హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి తన ఏకపక్ష పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం ప్రారంభించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. ‘పేపర్ లీకుల వంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం హేయమైనది..మీ పదవికి అపఖ్యాతిని తెచ్చిపెట్టేది. దానిని మీ చవకబారు అజెండాల కోసం ఉపయోగించవద్దు. మరోసారి చెబుతున్నాను బీఆర్ఎస్కు గానీ, నా కుటుంబానికి గానీ, నాకు గానీ గ్లోబరీనాతో ఎటువంటి సంబంధాలు లేవని’ కేటీఆర్ స్పష్టం చేశారు.
‘మీరు క్షమాపణ చెప్పండి లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోండి అని చెబుతూ నా న్యాయ బృందం త్వరలో మీకు నోటీసు పంపుతోంది. చవకబారు మంత్రి గారూ, చాలాసార్లు, మీ అసభ్యకరమైన, అసంబద్ధమైన ఆరోపణలకు నేను స్పందించను, ఎందుకంటే అవి మొదటి నుంచే అసంబద్ధమైనవి. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన మీతో ఏకీభవిస్తున్నానని కాదు. కేవలం ఈ బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు’ అంటూ తనకు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ ప్రకటించారు.


