10 అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. భారత్‌కు మకుటాయమానం! | 10 Busiest Airports.. Crown Jewels of India | Sakshi
Sakshi News home page

10 అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. భారత్‌కు మకుటాయమానం!

Aug 1 2026 9:03 AM | Updated on Aug 1 2026 9:20 AM

10 Busiest Airports.. Crown Jewels of India

భారతదేశ ఆకాశ రవాణా మార్గాలు నేడు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, విమానయాన రంగం కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో నిత్యం కళకళలాడే అనేక విమానాశ్రయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) చేరింది. వైజాగ్ (విశాఖపట్నం) నగరానికి సమీపంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా దీనిని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, భారీ కార్గో హ్యాండ్లింగ్‌, సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ పురోగతికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడనుంది. కాగా ప్రయాణికుల రద్దీ పరంగా దేశంలో టాప్ టెన్‌గా నిలుస్తున్న ఆ ప్రధాన విమానాశ్రయాల వివరాలు..

1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం.. ప్రయాణికులు, కార్గో రవాణా రెండింటిలోనూ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ప్రథమ స్థానంలో ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా  ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ 5,106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

2. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం , ముంబై
ప్రయాణికుల రద్దీ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పరంగా భారతదేశంలో రెండవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఇది. ముంబై నగరానికి ఉత్తరంగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌పోర్ట్  ఉంది.

3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో మూడవ అత్యంత రద్దీ అయినది. బెంగళూరు నగర స్థాపకుడు కెంపేగౌడ I పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. 2008 మేలో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్ 2023లో 37.2 మిలియన్ల ప్రయాణికులను చేరవేసింది. ఇది 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు, 2016లో కర్ణాటకలోనే తొలిసారిగా పూర్తిగా సౌరశక్తితో నడిచే విమానాశ్రయంగా ఇది రికార్డు సృష్టించింది.

4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం.. బేగంపేట విమానాశ్రయ స్థానంలో 2008 మార్చి 23న ప్రారంభమైంది. 5,500 ఎకరాల విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న ఇది దేశంలో నాల్గవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. భారతదేశంలోనే తొలిసారిగా దేశీయ ఈ-బోర్డింగ్‌ను (2015) ప్రవేశపెట్టిన ఘనత దీని సొంతం.

5. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నైలో సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం దేశంలో ఐదవ అత్యంత రద్దీ అయినదిగా, అంతర్జాతీయ ప్రయాణాల పరంగా మూడవ స్థానంలో నిలిచింది.  ఇక్కడ పాత మీనంబాక్కం టెర్మినల్ (కార్గో కోసం), తిరుశూలం వద్ద దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం టెర్మినల్స్ ఉన్నాయి.

6. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కతా
తూర్పు భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ విమానాశ్రయం కోల్‌కతాలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ఇది ప్రారంభమయ్యింది. పలు దేశీయ విమాన సంస్థలకు ఇది ప్రధాన హబ్‌గా ఉంది. గతంలో వేర్వేరుగా ఉన్న టెర్మినల్స్‌ను 2018లో ఒకే సమీకృత టెర్మినల్‌గా మార్చారు.

7. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్
గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్ జంట నగరాల నుంచి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం రాష్ట్రంలోనే అతిపెద్దది. దేశంలో ఏడవ స్థానంలో అత్యంత రద్దీ అయినది. ఇక్కడ  దేశీయ, అంతర్జాతీయ, కార్గో సేవల కోసం వేర్వేరు టెర్మినల్స్ ఉన్నాయి.

8. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కొచ్చి
కేరళలోని కొచ్చిలో ఉన్న ఈ విమానాశ్రయం కేరళలోనే అతిపెద్దది. రద్దీ అయినది. దేశీయ, అంతర్జాతీయ రాకపోకల కోసం దీనిలో ప్రత్యేకమైన టెర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి.

9. గోవా అంతర్జాతీయ విమానాశ్రయాలు 
గోవాలో ప్రస్తుతం రెండు విమానాశ్రయాలు ఉన్నాయి.
దోబోలిమ్ విమానాశ్రయం: దక్షిణ గోవాలో నేవీ ఎయిర్‌బేస్ పరిధిలో సివిల్ ఎన్‌క్లేవ్‌గా నడుస్తోంది. ఇది 2023లో 8.5 మిలియన్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసింది.
మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తర గోవాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 2023 జనవరి 5న ప్రారంభించిన విమానాశ్రయం ఇది. ప్రారంభ సంవత్సరంలోనే ఇది 4.4 మిలియన్ల ప్రయాణికులను ఆకర్షించింది.

10. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం 
మహారాష్ట్రలోని పూణేలో గల లోహెగావ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలో సివిల్ ఎన్‌క్లేవ్‌గా ఈ విమానాశ్రయం పనిచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 9.5 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అత్యాధునిక నూతన టెర్మినల్ భవనం ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement