చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.
అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.
2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.
1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.
ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.
డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


