జల్సాల కోసం ప్రేమ జంట స్నాచింగ్
బంజారాహిల్స్ : జల్సాల కోసం స్నాచింగ్లకు పాల్పడుతున్న ప్రేమజంటను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పేట్లవారిపాలెంకు చెందిన నరేంద్ర అలియాస్ నాని(23) ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రేవతి (33)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సనత్నగర్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే సినిమాలు, షికార్లు, హోటళ్లు, పబ్లకు డబ్బులు సరిపోకపోవడంతో స్నాచింగ్ల బాటపట్టారు.
బంగారం ధర అమాంతం పెరగడంతో ఒక గొలుసు కొట్టేస్తే సుమారు రూ. 2 లక్షల దాకా వస్తుండటంతో ఇద్దరూ కలిసి పథకం వేశారు. మంగళవారం ఉదయం ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె ఫోన్లో నిమగ్నమైందని గుర్తించిన ఈ ఇద్దరూ బైక్పై వెంబడించారు. వెనుక కూర్చొన్న రేవతి.. యువతి మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు సీసీ ఫుటేజీలు పరిశీలించారు.
స్నాచింగ్ చేసిన గొలుసు తీసుకుని బైక్పై గుంటూరు వైపు ఉడాయించారు. వరుసగా సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులకు టోల్గేట్లు దాటుకుని వెళ్తున్న ఈ జంట కనిపించింది. ఉదయం 9.06 గంటలకు స్నాచింగ్ జరగ్గా రాత్రి 8 గంటలకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్కు తరలించి గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. వీరిద్దరిపై గతంలో ఎలాంటి స్నాచింగ్ కేసులు లేవని, కేవలం తమ రోజువారీ ఖర్చులు, అవసరాల కోసం ఈ స్నాచింగ్కు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


