సువార్త
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.
గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.
‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.
గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.
దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.
దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.
– జేతమ్
నిర్వహణ: డి.వి.ఆర్.


