ప్రపంచ రాజకీయాల్లో, రక్షణ రంగంలో నిశ్శబ్దంగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన 2027 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (NDAA) సాధారణ రక్షణ బిల్లు మాత్రమే కాదు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అడుగుగా విశ్లేషకులు చూస్తున్నారు.
చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల విలీనం కాదు. యుద్ధభూమిలో రెండు దేశాల సైనికులు ఒకే కమాండ్ కింద పనిచేయబోరు. కానీ అంతకంటే శక్తివంతమైన అంశాన్ని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అదే రక్షణ సాంకేతిక ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చడం. కృత్రిమ మేధస్సు, డ్రోన్ స్వార్మ్స్, సైబర్ వార్ఫేర్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆయుధాలు, తదుపరి తరానికి చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలు.. ఇవన్నీ ఇక నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేయనున్నాయి. పరిశోధన నుంచి తయారీ వరకు, పరీక్షల నుంచి ఉత్పత్తి వరకు ఒకే రక్షణ ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించేందుకు ఈ బిల్లు బాటలు వేస్తోంది.
ఇటీవలి యుద్ధాల్లో ఇజ్రాయెల్ సాధించిన అనుభవం, చైనాతో పెరుగుతున్న సాంకేతిక పోటీ, భవిష్యత్తు యుద్ధాల్లో ఆధిపత్యం సాధించాలన్న అమెరికా వ్యూహం.. ఈ మూడు అంశాలే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగస్వామ్యానికి వందల మిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ అమెరికా ముందడుగు వేసింది. సుమారు 750 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందులో క్షిపణి రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సొరంగాల గుర్తింపు సాంకేతికతలు, కొత్త రక్షణ సాంకేతికతల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.
భారత్ పేరు ఎందుకు వినిపిస్తోంది?
ఈ పరిణామం భారత్కు కూడా కీలక అవకాశాలను తీసుకురాగలదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉంది. ఫాల్కన్ ఎయిర్బోర్న్ వార్నింగ్ వ్యవస్థలు, బరాక్ క్షిపణులు, హెరాన్ డ్రోన్లు, హారోప్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు వంటి అనేక కీలక వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. మరోవైపు అమెరికాతో iCET, INDUS-X వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ సాంకేతిక సహకారాన్ని భారత్ విస్తరిస్తుండగా, ఇజ్రాయెల్తో కూడా పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రెండింటితోనూ ఆధునిక రక్షణ సాంకేతిక రంగంలో కలిసి పనిచేసే అరుదైన స్థానంలో భారత్ నిలిచింది.
అయితే, ఇది అవకాశమే గానీ హామీ కాదు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, మేధోసంపత్తి హక్కులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ మార్గంలో సవాళ్లుగా మారే అవకాశమూ ఉంది. అందుకే భారత్ విదేశీ భాగస్వామ్యాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


