సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అసెంబ్లీ వరకు చేరింది. అసెంబ్లీ ప్రాంగణం బయట ఉండి నియోజకవర్గం వెలివర్రు గ్రామ టీడీపీ నేత వెంకటేశ్వర రాజు నిరసనకు దిగారు. టీడీపీ నుంచి రఘురామను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు తాను అసెంబ్లీకి వచ్చినట్టు తెలిపారు.
ఈ క్రమంలో వెంకటేశ్వర రాజు.. ఎన్టీఆర్ విగ్రహంతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నం చేశారు. తనకు జరిగిన అన్యాయం, నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు వేధింపులను చంద్రబాబుకు వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వెంకటేశ్వర రాజు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్నందుకు ఇటువంటి బహుమతి ఇస్తారా?. రఘురామ కృష్ణంరాజు నా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నేను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాను. సొంత పార్టీ నేతపై కక్ష సాధింపు చర్యలు దిగారు. ఉండిలో రఘురామ కృష్ణంరాజు పార్టీని నాశనం చేస్తున్నారు.
అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకొని నా ఇల్లు, నా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. నా ఆఫీసుకు అన్ని అనుమతులు ఉంటే కూల్చాల్సిన అవసరం ఏం వచ్చింది?. ఉండిలో చర్చిలు, మసీదులు కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మా మోర ఆలకించాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, టీడీపీ నేత వెంకటేశ్వర రాజు అంతకుముందు కూడా రఘురామపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.


