breaking news
kommineni Srinivasa Rao
-
ఈసీ మాయ.. అర్ధరాత్రి 20 సెకన్లకు ఒక్క ఓటు?
ఒకప్పుడు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు రిగ్గింగ్ చేయడానికి యత్నించేవారు. ఆ రోజుల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరిగేది. తదుపరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎంలు)ఆచరణలోకి వచ్చాయి. కొంత కాలం పాటు ఆ వ్యవస్థ బాగానే నడిచినట్లు అనిపించేది. అయినప్పటికీ కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేసేవారు. కానీ, రాను రాను అవి కూడా రిగ్గింగ్కు, అక్రమాలకు అతీతం కాదని సాక్ష్యాధారాలతో సహా సమాచారం రావడం ఆరంభమైంది.అసలు ఎన్నికల సంఘమే ఈ తరహా రిగ్గింగ్కు కారణభూతమవుతున్నదన్న ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా ఎన్నికల అధికారులు కొందరు మార్చారా? అన్న అనుమానం వస్తోంది. ఇందులో ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఆంధ్ర ప్రజలు పట్టపగలు వేగంగా ఓట్లు వేయలేదట. అర్దరాత్రి వేళ యమా స్పీడ్గా ఓట్లు వేశారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతుంటే మనం నోరు వెల్లబెట్టాల్సిందే. గతంలో ఆయా రాజకీయ పార్టీలతో సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ మేధావి, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ దీనికి సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టడం అత్యంత ఆసక్తికరంగా ఉంది.2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరిగిన అద్భుతం వెనుక తప్పుడు వ్యవహారం ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ద వైర్ అనే వెబ్సైట్కు రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. అది చదివితే కచ్చితంగా 2024 ఎన్నికలలో ఏపీలో ఏదో మోసం జరిగిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఆధారంగానే ఆయన ఈ పరిశీలన చేశారు. ఎన్నికలు జరిగిన 2024 మే 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ 68.04 శాతంగా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చిన మరో ప్రకటనలో అది 68.12 శాతంగా ఈసీ తెలిపింది. అంటే కేవలం 0.08శాతం పెరిగిందన్నమాట. ఆ తర్వాత 11.45 నిమిషాలకు ఓట్లు వేసినవారి శాతం 76.50శాతంగా ఈసీ చెప్పుకొచ్చింది.తదుపరి మే 17వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం అది 80.66 శాతం కాగా, పోస్టల్ ఓట్లు కూడా కలిపితే అది 81.86 శాతం అయింది. ఈ రకంగా ఓట్ల శాతం అర్ధరాత్రి పెరగడంపైనే ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. సాధారణంగా సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ బూత్లలో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. గత అనుభవాల రీత్యా చూస్తే సాయంత్రం మహా అయితే రాత్రి తొమ్మిది, పది గంటల వరకు ఓట్లు వేస్తారేమో!. అంతే తప్ప తెల్లవారుజామున రెండు గంటల వరకు ఓట్లు వేయడం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కానీ, ఏపీలో ఇందుకు భిన్నంగా జరగడం అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు కేవలం 0.08 శాతమే ఓట్లు పెరిగాయి. అంటే దాని అర్దం పోలింగ్ బూత్లలో దాదాపు ఎవరూ లేరనే కదా అర్థం?. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించకూడదు కదా!. కానీ, చిత్రంగా రాత్రి 8 గంటల నుంచి 11.45 గంటల వరకు ఎనిమిది శాతంపైగా ఓట్లు వేశారట. అంతమంది ఎక్కడ నుంచి వచ్చారు?. అది నిజమే అయితే వారిని ఎలా అనుమతించారు. తదుపరి రెండు గంటల వరకు మరో నాలుగు శాతం పెరగడం ఇంకా చిత్రమే. ఈ రకంగా 12.54 శాతం ఓట్లు అంటే 51,83,249 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆధార సహితంగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం మరింత అనుమానంగా మారింది.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన దాని ప్రకారం 11.45 నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు సుమారు 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అది కూడా 3500 పోలింగ్ బూత్లలోనే కావడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. పగలు నిమిషానికి ఒక ఓటు చొప్పున పడితే, అర్ధరాత్రి వేళ ప్రతీ 20 సెకండ్లకు ఒక ఓటు పోల్ అయిందని లెక్కలు చెబుతున్నాయి. అందులో వీవీప్యాట్ స్లిప్లకు 14 సెకండ్లు పోతే మిగిలేది ఆరు సెకన్లన్నమాట. ఇంత తక్కువ సమయంలో ఓట్లు వేయడం అసాధ్యం అన్నది తెలిసిందే. ఈ బూత్లలో అర్ధరాత్రి వేళ సుమారు 490 మంది ఉన్నారన్న మాట. మొత్తం మీద ఈ అదనపు ఓట్లను 175 నియోజకవర్గాలకు పంచితే అది ఒక్కో స్థానంలో 29,618 ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యాయన్నమాట. ఇవన్నీ పోలింగ్ అధికారుల సమక్షంలోనే జరిగాయా? అప్పుడు అక్కడ ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు?. వారు ఉన్నారా?. లేక వెళ్లిపోయాక ఈ మాయ జరిగిందా?. ఇది ఈవీఎంల మహిమగానే కనిపిస్తోందన్నది మేధావుల భావనగా ఉంది.రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు ఉంటాయి. కానీ, 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిశోధనలలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి తోడు ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, కొన్ని ఈవీఎంలను తిరిగి లెక్కించాలని, వీవీప్యాట్ స్లిప్లతో పోల్చి చూపించాలని, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ తగ్గకపోవడానికి కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్సీపీ చెందిన కొందరు నేతలు హైకోర్టుకు వెళ్లినా సరైన న్యాయం దక్కలేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్నది బలమైన భావనగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కుట్రలు జరిగి ఉండవచ్చని కొందరు సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు. 2019లో ఆయన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో ఎలాంటి పరీక్షలకైనా సిద్దమేనని ఈసీ తెలిపింది. కానీ, ఈసారి ఈసీ సరైన సమాధానమే ఇవ్వడం లేదు.ఈ ఎన్నికలు జరిగిన పది రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్లను దగ్దం చేయడం, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఓడిపోయిన అభ్యర్ధులు అడిగినా ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం కచ్చితంగా మరిన్ని డౌట్లకు తావిచ్చింది. నిజంగా అర్ధరాత్రి వేళ 3500 బూత్లలో ఒక్కో చోట సగటున సుమారు 490 మంది ఉండి ఉంటే దాని తాలూకూ ఫుటేజీ అభ్యర్ధులకు చూపించి ఉండవచ్చు. ఇందులో ఓటర్ల భద్రతకు వచ్చే ముప్పు ఏమిటో తెలియదు. నిర్దిష్ట విధానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏభై లక్షల మంది అదనంగా ఓట్లు వేసి ఉంటే అందులోనూ అర్ధరాత్రి 17 లక్షల మంది ఓట్లు వేసి ఉంటే మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలని కొందరు లెక్క గడుతున్నారు.ఎన్నికల కమిషన్కు చిత్తశుద్ది ఉంటే, రిగ్గింగ్ జరగలేదన్న నమ్మకం ఉంటే పోటీ చేసిన అభ్యర్ధి ఎవరు కోరినా వారికి వివరణ ఇచ్చి ఉండాలి. అవసరమైన వీడియో ఫుటేజీలు ఇచ్చి ఉండాలి. అలా చేయడానికి నిరాకరిస్తుడటంతో ఎన్నికల వ్యవస్థపై సంశయాలు బలపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. అసలే ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ప్రజలు బాధపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కూడా అందులో భాగమైతే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ బడ్జెట్... కాకిలెక్క.. స్వోత్కర్ష!
పౌరులు తప్పు చేస్తే ప్రభుత్వం జరిమానా లేదా శిక్ష వేయడం సాధారణంగా జరిగేది మరి... ప్రభుత్వమే తప్పుడు గణాంకాలిస్తే? ప్రజలను తప్పుదోవ పట్టిస్తే? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ గురించి ఈ ప్రస్తావన. ఊహాజనిత వాస్తవాలతో సంబంధం లేకుండా, ఊహాజనిత అంచనాలతో చేసిన ఈ అంకెల గారడీపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లో ఒకలా.. ప్రసంగంలో ఇంకోలా కూడా లెక్కలు చెప్పగలగడం ఈయనకే చెల్లిందేమో. నిజానికి ప్రజలు బడ్జెట్ను పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. ఎందుకంటే అందులో ఉన్న దానికి.. వాస్తవానికి అసలు పొంతనే ఉండటం లేదు మరి. ఏటా ఇదో మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఎన్నికల్లో తాము చెప్పిందేమిటి? వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నదీ.. అడ్డంకులను అధిగమించేందుకు రచిస్తున్న ప్రణాళికలేమిటన్న వివరాలతో ఉంటే బడ్జెట్కు కాస్తో కూస్తో విశ్వసనీయత వస్తుందేమో కానీ.. ఇలా ఓ సోదిలా మాట్లాడేసి పోతే ఫలితం సున్నా. ఈ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి పోకడలు రెండేళ్లుగా ఇలాగే ఉంది. మూడోసారి కూడా భిన్నంగా ఏమీ లేదు. 2019-2024 మధ్యకాలంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించే ప్రయత్నం జరిగింది. అయితే బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి... ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందో అని ఆ రకంగా చేసే సాహసం చేయలేకపోతోంది. అందుకే ఏదో చేసేయబోతున్నామంటూ బడ్జెట్ ప్రసంగం చేయడం... పది రోజులపాటు అసెంబ్లీ, మండళ్లలో చర్చించినట్టు నటించడం ఆ తరువాత ఎవరి దోవన వారు వెళ్లిపోవడం. ఇదీ తంతు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఏడాది రెవన్యూ రాబడిని రూ. 2.34,140 కోట్లుగా అంచనా వేశారు. పన్ను, పన్నేతర ఆదాయాల ద్వారా ఇంత మొత్తం వస్తుందన్నమాట. అయితే గత ఏడాది రూ.217976 కోట్ల ఆదాయాన్ని కాస్తా రూ.196903 కోట్లకు మార్చారు. పోనీ ఇంతైనా వచ్చిందా? ఊహూ అనుమానమే. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇంకా యాభై వేల కోట్ల వరకూ తక్కువందన్నమాట. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఉన్న రెండు నెలల్లో ఇంత మొత్తం సంపాదించాలంటే ప్రజల నడ్డి విరిచేంత భారం మోపాలి. లేదంటే ఈ అంచనాలకు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆదాయం రూ.2.34 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి ఎలా ఊహించారో మరి?రెవెన్యూ లోటు విషయంలోనూ కేశవ్ అంచనాలు డొల్లగానే ఉన్నాయి. రెవెన్యూ లోటు గత ఏడాది కన్నా తక్కువ ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గత ఏడాది రెవెన్యూ లోటు రూ.33 వేల కోట్లని అంచనా వేస్తే అది కాస్తా రూ.41 వేల కోట్లకు పెరిగింది. చిత్రంగా వచ్చే ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.22 వేల కోట్లే అంటున్నారు ఆర్థిక మంత్రివర్యులు. నమ్మే మాటేనా? చివరికి వారికి బాకాలూదే ఎల్లో మీడియా కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఒక చిన్న వార్తను ప్రచురించాయి ఇవి. అప్పుల విషయానికి వస్తే కొత్త ఏడాదిలో రూ.98 వేల కోట్లకు పైగా తీసుకుంటామని బడ్జెట్ పుస్తకంలో తెలిపారు. అది ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తీసుకునే అప్పు గురించి గుట్టుగా ఉంచారు.ఇంతవరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.311182 కోట్లుగా ఉంది. కొత్త బడ్జట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటారో ఊహించలేం. పెండింగ్ బిల్లులు సుమారు రూ.24 వేల కోట్లు చెల్లించినట్లు బడ్జెట్లో తెలిపారు తప్ప, ఇంకెంత పెండింగు బిల్లుల మొత్తం ఉందో దాచిపెట్టారు. ఉద్యోగులకే సుమారు రూ.40 వేల కోట్ల మేర బాకీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతరత్రా బిల్లులు కూడా లెక్కవేస్తే తడిసిమోపెడు కావచ్చు. ఇవి ఒక కోణం అయితే ప్రభుత్వం తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో పెక్కింటిని గాలికి వదలి వేసింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. వాటి ఊసే లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు తదితర స్కీములకు అవసరమైన మొత్తాలకన్నా బాగా తక్కువ కేటాయించారు. బడ్జెట్లో వాటికి ఇంత, వీటికి ఇంత అని చెబుతారు కాని, అవేవి అయ్యేవి కావన్న సంగతి ప్రభుత్వంలోని వారికి, ప్రతిపక్షానికి తెలుసు.అయినా దీనిని ఒక తంతుగా ,ప్రభుత్వ ప్రచారానికి వాడుకుంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కూటమి నేతలు ప్రచారం చేసిన అంకెలన్నీ బోగస్ అని తేలిపోతుండడంతో ఈసారి బడ్జెట్లో ఆ వివరాలు ఏవీ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.అయినా మంత్రి ప్రసంగంలో మాత్రం గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు ఆరోపణ చేసి వదలి వేశారు. మంత్రి కేశవ్ మొత్తం 16 సార్లు చంద్రబాబును పొగడడం కూడా అతిగానే ఉంది. మథా ప్రకారం జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అంటూ ఆవు కథ చెబుతూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రెండేళ్లు సరిపోలేదని వాపోయారు. కూటమి నేతలు సంపద సృష్టిస్తామని ఎన్నికలలో ఊదరగొట్టారు.కాని అధికారంలోకి వచ్చాక అప్పులేమో లక్షల కోట్లు చేశారు.ప్రజల సంపదను ప్రైవేటువారికి అర్ధణాకు,అణాకు కట్టబెట్టేస్తున్నారు.మరో వైపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అసత్యాలు వల్లె వేస్తూ బడ్జెట్ ప్రసంగం చేయడం వల్ల ప్రజలకు ఉపయగం ఏమి ఉంటుంది. స్థూలం గా చూస్తే ఏపీ బడ్జెట్ ప్రజల జ్ఞానానికి సవాలు విసురుతున్నట్లే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అటు నేనే.. ఇటు నేనే!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన్ను భుజాన మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతులకూ ఈ విషయం కొరుకుడు పడటం లేదు. భేషుగ్గా ఉందని చెబుదామా అంటే... మరి ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చడం లేదు ఎందుకు? అని ప్రజలు నిలదీస్తారు. పోనీ బాగాలేదు అందామంటే.. అది చంద్రబాబుకు అపకీర్తి. కిం కర్తవ్యం? అని మధనపడుతున్నాయి ఈ పత్రికలు రెండూ. అందుకేనేమో.. ఒకసారి బ్రహ్మాండమని, ఇంకోసారి ఫర్వాలేదని చెబుతూ జనాల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. ఇంకోపక్క ప్రజలపై పన్నుల మోత కూడా జోరుగా సాగుతోంది. సీఎం కూడా అధికారులు అప్పులు సరిగ్గా సమీకరించలేక పోతున్నారని విమర్శిస్తూంటారు కూడా. అదేనోటితో... 18 నెలల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించామని నిట్టూర్పు విడుస్తూనూ ఉన్నారు. అచ్చం తమ నేత మాదిరిగానే ఎల్లోమీడియా కూడా ఒకదానికి ఒకటి పొంతన లేని విధంగా కథనాలు వండివారుస్తోంది. చంద్రబాబు కొన్ని వారాల క్రితం నల్లజర్లలో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు పుట్టడం లేదన్నారు. ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చాలని ఉన్నా.. ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చెప్పుకొచ్చారు.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఏపీ జీఎస్డీపీ భేష్ అని ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేశారు. వృద్ధి జాతీయ సగటు కంటే 8.7 కంటే ఎక్కువుందని 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోశాం అని భుజాలు చరుచుకున్నారు కూడా. షరా మామూలుగానే వైసీపీపై తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. వైసీపీ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ నష్టం జరిగిందని ఓ కాకి లెక్క కూడా చెప్పేశారు. జిల్లా కలెక్టర్లు, శాఖల అధిపతుల సమావేశంలోనైతే వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వాస్తవం ఏమిటన్నది వారికి తెలియదా?డిసెంబర్ 12న ‘‘లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదు..మీదే ఫెయిల్యూర్‘‘ అని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. నిధులు ఉన్నా ఎందుకు ఖర్చు చేయరని, పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం అని బెదిరించారు కూడా. జీఎస్డీపీకి తగ్గట్లుగా ఆదాయం ఎందుకు లేదని ప్రశ్నించారు. అంటే దాని అర్థం ప్రభుత్వ లెక్కలు ప్రజలను మాయ చేయడానికే అన్న భావన వస్తుంది కదా! అదే సమయంలో మళ్లీ 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించామని, ఇంకా స్పీడ్ పెంచాలని, 70 కొత్త పథకాలను అమలులోకి తెచ్చామని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది.చిత్రంగా డిసెంబర్ 18న అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి రాష్ట్రం ఆర్ధిక ఒత్తిడిలో ఉందని, ఆదుకోవాలని, భారీగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఉద్యానవన హబ్ గా మార్చడానికి రూ.41 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని అడిగారు. దాని సంగతి ఏమైందో తెలియదు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేస్తూ చంద్రబాబు అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధం కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. ఈ మొత్తం ప్రసంగాలలో ఎక్కడా ప్రభుత్వం చేసిన రూ.మూడు లక్షల కోట్ల పైబడి అప్పుల గురించి మాట్లాడడం లేదు. అలాగే ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, రోడ్ సెస్ మొదలైన వాటి గురించి మాట్లాడడం లేదు.కొద్ది కాలం క్రితం వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం సజావుగా లేదు.రెవెన్యూ లోటు నానాటికి పెరిపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది. దానికి తగినట్లే తాజాగా వెల్లడైన గణాంకాలు చూస్తే రెవెన్యూ లోటు రూ.60.5 వేల కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు అయితే మరీ ఘోరంగా రూ.85.2 వేల కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలను మించి 108 శాతం ఇప్పటికే ఈ ఏడాది రూ.85 వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఈ సంగతిని కప్పిపుచ్చుతూ ఈ మద్య ఎల్లో మీడియా మరో కోణంలో ఓ కథనాన్ని ఇచ్చింది. ఏపీ రాబడి ఈ తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు దాటిందని పేర్కొంది. మంచిదే. అయినా ఎందుకు ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో వివరించితే బాగుండేది కదా!కాగా కొద్ది రోజుల క్రితం మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఇంకో కథనాన్ని ఇస్తూ ఏపీ ఆర్ధిక సంక్షోభాన్ని 'అదే వ్యధ, పాత కథ" అంటూ అప్పుల వలయం.. ఆర్థిక విలయం అని వ్యాఖ్యానించింది. కాకపోతే యథాప్రకారం అదేదో జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం అని రాసి తన కుళ్లు బుద్ది ప్రదర్శించింది. కూటమి సర్కార్ లోనూ గతుకుల ప్రయాణం సాగుతోందని, అన్ని రకాల ఆదాయాలు కలిపితే లక్షన్నర కోట్లే వస్తోందని, అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని పేర్కొంది. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకి అప్పులే గతి అని వాపోయింది. అప్పుల తిరిగి చెల్లింపునకు ఏడాదికి రూ.75 వేల కోట్లు అవుతోందని, జీతాలు, పెన్షన్లకు మరో రూ.75 వేల కోట్లు అవుతోందని తెలిపింది.డిసెంబర్ నాటికే లక్ష కోట్ల అప్పు దాటిందని కూడా వెల్లడించింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చు గురించి మాత్రం ప్రస్తావించలేదు. పైగా అమరావతిలో నిర్మాణాలకు పెడుతున్న అధిక వ్యయాన్ని సమర్థిస్తూ వార్తలు ఇస్తున్నారే. కేవలం చంద్రబాబు విమాన, హెలికాప్టర్ ఖర్చులకే ఏడాదికి ఏభై కోట్లుపైగా అవుతోంది. పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలు అమలు చేస్తున్నా తగ్గని పేదరికం అంటూ కొత్త కహాని వినిపించడానికి ఈ ఎల్లో మీడియా యత్నించింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి లక్షన్నర కోట్లు కావాలని, అది ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే, చంద్రబాబు, పవన్లతో పాటు ఈ ఎల్లోమీడియా ఏమని వాదించింది? చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, అప్పులు చేయకుండానే సంక్షేమం చేస్తారని, కరెంటు ఛార్జీలు పెంచరని, తగ్గిస్తారని.. ఇలా ఎన్నో కోతలు కోశారు కదా!టీడీపీ సూపర్ సిక్స్ను జగన్పై ఎక్కుపెట్టిన శరాలుగా అభివర్ణించారే. అంతే తప్ప ఏపీ ప్రజలను టీడీపీ, జనసేన నేతలు మాయదారి మాటలతో మోసం చేస్తున్నారని ఆనాడు రాయలేదే! తీరా అధికారం వచ్చేసింది కనుక ఇప్పుడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనా?మరో వైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేశామని బొంకుతున్నారా? లేదా? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారా? లేదా?నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.మూడు వేలు ఇచ్చారా? ఇలా అనేక హామీలకు ఎగనామం పెడుతూ అంతా హిట్ అని ప్రచారం చేస్తే సరిపోతుందా? ఎల్లో మీడియా ఆ పథకాల వల్ల పేదరికం తగ్గడం లేదని, వృథా ఖర్చు అన్నట్లుగా రాయడంలో ఆంతర్యం ఏమిటి? ఆంధ్ర ప్రజలు అమాయకులు, వారిని తేలికగా మోసం చేయవచ్చన్న భావన తోనే ఇలా పాలన చేస్తున్నారా? ఎల్లో మీడియా నిత్యం అసత్యాలను వండి వార్చడంలో ఆంతర్యం ఇదేనా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు పలుకులు ప్రచార ఆర్భాటం.. అర్ధ సత్యాలు మాత్రమే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త డైలాగులతో ప్రజలను భ్రాంతిలో ఉంచడానికి యత్నిస్తుంటారు. అందులో సత్యాసత్యాలతో సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయనగారు 20 నెలల్లో అరవై విజయాలు సాధించారట! టీడీపీ, జనసేనల సంయుక్త ఎన్నికల మేనిఫెస్టోలో 150 హామీలిస్తే వాటిల్లో ఎన్ని అమలు కాలేదో చెప్పలేకపోయారు కానీ అరవై విజయాలని ఢంకా బజాయించేశారు. దీనికి ఈనాడు కూడా తనదైన స్టైల్లో తలూపింది. ఈ క్రమంలోనే ఈ ఎల్లో పత్రిక ఏమని రాసిందంటే.. చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను విజయాలని జనం నమ్మాలట.రాష్ట్ర గవర్నర్ నజీర్ అసెంబ్లీలో చదివిన స్పీచ్లో పేదలకు ఏటా రూ.33 వేల కోట్లు నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. కాని ఎన్నికల టైమ్లో ఇచ్చిన హామీ రూ.1.5 లక్షల కోట్లు. దీని గురించి వివరణ లేదు. తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం చేశామన్నారు. తల్లుల ఖాతాలో రూ.పది వేల కోట్లు వేశామని చెప్పారు. ఏడాదిపాటు ఎగవేసి, రెండో ఏడు అరకొరగా అమలు చేసిన సంగతి విస్మరించారు.వాస్తవానికి ఈ స్కీమ్కు ఖర్చు చేసింది రూ.ఆరు వేల కోట్ల పైచిలుకే కదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్త్రీ శక్తి ద్వారా 43.51 కోట్ల పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారట. ఇందుకు రూ.1532 కోట్లు వ్యయమైందట. ఈ స్కీమ్ గురించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిందేమిటి? రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీగా వెళ్లవచ్చని. కానీ అమలవుతోంది ఏమిటి? బోలెడన్ని ఆంక్షల పెట్టారు. అలాంటప్పుడు ఇది విజయమెలా అవుతుంది? వంచనే కదా?ఇదే టైమ్లో ఈ స్కీమ్తో నష్టపోయిన ఆటోల వారికి ఏమైనా సహాయం చేశారా? స్త్రీ శక్తి స్కీమ్ లో అసలైన హామీ ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కదా! ఆ ఊసే ఎత్తకుండా విజయం చేసేశామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి! నిజంగానే ప్రభుత్వం కనుక రూ.1500 రూపాయల స్కీమ్ అమలు చేస్తే కచ్చితంగా విజయంగా గొప్పగా చెప్పుకోవచ్చు. కాని ఆ పరిస్థితి ఉందా! అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రెండువిడతలలో రూ.6300 కోట్లు ఇచ్చారట. చంద్రబాబు ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మాట చెబితే, గవర్నర్ స్పీచ్ లో మాత్రం రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ది చేకూర్చుతున్నట్లు చెప్పడం గమనార్హం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికి రెండు విడతలలో ఇచ్చింది పదివేలే అన్నది వాస్తవం! అంటే ఒక్కో రైతుకు 30 వేల రూపాయలు బకాయి పడినట్లే!ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందులో కొత్త ఏమి ఉంది? జగన్ టైమ్లో మూడువేల చొప్పున పెన్షన్ ఇస్తే, దానిని ఒక వెయ్యి పెంచిన మాట నిజమే. కాని ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదన్నది కూడా పచ్చి నిజం.సుమారు నాలుగు లక్షల మందికి పెన్షన్ కోత పడిందని చెబుతున్నారు. దాని మాట ఏమిటి? రూ.వెయ్యి కోట్లతో రహాదారులను మరమ్మతులు చేశామని చంద్రబాబు చెప్పినా, రాష్ట్రంలో అనేక రోడ్ల దుస్థితిపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి కదా! మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ లు పెట్టడం కూడా విజయమేనట. ఇది గిన్నిస్ రికార్డు అని భుజాలు చరుచుకున్నారు.ఈ సమావేశాల వల్ల ఏమి లాభం కలిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు తగ్గారో లెక్కలతో సహా వార్తలు వచ్చాయి కదా! మరి అది విజయమా?లేక అపజయమా? ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.2600 కోట్లు చెల్లించామని చంద్రబాబు చెప్పుకున్నారు. కాని ఇప్పటికీ సుమారు రూ.ఐదువేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయే. దానిపై విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు కదా!విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ వస్తోందట. జగన్ టైమ్లో వచ్చిన అదాని డేటా సెంటర్ను గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు. దీనికి రూ.22వేల కోట్ల మేర ఎదురు రాయితీలు ఇవ్వడం, అయినా వెయ్యి మందికి కూడా ఉపాధి కల్పించడం లేదన్న విషయం బహిర్గతం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని చంద్రబాబు తెలిపినా, రూ.40 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ఎన్.జి.ఓ. సంఘం నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన విజయాలన్నిటిని పరిశీలిస్తే ఇదంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం అంతగా లేదన్న సంగతి విశ్లేషణలో బయటపడుతుంది. గవర్నర్ స్పీచ్లో పీపీపీ విధానం, పీ-4 ,ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేయబోతున్నట్లు, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ,16 లక్షల ఉద్యోగాలు అంటూ అతిశయోక్తులు, అర్ధ సత్యాలే కనిపిస్తాయి.ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన అంశాలలో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడవద్దని హెచ్చరించారట. అంటే గత సమావేశాలలో యూరియా కొరత వంటి ప్రజా సమస్యలను కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దానిపై ప్రభుత్వం బాగా ఇరుకున పడింది. ఈసారి అలాంటి విషయాలు చెప్పవద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా అన్న సందేహం వస్తుంది.ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వంటి కొద్దిమంది రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితుల గురించి పల్లె కన్నీరు పెడుతోందంటూ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం సృష్టించింది.అసెంబ్లీలో కూడా ఆ సంగతులు చెబుతారేమో అన్న భయం టీడీపీ, జనసేన పెద్దలలో ఉన్నట్లు అనుకోవాలి. అయితే 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని కూడా చంద్రబాబు అన్నారట. అసలు ప్రభుత్వమే సరిగా లేదనుకుంటుంటే, తమ గురించి ఏమి ఉంటుందన్నది ఎమ్మెల్యేల భావనగా ఉందట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి పదిహేనేళ్లపాటు కలిసి ఉంటామని ప్రకటించడం హైలైట్. ఏదో భయం వారిని వెంటాడుతున్నట్లుగా ఉంది.వచ్చే ఎన్నికలలో గెలుస్తామో,లేదో అన్న సంశయం ఏర్పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలలో ఒక ధైర్యం కలిగించడానికి ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.వైసిపి కులచిచ్చు పెడుతుందని పవన్ కళ్యాణ్ అనడమే విడ్డూరం.కులం పునాదిపైన జనసేన ఏర్పడిందన్న సంగతి, అంతేకాక కులాలకు సంబంధించి గతంలో తెలిసిందే.కులం ప్రస్తావనపై గతంలో రకరకాల ప్రకటనలు చేసిన వీరు నీతులు చెబుతున్నారు!సూటిగా, సుత్తి లేకుండా తక్కువ టైమ్ లో అసెంబ్లీలో ప్రసంగం పూర్తి చేయాలని చంద్రబాబు చేసిన సూచన బాగుంది. అదే సలహాను చంద్రబాబు పాటిస్తే బాగుంది కదా అన్నది కూటమి ఎమ్మెల్యేల అంతర్గత భావనగా ఉంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...!
ఈ ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమిటి? ఈ ప్రశ్నకు ఎన్డీయే భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా సమాధానం చెప్పలేకున్నాయి. ప్రత్యేక కేటాయింపు లేవీ లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్లు ముక్తసరిగా ‘హర్షం’ వ్యక్తం చేశారు. ఏపీ దృష్టిపెట్టిన అంశాలపై దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుందని సీఎం, అభివృద్ధికి ఊతమని పవన్కళ్యాణ్, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని లోకేశ్లు పొడిపొడిగా వ్యాఖ్యానించారు.ఫలానా రంగానికి ఇన్ని నిధులు వచ్చాయని మాత్రం చెప్పలేకపోయారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. వేర్వేరు మంత్రులను కలిసి అధిక నిధులు కోరామని ప్రకటనలు గుప్పించినా లభించింది హళ్లికిహళ్లి.. సున్నకు సున్నా! అంతే! కానీ.. ఎల్లో మీడియా మాత్రం తెగ హడావుడి పడిపోయింది.ఈనాడు పత్రిక కథనంలో.. అభివృద్ది బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ గుండా వెళతాయట. సెమీ కండక్టర్ 2.0తో ఏపీకి ప్రయోజనం అంటోంది. అదేసమయంలో ఏపీ సమస్యలు, ఆర్థికలోటు వంటివి గాలికొదిలేసింది. పోలవరానికి రూ.3320 కోట్లు, అమరావతికి రూ.2000 కోట్లు వస్తాయని సంబరపడిపోయింది. అప్పుగా అమరావతికి డబ్బులిచ్చినా ఈనాడు చంకలు గుద్దుకుందన్నమాట. అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రతిపాదనకు కేంద్రం కొర్రీ పెట్టడంతో ఆలస్యమవుతోందని లేకుంటే ఎప్పుడో అయిపోయేదని కూడా చెప్పుకొచ్చింది ఈ పత్రిక చంద్రబాబు ఈ అంశంపై కూడా అమిత్ షాకు విన్నవించారని తెలిపింది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు. ఎందుకెళ్లారో స్పష్టత లేదు. పథకాలకు నిధుల కోసమా? తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ పెద్దలకు వివరణ ఇచ్చుకునేందుకా? ఇదీ కాకుండా.. ఇతరత్రా వ్యక్తిగత పనుల కోసమా? అన్నది తెలియదు. సహజంగానే బాకా పత్రికలు ప్రాజెక్టుల కోసమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమని కథనాలు ఊదాయి. చంద్రబాబు స్టైలు కూడా ఇలా లీకులివ్వడమే. కానీ పోలవరం విషయంలో ఈయన గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తే ఈ డొల్ల వ్యవహారం బట్ట బయలవుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పోలవరానికి కేంద్రం బడ్జెట్లో రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. ఇంత తక్కువ ఇచ్చారేమిటని కనీసం ప్రశ్నించలేని చంద్రబాబు రెండో దశకు రూ.32 వేల కోట్లు అడిగామని చెప్పుకుంటున్నారు. గత ఏడాది పోలవారినికి రూ.5000 కోట్లు కేటాయించినా.. అంచనాలను సవరించిన తరువాత దక్కింది రూ.మూడు వేల కోట్లే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. చంద్రబాబు అండ్ కో అంకమ్మ శివాలెత్తేది. ‘రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు’’, ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవం మంటకలిసింది’’ అంటూ ఊగిపోయేది. గత ఢిల్లీ పర్యటనలోనూ రాయలసీమలో ఉద్యానవన హబ్ ఏర్పాటుకు రూ.41 వేల కోట్లు అడిగామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ తరువాత ఈ విషయం అయిపు అజా లేకుండా పోయింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ఏపీకి నష్టం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమతుంది. తొలిదశలో ఇలా ఉంటుంది, ఆ తర్వాత దానిని యథా ప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుంటుంది. కాని అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావసానికి అధిక నిధులు అవసరం అవుతాయి. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా కావాలి. కాని కేవలం మూడువేల కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్దికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్ లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటి పారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడకు టీడీపీ, జనసేనలకు ఉన్న పదిహేడు మంది ఎంపీల మద్దతు కీలకం. అయినా వీరు రాష్ట్రానికి సంబంధించి తగినన్ని నిధులూ సాధించలేకపోయారు.. కొత్త పథకాలూ వచ్చింది లేదు. ఏంటో వీరి బలహీనత! శీతకన్నేసినా... పట్టించుకోకపోయినా కేంద్రం సహకరిస్తోందన్న ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమెందుకో? స్కిల్స్కామ్లో ఈడీతో కూడా క్లీన్ చిట్ ఇప్పించుకున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయని.. ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనని వైసీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం. గతంలో ప్రధానిని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ- తిరుపతి బుల్లెట్ ట్రైన్ లు వచ్చేస్తాయని చెప్పారన్న విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీకిప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు కూడా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది మూడువేల కోట్లు కేటాయించినా, ఈసారి కేవలం వంద కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దానిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటువారికి అప్పగిస్తున్నారు. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధులలో కోత,గ్రామీణ ఉపాధి హామీ నిధులలో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని కూడా ప్రభావితం చేస్తాయి.మరో వైపు తెలంగాణ కు కూడా అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వాపోయారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కాని, మెట్రో విస్తరణకు కాని నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని నిధుల కోసం కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయినా బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమీ లేకుండా పోయింది. దీనిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్కు, పవన్కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్లో పడవద్దని కేడర్కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లడ్డూ వ్యవహారంపై మళ్లీ బుకాయింపే!
తప్పు చేసి దొరికినప్పుడల్లా చంద్రబాబు ప్రయోగించే టెక్నిక్.. ఎదురుదాడి!. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చిన నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ గళమెత్తుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అర్థమైనా దాంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నటిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారమే చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, కేడర్ను ఆదేశించారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు.మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనుకాడడం లేదు. కుప్పం టూర్లో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు శ్రీవెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశం అంతటా ప్రచారం చేసిందెవరు? ఇవి చాలవన్నట్లు టీడీపీని గట్టెక్కించడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా అబద్దపు కథనాలు రాస్తున్నాయి. ప్రతిష్ట పూర్తిగా పోయినా ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా లాజిక్కు లేని వ్యాఖ్యలతో దిక్కుమాలిన సంపాదకీయం ఒకటి రాసింది.జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ, మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పింది ఈనాడు మీడియాకు తెలియదా?. జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని కదా ఆయన చెప్పారు?. అప్పుడు అదే చంఢాలాన్ని పేజీలకు, పేజీలు రాసి ప్రజలపై రుద్దాయి ఈ పత్రికలు. ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్లకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతుకొవ్వు, పామాయిల్కు తేడా తెలియదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి, పోటు తదితర సిబ్బంది, పూజారులు ఎవరూ పసికట్టలేకపోయారా?. అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్దాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా?. విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లినప్పుడు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయలేదే!. ఇవన్నీ పక్కనబెట్టి తగుదునమ్మా అటూ క్షమించరాని ఘోరాపచారమిది అంటూ రాసేసి ఈనాడు ఆత్మ వంచన చేసుకుంటే సరిపోతుందా?. తెల్లవారిలేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా?మరో మాట చెప్పాలి. బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకుముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే ‘హర్ష్ ఫ్రెష్ డెయిరీ’ 2018 నుంచే టెండర్లలో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్లింది. ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ, 2019 ఫిబ్రవరిలో పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా!. ఆ తర్వాత 2019 ఆగస్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. ఈనాడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనూ లేదు.అంటే పొరపాటున ఎవరో జర్నలిస్టు నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడం కోసం సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ‘భోలే బాబా కంపెనీ’గా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా? లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు?. దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా?. అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించాల్సి టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయి?. ఇదేనా వీరి భక్తి? హిందూ మతోద్ధరణ? కేసులో ఎలాగొలా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈపాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో!. ఎంత బురద వేసేవారమో కదా అన్నది వారి భావన కావచ్చు. ఇదే టైమ్లో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? దీనిని బట్టే వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం కొత్త కాదు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించివేసిన తర్వాత ఆయనపై ఎన్ని నిందలను మోపింది తెలిసిన విషయమే. గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానాలు, డాక్యుమెంటరీ తీయడం కోసం సాధారణ భక్తులందరినీ నిలిపివేయడంతో తొక్కిసలాట జరిగితే కుంభమేళాలో జరగడం లేదా? రోడ్డు ప్రమాదాలలో జరగడం లేదా? అని దబాయించారు. తుని వద్ద రైలు దగ్దం జరిగితే, అది తన ప్రభుత్వ వైఫల్యం అని అంగీకరించకుండా రాయలసీమ నుంచి గూండాలు వచ్చి దహనం చేశారని ఆరోపించారు. కానీ, గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలపై కేసు పెట్టారు. కందుకూరు, గుంటూరులలో ఆయన సభలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందితే అది పోలీసుల వైఫల్యం అని విమర్శలు చేశారు. అదే వైఎస్ జగన్ టూర్లో ఒకరు ప్రమాదానికి గురైతే మాత్రం అదంతా కారులో ప్రయాణిస్తున్న జగన్ తప్పని కేసు పెట్టించారు.అలాగే ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారు. అది వారికే ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మోసం చేయడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అండ్ కో వెనుకాడటం లేదన్న విమర్శ వస్తోంది. పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే శాంతిభద్రతలపై ఎంత శ్రద్ద ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అదే పని వైఎస్సార్సీపీ వారు చేసి ఉంటే ఈ పాటికి పోలీసులు ఎన్ని కేసులు పెట్టేవారో!. అయితే, అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలామంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు. కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడడానికి ఇంకెంత కాలం పడుతుందో!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్సభ సభ్యుడు శ్రీభరత్కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్సేఫ్గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
2029లో వచ్చేది జగనే... ఊహించని దెబ్బ ఖాయం!
-
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్షీట్లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్గఢ్లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దావోస్ సదస్సు విహారయాత్ర?
దావోస్ సమావేశాలు నిజంగానే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయా? లేక అవి విహార యాత్రల్లా మారిపోయాయా? ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి సాధిస్తున్నది ఏమిటి? పదిహేనుసార్లు దావోస్కు వెళ్లి రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ భారీ కంపెనీ లేదా పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే నిరాశే ఎదురవుతుంది.ఎందుకంటే.. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న దావోస్ పర్యటనలు మొత్తం సొంత డబ్బాలకే వాడుకుంటున్న భావన కలుగుతుంది. ప్రజా ప్రయోజనం ఎంతో కాని, ప్రభుత్వ నేతలకు మంచి టైమ్పాస్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఇవి పూర్తిగా నిష్ప్రయోజనమనీ చెప్పలేము కాని కాలక్రమంలో షో బిజినెస్గా మారుతోందన్నది ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ప్రకటనలు కొన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.గత ఏడాది దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క ఒప్పందమూ చేసుకోలేకపోయింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలు ఓ మోస్తరు నుంచి భారీ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు చూడండి.. అచ్చం అలాగే.. చంద్రబాబు అప్పట్లో ‘దావోస్కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య’ అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని సాగతిస్తున్నానని తెలిపారు. విశేషం ఏమిటంటే ముందుగా ఆయన సరైన సూచన ఇవ్వాల్సింది తన కుమారుడు లోకేశ్కే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్లినప్పుడు గ్రీన్కో వంటి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకువచ్చారు. కానీ అప్పట్లో లోకేశ్ అండ్ కో ‘విదేశాలకెళ్లి దేశీ కంపెనీని తీసుకొస్తారా’ అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన నెగెటివ్ మైండ్సెట్ సరికాదని చంద్రబాబు.. లోకేశ్కు అప్పుడే చెప్పిఉండాల్సింది.తాజా పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ ఛైర్మన్తో సమావేశమైన సందర్భంలో మాట్లాడుతూ గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. అప్పుడేమో మిథ్య అన్నారు.. ఇప్పుడు మాత్రం బోలెడంత పెట్టుబడి వచ్చిందంటున్నారు. ఏది నిజం? ఈయన అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అది రాష్ట్రానికి అప్రతిష్ట కాదా?. ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు దావోస్లో తొమ్మిది సెషన్లు, సమావేశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలు అన్నీ ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈవోలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా!.కాకపోతే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ పెట్టుబడులు పెట్టాలని బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్.ఎమ్.జడ్ను కోరితే వారు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ రూ.91 వేల కోట్ల పెడుతుందని, లక్ష ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లు కూడా లేకపోగా ఉద్యోగుల సంఖ్య వెయ్యి మంది మించడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీతో లక్ష ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ ఇమేజీని చంద్రబాబు, లోకేశ్లు పెంచారా అంటే ఉన్న పరువు కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏమి చెబుతున్నానో మర్చపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది.‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త’ విధానం తెచ్చానని, కనీసం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది ఐదు లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని చంద్రబాబు మరో సమావేశంలో అన్నారు. ఈ లక్ష్యం సాధిస్తే తర్వాత పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్టిలో చెబితే వాళ్లు ఏమనుకుంటారు? పైకి ఏం అనకపోయినా తర్వాత అయినా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ను హైదరాబాద్ తెస్తానని అంటూ కొన్ని అతిశయోక్తులు చెప్పినా తన గురించి కాకుండా.. తెలంగాణ, హైదరాబాద్లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. సుమారు రూ.29 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. రేవంత్ తన ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్ కో సంస్థతో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం దావోస్లో ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోధాకు చెందిన కంపెనీతో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు చేశారు.2014-19 టర్మ్లో చంద్రబాబు దావోస్ పర్యటనలో చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్ హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరాంకో, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, అలీబాబా రెండో డేటా సెంటర్ ఏపీలోనే.. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ, ఏపీ బ్రాండింగ్ @దావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా! దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. గతంలో బ్రాండ్ ఇమేజీ లేదని మనమే దావోస్లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజీ పడిపోయిందో, పెరిగిందో ఆలోచించుకోవచ్చు.ఇక రెడ్బుక్ అరాచకాల విషయం జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. దావోస్ వరకు వెళ్లి తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. దావోస్లో తెలుగువారి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ను విమర్శించడం వల్ల ఏపీకి ఏం మేలు కలిగినట్లు!. సీపీఎం నేత బీవీ రాఘవులు దావోస్ పర్యటనలను ప్రజాధనంతో జరిగే తీర్ధయాత్రలుగా అభివర్ణించారు. దావోస్లో చంద్రబాబు, లోకేశ్లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజీతో కాకుండా, తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దలాల్ ఒక ట్వీట్ చేస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని వ్యాఖ్యానించారు. దావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఇబ్బందికర వ్యవహారంగా మారిన సంగతిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకోగల ఒప్పందాలను దావోస్లో చేసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ప్రచార ఆర్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత వ్యాఖ్యానించారు. ఏపీ అనుభవం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దావోస్ దారి ఖర్చులూ కలిసిరాలేదట.. నిజమేనా?
‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’ - సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’ - చంద్రబాబు నాయుడు ప్రశంస..‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’- నెటిజన్ల వ్యాఖ్య..పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.ఆంధ్రప్రదేశ్కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్లు అది మాని ఏపీ బ్రాండ్ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ఫ్రస్టేషన్ పతాక స్థాయికి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పతాకస్థాయికి చేరుకున్నట్టుంది. వయసు కూడా మరచిపోయి వైఎస్సార్సీపీ నేతలపై అధ్వాన్నపు దూషణలకు దిగుతున్నారు. సందర్భమేదైనా సరే ఒకటే అజెండా. జగన్ను, ఆయన పార్టీని తిట్టడం. ఈ వైఖరితో ప్రజల దృష్టిలో పలుచనవుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకపోవడం, పాలన గాడి తప్పి అస్తవ్యస్తంగా మారడం.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో... వారి దృష్టి మరల్చేందుకు ఈ టెక్నిక్ను వాడుతున్నారేమో మరి! ఏడాదిన్నరగా రెడ్బుక్ పేరుతో సాగిన అరాచకాలు, కొన్ని గ్రామాల్లో దళతల కుటుంబాల బహిష్కరణ, తాజాగా సంక్రాంతి పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ పరువును ఎప్పుడో బజారున పడేశాయి. దీన్ని కవర్ చేయడానికా అన్నట్ట జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని వాడుకునే ప్రయత్నం జరిగింది కానీ.. ఆ సభలోనూ ఎన్టీఆర్ గురించి నాలుగు మంచిముక్కలు మాట్లాడటం కంటే వైఎస్సార్సీపీని దూషించేందుకే ప్రాధాన్యమిచ్చారు. షరా మామూలన్నట్టు ఎల్లోమీడియా ఈ వాగుడుకే తానా తందానా అని మురిసిపోయింది. చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటోంది. ఐదేళ్ల పాలనలో భూముల రీసర్వేతోపాటు జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కొనసాగించలేకపోవడం ఒక కారణమైతే.. 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తన ఖాతాలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం రెండో కారణం. వీటిపై ఎప్పటికప్పుడు సాక్షి, సోషల్ మీడియాల్లో ఆధారసహితంగా కథనాలు వస్తూండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు ఉంది. భూమి, ఇసుక, మద్యం, గనులు, గంజాయి, డ్రగ్ మాఫియాలేవైఎస్సార్సీపీ క్రెడిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పెద్దక్షరాలతో ప్రచురించింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఇప్పటికీ మునుపటి ప్రభుత్వంపై ఏడుపే కొనసాగుతోందన్నమాట. పైగా అన్నీ అబద్ధాలు. జగన్ టైమ్లో జరిగాయని చెబుతున్న ఎన్ని భూ దందాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది? ఎన్నింటిని రుజువు చేశారు? కూటమి పాలనలో అనంతపురంలో జరిగిన భూ కబ్జా ఆరోపణ మాటేమిటి? ఊరు, పేరు లేని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు ఇచ్చేయడాన్ని ఏమనాలి? ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది ఎందుకు? జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక విక్రయించి ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం సమకూరిస్తే మాఫియా అన్నారు మరి.. ప్రస్తుతం ఉచిత ఇసుకపై టీడీపీ నేతలు చేస్తున్న దందాలేమిటి? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారే? వీరిని అదుపు చేయలేక చంద్రబాబువైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. గనుల విషయానికి వద్దాం.. టీడీపీ నేతలు కుప్పంలోనే అక్రమ మైనింగ్కు పాల్పడినట్లు వచ్చిన వార్తల మాటేమిటి? నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు గనులు కబ్జా చేసి కప్పం చెల్లించమని డిమాండ్ చేసిన మాటేమిటి? మద్యం మాఫియా అంట! తన హయాంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వ పరం చేశారు జగన్. విక్రయాలకు నిర్ణీత వేళలు నిర్ణయించారు. బెల్ట్ షాపులు లేకుండా చేశారు. మరి.. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోంది? ప్రైవేటు వారికి, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుయాయిలకు షాపులు కేటాయించి, వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టించి, ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటోంది. ఇది కదా మాఫియా అంటే? అవి చాలవన్నట్లు టీడీపీ నేతలే నడుపుతున్న నకిలీ మద్యం ప్లాంట్ ఇటీవలే పట్టు బడింది కదా! సర్వే రాళ్ళపై నవరత్నాల బొమ్మతోపాటు జగన్ చిత్రపటం వాడడం వల్ల రూ.700 కోట్లు వృథా అయ్యాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సర్వే రాళ్లు ఎందుకు వృథా అవుతాయి.ప్రభుత్వానికి చాతకాకపోతే తప్ప. మరో వైపు ప్రభుత్వ ఆఫీసులు, ఇతరత్రా, చివరికి రోడ్డు డివైడర్లపై టీడీపీ పచ్చ రంగు, జనసేన రంగులు వేయడాన్ని ఎలా సమర్థిఃచుకుంటారు. రీసర్వే మీద జగన్పై తప్పుడు ఆరోపణలు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా! మళ్లీ దానిని ఎలా కొనసాగిస్తున్నారు. క్రెడిట్ చోరీ అంటే మాత్రం కోపం వస్తుంది. గంజాయి,డ్రగ్స్ గురించి జగన్ టైమ్లో ఉన్నవి, లేనివి కల్పించి ఎన్ని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవి ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది కనబడుతూనే ఉంది కదా! విశాఖ,గుంటూరు,తదితర చోట్ల పోలీసులకు గంజాయి పట్టుబడిన మాటేమిటి?జగన్ సొంతగా పెట్టుకుని కష్టపడి ఈ స్థాయిలో ఉన్నవైఎస్సార్సీపీని ఫేక్ అని చంద్రబాబు అంటున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఆయనకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు.తన అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశారని, మానవత్వం లేదని, తనకు ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వయంగా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ ప్రముఖంగానే కనిపిస్తుంది కదా! నేర రాజకీయాలు చేస్తున్నారంటూ మరో తప్పుడు ఆరోపణ. పల్నాడులోవైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ను ను టీడీపీ గూండాలు హత్య చేస్తే, అలాంటి వాటిని నిరోధించడంలో విఫలం అవడమే కాకుండా,వైఎస్సార్సీపీ వారు రెచ్చగొడుతున్నారని అనడం సీఎం స్థాయికి తగునా!ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షన్ హత్య జరిగితే పాడె మోసి రాజకీయ రంగు పులిమిన చంద్రబాబు ప్రస్తుతంవైఎస్సార్సీపీ వారిపై ఆరోపణ చేస్తున్నారు. టీడీపీ వారు వందల కుటుంబాలను గ్రామాలలోకి రానివ్వకుండా బహిష్కరణ చేస్తున్న ఘటనలను అదుపు చేయకుండా అలాంటివాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా సిగ్గు చేటైన విషయం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వాఖ్యాత -
బాబుగోరూ.. ఓసారి మీ మొహం అద్దంలో చూస్కోండి..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాజకీయమంతా... అబద్దాలు, డాబుసరి కబుర్లు, వక్రీకరణలు, బురద జల్లుడులపైనే ఆధారపడి ఉంటోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి బట్టబయలైంది. గోదావరి జిల్లా రాయవరం వద్ద పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా చంద్రబాబు అబద్ధాలు బహిరంగమయ్యాయి. ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు అందరికీ అందాయా?’’ అనే చంద్రబాబు ప్రశ్నకు అసలు సమాధానమే లేకపోయింది. అందిన వారు చేతులెత్తాలంటే ఎవరూ స్పందించలేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు ఒకరిద్దరిని నేరుగా అడిగారు. ‘‘అందలేదు’’ అని వారు ఠకీమని సమాధానం చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియకుండా పోయింది చంద్రబాబుకు. ఆ అసంతృప్తిని కాస్తా అక్కడి అధికారులపై విసుక్కుని తీర్చుకున్నారు. ‘‘సరిగా ఆర్గనైజ్ చేయడం రాదా’’ అంటూ జాయింట్ కలెక్టర్పై కూడా విసుగు చూపించారు. ఆర్గనైజ్ చేయడం అంటే రైతులను మభ్యపెట్టడం అన్న అర్థం వస్తుంది. చంద్రబాబు అప్పటికే ఒకట్రెండు కుటుంబాలతో కలిసి పొలాల్లోకి వెళ్లి పాస్ పుస్తకాలు అందినట్లు హడావుడి చేశారు. ఆయా కుటుంబాల వాళ్లు కూడా తాము సంతోషపడుతున్నట్టుగానే చెప్పారు. కానీ సభలో మాత్రం దీనికి భిన్నమైన స్పందన రావడంతో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ఏం జరగలేదని అందరికీ తెలిసిపోయింది. ఆ సభలో ఒకవైపు చంద్రబాబు మాట్లాడుతూండగానే ప్రజలు ఒక్కరొక్కరుగా వెళ్లిపోవడమూ కనిపించింది. నిజానికి ఈ సర్వే కొత్తగా చేపట్టిందేమీ కాదు. జగన్ సీఎంగా ఉండగా భూముల రీసర్వే చేపడితే చంద్రబాబు, ఎల్లోమీడియా విపరీతమైన దుష్ప్రచారం చేసింది. జగన్ భూములు లాగేసుకుంటారని రైతులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వచ్చాక టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెబుతున్నారు. దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? కేంద్రం ఆదేశాల ప్రకారమే జగన్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూముల రీసర్వే నిర్వహించారు. అంతేకాక భూముల సర్వే పూర్తి అయ్యాక, అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు తెలపాలని, ఆ తర్వాత ప్రభుత్వం రైతులకు భూమి గ్యారంటీ పత్రాన్ని ఇస్తుందని చట్టంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ దానిని బలపరిచారు కూడా. కాని ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇదే రీసర్వేపై చిలవలు, పలవలు చేసి, ఏదో అయిపోతుందంటూ వదంతులు సృష్టించారు. జగన్ ఫోటో ఉంటే భూములు అన్ని పోయినట్లు అబద్దాన్ని నూరిపోసి రైతులలో భయం నింపే యత్నం చేశారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ అంశంపై చేసిన నీచమైన ప్రచారానికి అంతేలేదు.. ఎలాగైతే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేని ఆపారా అంటే లేదు. జగన్ ప్రభుత్వం టైమ్లో నిర్వహించిన సర్వేనే కొనసాగించి, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు. జగన్ సర్వేని సమర్థంగా అమలు చేసినందుకు కేంద్రం ఇచ్చిన ఇన్సెంటివ్ సుమారు రూ.400 కోట్లను కూటమి ప్రభుత్వం పొందింది. ఇంత లబ్ది పొందినా, కూటమి ప్రభుత్వం రాకపోతే మీ భూములు గోవిందా అయ్యేవి అని చంద్రబాబు స్పీచ్ ఇచ్చారు. ఇది అసత్యమని ఆయనకు తెలుసు. అయినా తను ఆడిన అబద్దాన్ని నమ్మే స్థితిలోనే జనం ఉండాలన్నది ఆయన సిద్ధాంతం అన్నమాట. కాని వాస్తవం ఎప్పటికైనా జనానికి తెలియకుండా పోతుందా! సర్వే రాళ్లపై ఉన్న పటం కారణంగా రూ.700 కోట్లు వృథా అయ్యాయని అర్థం లేకుండా మాట్లాడారు. అంటే ఆ రాళ్లను వృథా చేయబోతున్నామని చెబుతున్నారు. అదే జరిగితే బాధ్యత చంద్రబాబు సర్కార్దే అవుతుంది కదా! మాజీ ముఖ్యమంత్రి జగన్ భూముల రీసర్వేపై ప్రతిపక్షంగా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఆడిన నాటకాన్ని... అధికారం దక్కిన తరువాత చేస్తున్న మోసాలను, క్రెడిట్ చోరీని మీడియాకు పూస గుచ్చినట్లు వివరించారు. ఈ విమర్శలు వేటికీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జవాబు ఇవ్వలేకపోయారు. కాకపోతే యథాప్రకారం జగన్ను దూషించడానికి మాత్రమే పరిమితమయ్యారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ టైమ్లోనే 6800 గ్రామాలలో సర్వే పూర్తయిన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఒక వైపు అమరావతి పేరుతో రైతుల భూములు వేల ఎకరాలను కైవసం చేసుకుంటున్న చంద్రబాబు గత ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. జగన్ 22ఎ నిబంధన తెచ్చి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. తీరా చూస్తే ఆ నిబంధనను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని వెల్లడవుతోంది.దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని సవాల్ చేస్తూ జగన్ టైమ్లో ఒక్క భూమిని అయినా నిషేధిత జాబితాలో చేర్చారేమో రుజువు చేయాలని అన్నారు. పైగా ఆ జాబితా నుంచి వేల ఎకరాల భూమిని విడిపించి జగన్ రైతులకు న్యాయం చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధునిక సర్వే వ్యవస్థనే అమలు చేస్తూ బ్లాక్, క్లౌడ్ అంటూ రైతులకు అర్థం కాని పదాలు వాడుతూ మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీయడం తప్ప, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. చంద్రబాబు గతంలో ఈ సేవ సర్టిఫికెట్లపై తన ఫోటో ఎలా వేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బురద వేయడమే తప్ప, ఎదుటివారు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. రైతులను చంద్రబాబు పాస్ పుస్తకాల గురించే కాక మరికొన్ని ప్రశ్నలు వేసి ఉండాల్సింది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన రూ.నలభై వేలలో రూ.ఐదు వేలే ఇచ్చారు. ఆ స్కీమ్ అందిందా? లేదా? యూరియా అందుతోందా? రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయా? లేక ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వం పని చేయడం బాగుందా? అన్న ప్రశ్నలు రైతులకు వేసి సమాధానాలు తెలుసుకోవాల్సింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం సరైనదేనా? కాదా? 99 పైసలకే పాతిక ఎకరాలు ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తున్నాం.. మీకు సంతోషమేనా అని అడిగితే తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నది తెలిసేది కదా!. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాగుందా?అని ప్రశ్నించగలిగితే ఇంకా బాగుండేది. పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో అయినా తన ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉంది చంద్రబాబుకు తెలియడం కొంతలో కొంత బెటర్.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్.. ఇది పాయె.. అదీ పాయె!
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే ఆంధ్రప్రదేశ్ సకల శాఖల మంత్రి నారా లోకేశ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఈయనేమో ఐటీ, విద్యాశాఖల మంత్రి. కానీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇతర శాఖలన్నీ తనవే అన్నచందంగా వ్యవహరిస్తూంటారు. ఒకపక్క రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షల్లో తగ్గిపోతూంటే దాన్ని పట్టించుకోకపోగా.. ఇతర శాఖలపై పెత్తనం ఏమిటన్నది ప్రశ్న. చిత్రంగా ఎల్లోమీడియా మాత్రం లోకేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చేశారని ఊదరగొడుతూంటుంది. అందుకే చాలామంది రెండు శాఖలలోను లోకేశ్ పనితీరు అంతంతమాత్రమేనంటున్నారు. తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది కూడా ఇదే. ఎలివేషన్ ఇచ్చేందుకేమో... చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్కు కీలకమైన విద్య ఐటీ శాఖల మంత్రిగా చేశారు. యువకుల్లో లోకేశ్కు ఒక గుర్తింపు వస్తుందని కూడా భావించి ఉండవచ్చు. తల్లికి వందనం స్కీమ్ లోకేశ్ ఐడియానే అని చంద్రబాబు చెప్పడం కూడా ఎలివేషన్లో భాగమే. కాకపోతే ఈ పథకాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ పేరుతో మొదలుపెడితే.. క్రెడిట్ లోకేశ్కు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఐటీ శాఖకు సంబంధించి కూడా.. ఇదే రకమైన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తెప్పించానికి లోకేశ్ కృషి చేసినట్టుగా చెప్పారు ఆయన. ఆసక్తికరంగా ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెడిసికొట్టాయి కూడా. చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు పరుగులు పెడతాయని ఒకప్పుడు ఊదరగొట్టిన లోకేశ్ ఆ తరువాత ఆ విషయం ఎత్తకపోగా.. ఐటీ అభివృద్ది పేరుతో 99 పైసలకే ఎకరాలకు ఎకరాల భూమి కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టారు. పోనీ అలాగైనా కంపెనీలు వచ్చాయా? ఊహూ లేదు. అది చాలదన్నట్టు మంత్రివర్గం స్థాయిలో తీసుకోవాల్సిన భూ కేటాయింపు నిర్ణయాలను తానే తీసుకుంటూ విమర్శలకు గురయ్యారు. తొంభై తొమ్మిది పైసలకే భూములెలా పంచుతారంటే అహంకారపూరిత ధోరణిలో తన నిర్ణయాలను సమర్థించుకుంటున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు. లోకేశ్ శాఖల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర శాఖల విషయంలో జోక్యం చేసుకోవడం ,ముఖ్యంగా రెడ్బుక్ అంటూ హోం శాఖను తానే నడుపుతున్నట్లుగా ప్రవర్తించడం, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి ఆయన ఇమేజ్ను డామేజీ చేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్య,ఆరోగ్య రంంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కాని కూటమి ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి.దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ బాధ్యులవుతారా? కాని ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులు ఏ మాత్రం బాగోలేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీడియా కథనం ప్రకారం.. 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో హైస్కూలు స్థాయి లోపు 18 లక్షల మంది విద్యార్ధులు చదువులకు దూరం అయ్యారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఐదు శాతం మంది తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో ఒక శాతం, హైస్కూలు దశలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. జగన్ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమాల ద్వారా, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై ఆసక్తి రేకెత్తించారు. పేదలు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్లకుండా స్కూళ్లలో చేర్చే అవకాశాలు కల్పించారు. ‘‘నాడు-నేడు’’ కింద ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి వాటికి కొత్త కళ తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడే డిజిటల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్లు ఇచ్చారు. ఎల్లో మీడియా విష ప్రచారం చేసేది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు.అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా రూ.14 వేల చొప్పున ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో మెనూ గురించి కూడా శ్రద్దపెట్టారు. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్, బూట్ల నుంచి అన్నింటినీ టైమ్కు అందించే ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాలు మాత్రం టీచర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి. టీచర్లు కూడా కొంత వరకూ వీరి ట్రాప్లో పడినట్లు చెబుతారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పద్దతులను యధాతధంగా పాటించినా మంత్రి లోకేశ్కు మంచి పేరే వచ్చేదేమో! కానీ.. ఏడాది పాటు తల్లికి వందనం ఎగవేయడం, రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేయడంతో విద్యార్థులు చదువులకు దూరమై ఉండవచ్చని చెబుతున్నారు. గ్రామాలలో, పట్టణాలలో మనీ సర్కులషన్ బాగా పడిపోయిందని అంటున్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు.దీని ప్రభావం కార్మికరంగంపై కూడా ఉంటుంది. వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. జగన్ హయాంలో వివిధ స్కీముల ద్వారా జనంలో డబ్బు చెలామణిలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో పనుల్లేక జనాలు వలస వెళుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా చూసేందుకు ప్రయత్నించడం అత్యవసరం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు నువ్ సెప్పు.. ఆయన్ని కొట్టమని డప్పు!
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబుల్ పర్సన్ అట! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మేరకు ఆయనకు కితాబిచ్చినట్లు ఈమధ్యే ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు తన జీవితాన్నే అంకితం చేశారని కూడా ఆయన అన్నట్టు.. వీళ్లు చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం మామూలే కానీ.. అవి కొంచెం అతిగా అనిపిస్తే మాత్రం మెచ్చుకున్న వ్యక్తిని కూడా శంకించాల్సి వస్తుంది. ఇంతకీ నోబుల్ అన్న పదానికి అర్థం తెలుసా?.. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతి అని. .. చంద్రబాబు నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పైన చెప్పుకున్నవి మచ్చుకైనా కనిపించాయా అన్నదే ప్రశ్న! అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదం చంద్రబాబుదని ప్రత్యర్ధులు అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు పిల్లనిచ్చిన మామనే కూలదోసిన చరిత్ర బాబుది. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తులు కలుపుకున్న వైనమూ అవకాశ వాద రాజకీయాన్ని ధ్రువీకరిస్తాయి. అంతెందుకు.. ప్రస్తుత ప్రధాని.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఉగ్రవాదని ఆరోపించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందీ బాబే. వ్యక్తిగత దూషణలు బహిరంగంగా చేసిందీ ఈయనే. కానీ.. 2024 ఎన్నికల సమయం రాగానే.. అవసరాన్నిబట్టి.. అన్నీ మరచిపోయి.. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడింది కూడా ఈయనే. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఈయన తీరు ఏమైనా మారిందా? ఊహూ లేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలకు ఎలాంటి పనులూ చేయవద్దని అధికారులను ఆదేశించడం ఏ రకమైన ఆదర్శమవుతుందో ఈనాడుకే తెలియాలి. 2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీనే ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీసు ఇచ్చింది. విచిత్రంగా.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్లీ అసలు ప్రస్తావించనే లేదు. నోబుల్ పర్సన్గా గుర్తించిందేమో మరి!. గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాలలో వచ్చిన కొన్ని వార్తలు గమనిస్తే ఇలా కూడా నోబుల్ కావచ్చా? అన్న సంశయం వస్తుంది. చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీనిని తొలుత గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడి అరెస్టు కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా... చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా కొన్ని నిధులు టీడీపీ బ్యాంక్ ఖాతాలలోకి కూడా వచ్చిందని సీఐడీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు 53 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు ఇందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ను ప్రయోగించి కేసు పెట్టిన సీఐడీ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు. చంద్రబాబు నిజంగానే నోబుల్ పర్సన్ అయిఉంటే ఆ కేసు విచారణను ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు!. దురదృష్టవశాత్తు అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లలోనూ చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పు సర్టిఫైడ్ కాపీలను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై కూడా పలువురు అభ్యంతరం చెబుతున్నారు.. పారదర్శకంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో పేర్కొంది. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారా?..పవన్ కళ్యాణ్తో కలిసి ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయలేకపోయినా, అన్నీ చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, ఇంతవరకు దానిపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులన్నిటిని ఎదుటివారిపై రుద్దడం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికలలో ప్రచారం చేయడం.. ఇలాంటి వాటన్నిటిని చేసినా నోబుల్ పర్సన్ అవుతారేమో తెలియదు! పోనీ ఇకనైనా అబద్దాలు చెప్పడం మాని చంద్రబాబు నోబుల్ పర్సన్ అనే పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.! ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్కు పేరు వస్తుందనా? లేక రేవంత్కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ను విమర్శిస్తూ జగన్కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇదెక్కడి రాజకీయం పవనూ?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు. ఒకరకంగా జనసేన కేడర్ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వారి ప్రభావంలో పడితే.. కవితకు నష్టమే..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శాసనమండలిలో కంటతడి పెట్టిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందడానికి ముందు రోజు ఆమె ఓ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, అవమానించారన్న కవిత మాటలు ఆమెకు రాజకీయంగా ఎంత మేలు చేస్తుందన్నదానిపై ఇప్పుడు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కవిత ఆవేదనతో మాట్లాడారా? లేక రాజకీయ ఎజెండాతో వ్యవహరించారా? చెప్పలేము కానీ ఈ ఘటన ప్రభావం ప్రస్తుతానికి పెద్దగా కనిపించడం లేదు. బీఆర్ఎస్కు మరీ ఎక్కువ నష్టం కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీలు ఒక అస్త్రంగా వాడుకోవడం ద్వారా బీఆర్ఎస్ను చికాకు పెట్టవచ్చు.తెలంగాణ ఉద్యమంలో కవిత క్రియాశీలక భూమిక పోషించిన మాట వాస్తవం. ‘తెలంగాణ జాగృతి’ పేరుతో సాంస్కృతిక చైతన్యం తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు. దసరా సందర్భంలో గ్రామ గ్రామాన బతుకమ్మ పండగ జరుపుకోవడంలో కవిత కృషి ఉంది. అలాగే నిజాం నాటి సాహిత్యాన్ని, చరిత్రను గ్రంధస్తం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టిక్కెట్పై నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండోసారి ఓడిపోయినా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఇలా.. తెలంగాణ ఉద్యమంలో భాగమైనందుకు ఆమెకు కొంతమేర ప్రతిపలం ముట్టినట్లే. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఆరంభించినప్పుడు కవిత, ఆమె సోదరుడు తారక రామారావులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2004 ఎన్నికలలో టీఆర్ఎస్ గణనీయమైన విజయాలు సాధించడం, కేసీఆర్ కేంద్ర మంత్రి కావడం, మిత్రపక్షమైన కాంగ్రెస్తో కలిసి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చేరడం, వైఎస్ కేబినెట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు మంత్రులు అయ్యారు. ఆ తరువాతి కాలంలోనే కేటీఆర్, కవితలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కేసీఆర్తో తొలినాళ్ల నుంచి ఉన్నది మేనల్లుడు హరీష్ రావే. ఇందుకు అనుగుణంగానే ఎమ్మెల్యే కాకపోయినా హరీష్కు వైఎస్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కింది. లోక్ సభ, అసెంబ్లీకి రెండు చోట్ల పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ కేంద్ర మంత్రి కావడంతో సిద్దిపేట అసెంబ్లీ సీటు హరీష్రావుకు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేసీఆర్ ఆ తర్వాత రోజుల్లో అసెంబ్లీకి పోటీచేసినా సిద్దిపేటను మాత్రం హరీష్కే కేటాయించారు. అలాగే తన కుమారుడు కేటీఆర్కు సిరిసిల్ల సీటు ఇచ్చారు. 2009లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కేటీఆర్ అతి కష్టమ్మీద తక్కువ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ప్రజలలో పట్టు పెంచుకుని ఆ సీటును ఆయన కాపాడుకుంటున్నారు. 2014లో కవిత నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాని 2019లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయంగా కొంత వెనుకబడవలసి వచ్చింది. అయితే తండ్రే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఎమ్మెల్సీ కాగలిగారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్య గ్యాప్ ఉందని వార్తలు వచ్చాయి. 2023లో పార్టీ ఓటమి పాలయ్యాక ఇవి బహిర్గతమయ్యాయి. ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లడం పార్టీకి కొంత మైనస్ అయింది. కేటీఆర్, హరీష్ రావులు ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలూ చేశారు. కవిత జైలునుంచి బయటకు వచ్చాక ఏదో గిల్టీతో ఉన్నట్లు అనిపించేది. పైకి బింకంగానే కనిపించినా, తనను పార్టీలో దూరం పెడుతున్నారన్న భావనకు గురయ్యే వారు. హరీష్ రావు, కేటీఆర్లపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. తండ్రి తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, కేటీఆర్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తిలో ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ పక్షాన గట్టిగా నిలబడి పోరాడవలసిన సమయంలో ఆమె తొలుత హరీష్పైన,ఆ తర్వాత కేటీఆర్పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో హరీష్పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆ రాజీనామాను కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెండింగులో పెట్టడంతో ఆ అవవకాశాన్ని వాడుకుని కౌన్సిల్లో కవిత భావోద్వేగంతో కంట తడిపెట్టి ప్రసంగం చేశారు. నిజానికి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అయినా రాజీనామా సందర్భం కనుక ఆమె స్పీచ్ ను గుత్తా అనుమతించి ఉండవచ్చు. పైగా అదేమీ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేది కాదు. ఆ సందర్భంగా కేసీఆర్పైన, బీఆర్ఎస్పైన ఆమె గట్టి ఆరోపణలే చేశారు. ఏకంగా ఆ పార్టీకి నైతిక అర్హత లేదని ఆరోపించారు. తనది ఆస్తి గొడవ కాదని, ఆత్మగౌరవ పోరాటమని ప్రకటించారు. కాళేశ్వరం,తదితర ప్రాజెక్టుల నిర్మాణ తీరును తప్పుపట్టారు. ఒక్క కాంట్రాక్టర్కే రూ.లక్ష కోట్ల కాంట్రాక్ట ఇచ్చారని ఆరోపించారు. ఇవన్ని ఇంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం విచారణ కూడా చేయించింది. అయినా కేసీఆర్పైన లేదా ఇతరత్రా ఎవరిపైన ఇంకా కేసు పెట్టలేదు. కాని కవితే ఈ రకంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం నైతికంగా కరెక్టేనా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభ్యంతరం చెబితే ఒక అర్థం ఉండేది.అలాకాకుండా ఇప్పుడు ఏవేవో మాట్లాడితే కాంగ్రెస్ కు మేలు చేస్తుంది తప్ప తనకు కాదన్న సంగతి ఆమెకు తెలియదని చెప్పలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్లోని కొందరు ప్రముఖులతో రాజకీయ సంబంధాలు పెట్టుకుని ఆమె బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె ప్రభుత్వంలో కొన్ని పనులు కూడా చేయిస్తున్నారన్నది బీఆర్ఎస్ వర్గాల అనుమానం. అంతేకాక అధికారంలో ఉన్నప్పుడు ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరిగేదని, అయినా కేసీఆర్ కుమార్తె కావడంతో తాము ఏమీ మాట్లాడ లేకపోయేవారమని ఆ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపార సంస్థల వారిని ఆమె బెదిరించేవారని కొందరు ఆరోపిస్తుంటారు. రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాని ఇప్పుడు సొంతంగా పార్టీ పెడితే నెగ్గుకు రాగలరా? అన్నదే చర్చ. అందులోను హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి పోటీచేయాలని ఆమె భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో కవిత రాజకీయం నల్లేరు మీద బండిగా ఉండబోదన్నది ఎక్కువ మంది భావన. ఎంత వాగ్దాటి ఉన్నా, పార్టీ అనే పెద్ద వ్యవస్థ ఉంటేనే ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం అవుతోంది. బీజేపీ వైపు వెళ్లే చాన్స్ కాస్త తక్కువగానే కనిపిస్తోంది. బిజెపి ప్రభుత్వమే తనను జైలులో పెట్టించిందన్న కోపం ఆమెకు ఉంటుంది. కాంగ్రెస్లో చేరితే చెప్పలేం కాని, సొంతంగా పార్టీ అయితే మనుగడ అంత తేలికకాదు. ఈలోగా బీఆర్ఎస్తో రాజీ కుదిరుతుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఈమె రాజకీయ ప్రచారం వల్ల బీఆర్ఎస్కు జరిగే నష్టాన్ని అంచనా వేసుకుని మధ్యవర్తులు ఆ ప్రయత్నాలు చేసే అవకాశమూ ఉంటుంది.ప్రస్తుతానికి అయితే కవిత భవిష్యత్ రాజకీయం వల్ల తాము నష్టపోతామని బీఆర్ఎస్ అనుకోవడం లేదు. అందువల్లే ఆ పార్టీ మహిళా నేతలు కవిత విమర్శలకు ధీటుగానే బదులు ఇచ్చారు. కవిత కీలుబొమ్మగా మారారని, ఆమె వైఖరి వల్లే కేసీఆర్ మానసిక క్షోభకు గురి అవుతున్నారని పేర్కున్నారు. మండలిలో ఆమె పచ్చి అబద్దాలు చెప్పారని వారు విమర్శించారు. అంటే బీఆర్ఎస్తో సంబంధాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్న మాట. రాజకీయాలలో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు.. మౌనమేల నోయి..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి చాలాకాలం క్రితం అన్నమాట ‘కేంద్రం మిథ్య’ అని! అప్పటి ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారిని కూడా విధానపరంగా ఎదిరించిన చరిత్ర ఆయనది. అయితే... అదే తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని సీఎం అయిన చంద్రబాబు మార్కు రాజకీయం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెతను గుర్తు చేస్తుంది ఈయన వ్యవహారం. ఒకట్రెండుసార్లు బాబుగారు కేంద్రాన్ని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి లెండి. నిధుల పంపిణీలో దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి ఆయన గళమెత్తారు. కానీ ఇప్పుడు అదంతా గతం. 2024లో గద్దెనెక్కింది మొదలు చంద్రబాబు నాయుడు బాగా బలహీనపడినట్లు కనిపిస్తున్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధుల విషయంలోనే రాష్ట్రానికి భారీగా కోత పడుతున్నా కిమ్మనలేకపోతున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే.. ఈ విషయంపై జనసేనతో కలిసి కేంద్రానికి వత్తాసుపలకడం! విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని తరచూ జగన్ను విమర్శించిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి! పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి తనకు ఇద్దరు ఎంపీలున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవటీకరణను అపేసేవాడినని బీరాలు పలికారు కూడా. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 17 మంది ఎంపీల మద్దతుంది. కానీ వీళ్లు ఈ అంశంపై గళమెత్తితే ఒట్టు!కొంచెం గతంలోకి వెళదాం... నరేంద్ర మోడీతో చెడిన తరువాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఏమన్నారో గుర్తు చేసుకుందాం. అమరావతికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని, ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా.. పనికి ఆహారం పథకం కింద ఏకంగా యాభై లక్షల టన్నుల బియ్యం తీసుకొచ్చానని బాబు చెప్పుకునేవారు. బాబుగారి పలుకుబడి అంత అని టీడీపీ ప్రచారం చేసుకునేది. ఇదే బియ్యం పార్టీ నేతల అక్రమార్జనకు దారి తీసిందన్నది వేరే సంగతిలెండి. కానీ ఇప్పుడేమైందో మరి? కేంద్రం కొత్త విధానాలు రాష్ట్రాలకు నష్టం చేస్తున్నా నోరెత్తలేకపోతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతంతమాత్రం నిధులే వస్తున్నా కేంద్రం బాగా సహకరిస్తోందని చెప్పుకునే దుస్థితి ఎందుకో? కేంద్రం నుంచి రూ.34 వేల కోట్ల సాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే, తొమ్మిది నెలల్లో కేవలం రూ.ఏడు వేల కోట్ల వరకే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ వాటా 75 శాతం నుంచి 40 శాతానికి కుదించుకుంది. గ్రామీణ సడక్ యోజన, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లోనూ రాష్ట్రం వాటాను నలభై శాతానికి పెంచారు.పి.ఎమ్. ఫసల్ భీమా స్కీమ్ లో గతంలో ఏభై శాతం చొప్పున కేంద్ర,రాష్ట్రాలు భరించేవి.కాని ఇప్పుడు రాష్ట్రమే 75 శాతం ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా రాష్ట్రాలపై ఆ మేరకు అధిక బరువు పడుతుంది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మగాంధీ పేరును తొలగించడంపై.. కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం వాటా తగ్గడంపై కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బాబు మౌనం పలు సందేహాలకు కారణమవుతోంది. ఈ మార్పుల వల్ల ఏపీకి మాత్రమే ఏటా సుమారు రూ.4500 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా. అయినాసరే.. టీడీపీ, జనసేనలు ఈ మార్పులను వ్యతిరేకించలేదు. కాకపోతే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అభ్యంతరం మాత్రం చెప్పారట. మార్పులు స్వాగతిస్తూనే ఆర్థిక పరిస్థితి రీత్యా ఏపీకి వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారట. జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ఇలా కోరడం సమంజసమేనా? జనసేన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారట. వైసీపీ ఎంపీ వైసిపి అవినాశ్ రెడ్డి మాత్రం ఉపాధి స్కీమ్ ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని ధైర్యంగా విమర్శించారు.కొత్త చట్టం పేదల పొట్ట కొడుతుందని హెచ్చరించారు. బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడింది స్పష్టంగా తెలుస్తోంది కదా!విశాఖ స్టీల్, ఇతర అంశాల విషయంలోనూ టీడీపీ, జనసేనల తీరు ఇలాగే ఉంది. మోడీగారికి చాలా పనులు ఉంటాయని, అన్నిటికి ఆయనను ఇబ్బంది పెట్టలేమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్ ప్రభుత్వ కాలంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చినా, ఏపీకి నష్టం జరుగుతుందనుకుంటే ప్రధానికి, కేంద్ర మంత్రులకు నిర్మొహమాటంగా తెలిపే వారు. విశాఖలో జరిగిన ఒక సభలో ప్రధాని మోడీ సమక్షంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని గట్టిగా కోరిన విషయం తెలిసిందే. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు. కానీ ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రూ.ఎనిమిది వేల వరకూ తగ్గుతుందన్న అంచనాలు వచ్చినా కిమ్మనలేదు ఈ పార్టీలు. ఈ అంశాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించి రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఎంతో సీనియర్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం ఈ డిమాండ్ చేయలేకపోయారు. పైగా మోడీ మెప్పుదల కోసం అన్నట్టు.. రేట్ల తగ్గింపు తరువాత కూడా ఏపీలో జీఎస్టీ ఆదాయం బాగా పెరిగిందంటూ సభలు పెట్టారు.తాజాగా తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు సెస్ల భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహానాల లైఫ్ట్యాక్స్పై పది శాతం అదనపు సెస్ అలాంటిదే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మౌనం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. డిమాండ్లు పెడితే బీజేపీ పెద్దలు అవమానిస్తారన్న సందేహమా? లేక... తనపై ఉన్న కేసుల భయమా? అదీ కాదంటే పుత్రరత్నం భవిష్యత్తు కోసం రాజీ పడుతున్నారా? ఇదీ కాదంటే.. ఎలాగూ అమరావతి కోసం అప్పులు చేసుకునేందుకు ఉదారంగా అనుమతిస్తున్నారు కాబట్టి.. అలా ముందుకెళదాం అనుకుంటున్నారా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
శిష్యుడి మాటకు గురువు తలూపుతున్నారా?
ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకోపక్కేమో తమకు అత్యంత ప్రియుడైన తెలుగుదేశాధిపతి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును చిక్కులే పడేసేలా వ్యాఖ్యానిస్తే.. సమర్థించుకోలేక, విమర్శించనూ లేక అల్లల్లాడిపోతోంది ఈ పచ్చమీడియా! తన విజ్ఞప్తితోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని రేవంత్ చెప్పడం.. ఏపీలో తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియాకు కూడా దిక్కుతోచటం లేదు.రేవంత్ రెడ్డిని విమర్శించే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎటూ చేయదు. వంతపాడే జనసేన, బీజేపీలు కూడా కామ్గానే ఉన్నాయి. రహస్య విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి మూడు రోజులు అవుతున్నా చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేకపోయారు. నష్టం కొంత తగ్గిద్దామనుకున్నాయేమో.. ఎల్లో పత్రికలు రేవంత్ వ్యాఖ్యలను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేశాయి. చంద్రబాబుకు నష్టం జరిగే సమాచారాన్ని ఎడిట్ చేసి కనీ కనిపించకుండా వేసి ఏపీ పాఠకులను మోసం చేశాయి.సాక్షి మీడియా మాత్రమే రేవంత్ ప్రకటనను యథాతథంగా ఇచ్చింది. విశ్లేషణలు అందించింది. సాక్షి, సోషల్మీడియా చురుకుగా ఉండటంతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమకు ఎంత అన్యాయం చేసింది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఈ ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన సహజ ధోరణిలో జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆగిందంటూ దిక్కుమాలిన వాదన తెరపైకి తెచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్లో 'చచ్చినా, బతికినా తెలంగాణ కోసమే’ అన్న శీర్షికతో రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది.ఇందులో రాయలసీమ లిఫ్ట్ను తానే ఆపు చేయించానన్న అంశానికి ప్రాధాన్యమివ్వలేదు. లోపల పేజీలో మాత్రం కొద్దిగా రాసింది. అందులో కూడా జగన్ ప్రస్తావన తెచ్చింది. పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి జగన్ను ప్రోత్సహిస్తే తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆపించానంటూ రేవంత్ చేసిన కామెంట్ను ముద్రించారు. తెలంగాణలో కనీసం లోపలి పేజీలోనైనా వేశారు.. ఈనాడు ఏపీ ఎడిషన్లో వేసినట్లు కనిపించలేదు. కాని మరుసటి రోజు మాత్రం మంత్రులు సవిత, రామానాయుడుల ప్రకటనలను మొదటి పేజీలో ప్రచురించారు.కాగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రేవంత్ అబద్దాలు చెప్పారని చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈనాడు మీడియా చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపింది. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే అని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో ఎత్తిపోత పనులు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలుగా ఈ ఉదంతాన్ని కొట్టిపారేశారు. అంతే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేకపోయారు. దీనినిబట్టి టీడీపీ కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా వెల్లడైంది. ఈ పథకంపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది తెలంగాణ టీడీపీ సహకారంతోనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్జీటీ వ్యతిరేక ఆదేశాలు ఇచ్చినా జగన్ వ్యూహాత్మకంగా పనులు కొనసాగించారు. దాంతో అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ అంటే పడని శక్తులు ఎన్జీటీకి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేశాయి. ఈలోగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 19 నెలలు అయినా ఈ స్కీమ్ అడుగు ముందుకు కదల్లేదు. ఎందుకిలా అన్నదానికి ఈ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా! ఆ ఊసే లేకుండా వారు స్టేట్ మెంట్ ఇచ్చారు.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నామని ఊదరగొట్టే ఈ నేతలు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెచ్చి ఉండాలి కదా!అవేమీ చేయలేదంటే ఈ పథకాన్ని ఆగినా, రాయలసీమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నట్లే కదా అన్న ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారు? రేవంత్ డిమాండ్ కు తలొగ్గినట్లే అవుతుంది కదా! ఒకవేళ జగన్ పై ఇలాంటి ఆరోపణ వచ్చి ఉంటే తెలుగుదేశంతోపాటు ఎల్లో మీడియా ఎంత రచ్చ చేసి ఉండేవో ఊహించుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ ఒక తప్పుడు ఆరోపణ చేశారే తప్ప, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. రేవంత్ చాలా స్పష్టంగా ఏకాంత సమావేశంలో చంద్రబాబును ఒప్పించానని వెల్లడించారు. తనపై గౌరవంతోనే చంద్రబాబు ఈ స్కీమ్ పనులు నిలిపివేశారని అన్నారు. కావాలంటే కమిటీగా వెళ్లి చూడవచ్చని తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అయినాసరే... టీడీపీ నేతలు, మంత్రులు మొక్కుబడిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమా? కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కాని, ప్రజాసంఘాలు కాని చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ స్కీమ్ పనులు కొనసాగాయనేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి రికార్డులు చూపించారు. వైసీపీ బృందం ఒకటి లిఫ్ట్ స్కీమ్ ప్రాంతానికి వెళ్లి జగన్ టైమ్లో జరిగిన పనులు ప్రజలకు తెలియచెప్పింది.అలాగే నమస్తే తెలంగాణ పత్రిక గతంలో ఆ ప్రాంతానికి వెళ్లి జగన్ ఈ స్కీమ్ పనులు ఆపలేదని, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన నాటికి 14 శాతం పనులు జరిగితే, ఆ తర్వాత 85 శాతం జరిగాయని ఆ రోజుల్లో తెలిపింది. ఏపీ మంత్రులు ఈ విషయాలను కప్పిపుచ్చుతూ ప్రకటనలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అప్పట్లో ఈ స్కీమ్ను ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపలేదంటూ కొన్ని వార్తలు ఇచ్చిన క్లిప్లింగ్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ మీడియా కూడా జగన్పై ద్వేషంతో రాయలసీమకు నష్టం చేయడానికి వెనుకాడలేదన్నమాట.ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో దీనిపై మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెబుతారని లీక్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని పెద్ద హెడింగ్ పెట్టి తన పాఠకులను, ఏపీ ప్రజలను మోసం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ పత్రిక రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్క ముక్క కూడా ఏపీ ఎడిషన్ లో ప్రస్తావించినట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు మాత్రం తాటికాయంత శీర్షిక పెట్టి జగన్ పై బురద చల్లేందుకు యత్నం చేసింది. రేవంత్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుకు తీరని నష్టం జరిగిందని గమనించిన ఈ ఎల్లో మీడియా మొత్తం ఇష్యూని జగన్ పై నెట్టేసి టీడీపీని రక్షించాలని విఫల యత్నం చేసింది.అనుమతులు లేవు.. డీపీఆర్ లేదు.. అయినా జగన్ 2020లో ఈ ప్రాజెక్టును చేపట్టారని ఈ పత్రిక రాసింది. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటూ రాశారు. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద చల్లి రాజకీయ లబ్దిపొందేందుకు వైసీపీ ఎత్తు అని ఎల్లో మీడియా ఆరోపించింది. అయినా వాస్తవాలు వెల్లడవడంతో ఆ ఎత్తు చిత్తయిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. అది నిజమే అయితే ఇంతగా కంగారు పడుతూ జగన్కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా! ఆయనను ఎందుకు ఒక్క మాట అనలేదు?జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ పనులను చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు వేసింది తెలియచేస్తూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. అటు రేవంత్ తోను, ఇటు చంద్రబాబుతోను ఈనాడు యజమాని కిరణ్ కు, ఆంద్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికి తెలిసినవే. వారి వ్యాపార ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో దానిని కవర్ చేయడానికి జగన్ పై తోసేయాలని కుట్ర చేస్తున్నారు.ఇదే టైమ్ లో ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ స్కీమ్ అంటూ విపరీతంగా ప్రచారం చేసి, సడన్గా దానిని ఆపేసి పోలవరం-నల్లమల సాగర్ స్కీమ్ అంటూ కొత్త గాత్రం ఎందుకు ఎత్తుకున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా! ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా చంద్రబాబు ఆయన మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఆ కేసు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలుకుని చంద్రబాబు ఏపీకి వెళ్లిపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏకంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నే నీరుకార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అంటే గురువును శిష్యుడే శాసిస్తున్నారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ మాట.. బాబు గుట్టు!
కాలం కలిసిరాకపోతే తాడే పామవుతుందట. పాపం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిప్పుడు ఈ సామెతను పదే పదే తలచుకుంటూ ఉండి ఉంటారు. ఎందుకంటే... పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మీద చంద్రబాబు నిలిపివేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రకటించారు. కావాలని చెప్పారో, క్రెడిట్ కోసం చెప్పారో, అనుకోకుండా చెప్పేశారో తెలియదు కాని... ఈ నిజం కాస్తా చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేసింది. తెలంగాణ ప్రజల మెప్పు కోసం లేదంటే బీఆర్ఎస్పై పైచేయి కోసం రేవంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో చంద్రబాబు కాస్తా రాయలసీమ ద్రోహిగా ముద్రపడిపోయారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృథా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని నమ్మిన గత ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అప్పట్లోనే విమర్శలు చేసినా జగన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. తమకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిది కదా అని వాదించేవారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే తాము కూడా అదే 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించేవారు.నిజానికి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టమేమీ ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.కాకపోతే నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పడినట్లు ఈ స్కీమ్ను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అదే రీతిలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డే అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమందితో ఎన్జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. ఏడువేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తాగు నీటి అవసరాల పేరుతో ఈ స్కీమును కొనసాగించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తి చేయించారు. అంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, టీడీసీ. జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో స్కీమ్ను కొనసాగించి ఉంటే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. కాని ఆ పని చేయకపోగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. పర్యావరణానికి సంబందించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదని ఫలితంగా అనుమతులు రాలేదని, దానివల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్సభలోనే చెప్పారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం అలా చేసిందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. రేవంత్, చంద్రబాబులు ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తనమీద గౌరవంతో చంద్రబాబు ఈ పని చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా? లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది కొరవడడంగా చూడాలా? అందరూ వీరిద్దరి సంబంధంగా చూస్తారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. రేవంత్ను కాంగ్రెస్ లోకి పంపడం మొదలు, ఆయన ముఖ్యమంత్రి అవడం వరకు చంద్రబాబు పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ మాత్రం తన మిత్రపక్షమైన బీజేపీకి కాకుండా కాంగ్రెస్కే అనుకూలంగా పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. రాజకీయంగా ఇంతగా కలిసిపోయిన చంద్రబాబు, రేవంత్లు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫర్వాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని అనుకునేవారు. తాజాగా ఈ రేవంత్ ఈ సమాచారం వెల్లడించడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ చెప్పినట్లు ఏపీలో చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన కలుగుతుంది. అందులో ఇది ఒకటి. కాకపోతే ఈ రహస్యం రేవంత్ చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం. ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపేయడం వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, రేవంత్కు 2009 నుంచి సంబంద బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తి బాగా కుదిరిందని రాజకీయవర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్దపడడంం దారుణమనిపిస్తుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ ఒక విజన్తో రాయలసీమ అభివృద్దికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమవుతుంది. పైకి మాత్రం రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెబుతుంటారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఇరిగేషన్ స్కీమ్ తీసుకురాలేదు. ఉన్నవాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాలలో మాత్రం శంకుస్థాపనల హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీమ్లకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2002 ప్రాంతంలో శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చి నిరసన తెలిపారు. తదుపరి తాను సీఎం అయ్యాక ఆయన చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వివిద ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్ధ్యం 44వేల క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు వారినెవరిని వారించ లేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయి తీసుకువచ్చిన రాయలసీమ లిఫ్ట్కు చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి. ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని మసర్ధంగా వాడుకోవాలని అంటూంటారే ఎందుకు చెబుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది. తెలంగాణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ఒక సంగతి అయితే, ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు మంగళం పలకడం మరో ఎత్తు. గోదావరి-బనకచర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి యత్నించారు.తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే, దానిని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు అరవైవేల కోట్ల ప్రాజెక్టు అట. ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందో, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది.నిజానికి ఈ భారీ స్కీమ్ లపై చంద్రబాబుకు నమ్మకం ఉండి చేపడుతున్నారని చెప్పజాలం.కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతరత్రా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంటారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబుకు గతంలో అసలు భారీ నీటి ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం లేదు. ఎన్నికలలో అవి ఫలితాలు ఇవ్వవన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డి వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకోసం ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్మనే వారు కారు. వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు సాకారం అవడం ఆరంభం అయింది. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది.అదే టైమ్ లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్న సంగతి నిర్దారణ అవుతుంది.ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పట్టాభిషేకం పంచాయితీ కోసమేనా విదేశీ పర్యటన?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. పర్యటించరాదని కాదు కానీ గతంలో వీరిద్దరూ వైఎస్ జగన్ లండన్ టూర్పై పిచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు ఈ రహస్య పర్యటన కాస్తా చంద్రబాబును రాష్ట్ర ప్రజల దృష్టిలో అభాసుపాలు చేసింది. కొందరు చేసిన పాపాలు ఎక్కడకు పోతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికారిక హోదాలో సీఎం లేదా మంత్రులెవరైనా విదేశీ పర్యటనకు వెళుతూంటే ముందుగానే టూల్ షెడ్యూల్ విడుదలవుతుంది. కొన్నిసార్లు ఈ పర్యటనల్లో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటూంటారు. పర్యటన వ్యక్తిగతమైందైనా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేశ్ల టూర్ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉండవచ్చు కానీ.. వ్యక్తిగత పర్యటనైనప్పటికీ ఏపీ ప్రజానీకానికి తెలియచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు పెద్దగా విలువలేకుండాపోయిందని, చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేశ్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ గోప్యంగా వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో ఉన్నప్పటికీ టెలికాన్ఫరెన్స్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారని ఎల్లోమీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ.. ఎక్కడున్నారో మాత్రం చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్ తన కుతుళ్ల గ్రాడ్యుయేషన్ ఉత్సవాలకు లండన్ వెళితే చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు. కన్న కూతుళ్లను చూడాలన్న అభిమానం పుట్టింది. ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. అక్కడ విమానం లాండింగ్ ఉండాలంటే విమానానికి గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే దగ్గర, దగ్గర రూ.30 - 40 కోట్లు మీ డబ్బు ఖర్చు పెట్టి, కూతుళ్లను చూడడానికి వెళ్లాడు’’అని ఆరోపించారు. లోకేశ్ కూడా ‘‘రూ.12 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. హాలిడేకి వెళ్లాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళతాడు. లండన్ వెళ్లి ఎక్కడ పడుకుంటాడు అని నేను అడిగానా? ఏ హోటల్కు వెళ్లాడని నేను అడిగానా?’’ అంటూ అనుచిత భాష వాడారు. ఖర్చు విషయంలో చెరోమాట మాట్లాడటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. వాస్తవం ఏమిటంటే అప్పట్లో జగన్ లండన్ వెళ్లింది తన సొంత డబ్బుతో. ప్రభుత్వ సొమ్ముతో కానేకాదు. కానీ ఆ టూర్ సమయంలో ఎడాపెడా తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు రహస్య టూర్ను సమర్థించుకోలేక నానా పాట్లు పడుతోంది. టీడీపీ సోషల్ మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అప్పట్లో నీచంగా ధంబ్ నెయిల్స్ పెట్టారు. ‘‘జగన్ ప్రత్యేక విమానంలో ఏమీ తీసుకువెళ్లారు?’’ ‘‘ఆ సూట్ కేసులలో ఏముంది? డబ్బు తరలించారా?’’ ‘‘మధ్యలో విమానం ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది?’’ ‘‘ఆ దీవుల్లో బ్లాక్ మనీ దాచుకోవచ్చని వెళ్లారా?’’ అంటూ ఇలా రకరకాలుగా కథనాలు వండి వార్చారు. మెయిన్ మీడియాలో సైతం ఈ అంశాలపై చర్చలు జరిపారు. జగన్కు ఎల్లో మీడియా వేసిన ప్రశ్నలన్నీ ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లకు కూడా వర్తిస్తాయి కదా! వాటి గురించి మాట్లాడలేకపోయారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆరుసార్లు, లోకేశ్ తొమ్మిదిసార్లు విదేశీ యాత్రలు చేశారు. పెట్టుబడుల కోసం అని చెబుతున్నా, ఇంకేదో కారణం ఉంటుందన్నది పలువురి సందేహం. టీడీపీ విశ్లేషకులు ‘‘జగన్కు చెప్పి వెళ్లాలా? అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఆ తరువాత కానీ జగన్ సీబీఐ కోర్టు అనుమతితోనే టూర్ వెళ్లారు. లండన్ ఎయిర్ పోర్టులో వైసీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన వారు, అభిమానులు పలువురు ఆయనకు స్వాగతం చెప్పారు. కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాపరికం ఏదీ లేదు. అయినా ఎల్లో మీడియా ప్రజలలో అనుమానాలు వచ్చేలా పిచ్చి వార్తలు ప్రచారం చేసింది. వదంతులు సృష్టించడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఇప్పుడు పరిస్థితి చూడండి. కొత్త సంవత్సరం రావడానికి మూడు రోజుల ముందే లోకేశ్ విదేశీయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్లారు.వారెందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారో చెప్పలేని స్థితి. కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్లారని ప్రచారం జరిగింది. అదే నిజమైతే అమరావతి, ఏపీ, విశాఖ లేదా తిరుపతి వంటి నగరాలలో వేడుక చేసుకోకుండా విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వస్తాయి. అయితే చంద్రబాబు, లోకేశ్లు లండన్ కే వెళ్లారా? సింగపూర్కు వెళ్లారా అన్నది తెలియదు. తనకు వెంటనే పట్టాభిషేకం జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని, అందుకే ఆ పంచాయతీ కోసం విదేశాలకు వెళ్లారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారా అని మాజీ ఎమ్మెల్యే సుధాకర బాబు నిలదీశారు. సీఎం పదవి ఇవ్వలేదని అలిగి లోకేశ్ ముందే విదేశానికి వెళితే, అతనిని బుజ్జగించడానికి చంద్రబాబు వెళ్లారా అని మరో నేత నాగార్జున యాదవ్ అడిగారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లారా? లేక హెరిటేజ్ డబ్బుతో వెళ్లారా? అన్నది ఎందుకు చెప్పడం లేదని ఆయన అన్నారు. ఈ ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నది వేరే విషయం. జగన్ టూర్కు రూ.నలభై కోట్ల ఖర్చయి ఉంటుందని చంద్రబాబు ఆరోపించినందున, ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన తమ టూర్కు అంతే ఖర్చు చేశారా? ఇంకా ఎక్కువ చేశారా? జగన్ను ఉద్దేశించి అప్పట్లో అనుచితంగా వ్యాఖ్యానించిన లోకేశ్కు కూడా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవుతుంది కదా! గతంలో చంద్రబాబు, లోకేశ్లు ఎలాపడితే అలా అసభ్యంగా మాట్లాడితే, జగన్ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడం సంస్కారయుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేశ్ల రహస్య విదేశీ యాత్ర వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కాని,తెలుగుదేశం పార్టీని,ఎల్లో మీడియాని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారా వ్యాఖ్యాత. -
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లో మీడియా పెను శాపమవుతోంది. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఈ మీడియా ప్రజలపై వేల కోట్ల భారాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్థించే స్థితికి చేరుకుంది. జర్నలిజం ప్రమాణాలకు ఎన్నడో తిలోదకాలు ఇచ్చిన ఈ మీడియాపై ప్రజలు మండిపడుతున్నారు. జగన్ సీఎంగా ఉండగా వదంతులతో, కల్పిత కథలతో విష ప్రచారం చేసిన మీడియా ధోరణి ఇప్పటికీ మారలేదు. ఆంధ్రజ్యోతి కొన్ని రోజులు క్రితం ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనం దీనికో ఉదాహరణ. ఏపీలో వాహన కొనుగోలుదారులపై పది శాతం సెస్ వేయడాన్ని సమర్థించింది ఆంధ్రజ్యోతి తరఫున వచ్చిన ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అనే కథనం. పైగా ఇందులోనే సెస్కు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ఇచ్చిన కథనంపై తన అక్కసునంతా వెళ్లగక్కింది. సెస్ను ప్రభుత్వం సమర్థించుకుంటోందని రాసి ఉంటే అదో పద్ధతి అనుకునేవాళ్లు. కానీ.. పత్రిక స్వయంగా భుజానికెత్తుకోవడం సరైన నిర్ణయమంటూ రాసేయడంతోనే సమస్య. వాహనాల లైఫ్ టాక్స్పై మాత్రమే సెస్ అని, ఒక్కో వాహన కొనుగోలుదారుపై పడే భారం రూ.1200 అని ఈ కథనం చెబుతుంది. సాక్షి కూడా ఇదే కదా రాసింది. రాష్ట్రంలో సగటున నెలకు 73 వేల వాహనాలు అమ్ముడుపోతూంటే సెస్ వల్ల ఏడాదికి రూ.270 కోట్ల భారం ప్రజలపైపడుతుందని సాక్షి రాసింది. కానీ ఎల్లోమీడియా దృష్టిలో ఇది పెద్ద భారమే కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారికి బాగా గిట్టుబాటు అవుతోంది మరి. ఇలాంటి అంశాల్లో మీడియా అనేది ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్దతను ప్రశ్నించాలి. అప్పులు తేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పన్నుల బాదుడు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి, సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎన్నికల సమయంలో పలికిన బీరాలను గుర్తు చేయాలి. అలా చేయకపోగా రోడ్లు బాగు చేయాలని, మద్యం తాగి నడిపే వారిని పట్టుకునేందుకు బ్రీత్ ఎనలైజర్లు, వేగం నియంత్రణకు స్పీడ్గన్లు ఏర్పాటు చేయాలని రాస్తోంది. ఇదే రకమైన బుద్ధో మరి? కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ బాగు చేసేశామని ఆ మధ్య ఎప్పుడో చెప్పారు కదా? అంతలోనే ఏమైంది?అవినీతి పుణ్యమా అని గోతులమయం అయ్యాయా? పైగా రహదారుల కోసం ఇప్పటికే సెస్లు ఉండగా అదనంగా ఎందుకు? పెట్రోల్, డీజిల్ ధరలపై ఇప్పుడున్న సెస్ ఎంత? ఆ మొత్తాన్ని రోడ్లకు వాడడం లేదు ఎందుకు? ఎన్నికలై 19 నెలలైనా ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు, డీజిళ్ల ధరలు ఎందుకు తగ్గించలేదు? ఈ అంశాలపై ఎల్లో మీడియా ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా?. జగన్ టైమ్లో చెత్త పన్ను కోట్లు వసూలు చేశారట. కాని ఎక్కడి చెత్త అక్కడ ఉందట. తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారంటే రాజకీయం అనుకోవచ్చు కానీ.. ఆంధ్రజ్యోతి ఇంత పచ్చిగా అబద్దాలను ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్థానిక సంస్థలలో నెలకు రూ.50 - 100 వసూలు చేసి పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. వీటి ద్వారానే ప్రభుత్వానికి రూ.కోట్లు వచ్చాయట. ఇందులో ఇసుమంతైనా నిజం ఉందా? ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తివేశామని చెప్పిన తర్వాత అనేక గ్రామాలు, పట్టణాలలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో తెలియదా? ప్రస్తుతం పిఠాపురం వంటి చోట్ల ఈ చెత్త పన్ను వసూలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. చెత్త పన్నుతో కోట్ల వచ్చాయట. ఇప్పుడేమో లైఫ్ టైమ్ టాక్స్ పై పది శాతం సెస్ వేస్తే కాని రోడ్లు బాగు చేయలేరట.అది కోట్ల మొత్తం కాదని వీరు చెబుతున్నారా? వైసీపీ హయాంలో చెత్త పన్ను వేస్తున్నారని, చెత్త ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేశారు. పెద్ద సంస్కరణవాదిని అంటూ గతంలో ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేయించిన చంద్రబాబు అధికారంలో ఇంకో పార్టీ ఉంటే మాత్రం ఇలా చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా రోడ్డు కావాలంటే స్థానికు ప్రజలు ఏభై శాతం భరించాలని ‘జన్మభూమి’ పథకం కింద నిబంధన పెట్టిన విషయంబ మరచిపోయారా? ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆ షరతు తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం చేస్తుందట. ప్రైవేటు వ్యక్తులు చెత్త తొలగించడానికి ఏభయ్యో, వందో తీసుకుంటేనే తప్పు అని చెప్పిన చంద్రబాబు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా, వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అప్పనంగా ధారాదత్తం చేస్తారట. జగన్ చేస్తే బాదుడు ..చంద్రబాబు చేస్తే బాగుకే అని రాయడం అంటే పాఠకులను, ప్రజలను మోసం చేయడం కాకుండా మరొకటి అవుతుందా?.. గత నవంబర్ ఆఖరు వారంలో ఇదే పత్రిక ఒక కథనం ఇచ్చింది. సెస్సులు వేసి రోడ్లు వేయాలని రహదారుల శాఖ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం పెట్రోలు, డీజిల్, గనులు,రిజిస్ట్రేషన్లపైన సెస్ వేసి స్టేట్ హైవేలను అభివృద్ది చేయాలని తలపెట్టారట. దీనిని ప్రజలపై భారం మోపడం అని అంగీకరించరా? ఈ భారం సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉండవచ్చని ఇతర మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత బాదుడు బాదినా ఆహా,ఓహో అని పొగుడుతారా? అదే జగన్ ప్రభుత్వం ఉంటే అడ్డగోలుగా రాస్తారా?.. ఇప్పటికే కరెంటు చార్జీల సర్దుబాటు రూపంలో సుమారు రూ.17వేల కోట్లు మళ్లీ మరో రూ.15651 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారా?లేదా? భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో అదనంగా రూ.వెయ్యి కోట్లు ఆదాయం సమకూర్చుకుంటున్నారా? లేదా? గ్రామాలలో రక్షిత నీటి సరఫరాపై యూజర్ ఛార్జీలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? లేదా? ఒక వైపు దాదాపు మూడు లక్షల కోట్ల అప్పుతో రికార్డు సృష్టించిన ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాదుడు ఏమిటి అని అడగవలసిన ఈ ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతోంది.కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు ఇదే ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేసింది? జీఎస్టీ తగ్గించడంతో అన్ని రకాల వ్యాపారాలు పెరిగిపోయాయని, ప్రబుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తోందని కదా? ఇప్పుడేమో ప్రభుత్వం ఆదాయం తగ్గపోయిందని ఎందుకు సన్నాయిరాగం తీస్తున్నట్లు? మరో సంగతి చెప్పాలి. వైసీపీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లుల బకాయిలు ఇస్తోందట. అది తప్పట. పనులు చేయించుకున్న తర్వాత బిల్లులు చెల్లించవద్దని ఏ మీడియా అయినా రాయగలుగుతుందా? పనులలో ఏదైనా తేడా ఉంటే అది వేరే విషయం అసలు రాజకీయ కక్షలతో పాలన సాగించాలని ఒక మీడియా చెప్పడం ఉన్మాదం కాక మరేమవుతుంది. ఇక్కడ ఈనాడు మీడియా గురించి కూడా ఒక మాట చెప్పాలి. జగన్ టైమ్లో ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తే ఈ మీడియా అది జగన్ బినామీ కంపెనీ అని ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీకి సుమారు రూ.14 వేల కోట్ల విలువైన రాయితీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఎక్కడా తప్పుపట్టకుండా ఈనాడు మీడియా జాగ్రత్తపడింది.అంటే ఇప్పుడు చంద్రబాబు బినామీ కంపెనీ అయిందా? లేక ఇండోసోల్ తో ఏదైనా బేరం కుదిరిందా? అన్న విమర్శ చేస్తే ఆ మీడియా వద్ద సమాధానం ఉంటుందా? అందుకే ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజలపాలిట శాపంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో పదే పదే అదే తప్పు!
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపటత్వంపై మాత్రమే ఆధారపడి పనిచేస్తోందని పదే పదే రుజువు అవుతోంది. స్వయానా మంత్రులే ఫేక్ వీడియోల ప్రదర్శనకు దిగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు సైతం చెబుతూండటం అత్యంత బాధాకరం. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ రౌడీయిజం చేయాలని చూస్తున్నాయని, జగన్ పుట్టిన రోజున జంతుబలి చేస్తారా? పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా విమర్శించారు. ఇది కూడా పక్కదోవ వ్యూహంలో భాగమే.జగన్ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అతడికి వచ్చిన మద్దతు, జరిగిన సంబరాలను కూటమి పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతే.. కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి బైకులు ర్యాలీలు తీసినా కేసులు పెట్టారు. కేక్ కట్ చేసినా అరెస్టు చేశారు. జాతరలో మాదిరి పొట్టేళ్లను నరికారంటూ పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని అమానుషంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చివరకు పోలీసు శాఖ ఇవన్నీ ఏవో గొప్ప పనులైనట్లు ప్రచారం చేసుకునే దుస్థితికి చేరింది. దీనికి డిజిపి గుప్త సమర్థన మరీ ఘోరంగా ఉంది.తమ వద్ద వాహనాలులేవని, అందుకే నడిపించామని ఆయన చెప్పారు.నిజమే! ఎవరు చట్ట ఉల్లంఘన చేసినా తప్పే. కేసులు పెట్టవచ్చు. అలా కాకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతామని, టీడీపీ, జనసేనలకు చెందిన వారు ఎలాంటి తప్పులు చేసినా, తీవ్ర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమని పోలీసులు బాహాటంగా చెబుతున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? నీతులు చెప్పే చంద్రబాబు ఏమని ఆదేశాలు ఇవ్వాలి? ఎవరు బహిరంగంగా జంతు బలి చేసినా ఒప్పుకోరాదని, వివక్ష లేకుండా కేసులు పెట్టాలి అని. ఆ పని చేయలేదు. కొంతకాలం క్రితం టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పొటేళ్లలను రోడ్డుపైనే నరికారు.చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.అంతకన్నా దారుణం ఏమిటంటే ఆయన బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కటౌట్ కు పోటేళ్ల తలల దండ వేశారు. ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్, కొందరు టీడీపీ నేతల సమక్షంలోనే పొటేళ్లను నరికి వేడుక చేస్తుంటే ఇదే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు.అంతే తప్ప వీరెవ్వరిపైన కేసులు పెట్టలేదు. చంద్రబాబు మాటలలోని డొల్లతనం ఈ ఘటనలు తెలియచేయడం లేదా?నిందితులను పెరేడ్ చేయించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి డీజీపీకి తెలియదా? లేక నిందితులను శిక్షించే హక్కు నేరుగా ఏమైనా రాజ్యాంగం ఇచ్చిందా? డీజీపీ అలా మాట్లాడితే కింది స్థాయి పోలీసులకు ఏమి సంకేతం ఇస్తున్నట్లు? అన్ని రంగాలలో విఫలమైన నేపథ్యంలో పోలీసులే కూటమి పెద్దలకు దిక్కయ్యారు.అందులో వీర విధేయతతో, రాజును మించిన రాజభక్తితో వ్యవహరించే కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అరాచకంగా నడుపుతున్నారు. ఇంత అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ పరిస్థితి అవమానకరం అని వేరే చెప్పనవసరం లేదు.పోలీసు అధికారులు చంద్రబాబు మాటకన్నా ఆయన కుమారుడు ,మంత్రి లోకేశ్ ఆదేశాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఏపాటి ప్రతిష్టో ఆయనే ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి రఫ్ఫా, రఫ్ఫా అంటే తప్పన్నారు.ఒకే! అలాగే అనుకుందాం? మరి లోకేశ్ రడ్బుక్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్టా? దాని ప్రకారం పోలీసులను పని చేయించడం సరైనదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాళ్లు విరగగొడతాం, కీళ్లు విరగగొడతాం, చేతులు అరగదీస్తాం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తోంది? కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి? వారు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదే.పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ బెదిరిస్తున్నారే! వినుకొండలో రషీద్ అనే యువకుడిని టీడీపీ వారే నడిరోడ్డుపై నరికి చంపితే దానిని ఏమంటారు. కనీసం ప్రభుత్వం ఆ ఘటనను ఖండించిందా? అంతదాక ఎందుకు ! చంద్రబాబు ఇన్ని సుద్దులు చెబుతున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని రోడ్డుపై ప్రదర్శన చేశారే. వారిపై కేసులు పెట్టారా? రోడ్డుపై నడిపించి అవమానించారా? ఈ రెడ్బుక్ అండ చూసుకుని పోలీసులు పలు చోట్ల సామాన్య ప్రజలపై కూడా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులో సీఐ బెదిరింపులు భరించలేక ఓ ఆర్యవైశ్య మహిళ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నం చేసింది. ఇది మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తున్న తీరా!పొదిలిలో ఒక వ్యాపారిపై పోలీసులు దాడి చేసి కొట్టడంపై ఆర్యవైశ్య సంఘం వారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారే. సీపీఎం నాయకుడు అప్పలరాజు పై పిడి చట్టం పెట్టడంపై టీడీపీకి చెందిన కొందరు మేధావులు కూడా ఖండిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయే! అనంతపురంతో సహా పలు చోట్ల భూ కబ్జాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? ఇవి కాకుండా అనంతలో గన్ కల్చర్ కూడా పెరుగుతోందని వార్తలు సూచిస్తున్నాయి.తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రాజ్యాంగం నడుస్తోందే! ఆయన పోలీసు అధికారులనే అవమానిస్తే నోరు విప్పలేకపోయిన వ్యవస్థ మనది. అమాయకులపై మాత్రం లాఠీ ఝళిపిస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? హోం మంత్రి అనిత వాటికి సమర్థన ఇవ్వడమా? నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఏదో గొప్ప విషయంగా ఆమె చెబుతారా? రేప్, హత్యల వంటి సీరియస్ నేరాలకు పాల్పడిన వారెవరికి ఇలా చేయలేదే? తెనాలిలో పోలీసుల ముగ్గురు దళితుల అరికాళ్లపై బహిరంగంగా కొట్టి అరాచకంగా ప్రవర్తించినా చర్య తీసుకోకపోగా, అది తప్పు కాదన్నట్లు మాట్లాడితే ఏపీ ప్రజలను కాపాడేదెవ్వరు? కదిరి వద్ద ఒక గర్భిణిపై వైసీపీ కార్యకర్త ఒకరు కాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా హోం మంత్రే ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారట.ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ప్రభుత్వం ఖండించలేకపోయింది. తీరా చూస్తే అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ నాయకుడు చెప్పినా, అతని సోదరి తెలిపినా హోం మంత్రి మాత్రం అదే అసత్యాన్ని వల్లెవేసే యత్నం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు హింసించి నడిరోడ్డుపై నడిపించారు. ఒక వైపు ఫేక్ వీడియోలు, మరో వైపు ఫేక్ ఆరోపణలు, ఇంకో వైపు కక్షపూరితంగా ఏకపక్షంగా వైసీపీ వారిపై కేసులు,అరెస్టులు..ఇవన్ని ఈ ప్రభుత్వం ఎంత నీచంగా పనిచేస్తుంది తెలియచేస్తుంది తప్పమరొకటి కాదు.ఇలాంటి దుష్టచర్యలను ఉన్మాదం అంటారన్న సంగతి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.వైసిపివారిని ఎంత వేధిస్తే వారు అంతగా రాటు తేలుతున్నారన్న విషయం కూడా ప్రజలకు అర్ధం అవుతోంది.కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలకు ఎప్పుడో అప్పుడు చెక్ పడకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈనాడు ఇప్పుడు వారి చెప్పుచేతల్లో!
ఈనాడు మీడియాను తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే నడుపుతున్నారట. నిజం కాదని ఎంతగానో అనుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో ఆ పత్రికలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ ప్రచారాన్ని నమ్మక తప్పడం లేదు. ఏదో.. ఎవరి ప్రయోజనం ఏమిటో తెలియదని కొందరు సరిపెట్టుకుంటున్నారు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్లను ఈ మీడియా సంస్థ కాపుకాస్తున్న విధానం రోజురోజుకూ మితిమీరిపోతోంది. పైగా ఇందుకోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై చండాలపు సంపాదకీయం ఒకటి రాసిపెట్టడం ఏహ్యభావాన్ని మరింత పెంచుతోంది.అది సంపాదకీయం చదివిన తర్వాత కచ్చితంగా ఇది టీడీపీ ఆఫీస్ నుంచి రాసి ఉండవచ్చని అనిపించింది. చాలామంది ఇదే విషయం చర్చించుకుంటున్నారు కూడా. టీడీపీ ఆఫీసులోని ఒక టీమ్ ఈనాడులో ఏ రోజు ఏ వార్త రావాలో నిర్దేశిస్తున్నారని, టీడీపీ రచయిత ఎవరో రాసిన వ్యాసాన్ని ఈనాడు యథాతథంగా సంపాదకీయంగా ప్రచురించి ఉండవచ్చని అనిపిస్తోంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ఈనాడుకు ఆదేశాలు వెళుతున్నాయా? ఏమో తెలియదు కానీ.. చంద్రబాబు, లోకేశ్లకు అత్యంత విధేయులుగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఆ పత్రిక ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తోందేమో.ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ విధానం సుస్పష్టం. వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ సందర్భంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మొత్తం ఒక స్కామ్ అని, అందులో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తప్పట. అలా మాట్లాడకూడదట. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించకూడదట. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందట. అంతటితో ఆగలేదీ పచ్చపత్రిక. జగన్ క్రూరుడని, ఆయనవి విష రాజకీయాలని 11 సీట్లకే పరిమితమైన తరువాత బెదిరింపు భాష మానుకోలేదని నానా మాటలు తన సంపాదకీయం ద్వారా అనేసింది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చునని బాబు అండ్ కోకు వత్తాసుపలికింది.ఒక్క ముక్కలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని ఎడిటోరియల్గా అచ్చేసింది ఈనాడు పత్రిక. బాబు వాక్యం వేదమైనట్లు, ఎవరూ వ్యతిరేకించకూడదన్న బానిస మనస్తత్వం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. వైఎస్సార్సీపీ వాదన అక్షరం రాయకుండా ఆసాంతం జగన్పై విషం చిమ్మారంటేనే ఇదంతా టీడీపీ రాతే అయి ఉంటుంది. జగన్ విధానంతో ఏకీభవించవచ్చు.. లేక వ్యతిరేకించవచ్చు. కానీ, రెండు వైపుల వాదనలు వివరించి జగన్ వాదన ఏ రకంగా తప్పో రుజువు చేసి ఉంటే హుందాగా ఉండేది. ఏకపక్షంగా పచ్చి అబద్దాలను ప్రచురించడం ఏ రకమైన జర్నలిజం?. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్కు అసలు బలమే లేదని కదా వీరి అభిప్రాయం. అలాంటప్పుడు ఆయనను పట్టించుకుని ఇంత నిర్లజ్జగా ఎడిటోరియల్ రాయవలసిన అవసరం ఏమిటి?.జగన్ హెచ్చరికలకే ప్రైవేటు సంస్థలు రాకుండా పోయాయన్నది నిజమే అనుకుంటే జనాభిప్రాయానికి వారు భయపడుతున్నట్లు అంగీకరించినట్లేనా? అంతేకాదు.. ఈ లెక్కన ఈనాడు మీడియా కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అని నిర్ధారిస్తున్నట్లే కదా!. చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసలు మెడికల్ కాలేజీలు జగన్ ఎక్కడ నిర్మించారని ప్రశ్నించి నాలుక కరుచుకున్నారు. జగన్, వైఎస్సార్సీపీ నేతలు ఆ కాలేజీల వద్దకు వెళ్లి వాటిని ప్రజలందరికీ చూపించారు. అయినా కూడా మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మించలేదని గుడ్డిగా ప్రశ్నించింది ఈనాడు!. నిధుల కొరతవల్ల ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్లి ఉండవచ్చనని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ పచ్చ పత్రిక అమరావతి పేరుతో వేలకు వేల కోట్లు అప్పులు తేవడాన్ని ఏనాడైనా ప్రశ్నించిందా?.జగన్ అధికారంలో ఉండగా.. ప్రతి విషయాన్ని వక్రీకరించిన ఇదే పత్రిక ప్రజలను మోసం చేయడానికి టీడీపీ, జనసేనలతో కుమ్మక్కై అప్పులపైన, అమ్మాయిల మిస్సింగ్లపై, భూముల రీసర్వే వంటి అంశాలపై ఎంత తప్పుడు ప్రచారం చేసిందీ ప్రజలకు తెలియకుండా ఉంటుందా? బాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లది క్రూరత్వం, కపటత్వం కావా?. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి వాటిని విస్మరించడం, ఎగ్గొట్టడం ఏనాడూ ఈ పచ్చ పత్రికలకు కనపడలేదు. ఎన్నికలకు ముందు సెల్ఫ్ పైనాన్స్ సీట్లకు జగన్ అనుమతిస్తే వ్యతిరేకించిన బాబు, లోకేశ్లు ఆ తరువాత ప్లేటు ఫిరాయించినా, వైద్య కళాశాలల ఆస్తులు అప్పనంగా ప్రైవేటువారి పరం చేస్తున్నా పట్టలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగంలో కాలేజీలు మంజూరు చేసింది. పీపీపీ విధానంలోనే చేయాలని ఆదేశించలేదే? అయినా పార్లమెంటరీ కమిటీ సిఫారసు అని మరొకటని ఎందుకు ఈనాడు మీడియా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది? అందులో వారి స్వార్ధం ఏమిటి? జగన్ టైమ్లో అనేక అంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూటమి పాలనలో ఎందుకు వెనుకబడిపోయిందన్న విషయం రాసి ఉంటే ఈనాడును అభినందించి ఉండవచ్చు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు అనేక తప్పుడు కథనాలు వండి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కృషి చేసిన ఈనాడు ఇప్పుడు అదే పని చేస్తోంది. ఏడాదిన్నరగా రెడ్బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదిపితే ఒట్టు ఈ పత్రిక. కదిరి వద్ద ఎవరో ఒక వ్యక్తి తన వదినతో గొడవపడి తోస్తే, దానికి.. జగన్ పుట్టిన రోజును జతచేసి అతను వైఎస్సార్సీపీ వాడని ఆరోపించి, పోలీసులు కొట్టి రోడ్డుపై తీసుకువెళితే ఈనాడు, ఎల్లోమీడియా మొదటి పేజీలో వార్తలు ఇచ్చాయి.చిన్నపాటి కుటుంబ గొడవను మొదటి పేజీలో వేశారంటే అది టీడీపీ టీమ్ ఆదేశాల మేరకే జరిగి ఉండవచ్చన్న భావన కలుగుతుంది. తీరా అతను జనసేనకు చెందిన వ్యక్తి అని తేలితే ఎల్లో మీడియా కిక్కురుమనలేక పోయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కత్తులు తిప్పుతూ రోడ్డుమీద వీరంగం వేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు? ఎవరు తప్పు చేసినా తప్పే అని రాయవలసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా చేయకపోగా, వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతూ జనానికి కంపరం పుట్టిస్తున్నాయి. అమరావతిలో ఒక రైతు మంత్రి నారాయణ సమక్షంలో తన ప్లాట్ గురించి ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపులోనే గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోతే ఆ వాస్తవాన్ని రాయకుండా కప్పిపుచ్చినప్పుడే ఈనాడు, తదితర ఎల్లో మీడియా నైతికంగా పాతాళానికి చేరినట్లు అయ్యింది.ఈ సందర్భంలో ఏపీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని ఈ మీడియా చెబుతోంది. ఇది వాస్తవమే అనిపిస్తుంది. కాకపోతే అది జగన్ వల్ల కాదు. మంత్రి లోకేశ్ రెడ్బుక్ అరాచకాలు, ఎన్నికల ప్రణాళిక అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తుండడం వల్ల అని గమనించాలి. ఈ పరిణామాలన్నిటిపై రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. అది తిరుగుబాటుగా మారకుండా ఉండడానికి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈనాడు గ్రూప్కు చెందిన మార్గదర్శికి సంబంధించి కేసులు ఎత్తివేయడం, జప్తు అయిన రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడం తదితర ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి లొంగి పనిచేయకుండా ఎలా ఉంటుంది?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుగారు... చిల్లర రాజకీయాలపై మీరే మాట్లాడాలి!
ఏపీ ముఖ్యమంత్రికో చిత్రమైన గుణం ఉంది. ఆయన ఎవరినైనా దూషించవచ్చు కానీ.. ఎవరైనా ఆయన్ను పల్లెత్తు మాట అన్నాసరే.. ‘‘చూశారా ఎంత మాటన్నారో?.. ప్రజల కోసం అన్నీ భరిస్తా’’ అనేస్తారు. ఇదీ ఇకరకమైన ప్లేటు ఫిరాయింపే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో ఇటీవల ఆయన మాట్లాడుతూ ‘‘వాజ్ పేయి వంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన తాను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది’’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు. మరికొందరు దేశం కోసం బతుకుతారు. ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారు’’ అని కూడా వ్యాఖ్యానించినట్లు తెలుగుదేశం మీడియా తన కథనంలో తెలిపింది. విపక్షమైనంత మాత్రాన వారిని చిల్లర వ్యక్తులతో పోల్చడం ఏపాటి సభ్యత? గురువింద గింజ సామెత ఆయనకు గుర్తురాలేదా? ఎవరేమైనా అనని దులుపుకుని పోవడమే ఆయన నైజమా?వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. ఒకపక్క చంద్రబాబు పాలన వ్యవస్థల్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలనే అనుసరిస్తూ ఇంకోపక్క ఇష్టారీతిని భూముల పందేరం పెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్లో 95 శాతం వరకూ నెరవేర్చిన జగన్కు.. ఇచ్చిన హామీల్లో దాదాపు ఏవీ నెరవేర్చని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి పోలికెక్కడ? ఈ రెండు అంశాలు చాలవా? ఎవరిది చిల్లర రాజకీయమో అర్థం చేసుకునేందుకు? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంలో పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత జగన్ది. గతిలేక... తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కొనసాగించాల్సిన స్థితి చంద్రబాబుది. అందుకే కదా జగన్ పథకాల పేర్లు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడింది? ఇది చిల్లరతనం కాదా? అని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది కదా! వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా రూ.పదివేలకు పెంచుతామన్న ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కడం చిల్లరతనం కాదా? అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు జగన్ చేపట్టిన నౌకాశ్రయాలను చూపి చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడులు అడుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఏకంగా 17 వైద్య కళాశాలలను తీసుకొస్తే అందులో జగన్ స్వార్థం కనిపిస్తుందా? పేద విద్యార్ధుల విద్య, పేద ప్రజలకు మంచి వైద్యం అప్పగించాలన్నదే ఆయన లక్ష్యం కనిపిస్తుందా?? ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క ప్రభుత్వమెడికల్ కాలేజీని తన హయాంలో తేలేదు? పైగా జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎకరా వంద రూపాయల లీజుకు కట్టబెట్టి ప్రైవేటు వారికి సంపదగా మారుస్తున్నారే? దీనిని బట్టి అర్థం కాదా? ఎవరు స్వార్థపరులన్నది? జగన్ తెచ్చిన కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేశ్లు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటికరిస్తూ జనం దృష్టిలో విలన్లుగా మారారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ, వలంటీర్లు కిడ్పాప్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చిల్లరవి కావా? అధికారంలోకి వచ్చాకైనా వీటిలో ఒక్కదానికైనా ఆధారం చూపించారా?ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయజాలం. కాని ఆయనే అనవసర కామెట్లు చేస్తున్నారనిపిస్తుంది.ఇక రాజకీయ కోణం చూద్దాం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో వేసిన గుంతులు, కట్టిన పొత్తులు ఏ సిద్ధాంతపరమైన రాజకీయాలకు ప్రతీకలు? మామ ఎన్టీఆర్పై కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికలలో ఓటమి తర్వాత బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీలోకి ఫిరాయించేశారే! మరి జగన్ ఏమి చేశారు. తాను విబేధించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. దీనిని ప్రతిష్టాత్మక వ్యవహారం అంటారు కాని జెండాలు మార్చే చిల్లర రాజకీయం అనరు కదా! 1995లో ఎన్టీ రామారావును దించడానికి తనకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా ఎంతగా అప్రతిష్టపాలు చేసింది చరిత్రలో ఉంది కదా! అది ఏమైనా ఘనమైన విషయమా? ఎన్టీ రామారావే చంద్రబాబు బుద్ధి, నైజం గురించి ఎంత ఘోరంగా దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయే!. అది ఏపాటి గౌరవమో చంద్రబాబు చెప్పగలరా? ఆ ఎపిసోడ్లో వాజ్పేయి వంటివారు ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కొత్తగా పెట్టిన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా! 1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించే వారా? కాదా?ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ను గోదాట్లో ముంచి బీజేపీకి మద్దతు ఇచ్చారా?లేదా? 2001-02 మధ్య గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు ఉండకపోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి 2014లో పొత్తు పెట్టుకుంది నిజమా? కాదా? 2004 ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమికి గురైన తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని ప్రకటించారా? లేదా? ఇప్పుడేమో వాజ్ పేయి, నరేంద్ర మోడీ తనకు స్ఫూర్తి అని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఎలాగైనా రూపాంతరం చెందగలరన్నమాట. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 2009 ఎన్నికలలో పోటీ చేయడానికి రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారా?లేదా? తీరా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చాక ఎన్ని మాటలు మార్చారు? తెలంగాణలో తన వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వెళ్లి రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాశనం చేశారని ఎంతగా నిందించారు? దీనిని ఏ రాజకీయం అంటారు? 2018లొ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో తెలియదా? దేశ ప్రధానినే టెర్రరిస్టు అన్న చరిత్ర చంద్రబాబుదే కావచ్చు. ఆ రోజుల్లో టీడీపీ మీడియాలో వచ్చిన కొన్ని హెడ్డింగ్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాల మోడీ, బీజేపీకి సహకరించే వాళ్లు దేశద్రోహులు, మోడీని దింపేస్తాం, మోడీ హటావో..మోడీతో రాజీ లేదు..రెచ్చిపోతా..,ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షాలతో కలవడానికి ఎన్ని పాట్లుపడింది ఇటీవలి చరిత్రే కదా? మధ్యలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో పోటీచేశారే. ఆ తర్వాత వారిని గాలికి వదలివేశారే! వీటిని రాజకీయ వ్యూహాలు అంటారా? లేక అవకాశవాద రాజకీయాలు అంటారా? లేక చిల్లర రాజకీయాలు అంటారా అన్నదానిపై ఎప్పుడైనా టీడీపీ వివరణ ఇచ్చిందా? మరి జగన్ ఎప్పుడైనా ఇలాంటి అవకాశవాద, లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారా? నిజానికి బీజేపీ కోరిన విధంగా జగన్ ఎన్డీయేలో చేరి ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. విధానాల మీద అభిప్రాయం చెప్పవచ్చు కాని రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కింపచరిచే విధంగా మాట్లాడి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటే ఎదురుదెబ్బ తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేసుల మాఫీపై నయా రోల్మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్నెట్ స్కామ్లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను గడ్డి స్కామ్లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎంతకాలమీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు బాబూ!
మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. రాజు అంటే పరిపాలకుడు మొండివాడుగా ఉండొద్దు అన్న అర్థమూ ఉంది దీంట్లో. పట్టు విడుపుల్లేని రాజకీయం, ప్రజాస్వామ్యంలో విజ్ఞత, విచక్షణల అవసరమని గతానుభావాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాక్షేమమే పరమావధి కావాలి మినహా వ్యక్తిగత పట్టింపులు కాదు. ఈ విషయాలను విస్మరిస్తే ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. అచ్చం... ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్నది ఇదే. ఎవరు కాదన్నా.. వద్దంటున్నా ప్రైవేటీకరణకు మంకుపట్టు పట్టుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఈ అహేతుక నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ప్రజల అభిమతానికి భిన్నంగా నడుచుకుంటే రాజకీయ పార్టీలకు ఇక్కట్లు తప్పవన్న సంగతి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. తెలుగువారంతా కలిసి ఉండాలనుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగా ‘‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే’’ అన్న సందేశాత్మక పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీని అక్రమంగా లాగేసుకున్న తరువాత చాలాకాలం అదే విధానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన మహానాడులోనూ టీడీపీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ 2009 వచ్చేసరికి ప్రత్యేకవాదంపై ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ నేతలు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. అది ఆంధ్రుల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మారింది. దాంతో 2009లోనూ ఓటమిపాలైంది. 1999లో విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని పాదయాత్ర లో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని ఎద్దేవ చేశారు. 2004 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది ఒక కారణమైంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకుని గత టర్మ్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ను కొనసాగించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలు, తదుపరి మాటలు మార్చడం గురించి ఇక్కడ చర్చ కాదు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు. అతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వపరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. జగన్ వారి పక్షాన గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నందంతా ఒక స్కామ్ అని, ఇందులో ప్రైవేటు సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా తెలిపారు. బహుశా ప్రజా వ్యతిరేకత, జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో, ఏమో కాని, ప్రైవేటు సంస్థలు కాలేజీలకు టెండర్లు వేయలేదు. నాలుగు కాలేజీలకు గాను ఆదోని కాలేజీకే ఒక ప్రైవేటు వైద్య సంస్థ కిమ్స్ మాత్రం బిడ్ వేసిందని ప్రభుత్వం చెప్పింది. అయితే తాము బిడ్ వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్లో పనిచేసే ఒక డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పని చేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్లీ సమీక్ష చేసి మొండిగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేటు సంస్థలకు ఆర్థిక, ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడే ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీలకోసం వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నిటిని ప్రైవేటు వారికి అప్పగించడం ఏమి హేతుబద్దత? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా, రెండేళ్లపాటు సిబ్బందికి జీతాలూ ఇస్తారట. అయినా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేటు సంస్థలకు వయబిలిటి గ్యాప్ ఫండ్ కూడా ఇస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పని చేసిందన్నది ప్రజాభిప్రాయంగా ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. అదే టైమ్లో ఈ కాలేజీలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం ఆస్తులు ఇచ్చిన నష్టం రావచ్చునని ప్రైవేటు సంస్థలు అనుమానించాయా? లేక చంద్రబాబు బలహీనతను క్యాష్ చేసుకొన్ని మరిన్ని రాయితీలు పొందాలని అనుకుని ఉండవచ్చు. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానమే. కేంద్ర మంత్రి నడ్డా నిజంగానే అలా లేఖ రాసి ఉంటే దానిని బహిర్గతం చేసి ఉండేవారు కదా! ప్రజాధనం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995-2004 మధ్యకాలంలో 54 ప్రబుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ఆ ప్రైవేటు సంస్థలకు మంచి విలువైన భూములు కట్టబెట్టగా, అవి ఆ తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు ఖాళీగా ఉండే సీట్ల టిక్కెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనినే వయబిలిటి గ్యాప్ ఫండ్ అంటారు. ఇదే సూత్రాన్ని మెడికల్ కాలేజీలకు వర్తిస్తారట. అత్యవసర సమయాలలో ఇలా చేస్తే ఫర్వా లేదు కాని, లేని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఇలా వృథా వ్యయం చేయవచ్చా? ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ టర్మ్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికి సుమారు రూ.47 వేల కోట్ల రుణం తీసుకు వస్తున్నారు. కాని వైద్య కాలేజీలకు ఐదువేల కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో ఐదు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అదనంగా ఫించన్ పెంచి దానిని ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాని మెడికల్ కాలేజీలను నడపలేమని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆస్పత్రులు కార్పొరేట్ తరహాలోనే పనిచేసే స్థితి వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులే గొప్ప అన్నట్లు మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటూ కొత్త రాగం ఆలపించారు. పేదలకు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు వారికి కాలేజీలు ఇస్తారట.ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయో అందరికి తెలుసు. పోనీ ప్రైవేటు కాలేజీలు సొంతంగా భూమి సమకూర్చుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు పెట్టుకుంటే అదో పద్దతి అనుకోవచ్చు.ప్రభుత్వమే అన్ని సమకూర్చి,అప్పనంగా కాలేజీలను ప్రైవేటువారికి ఇవ్వడం ద్వారా పేదలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కాదు.కేంద్రం జగన్ టైమ్ లో ప్రభుత్వరంగంలో పనిచేసేలానే ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతిని దాచేయాలని యత్నిస్తున్నారు.కేంద్రం కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రభుత్వపరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావల్సినవారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ప్రజల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న ఈ మొండి నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి గుండెల్లో అప్పుడే గుబులు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అరాచకాలకూ ప్రజలు మద్దతివ్వాలా?
‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్ రిజల్ట్’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్బుక్లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా లోకేశ్ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు. మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్బుక్లో భాగమైతే ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేశ్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్బుక్ మూడులో పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా? లోకేశ్ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్బుక్ ప్రభావమని లోకేశ్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు. అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్బుక్ పేరుతో లోకేశ్ బృందం చేసిన నిర్వాకమే కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్ పెత్తనం, పిచ్చి రెడ్బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే రెడ్బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కల్లలైన బాబు ‘రియల్’ మాటలు!
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రచారం చేసిన విషయం ఒకటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆస్తుల విలువలు పెరగవని ప్రజలు, రైతులను బెదిరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కప్పిపుచ్చి భూముల విలువలు పడిపోయాయంటూ ఎల్లోమీడియా కూడా తన కథనాలలో విషం చిమ్మింది. ఏదైతేనేం.. ఎన్నికల్లో ఈ కూటమి అధికారం దక్కించుకుంది. ఇంకేం.. మా భూములు బంగారమవుతాయని అందరూ ఆశించారు. ఇరవై నెలలు గడిచిపోయింది కానీ.. వీరి ఆశలు మాత్రం పెద్దగా నెరవేరలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. 2023-24లో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.9546 కోట్ల ఆదాయం సమకూరింది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25లో మాత్రం ఈ సంఖ్యలు పడిపోయాయి. ఆదాయం రూ.8843 కోట్లు మాత్రమే. 2025-26లో రూ.10169 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా.. అక్టోబర్ నాటికి అయ్యింది రూ.ఏడు వేల కోట్లే. కూటమి ప్రభుత్వం 2024-25లోనూ రూ.11997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కానీ.. ఈ ఏడాది దీన్ని రూ.10169 కోట్లకు తగ్గించుకుంది. ఏటా ఆయా పద్దుల కింద ఆదాయం పదిశాతం వరకూ పెరిగేలా ప్రభుత్వాలు లక్ష్యాలు పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తుంటాయి. ఏపీలో మాత్రం లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్న మాట.రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను ఏభై శాతం మేర పెంచినా ఆశించినంత ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగించేదే. వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాజధాని అమరావతిలో ఖర్చు చేస్తున్నా ప్రజలలో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి తమ వెంచర్ల భవిష్యత్తు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు చాలామందికి నెలలకొద్దీ జీతాలు కూడా అందడం లేదని ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఇల్లు కట్టుకుంటున్నాను అంటూ చంద్రబాబు హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయన్న ప్రచారం రాజకీయ లబ్ది కోసం మాత్రమే చేసిన అబద్ద ప్రచారం అని స్పష్టమవుతుంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత సాగేది. విశాఖపట్నం వంటి చోట్ల జోరుమీద ఉండేది కూడా. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఈ రకమైన చర్యలతో ప్రభుత్వం విశాఖ ఇమేజీని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్న భావన ఏర్పడింది అంటున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే, ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టు వేగం మందగించింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైమ్లో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం అవి 80 దాటడం లేదట. తూర్పు గోదావరి జిల్లాలో 2023-24లో సుమారు 129355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కూటమి వచ్చాక ఏడాది కాలంలో ఇది 61597 డాక్యుమెంట్లకు పరిమితమైంది. కడపలో గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇప్పుడవి ఏభై - అరవై వరకే ఉంటున్నాయి.రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిమెంట్, ఐరన్, కలప పెయింటింగ్, విద్యుత్, ప్లంబింగ్ తదితర రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. జగన్ టైమ్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం, నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి, సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు కొనసాగడానికి ఉపకరించాయి. అయినా అప్పట్లో ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ఏవీ సజావుగా సాగడం లేదు. అమరావతి తప్ప మిగలిన రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురం సహా వివిధ జిల్లాలలో పేదలు, కూలీలు వలసలు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో పెరగలేదు. కానీ, భూముల వేలంపాటల్లో మంచి రేట్లు వస్తుండటంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కోకాపేట పరిసరాలలో ఇటీవల జరిగిన వేలంపాటలో ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్లు వచ్చాయి. అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అణా, బేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో 2020లో రూ.600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. వేలం పాట ద్వారా ఎకరాకు రూ.150 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. కానీ ఏపీకి వచ్చేసరికి సత్వా కంపెనీకి ఏభై కోట్ల విలువైన భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు ఉన్న యూసఫ్ అలీకి చెందిన లూలూ గ్రూపు అహ్మదాబాద్ లో సుమారు 16.35 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖల్లో నామమాత్రపు లీజుకు భూములు ఇచ్చేసింది.అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయ అంచనాలు దారుణంగా బోల్తా పడ్డాయి. వేర్వేరు మార్గాల ద్వారా మొత్తం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా అందిన రూ.7132 కోట్లు ఆశించిన మొత్తంలో 54 శాతమే కాగ్ వెల్లడించింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54వేల కోట్లకు చేరింది. ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తన ప్రభుత్వ అసమర్థతే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్ను యూనిట్కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?
గజం మిథ్య ,పలాయనం మిథ్య అని అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్కు తెలియకపోవడమే ఒక ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య,సంజయ్ కుమార్ లపై కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదించారు. ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్ ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే శాయి. ఒక చిన్న తేడా ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ పార్టీ అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్.పిలు నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైఎస్సార్సీపీ ఎమ్.పి రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్సీపీ అధినేత జగన్కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు అనిపిస్తుంది.ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే, దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి గళాలను పక్కదోవ పట్టిస్తారా?
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది. సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి. బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు. ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు. తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు. ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది. దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు. బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాష్ట్ర భవిష్యత్తుతో బాబు చెలగాటం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినవారు ఒక సంగతి చెబుతుంటారు. ఏదైనా చేయకూడని, లేదా విమర్శలకు ఆస్కారమిచ్చే కార్యక్రమం చేయదలచుకుంటే ముందుగా దానిని తన ప్రత్యర్దులకు చుడుతుంటారు. తాను తప్పు చేసేందుకు ప్రత్యర్ధి రాజకీయ పార్టీనే కారణమన్న భావన కల్పిస్తారు. ఆ తర్వాత తనకు అనుకూలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి పని ముగించుకుంటారు అని. కొద్ది రోజుల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు కొద్ది రోజులకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విధ్వంసమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకువచ్చిందని అన్నారు. అధిక వడ్డీకి అప్పు చేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం 18 నెలలు కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు. సహజంగానే ఈ వివరాలను ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతులు భజన చేశాయి. దాంతో ఆయన లక్ష్యం నెరవేరినట్లు అయ్యింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. కొత్తగా మరో సుమారు రూ.13 వేల కోట్ల అప్పు చేసేశారు. దీనికోసం ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నమాట. ఆ క్రమంలో చంద్రబాబు సర్కార్ మద్యంపై వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసింది. ఎక్సైజ్ బాండ్ల ద్వారా 9.15 శాతం వడ్డీకి సుమారు రూ.5500 కోట్ల అప్పులు చేసినట్లు ‘సాక్షి’ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రాజధాని పేరుతో మళ్లీ అప్పులు చేశారని సమాచారం వచ్చింది. ఈ రకంగా వేలకు వేల కోట్ల అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దానివల్ల సమకూరుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు తెలియకుండా కథ నడిపిస్తున్నారు. ఇన్నివేల కోట్ల అప్పులు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏవో అరకొర తప్ప పూర్తిగా నెరవేర్చడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వం రెగ్యులర్గా అమలు చేసే స్కీముల బకాయీలు తీర్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలే రూ.35 వేల కోట్ల వరకు ఉంది. ఈ మధ్య చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గతంలో జగన్ టైమ్ లో మద్యం అమ్మకాల ఆధారంగా రుణాలు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్లు చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా విస్తారంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం కిమ్మనడం లేదు. వారికి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినట్లు అనిపించదు. చంద్రబాబు అప్పు చేస్తే అమెరికా అవుతుందని ప్రచారం చేయడమే ఎల్లోమీడియాకు తరువాయి అన్నమాట. అంతేకాదు.మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన సుమారు రూ.రెండు లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టుపెట్టి తొమ్మిదివేల కోట్ల అప్పు చేయడమే కాకుండా, ఆ రుణం చెల్లింపులో సమస్య వస్తే, ఏకంగా ఆర్బీఐ నుంచే డ్రా చేసుకునేలా కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కనబడదు. ఆర్థిక నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాను ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కోసం ముందుగా గత ప్రభుత్వంపై అవే ఆరోపణలు చేశారన్నమాట. అంటే ఎవరైనా ఏమిటి ఈ వడ్డీలు అని అడిగినా, గతంలో కూడా ఇలాగే జరిగిందని అనుకోవాలన్న మాట. అందులో నిజానిజాల ఎంత అన్నది వేరే విషయం. అప్పులు ఒక సమస్య అయితే, ఏపీ ప్రజలను పచ్చి తాగుబోతులుగా మార్చడానికి వెనుకాడకపోవడం ఇంకో సమస్య. మద్యం ద్వారా 2024-2025లో రూ.24 వేల కోట్ల ఆదాయం వస్తే 2025-2026లో రూ.35 వేల కోట్లకు పెంచాలని ఆదేశించారట. మీడియా కథనం ప్రకారం గతేడాది కన్నా రూ.11 వేల కోట్లు మద్యం ద్వారా ప్రభుత్వం అదనంగా సంపాదిస్తుందని చెప్పి రూ.5500 కోట్లు రుణం తీసుకున్నారన్న మాట. అంతేకాదు. ఆపై ఏడాది ఈ ఆదాయం రూ.50 వేల కోట్లు చేస్తారట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇలా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించడంలో ఏ హిందూమత ధర్మం, ఏ సనాతన ధర్మం కనిపిస్తుందో ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణే చెప్పాలి. మద్యం మత్తులో మోటారు సైకిల్ నడుపుతూ ఒక బస్ తగలబడిపోయేందుకు కనీసం 19 మంది మరణించేందుకు కారణమైన విషయం జనం మదిలో నుంచి ఇంకా పోలేదు. ఆ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోకపోగా, ఎవరైనా మద్యం బెల్టు షాపుల గురించి, నకిలీ మద్యం గురించి మాడ్లాడితే వారిపై వీర విధేయులైన కొందరు పోలీసు అధికారులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని యత్నిస్తున్నారు. స్వర్ణాంధ్ర సాధిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చుతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి. రుణాలపై వడ్డీ గురించి చూస్తే గరిష్టంగా ఏడు శాతం వరకు ఉంటుంది. అలాంటిది 9.5 శాతం వడ్డీ అంటే ఆ మేరకు ప్రజలపై భారం పడినట్లే. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ చేస్తూ ఇప్పటికి రూ.2.66 లక్షల కోట్ల రుణం తీసుకుని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచి అప్రతిష్టను మూటకట్టుకుంది. రాజధాని పేరుతో తీసుకునే అప్పులపై కూడా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో రూ.7387 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా తీసుకుంటున్న ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అంటే దీని అర్థం ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెల్లించాల్సిందని అనేగా! ఈ తాజా అప్పుకూడా కలుపుకుంటే రాజధాని రుణం రూ.47387 కోట్లకు చేరిందన్నమాట. రాజధానిలో ఎన్ని పనులు చేస్తారో తెలియదు కాని రుణాలకు మాత్రం కొదవలేదు. దీనివల్ల రాజధాని చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా కాస్తో, కూస్తో లాభం ఉంటుందేమో కాని ఏపీ ప్రజలందరికి కలిసివచ్చేది ఎంత ఉంటుందన్నది ఎవరికి తెలియదు. అప్పుల భారం మాత్రం అన్ని ప్రాంతాల వారు భరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, ప్రభుత్వం సొంత వనరుల నుంచి రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని చంద్రబాబు గతంలో ఒక పాట మాదిరి పాడేవారు. కాని ప్రభుత్వం వచ్చాక అసలు విషయం బయటపడింది.సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నది ప్రజలను మభ్యపెట్టడానికే అని తేలిపోతోంది. పోనీ తెచ్చిన డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతున్నారా అంటే అదేమీ కనిపించడం లేదు. దుబారాకు ఆకాశమే హద్దుగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అలాగే చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి రూ.10 వేల వ్యయం చేయడానికి సిద్ధపడ్డారు. సీఎం నివసించే కరకట్ట రోడ్డుపై మంచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారట. అందుకు రూ.ఐదున్నర కోట్లు వ్యయం చేస్తారట. ఇది దుబారా కాదా?మరో వైపు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఈ భూమి చాలదని ఇంకో 44 వేల ఎకరాలకు టెండర్ పెడుతున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ల విమాన, హెలికాఫ్టర్ ప్రయాణాలకు తడిసి మోపెడు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రబాబు పర్యటనల ఖర్చు రూ.40 కోట్లు దాటిందట. నాలుగు వేల రూపాయల ఫించన్ పంపిణీకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఏపీ భవిష్యత్తును ఎంతగా విధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన కలుగుతుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ రైజింగ్ విజన్ ఆచరణ సాధ్యమేనా?
‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ నేల విడిచి సాము చేస్తోందా? లక్ష్యాలు ఘనంగానే పెట్టుకున్నా.. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది వ్యూహాలు... మూడు మూల స్థంభాలున్న ఈ విజన్ డాక్యుమెంట్లో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకం. భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు అదనంగా మరికొంత చేర్చి సుమారు 30 వేల ఎకరాలు సిద్ధం చేశారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతంలోని ఊళ్లలో ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ యూనివర్శిటీలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సొంత రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలోకి తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించినభూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని వివిధ పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్టుతోనే హైదరాబాద్ న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల స్థాయికి చేరుకుంటుందని భ్రమపెట్టడం అంత మంచిది కాదు. అయితే హైదరాబాద్ పరిసరాల్లోని మరో 27 మున్సిపాల్టీలను, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులలో మూసీ పునరుద్ధరణ కూడా ఒకటి. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు.అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్బుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు ఊహాచిత్రం కూడా ఉంటుంది. కాని వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవన్ని క్లియర్ అయితే పరిశుభ్రమైన వాతావరణం, నది పూర్తిగా క్షాళన జరిగితే హైదరాబాద్ కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది. డ్రై పోర్టు, దాన్నుంచి కృష్ణపట్నం వరకు 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే, బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నైకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కావాలని ఈ విజన్ డాక్యుమెంట్ లక్షించింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఈ ప్రతిపాదనలలో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ రైలు నడపడం కోసం ఒక కారిడార్ నిర్మిస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ రైళ్ల డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే వచ్చే రెండు, మూడేళ్లలోనే బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయన్నట్లు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.దేశం అంతటా ఇవి ఏర్పాటు కావాలంటే లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. వచ్చే దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా బాగా మెరుగైతే, అప్పుడు వేగంగా ఈ బుల్లెట్ రైళ్లు సాకారం అవుతాయేమో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ది చేయాలని ఈ విజన్ లో తెలిపారు. వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజినల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ మరింత విస్తరిస్తే ప్రభుత్వ పాలన ఎంత సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే మూడు జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు.ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరో వైపు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది మరో లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం డాలర్ విలువ 90 రూపాయలు ఉంది. వచ్చే ఇరవై,పాతికేళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యం సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్దరణ, వచ్చే వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కరువు లేకుండా చూడడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ది, సుస్థిర అభివీద్ది అనేవాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు.ఇవన్ని చదవడానికి బాగానే ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో సుమారు నలభై ఎయిర్ పోర్టులకు డిమాండ్ లేదని వార్తలు సూచిస్తున్నాయి. అయినా హైదరాబాద్ చుట్టూరా కొత్తగా ఈ ఎయిర్ పోర్టులు ఎప్పటికి వస్తాయో, అవి ఎంతవరకు బాగా నడుస్తాయో తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు, 2047 నాటికి ఎంత మొత్తం అవుతుంది? లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు? ఆర్థిక వనరులు ఎలా మెరుగు అవుతాయి? మొదలైనవాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు. అతిశయోక్తులతో అంకెల గారడి చేశారు.కాని వాటిలో ఒక్క లక్ష్యం అయినా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.ఏది ఏమైనా పాలకులకు ప్రచారానికి, ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు మాట: అప్పుడలా.. ఇప్పుడిలా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒకపక్క సూపర్సిక్స్ హామలు అమలు చేద్దామని ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉందంటారు.. అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్రం ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం నడుచుకుంటూండటంతో కొత్త అప్పులు పుట్టడం లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని బాధపడేదీ ఈయనే. అవునా? నిజమే కాబోలు అని అనుకునే లోపు అకస్మాత్తుగా ఆయనే ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తారు. ఏపీలో జీఎస్డీపీ భేష్ అంటారు. 11.28 వృద్ధి నమోదు చేశామంటారు. ఏడాదిన్నర కాలం కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాం అని తన భుజాలు తానే చరచుకుంటారు. ఎల్లోమీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని చూసినప్పుడల్లా సామాన్యుడికి వచ్చే సందేహం.. ఇంతకీ ఏపీ దివాళా తీసిందా? అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోందా? ఒక్కటైతే నిజం... బాబుగారి రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరూ అంగీకరించే విషయం ఏమిటంటే.. అదేదో పాత సామెత చందంగా ‘‘అవసరార్థం బహుకృత వేషం’’ వేయడంలో దిట్ట అని! పొంతన లేని, సత్యాసత్యాలతో సంబంధం లేని మాటలు కన్నార్పకుండా మాట్లాడగలరని. పోనీ.. ఇలా మాట్లాడితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకైనా మీడియా ఆయన్ను ప్రశ్నించాలని అనుకుంటాం కానీ.. ఎల్లోమీడియా ప్రజల పక్షాన పనిచేసి చాలాకాలమైంది. పైగా.. తనను ప్రశ్నించే మీడియాను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు కూడా ఎవరైనా ప్రశ్నించినా దబాయించడం అలవాటు చేసుకున్నారు. 2019-2020, 2020-2021 మధ్య ఏపీలో వృద్ది రేటు పడిపోయిందని, జగన్ టైమ్లో జరిగిన విధ్వంసం అది అని చెప్పడానికి చంద్రబాబు యత్నించారు. కానీ అది కరోనా విజృంభించిన సమయం. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సందర్భం. ఈ సమయాన్ని సాధారణ సమయంతో ఎలా పోలుస్తారని విలేకరులెవరూ ప్రశ్నించలేకపోయారు. అప్పులు తీసుకుని ప్రభుత్వాలు నడపాలని కేంద్రం స్వయంగా అప్పట్లో ఆదేశించిన విషయాన్నీ కూడా ఆయన దాచేశారు. అంతేకాదు. జీఎస్డీపీ భేష్గా ఉందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలేమిటి అని ఎవరైనా అడిగారా? అలా అడిగినా వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని ఉండవచ్చు. దాంతో మీడియా కూడా సరేలే మనకెందుకులే అని ఊరుకుని ఉండవచ్చు. జీఎస్డీపీ వృద్ధికి ఆయన చెప్పిన కారణాలు గమనించండి. ఆక్వా రంగానికి యూనిట్కు రూ.1.50లకే విద్యుత్ ఇచ్చామని అన్నారు. నిజానికి ఇది జగన్ టైమ్లో మొదలైంది. అమెరికా టారిఫ్ల వల్ల గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోందన్నారు. కానీ దాన్ని వివరించనే లేదు. రోడ్లు,పోర్టులు,జలవనరులు రంగాలలో వ్యయం పెంచామన్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఎన్నడూ ఒక ఓడరేవుకాని, ఫిషింగ్ హార్బర్ కాని నిర్మించిన పాపాన పోలేదు. జగన్ చేపట్టిన వాటిని తనవిగా కలరింగ్ ఇస్తే ఎలా? పోనీ అవైనా సక్రమంగా జరుగుతున్నాయా? అంటే.. అదీ లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. కానీ అదే సమావేశంలో ప్రజలు తింటున్న పంటలనే పండించాలని, లేకుంటే వ్యాపారులు కొనరని, ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయలేదని తేల్చేశారు. మాట్లాడితే వరి వేయవద్దని చెబుతున్నారు. ఏపీలో అత్యధికులు తినేది వరి అన్నమే. బియ్యం తింటే మధుమేహం వస్తుందని మరొకటి వస్తుందని భయపెడుతున్నారు. బహుశా చంద్రబాబు ఎప్పుడో వరి అన్నం మానివేసి ఉండవచ్చు. అయినా ఆయనకు సుగర్ వ్యాధి ఉందా? లేదా? అన్నది కూడా వివరిస్తే బాగుండేది. జైలులో ఉన్నప్పుడు ఏ ఆనారోగ్యం చూపించి బెయిల్ పొందారు? దానికి కారణాలు కూడా చెబితే ప్రజలకు అర్థమవుతుంది కదా! ఇటీవలి కాలంలో దాదాపు అన్ని పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ధరల స్థీరికరణ నిధిని పెట్టి రైతులను ఆదుకోకుండా గాలికి వదలివేసి ఈ కబుర్లు చెబితే ఏమి లాభం? అంతేకాక రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేల హామీని అరకొరగా అది కూడా రూ.ఐదువేలతో సరిపెట్టారాయె? రాష్ట్రానికి రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఒక్కోసారి ఒక్కో అంకె చెబుతూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ గణాంకాలు చెబుతుంటారు. ఈ సమ్మిట్ జరగడాదనికి ముందే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు కదా! వాటిలో ఈ ఏడాదిన్నరలో వచ్చిన పరిశ్రమలు ఏమిటో చెప్పాలి కదా! జగన్ టైమ్లో వచ్చిన కొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయడం తప్ప , ఆ తర్వాత వచ్చిన పరిశ్రమలు పెద్దగా లేవు. ఒకేసారి అన్ని పరిశ్రమలు రావు. ఆ విషయం చెప్పవచ్చు. కాని అలాకాకుండా అవేవో రెడీమెడ్గా ఉన్నట్లు చెప్పే యత్నమే బాగోదు.పైగా 99 పైసలకు భూములను కట్టబెడుతూ, వేల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వంపై భారం మోపుతుంటే ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియదు.విద్యార్ధుల,తల్లిదండ్రుల సమావేశం పెట్టామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే.దానికి, వృద్ది రేటుకు సంబంధం ఏమిటో తెలియదు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6700 కోట్ల బకాయిలు పెట్టి, విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టినట్లవ్వదా! ఆరోగ్య రంగంలో మూడువేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయా?లేదా? తాను సాధించిన వాటికంటే గత ప్రభుత్వంపై ఏవో ఆధారాలు చూపని ఆరోపణలు చేయడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చంద్రబాబు అన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది పక్కనబెడితే, కొద్ది నెలల క్రితం మైనింగ్ కార్పొరేషన్ ఆదాయాన్ని తనఖాగా పెట్టడమే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం అప్పు వాయిదా సకాలంలో తీర్చకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్లో ఉండే ట్రెజరీ ఖాతా నుంచి నేరుగా డబ్బు డ్రా చేసుకోవచ్చని ఒప్పందం అయింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? సర్దుబాటు ఛార్జీల పేరిట వేల కోట్ల బాదుడు బాది, ఇప్పుడేమో రెండో ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెబితే సరిపోతుందా? అదే టైమ్ లో మళ్లీ విద్యుత్ ఛార్జీలపై ఈర్డీసీకి ఎందుకు నివేదిక ఇచ్చారు? మరో సంగతి చెప్పాలి. తమ ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదని నల్లజర్లలో చెప్పారు కదా? ఆ పాయింట్ పై ఈ ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదు. అప్పుడేమో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఇప్పుడేమో అంతా బాగుందని చెప్పడానికి కారణాలు ఏమిటి? రాష్ట్రం దివాళా తీసిందన్న సంగతి దేశంలో అందరికి తెలిసిపోయేసరికి పరువు పోయిందని ఇప్పుడు సడన్గా ఈ ప్రజెంటేషన్ ఇచ్చారా? లేక అప్పులు ఇచ్చేవారు భయపడుతున్నారు కనుక మాట మార్చారా? పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి తగ్గుతున్నారన్న భావనతో అంతా బాగానే ఉందని కలరింగ్ ఇవ్వ సంకల్పించారా? ఏడాదిన్నర కాలంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి దాచేసి, ఆల్ హాపీస్ అంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తే సరిపోతుందా?నిజంగా అంతా బాగుంటే సూపర్ సిక్స్లోని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి,పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్కో యువకుడికి పది లక్షల హామీ మొదలైనవాటిని నెరవేర్చి చూపవచ్చు కదా! జనం దగ్గరకు వెళ్లేమో బీద అరుపులు, మీడియా సమావేశంలో ప్రజెంటేషన్లో గొప్పల గప్పాలు చెప్పి ఎవరిని మభ్య పెట్టదలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను మోసం చేయడానికే సొంత లెక్కలతో చంద్రబాబు అంకెల గారడి చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వృద్ది రేటు, తలసరి ఆదాయం, అప్పుల పరిస్థితి అన్నిటి గురించి కాగ్ గణాంకాల ఆధారంగా వివరిస్తూ ఎందులో చూసినా తన పాలనతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్గా ఉండడం రేవంత్కు ప్లస్ పాయింట్గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుని కాంగ్రెస్ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్కు, రేవంత్కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుల కుప్పలు.. ప్రజలకు కష్టాలే కష్టాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్న తాజా నివేదిక ఆందోళనకరం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అధ్యయనం ప్రకారం వేగంగా రుణగ్రస్థమవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ముందున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వాలు చేస్తున్న పదేళ్ల టర్మ్ అప్పులు మరీ ఎక్కువ భాగంగా మారుతున్నాయని, చేసిన అప్పులు సక్రమంగా వాడకపోవడం, ఉద్దేశించిన పథకాలకు కేటాయించకపోవడం, ఆశించినంత రాబడి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం చట్టం వల్ల కొత్త అప్పులు పుట్టడం లేదని కూడా వాపోయారు. అయితే... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి? అప్పటి సీఎం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని.. తాను సంపద సృష్టించి ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తానని కదా? ఏమైంది? అధికారం దక్కగానే స్వరం మారింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాగని కొత్తగా సంపద సృష్టించారా? ఊహూ.. అదీ లేదు. పైగా నిధుల ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారన్న వస్తున్న విమర్శలనూ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో రూ.40 వేల కోట్ల అప్పు చేసేందుకు అవకాశం ఉండగా రూ.49 వేలు, తెలంగాణ రూ.31 వేల కోట్ల స్థానంలో రూ.60 వేల కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తాల్లోనూ పదేళ్లలో తిరిగి చెల్లించవలసిన సెక్యూరిటీలే ఎక్కువ. దీనివల్ల వచ్చే పదేళ్లలో రాష్ట్రాలు మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కునే ప్రమాదం ఉంది. అయితే హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూముల వేలం ద్వారా తెలంగాణ ఏటా రూ.5 నుంచి రూ.పది వేల కోట్ల వరకూ సంపాదిస్తోంది. పైగా రాజధాని పేరుతో ఇష్టమొచ్చినట్లు అప్పు చేయాల్సిన అవసరమూ ఆ రాష్ట్రానికి లేదు. పరిశ్రమల పేరు చెప్పి అణాకు, బేడాకు భూములు కూడా ఇవ్వడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.ఆదాయమేమో తక్కువ. దుబారా ఎక్కువ. విజన్ విజన్ అని చంద్రబాబు చెప్పే మాటలు చేతల్లో మాత్రం అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు తాను చేతల మనిషిని కూడా అన్నది రుజువు చేసుకోవల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే అధికారం దక్కిన తరువాత కేవలం 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎకాఎకి రూ.2.5 లక్షల కోట్ల వరకూ ఉంది. ఈ డబ్బు ఎలా సద్వినియోగమైందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని కాగల 17 వైద్యకళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, రూ.6500 కోట్లకు పైగా ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిలు, రూ.3000 కోట్ల ఎన్టీఆర్ ఆరోగ్యసేవ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. మరో వైపు సూపర్ సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని ఏటా సుమారు లక్షన్నర కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిలో కొన్నిటిని అరకొరగా చేసి.మిగిలిన వాటిని మంగళం పలకడానికి ఇప్పుడు తాజాగా అప్పులు పుట్టడం లేదన్న గాత్రం అంందుకున్నట్లు అనిపిస్తుంది. రాష్ట్ర జీఎస్టీ రాబడి తగ్గడం కూడా మరో ప్రమాద సూచిక. జీఎస్టీ స్లాబ్లు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఎల్లోమీడియా డబ్బా కొట్టినా ఇప్పుడు మాటమార్చి రాబడి తగ్గిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సెంట్రల్ యూనివర్శిటీ లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ఫ్రొషెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి వంటి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక్క కరోనా సంక్షోభ సమయంలో తప్పు నిర్ణీత పరిమితిలోపే అప్పులు చేసేవని, 2025లో పలు రాష్ట్రాలు హద్దులు దాటి అప్పులు చేస్తూ భావితరాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాలు ఏ స్కీమ్ కింద అప్పులు చేస్తాయో దానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం వల్ల అప్పు తీర్చడానికి అవసరమైన ఆదాయం రాదు. దాంతో అప్పులకు వడ్డీ తోడై భారం తడిసి మోపెడవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు అప్పుల్లేకుండానే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ రూ.40 వేల కోట్లు అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో రోడ్ల వంటివి నిర్మించినప్పటికీ ఆ తరువాత ఆదాయమేమీ రావడం లేదు. దీంతో అప్పులపై వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతోంది. భూమి ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత మిగిలిన భూమిని అమ్మి మాత్రమే ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవాలి. లేదంటే అప్పు ఓ గుదిబండగా మారుతుంది. ఈ దృష్టితోనే రాజధాని పేరుతో విపరీతమైన ఖర్చులు వద్దని నిపుణులు వారించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కంప చెట్లు కొట్టించేందుకే రూ.40 కోట్లు వ్యయం చేశారంటే ఈ ప్రభుత్వం దుబారా స్థాయి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. వందల కోట్ల రూపాయలతో వరదనీరు తోడటం, కిలోమీటర్ రహదారికి ఎక్కడా లేనంతగా రూ.75 కోట్ల నుంచి రూ.174 కోట్ల వరకూ ఖర్చు చేస్తూండటం, మహా నగరాల్లోనూ లేని విధంగా చదరపు అడుగు భవన నిర్మాణానికి రూ.పదివేలకు మించి వ్యయం చేస్తూండటం కూడా ప్రభుత్వం తీరుకు అద్దం పట్టేవే. ఇలా లక్షల కోట్లు వ్యయం చేసి ఆ తర్వాత తిరిగి రాబట్టుకునే మార్గం లేకపోతే ఆ భారం రాష్ట్ర ప్రజలు మోయవలసిందే. ఈ మధ్యకాలంలో పరిశ్రమలకు ఇస్తున్న భారీ రాయితీలు కూడా ఆర్థిక పరిస్థితిపై మరిన్ని సందేహాలను లేవనెత్తుతున్నాయి. విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.22 వేల కోట్లకుపైగా రాయితీలు ఇవ్వడం దీనివల్ల వచ్చే ఉద్యోగావకాశాలు రెండువేలు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో 200 ఉద్యోగాలే వస్తాయని తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వం ఈ భారం అంతా మోయవలసి వస్తుంది.ఇక కొన్ని పరిశ్రమలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారు. అలాకాకుండా ప్రభుత్వం హేతుబద్దమైన రీతిలో ఈ ధరలు నిర్ణయించి ఉంటే అది అమ్మకమైన, లీజు అయినా ప్రభుత్వానికి కొంత ఆర్జన ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు ఇచ్చుకుంటూ పోయి, మరో వైపు ప్రభుత్వానికి ఏళ్లతరబడి వచ్చే ఆదాయం లేని పరిస్తితి ఏర్పడితే అది ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చన్నది నిపుణుల అంచనా.తీసుకునే రుణాలు ఏ పాతికేళ్లకో చెల్లించేలా తీసుకోగలిగితే అది ఒక రకంగా ఉండవచ్చు.కాని కేవలం పదేళ్లకే తిరిగి చెల్లించేలా ఒప్పందం అయితే ఏటాటే ఆర్ధిక భారం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికే అప్పులు చేసే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం,ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి జనాన్ని మోసం చేయడం, అరకొరగా చేసి అన్నీ చేసేశామని బొంకడం, ఇంకో వైపు ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం,దానిని కప్పిపుచ్చుతూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం..ఇదే - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పంచాయతీ ఎన్నికల్లోనూ అలవికాని హామీలు!
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అని సామెత. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వార్తలు ఈ సామెతనే గుర్తు చేస్తున్నాయి. ప్రజాపాలన ఉత్సవాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ‘‘హాఫ్కు’’ ‘‘ఫుల్కు’’ ఓటేయవద్దని చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని సీఎం స్వయంగా చెప్పడం ఆహ్వానించదగ్గది. అన్ని పార్టీలవారు వీటిని పాటించడం అవసరం. కాని అలాంటి మాటలు చెప్పడానికి ముందు పాటించి చూపడమూ ముఖ్యమే. శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు ఎంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నదీ మద్యం ఎలా పారుతోంది? అందరికీ తెలిసిన విషయమే. ఈ సంగతులన్నీ ప్రజలకు తెలియవా? ఈ మధ్యనే జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, ఒక్కో ఓటుకు రూ.2500 నుంచి రూ.నాలుగైదు వేల వరకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. వారీ స్థాయిలో కాకపోయినా బిజెపి కూడా బాగానే ఖర్చు చేసింది కదా! రేవంత్, మంత్రులు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు కదా! ఇన్ని చేసినవారు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో మద్యం, డబ్బు పంచవద్దని చెబితే జనానికి పడతాయా? అయినా సీఎం హితబోధ చేయడాన్ని తప్పు పట్టనక్కర్లేదు. రేవంత్ మరో మాట కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తోందని, మంచి ప్రభుత్వం కనుక ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, మరో మూడేళ్లు ఈ ప్రభుత్వానికి సహకరించే సర్పంచ్లు ఎన్నికైతే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారిని ఎన్నుకోవాలని, కిరికిరిగాళ్లను వద్దని కోరారు. పంచాయతీ ఎన్నికలు పేరుకే రాజకీయేతరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తన స్పీచ్లలో ఎవరినైనా రాజకీయాలకు అతీతంగా మంచివారిని ఎన్నుకోండని చెబితే బాగుండేది. అలా కాకుండా తమ మద్దతుదారులనే ఎన్నుకోవాలని పరోక్షంగా ప్రచారం చేసినట్లు అనిపిస్తుంది. వేరే పార్టీ మద్దతుదారులను సర్పంచ్లుగా ఎన్నుకుంటే నిధులు రావని, పనులు జరగవని బెదిరిస్తున్నట్లు అనిపించదూ! వర్తమాన రాజకీయాలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణితో ఉంటున్నాయన్నది కూడా వాస్తవమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీవారినే ఉప ఎన్నికలలో, జెడ్పీ, మండల, పంచాయతీ ఎన్నికలలో గెలించాలని, లేకుంటే అభివృద్ది ఆగిపోతుందని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక బలహీనతగా కనిపిస్తుంది. ఇదే ధోరణితో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాష్ట్రాలలో ప్రచారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పర్వంలో డబ్బు, మద్యం,తదితర ప్రలోభాలు యథావిధిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వేలంపాటల ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో మాత్రం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. కాని అత్యధిక పంచాయతీలలో ఈ పరిస్థితి లేదు. అదేమీ తప్పు కాదు. పంచాయతీలలో ఎన్నికులు జరగవచ్చు. కాని అవి పద్దతిగా జరిగితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. మంత్రులు,ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో ఎలాగైనా ఏకగ్రీవాలు జరగాలని తంటాలు పడుతున్నారట. కొన్ని పంచాయతీలలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు రాష్ట్ర స్థాయి పార్టీలు, నేతలను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు కొందరు హామీలపై బాండ్లు రాసిచ్చారు.దానిని ఆయా చోట్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పాటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్ధి ఇంటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు, పెళ్లి జరిగితే ఆడబిడ్డకు ఐదువేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారట. కొన్ని గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చు చేస్తున్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాలలో ఎన్నికలు జాతరను తలపిస్తున్నాయి. చిన్న పంచాయతీలలో పది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్దమవుతున్నారు.కాస్త పెద్ద పంచాయతీలలో కోట్లు వ్యయం చేయడానికి వెనుకాడబోమని చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పోటీదారులకు రూ.15 నుంచి రూ.35 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామంలో సర్పంచ్గా తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తానని ఒక అభ్యర్ధి హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో 700 ఇళ్లు ఉన్నాయి. ఇందుకోసం ఏడాదికి సుమారు ఎనిమిది లక్షల చొప్పున ఐదేళ్లకు నలభై లక్షలు వ్యయం చేస్తానని హామీ ఇచ్చారన్నమాట. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం పేరుతో రూ.ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, ఆడపిల్లలకు మెట్టెలు, పెళ్లికొడుక్కి రూ.5116 ఇస్తామంటున్నారట. ఇల్లు కట్టుకుంటే స్లాబ్ వేసుకున్నప్పుడు రూ.21 వేలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నారట. మరి కొన్ని గ్రామాలలో విద్యార్ధులకు ఉచిత బ్యాగ్లు, బూట్లు, ఉన్నత విద్యకు ఆర్థికసాయం, సీసీ కెమెరాలు మొదలైనవి సమకూర్చుతామని హామీ ఇస్తున్నారు. గద్వాల జిల్లా సల్కావరం గ్రామంలో ఒక అభ్యర్ధి 22 హామీలతో బాండ్ పేపర్ పై రాసిచ్చారట.ఇవన్ని అచ్చంగా అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అసాధ్యమైన హామీల్లానే ఉన్నాయి. ఇక ఒకే కుటుంబానికి చెందిన వారు పోటీ పడుతున్న ఘటనలు జరిగాయి. బలవంతంగా విత్ డ్రా చేసుకోమంటున్నారని ఒక అభ్యర్ధి ఆత్మహత్యకు పాల్పడ్డారట. నిధులు అంతంత మాత్రంగా ఉండే పంచాయతీ ఎన్నికలలో ఈ పరిస్థితి ఎందుకు ఉందో ఊహించుకోవచ్చు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎలాగైతే రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయో,అదే రీతిలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయని అనుకోవాలి. అధికారంలోకి వచ్చాక, హామీలు అమలు చేసినా,చేయకపోయినా ఏమీ కాదులే అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేతలు వ్యవహరిస్తుంటారు.దానినే గ్రామాలలో అభ్యర్ధులు క్లూగా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘‘హాఫ్కు’’, ‘‘ఫుల్కు’’ ఓటు వేయవద్దని రేవంత్ రెడ్డి చెబితే ఎవరైనా వింటారా? సుద్దులు చెప్పడం కాకుండా నిబంధనలను పటిష్టంగా అమలు చేసినప్పుడు, రాష్ట్ర స్థాయి నేతలు ముందుగా తాము పాటించి చూపితే ప్రజలలో విశ్వసనీయత వస్తుంది .లేకపోతే అవన్ని ఊకదంపుడు ఉపన్యాసాలుగానే మిగిలిపోతాయి అని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రఫ్పాడించిన వైఎస్ జగన్
ఎవరన్నారు ర్యాగింగ్, ట్రోలింగ్లు.. కాలేజీలు, సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమని? రాజకీయాల్లోనూ వీర ర్యాగింగ్ చేయవచ్చు. కావాలంటే వైఎస్ జగన్ తాజా ప్రెస్మీట్ చూడండి!. కాలేజీలలో ర్యాగింగ్ నిషిద్ధం కానీ రాజకీయాలలో ప్రత్యర్థులను సమర్థంగా ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్పై అడ్డంకులేవీ లేవు. రఫ్ఫా రఫ్పా అన్న సినిమా డైలాగును ఫ్లెక్సీల్లో పెడితే ఏపీ పోలీసులు కేసులు పెట్టగలరేమో కానీ.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసే రాజకీయ ప్రత్యర్థులను బిత్తరపోయేలా రఫ్పాడిస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి?.వైఎస్ జగన్ ర్యాగింగ్కు తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. దీంతో ఏవేవో అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. మరి కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వాదనతో బిత్తరపోయిన ఎల్లో మీడియా సహజంగానే దాన్ని తక్కువ చేసేందుకు, వక్రీకరించేందుకు అన్ని శక్తులూ ఒడ్డింది. ఇదంతా వారి ఉడుకుమోతు తనానికి నిదర్శనం అనుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న ధోరణితో తప్ప, నిజానిజాలపై దృష్టి పెట్టడం మానేశాయి. జగన్పై రాస్తున్న ఏడుపుగొట్టు కథనాలే అందుకు నిదర్శనం.జగన్ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే..మొట్టమొదట అరటి రైతుల సమస్యల గురించి.. అరటి, మిర్చి, తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం పంటల బీమా సదుపాయాలు లేకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వలేదు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు?’’ అని అడుగుతూ అది సూపర్ మోసం అని, చంద్రబాబుపై చీటింగ్ కేసుపెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు అమలుపై నిలదీశారు. అమలు చేసినట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీలలోని డొల్లతనాన్ని, ఏడాది కాలం ఎగవేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. ఆయా స్కీములలో ఎగవేతల ద్వారా కూటమి సర్కార్ ప్రజలకు ఎంతెంత బాకీ పడింది లెక్కలు చెప్పారు. వీటికి కూడా టీడీపీ నుంచి నేరుగా జవాబు రాలేదు. కూటమి తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎలా హుళ్లక్కి చేసింది జగన్ సోదాహరణంగా వివరించారు. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు అడక్కుండా, ప్రైవేటు కంపెనీ కోసం టీడీపీ ఎంపీలు గనులు మంజూరు చేయడం గురించి అడగడంపై ఆయన మండిపడ్డారు. వీటన్నిటిపై తన ప్రశ్నల పరంపరతో చంద్రబాబును రాజకీయంగా జగన్ మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన ర్యాగింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం.చంద్రబాబు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద చల్లుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీలకి ముచ్చెమటలు పట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్లను సిట్ ముందుగా ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే పెద్ద అనుమానం. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైమ్లో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురమనలేకపోయాయి. అప్పట్లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం కాపీని కూడా జగన్ ప్రదర్శించడం విశేషం. ఆ రోజుల్లో ఒక అధికారిక బృందం వెళ్లి బోలేబాబా కంపెనీలను తనిఖీ చేసి వచ్చీ మరీ ధ్రువీకరించాయన్న సంగతి బయటపడింది. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి.చంద్రబాబు కూడా హెరిటేజ్ పేరుతో డెయిరీ సంస్థను నడుపుతున్నారు. ఆయనకు బోలే బాబా కంపెనీ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సరైన కంపెనీ కాకపోతే అప్పుడే తప్పించి ఉండాలి కదా! అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెయ్యి ట్యాంకులను తిప్పి పంపడం, మళ్లీ తర్వాత వాటిలో కొన్నిటిని అనుమతించడం వంటి విషయాలను కూడా జగన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలకు ,ఎల్లో మీడియాకు దిమ్మదిరిగినంత పనైంది. వీటిపై వీరెవ్వరూ నోరు విప్పితే ఒట్టు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి తిరస్కరణకు గురైన నెయ్యిని వాడారని, అయినా చైర్మన్, అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైమ్లోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసులో నిందితుడి ఆస్తి మొత్తం స్వామి వారికి రాసిస్తే అది తప్పన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం ఏమిటో తెలియదు.చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా! అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది?. అలాంటప్పుడు! అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు. అంతేకాదు. తిరుమల, ఇతర ఆలయాలలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. అంతే తప్ప ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లరు. కానీ, ఈ కేసులో లోక్ అదాలత్ నిర్ణయం మేరకు ఆస్తి మొత్తం రాయించుకుంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చోరీ చేశారో అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్న సిట్ ఆ విషయం విచారించి ఉంటుంది కదా! ఇంకేమైనా ఆస్తులు ఎవరికైనా రాసిచ్చారా అన్నది పట్టుకునేవారు కదా! ఈ కేసును ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి పులమాలని విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు ఆయనను కూడా విచారించవలసి ఉంటుంది కదా!అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేశ్ తదితర మంత్రులను కూడా పిలిచి మాట్లాడి ఉండాలి కదా! ఇవేవీ ఎందుకు చేయలేదు! ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల రూపాయల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియా పరకామణిలో డెబ్బేవేల రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా భావిస్తున్నట్లుగా ఉంది. దీనిని జగన్ చిన్న కేసు అన్నారని రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేకా హత్యకేసుకు ముడిపెట్టడం ఇదో వింతగా ఉంది.పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన ఆస్తులను రాసిస్తే, వందల కోట్ల స్కామ్ కేసులను ఎదుర్కుంటున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? ఎవరు ధర్మంగా ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా?. ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాలలో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్పాడించారని అనాల్సి వస్తోంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజం.. పవన్ వ్యాఖ్యలపై మౌనం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వేర్వేరు వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ.. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం మౌనం పాటించి తన రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శించింది. రేవంత్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్లో ఉన్న స్వేచ్చ గురించి మాట్లాడుతూ హిందూమతంలో ఉన్న దేవుళ్ల గురించి ప్రస్తావించారు.దీనిని మతపరమైన సమస్యగా బీజేపీ చిత్రీకరించే యత్నం చేసింది.మరో వైపు పవన్ కళ్యాణ్ కోనసీమలో జరిగిన ఒక సభలో తెలంగాణవారి దిష్టి తగిలిందని వివాదాస్పద కామెంట్ చేశారు.ఈ అంశంపై బీఆర్ఎస్ తొలుత స్పందించగా, కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాక మంత్రులు రియాక్ట్ అయి ఉండవచ్చు. బీజేపీ అయితే అసలు నోరే విప్పలేదు.రేవంత్ వ్యాఖ్యలను చూద్దాం.'హిందువులలో ఎంతమంది దేవతలు ఉన్నారు!మూడు కోట్ల మంది ఉన్నారా!మరి అందరు దేవుళ్లు ఎందుకు ఉన్నారు?పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడున్నారు.రెండు పెండిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకో దేవుడున్నాడు.మందు తాగేటోళ్లకు మరో దేవుడున్నాడు.ఎల్లమ్మ,పోచమ్మ దేవతలు ఉన్నారు. కల్లు పోయాలి, కోడి కోయాలి అనేటోళ్లకు దేవుడున్నాడు.పప్పన్నం తినేటోడికి కూడా దేవుడున్నాడు.అన్ని రకాల దేవుళ్లు ఉన్నారు.కాంగ్రెస్ లో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుడిపైనేఏకాభిప్రాయం లేదు.ఒకాయన వెంకటేశ్వరస్వామిని మొక్కుతాడు. మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతాడు.నేను అయ్యప్పమాల వేస్తానని ఒకరు అంటే మరోకాయన శివమాల వేస్తానంటాడు.దేవుళ్ల మీదనే ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను" అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ గట్టిగా స్పందించడమేకాకుండా నిరసనలకు కూడా పిలుపు ఇచ్చింది. హిందువులను తిండిబోతులుగా, తాగుబోతులుగా చిత్రీకరించే యత్నం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బదులు బీజేపీని పెంచడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారేమో అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ బరి తెగించి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దీనిపై స్పందిస్తూ రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారని, హనుమంతుడుపెళ్లి చేసుకోలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ నేతలు ఇలాంటి టైమ్ కోసం ఎదురు చూస్తున్నట్లు మాట్లాడారు. పనిలో పని జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ మాత్రానికే బీజేపీ తెలంగాణలో పెరిగిపోతుందని చెప్పలేం.కాని ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి ఇలాంటి సందర్భాలను రాజకీయ పార్టీలు వాడుకుంటాయి.నిజంగానే బీజేపీకి మత రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతే, హిందూమతాన్ని అంతగా ఉద్దరించే నేతలు అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదానికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణ చేశారు.తద్వారా స్వామివారి ప్రసాదానికి తీవ్ర అపచారం చేశారని కోట్లాది మంది హిందువులు బాధపడ్డారు.అయినా ఇంతవరకు బీజేపీ నేతలు ఏ రాష్ట్రంలోకాని, కేంద్రంలో కాని ఎవరూ నోరు విప్పి అదేమిటి?అలా తప్పుడు ఆరోపణలు చేయవచ్చా అని ప్రశ్నించలేదు. పైగా తెలంగాణ బీజేపీ నేత మాధవి నిజంగానే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నట్లుగా ఏపీకి వెళ్లి హడావుడి చేశారు. విశాఖలో ఒక బీజేపీ నేత గోడౌన్ లో 1.80 లక్షల కిలోల ఆవు మాంసం పట్టుబడితే మాత్రం ఏదో మొక్కుబడి ప్రకటన చేసి ఊరుకున్నారు తప్ప,గట్టిగా నిరసన చెప్పలేకపోయారు. తెలంగాణలో రేవంత్ చేసిన వ్యాఖ్య సరైనదా?కాదా?అన్నది వేరే చర్చ.కాని బీజేపీ ఎలా అవకాశవాదంతో పనిచేస్తున్నదన్నదానికి ఇది ఉదాహరణ.రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని,దేశవ్యాప్తంగా రాజకీయంగా వినియోగించే విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. కేంద్ర పార్టీ నేతలు జాతీయ మీడియాకు కూడా దీనిపై ఉప్పందించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టారట.దానికి అనుగుణంగా బీజేపీ నిరసనలు కూడా నిర్వహించి ఉద్రిక్తతలు సృష్టించే యత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలకు, మూడుకోట్ల మంది హిందూ దేవుళ్లు ఉండడానికి పోల్చడం ఏమిటో అర్ధం కాదు. ఎవరి నమ్మకం ప్రకారం వారు పూజలు చేసుకుంటారు. గుడులకు వెళతారు.చాలామంది హిందువులు ఏ దేవుడినైనా భక్తితోనే ప్రార్ధిస్తారు. ఏ దేవుడు పెళ్లి చేసుకున్నాడు! ఎవరు చేసుకోలేదు! వంటి అంశాలను ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంది.మతపరమైన అంశాల విషయాలు సున్నితంగా ఉంటాయి. ఆ సంగతి రేవంత్ కు తెలియనిది కాదు.బీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు తెలంగాణలో ఎజెండాను మార్చి బీఆర్ఎస్ ను దెబ్బతీస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని ఏమైనా అనుకున్నారా?లేక అనాలోచితంగానే మాట్లాడారా అన్నది అప్పుడే చెప్పలేం.తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఆయన బదులు ఇచ్చినప్పటికీ, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది కదా!ఉత్తరాదిన కూడా తనను బీజేపీ పాపులర్ చేస్తోందని రేవంత్ అన్నారు కాని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బదనాం చేయడానికి బీజేపీ వాడుకుంటుందన్న సంగతి విస్మరించరాదు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు పెంచేవే అని చెప్పాలి. రాజోలు నియోజకవర్గంలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని అంటూ ,అది కూడా రాష్ట్ర విభజనకు కారణం అయిందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వారి దిష్టి కోనసీమకు తగిలిందన్నట్లుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వి మతిలేని వ్యాఖ్యలని అన్నారు.హైదరాబాద్ లో నివసిస్తూ పవన్ ఇలా మాట్లాడతారా? హైదరాబాద్ కే దిష్టి పెట్టినట్లు మాట్లాడారని విమర్శించారు. ఎందువల్లోకాని కాంగ్రెస్ నేతలు తొలుత దీనిపై ఏమీ మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ పవన్ వైఖరిని తప్పు పట్టారు.పవన్ తెలంగాణలోని ఆస్తులన్నిటిని అమ్ముకుని విజయవాడ వెళ్లవచ్చని సలహా ఇచ్చారు.ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన సినిమాలు తెలంగాణలో ఆడబోవని హెచ్చరించారు.ఆ శాఖ మంత్రిగా స్పందిస్తున్నానని అన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారని, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు దీనిపై స్పందించాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.చంద్రబాబు,బీజేపీ లు దీనిపై నోరు మెదపలేదు.సిపిఐ నేత నారాయణ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ ను తొలగించాలని సూచించారు.అది కూడా జరగని పనే.బీజేపీకి, చంద్రబాబుకు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. పైగా పవనే అప్రతిష్ట పాలు అవుతారు. అది వారికి ప్రయోజనమే కదా!అందుకే బీజేపీ మీడియాకు చెందినఒక పత్రిక పవన్ పై తెలంగాణ నేతల విమర్శలకు కాస్త బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. పవన్ వి తలతిక్క మాటలు అని ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.ఇందులో కొంత వాస్తవం ఉందన్న అభిప్రాయం కలుగుతుంది.రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవారు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అంత తెలివైన పని కాదు. కోనసీమకు పవన్ కళ్యాణ్ దిష్టే తగిలి కొబ్బరి చెట్లు మాడిపోయాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీల చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ వీరి విమర్శలను పట్టించుకున్నట్లు లేరు.కాకపోతే జనసేన పేరుతో ఒక ప్రకటన చేస్తూ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. పవన్ వ్యాఖ్యల వీడియోలు లేకపోతే జనసేన అలాంటి ప్రకటన చేసినా నమ్మేవారేమో!ఆ పరిస్థితి లేదు. పవన్ గతంలో తెలంగాణలో వారికి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం, ఏపీకి వెళ్లి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కొత్త విషయం ఏమీ కాదు.అయితే తాజా వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని చెప్పకతప్పదు.లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్ లో, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తుంటారు. వారికి అసౌకర్యం కలిగేలా పవన్ వంటివారు మాట్లాడడం సరైనది కాదు. ఆయన ఇంకా సినిమాలలో నటిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సినిమావారికి కూడా నష్టం కలగవచ్చు. పవన్ క్షమాపణ చెప్పకపోతే కోమటిరెడ్డి హెచ్చరించినట్లు ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేయగలుగుతారా? అది సాధ్యమేనా?కాకపోతే తెలంగాణలో సెంటిమెంట్ పరంగా అవసరమైనప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా వాడుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దీనిపై మాట్లాడలేదు. ఆయన చంద్రబాబు సూచనల మేరకే వ్యవహరిస్తారని చాలామంది నమ్ముతారు.రేవంత్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా మతం,ప్రాంతం వంటి అంశాలలో వివాదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పంథా’ పేరుతో పైపూతలు!
‘‘పంథా మార్చిన చంద్రబాబు’’ ఎల్లో మీడియా ఈనాడులో కనిపించిన ఒకానొక శీర్షిక. చూడగానే ఏమనిపిస్తుంది? పరిపాలనకు సంబంధించి ఏదో మేలి మార్పు తీసుకొచ్చారేమో చంద్రబాబు అని కదా? లేదూ.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనం అనుకుంటే రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చెక్ పెట్టే చర్యలేవో తీసుకున్నారని అనిపించాలి. కానీ.. కథనం మొత్తం ఒకటికి పది సార్లు చదివినా అర్థమయ్యేది ఏమిటంటే.. బాబుగారిని ఆకాశానికి ఎత్తేయడం ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన ఎమ్మెల్యేలను బెదిరించడం అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే... పార్టీపై ప్రజా వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన అవసరం లేదంటూ... కార్యకర్త తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు చెప్పారని ఈ కథనంలో పేర్కొన్నారు మరి. అక్కడితో ఆగలేదు.. మొదట నాయకులు, కార్యకర్తలు మోటివేట్ అయితే, అధికారులను నియంత్రించడం కష్టం కాదని కూడా బాబుగారు పేర్కొన్నారట. పవిత్ర యజ్ఞానికి ఎవరు విఘాతం కలిగించినా వదలిపెట్టను అని హెచ్చరించారట. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పవిత్ర యజ్ఞం ఏమిటి? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమా? రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ఇష్టారీతిన, అర్థంపర్థం లేని రీతిలో ఖర్చు పెట్టడమా? చారాణా కోడికి బారా అణా మసాలా అన్నట్టు రూ.నాలుగు వేలు ఫించన్ ఇచ్చేందుకు హెలికాప్టర్ వేసుకుని రాష్ట్రమంతా తిరగడమా? తనపై ఉన్న అవినీతి కేసులను తానే మాఫీ చేసుకోవడమా? రైతులు సంక్షోభంలో ఉంటే వాటిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడమా? ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద రూ.6700 కోట్ల బకాయిలు పెట్టడమా? దాని ఫలితంగా టీడీపికి చెందిన వారి కాలేజీలలోకి సైతం విద్యార్ధులను లోపలికి రానివ్వడం లేదట. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద మూడువేల కోట్ల బకాయిలు పెట్టడమా? విశాఖలో 99 పైసలకే ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం పవిత్ర యజ్ఞమా? లూలూ వంటి సంస్థలకు వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని, ప్రభుత్వ భూమిని కారు చౌకగా అప్పగించడమా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. ఇవన్ని పవిత్ర యజ్ఞంలో భాగమనుకుంటే చేసేదేమీ లేదు. తన విధానాలను మార్చుకునే రీతిలో చంద్రబాబు తన పంథా ఉంటే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప, ఎప్పటి మాదిరి ఊక దంపుడు ఉపన్యాసాలతో, ఎల్లోమీడియాలో హెడ్ లైన్స్ లో ఉంటూ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను హెచ్చరించినట్లు లీకులు ఇచ్చుకుంటే పంథా మారినట్లు ఎలా అవుతుందో తెలియదు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పరోక్షంగా హెచ్చరించారట. చిత్రం ఏమిటంటే కొలికపూడి చేసిన ఆరోపణల జోలికి వెళ్లకుండా ఆయననే మందలించడం ఎలాంటి పాలన అవుతుంది. టీడీపీ టిక్కెట్ కోసం ఎన్నికలకు ముందు తాను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి రూ.ఐదు కోట్లు ఇచ్చానని కొలికపూడి కొన్ని ఆధారాలు చూపించారు. ఆ విషయం ఏమైంది? చిన్ని అనుచరులు తిరువూరులో అరాచకాలకు పాల్పడుతున్నారని, ఇసుక, బెల్ట్ షాపులు, చివరికి గంజాయి కూడా అమ్ముతున్నారని విమర్శించారు. ఇందులో వాస్తవం ఉందా? ఉంటే ఎంపీ, ఆయన అనుచరులపై ఏం చర్య తీసుకున్నారు? చర్యలు తీసుకోవడం అపవిత్ర యజ్ఞం అవుతుందా? పార్టీకి నష్టం కలిగిస్తే కఠినంగా ఉంటానని కొలికపూడినే బెదిరించడం ఏమిటి? అంటే చిన్ని వంటివారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఎవరూ ప్రశ్నించకూడదా? ఒకవేళ కొలికపూడి చెప్పిన వాటిలో అసత్యం ఉంటే ఆయనపై చర్య తీసుకోవాలి కదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఏ చిన్న విమర్శ చేసినా, ఆధారాలు చూపాలంటూ పోలీసులను ప్రయోగించి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కదా? ఈ సూత్రం టీడీపీ నేతలకు వర్తించదా? రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సుధామాధవి నుంచి వేమన సతీష్ అనే మరో నేత రూ. ఏడు కోట్లు తీసుకున్నారన్నది ఆరోపణ. ఆమె దీనిపై ఫిర్యాదు చేస్తే అసలు విషయాన్ని పక్కనబెట్టి ఆమె కుటుంబాన్నే భయపెడతారా? అది పవిత్ర యజ్ఞమా? ఆమె చేసిన ఆరోపణపై విచారించి ఎందుకు చర్య తీసుకోలేదు? మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తే పోలీసులు ఆమెనే వేధిస్తారా? ముఖ్యమంత్రి కార్యాలయం ఆ విషయంలో విచారణ చేసి, ఫిర్యాదులో నిజం లేదని తేలితే ఆమెపైనే చర్య తీసుకోవాలని చెబుతారా? ఇదెక్కడి న్యాయం?పైగా పోలీసులు ఆమె సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కాని, నిందితుడి ఫోన్ తీసుకోవడం, విచారణకు పిలవడం చేయలేదట. మహిళల జోలికి వస్తే ఖబడ్దార్ అన్నారని తెలుగుదేశం మీడియాలో వార్తలు రాయించుకుంటే సరిపోతుందా? చంద్రబాబువి మేకపోతే ప్రకటనలే అన్న భావన కలగదా? పైగా ఈ వార్తను కవర్ చేసిన సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడమా? ఇదేనా పంథా మార్చుకోవడం? పవిత్ర యజ్ఞం? మహిళలను వేధించారని, స్త్రీలతో అసభ్యంగా మాట్లాడారని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే వారిని కనీసం మందలించలేదే! చంద్రబాబు నియోజవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నేతలు, కేడర్తో భేటీ అవుతున్నారట.వారి నుంచి ప్రభుత్వం గురించి నిజమైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటే కదా చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందని అనుకుంటారు! ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం తెప్పించుకుని ఆశించిన పనితీరు లేనివారిని సున్నితంగా హెచ్చరిస్తున్నారట. ఒక పక్క కఠినంగా ఉంటున్నారని వీరే ప్రచారం చేస్తారు. మరో వైపు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలిస్తున్నారని వీరే చెబుతారు. దేనిని నమ్మాలి? ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ ఆఫీసును ఆదేశించారట. ఈ లెక్కన ఎమ్మెల్యేల తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించుకోవచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలపై ఇసుక, మద్యం తదితర స్కామ్ ల ఆరోపణల గురించి చంద్రబాబుకు తెలియదా? వారికి తగినట్లే కార్యకర్తలు పలుచోట్ల బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయే. ఎవరికి వారు సంపాదన రంధిలో పడ్డారని వార్తా కధనాలు వస్తున్నాయి కదా?అ వి నిజమా? కాదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 నుంచి వంద మంది ఓడిపోతారని కొన్ని సర్వేలు సూచించాయి. దాంతో కొంత ఆందోళనకు గురై చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా పంథా మారిందంటూ లీకులు ఇచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. వంద రోజులలో గంజాయిని అరికడతామని ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ తర్వాత అంతా నియంత్రించేసినట్లు ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా ఏపీ గంజాయి హబ్ గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. చివరికి గంజాయి బేరగాళ్లు నెల్లూరు వంటి చోట్ల హత్య,దాడులు వంటివాటికి పాల్పడ్డారు.వీరికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరి అండదండలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.ఏదో పెన్షన్లు, సీఎం రిలీఫ్ చెక్కులు పంచితే ఎమ్మెల్యేలు బాగా పనిచేసినట్లు అనుకుంటే అంతకన్నా ఆత్మ వంచన ఉండదు. పవిత్రమైన యజ్ఞం అంటూ కధలు చెప్పే బదులు చంద్రబాబు మొత్తం తన ప్రభుత్వ తీరును సమీక్షించుకుని నిజంగా తన పంధాను మార్చుకుని ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తే ఆయనకే మంచిపేరు వస్తుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్ను వైజాగ్లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు.. ఇదేనా మీ బ్రాండ్..?
పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి. పారిశ్రామిక వాడలలో, లేదా ఇతరత్రా వచ్చే పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ పరిశ్రమలు మూతపడడం, లేదా వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి భూములు ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది.దీనిపై బిఆర్ఎస్ ,బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ, లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో, పరిసరాలలో ఉన్న పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి.పారిశ్రామికవాడలలో, లేదా ఇతరత్రా వచ్చే పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ పరిశ్రమలు మూతపడడం, లేదా వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి భూములు ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. దీనిపై బిఆర్ఎస్ , బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ,లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ,పరిసరాలలో ఉన్న పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా ప్రభుత్వమే అవకాశం కల్పిస్తున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చే భూములలో నలభై నుంచి ఏభై శాతం స్థలంలో ఐటి కార్యకలాపాలకు కాకుండా ఇళ్ల నిర్మాణం,కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించుకోవచ్చట.వాటిని అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చట. ఇలాంటివి ఐటి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఎందుకంటే అవి ఐటి కంపెనీలు కావు కనుక. కాకపోతే అవి నిర్మించే భవనాలను ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తాయి. ఆ ఐటి కంపెనీలలో ఉండే ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుని ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రోత్సహాకాలను ఇవి పొందుతాయట.విశాఖలోని కోట్ల విలువ చేసే భూములను ఈ రకంగా పందారం చేస్తున్నారు.ఇప్పటికే ఉర్సా అనే పేరుతో వెలసిన కొత్త సంస్థకు అరవై ఎకరాల భూమి కేటాయించి ప్రభుత్వం విమర్శలపాలైంది. అయినా అదేతరహాలో రహేజా, కపిల్ చిట్ ఫండ్స్ ,బివిఎమ్ ఎనర్జీ,ఎఎస్ఎస్ ఆర్ మొదలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం భూమిని ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుండడం శోచనీయమని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.రహదారులు,నీరు,విద్యుత్, వంటి మౌలిక వసతులకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందట. ఇవి కాకుండా పెట్టుబడిలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రోత్సాహకాల పేరుతో వారికి చెల్లింపులు జరుగుతాయట.ఇటీవల రహేజ గ్రూప్ కు విశాఖపట్నంలో 27 ఎకరాల భూమిని 99 పైసలకే ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ భూమి విలువ సుమారు 1300 కోట్ల పై మాటే అని చెబుతున్నారు.ఈ కంపెనీ నిర్మించే ఐటి క్యాంపస్ ద్వారా 15వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్లకే ఇచ్చేశారు.విశేషం ఏమిటంటే సత్వా కంపెనీ హైదరాబాద్ లో కోకాపేటలో ఇటీవలే వేల కోట్లు వ్యయం చేసి 25 ఎకరాలు కొనుగోలు చేసింది.ఈ కంపెనీ హైదరాబాద్ లో తన భవనాలను లక్షల రూపాయలకు అద్దెకు ఇస్తోంది. విశాఖలో సైతం అదే రీతిలో ఐటి కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ఏ ఇతర రాష్ట్రంలోలేని విధంగా కారుచౌకగా భూములు ఇవ్వడం ఎంతవరకు ఏపీ కి లాభదాయకమన్న ప్రశ్న వస్తోంది.విశాఖ ఇమేజీని చివరికి పైసలలోకి తీసుకువచ్చి ఇక్కడి భూమిని పప్పు బెల్లాలమాదిరి పంచుతారా అన్న బాధను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక సంగతి చెప్పాలి. గతంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా చోట్ల పరిశ్రమలవారికి నిర్దిష్ట మొత్తాలకు భూములను కేటాయించితే దానిని క్విడ్ ప్రోకో గా టిడిపి ప్రచారం చేసింది. వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే పాట అందుకుని రాజశేఖరరెడ్డి కుమారుడిపై కేసులు పెట్టించింది. చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేయడాన్ని ఇదే కోవలో వేసి జగన్ కు అంటకట్టారు.ఇప్పుడు ఏకంగా 99 పైసలకే వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చేస్తున్న చంద్రబాబు అండ్ కో కు ఎలాంటి లావాదేవీలు ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే ఎకరా 130 కోట్ల నుంచి 170 కోట్ల వరకు అమ్ముడుపోయింది. హైదరాడబాద్ కు విశాఖ కూడా పోటీ ఇచ్చే నగరమే. కోట్లలో భూమి ధర పలుకుతోంది. అలాంటి విశాఖలో ఇంత ఘోరంగా భూములు కట్టబెట్టడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం కిందకు రాదా?అన్న ప్రశ్నకు జవాబు దొరకదు.పైగా ఈ కంపెనీలు కొన్ని అసలు తమకు తక్కువ ధరకు భూమి ఇవ్వాలని కోరకపోయినా ఎందుకు కేటాయిస్తున్నారో అర్ధ కాదు. పరిశ్రమలు రావల్సిందే.కాని ఆ పేరుతో ఇలా భూములు కాజేస్తున్నారన్న భావన రానివ్వరాదు. భవిష్యత్తులో ఎంతకాలం ఇవి సంబంధిత పరిశ్రమలు కొనసాగిస్తాయో లేదో తెలియదు. లూలూ మాల్ వంటివాటికి ఎకరాలకు ఎకరాలు లీజు పేరిట తక్కువ ధరకు భూములు ఇచ్చారు. ఒక నిపుణుడు చెబుతున్నదాని ప్రకారం 33 ఏళ్లు లీజ్ అయినా, ఆ తర్వాత దానిని అరవైఆరు ఏళ్లు,తదుపరి తొంభైతొమ్మిది ఏళ్లు పొడిగించుతారు. చివరికి ఆ భూమి లీజుదారుడికే సొంతం అవుతున్నట్లే భావించాలి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక భూమిని అప్పట్లో ప్రభుత్వం లీజుకు ఇచ్చినా, తాజాగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారం 9వేల ఎకరాలలో పరిశ్రమల బదులు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి వీలు కల్పించబోతున్నారు. ఒకప్పుడు అజామాబాద్ పారిశ్రామికవాడ ను లీజు పద్దతిన ప్రభుత్వం ఇచ్చింది.కాని ఆ చుట్టుపక్కల నివాసాలు ఏర్పడడంతో అక్కడనుంచి పరిశ్రమలను తరలించాలన్న ప్రతిపాదన వచ్చింది.కాని ఆ సమయంలో ఆ భూములు తమకే ఇవ్వాలని పరిశ్రమలవారు పట్టుబట్టారు. తాజాగా హైదరాబాద్, పరిసరాలలో ఉన్న పారిశ్రామికవాడలలోని భూముల వినియయోగాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ,కొన్ని కండిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజ్ లో 30 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయించింది. దీనిపైనే బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు,బీజేపీ శాసనసభ పక్షనేత మహేష్ రెడ్డిలు ఇది లక్షల కోట్ల కుంభకోణం అని విమర్శిస్తున్నారు.ప్రభుత్వం ఖండించి తమ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి ఐదువేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెబుతోంది. దీనిని చెడగొట్టడానికి విపక్షం కుట్ర పన్నుతోందని మంత్రులు బదులు ఇచ్చారు.అయినప్పటికీ రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే గురువుకు తగ్గ శిష్యుడు అన్న విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉందన్నది కొందరి వ్యాఖ్య.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఏభైప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి ,వాటి ఆస్తులను ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే అప్పగించారు. వారు కూడా అక్కడ పరిశ్రమలు నడపడం లేదని, రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని చెబుతున్నారు. ఇది చంద్రబాబు మోడల్ ఆర్ధిక విధానంగా కొందరు చమత్కరిస్తుంటారు. తెలంగాణలో ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రైవేటు పరం అవుతుంటే,ఏపీలో కొత్తగా ఇస్తున్న భూములు ప్రైవేటువారికి మొదటే సంపద చేకూర్చి పెడుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. విశాఖలో మాదిరి అమరావతిలో కూడా ఇలాగే అణా,బేడాకు భూములు ఇవ్వడానికి చంద్రబాబు సిద్దపడతారా?అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఐటి కంపెనీల ముసుగులో ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం సరైనదేనా?అన్నది వారి ఆవేదన. ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావల్సిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా? -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు బాటలో పవన్ డబుల్ గేమ్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఊగిపోతూ, జుట్టు ఎగరవేస్తూ ఆవేశంతో ప్రసంగాలు చేస్తుంటే, ఆయనలో చిత్తశుద్ది ఉందని అభిమానులు బావించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తారని, ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీస్తారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని అంతా ఆశించారు. కాని అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చూసి విస్తుపోయే పరిస్తితి ఏర్పడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉచిత పధకాల గురించి మాట్లాడిన విషయాలు ప్రజలను అవమానించేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రజలకు ఉచిత స్కీములు ఇస్తానన్నది టీడీపీ, జనసేనలు. అప్పుడు ఓట్ల కోసం దేహీ అని ప్రజలను ప్రాధేయపడిన ఈ పార్టీల నేతలు ఇప్పుడు స్వరం మార్చడం శోచనీయంగా ఉంది. చిత్రంగా ప్రజలేదో దేహి అని అడుగుతున్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. అప్పుడెవరైనా ప్రజలు ఆయనను కలిసి తమకు ఫలానా స్కీమ్ కావాలని దేహీ అన్నారా? లేదే!. అయినా ఎందుకు సుమారు లక్షన్నర కోట్ల ఖర్చు అయ్యే స్కీములను కూటమి వాగ్దానం చేసింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఎవరైనా అడిగితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేవారు! చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, దానితో స్కీములు అమలు చేస్తామని అనేవారా?లేదా? గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు మాటలు మార్చడంలో ఎంతో అనుభవం ఉందని భావిస్తారు. ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ పయనిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కోనసీమ జిల్లాలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఉచితాలతోనే ఓట్లు రావని, ప్రజలు ఈ స్కీముల ద్వారా దేహీ అన్నచందంగా మారకూడదని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అబిప్రాయపడ్డారు. మరి ఇవే మాటలు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు? పైగా అప్పటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అదనంగా ఇస్తామని, సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికలోని 140 అంశాలను అమలు చేసి చూపిస్తామని గప్పాలు కొట్టారే! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వారు చేసిన వాగ్దానాలకు లక్షన్నర కోట్ల వరకు అవసరం అవుతాయని, అవి ఎక్కడ నుంచి వస్తాయని ఆ రోజుల్లో జగన్ చెబితే ఆయనకు చేతకాదని ప్రచారం చేశారే. ఇప్పుడేమో చేతులెత్తేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే ఈ మధ్యనే సూపర్ సిక్స్ -సూపర్ హిట్ అంటూ భారీ సభలు పెట్టి ఉపన్యాసాలు ఎలా దంచారు? సూపర్ సిక్స్ లోని అంశాలనే పూర్తిగా అమలు చేయలేదు. అయినా హిట్ అన్నారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారా? లేదా?. నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయలు ఇస్తామని అన్నారా?లేదా? ఏభై ఏళ్లకే బిసిలకు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారా? లేదా? ఇలా అనేక అబద్దపు హామీలు ఇచ్చి, ఇప్పుడేమో ఉచితాలు మంచిది కాదని చెబుతారా? అంటే ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ప్లాన్ వేసినట్లే కదా!. మహిళలకు ఉచిత బసు ప్రయాణం స్కీమును ఎందుకు ప్రకటించారు. దాని గురించి ఎవరైనా దేహీ అన్నారా? మహిళల నుంచి వస్తున్న నిరసనను తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా దానిని అమలు చేశారు. అదే సమయంలో లక్షలాది ఆటోవాలాల ఉపాధికి గండి కొట్టారు. ఎవరి కాళ్లమీద వారు నిలబడాలని సుద్దులు చెబుతున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఉచిత బస్ స్కీమ్ ప్రారంభసభలో ఎందుకు పాల్గొన్నారు. ఆటోలవారి కాళ్లను కూటమి పెద్దలు విరగగొట్టినట్లే అనుకోవాలి కదా! పోనీ ప్రజా ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా అంటే అదేమి లేదు. తమ షోకులను ఎక్కడా తగ్గించుకోవడం లేదు. దుబారాకు అంతులేదన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ లలో పర్యటనలు చేస్తున్నారు. అది అనవసర వ్యయమా? కాదా?. పేదలకు ఇవ్వడానికి డబ్బు లేదు కాని, విశాఖలో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు అడిగినా, అడగకపోయినా 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఎలా ఇస్తున్నారు?. అది ఉచిత స్కీమ్ కింద రాదన్నమాట. తూర్పు గోదావరి జిల్లాలో డ్రైనేజీల మరమ్మతుకు నాలుగువేల కోట్లు కావాలని, కాని ఆ డబ్బు లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్, అమరావతిలో వేల కోట్లు అప్పుచేసి పనులు ఎలా చేపట్టగలుగుతున్నారు?ఇప్పటికే 29వేల కోట్ల అప్పు అమరావతి కోసం చేశారు. మరో 31 వేల కోట్లు మంజూరు అయ్యాయని గొప్పగా చెప్పుకున్నారు.అవి చాలవన్నట్లు మరో 7500 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఇక ప్రభుత్వ అవసరాల కోసం సుమారు 2.20 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బు అంతా ఏమైపోతోందో ఎవరికి అర్ధం కావడం లేదు. అమరావతిలో రోడ్డు నిర్మాణంలో కిలోమీటర్ కు 170 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా దుబారా అవ్వదా! పవన్ కళ్యాణ్ వాటి గురించి మాట్లాడకుండా ప్రజలు ఉచిత పధకాలు కోరుకోరాదని చెప్పడం మోసం చేయడం కిందకు రాదా?ఎన్నికలకుముందు అన్నీ తన చేతిలోనే ఉంటాయన్నట్లు ఫోజు పెట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో తన వద్ద ఆర్ధిక శాఖ లేదని, ముఖ్యమంత్రిని నిధులు అడగాలని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? అమరావతిలో 33వేల ఎకరాల భూమి తీసుకోవడాన్నే ఒకప్పుడు తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారు. అదనంగా మరో 40వేల ఎకరాలకు ప్రభుత్వం సిద్దం అవుతుంటే,క్యాబినెట్ లో ఒకసారి ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం రెండోదశలో 20వేల ఎకరాలు అదనంగా తీసుకోబోతోంది కదా! దీనిని ఎందుకు పవన్ అంగీకరించారు? ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలలో పవన్ కూడా డబుల్ గేమ్ ఆడుతూ చంద్రబాబుతో ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాటకు ప్రభుత్వంలో పెద్ద గా విలువ ఇవ్వడం లేదని, తొలుత ఏదో విన్నట్లు నటించి తర్వాత చంద్రబాబు ,లోకేష్ లు తమ పని తాము చేసుకుని పోతున్నారన్న ప్రచారం కూడా రాజకీయవర్గాలలో ఉంది. ఇక బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అప్పుడప్పుడు ఉచితాలకు వ్యతిరేకం అంటూ గాత్రం అందుకుని విమర్శలకు గురి అవుతున్నారు. కొద్ది కాలం క్రితం బీహారులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రెండు లక్షల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పి ,తొలుత పదివేల రూపాయల చొప్పున ఇచ్చినప్పుడు వెంకయ్య అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేది కదా!. స్వయంగా ప్రధాని మోదీనే ఈ బటన్ నొక్కారు కదా! ఉచిత బస్ ప్రయాణాలు వద్దని చెప్పిన ఆయన పరిశ్రమలకు కోట్ల రూపాయల విలువైన భూములను 99 పైసలకే 66 ఏళ్ల లీజుకు ఇవ్వడం ఏమిటని ఎందుకు అడగలేదో తెలియదు.2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేసినప్పుడు చంద్రబాబు ఇచ్చిన లక్షకోట్ల రూపాయల రుణాల మాఫీని వ్యతిరేకిస్తూ ఎక్కడైనా ప్రకటన ఇచ్చారా? అలా చేసి ఉంటే ఇప్పుడు ఏమి చెప్పినా విశ్వసనీయత వచ్చి ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ రకరకాల చిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎర్రచందంనం స్వామివారి రక్తం నుంచి పుట్టిందని కొన్నాళ్ల క్రితం ప్రకటించి ప్రజలు విస్తుపోయేలా చేశారు. కోనసీమకు తెలంగాణవారి దిష్టి తగిలిందని అంటూ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. దాని మీద తెలంగాణ నేతలు జగదీష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మంత్రులు తదితరులు మండిపడి పవన్ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి మీద విమర్శలు వస్తుంటే ,వాటిని తట్టుకోలేక సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రశ్నించేవారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేనలకు చెందిన వారు అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్నా పట్టించుకున్నట్లు కనపడదు. పవన్ కళ్యాణ్ గతంలో ఏమి ప్రసంగాలు చేసింది? అధికారం వచ్చాక ఏమి చేస్తున్నది?ఎలా మాటలు మార్చుతున్నది తెలిపే వీడియోలు బహుశా వందల సంఖ్యలో ఉండవచ్చు. వాటిని ఒక్కసారి చూడగలిగితే ఆయనేమిటో పవన్కే తెలుస్తుంది. మాట మార్చడం గొప్పదనం కాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్ప విషయం అవుతుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కిన పాలనే ఇది
భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలిపే భారీ ప్రసంగాలు ఒకవైపు, అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వైనం మరో వైపు ... ఇవి పరస్పర విరుద్దం అయినప్పటికీ, మన పాలకులు అతి చాకచక్యంగా రెండిటిని ఏక కాలంలో చేయగలుగుతున్నారు. అప్పుడప్పుడూ న్యాయ వ్యవస్థ చెక్ పెడుతున్నప్పటికీ, దానిని అతిక్రమించి రాజ్యాంగాన్ని ,తద్వారా ఏర్పడిన చట్టాలను పలుమార్లు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరికొత్త రికార్డులను సాదిస్తోందన్న భావన న్యాయ కోవిదులలో కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ ఒక కల్పిత కథను సృష్టించి, అందులో పలువురిని ఇరికిస్తూ అరెస్టులు చేయడం, వారికి బెయిల్ వస్తే కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పెద్ద,పెద్ద లాయర్లను పెట్టి వారిని తిరిగి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న తీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వంచి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది. దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు.అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది.దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు. మద్యం కేసులో రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి దనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రైవేటు కంపెనీలో పనిచేసే బాలాజి గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయలేదన్న భావనతో వీరికి కోర్టు బెయిల్ ఇస్తే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి దానిని రద్దు చేయించాలని పిటిషన్ వేసింది.దానిపై హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలని, అందువల్ల కోర్టులో తిరిగి లొంిపోవాలని వీరిని ఆదేశించింది. ఆ మీదట వారు సుప్రింకోర్టును ఆశ్రయిస్తే వారికి డిపాల్ట్ బెయిల్ కొనసాగిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది.నిదితులను సుదీర్గకాలం కస్టడీలో ఉంచి ఏమి సాధిస్తారని సుప్రింకోర్టు చీప్ జస్టిస్ సూర్యకాంత్ ఆద్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.200 మంది సాక్ష్యులను విచారించాలని ప్రభుత్వం చెబుతోందని, ఎంత కాలం ఈ విచారణ సాగుతుందని కోర్టు అడిగింది. దీనికి సిట్ తరపు లాయర్లు జవాబు ఇచ్చే అవకాశం ఉందా?ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో లోక్ సభ సభ్యుడు మిదున్ రెడ్డికి ,మరొకరికి ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఆదారాలు ఎక్కడ అని ప్రశ్నించింది.దానిపై కోపం వచ్చిన ప్రభుత్వ తరపు ఢిల్లీ న్యాయవాది ఒకరు ఏకంగా ఆ జడ్జిని బదిలీచేయిస్తామని వ్యాఖ్యానించి బెదిరించారని వార్తలు వచ్చాయి.అయినా నిందితులకు బెయిల్ రానివ్వకుండా ఏదో సాకు చూపుతూ ప్రభుత్వం అడ్డుపడుతున్నదన్న సంగతి అందరికి అర్ధం అవుతూనే ఉంది.ఇదంతా రాజ్యాంగ సమ్మతంగా కనిపిస్తుందా?నిర్టిష్ట ఆధారాలు చూపి కేసు పెడితే ఎవరూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు జరిగాయా?లేదా?ఆ వెంటనే పోలీసులు కేసులు పెట్టడం నిత్యంచూస్తూనే ఉన్నాం. ఈ కేసులో హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందని పోలీసులు కోర్టుకు చెప్పిన తర్వాత, వాటి నెంబర్లతో సహా వీడియో రికార్డు చేయాలని రాజ్ కెసిరెడ్డి కోరగానే పోలీసులు వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమ చేయడం ఏమిటి?అలాగే వెంకటేష్ అనే మరో నిందితుడి ఫోన్ లో డబ్బుల డంప్ వీడియో,ఫోటో దొరికిందంటూ ఎందుకు లీక్ ఇచ్చారు. తర్వాత ఆసలు పోన్ ను ఓపెన్ చేయలేదని ఎందుకు కోర్టుకు చెప్పారు. ఇవన్ని చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు చేతిలోకి తీసుకున్నట్లు అనిపించదా? 3500 కోట్ల రూపాయల ముడుపులను ఇచ్చినట్లు ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయకపోయినా దారిపోయే వ్యక్తి తో లెటర్ రాయించి ఇలా కక్ష అరెస్ట చేయిస్తున్నారా?లేదా? పోనీ ఇదే ప్రామాణికం అయితే గతంలో చంద్రబాబు తదతరుల మీద వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ రాజ్యాంగం ప్రకారం నైతికంగా కరెక్టు అవుతాయి.ఉదాహరణకు అప్పట్లో స్కిల్ స్కామ్ , ఇసుక, మద్యం, అస్సైన్డ్ భూములు, అమరావతి ఇన్న్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి కేసులను నీరుకార్చుతున్న వ్యవహారంపై వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అప్పట్లో ఈ కేసులో సాక్ష్యాదారాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులతోనే ,ఆధారాలు లేవని అఫిడవిట్లు వేయిస్తున్నారట.ఉదాహరణకు మద్యం స్కామ్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి, అమరావతి కేసుల్లో ఫిర్యాదు చేసిన ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ , ఫైబర్ నెట్ అవినీతి కేసులో కంప్లెయింట్ చేసిన మధుసూదన రెడ్డిలను భయపెట్టి ,లేదా ప్రలోభపెట్టో ఆ కేసులపై వ్యతిరేకంగా అఫిడవిట్ లు వేయిస్తున్నారు.ఇది ఏ రాజ్యాంగం, చట్టం అనుమతిస్తుంది?అసలు విచారణ పూర్తి కాకుండానే అధికారం ఉంది కనుక వాటి నుంచి బయటపడడానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలపై న్యాయపోరాటం చేస్తామని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెబుతున్నారు. ఇది లీగల్ పైట్ కు సంబందించిన విషయం కాదు.ప్రభుత్వం నడిపేవారు పాటించవలసిన విలువలకు సంబంధించినవని చెప్పాలి.తనపై వచ్చిన రోఉపణలను తనే క్లియర్ చేసుకోవడం నైతికంగా సమర్ధనీయమేనా? ఏపీలో తప్ప,దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఇలా జరుగుతోందా?వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య పై ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటికి రెండుసార్లు ఆరోపణలు చేయవచ్చా? విసుగుచెందిన ఆ అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపితే దానికి జవాబు ఇవ్వకుండా, అతని ఉద్యోగం పీకేస్తారా? శంకరయ్య పోలీసు శాఖకు కళంకం తెచ్చారని ఇలా చేశారట. అంటే పౌరునిగా తన హక్కు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కళంకం పేరుతో ఉద్యోగం తీసిస్తేరా? నిండు చట్టసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబితే మాత్రంం ప్రజాస్వామ్యానికి కళంకం రాదన్నమాట.దానిపై ఎవరూ మాట్లాడకూడదన్నమాట.శంకరయ్య చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు ఇవ్వలేకపోయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ విచారణకు హాజరుకాకుండా, అమెరికా పంపించివేసి, కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక అతనికి బకాయిలతో సహా జీతాలు చెల్లించడం ఏ రకంగా సమంజసం అవుతుంది. అలాగే సోషల్ మీడియా పోస్టుల కేసుల పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం మాటేమిటి? నిజంగా తప్పుగా పోస్టులు పెడితే ఎవరూ కాదనరు. తెలుగుదేశం, జనసేనలకు చెందినవారు ఎలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టినా,వాఖ్యలు చేసినా కేసులు ఉండవా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతో వైసిపి అధికార ప్రతినిది కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేస్తే గౌరవ న్యాయస్థానం రిమాండ్ను తిరస్కరించిందే. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుబడిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఎలా ఇరికించారు?అసలు పాత్రధారులన్న అనుమానం ఉన్న టిడిపి నేతలపై కేసే ఎందుకు పెట్టలేదు?ఇంకా చిత్రమేమిటంటే ఏపీలో ఆయా ఘటనలలో బాదితులపైనే కేసులు పెట్టే సన్నివేశాలు చూస్తున్నాం.అందువల్లే హిందుపూర్ లో ఒక అధికారి తాను తప్పుడు కేసు పెడుతున్నానని క్షమించాలదని సంబంధిత వ్యక్తికే ఫోన్ చేసి చెప్పారు. దానిని బట్టే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం రాజ్యాంగ విలువలను పాటించడం లేదన్న సంగతి తేటతెల్లమవుతుంది కదా!అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు నాయుడా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేషా?రెడ్ బుక్ పేరుతో లోకేష్ కు చెందిన ఒక టీమ్ జరుపుతున్న అరాచకాలను ఏ రాజ్యాంగం అనుమతిస్తుంది. పైగా పలువురు పోలీసులకు రాజ్యాంగం తెలియదని లోకేష్ తన యువగళంలో తెలుసుకున్నారట. రెడ్ బుక్కే రాజ్యాంగమని తెలుసుకుని మసలుకోకపోతే పోలీస్ అధికారులనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికే కాదు.ఆయన విగ్రహం ఉన్న స్త్మతి వనానికి కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఎంత దురదృష్టం! ఇలాంటి ప్రభుత్వాన్నా ఏపీ ప్రజలు కోరుకున్నది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు.. ఆయన సహజ స్వభావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అంతే! విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపైన, అందులో పనిచేసే కార్మికులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా! కాని ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెట్, దీనిని ఎలాగైనా కాపాడుకుంటాం,పొరాడుదాం.. అని చెప్పారా?లేదా?ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టాలలో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు?ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవ్వలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులను ఎలా రెచ్చగొట్టారు? తాను ఈ ప్లాంట్ను కాపాడడానికి సిద్దంగా ఉన్నానని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే కానీ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ ఎత్తడం లేదు. విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు! కొద్దికాలం క్రితం శాసనమండలిలో మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారని వార్తలు వచ్చాయి కదా! ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే! అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవలసిందే కదా! 12వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దానిని ఏమి చేసినా ఫర్వాలేదన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు?దేనికి వాడారు? ప్రైవేటువారికి అప్పగిస్తే రుణ బారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది కదా! ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా, అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోదీని ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. పైగా అది లాభాలలో నడుస్తుందని ఆయన జోస్యం చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించేలా కృషి చేయలేదో వివరించాలి కదా! ప్రైవేటుపై మోజు ఉంటే ఉండవచ్చు. కాని ఎన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు , బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ తర్వాత వాటిని సరిగా నడపలేక చేతులెత్తేశాయి. మరికొన్ని సంస్థలు మోసాలు చేసి దివాళాకు వెళ్ళాయి. ఇలా మూత పడ్డ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాత్రం బ్రహ్మాండంగా, హాపీగా ఉంటున్నారే. రాజకీయాలలోకి వచ్చి మంచి పదవులు పొందుతున్నారే. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వందల కోట్ల రుణాలను బ్యాంకులనుంచి పొంది ఎగనామం పెట్టారు కదా! గతంలో చంద్రబాబు టైమ్లో కొండపల్లి వద్ద లాంకో పవర్ అన్న సంస్థ ఏర్పాటైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన ఆ సంస్థ వివిధ కారణాలతో మూతపడింది.ఆ కంపెనీకి బ్యాంకులు ఇచ్చిన 45వేల కోట్ల రుణాలలో ఎంత భాగం మాఫీ అయ్యాయో చంద్రబాబు వంటి వారికి తెలియదా? అప్పుడు తెల్ల ఏనుగులకు ప్రభుత్వ డబ్బు కట్టబెట్టినా ఫర్వాలేదా? దేశ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల మేర బ్యాంకులు పరిశ్రమలవారికి ఇచ్చిన రుణాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటిస్తున్నాయి కదా! ప్రైవేటు కంపెనీ లూలూ కు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అర్ధణా,అణాలకు ఇచ్చేసింది కదా! అదే కంపెనీ అహ్మదాబాద్లో ఎందుకు 519 కోట్లతో భూమి కొనుగోలు చేసింది. ఏపీలో మాత్రం అతి తక్కువ మొత్తానికి విలువైన భూమిని లీజుగా పొందింది? దీనికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?ఆ కంపెనీ ఉత్పత్తులపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా పట్టించుకోలేదే! కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు ఇవ్వడం, మరికొన్నిటికి వేల కోట్ల రాయితీలు ఇవ్వడంం, ఉర్సా వంటి సంస్థలకు భూముల అమ్మకం వంటివి సమర్ధనీయమేనా? ఆ రాయితీలు ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ఇచ్చేది. ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవని ఒక ముద్ర వేసి వాటి ఆస్తులను ప్రైవేటువారికి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటి?చంద్రబాబు హయాంలోనే ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయా? లేక కంపెనీలను మూసి భూములు అమ్ముకుంటున్నాయా? అన్న శంక పలువురిలో ఉంది. దానిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా? ప్రజల పన్నులతోనే సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులను సంపన్నులను చేయడానికి వాడవచ్చా? దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా?లేదా? సెయిల్తో పోల్చితే సొంత గనులు లేకపోయినా ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు. అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టకుండా,ఎలాగైనా ప్రైవేటువారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు. ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ కాదనరు. కాని ఆ రోజు సెంటిమెంట్ అని ఆంధ్రుల హక్కు అని , ఈరోజు తెల్ల ఏనుగు అని అనడం, ప్రశ్నలు వేసిన మీడియావారిపై కస్సుమనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్ని ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. అదికారం వచ్చాక వారిని ఏమి ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 35 విభాగాలను ప్రైవేటువారికి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. కొన్నివేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్రభుత్వానికి ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్నదాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటిగా ఉన్న ఈ ప్లాంట్ భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలాకాలం గా స్పష్టంగా ఉన్నా,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు దీనిపై కార్మికులను ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులువాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయవద్దని తీర్మానం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంనై అభాండాలు మోపారు.ప్లాంట్ కు ఉన్న భూములలో కొంత భాగాన్ని అమ్మి ప్లాంట్ ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు పెట్టారే!ఇప్పుడు ఏకంగా భూమితో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటువారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు కాని, రాజకీయ పార్టీల నేతలు కాని విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్దంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలుఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. ఇది పుండుమీద కారం చల్లడమే అవుతుందనిపిస్తుంది. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సూపర్ సిక్స్ అని, ఎన్నికల మానిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా! అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎలా కరెక్టు అవుతుందన్నది వారి సందేహంగా ఉంది. నిత్యం అసత్య ప్రచారాలతో కాలాక్షేపం చేస్తున్న చంద్రబాబు సర్కార్ లోని మంత్రులకు ఎందుకు జితాలివ్వాలని జనం అడగవచ్చా? ప్రభుత్వంలోని సిబ్బందికి కూడా ఇలాగే ఏమైనా కండిషన్లు పెట్టబోతున్నారా?అని వారు అడుగుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాలలో , హెలికాప్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు తరచుగా పర్యటిస్తున్నారు కదా!వారికి అలా తిరిగే అధికారం ఉందా?లేకపోతే ఈ ఖర్చును జనం ఎందుకు భరించాలి. దేశవ్యాప్తంగా మరో నాలుగు ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి, ఆ రాష్ట్రాలలో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట. కాని ఆంధ్రులకు ఆ చేవ లేదని భావించిందో ఏమో కాని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది.దానికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబాయిస్తున్నానులే అనుకుంటుండవచ్చు. కాని ఉత్తరాంధ్రకే కాదు.. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కు ఆయన ద్రోహం చేసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?
చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ ల చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ లో కొంతకాలం క్రితం వరకు ఉన్న గవర్నర్ కు, సిపిఎం ప్రభుత్వానికి మద్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్నాటక ,పంజాబ్, పశ్చిమబెంంగాల్ రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్రాలలో ఇది రాజకీయ దుమారంగా ఉంటోంది. తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి ఉంచారు. దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మూడు నెలల గడువులోపు బిల్లులపై నిర్ణయం చేయాలని తీర్పు ఇచ్చింది. అది సంచలనంగా మారింది. కాని కేంద్రం దీనిని అంగీకరించలేదు. రాష్ట్రపతి ఈ విషయంలో పద్నాలుగు ప్రశ్నలు సంధిస్తూ సుప్రింకోర్టుకు లేఖ రాశారు.ఆ మీదట రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రాష్ట్రపతి,గవర్నర్ లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. అలాఅని సుదీర్ఘ సమయం తీసుకోవడం కూడా సరికాదని,ఫెడరల్ స్పూర్తికి విరుద్దం అన్నప్పటికీ, అలా వ్యవహరిస్తే పరిష్కారాన్ని సుప్రింకోర్టు సూచించినట్లు అనిపించదు.ఇది దేశంలో భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ,రాజ్యాంగ సంక్షోభాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కేంద్రం కనుక దీనిని తనకు అనుకూలంగా మలచుకుని రాష్ట్రాలపై గవర్నర్ ల ద్వారా మరింత పెత్తనం చేయవచ్చు.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.ఒకవేళ రాష్ట్రాలు ఏదైనా రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని రూపిందిస్తే దానిపై నిపుణులైన న్యాయ కోవిదులతో పాటు ,వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుని గవర్నర్ లు నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాటు చేయడం అవసరం అనిపిస్తుంది.. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం,లేదా పునస్సమీక్షకు అసెంబ్లీకి తిరిగి పంపడం అనే ఆప్షన్లు ఉన్నాయని అంటూనే గడువు పెట్టలేమని చెప్పడం వల్ల రాజకీయ సమస్య అయ్యే అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యను చూస్తే ఆపివేలయాలన్న బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపడం అనేది ఆప్షన్ కాదని, నిబంధన అనడం బాగానే ఉంది. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. న్యాయమూర్తుల మనసులలో గవర్నర్ ల అధికారాలపై అనుమానాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నిబంధనను గవర్నర్ లు పట్టించుకోకపోతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మరింత స్పష్టత అవసరం అనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్దం కానప్పటికీ, గవర్నర్ లు కావాలని బిల్లులను ఆమోదించకుండా ఉంటే ఏమి చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న.ప్రజాస్వామ్యంలో గవర్నర్ లు పెత్తనంపై ఇంతవరకు చాలా చర్చ జరిగింది. సర్కారియా కమిషన్ వంటివి దీనిపై విస్తృతంగా పరిశీలన చేసి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చట్టసభలలో మెజార్టీ పై గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలలోనే రుజువు చేసుకోవాలన్న సూత్రం అప్పటి నుంచే వచ్చింది. 1980,90 వ దశకాలలో ఉమ్మడి ఎపితో పాటు పలు రాష్ట్రాలలో గవర్నర్ ల తప్పుడు నిర్ణయాల వల్ల రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. మెజార్టీ లేని పార్టీ నేతలకు కేంద్రం లోని పెద్దల సలహాల మేరకు పట్టం కట్టి నాలుక కరచుకున్న ఘట్టాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు గవర్నర్ ల వ్యవస్థ ఉండరాదని వాదించేవారు. ఆయన సీఎం.గా ఉన్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్ కుముద్ బెన్ జోషి తో తరచు వివాదాలు ఏర్పడేవి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాలలో గవర్నర్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాకపోతే ఆయన ఎప్పుడూ ఒక స్థిరమైన విధాన నిర్ణయానికి కట్టుబడి లేరు. యుపిలో గవర్నర్ కు వ్యతిరేకంగా బిజెపి అగ్రనేత వాజ్ పేయి ఏకంగా నిరాహార దీక్షకు దిగిన సందర్భం కూడా ఉంది. పశ్చిమబెంగాల్ లో గతంలో గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంఖడ్ కు, ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఎంత పెద్ద రగడ నడిచింది ఇటీవలి చరిత్రే. చివరికి ధంఖడ్ ఒక సందర్భంలో అసెంబ్లీ వద్దకు వెళితే గేటు కూడా తెరలేదు. ప్రస్తుత గవర్నర్ తో కూడా వివాదం సాగుతోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే టీఎంసీ పార్లమెంటు సభ్యుడు ఒకరు రాజ్ భవన్ లో ఆయుధాలు ఉన్నాయని ఆరోపించారు. దానిపై ఆయన మీద కేసు పెట్టడం, అందుకు ప్రతిగా గవర్నర్ ఆఫీస్ పై ఎమ్.పి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు బిల్లుల ఆమోదం తో పాటు పలు అంశాలపై బిజెపి ప్రభుత్వ నియమిత గవర్నర్ లు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్.డి.ఎ. యేతర ప్రభుత్వాలు గుస్సగాఉన్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్సీ నియామకాలపై గవర్నర్ లు ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్.డి.ఎ.పాలిత రాష్ట్రాలలో గవర్నర్ లు రాష్ట్రాల అభిమతం మేరకు నడుచుకుంటారు. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు సాగేది. ఈ నేపధ్యంలో మంత్రివర్గ సలహాను కూడా గవర్నర్ లు విధిగా పాటించనవసరం లేదని సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సరికొత్త సంక్షోభాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కొందరు న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అధికారం కాకుండా, నామినేటెడ్ గవర్నర్ లకు అధికారం ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పెట్టుబడులు.. అంకెల గారడీ.. అదన్నమాట సంగతి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా?లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా ఐదేళ్లలో ఏభై లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు. పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అలా మాట్లాడడమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు, గణాంకాలు చెబితే అది అసత్యమైనా నమ్మేవారు కూడా ఉంటారు.పదిహేనేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కాని ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని లక్ష్యమన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే మూడేళ్లలో విశాఖలోనే ఐదు లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనించడం లేదూ! ఈ సమ్మిట్ లో మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్ని వినడానికి ఎంత బాగుంటాయి. నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది!గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడి ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈ సారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాలలో కలిగింది. దీనిని పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా, పండగలా జరిగినా సంతోషించవచ్చు. కాని ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలం అయినట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఈ ఒప్పందాలన్నిటిని మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కాని గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఏంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా, అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే యత్నం చేసేవారు. ఆయన టైమ్లో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి.రెన్యుబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారని అంటూ అబద్దాన్ని చెప్పడాన్ని మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా, అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. అంటే వచ్చేసారి వైఎస్సార్సీపీ గెలిస్తే ఎలా అని పెట్టుబడిదారులలో ఉన్న సందేహం అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం చేశారు. దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మితే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడతారు అంతేకాదు.. ప్రముఖ పారిశ్రామికేత్త జిందాలపై తప్పుడు కేసు పెట్టి వేధించే యత్నం కూటమి సర్కార్ చేసిందా?లేదా?ఆయన ఏపీకి రాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్డడానికి ఎందుకు సిద్ధమయ్యారు. లోకేష్ విరచిత రెడ్ బుక్ ప్రబావం గురించి పారిశ్రామికవేత్తలకు తెలియదా! నిజానికి చంద్రబాబు టైమ్లో వచ్చిన పరిశ్రమలకన్నా అధికంగా జగన్ టైమ్లోనే గ్రౌండ్ అయ్యాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం వచ్చినా అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆయన ఏపీకి రప్పించగలిగారు. జగన్ ప్రభుత్వ టైమ్లో జరిగిన సమ్మిట్ లో రిలయన్స్ ముకేష్ అంబానీ వచ్చి భారీ పెట్టుబడిని ప్రతిపాదించారు. జగన్ చెంతనే కూర్చుని సదస్సుకు నిండుదనం తెచ్చారు. మరి ఇప్పుడు అంబానీ ఎందుకు రాలేదో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్లో పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆదిత్య మిట్టల్, నవీన్ జిందాల్, బివిఆర్ మోహన్ రెడ్డి, భంగర్, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరిగిన సమ్మిట్లో కరణ్ అదాని తప్ప మిగిలిన ప్రముఖులు పలువురు ఎందుకు రాలేదో తెలియదు. కరణ్ అదాని తన ప్రసంగంలో ఏమి చెప్పారు?. విశాఖలో వస్తున్నది అదాని డేటా సెంటర్ అని, దానికి గూగుల్ భాగస్వామి అవుతోందని ప్రకటించారా?లేదా? దానిపై చంద్రబాబు, లోకేష్లు కిమ్మనలేకపోయారే? ఆదాని డేటా సెంటర్ తో పాటు ఐటి బిజెనెస్ సెంటర్ కు ఆనాడు జగన్ శంకుస్థాపన చేసిన సంగతి విస్మరించి, అంతా గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలని ప్రయత్నించి భంగపడడం ప్రభుత్వానికి ఏ పాటి మర్యాద అవుతుంది.ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు అప్పుడూ వచ్చారు. ఇప్పుడూ వచ్చారు. 2014-19 టరమ్లో కూడా చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి, తదుపరి మళ్లీ ఏభై లక్షల ఉద్యోగాలు అన్నా, కోటి ఉద్యోగాలు అన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలు అని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు.కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైమ్లో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్, ఎనర్జీస్, వంటి కొన్ని సంస్థలు సుమారు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్లీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు దానినే లోకేష్ కూడా ఫాలో అవుతున్నారు.ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమలవారు తరలి వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు కాని, విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలవారు చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్దతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నారని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు.ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్బుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం చిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ లోకేష్కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎల్లో మీడియా ఏడుపు... జగన్కు దిష్టిచుక్క!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనసందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లోమీడియా కూడా గుక్కపెట్టి రోదిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్తా.. వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఏభైవేల మందికి పైగా జనం ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయి వెంట పరుగెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జనసందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలామందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని ఈవీఎంల ప్రభావమో, పోలింగ్ సమయం తరువాత పోలైనట్టుగా చెబుతున్న సుమారు ఏభై లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుడు, ఇప్పుడు జగన్వైపే ఉన్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఒక రాప్తాడు మాత్రమే కాదు.. తుపాను బాధితుల పరామార్శకు మచలీపట్నం వెళ్లినా అదే జన కెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని నెలల క్రితం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలివచ్చినంత జన తరంగం కనిపించింది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏమాటకామాట. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మాదిరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒకరు రఫ్పా,రప్ఫా అని సినిమా డైలాగును పోస్టరు రూపంలో ప్రదర్శించినా తప్పుడు కేసు పెట్టే ఆలోచన చేయలేదు. ఏపీలో అయితే జగన్ అభిమానులు కదిలితే కేసు. మాట్లాడితే కేసుగా ఉంది పరిస్థితి. జగన్ మచిలీపట్నం టూర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై కేసులు పెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టారు. హైదరాబాద్లోనూ తరగని జగన్ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ చానళ్లలో పిచ్చి వాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జంట్గా జగన్పై కేసులను తేల్చేయాలట. వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటివారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లు మాట్లాడారు. మరో చోటా నేత జగన్ను ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ కోసం ఆ రకంగా రావడం ఏమిటని ప్రశ్నించారు. చాలాచాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు. జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయరాదు.అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. జగన్ కోర్టు హాలులో నిలబడితే అదేదో తప్పు అన్నట్లుగా ప్రచారం చేశారు. కోర్టులో జగన్ సాక్ష్యుల స్థానాలలో కూర్చుని కనిపించారని మరొకరి ఆక్షేపణ. న్యాయమూర్తి రావడానికి ముందు ఎవరైనా కోర్టులో కూర్చోవచ్చు. దీనిపై వైసిపి నేత, మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. కోర్టులో వీడియోలు తీయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయనను హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకు రావాలని పోలీసు అధికారులు భావించారు.కాని చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. బస్సులోనే ప్రయాణిస్తానని పట్టుబట్టారు. పోలీసులు ఒప్పుకుని నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. అది అప్పట్లో పోలీసులు వ్యవహరించిన పద్దతి. కాని ఇప్పుడేమో ఎలా ప్రవర్తిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు. చిలకలూరిపేట మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బస్సు వద్ద హడావుడి చేశారు. నినాదాలు చేశారు. చంద్రబాబు విజయవాడ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన కూడా తన లాయర్ పక్కన కూర్చున్న సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తదుపరి ఆయన కూడా లేచి నిలడ్డారు.ఆ సన్నివేశాలను ఎవరూ రికార్డు చేయలేదు. ఆరోగ్య సమస్యల పేరు చప్పి చంద్రబాబు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీ ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అది తమ సంస్కృతి అని పొన్నవోలు అన్నారు. కాని ప్రస్తుతం టీడీసీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య సమస్యలు ఏమయ్యాయో కాని రాత్రంతా గంటల తరబడి ర్యాలీ చేసి రాజమండ్రి నుంచి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అప్పుడు ఈనాడు ‘‘జైలు నుంచి జనం గుండెల్లోకి’’ అని శీర్షిక పెట్టింది. దారి పొడవునా నీరా'జనాలు"అని రంకెలేసింది. చంద్రబాబుకు నిజంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లవార్లూ ర్యాలీ చేయవచ్చా అని ప్రశ్నించలేదు. జగన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం ఇదే పత్రిక ‘‘జగన్ మార్కు బలప్రదర్శన’’ అని ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఆయన అనుచరులు హల్ చల్ చేశారట. అంతకు ముందు బందరు ప్రాంతానికి వెళ్లినప్పుడైతే ‘‘అడుగడుగునా అరాచకమే’’ అంటూ నీచమైన శీర్షిక పెట్టింది. హైవేపై గుమికూడదని పోలీసులు షరతు పెట్టడాన్ని కూడా సమర్థించి తన లేకి బుద్ది ప్రదర్శించుకుంది. చంద్రబాబు హైవేలపై ర్యాలీ తీసినప్పుడు, పుంగనూరు వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ను దగ్ధం చేసినప్పుడు మాత్రం ఈ మీడియాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. చంద్రబాబు కందుకూరులో రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా అది పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ తన వికృతత్వాన్ని అంతా ప్రదర్శించి జగన్కు హైదరాబాద్లో ప్రజాస్పందనపై ఒక వ్యాసం రాసి అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్పై లేనట్లు ఆ విషయాలేవి ప్రస్తావించకుండా, జగన్ కేసులపైనే నీచాతినీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే, సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఉతికి ఆరేశారు.అయినా వారేమి సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏది ఏమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బలుపెట్టినా, జగన్కు దిష్టి తీసిన చందమేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
క్రెడిట్ చోరీ: నవ్వి పోదురు గాక...
పాలన నిరంతర ప్రక్రియ. పార్టీలు మారవచ్చేమో కాని, ప్రభుత్వ వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూంటాయి. అయితే ఏ ప్రభుత్వమైనా అమలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కాకపోతే గత ప్రభుత్వంలో అమలు చేసినవాటిని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం.. ప్రచారం చేసుకోవడం నగుబాటుకు దారితీసే అవకాశాలే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నది అదే. చంద్రబాబు క్రెడిట్ చోరీ గురించి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఇప్పటికే చాలాసార్లు విమర్శించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఇందులో వాస్తవమూ లేకపోలేదు.ఇతరుల శ్రమను తనదిగా చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. ఎదుటివారు నమ్ముతారా? లేదా? అన్న పట్టింపు కూడా అస్సలు ఉండదు. అన్నమయ్య జిల్లాలో ఇటీవలి ఘటననే ఉదాహరణగా తీసుకుందాం. పేదల కోసం నిర్మించిన ఇళ్ల ఆవిష్కరణ ఇది. బోలెడంత ఖర్చు చేసి దీనిపై ప్రకటనలూ గుప్పించారు. కానీ.. ఈ ఇళ్లన్నీ 2024 తరువాత నిర్మించినట్టుగా చెప్పుకోవడంతో చిక్కు వచ్చిపడింది. గత ప్రభుత్వం మంజూరు చేసి, కొంతమేర పూర్తి చేసిన ఇళ్లను తాము పూర్తి చేశామని చెప్పి సరిపోయేదేమో కానీ.. అంతా తమ ఘనతేనని చెప్పుకోవడంతో పూర్వాపరాలపై ఆరాదీయాల్సి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యాక పేదలెవరికి ఇంటి స్థలం ఇచ్చినట్లుకాని, కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లుగాని లేదు. దీంతో అంతలోనే మూడు లక్షల ఇళ్లు ఎలా పూర్తి చేశారన్న సందేహం వచ్చింది. రికార్డులు పరిశీలిస్తే చంద్రబాబు క్రెడిట్ చోరీ వ్యవహారం తెలిసింది. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తే అందరికీ 2021-22లోనే స్థల కేటాయింపు, నిర్మాణ వ్యయం మంజూరీలు జరిగినట్లు స్పష్టంగా ఉంది. అప్పట్లో జగన్ ఇచ్చిన సెంటు భూమి శవం పూడ్చేందుకు సరిపోతుందని ఇదే చంద్రబాబు విమర్శించిన విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. తాను అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇస్తానని చెప్పి... క్రెడిట్ చోరీకి మాత్రమే పరిమితమైపోయారు. ఇదే కార్యక్రమంలో ఒక అధికారి సీఎంను ఆకాశానికి ఎత్తేశారు. దేవుడితోనూ పోల్చారు. మరీ అంత స్వామి భక్తా? అని ముక్కున వేలేసుకోవడం ప్రజలవంతైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ మొత్తమ్మీద 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలూ జరిగిపోయాయి. ఇవే జగనన్న కాలనీలు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేరును ఎన్టీఆర్ కాలనీలుగా మార్చారు. అంతే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును నాటకాల రాయుడు అంటూ జగన్ ఎద్దేవ చేశారు. రాష్ట్రానికి తెచ్చిన కంపెనీల విషయంలోనూ బాబు సర్కారు క్రెడిట్ చోరీకి పాల్పడిందన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ.. ప్రజల్లో నవ్వులపాలవడంతో వాయిదా వేసుకుంది. పైగా... జగన్ హయాంలో పరిశ్రమలే రాలేదని, ఉన్నవాటిని తరిమేసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు తప్పుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలు వల్లెవేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వరుల రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీగా పెట్టుబడులు ఆకర్శిస్తోందంటూ మంత్రి లోకేశ్ ఇటీవల ఎక్స్ వేదికగా పంచుకున్నది కూడా జగన్ హయాంలో జరిగిన విశాఖ సమ్మిట్లో తెచ్చిన ప్రతిపాదనే. అప్పటి ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాలో భూమి కేటాయిస్తే కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాకు తరలించి అదేదో కొత్త ప్రాజెక్టు అన్న కలరింగ్ ఇస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వచ్చాయి. విశాఖలో అదాని డేటా సెంటర్ విషయంలోనూ ఇదే జరిగింది. గూగుల్ డేటా సెంటర్ అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. అందువల్లనేమో అదాని కూడా ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం రాస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందన్న విమర్శ వచ్చింది. గతాన్ని తరచి చూస్తే.... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్ పోర్టు తదితర అభివృద్ది కార్యక్రమాలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాగాయి. కొన్ని ఆయన టైమ్లోనే పూర్తి అయ్యాయి. కాని అవన్ని తనవల్లేనని చంద్రబాబు క్రెడిట్ తీసుకునే యత్నం చేశారు. చివరికి హైదరాబాద్లో పాతబస్తీ ముస్లింలను కోటీశ్వరులను చేశానని, హైదరాబాద్ బిర్యానిని, ముత్యాలను తానే పాపులర్ చేశానని.. చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకరని, హైదరాబాద్లో కోటీశ్వరులకు ఎన్నడూ కొరత లేదన్న ఓ యూట్యూబర్ సమాధానమైనా చంద్రబాబు కళ్లు తెరిపించిందేమో తెలియదు! అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడం కూడా తన పనే అని చెబుతుంటారు. విశేషం ఏమిటంటే ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ అణు పరీక్షల్లో కీలక భూమిక పోషించిన కలాం అప్పటికే సుప్రసిద్ధుడు. వాజ్ పేయి వంటి నేతలకు సన్నిహితుడు. అయినా ఆ క్రెడిట్ కూడా తనదేనన్న భ్రమ కల్పించడానికి చంద్రబాబు యత్నించారని ఆ రోజుల్లో వ్యాఖ్యలు వచ్చాయి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు అనుభవం ఎందులో?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తరచూ కోటలు దాటుతూంటాయి. చిత్రి విచిత్రంగానూ అనిపిస్తాయి. ఒకసారేమో అనుభవజ్ఞుడైన డాక్టర్లాంటి వాడినైన తనకే రాష్ట్రం నాడి అంతచిక్కడం లేదంటారు. ఇంకోసారి... అర్థం కాకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేస్తున్నా అంటారు. మరోసారి.. ఇంకోటి. చంద్రబాబు గారికి అనుభవమున్న మాట నిజమే కానీ.. ఎందులో? అన్నదే ప్రశ్న. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కడంలోనా? పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడంలోనా? రాజకీయాల కోసం వ్యక్తిత్వాలను హననం చేయడంలోనా? పదవి దక్కించుకునేందుకు నాడు ఎన్టీఆర్పై.. నిన్న మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు, కుట్రలు పన్నారో ప్రజలందరూ చూశారు కాబట్టి ఆయన అనుభవం వీటిల్లోనే అని అనుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారనాలి. ఇంకో విషయంలోనూ ఈయనగారి నేర్పరితనం మెండు. ఇతరులు చేసిన గొప్ప పనులను తన ఖాతాలో వేసేసుకోవడం. జగన్ దీన్నే క్రెడిట్ చోరీ అన్నమాట. అధికారంలోకి వచ్చేవరకు ఒక మాట, ఆ తరువాత ఇంకోమాట మాట్లాడటంలోనూ మాంచి అనుభవం సంపాదించారు. ఒకప్పుడైతే ఈయన గారి పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఉపయోగం ఉండేదేమో కానీ.. సోషల్మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో మాత్రం చెల్లడం లేదు. చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాటలు మార్చే విషయంలో ఘనమైన రికార్డే సృష్టించారు. జగన్ ప్రభుత్వంపై వీరిద్దరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారో, ఇప్పుడేమి మాట్లాడుతున్నారో పోల్చుతూ అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అప్పట్లో వీరితోపాటు చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా విపరీత ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పు రూ.14 లక్షల కోట్లను జగన్ ఒక్కడే చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దీంట్లోని డొల్లతనం ఏమిటన్నది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర కాకముందే రికార్డు స్థాయిలో రూ.2.20 లక్షల కోట్ల అప్పులు చేసి దేశంలోనే నెంబర్ ఒన్గా నిలిచారు.ఈ అప్పు ఏపీ కొంప ముంచుతుందని తెలిసినా ప్రజలు మాట్లాడకుండా ఉండేందుకు ఆయన తన అనుభవాన్ని ఉపయోగించగలరు. మద్యం విషయంలోనూ ఇంతే. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లేని ఆరోపణలు చేశారు.. తాము పెత్తనం చెలాయించే సమయంలో సొంత పార్టీ వారే అన్ని రకాల నకిలీ దందాలు చేస్తూ పట్టుబడ్డా నిమ్మకు నీరెత్తడంలేదు. ఎన్నికల సమయంలో ఏటా రూ.1.5 లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని నమ్మబలికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదెలా సాధ్యమని ప్రశ్నించిన వారికి... సంపద సృష్టి చంద్రబాబు అనుభవం ఉందంటూ చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం సంపద సృష్టికి సలహాలు ఇవ్వండని బాబే ప్రజలనే కోరడం ఆరంభించారు. 1994లో ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్న చంద్రబాబు మునుపటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడానికి శ్వేతపత్రాల తంతు నిర్వహించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఆయనకు అప్పటి నుంచే తెలుసన్నమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ పాలనను విమర్శిస్తూ మీడియా ద్వారా కథనాలు రాయించేవారట. కాంగ్రెస్తో కలిసి జగన్పై కేసులు పెట్టడంలో, ఆయనపై వచ్చిన ఆరోపణలను వంద రెట్లు అధికం చేసి ప్రచారం చేయడంలోను చంద్రబాబు తన అనుభవం మొత్తాన్ని రంగరించారు. స్వార్ద రాజకీయ ప్రయోజనాలకే తన అనుభవాన్ని వాడుతున్నారని తెలిసి ప్రజలు కొన్నిసార్లు ప్రజలు చంద్రబాబును ఓడించారు. తదుపరి ఆయన వ్యూహం మార్చి కాపీ రాగంలోకి వచ్చేస్తుంటారు. ఉదాహరణకు జగన్ తన ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక కొత్త వ్యవస్థల పేర్లు మార్చి అవేవో తాను సృష్టించిన వాటిగా చూపించే యత్నం చేయడం. జగన్ 2019లో తీసుకొచ్చిన నవరత్నాలను అప్పట్లో గేలి చేసిన చంద్రబాబు ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు, చేర్పులతో 2024 మానిఫెస్టోలో పెట్టుకున్నారు. జగన్ అమలు చేసినవాటిని కొనసాగిస్తూనే అనేక అదనపు స్కీములను ప్రజలకు అందచేస్తానని ఊరించారు. వాటిని ఇప్పుడు అమలు చేయలేక చతికిలపడి, ఆ మాట నేరుగా చెప్పకుండా జగన్ టైమ్లో ఏదో విధ్వంసం అయిందని, అందువల్ల తాను చేయలేకపోతున్నానని ప్రజలను నమ్మించడానికి తన అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏపీలో సుపరిపాలన కూడా వచ్చేసిందట.సెల్ ఫోన్ లోనే పనులన్నీ అయిపోతున్నాయట.అది నిజమే అయితే కొద్ది రోజుల క్రితం లోకేశ్ పార్టీ ఆఫీస్ కు వెళితే నాలుగు వేల మంది ఎందుకు క్యూలో నిలబడి తమ సమస్యలు తీర్చాలని అర్ధించారో చెప్పాలి. గ్యాస్ ఇచ్చే బాయ్ టిప్ అడుగుతున్నాడా అని తెలుసుకుంటున్న చంద్రబాబుకు తన పార్టీ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్న డబ్బుల గురించి, టిక్కెట్ల అమ్మకాల గురించి తెలుసుకోలేకపోయారని అనుకోవాలి.ఉమ్మడి ఏపీకి చంద్రబాబు 21 ఏళ్ల క్రితం సీఎంగా ఉండేవారు. అయినా ఇప్పటికీ హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని గప్పాలు పోతుంటారు. ఔటర్ రింగ్ రోడ్డుతోసహా ఆయన పాలన తర్వాత జరిగిన అభివృద్ది అంతటిని తన ఖాతాలో వేసుకోవడంలో దిట్ట అని ఒప్పుకోవల్సిందే. హైదరాబాద్ను ఇటుక,ఇటుక పేర్చి అభివృద్ది చేశానని ప్రచారం చేసుకునే ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారో చెప్పరు. మొన్నటిదాక పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వస్తున్నాయని చెప్పేవారు.ఇక ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేశారు. విశాఖ సదస్సు ద్వారా మరో రూ.13 లక్షల కోట్లు వస్తాయని చెబుతున్నారు. ఇలా అతిశయోక్తులతో కూడిన మాటలు చెప్పడంలో అసత్యాలు వల్లె వేయడంలో చంద్రబాబు మొనగాడని చెప్పక తప్పదు. ఏది ఏమైనా చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాభివృద్ది ఆశించడం అత్యాశే అవుతుందేమో!కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈనాడు ‘స్వామి’ భక్తి పారవశ్యం!
వ్యాపార ప్రయోజనాల కోసం ఏనాడో ప్రజాహితాన్ని వదిలేసిన ఈనాడుకు అకస్మాత్తుగా ఎక్కడలేని భక్తి పుట్టుకొచ్చింది. అయితే ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీదా? లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీదా? అన్నది తేలాలి. ఈ అనుమానం వచ్చింది కూడా ఈనాడు రాసిన ఓ దిక్కుమాలిన సంపాదకీయం తరువాతే. ‘‘వైకాపాసురుల మహాపచారాలు’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తనకున్న అక్కసంతా వెళ్లగక్కుకుంది ఆ పచ్చమీడియా సంస్థ. కానీ.. ఆ క్రమంలోనే హిందూ మతానికి తీరని ద్రోహం చేస్తోందన్న సంగతి మరచిపోయింది. పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద అభియోగం ఏమిటి? ఆ తర్వాత ఈ అంశంపై విచారణ జరుగుతున్న తీరు ఏమిటి? లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఈనాడు మీడియా ఇప్పుడు ఎందుకు కప్పిపెడుతోంది? అసలు మొదలు ప్రశ్నించాల్సిన విషయాన్ని డైవర్ట్ చేయడం ఈనాడు మీడియా నీచ జర్నలిజానికి నిదర్శనం. చిత్తుశుద్ధి ఉంటే సంపాదకీయం ద్వారా ప్రశ్నించాల్సింది రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిని కదా? కల్తీకి ఆధారాలు ఏమిటి నిలదీయాలి కదా? దానికి సంబంధించిన విచారణ కాకుండా ఏదేదో కల్తీ అంటూ కొత్త కథలు సృష్టిస్తూ విచారణనున ఇష్టారీతిన నడిపిస్తే అది స్వామి వారిపట్ల అపచారమే అవుతుంది. ఈనాడుకు అంత భక్తే ఉంటే, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి గోదాములో లక్షల కిలోల గోమాంసం పట్టుబడిన సంగతిని ఎందుకు ప్రస్తావించడం లేదు. తప్పు పట్టలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? అలాగే పిఠాపురం వద్ద జరుగుతున్న దారుణ నెయ్యి కల్తీపై నోరు మెదపదు ఎందుకు? జంతుకొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకూ పంపించారని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎందుకు తప్పు పట్టలేదు? ఈ ఆరోపణలో నిజం లేదని ఇదే ఈనాడు ఇటీవల కథనం ఒకటి ప్రచురించింది కదా? పవన్ చేసిన పాపం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇవన్నీ హిందూ మతానికి అపచారం చేసినట్లు కాదన్నది ఈనాడు నమ్మకమా? ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏమారుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు వికృత రాతలు రాయడాన్ని ప్రజలు కనిపెట్టలేరని అనుకుంటోందా? బాబుపై ప్రీతితో ఆఖరికి ఈ మీడియా సంస్థ నకిలీ మద్యం తయారీదారుల కొమ్ముకాస్తోంది.టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొక్కిసలాట మరణాలు, మాంసాహారం భుజించడం, మద్యం సీసాలు దొరకడం వంటి అపచారాలు, ఈనాడు మీడియాకు పవిత్ర కార్యక్రమాలుగా కనబడుతున్నాయోమే తెలియదు. జంతు కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించవద్దని జగన్ అప్పట్లో చెబితే వక్రీకరించి జగన్ అబద్దాలు చెప్పారని రాసి ఈనాడు అల్పబుద్దిని ప్రదర్శించింది. రామోజీరావుకు దైవ భక్తి పెద్దగా లేదు. కాని ఆయన కుమారుడు కిరణ్ మాత్రం భక్తి విశేషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై అసత్య కథనాలతో పాటు, ఏకపక్షంగా సంపాదకీయం రాసి తాను నమ్మే స్వామి వారికి కిరణ్ కూడా తీరని అపచారం చేశారు!తిరుమల లడ్డూపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణకు హాజరైన టీటీడీ మాజీ కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి చెప్పిందేమిటి? ఈ మీడియా రాసిందేమిటి?పైగా ఆ మీడియా సేకరించిన సమాచారం అంతా సత్యమన్నట్లు సంపాదకీయం కూడా రాసేసి తెలుగుదేశం పార్టీపై, కూటమి ప్రభుత్వంపై ఎనలేని భక్తిప్రపత్తులు చాటుకుంది. లవలేశమైనా నిజాయితీ ఉన్నా తొలుత తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలో వాస్తవం ఏమిటన్నది రాయాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దానిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని, సిట్ను ప్రశ్నించాలి కదా! దర్యాప్తు అంతటిని ఎలాగొలా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారరెడ్డికి చుట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం, మరో వైపు ఈనాడు, ఎల్లో మీడియా పాట్లు పడుతోంది. ఎవరో ఒకరిని పట్టుకోవడం, వారితోటే ఆ రోజుల్లో అక్రమాలు జరిగాయని వాంగ్మూలం ఇప్పించుకోవడం,తదుపరి తాము అనుకున్న వైఎస్సార్సీపీ నేతను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకుంది. నెయ్యి తక్కువ ధరకు కొన్నందున అందులో కల్తీ ఉందనే అభిప్రాయానికి వస్తే, 2014-19లో అంతకంటే తక్కువ ధరకు చేశారు కదా? అప్పుడు కూడా ఇలాగే జరిగిందా? టీడీపీ, వైఎస్సార్సీపీ రెండింటి హయాంలో పలుమార్లు నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యి టాంకర్లను వెనక్కి పంపించారు కదా? ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. టీటీడీకి సంబంధించిన లేబొరేటరీలు ఎప్పుడైనా కల్తీ అంశాన్ని కనిపెట్టాయా? ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్టు చేశాయా? అయినా చర్య తీసుకోలేదా? అన్నదానికి జవాబు దొరకదు. రెండేళ్ల క్రితం పంపిణీ చేసిన లడ్డూ కల్తీ నెయ్యితో చేసిందని చెప్పడానికి మెటిరీయల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? తిరుమలకు వచ్చిన నెయ్యిలో వెజిటబుల్ ఫాట్ అంటే డాల్డా వంటివి కలిసి ఉండవచ్చన్న అనుమానం వచ్చే కొన్ని టాంకర్లను వెనక్కి పంపించారు కదా? అలాంటిది రసాయనాలతో తయారు చేసినవాటిని పట్టుకోలేరా? ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చిందట. దీనికి ఆధారం చెప్పకుండా ఏమిటో ఈ అర్ధం లేని రాతలు! పైగా సంపాదకీయమట. ధర్మారెడ్డి సిట్ అధికారులను ఎదురు అనేక ప్రశ్నలు వేశారు. అయినా ఆయన టీటీడీ ఛైర్మన్ ఒత్తిడి తెచ్చారని, అందువల్లే నెయ్యి కొన్నామని చెప్పినట్లు ఎల్లో మీడియా రాసుకుంది.ఈ అంశాన్ని సిట్ అధికారులు అధికారికంగా ఏమైనా వారికి వెల్లడించారా? ధర్మారెడ్డి ఏదో చెప్పారంటూ అది నిజమో కాదో, నిర్దారించుకోకుండా అడ్డగోలుగా ఈనాడు సంపాదకీయం రాసుకున్నట్లు అనిపించడం లేదా? ధర్మారెడ్డి ఒకవైపు తన వాంగ్మూలం గురించి ఒక వర్గం మీడియా అవాస్తవాలు రాస్తోందని చెబతే దానిని పట్టించుకోరా? తాను విచారణలో చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా ప్రచారం చేసింది మరొకటని ఆయన స్పష్టం చేశారు. కల్తీ జరగకుండానే ఏదేదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి సిట్ అధికారులకు కూడా స్పష్టం చేశారని చెబుతున్నారు కదా! తక్కువ ధరకు కోట్ చేసేవారికే నెయ్యి టెండర్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న విధానమని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో కేవలం రూ.276లకే కిలో నెయ్యి కొనుగోలు చేశారన్న వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో పర్చేజ్ కమిటీలో ప్రస్తుత మంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు. మరి వారికి కూడా దీనితో సంబంధం ఉండాలి కదా! ఇంతవరకు వారిని ఎందుకు విచారించలేదు? అంతా అయిన తర్వాత ప్రభుత్వం వారికి కావల్సిన రీతిలో సాక్ష్యం ఇప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారా? కల్తీ జరిగినా మీరు ఎందుకు చర్య తీసుకోలేదని సిట్ అధికారులు లీడింగ్ ప్రశ్న వేసినప్పుడు ధర్మారెడ్డి సూటిగా సమాధానం ఇస్తూ, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని అని ఎదురు ప్రశ్నించారు. టీటీడీ రికార్డులు చూసుకుంటే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయని కూడా స్పష్టం చేశారట. తొలుత జంతు కొవ్వు అన్నారు.. తదుపరి కల్తీ నెయ్యి అని చెప్పారు.. ఆ తర్వాత రసాయనాలు కలిశాయని అంటున్నారు. తాజాగా ఆయా కంపెనీల టర్నోవర్ను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కల్పిత మద్యం కేసులో కూడా ఇలాగే ఇద్దరు సాక్ష్యులు చెప్పని అంశాలను ప్రస్తావించి కోర్టుకు సమర్పించారట.దాంతో ఆ సాక్ష్యులు ఎదురు తిరిగి హైకోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశారు. ఇలా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో అసలు అంశాలను పక్కదారి పట్టించడానికి ఇంకెన్ని కథలు పుట్టుకువస్తాయో చూడాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ పరపతి పెంచిన జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చే అంశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. గెలుపు ద్వారా పార్టీలో తన పట్టు పెంచుకున్నాడు. రాష్ట్రంలో తనపై వ్యతిరేకత పెరుగుతోందన్న వదంతులు పుంజుకుంటున్న సమయంలో దాన్ని పూర్వపక్షం చేసేందుకు రేవంత్ ఈ ఉప ఎన్నికలను వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘట్టం మొదలైనప్పుడు రాజకీయ వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్లు విస్తృత ప్రచారం చేశారు కూడా. కాంగ్రెస్ తరఫున తొలుత ముగ్గురు.. ఆ తరువాత మరింత మంది మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్సహా ఇతర నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆగలేదు. రేవంత్ స్వయంగా పలు సభలు నిర్వహించారు. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటి అర సభల్లో పాల్గొనడం కద్దు. కానీ రేవంత్ ఈ రిస్క్ తీసుకోలేదు. ఎప్పటికప్పుడు అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరించుకుని తన వ్యూహాలకు పదును పెట్టుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం అలాంటిదే. మైనార్టీ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ను మంత్రిని చేసేశారు. అంతేకాక ఆ వర్గం బాగా బలంగా ఉన్న చోట మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు మనుగడ అన్న రీతిలో ప్రసంగాలు చేశారు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్కు లాభించింది. రాజీలేకుండా డబ్బులు ఖర్చు చేశారన్న అభిప్రాయమూ సర్వత్రా ఉంది. వీటన్నింటి ఫలితంగా అప్పటివరకూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న మౌత్ టాక్ కాస్తా చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్కు పాజిటివ్గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా డబ్బు పంపిణీ చేసినా అది అధికార పక్షానికి సరితూగలేదని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఎలా గెలిచారన్నది ముఖ్యం కాకుండా పోతోంది. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం పెరిగిపోతోంది. గెలిచాక మాత్రం ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం రివాజుగా మారింది. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దుబ్బాక, హుజూరాబాద్లలో తప్ప, మిగిలిన ఉప ఎన్నికలలో విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి వచ్చారు. అయినా బీఆర్ఎస్ గెలవగలిగింది. బీజేపీ జూబ్లి హిల్స్ ఉపఎన్నికను అంత సీరియస్గా తీసుకోలేదు. ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేనలు ప్రచారంలో పాల్గొనలేదు. పైగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. గత సాధారణ ఎన్నికలవరకు కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లు కనిపించేది కాదు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం, కేసీఆర్పై ఘాటైన విమర్శలు చేయడం,నాయకులందరిని ఏకం చేయడం తదితర వ్యూహాలతో అధికారంలోకి తేగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విజయం ద్వారా అసమ్మతి ఆలోచన చేసే నేతలు కూడా కిమ్మనే పరిస్థితి ఉండదు. అధిష్టానం వీక్ గా ఉండడం, బీహారులో దారుణమైన పరాజయం చెందడం కూడా రేవంత్ కు కలిసి వచ్చే అంశమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసిందనాలి. నవీన్పై కుటుంబపరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరిగేలా చేసుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జరిగిన ఈ ఉప ఎన్నికకు సానుభూతి ఉపకరిస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను ఎంపిక చేసుకుంది. అయినా అది ఫలించలేదు. కాకపోతే గత లోక్సభ ఎన్నికలలో మాదిరి మూడో స్థానంలోకి పడిపోకుండా గట్టిపోటీ ఇవ్వగలగడం, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని కేడర్లో కలిగించే విధంగా 74 వేల ఓట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ కు 99 వేల ఓట్లు రావడం బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందే అయినా, లోక్ సభ ఎన్నికలతో పోల్చితే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాం కదా అన్న భావన కలుగుతుంది. అధతికార దుర్వినియోగంతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. బీజేపీ పరిస్థితి మాత్రం కాస్త గడ్డుగా మారిందనే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం పరువు తక్కువే. బీహారులో ఎన్డీయే విజయ దుందుభి మోగించిన తరుణంలో జూబ్లిహిల్స్లో ఈ రిజల్ట్ రావడం మింగుడుపడని విషయమే. అయితే వచ్చే ఎన్నికలకు హిందూ ఓట్ల పోలరైజేషన్కు కృషి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాగా ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన అంతా సజావుగా ఉందని కాంగ్రెస్ భావిస్తే అది తప్పే అవుతుంది. విజయం సాధించారు కనుక ఆ ఉత్సాహం ఉంటుంది.కాని దాని వెనుక ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు చేయాల్సి వచ్చింది వారికే తెలుసు. ఏపీలో 2018 నాటి నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి విజయం కోసం అన్ని వ్యూహాలు అమలు చేశారు. తద్వారా గెలవగలిగారు.కాని ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆ సీటు మళ్లీ వైసీపీ పరమైంది.అన్నిసార్లు అలా జరగాలని లేదు.కాని అలాంటి ఉదాహరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అడుగుజాడలోనే నడిచి ఉప ఎన్నికలో గెలిచారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులకు, హైడ్రా యాక్టివిటి అంతటికి ప్రజామోదం లభించిందని కూడా అనుకోరాదు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల రేవంత్ పరపతి పెరిగే మాట నిజం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు విస్తృతార్థం పవన్కు తెలుసా?
రాజకీయ పరిపాలన అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే తెలియదా? ఒకవైపు సీఎం చంద్రబాబేమో పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆ విషయం తెలిసినా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబుకు అసంతృప్తి కలుగుతుందో అని దానిని ఎమ్మెల్యేలపై నెట్టివేస్తూ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేల దందా గురించి పవన్ ప్రస్తావించడం తప్పు కాదు. కాకపోతే అదేదో కేవలం ఎమ్మెల్యేలకి సంబంధించిన అంశమని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది.నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన సాగాలి కాని చంద్రబాబు నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు కూడా అధికారులకు పార్టీ పరమైన ఆదేశాలు ఇస్తూ మొత్తం వ్యవహారాన్ని ఏకపక్షం చేస్తున్నారు. టీడీపీ ఐడీ కార్డుతో వచ్చే వారిని కూర్చొబెట్టి మర్యాదలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సూచన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా పోలీసు వ్యవస్థ వారి జోలికి వెళ్లడానికే జంకుతోంది. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. రాజకీయ పాలన అని దీనికి ముద్దు పేరు పెట్టుకున్నారు.మరి పవన్ కళ్యాణ్ ఏమని అర్థం చేసుకున్నారో తెలియదు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక విస్తృతార్థంలో పొలిటికల్ గవర్నెన్స్కు ప్రాధాన్యమివ్వాలని చెబుతుంటే.. కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ చిన్న పనికోసం వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, ప్రజల ఆస్తి వివాదాలలో కూడా తలదూర్చుతున్నారని దీనివల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన మందలించారట. జనసేన ఎమ్మెల్యేనే అరాచకాలు చేస్తుంటే ఆయన నిరోధించలేక పోయారన్నమాట. కాని రాజకీయ పాలన అంటే చంద్రబాబు విస్తృతార్థం ఏమిటో పవన్కు తెలుసా?. చంద్రబాబు ఉద్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ఏ పని చేయకపోవడం, ఆ పార్టీ అభిమానులకు స్కీమ్లలో కోత పెట్టడం, సోషల్ మీడియా, సాక్షి వంటి మీడియా ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే పొలిటికల్ గవర్నెన్స్.అలాగే.. వేల కోట్లు అప్పులు తేవడం, కాణీ, అణాలకు ఎకరాలకు ఎకరాల భూమి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం. ఆఖరుకు టీడీపీ ఆఫీసులకు తక్కువ మొత్తానికి భూమి లీజులకివ్వడం కూడా రాజకీయ పాలనే అవుతుంది. అయితే, టీడీపీ మాదిరిగానే జనసేన పార్టీకి కూడా భూములు కేటాయించాలని మంత్రి దుర్గేశ్ కోరారట. టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న విషయం పవన్కు తెలియదా? రాష్ట్రంలో 90 శాతం మద్యం దుకాణాలను టీడీపీ వారికే దక్కేలా చేసింది నిజమే కదా?.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. పార్టీలు, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగానే చెప్పారు. అదేం పద్దతి? అని పవన్ అప్పుడు అడిగి ఉంటే గౌరవంగా ఉండేది. కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వడం లేదని, అధికారులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నారని పలు వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం భూముల రిజిస్ట్రేషన్లలో కూడా ఎమ్మెల్యేల దందా ఏంటని ఎల్లో మీడియా కూడా రాసింది. అప్పుడు తానే సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఆ ప్రకారం సుమారు 35 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయినా ఆ తర్వాత ఏమీ కాలేదని పవన్ వ్యాఖ్యల ద్వారా అర్దం అవుతుంది.టీడీపీ నాయకత్వం ఆదేశాలను పట్టించుకోని వారి సంఖ్య 48కి పెరిగింది. వారికి నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఆఫీస్కు ఆదేశాలు ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే వారు పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం లేదట. అందుకే నోటీసులు ఇచ్చారట. అంతే తప్ప, భూమి, లిక్కర్, ఇతర స్కాంలలో భాగస్వాములు అవుతున్నారని కాదట. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓపెన్గా టీడీపీ నేతల భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి అమ్మకాలలో కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనుషులు భాగస్వాములు అవుతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి చర్య తీసుకోకపోగా, వాటన్నిటిని బయటపెడతావా అంటూ కొలికపూడి పార్టీ లైన్ దాటారంటూ ఆయనను మందలించే స్థితిలో టీడీపీ ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ ప్రకారం పార్టీ నాయకులు అక్రమాలు చేసినా ఫర్వాలేదు కాని, అవి బయట పడకూడదనే కదా!. మరి పవన్ కళ్యాణ్కు అర్థమైన విస్తృతార్థం ఏమిటో?.ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ కోరినప్పుడు చంద్రబాబు ఏం జవాబు ఇచ్చారో తెలుసా? ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారమే తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్చార్జీ మంత్రులదే అని చెప్పారు. అంటే ఆ రకంగా చంద్రబాబు చేతులు దులుపుకున్నారన్నమాట. దీని గురించి పవన్ ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు?. రాష్ట్రంలో పరిస్థితి ఎంత అరాచకంగా ఉందనే విషయం పవన్ కళ్యాణ్కు తెలియదా?. టీడీపీ ఎమ్మెల్యే జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న ఆరోపణలు వస్తే పవన్ కనీసం స్పందించలేకపోయారే!. శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలలో ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన ఆరోపణలు వస్తే చర్య తీసుకోవాలని పవన్ కోరారా?. సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పటికీ రేషన్ మాఫియా కొనసాగుతోందని అనేక వార్తలు వస్తుంటే ఎందుకు నోరెత్తడం లేదు?.రాష్ట్రంలో జూద కేంద్రాలు నడుస్తున్నాయని భీమవరం డీఎస్పీపై తీవ్ర ఆరోపణలను పవన్ చేస్తేనే దిక్కులేదే!. అది నిజమా? కాదా? అన్నది కూడా చెప్పలేదే!. అయితే, ఒక్కటి మాత్రం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కేబినెట్ సమావేశాలలో, ఇతరత్రా వీలైనప్పుడు పవన్ను పొగిడేసి చంద్రబాబు ఖుషీగా ఉంచుతున్నారని అనుకోవాలి. అంతేకాక పవన్ తన పదవిని ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వెళ్లాలన్నా, మరెక్కడికి వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లతో సమానంగా ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే తమకు కావల్సిన వారికి వందల ఎకరాల భూమిని పందేరం చేసుకుంటున్నారు. పవన్ సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్తకు 1200 ఎకరాల భూమి కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేయడం రాజకీయ పాలన కిందకు వస్తుందేమో తెలియదు. విశాఖలో టీడీపీ నేత గోడౌన్లో పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడితే కిమ్మనకపోవడం, పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతున్న తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగడం వంటివి జరిగినా నోరెత్తినట్లు వార్తలు రాలేదు. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల లబ్ది పొందుతున్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నీతులు చెబితే కుదురుతుందా?. అందుకే కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల మాటేమిటి?. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్నారట. మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ది పొందడం తప్పు కాదు కాని, అచ్చంగా రాజకీయాలు చేయడమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు!
సంపద సృష్టించి మరీ ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళతానని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. కానీ గత ఏడాది జనసేన, బీజేపీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన గారి సంపద సృష్టి అసలు రహస్యం ప్రజలకు అర్థం కాలేదు. అప్పులు, రెవెన్యూ లోటుల్లో మాత్రం ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసేశారు. ఒకప్పటి బీమారు రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రుణాల విషయంలో బాగా మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలోని అంశాలు.ఏపీలో చంద్రబాబు అండ్ కో.. పాలన, అభివృద్ధి వంటి విషయాలపై కాకుండా.. ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై కేసులో పెట్టడంలోనే బిజీ అయిపోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్పై కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమోనని ఓ సీనియర్ పాత్రికేయుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వాన్నంగానే ఉందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఆహో, ఓహో అంటూ డబ్బా కొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు కాస్త భిన్నమైన కథనం రాయడం ద్వారా ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తీసుకువచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో కలిసి ఎల్లో మీడియా నానా రచ్చ చేసేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని, అదంతా జగన్ ప్రభుత్వమే చేసిందేమో అన్న అనుమానం కలిగేలా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లేనని తేలింది. జగన్ టైమ్లో అప్పులు అంటూ గోలగోలగా చెప్పిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్షన్నర కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. అది అసాధ్యమని జగన్ అంటే, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్దాలు చెప్పారు. ఎల్లో మీడియా తాన తందానా అని పాట పాడేవి. ఇప్పుడేమో ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోటెత్తిన లోటు అని కథనాలు ఇస్తున్నారు. మరి అప్పుడు అన్ని చేసేస్తామని చెప్పారు కదా.. ఇప్పుడేమిటి ఇలా చేతులెత్తేస్తున్నారని వారు ప్రశ్నించరు. ఎవరైనా అడిగితే వారిపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా అన్నదానిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటోంది.తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్ధిక నిర్వహణ చేసినట్లు వెల్లడవుతుంది. కూటమి ప్రభుత్వం 2025-26లో రెవెన్యూ లోటు రూ.33185 కోట్లు అంచనా వేస్తే ఆరు నెలలకే రూ.46652 కోట్లకు చేరిందని కాగ్ వెల్లడించింది. ఇది అధికారుల అంచనా తప్పా? లేక లక్ష్య సాధనలో వైఫల్యమా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ పని ఎటూ చేయరనుకోండి. దాదాపు రూ.2.17 లక్షల కోట్ల రెవెన్యూను అంచనా వేస్తే రూ.74234 కోట్లు మాత్రమే వచ్చాయి. ఖర్చు మాత్రం రూ.120887 కోట్లుగా లెక్కగట్టారు. బడ్జెట్ రూపొందించిన సమయంలో అంచనా వేసిన ఆదాయంలో కేవలం 34 శాతం మాత్రమే ఇప్పటికి వచ్చిందట. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32284 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని భావిస్తే, ఈ ఆరు నెలల్లో రూ.4014 కోట్లే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది మొత్తానికి తీసుకోవాలని తలపెట్టిన రూ.79926 కోట్ల రుణంలో ఆరు నెలల్లోనే 78 శాతం పైగా, అంటే రూ.63వేల కోట్ల రుణాన్ని తీసేసుకుంది. ఇది దేశంలోనే అత్యధికం.2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు కేవలం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయారు. అదే 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉన్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. ఒకప్పుడు ఆర్థిక నిర్వహణలో ఉత్తరప్రదేశ్ అట్టడగున ఉండేది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహారులు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. అప్పులు, ఆర్ధిక నిర్వహణలో యూపీ బాగా పనిచేస్తున్నట్లు అనుకోవాలి.ఉత్తరప్రదేశ్ ఈ ఆరు నెలల్లో కేవలం రూ.9332 కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ (రూ.49100 కోట్లు), తెలంగాణ(రూ.45139 కోట్లు) అధిక అప్పులు చేసిన రాష్ట్రాలలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం రెండేళ్లపాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుణాలు తీసుకోండని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా, అదేదో జగన్ తప్పు పనిచేసినట్లు ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పని చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు పదివేల కోట్లు కాని, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల ఆర్ధిక సాయం కాని జగన్ సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్ అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కాని ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇతర రాష్ట్రాలలో వృద్ధిరేటు కనిపిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా ఉంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా రాసిన కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం పథకంతో జీఎస్టీ జోష్, ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్దికాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత జీఎస్టీ తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అంటూ కూడా ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని రాస్తోంది. సేవింగ్స్కు సూపర్ మస్కా, రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని రాస్తోంది. మొదటేమో అద్భుతమని ప్రచారం చేయడం, ఒక్కో కుటుంబానికి రూ.25 వేల రూపాయల నుంచి నలభై వేలు సేవ్ అవుతున్నాయని ప్రభుత్వానికి డబ్బా కొట్టడం, ఇప్పుడేమో సేవింగ్స్ కనిపించడం లేదని చెప్పడం.. ఇలా ఉంది ఎల్లో మీడియా తీరు.ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.249350 కోట్ల మేర అప్పులు చేసిందని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో ఐదేళ్లలో రూ.332670 కోట్లు అప్పుచేస్తే శ్రీలంక అయిపోయిందని విష ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలు చేసిన వాగ్దానాలలో అనేకం అమలు చేయకుండానే దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, వచ్చే సంవత్సరాలలో ఇంకెంత అప్పు చేస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక, ఇప్పటికి జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమోకాని, ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బ్లాక్మెయిల్ రాజకీయాలు!
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ నేతల వ్యాఖ్యలు చూస్తే రాజకీయాల్లో బ్లాక్మెయిలింగ్ ఎంత కీలకమైపోయిందో అర్థమవుతుంది. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో కాలేజీలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అసలు బ్లాక్మెయిలర్ సీఎం అని విమర్శించారు. హరీశ్ ఇంకో అడుగు ముందుకేసి సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించేవారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్లు హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్గా మారారని రేవంత్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆయా వర్గాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్నంతా దీనికోసమే వాడేస్తున్నారు. చంద్రబాబు అనుంగు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది.తెలంగాణలో ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలు బంద్కు దిగాయి. ఒక రోజు బంద్ తర్వాత చర్చలు జరిగి కొంత పలించాయి. ఈలోగానే రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆ కాలేజీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పినా వినకుండా కాలేజీలను బంద్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీల అండ చూసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. కాలేజీల యాజమాన్యాలు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ను నష్టపరచేలా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయంతో సీఎం అంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వైపు ఉన్న లోపాలను కూడా సరి చేసుకుంటామని చెప్పి ఉండాల్సింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రభుత్వాలు ఇంత అధ్వాన్నంగా పని చేస్తున్నాయా అన్న భావన కలిగించాయి. విద్య సేవ మాత్రమే అని, వ్యాపారంలా చేస్తూ సహించేది లేదని ఆయన అన్నారు. వ్యాపార తెలివితేటలు చూపిస్తే చట్టప్రకారంగా ముందుకు వెళతానని కూడా రేవంత్ హెచ్చరించారు. భవనాలు, ల్యాబ్లు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉన్నారో, లేరో చూడడానికి విజిలెన్స్ అధికారులు వస్తారంటే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి ఎంత మొత్తం డొనేషన్లు వసూలు చేస్తారో తమకు తెలుసునని, వచ్చేసారి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తానని రేవంత్ అన్నారు. ఈ మాటలు వింటే ముఖ్యమంత్రే కాలేజీలను బెదిరిస్తున్నారన్న భావన కలగదా? కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే శక్తి ఎంత ఉంటుందన్నది ఒక ప్రశ్న. సమయం చూసి ఆయా సంఘాల వారు ప్రభుత్వాలను బెదిరించేలా వ్యవహరించడం కొంత వాస్తవమే కావచ్చు. ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుంటాయి. అవి నెరవేర్చకపోతే సమ్మెలు చేస్తామని కూడా హెచ్చరిస్తుంటాయి. అయితే కాలేజీల డిమాండ్ సహేతుకత ఉందో, లేదో చూడాలి. సుమారు 1200 కాలేజీలకు సుమారు రూ.3600 కోట్లు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వీరి ఆందోళనలు స్పందించిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి చర్చలు జరిపి రూ.300 కోట్లు విడుదలకు అంగీకరించారు. కానీ అందులో రూ.60 కోట్లు మాత్రమే విడుదలైనట్లు సమాచారం. దీంతో కాలేజీలు మళ్లీ బంద్ పిలుపు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. ఉప ఎన్నిక సమయంలో ఇది పెద్ద ఇష్యూగా చేయవచ్చని, ప్రభుత్వం దిగి వస్తుందని అనుకుని ఉండవచ్చు. తదుపరి మల్లు భట్టి వీరితో మళ్లీ చర్చలు జరిపి రూ. 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పి రాజీపడ్డారు. ఈలోగానే రేవంత్ కాలేజీలపై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కాలేజీల యాజమాన్యాలపై ఆయన ఆరోపణలు చేసిన తీరులో ప్రభుత్వ బలహీనతలు కూడా బయటపడ్డాయి. కాలేజీలు తగిన మౌలిక సదుపాయాలు లేకుండానే కాలేజీలు నడుపుతున్నట్లు.. ఆ మేరకు ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. లేదా తమను డబ్బు అడగనంతవరకు ఎలాగోలా చేసుకునివ్వులే అని వదలివేసినట్లే కదా!దీనివల్ల విద్యా ప్రమాణాలు పడిపోయినా, విద్యార్ధులకు సరైన బోధన జరగకపోయినా, ప్రభుత్వం రాజీ పడినట్లే కదా! అధికారులు తమ బాధ్యతలు నిర్వహించడం లేదని వెల్లడైనట్లే కదా! విద్య అన్నది సేవ అని, వ్యాపారం కాదని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని కాలేజీల నిర్వహణకు డబ్బులు అవసరం. రీయంబర్స్మెంట్ హామీలిచ్చిన రాజకీయ పార్టీలు దాన్ని నెరవేర్చకపోతే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. లేదా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. కాలేజీలు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని అన్నారు. వచ్చేసారి అలా జరగనివ్వబోమని కాలేజీలను రేవంత్ బెదిరిస్తున్నారా! అసలు డొనేషన్లు ఎలా వసూలు చేస్తున్నారు? వాటిలో రాజకీయ పార్టీల నేతలకు ఎంత మేర వాటాలు ఇస్తున్నారు? వాటిని నియంత్రించవలసిన ప్రభుత్వమే ఇలా మాట్లాడితే వ్యవస్థలో ఉన్న డొల్లతనం తెలిసిపోవడం లేదా?ప్రభుత్వం తన విధులను సక్రమంగా చేయడం లేదని అంగీకరించినట్లే అవుతుంది కదా!యాజమాన్యాల నేత ఆరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగారని సీఎం వెల్లడించారు. వాటిని ఇవ్వనందునే బ్లాక్ మెయిల్కు దిగారని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఆరోరా రమేష్ తప్పు చేస్తుంటే చర్య తీసుకోవల్సిన సీఎం ఇలా బేలగా మాట్లాడడం ఏమిటో తెలియదు. కాలేజీలను బంద్ పెట్టిన తర్వాత చర్చించడానికి ఏముంది అని రేవంత్ అన్నప్పటికి, మరో వైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వీరితో సంప్రదింపులు జరిపి రాజీ కుదుర్చుకున్నారు.బహుశా రేవంత్ అనుమతితోనే ఇది జరిగి ఉంటుంది. ఈలోగానే ఆయన ఇన్ని మాటలు మాట్లాడితే పలచన అయ్యేది ఆయన ప్రభుత్వమే కదా!కొద్ది కాలం క్రితం ఏపీలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.3000 కోట్లు రాబట్టుకునేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేశాయి. ప్రభుత్వం ఆసుపత్రుల యజమానులను బెదిరించినట్టుగా వార్తలొచ్చాయి. చివరకు కొంతమేరకు నిధుల విడుదలతో సమ్మె విరమణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాలేజీల ఫీ రీయంబర్స్మెంట్ మొత్తం కూడా రూ.4000 కోట్ల వరకూ ఉంది. సకాలంలో చెల్లించకపోవడం వల్ల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతూ నిత్యం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. తెలంగాణలో సైతం అదే మాదిరి ప్రభుత్వాన్ని నడపడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కొంత బెటర్ అయినప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.ఇదే సందర్భంలో రేవంత్ మరికొన్ని విషయాలు చెప్పారు.ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు అని, ఇందులో వేతనాలు,పెన్షన్లకు రూ.6500 కోట్లు, కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీతోసహా అసలు కట్టడానికి రూ.6500 కోట్లు పోతే మిగిలేది 5500 కోట్లేనని వెల్లడించారు. ఈ మొత్తంతోనే అభివృద్ది కార్యక్రమాలు, ఫీజ్ రీయంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర స్కీములు అంటూ పెద్ద జాబితానే చదివి వీటిలో దేనిని ఆపాలో,దేనిని అమలు చేయాలో చెప్పాలని ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ చెప్పాలని అనడం వింతగా ఉంటుంది.ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి.ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తామని ఎలా చెప్పగలిగారు?అప్పుడు ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెబితే, సూపర్ సిక్స్ అంటూ ఏపీలో తెలుగుదేశం,జనసేన కూటమి ఊదరగొట్టింది.వంద రోజుల్లో గ్యారంటీలను చట్టబద్దం చేసి, అన్నిటిని అమలు చేసి చూపుతామని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆ రోజుల్లో ఎలా చెప్పారు?చంద్రబాబు అయితే తనకు సంపద సృష్టించడం తెలుసునని, తద్వారా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేస్తానని ప్రచారం చేశారు.తీరా అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ ఇప్పుడు ఆర్దిక కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారు. కేసీఆర్ అప్పుల కుప్ప చేసేశారని రేవంత్ ఆరోపించడం వవల్ల ఉపయోగం ఏమి ఉంటుంది. అవన్ని తెలిసే ఆనాడు మాట్లాడారా?లేదా? చంద్రబాబు నాయుడు సైతం ఖజానా ఖాళీగా కనబడుస్తోందంటూ ప్రజల ముందు మాట్లాడుతున్నారు.రెండు రాష్ట్రాలలోను ప్రస్తుతం ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? ఏపీలో రికార్డుస్థాయిలో అప్పులు చేశారే? ఎదుటివారిపై ఆరోపణలు చేయడానికి ముందు తాము ఏమి చేస్తున్నామో కూడా గమనించాలి కదా!అధికారంలోకి రావడానికి ముందేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక ఇలా వ్యవహరించడం చూస్తే దీనిని బ్లాక్ మెయిలింగ్ అని ప్రతిపక్షాలు విమర్శించవా?అందుకే రేవంత్ పై హరీశ్ రావు ఆరోపణలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పరిశ్రమల వారిని, రియల్ ఎస్టేట్ వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాలేజీలు,తదితర వర్గాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ బకాయిలు అడిగితే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఏమిటి అని హరీశ్ ప్రశ్నించారు.కాగా జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయన్నట్టుగా రేవంత్ మాట్లాడడాన్ని కూడా బ్లాక్ మెయిలింగ్ అన్న ప్రచారం జరిగింది. రేవంత్ కూడా ఇలా ప్రసంగం చేసి ఉండాల్సింది కాదు. గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగితే ఆనాడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు తను వేసిన రోడ్లను వాడుకుంటూ తనకు ఎందుకు ఓటు వేయరని, తను ఇచ్చిన ఇల్లు, తను ఇచ్చిన బాత్ రూమ్ ఉపయోగించుకుంటున్నారని,కనుక తన పార్టీకే ఓటు వేయాలని ప్రజలను హెచ్చరించిన ఘట్టాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.కాగా హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని, కేటీఆర్ ఆరోపిస్తే, హైడ్రా ద్వారా ప్రజలకు మేలు చేస్తుంటే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.ఏది ఏమైనా రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్నికలకు ముందు ఒకరకంగాను, ఆ తర్వాత మరో రకంగాను వ్యవహరించడం మామూలు అయింది.ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు మారుతుందా అన్నది సందేహమే.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలే అప్పు.. అపై దుబారా!
‘‘అప్పు చేసి పప్పు కూడు’’ అని ఒక సామెత. ‘‘నాడా దొరికింది.. గుర్రాన్ని కొందాం’’ అనేది ఇంకో నానుడి. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారుకు బాగా వర్తిస్తాయి. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. ఇప్పటికే రూ.26 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. తాజాగా ఇంకో రూ.32500 కోట్లు తీసుకుంటోంది. ప్రభుత్వ అవసరాల కోసం చేసిన రూ.1.60 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ.55 వేల కోట్లు దీనికి అదనం. అమరావతిలో రూ.91639 కోట్లతో 112 పనులు చేపడుతూంటే అందులో సుమారు రూ.53,338 కోట్ల వ్యయమయ్యే 87 నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వీటిలో ప్రధాన మౌలిక వసతుల కల్పన, రైతులకు కేటాయించిన స్థలాల లే-అవుట్ల అభివృద్ధి, పరిపాలన నగరంలో హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్ టవర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటి పనులు చేపడతారట. ఇవేవీ ప్రభుత్వానికి కొత్తగా ఆదాయం తెచ్చేవి కావు. అవసరమైన నిర్మాణాలకు ఓకేగానీ.. భూమి సేకరించాం కనుక, అనవసరమైన నిర్మాణాలు చేపట్టడం ఎంత వరకూ ఉపయోగకరం? ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి వందల కోట్లు వ్యయం చేశారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మూడువేల మంది సిబ్బంది కూడా ఉండని సచివాలయం కోసం ఏభై అంతస్తుల టవర్లు నిర్మించబోతున్నారట. అంతకుముందు 2014 టర్మ్లో ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో సుమారు రూ.పది వేల కోట్లు వెచ్చించింది. అప్పులు చేసి ఇలా దుబారా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు, కొన్ని చోట్ల రహదారుల నిర్మాణానికి కిలోమీటరుకు ఏకంగా రూ.75 కోట్ల నుంచి రూ. 174 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవడం చూస్తుంటే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే. హైదరాబాద్లో ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న భవనాల్లో చదరపు అడుగు ఖర్చు నాలుగైదు వేలకు మించడం లేదు. కానీ అమరావతిలో భూమి ఖర్చు లేనప్పటికీ చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క రాజ్ భవన్ నిర్మాణానికే రూ.212 కోట్లు వెచ్చించబోతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది కుడి గట్టుకు 1.71 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.303 కోట్లు వెచ్చించబోతున్నారు. గత ప్రభుత్వం రూ.474 కోట్లతో 5.66 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించింది. అంటే కిలోమీటర్కు రూ.84 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం కిలోమీటర్కు రూ.177.5 కోట్లు పెడుతోందన్న మాట. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చాలాసార్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదని చెబుతుండేవారు. సేకరించిన భూముల్లో వాడుకోగా మిగిలిన భూముల అమ్మకంతో నిధులు సమకూరతాయని నమ్మబలికేవారు. కానీ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో తదితర సంస్థల ద్వారా రూ.అరవై వేల కోట్ల అప్పు చేసేశారు. ఇంకెన్ని వేల కోట్ల అప్పు తీసుకుంటారో తెలియదు. ఇదేదో కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తోందని అనుకుంటే ఓకే కానీ.. అంతా ఏపీ ప్రజలపై రుణభారం పెంచే వ్యవహారమే. కేవలం 29 గ్రామాల పరిధిలో చేసే ఖర్చు బరువును అన్ని ప్రాంతాల వారూ భరించాల్సిందే కదా?అమరావతిలో ఇప్పటికి సేకరించిన 33 వేల ఎకరాల భూమి, అందుబాటులో ఉన్న 20 వేల ఎకరాలు సరిపోదని, మరింత సేకరించకపోతే అది మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రైతులను బెదిరిస్తున్నారు. మరో 44వేల ఎకరాల భూమిని తీసుకు తీరతామనే సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాక తొలిదశలో భూములు ఇవ్వని సుమారు 1800 ఎకరాలకు చెందిన రైతుల నుంచి బలవంతపు భూ సేకరణకు రెడీ అవుతున్నారు. ఏదో తమకు కాస్త ఆదాయం వస్తుందిలే అని ఆశించిన రైతులకు ఈ పరిణామాలేవీ మింగుడు పడడం లేదు. కొత్తగా భూమి సమీకరణ జరిగితే ఆ ప్రాంతం అభివృద్దికి మరో లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తానఇన కూడా అప్పుగా పరిగణిస్తే వడ్డీలతో కలిపి ఏపీపై రుణభారం రకంగానే అప్పులు చేసుకుంటూ పోతే, అప్పులు, వడ్డీలు కలిసి ఐదు లక్షల కోట్లు మించినా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిలో రూ.24790 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానించడానికి కిలోమీటర్కు రూ.174.4 కోట్లు అంచనా వేశారు. ఇప్పటికే నిర్మించిన సీఆర్డీయే భవనానికి రూ.338 కోట్లు వ్యయం చేశారు. చదరపు అడుగుకు రూ.11 వేలు పడిందని వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు చెప్పారు. ముంబైలో స్టార్ హోటల్ నిర్మాణానికి చ.అ. రూ.4500 మాత్రమే అవుతోందని ఆయన వివరించారు. 2016లో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణానికి రూ.1150 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్ఓడిల కోసం రూ.4688 కోట్లతో భారీ టవర్లను నిర్మిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఐదారు వేల కోట్ల రూపాయలు లేవని చెబుతున్న ప్రభుత్వం ఈ రకంగా వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాళంగా ఖర్చు చేయవచ్చా? చత్తీస్ఘడ్ తాజాగా ఆవిష్కరించిన కొత్త అసెంబ్లీ భవనం వ్యయం కేవలం రూ.325 కోట్లు. ఏపీలో మాత్రం సోకులకు పోతూ భారీ ఎత్తున వ్యయం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఆర్డీయే అధికారులు రైతుల సమావేశం ఏర్పాటు చేసి రాజధానిలో చేపట్టే ఇళ్లకు ప్రహరీ గోడలు కట్టకూడదని, విదేశాలలో ఉన్నట్లుగా ఇళ్లను నిర్మించుకోవడంతో పాటు గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. అలాగే నిర్దిష్ట ప్లాట్ల సైజు ప్రకారమే కాలనీలు ఉండాలని.. ఇలా రకరకాల సూచనలు చేస్తే రైతులకు ఇదేమిటా అని తలపట్టుకోవాల్సి వచ్చిందట.రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను మాత్రం నివృత్తి చేయలేకపోయారట. అసలు ప్లాట్లే ఇవ్వకుండా, ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా గ్రీనరీ, నిబంధనలు అని ఆదేశాలు ఇవ్వడమేమిటో అని రైతులు ప్రశ్నించారట.ఈ ప్రాజెక్టు ఒక వైపు 2034 కు పూర్తి అవుతుందని ప్రపంచ బ్యాంక్ కు చెబుతూ తొలిదశ మూడేళ్లలో అవుతుందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. వీటిలో దేనిని నమ్మాలి?నిజానికి గుంటూరు-విజయవాడ మధ్య రెండు, మూడు వేల ఎకరాలలో అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాలు, హైకోర్టు, న్యాయమూర్తుల, మంత్రుల, అధికారుల నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే రూ.పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం జరిగిపోయేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో రాజధాని కార్యాలయాల కోసం వాడుతున్న భూమి వెయ్యి ఎకరాలకు మించదని అంటున్నారు. ఇలాకాకుండా.. రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుని, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడం రియల్ ఎస్టేట్ మోడల్ తప్ప మరొకటి కాదు. దానివల్ల ప్రభుత్వానికి కలసివచ్చేది పెద్దగా ఉండదు. కాని చంద్రబాబు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకోవడం కోసం ఏపీ ప్రజల నెత్తి మీద అప్పుల భారం మోపడం ఎంతవరకు కరెక్టు? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈర్ష్య.. అసూయలతో రాజకీయం ఎంత కాలం?
రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ ద్వేషంతోనో... ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందన్న సంశయంతోనో చేయకూడదు. చేస్తున్నది మంచి పనా? కాదా? అన్నది ఆలోచిస్తే రాజకీయాలలో పెడధోరణులు తగ్గుతాయి. అయితే సమకాలీన రాజకీయాలలో ప్రజోపయోగాల కంటే ద్వేషానికే పెద్దపీట పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేన, బీజేపీల కూటమి సర్కార్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈర్ష్యా, అక్కసులతో చేస్తున్న కొన్ని పనులు వారికే చేటు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలతోపాటు ఆయన చేసిన అభివృద్దిని కూడా విధ్వంసం చేసే రీతిలో సాగుతోంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి, సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచిత ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అందరిని విస్మయపరుస్తోంది. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించింది. నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గా పేరొందిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఒక పెద్ద లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన విజ్ఞాన వేదిక, రిక్రియేషన్ సెంటర్.. వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు సంకల్పించింది. కొన్నిటి నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. దీంతో అంబేద్కర్ మహా శిల్ప కేంద్రానికి గ్రహణం పట్టింది. అధికారంలోకి రావడంతోనే కూటమి పార్టీ నేతలు కొందరు ఈ కేంద్రంపై దాడి చేసి, జగన్, అంబేద్కర్ పేర్లను తొలగించారు. విమర్శలు రావడంతో అంబేద్కర్ పేరును మాత్రం తిరిగి పెట్టారట. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా విస్మరించింది. చివరికి అక్కడ పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వడం లేదు. దాంతో వారు పనులు చేయకపోవడంతో ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలవారు నిరసన తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి ఒక ప్రశ్న వేశారు. ‘‘నెలకు రూ.పది లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పరిరక్షించలేని చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎలా నిర్మించగలుగుతుంది?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.టీడీపీ అంబేద్కర్ను అగౌరవ పరిచిందంటూ నెటిజన్లు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని ప్రసంగాల వీడియోలను బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం అంతంతమాత్రంగానే ఉంది. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా మాల్కు ఇవ్వడానికి ప్రయత్నించిందని, సృ్మతివనం పేరుతో అమరావతిలో ఓ మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్లాన్ చేసినా జనాగ్రహం కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని నిర్వహణ, పర్యవేక్షణలపై చేతులెత్తేసింది. ఈ తప్పును తొందరగా దిద్దుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా చేసి, ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారట. అంబేద్కర్ కేంద్రమే కాదు... విశాఖలో రిషికొండ మీద జగన్ నిర్మించిన భవనాలను కూడా కూటమి సర్కారు ఏడాదిన్నరగా పాడు పెడుతోంది. బహుశా వీటిని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించవచ్చని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణానికి పూనుకుని, కొన్నిటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని కొనసాగిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. ప్రైవేటీకరణలో భాగంగా ఇంకా మొదలుకాని కొన్ని కాలేజీల టీచింగ్ ఆస్పత్రులకు సంబంధించి విలువైన యంత్ర పరికరాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు. అందులో పులివెందుల కాలేజీ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. పులివెందుల అంటే చంద్రబాబు అండ్ కో కి ఉన్న ద్వేషం అలాంటిదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ గతంలో కుప్పంలో ప్రభుత్వ స్కూల్ను నాడు-నేడు కింద బాగు చేయించడం, కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వడానికి కృషి చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదే చంద్రబాబు మాత్రం జగన్ నియోజకవర్గమైన పులివెందుల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. పులివెందులతోపాటు రాయలసీమలోని మదనపల్లె, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కుపురం కాలేజీల నుంచి కూడా పరికరాలను తరలించారని వార్తలు వచ్చాయి. ఇది ఆ ప్రాంత ప్రజలలో ఆవేదన మిగుల్చుతుందని చెప్పాలి. టూరిజం రంగానికి చెందిన హోటళ్లు, భవనాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించారు.ఇలా ఒక్కొక్క రంగాన్ని ప్రైవేటువారికి అప్పగించేస్తే ప్రభుత్వం ఇక చేసేది ఏముంటుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలతో పాటు, ఆయా నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటువారిపరం చేయడం వంటి చర్యల ద్వారా కూటమి సర్కార్ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.దీనికంతటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషమే కారణంగా కనిపించడం లేదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎన్టీఆర్తో రేవంత్ రాజకీయం.. ప్లాన్ ఫలించేనా?
హైదరాబాద్లోని అమీర్పేట సెంటర్లో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలోనూ.. కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని బోరబండలోనూ ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.అంతేకాదు.. హైదరాబాద్లో ఎన్టీఆర్ అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరని, ఆయన విగ్రహం ఏర్పాటును ఎవరైనా వ్యతిరేకిస్తే మూసీలో పడేసి తొక్కుతామని కొన్ని అభ్యంతరకరమై వ్యాఖ్యలు ఆయన చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు బోలెడన్ని హామీలివ్వడం కొత్త కాదు కానీ.. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఏపీలో కాంగ్రెస్ను ఓడించి దేశంలోనే సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం. కాంగ్రెస్ నేతలను కుక్కమూతి పిందెలుగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన వారంటూ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున విమర్శించడం ఇప్పటికీ చాలామందికి గుర్తే. హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్యను ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ అవమానించారన్న ప్రచారాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఈ ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకున్నారు. తరువాతి కాలంలో అంటే 1989లో కాంగ్రెస్.. టీడీపీని ఓడించగా 1994లో మళ్లీ గెలిచింది. 1984లో టీడీపీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సహకారంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ, 1995లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడుతో, ఇతర కుటుంబ సభ్యుల చేతిలో పరాభవానికి గురై ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్టీఆర్ అనుకున్నప్పటికీ 1996 జనవరిలో ఆయన మరణంతో సాధ్యం కాలేదు. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఎన్టీఆర్ చరిష్మాను వాడుకోవడం ఇప్పటికీ వదల్లేదు.2001లో కేసీఆర్ నేతృత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కొన్నిసార్లు ఆంధ్ర ప్రాంత నేతల విగ్రహాలు కూడా టార్గెట్ అయ్యాయి. 1987 ప్రాంతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాలలో ఆంధ్ర ప్రముఖులవి కొందరు ఉద్యమకారులు 2012 ప్రాంతంలో ధ్వంసం చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పునరుద్దరించింది. ఇలా తెలంగాణలో నాయకుల విగ్రహాలకు కొంత చరిత్ర ఉంది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు జరిగాయి. నగరం నడిబొడ్డున ఎలా చేస్తారని వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరు లేకపోలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాట్ను ఏర్పాటు చేసి, అధికారికంగా జయంతి, వర్ధంతులు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొంతకాలం ఆ జీవోని అమలు చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ప్రభుత్వం తరపున పుష్పగుచ్చం పెట్టి నివాళి అర్పించేవారు. తదుపరి కాలంలో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు మాత్రమే అక్కడకు వెళుతుండేవారు. ఇంతలో 2009లో తెలంగాణ ఉద్యమం రావడం, రాజకీయాలు కొత్త రూపుదాల్చడం తదితర కారణాలతో ఎన్టీఆర్ ప్రస్తావన తగ్గిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించలేదనే చెప్పాలి. 2018లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పార్టీ మూల సిద్ధాంతానికే విరుద్దంగా ప్రవర్తించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఓటమి పాలైంది.2023 ఎన్నికల్లో ఒకప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడం ఏకంగా ముఖ్యమంత్రి కావడం విశేషం. చంద్రబాబుకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు మెరుగయ్యేందుకు రేవంత్ కారణమయ్యాడన్న ఒక ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ గురించి మాట్లాడింది లేదు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ ప్రస్తావన తెచ్చారు. తద్వారా టీడీపీ అభిమానుల, కమ్మ సామాజికవర్గం ఆదరణ పొందే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది.అభిమానులు కోరుకుంటున్నట్లు విగ్రహాన్ని నెలకొల్పుతామని, దుర్మార్గులు ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మూసీలో తొక్కుతామని రేవంత్ వ్యాఖ్య అంత భావ్యంగా అనిపించదు. సినీ నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్పై తెలుగు వారిలో అభిమానం ఉండవచ్చు. అంతమాత్రాన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించరాదని ఎలా అంటారు?. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా వాడుకునేందుకు మాత్రమే రేవంత్ ఇలా మాట్లాడారు అనిపిస్తోంది. అయితే, బీఆర్ఎస్ ఈ విగ్రహం ఊసే ఎత్తడం లేదు. ఎన్టీఆర్ను ఒక కుల ప్రతినిధిగా మాత్రమే చూడటం రాజకీయ పార్టీలకు అమర్యాదే అవుతుంది. విగ్రహాలను చూసి ఓట్లు వేసే రోజులా ఇవి? అలా అయితే హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంతో పాటు ట్యాంక్ బండ్పై పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్ ప్రభుత్వం 1989లో ఓటమిపాలైంది. ఎన్టీఆర్ స్వయంగా తెలంగాణ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అంతమాత్రాన విజయం సాధించిందా?.విగ్రహాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం, సెంటిమెంట్ను వాడుకోవాలని ప్రయత్నించడం రాజకీయ నేతలకు కొత్త కాకపోవచ్చు. తెలుగుతల్లి విగ్రహం బదులు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఈ కోవలోనిదే. కొత్త రూపుతో రేవంత్ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సచివాలయం వెలుపల రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య విగ్రహం ‘లక్డీకాపుల్’ వద్ద ఏర్పాటైంది. విగ్రహాల ఏర్పాటు దేశ, రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ఉంటాయి. గొప్ప నేతల నుంచి ప్రేరణ పొందడానికి నెలకొల్పుతారు. అదేమీ కొత్తకాదు. తప్పుకాదు. కాకపోతే ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడంతో దీని పూర్వాపరాలు తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు పేరు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. తద్వారా టీడీపీ లేదా, ఒక సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు.ఇక్కడ మరో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇదే తరహాలో కాంగ్రెస్ జాతీయ నేతలకు గౌరవం ఇవ్వడం లేదు. ప్రధాని మోదీ బాటలోనే ఆయన కూడా జవహర్ లాల్ నెహ్రూను విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు పునరుజ్జీవం కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖరరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన స్కీముల పేర్లను మార్చివేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్ అని పెట్టిన పేరును టీడీపీ ప్రభుత్వం తీసివేసింది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం గమనించదగిన విషయమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ముందంజలో ఉందని కొన్ని సర్వేలు రావడం కాంగ్రెస్కు ఆందోళన కలిగించింది. అవి ఫేక్ సర్వేలు అని రేవంత్ కొట్టి పారేశారు. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న ఉపన్యాసాలు ఎన్టీఆర్, పీజేఆర్ విగ్రహాల స్థాపనపై ప్రకటనలు, స్కీముల కొనసాగింపుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉందేమోనన్న అభిప్రాయానికి తావిస్తున్నాయని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడ్డుకుంటే ఆగేదా.. జనాభిమానం!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలతో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి సర్కారు వణికిపోతున్నట్లుగా ఉంది. ప్రతి పర్యటన సందర్భంగా పలు రకాల ఆంక్షలు పెట్టి.. ఎలాగైనా సరే ఆ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాపం.. వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు సరికదా.. జగన్ సభలు, పర్యటనలు జనసంద్రాలవుతున్నాయి. తాజాగా జగన్ చేసిన కృష్ణ జిల్లా పర్యటనలో కేవలం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టిందంటే.. జనాభిమానం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఇవన్నీ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలకు కడుపు మంట మిగులుస్తుంది. వారి కథనాలు చూస్తే అవి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే మీడియాను నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది. అయితే జగన్ టూర్కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. ‘‘అడుగడుగునా అరాచకమే’’ అన్న ఈనాడు కథనం చూడండి... జగన్ పోలీసులు పెట్టిన షరతులను ఉల్లంఘించారన్నది ఏడుపు. ఆంధ్రజ్యోతి కూడా జగన్ టూర్తో జనం పాట్లు పడ్డారని గొంతు చించుకుంది. అంతేకానీ ఈ ఎల్లోమీడియా పత్రికలు జనం రాలేదని మాత్రం రాయలేకపోయాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నియంత్రణకే పోలీసులు ఉంటారు. కానీ వారు ఆ పని చేయకుండా ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తున్న జగన్ అభిమానులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణలు కూడా చాలా చోట్ల పర్యటించారు. కానీ ఎన్నడూ ఈ రోజు జగన్ పర్యటనలకు పెట్టినన్ని ఆంక్షలు పెట్టలేదు. శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని, ఫలానా టూర్ చేయవద్దని పోలీసులు చంద్రబాబును చెబితే ఆయన ఊరుకోలేదు సరికదా... అంతెత్తున విమర్శించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడారు. హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు, అంగళ్లు వద్ద పార్టీ కార్యకర్తలను వైఎస్సార్సీపీపై ఉసికొల్పిన సందర్భాన్ని ఎల్లో మీడియా మర్చిపోయి ఉండవచ్చు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు దూకుడు కారణంగా ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీసు వాహనం దగ్ధమైంది. అప్పట్లో అవన్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు, అదంతా ప్రభుత్వ తప్పు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకుంది టీడీపీ, చంద్రబాబు బృందం. కందుకూరు వద్ద నడిరోడ్డు మీద సభ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినప్పుడు ఎల్లో మీడియాకు జనం పాట్లు కనిపించలేదు. వారికి ఇవి నరకంగా అనిపించలేదు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు సభ పెట్టి చీరల పంపిణీ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాట వీరికి గుర్తుకు రాదు. విజయవాడలో ఒకసారి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినప్పుడు గంటలకొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మాబోటి వాళ్లం కూడా ఒక సందర్భంలో ట్రాఫిక్లో చిక్కుకున్నాం. జగన్ సీఎంగా ఉండగా... బహిరంగ సభల్లో తొక్కిసలాటలు, మరణాలు లేకుండా చూడడానికి, నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం జీవో ఇస్తే టీడీపీ, ఎల్లో మీడియాకాని రచ్చ రచ్చ చేశాయి. సంపాదకీయాలు సైతం రాసి గగ్గోలు పెట్టాయి. కోర్టుకు వెళ్లి రద్దు చేయించాయి! జగన్ టూర్లో ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగాయా? పొరపాటున వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన తప్ప ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? కృష్ణా జిల్లా టూర్లో జగన్ కాన్వాయితోపాటు ఇతర ప్రయాణికుల వాహనాలు, బస్సులు అన్నీ మామూలుగానే నడిచాయి. జనం గూమికూడిన చోట ట్రాఫిక్ కొద్దిసేపు ఆటంకం కలిగి ఉండవచ్చు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు స్వాగతం చెబుతుంటే ఆయన వారిని కాదని ఎలా వెళ్లిపోగలుగుతారు? ఇవన్ని ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ టూర్ వల్ల జనానికి ఇబ్బందులు వస్తుంటే, అధికార హోదాతో తిరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల టూర్ల వల్ల ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది? పర్యటన ప్రాంతానికి రావడానికి అరగంటో, గంట ముందునుంచే ట్రాఫిక్ నిలిపివేయడమో, నియంత్రణలు పెట్టడమో చేస్తుంటారు కదా! అప్పుడు జనం పాట్లు పడినా, నరకం చూసినా తప్పు లేదా? జనం జగన్కు నీరాజనం పలుకుతున్న వైనం కూటమి నేతలకు ఆందోళన కలిగిస్తుండవచ్చు. వైఎస్సార్సీపీ ఓటమి పాలైన ఏడాదికే జగన్ సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తూండేందుకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్ని సంగతి వారికి తెలియదా? నిజానికి పోలీసులు జగన్ టూర్పై పోలీసులు పెట్టిన షరతులు అసంబద్ధమైనవి. హైవేపై గుమి కూడకూడదట. రాకపోకలకు, ప్రజాజీవనానికి అంతరాయం కలగరాదట. జగన్ తో పాటు ఏభై మంది మాత్రమే ఉండాలని, పది వాహనాలే వెళ్లాలని, దిచక్ర వాహనాలకు అనుమతి లేదని మరో షరతు పెట్టారట. ఇలాంటి షరతులు పెట్టిన పోలీసులను విమర్శించాల్సి మీడియా వాటిని సమర్థిస్తూ కథనాలు రాయడం, ఉల్లంఘించారని వైసీపీపై ఎదురుదాడి చేయడం చూస్తే ఈనాడు మీడియా జర్నలిజం ఎంత నీచంగా మారిందో తెలుస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు వెళుతున్నప్పుడు జనం పోగవ్వకుండా ఎలా ఉంటారు? 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చైతన్యరథం వేసుకుని రాష్ట్రమంతటా టూర్ చేశారు.రహదారులన్నీ కిక్కిరిసిపోయేవి. అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన ఆంక్షలు పెట్టలేదు. అది వదిలేద్దం. చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం కార్యక్రమంపై కూడా ఇలాంటి నియంత్రణలు లేవు. సినిమా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పర్యటనలు జరిపిన సందర్భంలోనూ పోలీసులు ఇలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ నేతలు రోడ్లపై టూర్లు చేయకూడదని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్నదే ఎల్లో మీడియా విధానమైతే అదే మాట చంద్రబాబు పర్యటనల సందర్భంలోనూ చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్పని సుద్దులు ఇప్పుడు చెప్పడం కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. జగన్ తాజా టూర్లో జనం ప్రభుత్వంపైకి సంధించిన ప్రశ్నలకన్నా, ఇతర చిల్లర అంశాలే ఫోకస్ అవ్వాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం కావచ్చు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసాగా రూ.13500 చెల్లింపు మొదలైన హామీలను అమలు చేశారు.దాంతో రైతులను ఏమార్చడానికి ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద తాము ఏడాదికి రూ.ఇరవై వేలు ఇస్తామని, ఇతరత్రా అన్నిప్రయోజనాలు కల్పిస్తామని టిడిపి, జనసేన తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం లేదు. ఒక ఏడాది ఎగవేసి, తదుపరి రూ.ఐదు వేలే ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మోంథా తుపాను వల్ల రైతుల వరి పంట నేలవాలి పోవడంతో చాలా నష్టపోయారు. వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. పైగా పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుకు బాధ్యత లేదని రైతులను బెదిరిస్తున్నారు. రైతులు వీటన్నిటిని జగన్ వద్ద ప్రస్తావించారు. అవన్ని జనంలోకి వెళతాయి కనుక ఈ రకంగా పోలీసులతో అడ్డదిడ్డమైన కండిషన్లు పెట్టించి టూర్ విఫలం చేయాలని చూశారనుకోవాలి. అయినా రైతులే వైసీపీ శ్రేణులే కాదు..సాధారణ జనం కూడా తరలిరావడం కూటమి నేతలకు, ఎల్లో మీడియాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేతల కుమ్ములాటలతో టీడీపీ అక్రమాలు బయటకు!
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్!ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు!తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అనంతపురం పోలీసులు!ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి ఈ పరిణామాలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం అంతర్గత వ్యవహారాలుగా చూడలేము. ఈ రచ్చ పుణ్యమా అని అనేక అవినీతి, అక్రమ వ్యవహారాలు ప్రజల దృష్టికి వచ్చాయి. జూద శిబిరాలకు సంబంధించి ఒక డీఎస్పీపై చర్య తీసుకునే విషయమై పవన్, రఘురామ కృష్ణమరాజులు మాటమాటతో వీధికెక్కితే.. జేపీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై నోరు పారేసుకుని బజారుకెక్కారు. ఇవన్నీ ఒకవైపున ఉంటే.. నెల్లూరు జిల్లా నేత, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన ఒక నేత ఆస్తులను తనవారి పేరుతో ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారట! కూటమి నేతల గుణగణాలకు, అధికారంలోకి వచ్చిన తరువాత వారు చేస్తున్న దందాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఈ మకిలి ప్రభుత్వానికి అంటకుండా ఉండాలంటే అధికారులు తగిన చర్యలు తీసుకునేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉంది. మరి.. ఆయన పట్టించుకుంటారా? లేక యధావిధిగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారా? వేచి చూడాలి మరి. 2024లో అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ సహా కూటమి నేతలు చాలామంది రకరకాల అక్రమాలు, అనైతిక కార్యక్రమాల్లో చిక్కుకుపోయిన దాఖలాలు బోలెడున్నాయి. పార్టీ, ప్రభుత్వం జనం దృష్టిలో పలచన అవుతుంది అనుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒకలా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. నకిలీ మద్యం కేసు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేయడం తాజా ఉదాహరణ. ఈ తంతు ఒకపక్క నడుస్తున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అవినీతి అంటు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. కానీ... చంద్రబాబు నిమ్మకు నీరెత్తలేదు! బహుశా అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబుకు ప్రభుత్వం, పార్టీ రెండింటిపై పట్టు నిజంగానే తగ్గిందేమో! నిజానికి కేశినేని చిన్ని గురించి ఆయన సోదరుడు మాజీ ఎంపీ నాని గతంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలకు ముందే ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టారు. కానీ వేర్వేరు కారణాల వల్ల చిన్ని గెలవనైతే గెలిచారు. ఆయన గురించి ప్రజలకు మరింత తెలియడం ఆరంభమైంది. కొలికిపూడి శ్రీనివాసరావు తాజాగా చెప్పిన విషయాలు వాస్తవమైతే జనం మతిపోవల్సిందే. ఎదుటి పార్టీలో ఉన్న వారందరి వ్యక్తిత్వాలపై బురదచల్లే చంద్రబాబు, లోకేశ్లు ఇలాంటి వ్యక్తిని ఎలా ఏరికోరి ఎంపీగా చేసుకున్నారన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న చిన్ని అందులో అపార్ట్మెంట్లు నిర్మిస్తామని నమ్మబలికి వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారట. కబ్జాను గుర్తించిన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని కొలికపూడి చెబుతున్నారు. దీంతో డబ్బులు చెల్లించినవారు లబోదిబో అంటున్నారట. చిన్ని అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానని ఒక కన్సల్టెన్సీ పేరుతో వందల మందిని మోసం చేశారని, ఇప్పుడు వారందరూ తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ఎంపీ అయ్యాక చిన్ని సొంత వర్గం సాయంతో తిరువూరు తదితర చోట్ల ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు నడిపిస్తున్నారని కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఆఖరికి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు కూడా చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలను విడుదల చేశారు. వైసీపీ నేతలు కొందరితోనూ చిన్నికి సంబంధాలు ఉన్నాయని అవినీతి డబ్బుతోనే తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశామని కూడా ఎమ్మెల్యే వెల్లడించేశారు. ఈ అంశాలన్నింటిపై ఇప్పటివరకూ టీడీపీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కాకపోతే టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం కొలికపూడిని విమర్శిస్తూ వ్యాఖ్యలు వచ్చాయి. ఒకప్పుడు అమరావతి ఉద్యమంలో ఉన్న సమయంలో కొలికపూడిని అమరావతి అంబేద్కర్ అని పోస్టు పెట్టిన ఒకాయన, ఇప్పుడు అసలు కొలికపూడికి కోట్ల డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కోచింగ్ సెంటర్ నడుపుకునే కొలికిపూడి 2019 వరకూ వైసీపీలోనే ఉన్నారని, టిక్కెట్ రాకపోయేసరికి అమరావతి ఉద్యమంలోకి వచ్చారని, ఈయన సంగతి తెలియక ఎన్నారైలు చాలామంది చమురు వదలించుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు కొలికపూడి వైసీపీలో లేరు కాని, ఒక విశ్లేషకుడిగా టివీ డిబేట్లలో పాల్గొని చంద్రబాబును తీవ్రంగా దుయ్యబట్టేవారు. 2014-19 టర్మ్లో టీడీపీ ప్రభుత్వ విదానాలపై ధ్వజమెత్తేవారు. ఆ తర్వాత ఎలా కుదిరిందో కాని చంద్రబాబు పక్కన ప్రత్యక్షమయ్యారు. అమరావతి పేరుతో సాగిన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తిరువూరు టీడీపీ టిక్కెట్ సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో వైసీపీ అసమ్మతి ఎంపీగా ఉన్న వ్యక్తి ఈయనకు అండగా నిలబడ్డారని ప్రచారం. చిన్నికి, ఈయనకు ఎక్కడ చెడిందో కాని అనేక విషయాలు బయటకు వచ్చాయి. కేశినేని చిన్ని కూడా కొలికపూడిపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. లిక్కర్ స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డిలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఎంపీపై కొలికపూడి ఆరోపణలు చేస్తే, అతడి ఆరోపణలను ఎవరూ నమ్మరని చిన్ని అంటున్నారు. కానీ డబ్బు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై చిన్న ఏమీ వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కొంతకాలం క్రితం కొలికపూడి వైసీపీ నేతకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన ఘట్టం పలు విమర్శలకు దారి తీసింది. ఆ తరువాతి కాలంలో చిన్ని వర్గం వారు తిరువూరులో అరాచకాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూండేవారు. ఇద్దరి మధ్య రాజీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోలేదని తానే స్వయంగా హాండిల్ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం మొత్తాన్ని క్రమశిక్షణ విషయమన్నట్లు డైవర్ట్ చేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ కూడా కొలికిపూడి బహిరంగంగా ఎంపీపై ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొలికిపూడిని సస్పెండ్ చేయవచ్చన్న ప్రచారం జరిగినా ప్రస్తుతం అది సాధ్యం కాకపోవచ్చునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి మద్య రాజీ చేసి తూచ్..అబ్బే ఏమీ లేదు.. అని సరిపుచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కొలికపూడి, చిన్ని పరస్పర ఆరోపణలపై దర్యాప్తు చేయించి, చర్య తీసుకోవాలి. కాని అలా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశించలేం. ఒక్కటైతే నిజం ఈ రచ్చ పుణ్యమా అని ఎవరు ఏమిటన్నది ప్రజలకు స్పష్టమవుతోంది. ఇక పవన్, రఘురామ కృష్ణమరాజుల వ్యవహారం.. రాష్ట్రంలోని జూద కేంద్రాల గురించి నివేదిక కోరుతూ పవన్ ఏకంగా డీజీపికి లేఖ రాశారు. అధికారం ఉందా? లేదా? అన్నది పక్కనబెడితే పవన్ ఈ లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలో జూదం ఎంత విచ్చలవిడిగా సాగుతోందో చెప్పకనే చెప్పారు. కానీ... డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమరాజు పేకాట ఏదో సంప్రదాయ క్రీడ అన్నట్లుగా మాట్లాడారని వార్తలు వచ్చాయి.. చంద్రబాబు దీన్నీ సమర్థిస్తారా? మరో సంగతి చెప్పాలి. పవన్ కళ్యాణ్ కోరినట్లు డీఎస్పీపై చర్య తీసుకోలేదు. డీజీపీ కూడా నివేదిక ఇచ్చినట్లు లేరు. జూదశిబిరాల కథ కంచికే అన్నమాట.పోలీసు అమరవీరుల దినం రోజున చంద్రబాబు ఉపన్యసిస్తూ పోలీసులకు స్వేచ్చ ఇస్తున్నామని చెబుతున్న సమయంలోనే తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి అక్కడి ఎఎస్పీని ఏ రకంగా బెదిరించింది అంతా చూశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని బింకాలు పోయే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆయనపై కేసు పెట్టలేకపోయింది? ఇది బలహీనత కాదా?ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బనాయుడు అనే వ్యక్తికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను రిజిస్టర్ చేయించారన్న కథనం వచ్చింది. ఇది అక్రమాలకు పరాకాష్ట. ఆ రిజిస్ట్రేషన్లు ఎలా చెల్లుతాయో అర్థం కాదు. ఇవి రవిచంద్రకు సంబంధించిన వారెవరివైనా బినామీ ఆస్తులే అయి ఉంటాయని, అందుకే సుబ్బనాయుడు చనిపోతే కష్టం అవుతుందని భావించి ఇలా చేసి ఉండవచ్చని కొందరి వాదనగా ఉంది. మొత్తంమీద చంద్రబాబు ఆద్వర్యంలో కూటమి ప్రభుత్వం మూడు అక్రమాలు, ఆరు అవినీతి దందాలుగా కళకళలాడుతోందా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుగారు మళ్లీ ఏసేశారు!
అదేదో సినిమాలో ఓ డైలాగుంటుంది.. ‘‘మళ్లీ ఏసేశాడు’’ అని! చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఈ డైలాగునే గుర్తుకు చేస్తున్నాయి. మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామని ఆయన ప్రకటించారు. అంతవరకూ ఓకే కానీ.. అమెరికా కూడా ఇలంటి సంక్షోభాలను తనంత సమర్థంగా ఎదుర్కోలేదనడంతోనే వచ్చింది చిక్కు. అక్కడితో ఆగారా? ఊహూ లేదు.. పదహారు నెలల్లో తయారు చేసిన టెక్నాలజీతో తుపానును అడ్డుకున్నామని కూడా ఆయన వాకృచ్చారు. నిజానిజాలు దేవుడికెరుక అనుకున్నారేమో మరి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త, వెరైటీ పదాన్ని వెతుక్కోవడం వాటితో తనకు తాను బూస్టింగ్ ఇచ్చుకోవడం. ఇదీ బాబు పంథా. తుపాను సమయాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో గుర్తించేందుకు భారత ప్రభుత్వం దశాబ్దాల క్రితం భారత వాతావరణ విభాగం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు మాత్రం.. వర్షాలు పడే గ్రామాలను తాము ముందే గుర్తించేశామని చెప్పుకుంటారు. అనుచరగణం కానీ.. సామాన్యులు కానీ మారు మాట్లాడకూడదంతే. మోంథాపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకున్నారు. గ్రామాలను ముందుగానే గుర్తించినప్పటికీ వర్షాలు ఇంకోచోట కురిశాయని, కాకినాడ వద్ద కాకుండా ఇంకోచోట తుపాను తీరం దాటిందని ఆయనే చెప్పారు. మరి 16 నెలల్లో వారు అభివద్ధి చేసిన టెక్నాలజీ పనిచేసినట్టా? చేయనట్టా? అదృష్టవశాత్తు మోంథా తన దిశను మార్చుకోవడం వల్ల ప్రాణ నష్టం లేకుండా పోయింది. కాని పంటల నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. కోస్తాలోని పలు జిల్లాలలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తుపానులు నిలువరించే సైన్స్ ఇప్పటివరకూ అభివృద్ధి కాలేదు. కానీ చంద్రబాబు వంటి కొద్దిమంది తాము సముద్రాన్ని నియంత్రించామని, ఎండ వేడి కొన్ని డిగ్రీ సెల్సియస్ తగ్గేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూంటారు. ఇలాంటి వ్యాఖ్యలతో విన్నవారికి మతి పోవడం తప్ప ప్రయోజనం నాస్తి. అలాగే ఈ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో తెలుసుకుని ఏర్పాటు చేశామని అంటున్నారు. ఒకే. జాగ్రత్తలు తీసుకున్నామని చెబితే ఫర్వాలేదు.కాని కేంద్ర జల కమిషన్ చేపట్టే కార్యక్రమాలను కూడా తన ప్రభుత్వమే చేస్తున్నట్లు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు వర్షాలు,వరదలు, రిజర్వాయర్ల పరిస్థితులను పర్యవేక్షిస్తూంటుంది. ఆ సమాచారాన్ని రాష్ట్రాలకు అంద చేస్తుంది. ఆ సంగతి ఎవరికి తెలియదన్నట్లుగా తన ఖాతాలో వేసుకుంటే ఎవరికి అప్రతిష్ట? అందుకే ఒక మీడియా 'బాబు గప్పాలకు ఆకాశమే హద్దు" అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ఇచ్చింది. మరో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే తుపాను ప్రభావ ప్రాంతాలలో గ్రామ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. సిబ్బంది సేవలు అవసరమయ్యాయి. చంద్రబాబు గతంలో ఈ వ్యవస్థలను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వీటి పేర్లను స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చే యోచన చేస్తోందట. పేరు మార్చితే జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను జనం మర్చిపోతారా? కరోనా వంటి అతి పెద్ద సంక్షోభాన్ని సైతం జగన్ ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను వినియోగించి సమర్ధంగా ఎదుర్కొన్న విషయాన్ని మర్చిపోకూడదు. వరదలు వంటివి సంభవించినప్పుడు జగన్ జిల్లాల అధికారులకు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చి, నిధులు అందుబాటులో ఉంచి సహాయ చర్యలు చేపట్టేవారు. ప్రజలలోకి వెళ్లి సహాయక చర్యల అమలును తెలుసుకునేవారు. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అదేదో తామే తుపానును నిలుపుదల చేశామన్నంతగా బిల్డప్ ఇచ్చుకోవడమే సమస్య. చంద్రబాబు, లోకేశ్లు కంప్యూటర్ల ముందు కూర్చుని పర్యవేక్షించారంటూ ఊదరగొట్టారు. టీడీపీ మీడియా మరింతగా రెచ్చిపోయి జనానికి ఊపిరి ఆడనంతగా వీర భజన చేసింది. తుపానును ఎదుర్కోవడంలో చంద్రబాబును మించిన సమర్థుడు మరొకరు లేరని, తుపానును సైతం నిలిపివేశారని, తుపానే మోకరిల్లిందని, చంద్రబాబు, లోకేశ్లు నిద్రాహారాలు మాని 72 గంటలపాటు పని చేశారని, తన కుటుంబంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కూడా వెళ్లలేదని మరీ ప్రచారం చేశారు. చంద్రబాబు, లోకేశ్ల వద్ద మార్కులు కొట్టేయడానికి టీడీపీ డప్పు వాయించిందన్నమాట. వివాహ కార్యక్రమానికి కూడా చంద్రబాబు వెళ్లారు.అంటే ఎల్లో మీడియా అసత్యం ప్రచారం చేసిందని తేలిపోయింది కదా! దీనివల్ల మీడియాకు ఏమైనా గిట్టుబాటు అవుతుందేమో కాని, చంద్రబాబు, లోకేశ్లకు మాత్రం నష్టమే. చంద్రబాబుకు సాధ్యపడలేదు కాని, వీలైతే తుపానును వెనక్కి పంపించడానికి కూడా వెనుకాడరని మరో టిడిపి మీడియా చెప్పడం విని అంతా నివ్వెరపోయారు. చంద్రబాబే తన గురించి పొగుడుకుంటున్నప్పుడు టీడీపీ నేతలు, మంత్రులు వెనుకబడతారా? ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంలో సేఫ్ అని ఒక మంత్రి అంటే, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లు తుపానును తెలంగాణ వైపు మళ్లించేశారని మరో మంత్రి వ్యాఖ్యానించారట. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటివల్ల చంద్రబాబు వంటి సీనియర్ నేత నవ్వుల పాలవుతారు తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. మోంథా తుపాను వల్ల ఆంధ్ర రైతులకు జరిగిన నష్టం పూరించలేనంత. అసలే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఈ తుపాను పులిమీద పుట్రలా మారింది. ప్రభుత్వం రెండు, మూడు లక్షల ఎకరాలలో పంట నష్టం అని చెబుతున్నా అసలు నష్టం ఇంకా చాలా ఎక్కువనే అంచనాలున్నాయి. నష్టం 15 లక్షల ఎకరాల మేర ఉండవచ్చునని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఇలాంటి ఘట్టాలలో సాధారణంగా చంద్రబాబు భారీ గణాంకాలు చెబుతుంటారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు తొలుత రూ.60 కోట్ల నష్టం అన్నారు. తరువాత దానిని రూ.20 వేల కోట్లకు తగ్గించారు. కేంద్రానికి నివేదిక పంపినప్పుడు రూ.13 వేల కోట్లుగా తెలిపారు. ప్రధాని మోడీ తొలుత రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించి, అంతిమంగా 600 కోట్లు ఇచ్చారు.ఈసారి ఎందువల్లో నష్టాన్ని ప్రాథమికంగా రూ. 5400 కోట్లకే పరిమితం చేశారు. అందులోను వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని తగ్గించి చూపారా అన్న సందేహం ఉంది. రైతులకు బీమా సదుపాయం అమలు చేయకపోవడం, తదితర కారణాల వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏమైనా ఇలా చేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తుపాను నష్ట పరిహాం తీసుకుంటే ధాన్యం కొనుగోళ్లకు బాధ్యత లేదని ప్రభుత్వం చెబుతోందట. ఇది రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు, లోకేశ్లు తమకు తాము ఇచ్చుకునే ఎలివేషన్స్కు తోడు ఎల్లో మీడియా వీర భజన ఏపీ ప్రజలకు విసుగు తెప్పిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్న సూక్తికి బదులు అతి ప్రచారమే మిన్న అని చంద్రబాబు సర్కార్ భావిస్తోందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డైవర్షన్ రాజకీయాలకు ఇది పరాకాష్ట!
ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈ విషయం తెలియని వారంటూ లేరు కానీ.. తాజా ప్రయత్నం మాత్రం పరాకాష్ట అని చెప్పక తప్పదు. రాష్ట్ర పాలన యంత్రాంగం ఘోర వైఫల్యం కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణిస్తే.. దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుండి నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చింది. కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంలా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయించింది.వాస్తవానికి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఆ ఘటనతో తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని కూటమి పెద్దలు అంచనాకు వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట మొదలుకొని అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లోనూ ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో దైవానికి ఏదో అపచారం జరిగిందన్న సెంటిమెంట్ ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది అరిష్టం అన్న భావనకు భక్తులు వస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదు.. చంద్రబాబు విపక్షంలో ఉండగా కందుకూరు, గుంటూరు సభలలో జరిగిన తొక్కిసలాటల్లోనూ ప్రాణ నష్టం జరగడం గమనార్హం.కుల, మత రాజకీయాలు నడపడంలో ఆరితేరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి ఈ తొక్కిసలాటల ఘటనలు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని చెప్పి తప్పించుకోవాలని మంత్రులు ప్రయత్నించారు. ‘మనం నిమిత్త మాత్రులం’ అంటూ చంద్రబాబు పెదవి విరిచేసినట్లు వార్తలు వచ్చాయి. తుపానులను సైతం వెనక్కి నెట్టేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ల సొంతమని టీడీపీ మీడియా బిల్డప్ ఇచ్చిన రెండు రోజులకే కాశీబుగ్గ ఘటన జరిగింది. తమకు టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏకాదశి రోజున ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావచ్చునన్న కనీస అవగాహన లేకపోయింది. పట్టణాల్లో ఏ వీధి దీపం ఆరిపోయినా రాజధానిలో కూర్చుని గుర్తిస్తామని చెప్పుకున్న చంద్రబాబు ఆలయ రద్దీని మాత్రం నియంత్రించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.కాశీబుగ్గలో పాండా అనే వ్యక్తి తన సొంత జాగా 12 ఎకరాలలో ఈ ఆలయం నిర్మించారట. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందీ ఆలయం. ఆ విషయం స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడే విషయంలో లేకుండా పోయిందని విమర్శించారు.ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతిన్నదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రాజకీయాల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. ఆకస్మికంగా నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ను ఆదివారం ఉదయాన్నే అరెస్ట్ చేసింది. ఎల్లో మీడియా పుణ్యమా అని కాశీబుగ్గ ఘటన కాస్తా మరుగునపడి.. ఈ అరెస్ట్ అంశం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. పోలీసులు కూడా ముందస్తు విచారణ లాంటివేవీ లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు ఈ అరెస్ట్ స్పష్టం చేస్తోంది. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు జనార్దనరావు ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా జోగిని నిర్భందించారు. జోగి దైవ సన్నిధిలో ప్రమాణం చేయడానికి అయినా సిద్దమేనని సవాల్ చేయడమే కాకుండా, ఆ ప్రకారం కనకదుర్గమ్మ గుడి వద్ద చేతిలో కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. ఇదే పని చంద్రబాబు లేదా లోకేష్ చేయగలరా అని ప్రశ్నించారు. వీటిని వారు ఎటూ పట్టించుకోరు.ఇక్కడ చిత్రం ఏమిటంటే నకిలీ మద్యం ప్లాంట్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎల్లో మీడియాలోనే వచ్చిన రిపోర్టు ప్రకారం వేలాది బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అయింది. ఒక్క తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు మీడియా పేర్కొంది. నకిలీ మద్యం ప్లాంట్ను పట్టుకున్న సందర్భంలోనే ఒక డైరీ దొరికిందని, అందులో ఈ మద్యం సరఫరా అయిన 78 మంది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ బెల్టు షాపుల జోలికి ఏపీ పోలీసుల మాత్రం పోలేదు. కానీ, నకిలీ మద్యం ప్లాంట్, అక్కడ ఒక పొలంలో ఉన్న మద్యం డంప్ కనుక్కున్న అధికారిని బదిలీ చేశారట. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం తాగి మోటార్ సైకిల్ నడిపి బస్ ప్రమాదానికి కారణమయ్యారు. ఆ ఘటనలో 19 మంది మరణించారు. నకిలీ మద్యమే కారణం అని ప్రకటనలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 27 మందిపై కేసులు పెట్టారు. అక్కడ బెల్ట్ షాపుపై చర్య తీసుకోలేదు. ఆ షాపులలో నకిలీ మద్యం లేదని ఎక్కడా నిరూపించలేదు.రెండు రోజుల క్రితం సాక్షి టీవీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద బెల్ట్ షాపులలో అది మంచి మద్యమో, కాదో తెలియని రీతిలో విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో సహా వార్తా కథనాలను ప్రసారం చేసింది. అందులో ఒక వ్యక్తి టీడీపీ ఐడీ కార్డు వేసుకుని మరీ బెల్ట్ షాపు నడుపుతున్న వైనం బహిర్గతమైంది. ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇబ్రహీంపట్నం వద్ద కూడా నకిలీ మద్యం డంప్ ఉందని వార్తలు వచ్చాక, అక్కడకు వెళ్లి దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్. జనార్దనరావు దక్షిణాఫ్రికా నుంచి పంపిన వీడియోలో ఎక్కడా జోగి పేరు ప్రస్తావించలేదు. ఎవరితో ముందస్తు ఒప్పందం అయ్యారో కానీ, సడన్గా ఏపీకి వచ్చి ఆయన లొంగిపోయారు. ఆ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ ముంబై విమానాశ్రయంలో పోయిందని పోలీసులకు చెప్పినా, దానిని కనుక్కునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశారో, లేదో తెలియదు. పోలీసు రిమాండ్లో ఉండగా జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం ప్లాంట్ పెట్టానని జనార్దనరావు ఇచ్చిన వీడియో ప్రకటనను బయటకు రిలీజ్ చేశారు. దానిని బట్టే ఇదంతా కుమ్మక్కు రాజకీయం అని, వైఎస్సార్సీపీ నేతను ఎలాగోలా ఇరికించి ఈ కేసును డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమని జనం అందరికీ తెలిసిపోయింది.ఇలా డైవర్షన్ చేయడంలో చంద్రబాబుకు చాలానే చరిత్ర ఉంది.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడు దానిని డైవర్ట్ చేయడానికి తన ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారంటూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఏపీలో కేసులు నమోదు చేయించడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని తన సన్నిహితులతో రాజీ మంతనాలు జరిపించి కేసు లేకుండా చేసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయినా, ఒక్క అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఆయన తప్పేమి లేదన్నట్లు, భక్తులదే తప్పన్నట్లుగా చిత్రీకరించగలిగారని చెబుతారు. విజయవాడలో బుడమేరు వరదలతో వేలాది మంది అల్లాడుతుంటే ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర అంటూ వైఎస్సార్సీపీపై నెట్టే యత్నం చేశారు. మొత్తమ్మీద చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో కాకుండా రాచరికంలో ఉన్నామా అనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
మైనార్టీ మంత్రి కాంగ్రెస్ను ఒడ్డున పడేస్తారా?
ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్లో మంత్రి అయ్యారు. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే కానీ.. ఇంకో పది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరినే మంత్రిని చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజహర్పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ, మతపరంగా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా, రేవంత్ ఈ పదవి మైనార్టీలను మోసం చేయడానికి ఇచ్చారని, ఇది ఆరు నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల సంఖ్య సుమారు లక్ష. పైగా రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలెవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడమేమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. బీజేపీ మైనార్టీల ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, గవర్నర్పై కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరక్కుండా చూసే ప్రయత్నమూ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ అనుభవం లేకపోతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఉండేదేమో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్లో ఈ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించినా సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్ను మంత్రిని చేయడం మైనార్టీ ప్రాతినిథ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనార్టీ వర్గానికి చెందిన అజహర్ను మంత్రి చేశారని వీరు అంటున్నారు.ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణంగా జరిగేదే కానీ.. ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని అంచనా. ఇప్పటివరకూ జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనార్టీ నేతలను కూడా ఆకర్శించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మైనార్టీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా? కాదా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వ్యవహరించరాదనే చెప్పాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు రాకపోయినా, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయయపడ్డారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అజహర్పై దేశద్రోహంతోపాటు తీవ్రమైన కేసులున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన అజహర్కు ఆ తరువాత ఫిక్సింగ్ అభియోగాల మరకలూ అంటాయి. క్రికెట్కు దూరమయ్యారు. రాజకీయాలకు దగ్గరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత రాజస్థాన్ నుంచి పోటీ చేశారు కానీ గెలవలేదు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగాలని ఆశించినా టిక్కెట్ నవీన్ యాదవ్కు ఇవ్వాలన్న రేవంత్ నిర్ణయంతో అది జరగలేదు. అజహర్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా వ్యతిరేకించిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది కానీ.. దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే.. ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రి అయ్యారన్నమాట. ఇంకో ఆరు నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదలుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు నెలల క్రితమే అజహర్ను మంత్రిని చేయడంపై నిర్ణయం జరిగిందని మహేష్ గౌడ్ చెబుతున్న మాటలు నమ్మ శక్యంగా లేవు. ఎందుకంటే కొంత కాలం క్రితమే ఆయన అజహర్కు మంత్రి పదవి ఇస్తున్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఏతావాతా... అజహర్కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్కు మేలు చేస్తుందా? లేదా? అన్నది ఇంకో పది రోజుల్లో తేలనుంది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేకాట క్లబ్బులపై పవనాయణం!
‘‘ఆంధ్రప్రదేశ్లో పేకాట క్లబ్బులు, జూద కేంద్రాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి’’ ఈ మాటన్నది సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వాస్తవాన్ని ధైర్యంగా అంగీకరించినందుకు ఆయన్ను అభినందించాల్సిందే. భీమవరం డీఎస్పీ జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేసి ఆయనపై విచారణ జరపాలని ఎస్పీని, తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించడమూ బాగానే ఉంది. కానీ... పవన్ ఇలా ఆదేశించారో లేదో.. ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు భీమవరం డీఎస్పీకి మద్దతుగా నిలబడటం... ‘‘పవన్ ఇతర శాఖల్లో వేలు పెట్టడం సంతోషం’’ అన్న వ్యంగ్య వ్యాఖ్య విసిరేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారమంతా చూస్తే... పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాన్ని వాడారని మంత్రి లోకేశ్ మాదిరి తాను చక్రం తిప్పుతున్నానని అనిపించుకునే ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. టీడీపీ కూడా పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఉత్తరం రాసిన ఇన్నాళ్లకు కూడా ఆ డీఎస్పీపై చర్య తీసుకోలేదు. కూటమి 15 ఏళ్లదంటూ తెలుగుదేశం పార్టీతో అంటకాగడానికే ప్రాధాన్యమిస్తున్న పవన్ ప్రజా సమస్యలు, జనసేన కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జూద కేంద్రాల గురించి మాట్లాడడం కొంతలో కొంత బెటర్. అయితే ఇదంతా చిత్తశుద్దితో చేశారా? లేక జనసేన ఎమ్మెల్యే ఎవరికైనా పోలీసులు సహకరించడం లేదన్న అసంతృప్తితో రియాక్ట్ అయ్యారా అన్నదానిపై పలు వార్తలు వచ్చాయి. ఏపీలో అనేక సమస్యలుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లను పొగిడే పనిలో బిజిగా ఉంటున్నారన్న విమర్శ నుంచి తప్పించుకోవడానికి పవన్ ఈ ట్రిక్కు ప్లే చేశారా అని కొందరు సందేహిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ఆడించే ఆటలో ఒక భాగమేనని, ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతోందన్న భావన కలిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తుంటారని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు జోక్యంతో ఈ కధ కొత్త మలుపు తీసుకున్నట్లయింది. తానూ పవన్ అభిమానినే అని చెబుతూనే రాజు భీమవరం డీఎస్పీ మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం, విచారణలో అన్ని తేలుతాయని వ్యాఖ్యానించడం విశేషం.. పైగా పేకాట అన్నది అక్కడి సంస్కృతిలో భాగం అన్నట్లు మాట్లాడడం మరీ విడ్డూరం.ఇక్కడ మరో కోణం ఏమిటంటే తన పరిధిలో లేని హోం, లా అండ్ ఆర్డర్ శాఖలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమే. కాకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో, పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నేరుగా ప్రశ్నించరు. మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కాకుండా మరో మంత్రి ఎవరైనా ఇలా వేరే శాఖలో జోక్యం చేసుకుంటే పెద్ద రభస అయి ఉండేది. మంత్రుల తగాదాగా మారేది. ముఖ్యమంత్రి రాజీ చేయాల్సి వచ్చేది. పవన్ కళ్యాణ్ పేకాట క్లబ్బుల గురించి చేసిన వ్యాఖ్య హోం మంత్రి అనితను అవమానించినట్లని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయినా, సర్దుకుపోక తప్పని స్థితిలో ఉన్నారు. అందువల్లే తమకు ఈగోలు లేవని అసహనంగా మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఒకసారి పవన్ పిఠాపురంలో మాట్లాడుతూ తన వద్ద హోం శాఖ ఉండి ఉంటే శాంతి భద్రతల విషయంలో గట్టి చర్యలు తీసుకునేవాడిరి అన్నట్లుగా మాట్లాడి అనితను ఇరుకున పెట్టారు. తదుపరి వారు ఈ అంశంపై రాజీ కబుర్లు మాట్లాడుకున్నారని అంటూ లీక్ ఇచ్చి వదలివేశారు. ఇప్పుడు ఏకంగా డీజీపీ నుంచే నివేదిక కోరడం సంచలనంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి అన్నది ఒక హోదా తప్ప, ప్రత్యేకంగా మంత్రిని మించి అధికారాలేమీ ఉండవు. అయినా పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడంలోని ఆంతర్యం ఏమిటా అన్నది చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో చట్ట విరుద్దంగా జూద కేంద్రాలు నడుస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ అధికారులకు నెలవారీ మామూళ్లు అందచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారని తెలిపారు. పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియ చేయాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత పవర్ ఫుల్ మంత్రి లోకేశ్ హోం మంత్రి అనితలు ఉండగా ఫిర్యాదులు పవన్ కళ్యాణ్కు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు సరిగా స్పందించడం లేదా? ఈ మొత్తం ట్వీట్ చూస్తే ఏపీలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలియచేస్తుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులకు ద్వారాలు తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు వీటిని నడుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎల్లో మీడియా సైతం వీటిని రిపోర్టు చేసింది. అయినా ప్రభుత్వంలో, పోలీసులలో పెద్దగా ఉలుకు, పలుకు లేదన్న విమర్శలు ఉన్నాయి. పవన్ దీనిపై స్పందించడానికి భీమవరం డీఎస్పీ జయసూర్యపై తనకు జనసేన నేతల నుంచి అందిన ఫిర్యాదులు ఒక కారణంగా చెబుతున్నారు. ఆయన స్థానిక జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు మాటను పట్టించుకోవడం లేదట. జయసూర్య గతంలో కూడా ఇక్కడ పనిచేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి.ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సివిల్ తగాదాలలో తలదూర్చుతున్నారని జనసేన నేతలు కొందరి ఆరోపణ. దీనిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారట. డీఎస్పీపై విచారణ చేయాలని ఆయన కోరారట. దీనికి సంబంధించి మరో వాదన కూడా ఉంది. భీమవరం ప్రాంతంలో ఉండే పేకాట క్లబ్బులు సజావుగా సాగినంతకాలం ఎలాంటి ఫిర్యాదులు వెళ్లలేదట. గత కొద్దికాలంగా పేకాట క్లబ్లులు నడవడం లేదట. దాంతో కొంతమంది ఆదాయానికి భారీగా గండి పడుతోందట.ఈ అంశాన్ని జనసేనలోని మరో వర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్గనైజ్డ్ జూద కేంద్రాల బదులు అపార్టుమెంట్లు, శివారు ప్రాంతాలలో జూద క్రీడలు జరుగుతున్నాయట. తమ ఆదాయం పోయిందన్న అసంతృప్తితో కొందరు జనసేన నేతలు పవన్కు ఫిర్యాదు చేశారా? అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఒక్క భీమవరం గురించే మాట్లాడితే అది మరో రకంగా సమస్య అవుతుంది కనుక, రాష్ట్రం అంతటి పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారన్న విశ్లేషణ వస్తోంది. అయితే కేవలం పేకాట క్లబ్ గొడవపైనే పవన్ ఎందుకు స్పందించారు. ఈ ఏడాదిన్నర కాలంలో జరిగిన అనేక ఘటనలపై ఎందుకు మాట్లాడలేదో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కందుకూరులో జనసేన అభిమాని ఒకరు దారుణ హత్యకు గురి కావడం, శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే పురమాయించడం, తదుపరి డ్రైవర్ హత్యకు దారి తీయడం వంటి ఘటనలపై ఎందుకు పవన్ నోరు విప్పలేదని జనసేనే నేతలే, ముఖ్యంగా కాపు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ట్రం అంతటిని కుదిపేసిన నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం, విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇతరత్రా ఎమ్మెల్యేల అవినీతి కార్యకలాపాలు మొదలైనవాటిపై పవన్ ఎందుకు గళం విప్పడం లేదన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. జనసేన ఒక ఇండిపెండెంట్ పార్టీగా కాకుండా, కేవలం టీడీపీ అనుబంధ పార్టీ అన్నట్లుగా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్గా పేకాట క్లబ్ ల గురించి లేఖ రాయడం సహజంగానే కలకలం రేపుతుంది. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ,ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబుకు లేఖలు రాస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు పేకాట క్లబ్ ల గురించి ఆయన మాట్లాడినా విమర్శలు వచ్చేవి కావు. అందువల్లే చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ ఈ సమస్యను లేవనెత్తారా? ఇతర అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యమా అన్న అనుమానాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా కనీసం పేకాట క్లబ్ లు ,జూద కేంద్రాల వల్ల ఎపిలో ప్రజలకు నష్టం జరుగుతోందన్న సంగతిని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషించాలి.కాకపోతే పవన్ ఇచ్చిన ఆదేశాలకు పెద్దగా విలువ లేదని తెలుగుదేశం పెద్దలు తేల్చేసినట్లే అనుకోవాలా?ఈ రకంగా పవన్ పరువు భీమవరం కాల్వలో కలిసినట్లేనా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబుకు సోషల్ మీడియా భయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా పెద్ద సవాలే విసురుతోంది. ఆడిటర్లు, ఎడిటర్లు అవసరం లేని ఈ మీడియా ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని కూడా ఆయన హూంకరించారు. పాపం... ఈ క్రమంలో ఆయన తన గతాన్ని మరచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని జగన్, ఆయన కుటుంబాన్ని ఎంతగా రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. మంత్రులగా ఉన్న రోజా, అంబటి రాంబాబులపై కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం విచ్చలవిడి వ్యాఖ్యలు... కథనాలు వండి వార్చిన విషయం మరీ అంత పాత సంగతైతే కాదు. విపక్షంలో ఉన్నప్పుడు కాని, ప్రస్తుతం అధికారం వచ్చాక కాని, తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుంటారు. ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్దాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేశాయి. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, మీడియా స్వేచ్చను అరికడతారా అంటూ నానా యాగీ చేసేవారు. ఏపీ రూ.14 లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మద్యంలో 30 వేల మంది చనిపోయారని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటారని.. ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా, తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు. అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ఒకపక్క లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయిండం చూస్తూనే ఉన్నాం. ఎటూ అధికారం ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్సార్సీపీ వారిపై ఎంత నీచంగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు. అదే వైఎస్సార్సీపీ సానుభూతి పరులెవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దాదాపు 1200 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు గారు.. సోషల్ మీడియాను గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే.. దాన్ని మీ పార్టీతోనే మొదలుపెట్టడం మేలవుతుంది. నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది. వైఎస్ జగన్, కుటుంబం, అంబటి రాంబాబు, రోజా వంటి వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంత మందిపై కేసులు పెట్టారు మీరు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా? మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ టిక్కెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా? అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. కూటమి నేతల తీరుతెన్నులకు ఇవి నమూనాలు మాత్రమే. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు కాని వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని, వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి, ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరు ఏమీ పోస్టులు పెట్టుకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నిర్మించింది కనుకే ఇప్పుడీ సోషల్ మీడియా భయం చుట్టుకున్నట్లుంది. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అని అన్నారు. ఏమిటి దీనర్థం? ఆ స్వేచ్చ ప్రజలకు మేలు చేయడానికా? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళుతున్న సోషల్ మీడియాని అణచి వేసేందుకా? ఇప్పటికే ఏపీలో పోలీసులు ఎక్కడా లేని విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, మరో వైపు అధికార కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాష్టికాలకు పాల్పడినా పట్టించుకోక పోవడం పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి సైతం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిందంటూ ఆధారం లేని ఆరోపణ చేసి వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి, అయోధ్యకు కల్తీ లడ్డూలు సరఫరా అయ్యాయని రెచ్చిపోయి మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఇది ఫేక్ ప్రచారం అవుతుందా? లేక వాస్తవాల ప్రచారం అవుతుందా అన్నదానిపై ఈ ఏడాదికాలంలో ఎన్నడైనా వివరణ ఇచ్చారా? విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు చంద్రబాబు, లోకేశ్లు ఎలాంటి వార్నింగ్ లైనా ఇవ్వవచ్చు. అధికారంలోకి రాగానే ప్రత్యర్ధి పార్టీవారు మాట్లాడితే అది రాజకీయ కుట్ర, శాంతియుత వాతావరణం చెడగొట్టడం అవుతుంది. ప్రతి ఉపన్యాసంలోను కొన్ని పాయింట్లు రాసుకుంటారు. వాటిని ఒక జాబితా ప్రకారం వల్లె వేస్తుంటారు. ఒక ఉదాహరణ చూడండి..'గుంటూరులో కారు కింద వ్యక్తి పడిపోతే పొదల్లో పారేసి వెళ్లిపోయారు.పోలీసులు అంబులెన్స్ లో తీసుకువెళ్లి రక్షించే యత్నం చేస్తే వారే చంపేశారని చెప్పించే పరిస్థితికి దిగజారారు.." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఆయన ఇలా మాట్లాడితే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు వాస్తవం తెలియదా! అయినా సరే! ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది.ఇంతకుముందు టర్మ్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం ఘట్టం చిత్రీకరించేందుకు సాధారణ భక్తులను నిలిపివేసినందున అది జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజి మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉండగా కందుకూరు సభలో, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి మరో 11 మంది మృతి చెందారు.అదంతా పోలీసుల వైఫల్యం అని వారిపై నెట్టేశారు. తన వైపు ఎంత తప్పు ఉన్నా కప్పిపుచ్చుకోవడంలో ఎంత నేర్పరితనం ఉందో, ఆయా సందర్భాలలో తన రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో అంతకన్నా అధికంగా నేర్పరితనం చంద్రబాబుకు ఉందని ఎక్కువ మంది భావిస్తుంటారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు, పలుచోట్ల నకిలీ మద్యం డంప్ లు దొరకలేదా? వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చాక, అక్కడ ఏ మద్యం సరఫరా అవుతోందో ఎవరైనా చెప్పగలుగుతున్నారా?ఎక్సైజ్ అధికారులే పలు చోట్ల ఇలాంటి మద్యాన్ని పట్టుకున్నారు కదా? అయినా నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్యం పాలు కాలేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది తాగుబోతులకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది? ఆయన చేసే వాదన సరైనదే అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని ఏ ఆధారాలతో ఎలా చెప్పగలిగారు. 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఎన్నికల ప్రణాళికలో ఎలా రాయగలిగారు.అది తప్పు కాదా?ఇప్పుడు ఆధార సహితంగా నకిలీ మద్యం దొరికినా ఎవరి ఆరోగ్యం చెడలేదని , ఎవరూ మరణించలేదని జనం నమ్మాలని,దీని గురించి ఎవరూ ప్రశ్నించకూడదన్నది ఆయన ఉద్దేశం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు. రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో.. తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో.. జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా. దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు. లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘బాబు.. ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా మార్చకుంటే అదే పదివేలు’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన మంచేమిటో చెప్పుకునే బదులు గత సీఎం జగన్పై విమర్శలు ఎక్కువపెట్టేందుకు వృథా ప్రయాస పడుతున్నారు. జగన్పై అనుచిత వ్యాఖ్యల ద్వారా తమకే నష్టం జరుగుతోందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలలను మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. వైన్షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతివ్వడం రాష్ట్రవ్యాప్తంగా వేలాది బెల్ట్షాపులకు తెరెత్తడం ఈ కూటమి ప్రభుత్వం ఘనతే. ఏరకంగా చూసినా ఇవేవీ ప్రజలకు మేలు చేసేవి కానేకావు. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఎన్నికల్లో జగన్ ఓటమిని చూపుతున్నారు. రాజకీయ ఓటమిని నరకాసుర వధతో పోలుస్తున్నారు. పోనీ ఇదే కొలమానం అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే టీడీపీ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయింది. అంత రాక్షసంగా పాలించారు కాబట్టే ఓడియామని చంద్రబాబు ఒప్పుకుంటారా? చంద్రబాబు కుమారుడు, సకలశాఖల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న లోకేశ్ జీవితాంతం తానే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలన్న ఆశ ఉండటాన్ని తప్పు పట్టలేము కానీ.. అందుకు రాక్షసపాలనను, రెడ్బుక్ రాజ్యాంగాన్ని మార్గంగా మార్చుకుంటే మాత్రం భంగపడక తప్పదు. ఎడాదిన్నర కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాకు చెందిన పలువురిపై అక్రమంగా కేసులు బనాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. తాజాగా కందుకూరు సమీపంలోని దారకంపాడు వద్ద లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న కథనం కూటమి ఏలుబడిలో శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం. కారణాలేవైనా ఈ కేసులో ఆరోపణలపై పోలీసులు సకాలంలో నిస్పాక్షికంగా విచారించి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేదే కాదు. రెండు కులాల మధ్య చిచ్చు రేగేది కాదు. కాపు సంఘాల నేతలు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దిగాల్సిన పరిస్థితిని కూడా నివారించి ఉండవచ్చు. ఈ వ్యవహారంలో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఎందుకు గోప్యంగా ఉంచారూ అన్నది!కొన్ని నెలల క్రితం ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైతే చంద్రబాబుతోసహా పలువురు మంత్రులు, టీడీసీ నేతలు హుటాహుటిన అక్కడకు తరలివెళ్లారు. మద్యం, భూ మాఫియాలలో భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలున్నా, పార్టీలోని వర్గ విభేదాలే హత్యకు కారణమన్న అంచనా ఉన్నా వీరందరూ హడావుడి చేశారు. మరి లక్ష్మీనాయుడి కేసు విషయానికి వచ్చేసరికి అంతా మారిపోయింది.హత్య జరిగితే రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జనసేనాభిమాని హత్యకు గురయ్యారని తెలిసినా ఎందుకు పరామర్శించలేదు?! అధికారాన్ని అనుభవించాలన్న పవన్ కళ్యాణ్ బలహీనతను టీడీపీ బాగానే వాడుకుంటుందన్న ఆరోపణలు ఇందుకే వచ్చేది. హోం మంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు అక్కడకు అసలు విషయం పక్కనబెట్టి వైసీపీపై విమర్శలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పేమి లేకపోతే హత్యకు గురైన లక్ష్మీ నాయుడు కుటుంబానికి ఎందుకని ఆర్థికసాయం, భూమి కేటాయింపు ప్రకటించారు? ఈ రకంగా సాయం చేయడాన్ని టీడీపీ మద్దతుదారైన మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా తప్పు పట్టారే! కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు టీడీపీ, జనసేనలు అచ్చంగా కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవి. ఎక్కడైనా దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడకు వాలిపోయి మత రాజకీయాలు చేశారు. విశాఖపట్నంలో తాగి గొడవ చేస్తున్న ఒక డాక్టర్ను పోలీసు కానిస్టేబుల్ అరస్ట్ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ కాదా? అతను అనారోగ్యంతో మరణించినా వైసీపీ కారణమంటూ అన్యాయంగా ప్రచారం చేశారే. పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తి వ్యక్తిగత తగాదాలో మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్లి పాడే మోశారు. అది కుల రాజకీయమా? శవ రాజకీయమా? అంతేకాక చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కూటమి ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెరలేపింది. అందువల్లే ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదన్న డిమాండ్ వచ్చింది.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణిస్తే ప్రభుత్వం ఎందుకు 11 కోట్లు ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టింది? ఇలాంటి పలు అంశాలను ఏబీ వెంకటేశ్వర రావు ఎందుకు ప్రశ్నించలేదని కాపు సంఘం నేత దాసరి రాము నిలదీశారు. కాపు సంఘాలు జోక్యం చేసుకుని తీవ్రంగా స్పందించి ఉండకపోతే ప్రభుత్వం ఈ మాత్రం అయినా కదిలేదా అన్నది వారి ప్రశ్న. కాపు సంఘాలు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన తర్వాతే వైసీపీకి చెందిన కాపు నేతలు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తొలుత గొడవ జరిగింది టీడీపీ, జనసేనల వారి మధ్యే అన్నది నిజమా? కాదా? కొందరు జనసేన కార్యకర్తలు టీడీపీ వారి నుంచి ఎదురవుతున్న సమస్యలు, దౌర్జన్యాల గురించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.కులపరమైన విభేదాలు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ ఒక ప్రకటన ఇచ్చినప్పటికి, కాపు సంఘాలు నేరుగా కులాల పేర్లు చెప్పి ఆరోపణలు చేసినా ,ఎలాంటి చర్య తీసుకోలేదు. అంటే ఎక్కడ జనసేన కార్యకర్తలు మరింతగా రెచ్చిపోతారో అన్న భయం, కాపులు ఇంకా దూరమవుతున్నారన్న ఆందోళన ప్రభుత్వానికి రావడమే కారణం కాదా? అదే వైసీపీ వారు ముందుగా వెళ్లి ఉంటే పోలీసులు ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో! ఇదే సందర్భంలో శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించడానికి చేసిన ప్రయత్నాలపై కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోవడాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. అలాంటప్పుడు ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? మంచికి మద్దతు ఇవ్వాలని కోరినంత మాత్రాన జరుగుతున్న ఘటనలు ప్రజల దృష్టికి రాకుండా పోతాయా? కూటమి సర్కార్ ఎంత మంచిగా పనిచేస్తున్నది వారి ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. తాము లంచాలు వసూలు చేయకపోతే పనులు చేయలేమని చెప్పే ఎమ్మెల్యే ఒకరు, పదవులను అమ్ముకుంటున్నారని చెప్పే మరో ఎమ్మెల్యే.. కొందరు మంత్రులు దందాలు చేస్తున్నారని, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వసూల్ రాజాలుగా మారారని ఎల్లో మీడియానే రాసిన కధనాలు, ఇసుక,మద్యంలలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని వచ్చిన వార్తలు చూశాక ఇది మంచి ప్రభుత్వం అని ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు ఎంత చెప్పినా జనం అంగీకరిస్తారా? మరో సంగతి చెప్పాలి.చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే లూలూ గ్రూప్ విశాఖ, విజయవాడ, మల్లవల్లిలలో కారు చౌక లీజుతో ప్రభుత్వ భూములను దక్కించుకుంది. అయితే ఇదే లూలూ గ్రూప్ గుజరాత్లో మాత్రం రూ.519 కోట్లు పెట్టి భూమి ఖరీదు చేసి మాల్ పెట్టుకుంటోంది. ఇలాంటి చర్యలకు జనం మద్దతు ఎందుకు? చంద్రబాబు, టీడీపీలు ముందుగా తన ఇంటిని సర్దుకున్న తరువాత వైసీపీపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది కాని, తమ తప్పులన్నిటిని, వైసీపీకి అంటకట్టే ప్రయత్నం చేస్తే సరిపోతుందనుకుంటే ఎల్లవేళలా సాధ్యపడదు. వైకుంఠపాళిలో గవ్వలతో పావులు కదుపుతున్నట్లుగా, ఏపీ ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చకుండా ఉంటే అదే పదివేలు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదండి బాబు మార్కు మోసం!
రాజకీయ పార్టీలకు మాటకు కట్టుబడే లక్షణం.. నిబద్ధత, ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం. లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహస్తుడన్న పేరు ఇప్పటికే సంపాదించి ఉండటం ఇందుకు కారణం.ఇప్పుడీ ప్రస్తావన మరోసారి ఎందుకొచ్చిందంటే.. టీడీపీతోపాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటన్న చర్చ వచ్చినందుకు! అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ వస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని, బకాయిలు చిటికెలో తీర్చేస్తామని ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గద్దెనెక్కిన 16 నెలల తరువాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కథలు చెబుతున్నారు. ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు రూ.34వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ముక్తాయించారు. సహజంగానే దీనిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది.2019లో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నెరవేర్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ ఇవి వృథా అని ఎన్నడూ చెప్పలేదు. తొలగిస్తామని కూడా అనలేదు. పైగా వలంటీర్లకు జగన్ ఇస్తున్న రూ.5వేలు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడేమో దానిని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. ఇది పక్కా మోసమే కదా?.వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే, చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్ధికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్లో రూ.లక్ష కోట్ల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు! అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకాని వాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు?. రైతులకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులెత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా!. జగన్ రైతులకు రూ.13,500 చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దానిని అమలు చేశారు. అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు?. జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా!.2014 టర్మ్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి యత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు. జగన్ టైమ్ లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం ఐఆర్ ఇచ్చి, తదుపరి 23 శాతం పీఆర్సీ ఇస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారే! చంద్రబాబు చెబుతున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్లు అవుతుందా?. తాను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా? ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి కదా!. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి కదా! నాలుగు డీఏ బకాయిలకు ఒకటే ఎందుకు ఇచ్చారు?.పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిన మాట నిజం కాదా? ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులను అదనపు రాయితీలు ఇచ్చి మరీ అక్కడకు తరలించారే. వారానికి ఐదు రోజుల పని చేయండని చెప్పారే. హైదరాబాద్లో భవనాలు వదులుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలను విజయవాడ, గుంటూరులలో తీసుకున్నారే. ఇదేమి ప్రభుత్వంపై భారం పడలేదా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా!. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నారా? లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారే! అది మంచి హామీనా?. ఆర్టీసీని ముంచే హామీనా?. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఏం కాదా?. అదే జగన్ చేస్తే నాశనం అయినట్లా? ఇదేం అన్యాయం.ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదానీ, రైడెన్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా రూ.22వేల కోట్ల ప్రజా ధనాన్ని తేలికగా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శకు మీరెచ్చే జవాబు ఏమిటి?. వేల కోట్ల లాభాలలో ఉన్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, ఉర్సా, లూలూ వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా?. గూగుల్ తదితర కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక ఆ కంపెనీలలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందా అన్న సందేహాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తే పరిస్థితి తెచ్చారే!.జగన్ టైమ్లో అప్పులు తేవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు తాను 16 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారో ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? డీబీటీ విధానం అంటే నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేయడం తప్పని చెబుతున్న చంద్రబాబు తాను అదే పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వెల్లడించాలి కదా!. అసలు ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాలలో ఉందని, తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని, తాను రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ప్రకటించారే. జగన్ ఎక్కడా అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు.పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను మార్చేయాలన్న భావనతో చంద్రబాబు సర్కార్ ఉందా? ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్, అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం అందుకున్నారా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అంతన్నారు ఇంతన్నారు.. తీరా చూస్తే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విధానాలను, సంక్షేమ పథకాలపై మనసూ మార్చుకున్నారా? ‘‘యువత పాతికేళ్ల భవిత కోరుతున్నారు’’ అని ఆయన ఇటీవల చేసిన ఒక ట్వీట్ ఇందుకు కారణమవుతోంది. రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ, జనసేనలు సంయుక్తంగా 2024 ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు, విడుదల చేసిన ప్రణాళిక, సూపర్ సిక్స్ హామీలకు ఈ వ్యాఖ్య భిన్నంగా ఉండటం గమనార్హం. 2018లో అక్టోబరు 12న పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. కొందరు యువకులతో భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపారు. తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ ఫోటోను ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ప్రతిగా పవన్ ఆ ట్వీట్ను ట్యాగ్ చేసి.. ‘‘ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదని, పాతికేళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు’’ అని కామెంట్ చేశారు. అందుకే తరచూ కలుస్తూ వారి (యువత) కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తున్నానని కూడా ఆ ట్వీట్లో చెప్పుకున్నారు. సహజంగానే ఈ ట్వీట్లో ఉన్న చిత్తశుద్ధి ఎంత? అన్న ప్రశ్న వస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లలో ఆయన ఇదే యువతను ఉద్దేశించి భిన్నమైన కామెంట్లు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. తన సినిమాలపై వ్యతిరేక కామెంట్లు చేసిన వారిపై దాడులు చేయమని యువతకు పిలుపునిచ్చారాయన. అంతేనా.. మోటార్సైకిళ్ల సైలెన్సర్లు తీసేసి తిరగాలని.. ఇంకా పలు రకాలుగా రెచ్చగొట్టారు. ఇవన్నీ పాతికేళ్ల భవిష్యత్తుకు మంచి చేసేవేనా? రాజకీయాల్లో ఉన్న వారికి నిబద్ధత అన్నది చాలా ముఖ్యం. ఇలా రోజుకో రీతిలో మాట్లాడం ఎంత మాత్రం సరికాదు. ఎప్పటికప్పుడు తప్పొప్పులను దిద్దుకుంటూ యువతకు ఆదర్శంగా నిలవడం అవసరం. ఈ దిశగా పవన్ ఏమీ చేయడం లేదన్నది సుస్పష్టం. టీడీపీ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ హామీలతోపాటు అప్పట్లో ఈయన గారు జనసేన తరఫున ‘షణ్ముఖ వ్యూహం’ పేరుతో కొన్ని వాగ్ధానాలు చేసిన విషయం రాష్ట్ర యువత మరచిపోయి ఉండదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం, స్టార్టప్లకూ ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని ఆయన షణ్ముఖ వ్యూహంలోనే ‘సౌభాగ్య పథం’ పేరుతో ప్రతిపాదించారు. ఒక్కో నియోజకవర్గానికి 500 మందికి ఇలా రూ.పది లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా దీని అయిపుఅజా లేదు. తాజాగా పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ పథకం ఉచితాల ఖాతాలోకి వస్తుందా? లేక నిర్మాణాత్మకమైందేనా? ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్లు ఇద్దరూ బోలెడన్ని హామీలిచ్చారు. అప్పటి సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలకు మించి ఇస్తామని నమ్మబలికారు కూడా. కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏది ఎలా ఎగ్గొట్టాలా? లబ్ధిదారులకు కత్తెరేయాలా? అన్న ఆలోచనలోనే ఉండిపోయారు ఒకటి, అర పథకాలను అరకొరగా అమలు చేసి మ మ అనిపించారు. ఈ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు పవన్ ఉచితాలు వద్దని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా? అయినా కావచ్చు! 2018లోనే ఉచితాలు వద్దని పవన్ భావించి ఉంటే.. 2024 ఎన్నికల్లో అన్ని హామీలు ఎందుకిచ్చారు? పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తామన్నది ఆ ఆలవికాని హామీల్లో ఒకటి. ఒకవేల టీడీపీ ఈ హామీని ఇచ్చిందనుకుంటే.. ఉచితాలను వ్యతిరేకించే ఆలోచన ఉన్న పవన్ ఎందుకు వద్దనలేదు? నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3000 ఇస్తామన్నది కూడా ఉచితం కాదనుకున్నారా పవన్? అమ్మ ఒడి పథకం కింద వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జగన్ ఆంధ్రప్రదేశ్లోని పేద కుటుంబాల్లోని ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇచ్చారు. అది చాలదని కుటుంబంలోని ప్రతి పిల్లాడికి రూ.18 వేలు చొప్పున ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? ఇవే కాదు.. బీసీలకు యాభై ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల ఫించన్, ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, వలంటీర్ల గౌరవ వేతనం పెంపు, కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వ్యయం, అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం, మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ఆంక్షల్లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారు కదా? పవన్ వీటన్నింటినీ ఉచితాలు కాదని అప్పట్లో హామీ ఇచ్చారా? ఇక ఉచిత ఇసుక మాట సరేసరి.అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం... ఇలా అనేక హామీలిచ్చారే... వీటి అమలుకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అసాధ్యమని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినా... సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని ప్రకటించారు కదా? ఇప్పుడు ఏమైంది? వృద్ధాప్య ఫించన్ల మొత్తం రూ.వెయ్యి పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మినహా ఏడాదిన్నరగా అమలు చేసింది ఎన్ని హామీలు? పరిస్థితులు ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా యువత ఉచితాలు అడగడం లేదని అనడంలో ఆంతర్యమేమిటి? హామీల ఎగవేతకు దారి వెతుకుతున్నారన్న అనుమానం బలమవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అతకని అతిశయోక్తులతో ప్రధాని ప్రసంగం...
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట. జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్ల డేటా సెంటర్ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు. కారణమేమిటో మరి?తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్టెల్లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్కు ఆ ధైర్యం ఉందా?
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజీనామా చేసేస్తానని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రకటించారు. ఈ మాటల వెనుక చిత్తశుద్ధి ఎంత? అన్న దానిపై అందరిలోనూ సందేహాలున్నాయి. సినిమా నటుడైన పవన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ మేలైన నటనకు అలవాటు పడిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటలకు.. అధికారం వచ్చిన తరువాత చేతలకూ అసలు పొంతన లేకపోవడం ఇందుకు కారణమవుతోంది.సముద్రజలాల కాలుష్యం పెరిగిపోతుండటం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. పిఠాపురం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. తమ సమస్యలు వినేందుకైనా ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే రావాల్సిందేనని భీష్మించుకున్నారు. అనారోగ్యం, ఇంకో కారణం చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా రాయబారం నడిపిన పవన్ వారిని కలవలేదు. త్వరలో వస్తానన్న హామీ మేరకు మత్స్యకారులు తమ ఆందోళన విరమించుకున్నారు కూడా. ఆ తరువాత.. సరిగ్గా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన రోజే పవన్ కళ్యాణ్ కూడా తన సభ పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కొందరి అనుమానం పక్కనబెట్టినా.. మత్స్యకారులను కలిసిన పవన్ ఏదైనా నిర్దిష్టమైన హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. వందరోజుల్లోపు న్యాయం జరక్కపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానన్న నామ్ కా వాస్తే అన్నట్టుగా ప్రకటనైతే చేశారు.కొన్ని సినిమా డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. సమస్యను అధ్యయనం చేయాలని.. సముద్రంపైకి వెళ్లి తానే పరిశీలిస్తానని కూడా చెప్పారు కానీ.. ఏదీ చేసినట్లయితే తెలియరాలేదు. మాటలు మార్చడం పవన్కు కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే పలు వీడియోలు సోషల్ మీడియాలో ఏళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయనకే చిత్తశుద్ధి ఉండి ఉంటే తాము అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చామన్న విషయం ఒప్పుకునేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతెందుకు.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఈమధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేకానేక వ్యవహారాలపై పల్లెత్తు మాట కూడా అనలేదు కదా? సొంత పార్టీ ఎమ్మెల్యేల దందాలు కానీ.. లంచాలు తీసుకుంటున్నామని బహిరంగంగానే చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నా వ్యతిరేకించలేదు సరికదా.. ఇది తప్పని చిన్న మాటైనా అనలేకపోయారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులని తేటతెల్లమవుతున్నా.. పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఒట్టు.గతంలోనూ ఇంతే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించిన చంద్రబాబుకు వపన్ దన్నుగా నిలిచాడు. సనాతని వేషం కట్టి.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు వెళ్లాయని ఆరోపించారు. వాస్తవాలు బయటపడిన తరువాత మాత్రం ఇప్పటివరకూ ఆ అంశంపై కిమ్మనలేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన ప్రకటనలు ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి పొట్టకొట్టబోమని, జీతాలు పెంచుతామని బహిరంగంగానే ప్రకటించారు. అధికారం వచ్చిన తరువాత వాటి ఊసెత్తేందుకూ ఇష్టపడటం లేదు. సుగాలి ప్రీతి విషయంలోనూ అంతే. ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని అధికారం వచ్చిన వెంటనే తొలి ఆదేశం జారీ చేస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిపాటు ఆ ఊసే ఎత్తలేదే! కూతురికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కితే మాత్రం ఆమెనే తప్పు పట్టారు. ఇంకో జనసేన నేత ఆ తల్లిపై నీచమైన కామెంట్లు చేశారు.ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది మహిళలు కనపడకుండా పోయారని, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు తనకీ విషయాన్ని చెప్పాయని ఊరంత ఊదరగొట్టిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే తేవడం లేదు. తప్పిపోయింది కేవలం 34 మంది మహిళలు మాత్రమేనని స్వయంగా కూటమి నేతలే ప్రకటించారు. వాస్తవానికి రాజకీయాలకు గుడ్బై చెప్పేసేంత విషయం ఇది. అలాగే.. నాసిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కిడ్నీలు పాడైపోతున్నట్లు హైదరాబాద్ డాక్టర్లు చెప్పారంటూ కూడా పవన్ అప్పట్లో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు అధికార భాగస్వామి టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ, పంపిణీ కర్త, కర్మ, క్రియలని తెలిసిన తరువాత నోరు కూడా విప్పడం లేదు. పవన్ కళ్యాణ్ కలుగులో దాక్కున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేయడం కూడా ఇందుకే. ఒక్కో నియోజకవర్గంలోని 500 మంది యువకులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి పరిశ్రమలు స్థాపింపజేస్తామని కూడా పవన్ గతంలో చెప్పారు. ఎందుకని ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదో ఆయనకే తెలియాలి.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని హామీలను అమలు చేయకపోవడం ప్రజలను వంచించడమే. రాజకీయాలకు గుడ్బై చెప్పాల్సినంత పెద్ద విషయాలే. కానీ.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో పర్యటిస్తూ, సినిమాలలో నటిస్తూ, అటు అధికారాన్ని.. ఇటు సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటారు? తప్పుకోకున్నా ఫర్వాలేదు కానీ.. తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పినా పవన్కు మంచి పేరు వస్తుంది. అయితే ఆయనకు ఆ ధైర్యం ఉందా? అన్నదే ప్రశ్న. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నకిలీ మద్యంపైనా టీడీపీ మార్కు లీల!
తనపై వచ్చిన ఆరోపణలను ప్రత్యర్థులకే చుట్టబెట్టడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అందవేసిన చేయి. అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడే రాజకీయాలు చేస్తారు. విలువలతో నిమిత్తం లేకుండా వ్యవహరించే తీరు సమాజానికి ఏ మాత్రం ఆదర్శంగా కనపడదు. నకిలీ మద్యం కేసు ఇప్పుడు చంద్రబాబు నైజానికి ఇంకో నిలువెత్తు తార్కాణంగా నిలుస్తోంది. ములకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ తెలుగుదేశం పార్టీ నేతలే అని తేటతెల్లమైనా ఆ కేసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. కస్టడీలో ఉన్నా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ద్వారా వీడియో విడుదల చేయించిన వైనం, అందులో తెలుగుదేశం ప్రభుత్వానికి సర్టిఫికెంట్ ఇప్పించుకోవడం చూసి విస్తుపోవడం ప్రజల వంతైంది.జనార్ధనరావు విడుదల చేసిన వీడియో సారాంశం మొత్తం ఎల్లో మీడియాలో విపులంగా ప్రచురించారు. అది అచ్చంగా కాశీ మజిలీ కథ మాదిరిగా ఉంది. జగన్ జమానాలో జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేశ్ రూ.మూడు కోట్లు ఆశజూపి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించారట! జోగి రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే తాను ఆయన నేతృత్వంలో నకిలీ మద్యం తయారు చేశానని, హైదరాబాద్ నుంచి తెచ్చి బార్లో విక్రయించేవాడినని ఆయన అన్నారట. ఇది నిజమైతే అలాంటి వ్యక్తి టీడీపీ వారికి ఎలా దగ్గరయ్యాడు? పైగా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పెట్టిస్తే చంద్రబాబు ఎలా బద్నామ్ అవుతారు? కుప్పంలో పెట్టించి ఉంటే బాబుకు మరింత ఎక్కువ నష్టం జరిగేదిగా అన్న అనుమానం వస్తే కాశీ మజిలీ కథలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అంతేనా...? నకిలీ ప్లాంట్ సిద్దం చేసి సరకు నిల్వచేసి పెడితే ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్ పై దాడులు జరిగేలా చూస్తామని రమేశ్ చెప్పారట. అంటే మంత్రిగా పనిచేసిన రమేశ్కు అలా ప్లాంట్ పట్టుబడితే తన మీదకు కూడా కేసు వస్తుందని తెలియని అమాయకుడని జనార్ధనరావు చెప్పారన్నమాట. ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించిన సందర్భంలోనే అక్కడ టీడీపీ నేత, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ ద్వారా నకిలీ మద్యం ఇతర చోట్లకు రవాణా అయినట్లు ప్రకటించారు. ఆ స్థలంలోనే ఉన్న పాలవ్యాన్ల ద్వారా బెల్ట్షాపులకూ చేరుతోందని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలేనా? టీడీపీ ముఖ్య నాయకులను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో తాను చెబుతున్న విషయాలేవి హైలైట్ కాలేదట. రమేశ్ ఆఫ్రికాలో ఉన్న తనకు ఫోన్ చేశారని జనార్ధనరావు చెప్పారట. అది నిజమైతే, ఫోన్ బొంబాయిలోనే వదలివేసి రావడం ఎందుకు? పనిలో పని జయచంద్రారెడ్డికి కూడా మద్యం తయారీతో ఎలాంటి సంబంధం లేదని ఈయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న మద్యం వ్యాపారం మాటేమిటి? ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తానని, అప్పటివరకూ ఆఫ్రికాలోనే ఉండమని జోగి రమేశ్ తనతో చెప్పారని, ఆ పని జరక్కపోవడంతో ఈలోగా తన తమ్ముడిని అరెస్ట్ చేయడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు జనార్ధనరావు చెప్పారట. జనార్ధన రావు వాదనలో లొసుగులు అన్నిఇన్నీ కావు. ఆఫ్రికాలో ప్లాంట్ పెట్టగలిగిన వ్యక్తి రూ.మూడు కోట్ల ముడుపుల మొత్తానికి ఆశపడటం నమ్మశక్యంగా కనిపించదు. అలాగే అధికారంలో ఉన్న వారి నుంచి గట్టి హామీ ఏదీ లేకుండా ఎవరూ బెయిల్ కోసం ప్రయత్నించకుండా విదేశాల నుంచి ఆకస్మికంగా రారు. తొలుత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న నకిలీ మద్యం ప్లాంట్ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఎక్సైజ్ అధికారులు కూడా దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందని, ప్రభుత్వంలోని పెద్దలు కొంతమందికి ఈ కేసులో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిసి ఉంటే ఈ వ్యవహారాన్ని ముందుగానే తొక్కిపెట్టి వేసేవారేమో తెలియదు. అనూహ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అవడం, పలు చోట్ల నకిలీ మద్యం పంపిణీ అయిందని వార్తలు రావడంతో సంచలనమైంది. మద్య పానం చేసేవారిలో ఆందోళన పెరగడం, కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని, మరికొందరు అకాల మృతి చెందారని కథనాలు వచ్చాయి. అప్పటికి దీని సీరియస్నెస్ కనిపెట్టిన ప్రభుత్వ ముఖ్యులు వెంటనే టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, కట్టా సరేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఆ చర్యతో ఈ స్కామ్తో టీడీపీ వారికి ఉన్న కనెక్షన్ ప్రజలందరికి తేటతెల్లమైంది. ఇది మరింత డామేజీ అయిందని భావించిన ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో వ్యూహంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో టీడీపీ వారు ఉన్నా సహించబోమన్న సంకేతం ఇవ్వాలని, తద్వారా క్రెడిట్ పొందాలని భావిస్తున్న తరుణంలో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లతో ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చా యి. జయచంద్రా రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇచ్చిన వైనంపై సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనిషి అని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. తంబళ్లపల్లెలో రామచంద్రా రెడ్డి సోదరుడు ద్వారకానాథ రెడ్డిని గెలిపించుకోవడానికి టీడీపీలోకి పంపించారని, ఆయన కోవర్టు అనే వాదన తీసుకువచ్చారు. దీనిపై అంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే లోక్సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటి ద్వారా కొత్త కథలు సృష్టించారు. జగన్ జమానాలోనే నకిలీ మద్యం మొదలైందని, జనార్ధనరావు తదితరులు అప్పటి నుంచే ఈ వ్యాపారం చేశారని అంటూ వార్తలు ఇచ్చారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నం లో మరో నకిలీ మద్యం డంప్ బయటపడింది. ఇది మద్యం సేవించే వారిలో ఆందోళన పెంచింది. ఈ సమయంలో ప్రభుత్వం దీనిపై కచ్చితమైన చర్యలు తీసుకుని మద్యం తీసుకునే వారి ఆరోగ్యాలపై దృష్టి కేంద్రీకరించకుండా, వాటిని వదంతుల కింద, వైఎస్సార్సీపీవారి దుష్ప్రచారం కింద తిప్పి కొట్టడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ కేసు విచారణకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వారు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తుంటే తన అధీనంలో ఉన్న సిట్ వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అంతేకాకుండా, మీడియాతో మాట్లాడుతూ స్కామ్ ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని, ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనీయం, రాజకీయం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. ఆ బ్యాచ్ ఎవరో మీకే త్వరలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆఫ్రికా వారిని కూడా మనమే కాపాడాలని వింత ప్రకటన చేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్ పై స్పందిస్తూ, కేసును సాగదీయాలనే ఆలోచనతోనే అడుగుతున్నారని అనడం తమాషానే అనిపిస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సీబీఐ సమర్థతపై నమ్మకం లేదన్నమాట. తన హయాంలో నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని బుకాయించడానికి యత్నించారు. అదే వైఎస్సార్సీపీ టైమ్లో మాత్రం నిరాధారంగా 30వేల మంది చనిపోయారని ఎలా చెప్పారు? ఇది శవ రాజకీయం కాదా? సిట్ ఏమి చేయబోతోందో ముందస్తుగానే ఆయన సంకేతాలు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.అది అలా ఉండగా, ఆఫ్రికాలో ఉన్న జనార్ధనరావు ఏపీకి వచ్చి లొంగిపోయారు. అంతకు ముందు ఆయన విడుదల చేసిన వీడియో లో ఎక్కడా జోగి రమేశ్ పై కాని, వైఎస్సార్సీపీపైన కాని ఆరోపణలు చేయలేదు.కాని అరెస్టు అయ్యాక, వీడియో ఆయన ఎలా చేశారో, దానిని ఎలా ఎల్లో మీడియాకు అందచేశారో, ఇందులో పోలీసుల పాత్ర ఏమిటో తెలియదు కాని, మొత్తం కధను జోగి రమేశ్ పై నెట్టేశారు. ఇది టీడీపీ పెద్దల నైపుణ్యం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత తామే నకిలీ మద్యం ప్లాంట్ ను ,డంప్ లను కనిపెట్టామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు ఎవరి ద్వారానో సమాచారం అందించి దాడులు చేయించారని జనార్ధనరావుతో చెప్పించారు. ఇక్కడే ప్రభుత్వం దొరికిపోయిందనిపిస్తుంది. ఈ నకిలీ మద్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందన్న అంచనాకు వచ్చిన పెద్దలు వెంటనే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా జోగి రమేశ్ వైపు మలుపు తిప్పారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఈ నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జోరుగా నిరసనలు చేసిన సాయంత్రానికే జనార్ధనరావు వీడియోను వ్యూహాత్మకంగా విడుదల చేశారు. అయితే అందులో జరిగిన తప్పిదాలతో దొరికిపోయారన్న భావన కలుగుతుంది. అలాగే సురేంద్ర నాయుడు కు ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడితే ఆయనకు క్షమాబిక్ష పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా ?కాదా?ఏ సంబంధం లేకుండా అలా చేస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ప్రశ్నకు ఎందుకు టీడీపీ నుంచి సమాధానం రాలేదు? ఇవన్ని ఎందుకు ! సీబీఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జి దర్యాప్తు ,లేదా వెంకకటేశ్వర స్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి రావాలని, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేశ్ సవాల్ చేశారు. వాటిలో ఒక్కదానికైనా చంద్రబాబు లేదా ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదు? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీసీ రిజర్వేషన్లతో పార్టీల ‘రాజకీయం’!
గాల్లో కత్తులు దూయడం... శూన్యంలో యుద్ధాలు చేయడం రాజకీయ పార్టీలు, నేతలకు అలవాటైన విద్యే. తెలంగాణ స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దీన్నే నిరూపిస్తోంది. అన్ని పార్టీలకూ తుది పరిణామం ఏమిటన్నది స్పష్టంగా తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూంటారు. ప్రత్యర్థులపై పైచేయికి వ్యూహాలు పన్నుతూంటారు. నిర్దిష్ట గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్నికల్లో అధిపత్యానికి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేయాలని సంకల్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలు 56 శాతమని తేల్చారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం 42 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. స్థానిక సంస్థలలోనే కాక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకురిజర్వేషన్లు ఉండాలని కొన్ని రాష్ట్రాల శాసన సభలు తీర్మానాలు కూడా చేశాయి. కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఏభై శాతానికి మించే వీలు లేదు. అయినా తాము అనుకున్న రిజర్వేషన్ల శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది. ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతుందని అంతా అనుకున్నదే. అయినా ఎవరికి వారు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గడిపారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. కాని రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. గవర్నర్ సకాలంలో ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు ఓకే అయిపోయినట్లే అని కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా తాము 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి జీవో ఇచ్చింది. అయినా ఎవరికి ఇది అమలు అవుతుందన్న నమ్మకం లేదు. కాని ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆ జీవోపై హైకోర్టులో ఊహించినట్లే స్టే వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం మరో చిత్రం. తదుపరి హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది. ఈ గేమ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అవడం గమనించదగిన అంశమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్కు తెలియదా? తీర్పు వచ్చాక మళ్లీ రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు కొనసాగించాయి. రిజర్వేషన్ల జీవోను బీజేపీ, బీఆర్ఎస్లే అడ్డుకున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిని ప్రజలలో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు కేడర్కు పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ది ఉందా అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తమకు రావడానికే గేమ్ ఆడారు తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఈ వ్యవహారానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించేవి. రిజర్వేషన్ల అంశంపై మాత్రం అందరూ పోటాపోటీగా 42 శాతానికి మద్దతిస్తున్నట్లు మాట్లాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తే రేవంత్ విమర్శించేవారని, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం నేరమన్నారని బీఆర్ఎస్ ఇప్పడు గుర్తు చేస్తోంది. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తనే రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం ఉందన్నట్లుగా బిల్లు ఆమోదింప చేశారు. జీవో కూడా ఇచ్చేశారు. మరి ఇది చెల్లదన్న సంగతి ఆయనకు తెలియదా? అంటే ఏమి చెబుతాం? కులగణనతో చాలా మార్పులు వచ్చేస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అంటూ దేశంలో పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. తమిళనాడులో మాదిరి షెడ్యూల్ 9 లో చేర్చితేనే రిజర్వేషన్ లకు చట్టబద్దత వస్తుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ బీహారు ఎన్నికలలో ప్రయోజనం కోసం ఈ డ్రామా ఆడిందని మాజీ స్పీకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఉన్న చిత్తశుద్దిని రుజువు చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో స్టే రాకపోతే స్థానిక ఎన్నికలు జరిగిపోయేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచిన పార్టీగా పేరు తెచ్చుకునేది. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేశామనిపించుకునేది. గతంలో కేసీఆర్ కూడా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి ప్రచారం చేశారు.. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయనకు కూడా తెలుసు. అయినా కావాలని అప్పట్లో అలా చేశారన్నది నిష్టుర సత్యం. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పంథాలో సాగిందని చెప్పాలి. బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించి, అటు పాము చావకుండా, ఇటు కర్ర విరగకుండా వ్యవహరించింది. కేంద్రం మీదకు నెట్టాలని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం మీద నెపం ఉండేలా బీజేపీ ప్రయత్నం చేశాయి. జాతీయ పార్టీలను తప్పుపట్టి తానే బీసీలకు అనుకూలం అన్న భావన కలిగించాలని బీఆర్ఎస్ యత్నం.వాస్తవానికి ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయానిపిస్తుంది. కాకపోతే అమాయక గ్రామీణులు కొందరు నిజంగానే ఎన్నికలు వచ్చేస్తాయనుకుని తమ చేతులు కాల్చుకున్నారట. దసరా నాడు వారికి ఎన్నికల ఖర్చు రూపేణా బాగానే చేతి చమురు వదిలిందట. ఏతావాతా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామాగా మార్చడం దురదృష్టకరం. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షిస్తున్న బీసీ వర్గాలకు మరోసారి నిరాశే ఎదురైంది.తాజాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇందుకు భిన్నంగా తీర్పు వస్తే ఒక చరిత్రే అవుతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబును నమ్మి... రెంటికీ చెడుతున్న అమరావతి రైతులు
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ, బలవంతపు సేకరణ ప్రతిపాదనలు వస్తూండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతుల నుంచి సేకరించింది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కలిపి 53 వేల ఎకరాల వరకూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని భూములు కావాల్సిందేనని భీష్మించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో స్వచ్చందంగా భూములివ్వని వారిపై 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా సుమారు 3500 ఎకరాలు తీసుకోబోతున్నారట. తద్వారా తొలిదశ అసలు లక్ష్యమైన 38 వేల ఎకరాలు సేకరించినట్లు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. రెండో దశ భూ సమీకరణపై చర్చ జరగలేదని చెబుతూ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, రోప్ వే, రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనర్థం... రెండో దశకు సుమారు 44 వేల ఎకరాలు తీసుకోబోతున్నామని తెలివిగా చెప్పడమే. ఇది రైతులకు అర్థం కాదన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా అమరావతి రైతులను సంక్షోభంలోకి నెట్టేదే. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, బలవంతపు సేకరణ అస్సలు ఉండదని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నమ్మబలికింది. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తే చాలామందికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వదలుకోవడానికి సిద్దపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వాన్ని ఎదిరించారు. బెదిరింపులకు లొంగకుండా సేద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని బెదిరించేందుకు పంటలను దగ్దం చేశారన్న ఆరోపణలూ అప్పట్లో వచ్చాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. చంద్రబాబు, మరికొందరు నేతలు అమరావతి రైతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. వాస్తవానికి జగన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెయాలని సంకల్పించారు. కానీ ఈ విషయంపై అప్పటి ప్రతిపక్షం రకరకాలుగా దుష్ప్రచారం చేయించింది. ఉద్యమం పేరుతో హడావుడి చేయించారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత తమకు లాభం చేకూరుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలతో ప్లాట్లు వచ్చేస్తాయని అమరావతి రైతులు భావించారు. కానీ.. జరిగింది వేరు. చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేయకపోగా అదనపు భూముల కోసం ఎత్తులేస్తున్నారు. పైగా తొలిదశలో భూములిచ్చిన కొందరు రైతులకు.. పూలింగ్కు ఇవ్వని వారి భూమిలో ప్లాట్లు కేటాయించారట. ఆ భూములను ఇప్పుడు బలవంతంగా సేకరించి ప్లాట్లు ఇస్తారట. ఇది ఏ ధర్మం? ఇంకో సంగతి చెప్పాలి. ఇక్కడ ఎకరా రూ.నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోతోందని, చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు మార్లు చెప్పారు. ఆ ప్రకారం వీరికి 2013 చట్టం కింద మూడు రెట్లు ఎక్కువ ధర ఇస్తారా? అలా కాకుండా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే పరిహారంగా ఇచ్చే యత్నం చేస్తే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరో వైపు అప్పట్లో పూలింగ్కు భూములు ఇవ్వని 3500 ఎకరాల రైతులకు ఎంత పరిహారం దక్కుతుందో తెలియదు. ప్లాట్ల కేటాయింపు కేవలం పేపర్లపైనే ఉండడం వల్ల భూములు అమ్ముడుపోవడం లేదని రైతులు చెబుతున్నారు.ఇక రెండో దశ భూ పూలింగ్కు భూములివ్వడం చాలామందికి ఇష్టం లేదు. పెదపరిమి వంటి గ్రామాలలో కొందరు టముకు వేసి మరీ పూలింగ్కు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగానూ తొలిదశ రైతులకు న్యాయం చేయకుండా తమ వద్దకు ఎలా వస్తారని చాలామంది ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాకపోతే ఒకసారి భూమి తీసుకోవడం లేదని చెబుతారు. ఇంకోసారి ఆ భూములు ఇవ్వకపోతే, ఈ ప్రాంతం ఒక మున్సిపాల్టీగా మిగిలిపోతుందని బెదిరిస్తున్నారు. రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని ఎల్లోమీడియాలో ప్రచారం చేయించారు. కాని అదే సమావేశంలో ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటుకు తీర్మానించారు. ఆ కంపెనీ విమానాశ్రయం, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ వంటివి చేపడుతుందని చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణ పనులు నేరుగా కాంట్రాక్టర్లకే భూములు కేటాయించి అప్పగిస్తారట. ఆ కాంట్రాక్టర్లు భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుని వాటిని కడితే యూజర్ ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నష్టమొస్తే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వం మళ్లీ ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. ఈ ప్రత్యేక కంపెనీకి భూములు గతంలో ప్రతిపాదించిన ప్రకారం రెండో దశ గ్రామాల నుంచే రావాలి. ఆ రకంగా 44 వేల ఎకరాల భూమి తీసుకుంటారని నేరుగా కాకుండా ప్రాజెక్టుల మిష పెడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు చేసి, రైతులకు న్యాయం చేయకపోతే అమరావతిలోనే తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు. కొందరు రైతులు ప్రభుత్వం తమను ఏ రకంగా వేధిస్తుందో ఇప్పటికే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుకు మునిశాపం ఇంకా తీరినట్లు లేదు!
నెలకోసారి నాలుగు వేల పింఛన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఖర్చుల సంగతి కాసేపు పక్కనబెడదాం. కానీ, ఈ పర్యటనల సందర్భంగా ఆయన అసత్యాలు, అర్ధ సత్యాలూ మాట్లాడుతుండటం ఆయన పదవికి శోభనిచ్చేది కాదు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సినంత అనుభవం బాబు గారిది. అబద్ధాలకోరు అని ప్రజలు అనుకునేలా ఉండకూడదు. ప్రతిపక్షాల ఆరోపణలు కాకపోయినా ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోయే అబద్ధాలు ఆడటం వల్లనే వస్తోంది చిక్కు.చంద్రబాబుకు సంక్షేమం మీద అస్సలు నమ్మకం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అప్పు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించిన వ్యక్తి ఈయన. కానీ.. ఎన్నికలు వస్తే చాలు.. ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఖర్చులతో నిమిత్తం లేకుండా ఎడాపెడా హామీలు గుప్పించేస్తారు. 2024లోనూ ఇలాగే చేసి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అరకొర అమలుతో మమా.. అనిపించేశారు. గోరుముద్దలు పెట్టేటప్పుడు ఇదే పప్పు అనుకో! ఇదే కూర అనుకో, ఇదే పచ్చడి అనుకో, ఇదే పెరుగు అనుకో.. అని పిల్లలకు చెబుతారు చూడండి.. సరిగ్గా అలాగే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.పర్యటనల సందర్భంగా ‘పేదల సేవలో ప్రజా వేదిక’ అనే పేరు స్టేజికి పెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, తీసుకునే చర్యలేవీ పేదలకు అనుకూలంగా ఉండవు. పేదల పేరు చెప్పి ధనికులు, పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవం దీనికి చాలా భిన్నం. ఒక ఫించన్ల మొత్తంలో పెంపు మినహా కూటమి సర్కారు తొలి ఏడాది ఎన్నికల హామీలు నెరవేర్చింది ఏమీ లేదు. అయినా సరే.. ఫించన్ల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అంటారు బాబుగారు.వాస్తవానికి ఈ క్రెడిట్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దక్కాలి. ఎందుకంటే సుమారు 45 లక్షలుగా ఉన్న ఫించన్లను 64 లక్షలకు తీసుకువెళ్లారు. అదే సమయంలో 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాలుగున్నర లక్షల ఫించన్లు తొలగించారు. ఇదిలా ఉంటే.. ఫించన్ల సొమ్మును ఇంటి పన్నులకు జమ చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటిది జగన్ టైమ్లో జరిగి ఉంటే చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండేవారు. విజయనగరం జిల్లాను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని చంద్రబాబు చెప్పడం స్వాగతించదగిందే. కాకపోతే ఇప్పటికే ఆయన సుమారు 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సంగతి మర్చిపోతుంటారు.చంద్రబాబు ఈ మధ్య చెబుతున్న పలు అసత్యాల్లో పెట్టుబడుల అంశం ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. నిజమైతే ఇదో అద్భుతమైన రికార్డు. కేంద్రమే ప్రకటించి ఉండేది. అదేమీ జరగలేదు. ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు నిరుద్యోగ భృతిని ఎగవేయడం కోసం ఇలా అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. వలంటీర్లు 2.5 లక్షల మందితోపాటు ఏడాది కాలంలో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది. అలాగే 2014-19 మధ్య మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడులపై అసత్యాలు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చేశాయని ఆయన చెప్పారని ఎల్లో మీడియానే రాసింది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఆయనకు, ఎల్లో మీడియాకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటూ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.విశాఖలో జరగబోయే సదస్సుకు రావాలని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్లు ఢిల్లీ వెళ్లి పారిశ్రామిక వేత్తలను కోరారు. ఇది తప్పు కాదు. కానీ, ఇంతకాలం చంద్రబాబు బ్రాండ్ను చూసి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారని ప్రచారం చేశారు. ఆ బ్రాండ్ ఏమైందో తెలియదు కానీ.. వీరే వెళ్లి సదస్సుకు రావాలని పరిశ్రమల వారిని అభ్యర్ధించవలసి వస్తోంది. ఇదే పనిమీద వీరు దుబాయికి కూడా వెళుతున్నారట. సదస్సు తర్వాత మరో పదో, పదిహేను లక్షల కోట్లో లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు చెబుతారు. ఆ తర్వాత అవి వచ్చేశాయని అంటారు.వైఎస్సార్సీపీ విద్యుత్తు ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచిందని తాము ఆ పని చేయలేదని ఆయన చెబుతున్నారు. ఛార్జీల మోత తట్టుకోలేక ప్రజలు హాహాకారాలు చేస్తూంటే చంద్రబాబు అసలు పెరగలేదని ధైర్యంగా చెబుతున్నారు. దీని గురించి ఆయన జనాన్ని ప్రశ్నించి ఉంటే తెలిసేది. పైగా అనుమతించిన దానికన్నా ఎక్కువ వసూలు చేసినందుకు విద్యుత్ నియంత్రణ మండలి చివాట్లు పెట్టి డబ్బు వెనక్కు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్నీ కప్పిపుచ్చుతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలోనూ ఇలాంటి అబద్ధాలను ఎవరైనా నమ్ముతారా? అన్నది కూడా ఆలోచించడం లేదు. 2024లో ఏపీకి స్వాతంత్రం వచ్చిందని అంతటి సీనియర్ నేత చెప్పడం దారుణంగా ఉంటుంది. నిజంగానే వైఎస్సార్సీపీ హయాంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు కాని, ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ తదితరులు అన్ని అసత్యాలు ప్రచారం చేయగలిగేవారా?.ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కట్టడి చేయడానికి, హామీల గురించి ప్రశ్నించకుండా ఉండడానికి నిర్భంధకాండను అమలు చేస్తున్న సర్కార్, లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అధినేతగా చంద్రబాబు స్వాతంత్రం గురించి మాట్లాడడం అర్థరహితం అనిపిస్తుంది. ఇప్పుడు నియంతృత్వంగా ఉందా? గతంలో ఉందా అని ఆయన ఒక సర్వే చేయించుకుంటే మంచిది. పైగా సోషల్ మీడియాను అణచివేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్నే నియమించిన ఆయన స్వేచ్చ గురించి కథలు చెబుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మంచిదే.. నిజంగా అందులో నిజం ఉంటే ఆయన ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎందరిపై మహిళల వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎందరి తోలు తీశారో చెబితే బాగుండేది కదా!.జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేని ఏం చేశారు?. ఒక విద్యాలయ ప్రిన్సిపాల్ను వేధించిన మరో ఎమ్మెల్యేని ఏం చేశారు?. చిత్తూరులో ఒక యువతిని హింసించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల తోలు తీశారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కబుర్లు చెప్పడం వేరు. కార్యాచరణ వేరు. లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పని చేయించాలన్నది తమ ఆలోచన అని, అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియాలోనే వసూల్ రాజాలుగా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ వచ్చిన వార్తల సంగతేమిటి?. తొలుత వారిని కట్టడి చేసిన తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పాలి.ప్రజలకు ఎలాంటి లంచాలతో పని లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలను ధ్వంసం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడేదో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు!. దీపావళికి మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ఆయన అంటున్నారు. అవి ఎవరి హయాంలో నిర్మితమైంది అందరికీ తెలుసు. కాకపోతే వాటిని తామే నిర్మించామని చెప్పకుండా, గత ప్రభుత్వం ఏం చేసింది.. తమ సర్కార్ ఏం చేసింది వివరిస్తే గౌరవంగా ఉంటుంది. అలాకాకుండా జగన్ ప్రభుత్వం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకున్నంత మాత్రాన జనానికి వాస్తవాలు తెలియకుండా పోవు కదా!. చంద్రబాబు నుంచి సత్యం ఆశించడం అత్యాశేనా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నియంతృత్వ పోకడకు సిద్ధమవుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, భావ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్బుక్ పేరుతో అరాచకపు పాలన సాగిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సర్కారు సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తోంది. రెడ్బుక్ సృష్టికర్త, మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ సార్థ్యలోనే ఈ కమిటీ పని చేయబోతుండడం ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. మంత్రుల కమిటీ బాధ్యతల ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్బుక్తో భయపెట్టడానికి చేసిన యత్నం విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త అంకానికి తెరతీసినట్లు అర్థబవుతుంది. తమ దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై వైఎస్సార్సీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై 15 నెలల్లో 2300 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్లు రాష్ట్రంలోను, వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని, తద్వారా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై నిరంతరం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుఎ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్తోపాటు విదేశాల్లోనూ ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్న లోకేశ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది? వాటికి ఉండే పవిత్రత ఏమిటి? సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతమున్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగబడడమేమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్లు ఎలా మారుస్తారు? అని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పోన్నవోలు సుధాకరరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాతో పాటు, తన వైఫల్యాలను పదే, పదే గుర్తు చేసే ప్రదాన మీడియాను ముఖ్యంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతోంది. సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్న తీరు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైనం పై న్యాయ స్థానాలు తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు సవిందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసుల అరాచకపు ప్రవర్తనను తేటతెల్లం చేసింది. హోం మంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు తమ పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడడం లేదని, మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు గురయ్యారు. ఆమె చెప్పిన వారిలో ఒకరైన విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణలు చేయలేదు. ప్రభుత్వం మంచి, చెడులను గణాంకాలతో సహా విశ్లేషిస్తారు. ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోం మంత్రి మాట్లాడడం అందరిని నివ్వెరపరచింది. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప, ఫలానా కులం అని చెప్పడం ఏపాటి విజ్ఞత? అలాగే మరొకరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకుని యూ ట్యూబ్ నడుపుతున్నారని, అతని పేరు ముకేష్ రెడ్డి అని హోం మంత్రి అసెంబ్లీలో చెబితే, ఆ యువకుడు తన ఆధార్ కార్డు చూపి మరీ తాను చలపతి చౌదరినేనని రుజువు చేసుకున్నారు. దాంతో ఈ ప్రభుత్వ డొల్లతనం, మంత్రిగారి తొందరపాటుతనం అన్నీ బయటపడ్డాయి.మంత్రి అనిత చెప్పేది ప్రామాణికం అయితే స్వాతిరెడ్డి అనే పేరుతో సోషల్ మీడియాలో వైసిపిని విమర్శించే ఒకరు చౌదరి అట. పైగా ఆమెను గతంలో చంద్రబాబు అభినందించిన ఘట్టం కూడా జరిగిందట. ఆమె గురించిన సమాచారం అనిత వద్ద లేదా? లేక ఆమె తమ పార్టీ కనుక వదలి వేశారా అని కొందరు ప్రశ్నించారు. ఇక జగన్ ను ఉద్దేశించి మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడేది అందరికి తెలిసిందే. అంతేకాదు. గతంలో ఈ మంత్రిగారు జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చట్టసమ్మతమేనా అని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మంత్రిగారు కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇక ప్రభుత్వ పెద్దలు నిత్యం అబద్దాలు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన దారుణ వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని లోకేశ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా? గతంలో పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ చేసిన దారుణమైన అబద్దపు ప్రచారంపై ఈ కమిటీ ఏమైనా విశ్లేషిస్తుందా! సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యతిరేక ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని చూస్తున్న ఈ కమిటీ ప్రభుత్వంలో అబద్దాలు ఆడే వారిపై కూడా కేసులు పెట్టవచ్చని సిఫారస్ చేయగలుగుతుందా? అప్పుడు ఈ కమిటీకి విలువ వస్తుంది.కాని అలా చేయలేరు. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత దుష్ప్రచారం చేసింది చంద్రబాబు, లోకేశ్ లకు తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియకపోవచ్చు. దానిని ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం, ఇప్పుడు ఈ కమిటీ ప్రయత్నిస్తుందన్న విమర్శ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది.వాటిని ఎపి పోలీసులు సరిగా పాటించడం లేదు. ఏడేళ్ల శిక్షకు అవకాశం ఉన్న సోషల్ మీడియా కేసులలో నోటీసు ఇచ్చి పంపాలి. అలా చేయడం ఇష్టం లేని రెడ్బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న పోలీసులు పలు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ కమిటీ అలాంటి పోలీసులపై చర్య తీసుకోవడానికి సిఫారస్ చేస్తుందా? ఈ కమిటీ జవాబుదారితనం గురించి ఆలోచిస్తుందట. ముందుగా ప్రభుత్వంలో ఉన్నవారి జవాబుదారితనం గురించి ఈ కమిటీ చర్చించి, నిర్ణయాలు చేసి, అప్పుడు సోషల్ మీడియావారి జోలికి వెళితే మంచిది కదా! అంతర్జాతీయ ఉత్తమ పద్దతులను అధ్యయనం చేస్తారట. అదేమిటో తెలియదు. హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలలో ఎలా స్పందించాలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై అప్రమత్తంగానే ఉంటుంది. అయినా ఆ పేరుతో పద్దతిగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలన్న ఉద్దేశం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పౌరహక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలన్నది ఈ కమిటీ బాధ్యతట. అదే నిజమైతే ప్రభుత్వం ఇంతవరకు అక్రమంగా అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులన్నిటీని సమీక్షించి, అన్యాయంగా అరెస్టు అయినవారిని విడుదల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఈ కమిటీకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను పెట్టాలట. అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల బెదిరింపులు చాలవన్నట్లుగా కొత్తగా కొన్ని సంస్థలను సృష్టించి వారికి కోట్ల రూపాయలు చెల్లించి సోషల్ మీడియా వారిని బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారన్న డౌటు రావడం లేదా? ఇదంతా మీడియా గొంతు నొక్కడమేనని వైఎస్సార్సీపీ అభిప్రాయపడింది. ఈ కమిటీలో బీజేపీ నుంచి మంత్రి సత్య ప్రసాద్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి పార్థసారథి కూడాఉన్నప్పటికీ, అంతిమంగా లోకేశ్ ఏమి డిక్టేట్ చేస్తే అది ఫైనల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి తమ రాష్ట్రంలో రెడ్ లేదా పింక్, లేదా బ్లూ బుక్ లు ఏవీ ఉండవని, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని, అది చట్టాల ప్రకారమే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు, ఏపీలో రెడ్ బుక్ అరాచకపు పాలనకు చెంపపెట్టు అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలదా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కొమ్మినేని కేసులో సుప్రీం దెబ్బ మర్చిపోయావా చంద్రబాబూ?
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా, వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండవని తెలిసీ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అవివేకమైన చర్యగా పొన్నవోలు సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ చర్యలు ఎప్పటికీ నెరవేరవని గట్టిగా బదులిచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ ఇన్ఫర్మేషన్కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి విష ప్రచారం చేశారని, ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారిమీదనే పెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని, వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ప్రశ్నించే గొంతు నొక్కుతున్న నియంత పాలనప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాలన సాగిస్తున్నారు. ఈ 16 నెలల్లోనే సుమారు 2వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తోంది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఒక్కొక్కరి మీద రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధంలో హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తోంది. వరుసపెట్టి ఒక్కో వర్గాన్ని ఎలాగైతే అంతం చేశాడో సీఎం చంద్రబాబు సైతం అదేవిధానాలను అవలంభించబోతున్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. అంగన్వాడీలు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు.. ఆఖరుకి రైతులను కూడా.. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధింస్తున్నట్టే వారినీ ఇలాగే వేధిస్తారు.బీఎన్ఎస్ 111 సెక్షన్ పై కోర్టు మొట్టికాయలు వేసినా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్, పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసు రుజువైతే వారు జీవితకాలం జైలుకు పోతారని ఈ ప్రభుత్వానికి తెలియదా? మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైయస్సార్సీపీ లీగల్ సెల్ పోరాడితే 111 సెక్షన్ ని కోర్టులు స్వ్కాష్ చేశాయి. ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రావడం లేదు. 2 వేల మంది మీద కేసులు పెట్టారు. యాక్టివిస్టులను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.టీవీలో హోస్ట్గా ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తే.. నవ్వినా, మాట్లాడినా కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం, పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది. పాలన సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన కూటమి నాయకులు అదే రాజ్యాంగం తమకు వర్తించదు అన్నట్టు నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైన విషయం మర్చిపోతే ఎలా?ఫేక్ ఫ్యాక్టరీని నడిపిస్తుంది చంద్రబాబేఫేక్ ప్రచారం చేయడంలో మొదటి దోషి చంద్రబాబు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో ముద్దాయి ఐటీడీపీయే. ఎన్నో ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్ష నాయకుడి మీద ఇప్పటికీ బురదజల్లుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారు. అలాంటిది వీళ్లే ఇప్పుడు సోషల్ మీడియాను కట్టడి చేస్తామంటూ చట్ట సవరణకు ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. నియంతృత్వ పోకడలు మరింత పెరిగిపోతే ఏపీలోనూ నేపాల్ మాదిరిగా జెన్జీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పౌరుల హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఆయన కుటుంబంతోపాటు పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషప్రచారంపై ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో డీజీపీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వరకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇవే కేసులు అధికార పార్టీ వారికి కూడా వర్తిస్తాయని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నా.మీరు చేసిన తప్పుడు ప్రచారానికి కేసులు పెట్టొద్దా? సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించడానికి మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాస్తవానికి ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీయే. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర టీడీపీ నాయకులు ఎన్నో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విషప్రచారం చేశాడు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అందులో ప్రథమ ముద్దాయి చంద్రబాబే అవుతాడు. 34 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ నాడు పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. మిస్ ఇన్ఫర్మేషన్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, శ్రీలకం చేశాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి పథకం ప్రకారం విషం చిమ్మారు. అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ చేసిన ప్రచారం అబద్ధమేనని ఎన్సీఆర్బీ లెక్కలతో తేలిపోయింది. అంతా ఉత్తుదేనని కేంద్ర మంత్రి పార్లమెంట్లోనూ చెప్పాడు.వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.70 లక్షల కోట్లేనని ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉచితంగా ఇసుక పేరుతో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించినా రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ వేదికగా వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు. అదంతా అబద్ధమేనని తేలిపోయింది. వీటన్నింటిపైనా తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు?ఐటీ యాక్ట్ కేంద్ర పరిధిలోని అంశం సోషల్ మీడియా ఐటీ యాక్ట్ 2000 పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడిగా మూడు వేర్వేరు చట్టాలున్నాయి. వాటి అధికారం, పరిధులు వేర్వేరుగా ఉంటాయి. ఉమ్మడి చట్టమైనా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడం మినహా రాష్ట్రం మార్పులు చేయలేదు. తిరగరాయడం సాధ్యం కాదు. ఐటీ యాక్ట్ అనేది రిసిడ్యూరీ లిస్టులో ఉంటుంది. కాబట్టి కేంద్రం మాత్రమే దీనికి చట్టం చేయగలదు. దీనిలో రాష్ట్రం ఏమాత్రం కలగజేసుకోవడం సాధ్యపడదు. అయినా సోషల్ మీడియాను కట్టడి చేసే పేరుతో ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం పరిధిలో లేదని చంద్రబాబు అనుకుంటున్నారా? మాకొక ప్రత్యేక రాజ్యాంగం ఉందని ఆయన చెప్పదలుచుకున్నారా? అయినా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం చూస్తుంటే వారిది అవివేకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టుల ముందు ఇలాంటి చట్టాలు నిలబడవని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.సోషల్ మీడియా పోస్టులు, కట్టడికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించి నవంబర్ లోపు కోర్టు ముందు ఉంచాలని మార్చి 25న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఐటీ యాక్ట్ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టే నేరుగా సుప్రీంకోర్టు కేంద్రానికి సూచనలు చేస్తే, అందులో రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అని ఎలా దూరిపోతుంది? రెసిడ్యూరీ లిస్టులో ఉన్న ఐటీ యాక్టుకి పార్లమెంట్లో మాత్రమే చట్టం చేయడానికి వీలుపడుతుందే తప్ప, ఇందులో ఏ రాష్ట్ర అసెంబ్లీలు కలుగజేసుకోలేవు. ఐటీ యాక్టులో ఇప్పటికే చట్టాలున్నప్పుడు వీరు కొత్తగా ఏం తీసుకొస్తారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో ఏ ఒక్కరూ లా అండ్ జస్టిస్కి సంబంధించిన మంత్రి లేకపోవడం ఇక్కడ మరీ విచిత్రంగా ఉంది. ఐటీ యాక్టుని నిర్దేశించేది గృహ నిర్మాణం, సివిల్ సప్లయిస్, వైద్యారోగ్య శాఖకు చెందిన మంత్రులా అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్గా..
మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ, లోక్సభలో వైఎస్సార్ పార్టీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్ ప్రత్యేక అధికారుల బృందం (సిట్)తోపాటు, కల్పిత కథలతో మద్యం కేసంటూ శివాలెత్తిన ఎల్లోమీడియాకూ పెద్ద హెచ్చరికగా కూడా చూడొచ్చు. ఎల్లోమీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒక్కటే. జర్నలిజానికి, నైతిక విలువలకు ఎప్పుడో పాతరేశారు అని. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏమంది? మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను, మాస్టర్మైండ్ అనేందుకూ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ముడుపుల వసూళ్ల ఆరోపణలకు, నేరపూరిత కుట్రకూ ఆధారాలెక్కడని ప్రశ్నించింది. సహ నిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తేల్చింది. ఒట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. జర్నలిజానికి విలువిచ్చే ఏ మీడియా సంస్థ అయినా.. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, బెయిల్ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అరెస్ట్ను పతాక శీర్షికలకు చేర్చి బెయిల్ వార్తను అప్రధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటన్నది అర్థమైపోతుంది. ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లోమీడియా, ఇటు పోలీసులు అధికారుల వద్ద కూడా సమాధానాలు లేవు. దీన్నిబట్టి చూస్తే జగన్ హయాంలో స్కాముల కోసం ఎల్లోమీడియా భూతద్దం వేసి చూసినా ఏమీ దొరకలేదన్నది స్పష్టమైంది. అందుకే ఒక మద్యం కేసు కట్టుకథ సృష్టించారు. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు. ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాద చేయాల్సింది? కానీ ఈ కేసులో ఎవరో దారినపోయే దానయ్య ఫిర్యాదు ఇస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం. హుటాహుటిన సిట్ ఏర్పాటు జరిపోయాయి. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట. పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్ విజయసాయిరెడ్డి జోలికి అస్సలు వెళ్లకపోవడం అనుమానాలను ధ్రువీకరిస్తుంది. గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్షీట్పై న్యాయస్థానం 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారిమళ్లాయని చెబుతున్న రూ.3,500 కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే... సిట్ అధికారులు న్యాయస్థానం నుంచి ఏమి అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం. ఛార్జ్షీట్లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్ సక్రమంగా లేకుండా రిమాండును అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేసింది. తేదీలతో నిమిత్తం లేకుండా ఈనాడులో వచ్చిన కొన్ని స్టోరీలను చూద్దాం. ‘‘మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, ‘‘డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్ల తరలింపు’’ - మరికొన్ని మొత్తాలు యూకే, దుబాయి, అమెరికాకు తరలింపు.. ‘‘హవాలా ఏజెంట్ల విచారణలో సిట్కు కీలక అధారాలు లభ్యం’’ ..అని ఒక రోజు రాశారు. మరి ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. అలాంటి అభియోగాలతో వారు చెబుతున్న బిగ్ బాస్ పై కేసు పెట్టలేదే! అంటే తప్పుడు ప్రచారం కోసం అల్లిన కథేనని తెలియడం లేదూ! మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు అని పెద్ద హెడింగ్ పెట్టి ఈడీ సోదాలలో కీలక ఆధారాలు లభ్యం అని కొద్ది రోజుల క్రితం రాశారు. ఆ తర్వాత ఆ కథ ఏమైందో తెలియదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై స్టోరీ ఇస్తూ డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అన్నారు. దీన్ని చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సవాల్ చేశారు. ఆ వార్తను కప్పిపుచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు భారీ కథనం ఇస్తూ బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమలులో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ రూపొందించింది ఆయనే అని ఈ పత్రిక పేర్కొంది. సిట్ ఆధారాలు సేకరించిందని కూడా రాసేసింది. మరి అది నిజమే అయితే ఆ ఆధారాలేమిటో కోర్టు ముందుకు ఎందుకు ఉంచలేకపోయారో ఇప్పుడు రాయాలి కదా! ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు స్వయంగా తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది. కల్పిత కథలో ఆయననే టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు. కాని ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికి అరెస్టు అంటూ హడావుడి చేసేవారు కదా!. గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదు. ఆ సన్నివేశం అంతా చూసిన ఓపెన్ కేసే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్ కు ఆధారాలు దొరికపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. పదహారు డిస్టిలరీల ముడుపులే రూ.1677 కోట్లు అని సిట్ వీరికి చెప్పిందట. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పలు సంస్థల ఖాతాలలోకి మళ్లించి, నగదు విత్ డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి, తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోకి, డొల్ల కంపెనీలలోను పెట్టేదట. హవాలా ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేది అని సిట్ తేల్చిందట. ఇది చదువుతుంటే ఇంత తెలివితక్కువగా కథలు సృష్టిస్తారా అనిపించదా! .. బ్యాంకు ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాలలో విత్ డ్రా చేస్తే పట్టుకోవడం పోలీసులకు చేతకాదా?. మరి ఆ డబ్బు గురించి ఛార్జ్షీట్లో ఏమైనా రాశారా??.. అంటే అదీ ఉన్నట్లు లేదు. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి కలిసే ఈ కల్పిత గాథలను సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. పోలీసులు వీరికి అండగా నిలుస్తూ వారి పాత్ర వారు పోషించారనుకోవాలి. ఉదాహరణకు.. బాక్సులు బద్దలు-లిక్కర్ స్కామ్ సొమ్ము-రూ.11 కోట్లు సీజ్ అని ఒక రోజు గోలగోల చేశారు. ఇదెలా అని అనుకుంటుండగానే, ఈ కేసులో నిందితుడు అయిన రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బు తనది కాదని, ఆ నోట్లపై నంబర్లు రికార్డు చేయండని అనగానే సిట్ అధికారులు జారుకున్నారు. ఆ డబ్బును కోర్టులో జమ చేయలేకపోయారు. పైగా బ్యాంకులో జమ చేసేసినట్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఆ డబ్బు విడిగా ఉంచారో, లేదో తెలియదు. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు.. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు.. సిట్ కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడి చేసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడి ఫోన్ను తెరవనే లేదని సిట్ కోర్టుకు చెప్పింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్టు చేస్తే అతనే కీలకమని సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరిమీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో మూడు లక్షల జీబీలు ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఒక కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. ఇలా ఒకటి కాదు..గత ఏడాది కాలంలో ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్ పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాట్లు పడుతూనే ఉంది. ఎటు తిరిగి మిథున్ రెడ్డి తదితరులను కొన్నాళ్లపాటు జైలులో ఉంచి శునకానందం పొందడడం తప్ప, సాధించింది ఏమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యాక మీడియాతో మాట్లాడుతూ తనను జైలులో టెర్రరిస్టు మాదిరి చూశారని ఆవేదన చెందారు. అయినప్పటికీ ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎపి లిక్కర్ స్కామ్ అన్నది ఒక ఊహాజనిత కథ అని ఎప్పటికప్పుడు అర్థం అవుతూనే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?
‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త‘‘ఈఆర్సీ సీరియస్.. సర్కార్కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్తపైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా.. ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. జగన్ టైమ్లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News) ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో పార్టీల మీడియా ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు ఇస్తున్నారో!.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిజిటల్ బుక్ ముకుతాడు వేస్తుందా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తే లీగల్ సెల్ తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్ టీమ్ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.ఈ బుక్లో సాక్ష్యాధారాలు కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పరకామణి వ్యవహారంలో జగన్పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.డిజిటల్ బుక్తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అన్నను మరచిన తమ్ముళ్లు!
అవాకులు చెవాకులు పేలడం.. అభిమానంతో దగ్గరకొచ్చిన వారికి చెంపదెబ్బలు తగిలించడం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్తేమీ కాదు కానీ.. అసెంబ్లీ వేదికగా ఆయన సహనటుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కొందరి బలహీనతలు, కొందరి అహంకారం, ఇంకొందరి విచక్షణ, విజ్ఞతలను ప్రజల ముందుంచింది. అంతేకాదు.. తరచూ రాజకీయ విన్యసాలు సాగిస్తూ, ఏది వాస్తవమో, ఏది అబద్దమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడించింది.తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ వారిని సీఎం హోదాలో జగన్ ఎంత గౌరవంగా చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికి తెలిస్తే, చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్లో సోదికి వెళితే ఏదో బయటపడిందన్నట్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించాల్సిన అంశాలే.శాసనసభలో జగన్ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉప సభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. జగన్ను సైకో అనడం ద్వారా బాలకృష్ణ తన పాత చరిత్ర అంతా తవ్వించుకున్నారు. బాలకృష్ణ ఏ రకంగా సైకోనో వివరించే అనేక దృష్టాంతాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో కొందరు టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వ పరువు తీస్తారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను మాత్రం ఒక్క మాట అనలేకపోయారు.మెగాస్టార్ చిరంజీవిని అలా అనడం తప్పు అని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ఆయన మరో సోదరుడు నాగబాబు నోరు పెగలలేదు. జనసేన కేడర్, సామాజిక వర్గం, సాధారణ ప్రజలు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా నిరసించినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం కిమ్మనలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో!బాలకృష్ణ జనసేన కార్యకర్తలను అలగా జనం అన్నారని ఒకసారి వాపోయిన పవన్ ఆ తరువాత ఆయనతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ గమనించే ఉంటారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ కామెంట్ చేసినా వీరు ఎవరూ పెద్దగా ఫీల్ అయినట్లు లేదు. నాగబాబు కొంతవరకూ దీటుగా సమాధానం చెప్పినప్పటికీ ఆ తరువాత టీడీపీ పదవుల ఆశతో అన్నీ మరచిపోయారు.చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టైతే రోడ్డుమీద పడి నానా యాగీ చేసిన పవన్ కళ్యాణ్ సొంత అన్నకు అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లి బెడ్పై ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ మాటలను ఖండిస్తే ఎక్కడ తన ఉప ముఖ్యమంత్రి పదవి పోతుందో అని పవన్ బెంగపట్టినట్టుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేసినా భరించాల్సిందే అని పవన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.సమస్యంతా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో మొదలైంది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్పై లేని పోని అభాండాలు మోపి, చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని బోల్తాపడ్డారు. చిరంజీవి తదితర నటులు జగన్ను కలిసినప్పుడు ఏదో అవమానం జరిగిందని అచ్చం టీడీపీ నేత మాదిరి ఒక కల్పిత కథ సృష్టించే యత్నం చేసి దెబ్బతిన్నారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరుకున్నారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఆ కల్పిత కథలో చిరంజీవిని పొగడడం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైకు అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయన అహంకారం బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుడిని అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన ఏర్పడింది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా మాట్లాడడం అందరిని విస్మయపరిచింది. జగన్ను దూషిస్తున్నప్పుడే స్పీకర్ ఛైర్లోఉన్నవారు వారించగలిగితే ఇది ఆగి ఉండేది. సీఎం బావమరిది కావడంతో అలా చేయలేకపోయారు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నినాని వంటివారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకు ఉన్న మెంటల్ సర్టిఫికెట్ తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ జరిపిన కాల్పుల వల్ల నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికెట్ను తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు, దివంగత కాకర్ల సుభ్బారావు చెప్పిన విషయం వీడియోలలో నిక్షిప్తమై ఉంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపి వేశారని అప్పట్లో బాలకృష్ణ భార్య వసుంధరపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కోర్టులో సరెండరై బెయిల్ కూడా పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్పై అనవసరంగా నోరు పారేసుకునే చంద్రబాబు తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు చెరిపేసిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూంటారని ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది.చట్టపరంగా కాల్పుల కేసులో బాలకృష్ణను జైలులో పెట్టాలి. అలా చేయలేదు. బాలివుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు అన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న దగ్గుబాటి దంపతులు, తదితరుల విజ్ఞప్తిని గమనంలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును తేలికగా వదలి వేసిందని అంటారు. చట్టప్రకారం అలా చేయకూడదు.అయినా చేశారు.ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. సినిమాల పరంగా, ఇతరత్రా సాయం, గౌరవం పొందినప్పటికీ జగన్ను పట్టుకుని బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్య చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాబట్టి రాజకీయంగా ఆలోచించకుండా బాలకృష్ణకు, ఆయన భార్యకు సాయం చేశారని, అదే పరిస్థితి వైఎస్సార్ సన్నిహితులు ఎవరికైనా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండిఉంటే, రాజకీయంగా ఎంతగా వాడుకునే వారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా, బాలకృష్ణకు టీడీపీ ఇక్కెట్ ఇవ్వడం, హిందుపూరం ప్రజలు ఎన్నుకోవడం విశేషమే. ఆ తర్వాత కాలంలో ఆయన తన అభిమానులపై దురుసుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ మందలించలేదు. ఆయన కూడా తాను తప్పు చేశానని అనుకోవడం లేదు. అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆ కామెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సినీ ప్రముఖులు కాని, సభలో పాల్గొన్నవారు ఎవరూ బాలకృష్ణను ఏమీ అనలేదు. పైగా అంతా నవ్వుతూ కూర్చున్నారు. తదనంతర కాలంలో ఆయనకు పద్మభూషణ్ బిరుదు రావడం కూడా మరో విశేషం. ప్రధానమంత్రి మోడీని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసినా బాలకృష్ణకు ఏమీ ఇబ్బంది రాలేదు. పైగా బిరుదు కూడా వచ్చింది. బీజేపీ నేతలు ఇందుకు సిగ్గుపడినట్లు కనిపించలేదు.చంద్రబాబుకేమో తన బావమరిది జోలికి వెళితే ఇంకేమవుతుందో అన్న భయం ఉండవచ్చని, అందుకే ఆయన కూడా దీనిపై స్పందించలేదేమో అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక చిరంజీవి మూడేళ్లపాటు ఈ అంశంపై మౌనంగా ఉండి తన తమ్ముడికి రాజకీయంగా సాయపడ్డారని, ఇప్పుడు బాలకృష్ణ చేసిన అవమానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్లు అబద్దపు ప్రచారం చేస్తున్నప్పుడే జగన్ తమను గౌరవంగా చూసుకున్నారని చిరంజీవి చెప్పి ఉంటే ఎంతో మర్యాదగా ఉండేదన్న భావన ఉంది. ఇప్పటికైనా చిరంజీవి స్పందించడం బాగానే ఉంది కాకపోతే సొంత తమ్ముళ్ల నుంచే ఆయనకు మద్దతు కొరవడడం కాస్త అప్రతిష్టే. కొద్ది మంది చిరంజీవి అభిమానులు తమ నిరసన చెప్పారు. మరో ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ సినిమా ప్రముఖులందరిని జగన్ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలు వాస్తవమైనవని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణను ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా, వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతొకొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ చిక్కొచ్చిపడింది. ఒకపక్క ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య కేసు మొత్తం చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఇంకోపక్క ఇంకోపక్క మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ రెండు సంఘటనలూ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేవే. తెలుగుదేశం పార్టీ నేతలకూ ఇబ్బందికరమైనవే. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున అందరి నోళ్లు నొక్కేయవచ్చు. దబాయింపులతో నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఓటుకు నోటు కేసు మొత్తాన్ని మళ్లీ దర్యాప్తు చేయాలని మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తారన్నది ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసులో మత్తయ్యపై ఉన్న ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సీఎం నిందితుడిగా ఉన్నా అప్పీలుకు వచ్చిన కారణంగా న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది కూడా. ఈ నేపథ్యంలో మత్తయ్య తీవ్రంగా స్పందిస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయించడానికి మత్తయ్య ద్వారా టీఆర్ఎస్ నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్తో రాయబారం చేయించారు. ఓటుకు గాను రూ.ఐదు కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు, రేవంత్లు ఒప్పుకున్నారన్నది అభియోగం. ఈ క్రమంలో రేవంత్ ఏభై లక్షల నగదుతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లడం, ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయనను అరెస్టు చేయడం తెలిసిన సంగతే. ఇదంతా కుట్ర అని రేవంత్ వాదిస్తుంటారు. కాగా ఇదే కేసులో స్టీవెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి, ‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ..అంతా నేను చూసుకుంటా..’’ అంటూ భరోసా ఇచ్చిన ఆడియో అప్పట్లో పెను సంచలనం. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ చేసుకున్నారని చాలామంది చెబుతారు. అదే టైమ్లో కేసీఆర్పై ఏపీలో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి హడావుడి చేశారు. ఈ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు ముప్పై సార్లకు పైగా ఉన్నా, ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ఇప్పుడు మత్తయ్య చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం గమనార్హం.ఈ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ అన్నప్పటికీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఆయనను నిందితుడిగానూ చేర్చలేకపోయారు. మత్తయ్య చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్, అతని సన్నిహితులు కొందరు, ఆనాటి ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావుల పాత్ర ఉంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కకుండా ఏపీకి తరలించారట. ప్రలోభాలకు గురి చేస్తూ.. ఇంకోపక్క బెదిరిస్తూ తాము అనుకున్న విధంగా కేసీఆర్పై ఫోన్ టాపింగ్ కేసు పెట్టించడం, 164 సెక్షన్ కింద సాక్ష్యం చెప్పడం వంటివి చేయించారని మత్తయ్య అంటున్నారు. మత్తయ్యకు, చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడ చెడిందో కాని, తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుందో చెప్పలేం. ఏపీ, తెలంగాణలలో చంద్రబాబు, రేవంత్లు ముఖ్యమంత్రులుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని మత్తయ్య ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై, ముఖ్యనేతలపై అదే రాష్ట్రంలో దర్యాప్తు అంత తేలికకాదు. కేసు నీరుకార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూంటాయి. చంద్రబాబుపై వచ్చిన స్కిల్ స్కామ్, మద్యం కేసు, ఇతర కేసులపై విచారణ దాదాపు నిలిచిపోయిన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఓటుకు కోట్లు కేసులో అరెస్టు అయి కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రేవంత్ స్వయంగా సీఎంగా ఉన్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు కూడా పదవులలో ఉన్నారు. అందువల్ల ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందన్నది అనుమానమే. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులను కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో, లేక సీబీఐకి అప్పగించడమో చేస్తే తప్ప ఓటుకు కోట్లు కేసు ముందుకు వెళ్లదని ఒక న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.ఇప్పటికైతే అలా జరిగే సూచనలు ఏమీ లేవు..సుప్రీంకోర్టులో మత్తయ్య అఫిడవిట్ వేస్తే, అది సీజే ముందుకు వస్తే, దేశ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద కథనం అవుతుంది. భవిష్యత్తులో అధికారంలో ఉన్న నేతలపై కేసులు ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక సూచన రావచ్చేమో చూడాలి. ఇక వివేకా హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు కాని, ఇతర కూటమి నేతలు కాని అధారం ఉన్నా, లేకపోయినా పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తుంటారు.అందులో భాగంగానే సీఐ శంకరయ్యపైన కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. తానేదో హత్యకేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సి.ఎమ్. చెప్పడం అన్యాయమని, సీబీఐ కూడా తనపై అలాంటి ఆరోపణలు చేయలేదని, తను సాక్షిగానే పరిగణించిందని, ఆయన అన్నారు. తనకు డీఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు. తాను ఇంకా సీఐగానే ఉన్నానని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే, ఏ అసత్యం చెప్పినా,తనను ఎవరూ ఏమీ చేయరులే అన్న ధీమా కావచ్చు.కాని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆ సీఐ ఏకంగా లీగల్ నోటీసు ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు. నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా? ఇలా నోటీసు ఇచ్చి ఎదుర్కోవచ్చా అన్నదానికి ఈ నోటీసు ఒక సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఏదో రకంగా ఆ సీఐపై ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని వేధించే అవకాశం కూడా ఉంది. ఇప్పిటికే సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకే లీగల్ నోటీసు ఇస్తారా అని మండిపడ్డారు. మళ్లీ పాత ఆరోపణలనే చేయడానికి ఆయన వెనుకాడలేదు. అయితే శంకరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా మాత్రం జవాబు ఇవ్వలేదు. శంకరయ్యపై తీవ్రంగా మాట్లాడిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు సంబందించి, మత్తయ్య చేసిన ఆరోపణలపైన ఎందుకు స్పందించలేకపోయారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఆయన వద్ద దానికి సమాధానం లేదనే అనుకోవాలి. ఆయనే ఉపన్యసించినట్లు, ఈ ఉదంతం రాజకీయం ముసుగులో నేరం చేసినట్లు అవుతుందా? కాదా? అన్నది స్పష్టం చేస్తే ప్రజలకు విశదమవుతుంది కదా!.ఏది ఏమైనా ఈ రెండు కేసులలో చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు కాని, పరువు మాత్రం దెబ్బతిన్నట్లే భావించిల్సి ఉంటుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఒక రౌడీషీటర్ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను రౌడీ అని, పేకాట క్లబ్లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పులపై కూటమి తప్పుడు ప్రచారం బట్టబయలు
ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదు వేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్న మాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా వారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదువేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్నమాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఎపినే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రేదశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియావారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్ధిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఏపీ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈనాడు వంటి ఎల్లో మీడియా జగన్ హయాంలో అప్పు చేసినప్పుడల్లా అది ఎంత చిన్న మొత్తం అయినా, ఏపీ అప్పుల చిప్ప అయిపోయిందని, మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేది. అలాగే వారి టీవీలలో విపరీతంగా ప్రసారం చేసేది. కాని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినా ఈ మీడియా కిమ్మనడం లేదు. పైగా దీనికి ఇదంతా రుణాల సమీకరణ అని ముద్దుపేరు పెట్టుకుని రాస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల ప్రకారం 1,17 లక్షల మొత్తం నిధుల రాష్ట్రానికి ఈ ఐదు నెలల్లో సమకూరితే అందులో సింహభాగం అప్పులే కావడం గమనార్హం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాలు ప్రస్తుతం చేస్తున్న అప్పు గురించి నోరు ఎత్తడం లేదు. పైగా ఇప్పటికీ చంద్రబాబు ఆయా సభలలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని అసత్య ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితిపై నెటిజన్లు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. జగన్ నెలకు 5500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక.. చంద్రబాబు నెలకు 11వేల కోట్ల అప్పు చేస్తే సింగపూర్ అయినట్లా అని వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ లో తెలిపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తీసుకోదలచిన అప్పుల్లో మూడింట రెండు వంతుల మేర అప్పుడే ప్రభుత్వం తీసేసుకుందని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైమ్ నాటి 2023-34 ఐదు నెలలతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 8752 కోట్ల రాబడి తగ్గిందని కాగ్ వెల్లడించింది. అలాగే అదే కాలానికి ప్రభుత్వం పెట్టే వ్యయంలో కూడా 10663 కోట్లు తగ్గిందని, దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై కనబడుతోందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి ,జగన్ టైమ్ నాటికన్నా, ఈ ఏడాది ఐదు నెలల్లో కేంద్రం నుంచి 16వేల కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని తేలుతోంది. ఆదాయం ఆశించినంత రాక రెవెన్యూ లోటు, అప్పుల వల్ల ద్రవ్య లోటు తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఈ లెక్కలు గమనిస్తే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్ధిక ఆరోగ్యం క్షీణించినట్లు కనబడుతుంది. రెవెన్యూ లోటులో దేశంలోనే నెంబర్ టు స్థానంలో ఏపీఉంది.మరో వైపు ప్రభుత్వం ఆయా రంగాలకు చెల్లించవలసిన బకాయిలు వేల కోట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆరోగ్యశ్రీ బకాయిలే 2700 కోట్లు అని స్వయంగా ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చిన్న,మద్య తరగతి క ఆంట్రాక్టర్ లకు ఆరేడువేల కోట్లు చెల్లించవలసి ఉందని కదనాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 30వేల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీటితో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చలేదు. వాటిని అరకొరగా అయినా చేయాలంటే మరింత అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ దశలోజీఎస్టీ కొత్త సంస్కరణలు రావడం రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పైకి మాత్రం ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు చెబుతూ లోపల మాత్రం ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. తెలంగాణలోజీఎస్టీ మార్పుల వల్ల నష్టం ఏడువేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు.ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుని భారాన్ని రాష్ట్రాలపై మోపిందని, ఇందుకు నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో కూడా ఎనిమిదివేల కోట్లకుపైగా నష్టం ఉందని లెక్కలు కడుతున్నారు. అసలే రెవెన్యూ లోటుతో కింద, మీద పడుతున్న తరుణంలో ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆయా అధికారిక సమావేశాలలో వివిధ శాఖల బడ్జెట్లలో కోత పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.ఈ క్రమంలో ముందుగా విద్య, వైద్య రంగాలను బలి చేయడానికి సన్నద్ధం అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ టైమ్లో నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేస్తే, ఇప్పుడు దానికి దాదాపు మంగళం పలికినట్లేనా అన్న సందేహం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో విరాళాలు, ఆయా సంస్థల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడమే నిదర్శనంగా ఉంది. అలాగే సంజీవని కార్యక్రమం చేపట్టడం, ఇతర పద్దతుల ద్వారా ఆరోగ్య శాఖ బడ్జెట్ లో 30 శాతం తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఆ మాట అన్నారంటే అధికారులకు పరోక్షంగా ఆ రకంగా కోతలు పెట్టమని చెప్పడమే కదా!. జీఎస్టీ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను గురించి వివరించాలని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. దానివల్ల నిజంగా జనానికి ఎంత మేలు కలుగుతుందో కాని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కోతల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందేమోనన్న భయం పలువురిలో వ్యక్తం అవుతోంది.ఆర్థికంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇబ్బందులు వస్తాయని ఆర్థిక మంత్రి, అధికారులు చెప్పినా, ప్రజా ప్రయోజనాల రీత్యా మద్దతు ఇవ్వాలని తాను తెలిపానని ఆయన అన్నారు. నిజానికి చంద్రబాబు వంటివారికి ఇవి నచ్చుతాయంటే అంతగా నమ్మలేం. గత అనుభవాలు ఈ విషయాన్ని చెబుతాయి. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, మోదీని ఈ మధ్య కాలంలో విపరీతంగా పొగుడుతున్న నేపథ్యంలో ఇంతకన్నా వేరే మార్గం చంద్రబాబుకు లేదన్న సంగతి బహిరంగ రహస్యమే. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రాబడి తగ్గుతుండడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని శాసనసభలోనే ఆయన వ్యాఖ్యానించడం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆరోగ్య బీమాపై పన్ను తీసివేసినందున రాష్ట్రానికి 800 కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. బాగానే ఉంది. అలాంటప్పుడు ఆరోగ్య శాఖ బడ్జెట్ 30 శాతం తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చెప్పారో తెలియదు. వ్యవసాయం ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు చెప్పేస్తున్నారు. ఒక పక్క తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, అల్లాడుతుంటే, వారికి ఆదాయం పెరుగుతుందని సీఎం అంటున్నారు. నిజంగా అలా జరిగితే సంతోషమే. కాని ఊహాజనిత అంశాల ఆధారంగా మాట్లాడితేనే సమస్య వస్తుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల కొన్నిటి ధరలు తగ్గి ప్రజలకు కొంత ప్రయోజనం ఉండవచ్చు. కాని దానితోనే ప్రజల జీవితంలో పెనుమార్పులు వస్తాయని అనుకుంటే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయని చెబుతున్నారు. తద్వారా పన్ను రాయితీలు వచ్చినా, ప్రజలకు లభించేది పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు. మరో వైపు పోరాటా వంటి ఉత్తరాది ఆహార పదార్థాలకు పన్ను తీసి వేసి, ఇడ్లి, దోసె వంటి దక్షిణాది పదార్ధాలపై పన్నులు ఉంచడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. జీఎస్టీ రూపేణా ఇంతకాలం అధిక పన్నులు వసూలు చేసి, ఇప్పుడేదో తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోందని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
AP Assembly: ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని..
ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు ప్రతిపక్ష నేతకు తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాలపై పెద్దగా నమ్మకం లేనివారి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తమ గొంతు వినిపించేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలపై వీరు అస్సలు నోరు మెదపడం లేదు. పైగా.. ప్రతిపక్షానికి సమయం ఇవ్వడం వల్ల అధికార పక్షానికీ మేలు జరుగుతుంది. వారి విమర్శలను తిప్పికొట్టేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకూ అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాలన్నింటినీ తోసిపుచ్చుతున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరు కాని విషయం ప్రజలందరికీ తెలిసిందే. తమ గొంతులు నొక్కేస్తూ, అవమానిస్తున్న కారణంగా అసెంబ్లీకి రామని ఆ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ స్వోత్కర్షలతో నిస్సారంగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఆధారంగా కాకుండా... చర్చనీయ అంశం ఆధారంగా తగిన సమయమిస్తామని స్పీకర్ లేదంటే సీఎం భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు బాధ్యత వైసీపీది అయ్యేది. టీడీపీ ఆ పని చేయలేదు. మరోవైపు.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ(YSRCP Opposition Status Demand) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన నోటీసుకూ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గతాన్ని మరచిపోయారు. 1972లో సీపీఐకి కేవలం ఏడుగురే సభ్యులుంటే సీపీఎంకు ఒకే ఒక్క సభ్యుడు ఉండే వారు. అయినా ఆయా పార్టీల నేతలు మాట్లాడేందుకు తగిన సమయం లభించేది. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 మందే సభ్యులతో ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ నేత పీజేఆర్ తదితరులు సమయం కోసం పోరాడాల్సి వచ్చేది. దాంతో వారు కోరినట్లు ఆనాటి స్పీకర్ యనమలకు కొంత టైమ్ కేటాయించక తప్పేది కాదు. 2004లో సీపీఐ (ఎంఎల్) తరఫున గుమ్మడి నరసయ్య ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయినా ఆయన గౌరవానికి ఏమాత్రం విఘాతం కలగకుండా చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం కేటాయించేవారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం విమర్శలను భరించే స్థితిలో లేదు. దీంతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష హోదా(Opposition Status) ఇవ్వడానికి పదిశాతం సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయం మాత్రమే. కాబట్టి వైసీపీకి ఆ హోదా ఇచ్చి ఉంటే హుందాగా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నా 70 స్థానాలున్న అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా జగన్ తన గళాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అసెంబ్లీలోనూ తగిన అవకాశాలిస్తామని స్పీకర్ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలలు మరింత స్పష్టమవుతాయో అన్న భయం కాబోలు!. 1994లో అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు(NT Rama Rao) ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు కూల్చివేశారు. ఆ టైమ్లో ఎన్టీఆర్ తన వెంట ఉన్న 35 మంది సభ్యులతో విశ్వాసపరీక్ష కోసం అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుపై మాట్లాడేందుకు శతథా ప్రయత్నించారు. కానీ అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడే మాట మాటకూ మైక్ కట్ చేసిన అందరికీ తెలుసు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఎన్టీఆర్ కారణంగానే తనకు స్పీకర్ పదవి దక్కిందన్న విషయమూ యనమల మరచిపోయారు. సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్తోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తారన్నది వట్టిమాటే. అందుకే మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి అంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక సభ్యుల గైర్హాజరి కూడా కొత్తగా జరుగుతున్నది కాదు. 1989-94 మధ్య ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు దాదాపు రెండేళ్లు సభలోకి రాలేదు. ఒక సందర్భంలో తనను ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-2024 టర్మ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరిపై ఎవరో అనుచితంగా మాట్లాడారంటూ లేని ఆరోపణలు చేసి సుమారు రెండేళ్లు సభకు గైర్హాజరయ్యారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు 23 యంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపు చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు రెండేళ్లు బహిష్కరించారు. ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించి, వారి ఖర్మ అని అనడం. ఆయన బహిష్కరించిన్పుడు కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది కదా! జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లికి రాలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని అనడం చిత్రం. జగన్ మీడియా సమావేశంలో(Jagan Press Meet) అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా? ఏదో రకంగా జగన్ను, వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పు పట్టే చంద్రబాబు తాను, అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అనే దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. మరి ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు కదా! దాని గురించి ఏమి చెబుతారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు, టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్లినా మాట్లాడడానికి తగు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా లేరు. ప్రజాస్వామ్య స్పూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఇంతకన్నా ఏమి ఆశించగలం!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: హిట్టా.. ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబూ! -
డొల్ల మాటలు... ఊకదంపుడు ఉపన్యాసాలు!
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలంటే.. ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షలు, లోటుపాట్ల సవరణ వంటిపై చర్చలు జరుగతాయని అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ తీరు వేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని కూడా ఆత్మస్తుతి, పరనిందకు వేదికలుగా మార్చేసుకుంటున్నారు. ఈ మధ్యే రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల కష్టాల గురించి కాకుండా రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలకే అధిక ప్రాధాన్యం లభించింది. ఒక పక్క రైతులకు యూరియా అందక నానా అగచాట్లూ పడుతూంటే.. టమోటా, ఉల్లి, తదితర పంటలకు తగిన ధరలు దొరక్క సతమతమవుతూంటే చంద్రబాబు వాటి గురించి కాకుండా దుష్ప్రచారం జరుగుతోందని ఒకసారి, అధికారుల వైఫల్యమని ఇంకోసారి మాట్లాడారు. జగన్ హయాంలో మాదిరిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలనో ఇంకో మార్గమో చూపాలి కదా? అదేది చేయలేదు బాబు. ఈ వైరుద్ధ్యం ప్రజల దృష్టిలో పడదన్నది ఆయనగారి ధైర్యం! ఈ సదస్సుల్లో ఒక విషయమైతే స్పష్టమైంది. జగన్ హయాంలో మాదిరిగా ప్రజాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలను ప్రోత్సహించరాదని చంద్రబాబు తీర్మానించుకున్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ బడ్జెట్లో 30 శాతం కోతకు, విద్యాసంస్థల బాగుకు విరాళాలపై ఆధారపడాలన్న ఆలోచనలను ప్రోత్సహిస్తూండటం ఇందుకు కారణం. మద్యం ఆదాయం 10.29 శాతం పెరిగిందన్న సమాచారం కూడా ఏమంత ప్రజానుకూలమైన విషయం కాదు. రాష్ట్రంలో హోం, రెవెన్యూ, మున్సిపల్ శాఖల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చంద్రబాబు ఈ సమావేశాల్లో ప్రకటించారు. పాలనపై పట్టు తప్పడం, రెడ్బుక్ రాజ్యాంగం పెచ్చరిల్లడం, టీడీపీ, జనసేన దౌర్జన్యాలు, కబ్జాకాండలు, ఇసుక, మద్య అక్రమ వ్యవహారలు కారణం కావచ్చ కానీ చంద్రబాబు వీటిని ప్రస్తావించడం లేదు. తనది రాజకీయ పాలనే అని బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. ఇది కాస్తా పార్టీ శ్రేణులకు గ్రీన్ సిగ్నల్లా మారిపోయింది. మరింత రెచ్చిపోతూ రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితిలోకి నెట్టేశారు. పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీలతో ఒకలా.. ప్రతిపక్షాలతో ఇంకోలా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేపడితే టీడీపీ, జనసేన ఎల్లో మీడియాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనర్థం వీరు గత ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేసినట్లే కదా? జగన్ సీఎంగా తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు వడివడిగా అడుగులేస్తున్న ఈ పరిస్థితుల్లో తాజాగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకో ఆందోళనకరమైన ప్రకటన చేశారు. పాఠశాలల మౌలిక వసతులకు అవసరమైన రూ.2820 కోట్లను ఎన్నారైలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీల నుంచి సేకరించాలని సంబంధిత శాఖ మంత్రి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. లీడ్ యాప్లో డోనార్స్ స్పాన్సర్షిప్ అనే ఆప్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఓకే అనుకుందాం. ఒకవేళ ఇంత మొత్తం విరాళాలుగా రాకపోతే? మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యావ్యవస్థను మరింత నీరుగారుస్తారా? ఆరోగ్య శాఖ సమీక్షలో రూ.20 వేల వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో 33 శాతం తగ్గించినా డబ్బు భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు అన్నారట. సంజీవని కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. ఆ మధ్య ఈ ప్రోగ్రాం గురించి చెబుతూ మనిషి కనీస ఆయుష్షు 120 ఏళ్లు అని అన్నట్లు వచ్చిన వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడేమో నిధులలో కోత పెట్టాలంటున్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2500 కోట్ల గురించి, నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె గురించి ఎందుకు మాట్లాడ లేదని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం అస్సలు దొరకదు. ప్రభుత్వానికి అందుతున్న దరఖాస్తుల్లో ఆరవైశాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవని చెప్పడం ద్వారా చంద్రబాబు గత ప్రభుత్వ సమర్థతను, ప్రస్తుత ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని బయటపెట్టుకున్నట్లు అయ్యింది. గతంలో రాష్ట్రమంతా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల పుణ్యమా అని ఎక్కడి సమస్యలక్కడే పరిష్కారమైపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సహజంగానే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుంది. రైతు సమస్యలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించే లక్ష్యంతో జగన్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేసింది. ఫలితమే రైతుల ఇక్కట్లు! ఇన్ని అంశాలపై బహిరంగ చర్చ జరిపిన ఈ సదస్సులో శాంతి భద్రతల గురించి మాత్రం రహస్యంగా సమీక్షించారట. ఎందుకో మరి? పైకి ఒకలా..లోపల ఇంకోలా వ్యవహరించే తన వైఖరి బయటపడిపోతుందనా? సీఎం గారు నేరాలు 33 శాతం తగ్గాయని ఈ సమావేశాల్లో చెప్పారట. టీడీపీ, జనసేన నేతల అరాచకాలను అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై కూడా అధికారులకు సలహా ఇచ్చారా? అలా చేయకుండా కేవలం రెడ్ బుక్కే ప్రాముఖ్యత ఇస్తూంటే శాంతిభద్రతల అదుపు ఎలా సాధ్యం? కలెక్టర్లు, జిల్లా ఎస్పీల ఈ సమావేశం జరుగుతున్న తీరుపై ఎల్లో మీడియా రాసిన ఒక వార్త మాత్రం ఆసక్తికరమైంది. ‘‘సారు మారారు..’’ అంటూ ఇచ్చిన ఒక కథనంలో చంద్రబాబు టైమ్ కీపర్ అవతారమెత్తారని చంద్రబాబును కొనియాడారు. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు పది లక్ష్యాలు పెట్టినట్లు ఎల్లో మీడియా రాసింది. ఇవి ప్రజలకు ఏ మేరకు ఉపయోగమో తెలియదు. జీఎస్పీడీపీలో 15 శాతం వృద్ది రేటు సాధించాలని నిర్దేశించారు కానీ... అది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుందన్నది మరిచినట్లు ఉన్నారు. ఎక్కువమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలని వర్క్ ఫ్రం హోం విధానాలు రావాలని బాబు గారు నిర్దేశించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో వర్క్ ఫ్రం హోం నిమిత్తం చంద్రబాబు ఆయా పట్టణాలకు వెళ్లి ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలి కదా! అదేమి చేయకుండా కలెక్టర్లను దానికి బాధ్యులను చేస్తే ఏమి ప్రయోజనం? ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ పానెళ్లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని సీఎం సలహా ఇచ్చారు. సీఎం ఇతర మంత్రులు కూడా వీటిని వాడుతున్నారో లేదో తెలియదు. సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలట.అందులో పోలీసు వ్యవస్థ భాగస్వామి కావాలట. కొత్త, కొత్త పదాలు వాడడంలో మాత్రం చంద్రబాబు దిట్ట అని చెప్పాల్సిందే. ఈ సర్కులర్ ఎకానమీ ఏమిటో, అందులో పోలీసుల పాత్ర ఏమిటో జనానికి అర్థం కాదు. రోడ్లు, హైవేలు, పోర్టుల, రైల్వేలు, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అవన్ని వేగంగా జరిగేలా కలెక్టర్లు చూడాలట. నిధులు ఇస్తే ఆటోమాటిక్ గా సాగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. అమరావతిలో తప్ప మిగిలిన చోట్లకు ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమ పథకాలు నిరాటంకంగా క్షేత్రస్థాయికి వెళ్లాలట. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టో దగ్గర పెట్టుకుని వెల్ప్ ర్ పై తగు ఆదేశాలు ఇస్తే ఏమైనా చేస్తారు కాని రొటీన్ గా మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? వేగంగా అనుమతులు ఇవ్వాలని, శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని చెప్పడం బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వంలోని వారే వాటిని చెడగొడుతున్న సంగతిని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అధికారులంతా ఫిట్ నెస్ తో ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అధికారులే బాధ్యులు.. మాట మార్చడం చిటికెలో పని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు. యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా! యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో, జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పు చేసి అమరావతికి పప్పన్నమా?
ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టూ ఒక రోడ్డు వేసేందుకు పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తం పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం కూడా సిద్ధమేనట. ఈ భారీ ఖర్చుకు తోడు.. రాజధాని ప్రాంతాన్ని వరదనీరు ముంచేయకుండా ఉండేందుకు రెండు ఎత్తిపోతల పథకాలు. వీటి కోసం రూ.ఆరు వేల కోట్ల ఖర్చు! ఇంతింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సామాన్యులకు చౌకగా వైద్యం అందించేందుకు పనికొచ్చే వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం పైసా లేకపోవడం విచిత్రమే! డబ్బుల్లేకే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది పాపం!అమరావతిలో 34 వేల ఎకరాల రైతుల భూమి, ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో తెగ చెప్పేవారు.. ఇప్పుడేమో ఆ భూమి మున్సిపాల్టీ స్థాయిది అంటున్నారు. అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44 వేల ఎకరాలైనా కావాలంటున్నారు. ఈ రెండు విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందన్న అనుమానం వస్తుంది.రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుదారుల లాభాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను విస్మరించిందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా అణ, కాణీలకు ప్రైవేటు వారికి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు సంస్థలు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ,ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే ఫర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా, రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజలలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది.విశాఖపట్నంలో రిషికొండపై కేవలం రూ.450 కోట్ల వ్యయంతో గతంలో ఉన్నవాటి స్థానంలో ఏడు కొత్త భవనాలను నిర్మిస్తే వృథా ఖర్చు, పర్యావరణానికి విఘాతమని విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట తీసేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ విస్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. స్వభావరీత్యా అక్కడి భూమి భారీ భవనాల నిర్మాణానికి అనువు కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు సాగుతోంది.పరిపాలన కేంద్రమైన రాజధాని కోసం అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని అప్పట్లోనే చాలామంది చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు సరికదా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసేది. పోనీ.. అప్పట్లో తీసుకున్న ముప్ఫైవేల పైచిలుకు భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసిన రైతులకు ఇస్తామన్న భూమి ఇచ్చారా? ఊహూ లేదు. అలా చేసి ఇప్పుడు అదనపు భూమి కోసం అడిగితే రైతుల నుంచి అభ్యంతరాలు పెద్దగా వచ్చేవి కావేమో. ఒకపక్క అప్పుడప్పుడూ భూములు బలవంతంగా తీసుకోమని చెబుతూనే ఇంకోపక్క దానికి భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్, హోటల్ యాజమాన్యం బలవంతంగా తీసుకుందని ఇద్దరు చిన్నకారు రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవగా భూములిచ్చేయమని సలహాలు పారేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్డీయే కూడా భూములను బలవంతంగా లాక్కొనేందుకు సిద్ధమవుతోంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై విష ప్రచారం ఆరంభిస్తారు. అమరావతి దేవతల రాజధాని అని, రాక్షసులు కొందరు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మొదలు అందరూ విమర్శించడం ఆరంభిస్తారు.రైతుల పాట్ల మాటేమిటి అని ఎవరూ ప్రశ్నించకూడదు. లక్షల కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడం ఎలా సాధ్యమని చాలామందిలో అనుమానం ఉన్నా ఎవరికి వారు ఏమోలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త, కొత్త ప్రతిపాదనలలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో సందేహాలు, భయం మొదలయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాల్టీ అవుతుందని సీఎం స్వయంగా అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా? లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం? మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడనుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా, అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి, ఆ తర్వాత అభివృద్ది ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటనను కూడా వక్రికరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది. అది వేరే విషయం. సజ్జలకాని, బుగ్గన కాని చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వ్యయం చేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి?ఆ ప్రాంతంలో అభివృద్ది సంగేతేమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడకు వస్తాయి? అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం అప్పులు కూడా తీసుకు వస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరువేల కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే, అమరావతి రాజధానికి మాత్రం ఇన్నివేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏపాటి తెలివైన పని. సభలు,ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి, లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అదీ కనిపించడం లేదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటివాటికి ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు.కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారి తీయవచ్చు.వీటన్నిటిని గమనించి సమతుల్యతతో కూడిన సమిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వార్తలు రాయడమే నేరమా?
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది!’ కోట్లాది హిందు వుల మనోభావాలను గాయపరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఇది. ఆ వెంటనే దానిని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ‘ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు’... ఇది కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపాదించి చేశారు. అలాగైతే ఎన్ని కేసులు పెట్టొచ్చు?అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలు జగన్పై పలు తీవ్రమైన అభియో గాలు గుప్పించారు. ‘జగన్ ఏపీలో ప్రజల భూములన్నీ కొట్టేయడా నికి యత్నిస్తున్నారు; జగన్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే 30 వేల మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారంటూ వలంటీర్లపై నిందలు వేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే అప్పట్లో వారిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో! అలాంటి అబద్ధపు ఆరోపణలను ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో! కానీ జగన్ టైమ్లో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదలివేశారు. ఇటీవలి కాలంలో ఏపీని పోలీసు రాజ్యంగా మార్చి, విపక్ష వైసీపీ వారిపైనే కాకుండా, తనకు గిట్టని ‘సాక్షి’ మీడియాపైనా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంగతులు గుర్తు చేయవలసి వచ్చింది.కేసులతో కొత్త రికార్డులురాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ల ఆధారంగా మీడియాపై కేసులు పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీటి మళ్లింపు వల్ల గుంటూరు చానల్కు గండి పడిందనీ, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాల పంట పొలాలు మునిగాయనీ ఆరోపించారు. ఆయన చెప్పిన విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. సాధారణంగా ప్రభుత్వ పక్షాన ఎవరైనా ఏమి చేయాలి? అది వాస్తవమా, కాదా? అన్నదానిని పరిశీలించి మీడియాకు వివరణ ఇచ్చి, వార్తను ప్రజలకు తెలియచేయాలని కోరవచ్చు. అలాకాకుండా సంబంధిత అధికారి ఒకరితో ‘సాక్షి’పై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి నోటీసు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. విశేషం ఏమిటంటే, ఇదే సమయంలో టీడీపీ మీడియా ఒక కథనాన్ని ఇస్తూ, అమరావతిలో వరద ముప్పు నివారణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లతో మరో రెండు ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపింది. కేసులు అక్రమమని తెలిసినా, పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగక తప్పడం లేదు. ఆ మాట కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులకు వ్యక్తిగతంగా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికీ ఇలాంటి అసంబద్ధ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ‘సాక్షి’ గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండ రని పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు.మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికా రుల ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని ‘సాక్షి’ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీస్ పెద్దలకు కోపం వచ్చిందట. అది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు. కానీ, పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే సదరు సంఘం నేతలు వివరణ ఇచ్చేవారు. పాపం... ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన క్యాడర్గానీ కొంతమంది పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు. కానీ ‘సాక్షి’ మీద సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అర్ధరాత్రి వేళ ‘సాక్షి’ ఆఫీస్కు పోలీసులు వచ్చి హడావిడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచా రణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయులు హాజర య్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు ఆ సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట! జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి. అయినా ఆ వివరాలు కోరారు. ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేక పోయారో, దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థం అవుతుంది.ద్వంద్వ ప్రమాణాలుఇంకో ఉదంతం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ‘సాక్షి’ ఒక వార్తను ఇచ్చింది. ఆ అధికారి పేరు రాయలేదు. తమకు వచ్చిన సమాచారంలో నిజం ఉందని నమ్మితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాలు ఇస్తుంటారు. ఈ స్టోరీపై సీనియర్ అధికారికి ఆగ్రహం వచ్చింది. వేరే అధికారిని పిలిచి కేసు పెట్టించారు. ఆ అధికారి తను ఏ తప్పు చేయకపోతే, ఆ కథనం తనను ఉద్దేశించి రాశారన్న అభిప్రాయం కలిగితే ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించి ఉండవచ్చు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసు ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా మరొకరితో కేసు పెట్టించడంలోనే డొల్లతనం ఉందనిపిస్తుంది.ఏపీ పోలీసుల ప్రవర్తనకు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపుల్. తమ ఓట్లు తమను వేయనివ్వాలని కొందరు ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్ఠో ఊహించుకోవచ్చు. కోర్టులలో బెయిల్ రాకుండా ఉండటం కోసం సంబంధం ఉన్నా, లేకపోయినా తోచిన సెక్షన్లు పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం... అదే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ సమక్షంలోనే గూండాయిజానికి పాల్పడినా నిస్సహాయంగా ఉండిపోవడం సమాజానికే ప్రమాదకరమని చెప్పక తప్పదు. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు చేసిన గూండాయిజం తెలిసిందే! ‘సాక్షి’ టీవీ చర్చలో అభ్యంతర పదం వాడారని అంటూ కూటమి నేతలే కొంతమందిని పురిగొల్పి కృత్రిమ ఆందోళనలు చేయించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, పోలీసు వ్యవస్థ ధర్మంగా, నిష్పక్షపాతంగా లేకపోతే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదనీ, రాజ్యాంగమనీ ఎప్పటికి గుర్తిస్తారో!కొమ్మినేని శ్రీనివాసరావువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాజ్యాంగం కంచెను రాజకీయం మేసేస్తోంది!
దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్ఎస్ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్ఎస్లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్ఎస్ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్ఎస్ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హిట్టా? ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు. జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది. బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. 👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు. 👉సూపర్ సిక్స్తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. 👉వృద్ధాప్య ఫించన్లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు. యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ను ఆ ఒక్క ప్రశ్న అడిగి ఉండాల్సింది!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం.. ..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!.. .. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి. నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ.. .. రాజ్దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!! కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ప్రైవేట్ పిపాసకు ఏపీలో వైద్యం బలి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది. అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు. ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్ చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ పార్టీ అద్భుతాలు రేవంత్కే తెలియాలి!
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు. పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్ఎస్లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్తో, మరోసారి టీఆర్ఎస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు. కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యూరియాపైనా బాబు మార్కు డ్రామా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే చిట్కాలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎరువులకు కొరత ఉంది అన్నామనుకోండి.. వెంటనే వాడకం తగ్గించుకోమంటారు. ధాన్యం కొనుగోళ్లు ఇష్టం లేకపోతే... వరి వేయడం వేస్ట్ అనేస్తారు. పోనీ ఈ సలహాలేమైనా సకాలంలో ఇస్తారా? ఊహూ. అన్ని అయిపోయాక ఉచిత సలహాలు పారేస్తూంటారంతే. రాజకీయంగానూ అంతే. తన అసమర్థత బయటపడుతుందన్న అనుమానం వస్తే చాలు.. రాజకీయం మొదలుపెడతారు. నెపం ప్రత్యర్థి పార్టీలపై తోసేసే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత విషయంలోనూ జరిగింది ఇదే. సమస్యను తీర్చే ప్రయత్నం చేయకపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దూషణలకు పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరించడం కూడా చంద్రబాబుకున్న నైపుణ్యం!ఏపీ, తెలంగాణల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా యూరియా కొరతపై కొన్ని వార్తలైనా ఇవ్వక తప్పలేదంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ కష్టం రైతులకు మాత్రమే తెలుస్తుంది. ఏసీ రూములో కూర్చుని ఉండే మంత్రికి, ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుంది? బఫే డిన్నర్లో మాదిరిగానే యూరియా కోసమూ నిలబడమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య రైతులు అవమానించడమే అవుతుంది. తెలంగాణలో యూరియా కొరత ఉన్నా కాంగ్రెస్ మంత్రులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులపై నోరు పారేసుకోవడం లేదు.ఏపీలో చంద్రబాబు అటు కేంద్రాన్ని అనలేరు. ఇటు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేరు. అందుకే రైతులు, సోషల్ మీడియా, సాక్షిలపై ఆయన తన అక్కసు తీర్చుకుంటున్నారేమో! యూరియా కొరత సమస్యపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబడ్దార్ అని అన్నారట యూరియా అందుబాటులో ఉందని ఆయన చెబుతున్నారు. రైతులకు ఒక క్రమపద్దతిలో ఒక టైమ్ ప్రకారం యూరియాను పంపిణీ చేస్తే ఇబ్బంది ఉండదు. అలాకాకుండా యూరియా దొరుకుతుందో ,లేదో తెలియని అయోమయ స్థితిలో రైతులను ఎందుకు ఉంచుతున్నారు? ఎరువుల కొరతపై తప్పుడు పోస్టులు పెడితే చర్యలే అని ఆయన రైతులను, సోషల్ మీడియా వారిని బెదిరిస్తున్నారు. ఏపీలో అచ్చంగా పోలీసు యంత్రాంగంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ఉంది తప్ప, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్లు కనబడదు. ఇది అత్యయిక స్థితిని తలపిస్తుంది తప్ప, ప్రజాస్వామ్య యుతంగా ఉండదు. ఒకవైపు టీడీపీ తరపున పచ్చి అబద్దాలను తమ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుంటారు. అదే టైమ్ లో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టిస్తుంటారు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి అని పలువురు చెబుతున్నారు. వైసీపీ చేసే రాజకీయాలలో రైతులు భాగస్వాములు కావద్దని, ఎరువు లేదని ఎవరైనా చెబితే తానే అక్కడకు వెళ్లి చూస్తా.. తప్పు ఉంటే చర్య తీసుకుంటా.. లేకుంటే సోషల్ మీడియా సంగతి చూస్తా అని చంద్రబాబు అనడం ఏ పార్టి విజ్ఞత అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. అంటే సీఎం స్వయంగా వెళితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదని ఆయనే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. ఇన్నాళ్లుగా ఎన్నిసార్లు ఎన్ని చోట్ల యూరియా కోసం నిలబడిన రైతుల క్యూల వద్దకు ఆయన వెళ్లారు. నిత్యం ఏదో ఒక చోటకు హెలికాప్టర్ వేసుకుని టూర్ చేస్తుంటారు కదా? ఎక్కడా ఆయనకు ఈ క్యూలు కనిపించలేదా? వీటి గురించి మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులపై ఒత్తిడి లేదట. ఆత్మహత్యలు లేవట. అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇది ఏ మేరకు నిజమో ఆయనకు తెలుసు. రైతులకు తెలుసు. జగన్ టైమ్ లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి,రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలను తీర్చడానికి కృషి చేసినమాట అవాస్తవమా?అప్పట్లో ప్రతి ఏటా 13500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందించారా? లేదా?అయినా రైతులపై ఒత్తిడి ఉందా? తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వలేదా? దానిని ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారా? లేదా? ఈ ఏడాది కేంద్రం ఇచ్చేదానితో కలిసి ఏడువేలే ఇచ్చారే? వరి, మిర్చి, మామిడి, ఉల్లి, తదితర పంటలకు సరైన ధరలు లేక వారంతా ఆందోళనకు దిగుతున్న మాట నిజం కాదా ? అయినా రైతులపై ఇప్పుడు ఒత్తిడి లేదని చంద్రబాబు అనడం చూస్తే, ఎంత ధైర్యంగా అబద్దాలు చెప్పగలుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ టైమ్ లో రైతులు ఎక్కడైనా రోడ్డెక్కవలసిన అవసరం వచ్చిందా? అలాంటి దృశ్యాలు కనిపించాయా అని వైసీపీ వారు అడుగుతున్నారు. సరిపడా యూరియా సరఫరా నిజంగా ఉంటే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్డు ఎక్కవలసి వస్తోందన్న ప్రశ్న వస్తోంది.అంటే వ్యాపారులు పక్కదారి పట్టించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా ఇస్తున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల సిఫారసులుంటే తప్ప ఇవ్వడం లేదు. మరికొన్ని ప్రాంతాలలో యూరియా పొందాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని షరతులు పెడుతున్నారట. సాక్షి మీడియాలోనే కాకుండా ఎల్లో మీడియాలో కూడా అప్పుడప్పుడు యూరియా కొరత సమస్యల వార్తలు వస్తున్నాయి. జనంలో ఎల్లో మీడియా క్రెడిబిలిటి పోయిందనుకున్నారో, ఏమో కాని, సాక్షి మీడియాపైనే చంద్రబాబు విరుచుకుపడుతుండడం అలవాటుగా చేసుకున్నారు.దీనిని బట్టి సాక్షి మీడియానే జనం నమ్ముతున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. అందుకే ఆయన ఎక్కువ కంగారు పడుతున్నారనుకోవాలి. జనంలో ఎవరైనా నిలదీస్తే వారికి వైసీపీ ముద్ర వేసి సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు. యూరియా గందరగోళంపై చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి జగన్ గట్టిగా ప్రశ్నించారు.తనకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని జగన్ ఎద్దేవ చేశారు. రైతులకు తమ ప్రభుత్వంలో జరిగిన మేలు , ప్రస్తుతం రైతులు పడుతున్న పాట్లను జగన్ వివరించారు. ప్రతిపక్షంగా ఆయన చేసిన విమర్శలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా?అన్నది చంద్రబాబు ఇష్టం. కాని రాష్ట్రంలో రైతులు యూరియా కోసం, గిట్టుబాటు ధరల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నది గమనించి చర్య తీసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ష్యూరిటీ అంటే భవిష్యత్తుకు మోసం గ్యారంటీ అని జగన్ , ఇతర వైసీపీ నేతలు ఎద్దేవ చేస్తున్నారు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్షీట్పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్షీట్లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్లు, ఛార్జ్షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్హౌస్లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేవుడి ముందూ రాజకీయమేనా బాబు!
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.అదే టైమ్లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.. -
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
ఎల్లో మీడియా సృష్టి అది.. బాబూ చూసుకోవాలి కదా!
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్తా కధనం వచ్చింది. అంతవరకు సంతోషమే. అదే రోజు, ఆ మరుసటి రోజు వచ్చిన కొన్ని వార్తలు చూస్తే ఆవేదన కలుగుతుంది. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, పెన్షన్ కోసం దివ్యాంగులు నానా అగచాట్లు పడుతున్న వైనంపై సచిత్ర కథనాలు వచ్చాయి. నిజంగా ఈ పరిస్థితి బాధాకరమే. అంతేకాదు.. పెన్షన్కు అనర్హులు అంటూ నోటీసు రావడంతో ఆందోళనకు గురైన దివ్యాంగ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం మరింత కలచివేస్తుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకొన్న దయనీయ పరిస్థితికి ఇది దర్పణం పడుతుందనుకోవాలి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెన్షన్ దారుల విషయంలో, యూరియా సరఫరాపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారట. అలాగే అమరావతి మునిగిందని చెబుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది మరింత విచారకరమని చెప్పాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై, లేదా ఇబ్బందులపై వార్తలు వస్తే వాటిని సరిచేసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ గా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ రెండు అంశాలకు సంబంధించి ఎల్లో మీడియా కూడా తమ జిల్లా పత్రికలలో పెన్షన్ దారులు పడుతున్న పాట్లు, యూరియా ఇక్కట్లు, అమరావతిలో వరద మొదలైన అంశాలపై కథనాలు ఇచ్చాయి.రాష్ట్రస్థాయిలో మాత్రం వాటిని కప్పిపుచ్చి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అన్న వ్యాఖ్యకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల మొత్తాన్ని వారి వైకల్యాన్ని బట్టి ఆరువేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నికల హామీగా ఇచ్చాయి. ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచినట్లు పెంచి, అనర్హుల పేరుతో చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పార్ధసారధి తదితరులు దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయని, పెన్షన్దారులలో దొంగలు ఉన్నారని ఆరోపిస్తూ స్పీచ్లు ఇచ్చారు. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఈ పెద్దలు కొందరు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యంపై నోటీసులు వచ్చినవారికి వచ్చే నెల పెన్షన్ రాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఎవరైనా కోరి అంగవైకల్యం తెచ్చుకుంటారా? అలా అని చెప్పుకుంటారా?. కానీ, దురదృష్టవశాత్తు పాలకులు దివ్యాంగులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. వారి పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు.దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళనకు దిగుతున్నారు. వారు తమ వైకల్యాన్ని టీవీల ముందు చూపుతున్న వైనం ఆవేదన కలిగిస్తుంది. అయినా ఎల్లో మీడియా మానవత్వం లేకుండా పెన్షన్లపై ఫేక్ రచ్చ అంటూ వార్తలు రాసి చంద్రబాబును సంతోషపెడుతోంది. నిజానికి ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారానికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలలో పలచన అవుతుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ విషం అని ఈ మీడియా రాసింది. దివ్యాంగుల ఫించన్ల తొలగింపుపై అసత్యాలు అని సత్యదూరమైన వార్తలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఎల్లో మీడియా ప్రభుత్వంతో కుమ్కక్కైంది. ఇప్పుడు నిత్యం కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు చేస్తున్న ఆందోళన అబద్దమా?.శ్రీకాకుళంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా?. పోనీ ఎల్లో మీడియా పెన్షన్దారులకు జరుగుతున్న అన్యాయంపై రాయలేదా?. అంటే వారు తమ జిల్లా పత్రికలలో రాస్తున్నారు. ఉదాహరణకు ఆగస్టు 21న ఇదే ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా పత్రికలో అర్హులకు అన్యాయం అని హెడ్డింగ్ పెట్టి ఒక పేజీడు వార్తలు రాసింది. అంటే ప్రభుత్వంపై వారు విషం చిమ్మినట్లేనని ఒప్పుకుంటారా?. లేక నిజమే రాశారా?. అలాగే చిత్తూరు జిల్లా ఎడిషన్లో వీరే రాసిన మరో వార్త ఏమిటంటే కొందరి పాపం.. వీరికి శాపం అని ఈ మొత్తం నెపాన్ని అధికారులు, డాక్టర్లపై నెట్టేసే యత్నం చేశారు. మంచానికే పరిమితమైన ఒక వ్యక్తికి నెలకు నాలుగు వేలే ఇస్తున్నారని ఇదే ఎల్లో మీడియా వారు ఫోటోతో సహా ప్రచురించారు. రెండు కాళ్లు పనిచేయకున్నా పూర్తిగా పెన్షన్ రద్దు చేశారని కూడా ఫోటోతో కూడిన మరో వార్తను ప్రచురించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి పత్రిక రాసినా, వైఎస్సార్సీపీ విమర్శలు చేసినా, అవి ఫేక్ ప్రచారం అయితే మరి ఇదే విషయాన్ని ఎల్లో మీడియా రాస్తోంది కదా?. దానిని ఏమంటారు. రాష్ట్ర స్థాయిలో ఒకరకంగా, జిల్లాలలో మరో రకంగా రాస్తున్న టీడీపీ మీడియా ఫేక్ అవుతుందా? లేదా?. అన్నది వారే ఆలోచించుకోవాలి. సాక్షిలో వచ్చిన కధనాలు కాని, వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాని నిజం కాకపోతే ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్లను యధాతధంగా ఉంచుతామని ఎల్లో మీడియాకు ఎందుకు లీక్ ఇచ్చారో చెప్పాలి. అంగవైకల్యంపై సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై కేసులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో బెదిరించడంతో వారు తమ వద్దకు వచ్చినవారికి ఎలాంటి అంగవైకల్యం ఉన్నా అనర్హులుగా ప్రకటించేశారట. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా!.ఇదే సందర్భంలో గతంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడానికి ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఇచ్చిన సర్టిఫికెట్ను వాడుకున్న విషయాన్ని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇక యూరియా సరఫరాపై కూడా ఇలాగే ఎల్లో మీడియా చేస్తోంది. రైతులు నిత్యం యూరియా కోసం క్యూలు కట్టి ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారని ఎల్లో మీడియా రాసింది. మరో వైపు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిఘా పెట్టాలని కూడా ఆయన ఆదేశించారట. యూరియా సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అదేమీ లేదన్నట్లు దుష్ప్రచారంగా కొట్టిపారేస్తే ఏమి ప్రయోజనం!. చెప్పులను కూడా క్యూలో ఉంచి రైతులు ఒక టైమ్ అంటూ లేకుండా ఎదురుచూపులు చూస్తున్న సన్నివేశాలు రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. పలు చోట్ల సొసైటీలలో, రైతు సేవా కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమస్య ఉంటే దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాకుండా ఎలా మాయ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా డప్పులు వాయిస్తోంది.అమరావతి విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద మోటార్లతో వరద నీరు తోడే పనిలో కనిపిస్తుంటారు. మంత్రి నారాయణ వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నామని చెబుతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వరద ఏమీ లేనట్లు మాట్లాడి అమరావతి మునగలేదని బుకాయిస్తుంటారు. టీడీపీ మీడియా అయిన ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికలలో సైతం అమరావతి ప్రాంతంలో వరదవల్ల ఆయా గ్రామాలలో ప్రజలు పడిన పాట్లను వివరిస్తూ వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు కోపం ఎంతసేపు సాక్షిపై, వైఎస్సార్సీపీపైనే ఉంటుంది. ఏమి చేస్తాం. ఆయన ధోరణే అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విపక్షం ఆధారాలు లేకుండా విమర్శలు చేసే అవకాశం ఉందా?.టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా తప్ప మరే ఇతర మీడియా అయినా నిజం లేని వార్తలను సృష్టించే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలపై వార్తలు వస్తే వెంటనే సంబంధిత శాఖలతో ఖండన లేదా వివరణ ఇవ్వాలని చెప్పేవారు. కాని ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే స్వయంగా ఆయనే సమస్యలపై అక్షర సత్యాలు రాస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులను వేధిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు తనకు తాను ఎంత బలహీనుడుగా మారుతున్నారో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఒక్క తెలంగాణలోనే ఎస్ఐఆర్ ఎందుకు?
బీహార్లో మాదిరిగా తెలంగాణలోనూ ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైందే. రాజధాని హైదరాబాద్లోనే మూడు నుంచి నాలుగు లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, సవరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన అంగీకరించినట్లయింది. బీహారులో ఎస్.ఐ.ఆర్ పేరుతో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లను మాయం చేశారన్నది విపక్షం ఆరోపణ. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆర్జేడీ, కాంగ్రెస్లు ఆరోపిస్తూంటే... ఇతరదేశాల వారు అక్రమంగా ఓటర్ల జాబితాలోకి చేరి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, మిత్రపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా అది ప్రజాస్వామ్య బలహీనతలకు ఉదాహరణలవుతాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఓట్చోరీపై మీడియా సమావేశంలో వెల్లడించింది మొదలు దేశంలో రాజకీయంగా వేడి పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపే లక్ష్యంతో రాహుల్ బీహార్లో ఓట్ అధికార్ యాత్ర కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపు కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్ని బోగస్ ఓట్లని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోఇన మహదేవపుర అసెంబ్లీ నియోజజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన అక్కడ ఏ రకంగా లక్షకుపైగా ఓట్లను చేర్చింది సోదాహరణంగా వివరించారు. ఈ బోగస్ ఓట్లతోనే బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ, కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగిందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైమ్లో బీహారులో తొలగించిన ఓట్లపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయా రాజకీయ పక్షాల వారు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారని చెబుతున్నారో వారితో మళ్లీ దరఖాస్తు చేయించుకోవాలని సలహ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దీనిని వ్యతిరేకించవచ్చు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాతబస్తీలో పలు చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. అందులో కొంత నిజం ఉండవచ్చు కూడా. పాతబస్తీలో అధికారులు ఏ మార్పు తీసుకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు గతంలో అక్కడ విద్యుత్ బిల్లులు చెల్లించని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ప్రయత్నిస్తే పెద్ద ఆందోళన వచ్చింది. స్థానికులు కొందరు అధికారులపై తిరగబడ్డారు. ఓట్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యాల వంటివారు, పాకిస్తాన్ చెందినవారు కూడా పాతబస్తీలో అధికంగా ఉన్నారని, వారికి కూడా ఓట్లు ఉన్నాయని,వాటిని తొలగించాలని బీజేపీ చెబుతుంటుంది. నిజంగానే ఇతర దేశాలకు చెందినవారు కాని, అనర్హులైనవారు కాని ఓటర్ల జాబితాలో ఉంటే ఆ పేర్లను తొలగించడం తప్పు కాదు. కానీ ఆ ముసుగులో బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్న అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తే తప్పు అవుతుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్చవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలను చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కనుక, కింది స్థాయి అధికారులు వారి అదీనంలో ఉంటారు కనుక అలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో, చేర్చడమో జరుగుతుంటే పట్టుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనకూలంగా ఉండే విధంగా మార్చే ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలలో, ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అనుమానాలు తీర్చాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికలలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. రాజకీయంగా కూడా ఫిర్యాదు చేసిన ఒక మాజీమంత్రిని దానిపై మరింత గొడవ చేయకుండా మేనేజ్ చేశారన్న అభియోగమూ లేకపోలేదు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పించింది. కౌంటింగ్ నాడు అసంబధ్దంగా పెరిగిన 12.5 శాతం ఓట్ల ప్రభావం 88 నియోజకవర్గాలపై ఉందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి కాని ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలపై స్పందించాలి. అందులో నిజం లేదని బహిరంగంగా రుజువు చేయాలి. ఈవీఎంలపై నిర్దిష్ట అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జ్లో అనుమానాలు రావడం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు రావడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగ ఓట్లు చేర్చడం అన్నది కొత్త కాదు. లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. వారికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. ఎన్నికల రోజున వందల బస్సుల్లో, వేల కార్లలో హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అనేక జిల్లాలు, రాష్ట్రాలలో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం వెతక్కుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయడం, కావల్సిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటివాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు చేయాలని తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా? లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్ను వాడుతారా? ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లా దేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా, లేదా అసలైన ఓటర్లను తొలగించకుండా ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలి. ఆధార్ కార్డును విదేశీయులకు జారీ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం చేస్తోంది. అంటే మన దేశంలో ఒక వ్యవస్థకు, మరో వ్యవస్థకు సమన్వయం కొరవడుతోందన్నమాట. అమెరికా వంటి దేశాలలో కాన్పు జరిగి పుట్టిన రోజునే గుర్తింపు కార్డు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పద్దతి వస్తే మంచిది. పుట్టిన రోజు సర్టిఫికెట్ ఆధారంగా వారికి నిర్ణీత ఏజ్ వచ్చాక ఆటోమాటిక్గా ఓటింగ్ హక్కు ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ సిద్ధం చేసుకోవడం వంటివి చేయవచ్చేమో పరిశీలించాలి. ఓటర్ల జాబితాలలో అక్రమాలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే.వీటన్నిటిని అరికట్టడానికి ఒక స్పష్టమైన విదానాన్ని రూపొందించనంత కాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో!::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. నిన్ను నమ్మేదెలా?
‘ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇదంతా కేవలం ఉపన్యాసం కోసం చేసిందేనని, చిత్తశుద్ధి లేనిదని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం ప్రచురితమైన రోజే ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరిగిన దాష్టీకాల వార్తలూ ప్రముఖంగా వచ్చాయి. కొన్నింటిలో చంద్రబాబు సొంతపార్టీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇప్పటివరకూ చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇందుకు తగ్గట్టుగానే బాబుకు వత్తాసు పలికే మీడియా కూడా టీడీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుతూంటుంది. కానీ.. ఈ ఘటనలన్నీ ఇతర మాధ్యమాల్లో వస్తుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.టీడీపీ ఎమ్మెల్యేల ఇతర దందాల సంగతి పక్కనపెట్టినా.. వీరూ, వీరి అనుచరులు మహిళలపై చేస్తున్న వేధింపుల ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. సినిమా విడుదలకు తన అనుమతి కావాలన్న ఆ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం ఆయన శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్ను ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. తనతో వీడియో కాల్లోనే మాట్లాడాలన్నది ఆయన హుకుం!. మాట వినకపోతే బదిలీ ఖాయమని సిబ్బంది ద్వారా బెదిరింపులకు దిగుతున్నట్లు ఈ కథనం చెబుతోంది.రాత్రి పది గంటల సమయంలోనూ పార్టీ ఆఫీసుకు రావాలని మహిళా ఉద్యోగులను పిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు భరించలేక ఆ దళిత మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ ఇతర మహిళా ఉద్యోగులను కూడా వేధించారని ఆమె అంటున్నారు. మరి ఇవన్నీ ఆడబిడ్డ జోలికి వెళ్లడమే కదా? మరి చంద్రబాబు తాట ఎంతవరకు తీశారు? కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు చేరవేయడానికి పనిచేసే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?.ఇక మరో ఎమ్మెల్యే ఉదంతం చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నట్లు పెదాలు కదుపుతున్న దృశ్యం సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యేకి టీడీపీకే చెందిన ఒక మహిళా నేతతో సంబంధం ఉందట. దీంతో ఆ మహిళా నేత భర్తే సంబంధిత వీడియోని ప్రచారంలో పెట్టారట. ఈ విషయాన్ని సూఫియా అనే మరో టీడీపీ నేత ఎమ్మెల్యేకి చెబితే తొలుత ఆమెను కామ్గా ఉండమని చెప్పారట. తదుపరి అక్రమ సంబంధం ఉన్న మహిళ కుటుంబంతో సెటిల్మెంట్ చేసుకుని, తదుపరి తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సూఫియా అంటున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీయకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన అత్యంత విషాద భరితం. శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే భర్త టీడీపీకి చెందిన వాడు కావడంతో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ వైస్ చైర్మన్ తదితరుల ఒత్తిడితో పోలీసులు ఆ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని శ్రావణి ఆరోపించారు. తన ఆత్మహత్యకు టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కారణమని ఆమె చెప్పిన ఆడియో వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అనే మహిళ హత్య కేసు గురించి గొంతెత్తి అరిచేవారు. ఎన్నికల తర్వాత ఆయనకు పదవి రావడంతో ఆ మాటే ఎత్తడం లేదు. ఆ మీదట సుగాలి ప్రీతి తల్లి నిరసన యాత్ర చేయాలని తలపెట్టినా అనుమతించడం లేదట. జగన్ పాలన సమయంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వలంటీర్లే కిడ్నాప్లకు పాల్పడ్డారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారం సాధించడానికి గాను మహిళలను అడ్డు పెట్టుకుని అంత ఘోరమైన ఆరోపణలు చేయవచ్చా? అది వారిని అవమానించినట్లా? కాదా?.2014-19 మధ్య కాలంలో కూడా మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగాయి. ముసునూరు మహిళా ఎమ్మార్వో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు ఆమెను తీవ్రంగా అవమానించిన ఘటన అప్పట్లో పెను సంచలనం. అయితే చంద్రబాబు ఎమ్మార్వోనే మందలించి రాజీ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు.. కొద్ది నెలల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక టీడీపీ మహిళా నేత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై నామమాత్రంగా చర్య తీసుకున్నా, ఆ తర్వాత ఆ కేసే లేకుండా రాజీ చేశారని వార్తలు వచ్చాయి.శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వినూత వ్యక్తిగత వీడియోల కేసు చివరికి వారి పీఏ హత్యకు దారి తీసింది. వినూత దంపతులు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే జరిగిందని ఆరోపించారు. అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వపరంగా చర్యలు శూన్యమే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, రాహుల్ హాట్లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ టికెట్ కు డబ్బులిచ్చిన లోకేష్.. కొమ్మినేని సెటైర్లు
-
బాబు గారికి పిచ్చి అన్నా స్పందించరా?
‘పీ-4 పిచ్చిలో చంద్రబాబు’’ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఒక కథనం శీర్షిక ఇది. ఇలాంటి కథనం ఏదైనా సాక్షిలోనో.. లేదా టీడీపీకి సంబంధం లేని ఏ ఇతర మీడియాలోనో వచ్చి ఉంటే ఆ పార్టీ, దాని మద్దతుదారులు అంతెత్తున లేచి ఉండేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని అంత మాట అంటారా అని మండిపడేవి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసులు పెట్టడానికి ప్రయత్నించి ఉండేవారు. కాని టీడీపీ మీడియా యజమానే అనడంతో వాళ్లెవరూ కిక్కురుమనలేకపోతున్నారు. కనీసం ఖండన కూడా ఇచ్చినట్లు కనిపించలేదు.చిత్రమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇద్దరూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సందర్భంలోనూ ఈ ‘పీ-4’ అంశం గురించి చెప్పడం. అప్పుడు టీడీపీ మీడియా ఆహా, ఓహొ అంటూ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్తో సహా ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అద్భుతం అని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెగ ప్రచారం చేశాయి. ఏడాది కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ పిచ్చి పని చేసినా అది రైటే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామని ప్రకటించినా, విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం లులూ మాల్కు ఇచ్చేస్తున్నా టీడీపీ మీడియా అలా చేయడం తప్పు అని ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైందో.. చిత్తశుద్దితోనే రాశారా? లేక ఏదైనా తేడా వచ్చి రాశారా? లేక బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో రాశారా? లేక ప్రజలలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రాశారా? అన్నది తెలియదు కాని ‘పీ-4’ గురించి రాసిన కథనంలో చంద్రబాబు ‘పీ-4 పిచ్చిలో ఉన్నారని అంటున్నారు. శీర్షికలో పిచ్చి అని రాసి చంద్రబాబును తప్పుపట్టినా, మేటర్లో మాత్రం తప్పు సలహాదారులు, అధికారులపై నెట్టే యత్నం చేశారు. ఆ సందర్భంలో కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకున్నారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తుంటారట. ఆచరణ సాధ్యం కాని ‘పీ-4’ వంటి ఆలోచనలంటే ఆయనకు మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్లోను పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారట. ఇప్పుడు ఇలా రాశారు కాని, టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఇదే మీడియా అబ్బో ఇంకేముంది..జగన్పై శరాలు సిద్ధం అంటూ తెగ పొగిడింది. అది ఆచరణ సాధ్యమేనని ఈ మీడియాతో పాటు ఇతర టీడీపీ మీడియా సంస్థనలు కూడా హోరెత్తించాయి కదా! అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సలహాదారులలో ఈ మీడియా అధినేత కూడా ఉంటారని చెబుతారు. కాని ఇప్పుడు సడన్గా చంద్రబాబులో ఫలానా అవలక్షణం ఉందని ఆయనే చెబుతున్నారు. అదే టైమ్లో పుణ్యానికి పోతే, పాపం ఎదురైనట్లు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇందులో చంద్రబాబు చేసిన పుణ్యమేమిటో తెలియదు. ‘పీ-4’ కొత్త పల్లవి అందుకున్నారని రాశారే తప్ప ఎన్నికల ప్రణాళికలోనే దీనిని పెట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడేమో అది దిక్కుమాలిన సలహా అని అంటున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఈ మీడియా కూడా నమ్మడం లేదు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ ముద్దు పేర్లు పెట్టి, కొంతమందికి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఈ మీడియా యజమాని చెబుతున్నారు. ఇలాంటి సమాచారంతో కూడిన వార్తను సాక్షిలో వస్తే, టీడీపీ సోషల్ మీడియా తెగ విమర్శించింది. ఇదంతా అక్కసుతో కూడిన విమర్శలని ఆరోపించింది. మరి ఇప్పుడు స్వయంగా టీడీపీ మీడియానే ఆ విషయం రాస్తే నోరు విప్పలేకపోయింది. పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? పూర్తిగా నివారించడం మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియడం లేదట. దాతలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్భందం చేయడం ఏమిటని ఆ మీడియా ప్రశ్నించింది. కోటి మంది పేద కుటుంబాలు ఉంటే 11 లక్షల కుటుంబాలనే ఎంపిక చేశారని, దీనివల్ల మిగిలిన వారు టీడీపీకి దూరం కారా అన్నది ఈ మీడియా యజమాని బాధ. చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారని, దానివల్ల మిగిలిన పేద కుటుంబాలు కినుక వహించవా అని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారట, ఇప్పటికే ఎంపికైన కుటుంబాలలో 26 శాతం అనర్హమైనవని కూడా అధికారులు చెబుతున్నారట.ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ అమలు కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పిలిచి గంటల కొద్ది చర్చలు జరుపుతుండడాన్ని కూడా ఈ మీడియా ఆక్షేపించింది. ఈ సమావేశాలకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకున్నారని కూడా వెల్లడించారు. దత్తత తీసుకునే వారిని ఇంతమందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని ఈ మీడియా యజమాని అంగీకరించారు. ఇదే మాట సాక్షి మీడియా చెబితే ఇంతెత్తున ఎగిరిపడిన ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు. ‘పీ-4’ పథకం అమలు కమిటీ వైస్ ఛైర్మన్ కుటుంబరావును దీనికంతటికి బాధ్యుడు అన్నట్లుగా ఈ మీడియా యజమాని చెబుతున్నారు. తొలుత ముఖ్యమంత్రి ‘పీ-4’ పిచ్చిలో ఉన్నారని రాసిన ఈయన చివరికి దానినంతటిని ఒక సలహాదారుపై నెట్టేశారన్న మాట. ‘పీ-4’ వల్ల కూలీలు దొరకరని ఈయన సూత్రీకరిస్తున్నారు. అంటే ఎవరైనా నిజంగానే బాగుపడితే కూడా ఈయనకు నచ్చదు అనుకోవాలన్నమాట. అయితే టీడీపీతోసహా కూటమి ఎమ్మెల్యేలు కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రజలను పీడిస్తున్నారని ఈ టీడీపీ మీడియా అంగీకరించడం విశేషం. ఎమ్మెల్యేలకు కప్పం కడితేనే ఏ పని అయినా అవుతోందని, చివరికి పోలీస్ స్టేషన్లలో కేసు కట్టడానికి, రిజిస్ట్రేషన్లకు కూడా వీరు అనుమతి ఉండాలట. రాజధాని అమరావతి విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా ఉందని కూడా ఈయన చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఈ మీడియా ఒక నిజం రాసినా, ఇందులో వారికి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తున్నారు. గతంలో ఒక నేతపై కథనం రాస్తూ ఆయన చానా పైరవీలు చేస్తున్నారని, లోకేశ్ పేరుతో దందాలు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ స్టోరీ సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చింది. అయినా ఆయనకే ఎంపీ పదవి దక్కింది. ఆ తర్వాత ఈ మీడియా కలం, గళం మూతపడిపోయింది. దీని భావమేమి తిరుమలేశ! అని అంతా ప్రశ్నించుకున్నారు.ఇప్పుడు ఈ కథనం ఇవ్వడం ద్వారా ఎవరిని బెదిరించడానికి అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే జరుగుతుండడం ఆసక్తికరం! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
KSR: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సంపూర్ణ బెయిల్..
-
కొమ్మినేనికి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీం కోర్టు తాజాగా పర్మినెంట్ బెయిల్గా మారుస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అదే సమయంలో గతంలో లైవ్ షో విషయంలో ఇచ్చిన ఆదేశాలనూ సవరించింది. దీంతో ఈ కేసు విచారణ ముగిసినట్లయ్యింది. సాక్షి చానెల్లో ఓ గెస్ట్ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే కొమ్మినేని శ్రీనివాసరావును జూన్ 9వ తేదీన ఏపీ పోలీసులు నేరుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. జూన్ 13వ తేదీన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో సాక్షి టీవీ డిబేట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తొలగించింది. టీవీ షో లో గెస్టు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దంటూ మధ్యంతర బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లైవ్లో చేసే గెస్ట్లు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమన్న కొమ్మినేని తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ఆ ఆదేశాలను జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం సవరించింది. అదే సమయంలో.. అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తప్పనిసరిగా పాటించాలని, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో ముందుగా 41 ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని ఏపీ పోలీసులకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.మధ్యంతర బెయిల్ తీర్పు సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. యాంకర్ను ఎలా బాధ్యుడ్ని చేస్తారు?. కేవలం టీవీ డిబేటలో నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? అలాగైతే కోర్టులో విచారణ సందర్భంగా చాలాసార్లు మేం నవ్వుతాం. వాక్ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలి అని సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సెలవుల కారణంగా మూడు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్స్టాప్లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?
సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా?
తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.తొలి టర్మ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్లో చేరిపోయారు.ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలలో, కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్ఎస్ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్ఎస్కు సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్ కూడా కొంతకాలం కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈసీ విశ్వసనీయతకు పరీక్ష
ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన విషయాలే వెల్లడించారు. ఎన్నికల సంఘం తీరుతెన్నులను ఎండగట్టారు. అనేక లోపాలను, ఎన్నికలలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. కానీ... ఎన్నికల సంఘం స్పందించిన తీరు వాటిపై అంత సంతృప్తిగా ఉన్నట్లు అనిపించదు. కాగా రాహుల్ వాదనను ఖండిస్తూ దేశ ప్రజలను ఆయన అవమానించారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన, ఆధారాలు చూపిన అంశాలపై ఎన్నికల సంఘం నేరుగా స్పందించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ప్రమాణం చేయాలంటూ ప్రకటన చేయడం అర్థవంతమనిపించదు.గత సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇవే తరహా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా 49 లక్షల ఓట్లు అదనంగా పోల్ అయ్యాయన్న ఆరోపణపై ఇంతవరకు సరైన జవాబు రాలేదు. అసాధారణ రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి విజయం సాధించడంపై చాలామంది ఆశ్చర్యం చెందారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో పరిశోధన చేసి రాహుల్ తన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఏపీలో జరిగిన తంతుపై కూడా మాట్లాడి ఉంటే క్రెడిబిలిటి పెరిగి ఉండేదేమో. అలా కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా ఆ ప్రస్తావన చేయలేదేమో అన్న అనుమానం వస్తుంది. లేదా కాంగ్రెస్కు ఏపీలో ఎలాంటి పట్టు లేనందున దాని జోలికి వెళ్లలేదేమో తెలియదు.ఐదు రకాలుగా ఓట్ల చోరి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్లు, ఒకే చిరునామాలో భారీగా ఓట్లు, ఇన్ వాలిడ్ ఫొటోలు, ఫారం నెంబర్ 6 దుర్వినియోగం, సాయంత్రం పోలింగ్ ముగిసే టైమ్కు ఉన్న పోలింగ్ శాతానికి, ఆ తర్వాత రాత్రివరకు నమోదైన పోలింగ్ శాతాలపై అనుమానాలు ఉండడం, సీసీటీవీ ఫుటేజి ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్దం కాకపోవడం వంటి కారణాలను ఆయన వివరించారు. ఇక్కడ ఒక మాట అంగీకరించాలి. ఇలాంటి అవకతవకలలో కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి.డూప్లికేట్ ఓట్లు సర్వసాధారణం అన్న భావన ఏర్పడింది. ఏపీలో నమోదైన ఓటర్లు పలువురు తెలంగాణలో నివసిస్తుంటారు. ఎన్నికల రోజున పెద్ద ఎత్తున వాహనాలలో ఏపీకి తరలి వెళుతుంటారు. వారిలో అనేక మందికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. వీటిని ఏరివేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి పూర్తిగా జరిగినట్లు అనిపించదు.బీజేపీ కోసం ఎన్నికల సంఘం అక్రమాలకు అవకాశం ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈసీ నేరుగా అవకతవకలకు పాల్పడకపోవచ్చు కాని జరుగుతున్న వాటిని అరికట్టకపోవడం వల్ల అభియోగాలకు గురవుతోందని చెప్పాలి. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉపయోగపడుతోందని చెప్పాలి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని ఆశిస్తున్నప్పటికీ, ఆచరణలో అలా జరగడం లేదన్నది వాస్తవమే.ఉదాహరణకు ఏపీలో ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని అంటూ ఒక జాబితా ఇచ్చారు. ఈసి అంగీకరించడమే కాకుండా, బీజేపీ వారు సూచించిన అధికారులనే నియమించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ క్రమంలో నిష్పక్షపాతంగా ఉండే పోలీసు అధికారులను తప్పించారన్న సందేహాలు వచ్చాయి. దానికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడమే అని అంతా భావించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఈసీ ద్వారా తమకు కావల్సిన పనులు చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏకంగా 1,00,250 దొంగ ఓట్లు ఉన్నట్లు రాహుల్ సాధికారికంగా వెల్లడించారు. అవి ఏఏ రకాలుగా ఉన్నాయో కూడా తెలియచేశారు. వాటిలో నలభై వేల మంది ఓటర్లవి నకిలీ అడ్రస్లు అని ఆయన తేల్చారు. ఓటర్ల నమోదు అంశంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అచ్చంగా నకిలీ ఓట్లను చేర్పిస్తున్నాయి. వాటిని ఏరివేసే టైమ్ కూడా అధికారులకు ఉండడం లేదు.గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనే టీడీపీ ఇలా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను చేర్చిందంటూ ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ చేసి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల సంఘం అరికట్టలేకపోతోంది. ఇక ఎన్నికల రోజున సాయంత్రం వరకు జరిగే పోలింగ్ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పోలింగ్ మరో ఎత్తుగా ఉంటోంది. కొన్ని ఎంపిక చేసుకున్న బూత్ లలో సిబ్బందిని, పోలీసులను ఆకట్టుకుని ఈవీఎంల ద్వారా భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారన్నది మరో అభియోగం. నిజంగానే ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉంటే ఎవరూ కాదనరు. అలా కాకుండా క్యూ లైన్లలో పెద్దగా లేకపోయినా, ఓటింగ్ శాతం పెరిగిందని చెబితేనే సమస్య వస్తుంది.అందువల్లే పోలింగ్ నాటి ఓట్ల శాతం, కౌంటింగ్ నాటి ఓట్ల శాతానికి పెద్ద తేడా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు ఇలాంటి వాటిపై అధ్యయనం చేసి, నివేదికలను సమర్పిస్తున్నాయి. ఏపీలో 12.5 శాతం ఓట్లు అంటే సుమారు 49 లక్షల ఓట్లు తేడా వచ్చాయని అవి తేల్చాయి. రాహుల్ గాంధీ కోరినట్లు సాయంత్రం ఆరుగంటల తర్వాత జరిగినట్లు చెబుతున్న పోలింగ్ కు సంబంధించి క్యూలైన్ల సీసీటీవీ ఫుటేజీని అడిగిన వారికి ఈసీ అందించి ఉంటే అనుమానం కలిగేది కాదు. అలా ఇవ్వకపోగా, దానిని ధ్వంసం చేసేసినట్లు చెబుతున్నారు.ఏపీ అనుభవాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించుకుని ఉంటే ఆయన ప్రజెంటేషన్కు మరింత విశ్వసనీయత వచ్చేది. కొన్ని చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్లో వచ్చిన ఓట్లకు తేడా ఉన్నట్లు కొందరు అభ్యర్థులు గమనించారు. అలాగే వీవీప్యాట్ స్లిప్లను, ఈవీఎంలలో నమోదైన అంకెలతో పోల్చి చూపాలని ఇంకొందరు కోరారు. వీవీప్యాట్ స్లిప్లను నిర్ణీత రోజులు స్టోర్ చేయకుండా పది రోజుల్లోనే దగ్దం చేయించడం కూడా సంశయాలకు దారితీసింది. ఒంగోలు నుంచి వైసీపీ పక్షాన పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై దరఖాస్తు పెట్టుకున్నా, ఎన్నికల అధికారులు అంగీకరించకుండా డ్రామా నడిపారు. ఆయన కోర్టుకు వెళ్లినా పలితం దక్కలేదు.బాలినేని తదుపరి జనసేన పార్టీలో చేరి ఆ విషయాన్ని వదలివేశారు. కాగా బాలినేని పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా ఉందని ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వంటివారు ఈవీఎంలను ఎలా మానిప్యులేట్ చేయవచ్చో తమ వద్ద ఉన్న టెక్నికల్ వ్యక్తుల ద్వారా చూపించారు.ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆ సందర్భంలో వీవీప్యాట్ స్లిప్లను అభ్యర్ధులు కోరితే ఐదు శాతం బూత్లలో లెక్కించాలని ఆదేశించినా, అధికారులు అనుసరించడం లేదని మస్తాన్ చెప్పారు. దీనితో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని అమెరికా మంత్రి తులసి గబర్డ్ , టెస్లా అధినేత ఈలాన్ మస్క్లతోపాటు భారత్కు చెందిన పలువురు చెబుతున్నారు. పోలీసులు ఆయా కేసులలో నిందితుల నుంచి సెల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ వంటివాటిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వాటిని రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటికన్నా, కౌంటింగ్ నాటికి పెరగడంపై విజయనగరం నుంచి లోక్సభకు పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్ కోర్టుకు వెళ్లినా ఇంకా నిర్ణయం రాలేదు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.పీవీఎస్ శర్మ అనే ప్రముఖుడు ఏపీలో 48 లక్షల ఓట్లు పెరిగిన తీరు చూస్తే ఎన్నికలలో మానిప్యులేషన్ వల్లే జగన్ ప్రభుత్వం ఓడిపోయిందని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రేషన్ షాపులో ఐదు కిలోల బియ్యం ఇవ్వడానికి రేషన్ కార్డుతోపాటు వేలిముద్రను కూడా తీసుకుంటారని, అలాంటిది ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికలలో మాత్రం దొంగ ఓట్లు పడకుండా అలాంటి వ్యవస్థలను తీసుకు రాలేరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్యాంకులలో లావాదేవీలను చాలావరకు పకడ్బందిగా అమలు చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఎందుకు మార్పులు తీసుకురాలేకపోతున్నారన్న ప్రశ్నకు జవాబు దొరకదు.రాహుల్ గాంధీ ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు. దీనిపై ఎన్నికల సంఘం ఆయన ప్రమాణం చేయాలని, అఫిడవిట్ వేయాలని చెబుతోంది. రాహుల్ గాంధీ నిజంగానే బాద్యత లేకుండా ఆరోపణలు చేసి ఉంటే, ఈసీ కూడా అదే తరహాలో బాద్యతారాహిత్యంగా బదులు ఇస్తోందనిపిస్తుంది. ఈసీ ఒక రాజకీయ పార్టీ కాదు అన్న అంశాన్ని గుర్తుంచుకుని ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయవలసి ఉంటుంది. ఇప్పటికే మన ప్రభుత్వాల తీరుతెన్నుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం వంటి కీలక సంస్థ కూడా అభియోగాలకు గురయ్యే పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


