న్యూఢిల్లీ: పార్లమెంట్ ముట్టడి ఆందోళన సందర్భంగా జరిగిన హింసపై ‘కాక్రోచ్ జంతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ మార్చ్ సమయంలో బీజేపీ గూండాలే హింసను సృష్టించారని, విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశపూర్వకంగా ఈ కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ ఘర్షణల్లో గాయపడిన పోలీసు సిబ్బందికి ఆయన సానుభూతి తెలిపారు. అదే సమయంలో పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
మరోవైపు, ఈ ఘర్షణల్లో గాయపడిన నలుగురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసుల హింసపైనే చర్చ జరుగుతోందని, తమ కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభను, పోలీసులకు అయిన గాయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ సతీమణి ఉప్నీత్ కౌర్ మాట్లాడుతూ.. ప్రతి యూనిఫాం వెనుక ఒక భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.
కాగా అసహ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో తన తండ్రిని నేరస్థునిగా చిత్రీకరిస్తున్నారని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని కుంజల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా గాయపడిన పోలీసుల గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని వాపోయారు. జూలై 20 నాటి ఈ ఘటనపై అటు పోలీసు కుటుంబాల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం!


