‘నవ కేరళ సర్వే’ టార్గెట్‌.. బీజేపీ ప్లాన్‌ ఫలించిందా? | Special Story On Nava Kerala Survey LDF And BJP Stand | Sakshi
Sakshi News home page

‘నవ కేరళ సర్వే’ టార్గెట్‌.. బీజేపీ ప్లాన్‌ ఫలించిందా?

Mar 19 2026 11:54 AM | Updated on Mar 19 2026 11:58 AM

Special Story On Nava Kerala Survey LDF And BJP Stand

కేరళలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎన్నికల వేళ కేరళలోని పినరయి విజయన్‌ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నవ కేరళ సర్వే’ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేరళలో ఎల్‌డీఎఫ్‌ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి “నవ కేరళ సర్వే” అనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కేరళలో దాదాపు 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సర్వేలో భాగంగా కేవలం 49.42 లక్షలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. కాగా, సర్వేల సందర్బంగా ప్రభుత్వ పెద్దల ఆడియో లీక్‌ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. సర్వే అసలు ఉద్దేశ్యం ఎల్‌డీఎఫ​్‌ను తిరిగి అధికారంలోకి తేవడమే అని బయటపడింది. దీంతో, కేరళ బీజేపీ నేతలు రంగంలోకి దిగి తీవ్ర ఆరోపణలు చేశారు.

రాజకీయ ఉద్దేశంతోనే నవ కేరళ సర్వేను చేపట్టినట్టు ఆరోపించారు. అనంతరం, కాషాయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను వాడటం అన్యాయమని పేర్కొంటూ సర్వేను రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. అనంతరం, హైకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పబ్లిక్ అవుట్‌రీచ్ & డెవలప్‌మెంట్ ఫీడ్‌బ్యాక్ ఇనిషియేటివ్ మాత్రమే, ఎన్నికల ప్రచారం కాదని తెలిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సర్వే కొనసాగించడానికి అనుమతించింది. ఇదే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అని తెలుసుకోవడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేసింది.

అయితే, ఈ సర్వేలో ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకున్న నెంబర్‌ కంటే తక్కువ సంఖ్యలో సర్వే జరగడం, పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకంగా కనిపించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సర్వేలో తక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.

సర్వే ముఖ్యాంశాలు

  • సర్వే లక్ష్యం: 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం.

  • నిజంగా చేరుకున్న ఇళ్లు: 49.42 లక్షలు.

  • సేకరించిన అభిప్రాయాలు: కేవలం 4.5 లక్షలు.

  • ఫోకస్ గ్రూప్ చర్చలు: కుడుంబశ్రీ వంటి సంఘాల ద్వారా 46,000 అభిప్రాయాలు మాత్రమే సేకరించబడ్డాయి.

  • వాలంటీర్లు: 96,200 మంది నమోదు చేసుకున్నా, శిక్షణకు హాజరైన వారు చాలా తక్కువ.

ఆర్థిక వ్యయాలు

  • స్టేషనరీ, బ్రోచర్లు, పుస్తకాలు: సర్వే కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశారు.

  • 85,000 బుక్‌లెట్లు ముద్రించబడ్డాయి.

  • ఫారమ్‌లు, ఫీడ్‌బ్యాక్ ప్యాడ్లు, నోటు బుక్స్ కోసం భారీగా ఖర్చు జరిగింది.

ఇక, నవ కేరళ సర్వేలో ప్రజలు ప్రధానంగా ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, రహదారులు–నీటి సరఫరా, మహిళా సాధికారత, రైతు సహాయం వంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.

ప్రజలు ఇచ్చిన ప్రత్యేక సూచనలు

1. ఉద్యోగాలు & ఉపాధి

  • కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.

  • యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు పెంచాలని సూచించారు.

  • ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు.

2. ఆరోగ్యం

  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, అత్యవసర సేవలు పెంచాలని సూచించారు.

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.

3. విద్య

  • పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు.

  • స్కాలర్‌షిప్‌లు మరియు ఆర్థిక సహాయం విస్తరించాలని సూచించారు.

  • గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు.

4. మౌలిక సదుపాయాలు

  • రహదారులు, నీటి సరఫరా, గృహ నిర్మాణం, శుద్ధి వ్యవస్థలు మెరుగుపరచాలని సూచించారు.

  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు పెంచాలని కోరారు.

5. సంక్షేమ పథకాలు

  • కుడుంబశ్రీ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

  • పింఛన్లు, రైతు సహాయం, గృహ పథకాలు మరింత పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.

  • సామాజిక భద్రతా పథకాలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement