కేంద్ర బడ్జెట్లో క్రీడలకు రూ.4479.88 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.
దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.
ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు.


