న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సాంట్నర్ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.
ఎర్రమట్టి పిచ్!
అహ్మదాబాద్లో ఈసారి ఎర్రమట్టి పిచ్ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.
220 పరుగులకే కట్టడి చేస్తే
ఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.
అబద్ధం చెబుతున్నాడు
ఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సాంట్నర్కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.
అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్రూమ్లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్ డిమాండ్కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.


