సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాల్లో స్నేహబంధం సాధించిన అద్భుత విజయమిది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో ఒకే టెలిగ్రామ్ స్టడీ గ్రూప్నకు చెందిన ముగ్గురు స్నేహితులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా ఎంపికై సంచలనం సృష్టించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందినప్పటికీ, డిజిటల్ మాధ్యమంగా పరిచయమైన సిద్ధార్థ్ శ్రీవాస్తవ, చంద్రప్రభ శర్మ, ఖుషాలి సోలంకిలు తమ లక్ష్యం కోసం కలిసి సాగుతూ విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన సిద్ధార్థ్ శ్రీవాస్తవ ఐఐటీ బీహెచ్యూలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం వదిలేశారు. పలుమార్లు విఫలమైనా పట్టుదల వీడకుండా ఆరో ప్రయత్నంలో 118వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన చంద్రప్రభ శర్మ అమెరికాలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పూర్తి చేసి దేశసేవ కోసం తిరిగి వచ్చారు. ఆరో ప్రయత్నంలో 289వ ర్యాంకుతో ఐఆర్ఎస్ హోదా దక్కించుకున్నారు. రాజస్థాన్ బికనీర్ చెందిన ఖుషాలి సోలంకి ఐఐటీ ప్రవేశ అవకాశాన్ని వదులుకుని, మూడో ప్రయత్నంలో 61వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా విజయం సాధించారు.
ఈ ప్రయాణంలో ఎదురైన ఒంటరితనాన్ని, ఒత్తిడిని అధిగమించడానికి వీరు టెలిగ్రామ్ వేదికగా ఒక చిన్న గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు ఆన్లైన్ కాల్స్ ద్వారా చర్చలు జరుపుకోవడం, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించుకోవడం, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా ఈ ముగ్గురూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఇది కూడా చదవండి: జంతర్ మంతర్ వేదికగా విధ్వంసానికి పాక్ ప్లాన్


