సాక్షి, విజయవాడ: తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ.. ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారధి ఎదురుదాడికి దిగారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా? అంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80 శాతం మందికి పైగా విద్యార్థులకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఇచ్చారని.. రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన మాటలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించండి. నేను చెప్పింది వాస్తవమోకాదో మీ అధికారులతో విచారణ చేయించండి. తప్పు నాదైతే సభకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం’’ అంటూ బొత్స సవాల్ విసిరారు.
తానూ 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. మీరు మాకు సభా సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదని బొత్స పేర్కొన్నారు. బొత్స ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి కొలుసు పార్ధసారధి నీళ్లు నమిలారు. బొత్సపై మంత్రి ఎదురుదాడికి దిగారు.
సభ అనంతరం బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల్లో రెండు అంశాల పై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలుకే ఇవ్వడం పై ప్రశ్నించామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖలో ఐటీని అభివృద్ధి చేశాం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలుకే భూములిస్తానంటోంది.. ఎందుకు కంపెనీలతో లాలూచీ పడి భూములివ్వాలంటూ బొత్స ప్రశ్నించారు.
వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చింది. సీఎం కుటుంబ సభ్యులు 5 వేల కోట్ల భూములు కబ్జా చేశారు. 5 వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని గీతం సంస్థ చెబుతోంది. వేల కోట్ల భూములు కబ్జా చేయడమేంటి?. పెన్షన్లపై ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగంపై అధికారపార్టీ సభ్యులు డబ్బాలు కొట్టారు. ప్రతీ ఒక్కరికీ 15 వేలు తల్లికం వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందరికీ ఇచ్చారా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు

తల్లికివందనం డబ్బులో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. చాలామంది ఖాతాల్లో ఏడెనిమిది వేలే జమ అయ్యాయి. మేం చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపిస్తే మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పా. మేం వేసిన ప్రశ్నకు అడ్డగోలుగా మంత్రి సమాధానం చెబుతున్నారు. 15 ఏళ్లు నేను కూడా మంత్రిగా చేశా. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు చేతనైతే మీ అధికారులతో ఎంక్వైరీ చేయించండి. మేం చెప్పింది అసత్యమని నిరూపించండి. ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలి.
ప్రతిపక్షం చెప్పిన విషయాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తదా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.


