ఇండోర్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. లక్షల రూపాయలు విలువ చేసే వెండి బిందెను పొరపాటున చెత్తకుప్పలో పారేసిందో మహిళ. బంగారాన్ని మించి వెండి ధర దూసుకుపోతున్న వేళ 2 కిలోల వెండి పాత్రను అలా చెత్తలో వేసేయడం హాట్ టాపిక్గా మారింది.
జూలై 18న రాజేంద్ర నగర్కు చెందిన ఒక వృద్ధురాలు ఇళ్లల్లో పూజకు ఉపయోగించే తమ తరతరాల నాటి వెండి పాత్రను పొరపాటున చెత్తతో పాటు పారేశారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెంటనే గుర్తించి, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించారు. చివరికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు రెండు రోజుల పాటు చాలా కష్టపడి, ఎట్టకేలకు దాదాపు రూ.5 లక్షల విలువైన, 2 కిలోల బరువున్న వెండి లోటాను (పాత్రను)సురక్షితంగా వెలికితీశారు.
కుటుంబ సభ్యులు తాము పోగొట్టుకున్న వెండి లోటా ఫోటోను పారిశుధ్య సిబ్బందికి అందించారు. కానీ అప్పటికే అది చెత్త ప్రాసెసింగ్ యూనిట్కు చేరిపోవడంతో, అక్కడ కార్మికులు ప్లాస్టిక్, లోహాలు, ఇతర వ్యర్థాలను వేరుచేసే విభాగంలో వెతకడం ప్రారంభించారు. లోటా వెండిది అని తెలియక, అప్పటికే అది పునర్వినియోగం (Recyclable) కోసం వేరు చేసిన భారీ ఇనుము/లోహపు చెత్త కుప్పలో కలిసిపోయింది. కార్మికులు రెండు రోజుల పాటు టన్నుల కొద్దీ వ్యర్థాలను చేతులతో వెతికారు. ఫోటోలో ఉన్న పోలికలతో ఒక పాత్రను గుర్తించిన సిబ్బంది, దానిపై కుటుంబ సభ్యుల పేరు చెక్కి ఉండటంతో అది ఆ కుటుంబానిదేనని నిర్ధారించుకున్నారు.
ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
కుటుంబ సభ్యులు వెంటనే ఫిర్యాదు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. కొంచెం ఆలస్యమైతే, వ్యర్థాలను కుదించే యంత్రాల ద్వారా ఆ లోటా రూపురేఖలు మారిపోయి దొరికేది కాదని చీఫ్ శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు తీర్థయాత్రకు వెళ్లడంతో, ఆ వెండి లోటాను స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ బడ్వే వద్ద భద్రపరిచారు.
ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు


