రోగిగా ఉన్నప్పుడు డాక్టర్ చూపిన దయ..ఆ వృత్తిని చేపట్టాలనే ఆకాంక్షకు తెరతీసింది. పోనీ చదివేసి డాక్టర్ అవుదామంటే..తనకున్న శారీరక పరిస్థితులు..నువ్వా అంటూ వెక్కిరించాయి. కానీ అలాంటి అభిప్రాయాలకు తలవంచనంది. తనలాంటి వాళ్లు కూడా బేషుగ్గా వైద్యం అందించగలరు అని చూపాలనుకుంది. పోరాడుతూనే చదివింది. చివరికి యావత్తు ప్రపంచమే విస్తుపోయేలా తొలి అంధ చెవిటి డాక్టర్గా నిలిచి..యువతకు స్ఫూర్తిగా మారింది.
ఆ అజేయమైన ధైర్యశాలే అలెగ్జాండర్ ఆడమ్స్. ఆమె పుట్టకతో చెవిటి, అంధ దివ్యాంగురాలు. అలాగని తనను తాను ఏమి ప్రత్యేక వ్యక్తిగా భావించేది కాదు. అందరి పిల్లల్లానే హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేందుకే ప్రయత్నించేది. టీనేజ్ వయసులో ఉండగా..సరిగ్గా కరోనా మహమ్మారి టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై దాదాపు 17 నెలల పాటు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) అనే రోగనిరోధక రుగ్మత బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దాని ఫలితంగా ఆమె నిరంతరం ఆక్సిజన్ను ఉపయోగించాల్సిందే.
ఇన్ని ఆరోగ్య సవాళ్ల అంటే ఎవ్వరైన కుంగిపోతారు. కానీ ఆడమ్స్ అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. అత్యంత ధైర్యంతో ఆ సవాళ్లన్నింటిని ఎదిరించి తన జీవితాన్ని అందంగా మార్చుకోవాలనుకునే ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. ఆస్పత్రిలో రోగిగా మంచానికే పరిమితమైన క్షణాల్లోనే డాక్టర్ ఎంతో ప్రేమగా మీరు బాగానే ఉన్నారా? అని అడిగిన మూడు పదాలు ఆమెను డాక్టర్ అవ్వాలనే ఆశయానికి ఊపిరిపోశాయి.
పోనీ వైద్య విద్య అభ్యసించడం అడమ్స్ ఉన్న శారీరక పరిస్థితికి అంత సులభమా అంటే కానేకాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పైగా చుట్టూ ఉన్నవాళ్లంతా తన వల్ల కాదని అంటున్నా..చెప్పడానికి వాళ్లెవరరు అన్న మొండి పట్టుదలతో డాక్టర్ విద్యనే అభ్యసించిందేకు రెడీ అయ్యింది. కానీ అక్కడ కళాశాలలో దారుణమైన వివక్షను ఎదుర్కొంది.
అంతా ఆమెనా డాక్టర్ అంటూ పెదవి విరిచేవారు. దానికి ఆడమ్స్ తన వైకల్యమేమి డాక్టర్ వృత్తికి అడ్డంకి కాదని, ప్రజల అభిప్రాయాలే అడ్డంకి అని ధైర్యంగా చెప్పేది. అయితే ఆమె డాక్టర్గా అర్హత సాధించడానికి కేవలం కొన్ని నెలల ముందే వైద్య వృత్తి నుంచి తప్పుకోమని వైద్య శాఖ నుంచి గట్టి ఆదేశాలు వచ్చాయి. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే లండన్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో క్రియేటివ్ రైటింగ్లో మాస్టర్స్ కోర్సుకు సంబంధించిన ఒక ప్రకటన ఆమెను ఆకర్షించింది.
వెంటనే ఒక పక్క మెడికల్ స్కూల్లో తిరిగి చేరాలనే పోరాటం చేస్తూనే..రచనలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది. అలా రచనల్లో తనకున్న స్కిల్ని గుర్తించింది. అంతేగాదు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి తిరిగి తన 11 ఏళ్ల మెడికల్ డిగ్రీని కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. అలాగే 'ఇన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఆల్' అనే పేరుతో యూకే తొలి బధిర అంధ వైద్యురాలి కథ అంటూ తన స్టోరీని రాసింది.
మరి ఆమె ఎలా వైద్యం చేస్తుందంటే..
ప్రతి వైద్య ప్రక్రియకు వినికిడి, దృష్టితో పనిలేదని అంటుంది. ఆమె రోగుల గుండె, ఊపిరితిత్తుల ఉనికిని వినడానికి వినికిడి పరికరాలకు నేరుగా అనుసంధానించే బ్లూటూత్-ఎనేబుల్డ్ స్టెతస్కోప్ను ఉపయోగిస్తుంది. పరిమిత దృష్టి ఉన్నప్పటికి ఐవీ వంటివి ఎలా పెడతారని అడిగితే..అదంతా స్పర్శ అనుభూతికి చెందిందని అంటుంది.
నిజానికి అనుభవజ్ఞులైన వైద్యులు స్పర్శపై ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి, వైద్య విద్యార్థులను ఈ నైపుణ్యాన్ని నేర్చుకునేటప్పుడు కళ్ళు మూసుకోమని తరచుగా ప్రోత్సహిస్తారని ఆమె చెబుతుంది. దీని వల్ల ఒ కరకంగా తన వైకల్యం బలహీనత కాదని, రోగులతో మరింత లోతుగా అనుసంధానం కావడానికి అదొక అడ్వాంటేజ్గా మారిందని సగర్వంగా చెబుతోంది ఆడమ్స్.
పని చేస్తున్నప్పుడు సురక్షితంగా సంభాషించడానికి సహాయపడే వైబ్రేటింగ్ పేజర్లు, రేడియో ఎయిడ్స్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో తనపై ఉండే సందేహాలను తొలగించేలా వివరణ అందించడమే కాకుండా వృద్ధుల సంరక్షణ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె కథ వైకల్యం అనేది సామర్థ్యాన్ని నిర్వచించలేదని, కఠిన శ్రమతో ఏ కలనైనా సాకారం చేసుకోవచ్చని నిరూపించడమే కాకుండా భావితరాలకు ఆదర్శంగా నిలిచింది.
(చదవండి: తాత గారు వేళకు మందులు వేసుకోవాలని..! టీనేజ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ..)


