న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన హోలీ సంబరాలు విషాదానికి దారితీశాయి. రంగుల పండుగ వేళ జరిగిన స్వల్ప వివాదం చివరికి యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నైరుతి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో శుక్రవారం ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 4న హోలీ వేడుకల సందర్భంగా జేజే కాలనీలోని ఒక ఇంటి పైకప్పు నుంచి 11 ఏళ్ల బాలిక నీటి బెలూన్లను కింద ఉన్న తన బంధువులపైకి విసురుతోంది. అయితే, ప్రమాదవశాత్తూ ఆ రంగు నీళ్లు మరో వర్గానికి చెందిన మహిళపై పడ్డాయి. ఇది ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి తరుణ్ కుటుంబంపై దాడికి దిగారు. తరుణ్ను 10 మంది చుట్టుముట్టి కర్రలు, రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తలకి తీవ్ర గాయాలవ్వడంతో తరుణ్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ దాడిలో తరుణ్ తాత మాన్ సింగ్తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు.
STORY | Vehicles set ablaze, massive protest blocks road in Delhi's Uttam Nagar after man killed in Holi clash
Tension escalated in southwest Delhi's Uttam Nagar on Friday as a car and a motorcycle were set on fire, and a massive protest by Hindu political outfits blocked… pic.twitter.com/4qsI4PkQEo— Press Trust of India (@PTI_News) March 6, 2026
తరుణ్ మృతితో ఆగ్రహించిన స్థానికులు ఉత్తమ్ నగర్ తూర్పు మెట్రో స్టేషన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. వందలాది మంది రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఆందోళనకారులు ఆగ్రహంతో ఒక కారును, మోటార్ సైకిల్ను తగులబెట్టారు. ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన బాధితుడి తండ్రి, నిందితులను కఠినంగా శిక్షించే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ద్వారక డీసీపీ కుశాల్ పాల్ సింగ్ స్పందిస్తూ.. ‘తహోలీ బెలూన్ వివాదమే ఈ ఘర్షణకు మూలమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశాం. ఒక మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఉత్తమ్ నగర్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: పగిలిన ఇటుకలు.. వలస గుండె చప్పుళ్లు!


