breaking news
Cricket
-
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్కు రంగం సిద్ధం...ప్రపంచకప్లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్లో 3–0తో పాక్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు. షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు. పాక్పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’ – సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్ 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్గా 16 మ్యాచ్లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.తారిఖ్పై అందరి దృష్టి... తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలిచాడు. ‘చకింగ్’ చేస్తున్నాడంటూ వినిపించినా...రెండు సార్లు అతని యాక్షన్కు ఐసీసీ అనుమతి ఇచ్చింది కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు. అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్ను గందరగోళంలో పడేయవచ్చని...బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు. అయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా...అతను సాధారణ ఆఫ్స్పిన్నర్ మాత్రమేనని, భారత బ్యాటర్లు చెలరేగుతారని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!
సిడ్నీ: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడి క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్ హర్మన్తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్లో చెలరేగితే భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్లో టాప్స్కోరర్గా నిలిచి అద్భుతమైన ఫామ్తో స్మృతి ఈ సిరీస్కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్ కప్ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్ఫీల్డ్, వోల్, వేర్హామ్లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్లలో ప్రదర్శనను బట్టి సిరీస్ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు. -
మార్క్రమ్, యాన్సెన్ జోరు
అహ్మదాబాద్: బౌలింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో యాన్సెన్ జోరు (4/40), బ్యాటింగ్లో కెప్టెన్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన మార్క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్రలకు తలా ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ టపటపా... ఇన్గిడి మూడో ఓవర్లో అలెన్ 3 ఫోర్లు, 1 సిక్స్తో కివీస్ శిబిరానికి జోష్ తెచ్చాడు. యాన్సెన్ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్ (13) అవుటైనా... అలెన్ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్ వేసిన యాన్సెన్ ఈ సారి రచిన్ రవీంద్ర (13), అలెన్ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుకు చెక్పెట్టాడు. కివీస్ పవర్ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్ మహరాజ్... ఫిలిప్స్ (1)ను బౌల్డ్ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.ఈ దశలో చాప్మన్ ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరు పెంచాడు. డారిల్ మిచెల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో నీషమ్ (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్ సగటున ఓవర్కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్రమ్ కివీస్ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్రమ్ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్రమ్ 19 బంతుల్లోనే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కెప్టెన్లాగే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), మిల్లర్ (17 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. -
T20 WC 2026: స్కాట్లాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం కోల్కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోరర్గా నిలవగా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్చర్, డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడినప్పటికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజయాన్ని అందుకుంది.టామ్ బాంటన్(41 బంతుల్లో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ముల్లన్, బ్రాడ్ వీల్, కుర్రీ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజూ శాంసన్పై వేటు పడనుంది.గత మ్యాచ్లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నమీబియాతో మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్ సింగ్ లేదా రింకూ సింగ్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టే అవకాశముంది. పాక్పై కుల్దీప్ యాదవ్కు అద్భుతమైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్/అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
'అతడితో జాగ్రత్త'.. పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు వార్నింగ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును భజ్జీ హెచ్చరించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు. అతడిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అయితే మన జట్టుపై పూర్తి నమ్మకం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్పటిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాము అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి బౌలింగ్ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్ను తలపిస్తోంది. అతడి బౌలింగ్ యాక్షన్పై వివాదాలు తలెత్తినప్పటికి.. ఐసీసీ మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్పటివరకు కేవలం 4 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు కూడా అతడిపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.చదవండి: T20 WC 2026: భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే -
భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే కొలంబోకు చేరుకున్న ఇరు జట్లు.. శనివారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్ష్లలో పాల్గోనున్నాయి.కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని ఆఘా చెప్పుకొచ్చాడు."క్రికెట్ ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడల్లో రాజకీయాలకు తావులేదు. క్రికెట్ ఒక జెంటిల్మ్యాన్ గేమ్. ప్రతీ ఒక్కరూ హుందాగా వ్యవహరించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేపటి మ్యాచ్లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, రేపటి మ్యాచ్లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.కాగా పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఆసియాకప్లో పాక్ ఆటగాళ్లతో భారత్ కరచాలనం నిరకారించింది. ఆ తర్వాత భారత మహిళల జట్టు, అండర్-19 జట్టు కూడా అదే బాటలో నడిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్ షేక్ చేయలేదు. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. -
ఒమన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో ఒమన్పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐరీష్ జట్టు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ముఖ్యంగా టక్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్గా నిలిచాడు. డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమన్ బౌలర్లలో షకీల్ అహ్మద్ మూడు, కలీం రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు. -
కొలంబోకు చేరుకున్న అభిషేక్ తల్లిదండ్రులు.. పాక్తో మ్యాచ్కు డౌటే
టీ20 ప్రపంచకప్-2026లో కొలంబో వేదికగా ఆదివారం పాకిస్తాన్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు.అయితే ఆస్పత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించికపోయినట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భారత జట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. -
పాక్తో మ్యాచ్.. అర్ష్దీప్ సింగ్ కంటే అతడే బెటర్: గవాస్కర్
టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి దాయాది జట్టుకు మరోసారి ఓటమి రుచిని చూపించాలని భారత్ పట్టుదలతో ఉంది.అయితే పాక్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉండడంతో భారత్కు జట్టుకు గట్టి పోటీ ఎదురు కానుంది అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత టీమ్ మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా గురువారం(ఫిబ్రవరి 12) నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ, అర్ష్దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు."నమీబియాతో మ్యాచ్లో భారత బౌలర్లందరూ వికెట్లు తీశారు. అర్ష్దీప్ ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో మూడు ఓవర్లు మాత్రమే కెప్టెన్ బౌలింగ్ చేయించాడు. శివమ్ దూబే సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ను రొటేట్ చేసిన విధానం చూస్తుంటే పాక్ మ్యాచ్ కోసం ఒక ప్రణాళికతో ఉన్నట్లు కన్పిస్తోంది. పాక్తో మ్యాచ్కు అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. అందుకేనేమో నమీబియాతో మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్కు బదులుగా పాండ్యాతో మొదటి ఓవర్ను బౌలింగ్ వేయించాడు. అదేవిధంగా శ్రీలంక పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తాయి. భారత్ గతంలోనూ ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడింది. కాబట్టి కుల్దీప్ను జట్టులోకి తీసుకోవడం మేలు" అని గవాస్కర్ 'స్టార్ స్పోర్ట్స్' డిబేట్లో పేర్కొన్నాడు.చదవండి: Vaibhav Suryavanshi: క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ -
క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
నిన్నటివరకు మైదానంలో బౌలర్లను బెంబేలెత్తించిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్లాస్రూమ్లో కూర్చుని పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అతడు హాజరు కానున్నాడు. బిహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు.వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అతడికి ఇప్పటికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వైభవ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా పేర్కొన్నారు.కాగా 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ తరపున కేవలం 15 బంతుల్లో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కూడా భారత్-ఎ జట్టు, అండర్-19 జట్టు తరపున సంచలన ప్రదర్శనలు చేశాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తాచాటిన వైభవ్.. భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.చదవండి: వారెవ్వా జింబాబ్వే -
‘చిన్నస్వామి’లో కుంబ్లే, ద్రవిడ్ స్టాండ్స్
బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్ స్టేడియం కొత్త స్టాండ్లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కేఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్ను ఏర్పాటు చేస్తారు. అనిల్ కుంబ్లే కేఎస్సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్కప్లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్ప్లేలో 29 పరుగులకే పెవిలియన్కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్తో మ్యాచ్లో గాయపడిన అతను ఆసీస్తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్లో నేడుఐర్లాండ్ X ఒమన్వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్ఏ భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్లో యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన యూఎస్ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్మ్ రంజనే (48 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.మిగతా యూఎస్ఏ ఆటగాళ్లలో మొనాంక్ పటేల్ (36), షయాన్ జహంగీర్ (20) కూడా రాణించారు. సంజయ్ కృష్ణమూర్తి (1), మిలింగ్ కుమార్ (3), హర్మీత్ సింగ్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ మొహిసిన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లొగాన్ వాన్ బీక్ (4-0-28-1), కైల్ క్లెయిన్ (4-0-35-1), ఫ్రెడ్ క్లాసెన్ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్ లెవిట్ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. మ్యాక్స్ ఒడౌడ్ 13 పరుగులు చేసి హర్మీత్ సింగ్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి. -
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 వరల్డ్కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లోనే (2007) జింబాబ్వే ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్కప్లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్లో ఆసీస్పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్కు ఈ రెండు కలిస్తే భారత్కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. -
ఆసీస్ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్లో (ఒమన్) టేలర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో అతను మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమయంలో టేలర్ కుడి కాలి హామ్స్ట్రింగ్తో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్ స్థానాన్ని బెన్ కర్రన్తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రాత్మక ఆటగాడుటేలర్కు ప్రపంచ క్రికెట్లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు. -
యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు
భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నమెంట్కు శుక్రవారం తెరలేచింది.బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ వుమెన్-‘ఎ’ జట్టు నేపాల్ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రాణించిన అనుష్క శర్మ, తనూజఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్ (16)లతో పాటు వన్డౌన్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ (1) కూడా విఫలమైంది. కెప్టెన్ రాధా యాదవ్ (7), మిన్ను మణి (8), వికెట్ కీపర్ బ్యాటర్ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.Calm Under Fire 😌 Anushka Sharma’s gritty 47 pushed India A to a competitive total 💥Watch our Girls in Blue take on the UAE in the DP World Women’s Asia Cup Rising Stars 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising pic.twitter.com/r5I8fqLrJo— Sony Sports Network (@SonySportsNetwk) February 13, 2026ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్ తనూజ కణ్వార్ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్ (4), సైమా ఠాకూర్ (3 నాటౌట్) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్ కేవలం 130 పరుగులే చేసింది.యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్, కెప్టెన్ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఇషా ఓజా అజేయ హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తీర్థ సతీశ్ (10) నిరాశపరిచింది. వన్డౌన్ బ్యాటర్ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్ బాది అజేయంగా నిలిచింది.ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్ ఇషా ఓజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. UAE won by 7 wickets. India A will look to bounce back in the next game!Scorecard ▶️ https://t.co/L2wkjCKSKq#WomensRisingStarsAsiaCup pic.twitter.com/lGYXSFIDDD— BCCI Women (@BCCIWomen) February 13, 2026చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్ అవుట్ -
పసికూనల పోరులో యూఏఈదే పైచేయి
టీ20 ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. హర్ష్ ఠాకూర్ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్నీత్ ధలీవాల్ (34), శ్రేయస్ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా 11, యువరాజ్ సమ్రా 5, నికోలస్ కిర్టన్ 4, జస్కరన్ సింగ్ 4 (నాటౌట్), సాద్ బిన్ జాఫర్ 5, డిలాన్ హేలిగర్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. కెనడా బౌలర్లలో సాద్ బిన్ జాఫర్ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్ సనా (4-0-29-1), డిలన్ హేలిగర్ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్, షోయబ్ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. -
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
అవాంతరాలన్నీ తొలగి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.సాంకేతికంగా మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.అగ్రస్థానంలో టీమిండియామొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్ జట్టు నెదర్లాండ్స్, అమెరికాలపై జయభేరి మోగించింది.ఫలితంగా గ్రూప్-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్రేటు పరంగా భారత్ (+3.050).. పాకిస్తాన్ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.వాన పడే అవకాశంశ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది.యూటర్న్ తీసుకున్న పాక్ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా బంగ్లాదేశ్కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్కప్-2026 బహిష్కరిస్తామంటూ పాక్ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్ తీసుకుంది.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం -
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్కప్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి. -
T20 WC 2026: టోర్నీ నుంచి కెప్టెన్ అవుట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 అవకాశాలను ఐరిష్ టీమ్ సంక్లిష్టం చేసుకుంది.ఇలాంటి తరుణంలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్కప్లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్లతో కలిసి గ్రూప్-బి నుంచి ఐర్లాండ్ పోటీలో దిగింది. తొలి మ్యాచ్లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.గాయపడిన కెప్టెన్కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగానే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు.యువ బ్యాటర్ ఎంట్రీఇక పాల్ స్టిర్లింగ్ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్ సామ్ టాపింగ్ (Sam Topping) ఐర్లాండ్ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్ స్వదేశానికి పయనం కాగా.. సామ్ భారత్కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్ తమ తదుపరి మ్యాచ్లో ఒమన్తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక. ఇదిలా ఉంటే.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఐర్లాండ్ జట్టు (అప్డేటెడ్)మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం -
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటన
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్గా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్లు ఆడి 141.84 స్ట్రయిక్రేట్తో 1566 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన రియాన్ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. ఆ సీజన్లో అతను 149.21 స్ట్రయిక్రేట్తో 573 పరుగులు చేశాడు. గత సీజన్లో రియాన్ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్రేట్తో 393 పరుగులు) చేశాడు.గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ 8 మ్యాచ్ల్లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్లో రియాన్ ఫుల్టైమ్ కెప్టెన్గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కాగా, తదుపరి సీజన్కు రాయల్స్కు కెప్టెన్తో పాటు నూతన హెడ్ కోచ్ కూడా రానున్నాడు. గత సీజన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ వదవిని వదిలేయడంతో, ఆ స్థానంలో కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్ కలిసి 2026 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ను నడిపిస్తారు.2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు..రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పేరాల, షిమ్రోన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, యుద్ద్వీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పంజా, విజ్ఞేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్ -
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.పాక్ క్రికెటర్ల వెంటపడతాడుఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్లో భజ్జీ బ్రాడ్కాస్టర్గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్ అహ్మద్ అనే ఓ పాక్ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రంలా బిల్డప్ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్ఫామ్లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట.పాకిస్తాన్ తరఫున అతడు 3-4 మ్యాచ్లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అన్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్కాస్టర్గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఉస్మాన్ తారిఖ్ను ప్రశ్నలు అడిగాను.ఆ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్కాస్టర్గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలుచెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్తఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్లు ఆడిన వాడికి 100 మ్యాచ్లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు.కాగా టీమిండియా తరఫున హర్భజన్ సింగ్ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ తన్వీర్ అహ్మద్ పాక్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్ తీశాడు.చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు -
ఆసీస్పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్లో తన చివరి వికెట్తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా, ఓవరాల్గా 35 బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన స్టోయినిస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ ఓ వికెట్ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్కు షాకిచ్చిన జింబాబ్వేటీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్లో బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్లో బెన్నెట్తో పాటు మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) కూడా రాణించారు.బౌలింగ్లో ముజరబానీతో పాటు బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) కూడా సత్తా చాటారు.ఆసీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్లో ఎల్లిస్ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్టైమ్ బౌలర్ మ్యాక్స్వెల్ ఒక్క ఓవర్కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్ (1.1-0-6-1), స్టోయినిస్ (2.5-0-17-1) తలో వికెట్ తీశారు. స్టోయినిస్ బౌలింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.అనంతరం బ్యాటింగ్లో ఆసీస్ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్ 8, హెడ్ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్వెల్ (31), రెన్షా (65) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్ (6), డ్వార్షుయిస్ (6), జంపా (2), కుహ్నేమన్ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్కు వెళ్లడంతో ఆసీస్ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్లో ఆసీస్ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్లోనూ ఆ జట్టు ఆసీస్ను మట్టికరిపించింది. -
'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు
టీ20 ప్రపంచకప్-2026లో అసలు సిసలైన సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాదడం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేదని అతడు విమర్శించాడు."అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్నవాళ్లు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అతడు సక్సెస్ అవుతారు. విఫలమయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.ప్రతీ 8 ఇన్నింగ్స్లలో ఒకసారి మాత్రమే అతడు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్లలో తక్కువే పరుగులకే అవుట్ అవుతున్నాడు. అతడు ఒక చోట నిలబడి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది పడతాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.అయితే అభిషేక్ను నేనేమి తక్కువ చేసి మాట్లడడం లేదు. అతడి ఆటలో చాలా రిస్క్ ఉందని చెబుతున్నా. తనదైన ప్రత్యర్ధి జట్టును ముప్పు తిప్పలు పెట్టగలడు అని ఓ టీవీ ఛానల్ డిబేట్లో అమీర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయర్ అయినా మీ జట్టులో ఉన్నారా? అంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్కు ఈ పంజాబీ బ్యాటర్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. -
T20 WC: ఆసీస్కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్డౌన్లో వచ్చిన గ్రీన్ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. నేపాల్పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026 -
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! -
పిజ్జాలు తయారు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’
టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది. నేపాల్తో గ్రూప్ ‘సి’ మ్యాచ్లో అంచనాలను తలకిందులు చేస్తూ ఇటలీ అదరగొట్టింది. ముంబైలో గురువారం జరిగిన ఈ పోరులో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్పై జయభేరి మోగించడం విశేషం.క్రిషాన్.. మోస్కా బ్రదర్స్ అదుర్స్ఈ గెలుపులో అన్మదమ్ములు జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్), ఆంటోని మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్)లతో పాటు లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగేది కీలక పాత్ర. నేపాల్ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కలుగమగే ప్రధాన భూమిక పోషించగా.. లక్ష్య ఛేదనలో మోస్కా బ్రదర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇటలీకి తొలి విజయం అందించిన ఈ ముగ్గురు.. ఇటలీ వెలుపల జన్మించిన వారే కావడం గమనార్హం.మోస్కా బ్రదర్స్ తల్లిదండ్రులు ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా.. వీరిద్దరు సిడ్నీలో జన్మించారు. అయితే, ఆ తర్వాత క్లబ్ స్థాయి క్రికెట్లో మెళకువలు నేర్చుకుని ఇటలీకి తిరిగి వచ్చి తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు.శ్రీలంకలో పుట్టి పెరిగిఇక క్రిషాన్ కలుగమగేది మరో స్టోరీ. అతడు శ్రీలంకలో జన్మించాడు. క్రికెట్ అంటే అతడికి పిచ్చి అని చెప్పవచ్చు. చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న కలుగమగే అండర్–15 స్థాయి వరకు శ్రీలంకకే ఆడాడు.అయితే అదే సమయంలో కలుగమగే కుటుంబం ఇటలీ వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటలీలో ఈ ఆట ఉండదు కాబట్టి తన క్రికెట్ కెరీర్ కోల్పోతానని భయంతో అతను వెళ్లడానికి ఇష్టపడలేదు. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు తప్పలేదు. అయితే అక్కడికి వెళ్లాక క్రికెట్ అవకాశాలు రావడంతో పాటు... పరిస్థితి మారి ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.పిజ్జాలు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’నిజానికి కలుగమగే ప్రొఫెషనల్ షెఫ్. ఇటాలియన్ స్పెషల్ పిజ్జాలు తయారు చేసే ‘లా విటా పిజారియా’ అనే హోటల్లో సోమవారం నుంచి శనివారం వరకు ‘షెఫ్’గా అతడు పని చేస్తాడు. కాబట్టి కేవలం ఆదివారాల్లో మాత్రమే అతడికి క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సాధన చేసే కలుగమగే ఏకంగా వరల్డ్కప్ హీరోగా నిలవడం విశేషం.ఇక నేపాల్తో మ్యాచ్లో 34 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. కెప్టెన్ రోహిత్ పౌడేల్ (23), దీపేంద్ర సింగ్ ఐరీ (17), గుల్షాన్ ఝా (3) రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కలుగమగే కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.123 పరుగులకేమ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్రోహిత్ పౌడేల్ (23), ఆసిఫ్ షేక్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇతర ప్రధాన బ్యాటర్లు కుశాల్ భుర్తేల్ (5), దీపేంద్ర సింగ్ ఐరీ (17) ప్రభావం చూపించలేకపోవడంతో నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.ఇంగ్లండ్పై గత మ్యాచ్లో 17 ఫోర్లు, 7 సిక్స్లు బాదిన నేపాల్ బ్యాటర్లు ఈసారి.. 7 ఫోర్లు, 3 సిక్స్లు మాత్రమే నమోదు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగే (3/18) మూడు కీలక వికెట్లతో జట్టును దెబ్బ తీశాడు.మరో 44 బంతులు మిగిలి ఉండగానేఅనంతరం ఛేదనలో ఇటలీ ఎక్కడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంటోనీ మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు), జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. The Mosca brothers finish it in style! 🇮🇹🔥A dominant 10-wicket triumph over Nepal as Italy register their first-ever ICC Men’s T20 World Cup win 👏Statement made. History created.Next on ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/lKwkG3OSxX— Star Sports (@StarSportsIndia) February 12, 2026చదవండి: IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది? -
జైశ్వాల్, జడేజా కాదు.. రాజస్తాన్ కెప్టెన్గా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను రాయల్స్ యాజమాన్యం ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై రాజస్తాన్ రాయల్స్ ఫిబ్రవరి 13( శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు అధికారిక ప్రకటన చేయనుంది.గత సీజన్ వరకు కెప్టెన్గా పనిచేసిన సంజూ శాంసన్ స్దానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నాడు. తొలుత పరాగ్తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజస్తాన్ మేనెజ్మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్తాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అస్సాం జట్టుతో పాటు రాజస్తాన్ కెప్టెన్గా కూడా పరాగ్కు పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్-2025 సీజన్లో గాయపడిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్కు తమ జట్టు పగ్గాలను రాజస్తాన్ అప్పగించినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సీజన్కు ముందు రాజస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసిన రాజస్తాన్.. అందుకు బదులుగా స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కుర్రాన్లను తమ జట్టులోకి తీసుకుంది. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్తాన్ బరిలోకి దిగనుంది. -
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026 -
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్నెస్పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్తో మ్యాచ్కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. -
ఒకరేమో కార్పెంటర్.. మరొకరు పీఈటీ! ఎవరీ 'మోస్కా బ్రదర్స్'?
క్రికెట్ ప్రపంచానికి మరో అన్నదమ్ముల జోడీ పరిచయమైంది. వారిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తమ విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనం సృష్టించారు. ఓపెనర్లగా బరిలోకి దిగిన ఆ జంట 124 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. వారే ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా. గురువారం వాంఖడే వేదికగా జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో నేపాల్ను పది వికెట్ల తేడాతో ఇటలీ చిత్తు చేసింది. మోస్కా బ్రదర్స్ అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్లో ఇటలీకి ఇదే తొలి విజయం. ఆస్ట్రేలియా నుంచి వచ్చి... ‘మోస్కా బ్రదర్స్’ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా వీరిద్దరు అక్కడే సిడ్నీలో పుట్టారు. అక్కడి క్రికెట్ సంస్కృతి వల్ల ఆటపై మక్కువ పెంచుకొని ఇద్దరూ కలిసే ఆటను నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేసేవారు. ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయిలో ఆడిన తర్వాత వీరిద్దరు ఇటలీ చేరారు. తమ కొత్త జట్టును తీర్చిదిద్దేందుకు ఇటలీకి ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఏర్పడింది.ఈ క్రమంలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరిద్దరు 2022లో ఒకే మ్యాచ్ ద్వారా (గ్రీస్పై) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం విశేషం. టోర్నీ ముగిసిన తర్వాత ‘మోస్కా బ్రదర్స్’ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతారు. పెద్దవాడైన ఆంథోనీ పదేళ్ల పాటు కార్పెంటర్గా పని చేసి బాలఖైదీల కేంద్రంలో కార్పెంటర్ పనిని నేర్పించే ఉద్యోగంలో ఇటీవలే చేరాడు. మూడేళ్లు చిన్నవాడైన జస్టిన్ ఒక పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నాడు.మెనెంటీ బ్రదర్స్’ కూడా... ‘మోస్కా బ్రదర్స్’కు ఆటలో స్ఫూర్తిగా నిలిచిన మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు కూడా ఇటలీ జట్టులోనే ఉన్నారు. నేపాల్తో మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన హ్యారీ మెనెంటీæ చిన్నవాడు కాగా, బెన్ మెనెంటీ అతనికంటే మూడేళ్ల పెద్దవాడు. వీరు కూడా సిడ్నీకి చెందిన వారే. ఈ ఇద్దరి ప్రోత్సాహంతోనే క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ‘మోస్కా బ్రదర్స్’ ఇప్పుడు వారిద్దరిలో కలిసి ఇటలీ జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడటం విశేషం. అయితే ‘మెనెంటీ’లకు ఇప్పటికే చెప్పుకోదగిన అనుభవం ఉంది. బిగ్బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రయికర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు టాస్మేనియా తరఫున 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు.హాకీ వరల్డ్ కప్లో ఆడి... ఇటలీ టీమ్లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఉన్నారు. స్కాట్లాండ్తో మ్యాచ్లో కెపె్టన్గా వ్యవహరించిన దురదృష్టవశాత్తూ గాయంతో టోర్నీకి దూరమైన వేన్ లీ మాడ్సన్ స్వస్థలం డర్బన్. జాతీయ జట్టుకు టెస్టు ఆడే అవకాశం రాకపోయినా... మాడ్సన్కు ఏకంగా 253 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల అనుభవం ఉంది. అతను దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 2006 హాకీ వరల్డ్ కప్లో, 2006 కామన్వెల్త్ గేమ్స్లో ఆడటం విశేషం. సఫారీ టీమ్కు 2021 వరకు 6 వన్డేలు, 13 టి20లు ఆడిన జేజే స్మట్స్ ఇప్పుడు ఇటలీ టీమ్లో ఉన్నాడు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇటలీ దేశంలో అడుగు పెట్టకుండా అతను ఆ దేశం తరఫున వరల్డ్ కప్ ఆడుతుండటం ఆసక్తికరం.టీ20 ప్రపంచకప్లో అన్నదమ్ముల జోడీలు ఇవేటీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు అన్నదమ్ముల జోడీలు కలిసి మ్యాచ్లు ఆడాయి. తాజా ప్రపంచకప్లో ఇటలీ నుంచి రెండు ‘బ్రదర్స్’ జోడీలు ఆంథోనీ మోస్కా–జస్టిన్ మోస్కా; హ్యారీ మెనెంటీ–బెన్ మెనెంటీ రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగాయి. గతంలో ఇర్ఫాన్ పఠాన్–యూసుఫ్ పఠాన్ (భారత్; 2007)... నాథన్–బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)... డ్వేన్ బ్రావో–డారెన్ బ్రావో (వెస్టిండీస్) ... మోర్నీ మోర్కెల్–అల్బీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా)... డేవిడ్ హస్సీ–మైక్ హస్సీ (ఆ్రస్టేలియా) ‘బ్రదర్స్’ కలిసి టి20 ప్రపంచకప్లో ఆడారు. -
వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్పై కూడా అదరగొట్టారు: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో నమీబియాను 93 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. వరుసగా రెండు మ్యాచ్లోనూ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు."ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. వాంఖడే వికెట్పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేనప్పటికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు చాలా కీలకంగా మారింది.క్లిష్ట సమయంలో వారిద్దరూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మ్యాచ్లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా జస్ప్రీత్ తన రిథమ్ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తున్నారు. వారిద్దరిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మా తదుపరి మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాక్తో భారత్ తలపడనుంది.భారత్ ఆల్రౌండ్ షో..ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో 116 పరుగులకే కుప్పకూలింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును తమపేరిట లిఖించుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుసగా 8 విజయాలు సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఈ అరుదైన భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 విజయాలు నమోదు చేశాయి.టీ20 ప్రపంచకప్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లు ఇవేభారత్-10ఆస్ట్రేలియా-8దక్షిణాఫ్రికా-8ఇంగ్లండ్-7చదవండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్ -
ఇషాన్, పాండ్యా చెలరేగగా...
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ మెరుపులు, వరుణ్ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) పొదుపైన బౌలింగ్ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్ స్టీన్కాంప్ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా...వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్లో భారత్ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్తో తలపడుతుంది. ఇషాన్ 6, 6, 6, 6, 4... అభిషేక్ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్స్తో స్కోరింగ్ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్లో ఇషాన్ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్ కప్లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ (12), హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్కాంప్తో పాటు ఫ్రైలింగ్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎరాస్మస్ (11 బంతుల్లో 18; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) షికోంగో (బి) ఎరాస్మస్ 61; సామ్సన్ (సి) స్టీన్కాంప్ (బి) షికోంగో 22; తిలక్ (సి) స్మిట్ (బి) ఎరాస్మస్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) గ్రీన్ (బి) స్కాల్ 12; పాండ్యా (సి) (సబ్) లీషర్ (బి) ఎరాస్మస్ 52; దూబే (రనౌట్) 23; రింకూ (సి) ఎరాస్మర్ (బి) స్మిట్ 1; అక్షర్ (బి) ఎరాస్మస్ 0; వరుణ్ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్: రూబెన్ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్ 4–0–50–1, హీన్గో 1–0–18–0, ఎరాస్మస్ 4–0–20–4, స్కాల్ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్: స్టీన్కాంప్ (బి) వరుణ్ 29; ఫ్రైలింక్ (సి) దూబే (బి) అర్‡్షదీప్ 22; జాన్ నికోల్ (సి) అక్షర్ (బి) వరుణ్ 13; ఎరాస్మస్ (సి) తిలక్ (బి) అక్షర్ 18; స్మిట్ (బి) వరుణ్ 0; గ్రీన్ (హిట్వికెట్) (బి) దూబే 11; క్రూగర్ (సి) బుమ్రా (బి) అక్షర్ 5; రూబెన్ (బి) బుమ్రా 6; స్కాల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్గో (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–21 –2, అర్‡్షదీప్ సింగ్ 3–0–36–1, శివమ్ దూబే 2.2–0–11–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–20–1, వరుణ్ చక్రవర్తి 2–0–7–3, అక్షర్ పటేల్ 3–1–20–2. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2026: నమీబియాపై టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్మెన్స్ తక్కువ స్కోర్కే వెనుదిరగడంతో నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. తొలుత టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్ కేవలం 188 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. జాన్ ఫ్రైలింక్ వికెట్ అర్షదీప్కు 250వ వికెట్.అర్షదీప్ కెరీర్ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్ మొత్తంలో అర్షదీప్ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్ తన టీ20 కెరీర్లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్లో అర్షదీప్ 97 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్కు ఈ స్కోర్ అందించారు.మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు.ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు.భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 88-5గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసి నమీబియాను దెబ్బకొట్టారు. -
ఇషాన్ విధ్వంసం, హార్దిక్ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు. -
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్కు ముందు ఏ భారత వికెట్కీపర్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్ టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు ఛాంపియన్ (2007, 2024) అయినా, ఓ వికెట్కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్ సెంచరీఈ రికార్డు హాఫ్ సెంచరీని ఇషాన్ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్.. ఆమరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్లో వరుసగా మరో సిక్సర్, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్ తొలి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్ సిక్సర్లు, బౌండరీ కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ ఔటయ్యాక భారత స్కోర్ కాస్త నెమ్మదించింది.హార్దిక్ లైన్లోకి వచ్చాడుఅయితే హార్దిక్ పాండ్యా రాకతో భారత స్కోర్ మళ్లీ జోరందుకుంది. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 205/5గా ఉంది. శివమ్ దూబే (23), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరుగబోయే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్లో కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
T20 WC 2026: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ వికెట్కీపింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ తన అసమాన క్యాచింగ్ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ప్రవేశించాడు. బట్లర్కు ముందు ఈ ఫీట్ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.బట్లర్ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్-ఐ కమ్యూనికేషన్తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్కీపర్ బ్యాటర్ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ప్రవేశించాడు. Jos Buttler Breaks World Record For Highest Cricket Catch! 🤯 pic.twitter.com/AZaZQtY0v2— The Switch | Kevin Pietersen (@kptheswitch) February 11, 2026ఈ ఫీట్కు క్రికెట్తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్కు ఆన్ ఫీల్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్ తప్పక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్లర్ ఇప్పటికే ఆన్ ఫీల్డ్లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. వికెట్కీపర్గానే కాకుండా ఫీల్డర్గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్ రికార్డు) మాత్రం బట్లర్ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్ రికార్డు ఫీట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, బట్లర్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ ఇటీవలికాలంలో ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్తో మ్యాచ్లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్ల్లో బట్లర్కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.బట్లర్ ఫామ్లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్, స్కాట్లాండ్, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. -
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
టీ20 ప్రపంచకప్లో సంచలనం
ఇటలీ క్రికెట్ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్ జట్టు ప్రపంచకప్లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్కప్కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్ క్వాలిఫయర్స్ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్ 2026 బెర్త్ దక్కించుకుంది.తొలి ప్రపంచకప్లో ఆడిన రెండో మ్యాచ్లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్ ఆడుతున్న నేపాల్పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్ జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్, ఇంగ్లండ్) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్లో ఇటలీ తమ రెగ్యులర్ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్సన్ స్కాట్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డాడు.తొలి మ్యాచ్లో ఇటలీకి స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.తిప్పేసిన స్పిన్నర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ నేపాల్ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు క్రిషన్ కలుగమగే (4-0-18-3), బెన్ మనెన్టి (4-0-9-2), స్మట్స్ (4-0-22-1) నేపాల్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్, జస్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసి నేపాల్ను దెబ్బేశారు.నేపాల్ ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ ఎయిరీ (17), కరణ్ కేసి (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్ భుర్టెల్, సందీప్ లామిచ్చేన్ చెరో 5, లోకేశ్ బామ్, గుల్షన్ ఝా తలో 3, నందన్ యాదవ్ మరియు లలిత్ రాజ్బంశీ డకౌట్లయ్యారు.మోస్కా బ్రదర్స్ అదుర్స్124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. జస్టిన్, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బెన్ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్ఈ మ్యాచ్లో మోస్కా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. తొలి వికెట్కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అన్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు. -
మొన్న ఏమో ఇంగ్లండ్ను గడగడలాడించారు.. ఇప్పుడేమో ఇటలీ ముందు..!
టీ20 వరల్డ్కప్ 2026లో రెండు రోజుల కిందట పటిష్టమైన ఇంగ్లండ్ను ఓడించినంత పని చేసిన పసికూన నేపాల్, ఇవాళ (ఫిబ్రవరి 12) వారి కంటే చిన్న జట్టైన ఇటలీ ముందు తేలిపోయింది. మొన్న తన మెరుపు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను గడగడలాడించిన లోకేశ్ బామ్.. ఇవాళ ఇటలీ బౌలర్ల ముందు తస్సుమన్నాడు. లోకేశ్తో పాటు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చాటలేకపోవడంతో ఇటలీతో మ్యాచ్లో నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.27 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ ఎయిరీ (17), కరణ్ కేసి (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్ భుర్టెల్, సందీప్ లామిచ్చేన్ చెరో 5, లోకేశ్ బామ్, గుల్షన్ ఝా తలో 3, నందన్ యాదవ్ మరియు లలిత్ రాజ్బంశీ డకౌట్లయ్యారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ అన్ని విభాగాల్లో నేపాల్ను కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్పిన్నర్లు క్రిషన్ కలుగమగే (4-0-18-3), బెన్ మనెన్టి (4-0-9-2), స్మట్స్ (4-0-22-1) నేపాల్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్, జస్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసి నేపాల్ను దెబ్బేశారు. -
ఐపీఎల్లో అమ్ముడుపోని వారిపై పాకిస్తాన్ సూపర్ లీగ్లో కనకవర్షం
ఐపీఎల్ 2026 వేలంలో అన్సోల్డ్గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కనకవర్షం కురిసింది. పీఎస్ఎల్లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఉన్నారు.ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక, పీఎస్ఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఐపీఎల్ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్ఎల్లో మాత్రం మిచెల్పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.ఆడమ్ జంపా: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఐపీఎల్ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.రిలీ రొస్సో: ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్ సోల్డ్గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.పీఎస్ఎల్-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. మార్క్ చాప్మన్- 7 కోట్లు (పాక్ కరెన్సీలో)ఆస్టన్ టర్నర్- 4.2 కోట్లుమైఖేల్ బ్రేస్వెల్- 4.2 కోట్లుకుసాల్ మెండిస్- 4.2 కోట్లుటామ్ కర్రన్- 4.2 కోట్లుకుసాల్ పెరీరా- 3.1 కోట్లుజేమ్స్ విన్స్- 3 కోట్లురిషద్ హొసేన్- 3 కోట్లు వీరితో పాటు పీటర్ సిడిల్, జోష్ ఫిలిప్, తబ్రేస్ షంషి, జాన్సన్ ఛార్లెస్, మ్యాక్స్ బ్రయాంట్, షమార్ జోసఫ్, ఓట్నీల్ బార్ట్మన్, గుడకేశ్ మోటీ, రిచర్డ్ గ్లీసన్, బెన్ మెక్డెర్మాట్, దసున్ షనక, సామ్ హార్పర్, బెవాన్ జాకబ్స్ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్ఎల్ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.పీఎస్ఎల్లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్ అల్ హసన్, కైల్ మేయర్స్, కొలిన్ మున్రో, అల్జరీ జోసఫ్, జేమ్స్ నీషమ్, జేసన్ రాయ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, డేవిడ్ మలాన్, కేశవ్ మహారాజ్ తదితరులు ఉన్నారు. -
T20 WC 2026: మహ్మద్ నబీకి షాకిచ్చిన ఐసీసీ
అఫ్గనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బౌలింగ్ చేసింది.సమ ఉజ్జీలుగాఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్ కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.రెండు సూపర్ ఓవర్లుఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. అఫ్గన్- ప్రొటిస్ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్ లిండే బౌలింగ్లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్ పద్నాలుగో ఇన్నింగ్స్లో నబీ ఆన్ఫీల్డ్ అంపైర్తో వాదనకు దిగాడు.అంపైర్తో వాగ్వాదంలుంగి ఎంగిడి ధరించిన రిస్ట్ బ్యాండ్ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.అతడి మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్ పాయింట్తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు -
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్లో వెస్టిండీస్పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్తో మ్యాచ్లో ధనాధన్ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్ గురువారం నాటి మ్యాచ్లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.కుశాల్ మెండిస్ అర్ధ శతకంపల్లెకెలె వేదికగా టాస్ గెలిచిన ఒమన్.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిశారా (8) నిరాశపరచగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో అలరించాడు.మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ పవన్ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ దసున్ శనక సుడిగాలి ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు.కేవలం 19 బంతుల్లోనే ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.WHERE’S THE BALL?! 🚀Back-to-back sixes as the Sri Lankan skipper marches towards his fifty, leading from the front and steering SL towards a massive total 👏🔥ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW 👉 https://t.co/JscJZV8hFa pic.twitter.com/oH7vFDDqqJ— Star Sports (@StarSportsIndia) February 12, 2026ఇక ఒమన్తో తాజా మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్ ఏడు బంతుల్లో 19, దునిత్ వెల్లలగే నాలుగు బంతుల్లో 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్ మెహమూద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే🏏దసున్ షనక- 2026 వరల్డ్కప్లో ఒమన్ మీద 19 బంతుల్లో🏏దసున్ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్కప్లో కెన్యా మీద 21 బంతుల్లో🏏కుమార్ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్లో యార్కర్ను ఎదుర్కొనేందుకు ఇషాన్ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.గాయం గనుక తిరగబెడితేప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.అభిషేక్ డిశ్చార్జ్ అయినా..ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ బుధవారం డిశ్చార్జ్ అయినట్లు మరో బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్ స్పష్టతనివ్వలేదు.ఇంతలో ఇషాన్ కిషన్కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే రాణా అవుట్కాగా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్తో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు -
IND vs PAK: సిగ్గులేని షోయబ్ మాలిక్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి.. నీ అసలైన నైజాన్ని బయటపెట్టుకుంటూ మరింత దిగజారుతూనే ఉంటావు.. కాస్తైనా సిగ్గుందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బదులు ‘అడుక్కుని తినవచ్చు కదా!’ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేశాడు.ఎప్పటిలాగానే పాక్ యూటర్న్అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో ఎప్పటిలాగానే పాక్ మాట మార్చింది. భారత్తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. దీంతో తమకు యూటర్న్లు తీసుకోవడం మామూలేనని మరోసారి నిరూపించి నవ్వులపాలైంది. కానీ పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం కింద పడినా తమదే పైచేయి అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.బీసీసీఐ పదే పదే అడిగితేనే..ఇందులో భాగంగా మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తాను హోస్ట్గా ఉన్న ఓ న్యూస్ ఛానెల్లో ఓ ఫేక్ వీడియో ప్రదర్శించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడినట్లుగా ఓ వీడియో సృష్టించి.. అందులో ఆయన.. "బీసీసీఐ పదే పదే అభ్యర్థించడం వల్ల ఐసీసీ ప్రతినిధి పాకిస్తాన్ను టీమిండియాతో మ్యాచ్ ఆడేలా ఒప్పించారు.Pakistani sports show Har Lamha Purjosh hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA for selling chooran to the Pakistani audience pic.twitter.com/BMLmmD9sUe— Vishal (@Fanpointofviews) February 11, 2026స్పందించిన రాజీవ్ శుక్లాక్రికెట్ మనుగడకు ఇదే సరైన పరిష్కారం’’ అని అన్నట్లుగా AIతో మాయ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా.. రాజీవ్ శుక్లా స్వయంగా స్పందించారు. "పాకిస్తాన్తో ప్రపంచకప్ మ్యాచ్ గురించి నేను మాట్లాడినట్లుగా AIతో మాయ చేశారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.తప్పుదారి పట్టించే ఈ వీడియోను నమ్మవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వీడియోలు మీ ఫీడ్లోకి వస్తే రిపోర్టు కొట్టేయండి’’ అని రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. కాగా భారత్- పాక్ మ్యాచ్కు మార్గం సుగమమైన వేళ.. "ఐసీసీ చైర్మన్ పర్యవేక్షణలో ఐసీసీ ప్రతినిధి సరైన విధంగా స్పందించి లాహోర్లో పాకిస్తాన్ బోర్డుతో చర్చలు జరిపారు.#WATCH | Delhi | On Pakistan to play against India at T20 cricket World Cup, BCCI Vice-President Rajeev Shukla says, "I am delighted to see the outcome of the deliberations initiated by ICC representative, supervised by the ICC Chairman and the representatives who had gone to… pic.twitter.com/3x9xSDyGMB— ANI (@ANI) February 10, 2026 ఎందుకిలా?బంగ్లాదేశ్ బోర్డుతోనూ మాట్లాడి మంచి పరిష్కారం కనుగొన్నారు. క్రికెట్ ప్రాధాన్యం, మనుగడకు ఇలాంటి నిర్ణయం సముచితమైనది’’ అని రాజీశ్ శుక్లా పేర్కొన్నారు. అయితే, షోయబ్ మాలిక్ మాత్రం తప్పుడు వీడియోను ప్రదర్శిస్తూ బీసీసీఐ అడుక్కునందు వల్లే పాక్ వారితో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకొందనే అర్థం వచ్చేలా దిగజారుడు వైఖరి ప్రదర్శించాడు. కాగా కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగనుంది.కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సానియాతో ఉంటూనే నటి, వివాహిత సనా జావెద్తో మాలిక్ "బంధం’’ కొనసాగించాడు. ఈ క్రమంలో సానియా అతడికి విడాకులు ఇవ్వగా.. సనా సైతం భర్తకు విడాకులు ఇచ్చి మాలిక్ను పెళ్లి చేసుకుంది.చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లో వైభవ్ సూర్యవంశీ!
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లండ్తో టైటిల్ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో వైభవ్ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లోక్రిక్బజ్ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్ టీ20 ఈవెంట్ డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో వైభవ్ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.హార్దిక్ పాండ్యా సైతందేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్ కంటే ముందే పొట్టి క్రికెట్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్ రిచ్ లీగ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్ వధేరా, దీపక్ చహర్ తదితరులు కూడా భాగమయ్యారు.పైసా వసూల్ ప్రదర్శనకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్కు జోడీగా ఓపెనర్గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో ధనాధన్ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్ సెషన్లో వైభవ్ పాల్గొనున్నాడు. చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
T20 WC 2026: మళ్లీ మాట మార్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరోసారి మాట మార్చింది. పదే పదే యూటర్న్లు తీసుకుంటూ నవ్వులపాలు అవుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొన్న విషయం తెలిసిందే.భారత్లో తమకు భద్రత ఉండదని.. తమ వేదికను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది బంగ్లాదేశ్. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లా వాదనను కొట్టిపడేస్తూ పునరాలోచన చేయాలని గడువు ఇచ్చింది. అయినప్పటికీ తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి వైదొలగడానికైనా సిద్ధమే కానీ.. భారత్లో ఆడమని భీష్మించుకుని కూర్చుంది.బంగ్లాదేశ్ను తప్పించిఫలితంగా బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి అనుమతించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుని బంగ్లాకు మద్దతుగా నిలిచింది. తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని నాటకాలు ఆడింది. అయితే, ఐసీసీ రంగంలోకి దిగగా.. పాక్ భారత్తో మ్యాచ్కు అంగీకరించింది.ఆటగాళ్ల నిర్ణయమే ఇదిఅదే విధంగా.. బంగ్లాదేశ్పై ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం బంగ్లా క్రికెట్ బోర్డు, క్రికెటర్లు కలిసి టోర్నీని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఇందులో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నాడు. గతంలో ఇదే వ్యక్తి ప్రభుత్వం ఆదేశించినట్లుగానే టోర్నీ నుంచి తప్పుకొంటున్నామని తెలిపాడు. ఆ తర్వాత ఈమేరకు నాలుక మడతేశాడు. దీంతో ఆసిఫ్ నజ్రుల్, బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మరోసారి మాట మార్చేశాడుఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన ఆసిఫ్ నజ్రుల్ మరోసారి మాట మార్చాడు. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడకూడదన్నది మా ప్రభుత్వ నిర్ణయమే. మరోసారి ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు.మీడియాతో మాట్లాడటానికి తాను పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో బీసీబీ, క్రికెటర్ల నిర్ణయమేనని అనుకోకుండా చెప్పేశానని పేర్కొన్నాడు. తన మాటల్ని అందరూ అపార్థం చేసుకున్నారని నజ్రుల్ కవర్ చేశాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటగాళ్లు శిరసా వహించారని.. ఈ విషయంలో వారికి క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చాడు.పరువు పాయేదీంతో నెటిజన్లు బంగ్లాదేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ను నిందించాలనే తొందరలో మీ ఆటగాళ్లను కూడా బలి చేసేందుకు సిద్ధపడి.. పరువు తీసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైంది.చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్ తడబడుతోంది. గ్రూప్-‘సి’లో భాగంగా తొలుత నేపాల్తో తలపడ్డ హ్యారీ బ్రూక్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో మాత్రం వెస్టిండీస్ ముందు తలవంచింది.వెస్టిండీస్దే పైచేయిటీ20 ప్రపంచకప్ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్ స్పిన్ను ఎదుర్కోలేక ఇంగ్లండ్ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.నిరాశకు గురయ్యాంఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.ప్రత్యర్థి బౌలర్ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.సాల్ట్ విధ్వంసకర ప్లేయర్మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్ విధ్వంసకర ప్లేయర్. ఇక జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేపాల్ మీదైనా గెలిచాంఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్లో నేపాల్ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.196 పరుగుల భారీ స్కోరుకాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (42 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.స్పిన్నర్ల మాయాజాలం ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఒవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ బెతెల్ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా... జోస్ బట్లర్ (21), కెప్టెన్ హారీ బ్రూక్ (17) ప్రభావం చూపలేకపోయారు.చివర్లో స్యామ్ కరన్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. విండీస్ స్పిన్నర్లు గుడకేశ్ మోతీ 3, రోస్టన్ ఛేజ్ 2, అకీల్ హొసీన్ ఒక వికెట్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చదవండి: SA vs AFG: ‘డబుల్ సూపర్’ ధమాకా -
IND vs NAM: మరో కూనతో పోరు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్ను ప్రాక్టీస్గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. అస్వస్థత కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్లో బరిలోకి దిగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ దూరమైతే సంజూ సామ్సన్కు అవకాశం లభించవచ్చు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్ అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! అభిషేక్పైనే అందరి దృష్టి గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్ హిట్టర్’ వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ‘డకౌట్’ అయ్యాడు. ‘పవర్ ప్లే’ లోపే మ్యాచ్ను లాగేసుకునే సత్తా గల అభిషేక్... రెండో మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. వరల్డ్కప్నకు ఒక్క రోజు ముందు పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్ సుందర్ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. పోటీనిచ్చేనా! అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్తో ప్లేయర్లంతా ఫామ్లోకి రావాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్స్తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. వరల్డ్కప్నకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్. నమీబియా: ఎరాస్మస్ (కెప్టెన్ ), స్టీన్ కాంప్, ఫ్రైలింక్, జాన్ నికోల్, జేజే స్మిత్, జెన్ గ్రీన్, లైచెర్, విలియమ్ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్ స్కాట్జ్, బెన్ షికొంగో.టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X ఒమన్వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి నేపాల్ X ఇటలీవేదిక: ముంబై; మ.గం. 3 నుంచిభారత్ X నమీబియావేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
‘డబుల్ సూపర్’ ధమాకా
ప్రపంచకప్లో డజను మ్యాచ్లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి... కొన్ని చక్కటి ఇన్నింగ్స్లు, మరికొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలు వచ్చినా అసలైన టి20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు... ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్ మీల్స్ను అందించింది... దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్ను చూపించాయి... 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లూ 187 పరుగులతో సమఉజ్జీలుగా నిలవగా, సూపర్ ఓవర్ తప్పలేదు. అక్కడా ఎవరూ తగ్గకుండా సమం–సమం అనడంతో మరో సూపర్ ఓవర్ ముందుకు వచ్చింది. ఈసారి మాత్రం ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీ టీమ్ ఎట్టకేలకు గట్టెక్కింది. ప్రధాన పోరుతో పాటు రెండు సూపర్ ఓవర్లతో సాగిన డ్రామా టోర్నీకే హైలైట్గా నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రదర్శనకంటే కీలక సమయాల్లో వరుస తప్పులు చేసిన అఫ్గానిస్తాన్ స్వయంకృతమే ఫలితాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు సూపర్ ఓవర్లలో ఒక్కటి కూడా బౌలింగ్ చేయకపోగా... రెండో సూపర్ ఓవర్లో ఫామ్లో ఉన్న గుర్బాజ్ను కాకుండా నబీకి స్ట్రయిక్ అవకాశం ఇవ్వడం కూడా జట్టును ఓడించాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్లో డజను మ్యాచ్ల తర్వాత అద్భుతమైన వినోదాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా ‘డబుల్ సూపర్ ఓవర్’లో అఫ్గానిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ (28 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు), డికాక్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 61 బంతుల్లో 114 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84; 4 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్గిడి (3/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి ‘సూపర్ ఓవర్’లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో ‘సూపర్ ఓవర్’ను ఆడించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, 19 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకొని గ్రూప్ ‘డి’ నుంచి ‘సూపర్ ఎయిట్స్’కు చేరువ కాగా... వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్తాన్ ముందంజ వేసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చివరి ఓవర్ డ్రామా సాగిందిలా... ఆఖరి ఓవర్లో అఫ్గానిస్తాన్కు 13 పరుగులు అవసరం కాగా, ఒకటే వికెట్ ఉంది. తొలి బంతికి నూర్ను రబడ బౌల్డ్ చేసినా అది నోబాల్ అయింది. తర్వాతి బంతి వైడ్ కాగా, ఆ తర్వాత వేసిన బంతికి నూర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను యాన్సెన్ వదిలేశాడు. ఆ వెంటనే నూర్ సిక్స్ బాదడంతో తొలి రెండు బంతుల్లోనే 8 పరుగులు వచ్చినట్లయింది. ఇక చేయాల్సింది 4 బంతుల్లో 5 పరుగులే. తర్వాతి బంతికి షాట్ ఆడి నూర్ సగం దూరం వచ్చినా... ఫరూఖీ వెనక్కి పంపడంతో పరుగు రాలేదు.ఓవర్ నాలుగో బంతి మళ్లీ నోబాల్ కావడంతో పాటు 2 పరుగులు తీయడంతో సమీకరణం మరింత సులువుగా మారింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి, పైగా ఫ్రీ హిట్...బహుశా బ్యాటర్లకు ఇదే సూచన ఇచ్చేందుకు ‘వాటర్ బాయ్స్’ను పంపించగా, అంపైర్లు అనుమతించలేదు! నూర్ లాంగాఫ్ దిశగా కొట్టిన షాట్కు తొలి పరుగు సులువుగా రాగా, రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫారుఖీ నెమ్మదించడంతో రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఫీల్డర్ వైపు చూడకుండా వేగంగా పరుగెత్తి బ్యాట్తో డైవ్ చేసే ప్రయత్నం చేస్తే ఫారుఖీ పరుగు సునాయాసంగా పూర్తయ్యేది. అంతకుముందు మూడో బంతికి సింగిల్ నిరాకరించిన ఫారుఖీ అసలు సమయంలో సరిగా పరుగెత్తక తన జట్టుకు గెలుపును దూరం చేశాడు. దీని తర్వాత మరో రెండు బంతులు కూడా ఉన్నాయి కాబట్టి అఫ్గానిస్తాన్ ఈ రిస్క్ చేయకుండా ఉండాల్సింది.మొదటి సూపర్ ఓవర్: ఎన్గిడి బౌలింగ్లో అజ్మతుల్లా 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అనంతరం ఫారుఖీ బౌలింగ్లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తప్పనిసరిగా సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నిలిచింది. లో ఫుల్టాస్ను లాంగాఫ్ మీదుగా స్టబ్స్ సిక్స్ బాదడంతో దక్షిణాఫ్రికా కూడా 17 పరుగులే చేయగలిగింది. రెండో సూపర్ ఓవర్: అజ్మతుల్లా బౌలింగ్లో స్టబ్స్ వరుసగా 6, 1 రాబట్టగా, మిల్లర్ వరుసగా 2, 6, 6, 2 బాదడంతో 23 పరుగులు లభించాయి. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ ఓవర్లో అఫ్గానిస్తాన్ తొలి 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా వికెట్ కోల్పోయింది. అయితే గుర్బాజ్ చెలరేగి వరుసగా 6, 6, 6 కొట్టడంతో పాటు తర్వాతి బంతి వైడ్గా పడింది. ఈసారి కూడా సిక్స్ కొడితే అఫ్గాన్ గెలిచే అవకాశాలు ఉండగా, చివరి బంతికి గుర్బాజ్ క్యాచ్ ఇచ్చాడు. 38 ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20ల్లో ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితాలు వచ్చిన మ్యాచ్లు.2 అంతర్జాతీయ టి20ల్లో ‘డబుల్ సూపర్ ఓవర్’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్లు. ఈ రెండింటిలోనూ అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. 2024లో అఫ్గానిస్తాన్పై భారత్ ‘డబుల్ సూపర్’లో గెలిచింది. 2025లో నేపాల్పై నెదర్లాండ్స్ ‘ట్రిపుల్ సూపర్ ఓవర్’లో నెగ్గింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) నబీ (బి) ఫారుఖీ 5; డికాక్ (సి) జద్రాన్ (బి) రషీద్ 59; రికెల్టన్ (ఎల్బీ) (బి) రషీద్ 61; బ్రెవిస్ (సి) నబీ (బి) ఒమర్జాయ్ 23; మిల్లర్ (నాటౌట్) 20; స్టబ్స్ (సి) ముజీబ్ (బి) ఒమర్జాయ్ 1; యాన్సెన్ (సి) అటల్ (బి) ఒమర్జాయ్ 16; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–12, 2–126, 3–127, 4–155, 5–159, 6–187. బౌలింగ్: ఫరూఖీ 4–0–32–1, ముజీబ్ 3–0–30–0, ఒమర్జాయ్ 4–0–41–3, నబీ 2–0–20–0, రషీద్ 4–0–28–2, నూర్ 3–0–35–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) లిండే (బి) మహరాజ్ 84; జద్రాన్ (బి) ఎన్గిడి 12; నైబ్ (సి అండ్ బి) ఎన్గిడి 0; అటల్ (సి) యాన్సెన్ (బి) రబడ 0; రసూలీ (రనౌట్) 15; ఒమర్జాన్ (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 22; నబీ (సి) మార్క్రమ్ (బి) లిండే 5; రషీద్ (సి) మిల్లర్ (బి) యాన్సెన్ 20; ముజీబ్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 15; ఫారుఖీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 187. వికెట్ల పతనం: 1–51, 2–51, 3–52, 4–121, 5–121, 6–139, 7–164, 8–169, 9–175, 10–187. బౌలింగ్: ఎన్గిడి 4–0–26–3, యాన్సెన్ 4–0–42–1, రబడ 3.4–0–38–1, లిండే 3–0–39–1, మహరాజ్ 4–0–27–1, మార్క్రమ్ 1–0–14–0. -
రూథర్ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్ను షిమ్రోన్ హెట్మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్ను 200 దరికి చేర్చారు. రూథర్ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి. -
టీమిండియాకు గుడ్ న్యూస్
రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్మెంట్ సంజూ శాంసన్ను రేపటి మ్యాచ్కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి ఇవాళ కూడా నెట్స్లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్లో రాణిస్తే.. పాక్తో మ్యాచ్కు ముందు అభిషేక్తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇటీవలికాలంలో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. ఈ ప్రపంచకప్లో అభిషేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
T20 WC 2026: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పసికూన ఐర్లాండ్పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్షా తలో 37 పరుగులు.. కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్ జంపా (4-0-23-4), నాథన్ ఎల్లిస్ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లలో కుహ్నేమన్ (4-0-29-1) కూడా రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. డాక్రెల్ ఈ స్కోర్ చేయకపోయుంటే ఐర్లాండ్ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్ బ్యాటర్లలో లోర్కన్ టక్కర్ (24), రాస్ అదైర్ (12), గెరాత్ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. -
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' సమరాలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెగ్యులర్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి. అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్ ఓవర్) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్ మూడో సూపర్కు కూడా వెళ్లేది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూపర్ ఓవర్ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్ ఔట్ పద్దతి అమల్లో ఉండేది. సూపర్ ఓవర్ రాకతో బౌల్ ఔట్ పద్దతికి చరమగీతం పాడారు.అప్పటి నుంచి రెగ్యులర్ మ్యాచ్ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్ ఓవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది. ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్ ఆలౌట్గా పరిగణించబడుతుంది. సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది. సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్ ఓవర్ జరుగుతుంది. రెండో సూపర్ ఓవర్లోనూ సేమ్ రూల్స్తో ఇరు జట్లకు ఓ ఓవర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్ ఓవర్కు కూడా ఆస్కారముంటుంది. ఒకవేళ మూడో సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్ పరిస్థితులు, షెడ్యూల్ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది. 2025 జూన్ 16న నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మూడో సూపర్ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా చరిత్రకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్ కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అది ఐపీఎల్ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా నిలిచింది. ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్లో చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. 2012 ఎడిషన్లో న్యూజిలాండ్-వెస్టిండీస్.. అదే ఎడిషన్లో న్యూజిలాండ్-శ్రీలంక.. 2024 ఎడిషన్లో నమీబియా-ఒమన్.. అదే ఎడిషన్లో పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి. -
న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్వెల్ ప్రపంచకప్కు ముందు భారత్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్ సమయానికంతా ఫిట్నెస్ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. వార్మప్ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్వెల్కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్కాంచీని బ్రేస్వెల్కు రీప్లేస్మెంట్గా ప్రకటించారు. మెక్కాంచీ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ అండర్ డాగ్గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్ (డి) మ్యాచ్లో కెనడాతో తలపడనుంది. -
గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు. కాగా ఫార్మాట్లకు అతీతంగా ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్.ధనాధన్బిహార్కు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.ఫైనల్లోనూ భారీ శతకంఇక ఇటీవల ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ను గుర్తుకు తెస్తోందన్నాడు.గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీవిజ్డన్ క్రికెట్ వీక్లీ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. “వైభవ్ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్ను స్వింగ్ చేయడం.. ఆ టైమింగ్, పరిపూర్ణత సూపర్. అతడి హ్యాండ్ స్పీడ్, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.అచ్చం సోబర్స్ లాగే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్ మాత్రం తన బ్యాటింగ్ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్ స్వింగ్ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్’’ అని మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీని కొనియాడాడు. చదవండి: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు.. నెటిజన్స్ ఫైర్ -
రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీరోచిత పోరాటం
అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్ తమ వీరోచిత పోరాటంతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది.తొలుత రెగ్యులర్ మ్యాచ్లో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్గా సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది.రెగ్యులర్ మ్యాచ్సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)ఆఫ్ఘనిస్తాన్ 187-10 (19.4 ఓవర్లు)ఫ్రీ హిట్కు రనౌట్రెగ్యులర్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్. ఆఫ్ఘన్ కోల్పోయి వికెట్ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.తొలి సూపర్ ఓవర్ఆఫ్ఘనిస్తాన్- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)రెండో సూపర్ ఓవర్సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)ఆఫ్ఘనిస్తాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్ హక్ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-30-0), మొహమ్మద్ నబీ (2-0-20-0), నూర్ అహ్మద్ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్ బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ (5), స్టబ్స్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో జన్సెన్ (16) బ్యాట్ ఝులిపించాడు.188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్ను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఆఫ్ఘన్ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. మిగతా ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్ 12, దర్విష్ రసూల్ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్, సెదిఖుల్లా అటల్, ముజీబ్, ఫజల్ హక్ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్, రబాడ, లిండే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు. -
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.బిగ్బాష్లో అద్భుత ఫామ్లో ఉన్నా, స్టీవ్ను ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ వేధిస్తున్న గాయాలుప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్ - ఐర్లాండ్తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11 - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13 - శ్రీలంకతో – ఫిబ్రవరి 16 - ఒమాన్తో – ఫిబ్రవరి 20 ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా -
అది లీగల్: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్టైమ్ టెస్టింగ్ టూల్ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్కు మద్దతుగా.. అశ్విన్ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026 -
ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి వైదొలగడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.కాగా భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు రాలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. భారత్లో తమకు భద్రత ఉండదని.. మరో వేదికైన శ్రీలంకకు తమ మ్యాచ్లు మార్చాలని అభ్యర్థించింది.ప్రభుత్వ నిర్ణయానుసారమే..అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తమ బృందం తేల్చించిందన్న ఐసీసీ.. పునరాలోచన చేయాల్సిందిగా బీసీబీకి చెప్పింది. కానీ.. తమ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదని.. ప్రభుత్వ నిర్ణయానుసారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా తాము సిద్ధమని బీసీబీ ఐసీసీకి స్పష్టం చేసింది.ఈ విషయం గురించి జనవరి 22న బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు అర్థమయ్యేలా చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశాము.నాకు తెలిసి వాళ్లు అర్థం చేసుకునే ఉంటారు. ఐసీసీలో మాకు న్యాయం దొరకదనే అనిపించింది. టోర్నీలో మేము ఆడేది.. లేనిది అంతా ప్రభుత్వ నిర్ణయమే’’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి.. ర్యాంకింగ్ ఆధారంగా స్కాట్లాండ్ను అనుమతించింది ఐసీసీ.పాక్ యూటర్న్ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచి.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. అయితే, ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ తదితర సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాక్ యూటర్న్ తీసుకుంది. కొలంబోలో ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్ ఆడతామని స్పష్టం చేసింది.ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నారంటూ..ఇక బంగ్లాదేశ్ బోర్డుకు సైతం ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్ నజ్రుల్ తమ మాటల్ని పూర్తిగా మార్చేశాడు. ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఆడలేకపోయినందుకు మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.టోర్నీలో ఆడకూడదన్నది పూర్తిగా బీసీబీ, ఆటగాళ్ల నిర్ణయమే. దేశ క్రికెట్ను రక్షించేందుకు వారు త్యాగాలు చేశారు. బంగ్లాదేశ్ ప్రజలను కాపాడుకునేందుకు.. జాతీయ సమగ్రతను చాటేందుకు వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అంటూ అర్థంపర్థం లేకుండా మరీ దారుణంగా నాలుక మడతేశాడు.ఛీ.. మరీ ఇంత దారుణమా?దీంతో బంగ్లాదేశ్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యూటర్న్లు తీసుకోవడంలో బంగ్లా పాకిస్తాన్నే మించిపోతుందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని సోషల్ మీడియా వేదికగా ఛీత్కరించుకుంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసి ఆటగాళ్ల కలలను నీరుగార్చారని బంగ్లా ప్రభుత్వంపై మండిపడుతున్నారు.కాగా భారత క్రికెట్, ఐసీసీతో సత్సంబంధాలు కొనసాగించి సమస్య పరిష్కరించుకోవాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వంటి ఆటగాళ్లు బీసీబీకి సూచించారు. అయితే, బంగ్లా బోర్డులోని ఓ అధికారి అతడిని భారత ఏజెంట్ అంటూ విమర్శించాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల సంఘం సమావేశం ఏర్పాటు చేసి అతడితో రాజీనామా చేయించేలా ఒత్తిడి తెచ్చారు.ఆటగాళ్లపై నెపంబంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ సైతం తమకు వరల్డ్కప్లో ఆడాలని ఉందని.. అయితే, ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కానీ నజ్రుల్ మాత్రం ఇలా ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటూ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా మైనారిటీ హిందువుల మీద హత్యాకాండ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్- బంగ్లా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్-శ్రీలంక వేదికగా రల్డ్కప్ టోర్నీ మొదలైన సంగతి తెలిసిందే.చదవండి: పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్ -
T20 WC 2026: కివీస్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్ రికార్డు విజయం సాధించింది. చెన్నై వేదికగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడింది కివీస్. చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లోయూఏఈని ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్కు ఈ విజయం సాధ్యమైంది. వరల్డ్కప్ టోర్నీ తాజా ఎడిషన్ తొలి పోరులో అఫ్గనిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్కు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. తద్వారా సూపర్ ఎయిట్కు కివీస్ మరింత చేరువైంది.77 బంతుల్లోనే 107 పరుగులుకాగా న్యూజిలాండ్తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగింది యూఏఈ. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (45 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), అలీషాన్ షరఫు (47 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 77 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు.మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి 2 వికెట్లు తీయగా.. జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రపంచ రికార్డు అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.సీఫెర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు బాది 89 పరుగులు.. అలెన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 84 రన్స్తో అజేయంగా నిలిచారు. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.తద్వారా తొలి వికెట్కు 92 బంతుల్లోనే 175 పరుగులు జత చేసి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఏ వికెట్కైనా అత్యధిక స్కోరు సాధించిన జోడీగా సీఫెర్ట్- అలెన్ ప్రపంచ రికార్డు సాధించారు. తమ అద్భుత ప్రదర్శనతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే యూఏఈపై జట్టుకు విజయం అందించారు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక భాగస్వామ్యం (ఏ వికెట్కైనా)🏏టిమ్ సీఫెర్ట్- ఫిన్ అలెన్ (న్యూజిలాండ్): 2026లో యూఏఈ మీద 175 నాటౌట్🏏జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్): 2022లో టీమిండియా మీద 170 నాటౌట్🏏క్వింటన్ డికాక్- రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా): 2022లో బంగ్లాదేశ్ మీద 168 🏏మహేళ జయవర్దనే- కుమార్ సంగక్కర (శ్రీలంక): 2010లో వెస్టిండీస్ మీద 166🏏ఇబ్రహీం జద్రాన్- రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్): 2024లో ఉగాండా మీద 154న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ స్కోర్లు👉యూఏఈ: 173/6(20)👉న్యూజిలాండ్: 175/0(15.2)👉ఫలితం: యూఏఈపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..Absolute carnage 🔥New Zealand shatter records with the highest partnership and the highest successful chase without losing any wickets in ICC Men’s T20 World Cup history. 🇳🇿ICC Men’s #T20WorldCup | #PAKvUSA | LIVE NOW 👉 https://t.co/97PRnnpgoP pic.twitter.com/KjichpPvP0— Star Sports (@StarSportsIndia) February 10, 2026 -
పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స వార్తల్లోకెక్కాడు. గతేడాది నవంబరులో చివరగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ లెఫ్టాండర్. పేలవ ప్రదర్శనల కారణంగా టీ20 ప్రపంచకప్-2026 శ్రీలంక జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు.అదనంగా ఓ రబ్బరు పొర అయితే, ఆటతో కాకుండా భారత బ్యాటర్ల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా భనుక రాజపక్స పేరు తెరమీదకు వచ్చింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు వాడే బ్యాట్లు మిగతా జట్లు వాడే బ్యాట్ల కంటే ఎంతో మిన్నగా ఉంటాయని అన్నాడు. వారి బ్యాట్లపై అదనంగా ఓ రబ్బరు పొర కూడా ఉంటుందని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో భనుక రాజపక్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పాకిస్తాన్ జట్టు అభిమానులు నెట్టింట రచ్చ చేశారు. భారత బ్యాటర్ల ఆటను కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో భనుక రాజపక్స స్పందించాడు.ప్రశంసించాలని అనుకున్నాతన మాటల్ని వక్రీకరించి ఇష్టారీతిన ప్రచారం చేయడం సరికాదని హితవు పలికాడు. ‘‘అందరికీ హాయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. వారు తోచిన విధంగా మలచుకుని ప్రచారం చేస్తున్నారు. బహుశా అనువాదం చేయడంలో వారు పొరపడి ఉంటారు.నేను భారత బ్యాటర్లను ప్రశంసించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. వారి వద్ద అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్ పరికరాలు ఉన్నాయి.ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల కోసం బ్యాట్లు తయారుచేసే మ్యాన్ఫ్యాక్చరర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వారు. ఈ విషయంలో స్పష్టత వచ్చిందనే అనుకుంటున్నా.కౌంటర్ అదుర్స్నాకు వారి పట్ల గౌరవం తప్ప ఇంకేమీ లేదు’’ అని భనుక రాజపక్స సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో షాకవ్వడం పాక్ ఫ్యాన్స్ వంతైంది. మరోవైపు.. టీమిండియా అభిమానులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన వారికి భనుక రాజపక్స మంచి కౌంటర్ ఇచ్చాడని పేర్కొంటున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఇదిలా ఉంటే.. భనుక రాజపక్స తన కెరీర్లో 5 వన్డేలు, 45 టీ20 ఆడాడు. 34 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో 89 వన్డే, 744 టీ20 పరుగులు ఉన్నాయి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి.. -
ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాక్
భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెప్పినట్లుగానే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో విధిలేని పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించింది.అయితే, కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా పాక్ ప్రగల్బాలు పలుకుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ చైర్మన్ నజామ్ సేథి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తమ ముందు ఐసీసీ చిన్నబోయిందని.. వెనక్కి తగ్గి తమతో రాజీకి వచ్చిందని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఐసీసీ భయపడింది.. అందుకే రాజీ‘‘ఈ విషయంలో ఐసీసీ వెనకడుగు వేసింది. అందుకే పాక్ చెప్పినట్లుగా బంగ్లాదేశ్ పట్ల సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ బంగ్లాకు మద్దతుగా గొప్ప నిర్ణయం తీసుకుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే తమపై ఐసీసీ ఆంక్షలు విధించలేదని తెలుసుకున్న పాక్ ఇంటాబయటా లాయర్లను సంప్రదించి బాయ్కాట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.ఐసీసీకి కూడా తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని తెలుసు. అందుకే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడాలని కోరారు. అలా పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్కు కూడా న్యాయం జరిగింది.ఐసీసీ మీద ఆధాపడే స్థితిలో లేముమిగతా అన్ని బోర్డుల మాదిరే గతంలో పాక్ కూడా ఐసీసీ మీద ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ లీగ్ నుంచే ఎక్కువ డబ్బు వస్తోంది. కాబట్టి పాక్ తన సొంత వనరులపైనే ఆధారపడుతోంది.కాబట్టి ఐసీసీ చెప్పినట్లు వినాల్సిన పనిలేదు. మార్చిలో పాకిస్తాన్కు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది’’ అని నజామ్ సేథి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్కు ప్రధానంగా ఆదాయం ఐసీసీ నుంచే వస్తోంది.అన్నివైపులా ఒత్తిడి అంతేకాదు.. పీఎస్ఎల్లో అంతర్జాతీయ క్రికెటర్లు ఆడాలన్నా ఆయా సభ్య దేశాల బోర్డుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పాక్ భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే.. సభ్య దేశాలు పాక్ లీగ్లో ఆడే క్రికెటర్లకు నో ఆబ్జక్షన్ లెటర్ ఇవ్వకుండా ఆపే అవకాశం ఉందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.అదే విధంగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం పాక్లో తమపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లేఖ రాసింది. అయినా సరే తాము పాక్తో క్రికెట్ సంబంధాలు కొనసాగిస్తున్న తీరును ప్రస్తావించింది. యూఏఈ, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కు భారత్తో ఆడాలని విజ్ఞప్తి చేశాయి. అన్నింటికీ మించి గత్యంతరం లేకే భారత్తో ఆడలేమని పాక్ లేవనెత్తిన అంశం సబబుగా లేదు కాబట్టి.. ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించే పరిస్థితి వచ్చింది.మొదటికే మోసం వస్తుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పాక్.. అయినా సరే తామే గొప్ప అంటూ ఇలా మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకుంది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ కూడా తాము భారత్లో కాకుండా శ్రీలంకలో ఆడతామని పట్టుబట్టింది.ఇందుకు ఐసీసీ నిరాకరించగా.. తాము టోర్నీలో ఆడలేమని బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో మధ్యలోకి వచ్చిన పాక్.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి బెదిరింపులకు దిగింది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో భారత్తో మ్యాచ్ మాత్రమే ఆడమని నాటకాలు ఆడింది.అయితే, ఈ మ్యాచ్ జరుగకపోతే సభ్య దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ఐసీసీ పాక్కు మరో అవకాశం ఇచ్చింది. లాహోర్లో పీసీబీతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పాక్ గొంతెమ్మ కోరికలను తిరస్కరించిన ఐసీసీ.. బంగ్లాదేశ్ విషయంలో తాము ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఆంక్షలు, పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి.. -
’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.వియ్యంకులతో కలిసిఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కుటుంబం.. వియ్యంకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసింది. కాబోయే వధూవరులు అర్జున్, సానియా కూడా మోదీని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ స్వయంగా వెల్లడించాడు.రాష్ట్రపతి గారికి ధన్యవాదాలుఅదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి తమ కుమారుడి వివాహానికి (Arjun- Saania Wedding) రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సచిన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో.. ‘‘గత ఫిబ్రవరిలో గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మా మదిలో అలాగే ఉన్నాయి.ఈరోజు అర్జున్- సానియా వివాహానికి ఆహ్వానించేందుకు మరోసారి వారిని కలిశాము. వధూవరుల్ని ఆశీర్వదించిన గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు’’ అని సచిన్ ట్వీట్ చేశాడు. రాష్ట్రతితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పంచుకున్నాడు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సైతం వివాహానికి ఆహ్వానించినట్లు తెలిపాడు సచిన్.మీ విలువైన సలహాలకు థాంక్స్ఇక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం సచిన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘‘అర్జున్- సానియా వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. యువ జంటకు మీరు ఇచ్చిన విలువైన సలహాలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞులమై ఉంటాము’’ అని సచిన్ ప్రధానితో దిగిన ఫొటోలు షేర్ చేశాడు. వ్యాపార కుటుంబంకాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు. సచిన్ కుమార్తె సారా టెండుల్కర్కు సానియా స్నేహితురాలు. ఇక అర్జున్- సానియాల నిశ్చితార్థం గతేడాది జరిగిన విషయం తెలిసిందే. కాగా సచిన్- అంజలి దంపతులకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. తర్వాత అర్జున్ జన్మించాడు. అయితే, అక్క కంటే ముందు తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం. ఇక సారా వ్యాపార రంగంలో అడుగుపెట్టగా.. అర్జున్ తండ్రి బాటలో క్రికెటర్ అయ్యాడు. అయితే, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు పొందలేకపోయాడు 26 ఏళ్ల అర్జున్. చదవండి: నయా రాకెట్ -
T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.అదే విధంగా.. తీవ్రమైన జ్వరం కారణంగా టీ20 ప్రపంచకప్-2026 తొలి మ్యాచ్కు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కోలుకున్నాడు. అమెరికాతో మ్యాచ్కు దూరంగా ఉన్న అతడు గురువారం నాటి మ్యాచ్ కోసం ఇప్పటికే సన్నద్ధమయ్యాడు.ఆస్పత్రిపాలైన అభిషేక్ శర్మఇలాంటి శుభ తరుణంలో టీమిండియాకు మరో చేదువార్త. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్పత్రిపాలైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అభిషేక్ శర్మ దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కటే కూడా ధ్రువీకరించాడు. ‘‘అభి ఇప్పటికీ ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకుని మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నాం’’ అని తెలిపాడు.అందుబాటులో ఉండకపోవచ్చుఅయితే, బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. సమస్య ఏమిటో కనుక్కునేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. అతడు డిశ్చార్జ్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నమీబియాతో మ్యాచ్కు మాత్రం అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా అభిషేక్ శర్మ గనుక దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తిరిగి ఓపెనర్గా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విఫలం కావడంతో అతడి స్థానంలో అభిషేక్కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు. సంజూకు ఛాన్స్ఇక అమెరికాతో తొలి మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టిన టీమిండియా.. గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడుతుంది. కాగా అమెరికాతో మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిని విషయం తెలిసిందే. అయితే, ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఈ విధ్వంసకర ఓపెనర్ ఆట తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.చదవండి: నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం -
సిరాజ్ మియాకు అరుదైన గౌరవం
లండన్: భారత పేస్ బౌలర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత క్రికెట్ మేగజీన్ ‘విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్’ 2026 సంచిక కవర్ పేజీపై పబ్లిషర్లు సిరాజ్ చిత్రాన్ని ముద్రించారు. సిరాజ్తోపాటు ఇంగ్లండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఫొటో కూడా దీనిపై ఉంది. ఓవల్ టెస్టులో చేతితో గాయంతో జట్టును కాపాడేందుకు కట్టుతోనే మైదానానికి వచ్చిన వోక్స్ ఫొటోనే ఇక్కడ వాడారు. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగియగా... చివరి టెస్టులో సిరాజ్ ప్రదర్శనతోనే భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. రెండో ఇన్నింగ్స్లో చివరి రోజు 4 వికెట్లతో ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉండగా, సిరాజ్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆట ముగించాడు. మొత్తంగా ఈ సిరీస్లో సిరాజ్ 32.43 సగటుతో అత్యధికంగా 23 వికెట్లు పడగొట్టడం విశేషం. కొత్త విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ సంచిక ఏప్రిల్ 16న మార్కెట్లోకి రానుంది. -
PAK vs USA: అమెరికా పేసర్ అరుదైన ఘనత
అంతర్జాతీయ క్రికెట్లో సీనియర్ స్థాయిలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో పేస్ బౌలర్ ఎహ్సాన్ ఆదిల్ కూడా చేరాడు. 32 ఏళ్ల ఆదిల్ 2013లో అరంగేట్రం చేసి పాకిస్తాన్ తరఫున 3 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా అతడు రెండు మ్యాచ్లలో బరిలోకి దిగాడు. సొంత దేశంపైనే అరంగేట్రంఅయితే ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిన అతను అక్కడ తన క్రికెట్ను కొనసాగించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు అమెరికా టీ20 వరల్డ్ కప్-2026 జట్టులో చోటు దక్కించుకున్న ఆదిల్కు.. పాకిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచే అమెరికా తరపున తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఇలా తన సొంత దేశం పాకిస్తాన్తో మ్యాచ్లోనే అమెరికా తరఫున అతడు అరంగేట్రం చేయడం విశేషం. ప్రతీకారం తీర్చుకున్న పాక్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కొలంబోలో టాస్ గెలిచిన అమెరికా పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 32 పరుగుల తేడాతో గెలిచిన పాక్.. గత వరల్డ్కప్ ఎడిషన్లో అమెరికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో ఆదిల్ 3 ఓవర్లలో 39 పరుగులిచ్చాడు. ప్రపంచకప్ నుంచి హసరంగ, బ్రేస్వెల్ అవుట్ తాజా టీ20 ప్రపంచకప్లో దాదాపు అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. తాజాగా శ్రీలంక, న్యూజిలాండ్లకు చెందిన హసరంగ, మైకేల్ బ్రేస్వెల్ మెగా ఈవెంట్కు దూరమయ్యారు. ఆదివారం ఐర్లాండ్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్కప్లో కొనసాగే అవకాశం లేకపోవడంతో అతని స్థానాన్ని లెగ్ స్పిన్నర్ హేమంతతో భర్తీ చేసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. బ్రేస్వెల్ భారత పర్యటనకు వచ్చినపుడే గాయపడ్డాడు. అయితే వార్మప్ మ్యాచ్ సమయంలో అతని గాయం తిరగబెట్టింది. దీంతో అతని స్థానంలో ఆల్రౌండర్ కోల్ మెక్కొంచిని తీసుకున్నారు. చదవండి: T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్ -
పాకిస్తాన్దే పైచేయి
కొలంబో: గత టి20 ప్రపంచకప్లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో శనివారం నెదర్లాండ్స్తో జరిగిన తొలి పోరులో కష్టమ్మీద గట్టెక్కిన పాక్... అమెరికాపై మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ను ముగించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాక్ 32 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా... బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (19)తో తొలి వికెట్కు 54 పరుగులు (31 బంతుల్లో) జోడించిన ఫర్హాన్... మూడో వికెట్కు బాబర్ ఆజమ్తో 53 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. అమెరికా బౌలర్ షాల్విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభమ్ రంజనే (51; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో పాటు జహంగీర్ (49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మిలింద్ కుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. ఆఫ్ స్పిన్నర్ తారిఖ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. 1982లో తొలి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇ చ్చిన సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఫ్లడ్లైట్లతో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కావడం విశేషం. టి20 ప్రపంచకప్లో నేడుదక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్వేదిక: అహ్మదాబాద్; ఉదయం 11 గం‘‘ నుంచిఆ్రస్టేలియా X ఐర్లాండ్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గం‘‘ నుంచిఇంగ్లండ్ X వెస్టిండీస్ వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2026: పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా పేసర్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 10) పాకిస్తాన్, యూఎస్ఏ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గత ఎడిషన్లో యూఎస్ఏ పాక్పై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ఏ ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్లో భారత జట్టుకు కూడా పోటీనివ్వడం ఈ ప్రాధాన్యతను రెట్టింపు చేసింది. యూఎస్ఏ ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నుంచే పాక్ను మరోసారి చిత్తు చేస్తామని సవాళ్లు చేశారు. ఇది కూడా ఓరకంగా ఈ మ్యాచ్కు హైప్ తెచ్చిపెట్టింది. యూఎస్ఏ జట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లతో పాటు పాక్ మూలాలున్న ఆటగాళ్లు (ఎహసాన్ ఆదిల్, మొహమ్మద్ మొహిసిన్) కూడా ఉన్నారు. వీరు కూడా పాక్ ఓడిస్తామని ఛాలెంజ్ చేయడం ఈ మ్యాచ్పై ఆసక్తిని మరింత పెంచింది.కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ ప్రారంభంలో పాక్ తడబడింది. అయితే పాక్ను తొలుత ఇబ్బంది పెట్టింది మాత్రం పాక్ మూలాలున్న ఆటగాళ్లు కాని, భారత మూలాలున్న ఆటగాళ్లు కానీ కాదు. షాడ్లే వాన్ ష్కాల్విక్ అనే సౌతాఫ్రికా మూలాలున్న ఆటగాడు. ఈ షాల్విక్ తొలి మ్యాచ్లో భారత్ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ టీమిండియాపై 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.ఇప్పుడు ఇదే బౌలర్ పాక్ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన సైమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా (1) వికెట్లు తీసిన షాల్విక్.. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్ ఝులిపిస్తున్న షాదాబ్ ఖాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (1) వికెట్లు తీశాడు. మొత్తంగా షాల్విక్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో పాక్ మూలాలున్న బౌలర్ మొహమ్మద్ మొహిసిన్ కూడా పాక్ను ఇబ్బంది పెట్టాడు. మొహిసిన్ పెద్దగా వికెట్లు తీయకపోయినా (4-0-27-1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో పాక్ మూలాలున్న పాక్ బౌలర్ ఎహసాన్ ఆదిల్ మాత్రం ధారాళంగా (3-0-29-0) పరుగులు సమర్పించుకున్నారు. భారత మూలాలున్న బౌలర్లు సౌరభ్ నేత్రావల్కర్ (4-0-40-1), హర్మీత్ సింగ్ (4-0-41-1) కూడా బాగానే పరుగులు ఇచ్చారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజమ్ (30) పర్వాలేదనిపించాడు. -
నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం
బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్ 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో ఆంధ్ర ఓడినా, ఇన్నింగ్స్ పరాజయాన్ని గట్టెక్కించేందుకు నితీశ్ కుమార్ రెడ్డి చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్లో నితీశ్ 144 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. టెయిలెండర్లు కేఎస్ నరసింహ రాజు (25), త్రిపురణ విజయ్ (46)తో కలిసి నితీశ్ చూపిన పోరాటపటిమ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. నితీశ్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ (33) ఓ మోస్తరు పరుగులు చేశాడు. అలాగే ఓ వికెట్ కూడా తీశాడు.రెండు ఇన్నింగ్స్ల్లో నితీశ్ మినహా ఎవ్వరూ రాణించకపోవడంతో ఆంధ్రకు ఇన్నింగ్స్ పరాభవం తప్పలేదు. మరోవైపు ఈ మ్యాచ్లో గెలుపుతో బెంగాల్ సెమీస్కు చేరింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే రెండో సెమీఫైనల్స్లో ఈ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. అదే రోజు మొదలయ్యే తొలి సెమీస్లో ఉత్తరాఖండ్-కర్ణాటక పోటీపడతాయి.పాపం.. ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్ మిసయ్యాడుఈ మ్యాచ్లో బెంగాల్ యువ బ్యాటర్ సుదిప్ కుమార్ ఘరామీ తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు.ఈ ఇన్నింగ్స్లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్లో బ్యాటింగ్కు దిగిన అతను.. ఆరో వికెట్కు సుమంత్ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్కు హబీబ్ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఘరామీ బ్యాట్ నుంచి జాలువారిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్ ఇన్నింగ్స్తో బెంగాల్ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ కారణంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 629 పరుగుల అతి భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్ బౌలర్ మొహమ్మద్ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.రాణించిన భుయ్దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్లో రికీ భుయ్ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్ భరత్ (47), షేక్ రషీద్ (46), నితీశ్ కుమార్ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ఆకాశ్దీప్ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్ పడగొట్టాడు. -
T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజూ శాంసన్ జాక్పాట్ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్ మ్యాచ్లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్ సమయానికి అభిషేక్ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్ గైర్హాజరీలో సంజూ శాంసన్కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు.డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్పై కూడా స్పందించాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్ తమ మనసు మార్చుకొని భారత్తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.కాగా, బుమ్రా, సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్ అందుబాటులోకి రాక సంజూ శాంసన్కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. సీఫర్ట్-అలెన్ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్ రన్స్ను కూడా సీఫర్ట్ సిక్సర్తోనే సాధించాడు. అలెన్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత మ్యాచ్లోనూ సీఫర్ట్ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సీఫర్ట్ ధాటికి ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్ విధ్వంసకర ఫామ్ చూస్తుంటే, ఈ ప్రపంచకప్లో న్యూజిలాండ్ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్లపై న్యూజిలాండ్ను ఆపడం కష్టమే. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు బౌలింగ్లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ లాంటి ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్లో యూఏఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్ ఖాన్ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. -
T20 WC 2026: గ్లెన్ ఫిలిప్స్కు ఘోర పరాభవం
న్యూజిలాండ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్ మెంబర్ జట్టు బౌలర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2026 ఎడిషన్లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో ఫిలిప్స్ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ఫిలిప్స్ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం, మయాంక్ కుమార్ ఫిలిప్స్ను చెడుగుడు ఆడుకున్నారు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఫుల్ మెంబర్ జట్టు బౌలర్ ఓ ఓవర్లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 202622 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్, 201622 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 202422 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్లో ఫిలిప్ ఒక్క ఓవర్లో తడబడినా, ఫీల్డ్లో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక క్యాచ్లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్. కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు. -
శ్రీలంక జట్టుకు అతి భారీ షాక్
టీ20 ప్రపంచకప్కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ అయిపోయాక తీసిన ఎంఆర్ఐ స్కానింగ్లో హసరంగ ఎడమ కాలి హ్యామ్స్ట్రింగ్లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది. హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక.. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించి, సూపర్-8 దిశగా సాగుతోంది. గ్రూప్ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్-8లో మాత్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది. -
IND VS NAM: భారత తుదిజట్టు ఇదే.. సిరాజ్ అవుట్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ఆరంభ మ్యాచ్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.సూర్యకుమార్ ధనాధన్ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ (49 బంతుల్లో 84 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్ పడగొట్టగా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్దీప్ సింగ్ డకౌట్గా వెనక్కి పంపాడు.రాణించిన సిరాజ్మొత్తంగా సిరాజ్ మూడు, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకిఈ మ్యాచ్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.సిరాజ్పై వేటు తప్పదుకాగా హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్ వరల్డ్కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్పై వేటు తప్పదని బంగర్ అన్నాడు.నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్లో ఉన్న సిరాజ్ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయప్డాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్గా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్లలోనూ అతడినే ఓపెనర్గా కొనసాగించే అవకాశం ఉంది.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు అంచనాఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా/మొహమ్మద్ సిరాజ్.చదవండి: భారత్తో మ్యాచ్కు అంగీకరించిన పాక్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే -
సుడిగాలి శతకం.. అయినా వరించని అదృష్టం
బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల్లో (2025-26) ముగ్గురి పేర్లు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్. ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నా, బీసీసీఐ కాంట్రాక్ట్లు దక్కలేదు. షమీ, సర్ఫరాజ్ను పక్కన పెడితే ఇషాన్ కిషన్కు కాంట్రాక్ట్ లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.ఎందుకంటే, ఇతగాడు ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20 సుడిగాలి శతకం (43 బంతుల్లో) బాదాడు. అయినా అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. ఇషాన్కు కాంట్రాక్ట్ దక్కకపోవడానికి బీసీసీఐ ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పనప్పటికీ.. నిబంధనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.అదేటంటే.. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్ట్ లభించాలంటే సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలి. ఇషాన్ ఈ మధ్యకాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ లభించలేదు. కాంట్రాక్ట్ లభించడానికి ఫామ్ కొలమానం కాదు. ఈ కారణంగానే ఇషాన్ సూపర్ ఫామ్లో ఉన్నా కాంట్రాక్ట్ లభించలేదు.షమీ, సర్ఫరాజ్ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరు కూడా సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దేశవాలీ క్రికెట్లో ఈ ముగ్గురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటినా, బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. వీరిలో ఇషాన్, సర్ఫరాజ్కు వచ్చే ఏడాదైనా కాంట్రాక్ట్ లభించవచ్చేమో కాని, షమీని మాత్రం ఇక మరిచిపోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు లభించిన ఆటగాళ్లు..గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. -
'బాస్' ఆల్రౌండ్ షో.. పసికూనల పోరులో నెదర్లాండ్స్ గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఉదయం (11 గంటలకు) జరిగిన పోరులో పసికూనలు నెదర్లాండ్స్, నమీబియా తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. బాస్ డి లీడ్ ఆల్రౌండ్ మెరుపుల కారణంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లీడ్ తొలుత బంతితో (3-0-20-2), ఆతర్వాత బ్యాట్తో (48 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటి నెదర్లాండ్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ ప్రస్తుత ఎడిషన్లో బోణీ కొట్టింది. ఈ జట్టు తొలి మ్యాచ్లో పాక్ చేతిలో ఖంగుతింది. మరోవైపు నబీమియాకు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్లోనే ఆ జట్టు పరాజయంపాలైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (30), జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42) ఓ మోస్తరు స్కోర్లు సాధించి నమీబియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లలో జేజే స్మిట్ (22), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లొగన్ వాన్ బీక్, బాస్ డి లీడ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాస్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సునాయాసంగా ఛేదించింది. బాస్ డి లీడ్ అజేయమైన మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. లీడ్తో పాటు కొలిన్ ఆకెర్మన్ (32), మైఖేల్ లెవిట్ (28), స్కాట్ ఎడ్వర్డ్స్ (18 నాటౌట్) కూడా రాణించడంతో నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్, రూబెన్ ట్రంపెల్మన్, నికోల్ లాఫ్టీకి తలో వికెట్ దక్కింది. -
IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.థాంక్యూ చెబుతున్నాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్ (జై షా), ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.అతిపెద్ద విజయం ఇదిపాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.బంగ్లాదేశ్ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ సజావుగా సాగాలి’’ అని రాజీవ్ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాకాగా వరల్డ్కప్ టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకొంది. భారత్లో తాము మ్యాచ్లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.మధ్యలో ఎంటరైన పాక్ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.ఈ ప్రభావం బంగ్లా, పాక్లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్లో పాక్, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్ భారత్తో మ్యాచ్ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్.. యూటర్న్ తీసుకుని టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.చదవండి: IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ -
T20 WC 2026: క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డు
సౌతాఫ్రికా క్రికెట్ స్టార్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘డి’లో నుంచి సౌతాఫ్రికా- కెనడా సోమవారం పోటీపడ్డాయి.మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 59) సాధించగా.. క్వింటన్ డికాక్ 22 బంతుల్లో 25 పరుగులు చేయగలిగాడు.మిగతా వారిలో ర్యాన్ రికెల్టన్ (21 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.156 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితం అయింది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డుఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండు డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్లో కెనడా ఓపెనర్లు కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా (0), యువరాజ్ సమ్రా (12) ఇచ్చిన క్యాచ్లను డికాక్ ఒడిసిపట్టాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్గా ధోని వరల్డ్ రికార్డును డికాక్ సమం చేశాడు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు వీరే🏏🧤క్వింటన్ డికాక్- 32🏏🧤ఎంఎస్ ధోని- 32🏏🧤కమ్రాన్ అక్మల్- 30🏏🧤దినేశ్ రామ్దిన్- 27🏏🧤కుమార్ సంగక్కర- 26🏏🧤జోస్ బట్లర్- 26.చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం -
ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.షెడ్యూల్ ప్రకారం పాక్- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్ టోర్నీలో పాక్ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా ఓడిస్తాంపాక్తో మ్యాచ్కు ముందు మొహమ్మద్ మొహ్సిన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఈ ప్రపంచకప్ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్కప్లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్ పాక్లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.సంచలన విజయం కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ లీగ్ దశలో అమెరికా పాకిస్తాన్పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించగా.. పాక్పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్-8కు చేరగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్కప్-2026లో సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ నెదర్లాండ్స్ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్ పటేల్ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం -
IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)- పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడటం ఖాయమైంది.ఐసీసీ అధికారిక ప్రకటనఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలోనూ మా వైఖరి మారలేదు.ఎలాంటి ప్రభావం ఉండదు200 మిలియన్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.తగిన ప్రమాణాలు పాటిస్తేనే బంగ్లాకు ఆ ఛాన్స్అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్ వరల్డ్కప్ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.పాక్ ఓవరాక్షన్కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్కప్ టోర్నీ-2026కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడేలా ఒప్పందం కుదిరింది. అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ బెదిరింపులకు దిగింది. దీంతో ఐసీసీ- పీసీబీతో చర్చలు జరుపగా యూటర్న్ తీసుకుని.. టీమిండియాతో ఆడేందుకు అంగీకరించింది.ఇదిలా ఉంటే.. భారత్- బంగ్లాదేశ్ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ విడుదల చేసింది. దీంతో భారత్లో తాము వరల్డ్కప్ ఆడము అని.. శ్రీలంకలో తమకు ఆడే అవకాశం ఇవ్వాలని బంగ్లా ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్ వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ.. మరోసారి ఆలోచించాలని సూచించింది.ఫైనల్గా యూటర్న్కానీ తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొనేందుకైనా సిద్ధమని బంగ్లాదేశ్ చెప్పగా.. ఐసీసీ సరేనంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. ఈ విషయంలో ఓవరాక్షన్ చేసిన పీసీబీ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అని కొత్తరాగం ఎత్తుకుంది. అయితే, శ్రీలంక, యూఏఈ, బంగ్లా బోర్డులు భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ లేఖలు రాశాయి. ఐసీసీ సైతం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. దీంతో పాక్ మాట మార్చి భారత్తో ఆడేందుకు అంగీకరించింది. చదవండి: పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్ -
వైభవ్ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్
‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్కు వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెప్టెన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోర్నిలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. -
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో అనుమతికాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది.తాజా వైఖరి ఇదే..‘‘టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. వరల్డ్కప్ టోర్నీతో బిజీకాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్ దశలో సూర్య సేన లీగ్ దశలో మూడు మ్యాచ్లో సొంతగడ్డపై.. పాకిస్తాన్తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్ కొలంబోలో ఆడుతుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్కప్ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్లో గురువారం నమీబియాతో భారత్ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనం -
పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.యూటర్న్ వెనుక గల కారణాలు?ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్కాట్’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. యూటర్న్ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.శుభవార్తలే అందిస్తాంఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదాపాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్తో మ్యాచ్ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.మన కోసం ఏమీ అడగలేదా?అయితే, మన (పాకిస్తాన్) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.అయితే, బంగ్లాదేశ్ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.పాకిస్తాన్ జోక్యం..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.రంగంలోకి లంక బోర్డుఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్తో ఆడే మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్కు లేఖ రాసింది.బంగ్లాకు రిలీఫ్యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్ వెళ్లి పీసీబీ చైర్మన్తో చర్చించగా.. బంగ్లాదేశ్కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.ఇదిలా ఉంటే.. పాక్ బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడటం ఖాయమైంది.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనంMohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026 -
IPL 2026: బెంగళూరు స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు!
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. తీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. -
మధ్యప్రదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్
రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్ నబీఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్... భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్తో కర్నాటక తలపడుతుంది. -
‘ఎంతో ఎత్తుకు ఎదగాలి’
అండర్–19 ప్రపంచ కప్లో భారత జట్టును విజేతగా నిలిపిన కెపె్టన్ ఆయుశ్ మాత్రేకు అరుదైన ప్రత్యేక ప్రశంస లభించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వయంగా మాత్రేను అభినందించి అతని విజయంపై శుభాకాంక్షలు చెప్పాడు. 2013లో తాను ఆడిన ఆఖరి టెస్టు సిరీస్లో ధరించిన జెర్సీని కూడా సచిన్ బహుమతిగా అందజేశాడు. ముంబైకి చెందిన మాత్రే కెరీర్లో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. మాత్రే ఇప్పటికే రెండు సీజన్లలో కలిపి ముంబై తరఫున 13 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. -
భారత్తో మ్యాచ్ ఆడండి: పాకిస్తాన్ జట్టుకు ప్రభుత్వ ఆదేశం
టి20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్తో మ్యాచ్కు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా వెల్లడించారు. వరల్డ్ కప్నుంచి దూరమైన బంగ్లాదేశ్కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది. -
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
భారత్-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది.దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారత్లో కాకుండాశ్రీలంకలో తమ మ్యాచ్లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు. -
దక్షిణాఫ్రికా శుభారంభం
అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్ గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్ ‘డి’లో జరిగిన లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. అన్‡్ష పటేల్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్ దలివాల్ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, హర్‡్ష ఠాకెర్ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఇన్గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్కు 2 వికెట్లు దక్కాయి. మార్క్రమ్ ఫిఫ్టీ... ఓపెనర్లు మార్క్రమ్, డికాక్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్ మార్క్రమ్ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్ వెనుదిరిగిన తర్వాత ర్యాన్ రికెల్టన్ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కెపె్టన్తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్రమ్, రికెల్టన్, బ్రెవిస్ (6) అవుటయ్యారు. డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది. మెరిపించిన నవ్నీత్ దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్ప్రీత్ (0), యువరాజ్ (12) సహా నికోలస్ కిర్టన్ (4) వికెట్లను కోల్పోయింది. పవర్ప్లేలోనే మొవ్వ శ్రేయస్ (9) కూడా అవుట్ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్నీత్ దలివాల్, హర్‡్ష ఠాకెర్ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్కు 69 పరుగులు జోడించాక హర్‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్నీత్ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు. -
మార్క్రమ్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ (59) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్ (34 నాటౌట్), మిల్లర్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. డికాక్ (25), రికెల్టన్ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్ పటేల్ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కలీమ్ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్ సింగ్ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్ దీల్ప్రీత్ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్), సాద్ బిన్ జాఫర్ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్ హెలిగర్ ఓ ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్ప్రీత్ (0), యువరాజ్ సమ్రా (12), నికోలస్ కిర్టన్ (4), శ్రేయస్ మొవ్వ (9) ఔట్ కాగా.. నవ్నీత్ ధలీవాల్ (25), హర్ష్ థాకర్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు. -
‘ఎ’ గ్రేడ్లో గిల్, బుమ్రా, జడేజా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత సీజన్ వరకు ఉన్న ‘ఎ ప్లస్’ గ్రేడ్ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఆల్ ఫార్మాట్ స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్ దక్కడం విశేషం. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిను ‘బి’ గ్రేడ్లో చేర్చగా, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన అక్షర్ పటేల్ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్ పాటీదార్, ముకేశ్ కుమార్లను కాంట్రాక్ట్నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్లు వర్తిస్తాయి. గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్‡్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిõÙక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. ‘ఆ నలుగురు’ టాప్ గ్రేడ్లో...భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచి్చంది. గ్రేడ్ ‘ఎ’ – హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా గ్రేడ్ ‘సి’ – రాధ యాదవ్, అమన్జోత్ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబ్నిస్. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఆయా కాంట్రాక్ట్ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ ప్లస్ గ్రేడ్లో ఉండిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి. -
భారత్తో మ్యాచ్ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్ క్రికెట్ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సోషల్మీడియా పోస్ట్ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించాలి - భారత్-పాక్-బంగ్లాదేశ్తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్ కోసం కూడా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్ డిమాండ్లు సోషల్మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్తో మ్యాచ్ అవసరం లేదని అంటున్నారు. పాక్పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్కప్ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ను ప్రపంచకప్ నుంచి తప్పించిన తర్వాత పాక్ ప్రభుత్వం భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించింది. -
క్రికెట్ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్
అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా క్రికెట్ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్ఏ) ట్రంప్ మద్దతు ప్రకటించాడు. సోషల్ ట్రూత్లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్ యూఎస్ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్ ఇచ్చిన మద్దతు యూఎస్ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్తో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు ట్రంప్ సందేశం యూఎస్ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్కు క్రికెట్పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్, అమెరికన్ ఫుట్బాల్ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్కు 2020లో అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్ మద్దతు ఉంటే క్రికెట్ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్ మరింత చేరువైంది. యూఎస్ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్ఏ జట్టు గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్లో భారత్తో జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్లో వారి పోరాటానికి క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్ఏ జట్టు మాత్రం క్రికెట్ ప్రపంచాన్నంతా గెలిచింది. -
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) ధాటికి ఒమన్ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్ కలీమ్, కెప్టెన్ జతిందర్ సింగ్, షా ఫైసల్ తలో 5 పరుగులు, షకీల్ అహ్మద్ 4, జితెన్ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్ మీర్జా, కరన్ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) రాణించారు. మరుమని 21, సికందర్ రజా 5 (నాటౌట్) పరుగులు చేయగా.. డియాన్ మైర్స్ డకౌటయ్యాడు. ఒమన్ బౌలర్లలో సఫ్యాన్కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్ ముజరబానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్కాంగ్కు చెందిన ర్యాన్ క్యాంప్బెల్ పేరిట ఉండేది. క్యాంప్బెల్ 2016 ప్రపంచకప్లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్కప్లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. -
అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్ సెంచరీ మిస్
ఆంధ్రప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ యువ బ్యాటర్ సుదిప్ కుమార్ ఘరామీ తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్లో బ్యాటింగ్కు దిగిన అతను.. ఆరో వికెట్కు సుమంత్ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్కు హబీబ్ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఘరామీ బ్యాట్ నుంచి జాలువారిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్ ఇన్నింగ్స్తో బెంగాల్ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ కారణంగా ఆంధ్రతో మ్యాచ్లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 629 పరుగుల అతి భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్ బౌలర్ మొహమ్మద్ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్లో రికీ భుయ్ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్ భరత్ (47), షేక్ రషీద్ (46), నితీశ్ కుమార్ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ఆకాశ్దీప్ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్ పడగొట్టాడు.ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్ రికీ భుయ్ (1), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్లో ఉన్నారు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. -
బిగ్ ట్విస్ట్!.. పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్!
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్- పాక్ మ్యాచ్కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) క్రికెట్ కూడా పాకిస్తాన్కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాక్ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్ పంపింది. బంగ్లాదేశ్ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా.. భారత్లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు మద్దతుగా ఉంటామంటూ పాక్.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్కు వెళ్లారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్తో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్ షరీఫ్తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్- పాక్ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ! -
టీ20 వరల్డ్కప్ నుంచి పాక్ మూలాలున్న ఆటగాడి తొలగింపు
టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్ భారత్ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్ను నిందించడం సరికాదని వార్నింగ్ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్లో వారు న్యూజిలాండ్ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్ -
కేఎల్ రాహుల్ అద్భుత శతకం
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్లలో ఒకటిగా మిగిలిపోనుంది. 325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్ రవిచంద్రన్తో పాటు రాహుల్ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్ను కర్ణాటకవైపు మళ్లించింది.స్మరణ్ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్ పాటిల్ (31 నాటౌట్) స్మరణ్కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్తో తలపడుతుంది.కర్ణాటకతో మ్యాచ్లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్లో అఖిల్ హెర్వాద్కర్ (60) ఒక్కడే రాణించాడు.అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్ అవస్తి, తుషార్ దేశ్పాండే తలో 4 వికెట్లు తీశారు.ముంబై రెండో ఇన్నింగ్స్లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ ఆనంద్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్ కోటియన్ (48 నాటౌట్), తుషార్ దేశ్పాండే (47), ముషీర్ ఖాన్ (49), యశస్వి జైస్వాల్ (36), అఖిల్ హెర్వాద్కర్ (33), సిద్దేశ్ లాడ్ (25), సూర్యాంశ్ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, కావేరప్ప తలో 2, శిఖర్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో భాగంగా కోల్కతాలో సోమవారం ఇటలీతో తలపడింది స్కాట్లాండ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన ఇటలీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్కు ఓపెనర్లలో జార్జ్ మున్సే (54 బంతుల్లో 84) అదిరిపోయే ఆరంభం అందించగా.. మైకేల్ జోన్స్ (37) కూడా రాణించాడు. వన్డౌన్లో వచ్చిన బ్రెండన్ మెక్ముల్లన్ (18 బంతుల్లో 41 నాటౌట్) ధనాధన్ దంచికొట్టగా.. ఆఖర్లో మైకేల్ లీస్క్ (5 బంతుల్లో 22 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 207 పరుగులు సాధించింది. తద్వారా టీ20 వరల్డ్కప్ టోర్నీలో 200కు పైగా స్కోరు చేసిన తొలి అసోసియేట్ జట్టుగా స్కాట్లాండ్ చరిత్ర సృష్టించింది.McMullen charges out and pumps it clean over long-on for a glorious hit. 🙌Marching towards 200! 💪ICC Men’s #T20WorldCup | #SCOvITA | LIVE NOW 👉 https://t.co/iRy5VavUwZ pic.twitter.com/Ax7EvdDitH— Star Sports (@StarSportsIndia) February 9, 2026ఇక లక్ష్య ఛేదనలో ఇటలీ ఆది నుంచే తడబడింది. టాపార్డర్లో జస్టిన్ మోస్కా (0), ఆంటోనీ మోస్కా (13) విఫలం కాగా.. జేజే స్మట్స్ 22 పరుగులు చేశాడు. హ్యారీ మానెంటి (25 బంతుల్లో 37), బెన్ మానెంటి (31 బంతుల్లో 52) రాణించినా.. మిగతా వారి నుంచి సహకారం లభించలేదు.73 పరుగుల తేడాతో ఓటమిఆరో స్థానం నుంచి బ్యాటింగ్కు వచ్చిన ఆటగాళ్లు స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కట్టారు. 2, 0, 3*, 2, 0, 0, 0 స్కోర్లతో వెనుదిరిగారు. దీంతో 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి ఇటలీ ఆలౌట్ అయింది.ఫలితంగా స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాటిష్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మైకేల్ లీస్క్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వాట్ రెండు, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, ఒలివర్ డేవిడ్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అనూహ్య రీతిలో స్కాట్లాండ్ రేసులోకి వచ్చింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఈ జట్టు.. తాజాగా ఇటలీని ఓడించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే.. ఇటలీ ఐసీసీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.చదవండి: IND vs PAK: పాక్ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ -
IND Vs PAK: పాక్తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ
భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. ఈ మ్యాచ్లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్తో మ్యాచ్ బహిష్కరించామన్న పాక్ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్ ప్లాన్!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ సైతం తమకు భారత్లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్లు ఆడామని గుర్తు చేసింది.భారత్- పాక్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026 -
జస్ట్ మిస్.. పల్లీలు అమ్ముకుంటారా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ బసిత్ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా భారత్- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్లో కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్ పాకిస్తాన్ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బంతులు ఉండగా నెదర్లాండ్స్ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.తొలుత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బాస్ డీ లీడ్ (30; 4 ఫోర్లు), మిచెల్ లెవిట్ (24; 3 ఫోర్లు, 1 సిక్స్), అకెర్మన్ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, నవాజ్ తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (12), బాబర్ ఆజమ్ (15), ఉస్మాన్ ఖాన్ (0), షాదాబ్ ఖాన్ (8), నవాజ్ (6) విఫలమయ్యారు.ఫహీమ్ ఆష్రఫ్ రాణించడంతోవిజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫహీమ్ ఆష్రఫ్ (11 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ షాట్లతో విజృంభించాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వ్యాన్ మీకెరెన్ చెరో 2 వికెట్లు తీశారు. నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్ ఇచ్చిన క్యాచ్ను ఒడౌడ్ వదిలేయడంతో అతడికి లైఫ్ రాగా.. పాక్ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ (Basit Ali) పాక్ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం (Babar Azam), నవాజ్, షాదాబ్ ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్ బతికిపోయింది"పాకిస్తాన్ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్ ఆఫ్రిది బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్ ఆజం, నవాజ్, షాదాబ్ ఖాన్ అసలేం చేశారో వారికైనా తెలుసా?వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్ ఆజం బ్యాటింగ్కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్ ఆష్రఫ్ లేకుంటే ఈరోజు పాక్ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి స్టార్గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్కప్ అంబాసిడర్గా నియమించింది.వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్తో కూడిన సాసర్ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హిట్మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త
టీ20 వరల్డ్కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అనూహ్య రీతిలో..దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన సిరాజ్ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్కప్ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్ విజయంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.టీమిండియాకు శుభవార్తఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన సుందర్ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్లు ఇవే
భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గ్రూప్-సి నుంచి వెస్టిండీస్- స్కాట్లాండ్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో విండీస్ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్లో గ్రూప్-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్లో చెన్నైలో అఫ్గనిస్తాన్పై న్యూజిలాండ్.. ముంబైలో నేపాల్పై ఇంగ్లండ్.. ఐర్లాండ్పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్ ఇదేగ్రూప్-సి: స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ- ఈడెన్ గార్డెన్స్, కోల్కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్-బి: జింబాబ్వే వర్సెస్ ఒమన్- సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్-డి: సౌతాఫ్రికా వర్సెస్ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్కప్ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా.. గ్రూప్- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్, ఐర్లాండ్ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్ రేసులో ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఐసీసీ టీ20 వరల్డ్కప్-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్లో నమీబియాతో భారత్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానం ఇందుకు వేదిక.సతీసమేతంగాఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లతో పాటు కోచ్లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు ఓల్డ్ రాజేంద్రనగర్లో ఉన్న గంభీర్ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.#WATCH | Members of the Indian T20 cricket team arrive at the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi. Gautam Gambhir is hosting a special dinner for the team https://t.co/VQ2symRZ2M pic.twitter.com/tXgiuAwN6D— ANI (@ANI) February 8, 2026అందుకే డిన్నర్ పార్టీలుకాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్ డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్కోచ్ ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.టీ20 ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఎలో పాకిస్తాన్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్ (ఫిబ్రవరి 15).. లీగ్ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్తో తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!#WATCH | Indian Cricket Team Head Coach Gautam Gambhir arrives at his residence in Delhi pic.twitter.com/Y3yg3yvgVy— ANI (@ANI) February 8, 2026 -
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్తో ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ముందు పాక్ క్రికెట్ బోర్డు (PCB) మూడు షరతులు ఉంచినట్లు సమాచారం. కాగా బంగ్లాదేశ్కు మద్దతగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ కోసమంటూ.. భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్ తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఇందులో నిజం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ బంగ్లా పంతం వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో తమకు తటస్థ వేదికగా శ్రీలంక ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ.. తామూ టోర్నీ ఆడమని పాక్ కొత్త నాటకానికి తెరతీసింది.మరో డ్రామాఅయితే, ఈ విషయంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయంతో మాట మార్చి తాము భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడమని మరో డ్రామాకు తెరలేపింది. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే.. ఐసీసీతో పాటు సభ్య దేశాలు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ బోర్డు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.ఘాటుగా స్పందించిన శ్రీలంకఇక ఈ విషయంపై శ్రీలంక సైతం ఘాటుగానే స్పందించింది. పాక్లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత్తో మ్యాచ్పై పునరాలోచన చేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది. ఇతర సభ్య దేశాల బోర్డులు సైతం పాక్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మూడు ప్రధాన షరతులుఈ నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్.. పంతం వీడేందుకు సిద్ధపడినా.. మూడు ప్రధాన షరతులతో ఐసీసీని లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎక్కువ డబ్బు కావాలి!ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి నుంచి పీసీబీ 5.75 శాతం ఆదాయం పొందుతోంది. మరోవైపు.. ఇందులో బీసీసీఐ వాటా 39 శాతం. ఇక భారత్తో తమ క్రికెట్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా 2012 నుంచి భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్కప్ వంటి టోర్నీలలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి.కరచాలనం చేయాలిఅదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా షేక్హ్యాండ్కు నిరాకరించిన విషయం తెలిసిందే.పాక్ బుద్ధి చూపించిందంటూ ట్రోల్స్!ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము టీమిండియాతో మ్యాచ్ ఆడతామని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్గా మారగా.. ‘‘పాక్ బుద్ధి చూపించింది. డబ్బు కోసం బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేమ ఉంటే టోర్నీ నుంచి వైదొలగాల్సింది.అలా కాకుండా తటస్థ వేదిక ఏర్పాటు చేసినా బ్లాక్మెయిలింగ్కు దిగి.. క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదు’’ అని టీమిండియా అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలైన సంగతి తెలిసిందే.వద్దు.. అలా చేయొద్దుఅయితే, పాక్ మీడియా డాన్ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్కు పరిహారం చెల్లించాలని పాక్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు.. పాక్ బోర్డు భారత్తో మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలని.. ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్కు ఎంతమాత్రం సరికాదని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్ -
అమెరికా క్రికెట్ జట్టులో నంద్యాల యువకుడు
సంజామల: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ టీ–20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భాగంగా ఇండియాతో తలపడిన అమెరికా(యుఎస్ఏ) జట్టు తరఫున బరిలో దిగాడు. సాయితేజకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే హైదరాబాద్లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2022లో 18 ఏళ్ల వయసులో యుఎస్ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్లలో యుఎస్ఎ తరఫున ఆడుతున్నాడు. శనివారం టీ–20 ప్రపంచ కప్లో భాగంగా టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా తరఫున బరిలో దిగాడు. నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున టీ–20 ప్రపంచ కప్లో ఆడుతుండడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంగ్లండ్ను వణికించిన నేపాల్
ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్పై నెదర్లాండ్స్ గెలిచినంత పనిచేయగా... స్టార్లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టును నేపాల్ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్ బామ్... స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్లు), కెపె్టన్ హ్యారీ బ్రూక్ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) ఆఖర్లో మెరుపు షాట్లు ఆడగా... జోస్ బట్లర్ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్ సాల్ట్ (1), టామ్ బాంటన్ (2), స్యామ్ కరన్ (2) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రోహిత్ పౌడెల్ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు), లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ (29; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. నేపాల్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లోకేశ్ రెండు సిక్స్లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో లోకేశ్ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్ కరన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నేపాల్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్లో నేడుస్కాట్లాండ్ X ఇటలీవేదిక: కోల్కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ఉత్తరాఖండ్ సంచలనం
జంషెడ్పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్ జట్టుతో ఇక్కడి కీనన్ స్టేడియంలో ఆదివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ జట్టు ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. 136 పరుగుల తేడాతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు ఒకదశలో 100/2తో పటిష్టంగానే కనిపించింది. అయితే ఉత్తరాఖండ్ వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా మాయాజాలానికి... అభయ్ నేగి పేస్ ధాటికి జార్ఖండ్ జట్టు చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాలో కోల్పోయింది. చివరకు 130 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (34; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మయాంక్ మిశ్రా 22 పరుగులిచ్చి 5 వికెట్లు, అభయ్ నేగి 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఉత్తరాఖండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 282/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ జట్టు 122.3 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటై 136 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెపె్టన్ కునాల్ చండేలా (68; 8 ఫోర్లు), జగదీశ సుచిత్ (70; 6 ఫోర్లు), అభయ్ నేగి (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. కర్ణాటక లక్ష్యం 325 ముంబై జట్టుతో ముంబైలో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు విజయానికి 212 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (3), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 189/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు 98.3 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటైంది. తనుశ్ కొటియాన్ (48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), తుషార్ దేశ్పాండే (47; 7 ఫోర్లు, 2 సిక్స్లు) తొమ్మిదో వికెట్కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా ముంబై జట్టు కర్ణాటకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కష్టాల్లో మధ్యప్రదేశ్ జమ్మూ కశ్మీర్ జట్టుతో ఇండోర్లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ కష్టాల్లో పడింది. 291 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 204 పరుగులు చేయాలి. ప్రస్తుతం శుభం శర్మ (11 బ్యాటింగ్), వెంకటేశ్ అయ్యర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 3 వికెట్లు, ఆబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 84/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 70.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. -
యువ జట్టుకు ఘనస్వాగతం
ముంబై: అండర్–19 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు ఘనస్వాగతం లభించింది. ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత అండర్–19 జట్టు జింబాబ్వే నుంచి ఆదివారం నేరుగా ముంబై చేరుకోగా... విమానాశ్రయం వద్ద ప్లేయర్ల కుటుంబ సభ్యులు, అభిమానులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబర్చిన ‘యంగ్ ఇండియా’ ఆడిన ఆన్నీ మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో యువ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. విధ్వంసక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుశ్ మాత్రే, హెడ్ కోచ్ కనిత్కర్పై పూల వర్షం కురిపించారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాం. ఇన్నాళ్ల నుంచి వాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఆయుశ్కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడి శ్రమ ఫలించింది’ అని ఆయుశ్ మాత్రే తండ్రి యోగేశ్ మాత్రే అన్నారు. ఆరోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన వెంటనే జట్టుకు బీసీసీఐ ఏడున్నర కోట్ల ప్రైజ్మనీ ప్రకటించగా... త్వరలోనే ఆటగాళ్లను సన్మానించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం భారత్లో ఐసీసీ టి20 ప్రపంచకప్ జరుగుతుండంతో... వీలును బట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో ఆటగాళ్లు ముంబై నుంచి స్వస్థలాలకు వెళ్లారు. ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’లో వైభవ్ దుబాయ్: అండర్–19 ప్రపంచకప్లో అదరగొట్టిన భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ 14 ఏళ్ల ఓపెనర్... 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు లీగ్ దశలోనూ మెరుపులు మెరిపించిన వైభవ్... తుదిపోరులో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డులు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా... ఐసీసీ ఆదివారం 12 మందితో కూడిన ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ను ఎంపిక చేసింది. అందులో భారత్ నుంచి వైభవ్ సూర్యవంశీ సహా ముగ్గురికి అవకాశం దక్కింది. కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్ ఈ టీమ్లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆరోసారి ప్రపంచ టైటిల్ నెగ్గిన ‘యంగ్ ఇండియా’కు కెప్టెన్గా వ్యవహరించిన ఆయుశ్ మాత్రేకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. వరల్డ్కప్ రన్నరప్గా నిలిచిన ఇంగ్లండ్కు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఈ జట్టులో ఉండగా... ఇంగ్లండ్ సారథి థామస్ ర్యూ ఈ జట్టుకు వికెట్ కీపర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వరల్డ్కప్లో భారీ సెంచరీ బాదిన శ్రీలంక ప్లేయర్ విరాన్ చముదితకు కూడా ఈ జట్టులో చోటు దక్కగా... అఫ్గానిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఫైసల్ ఖాన్, నూరిస్తాని ఓమర్జాయ్ కూడా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్ నుంచి ఒక్కో ప్లేయర్కు ఈ జట్టులో చోటు దక్కింది. ఇయాన్ బిషప్, ఆండీ ఫ్లవర్, గ్రీన్వే, టెల్ఫోర్డ్తో కూడిన సెలెక్షన్ ప్యానల్ ఈ జట్టును ఎంపిక చేసింది. ఐసీసీ అండర్–19 పురుషుల ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్: థామస్ ర్యూ (కెప్టెన్), బెన్ మైస్, లమ్స్డెన్ (ఇంగ్లండ్), వైభవ్ సూర్యవంశీ, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్ (భారత్), విరాన్ చముదిత (శ్రీలంక), ఫైసల్ ఖాన్, నూరిస్తాని ఒమర్జాయ్ (అఫ్గానిస్తాన్), ఒలీవర్ పీక్ (ఆ్రస్టేలియా), విటెల్ లావెస్ (వెస్టిండీస్), అలీ రజా (పాకిస్తాన్). -
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్పై శ్రీలంక విజయం
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఐర్లాండ్పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు. -
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్ స్టిర్లింగ్ (158 మ్యాచ్ల్లో 14) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ ఓవర్ తర్వాత ఐర్లాండ్ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో జార్జియా డాక్రెల్ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్క్ అదైర్ (4-0-33-1), గెరాత్ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్ (4-0-44-0), బ్యారీ మెక్ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ మెండిస్ (56 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో కుసాల్ మెండిస్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్ మిషారా 14, పవన్ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు. -
రాణించిన కేఎల్ రాహుల్
ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్ రాహుల్ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (3), ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ ఆనంద్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్ కోటియన్ (48 నాటౌట్), తుషార్ దేశ్పాండే (47), ముషీర్ ఖాన్ (49), యశస్వి జైస్వాల్ (36), అఖిల్ హెర్వాద్కర్ (33), సిద్దేశ్ లాడ్ (25), సూర్యాంశ్ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, కావేరప్ప తలో 2, శిఖర్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్ అవస్తి, తుషార్ దేశ్పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్లో అఖిల్ హెర్వాద్కర్ (60) ఒక్కడే రాణించాడు. -
టీ20 ప్రపంచకప్లో తృటిలో మిస్ అయిన పెను సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్ అయ్యింది. ఇంగ్లండ్తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్లో నేపాల్ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. నేపాల్ ఓడినా, ఇంగ్లండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్ ఫేవరెట్ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్ పెను సంచలన సృష్టించేదే. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్కు చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ను సామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పర్ఫెక్ట్ యార్కర్లు వేసి నేపాల్ బ్యాటర్లు కరణ్, లోకేశ్ బామ్ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్ కట్టడి చేయడంతో నేపాల్ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్ సిక్సర్ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్ ముందు లోకేశ్ పప్పులు ఉడకలేదు. కర్రన్ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 18వ ఓవర్ నేపాల్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్ బ్యాటర్లు.. ఆ ఓవర్లో చెలరేగిపోయారు. ఆసిఫ్ షేక్, లోకేశ్ బామ్ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్వైపు నుంచి మ్యాచ్ను తమవైపు మళ్లించుకున్నారు. ఆతర్వాత 19 ఓవర్లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. నేపాల్ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ ఎయిరీ (44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39) మూడో వికెట్కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్ బామ్ ఇంగ్లండ్ను కంగారు పెట్టాడు. ఈ మ్యాచ్లో నేపాల్ ఓడినా, యావత్ క్రికెట్ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్ బౌలింగ్లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53), విల్ జాక్స్ (39 నాటౌట్) సత్తా చాటకపోయుంటే బౌలింగ్కు దిగకముందే మ్యాచ్ ఓడిపోయి ఉండేది. వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ తలో 2, షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ తీసి సత్తా చాటారు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్లో నేపాల్ తప్పక గెలిచే అవకాశం ఉంది. -
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
నేపాల్ ఆఫ్ బ్రేక్ బౌలర్ షేర్ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి బంతికే వికెట్ తీసి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం. మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్ ఎడ్వర్డ్స్, ప్రగ్యాన్ ఓఝా, పరాస్ ఖడ్కా, నదీమ్ అహ్మద్, ఖుర్రమ్ ఖాన్) మాత్రమే ప్రపంచకప్ టోర్నీలో (కెరీర్లో) తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్ బౌలర్ (పరాస్ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్ ఖడ్కా, ఆరిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్) నేపాల్ ఆటగాళ్లు కూడా కెరీర్లో తొలి బంతికే వికెట్ తీశారు.కాగా, టీ20 ప్రపంచకప్లో నేపాల్ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్తో తలపడుతుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో విల్ జాక్స్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 1, జోస్ బట్లర్ 26, టామ్ బాంటన్ 2, సామ్ కర్రన్ 2, జోఫ్రా ఆర్చర్ ఒక్క పరుగు చేశారు. నేపాల్ బౌలర్లలో నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్ ఫిల్ సాల్ట్.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్ (29), ఆసిఫ్ షేక్ (7) ఔట్ కాగా.. రోహిత్ పౌడెల్ (10), దీపేంద్ర సింగ్ (10) క్రీజ్లో ఉన్నారు. డాసన్, జాక్స్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో నేపాల్ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి. -
టీమిండియా స్టార్ ఆటగాడికి అస్వస్థత
టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్ శర్మ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్ఏతో మ్యాచ్కు దూరం కాగా.. అభిషేక్ నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్ కోలుకుంటాడో లేదో చూడాలి.కాగా, నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. స్కై మినహా భారత ఇన్నింగ్స్లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీతో లాహోర్లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం.కాగా, గత కొద్ది రోజులుగా భారత్-పాక్ ప్రపంచకప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు నిరసనగా పాక్ ప్రభుత్వం భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్ బ్రాడ్కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ప్రపంచకప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్, పాక్, వెస్టిండీస్, న్యూజిలాండ్ తలో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఎస్ఏపై, పాక్ నెదర్లాండ్స్పై, వెస్టిండీస్ స్కాట్లాండ్పై, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్పై విజయాలు సాధించాయి. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్ 125 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం 105 మ్యాచ్ల్లోనే 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159 మ్యాచ్ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్దీప్ సింగ్కు (22) దక్కుతుంది. విరన్దీప్ తర్వాతి స్థానాల్లో సికందర్ రజా (19), సూర్యకుమార్ (17) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో గుల్బదిన్ నైబ్ (63) టాప్ స్కోరర్ కాగా.. రహానుల్లా గుర్బాజ్ 27, ఇబ్రహీం జద్రాన్ 10, సెదిఖుల్లా అటల్ 29, దర్విష్ రసూల్ 20, అజ్మతుల్లా ఒమర్జాయ్ 14, మొహమ్మద్ నబీ 10 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తలో వికెట్ తీశారు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో టిమ్ సీఫర్ట్ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్ ఫిలిప్స్ 42, మార్క్ చాప్మన్ 28, డారిల్ మిచెల్ 25 (నాటౌట్), మిచెల్ సాంట్నర్ 17 (నాటౌట్), ఫిన్ అలెన్ ఒక పరుగు చేశారు. రచిన్ రవీంద్ర గోల్డెన్ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ రహ్మాన్ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ తలో వికెట్ తీశారు. -
అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గెలుపులో నగర కుర్రోడు
మల్లాపూర్/కాప్రా: హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్లో మైమరిపిస్తూ.. ఫ్లిక్లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ స్టయిల్ను ప్రపంచానికి చాటాడు. బిహార్కు చెందిన మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి టీమ్ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్ బ్యాటింగ్తో అరోన్ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్లో నివసిస్తోంది అరోన్ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్. కేరళకు చెందినవారైనా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అరోన్ అండర్–19 హైదరాబాద్ జట్టు కెప్టెన్ కూడా. ప్రపంచ కప్లో అఫ్ఘానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్–19 క్రికెట్లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్ ప్రస్తుతం సైనిక్పురి భవన్స్ కాలేజీలో బీకాం (ఫైనాన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్ చేశాడు. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్ రానున్న అరోన్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు. -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
IND vs USA: 'సమ్'తృప్తికర ఆరంభం
అభిషేక్ శర్మ డకౌట్... పవర్ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్లు సహా 63 పరుగులు సాధించాడు. ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్ భారత బ్యాటింగ్కు చిన్న హెచ్చరికను జారీ చేసింది. ముంబై: టి20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్ షాక్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్లు), సంజయ్ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్లు), మిలింద్ కుమార్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. భారత్ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. సూర్యకుమార్కు లైఫ్... హిట్టర్ అభిషేక్ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్’ కాగా... ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు), తిలక్ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించారు. నేత్రావల్కర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్తో తిలక్ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్ ఓవర్లో ఇషాన్ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్విక్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్ కిషన్ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్ దూబే (0) అవుటయ్యారు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్స్పిన్నర్ మొహసిన్ బౌలింగ్లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్ తన బౌలింగ్లోనే సూర్య ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్ లభించింది. దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్ ఓవర్లో సూర్య, అక్షర్ పటేల్ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్ను ఘనంగా ముగించాడు. సిరాజ్కు 3 వికెట్లు.. ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస ఓవర్లలో గూస్ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్ పటేల్ (0) వికెట్ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్ను అవుట్ చేసి వరుణ్ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్... అనూహ్యంగా వరల్డ్ కప్ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు... అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్ నేత్రావల్కర్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్–19 క్రికెట్ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రంజనే చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్తో నెరవేరింది. మ్యాచ్లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) మిలింద్ (బి) షాల్విక్ 20; అభిషేక్ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్ 0; తిలక్ వర్మ (సి) మోనాంక్ (బి) షాల్విక్ 25; సూర్యకుమార్ (నాటౌట్) 84; దూబే (సి) నేత్రావల్కర్ (బి) షాల్విక్ 0; రింకూ (సి) మిలింద్ (బి) మొహసిన్ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్ 5; అక్షర్ (సి) మొహసిన్ (బి) హర్మీత్ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్ (బి) షాల్విక్ 4; వరుణ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–65–0, అలీ ఖాన్ 2–0–13–1, షాల్విక్ 4–0–25–4, మొహసిన్ 4–0–16–1, శుభమ్ 2–0–16–0, హర్మీత్ 4–0–26–2. అమెరికా ఇన్నింగ్స్: గూస్ (సి) తిలక్ (బి) సిరాజ్ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్ (బి) సిరాజ్ 2; మోనాంక్ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్ 37; శుభమ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 37; హర్మీత్ (సి) సిరాజ్ (బి) అక్షర్ 0; మొహసిన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 8; షాల్విక్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్ 4–0–29–3, వరుణ్ 4–0–24–1, అక్షర్ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.టి20 ప్రపంచకప్లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి ఇంగ్లండ్X నేపాల్ వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచిశ్రీలంక X ఐర్లాండ్వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్కు ఐసీసీ ప్రశ్న
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడి.. కేవలం భారత్తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.బంగ్లాదేశ్కు మద్దతుగాఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ మ్యాచ్ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిస్కరిస్తామంటూ పాక్ కొత్త రాగం ఎత్తుకుంది.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.ఒకవేళ రద్దయితేకానీ బంగ్లాదేశ్ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందంటూ.. పాక్ భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశాడు.కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.తెలివి ప్రదర్శించిన పీసీబీఅయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్ తెలివిగా.. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్తో మ్యాచ్కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.గట్టిగానే బదులిచ్చిన ఐసీసీఅయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్.. ఆ తర్వాత మాట మార్చి భారత్తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్? -
IND vs USA: సూర్యకుమార్ విధ్వంసం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్ రెండో బంతికే అలీ ఖాన్ అభిషేక్ శర్మ (0) డకౌట్గా వెనక్కి పంపాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..ఆ తర్వాత వాన్ షాల్విక్ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్ కిషన్ (20), ఐదో బంతికి తిలక్ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్మిగిలిన వారిలో రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు.A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙PS. India win 88% of matches when captain SKY scores 50+ ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026మెరుపు అర్ధ శతకంధనాధన్ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అమెరికా బౌలర్లలో వాన్ షాల్విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్ సింగ్ రెండు, అలీ ఖాన్, మొహమ్మద్ మొహ్సిన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్-‘ఎ’లోచదవండి: అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి -
గంభీర్ బాటలో అభిషేక్ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఈ పంజాబీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్లో ఉన్న అభిషేక్.. కెరీర్లో తొలి ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్కప్లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అమెరికా పేసర్ అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.ఇక అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్కావడంతో.. “గంభీర్ బాటలో నడిచిన అభిషేక్ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. పవర్ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్కప్ అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్👉ఆశిష్ నెహ్రా (గోల్డెన్ డక్)👉శార్దూల్ ఠాకూర్👉దీపక్ హుడా👉అభిషేక్ శర్మ (గోల్డెన్ డక్). -
T20 WC: చెలరేగిన షెఫర్డ్.. విండీస్ బోణీ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్కతా వేదికగా గ్రూప్-‘సి’ నుంచి విండీస్- స్కాటిష్ జట్లు శనివారం తలపడ్డాయి.ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ (35) రాణించగా.. కెప్టెన్ షాయీ హోప్ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్డౌన్లో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్మెయిర్ 64 పరుగులు సాధించాడు. రోవ్మన్ పావెల్ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్ఫర్డ్ (13 బంతుల్లో 26) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్ షరీఫ్, ఒలీవర్ డేవిడ్సన్, మైకేల్ లీస్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ ఆది నుంచే తడబడింది. టాపార్డర్లో జార్జ్ మూన్సే (19), బ్రాండన్ మెక్ముల్లన్ (14) నిరాశపరచగా.. మైకేల్ జోన్స్ (1) విఫలమయ్యాడు.ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్టన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్ బ్రూస్ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్ (11), మార్క్ వాట్ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్ హ్యాట్రిక్తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షమర్ జోసెఫ్, గుడకేశ్ మోటీ తలా ఒక వికెట్ తీసి తమ వంతు సాయం అందించారు. -
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్ఏతో భారత్ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మిలింద్ కుమార్ (34) స్టంపౌట్. నాలుగో వికెట్ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్ 16, సంజయ్ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్ బౌలింగ్లో సాయితేజ ముక్కామల (2) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. మిలింద్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్దీప్ బౌలింగ్లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (0) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ తీసిన సిరాజ్1.4: అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్ టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే వికెట్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్లో తిలక్కు క్యాచ్ ఇచ్చి అమెరికా ఓపెనర్ ఆండ్రీ గౌస్ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్ డౌన్19.6: వరుణ్ చక్రవర్తి (0) రనౌట్.. తొమ్మిదో వికెట్ డౌన్అర్ష్దీప్ అవుట్18.6: షాల్విక్ బౌలింగ్లో... ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన అర్ష్దీప్ సింగ్ (4) సూర్యకుమార్ హాఫ్ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్ఏడో వికెట్ కోల్పోయిన భారత్16.4: హర్మీత్ బౌలింగ్లో మొహ్సిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). క్రీజులోకి అర్ష్దీప్ సింగ్. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్, సూర్య ధనాధన్15: నేత్రావల్కర్ బౌలింగ్లో అక్షర్ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్ కోల్పోయిన భారత్12.4: హర్మీత్ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్ పటేల్. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్ కోల్పోయిన భారత్11.4: మొహ్సిన్ బౌలింగ్లో మిలింద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ అవుట్ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్5.6: వాన్ షాల్విక్ బౌలింగ్లో నేత్రావల్కర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన శివం దూబే. పవర్ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్ వర్మ అవుట్5.5: మూడో వికెట్గా వెనుదిరిగిన తిలక్ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్). వాన్ షాల్విక్ బౌలింగ్ మోనాంక్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్ డౌన్5.2: వాన్ షాల్విక్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, రెండు సిక్స్లు). క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. తిలక్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్ 13 బంతుల్లో 23, ఇషాన్ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.2: అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్ బౌలింగ్... ఇషాన్ 7, అభిషేక్ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కగా.. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్కు లక్కీ ఛాన్స్అదే విధంగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక పేస్ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2026: భారత్ వర్సెస్ యూఎస్ఏ తుదిజట్లుభారత్ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్ఏఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ -
బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్టాపిక్. ఫార్మాట్ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్కు అలవాటుగా మారింది..ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ టోర్నీ-2026లో వైభవ్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్వరల్డ్కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026పుత్రోత్సాహంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోనుఈ క్రమంలో సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్ టెస్టు మ్యాచ్ ఆడేదాకా తననొక స్టార్ క్రికెటర్గా నేను పరిగణించను’’ అని సంజీవ్ సూర్యవంశీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంటీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్ టెండుల్కర్ను చూసి ఓ క్రికెటర్ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్? -
T20 WC: నేపాల్తో మ్యాచ్.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ మొదలైంది. పాకిస్తాన్- నెదర్లాండ్స్ మ్యాచ్తో శనివారం ఈ పొట్టి క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్తో పాటు.. వెస్టిండీస్- స్కాట్లాండ్.. టీమిండియా- యూఎస్ఏ మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారైంది.ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లుఇక గ్రూప్-సిలో ఉన్న ఇంగ్లండ్ తొలత నేపాల్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లియామ్ డాసన్లకు చోటు దక్కింది.హార్డ్ హిట్టర్ వచ్చేశాడు!అంతేకాదు.. పూర్తి ఫిట్నెస్తో హార్డ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్కు తోడు మాజీ కెప్టెన్ జోస్ బట్లర్తో పాటు కెప్టెన్ బ్రూక్ బ్యాటింగ్ లైనప్ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో సామ్ కర్రాన్, విల్ జాక్స్, జేకబ్ బెతెల్ ఉన్నారు. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్, ల్యూక్ వుడ్ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్- నేపాల్ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.టీ20 ప్రపంచకప్-2026: నేపాల్తో మ్యాచ్కు ఇంగ్లండ్ తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.బెంచ్: రెహాన్ అహ్మద్, జోష్ టంగ్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్.వరల్డ్కప్ టోర్నీకి నేపాల్ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.చదవండి: T20 WC: పాక్కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి.. -
IND vs PAK: పాకిస్తాన్ యూటర్న్?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.భారత్- బంగ్లా.. మధ్యలో పాక్అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ.భారత్తో మాత్రమే ఆడమంటూఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్తో మ్యాచ్కు తమకు భద్రత ఉండదంటూ పాక్.. టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్ దశలో మిగతా మ్యాచ్లకు లేని ఇబ్బంది భారత్తో మాత్రమే ఉందని చెప్పడం పాక్ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్కు లేఖ రాసింది. గతంలో పాక్లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.ఉగ్రదాడిని గుర్తుచేస్తూఅలాంటిది.. భారత్- పాక్ మ్యాచ్కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డు చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ భారత్తో మ్యాచ్ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..గతంలో సాయం చేశాము కదా!‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్ బోర్డుతో పాకిస్తాన్ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్ నిర్లక్ష్యం చేయలేదు.లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్- పాక్ మ్యాచ్ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్తో ద్వైపాక్షిక సిరీస్ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.కఠిన చర్యలు తప్పవుఇదిలా ఉంటే.. పాక్ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్- పాకిస్తాన్ మధ్య వరల్డ్కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది.చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్ -
T20 WC: పాక్కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శనివారం తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. గ్రూప్-ఎ నుంచి ఇరుజట్ల మధ్య పోటీ జరుగగా.. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.147 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో మైకేల్ లెవిట్ (24) ఫర్వాలేదనిపించగా.. బాస్డీ లీడే (30), కొలిన్ అకెర్మాన్ (20), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీబ్ ఆయుబ్ రెండేసి వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో షాహిన్ ఆఫ్రిది ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఓపెనర్ల శుభారంభంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47), సయీబ్ ఆయుబ్ (13 బంతుల్లో 24) శుభారంభం అందించారు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా (12)తో పాటు బాబర్ ఆజం (15) తడబడగా.. ఉస్మాన్ ఖాన్ (0) డకౌట్ అయ్యాడు.The pressure is back on Pakistan! 😮💨Babar Azam is caught as half of the side is back into the hut!Will Netherlands pull off an upset here? 🤔ICC Men's #T20WorldCup | #PAKvNED | LIVE NOW 👉 https://t.co/GKcXaJHm9F pic.twitter.com/PK1NOGXYju— Star Sports (@StarSportsIndia) February 7, 2026మారిన సీన్.. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠషాబాద్ ఖాన్ (8), నవాజ్ (6) చేతులెత్తేయగా.. ఆఖర్లో ఫాహీమ్ అష్రఫ్ (11 బంతుల్లో 29 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. అతడి తోడు షాహిన్ ఆఫ్రిది (5) అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి ఓవర్లో మూడో బంతికి ఆష్రఫ్ కష్టమ్మీద ఫోర్ బాదగా పాక్ గెలుపు ఖరారైంది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన పాక్.. మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.కాగా నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్.. ఆయుబ్, ఆఘా రూపంలో రెండు కీలక వికెట్లు తీయగా.. పాల్ వాన్ మీకెరెన్ సాహిబ్జాదా, ఉస్మాన్ ఖాన్ను పెవిలియన్కు పంపాడు. మిగిలిన వారిలో లోగాన్ వాన్ బీక్, కైలీ క్లెయిన్, వాన్ డెర్ మెర్వె తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్!.. మరీ ఆ షాట్లు అలా ఆడితే ఎలా? -
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసు గుర్రం మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్, రోహిత్తో పాటు ఏ ప్లస్లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సిరాజ్, పంత్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్లు సమాచారం. -
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్'దే ISPL టైటిల్
తమిళ నటుడు సూర్య కో-ఓనర్గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్కతా టైగర్స్పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
జగజ్జేత భారత్కు భారీ నజరానా
అండర్ 19 ప్రపంచకప్ 2026 విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్ పలు రికార్డులు సొంతం చేసుకుంది.దేశమంతా గర్విస్తుందిజగజ్జేత భారత్కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్కప్ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు. ప్రధాని అభినందనలు ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్కప్ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆరోసారి తాజా టైటిల్తో భారత్ ఆరోసారి అండర్ 19 వరల్డ్కప్ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భారత ఇన్నింగ్స్లో వైభవ్ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్ 2026 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 7) ప్రారంభం కానుంది. ఇవాళే భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. బుమ్రా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా అతను శుక్రవారం నాటి నెట్ ప్రాక్టీస్కి హాజరుకాలేదు. దీంతో నేటి మ్యాచ్కు బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రత్యర్ది (యూఎస్ఏ) చిన్నదే అయినా, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గత ప్రపంచకప్లో ఇదే జట్టు పాక్కు షాకిచ్చింది. కాబట్టి, బుమ్రా అందుబాటులో లేకపోయినా టీమిండియా మరో పేస్ బౌలింగ్ ఆప్షన్తో సిద్దంగా ఉండక తప్పదు.ఒకవేళ బుమ్రా నిజంగా యూఎస్ఏ మ్యాచ్కు దూరమైతే కొత్తగా జట్టులోకి వచ్చిన సిరాజ్కు తుది జట్టులో అవకాశం ఉండవచ్చు. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉండగా, సిరాజ్ ఫస్ట్-చేంజ్ బౌలర్గా ఉపయోగపడతాడు. యూఎస్ఏతో మ్యాచ్ తర్వాత భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో మ్యాచ్ షెడ్యూలైంది. అయితే ఈ మ్యాచ్పై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ఆడినా ఆడకపోయినా, భారత్ అయితే ఈ మ్యాచ్ కోసం కొలొలంబోకు వెళ్తుంది. ఒకవేళ పాక్ నిజంగా బరిలోకి దిగకపోతే భారత్కు మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు లభిస్తాయి. దీని తర్వాత టీమిండియా ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడనుంది.యూఎస్ఏతో మ్యాచ్కు భారత జట్టు (అంచనా)..ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్ -
శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు
శ్రీలంక టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్ మలింగ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్ మదుశన్ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్ గాయపడటంతో ప్రమోద్కు బంపరాఫర్ దక్కింది. ఈషాన్, ప్రమోద్ ఇద్దరూ రైట్ ఆర్మ్ మీడియం పేసర్లే. ఈషాన్ లంక టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాగా.. ప్రమోద్ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. అతను చివరిగా 2023 ఏప్రిల్లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్తో మాత్రం అనునిత్యం టచ్లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్లో ప్రమోద్.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు.స్వదేశంతో పాటు భారత్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్తో ఆడనుంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.అప్డేటెడ్ శ్రీలంక జట్టు..- దసున్ షనక (కెప్టెన్) - పథుమ్ నిస్సంక - కమిల్ మిశారా - కుసల్ మెండిస్ - కమిందు మెండిస్ - కుసల్ జానిత్ పెరేరా - చరిత్ అసలంక - జానిత్ లియానగే - పవన్ రత్నాయకే - వనిందు హసరంగ - దునిత్ వెల్లలాగే - మహీష్ తీక్షణ - దుష్మంత చమీరా - మతీషా పథిరానా - ప్రమోద్ మదుశన్ -
వైభవ్ సూర్యవంశీ కూడా వారిలాగే కనుమరుగైపోతాడా..?
అండర్ 19 వరల్డ్కప్ 2026 ఫైనల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి, భారత్ను ఆరోసారి జగజ్జేతగా నిలిపిన విషయం విధితమే. హరారే వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఈ మహా విధ్వంసం కారణంగా వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ మొత్తంలో ఇదే తరహా ఫామ్ను (439 పరుగులు, ఓ వికెట్) కొనసాగించినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా వైభవ్కే దక్కింది.ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన గత ఐదు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచిన ఏ ఒక్క ఆటగాడు కెరీర్లో పెద్దగా ఎదగలేకపోయాడు. తూతూమంత్రంగా కొద్ది రోజులు లైమ్లైట్లో ఉన్నా, ఆతర్వాత శాశ్వతంగా కనుమరుగైపోయారు. దీంతో భారత ఆటగాళ్లకు ఫైనల్స్ కలిరాదనే భావన కలుగుతోంది.తాజాగా వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడంతో, ఇతనికి కూడా గత ఐదు వరల్డ్కప్ ఫైనల్స్ హీరోలకు పట్టిన గతే పడుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వైభవ్ దూకుడు చూసి కొందరు అలాగే జరుగుతుందని అంటుంటే.. మరికొందరేమో వైభవ్ టీమిండియా తరఫున అద్భుతమైన కెరీర్ను కొనసాగిస్తాడని అభిప్రాయపడుతున్నారు.ఇంతకీ గతంలో భారత్ అండర్ 19 వరల్డకప్లు గెలిచిన సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2000) రితిందర్ సింగ్ సోధి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో సోధి అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి భారత్ తొలిసారి వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో సోధి తొలుత బౌలింగ్లో (10-0-26-0), ఆతర్వాత బ్యాటింగ్లో (39 నాటౌట్ (43)) రాణించాడు. ఈ ప్రపంచకప్ తర్వాత సోధి కొద్ది రోజులు లైమ్లైట్లో ఉన్నా, ఆతర్వాత కనుమరుగైపోయాడు.ఆతర్వాత భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2008) అజితేశ్ అర్గల్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో అర్గల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-7-2) మెరిసి, భారత్ రెండో ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్గల్ ఆ ప్రపంచకప్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్లో ఓ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆటగాడిగా కనుమరుగైపోయారు. అయితే ఆశ్చర్యకరంగా అతను అంపైరింగ్ను కెరీర్గా ఎంచుకొని, క్రికెట్తో బంధాన్ని కొనసాగిస్తున్నాడు.భారత్ మూడోసారి ప్రపంచకప్ సాధించడంలో (2012) నాటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో ఉన్ముక్త్ అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్) చేసి భారత్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో ఉన్ముక్త్ను అందరూ భావి భారత తారగా అనుకున్నారు. అయితే ఆశర్చర్యకరంగా అతని కెరీర్ కూడా ముందుకు సాగలేదు. అవకాశాలు లభించినా అతను ఒడిసి పట్టుకోలేకపోయాడు. భారత్లో కాదని వేరే దేశానికి వెళ్లినా అతని ఫేట్ మారలేదు. దీంతో అతను క్రమంగా కనుమరుగైపోయాడు.భారత్ నాలుగోసారి (2018) ప్రపంచ ఛాంపియన్గా అవతరించడంలో మన్జోత్ కల్రా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్స్లో కల్రా మెరుపు సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. పై ముగ్గురితో పోలిస్తే, కల్రా పరిస్థితి మరీ దారుణం. వరల్డ్కప్ ఫైనల్ తర్వాత ఇతను ఎక్కడా కనపడలేదు. లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లో కేవలం ఒకటి అరా మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వరల్డ్కప్ ఫైనల్లో సెంచరీ చేసి రాత్రికిరాత్రే హీరో ఇమేజ్ దక్కినా, ఎందుకో ఆ ఇమేజ్ను కొనసాగించలేకపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెరుపులా ఒక్కసారి మెరిసి ఆతర్వాత అదృశ్యమయ్యాడు.భారత్ ఐదోసారి వరల్డ్కప్ గెలవడంలో రాజ్ బవా కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో జరిగిన నాటి ఫైనల్లో బవా ఆల్రౌండర్గా (34 (54), 5-31) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. ఆ ఫైనల్ తర్వాత బవాకు మంచి అవకాశాలే లభించినా, పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్లో అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. ఇతను శాశ్వతంగా కనుమరుగుకాకపోయినప్పటికీ.. ఇంచుమించు అంచున ఉన్నాడు.పై ఐదుగురు వరల్డ్కప్ ఫైనల్స్ హీరోల పరిస్థితి చూశాక వైభవ్ ఎమవుతాడోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఉంది. ప్లేయర్ ఆఫ ద ఫైనల్స్గా నిలిచిన ఆటగాళ్ల కెరీర్లు బాగా లేకపోయినా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వాళ్ల కెరీర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజా వరల్డ్కప్లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో వైభవ్ కెరీర్కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఫ్యాన్స్ ఊరట పొందుతున్నారు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు (వైభవ్ సహా) ఐదుగురు (యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్)ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు. వీరంతా కెరీర్లో అత్యున్నతి సాధించారు. వైభవ్ కూడా వీరి బాటలోనే నడవాలని ఆశిద్దాం. -
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్ 19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్లోని ఫైర్ చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు. విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఐస్లాండ్ క్రికెట్ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరును ఐస్లాండ్ క్రికెట్ ఎక్స్ రేటెడ్ హింసగా పేర్కొంది. Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!— Iceland Cricket (@icelandcricket) February 6, 2026ఐస్లాండ్ క్రికెట్ ఈ ట్వీట్ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్ రేటెడ్ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్ బీభత్సం.ఈ సునామీ ఇన్నింగ్స్తో వైభవ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
జాక్పాట్ కొట్టేసిన సిరాజ్
అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్కప్ జట్టులోకి హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సిరాజ్ చేరిక టీమిండియా బౌలింగ్ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ.. ఆల్రౌండర్ హర్షిత్ రాణా జట్టుకు దూరం కావడం ఒకింత మైనస్సే అవుతుంది. ఎందుకంటే.. హర్షిత్ లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగల సమర్దుడు. ఛేదనల్లో అతని ఇన్నింగ్స్లు చాలా కీలకమవుతాయి. బౌలింగ్ విషయంలోనూ హర్షిత్ ఇటీవలకాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 జట్టుకు హర్షిత్ లాంటి ఆల్రౌండర్ చాలా కీలకం. మరోవైపు సిరాజ్ చేరిక కూడా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్. పైగా మంచి ఫామ్లో ఉన్నాడు. గత వరల్డ్కప్ విన్నింగ్ జట్టులోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్లా బ్యాటింగ్ చేయలేడన్నది తప్పిస్తే, సిరాజ్ లాంటి బౌలర్ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్.. బుమ్రా, అర్షదీప్తో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్కు ప్రపంచకప్ అందించాలని ఆశిద్దాం.సుందర్ విషయంలో ఇంకా క్లారిటీ లేదుగాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్తో భర్తీ చేసిన బీసీసీఐ.. మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న సుందర్ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబ్లో ఉన్నాడు. సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్ విషయంలో ఇంకా వేచి చూడాలని భావిస్తుంది. కాబట్టే ఇంకా అతనికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ప్రపంచకప్ తదుపరి దశ సమయానికంతా సుందర్ కోలుకుంటాడని ఆశిద్దాం.ఇదిలా ఉంటే, భారత్ ఇవాళ (ఫిబ్రవరి 7) ప్రపంచకప్లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తుది జట్టులో సిరాజ్కు తప్పక అవకాశం దొరుకుతుంది.టీ20 ప్రపంచకప్కు అప్డేటెడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (విసి), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్


