breaking news
TDP
-
ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: అంబటి
సాక్షి, గుంటూరు: రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని.. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని వరుస అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘యూట్యూబర్ ప్రశ్న రావణ్, జర్నలిస్టు కేవీఆర్ మా పార్టీకి చెందినవారు కాకపోయినా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తున్నాం. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం చట్టవిరుద్ధం. ప్రశ్న రావణ్పై ఐదుసార్లు అరెస్ట్, బెయిల్, మళ్లీ అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం...రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు యూఏపీఏ కేసు పెట్టడం న్యాయవ్యవస్థకే సవాల్. ఉగ్రవాదులపై ఉపయోగించే చట్టాన్ని ఓ యూట్యూబర్పై ప్రయోగించడం దారుణం. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైఎస్సార్సీపీ లీగల్ సపోర్ట్ అందిస్తుంది. సాయి కృష్ణ, కాంతికుమార్, ప్రశ్న రావణ్, కేవీఆర్.. ఎవరు మా పార్టీ వాళ్లు కాకపోయినా అన్యాయానికి వ్యతిరేకంగా నిలుస్తాం.బాధితులనే నిందితులుగా మార్చే ధోరణిని వైఎస్సార్సీపీ సహించదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే యూఏపీఏ.. అధికారాన్ని పొగిడితే రక్షణ అనే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సమస్యలను వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. మమ్మల్ని దూషించే వారిపై చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులా?. జనవరి 31న నా ఇంటిపై జరిగిన దాడిపై నిందితుల అరెస్టు కోరుతూ ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇస్తాం. ఈ దుర్మార్గమైన పాలనను ప్రజలు గమనించి తగిన తీర్పు ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్కు ఆ రూల్ వర్తించదా?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్రం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్లో ఉన్నవారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగేది. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావు లేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని బెదిరించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్దం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ఆధారసహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక పార్టీపరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్కే ఈ పవర్ ఉంటుందా.మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోం మంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఒక జీఓ ఇవ్వవలసిన అవసరం లేదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీసు శాఖలో ఉన్నాయి. సైబర్ క్రైమ్కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా ఫర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్దితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కాని ఆయన చెబుతున్నదానికి, ఆచరిస్తున్నదానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలనో, సోషల్ మీడియావారినో భయపెట్టే యత్నంగా కాకుండా, జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీవారు, లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది.పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపిపిస్తుంది. నిజంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికి దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్కావళిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుని, అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేయడం మంచిదే. తమ నిర్ణయాలతో విబేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కాని ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్కు పౌరులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఓ వారం, పది రోజుల క్రితమే కదా! వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ, తొక్కి నార తీస్తా అని పవన్ అన్నారు! మరి అవి వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా? రావా? అన్నదానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా అని అడుగుతున్నారు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకాని, పవన్ కాని ఎన్నడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది వాక్ స్వాతంత్రం కిందే వస్తుందా? అధికారంలో ఉంటే ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చెల్లుతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి ఒక ఫ్రొఫెసర్ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడినప్పుడు పవన్ కళ్యాణ్ మందలించి ఉండాల్సిందే. ఈ మద్యనే జగన్ను కూడా దూషించితే, పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే. అందులో రాజీ లేదు. కాని అదేదో ఒక పార్టీకి సంబంధించినంతవరకే కాదు కదా! మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైఎస్సార్సీపీ మహిళా నేతలు పలువురిని దూషిస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన వారు పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉంటే, ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది.ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషణ చేయకపోయినా ఆయనపైన, మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నిరకాల దూషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి కదా! వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్టు చేస్తున్నారే. వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే! కక్ష కట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారే! చంద్రబాబు పదే, పదే వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడాన్ని పవన్ సమర్థిస్తారా?హింసకు తావు లేదని అన్నారు. అది నిజమే. కాని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్దం అని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అనలేకపోయారే! విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూలకుండీలతో దాడులు చేశారు. అప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికి తెలిసిందే కదా! రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా, మందలించి ఉంటే పవన్ నిబద్దతగా ఉన్నారని అంతా ఒప్పుకునే వారు కదా! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాదితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు పవన్పై ఒక నమ్మకం ఏర్పడేది కదా! జనసేన నేత ఒకరు నడిరోడ్డుపై పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకం అని ఖండించి, చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏమి చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా! సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై పవన్ స్పందించాలి కదా.30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే! రాష్ట్ర అప్పులపై పది నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ చేసిన అసత్య ప్రచారం గురించి ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయే! అయినా అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడేవారు.నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్దమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలతో పాటు తాను గత పదేళ్లుగా ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్దతి అనిపించేదేమో! పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా!ఒక వైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచాకాలు సాగుతుంటే, వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌరుల హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా? లేక ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఫారాలెక్కడ ‘సర్’
ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బీఎల్ఏను కలవాలని మా బీఎల్వో చెబుతున్నాడు. మా ఇంటికి ఇంత వరకు బీఎల్వోనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బీఎల్ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తిచేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి. – ఎ.కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రబో అని ఓటర్లు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం అంకెల్లో వందశాతాలు చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలామంది బీఎల్వోలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బీఎల్వోల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లలో ఎవరికి ఫారాలు ఇవ్వాలి? ఎవరిని మినహాయించాలనేది టీడీపీ నాయకులే బీఎల్వోలకు నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఫారాలు ఇప్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన ఓటర్లకు ఓట్లు లేకుండా చేయాలన్న కుట్రతో పాటు పనిలో పనిగా దొంగఓట్లు చేర్పించే దుర్మార్గానికి కూడా అక్కడక్కడా పసుపు చొక్కా నాయకులు పూనుకుంటున్నారు. ఓటర్లకు రెండు ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఫారం వారికే తిరిగి ఇవ్వాలన్న పద్ధతిని బీఎల్వోలు ఎక్కడా పాటించడం లేదు. నిరక్షరాస్యులైన ఓటర్లకు వివరాలు నింపడంలో సాయపడాల్సిన బీఎల్ఓలు చాలామంది ఆ పనిని గాలికి వదిలేశారు. దాంతో చాలాచోట్ల ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్నా ఇంకా ఫారాలు అందలేదు.. అందిన ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా జరగలేదు.. ఈ నేపథ్యంలో సర్ గడువు పొడిగించాలని, అవకతవకలన్నీ సరిచేయాలని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్ జరుగుతున్న తీరిలా ఉంది... దొంగ ఓట్లు చేర్చే కుట్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలస వెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మక్కై అక్కడ 76 ఓట్లున్నట్లుగా చూపుతున్నారు. దొంగఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం కర్నూలు జిల్లాలో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. ఎక్కడో ఒకచోట కూర్చుంటున్నారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఓటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఆదోనిలో టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం. ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకోవలసిందే. కర్నూలులోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బీఎల్వోలు కూర్చుంటున్నారు. జిల్లాలో వలస వెళ్లిన కూలీల ఫారాలన్నీ అందుబాటులో లేకుండా చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించడానికి సర్వం సిద్ధం చేశారు. ‘సర్’ ప్రక్రియలో పసుపు యానిమేటర్లు అనంతపురం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో, డిజిటలైజేషన్ ప్రక్రియలో వెలుగు యానిమేటర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఓ అధికారి ఆదేశాలతోనే యానిమేటర్లు ఈ పనిలోకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం వెలుగు యానిమేటర్లందరూ అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా.. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందా లేక ప్రతిపక్షాలకు చెందిన ఫారాలు గల్లంతవుతాయా అన్నా అనుమానాలున్నాయి. ఎన్యూమరేషన్ జిరాక్స్లు ఎందుకు ‘తమ్ముడూ’? కళ్యాణదుర్గంలోని 70, 71 పోలింగ్ కేంద్రాల వద్ద ఓ టీడీపీ కార్యకర్త ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్స్లు తీసుకుంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు. తాను బీఎల్వోనని, గతంలో ఇక్కడి బీఎల్వో సరిగా పనిచేయకపోవడంతో తనను నియమించారని చెప్పి తప్పించుకోబోయాడు. గట్టిగా నిలదీయడంతో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకురావలసిందిగా స్థానిక టీడీపీ నేత డిష్ మురళి చెప్పాడని బయటపెట్టాడు. అంటే ఆ ఫారాలన్నీ పరిశీలించి ఏవేవి తీసేయాలో చెప్పేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రన్న మాట. బీఎల్వోలను పిలిపించేలోపు ఆ కార్యకర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వరా? శ్రీకాకుళం జిల్లాలో 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీకాకుళం నగరంలోని చాలా ఏరియాల్లోకి అసలు బీఎల్వోలు అడుగేపెట్టలేదు. జిల్లాలో చాలాచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇంటిలో ఐదుగురు ఓటర్లుంటే ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికీ మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి మాయమయ్యారు. చాలాచోట్ల అక్నాలెడ్జ్మెంట్లా ఉంచాల్సిన ఫారాన్ని కూడా బీఎల్వోలు తీసుకెళ్లిపోతున్నారు. రెండు ఫారాలు వాళ్లే తీసుకుపోతే మనకు ఇక ఆధారమేమి ఉంటుందని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 36వ డివిజన్లో ఒక ఇంట్లో 8మంది ఓటర్లు ఉంటే ముగ్గురికి, చెన్నారెడ్డి కాలనీలో ముగ్గురు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేశారు. సర్వం గందరగోళం.. సర్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సర్ ప్రక్రియ సర్వం గందరగోళంగా తయారయ్యింది. శని, ఆదివారాలలో బీఎల్వోలు బూత్లలో అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించినా ఎక్కడా బీఎల్వోలు కనిపించలేదు. చాలా చోట్ల బూత్లకు తాళాలేసి ఉన్నాయి. తెరిచి ఉన్న బూత్లలో సిబ్బంది ఎవరూ లేరు. ⇒ తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరించడం లేదు. రాజమండ్రి నగరంలో నేటికీ 25 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ జరిగింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడం తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. సర్వర్లు మొరాయించడం వంటి కారణాల వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ ఈనెల 14వ తేది నాటికి పూర్తి కాదని, గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. విశాఖ తూర్పు, ఉత్తర, గాజువాక, చోడవరం, పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల్లో బీఎల్వోల కోసం ప్రజలు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందలేదు ⇒ చిత్తూరు నగరంలోని 32వార్డు సచివాలయంలో పనిచేసే బీఎల్వోలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నంద్యాల విశ్వనగర్ టీడీపీ కార్యాలయంలో సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఎల్వో, అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్⇒ పల్నాడు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం లేదు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో బూత్ నంబర్లు 286, 287 పరిధిలో 22 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నూజెండ్ల మండల ఎంఆర్ఓకు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చాలాచోట్ల బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని ఫారాలు పూర్తి చేస్తున్నారు. ⇒ బాపట్ల జిల్లాలోనూ చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. మార్టూరులోని 21, 22, 23 వార్డులలో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను బీఎల్వోలు మినహాయించారు. కానీ ‘సాక్షి’లో కథనం రావడంతో బీఎల్వోలు హడావిడిగా శని, ఆదివారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే పర్చూరు, చీరాల నియోజకవర్గాలలోనూ వందలాదిమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు తమకు ఫారాలు అందలేదని చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోనూ ఫారాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి మళ్లీ తెస్తామని బీఎల్వోలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కలెక్టర్ మాత్రం జిల్లాలో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని చెబుతున్నారు.నంద్యాల 6వ వార్డులో టీడీపీ నాయకుడితో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరం 80వ బూత్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. దీంతో వారు దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో 800మంది వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తుండటంపై ఫారాలు అందనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సరిగా జరగడం లేదు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలతో కుమ్మక్కై ఫారాలను వారి చేతికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరి మున్సిపాలిటీ 10వ వార్డులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జీడీ నెల్లూరు పరిధిలోని గంగమాంబపురంలో ఫారాలన్నీ టీడీపీ నేతలకు బీఎల్వోలు అప్పగించగా, వారు తమకు అనుకూలమైన ఓటర్ల వివరాలను మాత్రమే ఆన్లైన్ చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు 92 బూత్లో సల్మా భాను అనే బీఎల్వో 600కి పైగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా బూత్ల్లో పర్యటిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై నిలదీస్తే ఆ బీఎల్వో దురుసుగా సమాధానం చెప్పారు. ఓట్ల తొలగింపుపై నూజండ్ల తహసీల్దార్ రమేష్కుమార్కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం ఫారాలివ్వడానికి బీఎల్వోలు ఎవరూ ఇళ్లకు రావడం లేదు. సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఫోన్ చేస్తే సచివాలయానికో, మరో ప్రాంతానికో రమ్మని చెబుతారు. వెళ్లినా అక్కడ ఉండడం లేదు. రోజువారీ పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగటం మా వల్ల కావడం లేదు. మేం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా ప్రాంతానికి వచ్చి ఫారాలు అందజేయాలని కోరుతున్నాం. – బాబు, పాలసముద్రం మండలం, చిత్తూరు జిల్లావృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు సర్ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ, స్వీకరణ చేయాలి. అయితే మా పంచాయతీలో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదు. సచివాలయానికి రావాలని ఓటర్లకు చెబుతున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లలేక, వ్యయప్రయాసలకోర్చి అక్కడవరకూ వెళ్లినా అక్కడ ఎదురు చూడలేక చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. – జమాల్, మాజీ సర్పంచ్, సింగవరం పంచాయతీ, అనంతపురం జిల్లాఐదుసార్లు ఓటు వేశాను.. ఇప్పుడు ఓటు లేదంటున్నారు మేం కనిగిరి బీసీ కాలనీలో ఉంటున్నాం. మా ఇంట్లో 9 మంది ఓటర్లం ఉన్నాం. మా స్వగ్రామం మార్కాపురం మండలం మేకలవారిపల్లి గ్రామం. నేను సుమారు 35 ఏళ్ల క్రితం కనిగిరికి వచ్చాను. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుసార్లు ఓటు వేశాం. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డును రెండుసార్లు పొందాను. అన్ని ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని వెళ్లి బీఎల్వో ఆంజనేయులును కలిశాను. 2002 జాబితాలో నీ పేరు కనిపించడం లేదు. మీ నాన్న, మీ బంధువుల ఆధారాలు తీసుకుని రా.. లేదంటే.. నీ ఓటు ఫారంను రిజక్ట్ చేస్తాను అని బీఎల్వో చెప్తున్నాడు. మీ నాన్న ఓటు వివరాలు, బూత్ నంబర్ కని్పంచలేదని బీఎల్వో దబాయిస్తున్నాడు. ఎన్నికల అధికారులు నాకు న్యాయం చేయాలి. – చల్లా ఏడుకొండలు, కనిగిరి, మార్కాపురం జిల్లాఓటరు లిస్టులో పేరు లేదంటున్నారు నాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. కానీ ఇçప్పుడు బీఎల్వో ఓటరు లిస్టులో నా పేరు లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వేస్తున్న ఓటు లేదంటే ఎలా? ఫారం పూర్తిచేసి ఇచ్చినా డిజిటలైజేషన్ కాలేదు. పక్క గ్రామంలో కూడా ఓటరు లిస్టులో పేరు కోసం వెతికించా. అక్కడా కనిపించలేదంటున్నారు. ఊరూరా తిరిగే ఓపిక లేదు. ఒంటరి వృద్ధురాలిని. నా ఓటు తీసేయడానికే లిస్టులో లేదంటున్నారా? అసలు నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? – కురబ రమణమ్మ, చేనేతనగర్, కురబలకోట మండలం, అన్నమయ్య జిల్లాఫారం నింపడానికి బీఎల్వో సాయం చేయడం లేదు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. బీఎల్వోలు ఎవరూ సాయం చేయడం లేదు. తండ్రి పేరుతో పాటు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు అడుగుతున్నారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో ఆ వివరాలు ఎలా నింపాలో అర్థంగాక నింపడం లేదు. 2002 ఓటరు జాబితా వివరాలు నింపాలంటే ఆ లిస్ట్ ఎక్కుడుందో తెలియడం లేదు. – భీమన వీరబాబు, క్వారీ మార్కెట్, బూత్ నంబర్ 30, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాఫారాలు ఇవ్వకుండా ఆన్లైన్ చేసేశామంటున్నారు సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్కు రెండు ఫారాలు ఇచ్చి వాటిని నింపిన తర్వాత ఒకటి ఓటర్ దగ్గర ఉంచి ఇంకొకటి బీఎల్వో తీసుకొని ఆన్లైన్ చేయాలి. అప్పుడే ఆ ఓటర్ ఎన్యూమరేషన్లో పాల్గొన్నట్లు అవుతుంది. రేపు ఓటు గల్లంతైతే ఓటరు అడగడానికి వీలు కలుగుతుంది. ఓటరు దగ్గర ఫారం లేకపోతే తన ఓటు గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది? మైలవరం నియోజకవర్గంలో చాలా బూత్లలో ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా వివరాలు తీసుకొని ఆన్లైన్ చేసేశామని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చూడాలి. – వేములకొండ విష్ణు, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా -
మా పార్టీకి ఓటు వేస్తామంటేనే..మీ పేరు ఆన్లైన్లో నమోదు
చిల్లకూరు: ‘మా పార్టీకి ఓటు వేస్తామంటేనే మీ దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. లేదంటే మీ ఓటు గల్లంతే..’ అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారు. తొణుకుమాల గ్రామంలోని 135వ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం బీఎల్వో చంద్రశేఖర్ ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. బీఎల్వో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బయటకు వెళ్లగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వచ్చి తమకు అనుకూలంగా ఉండే వారి ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాలని బీఎల్వోకు సహకారం అందిస్తున్న సచివాలయ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు.అదే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకువచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి ‘టీడీపీకి ఓటు వేస్తామంటేనే మీ ఫారాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం’ అని బెదిరించారు. వారిని వ్యతిరేకిస్తే ఓటు లేకుండా చేస్తారని భయపడిన కొందరు అంగీకరించడంతో తాము చెప్పినవారికి పూర్తయిన తర్వాత లైనులో ఉన్నవారికి ఆన్లైన్లో నమోదు చేయాలని సచివాలయ ఉద్యోగికి టీడీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు యత్నించగా, అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనంతరం బీఎల్ వో వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే గూడూరు ఆర్డీవో అరుణకుమారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. -
దొంగ ఓట్ల సృష్టికి టీడీపీ నేతల కుతంత్రం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్ల సృష్టికి టీడీపీ నేతలు కుతంత్రం పన్నుతున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నేతలు.. ఇతర నియోజకవర్గాల వ్యక్తులను ఇంటింటికీ పంపి ఓటర్ల నుంచి సమగ్ర ఓటర్ సర్వే(సర్) ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులను సేకరించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలోని బూత్ నంబర్ 70, 71 పరిధిలో శనివారం ఉరవకొండ మండలానికి చెందిన ఓ టీడీపీ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు ఇవ్వాలని కోరాడు.మీరేవరని ఓటర్లు ప్రశ్నిస్తే తొలుత బీఎల్వోనని, గతంలో పనిచేస్తున్న బీఎల్వో సరిగా పనిచేయనందున తనను పంపారని సమాధానమిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. బీఎల్వో అయితే ఐడీ కార్డు చూపాలని కోరారు. తడబడిన ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడు. అనంతరం సమస్య పెద్దదవుతుందని గుర్తించి స్థానిక టీడీపీ నేత డిష్ మురళి తనను పంపించాడని నిజం చెప్పాడు.దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు డిష్ మురళిని నిలదీయగా ‘మా వాళ్లే వదిలిపెట్టండి’ అని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఫొటోలు మార్చి ఆన్లైన్లో దొంగ ఓట్లు సృష్టించేందుకే ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు తీసుకెళ్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. -
యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వీడియో
సాక్షి, అనకాపల్లి: యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వీడియో చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం నా గొంతు నొక్కుతుంది. మీరు చంపితే నేను ఒక్కడినే చచ్చిపోతా.. ప్రశ్నించే వారు చావరు.. మీరు రావణ్ను మాత్రమే చంపగలరు.. ప్రశ్నను చంపలేరు. ప్రతీరోజూ 500 మంది పోలీసులు.. ప్రజా సమస్యలు వదిలేసి నా కోసం పని చేస్తున్నారు. ఇంత భయపడుతున్నారా..?. ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అంతా నా కోసం పని చేస్తున్నారు. ఇదా ఏపీలో పరిస్థితి?’’ అంటూ రావణ్ ప్రశ్నించారు.కాగా, రావణ్పై పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్ప్లాజా వద్ద రావణ్ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ(శనివారం) రావణ్కు యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్ చేశారు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావణ్పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. -
జర్నలిస్టులు ప్రశ్నిస్తే కక్ష సాధింపులెందుకు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం, పాలనను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఇందుకు నిదర్శమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మండిపడ్డారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తద్వారా మహిళల్ని చంద్రబాబు కించపర్చారని ఆయన ఆక్షేపించారు. మీడియా సమావేశంలో బొత్స ఇంకేమన్నారంటే..ప్రశ్నించిన వారిపై కూటమి సర్కార్ కక్షసాధింపులుఅసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపులకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లాకప్ డెత్ లు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో జనం నరకం అనుభవిస్తున్నారు. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. యూరియా దొరకని పరిస్ధితులు ఉన్నాయి.ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వ్యక్తుల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, అసలు హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారు. జరిగిపోయిన వాటికే మళ్లీ మళ్లీ శంకు స్థాపనలు, భూమిపూజలు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యల్ని మాత్రం గాలికొదిలేశారు. రెండేళ్ల పాలన దాటిపోయింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేశామని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా ? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో శంఖుస్ధాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మళ్లీ భూమిపూజలు చేస్తున్నారు.రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారుఎంతసేపూ వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకం అమలు చేయలేదు. ఈ డబ్బంతా ఎటు పోయిందో తెలియదు. మహిళల్ని బస్సులు ఎక్కించారు కానీ సున్నా వడ్డీలు మాత్రం ఎగ్గొట్టారు. ఆ బస్సులు సైతం స్ధానికంగా తిరగడానికి మాత్రమే, దూర ప్రాంతాలకు కాదు. కేంద్ర విద్యా మంత్రి స్కూళ్లకు వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి ప్రశంసించారంటే కారణం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే.కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా స్కూల్ కిట్లే ఇవ్వలేదు. అమరావతిలో అవినీతి జరుగుతోంది, మావిగనే మా విధానం అని మా నాయకుడు వైఎస్ జగన్ చెప్పారు. అది నిజం. రాజధాని అంటే హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఎన్ని లక్షల చదరపు మీటర్లో ఉందో చూడండి. అంత పెద్ద రాజధాని. అమరావతి మాత్రం గీత గీసుకుని కూర్చున్నట్లుంది. అందుకే మావిగన్ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు.మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించే తీరిక లేదా?గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందంటే మేం అంతా సంతోష పడ్డాం. కానీ ఇప్పుడు ఆమె రాష్ట్రానికి వస్తే స్వాగతం చెప్పకపోవడానికి ముఖ్యమంత్రి వెళ్లకపోవడం మహిళల్ని కించపర్చడం కాదా? రాష్ట్రపతిని స్వాగతించి వెళ్లిపోవచ్చు కదా. గవర్నర్, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం కచ్చితంగా వెళ్లాలి. ఆరోగ్యం బాగోలేకపోతే అది వేరు. కానీ రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు వెళ్లలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడి ఉపముఖ్యమంత్రి మీటింగ్లో ఉన్నారు.రాజ్యాంగ పదవిలో ఉన్న వారు వచ్చినప్పుడు గౌరవించాలన్న మర్యాద కూడా లేదు. వీళ్లు రాష్ట్రం గురించి, న్యాయం, ధర్మం గురించి, గౌరవాల గురించి బాధపడిపోతూ ఉంటారు. పాలన గాలికొదిలేసి ఎంతసేపూ కక్షసాధింపులకు దిగుతున్నారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోవాలి కానీ భావప్రకటన స్వేచ్ఛనే కాలరాస్తామంటే ఎలా ? అవే మాటలు మనం మాట్లాడితే ఒప్పు, ఇతరులు మాట్లాడితే తప్పంటే ఎలా ? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి? గవర్నర్ పదవే ఆయనకు చివరిది. రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవం ఎందుకు తగ్గించుకుంటున్నారు? చంద్రబాబు విశాఖలో సింగపూర్ టౌన్ షిప్ను అక్కడి మీ పార్ట్నర్స్తో కడతారా లేక అక్కడి ప్రభుత్వంతో కడతారా చెప్పాలి. గతంలో అమరావతిలో సింగపూర్ సహకారంతో ఏదో చేస్తానన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రభుత్వాన్ని అడిగితే మాకూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు సింగపూర్ టౌన్ షిప్ ఎవరి సహకారంతో చేపడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నమోదు 36 శాతం దాటలేదు కాబట్టి, గడువు మరో నెల పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. -
చంద్రబాబు తీరుపై RS ప్రవీణ్ కుమార్ రియాక్షన్
-
నా భూమిని టీడీపీ నేతలు ఆక్రమిస్తున్నారు
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పరిధిలోని తన 2.38 ఎకరాల భూమిపై టీడీపీ మండల నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జవాన్ భాష్యం మహేష్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. దేశానికి సేవలు అందిస్తున్నానని, తన ఆస్తినే కాజేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా పేరు భాష్యం మహేష్. మాది మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం. నేను సైనికుడిగా జమ్ము–కశ్మీర్లో సేవలు అందిస్తున్నా. నాకు తమ్మడపల్లెలో 2.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిని టీడీపీ నాయకులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కంచర్ల శివ, ఆయన అనుచరులు కలిసి నా భూమిని ఆక్రమించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్కు నేను విన్నవించేది ఒక్కటే... దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకుని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా కాపాడండి.. జై హింద్’ అని జవాన్ మహేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. -
టీడీపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది.. బాబు, లోకేష్ లు ప్రజలను మోసం చేస్తున్నారు
-
మీపై కేసు ఎందుకు పెట్టకూడదు?
ఆదోని: తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హొళగుంద ఎస్హెచ్ఓ, ఎస్ఐ దిలీప్కుమార్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సదరు ఎస్ఐపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆయనతోపాటు ప్రతివాదులైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, కానిస్టేబుల్ అనిల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ గిరిమల్ల దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రకారం.. హొళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన దళిత గిరిమల్ల కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. గత మే 20న గ్రామంలోని చెరువు కట్ట వద్ద మట్టిని తవ్వుకుంటూ ట్రాక్టర్లో నింపుకుంటున్నాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన పింజారి అల్లావలి అకారణంగా గిరిమల్లను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ మట్టిని ఎలా తవ్వుతావని గట్టిగా అరుస్తూ, గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. తల మీద తగలాల్సిన గొడ్డలికి గిరిమల్ల చెయ్యి అడ్డు పెట్టడంతో అతనికి రక్తగాయమైంది. అధికార పార్టీ వర్గీయులను ప్రశ్నించినందుకే.. గ్రామంలో సచివాలయం పక్కన అధికార పార్టీ అనుచరుడు పీర్సాబ్ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ విషయంలో గ్రామస్తులతో కలిసి గిరిమల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. న్యాయపోరాటం చేస్తూ వచ్చాడు. ఆ నిర్మాణాలను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ ప్రోద్బలంతో పింజారి అల్లావలి దాడికి పాల్పడటంతో వారందరిపై గిరిమల్ల హొళగుంద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దళితుడినైన తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. అయితే ఎస్ఐ దిలీప్కుమార్ గిరిమల్లను బెదిరించి అనిల్ అనే కానిస్టేబుల్ చేత ఫిర్యాదును తిరగరాయించారు. ఆ ఫిర్యాదులో పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ పేర్లు లేకుండా కేవలం పింజారి అల్లావలి పేరు మాత్రమే ఉండేలా చేశారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పైగా ఈ ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర ఆలస్యం అయ్యింది. ఆ దీంతో న్యాయం కోసం బాధితుడు గిరిమల్ల సీనియర్ అడ్వకేట్ డాక్టర్ బి.పురుషోత్తమ రెడ్డి ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఫిర్యాదులో పేర్లు లేకుండా చేసుకున్న వాళ్లంతా టీడీపీ వర్గీయులు కావడంతో పెద్దల ఒత్తిడితో ఎస్ఐ ఫిర్యాదు నుంచి వారి పేర్లను తీసివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రిటైర్డ్ జడ్జిపైన చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే పులివర్తి నాని బూతుల పంచాంగం
-
రిటైర్డ్ జడ్జిని చంపడానికి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల రెక్కీ
-
హోంమంత్రి అనిత శాఖలో పవన్ కల్యాణ్ జోక్యం
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అవినీతి, స్కామ్లకు చంద్రబాబు బ్లూప్రింట్ తయారుచేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్రానికి గుదిబండ.. స్కామ్లు చేయడానికే అమరావతి పెట్టారు. అమరావతిలో పెట్టే నిధుల్లో 10 శాతం మావిగన్లో పెట్టినా ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు.మావిగన్పై వైఎస్ జగన్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని అన్న చంద్రబాబు ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. రాజధానికి ప్రభుత్వ భూమి ఉంటే మంచిదని వైఎస్ జగన్ అన్నారు. అమరావతి నేల రాజధానికి పనికిరాదని గతంలో చాలా మంది చెప్పారు. అమరావతి నేల కుంగిపోతుంది.. ఇది ప్రమాదకరం. అమరావతి పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడైనా సమాధానం ఇస్తున్నారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘మావిగన్లో తక్షణ అభివృద్ధికి అవకాశం ఉంది. అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్రం మోయలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో లే అవుట్లు కూడా అభివృద్ధి చేయడం లేదు. లే అవుట్లు అభివృద్ధి చేయలేకపోతే రైతుల పరిస్థితి ఏంటీ?. అమరావతి కోసం అప్పు తెచ్చిన రూ.47 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు, మచిలీపట్నం పోర్టు, హంద్రీనీవా కాలువ పూర్తి చేయొచ్చు. పాఠశాలలు దేవాలయాలు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయి?. ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్లో ఎవరుంటున్నారు?. చదరపు అడుగుకు రూ. 20 వేల ఖర్చు ఏంటీ? ఎక్కడైనా ఉందా?. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు.. భయపెడుతున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతికి, మావిగన్కు మధ్య తేడా ఇదే..‘‘మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అమరావతికి, మావిగన్కు మధ్య తేడా ఏంటో వైఎస్ జగన్ పలుమార్లు చెప్పారు. దాని గురించే మరోసారి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి అసాధ్యమైనదని, దాంట్లో 10 శాతంతో మావిగన్ అవుతుందని చెప్పారు. మావిగన్ ఆలోచనతో చంద్రబాబుకు పడరానిచోట దెబ్బ పడుతోంది. మావిగన్ అనగానే.. గుంటూరు, విజయవాడ కూడా మావిగన్లో భాగమేనని చంద్రబాబు అంటున్నారు. అమరావతికోసం చంద్రబాబు పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయా?. కానీ మావిగన్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయి. ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుంది’’ అని సజ్జల వివరించారు.మరి మాటలు మార్చింది ఎవరు?‘‘ప్రభుత్వ భూమి అయితే రాజధానికి బెటర్ అని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ అందుబాటులో రాజధాని ఉంటుందని ఆరోజు అన్నారు. అమరావతిలో అవినీతి, దోపిడీ, ఆర్థిక భారం.. ఈ అంశాలన్నీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల డబ్బును వృథా చేయొద్దన్నందుకు వైఎస్ జగన్పై పడుతున్నారు. మాట మార్చింది వైఎస్ జగన్ కాదు.. కూటమి నాయకులే. మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికీ చోటు ఉంది. అమరావతి ప్రాధాన్యతను తగ్గించలేదు. లెజిస్లేచర్ క్యాపిటల్గా ఆ ప్రతిపాదనలో చోటు ఉంది. పైగా రైతులకు మేలు చేసింది వైఎస్ జగనే. ..వైజాగ్ను గ్రోత్ ఇంజిన్గా మార్చాలనుకున్నారు. మరి కంపెనీలు వైజాగ్నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాయి?. రాజధాని విషయంలో స్థిరత్వం లేనిది చంద్రబాబుకే. కేవలం అవినీతి కోసమే అమరావతిని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతి అవినీతికి బ్లూ ప్రింట్. ఇది రాష్ట్రానికి తీరని నష్టం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఖర్చులు బాధ్యతారాహిత్యం. రాష్ట్రం పట్ల స్పృహలేని వారు మాత్రమే ఇలా చేస్తారు. చంద్రబాబు రాత్రికి రాత్రే మాటలు మారుస్తున్నారు. చంద్రబాబు గతంలో టెంపరరీ రాజధాని అన్నారు, ఇప్పుడు మున్సిపాల్టీ అంటున్నారు. అమరావతి మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు. స్వయంగా కామెంట్ చేశారు. ..అమరావతి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదని గతంలో అన్న పవన్కళ్యాణ్. భూములు ఇవ్వకపోతే లాక్కోవద్దని గతంలో అన్న పవన్కళ్యాణ్. కర్నూలు రాజధాని అంటూ గతంలో ప్రకటన చేసిన పవన్కళ్యాణ్. రాజధాని అరిగిపోయిన రికార్డంటూ కామెంట్ చేసిన సోము వీర్రాజు. వైజాగ్ను అభివృద్ధి చేయాలన్న సోము వీర్రాజు. అన్ని సదుపాయాలూ వైజాగ్లో ఉన్నాయంటూ గతంలో కామెంట్ చేసిన సోము వీర్రాజు. రూ.1500 కోట్లు ఇస్తే కారిపోయిన బిల్డింగులు కట్టారన్న సోము వీర్రాజు. అమరావతి ఉత్తుత్తి అమరావతిగా మిగిలిపోనుందా అంటూ మాట్లాడిన జీవీఎల్. వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలన్న జీవీఎల్. గ్రాఫిక్స్, బొమ్మలకే అమరావతిని పరిమితం చేశారన్న పురందేశ్వరి. కూటమి నాయకులు అన్న మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్లే చేసి చూపించారు.అమరావతి ఖర్చులు, అప్పులు, ప్రజలపై భారం‘‘అమరావతిలో వర్టికల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. భూమి ఉన్నప్పుడు వర్టికల్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు?. రూపాయి అయ్యే చోట వంద రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?. ఆ డిజైన్లకు ఎంత డబ్బు పెట్టినా అవుతుందా?. ఏ పనీ చేయకపోయినా రూ.47 వేల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.60 వేల కోట్ల పనులు అప్పగించేశారు. ఈ రూ.47 వేల కోట్లతో పోర్టులు, రాయలసీమ లిఫ్ట్, మెడికల్ కాలేజీలు, వెలిగొండ నిర్వాసితుల సమస్య, పోలవరం నిర్వాసితుల సమస్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్.. ఇవన్నీ కూడా పూర్తి చేయవచ్చు...చంద్రబాబుకు ఏది ప్రాధాన్యతో తెలియని పరిస్థితి ఉంది. లక్ష కోట్లకు ఏటా రూ.8 వేల కోట్ల వడ్డీ కట్టాలి. రెండేళ్లలో చంద్రబాబు రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.10 వేల కోట్లతో రాజధాని పూర్తి చేస్తే ఎవరు అడుగుతారు?. కానీ ప్రజల సొమ్మును ఇష్టానుసారం పోస్తున్నారు. హెరిటేజ్ అమ్మి కడుతుంటే ఎవ్వరూ అడగరు. వేల, లక్షల కోట్లు పెట్టి ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు కట్టారా?. బర్మా మిలటరీ నియంతలు కట్టిన నేపిడా కూడా ఘోస్ట్సిటీగా మారిపోయింది...అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అవుతుందో చంద్రబాబు చెప్పగలరా?. అమరావతిలో ప్రభుత్వ భవనాల నుంచి ఆదాయం వస్తుందా?. ప్రజలకు పెద్ద భ్రమలను కల్పించే మెకానిజం చంద్రబాబుకు ఉంది. విజయవాడలో ఎయిర్పోర్ట్ పనులను ఎందుకు ముందుకు జరగనీయడంలేదు?. మచిలీపట్నం పోర్టును ఎందుకు పూర్తి చేయడంలేదు?. ఇవన్నీ వదిలేసి, డబ్బంతా అమరావతికి డైవర్ట్ చేస్తున్నారు. భారం అంతా ప్రజలమీద వేస్తున్నారు, ఆదాయాలన్నీ ప్రైవేటు వారికి ఇస్తున్నారు...రైతుల ప్రయోజనాలను కూడా చంద్రబాబు కాపాడ్డంలేదు. ఇప్పటివరకూ రోడ్లు కూడా వేయడంలేదు. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే వెళ్లగొట్టారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని కచ్చితంగా ప్రశ్నిస్తాం. రైతుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తాం. కలిసి వచ్చేవాళ్లందరినీ కలుపుకుంటాం. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అమరావతిలో విపరీతంగా దోచుకుంటున్నారు. మట్టి మాఫియా చేస్తున్నారు, కొండలను కరిగించేస్తున్నారు. ఇలాంటి దోపిడీ చేస్తున్నవారే మొన్న వైఎస్సార్సీపీ బృందాన్ని అడ్డుకున్నారు. అమరావతి గురించి ప్రస్తావించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రశ్నిస్తే, దాడులు చేస్తున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నలు వేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు...రాష్ట్రంలో ప్రజల వాయిస్ను మేం వినిపిస్తున్నాం. ఆ హక్కును చంద్రబాబుగారు ఎలా కాదంటారు?. చంద్రబాబును ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండాలి. ప్రజా సంబంధిత అంశాలనే మేం ప్రస్తావిస్తున్నాం. మావిగన్ మా పార్టీకి నష్టం చేస్తుందనే అనేవాళ్లు కూడా ఉన్నారు. మేం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడడం లేదు. రాష్ట్రానికి నష్టం తెచ్చే అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తాం. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు ఏ కామెంట్ చేసినా వాటికే తగులుతాయి. వీళ్లు పెద్ద ఫేక్ సైన్యాన్ని నడుపుతున్నారు. అసభ్యంగా మాట్లాడ్డంలో వారి తర్వాతే. “కొడకల్లారా..” అంటూ గతంలో తిట్టారు. వారి మాటలను వారే వీడియోల ద్వారా చూడొచ్చు. చంద్రబాబు కూటమి నాయకుల దుర్మార్గాలు మితిమీరుతున్నాయి...కడప స్టీల్ప్లాంట్కు 2023లో వైయస్.జగన్ శంకుస్థాపన చేశారు. మేం వేసిన రోడ్లమీదనే వాళ్లు ఇవాళ ప్రయాణించారు. స్టీల్ప్లాంట్కు అవసరమైన ఇన్ఫ్రా పనులు వేగంగా నడిచాయి. అమరావతి పనులకంటే వేగంగా అక్కడ జరిగాయి. వాటిని ఒప్పుకునే నైతికత చంద్రబాబుకు లేదు. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వారు లేరు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కూడా తానే మొదలుపెట్టానంటాడు. జత్వానే కేసును అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ కేసును అడ్డుపెట్టుకుని ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కక్షసాధిస్తున్నారు. వైఎస్ జగన్ పాలన కొనసాగి ఉంటే దాదాపు స్టీల్ప్లాంట్ నిర్మాణం ఇవ్వాళ్టికి కొలిక్కి వచ్చేది. గతంలో బ్రహ్మణి స్టీల్ప్లాంట్ను అడ్డుకున్నాడు. రాయలసీమలో స్టీల్ప్లాంట్ రావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. రాయలసీమకే కాదు, చంద్రగిరి, కుప్పంకూ మంచి జరగడం ఆయనకు ఇష్టంలేదు. రాయలసీమ లిఫ్ట్ను ఆపేసి, ఇవాళ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. దోపిడీ కోసమే అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
జంగిల్ రాజ్తో డిఫెన్స్లో చంద్రబాబు!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిలలాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా! అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం..హే రామ్.. సేవ్ ఆంధ్ర! రాష్ట్రంలో జంగిల్ పాలన, 18 నెలల సీసీ టీవీ పుటేజి తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో! జీవించి ఉంటే ఎన్టీఆర్పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో!, రాజకీయ స్వార్ధంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి? మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్కు కట్టుబడి ఉంటాం.. ఎన్నికల మానిఫెస్టోలో పెడతాం! బాబు పాలన అంటే మోసం గ్యారంటీ!... ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో, ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు.హే రామ్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్న మాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, సీసీ టీవీ ఫుటేజీ గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డిటైల్డ్గా ప్రస్తావించారు.చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఆదారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి, దహనం చేసి, బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని ఆయన అన్నారు. తాను వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరే బాధ్యుడైన సర్కిల్ ఇన్ స్పెక్టర్పై చర్య తీసుకోవడం ఆరంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 18 నెలల సీసీ టీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో, డీజీపీ ఆఫీస్లో బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు.పోలీస్ కమిషనర్ను రక్షించడానికి డీజీపీ, ఈయనను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ, కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్టేషన్ వస్తుందని అని అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా! ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవి ఫుటేజీ మాయం, రౌడీషీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా? అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే యత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్కు తగునా అన్న ప్రశ్న వస్తుంది.జగన్ను తాను అనుకుంటే ఒక్క నిమిషంలో అరెస్టు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం అర్దవంతంగా లేదని చెప్పాలి. ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలువరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం వారితో గొడవజరుగుతున్న తీరును జగన్ వివరించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు లేదు.అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం వేదిస్తున్న తీరుపై జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయిజం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాదితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి రూ.20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా? అని ఆయన అడిగారు. అమరావతికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజ్గా మారిందని ఆయన అన్నారు.ఎన్టీ.రామారావు బతికి ఉంటే, గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవ చేశారు. నిజంగానే ఈ రెండేళ్లలో విపక్ష వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన, ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చిందన్న విమర్శలు జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓట్లు కోల్పోతే పేదలకు స్కీముల పరిస్థితి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు.అమరావతి విషయంలో జగన్ విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్గా ఉన్న మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, అదంతా అవినీతి అవుతుందా? అవ్వదా అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారు.నాడు మూడు ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావవిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే ఆయన అన్నారు. అమరావతికి, మావిగన్కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చెప్పలేకపోతున్నారు. తొలుత ఏభై వేల ఎకరాలు సేకరించడం, మళ్లీ మరో ఏభై వేల ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి సిద్దం అవడం, ఇప్పటికే సుమారు ఏభైవేల కోట్ల అప్పు చేయడం, ఇతర హామీలను అమలు చేయకపోవడం వంటివాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్.. సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేతా.. ఇదేం రోత..?
శ్రీకాకుళం: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎక్కడైనా తప్పు జరిగితే సరిదిద్దాల్సిన వ్యక్తి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరిష్కరించాల్సిన నాయకుడు. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేనే చిన్న పిల్లల ఆస్పత్రి పక్కన రాత్రిపూట బర్త్ డే పార్టీ అంటూ నానా హంగామా చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారు కంగారు పడిపోయేంత శబ్దాలు చేస్తూ దగ్గరుండి నృత్యాలు నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పాతపట్నంలో బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుట్టిన రోజు వేడుకలు పట్టణం మధ్యలో ఉన్న ఎరుకోల కాంప్లెక్స్లో జరిగాయి. చిన్నపిల్లల ఆస్పత్రి, పాఠశాలలు వంటివి ఉన్న ప్రదేశంలో రాత్రి సమయం అని కూడా చూడకుండా పెద్ద సౌండ్ సిస్టంతో బర్త్డే పార్టీ చేయడంతో రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ పేరుతో సున్నితమైన ప్రాంతాల్లో డాన్స్లు పెట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. ఇబ్బంది పెట్టడం దారుణం ప్రశాంత వాతవరణంలో ఉండే పాతపట్నంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ఈవెంట్ల పేరుతో నృత్యాలు చేయడం దారుణం. ఈవెంట్ పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉన్నప్పటికి ఈవెంట్లకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడం విడ్డురుంగా ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి నృత్యాలు చేయించడం దారుణం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పాతపట్నం -
TDP గూండాల కు లోకేష్ సపోర్ట్.. పవన్ చెప్పిందే నిజమైంది!
-
టీడీపీ పైశాచికానికి అబల బలి
పచ్చరూప రాక్షసుల పైశాచికానికి మరో అబల బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే.. మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపిన కిరాతకుల దౌష్ట్యానికి నిండుప్రాణం వదిలింది. సీఎం సహాయనిధినీ దక్కకుండా సైంధవుల్లా అడ్డుపడి చనిపోయే వరకు సూటిపోటి మాటలతో రాబందుల్లా పొడిచిపొడిచి బాధించిన దుష్టకూటమి పాలనలో వైద్యం అందక ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైన ఆ మానవతి గురువారం తనువు చాలించింది. సభ్యసమాజాన్ని కలచివేసేఈ హృదయవిదారక ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. కళ్యాణదుర్గం: టీడీపీ మూకల పైశాచికానికి మరో అబల బలైంది. ఏడాదిన్నరపాటు మృత్యువుతో పోరాడి ఆమె కన్నుమూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసముంటున్న చంద్రకళ, చిన్నా దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్ను పడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది.దీంతో రెచ్చి పోయిన రామాంజినేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిన్నర క్రితం చంద్రకళపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమానభారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెకు అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వైద్య ఖర్చులకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఆస్పత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య.. మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి చంద్రకళ పరిస్థితిని తీసుకెళ్లి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. చంద్రకళ (ఫైల్) , పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తూతూ మంత్రంగా కేసు టీడీపీ నేత కుటుంబ సభ్యులు చంద్రకళపై దాడికి పాల్పడినప్పుడు పట్టించుకోని పోలీసులు ఆమె యాసిడ్ తాగి బలవన్మరణానికి యత్నించిన తర్వాత కేసు నమోదు చేసి గంటలోపే స్టేషన్ బెయిలిచ్చి నిందితులను వదిలేశారు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ చంద్రకళ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులపై అప్పట్లో టీడీపీ నేతల ఒత్తిళ్లతో తూతూ మంత్రంగా కేసులు కట్టి తమ బిడ్డ చావుకు కారణమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిల్లలకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.సీఎం సహాయ నిధికీ మోకాలడ్డుచంద్రకళను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వద్దకు బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే.. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే నెపంతో ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చి నప్పుడు దరఖాస్తు చేసుకోండంటూ..’ హేళన చేశారు. సాయం అందకుండా మోకాలడ్డారు. అంతటితో ఆగకుండా తమపై పెట్టిన కేసు రాజీ చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డారు. తీవ్ర ఒత్తిడి చేశారు. మీరే దాడి చేశారంటూ అక్రమ కేసులు బనాయిస్తామని నిత్యం భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వేధింపులకు కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను చూడలేక మంచంలోనే చంద్రకళ నరకం అనుభవించింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ప్రాణం విడిచింది.మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు మా బిడ్డను అన్యాయంగా టీడీపీ వారే పొట్టున పెట్టుకున్నారు. టీడీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. నా కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలి. – బయన్న, మృతురాలి తండ్రి పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి. ఎమ్మెల్యేలకు, మంత్రులకు బందోబస్తు వెళ్లడానికి కేటాయిస్తున్న సమయం ప్రజలను రక్షించేందుకు వినియోగించాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలకు గొల్ల మమత, బోయ శ్రావణి, వడ్డే చంద్రకళలాంటి ఎంతో మంది అబలలు తనువు చాలించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి లేదు. పట్టపగలే ఓ వృద్ధురాలిని చంపితే ఇప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చంద్రకళ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటాం. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం -
ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కల్యాణ్కు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి కూటమిలో విభేదాలు ముదిరాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్ను ప్రోత్సహిస్తున్నారంటూ మనోహర్ ఫిర్యాదు చేశారు.కాగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
మంత్రి సుభాష్కు టీడీపీ కార్యకర్తల షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి సుభాష్కు టీడీపీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో అవనిగడ్డ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై మంత్రి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రెండేళ్లుగా గ్రామాల్లో ఒక్క పని కూడా జరగడం లేదన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలంటూ మంత్రిని నిలదీశారు. త్వరలోనే అవనిగడ్డకు ఇంఛార్జ్ని నియమిస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. మంత్రి ప్రసంగానికి టీడీపీ సీనియర్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై టీడీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేశారు.ఎమ్మెల్యే తీరును మంత్రి సుభాష్ సమక్షంలో టీడీపీ కార్యకర్తలు ఎండగట్టారు. టీడీపీ నియమించిన ఇంఛార్జ్ తనకు నచ్చలేదని ఎమ్మెల్యే చెబితే మీరేం చేస్తారంటూ కార్యకర్త ప్రశ్నించారు. తనను ప్రశ్నించిన కార్యకర్తపై మంత్రి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. తాను చెప్పేది మీకు అర్థం కావడం లేదని కార్యకర్తపై మంత్రి మండిపడ్డారు. తాము ఏం చెప్పినా మీకు అర్థం కాదు... తాము చెప్పినా మీరు వినరు అంటూ మంత్రి తీరుపై టీడీపీ కార్యకర్త అసహనం వ్యక్తం చేశారు. -
పోలీసు సైరన్తో మంతి ఆనం అనుచరుడి హల్చల్
నెల్లూరు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లోని ఓ గ్రామానికి మాజీ సర్పంచ్ అయిన వ్యక్తి.. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుమసముద్రంపేట మండలం శ్రీకొలనులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కారులో బుధవారం వచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, పోలీస్ శాఖ తరహాలో తన వాహనానికి సైరన్ వేసి ఉండటమే వివాదాస్పదమైంది. వాస్తవానికి రవాణా శాఖ నిబంధనల మేరకు ప్రైవేట్ వాహనాలకు సైరన్లు ఉండకూడదు. అయితే సదరు నేత దీన్ని ఉల్లంఘించి తన వాహనంలో ఆ శబ్దంతో రావడాన్ని చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ఇలా ప్రైవేట్ వాహనానికి పోలీస్ సైరన్ ఏమిటని కొందరు ప్రశ్నించగా, తాను వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడే అది ఉందని ఆయన సెలవివ్వడం గమనార్హం. ఆపై సదరు నేత ద్వారా కొందరికి పింఛన్లను మంత్రి ఆనం పంపిణీ చేయించడం విశేషం. -
మంత్రికి భయం ఎందుకో?
సాలూరు రూరల్: సాటి గిరిజన మహిళ అని కూడా చూడకుండా ప్రతిపక్ష పార్టీ ముద్రవేసి ఉద్యోగంలో నుంచి తీసివేయించినా మంత్రి సంధ్యారాణికి మంట చల్లారలేదా? అంటే అవుననే సమాధానం గిరిజనం నుంచి వినిపిస్తోంది. బాధిత మహిళ తనను ఎక్కడ నిలదీ స్తుందోనన్న భయంతో పోలీసుల సాయంతో ఆమెను గృహ నిర్బంధం చేయించడం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని అన్నంరాజువలస పంచా యతీ చెరుకుపల్లి గ్రామంలో నివాసముంటున్న గాదిపల్లి ప్రశాంతి ఇంటిని బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముట్టారు. అంతేకాకుండా ఆమెను మీరు ఇంట్లోనే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ఈ విషయమై అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? ఏంజరుగుతుందో తెలియని ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నంరాజువలస గ్రామంలో గిరిజన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి బుధవారం హాజరయ్యారు. అయితే సమావేశంలో మంత్రిని ఎక్కడ ప్రశాంతి ప్రశ్నిస్తుందోననే అనుమానంతో ముందస్తుగా పోలీసులతో గృహ నిర్బంధం చేశారని స్పష్టమవుతోంది. దీనికి కారణం గతంలో కేజీబీవీలో ప్రిన్సిపాల్గా పనిచేసిన ప్రశాంతిని కనీసం పీటీజీ మహిళ అని చూడకుండా మంత్రి సంధ్యారాణి ఉద్యోగంలోంచి తీసేయించారు. కారణం చిన్నదే అయినా కేవలం ఆమెకు గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సూచన మేరకు వచ్చిన ఉద్యోగం అన్న అక్కసుతో పూర్తిగా విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె మంత్రి, అ«ధికారుల చుట్టూ తిరిగినా కనికరించలేదు. దీంతో విసిగిపోయిన ఆమె ప్రస్తుతం పోటీ పరీక్షలకు చదువుకుంటోంది. ఇలాంటి సమయంలో అసలు గతం మరిచిపోయి తన పని తాను చేసుకుంటున్న ఆమెను అకస్మాత్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేసి మానసిక వేదనకు గురిచేశారని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఊరంతా వైఎస్సార్సీపీ అభిమానులే అన్నం రాజువలస పంచాయతీ ప్రజలంతా వైఎస్సార్సీపీ అభిమానులే. నేను ఎంత చేసినా నాకు ఓటు వేయరని మంత్రి సంధ్యారాణి అన్నా రు. బుధవారం అన్నం రాజువలస గ్రామంలో గిరి జన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నంరాజువల గ్రామస్తులు పూర్తిగా వైఎస్సార్సీపీకి చెందిన వారన్నారు. రాజన్నదొర ఈ గ్రామానికి ఏంచేశారో చెప్పాలన్నారు. మీకు అన్ని విధాలా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మానసికంగా కుంగిపోయానునేను ఎంఏ బీఈడీ చదివాను. 2019లో కేజీబీవీ ప్రిన్సిపాల్గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో గజపతినగరంలో చేరాను. 2022వ సంవత్సరంలో కరాసువలస కేజీబీవీకి బదిలీపై వచ్చాను. 2025 ఏప్రిల్ 9న మంత్రి సంధ్యారాణి పాఠశాల పరిశీలనకు వచ్చినప్పుడు పిల్లలకు వండిన వంటలు మెనూ ప్రకారం లేవని తనతో పాటు నలుగురు వంట ఆయాలను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పలుమార్లు మంత్రి సంధ్యారాణి వద్దకు వెళ్లి ఉద్యోగం తిరిగి ఇప్పించండని వేడుకున్నాం. మీరు వైఎస్సార్సీపీకి చెందిన వారని, ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సెల్లో పలుమార్లు ఆర్జీ పెట్టాను అయినా అధికారులు స్పందించలేదు. కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగ బాధ్యతలో పడి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా పోలీసులు అకస్మాత్తుగా వచ్చి ఇంటి ముందు కుర్చీ లు వేసుకుని కూర్చోవడంతో కొంత సమయం అర్థం కాలేదు. చివర కు మంత్రి సంధ్యారాణి నా ఉద్యో గం తీసేసిన విషయంలో ఎక్కడ నిలదీస్తానో అనే భయంతో పోలీసులను కాపలా ఉంచారని అర్థమైంది. సాటి గిరిజన మహిళ అని చూడకుండా నాపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సంధ్యారాణి ఇంకా నన్ను వెంటాడుతుంటే భయమేస్తోంది. – గాదిపల్లి ప్రశాంతి చెరుకుపల్లి గ్రామం అన్నంరాజువలస పంచాయతీ -
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్ఫుల్గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిన్ను గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్న పాపం పోదూ..
-
మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి
అనంతపురం జిల్లా: ‘శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణిని గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా పాపం పోదు’ అంటూ అనంతపురం జిల్లా కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుతో ఆయన తలపైన కొట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో బుధవారం వైరల్ అయింది. ‘ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఉదయం నన్ను అదుపులోకి తీసుకున్నారు. నా సమస్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుకు విన్నవించగా.. మీ ఎమ్మెల్యేకు చెబుతాను.. మాట్లాడమన్నారు. అయితే అది సాధ్యమే కావడంలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. స్వార్థపరురాలైన ఎమ్మెల్యే, అవినీతిపరులైన వారి అమ్మ బండారు లీలావతి స్వలాభం కోసం నియోజకవర్గంలో సొంత పార్టీ వారినే వేధిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వమని కోరారు. అయితే వేరొకరికి ఈ పోస్ట్ ఇవ్వడంతో తరచూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. -
సింహాచలం కొండపై అపచారం
సాక్షి, విశాఖపట్నం: సింహచలం కొండపై అపచారం జరిగింది. కొండపై టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేసింది. సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఆలయ, ఆగమ సంప్రదాయాలు పాటించకుండా కేక్ కటింగ్ చేయడంపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
NTR బతికుంటే ఆయన్ని కూడా.. బాబు ఎలాంటి వాడో జగన్ మాటల్లో
-
సాయికృష్ణ కేసులో నీకెందుకంత ఆసక్తి? డీజీపీని ఎందుకు కాపాడుతున్నావ్? గుట్టు విప్పిన జగన్!
-
సమాధానం చెప్పడం చేతకానప్పుడు ఛాలెంజ్ లు ఎందుకు?
-
లైవ్ లో ఫోటోలు.. వీడియోలు చూపిస్తూ జగన్ ఫైర్
-
540 మంది చనిపోతే చలించని బాబు రెండు కాడెద్దులు చనిపోతే మాత్రం... జగన్ సెటైర్లు నవ్వులే నవ్వులు
-
అమరావతి రైతులు కాదు. టీడీపీ గూండాలు ఇవిగో సాక్ష్యాలు
-
చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్ కన్నా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఏకమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వాటిని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.’ అని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో ‘కూటమి పాలనలో శాంతిభద్రతలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని కూటమి నేతల అరాచకాలు, దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు పెట్టి ప్రజలకు వివరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే అరాచకాలు రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్, రిటైర్డ్ ఏఎస్పీ జల్లా రాజేశ్వరరెడ్డి, సామాజిక ఉద్యమకారిణి వసుంధర, న్యాయవాదులు కేవీఎం రజిని, ఒగ్గు గవాస్కర్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్రెడ్డి, అధికార ప్రతినిధులు రవికుమార్, బండి పుణ్యశీల తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. కసబ్ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్ను కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి ట్రయల్ నిర్వహించి శిక్ష వేశారు. కానీ, విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి దహనం చేశారు. మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానని స్పష్టంగా సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి సాయికృష్ణ లాకప్డెత్, పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలి. టీడీపీ, జనసేన నేతలు ఎన్ని దారుణాలు చేసినా కేసులు పెట్టరా? లాయర్ శ్రీనివాస్ ఇంటిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే బాధితుడైన శ్రీనివాస్ పైనే పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. అమరావతిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడినా, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ దళిత ప్రిన్సిపాల్ను వేధిస్తే ఈ రోజుకీ కేసు నమోదు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదు. డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసినా కేసు లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీకి కొమ్ముకాసే కీలు»ొమ్మలుగా మారిపోయారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ బతికి ఉంది కాబట్టే దేశంలో సామాన్యుల మనుగడ సాధ్యమవుతోంది.ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారుఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఆందోళన తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ (అమరావతి) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లాకు చెందిన ఏపీ జేఏసీలోని వివిధ శాఖల సంఘాల నాయకులు, ఉద్యోగులతో మంగళవారం జరిగిన సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నేటికీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా నియమించాల్సిన పీఆర్సీ కమిషన్ను నియమించలేదని చెప్పారు. అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకూ ఒకసారి పెరగాల్సిన డీఏలు గత రెండేళ్లుగా పెంచలేదని, అసలు ఆ ప్రకటనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలపైనా ప్రభుత్వం ఎలాంటి చర్చలూ చేయడం లేదని విమర్శించారు. ఉద్యమానికి సిద్ధం: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు దశలవారీ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమాలకు జేఏసీ సమావేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల పదో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జేఏసీ జిల్లా నాయకత్వాలు ఆర్డీవోలకు, ఎమ్మెల్యేలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం సూచించింది. ఈ నెల 12న శ్రీకాకుళం, 21న అనంతపురం జిల్లాలో సాధారణ ఉద్యోగులను సమాయాత్తం చేసేందుకు ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేస్తున్నామని సమావేశం స్పష్టం చేసింది. త్వరలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సభలు నిర్వహిస్తామని సమావేశం ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సమావేశంలో రాష్ట్ర మహిళా జేఏసీ చైర్పర్సన్ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి, రాష్ట్ర జేఏసీ నాయకుడు వీఎస్ దివాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోకా ప్రకాష్తో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, డివిజన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా డీఏ, ఐఆర్ ఇవ్వలేదని, ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాల్సి ఉన్నా వాటి విషయం చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాకినాడలోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యల సాధనకోసం సాగించే పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. -
సర్పంచ్లుగా టీడీపీ వారిని గెలిపిస్తేనే రోడ్లు వేయిస్తా
మక్కువ (సాలూరు): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అంటూ ఓట్లేయించుకుని, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. రెండేళ్లుగా ఏ అభివృద్ధీ చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి అంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇదే తరహాలో ప్రజలను బెదిరిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మండలంలో పలు పంచాయతీలకు రోడ్లు లేవని, తాను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కొత్తగా వేయిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఒక షరతు పెట్టారు.మండలంలోని 18 పంచాయతీలకు రోడ్లు వేయాలంటే ముందుగా ఆ పంచాయతీలన్నింటిలో తెలుగుదేశం అభ్యర్థులనే గెలిపించాలన్నారు. టీడీపీ సర్పంచులు గెలిస్తేనే రోడ్లు వేయిస్తానని, లేకుంటే వేసేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. ఆమె మాటలు విని ప్రజలు విస్తుపోయారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండాల్సిన సంధ్యారాణి తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడుతూ తమకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి చేస్తామని లేకపోతే ఇబ్బందులు తప్పవని బాహాటంగా ప్రకటించడం ఏమిటని విమర్శిస్తున్నారు. గిరిజన మహిళా మంత్రి అయి ఉండీ తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన సంధ్యారాణి ఇలా ప్రజలకు బెదిరించడమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
-
మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!
-
టీడీపీ నేత అనుచరుడికి జనసేనలో పదవి?
కొల్లూరు: జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీలో టీడీపీ నాయకుడి ముఖ్య అనుచరుడికి పదవి కేటాయించడంపై జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్ ప్రధాన అనుచరుడిగా మెలుగుతున్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం ఇటు జనసేన.. అటు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చానీయంశంగా మారింది. టీడీపీ సభ్యత్వం ఉండి..ఆ పార్టీ పోలింగ్ బూత్ కన్వీనర్గా ఉన్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం వెనుక టీడీపీ మండల కన్వీనర్ సిఫారసే కారణమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ పేరుతో ఓ కొత్త కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో కొల్లూరుకు చెందిన ఈమని మణికంఠకు సాదక్ రిప్రజెంటేటివ్గా పదవి దక్కింది. అయితే గతంలో జనసేన కార్యకర్తగా ఉన్న మణికంఠ కొన్నేళ్లుగా టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆ పార్టీ సభ్యత్వాన్ని సైతం తీసుకున్నాడు. టీడీపీలో అతనిని కొల్లూరు 144వ పోలింగ్ బూత్కు కన్వీనర్గా సైతం ఆ పార్టీ సంస్థాగత పదవి కేటాయించింది. అయితే జనసేన పార్టీ నూతనంగా నియమించిన పార్లమెంట్ స్థాయి కమిటీలో టీడీపీ సభ్యుడైన మణికంఠకు పదవి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది. టీడీపీ కొల్లూరు మండల అధ్యక్షుడి అనుచరుడిగా మెలుగుతున్న మణికంఠకు జనసేనలో పదవి దక్కడం మైనేని చక్రం తిప్పాడనే చర్చ నడుస్తుంది. జనసేనకు మద్దతుగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను మభ్యపెట్టి టీడీపీ నాయకులు తమ వెంట తిప్పుకుంటూ మా పార్టీలో అంతర్గత పోరుకు ప్రోత్సహిస్తున్నారని స్థానిక జనసేన నేతలు వాపోతున్నారు. 2024 నుంచి టీడీపీ సభ్యత్వం పొంది, ఆపార్టీ బూత్ కన్వీనర్గా ఉన్న మణికంఠకు నేడు జనసేనలో పదవి రావడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు. జనసేన నాయకత్వంలో ముసలం పుట్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. -
సమాచారం ఎవరు లీక్ చేశారు..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమాచారం ఎవరు లీక్ చేశారు.. మీ మెయిల్ నుంచే అందరికీ ఫార్వాడ్ అయ్యింది.. ఏలూరు గ్రూపుల్లో వైరల్ అయింది.. మీరు చేశారంటే.. మీరు చేశారంటూ.. అధికార పార్టీ కార్పొరేటర్లను స్టేషన్కు పిలిచి మరీ విచారించడంతో అసలు ఏం లెటర్.. ఏం లీక్ అనే చర్చ ఏలూరులో హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆ లేఖ ఏమిటంటే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్, అతని టీమ్ గడిచిన రెండేళ్లల్లో చేసిన అవినీతి అరాచకాల చిట్టా అంటూ ఒక లేఖ వైరల్గా మారడం, టీడీపీ కార్పొరేటర్లే వైరల్ చేశారనే అనుమానంతో ఇద్దరిని పోలీస్స్టేషన్కు పిలిచి విచారించడంతో వ్యవహారం వైరల్గా మారింది.రెండేళ్ల అవినీతి, అక్రమాలు అంటూ..ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్ బారి నుంచి ఏలూరు ప్రజానీకాన్ని కాపాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టానానికి వినయపూర్వకంగా చేసుకున్న విన్నపమంటూ 21 పేజీల లేఖ నగరంలో కలకలం రేపింది. దాదాపు నెలన్నర క్రితమే లేఖ వ్యవహారం వెలుగులోకి వచ్చినా అప్పుడు వైరల్ కాకుండా కార్పొరేటర్లకు పోలీస్ కౌన్సెలింగ్తో వెలుగులోకి రావడం విశేషం. గత రెండేళ్లలో ఏలూరు నగరంలో ఎవరెవరి వద్ద సెటిల్మెంట్ పేరుతో ఎంత వసూలు చేశారనేది, అలాగే లేఅవుట్ల నుంచి భవనాల వరకు, స్వీట్ షాపుల నుంచి ఆస్పత్రుల వరకూ ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేశారనేది ఫోన్ నంబర్లతో సహా 21 పేజీల్లో 53 పాయింట్లతో పీడీఎఫ్ లేఖ వైరల్గా మారింది. ఈ పరిణామాల క్రమంలో గత వారం బడేటి క్యాంపు కార్యాలయంలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికల ముందు నుంచి దూరంగా ఉంటున్న ఓ మాజీ నేతను ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు గత వారం పిలిపించి మూడు గంటల పాటు విచా రించారు. తనకేమీ లేఖతో సంబంధం లేదని, నన్ను ఎలా మీరు ప్రశ్నిస్తారని.. సదరు నేత పోలీసులను గట్టిగా అడగ్గా సరేలే అని పంపించివేశారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఓ కార్పొరేటర్కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టి వెంటనే ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. సదరు కార్పొరేటర్పై అనుమానంతో మూడు, నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారు. చివరిగా 36వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమసుందరిని ఈనెల 23న పోలీస్స్టేషన్కు పిలిచి విచారించారు. 21 పేజీల డాక్యుమెంట్ను మీరు షేర్ చేశారా అని ప్రశ్నించడం, మీపై మరో కార్పొరేటర్ నాయుడు సోము ఫిర్యాదు చేశారంటూ విచారించారు. తాను డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదని.. ఎవరో చేసింది తనకేమీ సంబంధమని పోలీసులకు బదులిచ్చినట్టు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించడంతో 21 పేజీల లేఖ వ్యవహారం వైరల్ అయింది. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో పూర్తి ఆధారాలతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. -
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్తోనే, లాకప్ డెత్లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మైనింగ్ ఉత్తర్వులిచ్చింది చంద్రబాబు సర్కారే
సాక్షి, మదనపల్లె: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ చేయబోమని మాటల్లో కాకుండా, ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ లైసెన్సులను ఎప్పుడు రద్దు చేస్తారో ప్రకటించాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో మైనింగ్ కోసం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని సూటిగా ప్రశ్నించారు.మైనింగ్ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబేమల్లయ్య కొండకు సంబంధించి 2025 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి మైనింగ్ లైసెన్సులు జారీ చేసిందని మిథున్రెడ్డి వెల్లడించారు. ఎర్రకొండకు ‘సీఎల్’ ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదని చెప్పారు. తాజాగా బాబు ప్రభుత్వం సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసిందని చెప్పారు. ‘ఇది నిజం కాదా? టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు దాచిపెట్టి ఆ తప్పిదాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం ఏమిటి?’ అని నిలదీశారు. మల్లయ్య కొండల్లో మైనింగ్పై ఇప్పటికే జారీ చేసిన మూడు ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రతి తప్పిదాన్ని గత ప్రభుత్వంపై మోపేందుకు యత్నిస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, ఖనిజ సంపదను దోచుకోవాలని చంద్రబాబు సర్కార్ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. మల్లయ్యకొండ అభివృద్ధి కోసం పైసా ఇవ్వని బాబు సర్కారు మైనింగ్ పేరుతో దోపిడీకి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ అభివృద్ధి కోసం రూ.కోట్లాది నిధులను మంజూరు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదనే విషయం అందరికీ తెలుసన్నారు. -
టీడీపీ బీఎల్ఏల పర్యవేక్షణలోనే ‘సర్’
నెల్లూరు (బారకాసు) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. మంత్రి నారాయణ ఏకంగా బీఎల్ఓలతో సమీక్షించాక ఈ ప్రక్రియను పూర్తిగా టీడీపీ పర్యవేక్షణలోనే చేపడుతున్నారు. మంత్రి అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ నందన్, కమిషనర్ అండ చూసుకుని బీఎల్వోలు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి బరితెగించి టీడీపీ బీఎల్ఏలు చెప్పినట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారంటూ స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. వాస్తవానికి.. బీఎల్వోలే ఓటర్ల చిరునామాను గుర్తించి స్వయంగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని సదరు ఓటరుకు అందజేసి పూరించి తిరిగి తీసుకుని ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఓటరు చిరునామా తెలియకపోతే ఆ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్ఏల సహకారంతో సదరు ఓటరు వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయాల్సి ఉంది. అయితే, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నెల్లూరు నగరం, 5వ డివిజన్లోని సత్యనారాయణపురంలో ఉన్న ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో ఓ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం టీడీపీ బీఎల్ఏలు సమావేశమయ్యారు. 5వ డివిజన్ పరిధిలో 128 నుంచి 135వ నంబరు వరకు ఎనిమిది బూత్లు ఉన్నాయి. ఆయా బూత్ల పరిధిలో ఉన్న ఓటర్లలో తమ పార్టీకి అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారిని మాత్రమే వాటర్ప్లాంట్ వద్దకు పిలిపించుకుని బీఎల్ఓలతో కలిసి అక్కడే ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇది తెలిసి తమకు ఫారాలు ఇవ్వకుండా కొందరికే ఇవ్వడంపై ఆ ప్రాంత స్థానికులు అగ్గివీుద గుగ్గిలమవుతున్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై YSRCP విమర్శల దాడి.. ఏమన్నారంటే?
-
రాళ్లు విసిరిన వారిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం!
-
నడిరోడ్డుపై మహిళ బట్టలు చించి... TDP కౌన్సిలర్ దారుణం
-
కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!
రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.ప్రపంచ బ్యాంక్కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నీ కొడుకు మా పిల్లని ప్రేమిస్తాడా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నా కొడుకు మా ప్రాంతానికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడని తెలిసి మందలించాను. వాళ్లకు తెలియజేసి అమ్మా యిని కట్టడి చేయమని నేనే చెప్పాను. అయితే మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, షర్మిళ, సిరాజ్, కమల్, బీబ్జాన్, మల్లిక ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటలకు నన్ను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి.. దుస్తులు చించేసి వివస్త్రను చేసి ఈడ్చి ఈడ్చి కాళ్లతో, చేతులతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదు. వారి నుంచి తప్పించుకుని శరీరానికి చేతులు అడ్డుపెట్టుకుని ఇంట్లోకి పరుగెత్తాను. నేను ఏం తప్పు చేస్తే ఇలా కొట్టారు’ అంటూ కావలికి చెందిన గిరిజన మహిళ బోరున విలపించింది. ఆమె తనకు జరిగిన అవమానాన్ని ఆదివారం మీడియాకు వివరించింది. ‘నేను గిరిజన మహిళను. నా భర్త ముస్లిం. ఆయన 8 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఇద్దరు బిడ్డలతో చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతున్నా. పిల్లలు తెలిసో తెలియకో ప్రేమించుకున్నారు. పెద్దలుగా వారిని మందలించి సరైన మార్గంలో పెట్టాలి. టీడీపీ స్థానిక లీడర్, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం పెద్ద మనిషిగా సమస్యను పరిష్కరించకపోగా తన వాళ్లతో కలిసి నాపై దాడికి పాల్పడ్డారు. ఎరుకుల దానివి. నీ కొడుకు మా పిల్లని ప్రేమిస్తాడా? మిమ్మల్ని బతకనివ్వం అంటూ నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి విచక్షణారహితంగా కొట్టారు. అధికారం మాది.. కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి? చంపేసి సూసైడ్ అని రాయిస్తా. నీకు దిక్కెవరు. నీ కొడుకులపై కేసులు పెట్టి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా... ఎరుకుల లం.. అంటూ తీవ్రంగా కొట్టారు. ఇదంతా చుట్టు పక్కల జనాలంతా చూశారు. కొద్ది సేపటికి రెండో పట్టణ సీఐ, ఎస్సైలు వచ్చి నన్ను, స్థానికులను విచారించారు. నేను కూడా టీడీపీ సానుభూతిపరురాలినే. నన్ను కొట్టిన వాళ్లు టీడీపీ మాజీ కౌన్సిలర్ కావడంతో కేసు నమోదు చేయలేదు. ఈ విషయం ఎక్కడైనా బయటకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. నేను వాళ్లతో రాజీ పడేందుకు నా కొడుకుపైన అక్రమంగా కేసు పెట్టారు. ఇది ఎంత వరకు న్యాయం’ అని ఆమె ప్రశ్నించారు.ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్సార్సీపీగిరిజన మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం బాధిత మహిళ నివాసానికి వెళ్లి ఆమెను ఓదార్చారు. బాధితురాలికి న్యాయం కోసం ఎస్టీ కమిషన్ను ఆశ్రయి స్తామని గిరిజన మహిళా నాయకురాలు చలంచ్ల పద్మమ్మ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నందనవనం సీతమ్మ, జిల్లా మహిళా కార్యదర్శి దామెర్ల నాగేశ్వరమ్మ చెప్పారు. -
కూల్డ్రింక్ కంటే.. బీరే మంచిది!
సాక్షి, గాజువాక: కూల్డ్రింక్ కంటే బీరే మంచిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీచ్ల్లో ఏర్పాటు చేస్తున్న బీచ్ షాక్స్ (మద్యం షాపులు) మంచివేనని.. అవి చెడ్డవని చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూల్డ్రింక్ కంటే బీరులోనే తక్కువ కేలరీలు ఉంటాయన్నారు. బీరుతో పోలిస్తే కూల్డ్రింక్లోనే చక్కెర ఎక్కువని తెలిపారు. తాను ఇలా మాట్లాడితే బీరు తాగడాన్ని ప్రోత్సహించడానికి మాట్లాడుతున్నానని అనుకుంటారన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో బీచ్ షాక్స్తోపాటు ఇతర పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. కూల్డ్రింకులతో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందన్నారు. బీచ్ల్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదేనని, దానివల్ల సంస్కృతి దెబ్బతినదన్నారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూనే మోడరన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నెటిజన్ల ఆగ్రహం.. ‘ధూమపానం.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని సినిమాకు ముందు ప్రకటన వేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం రాసి బోర్డులు పెడుతుంటారు. కానీ ఇదంతా అబద్ధమని, కూల్ డ్రింక్స్ కంటే బీర్లు మంచివని, మద్యపానాన్ని ప్రోత్సహించేలా బీచ్ సాక్స్ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమంలో ప్రజలు చివాట్లు పెడుతున్నారు. ‘కూల్డ్రింక్స్ కంటే బీరులో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది‘ అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యపానాన్ని ప్రోత్సహించేలా బాధ్యాతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. పోషకాహార గణాంకాల ప్రకారం, 330 మి.లీ. సాధారణ కూల్డ్రింక్లో 35–40 గ్రాముల చక్కెర ఉండగా, అదే పరిమాణంలో సాధారణ బీరులో 0–3 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అంతమాత్రాన బీరు ఆరోగ్యకర పానీయం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫెర్మెంటేషన్ సమయంలో చక్కెరలో అధిక భాగం ఆల్కహాల్గా మారిపోవడమే బీర్లో చక్కెర శాతం తక్కువగా ఉండటానికి కారణం. అదే విధంగా 330 మి.లీ. బీరులో సుమారు 140–160 కిలో క్యాలరీలు, 10–13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, దాదాపు 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. కూల్డ్రింక్లో సుమారు 135–145 కిలో క్యాలరీలు ఉన్నప్పటికీ, ఆల్కహాల్ ఏమాత్రం ఉండదు. షుగర్ తగ్గిందని చెబుతున్న ఎమ్మెల్యే, అదే చక్కెర ఆల్కహాల్గా మారిన విషయాన్ని ప్రస్తావించకపోవడం ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు దాచిపెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. -
బాధితులే నిందితులా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన అచ్చోసిన పచ్చమూకలు ప్రజాస్వామ్యానికి పాడెకట్టి రోజుకో ఊరులో ఊరేగిస్తున్నాయి. ఎర్రబుక్కు సాక్షిగా రెండేళ్లుగా సాగుతున్న నారా మార్కు నరమేధం మధ్యయుగాల నాటి ఆటవిక పాలనకు అద్దం పడుతోంది. ప్రజలపైనా, ప్రజాస్వామికవాదులపైనా, ప్రతిపక్షాలపైనా యథేచ్చగా దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వ్యవస్థలను తోలుబొమ్మలు చేసి ఆడిస్తూ రాష్ట్రాన్ని నారా‘కాష్టం’గా మార్చేస్తున్నారు. అధికారమదంతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను నానా రకాలుగా హింసిస్తారు.. తిడతారు.. కొడతారు.. దారికాచి దాడులు చేస్తారు.. ఆస్తులు ధ్వంసం చేస్తారు.. బాధితులు లబోదిబో మంటూ పోలీసు స్టేషన్లకెళితే.. అప్పటికే అక్కడ పచ్చమూకలే తిష్టవేసుకునుంటాయి.. ఎదురు కేసులు సిద్ధంగా ఉంటాయి.. వ్యవస్థలన్నిటినీ దారుణంగా దిగజార్చేయడంతో అరాచకం రాజ్యమేలుతోంది.. స్థూలంగా ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. రాజధానిలో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై దుర్మార్గంగా దాడి చేశారు.. కార్లు ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కూడా.. కానీ విచిత్రంగా దాడికి గురైన వారిపైనే పోలీసులు ఆదివారం కేసులు పెట్టారు. దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఏ చెత్తబుట్టలో పదేశారో ఎవరికీ తెలియదు..పోలీసుల సాక్షిగా బరితెగించిన టీడీపీ గూండాలు..మట్టి, ఇసుక మెక్కి మదమెక్కిన రౌడీ మూకలు మద్యం సేవించి మరీ పట్టపగలు పోలీసుల సాక్షిగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడడం టీవీ చానళ్లు చూశాయి.. సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి.. రాళ్లు రువ్విన రౌడీలను, కర్రసాము చేసిన కసాయిలను, గుడ్లు విసిరిన గూండాలను ప్రజలు చూశారు. పోలీసులు చూశారు. అయినా దాడికి గురైనవాళ్లపై కేసులు నమోదయ్యాయి. పెనుమాక రైతుల విజ్ఞప్తి మేరకు ఆ మార్గంలో వెళుతున్న రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై పట్టపగలు రాళ్లు, కర్రలతో హత్యాయత్నానికి దిగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కానీ దాడిచేసినవారిది తప్పు కాదంట.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అమరావతికి వెళ్లడమే తప్పట. వారికి ఏం పని? ఎందుకు వెళ్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేక పాలస్తీనా– ఇజ్రాయిల్ సరిహద్దులోని గాజా ప్రాంతంలో ఉందా అని సగటు పౌరుడికి సందేహం రాకమానదు.. అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? లేక రాష్ట్రప్రభుత్వం నుంచి పచ్చమూకల నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే ‘నేను తెలంగాణ ఎందుకు రాకూడదు.. రావడమే కాదు రాజకీయం కూడా చేస్తా’నంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్లో చిందులు వేయడం అందరూ చూశారు. మరి పవన్ కల్యాణ్ ‘హైదరాబాద్ హమారా’ అనవచ్చు గానీ.. వైఎస్సార్సీపీ నాయకులు అమరావతిలో తిరగడం తప్పెలా అవుతుంది. దారిని పోతున్న మమ్మల్ని అడ్డుకుని, దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏం న్యాయమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేం పిలిస్తేనే వాళ్లు వస్తున్నారు అని పెనుమాక రైతులు కూడా చెబుతున్నారు. ఇవేవీ చంద్రబాబు బధిర సర్కారు చెవికెక్కడం లేదు.దాడికి గురైన వారిపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..సిఆర్డిఎ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై శనివారం ఉండవల్లి సెంటర్లో జరిగిన దాడిలో నిందితులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నా వారిని అరెస్టు చేయకపోగా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పెనుమాక రైతుల కోరిక మేరకు వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. కార్యకర్తలు ముందస్తు వ్యూహంతో అడ్డుకోవడం, వారిపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వరరావు కార్లను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షునితో పాటు లోకేష్ కోటరీలోని వ్యక్తులే స్వయంగా ఈ దాడులకు నేతృత్వం వహించారు. మహిళలతో కోడి గుడ్లు వేయించారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఇతర నేతలపై దాడికి దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. టీఎన్టీయూసీ నేత రాయపూడి కిరణ్బాబు విసిరిన రాయి పోలీసు కానిస్టేబుల్కు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంత జరిగినా తాడేపల్లి పోలీసులకు చీమ కుట్టినట్లు లేదు. పైగా తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్కు పిలిపించుకుని రెండు మూడు సార్లు ఫిర్యాదును మార్చి చివరకు పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం అనే మహిళా నాయకురాలితో ఫిర్యాదు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఇదీ తప్పుడు కేసు...పోలీసులు నమోదు చేసిన క్రైం నెంబర్ 412/2026 ప్రకారం శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఉండవల్లి గ్రామంలోని అమ్మ హోటల్ సెంటర్ వద్ద మాణిక్యంతో పాటు జంగాల భవాని తదితర మహిళలు ఉండగా, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లెళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణ (మూర్తి), మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు కార్లలో అక్కడికి చేరుకుని అమరావతి రాజధాని, రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, వారిని ప్రశ్నించిన ప్రజలపై బెదిరించడంతో పాటు తనను, రాయపూడి కిరణ్బాబును కులం పేరుతో అవమానించారని, కొందరు నిందితులు చేతులు, కాళ్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై బీఎన్ఎస్ సెక్షన్లు 189(2), 115(2), 118(1), 131, 351(2), 79 , 190తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 2015లోని 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి దాడులు చేసింది, కోడిగుడ్లు విసిరింది తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకులే. కానిస్టేబుల్పై రాయితో దాడిచేసి గాయపరిచిన రాయపూడి కిరణ్బాబును కేసు నుంచి తప్పించేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. తమపైనే దాడి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య (ఫైల్) వైఎస్సార్సీపీ నాయకులపై సీఐ ఫిర్యాదు.. కేసు..తెలుగుదేశం పార్టీ పెద్దల డైరెక్షన్కు అనుగుణంగా... వారు తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారు.. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు..... ఆయన స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసి 413/2026 కింద కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య తదితరులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్లలో పెనుమాక గ్రామం వైపు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఉండవల్లి సాయిబాబా ఆలయం సమీపంలో వారిని అడ్డుకున్నారని, అదే సమయంలో టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని అమరావతి రాజధానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ చట్టం సెక్షన్లు 30, 30–ఏ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అనుమతి లేకుండా ముందుకు వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఇతరులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అంబటి రాంబాబుకు వర్తించే పోలీసు సెక్షన్ 30, 30–ఎ తెలుగుదేశం నాయకులకు ఎందుకు వర్తించడం లేదో పోలీసులే చెప్పాలి. ఉదయం నుంచి వంద మందికి పైగా మోహరించి రోడ్డుపై బైఠాయించినా వారిని అదుపులోకి తీసుకోలేదు. వారికి కాపలాగా నిలబడ్డారు. వారు వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లతో దాడులు చేస్తున్నా వారిని అదుపులోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ప్రయత్నించారు. దీన్ని వారించడానికి వచ్చిన అంబటి రాంబాబును కూడా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మద్య తోపులాట జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని సీఐ బీఎన్ఎస్ 223, 132, 3(5),పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్లు 30, 30–ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు తమపై హత్యయత్నం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ను బయటపెట్టడం లేదు. ఆదివారం ఎమ్మెల్సీ మేకతోటి ఆరుణ్కుమార్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడి వీడియోలు, సీసీ ఫుటేజ్, విడియోలు, ఫోటోలు అందచేశారు.మాజీ మంత్రులపై గతంలోనూ ఎదురుకేసులుతిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం శ్రేణులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిలపై దాడులకు పాల్పడటమే కాకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టారు.. గుంటూరు నగరం గోరంట్ల వద్ద తెలుగుదేశం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడికి ప్రయత్నించడమే కాకుండా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతని ఇంటిపై, కార్యాలయం పై దాడి చేశారు. ఏడు గంటలసేపు విధ్వంసం సృష్టించారు. తిరిగి అంబటి రాంబాబును ఆరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైలులో ఉంచారు. దాడి చేసిన వారికి 41 నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పైగా అతనిపైనే తిరిగి కేసు పెట్టారు. తిరుపతి లడ్డు వ్యవహారం పై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడదల రజిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరుగుతుండగానే ఆలయం ముందుకు వచ్చి బరితెగించిన టీడీపీ గూండాలు హల్చల్ చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న విడదల రజిని పై దాడి కి యత్నించారు. కారును అడ్డుకుని, ముందుకు కదలనివ్వకుండా చేసిన టీడీపీ గూండాలు. కారుపై చేతులతో గుద్దుతూ, దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఆమె పైనే తిరిగి కేసు పెట్టారు. -
కమిషనర్ 'సర్'కొత్త ఊడిగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నెల్లూరు నియోజకవర్గంలో గాడి తప్పుతోంది. నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏకంగా సరికొత్త టీడీపీ నేత అవతారం ఎత్తారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. టీడీపీకి మేలు చేసేలా మంత్రి నారాయణ కనుసన్నల్లో పచ్చ కండువా కప్పుకుని సర్ ప్రోగ్రామ్ను పార్టీ వ్యవహారంగా మార్చేశారు. బీఎల్ఓల సమీక్షకూ మంత్రి నారాయణను ఆహ్వానించడమే కాకుండా ఏకంగా టీడీపీకి చెందిన బీఎల్ఏలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మై టీడీపీ యాప్ను పొగడ్తలతో ముంచెత్తడం కలకలం రేపింది. టీడీపీ బీఎల్ఏ కాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి కనుసన్నల్లోనే.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషనర్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకంగా టీడీపీ అధికారిక కార్యాలయంగా మార్చేశారు. టీడీపీ బీఎల్ఏలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీ బీఎల్ఏల టెలికాన్ఫరెన్స్లోకి లాగిన్ అయి వారితో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించాల్సిన బీఎల్ఓల సమీక్షలకు ఇటీవల మంత్రి నారాయణతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్లను ఆహ్వానించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా కమిషనర్ నందన్కు షోకాజు నోటీసు జారీ చేశారు. అయినా కమిషనర్ తీరు మారలేదు. ఆయన నోటీసును లెక్కచేయలేదు. ఏకంగా టీడీపీ బీఎల్ఏల సమీక్షలో పాల్గొని మై టీడీపీ యాప్ బహు బాగు అంటూ కితాబిచ్చారు. ఆ యాప్ను తాము ఫాలో అవుతున్నామని, ఓట్లు తొలగించేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీడీపీ కార్యకర్త డ్యూటీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారాయణ అండదండలు ఉండడంతోనే కమిషనర్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఆదేశాలూ పాటించడం లేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. మై టీడీపీ యాప్లో ఓటర్ వ్యక్తిగత సమాచారం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ బీఎల్ఏలు మై టీడీపీ యాప్లోకి లోడ్ చేస్తున్నారు. ఓటర్ వ్యక్తిగత సమాచారం చోరీకి కమిషనర్ ఆదేశాలతో బీఎల్ఓలే సహకరిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తోంది. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక -
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
-
‘అవసరమైతే వైఎస్ జగన్ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం’
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ, మరో వైపు భూసేకరణ అమలు చేస్తున్నారు. రైతుల పొలాల్లో గుంటలు తవ్వుతున్నారు.. రోడ్లు వేస్తున్నారు.. అనేక విధాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం అరాచకాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లాం. దీంతో రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. మా బాధలు వినడానికి ఆ కమిటీ మా భూములు చూడటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని మా భూములను పరిశీలించడానికి మళ్లీ ఆహ్వానిస్తాం. అవసరమైతే వైఎస్ వైఎస్ జగన్ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం’’ అని పెనుమాక రైతులు తెలిపారు.‘‘ఉండవల్లిలో టీడీపీ గూండాల అరాచకంపై పెనుమాక రైతులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి దుర్మార్గం. మేం పిలవడం వల్లనే రైతు పరిరక్షణ కమిటీలో ఉన్న నేతలు వచ్చారు. ప్రభుత్వం ఎంతసేపటికీ మా పొలాలను లాక్కునేందుకు చూస్తోంది. కానీ మాకు న్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై రైతులు మండిపడ్డారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది.. పెద్దారెడ్డి కౌంటర్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది.. పిచ్చాసుపత్రికి తరలించాలని ఎద్దేవా చేశారు. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ మండిపడ్డారు.తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు తగ్గించుకుంటే మంచిది. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నాకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్నదే మా ఉద్దేశం. మేము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నాతో సహా తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారుటీడీపీ నేతలు దాడి చేస్తే.. వైఎస్సార్సీపీ నేతలపై కౌంటర్ కేసులు దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ ఉన్నా లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తోంది?. జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిని టీడీపీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారాలు చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ట్రావెల్స్ బస్సులకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినందుకే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ప్రభాకర్ రెడ్డికి పోలీసులంటే గౌరవం లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి హబ్గా తాడిపత్రి మారిపోయింది. టీడీపీ నేతల అసాంఘిక కార్యకలాపాలకు తాడిపత్రి పోలీసులు సహకరించటం దుర్మార్గం. ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది. 24 మంది వైఎస్సార్సీపీ నేతల అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు. గొడవలు సృష్టించటమే ప్రభాకర్ రెడ్డి లక్ష్యమా?. తన కొడుకు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కూడా ఆయన చెడగొడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయండి.. లేదంటే శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. -
టీడీపీకి ఏజెంట్గా కమిషనర్
నెల్లూరు(అర్బన్): టీడీపీకి నెల్లూరు కమిషనర్ నందన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగాన్ని ధిక్కరించి కార్పొరేషన్ కార్యాలయంలో బీఎల్వోలతో మంత్రి నారాయణ సమీక్ష జరిగేలా చూశారని.. ఇలాంటి వ్యక్తిపై వేటేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలతో సమీక్షను కమిషనర్తో కలిసి మంత్రి ఈ నెల 22న జరిపిన నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కమిషనర్పై చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలపాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రాన్ని కాకాణి, పర్వతరెడ్డి తదితరులు శనివారం అందజేశారు. ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్ను ఇచ్చారు. కమిషనర్కు షోకాజ్ నోటీసులను కలెక్టర్ జారీ చేశారని, ఆయన వివరణ కోసం చూస్తున్నామని డీఆర్వో చెప్పగా, దీనికి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ఆధారాలను సమర్పించినా, చర్యలు చేపట్టకుండా నాన్చడం తగదని సూచించారు. ఈ విషయమై ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘం సీఈఓకు తమ పార్టీ రాష్ట్ర నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 24న ఫిర్యాదు చేశారని చెప్పారు. అవగాహన లేకపోవడం సిగ్గుచేటు ఎన్నికల విధుల్లో రాజకీయ పారీ్టల జోక్యం ఏ రోజూ ఉండదని కాకాణి పేర్కొన్నారు. దీనిపై మంత్రి నారాయణకు అవగాహన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఎల్వోలతో సమీక్ష జరిపేందుకు ఈయనకు ఏ హక్కు ఉందో చెప్పాలని ప్రశ్నించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో సర్కు సంబంధించిన ఫారాలను తమ పారీ్టకి చెందిన మహిళా ప్రతినిధికివ్వాలని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించడం దారుణమన్నారు. ఆ ఫారాలను సదరు నేత సేవ్ చేసుకున్నాకే బీఎల్వోలకు ఇవ్వాలని పేర్కొనడం ఎక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో అనర్హులను ఓటర్లుగా చేరుస్తూ.. అర్హులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కమిషనర్ సహకరిస్తున్నారని మండిపడ్డారు. వదిలే ప్రసక్తే లేదు మంత్రి అండదండలతో చెలరేగిపోతున్న నందన్ను తాము వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2029లో చట్టబద్ధంగా ఆయన సంగతి తేలుస్తామని తెలిపారు. ఒక వేళ రాజీనామా చేసి నారాయణ కళాశాలలో ఉద్యోగిగా చేరినా వదిలే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. కమిషనర్పై ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కేసులకు భయపడేది లేదనీ.. ఎన్నైనా పెట్టుకోమనీ.. ప్రక్రియ పారదర్శకంగా జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఓట్లు తొలగించే కుట్ర టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈ తరుణంలో వ్యవస్థలను ఉపయోగించుకొని సాధారణ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఓటేయని వారి ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే మంత్రి బరితెగించి బీఎల్వోలతో సమీక్షను జరిపారని విమర్శించారు. ఇందులో కమిషనర్ జోక్యం చేసుకొని.. మై టీడీపీ యాప్ను ఫాలో కావాలని.. ఫారాలను త్వరగా తీసుకొని బీఎల్వోలతో ఆన్లైన్ చేయించాలని సూచించారని తెలిపారు. కమిషనర్కు చిత్తశుద్ధి ఉంటే అన్ని పారీ్టల బీఎల్ఏలతో సమావేశాన్ని జరిపి, అందరికీ సరైన సలహాలివ్వాలని సూచించారు. అలా కాకుండా టీడీపీకి చెందిన ఓట్లనే త్వరగా ఆన్లైన్ చేయించేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచారు. మై టీడీపీ యాప్లో ఆ పార్టీ వారితో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల సమాచారం మొత్తం ఉందన్నారు. దీని ప్రాతిపదికన కమిషనర్ చెప్పారంటే ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు పూనుకోవడమేనని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రక్రియ నెల్లూరు, నెల్లూరు రూరల్లో మరీ ఎక్కువగా ఉందని, దీన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొణిదెల సుధీర్, కార్పొరేటర్ శ్రీకాంత్రెడ్డి, మైనార్టీ విభా గ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్, వెంకటశేషయ్య, కా ర్పొరేటర్లు కామాక్షి, గుంజి విజయలక్ష్మి, డివిజన్ల ఇన్చార్జీలు సుబ్బారెడ్డి, శ్రీధర్, శరత్, జయరామిరెడ్డి, అబ్దు ల్ మస్తాన్, సందీప్, మస్తాన్, పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమా?.. గూండాల రాజ్యమా? బాబును నిలదీసిన జగన్
-
మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్టు పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భూ కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్కి లేఖ రాశారు. హైదరాబాద్లోని ప్రగతి నగర్, షంషిగూడలో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని కోరారు.ఈడీ జప్తు ఆదేశాలు, ఎన్సీఎల్టీ ఆంక్షల విషయాన్ని దాచిపెట్టారు. ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఏమాత్రం లేవు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అఫిడవిట్ స్పష్టం చేసినప్పటికీ అక్కడ ఆక్రమణలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎంవో అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలి. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాను రంగంలోకి దించాలి. బాధ్యులపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.MULTI-THOUSAND-CRORE GOVT LAND GRAB EXPOSEDI have petitioned CM @revanth_anumula to halt the illegal takeover of 112.72 Acres of public land in Shamshiguda,Pragathi Nagar,Hyderabad allotted for TGIIC IT Park.Vijayawada MP Kesineni Sivanath (Chinni) & proxies (M/s Exella… pic.twitter.com/kPbMexMaOU— Kesineni Nani (@kesineni_nani) June 28, 2026 -
ఈ నా కొ..లకు లా తెలియదు
అనంతపురం టౌన్: ‘ఈ నా కొ..లకు లా తెలియదు. ఏమీ తెలియదు. 420 నా కొ..లు’ అంటూ న్యాయవాదులపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి తీవ్ర అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఆయన శనివారం అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘మీకు చదువురాదు.. ఏమీ రాదు. నేనే వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు సిగ్గుందా రా? లీగల్ సెల్ అంట.. ఏమి తెలుసురా మీకు? మీరు చేసేది భూ కబ్జాలు రా.. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా?’ అంటూ న్యాయవాదులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘రేయ్ వస్తున్నా.. మీరు డేట్ చెప్పండిరా.. డిబేట్ పెట్టుకుందాం. ప్రతి ఒక్క నా కొ..కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నా కొ..లే. రేయ్ రండి రా.. కోర్టు రోడ్డుకు వస్తా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. తాడిపత్రికి వస్తామంటే.. రండి చూద్దాం’ అంటూ నోరుపారేసుకున్నారు. ‘మూడేళ్ల తర్వాత వాళ్లు చూపిస్తారంటా. మనం రేపటి నుంచే చూపిద్దాం. ఇప్పటికే అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లా.. త్వరలోనే లోకేశ్ దృష్టికి తీసుకెళతా. ప్రతి టీడీపీ కార్యకర్త సిద్ధంగా ఉండాలి. మనమేంటో చూపిద్దాం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డిని పక్కన పెట్టుకొని మాట్లాడే ప్రతి ఒక్కరి కథ తమకు తెలుసని, జాగ్రత్తగా ఉండాలంటూ బెదిరించారు.ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ‘గత ప్రభుత్వంలో మీరు పెట్టిన కేసుల వివరాల పుస్తకాలను వెంకట్రామ్ (మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి), శైలజానాథ్కు పంపాను. ఏ కార్యకర్తకైనా కాఫీ పోశావా? టిఫిన్ పెట్టావా వెంకట్రామ్? నీ మీదా, రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి నెత్తిమీద ఒక్క రూపాయి పెట్టి వేలం వేస్తే దమ్మిడికి కూడా పోరురా మీరు. మళ్లీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? వాడిని (తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని) పక్కన పెట్టుకోకుండా ఏమైనా తిట్టండి. అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. -
మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎయిర్పోర్టుల్లో వైన్ షాపులు, బార్లకు అనుమతి ఇవ్వనుంది. తిరుపతి మినహా అన్ని ఎయిర్పోర్టుల్లో మద్యం విక్రయాలు జరపనున్నారు. ఎయిర్పోర్టుల్లో వైన్స్, బార్లకు 24 గంటలూ అనుమతి ఇవ్వడానికి నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది.బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు. మద్యం షాపుల దరఖాస్తు రుసుము రూ.2లక్షలు. ఎయిర్పోర్టు వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.కోటిగా చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.25లక్షలు. 20 లక్షలలోపు సర్క్యులేషన్ ఉంటే రూ.15లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.ప్రైవేట్ వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవలే బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎయిర్ పోర్టులలో వైన్ షాప్, బార్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్
-
కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్
-
ఎక్కడా తగ్గేదే లేదు.. ప్రాణత్యాగానికైనా మేము రెడీ..
-
గర్భిణి కళ్లెదుటే భర్తపై ‘లాఠీ’న్యం
నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో పోలీసులు లైసెన్స్డ్ రౌడీలు.. గూండాలుగా మారి సామాన్యులపై లాఠీలతో విరుచుకుపడుతున్న ఘటనలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుండగా.. సింహపురిలోనూ ఖాకీ క్రౌర్యం వెలుగుచూసింది. కొండాపురం పోలీసులు టీడీపీ నేత డైరెక్షన్లో వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర అనే యువకుడిని రెండు రోజులపాటు స్టేషన్లో ఉంచి చితకబాదిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఖాకీలు కొట్టిన లాఠీ దెబ్బలతో బాధితుడు నెల్లూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రవీంద్ర భార్య హెప్సిబా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర మంగళవారం ఉదయం నారసింహాపురం బస్టాండ్ వద్ద ఉండగా కొండాపురం స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి స్టేషన్కు రావాలని కోరారు. నేనెందుకు రావాలని అడిగిన రవీంద్రను కానిస్టేబుళ్లిద్దరూ అక్కడే ఉన్న మంచంపై పడేసి కాళ్లు, చేతులు కట్టేసి చితక బాదారు. ఆ తరువాత ఆటోలో కొండాపురం స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి నిండు గర్భిణి అయిన అతని భార్య కూడా వెంటనే స్టేషన్కు వెళ్లింది. ఇంతలో గణేశ్వరపురానికి చెందిన టీడీపీ నాయకుడు పేరం సుధాకర్ స్టేషన్కు వచ్చి ఎస్సై శ్రీనివాసులతో మాట్లాడారు. టీడీపీ నేత అక్కడ ఉండగా అతని డైరెక్షన్లో ఎస్సై శ్రీనివాసరావు రవీంద్రను లాకప్లోకి నెట్టి నిర్ధాక్షిణ్యంగా చితక బాదారు. దెబ్బలకు తట్టుకోలేక అతడు విలవిల్లాడినా కనికరించలేదు. తన భర్తను కొట్టొద్దని రవీంద్ర భార్య హెప్సిబా ఎస్సైను ప్రాధేయపడినా దుర్భాషలాడుతూ ఒక రోజు పగలు, రాత్రి అంతా చితక బాదారు. అదే రోజు అర్ధరాత్రి టీడీపీ నేత మద్యం తాగి మరోసారి స్టేషన్కు వచ్చి కానిస్టేబుల్ మహేష్ ద్వారా మరోసారి లాఠీలతో కొట్టించారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. తన భర్త రవీంద్ర వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో రాజకీయ కక్షతో టీడీపీ నేత సుధాకర్ అక్రమ కేసులు బనాయించి సస్పెక్ట్డ్ షీట్ ఓపెన్ చేయించారు. ఆ తర్వాత పోలీసులు ద్వారా అనేకసార్లు హింసించడం ప్రారంభించారు. బుధవారం సాయంత్రం వరకు స్టేషన్లోనే నడిపించి, ఆ తరువాత తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో వదిలేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు రవీంద్ర గురువారం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. తన భర్తకు, తనకు టీడీపీ నేత సుధాకర్ ద్వారా ప్రాణహాని ఉందని, పోలీసుల ద్వారా తన భర్త ప్రాణాలను తీసేందుకు టీడీపీ నేత ప్రయత్నిస్తున్నారని హెప్సిబా ఆందోళన వ్యక్తం చేసింది. స్టేషన్లో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జిల్లా పోలీసు అధికారులు స్పందించి కొండాపురం ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని హెప్సిబా కోరింది. -
చిత్రహింసలు పెడుతూ రెండు రోజులు లాకప్ లో ...
-
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
-
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. కూటమి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు..
-
గిరిజన మహిళను వివస్త్రను చేసి.. కాళ్లతో కొట్టి..
నెల్లూరు: టీడీపీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్తోపాటు అతని కుటుంబం కలిసి దుశ్శానపర్వానికి తెగించిన వైనం కావలి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగించారు. కుమారుడి ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ గిరిజన (ఎరుకుల సామాజిక వర్గం) మహిళను వివస్త్ర చేసి జుట్టు పట్టుకుని కాళ్లతో, చేతులతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగితే.. ఈ కేసును తొక్కిపెట్టిన పోలీసులు వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేసు కావలి రెండో పట్టణ పోలీసులు క్రైం నంబర్గా 38/2026 నమోదు చేశారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. కావలి కచ్చేరిమిట్టకు చెందిన ఓ గిరిజన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె కుమారుడు అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో ప్రేమాణయం సాగిస్తున్నాడని తెలుసుకుని ఆమే.. కొద్ది రోజుల క్రితం స్థానిక టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీంకు తెలియజేసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో షర్మిల, సిరాజ్, కమల్, బీబ్జాన్, మల్లికాతోపాటు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి వివస్త్ర చేసి కాళ్లతో, చేతులతో కొట్టారు. దాదాపు అర్ధగంటకుపైగా చుట్టు పక్కల జనం చూస్తుండగానే ఈ దారుణానికి తెగించారు. ‘ఎరుకుల లం.. నిన్ను చంపేసి సూసైడ్ అయిని రాయిస్తే.. నీకు దిక్కెవరు’ అంటూ విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె వారి నుంచి తప్పించుకుని తన మానాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డు పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారించారు. అదే రోజు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నప్పటికీ.. కేసు నమోదు చేయలేదు. నీరుగార్చేందుకే వారం తర్వాత కేసు నమోదు అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కొందరు వీడియోలు తీశారు. నిందితులు ఈ విషయం బయటకు వెల్లడిస్తే ఎవరినైనా చంపేస్తామంటూ బెదిరించారు. స్థానికులు వీడియోలు తీసినప్పటికీ బయట పెట్టేందుకు ఎవరూ సాహించలేదు. దీంతో ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించడంతో బయటకు పొక్కకుండా ఉండిపోయింది. బాధితురాలు సైతం రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు వారం తర్వాత కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి శారీరకంగా గాయపరిచి, పరువుకు భంగం కలిగించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కలిగించారనే సెక్షన్లతో స్టేషన్ హెడ్కానిస్టేబుల్ వై. శ్యామ్కుమార్తో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు డీఎస్పీ పరిధిలో ఉంటుంది. నిందితులు టీడీపీ నేతలు కావడంతో ఈ ఘటన జరిగిన రోజే సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించినప్పటికీ అప్పుడే ఫిర్యాదు స్వీకరించినప్పటికీ కేసు నమోదు చేయకుండా, వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, హెడ్కానిస్టేబుల్ పేరుతో ఆలస్యంగా కేసు నమోదు చేయడం, ఇది ఫాల్స్ కేసుగా కొట్టిపారేసేందుకు అనే వాదన పోలీస్ వర్గాల నుంచి వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితురాలు షరి్మల స్నానం చేస్తుండగా సదరు గిరిజన మహిళ కుమారుడు చూశాడంటూ అదే సమయంలో కౌంటర్ కేసును నమోదు చేయడం గమనార్హం. -
నడిరోడ్డుపై YSRCP నాయకులపై 300 మంది టీడీపీ గుండాల దాడి!
-
penumaka: బండ రాయిలతో టీడీపీ గూండాలు దాడి
-
నేను గాంధీని కాదు.. ఒకటిస్తే రెండిస్తా!.. బోడే ప్రసాద్కు దేవభక్తుని చక్రవర్తి మాస్ వార్నింగ్!
-
అంబటి కేసులో ఇద్దరు CIలకు నోటీసులు.. రెచ్చిపోతున్న ఖాకీలు
-
రూ. 100 కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రే తారుమారు..
-
బాబు మార్క్ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!
అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్సీపీ ది కుట్ర అవుతుందా?విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్గా, టెక్నికల్గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్కు తీసుకువెళితే దళిత డాక్టర్ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోరంకిలో టెన్షన్.. టెన్షన్.. దేవభక్తుని చక్రవర్తిపై దాడి
-
మందు బాబులకు అండగా టీడీపీ ఎంపీ
-
పోరంకిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై దారికాచి దాడికి యత్నించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు చక్రవర్తి వస్తుండగా.. పోరంకి వద్ద భారీగా మోహరించిన టీడీపీ గూండాలు.. చక్రవర్తి కారును అడ్డుకున్నారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు.టీడీపీ గూండాలు చుట్టుముట్టడంతో కారు దిగిన చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్రవర్తిని తరలిస్తున్న పోలీసు వ్యాన్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చిబూతులతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. -
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. -
JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన
-
మహిళలకు కూటమి మరో వాగ్దాన భంగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మహిళల చేతిలో నిధులు ఉంటే స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు.మహిళలకు చంద్రబాబు మోసంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంభన చేకూరుతుంది. వారి చేతిలో నిధులుంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రుణాల పెరుగుదల ఆగిపోవటంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్గా ఉంది. స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ చాలా కీలకమైన పథకం. మా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించాం. అదనంగా ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాం. ఇవన్నీ మహిళలకు స్వయం ఉపాధికి మంచి అవకాశాలుగా మారాయి. టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా చేతులు ఎత్తేసింది.రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికే నిధులు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఒక్కో SHG సంఘం మీద సగటున రూ.6 లక్షల రుణభారం ఉందనుకుంటే.. టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా సుమారు రూ.3,000 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఈ రెండేళ్లకు కలిపి మహిళలకు సుమారు రూ.6,000 కోట్ల ప్రయోజనం అందకుండా పోయింది. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల SHGలకు రుణాల వృద్ధి గణనీయంగా పెరిగింది. మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో SHGలకు అందిన రుణాలు రూ.49,696 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అవి రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025-26లో మరింత తగ్గి రూ.41,105 కోట్లకు చేరాయి. ఇలా మహిళా సంఘాలకు ఆర్థిక మద్దతు తగ్గటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది’ అని చెప్పుకొచ్చారు. 𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability… pic.twitter.com/Ql4wamJ4mg— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2026 -
మద్యం మత్తులో పోలీసు చొక్కా పట్టుకుని టీడీపీ నేత వీరంగం
-
టీడీపీ గేమ్లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీసీలకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటానంటూ ఎన్నికల ముందు నమ్మబలికి అధికారంలోకి రాగానే హామీలు అమలు చేయకుండా వారి వెన్నువిరిచేలా వ్యవహరించడం చంద్రబాబు నైజం. తొలి నుంచీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీడీపీ బీసీల పార్టీ అంటూ వారిని భ్రమల్లో ముంచి అధికారంలోకి వచ్చాక దగా చేయడం బాబుకు అలవాటు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల ఉన్నతికి ఉపయోగపడే ఒక్క చర్య కూడా బాబు తీసుకోలేదు. పైగా హామీల గురించి ప్రశ్నించిన వెనుకబడిన వర్గాలను ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా.. అంటూ అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. బీసీ డిక్లరేషన్.. అదే మోసం రిపీట్.. 2014 ఎన్నికల ముందు 2012 జూలై 12న బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలను దారుణంగా దగా చేశారు. 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగామొత్తం 119 హామీలిచ్చిన చంద్రబాబు 2014 నుంచి ఐదేళ్లపాటు అధికారం అనుభవించి ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదన్నది వాస్తవం. డిక్లరేషన్ అమలు అంటూ ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారన్నది జగమెరిగిన సత్యం. కత్తెరలు, ఇస్త్రీ పెట్టేలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. బీసీలకు వంద ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని 2012 బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లూ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టారు. 2024లోనూ బీసీ డిక్లరేషన్ పేరుతో నయవంచన చేశారు. ఆ ఎన్నికల్లోనూ బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదు. 2024 డిక్లరేషన్లో ఇచ్చిన హామీలకూ తిలోదకాలు ఇచ్చారు. రెండేళ్ల పదవీకాలం పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు. బీసీ సబ్ప్లాన్.. నిధుల కేటాయింపులో చీటింగ్.. బీసీలకు సబ్ప్లాన్ పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామంటూ 2014, 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. 2014 ఎన్నికల్లో ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి అందులో సగం నిధులూ కేటాయించలేదు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామనే హామీ ఇచ్చి గత రెండేళ్ల కాలంలో బడ్జెట్ల్లో బీసీ సంక్షేమంలో రూ.11,426 కోట్లు కోత పెట్టి దగా చేశారు. అంటే 2024–25లో రూ.18,593.45కోట్లు కేటాయించి రూ.15,400.88 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.23,256.79కోట్లు కేటాయించి రూ.15,023.37 మాత్రమే ఖర్చు చేశారు. కురుబలకు గొర్రెలు లేవు.. చేనేతకు జీఎస్టీ రాలేదు.. రాష్ట్రంలో వృత్తిదారులనూ చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. యాదవ, కురుబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం రెండేళ్లుగా మాటలకే పరిమితమైంది. చేనేతకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ రాలేదు. రాష్ట్రంలో చేనేతకు ఉచిత విద్యుత్ పథకంలో నెలకు హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500యూనిట్లు ఉచితం అనేది దాదాపు రెండేళ్ల తర్వాత ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చారు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 1,03,534 అర్హుల్లో 57,247మందికే పరిమితం చేయడం దుర్మార్గం. వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్, రాయల్టీ , సీనరీ చార్జీల్లో మినహాయింపు ఉత్తర్వులకే పరిమితం కావడంతో రాష్ట్రంలో అమలుకావడంలేదు. రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణంలేదు, స్వర్ణకారులకు అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అంతంతమాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మే 18న 1,52,248 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రకటించి మే 19న 1,30,796 మందికి రూ.20వేలు చొప్పున విడుదల చేసినట్టు ప్రకటించారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలోనే రకరకాల సాకులు చూపి 21,452 మందికి మత్స్యకార భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. నాయీబ్రాహ్మణులకు ఆలయాల్లో నెలకు రూ.25వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఆదాయం తగ్గితే మిగిలిన మొత్తం ఆ ఆలయాల నుంచి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు. గీతకార్మికులకు కేటాయించిన పది శాతం మద్యం షాపులనూ అధికార పక్షానికి చెందిన బినామీలే దక్కించుకుని దగా చేశారు. బీసీ రిజర్వేషన్లపై దొంగాట.. రిజర్వేషన్ల విషయమై గత ఎన్నికల్లో బీసీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అదే విషయమై దొంగాట ఆడుతున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రచార్భాటం చేసుకోవడం మినహా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణ అభివద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు తదితర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోను, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, పాలక మండళ్లలో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణకు నోచుకోకపోవడంతో బీసీల పట్ల ఆయనకు కించిత్ చిత్తశుద్ధి కూడా లేదని తేటతెల్లమవుతోంది.బీసీలకు వైఎస్ జగన్ పెద్దపీటపదవుల్లో సామాజిక న్యాయంవైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఫిబ్రవరి 15న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేసి చూపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదని.. వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్ది చూపించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చేయి పట్టుకుని ముందుకు నడిపించి సరికొత్త చరిత్రను సృష్టించారు. సామాజిక న్యాయం అమలులో దేశానికే దిక్సూచిగా నిలిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో టీడీపీ నాయకుడితో కేసు వేయించి చంద్రబాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన వైఎస్ జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు.అప్పటి వరకు ఓసీలకే పరిమితం అనుకున్న మైలవరం ఎమ్మెల్యే, నరసారావుపేట ఎంపీ సీట్లు సైతం 2024 ఎన్నికల్లో బీసీలకు కేటాయించి సామాజిక విప్లవానికి సరికొత్త భాష్యం చెప్పారు.ఓసీ మహిళకు రిజర్వ్ అయిన విజయవాడ నగర మేయర్ పదవిని రాయన భాగ్యలక్ష్మికి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీ మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్కు దక్కింది. బీసీలకు అసెంబ్లీ స్పీకర్, ఉపముఖ్యమంత్రి పదవులతోపాటు 11 మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చారు. 38 మంది ఎమ్మెల్సీల్లో 18 బీసీలకే ఇచ్చారు. 9మంది నగర మేయర్లతోపాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో దాదాపు 70శాతం వరకు బీసీలకే అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు. 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులుదేశంలోనే మొదటిసారిగా చట్టం చేసి మరీ 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు బీసీలకు వైఎస్ జగన్ కట్టబెట్టారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతోపాటు డైరెక్టరేట్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక సహకార సంస్థనూ ఏర్పాటు చేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జన గణనలో కుల గణన కోసం జాతీయ స్థాయిలో బీసీ సంఘాలు ఉద్యమించినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఘనత వైఎస్ జగన్కు దక్కింది. ఆ తర్వాత కేంద్రం అందుకు సానుకూల నిర్ణయాన్నీ ప్రకటించడం గమనార్హం. ఎవరూ అడగకుండానే ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తెచ్చి బీమా వర్తింపజేయడం ద్వారా కల్లు గీత కార్మికులకు వైఎస్ జగన్ నిజమైన భరోసా అందించారు. చేనేత కార్మికుల పెన్షన్ రూ.వెయ్యి చేస్తానని చివర్లో లబ్దిదారులను కుదించి బాబు మోసం చేస్తే.. జగన్ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితిని కుదించి అర్హులైన చేనేతలందరికీ న్యాయం చేశారు. నవరత్నాలతో బీసీలకు డీబీటీ ద్వారా రూ.1,22,451.82 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా రూ.50,657.39కోట్లు మొత్తం (డీబీటీ, నాన్–డీబీటీ) రూ.1,73,109.21కోట్లు అందించి జగన్ బీసీ సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 50 ఏళ్లకే పింఛన్ వంచన.. ఆదరణ ఆర్భాటంతో సరి.. బీసీలకు 50ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లకు ముసాయిదా రూపొందించినట్టు ప్రకటించి సరిపెట్టారు. అది పూర్తిస్థాయిలో చట్టం రూపంలో ఎప్పటికి వస్తుందన్నది అనుమానమే. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ రెండేళ్లుగా సమీక్షలతోనే సరిపోయింది. ఆచరణలో కాలయాపన చేయడంతో బీసీ వృత్తిదారులను నుంచి తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం వంటి హామీలు ప్రకటనతో సరిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయింపులు లేవు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు వ్యయం మేనిఫెస్టోకే పరిమితమైంది.ఆదరణ లేదు.. ఆదుకున్నది లేదు..ఎన్నికల ముందు బీసీ వృత్తిదారులకు మాయ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. రెండేళ్లుగా బీసీ వృత్తిదారులకు ఆదరణ పథకం లేదు.. సంక్షేమ పథకాలతో ఆదుకున్నదీ లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లతో ఆదరణ 3.0ద్వారా అధునాతన వృత్తి పరికరాలు అందిస్తామని చెప్పారు. రెండేళ్లలో బడ్జెట్లో రూ.రెండు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ.వెయ్యి కోట్లు కేటాయించినా అందులోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బీసీ వృత్తిదారులకు రూ.10వేల కోట్లతో ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. బీసీ కులాలకు రక్షణ చట్టం తెస్తామని ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. కూటమి పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. –మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్రకన్వీనర్ఉపాధి లేదు.. నిరుద్యోగ భృతి రాదు..ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు రాష్ట్రంలో యువత, విద్యార్థులను దారుణంగా మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దగా చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు ఇస్తామని రెండేళ్లయినా ఒక్క రూపాయీ విదల్చలేదు. బాబు ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలు ఇతర ఖర్చులకు రూ.లక్షలు ఖర్చు పెట్టేందుకు మధ్యతరగతి ప్రజలూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి సామాన్యులకూ కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విద్యా హక్కు చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు పూర్తైన విద్యార్థులకు కాలేజీల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. సర్టిఫికెట్లు రాకపోవడంతో వారికి ఉద్యోగం వచ్చినా చేరలేని దయనీయ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. –ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్40ఏళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారుఫార్టీ ఇయర్స్ ఇండస్త్రీ అని చెప్పుకొనే చంద్రబాబు 40ఏళ్లకుపైగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఊదరగొడతారు. ఆయనను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక దగా చేయడం అలవాటుగా మారింది. 2024 ఎన్నికల్లోనూ బీసీ ఓట్ల కోసం చంద్రబాబు బీసీ రక్షణ చట్టం తెస్తానని, బీసీ ఉప ప్రణాళిక అమలు చేస్తానని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని అనేక హామీలు ఇచ్చి అమలులో కాలయాపన చేస్తున్నారు. బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – బీసీ రమేష్గౌడ్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
లం.. కొడకల్లారా...నేను ఎవరో తెలియదా?
సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త ఓ పోలీసు చొక్కా పట్టుకొని పరుష పదజాలంతో వీరంగం సృష్టించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 21న రాయదుర్గంలోని క్రీడామైదానంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీనికి వచ్చిన కణేకల్లుక్రాస్కు చెందిన టీడీపీ కార్యకర్త, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మారుతి తన కారును క్రీడామైదానం ఎంట్రెన్స్లో దారికి అడ్డంగా పెట్టాడు. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర, కానిస్టేబుళ్లు రాజ్కుమార్తో పాటు మరికొంత మంది అతడిని ‘నీ కారు దారికి అడ్డంగా ఉంది. మరోచోట పార్కింగ్ చేయు’ అని సూచించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మారుతి..‘నేను ఎవరనుకొన్నావ్? నేను కాలవ మనిషిని..కాలవ భరత్కు సన్నిహితుడిని..నా కారును తీసి పక్కనబెట్టమంటారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ‘లం..కొడకల్లారా! నేను ఎవరనేది తెలియదా? ప్రభుత్వం మాదిరా’ అంటూ దుర్భాషలాడాడు. కానిస్టేబుల్ రాజ్కుమార్ చొక్కా పట్టుకుని ‘నేనేంటో నా తడఖా ఏంటో చూపిస్తా’ అంటూ ఎవరికో ఫోన్ చేస్తూ రెచ్చిపోయాడు. మంత్రి లోకేశ్తో మారుతి (ఫైల్) అయితే ఈ ఘటనపై ప్రభుత్వ విప్ కాలవ జోక్యం చేసుకుని ‘వాడు మనోడే.. వదిలేయండి. నో కేస్..నో యాక్షన్’ అంటూ పోలీసులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ‘సార్.. మీ కార్యకర్తే కావచ్చు..పట్టపగలు జనం చూస్తుండగా చొక్కా పట్టుకొని మమ్మల్ని తిడితే ఊరికే ఉండాలా? కొడితే కొట్టించుకోవాలా?’ అంటూ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఒక్కసారికి అతన్ని క్షమించి వదిలేయండంటూ కాలవ చెప్పడంతో పోలీసులు కేసు లేకుండా పంపించేశారు. -
కూటమి కంటే వైసీపీ 100 రెట్లు బెటర్ అంటున్న జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు
-
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
-
నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం
-
జేసీ ఏది చెప్తే అదే చేస్తారా ? తాడిపత్రి పోలీసులపై అనంత వెంకటరామిరెడ్డి ఫైర్
-
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. -
కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, ఛైన్ స్నాచింగ్స్ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసు అధికారులు అలవాటు పడ్డారు. అందుకే తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారు. పోలీసు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. నేరాలకు పాల్పడటం. కౌంటర్ కేసులు పెట్టడం. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈనెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్ష విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎవరి పేర్లూ చెప్పొద్దు
సాక్షి, అమరావతి : ‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్లో అదృశ్యం వెనుక సూత్రధారుల పేర్లు బయటపెటొద్దు.’ – ఇదీ సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్.సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ, ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్బాస్తోపాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయటపెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అజ్ఞాతం వీడి, అరెస్టుకు సహకరించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి.నేను ఒప్పుకోను.. అందరిపేర్లు బయటపెడతా – ఎదురుతిరిగిన సీఐ నాగరాజుకాపు యువకుడు సాయికృష్ణను లాకప్లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూ దందాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంతోనే సాయికృష్ణను టాస్క్ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్బాస్ డైరెక్షన్లో కథ నడిపించారు. టాస్క్ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా, చినబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి.. ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ, ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ.అందుకే ఈ కేసులో ఏ1, ఏ2గా ఉండాల్సిన బాస్, టాస్క్ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సీఐ నాగరాజు వరకే ఎఫ్ఐఆర్ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సీఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి.. పెద్దలు అందరూ తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన ప్రభుత్వ, పోలీసు పెద్దలకు ఝలక్ ఇచ్చారు. ‘అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్ఫోర్స్ పోలీసులు.. టాస్క్ఫోర్స్ సీపీ ఆధీనంలో పని చేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు’ అని సీఐ వాదించినట్టు సమాచారం. టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి గానీ, తనకు అప్పగించినట్టు ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ, పోలీసు పెద్దలు షాక్కు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారంసీఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ.. సీఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సీఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లూ బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్టు అయితే త్వరగా బెయిల్పై విడుదల అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెరవెనుక నుంచి డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేయిస్తుండటం గమనార్హం. -
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, జేసీ అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా, వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సాయిబాబాపై మంత్రి ఆనం సంచలన కామెంట్స్
-
సాయి కృష్ణ కేసుపై బాబును ప్రశ్నించిన జగన్
-
కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబివ్వాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్పై పిచ్చి కూతలు కూసిన పంతం నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడే ముందు.. రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం సహా వివిధ పథకాల ద్వారా రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. -
తుమ్మిళ్ల ఇసుక రీచ్లో ఏపీ టీడీపీ మూకల దాడి
రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో టీజీ ఎండీసీ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ మూక దౌర్జన్యానికి తెగబడింది. సైట్ ఇన్చార్జిపై దాడి చేసింది. కింద పడేసి పిడి గుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నడమే కాకుండా చంపేస్తామంటూ దుండగులు బెదిరించారు. ‘సోమవారం మధ్యాహ్నం రెండు కార్లలో వచ్చిన ఆరుగురు దుండగులు..సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం. ఇదే మా ఠాగూర్ అన్న ఆర్డర్ అంటూ అక్కడ ఉన్న బ్యాగ్ను తీసుకెళ్లారు. ఆ బ్యాగులో ఇసుక రీచ్ స్టాక్ బుక్కులతో పాటు, రూ.4 లక్షల నగదు ఉంది..’ అని దాడికి గురైన సైట్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. దాడి చేసిన వారిలో గుంటూరుకు చెందిన అడుసుమిల్లి శ్రీధర్ అనే వ్యక్తిని తాము గుర్తు పట్టామని చెప్పారు. వ్యాపార సంబంధమైన గొడవలతో..? తుమ్మిళ్ల ఇసుక రీచ్ ద్వారా ఆన్లైన్లో స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. ఏపీకే చెందిన ప్రసాద్ అనే కాంట్రాక్టర్ దీన్ని నిర్వహిస్తున్నాడు. కాగా ఠాగూర్ అనే వ్యక్తితో ప్రసాద్కున్న వ్యాపార సంబంధమైన గొడవలే దాడికి కారణమని తెలిసింది. ఈ దాడిపై రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. అడుసుమిల్లి శ్రీధర్ ఏపీలో స్థానిక టీడీపీ నాయకుడని చెప్పారు. కాగా ఠాగూర్ హస్తంతోనే తనపై దాడి జరిగినట్లు లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఠాగూర్ ఏపీలోని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడని అంటున్నారు. ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివసిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో కలకలం సోమవారం జరిగిన ఈ దాడి జిల్లాలో కలకలం సృష్టించింది. కొద్దిరోజుల కిందట కర్నూలుకు చెందిన నాయకులు వారి వెనక వాహనాల్లో వందలమంది అనుచరులను తీసుకొచ్చి, నదిలో ఇసుక తీయొద్దని, ప్రభుత్వ అధికారులకే వార్నింగ్ ఇచ్చారని, ప్రస్తుతం గుంటూరుకు చెందిన కొందరు ఇలా వచ్చి దాడికి తెగబడ్డారని చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని రాజోళి ఎస్ఐ గోకారి తెలిపారు. అయితే ఇసుక రీచ్లోని తన సిబ్బందిపై దాడి ఘటనపై కేసు నమోదు చేయకపోతే మంగళవారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తానని కాంట్రాక్టర్ ప్రసాద్ తెలిపారు. -
పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతూ.. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకుని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు! ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరి తెగించిన పచ్చ ముఠాలు పోలవరం కాలువను కుళ్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను (బండ్స్) కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించి జేబులు నింపుకొంటున్నారు. విజయవాడకు కూతవేటు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో కేజీఎఫ్ గనులను తలదన్నేలా ఈ మట్టి దందా సాగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలతో కాలువ గట్లు బలహీనపడి వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో.. ఇక్కడ కాలువ గట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్న పోలవరం కాలువలో మట్టి దందా ఇలా ఉంది..!మట్టి గుట్టలు మాయం..పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని మింగేసేందుకు ముఖ్యనేత డైరెక్షన్లో టీడీపీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అవసరాల కోసం పోలవరం కాలువ 167.040 కిలోమీటరు వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు పరిమితంగా పగటి పూట మాత్రమే చేపట్టాలి. దీనికి విరుద్ధంగా రోజు భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువ గట్లను ఛిద్రం చేసి వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారు. అడ్డగోలు తవ్వకాలపై సామాజిక కార్యకర్త జమలయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. జీపీఎస్ మ్యాపింగ్ ఫొటోలతో నీటి పారుదలశాఖ అధికారుల దృష్టికి సైతం తెచ్చినా స్పందించలేదు. ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో మరింత బరి తెగించి పోలవరం కుడికాలువ 166 కి.మీ. నుంచి 168 కి.మీ. వరకు రెండు కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గట్లను తవ్వడంతో భారీ మట్టి గుట్టలు మాయమయ్యాయి. కొన్ని చోట్ల బండ్ను మాయం చేశారు. దీంపాటు ఇదే ప్రదేశంలో కాలువ గట్టుకు సమీపంలో ఉన్న దండ తిప్పలు కొండలను సైతం బాంబులతో పెకిలించి గ్రావెల్ను తరలిస్తున్నారు.రూ.350 కోట్ల మట్టి దందా!– సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ మట్టి దందాకు అండదండలు అందిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని (శ్రీనివాస్) సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ రూరల్ పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ రక్షణ గట్లను, బుడమేరు డైవర్షన్ కాలువ(బీడీసీ) పరిసరాల్లోని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఎంపీ కేశినేని చిన్ని రూ.350 కోట్లు పోగేశారని ఆరోపించారు. పదవిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఒక పెద్ద బినామీ నెట్వర్క్ ద్వారా ఈ దోపిడీకి తెర తీసినట్లు పేర్కొన్నారు. మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీల కీలక చర్చలన్నీ విజయవాడ గురునానక్ కాలనీ ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 301 కేంద్రంగా సాగినట్లు వెల్లడించారు. అక్కడ తక్షణమే దాడులు నిర్వహించి సోదాలు చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. కేవలం ఐదు వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి పొంది ఏకంగా రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని కాలువ గట్ల నుంచి తవ్వేందుకు వ్యూహం రచించారని తెలిపారు. జేసీబీలు, పొక్లెయిన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపించారన్నారు. వందలాది టిప్పర్ల మట్టిని అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలించి విక్రయించారని చెప్పారు. ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా మైనింగ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మైలవరంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఫిర్యాదుమైలవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.సహజ వనరుల లూటీరాజధాని నిర్మాణం ముసుగులో టీడీపీ నేతలు అమరావతిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద, సహజ వనరులన్నింటిని దోచేస్తున్నారు. పోలవరం గట్లను సైతం మాయం చేస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ మట్టి దోపిడీ కేజీఎఫ్–3 సినిమాను తలపిస్తోంది. యథేచ్ఛగా మట్టి దోచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. మట్టి దోపిడీపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.– జోగి రమేష్, మాజీ మంత్రి -
అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు
చక్రాయపేట: ఇసుకాసురుల బరితెగింపు, ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారని ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లెకు చెందిన కారపురెడ్డి జయంత్రెడ్డి (17) కారపురెడ్డి రాజ్వర్థన్రెడ్డి (15)లుగా పోలీసులు గుర్తించారు. బంధువుల కథనం ప్రకారం వివరాలివీ.. కారపురెడ్డిపల్లెకు చెందిన లోకేశ్వరరెడ్డి, ఓబుళమ్మల కుమారులైన జయంత్రెడ్డి, రాజ్వర్థన్రెడ్డిలు వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమర్రి గ్రామానికి వచ్చారు. ఆదివారం మ.3 గంటలసమయంలో అన్నదమ్ములిద్దరూ ఈతకోసం పాపాఘ్ని నదిలోకి దిగారు. అయితే, నదిలో ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లోకి ఇద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే, నది వైపు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందింతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి రెండు గంటలపాటు గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. విగతజీవులుగా మారిన పిల్లలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జయంత్రెడ్డి బీటెక్ ఫస్టియర్లో చేరాల్సి ఉండగా.. రాజ్వర్థన్రెడ్డి చెన్నూరులో ఇంటర్ ఫస్టియర్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను తరలించం.. అక్రమంగా ఇసుక తవ్వి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఇసుక క్వారీ వారు వచ్చేవరకు మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తేలేదని గ్రామస్తులు నది వద్ద బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు శాంతించలేదు. బీటెక్ రవి సహకారంతోనే దందా.. పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలం దృష్ట్యా ఆగస్టు 15 వరకు నదుల నుంచి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆదేశాలిచ్చారు. అలాగే, ఇసుక అక్రమ రవాణాపై కొవ్వూరు శ్రీధర్రెడ్డి దాఖలు చేసిన 78/2026 రిట్ పిటిషన్ను స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ ఎస్. కుమార్సింగ్, గౌరవ మెంబర్ ప్రశాంత్గార్గ్ల బెంచ్.. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. కానీ, ఈ ఉత్తర్వులన్నీ ఇక్కడ బుట్టదాఖలయ్యాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముఖ్య సహకారంతో.. స్థానిక టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి నేతృత్వంలోనే ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. ఇదే విషయమై కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్వయంగా ప్రెస్మీట్ పెట్టి ఆధారాలతో సహా ఆరోపించినా అధికారుల్లో కనీస చలనం లోపించింది. అధికారుల నిర్లక్ష్యంవల్లే అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాతపడ్డారని.. ఇసుకాసురులైన టీడీపీ నేతలపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కాపులకు బాబు ద్రోహం..!
సాక్షి, అమలాపురం/రామచంద్రపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని.. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని.. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలని.. కాపు కార్పొరేషన్కు చంద్రబాబు బకాయి పెట్టిన రూ.9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్కు రూ.3 వేల కోట్లు ఇస్తామని హామీలిచ్చిన చంద్రబాబు రెండేళ్లలో మూడు రూపాయిలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ‘కాపు నేస్తం’ సహా ఎన్నో పథకాలను ఇచ్చారని.. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని.. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదు.. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా? అధికార పార్టీ నేతలు ఎంతోమంది అరాచకాలు చేస్తుంటే పవన్కు కనపడటం లేదా? సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపెడతారా? అయినా కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు..’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు అడగలేదా? ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలసికట్టుగా ఎదుర్కొంటామని.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తామున్నామనే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది మరే కులాలకూ వ్యతిరేకం కాదని, కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టి వెళ్తామని, కాపులతో ఉంటే తమకు ఓ భరోసా ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్య పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని.. కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతోపాటు రూ.వేల కోట్ల నిధులిచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, రౌతు సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్ నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న, మల్లి వెంకట్రాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె.గురునాథరావు, చిన్న శీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. పక్కన కాపు ముఖ్య నాయకులు ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం‘రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. నష్టపోయిన వారింటికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. వారికి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పిస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలసికట్టుగా ఎదుర్కొంటాం..’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఎనిమిది మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు. ‘నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా.. కనీసం బూడిదైనా ఇవ్వాలి..’ అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.ఎన్నికల్లో కులం చూపించి ఓట్లేయమనలేదా?: బొత్సరానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యన్నారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపి శవం కూడా కనిపించకుండా ఏవిధంగా మాయం చేశారో చూశామన్నారు. దీనిపై సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్పై తమకు నమ్మకం లేదన్నారు. ‘క్రిమినల్ కేసులుంటే చంపేస్తారా? అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? అలా అయితే కమిషన్ ఎందుకు వేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులకున్న అంగబలం, ఆర్థిక బలంతో అవసరమైతే సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలతో పోల్చడంపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. అధికారం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు వేయమంటారా? ఇప్పుడు అదే కులంలో మనిషిని చంపేస్తే ఆయనకు అడగాల్సిన బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. ‘కాపులకు న్యాయం జరుగుతుందని రెండేళ్లు ఎదురు చూశాం. అయినా అన్యాయమే జరిగింది’ అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలను ఇచ్చారని, ఇప్పుడు గతంలో ఉన్న పథకాలను సైతం తీసేస్తామంటే ఒప్పుకోబోమన్నారు.ఇవీ తీర్మానాలు..⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. బాబు సర్కారు అరాచకాలను ఖండిస్తున్నాం. సాయికృష్ణను పోలీసులే చంపేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు కూడా పోలీసులే కారణం. వీరి మరణాలపై సీబీఐతో విచారణ చేయాలి.⇒ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.⇒ కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.⇒ కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.⇒ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.⇒ వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం పథకం కింద మహిళలకు రూ.2 వేల కోట్ల సాయం అందించారు. ఈ ప్రభుత్వం మహిళలకు రూ.9 వేల కోట్ల బాకీలు చెల్లించాలి.రూ.3,000 కోట్లన్నారు.. రూ.3 కూడా ఇవ్వలేదుకాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కంటే అధికంగా కట్టుబడి ఉంటామని, రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రూ.3 కూడా కేటాయించలేదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపునేతల ఆత్మీయ సమావేశానికి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు 100 మంది గన్మెన్లను ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఫ్లైట్లు సమకూర్చితే కాపులకు న్యాయం జరిగినట్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల్లో అత్యధికులు చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారన్నారు. వారి జీవితాలు చదువు ద్వారా మాత్రమే మారతాయని, కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి వారందరికీ అన్యాయం చేస్తోందన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయనకు అనుకూలంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరమనే స్థాయి కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహిస్తారా..? అంటూ పవన్ కళ్యాణ్ ఒక రకం నాటకం ఆడితే.. పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దాగుడు మూతలు, డ్రామాలను కాపులతో పాటు రాష్ట్ర ప్రజలంద రూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తమను రెడ్డి కాపులుగా సంబోధిస్తున్న పవన్ కళ్యాణ్.. కమ్మ కాపు అవుతాడా? అని ప్రశ్నించారు. కాపులు కాపులేనని, కులం కార్డు వాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేయడాన్ని సహించబోరని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న కాపులతో పాటు తమ గొంతు వినిపించలేని ఇతర కులాలకు కూడా అండగా ఉండాలని, అందుకోసం టాస్క్ఫోర్స్లు, క్రౌడ్ ఫండింగ్తో ఆదుకోవాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు నాని వివరించారు.అలాగైతే కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు?: తోట త్రిమూర్తులుకాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది మరే కులానికీ వ్యతిరేకం కాదని, అందరూ కలసి ఉండాలని, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కుల జాడ్యం పోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లాంటి పదవులన్నీ కులాల వారీగానే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కులాలు అవసరం లేదన్నప్పుడు.. కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.‘కాపు నేస్తం’.. వైఎస్ జగన్నవరత్నాల పథకాలతో కాపులకు రూ.39,317.80 కోట్ల సాయంకాపు కార్పొరేషన్కు టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు సైతం చెల్లించింది జగనేచంద్రబాబు మాదిరిగా తాను మాయమాటలతో మభ్యపెట్టలేనని ముందునుంచీ చెప్పిన వైఎస్ జగన్ 2019–2024 మధ్య ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిజమైన కాపు నేస్తంగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవరత్నాలతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి బాటలు వేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర లాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు తోడ్పాటు అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. పార్టీ, ప్రాంతం లాంటివి చూడకుండా, దళారుల ప్రమేయం లేకుండా కాపులకు నవరత్నాల (డీబీటీ, నాన్ డీబీటీ) పథకాల ద్వారా రూ.39,317.80 కోట్లను అందించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.500 కోట్లు, 307 మంది విద్యార్థులకు రూ.20.97 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.8.83 కోట్లు ఇవ్వకుండా బకాయి పెట్టగా.. వైఎస్ జగన్ వాటిని చెల్లించడమే కాకుండా కాపుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా 4 కాపు భవనాలు ప్రారంభించింది. -
రాజకీయ కక్షతోనే నన్ను జైలుకు పంపారు: బొల్లా బ్రహ్మనాయుడు
సాక్షి, పల్నాడు జిల్లా: తాను ఏ తప్పు చేయలేదని.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయనను నరసరావుపేటలోని స్వగృహంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిలు బ్రహ్మనాయుడిని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన బొల్లా బ్రహ్మానాయుడు.. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అరెస్టు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రెస్మీట్లో బ్రహ్మనాయుడు ఏమన్నారంటే..నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా?నాపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే. నాకు సంబంధం లేని భూముల వ్యవహారంలో అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారు. నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా? నాపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కంప్లైంట్ నమోదైంది? ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నన్ను తెలంగాణలో అరెస్టు చేయించారు. నా అరెస్టుకు ఐదు రోజుల ముందే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తానని బహిరంగంగా చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగింది. వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి.ఢిల్లీలోని ఏ గెస్ట్హౌస్కు వెళ్లినా కృష్ణదేవరాయులు చరిత్ర చెబుతారుఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను తాను చాలా నిజాయితీ పరుడిగా, నిబద్ధత ఉన్న నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ నా నిజాయితీ గురించి వినుకొండ ప్రజలను అడిగితే చెబుతారు. ఎంపీ గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీలోని ఏ గెస్ట్హౌస్కు వెళ్లినా ఆయన చరిత్ర గురించి వినిపిస్తారు. నేను మీ కంటే ఆస్తిపరంగా చాలా చిన్నవాడిని.మీ నాన్న నిర్వహిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉందో ఒకసారి సర్వే చేయించి మీ నిజాయితీని నిరూపించుకోండి. వైయస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచి పదవిని అనుభవించి, ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ అవకాశాలను ఉపయోగించుకుని వదిలేసింది మీరే. మీలాగా నేను నేరస్తుడిని కాదు. మీ కుటుంబానికి ఇంత ఆస్తి ఉంటే ప్రజలకు మీరు ఎంత పన్నులు చెల్లిస్తున్నారో చెప్పండి. మీరు ఎంత జీఎస్టీ కట్టారో చూపించగలరా? నేను కోట్ల రూపాయల జీఎస్టీ, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నాను. అయినా ప్రభుత్వ ఆస్తులను మింగేశానంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవీ అంజనేయులు తరచూ కంపెనీల పేర్లు మారుస్తుంటారు. బయో ఫర్టిలైజర్స్ సంస్థ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తూ ప్రభుత్వ సబ్సిడీలు పొందుతోంది. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టులు, సొసైటీల పేరుతో పన్ను మినహాయింపులు పొందుతున్నారు.మీ నాన్న బడిపంతులు కదా ..ఇన్ని ఆస్తులు ఎక్కడివి?హైదరాబాద్, విశాఖలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టింది లావు కృష్ణదేవరాయులు కుటుంబమేనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తప్పులు చేస్తున్నది మీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్నది మీరు. మరో ప్రభుత్వం వస్తే మరో పార్టీలో చేరేది కూడా మీరే. మీ బెదిరింపులకు నేను భయపడను. 70 ఏళ్ల వయసులో నా అంతు చూస్తామంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరి అంతు ఎవరు చూస్తారో దేవుడే నిర్ణయిస్తాడు.నేను చదువుకోలేదు, రైతును. కానీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేశాను. వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారు. రెండుసార్లు ఓడిపోయినా ఒకసారి గెలిచి వినుకొండకు సేవ చేశాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎంపీ ఎప్పుడు పిలిచినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. నన్ను ఏమీ చేయలేరు. చివరకు నిజమే గెలుస్తుంది.అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలునాకు అండగా నిలిచిన పార్టీ అధినేత వైఎస్ జగన్కి, మా పార్టీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు.. చేసిందే చెబుతారు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పరు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇవాళ పేదవాడు ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. రాష్ట్రంలో లాకప్ డెత్లు కనిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు ఆపి, ప్రజలకు మంచి చేసే పాలన అందించాలి అని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.జైలుకు పంపడం దారుణం: విడదల రజినిమాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు బనాయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో 74 ఏళ్ల వయసులో ఆయనను జైలుకు పంపడం దారుణం. గండికోట భూముల వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడే. కానీ ఆయననే నిందితుడిగా చూపించి వేధింపులకు గురిచేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరుకుంది. చట్టాలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ విధానంగా మారింది.బ్రహ్మనాయుడికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది: గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డిమాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పూర్తిగా అక్రమంగా కేసు బనాయించారు. ఆయనకు ఆ భూముల కేసులతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆయనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారు. ప్రజలకు సేవ చేసిన ఒక సీనియర్ నాయకుడిని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటకు వస్తే ఈ కేసుల్లో నిజాలు ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ప్రత్యర్థులను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి అక్రమ కేసులు, వేధింపులకు వైయస్ఆర్సీపీ భయపడదు. బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా నిలుస్తుంది.గండికోట భూములు కేసులో బ్రహ్మనాయుడే బాధితుడు: గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిబొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ గల పెద్దమనిషి. ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్న నాయకుడిని రాజకీయ కక్షతో వేధించడం బాధాకరం. 74 ఏళ్ల వయసులో ఆయనపై కక్ష కట్టి జైలుకు పంపడం కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. గండికోట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడు కాగా, ఆయననే నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలను పక్కనపెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అక్రమ కేసులు, రాజకీయ వేధింపులతో వైయస్ఆర్సీపీ నాయకులను భయపెట్టలేరు. వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి" అని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. -
టీడీపీ నేతల అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జోగి రమేష్.. జాయింట్ కలెక్టర్తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.జోగి రమేష్తో ఫోన్లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. -
‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’
సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను...2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000...పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు...ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి...ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు...మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్కు బీపీ పెరుగుతోంది’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్కి మతి భ్రమించిందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్కి బీపీ పెరుగుతోందన్నారు.‘‘పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడటం లేదు. వైఎస్సార్సీపీ నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తాం. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేస్తున్నారనంటూ అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘తన బిడ్డను చంపేశారని, కనీసం బూడిదనైనా ఇప్పించమని అడిగారు. ఆ తల్లికి మద్దతుగా వైఎస్ జగన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లిని ఓదార్చితే కుల రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. సాయికృష్ణ నేరగాడనైతే మరి అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పిలిపించారు?. జనసేన నేత ఉదయభాను.. సాయికృష్ణ ఇంటికి ఎందుకు పంపించావ్ పవన్?. అంతకంటే ముందు తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ను పంపలేదా?. కేసును రాజీ చేసుకోవాలని కోరలేదా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.‘‘సాయికృష్ణ నేరస్తుడైతే మాత్రం పోలీసులతో చంపేస్తారా?. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగతేంటి?. ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్న చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారు?. కనీసం కేసు కూడా పెట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదికాదా పవన్?. కాపులంతా తనకు మద్దతుగా నిలబడితే సీఎం అవుతానని పవన్ చెప్పలేదా?. మరి తన సినిమాలను కూడా కాపులు మాత్రమే చూడాలని ఎందుకు చెప్పలేదు?. రాజకీయాలకు మాత్రం కులం కావాలా?..కుల రాజకీయాలు చేస్తూ ఇతరులను విమర్శించటం ఎందుకు?. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పవన్ ఎందుకు సానుభూతి చెప్పలేదు?. దళితుడైన క్రాంతికుమార్ పవన్కు కనపడలేదా?. హోంమంత్రి పదవి మీద పవన్కు మనసు పడింది. అందుకే పదేపదే నేను హోంమంత్రినైతే.. అంటున్నారు. దళితురాలు అనిత హోంమంత్రిగా పనికి రాదని పవన్ చెప్తున్నారు. ముందుగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయండి. అతని మిస్సింగ్ వెనుకున్న పోలీసు పెద్దల పాత్రను బయట పెట్టండి’’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హితవు పలికారు. -
వైఎస్సార్సీపీ BLAపై టీడీపీ నేతల దాడి
సాక్షి, నంద్యాల: డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎస్ఐఆర్ సర్వేలో TDP ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏ భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మధుసూదన్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త భరత్పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న సోదరుడిపైనా దాడికి తెగబడ్డాడు. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
న్యాయం చేస్తానన్న పవన్.. ఆధారాలే లేవంటున్నాడు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రంగా ఖండించారు. ఈ కేసును నీరుగార్చేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందిన పవన్.. ఇప్పుడు అదే కేసుపై భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసులోని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం తమకు కలుగుతోందని పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై తాజాగా సుగాలి పార్వతి స్పందించారు. ఈ సందర్బంగా పార్వతి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసే తన మొదటి ప్రాధాన్యమని చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఈ కేసులో పవన్ ఒక్క ఆదేశాలు జారీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో అఘాయిత్యం జరిగింది. ఈ అన్యాయంపై పవన్కు పూర్తిగా వివరించాను, ఆధారాలు కూడా ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పటికీ న్యాయం చేయలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఏమయ్యారు?. నిందితులకు అమ్ముడుపోయే విధంగా పవన్ వ్యహరిస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ఈ కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం దారుణం.సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు. దీనిపై వక్రీకరించి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలోనే కేసులో ఆధారాలను తారుమారు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నా.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ తన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని వాపోయారు. కానీ, సుగాలీ ప్రీతి కేసును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారుస్తున్నారు. సుగాలీ ప్రీతి కేసును పవనే నీరుగారుస్తున్నారు.ఈ కేసులో నిందితులను వీదేశాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేశారు. సుగాలీ ప్రీతి ఆత్మకు శాంతి కలిగించే విధంగా నేను పోరాటం చేస్తాను. మా కుమార్తె కోసం వీల్ చైర్ యాత్రను ప్రారంభిస్తాను. తప్పకుండా న్యాయం కోసం పోరాటం చేస్తాం’ అని తెలిపారు. -
లావు, ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: ఎవరు భూ కబ్జాలు చేశారో తేల్చుకుందాం రండి అంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. నేను బహిరంగ చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమైతే టైము ప్లేసు డిసైడ్ చేయండి. మీకు తోడు లోకేషన్ తెచ్చుకున్న నేను సిద్ధం. నాకు, గండిపేట భూముల కేసుకు ఎలాంటి సంబంధం లేదు’’ అని బొల్లా స్పష్టం చేశారు. నన్ను అక్రమంగా కేసులో ఇరికించారు. నేను అరెస్టు అయ్యే ఐదు రోజులు ముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్సార్సీపీ రాజకీయ బిక్ష పెట్టింది. ఓట్లేసి లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన మోసం చేశారు. కార్యకర్తలను మోసం చేశాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు.‘‘లావు శ్రీకృష్ణదేవరాయలు లాగా పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని నేను కాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. ఢిల్లీలో లావు శ్రీకృష్ణదేవరాయలకు బినామీ పేర్లతో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయో అందరికీ తెలుసు. మద్యం షాపులు తీసుకొండంటూ పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలు బతిమిలాడాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు కబంధహస్తాల్లో చిక్కుకుంటే ఏమవుతుందో మాకు తెలుసు..వినుకొండ వస్తే బొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ తెలుస్తుంది ఢిల్లీ వెళ్తే లావు శ్రీకృష్ణదేవరాయల లిక్కర్ బాగోతం తెలుస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గాని ఆయన తండ్రి గాని ఒక్క విద్యార్థికై ఎప్పుడైనా రాతి రాయితీ ఇచ్చి చదివించారా?. వైఎస్సార్సీపీలో ఉండి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశానికి కోవర్టుగా పనిచేశారు. వెన్నుపోటు పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు.’’ అని బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు. -
‘టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్ట్ రెడీ అవుతోంది’
సాక్షి, తాడేపల్లి: కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేని మద్యం స్కాంలో కారుమూరి సునీల్ని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘బీసీల అణచివేతకే సునీల్ అరెస్టు. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.కాగ్ లాంటి సంస్థలు ఏమైనా అభ్యంతరం తెలిపాయా?. శాఖాపరమైన విచారణ ఏమైనా జరిగిందా?. అవేమీ లేకుండానే విజిలెన్స్ విచారణకు ఎలా ఆదేశించారు?. సాయిశ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించటం దుర్మార్గం. దమ్ముంటే నారా లోకేషే ఫిర్యాదు చేయొచ్చుగా?. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది. ఫిర్యాదు, విచారణ ఎలా జరగాలో టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్టు రెడీ అవుతోంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ హయాంలో పారదర్శకంగానే రవాణా టెండర్లు జరిగాయి. తక్కువ ప్రైస్ చూపిన వారికే టెండర్లు దక్కాయి. అందులో నేరం ఏం ఉంది?. కేవలం కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసులకు సోషల్ మీడియా కార్యకర్తలే భయపడలేదు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారా?’’ అంటూ నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు. -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాడు రాజకీయాల కోసం తల్లిని కూడా బలి చేస్తాడు..
-
‘రెడ్బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడింది’
సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. -
నా కళ్లారా చూశా లాక్అప్లోనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షి షాకింగ్ నిజాలు
-
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
అనగానగా ఓ పార్టీ.. దాంట్లో రౌడీలు, కామాంధులు
-
చంద్రబాబూ.. ప్రజల కోసమా?.. పబ్లిసిటీ కోసమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా? లేదా? అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా? లేదా? అన్నదానితో సంబంధం ఉండదు. తన టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్లోని పాయింట్లను అన్నిటిని చెప్పానా? లేదా? అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయా సభలలో చేసిన ఒక వ్యాఖ్య చూడండి. 'బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు" అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్పై చేసిన పరోక్ష ఆరోపణ అని తెలుస్తూనే ఉంది. కాని ప్రజలు తమకు ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తామన్న సంక్షేమ స్కీమ్లు ఇచ్చారా? లేదా? తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా? లేదా? అన్నది చూస్తారు తప్ప, తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా?లేదా? అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం లేకపోలేదు.గత జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా, వారికి అన్ని అవసరాలలోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని గుర్తించారు. అంతే! వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగు ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒకాయనను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు. పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు ఐదువేలు అని, తనకు అత్యవసరం కనుక 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని, తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతనినే కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్ను పరిశీలించిన అతను 400 రూపాయలకు ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా వాచ్ అమ్మిన వ్యక్తి లాభపడతాడన్నమాట.ఆశకు లొంగి రెండో వ్యక్తి మోసపోయాడన్నమాట. ఈ కథకు, చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా? లేదా అన్నది పక్కనబెడితే, ప్రజలను ఆశపెట్టి వారికి ఆకర్షించడంలో చంద్రబాబు సిద్దహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వలంటీర్లను వలలో వేసుకుని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైమ్లో ఇచ్చిన ఐదువేల గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్లవద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో, లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వెళతారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్లిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.వృద్దాప్య పెన్షన్ జగన్ టైమ్లో మూడువేల రూపాయలు ఉండేది. దానిని వలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి నాలుగువేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాఫ్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైఎస్సార్సీపీ హయాంలో అందరి ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తే, అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లవ్వదా! అన్నది వైఎస్సార్సీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా? అంటే లేదు.1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన పవర్ లో ఉన్నారు కదా! ఆ టైమ్లో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వలంటీర్ల బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాని, అది అంత సఫలం అవుతున్నదా? అన్నది చర్చ ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు. పౌరసరఫారాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే! అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి జనం సరుకులు తీసుకోవలసి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమికూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందా? ఇదే కాదు.. ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో కాని, అప్లికేషన్లు పెట్టుకోవడంలో కాని, అనేక రకాలుగా వలంటీర్ల సేవలను ప్రజలు పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.వలంటీర్లు ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వంలో తమ ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీమ్ల అమలు నిమిత్తం ఆయా చోట్ల సభలు నిర్వహంచకపోలేదు. అయినా జగన్ బటన్ నొక్కడమే చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది.. మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ, దుబారాపై ఆదేశాలు ఇస్తూ, తానేమో ప్రజల డబ్బును లక్షలలో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.వృద్దాప్య పెన్షన్ను సీఎం ఇచ్చినా, వలంటీర్ ఇచ్చినా లబ్దిదారులకు తేడా ఉండదు. వారికి కావల్సింది ఆర్థికసాయమే. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలలో అనేకమైన వాటిని ఎగవేసి, దానిని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడడానికి ఈ సభలు, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్ట సుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా? లేక తన పబ్లిసిటీలో భాగంగా దీనిని ఒక ఈవెంట్ గా మార్చారా? అన్నది చర్చనీయాంశమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నన్ను గెలికితే.. ‘ఆపరేషన్ సింధూర్’ తప్పదు!
జమ్మలమడుగు: ‘‘నేను ఎవరి జోలికీ వెళ్లను, ఎవరినీ గెలకను.. కానీ నన్ను ఎవరైనా గెలికితే మాత్రం ‘ఆపరేషన్ సింధూర్’ చేపడతా’’ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర బెదిరింపులకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మలమడుగులో నిర్వహించిన ర్యాలీ అనంతరం పాత బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నంత సేపూ కింద ఉన్న కొందరు కార్యకర్తలు అరుస్తూ గోల చేస్తుండటంతో ఆదినారాయణరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆవేశంతో..కోపంతో ఊగిపోతూ.. ‘‘నేను మూడు రెండు వేసి అరుస్తాను.. నేను ఆరు వేసినా అరవకుండా ఉంటారా?’’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నివిధాలుగా అభివృద్ధి చేశామంటూ ప్రగల్భాలు పలికారు. నియోజకవర్గంలో చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆయన మైకులో చెబుతుండగానే.. కింద ఉన్న ఒక చేనేత కార్మికుడు గట్టిగా స్పందిస్తూ, తనకు ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రాలేదని అందరి ముందూ వాపోవడంతో సభలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది.వైఎస్సార్సీపీ సభకు పోటీగా పెట్టినా.. వెలవెలబోయిన కూటమి సభ!ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ’వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చి సభను భారీగా విజయవంతం చేశారు. దానికి పోటీగా ఎలాగైనా సరే జమ్మలమడుగులో అంతకంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తామేంటో నిరూపించుకోవాలని కూటమి నేతలు ఆశపడ్డారు. అయితే, వైఎస్సార్సీపీ సభకు వచ్చిన జనంలో సగం మంది కూడా ఈ రోజు కూటమి సభకు రాలేదని, కేవలం నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్రమే హాజరయ్యారని అక్కడికి వచ్చిన వారి సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకోవడం ఇక్కడ కొసమెరుపు. -
సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మై టీడీపీ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దానికంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయని అన్నారు.బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసీ వెంటనే అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు.అనంతపురంలో టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్రఅనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను పరిశీలించగా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్న విషయం వెల్లడైందన్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చిందని, దానిని ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారని అన్నారు. బుధవారం శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐఆర్ ప్రక్రియలో దూరాడని, తాము అడ్డుకుంటే పొరపాటు అంటున్నారన్నారు. ఇది పొరబాటు కాదని, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని చెప్పారు. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓటరుకు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగా ఉండాలన్న విషయం తెలియదా అని అన్నారు. అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫారంలు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు, ఎస్ఐఆర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తారు. రెడ్బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్లు వేసేవాళ్లు. కానీ లోకేష్ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
‘సర్’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని శైలజానాథ్ తెలిపారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..ఎస్ఐర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్రఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్ చేసింది. 16వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాకు ఉన్న అనుమానాలు, మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఫిర్యాదు చేశాం. దీనిపై మా నాయకులు సచివాలయంలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎవరికి మేలు చేయానుకుంటున్నాయి?చంద్రబాబు ఎలాగో తనకు తాను తప్ప ఎవరికీ మేలు చేయడు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్సార్సీపీకి చెందిన 30 లక్షల ఓట్ల గల్లంతు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని కాపాడుకున్నాం. కాబట్టి ఎన్టీయే నుంచి, టీడీపీ నుంచి పారదర్శకత ఊహించలేం. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్ని చూసిన తర్వాత, బీహార్లో మేం బతికే ఉన్నాం అని సుప్రీంకోర్టుకు ఓటర్లు చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగలేదు.ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. వీటిని అనూహ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలోనూ అదే తంతు కొనసాగుతుందని చెప్పడానికి మేం వెనుకాడట్లేదు. ఎస్ఐర్ ప్రక్రియలో వైరస్ తరహాలో టీడీపీ చొరబడింది. మై టీడీపీ యాప్ పెట్టుకుని కుట్రకు తెరలేపింది. ఈ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దాని కంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయి. బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.అనంతపురంలో టీడీపీ కన్నుసన్నల్లో ఎస్ఐఆర్అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను మేం పరిశీలించాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చింది. ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారు. టార్గెట్గా ఓట్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐర్ ప్రక్రియలో దూరాడు.పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తున్నారు. మేం అడ్డుకుంటే పొరబాటు అంటున్నారు. ఇది పొరబాటు కాదు, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర. దళితులు, మైనార్టీలు, పేదల హక్కుల్ని హరించే కుట్ర ఇది. గతంలోనే ఇది నిరూపితమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రజల ఓట్లను న్యాయంగా కాపాడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు. ఒకాయన ఇందులో ఏం తప్పుందని అడుగుతున్నారు. ఓటరుకు సంబంధించిన ప్రతీ విషయం గోప్యంగా ఉండాలన్న విషయం మీకు తెలియదా? ప్రజల ఓట్లు లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.ఈసీ పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలిశింగనమల నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరుగుతోందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఊహించుకోవచ్చు. మీ సీఐలు ఉన్నా ఇలాఖాలో అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫామ్లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది వదిలేసి, బుక్క రాయసముద్రంలో ఏటీఎం ఎత్తుకుపోతే అది పెద్ద విషయమని పోలీసులంతా అక్కడికి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కు ముఖ్యం కాదా? ఎస్ఐర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయి.క్షేత్రస్దాయిలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల తీరు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. సర్ ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలి. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్సార్సీపీ భారీ పోరాటాలకు సిద్ధంగా ఉంది. కులం, మతం, పార్టీ, ప్రాంతం, అధికారం పేరు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రభావానికి లోనుకాకుండా ఎస్ఐర్ ప్రక్రియను నిర్వహించాలి. ఈ ప్రక్రియలో తప్పిదాలు జరిగితే అంతిమంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని సాకే శైలజానాథ్ హెచ్చరించారు. -
నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు. -
టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ యాప్లో నమోదు చేస్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) వెంట టీడీపీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని ‘మై టీడీపీ పాస్పోర్టు’ అనే యాప్లో నమోదు చేస్తున్నారు. మంగళవారం ఆదోనిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 243 పరిధిలో బీఎల్వోతో కలిసి టీడీపీకి చెందిన శ్రీనివాసాచారి ఓటర్ల వివరాలను సేకరించారు. ఆ వివరాలను ఆయన ‘మై టీడీపీ పాస్పోర్టు’లో నమోదు చేశారు. ఎప్పటికప్పుడు తాను నమోదు చేసిన ఓటర్ల డేటాను స్క్రీన్షాట్ తీసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఫారం–7 సమర్పించి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఈ కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలో కనీసం 50 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఫారం–7 సమర్పించడం ద్వారా తొలగించేలా చూడాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టార్గెట్ పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ బీఎల్ఏల అక్రమ చర్యలను అడ్డుకోవాల్సిన బీఎల్వోలు వారికి పూర్తిగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బీచ్లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి?
డాబాగార్డెన్స్ (విశాఖ): ‘విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా..’ అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనివ్వకుండా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడ్డుకుంటున్నారని, అబద్ధపు ప్రచారాలు ఆపి, డేటా సెంటర్ను అడ్డుకోవద్దని సూచించారు. డేట్ సెంటర్ ఏర్పాటుతో 200 మీటర్ల పరిధిలో హీట్వేవ్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ ఏర్పాటు ప్రారంభంలో కన్స్ట్రక్షన్ సమయంలో 40 నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని.. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత వెయ్యిలోపే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎంపీ ఒప్పుకున్నారు. విశాఖలో ఉన్న ఎయిర్పోర్టును కొనసాగించాలన్నా..వద్దన్నా పూర్తి హక్కు జీఎంఆర్ దే అన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో నిర్మించిన.. భోగాపురం ఎయిర్పోర్టు జీఎంఆర్ కోసమేనంటూ ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనల మేరకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని ఎంపీ వెల్లడించారు. విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంటున్నారని, అది కుదరదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ విమానాశ్రయం ఉండదని చెప్పారు. పర్యావరణం పేరిట ఇటీవల బీచ్ రోడ్డులో చేపట్టిన సంతకాల సేకరణ (డేటా సెంటర్కు వ్యతిరేకంగా)కు నగర పోలీస్ కమిషనర్ను పిలిచి మోసం చేశారని ఎంపీ తెలిపారు. సంతకాల సేకరణలో పాల్గొన్న సీపీని తాను ప్రశ్నించగా..పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమమని తనను ఆహ్వానించి మోసం చేసినట్టు తనతో సీపీ చెప్పారన్నారు. -
ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే.. ‘ఆక్వా’పై అల్టిమేటం
సాక్షి, అమరావతి: దారుణంగా పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వతేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే యూనిట్ విద్యుత్కు 2014–19 మధ్య రూ.3.85 చొప్పున వసూలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.2కే అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని.. ఆ దిశగా వారం క్రితం జీవో ఆర్టీ 169 జారీ చేశారని.. క్లాజ్ నెం 4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్ పెట్టారని దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు.. ఫిషరీస్ అసిస్టెంట్లు.. అప్సడా ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి ఛైర్మన్గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా, రైతులకు ద్రోహం జరగకుండా చూశాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్..యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశాం. మనం ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాక.. చంద్రబాబు యూనిట్ విద్యుత్ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా అమలు మాత్రం చేయలేదు. అక్కడా విద్యుత్ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.అవార్డులు, భారీగా ఎగుమతులు.. రూ.వంద కోట్లతో ఆక్వా వర్సిటీ..మన హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్లో స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు కూడా దక్కాయి. నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు.. ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. తాత్కాలిక భవనాల్లో క్లాస్లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.నెలాఖరులోగా ధరలు తగ్గించాల్సిందేఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రాష్ట్రమంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకూ పనికిరావు. 3 సార్లు ఉపసంహరించేలా చర్యలు..నాడు ‘అప్సడా’ ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచితే మూడుసార్లు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నాం. థాయ్లాండ్కు చెందిన సీపీఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు. రొయ్యల ధరలపై నిరంతర సమీక్షనాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్ రొయ్యలు రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యలు రూ.470 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు ఐపీఆర్ మోహన్రాజు, దుగ్గినేని గోపీనాథ్, జి.రాజ్కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్రెడ్డి, సీహెచ్ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరి ఇది.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని తెలియడంతో ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెబుతూ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు అంతా సిండికేట్గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధరలు సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి ఫీడ్ రేటు పెంచుతున్నారు. అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఆక్వా ఫీడ్, సీడ్ రంగంలో సహకార వ్యవస్థ వస్తే ఇలా సిండికేట్గా మారడం, దోపిడీ చేయడం సాధ్యం కాదు. మనం డెయిరీ రంగంలో అమూల్ను తీసుకురావడం వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో సిండికేట్ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మన ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు వారికి తోడుగా నిలిచేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020 అమలు చేసి ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్పై కేజీకి రూ.10, టైగర్పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ట్యాక్సా? వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి.బాబు బంధువులే ఉత్పత్తిదారులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పీఎఫ్ ఫ్యాక్టర్తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు (వైఎస్ జగన్) వచ్చాకే విద్యుత్ సబ్సిడీతో పాటు అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుజీవామృతంలా అప్సడా ఏర్పాటుఆక్వా రైతులకు జీవామృతంలా వైఎస్ జగన్ ‘అప్సడా’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్సడాను బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. వేట నిషేధ సమయంలో ఫిష్ మీల్ రేట్లు పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతున్నారు. ఫీడ్ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10 వేల కోట్లు నష్టపోతున్నారు. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. లోకల్ మార్కెట్ పెంచడానికి ఫిష్ ఆంధ్రా కార్యక్రమం చాలా ఉపయోగపడింది. – ఐపీఆర్ మోహన్రాజు, భీమవరంఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెంచారుఆక్వా ఫీడ్ ధర ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. వంద కౌంట్ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 అయ్యింది. నెల క్రితం వరకూ రూ.250కు కొనుగోలు చేశారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇప్పుడు రూ.225కు తగ్గించేశారు. నాడు వైఎస్ జగన్ రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడంతో రైతులు పండుగ చేసుకున్నారు. – జి.శ్రీనాథ్రెడ్డి, నెల్లూరు జిల్లాకోవిడ్లోనూ సరుకు అమ్ముకున్నాంవైఎస్ జగన్ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో మా పంట ఎవరూ కొనకపోతే జగన్ ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సిండికేట్ ఆగిపోయింది. సీడ్ కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్ ఉచితంగా ఇప్పించారు. అంతర్జాతీయ కంపెనీ సీపీఎఫ్ ఛైర్మన్నే రాష్ట్రానికి రప్పించి ఫీడ్ ధరలు తగ్గించారు. ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండా కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ రేట్లు పెంచాయి. మళ్లీ మే 11న ఫీడ్ ధరలు పెంచారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం. – దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లాసబ్సిడీని దూరం చేసే కుట్ర..ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నంబర్ 169 కాలమ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) గురించి ఉంది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎకరా లీజు రూ.లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్ రూ.యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది. – సీహెచ్ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లుసొంత మనుషుల కంపెనీలకు వత్తాసుడాలర్ విలువ రూ.90 అయినా ఆక్వా రైతుకు రేటు రూ.240 దాటడం లేదు. డాలర్ విలువ రూ.40 ఉన్నప్పుడు వనామీ రేటు రూ.300 పలికేది. కరెంట్ సబ్సిడీ బూచిగా చూపించి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు. – ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లాథాయ్లాండ్ విధానాలు అనుకూలం థాయిలాండ్లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – రాజ్కుమార్ప్రభుత్వం నిద్రపోతోంది..ఆక్వా కంపెనీలు ముంబై మాఫియాలా నడుస్తున్నాయి. సీజన్ చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతోంది. ఆర్నెల్ల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు కిలోకు రూ.4 తగ్గించామని చెబుతున్నారు. కాని దాన్ని డీలర్ కమీషన్ తగ్గించినట్టు చూపించారు. క్రాప్ హాలిడే ఇస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తుప్పుపట్టిపోతుంది. – పెద్దిరాజు, పశ్చిమ గోదావరి జిల్లాఆక్వాకు జగన్ తోడుగా నిలబడాలిగత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడ్, సీడ్ ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాసెసింగ్ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు దించేస్తున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు. ఆక్వాకు జగన్ మరింత తోడుగా నిలబడాలి. – జి.నారాయణమూర్తి, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లామిమ్మల్ని ఓడించినందుకు ఇలా..ఆక్వా రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు మీరు అండగా నిలబడ్డారు. బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడ్, సీడ్. ఆక్వాపై ఆధారపడ్డ వారి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. – జయకృష్ణంరాజు, ఉండిఆక్వా సంక్షోభంతో ఉపాధికి గండిఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గిపోతుంది. కరెంటు సబ్సిడీని పీఎఫ్కి లింకు చేయడం అన్యాయం. కరోనా సమయంలో కూడా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఆ రోజు జగన్ చర్యలు తీసుకోకుంటే ఆక్వా రంగం కుదేలయ్యేది. – ధర్మరాజుజగన్ గళం విప్పితే.. పరిష్కారంనాణ్యమైన సీడ్ ఇవ్వడం లేదు. జగన్ గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేం ఇక్కడ మీటింగ్కు వస్తుంటే అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు. – నానిరాజు, అమలాపురంఫీడ్ కంపెనీలపై తిరగబడతాంఫీడ్ కంపెనీల మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేం ధైర్యంగా పోరాడగలం. ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది. – అండ్రాజు చల్లారావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ఆర్బీకేల ద్వారా పంపిణీవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికేషన్ చేసేవాళ్లు. ఇవాళ అందుకోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పుడు ఫీడ్ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు. – నరసింహారావు, ఆక్వా రైతు -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చింతమనేని గొడవపై అనిత రియాక్షన్
-
అడ్వకేట్ బాల మాస్ వార్నింగ్
-
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
మహారాణిపేట (విశాఖపట్నం): పెందుర్తి మండలం, పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం.107/11లో ఉన్న పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమి 8.08 ఎకరాలుని ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఈ మేరకు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ భూమి ఆక్రమణకు జరిగిన ప్రయత్నాలు, అధికారులు చేపట్టిన చర్యలను వివరించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ... సర్వే నం.107/11లో ఉన్న 8.08 ఎకరాల పెద్దన్న చెరువు భూమిని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులే ఆక్రమించారని పరోక్షంగా ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అతని అనుచరులపై ఆరోపణ చేశారు. వారు ఈ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. బినామీలను సృష్టించి రూ.100 కోట్ల భూమి కబ్జా లేని రైతులను సృష్టించి బినామీ పేర్లతో రిజి్రస్టేషన్ చేశారని బండారు ఆరోపించారు. గతంలో పెద్దన్న చెరువు అన్యాక్రాంతంపై తాను ఫిర్యాదు చేశానని, అప్పటి కలెక్టర్ శ్యామలరావు విచారణ జరిపి రిజి్రస్టేషన్ను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ గత రెండు నెలలు నుంచి ఆక్రమణదారులు మరలా చెరువులో పనులు మొదలుపెట్టారని, అధికార టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెరువుని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల నాయకులు కూడా ఇటీవల చెరువును పరిశీలించి అధికార పార్టీ నాయకులు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. బినామీ రైతులను సృష్టించి రూ.100 కోట్లు విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారని, పరిరక్షించాలని అధికారులను కోరినట్టు బండారు తెలిపారు. -
సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి, నరసరావుపేట: టీడీపీ నేతలతో కలిసి పోలీసులు సివిల్ పంచాయితీల పేరిట డబ్బుల కోసం వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళిత నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. తనపై సీఐ వెంకట్రావు, స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు అక్రమ కేసులు బనాయించి డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందిన పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ దళిత నేత, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ జడ సురేంద్ర సోమవారం నిద్రమాత్రలు మింగాడు.అపస్మారక స్థితిలో వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు. సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు సురేంద్ర ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తాను గతంలో ఓ రెస్టారెంట్ను ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చి కొనుగోలు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించలేదంటూ స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు, సీఐ వెంకట్రావుతో కలసి వేధించడం మొదలు పెట్టారని వాపోయాడు. పిడుగురాళ్ల పోలీసుస్టేషన్లో అక్రమంగా నిర్బంధించి రూ.30 లక్షల దాకా బలవంతంగా వసూలు చేశారని, ఆపై ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని చెప్పాడు.ఇటీవల సుబ్బారావు, సీఐ వెంకట్రావు డబ్బులు కట్టాలని మళ్లీ వేధిస్తున్నారని, ఆదివారం స్టేషన్కు పిలిపించి కులం పేరుతో దూషించి, గంజాయి కేసు పెడతానంటూ సీఐ బెదిరించారన్నాడు. స్టేషన్లో స్పృహ తప్పిపడిపోయిన తనకు చికిత్స చేయించి ఇంటికి పంపించేశారని, వీరి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగుతున్నానని చెప్పాడు. కాగా, తన భర్తను రెండేళ్లుగా సీఐ, సుబ్బారావు వేధిస్తున్నారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. -
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి గత ఏడాది చెక్పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
గొల్ల నాకొ.. మిమ్మల్ని చంపితే ఎవరొస్తారు?
ఒంగోలు వన్టౌన్: ‘‘గొల్ల నాకొ..ల్లారా మిమ్మల్ని చంపితే ఎవరొస్తారురా’’ అని దూషిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు యాదవులను టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గడ్డపారతో హత్యాయత్నం చేయడంపై సోమవారం బీసీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మధుబాబు అనే వ్యక్తి గొర్రెలు కాసుకోవడానికి ఈదుమూడి గ్రామం మీదుగా వెళుతుంటే అధికార పార్టీ సామాజికవర్గం వారు దాడి చేశారని పేర్కొన్నారు.అనిల్ అనే యువకుడిపైనా అదే రోజు దాడి చేశారన్నారు. అనంతరం వీరిని గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారన్నారు. బాధితులు సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తే.. చిన్న కేసు పెట్టిన పోలీసులు, నిందితులు ఫిర్యాదు చేస్తే బాధితులపై ఎదురు కేసు నమోదు చేశారని, సీఐ నిందితులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.ఈదుమూడి గ్రామాన్ని సీఎం చంద్రబాబు పీ–4 గ్రామంగా స్వయంగా దత్తత తీసుకున్నారని, ఇదే గ్రామంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు యాదవులు, బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదుమూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలేనికి చెందిన గొర్రెల కాపరులు ఎల్లావుల అనిల్, వడ్లమూడి మధు వేసవిలో గొర్రెల మేత కోసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి తమ మందతోపాటు వెళ్లి ఇక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. ఈ నెల 7న ఆదివారం గొర్రెలు బీడు భూముల్లో తిరుగుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ‘‘ఎవడ్రా నా కొ... మా ఊరిలో.. మా పొలాల్లో గొర్రెలు మేపడానికి’’ అంటూ కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడి చేశారు.అదేరోజు సాయంత్రం గొర్రెలను తోలుకుని వెళ్తున్న బాధితులను అధికార పార్టీకి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, సుబ్రమణ్యం, కావూరి నాగార్జున, రంగారావు, వెంకట్రావు, ప్రసాద్ టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లి వెళ్లి కర్రలు, గడ్డపార, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ‘‘మేం అధికారంలో ఉన్నాం.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే చంపేస్తాం గొల్ల నా కొ...’’ అంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘సర్’లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్లు లేకుండానే వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ‘సర్’ తొలిరోజే డేటా చోరీ..⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా ⇒ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ ⇒ సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాంరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్యాదవ్ని కలిసి సర్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్ఏల చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యాప్లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు
-
రెచ్చిపోతున్న కాల్ మనీ కీచకులు.. రూ.5కోట్లకు వడ్డీ రూ.25కోట్లు
సాక్షి,కృష్ణ: విజయవాడలో కాల్మనీ ఆగడాలు కొనసాగుతున్నాయి.రూ.5 కోట్లు ఇచ్చి రూ.21 కోట్లు వడ్డీ కట్టించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. మరో రూ.5 కోట్లు కట్టాలంటూ వ్యాపారికి కాల్మనీ ముఠా బెదిరింపులకు దిగింది. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.దీంతో తన న్యాయం చేయాలని బాధితురాలు హోంమంత్రి అనితను కలిశారు. తనపై కాల్మనీ ముఠా దాడి చేసిందని ఆరోపించారు. ప్రామిసరీ నోట్పై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాల్మనీ వ్యాపారులు వెనిగళ్ల హర్షవర్ధన్, హరినాథ్లకు..టీడీపీ పెద్దల అండదండలున్నాయని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందు అండతో కాల్మనీ ముఠా రెచ్చిపోతుందని బాధితురాలు పోయారు. -
కడుపుకి అన్నమే కదా తింటున్నావ్..యాదవులపై దాడి నాగార్జున యాదవ్ వార్నింగ్
-
హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే.. మాకవరపాలెం పోలీసుల ఓవర్ యాక్షన్
-
అంత భయం ఎందుకు.. YSRCP పేస్ బుక్ బ్లాక్ చంద్రబాబుకు శేఖర్ రెడ్డి కౌంటర్
-
దెందులూరులో కాక్రోచ్ లు వచ్చే సమయం వచ్చింది
-
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
వీధి రౌడీలా రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని..


