ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది? | Mount Everest The Deadliest Truths of the Worlds Highest Peak | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది?

Aug 2 2026 7:23 AM | Updated on Aug 2 2026 7:28 AM

Mount Everest The Deadliest Truths of the Worlds Highest Peak

ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ యాత్రికుడు, ‘14 పీక్స్’ ఫేమ్ నిర్మల్ 'నిమ్స్‌డై' పుర్జా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన ఘోర హిమపాతంలో దుర్మరణం చెందడం యావత్ సాహస ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన బ్రాడ్ పీక్‌పై శుక్రవారం పడిన భారీ హిమపాతంలో నిర్మల్ పుర్జా సహా మరో తొమ్మిది మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరకం. 2019లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 8,000 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న ప్రపంచంలోని 14 అత్యున్నత శిఖరాలను అధిరోహించి అసాధారణ రికార్డు సృష్టించిన ఈ సాహస వీరుడు.. చివరికి అదే మంచు కొండల మధ్య తనువు చాలించడం పర్వతారోహణ వర్గాలను శోకసంద్రంలో ముంచెత్తింది. సరిగ్గా ఇదే తరహాలో ఎన్నో ఏళ్లుగా మానవాళికి అసాధ్యం అనుకున్న ఎవరెస్ట్ శిఖరం సైతం ఎంతో మంది సాహసికుల ప్రాణాలను బలిగొంటూ, చరిత్రలో లెక్కలేనన్ని విషాద గాథలను మిగిల్చింది. ప్రతికూల వాతావరణం, ఆకస్మిక హిమపాతాలు, ప్రాణాలను పణంగా పెట్టే నిలువుటంచుల ప్రయాణాలు మంచు పర్వతాలపై ఏ క్షణంలోనైనా పెను ముప్పును తెచ్చిపెడతాయనే సత్యానికి ఈ ఘటనే మరో నిదర్శనంగా నిలిచింది. ఎవరెస్ట్ మరణాల భయానక నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కేవలం సాహస ప్రియులకే కాదు, ప్రకృతి సృష్టించే భీభత్సానికి ప్రతీకగానూ నిలుస్తోంది. సముద్ర మట్టానికి 8,000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అని పిలుస్తారు. ఇక్కడ మనిషి తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటాడు. దీంతో ప్రతి క్షణం మృత్యువుతో పోరాడాల్సి వస్తుంది. ఎవరెస్ట్ ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది, అక్కడ ప్రాణాలు కోల్పోవడానికి గల అసలు కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.

ఎవరెస్ట్ మరణాల గణాంకాలు
ఎవరెస్ట్ పర్వతంపై మరణాల రేటు సుమారు 2%గా ఉంది. కే-2 లేదా కంచన్‌జంగా వంటి పర్వతాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా అనిపించినప్పటికీ, ఎవరెస్ట్‌పై పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటివరకు 7,000 కంటే ఎక్కువ మంది శిఖరాన్ని అధిరోహించగా, మూడు వందలకు పైగా మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మృతదేహాలు ఇప్పటికీ మంచులోనే అలాగే ఉండిపోయాయి.

ఎప్పటికీ మరువలేని జార్జ్ మిల్లొరీ విషాదం
1953లో ఎవరెస్ట్‌ను మొదటిసారి విజయవంతంగా అధిరోహించడానికి ముందే, 1920లలో బ్రిటిష్ బృందాలు ఇందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. వీటిలో ప్రముఖ పర్వతారోహకుడు జార్జ్ మిల్లొరీ నాయకత్వంలో జరిగిన యాత్ర విషాదాంతమైంది. 75 సంవత్సరాల తర్వాత 8,155 మీటర్ల ఎత్తులో మిల్లొరీ మృతదేహం లభించింది. ఆయన తన భార్య ఫోటోను, బ్రిటిష్ జెండాను శిఖరంపై ఉంచుతానని మాటిచ్చినప్పటికీ, ఆ వస్తువులు ఆయన వద్ద లభించకపోవడం గమనార్హం.

1996 నాటి ఘోర విషాదం
1996, మే 10-11 తేదీల్లో ఎవరెస్ట్‌పై జరిగిన ఘోర ప్రమాదం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచింది. అనుభవజ్ఞులైన గైడ్లు రాబ్ హాల్, స్కాట్ ఫిషర్ సహా ఎనిమిది మంది పర్వతారోహకులు మంచు తుఫానులో ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలో మారుతున్న వాతావరణం, విపరీతమైన చలి, నిర్ణీత సమయానికి వెనక్కి వెళ్లలేకపోవడం కారణంగా ఈ  ప్రమాదం సంభవించింది.

గ్రీన్ బూట్స్ విషాద గాథ
ఎవరెస్ట్ మార్గంలో ప్రాణాలు కోల్పోయిన కొందరి మృతదేహాలు దశాబ్దాలుగా మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. 1996లో మరణించిన భారతీయ పర్వతారోహకుడు త్సేవాంగ్ పాల్జోర్ ధరించిన ప్రత్యేకమైన ఆకుపచ్చ బూట్ల కారణంగా ఆయన మృతదేహానికి ‘గ్రీన్ బూట్స్’ అనే పేరు స్థిరపడింది. అలాగే ఆక్సిజన్ లేకుండా శిఖరాన్ని అధిరోహించాలనుకుని ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పర్వతారోహకురాలు ఫ్రాన్సిస్ ఆర్సెంటివ్ మృతదేహం తొమ్మిదేళ్ల పాటు పర్వతంపైనే ఉండిపోయింది.

అత్యంత ప్రమాదకరమైన ‘ఖుంబు ఐస్‌ఫాల్’
దక్షిణ మార్గంలో ప్రయాణించే పర్వతారోహకులకు ‘ఖుంబు ఐస్‌ఫాల్’ అత్యంత భయానక ప్రాంతం. కదులుతున్న మంచు గడ్డలు, అకస్మాత్తుగా ఏర్పడే లోతైన పగుళ్లు ఇక్కడ ప్రాణాంతకంగా మారుతాయి. 2014లో సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడిన కారణంగా 16 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సగటు ఆదాయం కంటే ఎంతో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో వీరు ఈ ప్రాణాలను సైతం లెక్కచేయని సాహసానికి పూనుకుంటున్నారు.

ఆక్సిజన్ కొరత.. ఫ్రాస్ట్ బైట్ సమస్యలు
సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ కొరత కారణంగా పర్వతారోహకులకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. అంతేకాకుండా విపరీతమైన చలి కారణంగా రక్త ప్రసరణ మందగించి చేతివేళ్లు, కాళ్లు, ముఖం మంచుకు ప్రభావితమయ్యే ఫ్రాస్ట్ బైట్ బారిన పడతారు. ఈ ప్రమాదాల కారణంగా పర్వతారోహకులు తమ అవయవాలను కూడా కోల్పోతుంటారు.

రికార్డు స్థాయి మరణాలు
2023వ సంవత్సరంలో నేపాల్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 463 పర్వతారోహణ అనుమతులు జారీ చేసింది. ఆ ఏడాది 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ మార్పులు, మంచు వేగంగా కరగడం, సరైన అనుభవం లేని పర్వతారోహకులు భారీ సంఖ్యలో తరలిరావడం వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement