సాక్షి, విజయవాడ: ఏపీలో అధికార కూటమి టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యల దుమారం పచ్చ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి పెట్టిన పోస్టుతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొలికపూడి వ్యాఖ్యలతో టీడీపీ అసలు బండారం బయటపడింది. దీంతో, కలవరపాటుకు గురైన పచ్చ పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు.
అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో కొలికపూడితో పల్లా సమావేశమయ్యారు. ఈ క్రమంలో కొలికపూడి కామెంట్స్పై పల్లా శ్రీనివాస్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కొలికపూడి.. తాను పెట్టిన స్టేటస్ వాస్తవమేనని చెప్పుకొచ్చారు. దీంతో, ఖంగుతున్న పల్లా.. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికినట్టు సమాచారం. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్దంగా లేరన్న పల్లా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి సెటైర్ వేసినట్టు సమాచారం.
ఇక, అంతకుముందు కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్లో రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మూడ్రోజులపాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యానని, రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్లో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, వారి పరిస్థితి సైతం కంటతడి పెట్టించిందని కొలికపూడి పేర్కొన్నారు. దీంతో, కొలికపూడి వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి.


