మహంకాళి బోనాల్లో అపచారం.. ప్రభుత్వంపై భగ్గుమన్న జోగిన శ్యామల | jogini shyamala Serious Comments on Telangana Govt | Sakshi
Sakshi News home page

మహంకాళి బోనాల్లో అపచారం.. ప్రభుత్వంపై భగ్గుమన్న జోగిన శ్యామల

Aug 3 2026 12:39 PM | Updated on Aug 3 2026 1:23 PM

jogini shyamala Serious Comments on Telangana Govt

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినులకు తీవ్ర అవమానం జరిగిందని జోగిన శ్యామల ఆరోపించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న జోగినుల సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బోనాల ఉత్సవాల్లో జోగినులకు తగిన గుర్తింపు, మర్యాదలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిన్న జోగినిలకు జరిగిన అవమాన ఘటనపై జోగిన శ్యామల తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా శ్యామల.. బోనాల జాతరలో జోగినుల పాత్ర ఎంతో కీలకమైనదని, అయినప్పటికీ ప్రతి ఏడాది తమకు హామీలు ఇస్తున్న అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. జోగినుల సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.

దేవాదాయ శాఖ పరిధిలో జోగినులకు ప్రత్యేక స్థానం, అధికారిక హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాల్లో భాగమైన జోగినుల సేవలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఉత్సవాల్లో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో జరిగిన అపచారాన్ని వెంటనే సరిదిద్దాలని శ్యామల డిమాండ్ చేశారు. జోగినుల గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

జరిగిన పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లో తిరిగి అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్యామల ప్రకటించారు. సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది జోగినుల సమస్యలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని జోగినుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

 

జోగినుల సంప్రదాయం తెలంగాణ సంస్కృతి, బోనాల ఉత్సవాల్లో విడదీయరాని భాగమని పేర్కొన్న శ్యామల.. ఆ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాదాయ శాఖపై ఉందన్నారు. జోగినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని, జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement