సాక్షి, తాడిపత్రి: తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం బాధాకరం. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్ల వద్దకు టీడీపీ నేతలు వెళ్లి దౌర్జన్యాలు చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో టీడీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు, పోలీసుల ప్రేక్షక పాత్రపై ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇటీవల పెద్దవడగూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిదంబర్ రెడ్డి ఇంటి వద్ద టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా పరామర్శించారు. ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దవడగూరు మండలంలో వరుసగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం, పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. దాడులు, బెదిరింపులపై బహిరంగంగా మాట్లాడుతున్నా పోలీసులు స్పందించకపోవడం అన్యాయం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అలజడి సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితిపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు, పోలీసుల ప్రేక్షక పాత్రపై ప్రజా ఉద్యమం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.


