'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే.. | Devshayani Ekadashi 2026: Fasting And Puja rituals | Sakshi
Sakshi News home page

'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..

Jul 24 2026 6:45 PM | Updated on Jul 24 2026 6:56 PM

Devshayani Ekadashi 2026: Fasting And Puja rituals

శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని  దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. 

చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..

విష్ణు అనుగ్రహం కలగాలంటే..
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. 

వ్రతంలోని ప్రధాన నియమాలు..
ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.  అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. 

తినకూడనవి..
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. 

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement