న్యూజిలాండ్తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.
విశ్రాంతినివ్వాలి
‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.
టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్.. ఫామ్లో లేని బ్రాండన్ కింగ్కు బదులు.. రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. బ్రాండన్రు ఐదు- ఆరు మ్యాచ్లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.
టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
రింకూను ఆడించండి
టెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.
అవును.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు.
సంజూతో పోలిక వద్దు
ఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.


