గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే ఇన్ని పతకాలు సాధించడం విశేషం. డాక్టర్ కావాలన్న చిన్న నాటి కోరికను సాకారం చేసుకోవడమే కాదు..వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలేజీకే గర్వకారణంగా నిలిచేలా ప్రతిభను చాటుకుని ప్రశంసలందుకుంటోందామె.
ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్లోని మజఫర్పూర్కు చెందిన రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ అధికారి కుమార్తె దీప్తి శర్మ. ఇటీవలే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) నుంచి వైద్య విద్యను పూర్తి చేసిన యువ పట్టభద్రురాలు. ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో మొత్తం 19 మెడల్స్ అందుకుంది.
ఇన్ని పతకాలు ఆమెనే ఎలా వరించాయంటే..ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు ప్రతిష్టాత్మకమైన హెవెట్ గోల్డ్ మెడల్, అన్ని ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ పరీక్షలలో అత్యధిక మొత్తం మార్కులు సాధించినందుకు ఛాన్సలర్ గోల్డ్ మెడల్, అన్ని MBBS పరీక్షలలో అత్యధిక సంఖ్యలో గౌరవాలు, సర్టిఫికేట్లు పొందినందుకు యూనివర్సిటీ ఆనర్స్ గోల్డ్ మెడల్తో సహా మొత్తం 19 పతకాలను సాధించింది. వాటిలో 11 బంగారు పతకాలే.
అంతేగాదు విశ్వవిద్యాలయ చరిత్రలోఆ పతకాలలో హెవెట్ గోల్డ్ మెడల్, ఛాన్సలర్ గోల్డ్ మెడల్ రెండింటిని గెలుపొందిన ఏడవ విద్యార్థిగా నిలవడం విశేషం. ఈ మేరకు దీప్తి మాట్లాడుతూ..గడిపిన ప్రత గంట కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొందామె. ఇన్ని పతకాలు గెలుపొందడం కన్నా.. పేరెంట్స్ పొందుతున్న సంతోషమే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పింది. తన వైద్య విద్య ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ..2021లో సరిగ్గా మహమ్మారి సమయంలో ఇంటర్ నీట్ రెండిటినీ పూర్తి చేశాను. నీట్లో తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి కేజీఎంయూ (KGMU)లో సీటు సంపాదించడం ఒక కల నిజమైనట్లుగా ఎంత సంబరపడ్డానో మర్చిపోనంటోందామె.
ఆ సమయంలో తన పేరెంట్స్ ఎలా సంబరాలు చేసుకున్నారో మర్చిపోనని భావోద్వేగంగా చెబుతోంది. ఇంటర్న్గా చేస్తున్నప్పుడూ.. తన దృష్టిని పాఠ్యపుస్తకాల నుంచి రోగుల సంరక్షణ వైపుకి ఎలా మళ్లించిదో కూడా వెల్లడించింది. ఈ ప్రశంసలన్నీ తన కెరీర్కు ఒక నాంది మాత్రమేనని అంటోందామె. అవార్డులు, సర్టిఫికెట్లు కేవలం ఒక ఆరంభం మాత్రమేన అనడానికి ఇదొక నిదర్శనం అని అంటోంది. ఒక ఇంటర్న్గా రోజుల రోగులను కలుస్తాను, వాళ్లు తమ డాక్టర్ని చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆశ అనే మెరుపు ఆ అంచనాలకు అనుగుణంగా జీవించడంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందని చెబుతోంది.
వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా స్వస్థత చేకూరేలా చేయడం తన కర్తవ్యమని అంటోంది. అంతేగాదు గందరగోళం కన్నా..స్థిరత్వమే మేలు అని నొక్కి చెబుతోంది. ఏం చదివినా..పూర్తి ఏకాగ్రతతో చదవడం,పునశ్చరణే అత్యంత కీలకం అని చెబుతోంది. కేవల మనం వేసుకున్న ప్లాన్ని విజయవంతం చేయడం కోసమే ఆందోళన పడండి తప్ప..ఇంకేం అవసరం లేదని అంటోంది.
అదనపు ఒత్తిడిని నివారించి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే..ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుందని చెబుతోందామె. భవిష్యత్తులో పునశ్చరణే కీలకం! మాస్టర్స్ డిగ్రీని అభ్యసించినా, సొంత క్లినిక్ను ప్రారంభించినా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవను కొనసాగించినా, ఒక విషయం మాత్రం నిశ్చయం..అది ఆమె ఇప్పుడే వైద్య ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న వైద్యురాలు అనేది.
(చదవండి: భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్)


