వాగమన్: కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్లోని వరాట్టుమెడులో రెవెన్యూ అధికారులు భారీ ఆక్రమణలను తొలగించారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిలో అక్రమంగా నిర్మించిన హోమ్స్టే భవనం, కేఫెటేరియా, ఇనుప కంచెలు, రాతి రిటైనింగ్ గోడలను అధికారులు నేలమట్టం చేశారు. అలాగే టార్పాలిన్తో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనును కూడా తొలగించారు. ఈ భూమిని మొదట వరాట్టుమెడుకు చెందిన ప్రతీష్ ఆక్రమించుకోగా, ఆ తర్వాత దానిని సెబిన్ ఆంటోనీకి బదిలీ చేశారు. వరాట్టుమెడు తహసీల్దార్ జోజో వీ సెబాస్టియన్, భూసేకరణ తహసీల్దార్ ఆర్ హరీంద్రనాథ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యుడు ఎస్. రాజ్కుమార్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యుడు శశికుమార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ప్రకాష్ రాజ్ భూమిపై కూడా..
ఇదే ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్కు కూడా కొంత స్వంత భూమి (పట్టా భూమి) ఉంది. అయితే ఆయన భూమికి ఆనుకుని ఉన్న కొంత భూమికి సరైన పట్టాలు లేవని వరాట్టుమెడు తహసీల్దార్ తెలిపారు. ప్రకాష్రాజ్ సమక్షంలో ఆ భూమిని సర్వే చేసి, సరిహద్దులను గుర్తించేందుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనకు ఇప్పటివరకు నోటీసులు అందలేదని, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని అధికారులు తెలిపారు. వరాట్టుమెడులో ప్రతీష్ తండ్రి దురైరాజ్, నానమ్మ సుబ్బయ్య పేరున రెండున్నర ఎకరాల చట్టబద్ధమైన భూమి ఉంది. అయితే దానికి ఆనుకుని ఉన్న దాదాపు 10 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అక్కడ వ్యవసాయం కూడా సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాక్కు భారత్ గట్టి కౌంటర్.. ఉగ్రవాదంపై నిలదీత!


