Other Sports
-
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. డెన్మార్క్తో జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో 1–4తో ఓడిన భారత్... ఇండోనేసియా జట్టుతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లోనూ 1–4తో ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గిన డెన్మార్క్, ఇండోనేసియా జట్లు గ్రూప్ ‘డి’ నుంచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. ఇండోనేసియాతో జరిగిన పోటీలో మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్లో ధ్రువ్–తనీషా క్రాస్టో 10–21, 21–18, 21–19తో రెహాన్–గ్లోరియాలపై గెలిచి భారత్కు 1–0తో ఆధిక్యం అందించారు. అయితే రెండో మ్యాచ్లో పీవీ సింధు 12–21, 13–21తో పుత్రి కుసుమ వర్థిని చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో ప్రణయ్ 21–19, 14–21, 12–21తో క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు. నాలుగో మ్యాచ్లో శ్రుతి–ప్రియా ద్వయం 10–21, 9–21తో ల్యానీ ట్రియా–సితి ఫాదియా జంట చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్లో హరిహరన్–రూబన్ 20–22, 18–21తో షోహిబుల్ –డానియల్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
అసీఫా ప్రపంచ రికార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో మహిళల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రేసులో ఇథియోపియాకు చెందిన టిగ్స్ట్ అసీఫా విజేతగా అవతరించింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 28 ఏళ్ల అసీఫా 2 గంటల 15 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2 గంటల 16 నిమిషాల 16 సెకన్లతో పెరెస్ జెప్చిర్చిర్ (కెన్యా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అసీఫా బద్దలు కొట్టింది. గత ఏడాది లండన్ మారథాన్లోనే పెరెస్ జెప్చిర్చిర్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించి స్వర్ణ పతకాన్ని సాధించగా... అసీఫా రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఈ సంవత్సరం పెరెస్ జెప్చిర్చిర్ లండన్ మారథాన్కు దూరం కాగా... అసీఫా అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోవడంపాటు ప్రపంచ రికార్డును లిఖించింది. జాయ్స్లిన్ జెప్కోస్గి (కెన్యా; 2గం:18ని:44 సెకన్లు) రజతం, సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్; 2గం:19నిమిషాలు) కాంస్యం సాధించారు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన అసీఫా 2022, 2023 బెర్లిన్ మారథాన్ రేసుల్లోనూ విజేతగా నిలిచింది. లండన్ మారథాన్ పురుషుల విభాగంలో సెబాస్టియన్ సావీ (కెన్యా) విజేతగా నిలిచాడు. సెబాస్టియన్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 2 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా; 2గం:3ని:37 సెకన్లు) రజతం, అలెగ్జాండర్ ముతిసో (కెన్యా; 2గం:4ని:20 సెకన్లు) కాంస్యం సాధించారు. -
మనుశ్–దియా జోడీ సంచలనం
ట్యూనిస్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నీలో భారత్కు చెందిన మనుశ్ షా–దియా చిటాలె జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మనుశ్–దియా ద్వయం 11–9, 5–11, 14–12, 3–11, 11–6తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ సొరా మత్సుషిమా–మివా హరిమోటో (జపాన్) జోడీని బోల్తా కొట్టించింది. 37 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో కీలకదశలో భారత జోడీ పైచేయి సాధించింది. సొంత సర్వీస్లో 22 పాయింట్లు నెగ్గిన దియా–మనుశ్... ప్రత్యర్థి సర్వీస్లోనూ 22 పాయింట్లు సాధించారు. విజేతగా నిలిచిన మనుశ్–దియాలకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షల 13 వేలు) ప్రైజ్మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్లో 11వ స్థానంలో ఉన్న మనుశ్–దియా ఈ టోర్నీలో మూడో సీడ్గా బరిలోకి దిగింది. తొలి రౌండ్లో దియా–మనుశ్ 11–6, 11–5, 11–5తో సన్ యాంగ్–హు యి (చైనా)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 2–11, 16–18, 11–2, 11–4తో సత్యన్ జ్ఞానశేఖరన్–ఆకుల శ్రీజ (భారత్)లపై, సెమీఫైనల్లో 11–4, 11–5, 11–6తో వసీమ్ ఇసిద్ (ట్యూనిషియా)–హనా గొడా (ఈజిప్ట్)లపై విజయం సాధించారు. -
14 స్వర్ణాల వేటలో...
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, అండర్–17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం బౌట్లలో సత్తా చాటిన 14 మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. అండర్–15 బాలికల విభాగంలో 12 మందిలో 9 మంది భారత బాక్సర్లు తుదిపోరుకు అర్హత సాధించారు. పోటీల ఎనిమిదో రోజు బాలికల విభాగంలో కోమల్ (33 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు) ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యంతో రిఫరీ స్టాప్డ్ ద కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా విజయం సాధించగా... ఖుషీ అహ్లావత్ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), తృష్ణ (67 కేజీలు) కూడా చక్కటి ప్రదర్శనతో గెలుపొందారు. మిల్కీ మైనమ్ (43 కేజీలు) హోరాహోరీ సెమీస్లో 3–2తో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో ఇద్దరు బాక్సర్లు ‘బై’ ద్వారా ముందంజ వేశారు. బాలుర అండర్–15 విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) రిఫరీ స్టాప్డ్ ద కాంటెస్ట్ ద్వారా కిర్గిస్తాన్ బాక్సర్ అర్సెన్ జొరోబెవ్పై విజయం సాధించాడు. ఇతర బౌట్లలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్ష్య (64 కేజీలు) కూడా గెలిచి ఫైనల్కు చేరారు. ఈ చాంపియన్షిప్లో మొత్తంగా భారత బాక్సర్లు 43 పతకాలు ఖాయం చేసుకున్నారు. -
వివాదం ఇంకా ఉంది!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐ–లీగ్ చాంపియన్షిప్లో చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్ను విజేతగా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్ చాంప్పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్ డివిజన్ డిప్యూటీ ప్రెసిడెంట్ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్ ఐ–లీగ్లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్ఎఫ్ ఏకపక్షంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్ డివిజన్ ఏఐఎఫ్ఎఫ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్ బ్రదర్స్ యాజమాన్యం, ఏఐఎఫ్ఎఫ్లకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్ఎఫ్ నవ్వులపాలైంది. వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. ఏమిటీ వివాదం! ఐ–లీగ్ ఫుట్బాల్ టోర్నీలో నాకౌట్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్ బ్రదర్స్ను ఏఐఎఫ్ఎఫ్ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితం వివాదం రేపింది. ఈ మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్గా అవతరిస్తుంది. -
భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున జ్యోతి సింగ్ (13వ నిమిషంలో), సునెలితా టొప్పో (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఇవీ స్టాన్స్బై (17వ నిమిషంలో), డేలీ డాల్కెన్స్ (48వ నిమిషంలో), జేమీ లీ సుర్హా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. తొలి క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను జ్యోతి సింగ్ గోల్గా మలచడంతో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత ఆసీస్ స్కోరును సమం చేసింది. ఒకదశలో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో ఆసీస్ రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్ రెండో గోల్ చేసినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. -
పరాజయంతో ప్రారంభం
జియామెన్ (చైనా): స్టార్ జోడీలు లేకుండానే ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయంతో భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే తదుపరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఈ మెగా ఈవెంట్కు దూరంగా ఉన్నాయి. దాంతో భారత జట్టు విజయావకాశాలన్నీ రెండు సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడ్డాయి. అయితే ఈ రెండింటిలోనూ భారత స్టార్స్ ఆకట్టుకోలేకపోయారు. వెరసి ఈ టోర్నీని భారత జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంట 13–21, 14–21తో జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మేగ్లండ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో భారత రెండో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 15–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ కుమార్ ద్వయం 7–21, 4–21తో ప్రపంచ నంబర్వన్ ఆండెర్స్ స్కారప్–కిమ్ అస్ట్రుప్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. నాలుగో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో భారత నంబర్వన్ పీవీ సింధు 20–22, 21–23తో లినె హోమార్క్ జార్స్ఫెల్డ్ చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ సింధు ఒకదశలో ఆధిక్యంలో ఉన్నా దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. చివరిదైన ఐదో మ్యాచ్గా జరిగిన మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా ద్వయం 13–21, 18–21తో నటాషా–అలెగ్జాండ్రా బోయె జంటను ఓడించి భారత్ క్లీన్స్వీప్ కాకుండా కాపాడింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. -
కోచింగ్లో కొత్త ‘కీర్తి’
క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప విజయాలు అందుకున్న స్టార్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే అదే శిక్షణకు వచ్చేసరికి మాత్రం పురుషులే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీడాంశం ఏదైనా కోచింగ్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ పురుష క్రీడాకారులకు మహిళలు కోచింగ్ ఇవ్వడం మరీ అరుదు. అయితే 32 ఏళ్ల కీర్తి తివారి ఇప్పుడు కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంకా ప్లేయర్ వయసులోనే ఉంటూ ఒక ప్లేయర్గానే కనిపించే ఆమె శిక్షణను చూస్తే ఎంత సాధికారికంగా కీర్తికి పట్టు ఉందో అర్థమవుతుంది. తనదైన శైలిలో ఆమె ఈతరం విజేతలను తయారు చేస్తోంది. ప్లేయర్నుంచి కోచింగ్ వైపు... కీర్తి స్వయంగా రన్నర్. 400 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్. కానీ అక్కడ పెట్టిన పరుగు ఫలితమివ్వకపోవడంతో కోచ్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. వ్యాయామ విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కీర్తి తదనంతరం పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా పూర్తి చేసింది. 2019లో లక్నోలో తన శిక్షణను మొదలుపెట్టిన ఆమె ఫెడరేషన్ కప్లో ఓ విజేతను తయారు చేసింది. ఈ సీనియర్ జాతీయ ఈవెంట్లో పి. డేవిడ్ పురుషుల లాంగ్జంప్లో విజేతగా నిలువడంతో ఇప్పుడు కీర్తి పేరు తెరపైకి వచ్చిం ది. ఆమె నా కోచ్... కీర్తి ఫిజిక్ను చూసిన వారికి ఆమె ఓ అథ్లెట్గానే కనిపిస్తుంది. పురుషుల లాంగ్జంప్ పోటీ జరుగుతుంటే మహిళా అథ్లెట్కు ఏం పని అని అక్కడున్నవారు అనుకుంటుండగా... బరిలో ఉన్న డేవిడ్ కల్పించుకొని ఆమె నా కోచ్ అని చెప్పాల్సి వచ్చిం ది. ఎందుకంటే చాలామంది కోచ్లు మలివయసువారే ఉంటారు. యువకులెవరూ కోచ్లుగా ఉండరు. కానీ మూడు పదుల వయస్సున్న కీర్తిని సహజంగానే క్రీడాకారిణిగా భావించారంతా! అయితే ఈ యువ కోచ్ తన శిష్యుణ్ని తీర్చిదిద్దిన తీరు, విజేతగా మలచిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. పురుష ప్రపంచంలో ఆమె ఒంటరి పయనం విదేశాల సంగతి పక్కనబెడితే భారత్లాంటి దేశాల్లో అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఏ ఆటలో ఆసక్తి వుంటే తీసుకెళ్లేది పురుష కోచ్ వద్దకే. దిగ్గజ షట్లర్లు సైనా, సింధు తదితరులంతా పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే ప్రపంచ బ్యాడ్మింటన్లో వెలిగారు. ఇలాంటి పురుష ప్రపంచంలో కీర్తి తన కోచింగ్ ప్రతిభతో పౌరుషాన్ని చాటింది. అకాడమీలో తాను ఒక ఒంటరనే ఫీలింగ్ ఉన్నా... తర్వాత అలవాటుపడింది. ఆటలో పడింది. కోచింగ్లోనే మమేకమైంది. దీంతో ఒంటరి పయనంలో ఆమె కనిపించేందుకు ఒక్కరే కావొచ్చు. కానీ కోచ్ పాత్ర తోడు–నీడ కావడంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. కష్టమైనా... కోచింగే ఇష్టం మహిళా కోచ్కు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా వుండవు. పురుషాధిక్య సమాజంలో ఈ సవాళ్లతోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో దూరమయ్యే పరిస్థితి పురుషులకు సులువు... కానీ అమ్మాయిల పరిస్థితి చాలా భిన్నం. అందుకేనేమో చాలామంది మహిళలు కోచింగ్ వైపు వచ్చినప్పటికీ నిలదొక్కుకునే ముందే అస్త్రసన్యాసం చేస్తారు. తిరుగుటపా కట్టేస్తారు. కానీ కీర్తి మాత్రం ఎన్ని కష్టాలెదురైనా... తనకెంతో ఇష్టమైన కోచింగ్ను వదిలిపెట్టలేదు. కొన్నాళ్లుగా డేవిడ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దుతున్న ఆమె చివరకు ఫెడరెషన్ కప్లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇంత చేసినా కూడా కొందరు ఈ మాత్రం ప్రదర్శనతో ఒలింపిక్స్కు తీసుకెళ్తావా అని గేలి చేసినవారూ ఉన్నారు. దానికి ఆమె సమాధానం... అవును ఒలింపియన్ను తయారు చేయడమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది. -
కోబీ బ్రయాంట్ జెర్సీకి రూ. 59 కోట్లు
న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్ ఎన్బీఏ అరంగేట్ర మ్యాచ్లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తొలి పోరులో బ్రయాంట్ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.ఎన్బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్బీఏలో భాగంగా బ్రయాంట్ 1996–97 సీజన్లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన కోబీ 8వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్ సంస్థ వెల్లడించింది. ఓవరాల్గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్ రూత్ జెర్సీ (24 మిలియన్ డాలర్లు), మైకేల్ జోర్డాన్ ఎన్బీఏ జెర్సీ (10.1 మిలియన్ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
పాకిస్తాన్కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
కరాచీ: సుప్రసిద్ధ హాకీ టోర్నమెంట్ ‘అజ్లాన్ షా కప్’లో పాకిస్తాన్ జట్టు ఈసారి పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీ నిర్వాహకులకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) బకాయి పడటంతో.. మలేసియా హాకీ సమాఖ్య (ఎమ్హెచ్ఎఫ్) ఆహ్వానాన్ని నిలిపివేసింది. రెండేళ్ల క్రితం 2023లో జరిగిన టోర్నీకి సంబంధించిన రూ. 8, 83, 582 (10,349 అమెరికా డాలర్లు) బకాయిల్ని జోహర్ హాకీ సంఘం (జేహెచ్ఏ)కు ఇంకా చెల్లించలేదు.అందుకే ఈసారి పాకిస్తాన్కు ఆహ్వానాన్ని పంపడంలేదని నిర్వాహకులు తెలిపారు. జేహెచ్ఏ నిబంధనల ప్రకారం ఆ టోర్నీలో పాల్గొనే జట్ల సభ్యులకు మాత్రం ఆతిథ్య ఏర్పాట్లు చేస్తారు. అంతేగాని వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, హాకీ సమాఖ్య ఉన్నతాధికారులు వస్తే బస, స్థానిక రవాణా, ఇతరాత్ర ఖర్చుల్ని వారే భరించాల్సివుంటుంది. 2023 అక్టోబర్లో జరిగిన టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కుటుంబసభ్యులు, హాకీ అధికారులకు అయిన ఖర్చుల్ని చెల్లించలేదు.ఇందుకు సంబంధించి ఇదివరకే మలేసియా హాకీ, జేహెచ్ఏ వర్గాలు పాకిస్తాన్ సమాఖ్యకు లేఖ రాసినప్పటికీ చెల్లింపులు మాత్రం చేయలేదు. కుటుంబసభ్యులు, సమాఖ్య అధికారులు ఆటగాళ్లకు బస కల్పించిన లగ్జరీ హోటల్స్లోనే గడిపారు. దీనిపై జోహర్ సంఘం మలేసియా సమాఖ్యకు తెలపడంతో బకాయిలు రాబట్టేందుకు పీహెచ్ఎఫ్తో సంప్రదింపులు జరుపుతోంది.ఇదీ చదవండి: మూడు విభాగాల్లోనూ శ్రీజ పరాజయంట్యూనిస్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్లోనే ఓటమి పాలైన శ్రీజ... మిక్స్డ్ డబుల్స్లో భారత్కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్తో కలిసి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ శ్రీజ 6–11, 9–11, 8–11తో ప్రపంచ 76వ ర్యాంకర్ క్రిస్టినా కాల్బెర్గ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయింది.23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీజ తన సర్వీస్లో 12 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 11 పాయింట్లు సాధించింది. భారత నంబర్వన్, ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక బత్రా కూడా అనూహ్యంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. భారత్కే చెందిన దియా చిటాలె 12–10, 5–11, 9–11, 11–4, 11–4తో మనిక బత్రాను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన దియా 38 నిమిషాల్లో మనికను ఓడించింది.తన సర్వీస్ 29 పాయింట్లు సాధించిన దియా ప్రత్యర్థి సర్వీస్లో 19 పాయింట్లు సొంతం చేసుకుంది. భారత్కే చెందిన మరో ప్లేయర్ యశస్విని ఘోర్పడే తొలి రౌండ్లో 7–11, 6–11, 9–11తో అనె యుసెవా (జపాన్) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సుతీర్థ ముఖర్జీ (భారత్) ద్వయం 11–7, 8–11, 8–11, 10–12తో జు కిహు–యాంగ్ హుజి (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది.మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–6, 11–9, 11–9తో దిమిత్రి లెవాజెక్– ఇజబెలా (సెర్బియా) జోడీపై గెలిచింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–సత్యన్ 6–11, 11–2, 18–16, 2–11, 4–11తో భారత్కే చెందిన మనుష్ షా–దియా చిటాలె చేతిలో ఓడిపోయారు. హర్మీత్ ముందంజ పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ హర్మీత్ దేశాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మానవ్ ఠక్కర్, సత్యన్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హర్మీత్ 11–6, 11–8, 11–7తో వు యిఫె (చైనా)పై గెలుపొందాడు. మానవ్ 11–8, 6–11, 7–11, 8–11తో మటియాస్ ఫాల్క్ (స్వీడన్) చేతిలో, సత్యన్ 6–11, 5–11, 11–6, 11–9, 9–11తో నవీద్ షమ్స్ (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత అత్యుత్తమ అథ్లెట్గా గుర్తింపు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కూడా దేశంలోని దురభిమానుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాను నిర్వహించబోయే ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టోర్నీ కి పాకిస్తాన్ ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అర్షద్ నదీమ్ను అతను ఆహ్వానించడమే అందుకు కారణం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తానీయులపై భారత అభిమానులు సహజంగానే ఆగ్రహంతో ఉన్నారు. దానిని ఇప్పుడు నీరజ్పై చూపిస్తున్నారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే నదీమ్ను నీరజ్ ఆహ్వానించాడు. టోర్నీ జరిగే సమయంలో తాను గతంలోనే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం విదేశాల్లో ఉంటున్నానని, అందుకు హాజరు కాలేనని కూడా నదీమ్ స్పష్టం చేసేశాడు. ‘సహచర భారతీయుల్లాగే నేను కూడా కశీ్మర్ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను. దానిపై చాలా ఆగ్రహంగా కూడా ఉన్నాను. అయితే నాపై కొందరు చూపిస్తున్న విద్వేషం ఊహించలేనిది. వారి మాటల్లో ఎన్నో తిట్లు కనిపిస్తున్నాయి. నేను సాధారణంగా ఇలాంటివి పట్టించుకోను. కానీ దానిని బలహీనతగా భావించవద్దు. పైగా దేశం పట్ల నా అంకితభావాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను. అర్షద్కు ఆహ్వానం పంపడం ఒక క్రీడాకారుడి కోణంలోనే చూడాలి. నా ఈవెంట్కు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేశాను. అయతే పహల్గాం ఘటనకు ముందే అందరినీ ఆహ్వానించాం’ అని నీరజ్ గుర్తు చేశాడు. మా కుటుంబాన్ని వదిలేయండి! కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తర్వాత కొందరు వ్యక్తులు తన తల్లిని కూడా వదలడం లేదని, ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయిస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పారిస్ ఒలింపిక్స్లో అర్షద్ స్వర్ణం, నీరజ్ రజతం గెలిచిన సమయంలో ‘అర్షద్ కూడా నా కొడుకులాంటివాడే’ అని నీరజ్ తల్లి సరోజ్ చెప్పింది. ‘జనాలు తమ అభిప్రాయాలు వేగంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు కనిపిస్తోంది. ఏడాది క్రితం మా అమ్మ ఏదో నిరాడంబరత్వం, భోళాతనంతో ఒక మాట అంది. అప్పుడు ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడేమో ఆ మాటను పట్టుకొని అమ్మను తిట్టడం బాధగా ఉంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకోవడం, నేను వివరణలు ఇచ్చుకోవడం చాలా బాధగా ఉంది. నా గురించి తప్పుడు మాటలు ప్రచారం చేయకండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి’ అని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సుబేదార్ మేజర్ హోదాలో ఉన్న నీరజ్ చోప్రా విజ్ఞప్తి చేశాడు. -
కూర్పుపై కసరత్తు
పెర్త్: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ్రస్టేలియా పర్యటనలో కూర్పుపై కసరత్తులు చేయనున్నట్లు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ టూర్లో భాగంగా భారత అమ్మాయిల జట్టు ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... ప్రధాన జట్టుతో 3 మ్యాచ్లు ఆడనుంది. పెర్త్ వేదికగా శనివారం ఆ్రస్టేలియా ‘ఎ’తో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతోంది. మే 1, 3, 4న వరసగా ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్లు జరగగా... అందులో ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలవగా... భారత్ మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో హరేంద్ర మాట్లాడుతూ... ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిబిరం ప్లేయర్లకు ఉపయోగపడనుందని అన్నాడు. ‘ఈ పర్యటన మా ఆటతీరును పరీక్షించుకునేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఏ రంగాల్లో మెరుగు పడాలో అర్థం చేసుకునేందుకు ఆ్రస్టేలియా కంటే మెరుగైన ప్రత్యర్థి ఉండరు. కూర్పును పరీక్షించడంతో బెంచ్ బలాన్ని మరింత పెంపొందించుకుంటాం. ఆ్రస్టేలియాలాంటి జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్. ఇది మున్ముందు టోర్నీలకు తోడ్పడుతుంది’ అని హరేంద్ర అన్నాడు. ఇటీవల ప్రొ లీగ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్పై విజయం సాధించి మన అమ్మాయిల జట్టు మంచి టచ్లో ఉంది. ఈ పర్యటన కోసం సలీమా సారథ్యంలో 26 మందితో జట్టును ప్రకటించారు. అందులో సీనియర్ గోల్ కీపర్ సవిత, నవ్నీత్ కౌర్, డ్రాగ్ఫ్లికర్ దీపిక ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఐదుగురు కొత్త అమ్మాయిలు జ్యోతి సింగ్, సుజాత, అజ్మీన, పూజ యాదవ్, మహిమ టెటెకు అవకాశమిచ్చారు. ‘బలమైన ప్రత్యర్థితో పోరుకు సిద్ధంగా ఉన్నాం. మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. జట్టు కూర్పు పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొ లీగ్లో యూరప్ అంచె పోటీలు, మహిళల ఆసియా కప్నకు ముందు ప్లేయర్లకు ఇది మంచి అనుభవం అవుతుంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది. -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, నిత్య, నందిని, రజిత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. భారత అథ్లెటిక్స్ జట్టుపురుషుల విభాగం: అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), గుల్వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్వీర్ చౌధరీ, మోహిత్ కుమార్. మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు. -
పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ను తన పేరిట జరిగే ఈవెంట్కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్కు చెందిన అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ అయిన అర్షద్కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్ -
‘మళ్లీ నా సమయం వచ్చింది’
పుణే: క్లాసికల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్లు ఆడినందుకు హంపికి టైటిల్ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ స్పందిస్తూ... ‘క్లాసికల్లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది. గతేడాది మొత్తం ఈ ఫార్మాట్లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్ టైటిల్ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి. నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్మాస్టర్ అభిజీత్ కుంటే అభిప్రాయపడ్డాడు. కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ గెలిచిన హంపి క్యాండిడేట్స్ ప్రపంచ టైటిల్ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్ అవసరం’ అని అన్నాడు. -
క్రీడాభివృద్ధికి ‘కార్పొరేట్’ సహకారం అవసరం
న్యూఢిల్లీ: భారత్లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారాన్ని కోరతామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో క్రీడల సంస్కృతి పెరిగేందుకు, అథ్లెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మనదేశంలో ప్రతీ క్రీడాంశానికి ప్రత్యేక ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయన్నారు. ఎక్సలెన్సీలతో ఎంతో మేలు ‘ప్రతి క్రీడ కోసం ప్రత్యేకంగా అధునాతన సదుపాయాలతో ఒలింపిక్ సెంటర్ లేదంటే ఎక్సలెన్సీ కేంద్రం నిర్మించాలనేదే నా లక్ష్యం. వచ్చే పదేళ్లలో ఇలాంటి కేంద్రాల ద్వారా ప్రతిభావంతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడు క్రీడా ప్రగతే మారుతుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరతాం. వారి నిధులతో ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఎక్సలెన్సీలను నిర్మించే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం దేశంలో ఉన్న 23 జాతీయ ఎక్సలెన్సీ కేంద్రాలన్నీ ప్రభుత్వానివే! భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలోనే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. మనకన్నా చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తున్నాయి. జపాన్, ఆ్రస్టేలియా, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్ను అధ్యయనం చేశాం. మన ఎక్సలెన్సీలకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తోడవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. వర్గపోరును సహించం జాతీయ క్రీడా సమాఖ్యల పంథా మారాల్సిందే. ఏ సమాఖ్య అయినా సరే తమ ఆట, అథ్లెట్లకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టాలి. క్రీడేతర అంశాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సమాఖ్యలో వర్గపోరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. దీని వల్ల ఆ క్రీడకు, అథ్లెట్కు వాటిల్లే నష్టమెంటో మాకు తెలుసు. కాబట్టి సమాఖ్యలన్నీ కూడా ఆయ క్రీడాకారుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, వెన్నంటే తోడ్పాటు తదితర అంశాలను గుర్తుంచుకొని వ్యవహరించాలి. వర్గపోరుతో అథ్లెట్ల ప్రయోజనాల్ని దెబ్బతీసే సమాఖ్యల తీరును ఎంతమాత్రం ఉపేక్షించం. ఐక్య కార్యచరణ సమితి అవసరం భారత్ ఇదివరకు 2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేసింది. దీనికి ముందే 2036 ఒలింపిక్స్ కోసం ప్రాథమిక దశలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేసింది. ఇలా మన సత్తా, సాధన సంపత్తిని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ముందు గట్టిగా విశదీకరించేందుకు, లేదంటే ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఒక ఐక్య కార్యచరణ సమితి అవసరం ఎంతో ఉంది. మన రెజ్లింగ్ సమాఖ్యకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య సమస్యలెదురయ్యాయి. ఐక్య సమితి ఉంటే మన వాదన వినిపించొచ్చు. ప్రత్యేక డిజీలాకర్ ఆటగాళ్లు వారి ప్రదర్శనలు, వాళ్లకు అవసరమైన పత్రాలు, దరఖాస్తులు ఇకపై డిజిటలైజ్ చేస్తాం. అంటే ప్రతిదానికి వేర్వేరు పత్రాలు, దరఖాస్తులు అవసరముండవు. ఆటగాళ్ల ఘనతల్ని ప్రత్యేక డిజీలాకర్లో భద్రబరిచే కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య విధిగా డిజీలాకర్ను ఏర్పాటు చేసుకోవాల్సిందే. అయితే ఒలింపిక్ పతక విజేతలకు దరఖాస్తులు, పత్రాలు వ్యక్తిగతంగా డిజీలాకర్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం యావత్తు చూసిన పతక విజేతల ఘనత ప్రత్యేకంగా లిఖించాలా? కొండంత భరోసాగా ఉద్యోగాలు క్రీడలను కెరీర్గా ఎంచుకొని కఠోరంగా శ్రమించి పతకాలు తెచ్చే క్రీడాకారులకు ఉద్యోగ భరోసా కూడా లభిస్తోంది. 25 వేల పైచిలుకు క్రీడకారులు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఈ స్థిరమైన ఆర్థిక భరోసా వల్ల ఆటగాళ్లు మరింత క్రీడల్లో రాణించేందుకు, రాటుదేలేందుకు, నాణ్యమైన శిక్షణ పొందెందుకు దోహదపడుతుంది. -
కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్ప్రి టైటిల్ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.నల్ల పావులతో ఎక్కువ గేమ్లు ఆడికాగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పుణె వేదికగా బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి, చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్తో కలిసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.అయితే, ఈ టోర్నమెంట్లో నల్ల పావులతో ఎక్కువ గేమ్లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారైంది. మరోవైపు.. నల్ల పావులతో తక్కువ గేమ్లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్తో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. పది మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. Congratulations @Humpy_Koneru On winning the FIDE Women’s Grand Prix title! Another glorious feather in your cap. Your brilliance continues to make India proud. A true inspiration to countless young minds, especially aspiring women in sports. #Chess #GrandPrix— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2025 -
సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ100 చార్లోట్స్విల్లె ఓపెన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చార్లోట్స్విల్లె నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 320వ స్థానంలో ఉన్న సహజ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో 6–0, 6–1తో మరియా కరోలినా ఫెరీరా టర్చెటో (బ్రెజిల్)పై విజయం సాధించింది. అయితే క్వాలి ఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో సహజ 4–6, 1–6తో ప్రపంచ 556వ ర్యాంకర్ మరియా కొజి రెవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ 4 డబుల్ ఫాల్ట్ లు చేసింది. తన సర్వీస్ను ఏడుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. సహజ ఫస్ట్ సర్వ్లో 17 పాయింట్లు, సెకండ్ సర్వ్లో 11 పాయింట్లు సాధించింది. పుణేలో ఈనెల తొలి వారంలో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించాక సహజ ఆడిన తొలి టోర్నీలో ఇదే కావడం గమనార్హం. -
నీరజ్ ఆహ్వానానికి నదీమ్ నో
లాహోర్: వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’లో తాను పాల్గొనడం లేదని... పాకిస్తాన్కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ స్పష్టం చేశాడు. వచ్చే నెల 24న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మీట్ జరగనుండగా... అందులో పాల్గొనాల్సిందిగా నదీమ్కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆహ్వానించాడు. అయితే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు సిద్ధమవుతుండటంతో నీరజ్ ఆహ్వానాన్ని తిరిస్కరించినట్లు నదీమ్ బుధవారం వెల్లడించాడు. నీరజ్ నుంచి ఆహ్వా నం రావడం చాలా గొప్పగా ఉందని అయితే అనుకోకుండా తాను పాల్గొనలేకపోతున్నానని అన్నాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ మే 24న జరగనుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం సాధించాలనే లక్ష్యంతో మెరుగైన సాధన కోసం నేను మే 22న కొరియా వెళ్తున్నా’ అని నదీమ్ వివరించాడు. మే 27 నుంచి 31 వరకు కొరియాలోని గుమీలో ఆసియా చాంపియన్షిప్ జరగనుంది. అంతకుముందు ఈ అంశంపై స్పందించిన నీరజ్ చోప్రా... ఈ టోర్నీలో పాల్గొనేందుకు నదీమ్కు ఆహ్వానం పంపినట్లు తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం చేజిక్కించుకోగా... నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. భారత్ వేదికగా నిర్వహిస్తున్న తొలి జావెలిన్ మెగా ఈవెంట్లో అంతర్జాతీయ స్టార్లు అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), థామస్ రోలెర్ (జర్మనీ), జూలియస్ యెగో (కెన్యా), కర్టీస్ థాంప్సన్ (అమెరికా) పాల్గొంటున్నారు. ఈ టోర్నీకి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ పంచ్కులాలో జరగాల్సినా... నిర్ణీత ప్రమాణాలతో కూడిన ఫ్లడ్లైట్లు లేకపోవడంతో వేదికను బెంగళూరుకు మార్చారు. -
విజేత హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి, చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ టోర్నీలో నల్ల పావులతో ఎక్కువ గేమ్లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారుకాగా... నల్ల పావులతో తక్కువ గేమ్లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్గా నిలిచింది. భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 10 మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. ఎనిమిది రౌండ్లు ముగిశాక 6 పాయింట్లతో హంపి, జినెర్ సమఉజ్జీగా ఉన్నారు. చివరి రౌండ్ గేముల్లో హంపి 84 ఎత్తుల్లో సలీమోవా (బల్గేరియా)పై, జినెర్ 76 ఎత్తుల్లో పొలీనా (రష్యా)పై గెలిచారు. దివ్య (భారత్)–అలీనా పోలాండ్) గేమ్ 42 ఎత్తుల్లో... హారిక శ్రీ(భారత్)–మున్గున్తుల్ (మంగోలియా) గేమ్ 40 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–సలోమి (జార్జియా) గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 2024–2025 గ్రాండ్ ప్రి సిరీస్లో మొత్తం ఆరు టోర్నీలు ఉండగా... ఇప్పటికి ఐదు ముగిశాయి. ఒక్కో ప్లేయర్ గరిష్టంగా మూడింటిలో పాల్గొనాలి. హంపికి సంబంధించి మూడు టోర్నీలు ముగిశాయి. ఓవరాల్ పట్టికలో హంపి 279.17 పాయింట్లతో రెండో స్థానంలో... గొర్యాక్చినా (రష్యా) 308.34 పాయింట్లతో అగ్రస్థానంలో ... జినెర్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జినెర్కు మరో టోర్నీ మిగిలి ఉంది. టాప్–2లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. -
టైటిల్కు చేరువలో హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి టైటిల్కు చేరువైంది. అలీనా కష్లిన్స్కాయ (పోలాండ్)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను హంపి 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 50 ఎత్తుల్లో భారత్కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ను ఓడించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి, జు జినెర్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరులో జు జినెర్పై హంపి పైచేయిగా ఉంది. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో హంపి; పొలీనా షువలోవా (రష్యా)తో జు జినెర్ తలపడతారు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబు తమ ఎనిమిదో రౌండ్ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. మెలియా సలోమి (జార్జియా)తో గేమ్ను హారిక 116 ఎత్తుల్లో... సలీమోవాతో గేమ్ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా), పొలీనా షువలోవా మధ్య జరిగిన మరో గేమ్ 91 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ఎనిమిదో రౌండ్ తర్వాత దివ్య దేశ్ముఖ్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో, నాలుగు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో, 3.5 పాయింట్లతో వైశాలి ఆరో స్థానంలో ఉన్నారు. -
నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కొచ్చిలో జరుగుతున్న ఈ మీట్లో మంగళవారం మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో నందిని మొత్తం 5813 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పూజ (హరియాణా; 5401 పాయింట్లు) రజతం, మౌమిత మండల్ (రిలయన్స్; 5373 పాయింట్లు) కాంస్యం సాధించారు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని దక్కించుకుంది. రిలయెన్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.23 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలిచే క్రమంలో జ్యోతి ఆసియా చాంపియన్షిప్ అర్హత ప్రమాణ సమయాన్ని (13.26 సెకన్లు) కూడా అధిగమించింది. -
స్లేటర్కు నాలుగేళ్ల జైలు
సిడ్నీ: గృహ హింస తదితర కేసుల్లో ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జడ్జి తీర్పునిచ్చారు. గతంలో ఈ కేసులో స్లేటర్ ఏడాది పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడు. తాజా తీర్పు ప్రకారం అతని మిగిలిన మూడేళ్ల శిక్షను కూడా రద్దు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఒక మహిళను వెంటపడి వేధించడంతో పాటు స్లేటర్ అసభ్యకర సందేశాలు కూడా పంపించాడు. పోలీసు విచారణలో ఇవన్నీ వాస్తవమని తేలడంతో అతడిని జైలుకు పంపించారు. అయితే స్లేటర్ సుదీర్ఘ కాలం పాటు మద్యానికి బానిసై మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఇదే కారణంగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డాడని అతని లాయర్లు వాదించారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి కూడా అతనిపై వేర్వేరు కేసులు ఉన్నాయి. జైలులో ఉన్న 375 రోజుల పాటు అతను సత్ప్రవర్తనతో మెలిగాడని వారు వివరించారు. దాంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి 55 ఏళ్ల స్లేటర్ శిక్షను కుదించారు. అయితే స్లేటర్ వచ్చే ఐదేళ్లపాటు ‘సస్పెండెడ్ పీరియడ్’లో ఉంటాడు. ఈ సమయంలో మళ్లీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర శిక్షకు గురవుతాడు. స్లేటర్ 1993–2001 మధ్య కాలంలో ఆ్రస్టేలియాకు 74 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 42.83 సగటుతో 5312 పరుగులు సాధించాడు. 14 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో అతను ఆసీస్ అప్రతిహత విజయాల్లో ఓపెనర్గా కీలకపాత్ర పోషించాడు. 42 వన్డేలు కూడా ఆడిన స్లేటర్ ప్రస్తుతం కామెంటేటర్గా స్థిరపడ్డాడు. -
ఎదురులేని హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) బత్కుయాగ్ మున్గున్తుల్తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్కే చెందిన మరో స్టార్ గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన మరో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత జు జినెర్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దివ్య దేశ్ముఖ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్తో హంపి; మున్గున్తుల్తో దివ్య దేశ్ముఖ్; పొలీనాతో హారిక తలపడతారు. -
జయహో జ్వెరెవ్
మ్యూనిక్ (జర్మనీ): స్వదేశంలో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అదరగొట్టాడు. తన 28వ పుట్టిన రోజున... తనకెంతో కలిసొచ్చిన బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో జ్వెరెవ్ మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జ్వెరెవ్ 6–2, 6–4తో అమెరికాకు చెందిన రెండో సీడ్ బెన్ షెల్టన్ను ఓడించాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకున్నాడు. 2017, 2018లలో కూడా ఈ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ ఓవరాల్గా తన కెరీర్లో 24వ టైటిల్ను సాధించాడు. చాంపియన్గా నిలిచిన జ్వెరెవ్కు 4,67,485 యూరోల (రూ. 4 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు రూ. 1 కోటీ 40 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎం70 మోడల్ ఎలక్ట్రిక్ కారు లభించింది. -
భారత షూటర్లకు రెండు రజతాలు
లిమా (పెరూ): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) రెండో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం భారత షూటర్లు రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య బోర్సె రజత పతకాలు సాధించారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబూటా 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 253.4 పాయింట్లతో చైనా షూటర్ షెంగ్ లిహావో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. పెనీ మార్టన్ (హంగేరి; 229.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్కు చేరిన మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 104.8 పాయింట్లతో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య ద్వయం 11–17తో జెనెట్ హెగ్–జాన్ హెర్మన్ హెగ్ (నార్వే) జంట చేతిలో ఓడిపోయింది. సోమవారంతో ముగియనున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
నాగపురి రమేశ్పై NADA సస్పెన్షన్ వేటు.. ఏ తప్పూ చేయలేదన్న కోచ్
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్, జాతీయ జూనియర్ జట్టు ప్రధాన కోచ్ అయిన నాగపురి రమేశ్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అతడి దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారు. డోప్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేశారు.ఏడుగురిపై కూడా వేటుఈ క్రమంలో.. నిబంధనల ప్రకారం వారికి కోచ్గా ఉన్న నాగపురి రమేశ్పై నాడా చర్యలు తీసుకుంది. గతంలో అతడు ద్రోణాచారి అవార్డు పొందాడు. అంతేకాదు.. అంతర్జాతీయ అథ్లెట్లు ద్యుతీ చంద్, పారా ఒలంపియన్, పతక విజేత జీవాంజి దీప్తి, అగసార నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘతన నాగపురి రమేశ్కు ఉంది.ఇదిలా ఉంటే.. రమేశ్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లు కరంవీర్ సింగ్, రాకేశ్లను కూడా నాడా సస్పెండ్ చేసింది. అదే విధంగా.. డోపింగ్ టెస్టుకు నిరాకరించిన ఏడుగురు అథ్లెట్లపై కూడా నాడా వేటు వేసింది. వీరిలో పారస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష, శుభం మహారా, కిరన్, జ్యోతి ఉన్నట్లు సమాచారం.నేను ఏ తప్పూ చేయలేదునాడా సస్పెన్షన్ వేటు నేపథ్యంలో నాగపురి రమేశ్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితం ధారబోశానని ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
ఫైనల్లో అనాహత్, వీర్
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–2, 11–7, 11–6తో హెలెన్ టాంగ్ (హాకాంగ్)పై విజయం సాధించింది. 21 నిమిషాల్లో ముగిసిన పోరులో అనాహత్... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఐదు మ్యాచ్లు జరగగా... అన్నీట్లోనూ అనాహత్ విజయం సాధించడం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్లో టోబీ ట్సె (హాంకాంగ్)తో అనాహత్ తలపడనుంది. భారత మరో ప్లేయర్, రెండో సీడ్ ఆకాంక్ష పరాజయం పాలైంది. ఆకాంక్ష 3–11, 10–12, 12–10, 8–11తో టోబీ ట్సె చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా ఫైనల్లో అడుగు పెట్టాడు. సెమీ ఫైనల్లో వీర్ చోత్రాని 11–7, 11–6, 7–11, 11–4తో ఎనిమిదో సీడ్ చి హిమ్ వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు. -
ఆటపై అభి‘రుచి’
సాక్షి క్రీడా విభాగం : పెరూ రాజధాని లిమా నగరంలో ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీ... భారత స్టార్ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బరిలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగిన మనూ స్వర్ణం గెలవడం ఖాయం అన్నట్లుగా అంచనాలు ఆమెపైనే ఉన్నాయి. కానీ చివరకు అనూహ్య ఫలితం వచ్చింది. భారత్కే చెందిన మరో యువ షూటర్, 18 ఏళ్ల సురుచి సింగ్ దూసుకొచ్చింది. మనూ భాకర్ను వెనక్కి నెట్టి ఆమె స్వర్ణపతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆమెపై పడింది. మనూ భాకర్పై గెలిచిన రెండో రోజు సురుచి పిస్టల్ మళ్లీ మెరిసింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కే చెందిన సౌరభ్ చౌధరీతో కలిసి సురుచి మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు వారమే అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచ కప్లో స్వర్ణం నెగ్గిన ఆమెకు ఓవరాల్గా ఇది మూడో స్వర్ణం. అయితే మొదటి స్వర్ణంతో పోలిస్తే మనూ భాకర్ను ఓడించి సాధించిన పసిడి పతకం విలువ పెద్దదిగా మారిపోయింది. బాక్సింగ్, రెజ్లింగ్ను కాదని... సురుచి స్వస్థలం హరియాణాలోని జఝర్. దేశంలోనే బాక్సింగ్కు అడ్డాగా ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సహా ఎంతో మంది బాక్సర్లు ఓనమాలు నేర్చుకొని అగ్రస్థాయికి చేరిన భివానికి సమీపంలో ఇది ఉంటుంది. జఝర్కు చెందిన ఇందర్ సింగ్ ఆర్మీలో హవల్దార్గా పని చేశాడు. ఒకప్పుడు గొప్ప రెజ్లర్గా గుర్తింపు తెచ్చుకున్న గూంగా (మూగ) పహిల్వాన్ (వీరేందర్ సింగ్) ఇతనికి సోదరుని వరుస (కజిన్) అవుతాడు. తన కజిన్ తరహాలోనే తన కూతురు సురుచిని కూడా రెజ్లర్ను చేయాలని ఇందర్ సింగ్ ఆశించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం మరోవైపు ఆసక్తిని చూపించింది. అటు బాక్సింగ్, ఇటు రెజ్లింగ్ కాకుండా షూటింగ్ను ఎంచుకుంది. అందులో టాప్ ప్లేయర్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కూతురి ఇష్టాన్ని గుర్తించిన ఇందర్ సింగ్ ఆమెను భివానిలోని గురు ద్రోణాచార్య షూటింగ్ అకాడమీలో చేర్పించాడు. ఆపై తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కూతురును షూటర్ను చేసేందుకు తన సమయం వెచ్చించాడు. 13 ఏళ్ల సురుచి కోచ్ సురేశ్ సింగ్ మార్గనిర్దేశనంలో షూటింగ్ను నేర్చుకొని అందులో పట్టు సంపాదించింది. ఇక మున్ముందు టోర్నీల్లో విజయాలే లక్ష్యంగా ఆమె సిద్ధమవుతూ వచ్చింది. అప్పుడే కోవిడ్ మహమ్మారి వచ్చేసింది. ప్రపంచంలో ఎంతో మంది ప్లేయర్లకు వచ్చిన కష్టమే సురుచికి కూడా వచ్చింది. సొంత ఊర్లో సాధన... కోవిడ్ సమయంలో భివానికి వెళ్లి ప్రాక్టీస్ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే సురుచి కొన్ని జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంటూ వచ్చింది. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇందర్ సింగ్కు తమ స్వగ్రామంలోనే కొత్తగా ఏర్పాటైన కార్గిల్ షూటింగ్ అకాడమీ కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అనిల్ జాఖడ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. దాంతో ఇక్కడే సురుచి సాధన మళ్లీ మొదలైంది. ఆమె తన ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ శిక్షణ కోవిడ్ తర్వాత మంచి ప్రభావం చూపించింది. 2022 జాతీయ చాంపియన్షిప్లో ఆమె తొలి సారి పతకం గెలుచుకొని తన విజయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023 జాతీయ చాంపియన్షిప్లో కూడా పతకాలు సాధించింది. అయితే 2024లో జరిగిన పోటీలు ఆమె స్థాయిని షూటింగ్ ప్రపంచానికి తెలియజేశాయి. ఈసారి ఏకంగా 7 పతకాలతో మెరిసిన సురుచికి భారత భవిష్యత్తు స్టార్గా గుర్తింపు వచ్చింది. స్టార్ షూటర్ శిక్షణలో... ప్రఖ్యాత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ భారత జట్టు కోచింగ్ బృందంలోకి వచ్చాక సురుచి ఆట మరింత పదునెక్కింది. షూట్ చేసే సమయంలో ఆమె నిలిచే తీరులో ఉన్న స్వల్ప లోపాన్ని సవరించడంతో పాటు కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకునే విషయంలో జీతూ రాయ్ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. సురుచి ఇటీవలి వరుస విజయాల్లో రాయ్ పాత్ర కూడా చాలా ఉంది. ముఖ్యంగా వరల్డ్ కప్కు ముందు కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో జీతూ రాయ్ మార్గనిర్దేశనంలో జరిగిన 15 రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం సురుచికి ఎంతో మేలు చేసింది. వరల్డ్ కప్లో 2 వ్యక్తిగత స్వర్ణాలతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో కలిసి మరో పసిడిని కూడా ఆమె సొంతం చేసుకొని తన స్వర్ణాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఓపికకు చిరునామావంటి షూటింగ్ క్రీడలో కెరీర్ ఆరంభంలో ఆమె త్వరగా ప్రాక్టీస్ ముగించే ప్రయత్నంలో కాస్త అసహనం ప్రదర్శించేది. కానీ కోచ్లు దీనిని గుర్తించి ఆమెకు సరైన దిశానిర్దేశం చేశారు. ఆటలో ఎదగాలంటే సాంకేతిక అంశాలే కాదు వ్యక్తిగత లోపాలు కూడా దిద్దుకోవాలని వారు చేసిన సూచనలను ఆమె అర్థం చేసుకుంది. ఇప్పుడు ప్రాక్టీస్లో కూడా తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పర్ఫెక్షన్ వచ్చే వరకు సురుచి అక్కడినుంచి కదలదు. అలాంటి పట్టుదల అలవాటు చేసుకొని పెద్ద లక్ష్యాలతో ఆమె ముందుకు సాగుతోంది. తొలి కోచ్ సురేశ్ సింగ్ నుంచి జీతూ రాయ్ వరకు ఇప్పుడు కష్టపడే తత్వం గురించే చెబుతుండటం విశేషం. వరల్డ్ కప్ తరహా ప్రదర్శనలు పునరావృతం చేస్తూ నిలకడగా సాగితే భవిష్యత్తులో సురుచి నుంచి కూడా ఒలింపిక్ పతకం ఆశించవచ్చు. -
రామ్ బాబుకు పసిడి
చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ బాబు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన రేస్లో రామ్ బాబు 35 కిలోమీటర్ల దూరాన్ని... 2 గంటల 32 నిమిషాల 53.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచాడు. 2022 ఆసియా క్రీడల్లో మంజు రాణితో కలిసి మిక్స్డ్ రేస్వాక్లో కాంస్యం నెగ్గిన రామ్ బాబు... జాతీయ పోటీల్లోనూ అదే జోరు కనబర్చాడు. అయితే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (2 గంటల 29 నిమిషాల 56 సెకన్లు)ను మాత్రం సవరించలేకపోయాడు. 20 కిలోమీటర్ల విభాగంలో... సెబాస్టియన్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 1 గంట 21 నిమిషాల 46.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. అమిత్ (1 గంట 21 నిమిషాల 51.46 సెకన్లు), అమన్జ్యోత్ సింగ్ (1 గంట 22 నిమిషాల 12.72 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు 1 గంట 24 నిమిషాల 50 సెకన్లు అర్హత మార్క్ కాగా... ఈ ముగ్గురూ దానికంటే మెరుగైన టైమింగ్ నమోదు చేసుకున్నారు. మహిళల 20 కిలోమీటర్ల రేస్వాక్లో రవీనా (1 గంట 35 నిమిషాల 58.80 సెకన్లు) స్వర్ణం గెలుచుకుంది. మహిళల విభాగంలో 35కు బదులు 34 కిలోమీటర్లు! మహిళల విభాగంలో ఫలితాలు వెల్లడించలేదు. మహిళా వాకర్లు రేసును పూర్తి చేయకుండానే ముగింపు గీత దాటడంతో ఫలితాలు నిలిపివేశారు. మొదట సాంకేతిక కారణాలతో మహిళల విబాగంలో ఫలితాలను నిలిపివేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టారు. 35 కిలోమీటర్ల రేసుకు బదులు మహిళలు 34 కిలోమీటర్లను మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ రేసులో పాయల్ 2 గంటల 51 నిమిషాల 48.76 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలు పరిగణనలోకి రావు. 2024లోనూ ఇక్కడ జరిగిన జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు తప్పుడు గణాంకాలు నమోదు కావడంతో... ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ సంఘం సమయాలను సవరించింది. -
జాతీయ ప్రాబబుల్స్కు 39 మంది ప్లేయర్లు
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ క్వాలిఫయర్స్ కు ముందు నిర్వహించనున్న జాతీయ శిబిరానికి 39 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. జూన్, జూలైలో జరగనున్న ఈ అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా... జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టీమ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రీ శనివారం 39 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ ప్రాబబుల్స్లో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ చోటు దక్కించుకుంది.ఇటీవల ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తరఫున 9 గోల్స్తో సత్తాచాటిన సౌమ్య... ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 33 మ్యాచ్లాడింది. మహిళల ఆసియాకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీకి థాయ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 23 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది. ఆతిథ్య థాయ్లాండ్, మంగోలియా, టిమొర్ లెస్ట్, ఇరాక్తో భారత జట్టు తలపడుతుంది. దానికి ముందు భారత ప్లేయర్ల కోసం మే1 నుంచి బెంగళూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. సీనియర్ ప్లేయర్లు బాలా దేవి, ఆశాలత దేవికి ఈ ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. ఇటీవల ఐడబ్ల్యూఎల్లో రాణించిన యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ చాను, కైశమ్ మెలోడీ చాను, మోనాలిసా దేవి (గోల్ కీపర్స్), పూర్ణిమ కుమారి, నిర్మలా దేవి, మార్టినా థోక్చమ్, శుభాంగి సింగ్, సంజూ, మాలతీ, టోయిజమ్ చాను, రంజనా చాను, స్వీటి దేవి, విక్సిత్ బారా, షిల్కీ దేవి (డిఫెండర్స్), కిరణ్, రత్నబాలా దేవి, ముస్కాన్, బబీనా దేవి, కార్తీక అంగముత్తు, కోల్నీ, సంగీత, ప్రియదర్శిని, బేబే సనా, సంతోష్, అంజూ తమాంగ్ (మిడ్ఫీల్డర్స్), మౌసుమీ ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాజన, లిండా కామ్, రింపా హల్దార్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సుమతి, మనీషా, గ్రేస్ డాంగ్మెయి (ఫార్వర్డ్స్). -
హంపి–హారిక గేమ్ ‘డ్రా’
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అజేయపరంపర కొనసాగుతోంది. భారత్కే చెందిన మరో స్టార్ గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారికతో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను హంపి ‘డ్రా’గా ముగించింది. తెల్ల పావులతో ఆడిన హంపి గేమ్ను 19 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3.5 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో హంపి రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్ను దివ్య దేశ్ముఖ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్, తమిళనాడు అమ్మాయి వైశాలి రమేశ్బాబు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో వైశాలి తెల్లపావులతో ఆడుతూ 52 ఎత్తుల్లో గెలుపొందింది. జు జినెర్ (చైనా)–నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) మధ్య జరిగిన గేమ్ 71 ఎత్తుల్లో... మెలియా సలోమి (జార్జియా)–అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత జు జినెర్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే ఆరో రౌండ్ గేముల్లో దివ్య దేశ్ముఖ్తో ద్రోణవల్లి హారిక; బత్కుయాగ్ మున్గున్తుల్తో కోనేరు హంపి; జు జినెర్తో వైశాలి; పొలీనా షువలోవాతో మెలియా సలోమి; నుర్గుల్ సలీమోవాతో అలీనా కష్లిన్స్కాయా తలపడతారు. -
శభాష్ సౌమ్య...
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. ఈస్ట్ బెంగాల్ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కీలకపాత్ర పోషించింది. మిడ్ఫీల్డర్ పొజిషన్లో ఆడే సౌమ్య మొత్తం 9 గోల్స్ సాధించి ఐడబ్ల్యూఎల్ 2024–2025 సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈస్ట్ బెంగాల్కే చెందిన ఫాజిలా ఇక్వాపుట్ (ఉగాండా) 24 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలువగా.. ఈస్ట్ బెంగాల్కే చెందిన ఎల్షాదాయ్ అచెమ్పోంగ్ (ఘనా) 10 గోల్స్తో రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో విదేశీ క్రీడాకారిణులు ఉండటంతో... తాజా ఐడబ్ల్యూఎల్లో అత్యధిక గోల్స్ చేసిన భారతీయ క్రీడాకారిణిగా సౌమ్య గుర్తింపు పొందింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీన మొదలైన ఈ లీగ్ ఏప్రిల్ 18న ముగిసింది. మొత్తం ఎనిమిది జట్లు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఒక్కో జట్టుతో రెండుసార్లు చొప్పున తలపడ్డాయి. ఈస్ట్ బెంగాల్ జట్టు నిర్ణీత 14 మ్యాచ్లు ఆడి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఈస్ట్ బెంగాల్ జట్టు 12 మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. ఓవరాల్గా ఈస్ట్ బెంగాల్ జట్టు 38 గోల్స్ చేసి, ప్రత్యర్థి జట్లకు 10 గోల్స్ సమర్పించుకుంది. ఇప్పటి వరకు ఐడబ్ల్యూఎల్ ఎనిమిదిసార్లు జరగ్గా... గోకులం కేరళ జట్టు మూడుసార్లు చాంపియన్గా నిలిచింది. ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్, రైజింగ్ స్టూడెంట్స్ క్లబ్, సేతు క్లబ్, ఒడిశా ఎఫ్సీ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. రెండోసారి విజేత జట్టులో... నిజామాబాద్ జిల్లాలోని కూనేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల సౌమ్య ఖాతాలో రెండోసారి ఐడబ్ల్యూఎల్ టైటిల్ చేరింది. సౌమ్య 2021–2022 ఐడబ్ల్యూఎల్ సీజన్ విజేత గోకులం కేరళ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. 2015లో భారత అండర్–14 జట్టుకు... 2016లో భారత అండర్–16 జట్టుకు ఆడిన సౌమ్య 2016 నుంచి 2018 వరక భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2021లో భారత సీనియర్ మహిళల జట్టులోకి ఎంపికైన సౌమ్య ఇప్పటి వరకు ఓవరాల్గా 33 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఐదు గోల్స్ సాధించింది. 2017లో ఇండియా రష్ సాకర్ క్లబ్ (ముంబై) తరఫున తొలిసారి ఐడబ్ల్యూఎల్లో బరిలోకి దిగిన సౌమ్య... 2019–2020 సీజన్లో కెంక్రె ఎఫ్సీ (ముంబై) తరఫున ఆడింది. 2021–2022 సీజన్లో గోకులం కేరళ జట్టుకు ఆడిన సౌమ్య 2022–2023లో క్రొయేషియాకు చెందిన డైనమో జాగ్రెబ్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించింది. క్రొయేషియా లీగ్లో ఆడిన తర్వాత తిరిగి వచి్చన సౌమ్య 2023–2024 ఐడబ్ల్యూఎల్లో మరోసారి గోకులం కేరళ జట్టు తరఫున బరిలోకి దిగింది. -
సెమీస్లో అనాహత్, ఆకాంక్ష
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్స్ అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–1, 11–7, 11–5తో అకారి మిదోరికవా (జపాన్)పై, రెండో సీడ్ ఆకాంక్ష 11–0, 11–3, 11–3తో వాయ్ హాన్ యోంగ్ (సింగపూర్)పై గెలుపొందారు. భారత్కే చెందిన తన్వీ ఖన్నా క్వార్టర్ ఫైనల్లో 5–11, 6–11, 12–10, 9–11తో ఎనిమిదో సీడ్ హెలెన్ టాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్ మ్యాచ్ల్లో అనాహత్ 11–4, 11–5, 11–7తో జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్)పై, ఆకాంక్ష 11–4, 11–3, 11–8తో రిసా సుగిమోటో (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.క్వార్టర్ ఫైనల్లో వీర్ చోత్రాని 9–11, 11–6, 11–6, 11–7తో మొహమ్మద్ సిఫిక్ కమాల్ (మలేసియా)పై గెలిచాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు. -
రొలాండ్ గారోస్లో నాదల్కు ప్రత్యేక సన్మానం
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. మరే ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో... 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న నాదల్... ఓవరాల్గా 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది మే 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుండగా... తొలి రోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నాదల్ను సన్మానించనున్నారు. ‘రొలాండ్ గారోస్కు, నాదల్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్లో అతడు చరిత్ర సృష్టించాడు. నాదల్ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. అది అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఫ్రెంచ్ ఓపెన్ డైరెక్టర్ అమెలీ మౌరెస్మో గురువారం అన్నారు. 2024 ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో పరాజయం పాలైన నాదల్... అదే సమయంలో సన్మానించాలని నిర్వాహకులు భావించినా... దానికి అతడు అంగీకరించలేదు. శరీరం సహకరిస్తే మరోసారి ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగాలని 38 ఏళ్ల నాదల్ భావించాడు. కాగా... వరుస గాయాల కారణంగా గతేడాది నవంబర్లో నాదల్ కెరీర్కు వీడ్కోలు పలకడంతో... నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాదల్తో పాటు మేరీ పియర్స్, రిచర్డ్ గాస్కె్వట్ను కూడా సన్మానించనున్నారు. 25 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్లో పియర్స్ మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్లో టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది జూన్ 5న మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్కు ముందు ఆమెను సన్మానించనున్నారు. 50 ఏళ్ల పియర్స్ 2019లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోనూ చోటు దక్కించుకుంది. -
పసిడి పతకం నెగ్గిన హిమాన్షు
దమ్మామ్ (సౌదీ అరేబియా): ఆసియా అండర్–18 యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో హిమాన్షు భారత్కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్ సాదుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.హరియాణా మహిళా అథ్లెట్ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల హైజంప్లో దేవక్ భూషణ్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్పుట్లో నిశ్చయ్ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్ సాబీర్, సాకేత్ మింజ్, కదీర్ ఖాన్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. -
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్గా జు వెన్జున్
మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్మాస్టర్ జు వెన్జున్ మరోసారి నిరూపించుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వవిజేతగా నిలిచింది. చైనాకే చెందిన టాన్ జోంగితో షాంఘైలో జరిగిన ప్రపంచ చెస్ మహిళల చాంపియన్షిప్ మ్యాచ్లో 34 ఏళ్ల జు వెన్జున్ 6.5–2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య 12 గేమ్లు జరగాల్సి ఉన్నా... తొమ్మిదో గేమ్లోనే జు వెన్జున్కు టైటిల్ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్లను నిర్వహించలేదు. తొమ్మిది గేమ్లలో జు వెన్జున్ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయింది. విజేతగా నిలిచిన జు వెన్జున్కు 3,41,000 డాలర్లు (రూ. 2 కోట్ల 91 లక్షలు), రన్నరప్ టాన్ జోంగికి 2,27,000 డాలర్లు (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 2018లో రెండుసార్లు (10 గేమ్ల ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్ వేర్వేరుగా) ప్రపంచ చాంపియన్గా నిలిచిన జు వెన్జున్ ఆ తర్వాత 2020లో, 2023లోనూ వరల్డ్ టైటిల్ను సాధించింది. -
స్వర్ణంతో శుభారంభం
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 సీజన్ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్్రస్టూమ్ ఇన్విటేషనల్ ట్రాక్ ఈవెంట్లో 27 ఏళ్ల నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్లో నీరజ్ జావెలిన్ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్ రాబర్ట్సన్ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. నీరజ్ పాల్గొన్న ఈ మీట్కు వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్ జెలెజ్నిను కొత్త కోచ్గా నియమించుకున్నాక నీరజ్ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్ ర్యాంక్లో నిలువడం విశేషం. నీరజ్ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్ లీగ్ మీట్లో, ఆ తర్వాత మే 24న పంచ్కులాలో జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో టోర్నీలో పోటీపడతాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకున్న నీరజ్... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా అవతరించాడు. -
హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్కే చెందిన ఇద్దరు గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్గున్తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
మీరాబాయి చానుకు కీలక పదవి.. వెయిట్లిఫ్టర్ స్పందన ఇదే
న్యూఢిల్లీ: స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను... భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికైంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన చాను... సహచర లిఫ్టర్లకు తోడ్పాటు అందించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొంది. ‘తోటి లిఫ్టర్ల తరఫున మాట్లాడే అవకాశం దక్కంది. దీన్ని సద్వినియోగ పర్చుకుంటా. పదవితో వచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా.క్రీడేతర అంశాలపై దృష్టి పడకుండా... వెయిట్లిఫ్టింగ్కు మరింత తోడ్పాటు అందించేందుకు నా వంతు కృషి చేస్తా. లిఫ్టర్ల సమస్యలతో పాటు అన్ని కోణాల్లో దృష్టి సారిస్తా’ అని మీరాబాయి చాను ఒక ప్రకటనలో తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో చాను 49 కేజీల విభాగంలో రజతం గెలిచి... ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా నిలిచింది. అంతకుముందు (2000 సిడ్నీ ఒలింపిక్స్) భారత్ నుంచి వెయిట్లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం నెగ్గింది. అదే అనిశ్చితి: గందరగోళంలో భారత బాక్సింగ్ సంఘంన్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘం (బీఎఫ్ఐ)లో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్ర సంఘాలన్నీ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే... తాజాగా ఎన్నికైన తాత్కాలిక కమిటీ మాత్రం జాతీయ చాంపియన్షిప్ల నిర్వహణ, కోచ్ల నియామకం, అంతర్జాతీయ టోర్నీలో ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా... న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమైంది.గత నెల 28న ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించగా... సమాయాభావం వల్ల అదీ సాధ్యపడలేదు. తాజాగా ఈ నెల 28 లోపు ఎన్నికలు నిర్వహించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. చాన్నాళ్లు బీఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ సింగ్... తాత్కాలిక కమిటీకి కూడా చీఫ్గా కొనసాగుతున్నాడు.‘సుదీర్ఘ అనుభవం ఉన్న అజయ్ సింగ్... ఎన్నికలను వాయిదా వేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అస్సాం బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, హేమంత్ అన్నారు. ‘అజయ్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా ఒక్క చాంపియన్షిప్ కూడా నిర్వహించలేదు. పారిస్ ఒలింపిక్స్లో మనవాళ్లకు రిక్తహస్తాలే మిగిలాయి’ అని మధ్యప్రదేశ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. -
హంపి, హారిక తొలి గెలుపు
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో మూడో రోజు భారత స్టార్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సత్తా చాటుకున్నారు. వీరిద్దరు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకున్నారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేముల్లో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి తెల్ల పావులతో ఆడుతూ 53 ఎత్తుల్లో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత్కే చెందిన రైజింగ్ స్టార్ దివ్య దేశ్ముఖ్ను ఓడించింది.తొలి రెండు రౌండ్ గేముల్లో నెగ్గిన దివ్యకిది తొలి ఓటమి కావడం గమనార్హం. మరో గేమ్లో హైదరాబాద్కు చెందిన హారిక 68 ఎత్తుల్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలి గెలుపు రుచి చూసింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను వైశాలి 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
‘ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్’
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా కొత్త పుస్తకాన్ని తీసుకురానుంది. ఓ క్రికెటర్ జీవిత భాగస్వామిగా తన అనుభవాలను పూజ పుస్తక రూపమిచ్చింది. ‘ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్’ పేరిట ఈ నెల 29న ఆ పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రికెట్ను విపరీతంగా అభిమానించి మన దేశంలో... ఓ ఆటగాడి జీవితంలో అటు గ్రౌండ్లో ఇటు ఇంట్లో ఎదురైన ఎత్తుపల్లాలను పూజ ఇందులో ప్రస్తావించింది. ‘చతేశ్వర్ పుజారా చాలా మొండివాడు. ఒక పట్టాన దేన్ని అంగీకరించడు. అదే సమయంలో సున్నిత మనసు్కడు, పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు. అయితే అతడి దగ్గర దాచడానికి ఏమీ లేదు. దైవంపై నమ్మకం ఎక్కువ. హాస్యాన్ని ఇష్టపడతాడు. రాజ్కోట్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన అతడి ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో భాగం అయ్యే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది. చతేశ్వర్ జీవితంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. అందుకోసమే ఇంత సమయం కేటాయించి పుస్తకాన్ని తీసుకు వస్తున్నా’ అని పూజా పుజారా వెల్లడించింది.క్రికెట్పై కనీస అవగాహన లేకుండానే 2013లో అతడిని వివాహమాడిన పూజా... ఆ తర్వాతి కాలంలో స్పోర్ట్స్ న్యూట్రీషియన్గా మారింది. ఓ క్రీడాకారుడి భాగస్వామి పుస్తకం రాయడం ఇదే తొలిసారి. ఈ నెలాఖరులో మార్కెట్లోకి రానున్న పుస్తకంపై భారత దిగ్గజ ఆటగాళ్లు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. పుజారాను సమీపం నుంచి గమనించిన పూజా... అతడి జీవితంలోనే భిన్న పార్శా్వలను స్పృషించిందని ద్రవిడ్ కితాబిచ్చాడు. కష్టాన్ని నమ్ముకుంటే ఒక వ్యక్తి ఎంతటి విజయం సాధించగలడనే అంశం ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుందని పేర్కొన్నాడు. -
సురుచి ధమాకా
లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ పిస్టల్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ రెండో టోర్నమెంట్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ మనూ భాకర్ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్ ఫైనల్లో సురుచి–సౌరభ్ చౌధరీ (భారత్) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్ జోడీ 17–9తో కియాన్జున్ యావో–కాయ్ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్లో మనూ భాకర్–రవీందర్ సింగ్ (భారత్) జోడీ 6–16తో కియాన్కె మా–యిఫాన్ జాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సాత్విక్ - చిరాగ్ జోడీ పునరాగమనం
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈనెల 27 నుంచి చైనాలోని జియామెన్ నగరంలో ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ‘సుదిర్మన్ కప్’కు తెర లేవనుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. బ్యాడ్మింటన్లో ప్రముఖ టీమ్ ఈవెంట్స్ అయిన థామస్ కప్, ఉబెర్ కప్లలో... ఆసియా టీమ్ చాంపియన్షిప్లలో భారత జట్లు పతకాలు సాధించాయి. కానీ 36 ఏళ్ల చరిత్ర కలిగిన సుదిర్మన్ కప్లో మాత్రం ఇప్పటి వరకు భారత్ పతకాల బోణీ కొట్టలేదు. అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులతో చైనాకు బయలుదేరనున్న భారత బృందం ఈసారి పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.న్యూఢిల్లీ: మొత్తం ఐదు మ్యాచ్లు... అందులో మూడు గెలిస్తే చాలు విజయం ఖరారు... పురుషుల సింగిల్స్లో ఇద్దరు స్టార్లు... మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్... పురుషుల డబుల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ జోడీ... ఈ మూడు విభాగాల్లో మనవాళ్లు సహజశైలిలో విజృంభిస్తే భారత్కు గెలుపుతోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న పతకం అందుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సుదిర్మన్ కప్లో విశేషంగా రాణిస్తేనే పతకాన్ని మెడలో వేసుకోవడం సాధ్యమవుతుంది. ఈనెల 27 నుంచి మే 4 వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో పోటీపడనున్న భారత జట్టును మంగళవారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. చిరాగ్ శెట్టి వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ నెలలోనే జరిగిన ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ జోడీ పాల్గొనలేదు. ప్రస్తుతం చిరాగ్ ఈ గాయం నుంచి తేరుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సుదిర్మన్ కప్లో ఈ జోడీ పునరాగమనం చేయనుంది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఐదు టోర్నీల్లో ఆడి రెండింటిలో సెమీఫైనల్కు చేరుకుంది. మహిళల డబుల్స్లో మినహా మిగతా నాలుగు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. భారత నంబర్వన్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఈ జంట సుదర్మిన్ కప్లో ఆడటంలేదు. ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లోనూ గాయత్రి–ట్రెసా జోడీ బరిలోకి దిగలేదు. గాయత్రి–ట్రెసా జోడీ స్థానంలో ప్రియా–శ్రుతి మిశ్రా ద్వయం సుదిర్మన్ కప్లో ఆడనుంది. నాలుగు విభాగాల్లో బ్యాకప్ ప్లేయర్లను ఎంపిక చేసిన ‘బాయ్’ మహిళల డబుల్స్లో ఒక్క జోడీనే ఎంపిక చేయడం గమనార్హం. క్లిష్టమైన ‘డ్రా’... ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా సుదిర్మన్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘డి’లో భారత్, మాజీ చాంపియన్ ఇండోనేసియా, మాజీ రన్నరప్ డెన్మార్క్తోపాటు ఇంగ్లండ్ జట్లున్నాయి. ఇంగ్లండ్ జట్టుపై భారత్ గెలిచే అవకాశం ఉన్నా... ఇండోనేసియా, డెన్మార్క్లపై నెగ్గాలంటే స్టార్ క్రీడాకారులు పూర్తిస్థాయిలో విజృంభించాల్సి ఉంటుంది. గ్రూప్ మ్యాచ్లు ముగిశాక నాలుగు గ్రూప్ల నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ చేరుకున్న జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి.సుదిర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ జట్టుపురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ (ప్రపంచ 18వ ర్యాంక్), హెచ్ఎస్ ప్రణయ్ (ప్రపంచ 30వ ర్యాంక్). మహిళల సింగిల్స్: పీవీ సింధు (ప్రపంచ 18వ ర్యాంక్), అనుపమ ఉపాధ్యాయ్ (ప్రపంచ 44వ ర్యాంక్). పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ప్రపంచ 11వ ర్యాంక్); హరిహరన్–రూబన్ కుమార్ (ప్రపంచ 42వ ర్యాంక్). మహిళల డబుల్స్: ప్రియా కొన్జెంగ్బమ్–శ్రుతి మిశ్రా (ప్రపంచ 39వ ర్యాంక్). మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (ప్రపంచ 17వ ర్యాంక్), సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ (ప్రపంచ 33వ ర్యాంక్). -
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక.. ఐదుగురికి తొలిసారి చోటు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. 26 మందిలో ఐదుగురు జ్యోతి సింగ్, సుజాత కుజుర్, అజ్మీనా కుజుర్, పూజా యాదవ్, మహిమా టెటె తొలిసారి భారత సీనియర్ జట్టులోకి వచ్చారు. బన్సారి సోలంకి, అంజన డుంగ్డుంగ్, లాల్థంట్లాంగి, సాక్షి శుక్లా, ఖైదెమ్ షిలీమా చాను, దీపి మోనికా టొప్పో, సోనమ్లను స్టాండ్బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. తొలుత ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... అనంతరం ఆ్రస్టేలియా సీనియర్ జట్టుతో మూడు మ్యాచ్లు ఉంటాయి. జూన్లో జరిగే యూరోపియన్ అంచె ప్రొ హాకీ లీగ్కు సన్నాహకంగా భారత జట్టుకు ఆస్ట్రేలియాతో సిరీస్ ఉపయోగపడనుంది. భారత మహిళల హాకీ జట్టు: సవితా పూనియా, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్కీపర్లు), జ్యోతి సింగ్, ఇషికా చౌధరీ, సుశీలా చాను, సుజాత కుజుర్, సుమన్ దేవి తౌడమ్, జ్యోతి, అజ్మీనా కుజుర్, సాక్షి రాణా (డిఫెండర్లు), సలీమా టెటె, వైష్ణవి ఫాలే్క, నేహా, షర్మీలా దేవి, మనీషా చౌహాన్, సునెలిటా టొప్పో, మహిమా టెటె, పూజా యాదవ్, లాల్రెమ్సియామి (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ముంతాజ్ ఖాన్, బల్జీత్ కౌర్, దీపిక సొరెంగ్, బ్యూటీ డుంగ్డుంగ్. -
డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో మికోలస్ రజత పతకం గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్గా గుర్తింపు పొందాడు. తండ్రి బాటలోమికోలస్కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించాడు. 2003 పారిస్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
యడ్లపల్లి ప్రాంజల... హైదరాబాద్కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. కొన్నేళ్ల క్రితం వరకు చక్కటి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మే, 2019లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో ఆమె అత్యుత్తమంగా 265కు చేరుకుంది.మరింత మెరుగైన ప్రదర్శనతో పైకి దూసుకు పోతూ మెరుగైన భవిష్యత్తుపై ప్రాంజల ఆట నమ్మకం కలిగించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఆమె మళ్లీ మళ్లీ గాయాలపాలైంది. ఒక గాయం నుంచి కోలుకోగానే మరొకటి ఆమెను వెంటాడింది.15 ఏళ్ల వయసులోనే ఐటీఎఫ్ స్థాయిలో వరుసగా టైటిల్స్ గెలిచిన ఆ అమ్మాయికి అసలు సమయంలో గాయాల విషయంలో సరైన మార్గనిర్దేశనం లేకుండా పోయింది. దాంతో కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ఆమె ఆటకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో ప్రాంజల 1409వ స్థానానికి పడిపోయింది! అంటే కెరీర్లో ఎదుగుతున్న కీలకమైన 20–25 మధ్య ఐదేళ్ల కెరీర్ను ఆమె దాదాపు పూర్తిగా నష్టపోయింది.‘నాకు ఇప్పటికీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. గాయాలతో పాటు టోర్నమెంట్ షెడ్యూల్, ఫిట్నెస్వంటివాటిపై సరైన రీతిలో మార్గనిర్దేశనం లభించి ఉంటే పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో అనిపిస్తుంది’ ఆమె ప్రాంజల వ్యాఖ్యానించింది.జిమ్ ఎక్సర్సైజ్లే సమస్యగా... ప్రాంజల మాత్రమే కాదు భారత టెన్నిస్లో ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత టెన్నిస్లో ముఖ్యంగా మహిళల టెన్నిస్లో ఇలాంటివి చూసేందుకు ఒక సరైన వ్యవస్థనే లేదు. అసలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు కూడా ఎంత వరకు చేయాలి, అవి పరిమితి దాటితో ఎలాంటి నష్టం కలిగిస్తాయో కూడా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వద్ద కూడా దీనికి సరైన సమాధానం లేదు. ఆటలో దూసుకుపోతున్న సమయంలో ‘అతి’గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా ప్రాంజలను నష్టపర్చింది. ఒక మ్యాచ్లో 6–3, 5–2, 30–30తో విజయానికి బాగా చేరువైన సమయంలో కూడా అనారోగ్యంతో తప్పుకోవాల్సి రావడం ఆమె పరిస్థితిని చూపించింది. ‘నేను టీనేజర్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ట్రైనింగ్ చేసేదానిని. జిమ్లో కూడా చాలా ఎక్కువగా బరువును ఎత్తేదానిని. దాని వల్ల ఏమైనా అయితే ఎలా కోలుకోవాలనే విషయంపై కనీస సమాచారం కూడా లేదు.వెన్నునొప్పి, తుంటి నొప్పి, మోకాలు, మడమ... ఇలా ఒకదాని తర్వాత మరో గాయం వెంటాడింది. జిమ్లో బరువుల ప్రభావంతో కండరాలు బాగా బిగుసుకుపోయాయి. దాంతో శరీరంలో సమతుల్యత లభించింది. రెండు నెలలో తగ్గే గాయాలకు కూడా ఆరు నెలలు పట్టింది. నేను చేసిన ఎక్సర్సైజ్లతోనే నాకు బాగా నష్టం జరిగిందనే విషయం కూడా నాకు ఇటీవల అర్థమైంది. అంతకుముందు ఏమీ తెలీదు. తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని’ అని ప్రాంజల తన ఆవేదనను ప్రదర్శించింది. ఏఐటీఏ చొరవ చూపిస్తేనే... కొన్నేళ్ల క్రితం చైనా మహిళా టెన్నిస్ ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మొదలు పెట్టింది. ముఖ్యంగా తమ అగ్రశ్రేణి క్రీడాకారిణులకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు భారత్లో 16–24 వయసు మధ్య టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలకు కూడా అలాంటిది అవసరం ఉంది. దీనిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘భారత మహిళా ప్లేయర్లు విడివిడిగా కాకుండా ఒక బృందంగా టోర్నీలకు వెళ్లటం మేలు చేస్తుంది. అప్పుడు ఏఐటీఏ వారి కోసమే ఒక కోచ్ను, ఫిజియోను పంపే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే అమ్మాయిలకు 360 డిగ్రీ పర్యవేక్షణ అవసరం. న్యూట్రిషన్, మానసిక దృఢత్వం, మ్యాచ్ల విశ్లేషణ, సరైన షెడ్యూలింగ్, ప్రాక్టీస్కు స్పేర్ పార్ట్నర్లు...ఇలా అన్నింటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారత్లో పెద్ద సంఖ్యలో టోర్నీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 3–4 ఏళ్ల పాటు ప్రస్తుత ప్లేయర్లకు అండగా నిలవాల్సి ఉంది. లేదంటే ఈ ప్రతిభ వృథా అవుతుంది’ అని ప్రముఖ టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్ సుందర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఏఐటీఏ మేల్కొనకపోతే ప్రాంజల కెరీర్ను దెబ్బ తీసిన అనుభవాలు మున్ముందూ ఎదురు కావచ్చు. -సాక్షి క్రీడా విభాగం -
హంపి గేమ్ ‘డ్రా’... హారిక పరాజయం
పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్బాబు తమ తొలి గేమ్లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేముల్లో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్ముఖ్ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ గేముల్లో బత్కుయాగ్ మున్గున్తుల్ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. -
Archery World Cup 2025: ధీరజ్కు కాంస్య పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ఆర్చరీ–2025 సీజన్ తొలి టోర్నమెంట్లో భారత క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత్ నాలుగు పతకాలు గెల్చుకుంది. చివరిరోజు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్లో 23 ఏళ్ల ధీరజ్ 6–4 (28–28, 28–29, 29–29, 29–28, 30–29) సెట్ పాయింట్లతో ఆండ్రెస్ టెమినో మెడీల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్ 1–7 (27–28, 28–30, 29–29, 26–30) సెట్ పాయింట్లతో ఫ్లోరియన్ ఉన్రా (జర్మనీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్లో 666 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచిన ధీరజ్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో 6–0తో కెమిరిన్ పికెరింగ్ (బెర్ముడా)పై, రెండో రౌండ్లో 7–1తో కార్లోస్ రొజాస్ (మెక్సికో)పై, మూడో రౌండ్లో 7–3తో అతాను దాస్ (భారత్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో థామస్ చిరాల్ట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న ధీరజ్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పని చేస్తున్నాడు. ఇదే టోర్నీలో ధీరజ్ రికర్వ్ టీమ్ ఈవెంట్లో అతాను దాస్, తరుణ్దీప్ రాయ్లతో కలిసి భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ సహచరుడు రిషభ్ యాదవ్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్లతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్ చైనాలోని షాంఘై నగరంలో మే 6 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ధీరజ్ సాధించిన పతకాలు. ఇందులో వ్యక్తిగత విభాగంలో మూడు కాంస్యాలు ఉన్నాయి. టీమ్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు, రెండు రజతాలు ఉన్నాయి. -
పియాస్ట్రి... మళ్లీ గెలిచాడు
సాఖిర్ (బహ్రెయిన్): క్వాలిఫయింగ్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్ నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఆ్రస్టేలియాకు చెందిన పియా్రస్టి... నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 39.435 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో చైనా గ్రాండ్ప్రిలోనూ పియాస్ట్రి టైటిల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన జార్జి రసెల్ రెండో స్థానాన్ని పొందగా... మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్గా నిలుస్తున్న రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన లూయిస్ హామిల్టన్ ఐదో స్థానాన్ని సాధించాడు. 24 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు పూర్తయ్యాయి. 77 పాయింట్లతో లాండో నోరిస్ అగ్ర స్థానంలో... 74 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో... వెర్స్టాపెన్ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి ఈనెల 20న జిద్దా నగరంలో జరుగుతుంది. -
సెమీస్లో బాలాజీ జోడీ ఓటమి
చెన్నై: మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ మూడో ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. మెక్సికో సిటీలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) ద్వయం 4–6, 5–7తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్క్రాయిసెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బాలాజీ–వరేలా మూడు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. సెమీఫైనల్లో ఓడిన బాలాజీ–వరేలాలకు 3470 డాలర్ల (రూ. 2 లక్షల 98 వేలు) ప్రైజ్మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
స్టాక్హోమ్ (స్వీడన్): పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్హోమ్ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్ మార్టిన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2009 నుంచి పాల్ బీడెర్మన్ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో ‘సూపర్ సూట్స్’ ధరించి బీడెర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య ‘సూపర్ సూట్స్’ను నిషేధించింది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్: ధీరజ్ బృందానికి రజత పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన భారత జట్టు 1–5 సెట్ల తేడాతో లీ జాంగ్యువాన్, కావో వెన్చావో, వాంగ్ యాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్లు 54–54తో సమంగా నిలిచి చెరో పాయింట్ దక్కించుకున్నాయి. రెండో సెట్ను చైనా 58–55తో నెగ్గి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మూడో సెట్ను చైనా 55–54తో సొంతం చేసుకొని 5–1తో స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఆర్చరీ సీజన్ తొలి టోర్నీలో ఇప్పటి వరకు భారత్కు మూడు పతకాలు లభించాయి. -
చాంపియన్ మోహన్ బగాన్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మోహన్ బగాన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)పై విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో ఐఎస్ఎల్ టైటిల్ కావడం విశేషం. 2024–25 లీగ్ దశలో అద్వితీయ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి లీగ్ షీల్డ్ దక్కించుకున్న మోహన్ బగాన్ జట్టు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. తుదిపోరులో మోహన్ బగాన్ జట్టు తరఫున జాసన్ కమిన్స్ (72వ నిమిషంలో), జేమీ మెక్లారెన్ (96వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మోహన్ బగాన్ జట్టు స్ట్రయికర్ అల్బెర్టో రోడ్రిగ్జ్ (49వ నిమిషంలో) సెల్ఫ్ గోల్తో బెంగళూరు ఖాతా తెరిచింది. మోహన్ బగాన్ ఆటగాళ్ల తప్పిదం వల్ల ఆట 49వ నిమిషంలోనే బెంగళూరు గోల్స్ ఖాతా తెరవగా... ద్వితీయార్ధంలో చెలరేగిపోయిన మోహన్ బగాన్ రెండు గోల్స్తో విజయ పతాక ఎగరవేసింది. మోహన్ బగాన్ జట్టు 20 షాట్స్ ఆడగా... అందులో ఆరింటిని ప్రత్యర్థి గోల్పోస్ట్పై సంధించగలిగింది. బెంగళూరు జట్టు 18 షాట్స్లో నాలుగింటిని ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి కొట్టింది. మ్యాచ్లో అత్యధిక శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకోగలిగిన బెంగళూరు... ఫినిషింగ్ లోపాలతో గోల్స్ చేయలేకపోయింది. స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఓవరాల్గా మ్యాచ్లో 62 శాతం బంతిని తమ ఆధినంలో ఉంచుకున్న బెంగళూరు జట్టు 512 పాస్లు కొట్టగా... 38 శాతం బంతిని నియంత్రించిన మోహన్ బగాన్ జట్టు 318 పాస్లు ఇచ్చుకుంది. పాస్ల కచ్చితత్వంలోనూ బెంగళూరు 78 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబర్చగా... మోహన్ బగాన్ 65 శాతంతో వెనుకబడింది. 2022–23 సీజన్లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఐఎస్ఎల్ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా బెంగళూరుపై మోహన్ బగాన్ జట్టు విజయం సాధించింది. -
పంకజ్ అద్వానీకి రజత పతకం
న్యూఢిల్లీ: వరల్డ్ మ్యాచ్ప్లే బిలియర్డ్స్ చాంపియన్షిప్లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ హోరాహోరీగా పోరాడి ఓడాడు. శనివారం జరిగిన తుదిపోరులో పంకజ్ 7–8 (100–19, 100–0, 47–100, 52–100, 100–19, 0–100, 100–49, 3–100, 100–34, 100–4, 85–100, 100–31, 53–100, 43–100, 28–100) ఫ్రేమ్ల తేడాతో ఇంగ్లండ్కు చెందిన డేవిడ్ కాసియర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాంశాల్లో వివిధ విభాగాల్లో కలిపి 28 సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన పంకజ్... ‘బెస్ట్ ఆఫ్ 15’ పోరులో ఆరంభంలో చక్కటి ఆధిపత్యం కనబర్చినా... ఆఖర్లో పుంజుకున్న ఇంగ్లండ్ క్యూయిస్ట్ విజయం సాధించాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో పంకజ్ పోటీ పడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న అద్వానీ... 2016 నుంచి ఈ టోర్నీలో వరుసగా టైటిల్స్ సాధిస్తూ వస్తున్నాడు. -
జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. తొలి రెండు సిరీస్లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. ఈ టోర్నీలో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. -
ఒత్తిడి లేకుండా ఆడటమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత రైఫిల్ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ‘కోటా’ను అందించిన షూటర్లలో అతనూ ఒకడు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ట్రయల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో సందీప్ సింగ్ చేతిలో ఓడి పారిస్ ఒలింపిక్స్కు దూరమయ్యాడు. ఇది అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. దాని నుంచి కోలుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది.‘ఆ సమయంలో నేను చాలా బాధపడిన మాట వాస్తవం. కొద్దిరోజుల పాటు అదే వేదనలో ఉండిపోయాను. నాకంటే ఎక్కువగా నా ఆటను దగ్గరి నుంచి చూసిన సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు బాధపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను. ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ ద్వారా మాత్రమే భారత జట్టును ఎంపిక చేస్తారనేది వాస్తవమని అర్థమైంది. సెలక్టర్లను ఒప్పించేందుకు నా ప్రయత్నం నేను చేశాను కానీ నిబంధనలు ఉన్నాయి. ఏం చేస్తాం’ అని రుద్రాంక్ష్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టాడు.బ్యూనస్ ఎయిర్స్లో గురువారం ముగిసిన సీజన్ తొలి వరల్డ్ కప్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సేతో కలిసి రజతం గెలుచుకున్నాడు. మానసికంగా దృఢంగా మారేందుకు సైకాలజిస్ట్ల సహాయం కూడా తీసుకుంటున్నాడు. ‘టోర్నమెంట్లు జరిగే సమయంలో ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను.అలాంటి స్థితిలో నిలకడగా రాణిస్తూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ప్రతీ రెండు నెలలకు ఒకసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. 0.1 పాయింట్ తేడాతో వెనుకబడిపోవచ్చు. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి సాంకేతికంగానే కాకుండా మానసికంగా కూడా మెరుగ్గా ఉండటంపై దృష్టి పెట్టాలి. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ ముందున్నాయి. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఎంచుకున్న దారిలో నిలకడ కొనసాగిస్తే మంచి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని బ్యూనస్ ఎయిర్స్లో వివరించాడు. -
ఎవరిదో కిరీటం?
కోల్కతా: 13 జట్లు... 162 మ్యాచ్లు... 210 రోజులు... 465 గోల్స్తో సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్, బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) మధ్య నేడు ఫైనల్ జరగనుంది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకున్న మోహన్ బగాన్ జట్టు... సొంతగడ్డపై జరగనున్న తుదిపోరులో గెలిచి రెండోసారి చాంపియన్గా నిలవాలని భావిస్తుంటే... ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫైనల్కు చేరిన బెంగళూరు ఎఫ్సీ కూడా రెండోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. 2022–23 సీజన్లో చాంపియన్గా నిలిచిన మోహన్ బగాన్ జట్టు... 2023–24 సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజా సీజన్ లీగ్ దశలో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన మోహన్ బగాన్... ఇప్పటికే లీగ్ షీల్డ్ విన్నర్గా నిలిచింది. 2024–25 లీగ్ దశలో 24 మ్యాచ్లాడిన మోహన్ బగాన్ జట్టు 17 విజయాలు, 2 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 56 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘టేబుల్ టాపర్’గా నిలిచింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని 26 మ్యాచ్ల్లో మోహన్ బగాన్ 50 గోల్స్ చేసింది. అంటే సరాసరిగా ఈ సీజన్లో మ్యాచ్కు రెండు గోల్స్ చొప్పున కొట్టింది. ఇక బెంగళూరు జట్టు గ్రూప్ దశలో 24 మ్యాచ్ల్లో 11 విజయాలు, 8 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 38 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని బెంగళూరు 27 మ్యాచ్ల్లో 48 గోల్స్ చేసింది. సమఉజ్జీల సమరం... దూకుడుకు మారుపేరైన ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే కాగా... ఈ సీజన్లో మోహన్ బగాన్ ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బగాన్ జట్టు ప్రత్యర్థులకు 18 గోల్స్ మాత్రమే ఇచ్చుకోగా... బెంగళూరు జట్టు 33 గోల్స్ సమరి్పంచుకుంది. ఈ గణాంకాలు చాలు మోహన్ బగాన్ జట్టుపై గోల్ కొట్టడం ఎంత కష్టమో చెప్పేందుకు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐఎస్ఎల్ ఫైనల్కు చేరిన బెంగళూరు జట్టు... 2018–19 సీజన్లో చాంపియన్గా అవతరించింది. 2017–18, 2022–23 సీజన్లలో రన్నరప్తో సరిపెట్టుకుంది. 2022–23 సీజన్లో మోహన్ బగాన్, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ నిర్ణీత సమయంలో 2–2 గోల్స్తో ‘డ్రా’ కాగా... షూటౌట్లో మోహన్ బగాన్ జట్టు 4–3 గోల్స్ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునేందుకు బెంగళూరుకు చక్కటి అవకాశం ఉంది. భారత స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సుభాశీష్ బోస్ కెప్టెన్సీలో మోహన్ బగాన్ బరిలోకి దిగుతోంది. ‘ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సీజన్ చాలా బాగా సాగింది. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని భావిస్తున్నాం. కోల్కతా నగరం మాకు రెండో ఇల్లు లాంటింది. జట్టు ప్రదర్శన బాగుంది. సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. వారి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని మోహన్ బగాన్ సారథి సుభాశీష్ బోస్ అన్నాడు. ఆడిన ఎనిమిది సీజన్లలో బెంగళూరు జట్టు నాలుగోసారి ఫైనల్కు చేరగా... ఐఎస్ఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. మోహన్ బగాన్ తరఫున అల్బెర్టో రోడ్రిగ్స్, లిస్టన్ కొలాకో, అనిరుధ్ థాపా, సుభాశీష్ కీలకం కానుండగా... బెంగళూరు జట్టు గోల్కీపర్ గుర్ప్రీత్సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, అల్బెర్టో నొగురె, ఎడ్గర్ మెండెజ్పై భారీ ఆశలు పెట్టుకుంది. -
సింధు ఇంటికి...
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ సింగిల్స్ విభాగం నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్వన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశారు. గతంలో రెండుసార్లు ఈ టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి మాత్రం నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 12–21, 21–16, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, తన చిరకాల ప్రత్యర్థి అకానె యామగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ కోల్పోయినా, వెంటనే తేరుకొని రెండో గేమ్లో నెగ్గి మ్యాచ్లో నిలిచింది. గతంలో 14 సార్లు అకానె యామగుచిపై నెగ్గిన సింధుకు నిర్ణాయక మూడో గేమ్లో గట్టిపోటీ లభించింది. కీలకదశలో యామగుచి పైచేయి సాధించి సింధుపై 12వ సారి విజయాన్ని అందుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రియాన్షు 14–21, 17–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–19, 13–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పతకానికి విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ కపిల జంట 12–21, 21–16, 21–18తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఐదో సీడ్ చున్ మాన్ టాంగ్–యింగ్ సుయెట్ సె (హాంకాంగ్) జోడీతో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ గెలిస్తే సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంటారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 11–21, 14–21తో టాప్ సీడ్ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) జంట 15–21, 14–21తో ఆరోన్ చియా–వుయ్ యిక్ సో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రష్మిక ‘హ్యాట్రిక్’
పుణే: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టోర్నీలో అదరగొడుతోంది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా గురువారం హాంకాంగ్తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 2–1తో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్కిది రెండో విజయం. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత్ సింగిల్స్లో ఒక మార్పు చేసింది. న్యూజిలాండ్, థాయ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లో బరిలోకి దిగిన హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి స్థానంలో గుజరాత్కు చెందిన వైదేహి చౌధరీకి అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్లో పోటీపడ్డ వైదేహి 2 గంటల 3 నిమిషాల్లో 7–6 (10/8), 6–1తో హో చింగ్ వుపై గెలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన శ్రీవల్లి రష్మిక 7–6 (8/6), 2–6, 6–3తో హాంగ్ యి కొడీ వోంగ్ను ఓడించి భారత్కు 2–0తో విజయాన్ని ఖరారు చేసింది. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఎనిమిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వ్లో 43 పాయింట్లు సాధించిన రష్మిక రెండో సర్వ్లో 14 పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయిన రష్మిక, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో, థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా రష్మిక సింగిల్స్లో విజయం అందుకుంది. ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన మూడో మ్యాచ్లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ పోరాడినా చివరకు విజయానికి దూరమైంది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన డబుల్స్ మ్యాచ్లో అంకిత–ప్రార్థన ద్వయం 7–6 (7/2), 3–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో యుడైస్ చోంగ్–హాంగ్ యి కొడీ వోంగ్ జంట చేతిలో ఓడిపోయింది. -
వినేశ్కు రూ. 4 కోట్ల ప్రైజ్మనీ
చండీగఢ్: పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతి అందించనుంది. 2024 విశ్వక్రీడల మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్కు చేరగా... తుదిపోరుకు ముందు నిబంధనల విరుద్ధంగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో వినేశ్ పారిస్ ఒలింపిక్స్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. తదనంతర పరిణామాల మధ్య రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. కాగా... ఒలింపిక్స్ ఫైనల్ చేరిన వినేశ్ను రజత పతకం గెలిచిన ప్లేయర్గానే భావిస్తామని గతంలోనే హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్లే ఆమెకు పురస్కారం అందిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం వినేశ్కు 3 ఆఫర్లు కేటాయించగా... అందులో వినేశ్ రూ. 4 కోట్ల నగదు బహుమతిని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖకు ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఒలింపిక్స్లో రజతం గెలిచిన అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం... రూ. 4 కోట్ల ప్రైజ్మనీ, గ్రూప్–1 ఉద్యోగం, షెహ్రీ వికాస్ ప్రాధికారణ్ ఇంటి స్థలం రూపంలో మూడు ఆఫర్లను ప్రకటించడం ఆనవాయితీ. అందులో అథ్లెట్లు ఎంపిక చేసుకున్న దాన్ని వారికి కేటాయిస్తారు. మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వినేశ్ ఈ అంశాన్ని గుర్తుచేసింది. ‘వినేశ్ దేశానికి గర్వకారణం అని ముఖ్యమంత్రి గతంలో అన్నారు. రజత పతక విజేతతో సమానంగా సత్కరిస్తామని మాటిచ్చారు. డబ్బు ముఖ్యం కాదు... కానీ ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పటి వరకు సీఎం హామీ నెరవేరలేదు’ అని వినేశ్ పేర్కొంది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నగదు పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మోంటెకార్లో (మొనాకో): భారత టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ప్లేయర్ రోహన్ బోపన్న మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్తో జత కట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన బోపన్న ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చాడు. 96 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–షెల్టన్ ద్వయం 2–6, 7–6 (7/4), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో బొలెలీ–వావాసోరి జోడీని బోల్తా కొట్టించింది. మూడు ఏస్లు సంధించిన బోపన్న–షెల్టన్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్ జంట ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో మాన్యుయెల్ గినార్డ్ (ఫ్రాన్స్)–రొమైన్ అర్నియోడో (మొనాకో)లతో బోపన్న–షెల్టన్ తలపడతారు. ఈ ఏడాది ఏడో టోర్నీలో ఆడుతున్న బోపన్న ప్రస్తుతం మోంటెకార్లో ఓపెన్లో, దోహా ఓపెన్లో మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. సాకేత్–రామ్కుమార్ జంట పరాజయం సాక్షి, హైదరాబాద్: మాడ్రిడ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని, హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్, భారత ప్లేయర్ సిద్ధాంత్ బంతియా వేర్వేరు భాగస్వాములతో ఈ టోర్నీలో పోటీపడ్డారు. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంట 2–6, 4–6తో మూడో సీడ్ ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–లుకాస్ మిడ్లెర్ (ఆ్రస్టియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్)–డేవిడ్ వేగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ 4–6, 2–6తో ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్)–డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సిద్ధాంత్ బంతియా (భారత్)–అలెగ్జాండర్ డాన్స్కీ (బల్గేరియా) ద్వయం 6–7 (2/7), 6–7 (4/7)తో ఒర్లాండో లుజ్ (బ్రెజిల్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాకేత్, అనిరుధ్, సిద్ధాంత్ జోడీలకు 1,470 యూరోల (రూ. 1 లక్ష 42 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ ద్వయం శుభారంభం3మెక్సికో సిటీ: భారత పురుషుల టెన్నిస్ డబుల్స్ నాలుగో ర్యాంకర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ రిత్విక్ (భారత్)–నికోలస్ బరియంతోస్ (కొలంబియా) ద్వయం 3–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో రే హో (చైనీస్ తైపీ)–క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియంతోస్ ద్వయం రెండు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వ్లో 38 పాయింట్లకుగాను 29 పాయింట్లు, రెండో సర్వ్లో 24 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది. -
ఒలింపిక్స్లో ఆరు క్రికెట్ జట్లు
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడాంశంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో ఆరు, మహిళల విభాగంలో ఆరు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. టీమ్లో 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్కు అవకాశం దక్కింది. మ్యాచ్లన్నీ టి20 ఫార్మాట్లోనే జరగనున్నాయి. అయితే ఏ ఆరు జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్యదేశం కాకపోయినా... ఆతిథ్య జట్టుగా అమెరికాకు క్రికెట్ పోరులో అవకాశం దక్కడం ఖాయం. అంటే మరో ఐదు జట్లు మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించవచ్చు. ఏదైనా కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–5లో ఉన్న జట్లను ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్ టీమ్ అర్హత సాధిస్తే ఏ దేశం బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. క్రికెట్లో వెస్టిండీస్ పేరుతో కరీబియన్ ద్వీపంలోని వేర్వేరు దేశాలు కలిసి ఆడుతున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్లో మాత్రం ఈ దేశాలన్నీ విడిగా పోటీ పడతాయి. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు బార్బడోస్ టీమ్ ప్రాతినిధ్యం వహించింది. విండీస్ రీజియన్ పోటీల్లో విజేతగా నిలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది. మొత్తం 351 మెడల్ ఈవెంట్లు... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు మరో నాలుగు కొత్త క్రీడాంశాలకు చోటు లభించింది. బేస్బాల్/ సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్లను కొత్తగా చేర్చారు. పారిస్ ఒలింపిక్స్లో మొత్తం 329 మెడల్ ఈవెంట్లు ఉండగా... ఇప్పుడు మరో 22 జత కలవడంతో ఈ సంఖ్య 351కి చేరింది. స్విమ్మింగ్లో గరిష్టంగా 41 పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుష అథ్లెట్ల సంఖ్య (5,167)తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళా అథ్లెట్లు (5,333) బరిలోకి దిగనున్నారు.ఫుట్బాల్లో 12 పురుష జట్లు ఉంటే 16 మహిళా టీమ్లు ఉంటాయి. గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, కాంపౌండ్ ఆర్చరీలలో తొలిసారి మిక్స్డ్ టీమ్లు ఉండబోతున్నాయి. అథ్లెటిక్స్లో కూడా మొదటిసారి 4్ఠ100 మిక్స్డ్ రిలే ఈవెంట్ను చేర్చారు. ఓవరాల్గా అథ్లెట్ల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే 10,500 ఉండనుంది. -
పసిడి పతక పోరుకు ధీరజ్ బృందం
ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో ధీరజ్, తరుణ్దీప్ రాయ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు 6–2 (54–54, 55–54, 56–56, 56–53) సెట్ పాయింట్ల తేడాతో పాబ్లో అచా, ఆండ్రెస్ టెమినో, జేవియర్ మెరీడాలతో కూడిన స్పెయిన్ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో భారత్ 6–2 సెట్ పాయింట్ల తేడాతో బ్రెజిల్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 6–2 సెట్ పాయింట్ల తేడాతోనే ఇండోనేసియా జట్టుపై గెలిచింది. మరోవైపు దీపిక కుమారి, అంకిత, అన్షికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 2–6 సెట్ పాయింట్ల తేడాతో అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. -
సింధు శుభారంభం
నింగ్బో (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 21–15, 21–19తో ప్రపంచ 36వ ర్యాంకర్ ఎస్తర్ నురుమి వొర్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో విజృంభించిన సింధు... 19 ఏళ్ల ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–11తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. ఇతర మ్యాచ్ల్లో ఆకర్షి కశ్యప్, అనుపమ, మాళవిక ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. ఆకర్షి 13–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో... అనుపమ 13–21, 14–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో... మాళవిక 14–21, 8–21తో గావ్ ఫెంగ్ జై (చైనా) చేతిలో ఓడారు. ప్రిక్వార్టర్స్లో కిరణ్, ప్రియాన్షు... పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. తొలి రౌండ్లో లక్ష్యసేన్ 18–21, 10–21తో లీ చయ్ హౌ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రణయ్ 16–21, 21–12, 11–21తో జూ గువాంగ్ లూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–8తో దిమిత్రి పనారిన్ (కజకిస్తాన్)పై, ప్రియాన్షు 20–22, 21–12, 21–10తో వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్లో ప్రియా–శ్రుతి మిశ్రా జోడీ 11–21, 13–21తో షూ యెన్ సంగ్–చైన్ హుయి యూ (చైనా) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ ద్వయం 21–3, 21–12తో మధుక దులంజన–లహిరు వీరసింఘే (శ్రీలంక) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించగా... పృథ్వీ–సాయి ప్రతీక్ జంట 19–21, 12–21తో చై సియాంగ్ చైవాంగ్ చీ లిన్ (చైనా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి ని్రష్కమించింది. -
రష్మిక అదుర్స్
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్ చేతిలో 1–2తో ఓడిపోయిన భారత్ వెంటనే తేరుకుంది. బుధవారం థాయ్లాండ్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 2–1తో గెలుపొందింది. భారత్కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక థాయ్లాండ్తో మ్యాచ్లోనూ శుభారంభం అందించింది. ప్రపంచ 170వ ర్యాంకర్ లానియానా తారారుడి (థాయ్లాండ్)తో జరిగిన తొలి సింగిల్స్లో ప్రపంచ 345వ ర్యాంకర్ రష్మిక 6–2, 6–4తో సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక నాలుగు ఏస్లు సంధించింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రెండో మ్యాచ్లో భారత్కు నిరాశ ఎదురైంది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి మూడో సెట్లో గాయం కారణంగా వైదొలిగింది. మనాన్చాయ (థాయ్లాండ్)తో జరిగిన మ్యాచ్లో సహజ తొలి సెట్ను 3–6తో కోల్పోయింది. రెండో సెట్ను టైబ్రేక్లో 7–6 (7/3)తో సొంతం చేసుకుంది. మూడో సెట్లో సహజ 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా ఆమె తప్పుకుంది. ఫలితంగా థాయ్లాండ్ స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం సత్తా చాటుకుంది. పీంగ్టార్న్–పట్చారిన్ (థాయ్లాండ్) ద్వయంతో జరిగిన డబుల్స్ మ్యాచ్లో అంకిత–ప్రార్థన 7–6 (7/3), 3–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచి భారత్కు 2–1తో విజయాన్ని ఖరారు చేసింది. -
ఆర్య–రుద్రాంక్ష్ జోడీకి రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు ఏడో పతకం లభించింది. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సే–రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ జోడీ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్య–రుద్రాంక్ష్ ద్వయం 9–17 పాయింట్ల తేడాతో జిఫె వాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. కాంస్య పతక మ్యాచ్లో నర్మద నితిన్ రాజు–అర్జున్ బబూటా (భారత్) జంట 13–17 పాయింట్ల తేడాతో ఫెర్నాండా రుసో–మార్సెలో జూలియన్ గిటిరెజ్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. నీరూ 115 పాయింట్లతో 12వ స్థానంలో, ప్రగతి దూబే 110 పాయింట్లతో 17వ స్థానంలో, భవ్య త్రిపాఠి 106 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లోనూ భారత షూటర్లెవరూ ఫైనల్ చేరలేకపోయారు. జొరావర్ సింగ్ సంధూ 119 పాయింట్లతో ఏడో స్థానంలో, పృథ్వీరాజ్ 117 పాయింట్లతో 16వ స్థానంలో, లక్షయ్ 115 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
భారత ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ ఆర్చరీ కొత్త సీజన్ను భారత పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్య పతకంతో ప్రారంభించింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్తలేలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్, రిషభ్, ఓజస్ త్రయం 230–224 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, రస్ముస్ బ్రామ్సెన్, మార్టిన్ డామ్స్బోలతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ ‘షూట్ ఆఫ్’లో 219–219 (27–29) స్కోరుతో ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. జ్యోతి సురేఖ మాత్రమే... మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మాత్రమే ఈ టోర్నీలో ఆడుతోంది. ఇతర భారత క్రీడాకారిణులకు వీసా రాకపోవడంతో టీమ్ విభాగంలో భారత్ పతకావకాశాలు దెబ్బతిన్నాయి. క్వాలిఫయింగ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ 691 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్లో చిలీకి చెందిన ఒలియా ప్రాడోతో జ్యోతి సురేఖ ఆడుతుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రిషభ్ యాదవ్–జ్యోతి సురేఖ జోడీ పోటీపడుతుంది.లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఈవెంట్ 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో కొత్తగా కాంపౌండ్ ఈవెంట్ను జత చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్లో ఆర్చరీ క్రీడాంశంలో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ విభాగంలో ఐదు ఈవెంట్స్లో (పురుషుల, మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్) పతకాలు అందజేస్తున్నారు. తాజాగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ను కొత్తగా మెడల్ ఈవెంట్గా ప్రవేశ పెట్టనున్నారని వరల్డ్ ఆర్చరీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాంపౌండ్ ఈవెంట్ను ఒలింపిక్స్లో చేర్చడంతో ఈ విభాగంలో భారత స్టార్స్ జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మల నుంచి ఒలింపిక్ పతకాన్ని ఆశించవచ్చు. -
Suruchi- Vijayveer: డబుల్ ధమాకా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మంగళవారం భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 18 ఏళ్ల సురుచి ఇందర్ సింగ్... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 244.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి చైనా ద్వయం కియాన్ వె 241.9 పాయింట్లతో రజతం దక్కించుకోగా... డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ జియాంగ్ రాన్జిన్ 221 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 41 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లోనూ సురుచి తన ఆధిపత్యం చాటుకుంది. సురుచి 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచింది. భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ నిరాశపరిచింది. మనూ 574 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సంతృప్తి పడి ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత్కే చెందిన మరో షూటర్ సయం 572 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో విజయ్వీర్ సిద్ధూ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో 22 ఏళ్ల విజయ్వీర్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలవడం ఇదే తొలిసారి. రికియార్డో మజెట్టి (ఇటలీ; 28 పాయింట్లు) రజతం నెగ్గగా... యాంగ్ యుహావో (చైనా; 23 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 24 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో విజయ్వీర్ 579 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. భారత్కే చెందిన గుర్ప్రీత్ సింగ్ 575 పాయింట్లతో 10వ స్థానంలో, అనీశ్ 570 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
ఓటమితో మొదలు
పుణే: సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు శుభారంభం లభించలేదు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ జట్టులో ప్రపంచ 245వ ర్యాంకర్ లులు సన్ సింగిల్స్ మ్యాచ్తోపాటు డబుల్స్లోనూ బరిలోకి దిగి తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. తొలి మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ 345వ ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–1, 6–1తో ఐశి దాస్ (న్యూజిలాండ్)పై అలవోకగా గెలిచింది. దాంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక కేవలం రెండు గేమ్లు కోల్పోయింది. ఆరు ఏస్లు సంధించిన రష్మిక నాలుగు డబుల్ ఫాల్ట్లు కూడా చేసింది. తొలి సర్వ్లో 20 పాయింట్లు నెగ్గిన రష్మిక రెండో సర్వ్లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. రెండో మ్యాచ్లో గెలిస్తే భారత్ 2–0తో విజయాన్ని ఖాయం చేసుకునేది. కానీ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ లులు సన్ 6–3, 6–3తో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లిని ఓడించింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ తన సర్వీస్ను మూడుసార్లు చేజార్చుకుంది. ఆరు ఏస్లు సంధించిన లులు సన్ రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. స్కోరు 1–1తో సమం కావడంతో చివరిదైన డబుల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. సింగిల్స్లో భారత నంబర్వన్ అంకిత రైనా, డబుల్స్లో భారత నంబర్వన్ ప్రార్థన తొంబారే జత కట్టి ఈ మ్యాచ్లో బరిలోకి దిగారు. అయినప్పటికీ భారత్కు ఓటమి తప్పలేదు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత–ప్రార్థన ద్వయం 3–6, 4–6తో లులు సన్–మోనిక్యూ బ్యారీ జోడీ చేతిలో ఓడిపోవడంతో న్యూజిలాండ్ 2–1తో విజయాన్ని అందుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్తో భారత్ ఆడుతుంది. -
‘ప్లే ఆఫ్’ బెర్త్ లక్ష్యంగా...
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ (Billie Jean King Cup) ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు పుణే వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భారత టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పాటు అంకితా రైనా, వైదేహి, ప్రార్థన తొంబారేలతో కూడిన మన జట్టు ముమ్మర సాధన చేస్తోంది. ఇటీవల ముంబై డబ్ల్యూటీఏ టోర్నమెంట్ సెమీఫైనల్కు చేరిన యువ సంచలనం మాయా రాజేశ్వరన్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైంది. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు న్యూజిలాండ్, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, థాయ్లాండ్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది మూడో స్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందలేకపోయిన భారత జట్టు ఈసారి ఆ అవాంతరాలను అధిగమించాలని పట్టుదలతో ఉంది.‘ప్రస్తుతానికి మా లక్ష్యం ప్లేయర్లను శారీరకంగా, మానసికంగా తాజాగా ఉంచడమే. ఈ వారం చాలా ముఖ్యమైంది. ఫిట్గా ఉంటేనే కోర్ట్లో చురుగ్గా కదలగలరు’ అని భారత కెప్టెన్ విశాల్ ఉప్పల్ పేర్కొన్నాడు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డైరెక్టర్ సుందర్ అయ్యర్ పేర్కొన్నారు. ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నట్లు వెల్లడించిన సుందర్ అయ్యర్... టోర్నీకి ‘సుహానా’ గ్రూప్ స్పాన్సర్గా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఐటా, ఐటీఎఫ్ మహారాష్ట్ర టెన్నిస్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని డీడీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
చార్ల్స్టన్ : అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తన కెరీర్లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్ను సాధించింది. చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో పెగూలా చాంపియన్గా అవతరించింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పెగూలా 6–3, 7–5తో గెలుపొందింది. ఈ సీజన్లోని పెగూలాకిది రెండో టైటిల్. ఈ విజయంతో పెగూలా తన కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ను అందుకుంది. విజేతగా నిలిచిన పెగూలాకు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మెయిన్ ‘డ్రా’కు నగాల్ అర్హత మోంజా (ఇటలీ): భారత పురుషుల టెన్నిస్ సింగిల్స్ నంబర్వన్ సుమిత్ నగాల్ మోంజా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఫెడరికో ఇనాకోన్ (ఇటలీ)తో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో సుమిత్ నగాల్ 6–4, 6–2తో గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నగాల్ తన ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో నగాల్ 5–7, 7–6 (7/2), 6–2తో ఎర్గీ కిర్కిన్ (టర్కీ)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆస్ట్రియా ప్లేయర్ ఫిలిప్ మిసోలిచ్తో సుమిత్ ఆడతాడు. 28వ ర్యాంక్లో యూకీ బాంబ్రీ సోమవారం విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో యూకీ బాంబ్రీ భారత నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. యూకీ రెండు స్థానాలు పడిపోయి 28వ ర్యాంక్లో నిలిచాడు. ఆరేళ్లుగా డబుల్స్లో భారత నంబర్వన్గా ఉన్న రోహన్ బోపన్న గతవారం టాప్ ర్యాంక్ను యూకీకి కోల్పోయాడు. ప్రస్తుతం బోపన్న 43వ స్థానంలో ఉన్నాడు. -
సింధుపైనే మరోసారి ఆశలు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ పోటీలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్లుంటాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుపైనే భారత్ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి.తొలి రౌండ్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఎస్టెర్ వర్దోయో (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ఈ టోర్నీ చరిత్రలో సింధు రెండుసార్లు (2014, 2022) కాంస్య పతకాలు సాధించింది. భారత్కే చెందిన సైనా నెహా్వల్ అత్యధికంగా మూడు కాంస్య పతకాలు గెలిచింది. ఈసారీ సింధు కాంస్యం నెగ్గితే సైనా రికార్డును సమం చేస్తుంది. 63 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ చేరుకోలేకపోయారు. సింధుతోపాటు భారత్ తరఫున మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, అనుపమ, ఆకర్షి కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున లక్ష్య సేన్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం; మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. -
ఐ–లీగ్ చాంపియన్ చర్చిల్ బ్రదర్స్ఎఫ్సీ
న్యూఢిల్లీ: ఐ–లీగ్ 2024–2025 సీజన్లో గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. రియల్ కశ్మీర్ ఫుట్బాల్ క్లబ్తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకున్న చర్చిల్ బ్రదర్స్ జట్టు 40 పాయింట్లతో అగ్రస్థానంతో లీగ్ను ముగించింది. తాజా సీజన్లో 22 మ్యాచ్లాడిన చర్చిల్ బ్రదర్స్ జట్టు 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 45 గోల్స్ చేసిన ఆ జట్టు... ప్రత్యర్థులకు 25 గోల్స్ ఇచ్చుకుంది. శ్రీనగర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో చర్చిల్ బ్రదర్స్ జట్టు తరఫున రఫీఖ్ అమిను (50వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టగా... రియల్ కశ్మీర్ జట్టు తరఫున రామ్సంగ ట్లైచున్ (8వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టు 3–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. ఈ సీజన్లో ఇంటర్ కాశీ జట్టు 22 మ్యాచ్లాడి 11 విజయాలు, 5 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయంపై ఉత్కంఠ ఐ–లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి చర్చిల్ బ్రదర్ జట్టు ‘టాప్’లో ఉన్నప్పటికీ... సీజన్లో భాగంగా జనవరి 13న నామ్ధారి స్పోర్ట్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపారని ఇంటర్ కాశీ జట్టు ఆరోపించింది. ఈ అంశంపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. ఒకవేళ నిర్ణయం ఇంటర్ కాశీకి అనుకూలంగా వస్తే... మరో 3 పాయింట్లు వారి ఖాతాలో చేరనున్నాయి. అప్పుడు ఆ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరనుంది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో డెంపో స్పోర్ట్స్ క్లబ్ 4–3 గోల్స్ తేడాతో గోకులం కేరళ జట్టుపై గెలుపొందింది. శ్రీనిధి డెక్కన్ జట్టుకు తొమ్మిదో స్థానం మొత్తం 12 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో 22 మ్యాచ్లాడిన శ్రీనిధి జట్టు 7 విజయాలు, 8 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 28 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 2021–2022 సీజన్లో మూడో స్థానం, 2022–2023 సీజన్లో రెండో స్థానం, 2023–2024 సీజన్లో రెండో స్థానం పొందిన శ్రీనిధి డెక్కన్ జట్టు ఈసారి మాత్రం నిరాశపరిచింది. -
వెల్డన్ వెర్స్టాపెన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్స్టాపెన్ జోరును అడ్డుకోవడంలో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లు విఫలమయ్యారు. వెరసి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లోని మూడో రేసులోనూ మూడో విజేత అవతరించాడు. సీజన్ మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్... సీజన్ రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్స్ సాధించారు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ పూర్తి ఆధిపత్యం చలాయించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకెంతో కలిసొచ్చిన సుజుకా సర్క్యూట్లో వరుసగా నాలుగో ఏడాది జపాన్ గ్రాండ్ప్రి టైటిల్ను దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 53 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 22 నిమిషాల 06.983 సెకన్లలో ముగించి చాంపియన్గా నిలిచాడు. 2022, 2023, 2024 జపాన్ గ్రాండ్ప్రి రేసుల్లో వెర్స్టాపెన్కే అగ్రస్థానం దక్కింది. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి మూడో స్థానంలో నిలిచారు. రెడ్బుల్ తరఫున తొలిసారి ప్రధాన డ్రైవర్గా వ్యవహరించిన జపాన్కు చెందిన యుకీ సునోడా 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత సీజన్లో ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టి ఆ తర్వాత వెనుకబడిపోయిన వెర్స్టాపెన్కు ఈ ఏడాది తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాంతో వెర్స్టాపెన్ ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో రెండో స్థానంలో, చైనా గ్రాండ్ప్రిలో నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ గత నాలుగేళ్లు ఫార్ములావన్లో ఓవరాల్ టైటిల్ సాధించిన వెర్స్టాపెన్ మూడో రేసులో మాత్రం వెనుకంజ వేయలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన అతను దూసుకుపోయాడు. ఒక్కసారి వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వెళితే అతడిని ఓవర్టేక్ చేయడం కష్టంతో కూడుకున్నదని మెక్లారెన్ డ్రైవర్లకు తెలుసు. జపాన్ గ్రాండ్ప్రిలో అదే జరిగింది. మొదట్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన వెర్స్టాపెన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలో కొనసాగి రెండు సెకన్ల తేడాతో విజేతగా నిలిచాడు. పాయింట్ తేడానే... 24 రేసులతో కూడిన తాజా సీజన్లో మూడు రేసులు ముగిశాక లాండో నోరిస్ 62 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 61 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా ఒక్క పాయింట్ మాత్రమే ఉండటం గమనార్హం. సీజన్లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రి ఈనెల 13న జరుగుతుంది. 64 ఫార్ములావన్ చరిత్రలో వెర్స్టాపెన్ సాధించిన విజయాలు. అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్ల జాబితాలో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్ హామిల్టన్ (105), మైకేల్ షుమాకర్ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 4 రెండు వేర్వేరు గ్రాండ్ప్రి రేసులను వరుసగా నాలుగేళ్ల పాటు సాధించిన నాలుగో డ్రైవర్గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందాడు. వెర్స్టాపెన్ అబుదాబి (2020, 2021, 2022, 2023), జపాన్ గ్రాండ్ప్రి (2022, 2023, 2024, 2025) రేసులలో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో జిమ్ క్లార్క్ (బెల్జియం గ్రాండ్ప్రి; బ్రిటన్ గ్రాండ్ప్రి 1962–1965), మైకేల్ షుమాకర్ (స్పెయిన్ గ్రాండ్ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్ప్రి 2003–2005), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్ గ్రాండ్ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్ప్రి 2014–2017) కూడా ఉన్నారు. -
రుద్రాంక్ష్ పాటిల్ ‘పసిడి’ గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల రుద్రాంక్ష్ 252.9 పాయింట్ల స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మార్టన్ పెనీ (హంగేరి; 251.7 పాయింట్లు) రజతం, జూలియన్ గుటిరెజ్ (అర్జెంటీనా; 230.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఫైనల్లో పోటీపడ్డ మరో భారత షూటర్ అర్జున్ బబూటా 144.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 47 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో అర్జున్ 643.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, రుద్రాంక్ష్ 633.7 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచి నాలుగు పతకాలతో రెండో స్థానంలో ఉంది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రుద్రాంక్ష్ కిది ఐదో పతకం కావడం విశేషం. గతంలో అతను రెండు స్వర్ణాలు (2023 కైరో), రెండు కాంస్యాలు (2023 భోపాల్) సాధించాడు. -
భారత బాక్సర్లకు ఆరు పతకాలు
తొలిసారి నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఆరు పతకాలతో మెరిశారు. బ్రెజిల్లోని ఫాజ్ డు లుగాకు నగరంలో ఈ టోర్నమెంట్ జరిగింది. పురుషుల 70 కేజీల విభాగంలో భారత బాక్సర్ హితేశ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హితేశ్తో తలపడాల్సిన ఒడెల్ కమారా (ఇంగ్లండ్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో హితేశ్కు బంగారు పతకం ఖరారైంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అభినాశ్ 0–5తో యురీ రెయిస్ (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్లో పరాజయం పాలైన నలుగురు భారత బాక్సర్లు జాదూమణి సింగ్ (50 కేజీలు), మనీశ్ రాథోడ్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), విశాల్ (90 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. ఆరు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో 19 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పోటీపడ్డారు. -
గ్రాండ్స్లామ్ విజేతలకు నగదు బహుమతి పెంచాలి
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీల విజేతలకు నగదు బహుమతిని పెంచాలని కోరుతూ స్టార్ ఆటగాళ్లు... నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల నిర్వాహకులకు లేఖ రాశారు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నిర్వాహకులతో వ్యక్తిగతంగా సమావేశమై ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్తో పాటు పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రశ్రేణి ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. మార్చి 21వ తేదీతో ఉన్న ఈ లేఖపై పురుషుల ప్రపంచ నంబర్వన్ సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ), అల్కరాజ్ (స్పెయిన్), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), రూడ్ (నార్వే), మెద్వెదెవ్ (రష్యా), రుబ్లెవ్ (రష్యా), సిట్సిపాస్ (గ్రీస్), అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) సంతకాలు ఉన్నాయి. మార్చి తొలివారంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో వీరు టాప్–10లో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో టాప్–11 ప్లేయర్లలో పది మంది దీనిపై సంతకాలు చెశారు. కజకిస్తాన్ ప్లేయర్ రిబాకినా మినహా తక్కినవాళ్లంతా ఇందులో ఉన్నారు. మహిళల ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), కోకో గాఫ్ (అమెరికా), స్వియాటెక్ (పోలాండ్), జెస్సికా పెగూలా (అమెరికా), మాడిసన్ కీస్ (అమెరికా), జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎమ్మా నవారో (అమెరికా), జెంగ్ క్విన్వెన్ (చైనా), పౌలా బదోసా (స్పెయిన్), మిరా ఆంద్రెయెవా (రష్యా) దీనిపై సంతకాలు చేశారు. » గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ల ద్వారా నిధులు సమకూర్చి ఆటగాళ్ల సంక్షేమ కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఆటగాళ్లు కోరుతున్నారు. » గ్రాండ్స్లామ్ విజయవంతం కావడంలో ఆటగాళ్లదే ప్రధాన పాత్ర కాబట్టి అందుకు తగ్గట్లు నగదు బహుమతి శాతాన్ని పెంచాలని... తద్వారా టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ప్లేయర్లు అంటున్నారు. » ప్లేయర్ల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్ద పీట వేయాలని... ఇందులో అత్యధిక వాటా ఆటగాళ్లకే దక్కాలని లేఖలో పేర్కొన్నట్లు ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది. » జొకోవిచ్ ఆధ్వర్యంలో స్థాపించిన ఆటగాళ్ల సంఘం... పురుషుల, మహిళల ప్రొఫెషనల్ టూర్లు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య, క్రీడా సమగ్రత సంస్థపై న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో ఇటీవల ఒక దావా వేసింది. » గ్రాండ్స్లామ్ ఆదాయంలో అతి తక్కువ మాత్రమే ఆటగాళ్లకు ఇస్తున్నారని... అందులో ప్లేయర్లకు మరింత వాటా దక్కాలని ఆ దావాలో పేర్కొంది. » యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ పురుషుల, మహిళల విజేతలకు కలిపి చెల్లించిన దానికంటే ఒక స్పెషాలిటీ కాక్టెయిల్ అమ్మకం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్నారని వాజ్యంలో పేర్కొంది. -
వెర్స్టాపెన్కు పోల్ పొజిషన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 నిమిషం 26.983 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేశాడు. చివరి ల్యాప్లో అతడు ఈ టైమింగ్ నమోదు చేశాడు. కాగా... వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 41వ పోల్ పొజిషన్. మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్ (1 నిమిషం 26.995 సెకన్లు), పియాస్ట్రి (1 నిమిషం 27.027 సెకన్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జపాన్ గ్రాండ్ప్రిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేకపోయాడు. గత 16 రేసుల్లో అతడు కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన ట్రాక్పై నేడు జరగనున్న ప్రధాన రేసును వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. ఆదివారం ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా... తడిసిన ట్రాక్పై మెరుగైన రికార్డు ఉన్న వెర్స్టాపెన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వెర్స్టాపెన్ కెరీర్లో ఇప్పటి వరకు 63 ఎఫ్1 రేసులు నెగ్గాడు. ఈ జాబితాలో లూయిస్ హామిల్టన్ (105), షూమాకర్ (91) మాత్రమే అతడికంటే ముందున్నారు. ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ (44 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్ (మెర్సిడెస్; 35 పాయింట్లు), పియాస్ట్రి (మెక్లారెన్; 34 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఇషా సింగ్ రజత గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్ జియాన్ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ మనూ భాకర్ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ భాకర్ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్కు అర్హత సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్ ప్రారంభ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనిట మంగోల్డ్ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్ కౌర్కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్ అనిట మంగోల్డ్ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్ కౌర్ ఆ తర్వాత అదరగొట్టింది. నీలింగ్ పొజిషన్లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 590 పాయింట్లు సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. -
ఫైనల్లో అభినాశ్
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్లోని ఫాజ్ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్ 5–0తో ఇటలీ బాక్సర్ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్... ఫైనల్లో బ్రెజిల్కు చెందిన యూరీ రెయిస్తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్కు ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు ఇచ్చారు. మొదటి, మూడో రౌండ్లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్ రాథోడ్ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్లో మనీశ్ 0–5తో నూర్సుల్తాన్ అల్టిన్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్కు చేరగా... జాదూమణి సింగ్ (50 కేజీలు), విశాల్ (90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. 19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో... భారత్ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు. -
మే 24న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరుతో మనదేశంలో ఓ అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మే 24న హరియాణాలోని పంచ్కుల వేదికగా జరగనున్న ఈ టోర్నీకి ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ అని పేరు పెట్టారు. దివంగత మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ స్టేడియంలో ఈ మీట్ను నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లు పాల్గొనే ఈ ఈవెంట్కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ హోదాను కేటాయించింది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ క్యాలెండర్లో చోటు దక్కకపోయినా... ప్రతి ఏటా దీన్ని నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్తంగా ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. నీరజ్ చోప్రా కూడా నిర్వాహక కమిటీలో భాగం పంచుకుంటున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిశాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఆమోదం తెలిపారు. భారత్లో మెగా టోర్నీలు నిర్వహించే సామర్థ్యాన్ని ఇది ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ దేశ అథ్లెటిక్స్ ప్రతిష్టను పెంపొందిస్తుందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నీరజ్ జావెలిన్ శిక్షణ ప్రారంభించిన ప్రాంతంలోనే ఈ టోర్నీ జరగనుంది. నీరజ్ భాగస్వామ్యంతో దేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం భారత అథ్లెటిక్స్కు గొప్ప విషయం’ అని బహదూర్ సింగ్ అన్నారు. హరియాణా, పానిపట్ సమీపంలోని ఖంద్రా గ్రామంలో జన్మించిన నీరజ్ చోప్రా... 2012 నుంచి 2015 వరకు పంచ్కులలో జావెలిన్ శిక్షణ పొందాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన నీరజ్... ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో దేశానికి స్వర్ణం అందించిన తొలి అథ్లెట్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ పొందుతున్న నీరజ్... మే 16న జరిగే దోహా డైమండ్ లీగ్తో సీజన్ ప్రారంభించే అవకాశాలున్నాయి. -
నిలబడలేని స్థితి నుంచి... మళ్లీ గన్ పట్టి...
రాహీ సర్నోబత్... భారత్ తరఫున షూటింగ్ ప్రపంచకప్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. మొత్తంగా షూటింగ్ ప్రపంచ కప్లలో ఆమె ఖాతాలో 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం ఆమె గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం వరకు రాహీ భారత అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 32 ఏళ్ల వయసులో ఆమె ఊహించని ఘటన రాహీ జీవితంలో చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ పోటీల కోసం ఆమె సిద్ధమవుతోంది. అనూహ్యంగా ఆమె శరీరంలో కాస్త మార్పు కనిపించింది. కొంత నొప్పిగా అనిపించినా ఆ సమయంలో దానిని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. శరీరమంతా తట్టుకోలేనంత నొప్పితో విలవిల్లాడింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. దాంతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అన్నింటిలో అంతా బాగుందనే వచ్చింది. అసలు సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారి అసలు పడుకోలేని పరిస్థితి. కూర్చొని మాత్రమే నిద్రపోవాల్సి వచ్చేది. చివరకు ఆమెకు ‘న్యూరోపతిక్ పెయిన్’ ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చారు. అయితే దీనికి ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక చికిత్స గానీ ఉండదని, ప్రతీ వ్యక్తికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయని చెప్పడం రాహీలో ఆందోళనను మరింత పెంచింది. ‘కొన్ని నెలల పాటు రోజుకు 17–20 గంటలు కేవలం పడుకునేదాన్ని. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని నాటి బాధాకర రోజులను రాహీ గుర్తు చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాహీ అదృష్టవశాత్తూ ఆరోగ్యం మెరుగవడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఫిజియోథెరపీని మొదలు పెట్టారు. నిర్విరామంగా 20 నిమిషాలు పాటు టీవీ షో చూడటం కూడా ఆమె మొదటి ఎక్సర్సైజ్గా మారింది. మొదట్లో అది కూడా కష్టంగా అనిపించింది. అయితే ఫిజియోథెరపీతో నెమ్మదిగా పరిస్థితి మారి కొంత ఎక్కువ సమయం కూర్చోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ఆమె ఆటలో పునరాగమనం గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు జీవితం సాధారణంగా మారి ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి మాత్రమే ఆమెది. కానీ రాహీ చివరకు కోలుకొని ఆపై ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టింది. అంతా చక్కబడటంతో సర్నోబత్ మళ్లీ గన్ పట్టుకొని షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సారి తనను తాను నిరూపించుకునేందుకో, పతకాలు గెలుచుకునేందుకో కాదు. తాను ఎలాంటి కఠిన పరిస్థితులను దాటి ధైర్యంగా నిలబడ్డానో, జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని పట్టుదలగా ఎలా వాడుకున్నానో చూపించేందుకు రాహీ మళ్లీ ఆటలోకి అడుగు పెట్టింది. ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించడంతో ఆమె కొత్త జీవితం మొదలైంది. రియో, టోక్యో ఒలింపిక్స్లలో పాల్గొన్న రాహీ సర్నోబత్ ఇప్పుడు మరోసారి తన స్వప్నం ఒలింపిక్స్ పతకం కోసం సిద్ధమవుతోంది. అసలు లేవలేని పరిస్థితి నుంచి కోలుకొని మళ్లీ సత్తా చాటుతూ లాస్ ఏంజెలిస్ గేమ్స్ లక్ష్యంగా తన సన్నాహాలు చేస్తోంది. - సాక్షి క్రీడా విభాగం -
ఒడిశా టైటిల్ నిలబెట్టుకునేనా!
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్షిప్నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘ఎ’ డివిజన్లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్లోని 10 జట్లు, ‘సి’ డివిజన్లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్కు... ‘బి’ డివిజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్కు చేరనున్నాయి. ప్రతి డివిజన్లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్షిప్ను ఈ ఫార్మాట్లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. » ‘ఎ’ డివిజన్లోని 12 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో మూడు టీమ్ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుతాయి. » ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్లో చోటు దక్కించుకున్నాయి. » ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్లు ఈ నెల 8న ఆరంభమవుతాయి. » ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి. » ‘సి’ డివిజన్లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి. » ఒక్కో మ్యాచ్లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. -
127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది జూన్లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న హాంకాంగ్తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి. -
పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’
ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికైంది మెట్టు హాసిని.పోటీ పడితే పతకమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హై స్కూల్లో చదివింది. ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది.పసిడి పతకాల పంటఅదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో గోల్డ్మెడల్ సాధించి ఔరా అనిపించింది.గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది.అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
65 నుంచి 40కు...
బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 28 మంది సీనియర్ ప్లేయర్లు కోర్ గ్రూప్ ప్రాబబుల్స్లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. భారత మహిళల హాకీ కోర్ గ్రూప్ ప్రాబబుల్స్: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్డుంగ్, సుమన్ దేవి (డిఫెండర్స్). సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, బల్జీత్ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్ (మిడ్ ఫీల్డర్స్). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్నీత్ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్ అటా్పడ్కర్ (ఫార్వర్డ్స్). -
సాకేత్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్కుమార్ రామనాథన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు. తొలి రౌండ్ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ నాలుగు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. అనిరుద్కు నిరాశమరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనిరుధ్ జంట తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది. భారత్కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ అద్భుత పురోగతి సాధించాడు. గతవారం చెన్నైలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ లెవెల్ టోర్నీలో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను తన కెరీర్లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. మంగళవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్లో స్నేహిత్ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 89వ ర్యాంక్కు చేరుకున్నాడు.నా తదుపరి లక్ష్యం అదేచెన్నై స్టార్ కంటెండర్ టోర్నీ రెండో రౌండ్లో స్నేహిత్ ప్రపంచ 29వ ర్యాంకర్ యుకియా ఉడా (జపాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్పై గెలిచి పెను సంచలనం సృష్టించాడు.‘నా తాజా ప్రపంచ ర్యాంక్తో ఎంతో సంతోషంగా ఉన్నా. ఈ ఏడాదిలోపు టాప్–100లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దానిని మూడు నెలల్లోపే అందుకున్నా. ఇక టాప్–50లోకి రావడమే నా తదుపరి లక్ష్యం’ అని అంతర్జాతీయస్థాయిలో భారత్ తరఫున డజనుకంటే ఎక్కువ పతకాలు సాధించిన స్నేహిత్ వ్యాఖ్యానించాడు.మరోవైపు చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని నెగ్గిన గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మానవ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 47వ ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్ అయ్యాడు. భారత్కే చెందిన హరీ్మత్ దేశాయ్ 68వ ర్యాంక్లో, మనుష్ షా 73వ ర్యాంక్లో నిలిచారు. చెన్నై స్టార్ కంటెండర్ టోరీ్నతో అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన శరత్ కమల్ 80వ ర్యాంక్లో నిలిచాడు. ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాజా ర్యాంకింగ్స్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత నెలలో అర్జున్ ఐదో ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్ ఖాతాలో 2782 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ చాంపియన్, తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2787 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్ను నిలబెట్టుకొని భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.తొలి రౌండ్లోనే లక్ష్య చహర్ ఓటమి వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్ను భారత్ పరాజయంతో ప్రారంభించింది. బ్రెజిల్లోని ఫాజ్ డు లుగాకు నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. పురుషుల 80 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బ్రెజిల్ బాక్సర్, 2023 ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత వాండర్లీ పెరీరాతో జరిగిన బౌట్లో లక్ష్య చహర్ 0–5తో ఓడిపోయాడు.150 పాయింట్లకుగాను పెరీరాకు 149 పాయింట్లు... లక్ష్య చహర్కు 135 పాయింట్లు లభించాయి. వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నుంచి పది మంది బాక్సర్లు బరిలో ఉన్నారు. రిత్విక్ జోడీకి నిరాశ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి వరుసగా మూడో టోర్నీలోనూ నిరాశ ఎదురైంది. ఫిబ్రవరిలో సాంటియాగో ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన రిత్విక్ ఆ తర్వాత పోటీపడ్డ మూడు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికాలో జరుగుతున్న హ్యూస్టన్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియంతోస్తో జతకట్టి ఆడిన రిత్విక్ తొలి రౌండ్లో నిష్క్రమించాడు.పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో రిత్విక్ చౌదరీ–బరియంతోస్ ద్వయం 5–7, 4–6తో మార్సెలో జోర్మన్–రాఫెల్ మటోస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియంతోస్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. తొలి రౌండ్లో ఓడిన రిత్విక్–బరియంతోస్లకు 3,700 డాలర్ల (రూ. 3 లక్షల 15 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
న్యూఢిల్లీ: ఏ ఆటలోనైనా... ఏ స్థాయి ప్లేయర్కైనా... అంతిమ లక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే... అయితే అందరికీ ఒలింపిక్ పతకాన్ని అందుకునే భాగ్యం ఉండదు. ఎంత సత్తా ఉన్నా... జట్టు క్రీడలో సమన్వయం కొరవడితే ఫలితాలు తారుమారు అవుతాయి... లక్ష్యానికి చేరువై దూరమైపోతారు. భారత సీనియర్ హాకీ స్టార్ వందన కటారియా కెరీర్లోనూ ఇలాగే జరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో వందన సభ్యురాలిగా ఉన్న భారత జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. బ్రిటన్ జట్టుతో జరిగిన కాంస్య పతక మ్యాచ్లో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ కీలక మ్యాచ్లో వందన ఒక గోల్ కూడా చేసింది. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో వందన ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. మంగళవారం అంతర్జాతీయ హాకీకి గుడ్బై చెప్పిన వందన తన కెరీర్లో ఒలింపిక్ పతకం లేకపోవడం లోటుగా ఉండిపోతుందని, టోక్యోలో కాంస్యం సాధించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. ‘నేను హరిద్వార్లో హాకీ స్టిక్ పట్టుకునే సమయానికి ఆడపిల్లలు ఇంటి గడప దాటకూడదనే అభిప్రాయం ఉండేది. వందనను హాకీ ఆడేందుకు ఇంటి బయటకు ఎందుకు పంపిస్తున్నావని మా నాన్నను ఇంటి చుట్టుపక్కల వాళ్లు చాలాసార్లు ప్రశ్నించారు. కానీ వారి మాటలను ఆయన పట్టించుకోలేదు. నాకంటే ముందుగానే మా ఇద్దరు అక్కలు రీనా, అంజలి హాకీ ఆడేవారు. నేను ఖోఖోను ఎక్కువ ఇష్టపడేదాన్ని. కొన్ని రోజులు గడిచాక నేను కూడా హాకీవైపు మళ్లాను. మాకెంతో మద్దతు ఇచ్చిన నాన్న టోక్యో ఒలింపిక్స్కు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. నాన్న మరణం నన్ను కుంగదీసినా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో టోక్యోకు వెళ్లాను. కుటుంబసభ్యుల మద్దతు ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించడం సాధ్యమే’ అని 32 ఏళ్ల వందన తెలిపింది. ‘అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదు. చాలా మంది జూనియర్ ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వందన వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించలేదని... అయితే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన హాకీకి తప్పకుండా సేవలు అందిస్తానని వందన తెలిపింది. -
సింధు తర్వాత ఎవరు?
సాక్షి క్రీడా విభాగం : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే దిగ్గజం. తదనంతరం ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వీళ్లిద్దరు పురుషుల కేటగిరీలో లెజెండ్స్! కానీ అమ్మాయిల విభాగంలో మాత్రం స్టార్లు, విజేతలంటూ ఎవరూ లేరు. మళ్లీ గోపీచంద్ తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచి్చన ‘ఆట’కు తిరిగివ్వాలనే లక్ష్యంతో కోచ్గా మారాక భారత బ్యాడ్మింటన్ ‘కోర్టు’లో రాణులు వెలుగులోకి వచ్చారు. అతను సానబెట్టిన సైనా నెహ్వల్ ఓ వెలుగు వెలిగింది. ఎన్నో ఏళ్లుగా మహిళల సింగిల్స్లో ఉనికి లేని భారత్కు ఘనవిజయాలు, ఒలింపిక్ పతకం తెచ్చి పెట్టింది. ఆమె ఆడుతుండగానే పీవీ సింధు దూసుకొచ్చింది. సింధుది గోపీచంద్ స్కూలే (కోచింగ్). ఆమె అచిరకాలంలోనే సైనాను మరిపించింది. బ్యాడ్మింటన్లో మురిపించింది. దేశాన్ని గర్వపడేలా చేసింది. ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ నంబర్వన్ ర్యాంక్, ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం ఇలా ఒకటేమిటి అన్నింటా సింధు మార్కు కనబడింది. అయితే కొంతకాలంగా సింధు ఆటతీరు గాడి తప్పింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత రెండు సీజన్లు సింధుకు కలిసి రాలేదు. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. కానీ తర్వాతే భారత బ్యాడ్మింటన్లో సింధు వారసురాలు కనబడటం లేదు. దీంతో సమీప భవిష్యత్తులో మహిళల సింగిల్స్లో ఆశాకిరణం ఫలానా అనే వారు లేక ప్రభ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ ప్రమాద ఘంటికలు 2025 సీజన్ ప్రారంభంలోనే మోగాయి. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ (కింగ్డావో–చైనా)లో చివరి నిమిషంలో గాయంతో సింధు వైదొలగగా... బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్తోనే సరిపెట్టుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్లలో నిలకడలేని ప్రదర్శనతో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. ఒక్క పురుషుల డబుల్స్లోనే ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ షెట్టితో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడు. వీలైతే విజయం (పతకం) లేదంటే రన్నరప్... ఇదీ కుదరకపోతే కనీసం సెమీఫైనల్ వరకైనా భారత ఆశల పల్లకిని మోసుకెళ్తున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగినట్లే ఎదిగి... క్రికెట్ మతమైన భారత్లో, ఘనచరిత్ర కలిగిన హాకీ, పతకాలపై గురి పెట్టే షూటింగ్లతో పాటు బ్యాడ్మింటన్ కూడా పతకాలు తెచ్చే ప్రముఖ క్రీడాంశమైంది. 2012 నుంచి భారత షట్లర్లు వరుసగా మూడు ఒలింపిక్ పతకాలు సాధించారు. లండన్ (2012)లో సైనా... ‘రియో’లో (2016)... ‘టోక్యో’లో (2020) సింధు పతకాలు పట్టుకొచ్చారు. దీంతో పాటు ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్యాలకు లెక్కేలేదు. ఒలింపిక్ నుంచి ఒలింపిక్ కాలచక్రంలో మిన్నంటే ప్రదర్శనతో షట్లర్లు వెలుగులీనారు. కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇలా వచ్చిన వారే. పతకం తేలేకపోయినా పురుషుల్లో లక్ష్య సేన్, మహిళల్లో సింధు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. కానీ తదుపరి ఒలింపిక్స్లో ఈ అర్హత ముచ్చట కూడా దక్కేలా కనబడటం లేదు. ఎందుకంటే శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్లలో పదును తగ్గింది. మ్యాచ్లు గెలిచే సత్తా కరువైంది. మహిళల సింగిల్స్లో సింధుకు ఇటు ఆటతీరులో నిలకడ లేదు! అటు ఫిట్నెస్లో స్థిరత్వం లేదు. దీంతో కొత్త ఒలింపిక్ సైకిల్లో వీళ్లెవరూ ముందుకెళ్లే షట్లర్లు కానేకారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటీ పరిస్థితి... ఎందుకీ దుస్థితి! శ్రీకాంత్, ప్రణయ్లు వెటరన్ ప్లేయర్లు కావడంతో సహజంగా వయసు పైబడిన ఛాయలు వారిని వెనక్కి లాగుతున్నాయి. కానీ లక్ష్యసేన్ తన కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాలతో ఔరా అనిపించాడు. కానీ కొన్నాళ్లుగా అలసత్వమో... అనాసక్తినో తెలియదు కానీ ఆశించిన స్థాయి ఆటతీరే కనబరచడం లేదు. ఇది భారత పతకాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. మహిళల సింగిల్స్లో సింధు ఎన్నో సాధించింది. దేశానికి ఎంతో పేరు తెచ్చింది. కానీ ఆమె తర్వాత కోర్ గ్రూపులో ఉండే కొదమ సింహాలను మాత్రం భారత బ్యాడ్మింటన్ రంగం తయారు చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే డబుల్స్ ప్రాధాన్యం వల్ల సింగిల్స్ స్టార్లు కరువైనట్లు ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. పురుషుల డబుల్స్లో పదో ర్యాంక్తో సాత్విక్–చిరాగ్ జోడీ, మహిళల డబుల్స్లో తొమ్మిదో ర్యాంక్తో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ టాప్–10లో ఉన్నాయి. కానీ సింగిల్స్లో సింధు (17), మాళవిక బన్సోద్ (23), అనుపమ ఉపాధ్యాయ్ (44), రక్షిత శ్రీ (45), ఆకర్షి కశ్యప్ (48), ఉన్నతి హుడా (55), తస్నిమ్ మీర్ (63), అన్మోల్ ఖరబ్ (67)... లక్ష్య సేన్ (18), ప్రణయ్ (29), కిరణ్ జార్జి (36), ప్రియాన్షు రజావత్ (38), ఆయుశ్ శెట్టి (44), సతీశ్ కుమార్ కరుణాకరన్ (47), తరుణ్ మన్నేపల్లి (53), కిడాంబి శ్రీకాంత్ (54), శంకర్ ముత్తుస్వామి (59)ల ర్యాంక్లు సమీప భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్కు ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతున్నాయి. నంబర్వన్ ర్యాంక్ దేవుడెరుగు... అసలు టాప్–10లో నిలువగలిగే ప్లేయరే కనిపించడం లేదు. కానీ... కాంపిటీటివ్ బెంచ్ (పోటీల్లో సత్తాచాటే బెంచ్)ను ముందుచూపుతో తయారు చేయడంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్లక్ష్యం కనబడుతోంది. కిం కర్తవ్యం? తదుపరి లాస్ ఎంజెలిస్ (2028) ఒలింపిక్స్ సైకిల్ మొదలైంది. తాజా పరిణామాలు, నిరాశాజనక ప్రదర్శనలు, వస్తోన్న ఫలితాలపై ‘బాయ్’ వెంటనే దృష్టి పెట్టాలి. అంటే విశ్వక్రీడలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. ఈ లోపు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ తదితర ఈవెంట్లెన్నో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ‘బాయ్’ గానీ, ‘సాయ్’గానీ ఇప్పుడే మేల్కొవాలి. ఒలింపిక్స్ మిషన్కు ఓ విజన్తో పని చేయాలి. బాగా ఆడే షట్లర్లు ఎందుకిలా అయ్యారో సమీక్షించాలి. వర్ధమాన షట్లర్లను గుర్తించి ఆర్థిక అండదండలు అందించాలి. కేంద్ర క్రీడా శాఖ ‘టాప్స్’లా ‘బాయ్’ కూడా సానుకూల దృక్పథంతో తమ ప్లేయర్లకు ఇంటా బయటా కోచింగ్కు, కోచ్లకు పెద్ద ఎత్తున వెచ్చించాలి. ఓ క్రమపద్ధతిలో లక్ష్యాలను పెట్టుకొని ఫలితాల కోసం కష్టపడితే పరిస్థితిలో మార్పు రావొచ్చు. -
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్బై
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది. ‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది. 2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. -
ఒంటి కాలితో సాధించింది
గూడూరు: ప్రతిభకు పేదరికం.. అంగవైక ల్యం అడ్డుకాదని నిరూపించింది ఓ యువతి. చిన్నప్పటి నుంచి ఆట, పాటలు, క్రీడలపై మ క్కువ పెంచుకొని రాణిస్తోంది. దివ్యాంగురా లైనా పారా త్రోబాల్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తె చ్చుకుంది. గతేడాది కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ క్రీడలో దేశం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గొల్లగూడెంకు చెందిన దయ్యాల కొమురయ్య, కొమురమ్మ కూతురు భాగ్య. ఒకే కాలుతో పుట్టి.. కొమురయ్య, కొమురమ్మలది పేద కుటుంబం. వారికి కొడుకు, కూతురు భాగ్య ఉన్నా రు. భాగ్య ఒంటికాలుతో పుట్టింది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. దీంతో డిగ్రీ పూర్త యిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎంఏ చేస్తోంది. ఫోకో ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపద గేయాలు, కర్రసాము, చెక్కభజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకుంది. బతుకమ్మ పాటలను సేకరించి పాడటం అలవాటుగా మార్చుకుంది.ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శనతో...ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలి టీస్ అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని 2022, డిసెంబర్ 3న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల ముందు నుంచి ఆటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. భాగ్య డ్యాన్స్ చేయగా ఫొటోలు పేపర్లో వచ్చాయి. ‘అప్పుడు నేను చదువుతున్న పొట్టిశ్రీరాము లు యూనివర్సిటీ వీసీ కిషన్రావు సర్ నన్ను పిలిపించి మాట్లాడారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి, పింఛన్తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నాననే విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే ఎవరితో మాట్లా డారో తెలియదు కానీ జర్మనీ నుంచి డ్యాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్ను తెప్పించి పెట్టించారు. ఆ తర్వాత ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేశాను’ అని భాగ్య వివరించింది. రాజరాజేశ్వరుడి ఆశీర్వాద బలంతో.. మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ రాజరాజేశ్వరుడి గుడిలో భాగ్య నాట్యం చేసింది. ఈక్రమంలో ఆమె నాట్యం చూసిన ఓ వ్యక్తి ఆమెకు దివ్యాంగులు ఆడే సిట్టింగ్ వాలీబాల్ గురించి తెలియజేశాడు. అయితే ఆ ఆటకు ఇక్కడ ఆదరణ లేదని, రాజస్తాన్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలో ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపాడు. దీంతో ఆమె ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆ ఆటలో శిక్షణ పొంది ఆ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని గెలిచింది. ఆ తర్వాత దేశం తరఫున థాయ్లాండ్లో జరిగే పోటీలో ఆడే అవకాశం వచ్చింది. కానీ 2019లో కరోనా కారణంగా పోటీలు రద్దయ్యాయి. అయితే ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పటికీ ఆమె క్రీడను వదిలిపెట్టలేదు. నేషనల్ పారా ఒలింపిక్ సంస్థ ఆధ్వర్యంలో 2024, సెప్టెంబర్ 1న హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జార్ఖండ్లో జరిగిన పారా త్రోబాల్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది. అనంతరం అదే సంవత్సరం డిసెంబర్ 2 నుంచి 5 వరకు కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో పాల్గొని దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది. ఈమేరకు తనకు కొందరు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారా త్రోబాల్, వాలీబాల్ క్రీడలను ప్రోత్సహించి, తనలాంటి దివ్యాంగులకు చేయూతనందించి, ముందుకు నడిపించాలని భాగ్య కోరుతోంది.ఎమ్మెల్యేలతో సీఎంను కలిసినా ఫలితం లేదుపారా త్రోబాల్ క్రీడలో దేశానికి బంగారు పతకం తీసుకొచ్చిన తన గురించి తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ నన్ను సీఎం రేవంత్రెడ్డిని కలిపించారు. నా గురించి చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. దేశానికి బంగారు పతకం తీసుకొచ్చినా, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. – భాగ్య, దివ్యాంగురాలు, క్రీడాకారిణి -
అంతర్జాతీయ స్కేటింగ్లో జెస్సీరాజ్ ప్రతిభ
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలేనికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాత్రపు జెస్సీరాజ్ ఇంటర్నేషనల్ స్కేటింగ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మార్చి 26 నుంచి 31 వరకు తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ఆల్రౌండ్ సత్తా చాటింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు, పెయిర్ స్కేటింగ్లో వెండి, ఇన్లైన్ ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను రెపరెపలాడించింది.సోమవారం తైవాన్లో జెస్సీరాజ్కు ఏషియన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ చేతులమీదుగా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా జెస్సీరాజ్ను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నరేశ్ వర్మ, ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇండియా చైర్మన్ ఎం.ప్రదీప్ అభినందించారు. -
Miami Open 2025: జొకోవిచ్కు చుక్కెదురు
ఫ్లోరిడా: కెరీర్లో 100వ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. 2019 తర్వాత పాల్గొన్న మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టెన్నిస్ టోర్నీలో జొకోవిచ్ రన్నరప్గా నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల జాకుబ్ మెన్సిక్ అసాధారణ ఆటతీరు కనబరిచి జొకోవిచ్కు షాక్ ఇచ్చాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మెన్సిక్ 7–6 (7/4), 7–6 (7/4)తో గతంలో ఆరుసార్లు మయామి ఓపెన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ను బోల్తా కొట్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెన్సిక్ 14 ఏస్లతో అదరగొట్టాడు. ఇద్దరూ తమ సర్వీస్లను ఒక్కోసారి కోల్పోగా... టైబ్రేక్లలో మెన్సిక్ పైచేయి సాధించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలిచిన మెన్సిక్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్కు 5,97,80 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో మెన్సిక్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఏకంగా 30 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం. -
Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు ఆదివారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు. -
శరత్ కమల్ శకం ముగిసె...
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తన ఆట ముగించాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీ పురుషుల సింగిల్స్లో పరాజయంతో అతను రిటైర్ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో సూరావజ్జుల స్నేహిత్ (తెలంగాణ) చేతిలో శరత్ కమల్ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు. శరత్ కమల్ చివరి మ్యాచ్ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్ విభాగంలో స్నేహిత్తోనే కలిసి శరత్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్ జాంగూన్ – ఆన్ జీహున్ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్ – స్నేహిత్ ఓడిపోయారు. 17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బరిలోకి దిగిన శరత్ కమల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన శరత్ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్లలో పాల్గొన్న శరత్ కమల్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్రత్న పురస్కారాలతో గౌరవించింది. -
గురీందర్వీర్ సింగ్ జాతీయ రికార్డు
బెంగళూరు: భారత యువ అథ్లెట్ గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్కు చెందిన 24 ఏళ్ల గురీందర్వీర్ సింగ్.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అతను10.20 సెకన్ల్లలో లక్ష్యాన్ని చేరాడు. గతంలో ఈ రికార్డు మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) పేరిట ఉండగా... తాజాగా గురీందర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.2021లో 10.27 సెకన్లలో వంద మీటర్లు పరిగెత్తిన ఈ పంజాబ్ స్ప్రింటర్... ఇప్పుడు దాన్ని సరిచేశాడు. ఇదే పోటీల్లో మణికంఠ 10.21 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. అమ్లన్ బొర్గోహై (10.43 సెకన్లు) మూడో స్థానంతో రేసును ముగించాడు. గురీందర్వీర్ సింగ్ 2021, 2024లో ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లలో పసిడి పతకాలు సాధించాడు.చెన్నై, మధురైలో జూనియర్ హాకీ వరల్డ్కప్ చెన్నై: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్నకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీని చెన్నై, మధురై నగరాల్లో నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం వెల్లడించింది. 24 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇది మూడోసారి. 2016లో లక్నో వేదికగా, 2021లో భువనేశ్వర్లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.‘చెన్నై, మధురై నగరాల్లో పోటీలు నిర్వహిస్తాం. వరల్డ్కప్లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. మధురైలో అంతర్జాతీయ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. భిన్నమైన నగరాలకు ఆటను విస్తరించాలనే ఉద్దేశంతోనే మధురైను వేదికగా ఎంపిక చేశాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. భారత్లో చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచకప్లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలవగా... 2023లో కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్కప్లో జర్మనీ చాంపియన్గా నిలిచింది. సెమీఫైనల్లో ఓడిన భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి స్వదేశంలో జరగనున్న టోర్నీలో అయినా యువభారత్ విజేతగా నిలుస్తుందా చూడాలి. అనాహత్కు టైటిల్ ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యువ క్రీడాకారణి అనాహత్ సింగ్ చాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–0 (11–9, 11–5, 11–8)తో హలెన్ టాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ విజయంతో అనాహత్ 300 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల అనాహత్కు ఇది వరుసగా ఆరో టైటిల్ కాగా... ఓవరాల్గా 11వది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ రన్నరప్గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అభయ్ సింగ్ 1–3 (10–12, 4–11, 11–7, 10–12)తో కరీమ్ (ఈజిప్ట్) చేతిలో ఓటమి పాలయ్యాడు.పుణేలో మహిళల చెస్ గ్రాండ్ ప్రి పుణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి ఐదో అంచె పోటీలకు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 13 నుంచి 24 వరకు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలు ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్ తదితరులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర చెస్ సంఘం నిర్వహించనున్న ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ జూ జినెర్, పొలినా షువలోవా (రష్యా), అలీనా కష్లిన్స్క్యా (పోలాండ్), సలిమోవా నుర్గుల్ (బల్గేరియా), బక్తుయాగ్ (మంగోలియా), మెలియా సలోమె (జార్జియా) పాల్గొననున్నారు. ఫిడే గ్రాండ్ ప్రి సిరీస్లో 14 మంది టాప్ ప్లేయర్లతో పాటు... ఆరుగురు ప్లేయర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొంటారు. గత సిరీస్ల ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. భారత్ యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోరీ్నలో పోటీపడనుంది. శరత్ కమల్ జోరు చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్... తన చివరి టోర్నీలో చక్కటి విజయాలతో దూసుకెళ్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్లో శరత్ కమల్ ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శరత్ 3–0 (11–8, 11–8, 11–9)తో పదో సీడ్ నికోలస్ లుమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 42 ఏళ్ల శరత్... తనకంటే 23 సంవత్సరాలు చిన్నవాడైన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.దేశం తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న శరత్ కమల్ బ్యాక్హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకొని వరుస గేమ్ల్లో విజయం సాధించాడు. శరత్తో పాటు పురుషుల విభాగంలో భారత్ నుంచి తెలంగాణ ప్యాడ్లర్ స్నేహిత్ సురావజ్జుల, మానవ్ ఠక్కర్ ప్రిక్వార్టర్స్కు చేరగా... మహిళల విభాగంలో కృతి్వక రాయ్ ముందంజ వేసింది. స్నేహిత్ 3–2 (8–11, 11–13, 11–9, 11–7, 12–10)తో యుకియా ఉడా (జపాన్)పై, మానవ్ 3–1 (11–4, 7–11, 11–5, 11–8)తో పిన్ లూ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. మహిళల విభాగంలో పదో సీడ్ తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–3 (6–11, 9–11, 11–6, 11–4, 7–11)తేడాతో కృత్వికరాయ్ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్–స్నేహిత్ జంట 1–3 (11–9, 8–11, 9–11, 6–11)తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. -
జొకోవిచ్ అరుదైన రికార్డు
ఫ్లోరిడా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మయామి ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. తద్వారా ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీ సెమీఫైనల్కు చేరిన పెద్ద వయసు్కడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉంది. 37 ఏళ్ల జొకోవిచ్ శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–6 (7/4)తో సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై విజయం సాధించాడు. 1 గంట 24 నిమిషాల పాటు సాగిన పోరులో నాలుగో సీడ్ జొకోవిచ్ 11 ఏస్లు కొట్టగా... కోర్డా ఏడు ఏస్లకు పరిమితమయ్యాడు. సెర్బియా వీరుడు రెండు బ్రేక్ పాయింట్లు కాచుకోవడంతో పాటు ఒక దశలో వరుసగా 12 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చాడు. ఇప్పటికే ఆరుసార్లు మయామి ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్న జొకోవిచ్ ఏడోసారి చాంపియన్గా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియా ఓపెన్ మధ్యలో గాయం కారణంగా తప్పుకున్న జొకోవిచ్... ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ తొలి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. గ్రాండ్స్లామ్ చాంపియన్ పీటర్ కొర్డా కుమారుడైన సెబాస్టియన్ కొర్డా... రెండో సెట్ ఆరంభంలో 4–1తో ఆధిక్యంలో నిలిచినా... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 6–2, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలుపొందింది. తద్వారా తొలిసారి మయామి ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. -
మనీషాకు స్వర్ణం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ మనీషా భన్వాల్ పసిడి పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో శుక్రవారం మనీషా 8–7 పాయింట్ల తేడాతో ఓక్ జే కిమ్ (కొరియా)పై విజయం సాధించింది. ఒక దశలో 2–7తో వెనుకంజలో నిలిచిన మనీషా... ఆఖరి నిమిషంలో అసమాన పోరాటంతో వరుసగా 6 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు గెలిచిన మనీషాకు ఇదే తొలి స్వర్ణం కాగా... సెమీఫైనల్లో మనీషా 5–1తో బిలిమ్బెక్ కైజీపై విజయం సాధించింది. అంతకుముందు టైనిస్ డుబెక్ (కజకిస్తాన్), హన్బిట్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయాలతో మనీషా సెమీస్కు చేరింది. 2021 ఆసియా చాంపియన్షిప్ తర్వాత ఈ పోటీల్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకం. ఆ పోటీల్లో భారత్ తరఫున వినేశ్ ఫొగాట్, సరితా మోర్ భారత్ తరఫున స్వర్ణాలు గెలిచారు. మరోవైపు యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్కు చెందిన మోయో కియోకా చేతిలో ఓడిన అంతిమ్... కాస్య పతక పోరులో సత్తాచాటింది. నేహ శర్మ (57 కేజీలు), మోనిక (65 కేజీలు), జ్యోతి బెరివాల్ (72 కేజీలు) మెడల్ రౌండ్స్కు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
వారెవ్వా ఇయాలా
క్రీడాభిమానులకు ఫిలిప్పీన్స్ దేశం గుర్తుకు రాగానే ముందుగా వారి మదిలో మెదిలేది దిగ్గజ బాక్సర్ మ్యానీ పకియావ్ పేరు. రానున్న రోజుల్లో ఈ స్టార్ బాక్సర్ సరసన అభిమానులు మరో పేరు కూడా ప్రస్తావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన టెన్నిస్ క్రీడలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన ఆ యువతార ఎవరో కాదు 19 ఏళ్ల అలెగ్జాండ్రా ఇయాలా... స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఫిలిప్పీన్స్ టీనేజర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఇయాలా సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించడం విశేషం. జెస్సికా పెగూలాతో జరిగే సెమీఫైనల్లో ఇయాలా విజయం సాధిస్తే... నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ఫ్లోరిడా: అనామకురాలిగా బరిలోకి దిగి రౌండ్ రౌండ్కూ సంచలన విజయాలు సాధిస్తున్న ఫిలిప్పీన్స్ టీనేజర్ అలెగ్జాండ్రా ఇయాలా...మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 140వ ర్యాంకర్ ఇయాలా 6–2, 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ను బోల్తా కొట్టించింది. 1 గంట 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇయాలా ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. 19 ఏళ్ల ఇయాలా గత ఏడేళ్లుగా స్పెయిన్లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టిన ఇయాలా రెండో రౌండ్లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై 7–6 (7/2), 7–5తో గెలుపొందగా... మూడో రౌండ్లో 6–4, 6–2తో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను కంగుతినిపించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇయాలాకు పదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) నుంచి ‘వాకోవర్’ లభించింది. ‘నమ్మశక్యంగా లేదు. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం’ అని ఇయాలా వ్యాఖ్యానించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)తో ఆడనున్న ఇయాలా విజయం సాధిస్తే... మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్)తో పావోలిని (ఇటలీ) తలపడుతుంది. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
ఫ్లోరిడా: కెరీర్లో ఆడిన రెండో ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలోనూ భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ ఆకట్టుకున్నాడు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన యూకీ... అదే జోరును కొనసాగిస్తూ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అతను అధిగమించలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–నూనో బోర్జెస్ (పోర్చుగల్) ద్వయం 6–7 (1/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–బోర్జెస్ నాలుగు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా రెండో సెట్లో ప్రత్యర్థి జంట సర్వీస్ను ఒక్కసారి బ్రేక్ చేశారు. మరోవైపు గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో కీలకదశలో పాయింట్లు నెగ్గి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–బోర్జెస్ జోడీకి 65,000 డాలర్ల (రూ. 55 లక్షల 73 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో 33 ఏళ్ల యూకీ బాంబ్రీ వచ్చే సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 26వ ర్యాంక్కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా 2019 నుంచి భారత నంబర్వన్గా కొనసాగుతున్న రోహన్ బోపన్నను దాటేసి యూకీ అధికారికంగా భారత డబుల్స్ కొత్త నంబర్వన్గా అవతరించనున్నాడు. -
గ్రూప్ ‘బి’లో భారత్కు చోటు
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదలైంది. భారత జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో గురువారం ‘డ్రా’ కార్యక్రమం జరిగింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు జూన్ 23 నుంచి జూలై 5 వరకు థాయ్లాండ్ ఆతిథ్యమిస్తుంది. భారత్తోపాటు థాయ్లాండ్, మంగోలియా, తిమోర్లెస్తె, ఇరాక్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. గ్రూప్ విజేత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్కు అర్హత సాధిస్తుంది. మొత్తం 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’... గ్రూప్ ‘బి’లలో ఐదు జట్ల చొప్పున ఉన్నాయి. మిగతా ఆరు గ్రూపుల్లో నాలుగు జట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు 2022 ఆసియాకప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన చైనా, కొరియా, జపాన్ జట్లు ఇప్పటికే ఆసియా కప్–2026 టోర్నీకి నేరుగా అర్హత పొందాయి. -
రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. స్థలమా?.. ఏది కావాలి?
ప్యారిస్ ఒలింపిక్స్-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్ ఫొగట్ తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్కు చేరిన వినేశ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలుఆ తర్వాత స్పోర్ట్స్ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్ ఫొగట్ పిటిషన్ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్ భారతావనికి నిరాశే మిగిలింది.అయితే, ఫైనల్ వరకు వినేశ్ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్ చేశారు.కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశంఅంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.హామీ మరిచారా?‘‘వినేశ్ ఫొగట్ మా కూతురు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్ ఫొగట్ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వినేశ్ ఫొగట్ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్ ఫొగట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.ఈ మూడింటిలో ఏది కావాలి?అందుకే కేబినెట్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికారణ్ పథకం కింద ప్లాట్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్ వినేశ్ ఫొగట్కు ఆఫర్ ఇచ్చింది. అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్ ఫొగట్.. తన భర్త, రెజ్లర్ సోమ్వీర్ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’ -
తొలిసారి పసిడి మెరుపులు
పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్కప్లో పురుషుల రెగూ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్తక్రా ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలి సెట్లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్కప్లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్తక్రా ప్రపంచకప్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్కు ముందే అర్జెంటీనాకు వరల్డ్కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్కప్లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఓవరాల్గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్కప్కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం
న్యూఢిల్లీ: ఫుట్బాల్ ‘ఆల్టైమ్ గ్రేట్’లలో ఒకడైన లయోనల్ మెస్సీ ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం భారత అభిమానులకు కలగనుంది. 14 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ భారత్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరులో కేరళలోని కొచి్చలో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై చాలా కాలం క్రితమే కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రహమాన్ ప్రకటన చేసినా... ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ప్రముఖ బ్యాంక్ ‘హెచ్ఎస్బీసీ’ ఈ పర్యటనలో అర్జెంటీనా టీమ్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. భారత్లో పుట్బాల్ను ప్రమోట్ చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అర్జెంటీనా రాకను హెచ్ఎస్బీసీ హెడ్ సందీప్ బత్రా ఖరారు చేశారు. 2025లో భారత్తో పాటు సింగపూర్లో కూడా మ్యాచ్లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం ‘హెచ్ఎస్బీసీ’తో ఒప్పందం చేసుకుంది. 2011లో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ మొదటిసారి భారత్కు వచ్చాడు. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్లో వెనిజులాతో తలపడిన అర్జెంటీనా 1–0తో విజయం సాధించింది. -
బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
షిల్లాంగ్: ఆసియా కప్–2027 క్వాలిఫయింగ్ టోర్నమెంట్ మూడో రౌండ్ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్ను భారత్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. 68వ నిమిషంలో శుభాశీష్ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి బంగ్లాదేశ్ గోల్పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లు బయటకు వెళ్లాయి. గ్రూప్ ‘సి’లో భారత్తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ జట్లున్నాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న సింగపూర్తో ఆడుతుంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
‘‘నాకు విడాకులు మాత్రమే కావాలి.. అతడి నుంచి ఒక్క పైసా కూడా అవసరం లేదు’’ అంటూ భారత బాక్సర్, ప్రపంచ చాంపియన్ స్వీటీ బూరా (Saweety Boora) తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్త దీపక్ హుడా (Deepak Hooda)తో వీలైనంత త్వరగా వైవాహిక బంధం తెంచుకోవాలని మాత్రమే భావిస్తున్నట్లు తెలిపింది. కాగా స్వీటీతో పాటు దీపక్ కూడా దేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు.అంతేకాదు.. 2019- 2022 వరకు భారత కబడ్డీ జట్టు కెప్టెన్గానూ ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్లోనూ తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. స్వీటీ బూరా 81 కిలోల విభాగంలో 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించింది.అదనపు కట్నం కోసం ఇక దీపక్తో పాటు స్వీటీ కూడా అర్జున అవార్డు గ్రహీత కావడం విశేషం. హర్యానాకు చెందిన ఈ క్రీడా జంట 2022లో వివాహం చేసుకున్నారు. అయితే, భర్తతో పాటు అత్తింటి వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వీటీ బూరా ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కోరినట్లుగా గతంలోనే విలాసవంతమైన కారు ఇచ్చినా.. ఇంకా డబ్బు కావాలంటూ తనను హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ఫిబ్రవరి 25న దీపక్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చినా దీపక్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని హిస్సార్ పోలీసులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో తన భర్తలో మార్పు రావడం కష్టమని భావించిన స్వీటీ బూరా విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల పోలీస్ స్టేషన్లో స్వీటీ- దీపక్లు తమ మద్దతుదారులతో కలిసి సెటిల్మెంట్ కోసం రాగా.. కోపోద్రిక్తురాలైన స్వీటీ భర్తపై దాడి చేసింది. పోలీస్ స్టేషన్లోనే అతడిపై పిడిగుద్దులు కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్వీటీ సహనం నశించినందు వల్లే ఇలా చేసిందని కొంతమంది మద్దతునివ్వగా.. భరణం కోసం డిమాండ్ చేస్తోందంటూ మరికొంత మంది ఆరోపించారు. అయితే, స్వీటీ మాత్రం వీటిని కొట్టిపారేసింది. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు విడాకులు కావాలి. అతడి నుంచి ఎలాంటి భరణం అక్కర్లేదు.నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దునా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారం లభించాలని మాత్రమే కోరుకుంటున్నా. హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తడమే నేను చేసిన తప్పు అనుకుంటా.విడాకుల కోసం నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించా. ఆ వ్యక్తి విడాకులు వద్దంటూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆ దెయ్యం డబ్బులు నాకెందుకు? నేనేమీ బికారిని కాదు. నాకు న్యాయం మాత్రమే కావాలి. ఇంకేమీ వద్దు’’ అంటూ స్వీటీ బూరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చదవండి: చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..? -
న్యూజిలాండ్ మళ్లీ సాధించింది.. ఇది మూడోసారి
ఆక్లాండ్: మరో అవకాశం కోసం వేచి చూడకుండా... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... న్యూజిలాండ్ పురుషుల ఫుట్బాల్ జట్టు దర్జాగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్కుఅర్హత సాధించింది. పది దేశాలు పోటీపడ్డ ఓసియానియా జోన్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీ (FIFA 2026 World Cup)కి అర్హత పొందిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సోమవారం జరిగిన ఓసియానియా జోన్ ఫైనల్లో న్యూజిలాండ్ 3–0 గోల్స్ తేడాతో న్యూ కాలడోనియా జట్టుపై గెలిచింది.న్యూజిలాండ్ తరఫున మైకేల్ జోసెఫ్ బాక్సల్ (61వ నిమిషంలో), బార్సరూసెస్ (66వ నిమిషంలో), హెన్రీ జస్ట్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఫైనల్లో ఓడిపోయిన న్యూ కాలడోనియా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకునే మరో అవకాశం మిగిలి ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణా అమెరికా జోన్లకు చెందిన ఆరు జట్లు పోటీపడే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీలో విజేతగా నిలిస్తే న్యూ కాలడోనియా జట్టు కూడా ప్రపంచకప్కు అర్హత పొందుతుంది. 2026లో ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రపంచకప్కు అర్హత పొందగా... జపాన్, న్యూజిలాండ్ ఈ మూడు జట్లతో చేరాయి. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ పోటీపడనుండటం ఇది మూడోసారి. తొలిసారి 1982లో వరల్డ్కప్లో ఆడిన న్యూజిలాండ్ రెండోసారి 2010 ప్రపంచకప్లో పోటీపడింది. ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు న్యూజిలాండ్ అర్హత సాధించడంలో విఫలమైంది. సెమీస్లో పోర్చుగల్ లిస్బన్: నేషన్స్ లీగ్ టోర్నమెంట్లో పోర్చుగల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్తో జరిగిన రెండో అంచె క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 5–2 గోల్స్ తేడాతో గెలిచింది. తొలి అంచె క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో ఒక గోల్ తేడాతో ఓడిన పోర్చుగల్ ఈ మ్యాచ్లో స్పష్టమైన విజయాన్ని అందుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి పోర్చుగల్ 3–2తో గెలిచింది. అయితే గోల్స్ సగటు 3–3తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు అదనపు సమయం ఆడించారు. అదనపు సమయంలో పోర్చుగల్ మరో రెండు గోల్స్ సాధించింది. -
సరైన సమయంలో రిటైర్మెంట్.. గర్వంగా ఉంది!
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద పరీక్షలాంటిదే. క్రీడాకారుడిగా కెరీర్ బాగా సాగుతున్న దశలోనే ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలంటే తెగువ అవసరం. ఆశించిన విజయాలు లభించకపోయినా... ఆటగాడిగా కొనసాగుతూ... ఇతరుల అవకాశాలను ప్రభావితం చేసే బదులు... వర్ధమాన క్రీడాకారులు తమ కెరీర్లో మరింత ఎదిగేందుకు మార్గదర్శిగా మారడం విజ్ఞుల లక్షణం. ఆ కోవలోకే తాను వస్తానని తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బసి సుమీత్ రెడ్డి చాటుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మిక్స్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్లో 25వ ర్యాంక్లో ఉన్న సుమీత్ రెడ్డి క్రీడాకారుడిగా తన ఇన్నింగ్స్ ముగిసిందని సోమవారం ప్రకటించాడు. కోచ్ రూపంలో ఇప్పటికే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టానని... భవిష్యత్లో భారత్కు మెరికల్లాంటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా కోచ్గా స్థిరపడతానని సుమీత్ స్పష్టం చేశాడు. సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్లో ఉన్న అన్ని ప్రముఖ టోర్నమెంట్లలో... నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. తెలంగాణకు చెందిన 33 ఏళ్ల బుసి సుమీత్ రెడ్డి తన కెరీర్లో ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. ఇక తన కెరీర్లో మళ్లీ ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం లేదని భావించిన సుమీత్ ఆటకు వీడ్కోలు పలకడమే ఉత్తమం అని ఆలోచించాడు. తన ఆలోచనను నిజం చేస్తూ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా రిటైర్ అవుతున్నట్లు సోమవారం ఇన్స్ట్రాగామ్ వేదికగా ప్రకటించాడు.ఇక మీదట తన దృష్టంతా కోచింగ్పైనే ఉంటుందని ఈ సందర్భంగా సుమీత్ రెడ్డి స్పష్టం చేశాడు. ‘రిటైరయ్యాను. గర్వంగా ఉన్నాను. కెరీర్లోని తర్వాతి అధ్యాయం కోసం ఉత్సుకతతో ఉన్నాను. నేనీ స్థాయికి చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సుమీత్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ‘నా పరిమితికి మించి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాను. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నప్పటికీ నా కెరీర్లో ఉన్నత దశ దాటిపోయానని భావిస్తున్నాను. ఇతరత్రా కారణాలతోనూ నా ప్రొఫెషనల్ కెరీర్ నుంచి వైదొలుగుతున్నాను. ఇక ఆటను ఆపేయాలనే సంకేతాలు మన మదిలో మెదిలినపుడు ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. వెన్నునొప్పి కారణంగా ఒకదశలో వైద్యులు బ్యాడ్మింటన్ను వదిలేయాలని సూచించారు. కానీ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచి్చన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన సలహాలతో డబుల్స్ వైపు అడుగులు వేసి కెరీర్ను తీర్చిదిద్దుకున్నాను’ అని సుమీత్ వ్యాఖ్యానించాడు. నాన్న ప్రోద్భలంతో... అథ్లెటిక్స్ నేపథ్యమున్న తన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో 2001లో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన సుమీత్ 2007లో ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత జూనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐదేళ్ల తర్వాత 2012లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి పుష్కరకాలం పాటు జాతీయ జట్టులో సభ్యుడిగా కొనసాగాడు.భార్య సిక్కి రెడ్డికి జోడీగామనూ అత్రితో కలిసి సుమీత్ రెడ్డి 2015లో పురుషుల డబుల్స్లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్ను అందుకోగా... భార్య సిక్కి రెడ్డితో కలిసి సుమీత్ 2025 మార్చిలో మిక్స్డ్ డబుల్స్లో కెరీర్ బెస్ట్ 25వ ర్యాంక్లో నిలిచాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుమీత్ రెడ్డి 2016 రియో ఒలింపిక్స్లో మనూ అత్రికి కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో పోటీపడ్డాడు. ఒక విజయం, రెండు పరాజయాలు నమోదు చేసుకొని సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం రియో ఒలింపిక్స్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 12 అంతర్జాతీయ టైటిల్స్... 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గిన భారత జట్టులో సుమీత్ సభ్యుడిగా ఉన్నాడు. 2016లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన టీమిండియాలోనూ సుమీత్ సభ్యుడిగా నిలిచాడు. 2016లో గువాహటిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, 2019లో కఠ్మాండూలో జరిగిన దక్షిణాసియా ఆసియా క్రీడల్లో సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్, పురుషుల టీమ్ ఈవెంట్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు.ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో సుమీత్ రెడ్డి ఓవరాల్గా 12 టైటిల్స్ సాధించాడు. ఇందులో గ్రాండ్ప్రి స్థాయికి చెందిన రెండు పురుషుల డబుల్స్ టైటిల్స్ (2015లో మనూ అత్రితో కలిసి మెక్సికో సిటీ గ్రాండ్ప్రి; 2016లో మనూ అత్రితో కలిసి కెనడా ఓపెన్) ఉన్నాయి. అంతర్జాతీయ చాలెంజ్, అంతర్జాతీయ సిరీస్ కేటగిరీల్లో కలిపి సుమీత్ 10 టైటిల్స్ గెలిచాడు. 2021లో భార్య సిక్కి రెడ్డితో కలిసి హైదరాబాద్లో సిక్కీ సుమీత్ బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి ఒకవైపు కెరీర్ను కొనసాగిస్తూనే చిన్నారులకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం జాతీయ డబుల్స్ కోచ్ల ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న సుమీత్ భవిష్యత్లో భారత జట్టు బ్యాడ్మింటన్ పవర్హౌస్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ ప్రేమాయణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వనెస్సా ట్రంప్తో దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వనెస్సాతో రిలేషిప్ విషయాన్ని వుడ్స్ సోషల్మీడియా వేదికగా ప్రకటించాడు. వనెస్సాతో బంధాన్ని వెల్లడిస్తూ వుడ్స్ తన సోషల్మీడియా ఖాతాల్లో ఇలా రాసుకొచ్చాడు. నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది. నువ్వు నా పక్కన ఉంటే జీవితం అద్భుతంగా ఉంది. కలిసి జీవితంలో ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు ధన్యవాదాలు. మా హృదయాలకు దగ్గరిగా ఉన్న వారి గోప్యత కొరకు కూడా అభ్యర్దిస్తున్నామంటూ వెనెస్సాతో సన్నిహితంగా ఉన్న దృష్యాలను షేర్ చేశాడు. Love is in the air and life is better with you by my side! We look forward to our journey through life together. At this time we would appreciate privacy for all those close to our hearts. pic.twitter.com/ETONf1pUmI— Tiger Woods (@TigerWoods) March 23, 2025వుడ్స్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుకునే వుడ్స్ పబ్లిక్గా వెనెస్సాతో బంధాన్ని అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. వెనెస్సా ట్రంప్ ఎవరు..?వెనెస్సా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య. వీరిద్దరు 12 ఏళ్లు వివాహ బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత విడిపోయారు. వీరికి ఐదుగురు సంతానం.వెనెస్సా కూమార్తెలలో ఒకరైన కాయ్, వుడ్స్ ఇద్దరు సంతానం సామ్, ఛార్లీ ఒకే స్కూల్లో (ద బెంజమిన్ స్కూల్) చదువుకుంటున్నారు. కాయ్, ఛార్లీ ఇటీవల ఓ జూనియర్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు.సామ్, ఛార్లీ.. వుడ్స్ అతని మాజీ భార్య ఎలిన్ నార్డెగ్రెన్కు కలిగిన సంతానం. వుడ్ ఎలిన్తో 2010లో విడిపోయాడు. వెనెస్సాకు ముందు వుడ్స్ ఎరికా హెర్మన్తో కొద్దికాలం సహజీవనం చేశాడు. వీరిద్దరి బంధం 2022లో ముగిసింది. 49 ఏళ్ల వుడ్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ మాస్టర్స్ టోర్నీతో పాటు మిగిలిన గోల్ఫ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 1996లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన వుడ్స్ తన కెరీర్లో 15 మేజర్ ఛాంపియన్షిప్స్ను సొంతం చేసుకున్నాడు. 1997 నుంచి వరుసగా 683 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్గా చలామణి అయిన ఈ అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం 82 సార్లు పీజీఏ టూర్ విజయాలు, 41 సార్లు యూరోపియన్ టూర్లో విజయాలు సాధించాడు. 2021లో వుడ్స్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. -
సూపర్ పియాస్ట్రి
షాంఘై: గత ఏడాది ఫార్ములావన్ సీజన్ ఆరంభంలో రెడ్బుల్ జట్టు అదరగొట్టగా... ఈసారి మెక్లారెన్ జట్టు మెరిపిస్తోంది. ఈ సీజన్లోని తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ విజేతగా నిలువగా... రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో మెక్లారెన్కే చెందిన రెండో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన 23 ఏళ్ల పియాస్ట్రి రేసు ముగిసే వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. నిర్ణీత 56 ల్యాప్ల రేసును ఆ్రస్టేలియా జాతీయుడైన పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 30 నిమిషాల 55.026 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించాడు. 2023లో మెక్లారెన్ జట్టు తరఫునే ఫార్ములావన్లో అరంగేట్రం చేసిన పియాస్ట్రి వరుసగా మూడో ఏడాది అదే జట్టుతో ఉన్నాడు. గత ఏడాది హంగేరి గ్రాండ్ప్రి, అజర్బైజాన్ గ్రాండ్ప్రిలలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న పియాస్ట్రి తాజా గెలుపుతో తన కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు.మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. నోరిస్ 1 గంట 31 నిమిషాల 04.774 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఫార్ములావన్ రేసులో ఓవరాల్గా 1–2 స్థానాలు మెక్లారెన్ డ్రైవర్లే సొంతం చేసుకోవడం ఇది 50వ సారి కావడం విశేషం. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానంలో నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ ముగ్గురిపై వేటు ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్, లూయిస్ హామిల్టన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా... పియరీ గ్యాస్లీ (ఆలై్పన్) 11వ స్థానంలో నిలిచారు. అయితే సాంకేతిక కారణాలరీత్యా రేసు ముగిశాక ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. లెక్లెర్క్ 10 పాయింట్లను, హామిల్టన్ 8 పాయింట్లను చేజార్చుకున్నారు. 11వ స్థానంలో నిలిచినందుకు గ్యాస్లీకి ఎలాంటి పాయింట్లు లభించలేదు. ఫార్ములావన్ నిబంధనల ప్రకారం రేసు ముగిసిన తర్వాత డ్రైవర్ల కారు కనిష్ట బరువు 800 కేజీలు ఉండాలి. అయితే లెక్లెర్క్, హామిల్టన్, గ్యాస్లీల కార్ల బరువు 799 కేజీలు చూపించింది. దాంతో ఈ ముగ్గురిపై రేసు నిర్వాహకులు వేటు వేసి వారి ఫలితాలను రద్దు చేశారు. సీజన్లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 6న సుజుకా సర్క్యూట్లో జరుగుతుంది. సీజన్లోని తొలి రెండు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్షిప్లో లాండో నోరిస్ 44 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో, 35 పాయింట్లతో జార్జి రసెల్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెక్లారెన్ 78 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టును గట్టెక్కించిన కాస్టనెడా
పనాజీ: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్ బ్రదర్స్ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో స్టాపేజ్ టైమ్లో గోల్ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్ బ్రదర్స్ జట్టుతో స్టాపేజ్ టైమ్లో (90+11వ నిమిషంలో) గోల్ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్లో ‘డ్రా’తో గట్టెక్కింది. స్టాపేజ్ టైమ్లో లభించిన పెనాల్టీ కిక్ను శ్రీనిధి డెక్కన్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ కాస్టనెడా గోల్గా మలిచాడు. ఈ లీగ్లో ‘టాప్ గోల్స్కోరర్’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్తో చర్చిల్ బ్రదర్స్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 20 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 7 మ్యాచ్ల్లో ఓడి, 6 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
పియాస్ట్రికి పోల్ పొజిషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్ రెండో రేసు చైనీస్ గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) పోల్ పోజిషన్ సాధించాడు. ఫార్ములావన్ కెరీర్లో అతడికి ఇదే తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. 23 ఏళ్ల ఆసీస్ రేసర్ శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా... 1 నిమిషం 30.641 సెకన్లలో ల్యాప్ పూర్తిచేశాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును పియాస్ట్రి తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. మెర్సెడెస్ డ్రైవర్ రసెల్ (1 నిమిషం 30.723 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. గత వారం ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) చైనీస్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఐదో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్లతో కూడిన రేసులో మెక్లారెన్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 30. 793 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన నోరిస్ ఈ రోజు జరగనున్న రేసును మూడో స్థానంతో ప్రారంభించనున్నాడు. మాజీ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 30.817 సెకన్లు) నాలుగో ‘ప్లేస్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. -
మరో విజయం సాధిస్తే...
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది. ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. -
‘నా ఆలోచనలను త్వరలోనే పంచుకుంటా’
కోస్టా నవారినో (గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా ఎంపికైన కిర్స్టీ కొవెంట్రీ భవిష్యత్తు ఒలింపిక్ ఆతిథ్య దేశాల అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. 2036లో భారత్లో విశ్వక్రీడలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొవెంట్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్లో ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల అంశంలో తన ఆలోచనలను త్వరలోనే వెల్లడిస్తానని కొవెంట్రీ పేర్కొంది. ‘ఈ ప్రక్రియ సుదీర్ఘ కాలం సాగుతుంది. భవిష్యత్తు ఆతిథ్య దేశం ఎంపికలో సభ్యులందరి పాత్ర ఉంటుంది. దీనిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని త్వరలోనే ఐఓసీ సభ్యులతో పంచుకుంటాను’ అని కొవెంట్రీ పేర్కంది. గురవారం జరిగిన ఐఓసీ ఎన్నికల్లో కొవెంట్రీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. జూన్ 23తో ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ పదవీ కాలం ముగిసిన అనంతరం కొవెంట్రీ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ ప్రస్తుతం ఆ దేశ క్రీడా శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తోంది. 2033 వరకు కొవెంట్రీ ఐఓసీ అధ్యక్షురాలిగా కొనసాగనుంది. ఆమె అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖాయం కానుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పదికి పైగా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో భారత్తో పాటు ఖతర్, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ సమర్పించడంతో... భారత్ తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఐఓసీ పూర్తి అధ్యయనం చేయనుంది. 2036 ఒలింపిక్స్కు సంబంధించిన ఆతిథ్య హక్కుల అంశంలో 2026లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సన్నాహాలపై త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతానని... ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడే 2017లో లాస్ ఏంజెలిస్కు ఆతిథ్య హక్కులు దక్కాయని కొవెంట్రీ తెలిపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ టి20 ఫార్మాట్ రూపంలో మళ్లీ విశ్వ క్రీడల్లో భాగం కానుంది. ఈ నేపథ్యంలో గ్రీస్లో జరిగిన ఐఓసీ సెషన్లో కిర్స్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. -
శంకర్ సంచలనం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువతార శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై శంకర్ అద్భుత విజయం సాధించాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల శంకర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 21–12, 21–5తో ఆంటోన్సెన్ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2022 ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన శంకర్ 66 నిమిషాల పోరులో ఆంటోన్సెన్ ఆట కట్టించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో రెండుసార్లు రజతం, ఒకసారి కాంస్య పతకం నెగ్గిన ఆంటోన్సెన్ తొలి గేమ్ గెలిచినప్పటికీ... ఆ తర్వాత ప్రపంచ 68వ ర్యాంకర్ శంకర్ ధాటికి చేతులెత్తేశాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో శంకర్ తలపడతాడు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–18, 21–14తో పుయ్ లామ్ యెంగ్–ఎన్గా టింగ్ యెయుంగ్ (హాంకాంగ్) జంటపై విజయం సాధించింది. -
BFI: హైకోర్టు అనుమతి.. అనురాగ్ ఠాకూర్కు లైన్ క్లియర్
సిమ్లా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ పడేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఠాకూర్ నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.బీఎఫ్ఐ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ సంఘం ప్రతినిధిగా పోటీ పడేందుకు ఠాకూర్ సిద్ధం కాగా... బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.ఆయా రాష్ట్ర సంఘాల్లో ఎన్నికల ద్వారా గెలిచి ఆఫీస్ బేరర్లుగా కొనసాగుతున్న వారికే ఇక్కడా పోటీ పడే అవకాశం ఉంటుందని... ఈ కారణంగా ఠాకూర్ అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 7న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ కోర్టుకెక్కారు. 2008 నుంచి వేర్వేరు హోదాల్లో తాను రాష్ట్ర సంఘంలో పని చేశానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాల అనంతరం... బీఎఫ్ఐ ఉత్తర్వులకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదని, ఠాకూర్ను ఎన్నికలకు అనుమతించాలంటూ హిమాచల్ హైకోర్టు స్పష్టం చేసింది.భారత్ ఖాతాలోనే ‘ఇండియన్ టూర్’ స్క్వాష్ టైటిల్ ఫైనల్లో అనాహత్తో ఆకాంక్ష ‘ఢీ’ చెన్నై: స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్ఎఫ్ఐ) ఇండియన్ టూర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ భారత్కు ఖరారైంది. భారత్కే చెందిన అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే ఫైనల్కు చేరుకోవడంతో ఇది సాధ్యం కానుంది. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో అనాహత్ 11–6, 11–3, 11–4తో హీలీ వార్డ్ (దక్షిణాఫ్రికా)పై, టాప్ సీడ్ ఆకాంక్ష 11–5, 11–7, 11–7తో భారత్కే చెందిన స్టార్ జోష్నా చినప్పపై విజయం సాధించారు. ఫైనల్ శుక్రవారం జరుగుతుంది.క్వార్టర్ ఫైనల్స్లో ఆకాంక్ష 11–8, 10–12, 4–11, 11–8, 11–9తో నాదియా ఎల్హమి (ఈజిప్ట్)పై, అనాహత్ 11–3, 11–3, 7–11, 11–1తో క్రిస్టినా గోమెజ్ (స్పెయిన్)పై, జోష్నా చినప్ప 11–7, 11–5, 11–4తో సోఫియా మటియోస్ (స్పెయిన్)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కే చెందిన వీర్ చోత్రాని, మెల్విల్ సియానిమనికో (ఫ్రాన్స్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్లో వీర్ 11–5, 11–7, 12–10తో రవిందు లక్సిరి (శ్రీలంక)పై, మెల్విల్11–7, 11–2, 11–7తో డీగో గొబ్బి (బ్రెజిల్)పై విజయం సాధించారు. -
CWG 2030: భారత్ సిద్ధం! నిర్వహణ కోసం బిడ్ దాఖలు
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత భారత్లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games 2030) నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్లో నగరం పేరును కూడా పేర్కొన్నారు. భారత్కు ఈ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కితే వాటికి అహ్మదాబాద్ వేదిక అవుతుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ ప్రక్రియను పూర్తి చేసిందని కేంద్ర క్రీడా శాఖలోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.‘అవును, మనం 2023 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం పోటీ పడుతున్నాం. భారత్ తరఫున ఐఓఏ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బిడ్ను సమర్పించాయి’ అని ఆయన చెప్పారు. నిర్వహణా కమిటీ ‘కామన్వెల్త్ స్పోర్ట్’ ఈ బిడ్ను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ కోసం పరిగణలోకి తీసుకుంటుంది. 2010లో భారత్లో కామన్వెల్త్ క్రీడలకు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం 2036 ఒలింపిక్స్ను కూడా మన దేశంలో నిర్వహించాలనే యోచన ఉంది. ఇందు కోసం కూడా ప్రాధమికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి ముందు సన్నాహకంగా ఈ కామన్వెల్త్ క్రీడల నిర్వహణతో తమ స్థాయిని ప్రదర్శించాలని భారత్ భావిస్తోంది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యంఆరేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు అహ్మదాబాద్లోని నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల నుంచి మేటి స్విమ్మర్లు ఈ మెగా ఈవెంట్కు వచ్చే అవకాశముంది.‘గుజరాత్ ప్రభుత్వం, ఆసియా అక్వాటిక్స్ నుంచి ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు ఆమోదం లభించింది. వచ్చే నెలలో ఎంఓయూ కూడా జరుగుతుంది’ అని భారత స్విమ్మింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ మోనల్ చోక్సి తెలిపారు. చివరిసారి భారత్ 2019లో ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో స్విమ్మింగ్, డైవింగ్, ఆరి్టస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో ఈవెంట్స్ను నిర్వహిస్తారు. -
గాయత్రి–ట్రెసా జోడీ జోరు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–12, 21–8తో అమెలీ లెహ్మన్–సెలీన్ హుబ్‡్ష (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత ద్వయం ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్లోనైతే ఒకదశలో గాయత్రి–ట్రెసా వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించారు. పురుషుల సింగిల్స్లో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 15–21, 11–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో... ప్రియాన్షు 15–21, 17–21తో టోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఇషారాణి బారువా 19–21, 21–18, 18–21తో జియాన్ జి హాన్ (చైనా) చేతిలో, అనుపమ 17–21, 19–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది. ఏడు ఒలింపిక్ పతకాలు... ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది. ఏథెన్స్ ఒలింపిక్స్లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది. -
లవ్లీనా సహా అసోం బాక్సర్లను ఆడన్విట్లేదు: బీఎఫ్ఐ అధ్యక్షుడు
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్... సస్పెన్షన్కు గురైన మాజీ కార్యదర్శి హేమంత కలితాపై కొత్త ఆరోపణలు చేశారు. అసోంకు చెందిన హేమంత తమ రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బాక్సర్లను జాతీయ మహిళా చాంపియన్షిప్లో ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బొర్గొహైన్తో పాటు ఇతర బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన ఆదేశించారంటూ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్ గురువారం ప్రారంభం కానుంది. ‘ఇందులో ఆడేందుకు లవ్లీనా సిద్ధమైంది. అయితే వారు పాల్గొనకుండా చూడాలని హేమంత అధికారులకు ఫోన్లు చేశారు.ఎన్నో ట్రైన్, ఫ్లయిట్ టికెట్లు రద్దు చేశారు. సహజంగానే తమ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి స్థితిలో లవ్లీనాలాంటి బాక్సర్లు పునరాలోచనలో పడ్డారు’ అని ఆయన వెల్లడించారు. దీనిని హేమంత కలితా కొట్టిపారేశారు. తాను ఏ ప్లేయర్ను ఆపలేదని, దానికి తనకు సంబంధం లేదన్న హేమంత...టోర్నీ కోసం ప్రకటించిన తేదీల పట్ల అసంతృప్తితో వివిధ రాష్ట్ర సంఘాలు తప్పుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దు: కోర్టు ఆదేశాలు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వివిధ రాష్ట్ర సంఘాల నుంచి ఎన్నికైన వారికి మాత్రమే ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉందంటూ బీఎఫ్ఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది.ఫలితాల ప్రకటన తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28 బీఎఫ్ఐ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 7న జారీ చేసిన నియమావళిలో తాజా నిబంధనలు ఉన్నాయి. అయితే దీనిని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ను తమ ప్రతినిధిగా ఓటు వేసేందుకు హిమాచల్ప్రదేశ్ బాక్సింగ్ సంఘం ప్రతిపాదించగా... ఆయన ఎంపికైన వ్యక్తి కాదంటూ రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారు. తాజా అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బీఎఫ్ఐని కోర్టు ఆదేశించింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 23–21తో భారత్కే చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ ముఖాముఖి రికార్డులో 7–3తో ప్రణయ్పై ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రణయ్తో 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్లో భారత్కే చెందిన క్వాలిఫయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 21–5, 21–16తో మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత ప్లేయర్లు ఆయుశ్ శెట్టి 15–21, 19–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–18, 17–21, 10–21తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. ఇషారాణి ముందంజ మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు 17–21, 19–21తో 39 నిమిషాల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. భారత్కే చెందిన ఇషారాణి బారువా, అనుపమ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వాలిఫయర్ ఇషారాణి 18–21, 21–17, 22–20తో భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్పై, అనుపమ 21–14, 21–13తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ (భారత్) 22–20, 14–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, రక్షితశ్రీ (భారత్) 11–21, 17–21తో లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–16, 21–17తో అలైన్ ముల్లర్–కెల్లీ బుటెన్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
‘గోల్’తో ఛెత్రి పునరాగమనం
షిల్లాంగ్: అంతర్జాతీయ ఫుట్బాల్ పునరాగమనంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్తో మెరిశాడు. ఫలితంగా 12 మ్యాచ్ల నుంచి విజయం లేకుండా సాగుతున్న భారత ఫుట్బాల్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో మాల్దీవులుపై నెగ్గింది. భారత్ తరఫున రాహుల్ (35వ నిమిషంలో), లిస్టన్ కొలాకో (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల ఛెత్రి 77వ నిమిషంలో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఛెత్రి కెరీర్లో ఇది 95వ అంతర్జాతీయ గోల్. తన రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఛెత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 286 రోజుల అనంతరం ‘బ్లూ జెర్సీ’లో మైదానంలో అడుగు పెట్టాడు. సునీల్కు ఇది 152వ మ్యాచ్ కాగా... 16 నెలల తర్వాత భారత జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. మొనొలో భారత ఫుట్బాల్ జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జట్టుకు ఇదే మొదటి గెలుపు. భారత జట్టు చివరిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లో భాగంగా 2023 నవంబర్ 16న కువైట్పై విజయం సాధించింది. -
‘పెళ్లి కార్నర్’లో భారత హాకీ స్టార్లు
షట్లర్లు సైనా నెహ్వాల్–పారుపల్లి కశ్యప్, ఆర్చర్లు దీపిక కుమారి–అతాను దాస్, హాకీ క్రీడాకారులు మౌనిక–ఆకాశ్దీప్... ఇలా పెళ్లాడిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా మహిళా డిఫెండర్ ఉదిత దుహాన్, పురుషుల ఫార్వర్డ్ మన్దీప్ సింగ్లు కూడా చేరనున్నారు. భారత ప్లేయర్ల పెళ్లి బాజా ఇప్పటికే మోగుతోంది. శుక్రవారం (21న) జరిగే వేడుకలో మన్దీప్–ఉదితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జలంధర్: మైదానంలో గోల్స్ కోసం ప్రత్యర్థులతో పోరాడే భారత హాకీ ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదిత దుహాన్లు కాసేపు పెనాల్టీ కార్నర్లు, పెనాల్టీ స్ట్రోక్లు పక్కనబెట్టి, చేతుల్లోని హాకీ స్టిక్లకు సెలవిచ్చి కళ్యాణ మాలలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. జలంధర్ (పంజాబ్)కు చెందిన మన్దీప్... హిస్సార్ (హరియాణా) అమ్మాయి ఉదితతో కలిసి ఏడడుగులు నడువనున్నాడు. భారత హాకీకి రెండు కన్నుల్లాంటి పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ల మధ్య ఈ నెల 21న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగనుంది. ఈ మేరకు ఇద్దరి ఇళ్లు, కళ్యాణశోభను సంతరించుకున్నాయి. వీళ్లిదరి పెళ్లికి సంబంధించిన ప్రి–వెడ్డింగ్ షూట్ ఫొటోల్ని సామాజిక సైట్లలో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల ఉదిత 2017లో జాతీయ జట్టుకు ఎంపికైంది. డిఫెండర్గా 127 మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి స్ట్రయికర్లను గోల్స్ చేయకుండా నిరోధించే ఆమె 14 గోల్స్ కూడా చేసింది. 30 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ 2013లో భారత్ తరఫున అంతర్జాతీయ హాకీలో ఆరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా 260 మ్యాచ్లాడిన మన్దీప్ 120 గోల్స్తో సత్తాచాటుకున్నాడు. పంజాబ్ పోలీస్ శాఖలో అతను డీఎస్పీగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో మన్దీప్ సభ్యుడు కాగా... త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో తృప్తి పడిన మహిళల జట్టులో ఉదిత ఉంది. పెళ్లికి ముందరి సంగీత్ కార్యక్రమం నేడు జరుగనుంది. భారత పురుషులు, మహిళా జట్ల ప్లేయర్లు ఈ వేడుకలో గానబజానాతో హడావుడి చేయనున్నారు. 21న ఉదయం 9 గంటలకు సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుంది. అనంతరం మరుసటి రోజు ఘనంగా రిసెప్షన్ (విందు)కు హాకీ, ఇతర క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు ఆయుశ్ శెట్టి అర్హత
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు ఆయుశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, సతీశ్ కుమార్ కరుణాకరన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఆయుశ్, శంకర్, సతీశ్ తాము ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి మెయిన్ ‘డ్రా’ బెర్త్లను దక్కించుకున్నారు. ఆయుశ్ తొలి రౌండ్లో 21–12, 21–15తో చోలన్ కయాన్ (ఇంగ్లండ్)పై, రెండో రౌండ్లో 21–6, 21–8తో రాఫెల్ గావోఇస్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. శంకర్ తొలి రౌండ్లో 21–13, 21–4తో యువెహాంగ్ వాంగ్ (ఇంగ్లండ్)పై, రెండో రౌండ్లో 21–7, 21–10తో తరుణ్ మన్నేపల్లి (భారత్)పై నెగ్గాడు. సతీశ్ తొలి రౌండ్లో 21–13, 21–9తో బ్రూనో కర్వాలో (పోర్చుగల్)పై, రెండో రౌండ్లో 19–21, 21–19, 21–16తో జస్టిన్ హో (మలేసియా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో భారత్కే చెందిన ఇషారాణి బారువా మెయిన్ ‘డ్రా’కు చేరుకోగా... శ్రియాన్షి వలిశెట్టి విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఇషారాణి 21–16, 21–11తో రోసీ పాన్కసారి (ఫ్రాన్స్)పై గెలుపొందింది. -
2028 ఒలింపిక్స్లో బాక్సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఓసీ
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ను చేర్చలేదు. కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్లో బాక్సింగ్ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్లో థామస్ బాచ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపనుంది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు.పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్ (2020 టోక్యో, 2024 పారిస్) క్రీడల్లో బాక్సింగ్ పోటీలను తిరిగి పర్యవేక్షించాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్కు ఒలింపిక్స్లో అవకాశం కల్పించాం’ అని థామస్ బాచ్ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం అధ్యక్షడు బోరిస్ ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. -
వరల్డ్ నంబర్ వన్కు షాకిచ్చిన టీనేజీ సంచలనం
మహిళల టెన్నిస్లో మరో స్టార్ అవతరించింది. టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటం కాదని రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆంద్రెయెవా నిరూపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో ఆంద్రెయెవా విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్)తో జరిగిన తుది పోరులో ఆంద్రెయెవా మూడు సెట్లలో విజయాన్ని అందుకొని కెరీర్లో రెండో డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. కాలిఫోర్నియా: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ రష్యా టీనేజ్ టెన్నిస్ స్టార్ మిరా ఆంద్రెయెవా రెండో టైటిల్ను హస్తగతం చేసుకుంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్లో గ్రాండ్స్లామ్ టోర్నీ తర్వాత ఉన్నతశ్రేణి టోర్నీ అయిన 1000 సిరీస్లలో ఆమె వరుసగా రెండో టైటిల్ను దక్కించుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించిన ఆంద్రెయెవా తాజాగా ఇండియన్ వెల్స్ ఓపెన్–1000 టోర్నీలో చాంపియన్గా అవతరించింది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏళ్ల ఆంద్రెయెవా 2–6, 6–4, 6–3తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది బ్రిస్బేన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలలో సబలెంకా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు ఈ గెలుపుతో ఆంద్రెయెవా బదులు తీర్చుకుంది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్ను సొంతం చేసుకుంది. అయితే తన లోపాలను సరిదిద్దుకొని రెండో సెట్ నుంచి ఆంద్రెయెవా విజృంభించింది. మూడో గేమ్లో సబలెంకా సర్వీస్ను బ్రేక్ చేసిన ఆంద్రెయెవా నాలుగో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆంద్రెయెవా తన సర్వీస్లను కాపాడుకొని సెట్ను 6–4తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఆంద్రెయెవా మూడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో సబలెంకా సర్వీస్లను బ్రేక్ చేసి 6–3తో సెట్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన ఆంద్రెయెవాకు 11,27,500 డాలర్ల (రూ. 9 కోట్ల 77 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సబలెంకాకు 5,99,625 డాలర్ల (రూ. 5 కోట్ల 19 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ టైటిల్తో ఆంద్రెయెవా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్కు చేరుకుంది. ఐదు స్థానాలు ఎగబాకిన ఆంద్రెయెవా ఆరో ర్యాంక్ను అందుకుంది. కంప్యూటర్ ర్యాంకింగ్స్ను 1975లో ప్రవేశ పెట్టాక ఒకే టోర్నీ ఫైనల్లో, సెమీఫైనల్లో వరల్డ్ నంబర్వన్, ప్రపంచ రెండో ర్యాంకర్లను ఓడించి విజేతగా నిలిచిన రెండో అతి పిన్న వయస్కురాలిగా ఆంద్రెయెవా గుర్తింపు పొందింది. ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్)పై ఆంద్రెయెవా గెలిచింది. 1979 యూఎస్ ఓపెన్లో ట్రేసీ ఆస్టిన్ (16 ఏళ్లు) ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మార్టినా హింగిస్ (1999లో) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్గా ఆంద్రెయెవా నిలిచింది. డ్రేపర్ ధమాకాఇండియన్ వెల్స్ ఓపెన్ పురుషుల విభాగంలో బ్రిటన్ ప్లేయర్ జాక్ డ్రేపర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో డ్రేపర్ 70 నిమిషాల్లో 6–2, 6–2తో హోల్గర్ రూనే (డెన్మార్క్)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 సింగిల్స్ టైటిల్ సాధించాడు. డ్రేపర్ 10 ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.23 ఏళ్ల డ్రేపర్ టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తాజా గెలుపుతో డ్రేపర్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 7వ ర్యాంక్ను అందుకున్నాడు.ఆండీ ముర్రే, టిమ్ హెన్మన్, గ్రెగ్ రుసెద్స్కీ, కామెరాన్ నోరి తర్వాత ఏటీపీ మాస్టర్స్–1000 టైటిల్ నెగ్గిన ఐదో బ్రిటన్ ప్లేయర్గా డ్రేపర్ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన డ్రేపర్కు 12,01,125 డాలర్ల (రూ. 10 కోట్ల 41 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ రూనేకు 6,38,750 డాలర్ల (రూ. 5 కోట్ల 53 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత జట్టులో పట్లోళ్ల ఇంద్రా రెడ్డి
ప్రతిష్టాత్మక ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత బృందాన్ని ప్రకటించారు. అండర్–11 ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తనయుడైన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి గత జనవరిలో జరిగిన జాతీయ స్కూల్ చెస్ చాంపియషిప్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.అండర్–11 ఓపెన్ విభాగంలోనే భారత్ నుంచి రేయాంశ్ వెంకట్ మరో ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సెర్బియాలోని వ్రాన్జాస్కా బాంజా పట్టణంలో జరుగుతాయి. బాలికల విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17)... ఓపెన్ విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17) తొమ్మిది రౌండ్లపాటు పోటీలను నిర్వహిస్తారు. భారత్ నుంచి మొత్తం 22 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీ షురూచెన్నై: భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నేటి నుంచి జరగనున్న ఇండియన్ టూర్ స్క్వాష్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాళ్లు సౌరవ్ ఘోషల్, జోష్నా చినప్ప ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చెన్నై వేదికగా జరగనున్న ఈ టోర్నీలో వీరితో పాటు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీనేజ్ సంచలనం 16 ఏళ్ల అనాహత్ సింగ్ కూడా బరిలోకి దిగనుంది.తక్కువ కాలంలోనే 9 ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిళ్లు ఖాతాలో వేసుకున్న అనాహత్ మహిళల విభాగంలో మూడో సీడ్ దక్కించుకుంది. గతేడాది కెరీర్కు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల సౌరవ్ ఇటీవల రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ వెంటనే బరిలోకి దిగిన సిడ్నీ క్లాసిక్ ఈవెంట్లో అతడు విజేతగా నిలిచాడు. 19 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన 38 ఏళ్ల జోష్నా గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి బాక్స్లో అడుగు పెట్టనుంది.పురుషుల విభాగంలో ఈజిప్ట్ ప్లేయర్ కరీమ్ అల్ హమామీ టాప్ సీడ్గా బరిలోకి దిగనుండగా... ఈజిప్ట్కే చెందిన అలీ హుసేన్ రెండో సీడ్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి సౌరవ్తో పాటు వీర్, సూరజ్, అరిహాంత్, హరిందర్ పాల్ సింగ్, పీఆర్ సంధేశ్ పాల్గొంటున్నారు. మహిళల విభాగంలో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే టాప్ సీడ్ దక్కించుకుంది. మన దేశం నుంచి షమీనా రియాజ్, పూజ ఆర్తి, రితిక సీలన్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, కువైట్, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, వేల్స్ నుంచి ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
వారెవ్వా నోరిస్...
మెల్బోర్న్: గత సీజన్ను విజయంతో ముగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో బ్రిటన్కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు. అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు. 2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్తోపాటు దూహాన్ నిష్క్రమించారు. ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్లో, లియామ్ లాసన్ (రెడ్బుల్) 46వ ల్యాప్లో తప్పుకున్నారు. ఓవరాల్గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్ప్రి ఈనెల 23న జరుగుతుంది. -
అల్కరాజ్కు చుక్కెదురు
కాలిఫోర్నియా: ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. గత రెండేళ్లు చాంపియన్గా నిలిచిన అల్కరాజ్ ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్, బ్రిటన్ ప్లేయర్ జేక్ డ్రేపర్ అద్భుత ఆటతీరుతో అల్కరాజ్ ఆట కట్టించి తన కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 13వ సీడ్ డ్రేపర్ 6–1, 0–6, 6–4తో రెండో సీడ్ అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో డ్రేపర్ తొలిసారి టాప్–10లోకి దూసుకురానున్నాడు. 23 ఏళ్ల డ్రేపర్ గత ఏడాది వియన్నా ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో 12వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో డ్రేపర్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ రూనే 7–5, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. అల్కరాజ్తో ఐదోసారి తలపడ్డ డ్రేపర్ ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో డ్రేపర్ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు అల్కరాజ్ 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
సవిత, హర్మన్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళల జట్టు గోల్కీపర్ సవితా పూనియాకు... ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ పురస్కారాలు అందజేస్తోంది.2024 పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో సారి విశ్వ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్ప్రీత్ సభ్యుడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గానూ సవిత హాకీ ఇండియా బల్జీత్ సింగ్ ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా దక్కించుకుంది.‘ఈ పురస్కారాలకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు సభ్యుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు. ఈ అవార్డులు ఆటపై ఏకాగ్రతను మరింత పెంచుతాయి’ అని సవిత పేర్కొంది. ‘ఈ అవార్డు నాకు ప్రేరణ వంటిది. యువ ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా ఇవి తోడ్పాటునిస్తాయి’ అని హర్మన్ప్రీత్ సింగ్ అన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచకప్ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. -
నోరిస్కు పోల్ పొజిషన్
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) పోల్ పొజిషన్ సాధించాడు. 24 రేసులతో కూడిన ఈ సీజన్కు ఆదివారం తెర లేవనుండగా... శనివారం క్వాలిఫయింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో లాండో నోరిస్ 1 నిమిషం 15.096 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. మెల్బోర్న్లో నోరిస్కు ఇదే తొలి ‘పోల్’ కాగా... ఓవరాల్గా కెరీర్లో 10వది. ఎఫ్1 సీజన్ ప్రారం¿ోత్సవ క్వాలిఫయింగ్ టోర్నీకి శనివారం 1,36,347 మంది అభిమానులు హాజరవడం విశేషం. ‘కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ట్రాక్పై కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ముందు వరుసలో నిలవగలం’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) 0.084 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్లో పియాస్ట్రి 1 నిమిషం 15. 180 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. ట్రాక్పై గత నాలుగేళ్లుగా ఎదురులేకుండా దూసుకెళ్తున్న రెడ్బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్)... క్వాలిఫయింగ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచాడు.వెర్స్టాపెన్ 1 నిమిషం 15.481 సెకన్లలో వేగవంతమైన ల్యాప్ పూర్తి చేశాడు. ఈ సీజన్ నుంచి ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) 1 నిమిషం 15.973 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ‘ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. కానీ ఓవరాల్గా సంతృప్తిగా ఉన్నా... గత రెండు రోజులుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ప్రధాన రేసులో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని హామిల్టన్ అన్నాడు. ఫెరారీ మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిసం 15.755 సెకన్లు; మొనాకో) ఏడో ప్లేస్లో, మెర్సెడెస్ డ్రైవర్ జార్జి రసెల్ (1 నిమిషం 15. 546 సెకన్లు; బ్రిటన్) నాలుగో స్థానంలో నిలిచారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. -
రష్మికకు ఐటీఎఫ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో ఆరో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ ఖాతాలో వేసుకుంది. భారత్కే చెందిన వైదేహి చౌదరీతో కలిసి రష్మిక డబ్ల్యూ 35 డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా... థాయ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూ 35 టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్టెడ్ (థాయ్లాండ్)–యుకీ నైటో (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన భారత జోడీ... వరుస సెట్లలో విజృంభించి టైటిల్ చేజిక్కించుకుంది. 1 గంట 18 నిమిషాల పాటు సాగిన పోరులో రష్మిక–వైదేహి 2 ఏస్లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. 9 బ్రేక్ పాయింట్లు కాచుకున్న భారత ప్లేయర్లు... ఓవరాల్గా 61 పాయింట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు. హైదరాబాద్కు చెందిన రష్మికకు ఇది రెండో డబ్ల్యూ 35 టైటిల్ కాగా... ఓవరాల్గా ఆరోది. 2024లో డబ్ల్యూ 35 ఇండోర్, 2023లో డబ్ల్యూ 15 అహ్మదాబాద్, డబ్ల్యూ 15 థాయ్లాండ్, డబ్ల్యూ 25 థాయ్లాండ్, 2022లో డబ్ల్యూ 15 గురుగ్రామ్ టోర్నమెంట్లలో రష్మిక డబుల్స్ చాంపియన్గా నిలిచింది. ఈ ఆరింట్లో నాలుగుసార్లు వైదేహి చౌదరీతో కలిసే రష్మిక విజయాలు సాధించింది. -
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గతంలో ఓ సినిమాలో తళుక్కుమని మెరిసింది. నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే ఐటం సాంగ్లో ఆడిపాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.గుత్తా జ్వాల (Jwala Gutta) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ (Tollywood)లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్లో రాణిస్తున్న నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ నో చెప్పాను. సినిమాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో నాకెందరో స్నేహితులున్నారు. చిత్రపరిశ్రమలో ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిలా నేనుండలేను. అక్కడ ఉండాలంటే మనకు సిగ్గు ఉండకూడదు. చాలా విషయాల్లో సర్దుకుపోతుండాలి.24 గంటలు పనిలోనే..నా భర్త.. హీరో, నిర్మాత విష్ణు విశాల్ (Vishnu Vishal) మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడుగా.. 24 గంటలు ఆయనకు ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చూస్తేనే నాకు తల నొప్పి వచ్చేస్తుంది. మేము 10 గంటలు ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్లకేమో డబ్బుల టెన్షన్, ఆ షాట్స్ సరిగా వచ్చిందా? లేదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నా భర్త రెడీ అవడానికి 2 గంటలు తీసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎంతో శ్రమిస్తారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్.. ప్రతిఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే!అలా ఐటం సాంగ్ చేశా..ఐటం సాంగ్ విషయానికి వస్తే.. అది తల్చుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్ (Nithiin) నాకు ఫ్రెండ్. ఒక పార్టీలో అతడు.. జ్వాల నువ్వు నా సినిమాలో ఓ పాట చేస్తున్నావ్ అన్నాడు. సరేనని తలూపాను. కానీ, సీరియస్గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత పాట రెడీ అని నా దగ్గరకు వచ్చాడు. నేను నోరెళ్లబెట్టాను. ఇప్పుడెలా నో చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాను. అతడేమో కచ్చితంగా నేను చేయాల్సిందే అని పట్టుబట్టాడు. అలా సెట్లో అడుగుపెట్టాను.ఫ్రీ పబ్లిసిటీమొదటి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్ చిన్నదైపోతూ వచ్చింది. ఏంటిదంతా? అనుకున్నాను. నాలుగురోజుల్లో సరదాగా షూట్ పూర్తి చేశాం. అప్పటికే అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నేను సాంగ్ చేయడం వల్ల ఆ మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. తెలుగు సినిమా జాతీయ మీడియాలో కూడా వస్తుందని నితిన్ సంతోషపడిపోయాడు. నా పాట వల్ల సినిమా ఫ్లాప్ అవకుండా హిట్టయింది. అదొక్కటి నాకు సంతోషంగా అనిపించింది అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చింది.చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా! -
రయ్... రయ్... రయ్...
మెల్బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున హామిల్టన్ మళ్లీ ప్రపంచ చాంపియన్గా అవతరిస్తాడా? ఈ ఇద్దరిని కాదని మూడో రేసర్ రూపంలో కొత్త విశ్వవిజేత ఆవిర్భవిస్తాడా? వీటన్నింటికీ సమాధానం నేటి నుంచి మొదలయ్యే ఫార్ములావన్ 75వ సీజన్లో లభిస్తుంది. 24 రేసులతో కూడిన ఈ సీజన్కు ఆదివారం ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో తెర లేస్తుంది. 2019 తర్వాత మళ్లీ ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో ఫార్ములావన్ సీజన్ మొదలుకానుండటం విశేషం. 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. క్వాలిఫయింగ్ సెషన్లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును 20 మంది డ్రైవర్లు ఏ స్థానం నుంచి ప్రారంభిస్తారో నిర్ణయిస్తారు. గత నాలుగేళ్లుగా రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఎదురులేని విజేతగా నిలుస్తున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నుంచి వెర్స్టాపెన్కు పోటీ లభిస్తున్నా... విజయాల పరంగా వెర్స్టాపెన్ ముందుకు దూసుకెళ్తున్నాడు. మెర్సిడెస్ జట్టు తరఫున 2013 నుంచి 2024 వరకు బరిలోకి దిగిన హామిల్టన్ ఈసారి తన కెరీర్లో తొలిసారి ఫెరారీ జట్టు తరఫున డ్రైవ్ చేయనున్నాడు. 2007 నుంచి 2012 వరకు మెక్లారెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ 2008లో తొలిసారి వరల్డ్ చాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత 2013 నుంచి 2024 మధ్య కాలంలో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఈ ఏడాది వెర్స్టాపెన్కు హామిల్టన్, లెక్లెర్క్, లాండోనోరిస్, కార్లోస్ సెయింజ్ జూనియర్, జార్జి రసెల్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశం ఉంది. పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఫార్ములావన్లో ప్రతి గ్రాండ్ప్రి మూడు రోజులు కొనసాగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్... శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. కొన్ని గ్రాండ్ప్రిలలో శనివారం స్ప్రింట్ రేసులను నిర్వహిస్తారు. ఈ రేసు 100 కిలోమీటర్లు జరుగుతుంది. అయితే స్ప్రింట్ రేసు ఫలితాలకు ప్రధాన రేసు ఫలితాలకు సంబంధం ఉండదు. ఇక ప్రధాన రేసులో టాప్–10లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. తొలి స్థానం నుంచి పదో స్థానం వరకు నిలిచిన డ్రైవర్లకు వరుసగా 25, 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్ లభిస్తుంది. రేసు మొత్తంలో ఫాస్టెస్ట్ ల్యాప్ నమోదు చేసిన డ్రైవర్కు బోనస్గా ఒక పాయింట్ ఇస్తారు. సీజన్లోని 24 రేసులు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన డ్రైవర్కు వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ లభిస్తుంది. అత్యధిక పాయింట్లు సంపాదించిన జట్టుకు కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్ టైటిల్ దక్కుతుంది. ఏ జట్టులో ఎవరున్నారంటే... ఈ ఏడాది కూడా ఫార్ములావన్ టైటిల్ కోసం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు బరిలో ఉన్నారు. ఒక్కో జట్టు తరఫున ఇద్దరు డ్రైవర్లు ప్రధాన రేసులో పోటీపడతారు. ఇద్దరు డ్రైవర్లలో ఎవరైనా పాల్గొనకపోతే అదే జట్టులో ఉన్న రిజర్వ్ డ్రైవర్కు అవకాశం లభిస్తుంది. ఈ సీజన్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డ్రైవర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్బుల్: మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్), లియామ్ లాసన్ (న్యూజిలాండ్). ఫెరారీ: లూయిస్ హామిల్టన్ (బ్రిటన్), చార్లెస్ లెక్లెర్క్ (మొనాకో). మెర్సిడెస్: జార్జి రసెల్ (బ్రిటన్), ఆంటోనెలి (ఇటలీ). మెక్లారెన్: లాండో నోరిస్ (బ్రిటన్), ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) ఆలై్పన్: పియరీ గ్యాస్లీ (ఫ్రాన్స్), జాక్ దూహన్ (ఆ్రస్టేలియా). ఆస్టన్ మార్టిన్: లాన్స్ స్ట్రోల్ (కెనడా), ఫెర్నాండో అలోన్సో (స్పెయిన్). హాస్: ఎస్తెబన్ ఒకాన్ (ఫ్రాన్స్), ఒలివెర్ బేర్మన్ (బ్రిటన్). కిక్ సాబెర్: నికో హుల్కెన్బర్గ్ (జర్మనీ), బొర్టెలెటో (బ్రెజిల్). రేసింగ్ బుల్స్: హాద్జర్ (ఫ్రాన్స్), యూకీ సునోడా (జపాన్) విలియమ్స్: ఆల్బన్ (థాయ్లాండ్), కార్లోస్ సెయింజ్ (స్పెయిన్)34 ఇప్పటి వరకు ఫార్ములావన్లో 34 వేర్వేరు డ్రైవర్లు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను సాధించారు. అత్యధికంగా 7 సార్లు చొప్పున మైకేల్ షుమాకర్ (జర్మనీ), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) టైటిల్స్ గెలిచారు. షుమాకర్ వరుసగా ఐదేళ్లు వరల్డ్ చాంపియన్గా నిలిచాడు. షుమాకర్ రికార్డును సమం చేసేందుకు వెర్స్టాపెన్కు ఈసారి అవకాశం లభించనుంది. గతంలో హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్కు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. 17 ఫార్ములావన్లో 17 మంది డ్రైవర్లు ఒక్కసారి మాత్రమే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచారు.105 ఫార్ములావన్ చరిత్రలో హామిల్టన్ గెలిచిన రేసులు. అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ రికార్డు హామిల్టన్ పేరిట ఉంది. షుమాకర్ (91), వెర్స్టాపెన్ (63), వెటెల్ (53), అలైన్ ప్రాస్ట్ (51) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 3 ఈ సీజన్లో బరిలో దిగుతున్న 20 మంది డ్రైవర్లలో ముగ్గురు ప్రపంచ చాంపియన్స్ ఉన్నారు. రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (2021, 2022, 2023, 2024), తొలిసారి ఫెరారీ తరఫున పోటీపడుతున్న లూయిస్ హామిల్టన్ (2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020), ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో (2005, 2006) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
కరీ...‘3’చీర్స్
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా బాస్కెట్బాల్ స్టార్ స్టీఫెన్ కరీ అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ‘త్రీ’ పాయింటర్లు స్కోరు చేయడంలో సిద్ధహస్తుడైన కరీ.. ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ)లో 4 వేల త్రీ పాయింటర్లు సాధించిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. లీగ్లో భాగంగా ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 ఏళ్ల కరీ... శుక్రవారం సాక్రమెంటో కింగ్స్ జట్టుతో జరిగిన పోరులో ఈ మైలురాయి దాటాడు. ఆట మూడో క్వార్టర్ 8వ నిమిషంలో నాలుగో ప్రయత్నంలో కరీ... త్రీ పాయింటర్ సాధించాడం ద్వారా 4000 త్రీ పాయింటర్లు ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టు 130–104 పాయింట్ల తేడాతో సాక్రమెంటో కింగ్స్పై విజయం సాధించింది. సుదీర్ఘ కాలంగా ‘పాయింట్ గార్డ్’ పొజిషన్లో ఆడుతున్న కర్రీ... తన జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2009 అక్టోబర్ 30న కరీ తన తొలి ‘త్రీ’ పాయింటర్ సాధించాడు. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక త్రీ పాయింటర్లు సాధించిన ఆటగాడిగా రే అలెన్ (2,973) పేరిట ఉన్న రికార్డును 2021లో అధిగమించిన కరీ... అదే జోరు కొనసాగిస్తూ పుట్టినరోజున మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా ఈ జాబితాలో ప్రస్తుతం కరీ తర్వాత జేమ్స్ హర్డెన్ (3,127), డామియన్ లిలార్డ్ (2,794) ఉన్నారు. బాస్కెట్కు 23.9 ఫీట్ల (7.24 మీటర్లు) దూరంలోని గీత నుంచి నేరుగా బంతిని లక్ష్యాన్ని చేర్చగలిగితే 3 పాయింట్లు లభిస్తాయి. అంతర్జాతీయ పోటీల్లో 22.2 ఫీట్లు ఉన్న ఈ దూరం... ఎన్బీఏలో మాత్రం 23.9 ఫీట్లుగా ఉంది. ప్రత్యర్థి కళ్లు గప్పగల నైపుణ్యంతో పాటు... దూరం నుంచే లక్ష్యాన్ని గురిపెట్టగల సామర్థ్యం కలగలిసినప్పుడే త్రీ పాయింటర్లు సాధ్యమవుతాయి. ఈ విషయంలో కెరీర్ ఆరంభం నుంచి తన ప్రత్యేకత చాటుకుంటున్న కరీ... ‘త్రీ’ పాయింటర్ స్పెషలిస్ట్గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఎన్బీఏలో రెండుసార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన కరీ... ఈ క్రమంలో ఎన్బీఏ చరిత్రలో 25,000 పాయింట్లు సాధించిన 26వ ప్లేయర్గా నిలిచాడు. ‘అతడు జట్టుకు ఎంతో ముఖ్యం. కీలక సమయాల్లో అతడు సాధించే పాయింట్లు టీమ్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఆటను ఎలా మలుపుతిప్పాలో అతడికి బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన ఏకాగ్రత కోల్పోడు. చిన్నప్పటి నుంచి అతడి నిశిత పరిశీలన నన్ను ఆకట్టుకుంటోంది’ అని కోచ్ స్టీవ్ కెర్ అన్నాడు. ‘నేనెప్పుడూ త్రీ పాయింటర్ల గురించి ఆలోచించలేదు. ఆటలో భాగంగా అవి వాటంతటవే వచ్చి చేరుతున్నాయి.నా వరకు మ్యాచ్ విజయమే ముఖ్యం. ఈ క్రమంలో 4 వేల త్రీ పాయింటర్లు సాధించడం ఆనందంగా ఉంది. అయితే అది ఒక నంబర్ మాత్రమే’ అని 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్న కరీ అన్నాడు. -
వరుసగా 24వ ఏడాది టైటిల్ లేకుండానే...
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. మహిళల డబుల్స్లో 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ఈసారి క్వార్టర్ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్ లియు షెంగ్షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 2 గతంలో భారత్ నుంచి ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. -
నిజమైన వయస్సును వెల్లడించాల్సిందే.. లేదంటే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: క్రీడా పోటీల్లో తరచూ వివాదాస్పదమవుతున్న తప్పుడు వయో ధ్రువీకరణ అంశంపై నిర్దిష్టమైన పాలసీని రూపొందిస్తున్న కేంద్ర క్రీడా శాఖ ఇందులో సాధారణ ప్రజల్ని భాగం చేయాలని నిర్ణయించింది.క్రీడల్లో నకిలీ వయో ధ్రువీకరణ నిరోధక జాతీయ పాలసీ (ఎన్సీఏఏఎఫ్ఎస్) ముసాయిదా బిల్లును రూపొందించిన క్రీడా శాఖ తుది సవరణలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖరు (31) వరకు సాధారణ ప్రజానీకం అభిప్రాయాలు, ఫిర్యాదులను సేకరించనుంది.‘నూతన క్రీడల్లో వయో ధ్రువీకరణ పాలసీపై క్రీడలు–యువజన సర్వీసుల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సలహాలు సంప్రదింపులు జరుపుతుంది. ప్రజలు కూడా భాగం కావొచ్చు. ఆయా వయో విభాగాల క్రీడల్లో నిజమైన వయస్సు కలిగిన క్రీడాకారులకు నష్టం కలుగకుండా చూడటమే ఈ బిల్లు లక్ష్యం’ అని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టాలకు లోబడి శిక్షలుభారత క్రీడల్లో మరింత జవాబుదారీతనం పెంచడం కోసం నిర్దిష్టమైన సవరణలతో 15 ఏళ్ల తర్వాత ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు క్రీడాశాఖాధికారులు తెలిపారు. తప్పుడు, నకిలీ ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొంటే తొలిసారి రెండేళ్ల నిషేధం విధిస్తారు. పతకాల్ని వెనక్కి తీసుకుంటారు. రెండోసారి పునరావృతం జీవితకాల నిషేధం విధించడంతో పాటు, చట్టాలకు లోబడి శిక్షలు తప్పవు. అయితే సస్పెన్షన్కు గురైన అథ్లెట్లు తమ తప్పుని అంగీకరించి, నిజమైన వయస్సును వెల్లడిస్తే క్షమాభిక్షకు అవకాశమిచ్చారు. ఇదీ చదవండిచండీగఢ్లో గురువారం జరిగిన పంజాబ్ యూనివర్సిటీ (పీయూ) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. మేటి షూటర్ మనూ భాకర్ ‘పీయూ ఖేల్రత్న’ పురస్కారం అందుకుంంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ ఈ ఏడాది చండీగఢ్లోని డీఏవీ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించింది. -
జయహో జార్ఖండ్
పంచ్కులా (హరియాణా): ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారి జాతీయ సీనియర్ మహిళల చాంపియన్షిప్లో విజేతగా అవతరించింది. ‘షూటౌట్’ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో అల్బెలా రాణి టొప్పో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4–3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా జట్టును ఓడించింది. 2011లో హాకీ ఇండియా (హెచ్ఐ) ఆవిర్భవించాక 15 సార్లు జాతీయ చాంపియన్షిప్ జరిగింది. జార్ఖండ్ జట్టు ఆరుసార్లు (2012, 2013, 2014, 2022, 2023, 2024) మూడో స్థానాన్ని దక్కించుకోగా... ఒకసారి (2015) రన్నరప్గా నిలిచింది. ఎనిమిదో ప్రయత్నంలో జార్ఖండ్ విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున కెప్టెన్ రాణి (42వ నిమిషంలో), జార్ఖండ్ తరఫున ప్రమోదిని లాక్రా (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జార్ఖండ్ తరఫున రజని కెర్కెట్టా, నిరాలి కుజుర్, బినిమా ధన్, అల్బెలా రాణి టొప్పో సఫలంకాగా... ష్యామీ బారా విఫలమైంది. హరియాణ తరఫున సోనమ్, కెపె్టన్ రాణి గురి తప్పగా... పింకీ, అన్ను, మనీషా సఫలమయ్యారు. జార్ఖండ్ గోల్కీపర్ అంజలి బింజియా హరియాణా ప్లేయర్ల రెండు షాట్లను నిలువరించి తమ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిజోరం జట్టు తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మిజోరం జట్టు 2–1 గోల్స్ తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 8 సార్లు టైటిల్ దక్కించుకోగా... హరియాణా (3 సార్లు) రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రెండుసార్లు టైటిల్ను గెలవగా.. ఒడిశా, జార్ఖండ్ ఒక్కోసారి జాతీయ టైటిల్ను సొంతం చేసుకున్నాయి. -
లండన్ మారథాన్లో ప్రపంచ రికార్డు!
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ పరుగు ప్రపంచ రికార్డు కొల్లగొట్టనుంది. రికార్డు స్థాయిలో అథ్లెట్లు లండన్ మారథాన్ రేసును పూర్తి చేస్తారనే అంచనాలు అమాంతం పెరిగాయి. వచ్చే నెల 27న లండన్ నగరంలో జరిగే ఈ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగులో పోటీపడేందుకు ఇప్పటికే 8 లక్షల 40 వేల మందికిపైగా ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ ఈవెంట్లో 5,78,304 రన్నర్లకంటే ఇది చాలా అధికం. పురుషులతో దీటుగా మహిళా రన్నర్లు ఆసక్తి చూపడం విశేషం. 8 లక్షల 40 వేల ఔత్సాహికుల్లో 49 శాతం మహిళలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న యువతులు ఏకంగా 105 శాతం పెరగడం విశేషం! ఇప్పటివరకు పూర్తి మారథాన్ పరుగు దూరాన్ని 55,646 మంది పూర్తి చేశారు. గత నవంబర్లో న్యూయార్క్ మారథాన్లో ఈ రికార్డు నమోదైంది. అయితే ఈసారి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది బరిలో దిగడానికి ఆసక్తి చూపడంతో పూర్తి చేసేవారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుందని నిర్వాహకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏప్రిల్ 27న జరిగే 45వ లండన్ మారథాన్ కొత్త మైలురాయికి చేరుకోబోతోంది. అత్యధిక సంఖ్యలో పరుగును పూర్తిచేసే రికార్డు సాకారం కానుంది. ఇదే జరిగితే ముమ్మాటికి మా మారథాన్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది’ అని లండన్ మారథాన్ ఈవెంట్స్ సీఈఓ హ్యూజ్ బ్రాషెర్ తెలిపారు. నగరంలోని గ్రీన్విచ్ నుంచి ద మాల్ వరకు సాగే 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఈసారి 56 వేల పైచిలుకు మంది పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. 1981లో లండన్ మారథాన్ మొదలైంది. ఆ ఏడాది తొలి మారథాన్లో ఏకంగా 13 లక్షల మంది బరిలోకి దిగారు. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–7 (5/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెర్నాండో రాంబోలి (బ్రెజిల్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గొరాన్సన్ ఏడు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. యూకీ–గొరాన్సన్లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఆడిన యూకీ తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 37వ ర్యాంక్కు చేరుకుంటాడు. -
లక్ష్య సేన్ సంచలనం
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్, ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–13, 21–10తో ఇండోనేసియా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. లక్ష్య సేన్ ధాటికి తట్టుకోలేక జొనాథన్ క్రిస్టీ 36 నిమిషాల్లో చేతులెత్తేశాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీలో సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. గతంలో క్రిస్టీ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. లక్ష్య ఆటకు జవాబివ్వలేక క్రిస్టీ అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో తొలి గేమ్లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. రెండో గేమ్లోనూ లక్ష్య తన దూకుడు కొనసాగించాడు. స్కోరు 11–6 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో గేమ్తోపాటు మ్యాచ్ను దక్కించుకున్నాడు. నేడు క్వార్టర్ ఫైనల్లో 6వ ర్యాంకర్ లీషి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్ ఆడతాడు. వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. హావో నాన్ జియె–హాన్ జెంగ్ వె (చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్ను 16–21తో కోల్పోయారు. రెండో గేమ్లో స్కోరు 2–2 వద్ద ఉన్నపుడు చిరాగ్ వెన్ను నొప్పితో ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో సాత్విక్–చిరాగ్ ద్వయం మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 16–21, 13–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 10–21, 12–21తో జె ఫెంగ్ యాన్–జిన్ వె యా (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఐఓసీ పీఠం ఎవరిదో?
లుసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ (జర్మనీ) పదవీకాలం ముగియనుండటంతో... చైర్మన్ పదవి కోసం ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వివిధ క్రీడా సమాఖ్యల్లో కీలక పదవులు నిర్వర్తిస్తున్న విశేష అనుభవం ఉన్నవారు పోటీలో ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.ఐఓసీలోని మొత్తం 109 మంది సభ్యులు ‘రహస్య బ్యాలెట్’ పద్ధతిలో ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం 8 సంవత్సరాలు కాగా... నాలుగేళ్లకోసారి పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ ఎన్నికను ఎగ్జిక్యూటివ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ నెల 18 నుంచి 21 మధ్య గ్రీస్లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుత చైర్మన్ థామస్ బాచ్ పదవీకాలం అధికారికంగా జూన్ 23తో ముగియనుంది. » ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఐఓసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బ్రిటన్కు చెందిన సెబాస్టియన్కు క్రీడా పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది. » ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు క్రిస్టీ కొవెంట్రీ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేసింది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల ఈ ప్రఖ్యాత స్విమ్మర్ ప్రస్తుతం జింబాబ్వే కేబినెట్లో క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తోంది. ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించిన క్రిస్టీ కొవెంట్రీ విజయంపై ధీమాగా ఉంది. » అంతర్జాతీయ స్కీయింగ్, స్నోబోర్డ్ సమాఖ్య అధ్యక్షుడు జోహన్ ఎలియాష్ కూడా పోటీలో ముందున్నారు. బ్రిటన్, స్వీటన్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎలియాస్... ప్రకృతి ప్రేమికుడిగా, పర్యవారణ పరిరక్షకుడిగా కూడా సుపరిచితుడే. » ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న జోర్డాన్ యువరాజు ఫైజల్ అల్ హుసేన్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. యుద్ధ విద్యల్లో మంచి అనుభవం ఉన్న ఫైజల్ ఇప్పుడు క్రీడా పరిపాలనలోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. » అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపరి్టయెంట్, అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య అధ్యక్షుడు మెరినరి వతనబె కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండగా... ప్రస్తుతం ఐఓసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న యువాన్ ఆంటోనీ సమరాంచ్ జూనియర్ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నాడు. పరిపాలనలో విశేష అనుభవం ఉన్న స్పెయిన్కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ... చైర్మన్గా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. » కొత్తగా ఎన్నిక కానున్న ఐఓసీ అధ్యక్షుడి ముందు క్రీడల్లో కృత్రిమ మేధ వినియోగం... డిజిటల్ మాధ్యమాల ద్వారా యువతను భాగం చేయడం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రచించడం... క్రీడారంగంలో మహిళలకు పెద్దపీట వేయడం వంటి పలు సవాళ్లు ఉన్నాయి. » జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కొవెంట్రీని చైర్మన్గా ఎంపిక చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ భావిస్తున్నాడు. అయితే ఐఓసీ సీనియర్ ఉపాధ్యక్షుడు యువాన్ సమరాంచ్, ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో కూడా పీఠం అధిరోహించాలని పట్టుదలతో ఉన్నారు. » ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు... విశ్వక్రీడల భవిష్యత్తును నిర్మించనున్నారు. ఆటల ఎంపిక, నిర్వహణ పద్ధతి, అథ్లెట్ల సంక్షేమం, వేదికల ఏర్పాటు ఇలా లెక్కకు మిక్కిలి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. » 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఐఓసీ అధ్యక్ష ఎన్నికపై మన దగ్గర కూడా ఆసక్తి నెలకొంది. -
రెండో సీడ్ జోడీకి యూకీ బాంబ్రీ ద్వయం షాక్
కాలిఫోర్నియా: తన కెరీర్లో ఆడుతున్న తొలి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గొరాన్సన్ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్)లను బోల్తా కొట్టించింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గొరాన్సన్ ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్ ప్రకారం యూకీ–గొరాన్సన్లకు క్వాలిఫయింగ్తోపాటు మెయిన్ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న మార్కోస్ గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్’ పూల్లో ఉన్న యూకీ–గొరాన్సన్లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు ఖరారయ్యాయి. -
ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్మాస్టర్ శ్యామ్సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్షిప్, షార్జా మాస్టర్స్లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్కు అలవాటు. దీంతో హోటల్ రూమ్లో బాటిల్ మూతలను బాల్గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్కు వీరాభిమాని... క్రికెట్ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్లో ప్రణవ్ వేగం శ్యామ్సుందర్ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు. -
భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు. -
లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరాడు. ఈ మ్యాచ్లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్గార్డ్–మాడ్స్ వెస్టర్గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది.