breaking news
Karnataka
-
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
తొలి ఏకాదశి వైభవం
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మొహర్రంను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మత భేదభావాలను మరిచి పాల్గొన్నారు. పీర్ల దేవుళ్లను అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. వీధివీధినా భక్తులు చక్కెర చదివింపులు జరిపించారు. తెల్లవారుజామున అగ్ని గుండంలో పీర్ల స్వాములను ఎత్తుకుని నడిచారు. ఉత్తర కర్ణాటకతో పాటు చిక్కమగళూరులోనూ మొహర్రంను ఆచరించారు. కొన్నిచోట్ల ముస్లింలు రక్త తర్పణం నిర్వహించారు. –యశవంతపురమాలూరు: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. పూలతో స్వామి వారిని సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి పూజలను ప్రారంభించారు. మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, వేద మంత్ర పారాయణం తదితరాలు గావించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం వరుసలు కట్టారు. ప్రధాన అర్చకులు ఎన్ శ్రీధర్ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. అగర ఆలయంలో..బొమ్మనహళ్లి: పవిత్ర తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళి అగరలో చరిత్ర ప్రసిద్ధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అభిషేకం, అలంకారాలు గావించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. -
సిద్దుకు పదవిపై గందరగోళం!
దొడ్డబళ్లాపురం: ఏఐసీసీ ఓబీసీ జాతీయ విభాగంలో సీఎం సిద్దరామయ్య నియామకం గురించి కొంత గందరగోళం అలముకొంది. ఆయన అందులో సభ్యునిగా ఉండగా, ఇప్పుడు అధ్యక్షున్ని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆదివారం సీఎం మాట్లాడుతూ జూలై 15న ఓబీసీ సభను నిర్వహించాలని తనకు సూచించారన్నారు. అధ్యక్ష పదవి గురించి సమాచారం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్పష్టతనిస్తూ మండలిలో సీఎం సిద్ధరామయ్య సభ్యుడు మాత్రమేనని, అధ్యక్షునిగా డా.అనిల్ జైహింద్ ఉన్నారని, ఆయన నేతృత్వంలోనే 15న బెంగళూరులో ఓబీసీ సభ జరుగుతుందని తెలిపింది. ఆ భేటీకి వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది వరకూ ముఖ్య నేతలు హాజరవుతారు. కెనాల్లోకి బైక్ పల్టీ, ఇద్దరు జలసమాధి మండ్య: బైక్ అదుపుతప్పి విశ్వేశ్వరయ్య కెనాల్ (వీసీ)లో పడడంతో ఇద్దరు మరణించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని హోసగావి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాకు చెందిన రామన్న (70), మద్దూరువాసి భరత్ (19), ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మోపెడ్లో వెళ్తున్నారు. బైకు నడుపుతున్న రామన్న అదుపు తప్పడంతో అడ్డుగోడను ఢీకొని కాలువలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో పాటు గాయాల పాలై అక్కడే చనిపోయారు. సాయంత్రం కొందరు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. అన్నదాత ఆత్మహత్య మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని బిలికెరె హోబ్లిలోని శ్రావణహళ్లి గ్రామంలో అప్పుల బాధతో రైతన్న ప్రాణాలు తీసుకున్నాడు. పుట్టస్వామాచారి (50) అనే రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. పొగాకు, ఇతర పంటల సాగు కోసం రూ. 20 లక్షల అప్పులు తీసుకొన్నాడు. మైక్రో ఫైనాన్స్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకొన్నాడు. కొన్నిరోజులుగా రుణదాతలు రైతు ఇంటికి వచ్చి చెల్లించాలని గొడవలు చేయడంతో విరక్తి చెందాడు. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు మైసూరులోని కేఆర్ నగర ఆస్పత్రిలో చేర్పించగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమస్యల వలయంలో తారానాథ ఆస్పత్రి
సాక్షి,బళ్లారి: మొండి వ్యాధులను సైతం ఇట్టే నయం చేయడంలో రాష్ట్రంలోని పేరుగాంచిన ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఒకటైన బళ్లారిలోని తారానాథ ఆస్పత్రిని సమస్యలు చుట్టుముట్టాయి. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు కొరవడటం రోగులకు శాపంగా మారింది. ఈ ఆస్పత్రికి బళ్లారి జిల్లాతో పాటు, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు, ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తారానాథ ఆస్పత్రిలో ఆయుర్వేద కళాశాల కూడా ఉంది. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, మరో వైపు వైద్య సేవలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. సిబ్బంది కొరతపై పలుమార్లు అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏటేటా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. బోధన సిబ్బంది 52 మంది ఉండాల్సి ఉండగా, అందులో సగం కూడా వైద్య సిబ్బంది లేరు. ఫలితంగా ఇటు వైద్య సేవలు, అటు బోధన సేవలు రెండింటికీ సమస్యగా పరణమించింది. 20 మందికి పైగా నర్సులు అవసరం ఉండగా,13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది కొరతతో ఒక్కోసారి నర్సుల పని కూడా తామే చేయాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక విధానం ద్వారా మసాజ్ చేయడంతోపాటు, స్టీం బాత్ సౌకర్యంకూడాఉంది. వనమూలికలతో తయారు చేసిన మందులతో పలు నొప్పులకు మసాజ్ చేసిన తర్వాత స్టీం బాత్ చేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. పక్షవాత బాధితులకు మసాజ్ చేసి చికిత్సలు చేస్తుంటారు ఆస్పత్రిలో విద్యుత్ సమస్య కూడా ఉంది. జనరేటర్ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యుత్కోతల సమయంలో రోగులు ఇబ్బందులు పడుతుంటారు. సిబ్బంది కొరతతో రోగులకు ఇక్కట్లు విద్యుత్ కోతలు ..జనరేటర్ అంతంత మాత్రమే -
నకిలీ రికార్డులతో ఆస్తుల విక్రయాలు
రాయచూరు రూరల్: దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రజల ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించి విక్రయించి భారీ కుంభకోణానికి తెరదీశారు. దీంతో నగరంలో అస్తులు కలిగిన వారు నగరసభ కార్యాలయానికి వెళ్లి అస్తులు తమపేరు మీద ఉన్నాయో, లేదో అని చూసుకుంటున్నారు. అక్రమార్కులు ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాల నకళ్లను సేకరించి వాటిని ఒరిజనల్గా చూపుతూ ఇళ్ల స్థలాలను అమాయకులకు కట్టబెట్టారు. రాయచూరు, సిరివార, లింగసూగురు తాలుకాలో ఇలా అనేక మందికి చెందిన ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించారు. బాధితుల ఫిర్యాదుతో 36 మందిపై పోలసులు కేసు నమోదు చేశారు. అంజినేయ్య, సంతోష్ శాన్బోగ, సబ్ రిజిస్ట్రార్, ఎఫ్డీపీ నారాయణ, రాజు, నగరసభ యస్డీసీ నరసింహులు, డి,డి,రైటర్ లోక్నాథ్ రెడ్డి, రామప్ప, మారెప్ప, ప్రసాద్, మసూదవలీ, అక్షయ్ భండారి, మహ్మద్ ముజాయిద్, విద్యా సురేస్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వారం రోజుల్లో నివేదికలు అందించాలని అదేశించినట్లు వివరించారు. రాయచూరు జిల్లాలో భారీ కుంభకోణం 36 మందిపై కేసులు -
రోడ్లు కావాలంటే గ్యారంటీలు బంద్ చేయాలి
సాక్షిబళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదుఉ గ్యారెంటీ పథకాల వల్ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, సీఎం ఆర్థిక సలహదారుడైన బసవరాజ్ రాయరెడ్డి అన్నారు. రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా యర్వనికలో హైస్కూల్ భవన కట్టడ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ పొలాలనికి రోడ్డు నిర్మించాలని ఓ రైతు విజ్ఞప్తి చేయగా ఆయన పైవిధంగా స్పందించారు. బియ్యం వద్దు, గృహలక్ష్మి వద్దంటే ఆ డబ్బుతో అభివృద్ధి పనులను చేపడుదాం. రోడ్లు బాగుపడాలంటే బియ్యంతో పాటు అన్ని గ్యారెంటీలు బంద్ అవుతాయని పేర్కొన్నారు. రోడ్డు కావాలంటే బియ్యం తదితరాలు బంద్ చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సలహా ఇస్తానని ఆయన సూచించారు. సాక్షత్తు సీఎం సలహాదారుడైన బసవరాజ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా రాయరెడ్డి వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తు గ్యారెంఈ పథకాలు మార్చే ప్రశక్తే లేదన్నారు. ఇవి పేదల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన బసవరాజ్ రాయరెడ్డి వ్యాఖ్యలు -
గుండెపోటుతో పలువురు మృతి
కాఫీనాడు చిక్కమగళూరు జిల్లాలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. మూడిగెరె తాలూకా భారీబైలుకు చెందిన మీనాక్షి (27), బి.హొసహళ్లిలో సుమిత్రేగౌడ (75) మృతులు. మీనాక్షి రెండు రోజుల నుంచి లో బీపీతో బాధపడుతోంది. ఎద నొప్పి ఎక్కువ కావడంతో శనివారం సాయంత్రం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. వర్షాల వల్ల రోడ్డుపై చెట్టు కూలడంతో ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమైంది. దారిలో మీనాక్షి చనిపోయింది. ఇక సుమిత్రేగౌడ ఇంటిలో ఉండగా గుండెపోటు వచ్చి కుప్పకూలి చనిపోయారు. ఇక హాసన్ జిల్లాలో గుండెజబ్బు మరణాలు తగ్గడం లేదు. ఆదివారం ఉదయం హొళెనరసీపుర తాలూకా ఐచనహళ్లికి చెందిన ఆనంద్ (44) ఎదలో నొప్పిగా ఉందని భార్యకు చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. హాసన్లో బెంగళూరు వాసి... కారులో ఉండగా గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన హాసన్లో జరిగింది. బెంగళూరు జయనగరకు చెందిన రంగనాథ్ (52) భార్య పిల్లలతో కలిసి ధర్మస్థలకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహ్నం హాసన్ జిల్లా కలెక్టరేటు వద్ద వస్తుండగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు ఈసీజీ తీస్తున్న సమయంలో గుండె ఆగి మరణించారు. కళ్లముందే ఇంటి పెద్ద చనిపోవడంతో భార్యపిల్లలు గుండెలవిసేలా రోదించారు. -
తీర జిల్లాల్లో తగ్గని వానలు
యశవంతపుర: కోస్తా జిల్లాలలో భారీ వానలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. చిక్కమగళూరు జిల్లా బాళెహొన్నూరు, కళస, కొప్ప, మూడిగెరె, ఎన్ఆర్పురలో భారీగా వానలు పడుతున్నాయి. చెరువు, కుంటలు నిండిపోయాయి. చార్మాడి ఘాట్ రోడ్డులో జలపాతాలు మొదలయ్యాయి. ఎత్తైన కొండల నుంచి వాననీరు ఉవ్వెత్తున దూకుతోంది. గాలీవానకు ఆదివారం ఉదయం కారవారలో సుభాష్ సర్కిల్లో స్కూటరిస్టుపై చెట్టు పడిపోయింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలు తగిలాయి. ప్రాణాపాయం నుంచి బయటపడింది. కృష్ణా, ఉపనదులు తీవ్రం బయలుసీమ జిల్లాలైన తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామాంతర, మండ్య, మద్దూరు, చిత్రదుర్గ, దావణగెరెలో ఆకాశం మేఘావృతమైంది. మహారాష్ట్ర, పశ్చిమ కనుమలలో వర్షాల వల్ల బెళగావి ప్రాంతంలో కృష్ణాతో పాటు ఉపనదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వేదగంగా, దూద్గంగా నదులు నిండి జోరందుకున్నాయి. వీటి కింది ఉన్న 8 జలాశయాలు పూర్తిగా నిండిపోగా, పరిసరాల్లో ఆలయాలు నీట మునిగాయి. బెంగళూరులో జల్లు వాన బనశంకరి: ఆదివారం బెంగళూరు నగరంలో కొన్నిచోట్ల జల్లులతో కూడిన వర్షం కురిసింది. వీకెండ్ మోజులో ఉన్న నగరవాసులకు బ్రేక్ ఇచ్చింది. జక్కూరు, చౌడేశ్వరినగర, విజ్ఞాననగర, అగర, హెచ్ఎస్ఆర్లేఔట్, కోరమంగల, ఆర్ఆర్ నగర, సంకేనహళ్లి, సంపంగి రామనగర, రాజగోపాల నగర, కేఆర్.పురం, కొడిగేహళ్లి, బాణసవాడి, జ్ఞానభారతి, హెమ్మెగెపుర తదితర 81 వార్డుల్లో జల్లు వర్షం కురిసింది. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
హుబ్లీ: బైక్ను బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన హుబ్లీ తాలూకా కుసుగల్ గ్రామం బ్యాహట్టి రోడ్డు శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. నవళగుంద తాలూకా అళగవాడి నివాసి బసవరాజ్ అళగవాడ గ్రామం నుంచి హుబ్లీ వైపు బైక్పై వెళ్తూ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు యత్నించి అదుపు తప్పి పడిపోయాడు. తలపై బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. యువతకు అర్థమయ్యేలా రచనలురాయచూరు రూరల్: యువతకు అర్థమయ్యేలా రచనలు చేయాలని సీనియర్ సాహితీ వేత్త శాశ్వతయ్య ముకుందమఠ్ అన్నారు. కవి తిమ్మయ్య శెట్టి రచించిన దైవం, ఏనుగుకు అంగి పుస్తకాలను కన్నడ భవనంలో జిల్లా, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. భావితరాలకు కూడా ఇప్పటి రచనలు ఉపయోగపడాలన్నారు. దొంగల అరెస్ట్, నగలు స్వాధీనం హుబ్లీ: చోరీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. కుందగోళ తాలూకా గుడగేరి శ్రీధర్(27), హేమంత(34) గడిఫేర్నడేస్ (31)అనే నిందితులను హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తారిహళ గ్రామంలో సైదుసాబ్ నదాఫ్ ఇళ్లలోకి చొరబడి నగలు దోచుకున్నారు. అంచటగేరి మంజునాథ ఇంట్లో రూ.42 లక్షల విలువైన వస్తువులు చోరీ చేశారని ఎస్ఐ సచిన్ అలమేళకర తెలిపారు. దొంగలను అరెస్ట్ చేయడంలో ఏఎస్ఐ హొన్నప్పన్నవర, సిబ్బంది మల్లిగేవాడ, సంతోష్ చవాన్, గిరిష, విశ్వనాథ చాకచక్యంగా వ్యవహరించారన్నారు. వీధిశునకాల దాడిలో బాలుడికి గాయాలురాయచూరురూరల్: వీధి శునకాలు దాడి చేయడంతో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. నగరంలోని 8వ వార్డు అంద్రూన్ కిల్లాలో రోహన్(4) అనే బాలుడు తన ఇంటి వద్ద ఆడుకుటుండగా శునకాలు దాడి చేశాయి. ముఖం, శరీరంపై పలుచోట్ల గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం బైరూన్ కిల్లా, యల్బీఎస్ నగర్, అరబ్ మోహాల్లో వీధి శునకాలు దాడి చేసి పదిమందిని గాయపరిచాయి. అయినా కుక్కలను నియంత్రించడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి రాయచూరురూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సింధనూరు తాలూకా తుర్విహళ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండా గ్రామం వద్ద జరిగింది. దేవీ క్యాంప్నకు చెందిన కరణ కుమార్(27), సిందనూరుకు చెందిన రమేష్(28)లు బైక్పై వెళ్తుండగా గుండా గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందారు. మృతదేహాలను సింధనూరు ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సుజాత తెలిపారు. అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలు రాయచూరురూరల్: మోహర్రం వేడుకల్లో అపశృతి జరిగింది. లింగసూగురు తాలూకా యరగుంటిలో శనివారం అగ్నిగుండం వెలిగించారు. అక్కడ అలాయ్ తొక్కుతుండగా హన్మంత్ నాయక్ అనే వ్యక్తి కాలుజారి గుండంలోకి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. యోగాతో ఆరోగ్య సంరక్షణ రాయచూరురూరల్: యెగాద్వారా ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని పతంజలి యోగా సంచాలకుడు విఠోభరావ్ అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని మహిళా సమాజ్లో పతంజలి యోగా సంస్థ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా, ధ్యానంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. యోగాను రోజువారి జీవితంలో భాగం కావాలన్నారు. -
సమాజానికి పాత్రికేయుల సేవలు అపారం
హొసపేటె: స్థిరమైన సమాజాన్ని నిర్మించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొప్పళ గవి మఠం జగద్గురు అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామీజీ అన్నారు. నగరంలోని సాయిలీల కళా మందిరంలో కర్ణాటక యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల దినోత్సవం, ప్రతిభా పురస్కారం, సీనియర్ విలేకరులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలను కొనుగోలు చేసి చదివే వారి సంఖ్య తగ్గుతోందన్నారు. జిల్లాధికారి దివాకర్ మాట్లాడుతూ విలేకరులు సమాజంలో ఉన్న ఒడిదొడుకులను అధికారుల దృష్టికి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని తెలిపారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ పాత్రికేయుల నూతన భవన నిర్మాణం చేపడుతామన్నారు. అనంతరం పది, పీయూసీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. పది వేలు చొప్పున నగదును జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ తరఫున ఆయన పీఏ లక్ష్మీ నారాయణ అందజేశారు. జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూర్, కార్యదర్శి లోకేష్, ఎస్పీ శ్రీ హరిబాబు, హుడా అధ్యక్షులు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్కుమార్, జిల్లాధ్యక్షుడు సత్యానారాయణ, కార్యదర్శి లక్ష్మణ, వెంకోబి తదితరులు పాల్గొన్నారు. -
రూ.40 కోట్లు చీట్..ఫండ్
బనశంకరి: చిట్ఫండ్ అంటే చీటింగ్ల మాదిరిగా మారాయి. అవసరానికి ఆదుకుంటుంది అని ఆశపడి చిట్టీలు కట్టి వందలాది ప్రజలు మోసపోయారు. ఈ ఘటన బెంగళూరు పుట్టేనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు..జరగనహళ్లి నివాసులైన సుధా, సిద్దాచారి దంపతులు 20 ఏళ్లుగా చీటీల వ్యవహారాలు నడుపుతున్నారు. ఆ కుటుంబం వద్ద 600 మందికి పైగా స్థానిక ప్రజలు చీటీలు కట్టారు. ఈ మొత్తం రూ.40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రూ.5 లక్షల నుంచి 10 లక్షల చీటీలు నడిపేవారు. అర్ధరాత్రి పరార్ సుధా, ఆమె భర్త సిద్దాచారి గత ఏడాదినుంచి ఖాతాదారులకు చీటీల డబ్బు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధా దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ఇటీవల అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని పరారయ్యారు. అంతకుముందు బ్యాంకులో తమ బంగారు ఆభరణాలను విడిపించుకున్నారు. ఇంట్లోనే మొబైల్ఫోన్ను వదిలిపెట్టి విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించారు. దంపతులు అదృశ్యం కావడంతో వందలాది మంది చీటీదారులు లబోదిబోమన్నారు. ఇంటి అవసరాల కోసం కట్టామని, ఎంతో నష్టపోయామని, న్యాయం చేయాలని విలపిస్తున్నారు. పుట్టేనహళ్లి పోలీస్స్టేషన్లో బాధితులు పిర్యాదు చేశారు. వంచక దంపతుల పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు పుట్టేనహళ్లిలో మోసం 600 మంది లబోదిబో -
2 నెలలు మృత్యువుతో పోరాడి..
శివమొగ్గ: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఏఎస్ఐ రెండు నెలలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. వివరాలు.. శివమొగ్గ జిల్లాలో ఆనవట్టి ఠాణాలో ఏఎస్ఐ బసవరాజప్ప (50) ఏప్రిల్ నెల 30వ తేదీన రాత్రి బైక్లో శిరాళకొప్పకు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బసవరాజప్పని ప్రజలు ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత చికిత్స చేసినా ఆయన కోలుకోలేదు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఇటీవల శికారిపుర పట్టణంలో ఉన్న ఇంటికి తీసుకుని వచ్చారు. శనివారం రాత్రి కన్నుమూశారు. లాడ్జిలో ఎస్ఐ ఆత్మహత్య ●● 6 రోజుల తరువాత వెలుగులోకి ● తుమకూరులో సంఘటన తుమకూరు: తుమకూరు నగరంలోని ఓ లాడ్జిలో దావణగెరెకు చెందిన ఎస్ఐ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఎస్ఐ నాగరాజు (35) దావణగెరె ఎక్స్టెన్షన్ ఠాణాలో ఎస్ఐగా పనిచేసేవారు. ఆదివారం లాడ్జ్ గదిలో నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది వెళ్ళి చూడగా విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలించగా 2 పేజీల డెత్నోట్ లభించింది. ఈ నెల 1వ తేదీన నాగరాజు లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఎస్ఐ అని చెప్పి రూంని తీసుకున్నారు. గదిలోకి వెళ్ళిన నాగరాజు మళ్లీ బయటికి రాలేదు. లాడ్జ్ సిబ్బంది ఫోన్ చేసినా స్పందన లేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సమస్యలే కారణమని డెత్నోట్లో రాసినట్లు తెలిసింది. కారు– బస్సు ఢీ, ముగ్గురు దుర్మరణం దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్టీసీ బస్సు కారు– ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో కారులో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా మురగుండి గ్రామం వద్ద జరిగింది. కల్బుర్గి జిల్లా అఫ్జల్పురకు చెందిన గిరీష్, రాహుల్, సంగు అమరగొండ మరణించారు, రాధిక అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా కొల్హాపుర మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్ర్టీసీ బస్సు ఢీకొంది. కారు గుర్తుపట్టలేనంతగా తుక్కు తుక్కయింది. అథణి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేస్తమా.. తిరిగి రావా! ●● ఎద్దు సమాధి చెంత శునకం ఘోష మైసూరు: పిచ్చి కుక్క కరిచి రేబిస్ వ్యాధితో మరణించిన మైసూరులో మేటగళ్లి మహాలింగేశ్వర ఆలయ వృషభం మిత్రుడు, వీధి శునకం ఆవేదన చెప్పనలవి కాదు. తన మిత్రుడు సమాధి నుంచి వస్తాడా.. అని అక్కడే వేచిచూస్తోంది. అది చూసి గ్రామస్తులకు కంటనీరు ఆగడం లేదు. ఆలయ ఎద్దుకు రేబీస్ సోకి వారం కిందటే చనిపోవడం, గ్రామస్తులు ఎద్దును ఆలయం పక్కనే ఖననం చేసి సమాధి నిర్మించడం తెలిసిందే. బసవతో బంధాన్ని పెంచుకొన్న శునకం అక్కడే తిరుగాడుతోంది. ఆదివారం జరిగిన సమారాధనలో శునకం కూడా పాల్గొంది. సమాధి దగ్గర ఉంచిన ఎద్దు చిత్రపటం ముందు బాధతో కూర్చుంది. -
రెండు సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ సర్కిళ్లను అధునాథనంగా అభివృద్ధి చేస్తామని కకలెక్టర్ నితీష్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయుల విగ్రహాలు, రాజ్యంగ పుస్తకం, పార్లమెంట్ నమూనాను 3డీ సాంకేతికతతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ పార్క్, బారికేడ్ గోడ, అంబేడ్కర్ భవనం నిర్మాణాలు, అందోళన కార్యక్రామాలకు స్థలం కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. సభలో ఎస్పీ పుట్ట మాదయ్య, కమిషనర్ జుబీన మోహపాత్రో, చిదానంద, పరుశురామ్, బసవరాజ్, బీ మయ్య, వసంత్ కుమార్, విశ్వనాథ్, విరుపాక్షి పాల్గొన్నారు. -
ద్విభాషా విధానంపై సందిగ్ధం
బనశంకరి: కర్ణాటకలో విద్యా వ్యవస్థలో అనేక ఏళ్లుగా ద్వి భాషా విధానం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. హిందీ భాష కు అడ్డుకట్ట వేయాలంటే కన్నడ, ఇంగ్లీష్ భాషలు మాత్రమే చాలునని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాల్లో ద్విభాషా విధానం అమలులో ఉంది. కన్నడనాట కూడా అమలు చేయాలని భాషావేత్తలు, కన్నడ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య స్పందన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై ప్రామాణికంగా పనిచేస్తున్నానని, కులమత తారతమ్యంలేని సమాజమే కువెంపు ఆశయమని ఆయన అన్నారు. కానీ నేడు విద్యా విధానంలో వైజ్ఞానికత లోపిస్తోందని చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో కువెంపు విచారక్రాంతి అనే పుస్తకాన్ని సిద్దరామయ్య విడుదలచేసి మాట్లాడారు. రాజకీయంగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. ద్విభాషా విధానంలో తన అభిప్రాయమే ప్రభుత్వ అభిప్రాయమన్నారు. కానీ సిద్దరామయ్య గట్టి నిర్ణయం తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ద్విభాషా విధానంలో విద్యాబోధన చేయాలని సోషల్ మీడియాలో కన్నడిగులు డిమాండ్ చేశారు. అమలు చేయాలని డిమాండ్లు -
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
రాయచూరు రూరల్: ఏకాదశి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రభుత్వ ఉద్యాన వనంలో విఠలరుక్మిణి అలయంలో పాండురంగ, రుక్మిణి స్వామివార్లకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారు, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 18న ప్రత్యేక ఆషాఢ మాస ఉత్సవాలు చేపడుతామని అలయ కమిటీ తెలిపింది. నగరేశ్వరాలయంలో పాండురంగ, రుక్మిణి దేవి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ఊంజల్ సేవలు నిర్వహించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్రాయచూరు రూరల్: మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ నితీష్, శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్ పుణ్యస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహనికి కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతి, కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేయడంతోపాటు దేశంలో మరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి జగ్జీవన్రామ్ అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే, అసిస్టెంట్ కమిషనర్ గజానన, సాంఘిక శాఖ అధికారి చిదానంద, నగరసభ కమిషనర్ జుబీన్ పాత్రో, తహసీల్దార్ సురేష్వర్మ, రాజేంద్ర జాలదార్ పాల్గొన్నారు. పెరుగుతున్న పశువుల చోరీలు హుబ్లీ: ధార్వాడ తాలూకా హొసవాళ, రామపుర గ్రామాలలో పశువులు, మేకలు, గొర్రెల చోరీ ఘటనలు పెరుగుతున్నాయి. ఇంటి ముందు కట్టేసిన మేకలు, పొట్టెళ్లు, పశువులను దుండగులు చోరీ చేసి ఉడాయిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారి ఇళ్లపై కన్నేసిన దొంగల ముఠాలు బైక్పై వచ్చి పొట్టెళ్లను చోరీ చేస్తున్నారు. దీంతో మేకల కాపరులు, పాడి రైతులు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. హొసవాళ గ్రామంలో వాసు ఉళికేరి అనే వ్యక్తికి చెందిన ఆవును, అదే గ్రామానికి చెందిన దాదాపీర దొడ్డమని ఇంటి ముందు కట్టిన పొట్టెళ్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు వాపోయారు. పట్టపగలే బైక్ మీద పొట్టెళ్లను తరలిస్తున్న దృశ్యం బేలూరులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ దృశ్యాలతోసహా సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చినా స్పందన లేదని పొట్టేళ్ల యజమాని వాపోతున్నాడు. రంగసిరి కార్యక్రమాలు పట్టణాలకూ విస్తరించాలి రాయచూరురూరల్: సమాజానికి నిస్వార్థంతో సేవలు అందించినప్పుడే సార్థకత ఉంటుందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అన్నారు. పండిత సిద్దరామ జం బలదిన్ని రంగ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన రంగసిరి సాంస్కృతిక కార్యక్రమాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో అదరణ కలిగిన రంగసిరి కార్యకలాపాలను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలన్నారు. రంగస్వామి, నాగవేణి, పవన్ పాటి ల్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, శ్రీనివాస్, గోవిందు, బిరదార్ పాల్గొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శనం హుబ్లీ: లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలు మానవజాతిని సరైన మార్గంలో నడిపిస్తాయని సింధనూరు గేట్సే మనె ప్రార్థన మందిరం దైవజనులు హరీష్ అన్నారు. సింధనూరు సమీపంలోని దుర్గ క్యాంప్లో సీనియర్ ఫాస్టర్ ఏసు రత్నం సారథ్యంలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక ప్రార్థన కూటమిలో ఆయన పాల్గొని బైబుల్లోని సందేశాలను వినిపించారు. ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవులు ఆచరించి తమ జీవితాలను సార్థకంచేసుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని ఆయన వివరించారు. -
ముదగల్లో పీర్ల దేవుళ్ల ఊరేగింపు
రాయచూరు రూరల్: ముదగల్లో నిర్వహించే మొహర్రం వేడుకలు హిందూ, ముస్లింల భావైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా మొహర్రం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పీర్ల దేవుళ్లను ఇరాన్ దేశం నుంచి ముదుగల్కు తీసుకోచ్చి కొలువుదీర్చినట్లు భక్తుల నమ్మకం. మొహర్రం సందర్భంగా కొలువు దీర్చిన పీర్లను దర్శించుకునేందుకు స్థానికులతోపాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. శనివారం రాత్రి అగ్నిగుండం వెలిగించగా భక్తులు అందులోకి కొబ్బరి, చక్కెర వేసి మొక్కులు తీర్చుకున్నారు. ముస్లింలతోపాటు హిందువులు పీర్ల దేవుళ్ల చావడి వద్ద ఆలం తొక్కుతూ ఆనందంలో మునిగిపోతున్నారు. శాంతియుతంగా ఆచారించాలి మోహర్రంను శాంతియుతంగా అచరించాలని జిల్లా ఎస్ప పుట్ట మాదయ్య సూచించారు. లింగసూగురు తాలుకా హట్టి, ముదుగల్, సింధనూరు తాలూకా క్యాంప్ సిరవారలో మొహర్రంను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలని సూచించారు. హొసపేటె: పీర్ల పండుగను నగర వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పీర్ల మందిరానికి వెళ్లి చెక్కర, బెల్లం పొడిని చదివించారు. చిత్తవాడిగి, రామటాకీస్, అజాడ్ నగర్ తదితర చోట్ల పీర్ల దేవుళ్లను కూర్చోపెట్టారు. -
పరిసరాలను సంరక్షించాలి
రాయచూరు రూరల్: పరిసరాల సంరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని గ్రీన్ సంచాలకుడు ఈరన్న పిలుపునిచ్చారు. భోళమాను దొడ్డి ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో వేడిమినుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఇంటిి ముందు మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు. పీర్ల దేవుళ్లకు హిందువులే అర్చకులు రాయచూరు రూరల్: ఆ గ్రామంలో మైనార్టీలు లేకపోయినా పీర్ల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. హిందువులే పీర్ల దేవళ్లకు పూజలు నిర్వహిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన ఈ గ్రామం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని యాదగిరి జిల్లా సురుపుర తాలూకాలో ఉంది. తళవార గ్రామంలో మైనార్టీలు ఒక్కరు కూడా లేరు. ఊరంతా హిందువులే. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతో పాటు వందేళ్లుగా మొహర్రంను ఆచరిస్తున్నారు. ఆరు రోజలు పాటు జరిగే మొహర్రం వేడుకల్లో హసేని, సయ్యద్ ఖాసీం, లాలసాబ్, మౌలాలీ పీర్లను కొలువు దీర్చి పూజలు చేస్తారు.ఈ గ్రామంలోని హిందువులతోపాటు పక్క గ్రామాలనుంచి హిందు, ముస్లింలు వచ్చి ఇక్కడ పీర్ల దేవుళ్లను దర్శించుకొని స్వామివారికి చక్కెర, కొబ్బెర చదివిస్తారు. ఈ ఏడాది కూడా మొహర్రం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ద్విభాషా విధానం అమలు చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖలో ద్విభాష విధానాన్ని అమలు చేయాలని కరవే డిమాండ్ చేసింది. జిల్లాదికారికార్యాలయం వద్ద శనివారం అందోళన చేపట్టిన అధ్యక్షుడు గంగణ్ణ మాట్లాడుతూ ప్రస్తుతం త్రిభాషా సూత్రం వల్ల విద్యార్థులు హిందీ భాషలో అధికశాతం ఉత్తీర్ణులు కాలేక పోతున్నారన్నారు. 1968లో తమిళనాడు హిందీభాషను రద్దు చేయగా మహారాష్ట్రలో కూడా హిందీని తొలగించారన్నారు. కర్ణాటకలో కూడా హిందీని రద్దు చేసి ద్విభాషా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. రోటరీ సేవలు విస్తరింపజేస్తాం రాయచూరురూరల్: రోటరీ క్లబ్ సేవలు విస్తరింపజేస్తామని జిల్లా రోటరీ గవర్నర్ తిరుపతి నాయుడు అన్నారు. నగరంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో శనివారరం జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో ఇప్పటికే గణనీయమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇతర రంగాల్లో కూడా సంస్థ సేవలు అందించాల్సి ఉందన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగికి రక్తస్రావం ●● జిమ్స్ ఆస్పత్రిలో ఘటన హుబ్లీ: కలబుర్గి జిమ్స్ ఆస్పత్రిలో మరో నిర్లక్ష్య ఘటన వెలుగు చూసింది. ఐసీయూలో ఉన్న రోగికి గ్లూకోజ్ పైపు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. జిల్లాలోని మెలకుంద గ్రామ నివాసి సిద్దన్న నాలుగు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని జిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచారు. ఆయనకు పెట్టిన గ్లూకోజ్ పైపు పక్కకు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. అయినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయగా సిద్దన్నకు గుండెపోటు వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితుడు కుటుంబ సభ్యులు వాపోయారు. -
వీసీగా శివానంద కెళిగన మని
రాయచూరు రూరల్: నగరంలోని మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్గ శివానంద కెళిగన మని నియమితులయ్యారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. మెరుగైన సేవలు అందించండి హొసపేటె: ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉద్యోగులు వినియోగించుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే గవియప్ప సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన రెవెన్యూ ఉద్యోగులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ల్యాప్టాప్ల ద్వారా ప్రజలకు సత్వరం సేవలు అందించవచ్చన్నారు. తహసీల్దార్ శృతి పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గం జిల్లా మదకరిపుర సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బచ్చబోరనహట్టి గ్రామానికి చెందిన రమేష్(35) ఇతను బైక్పై వెళ్తుండగా అదుపు తప్పి పడి మృతి చెందాడు. బెంగళూరులోని బెంగళూరుఉ– మైసూరు సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ హజార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్లో వెళ్తూ కేఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఆన్లైన్లో రెవెన్యూ పత్రాలు తీసుకోవచ్చు
● దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి వెల్లడి బళ్లారి రూరల్ : భూ సంరక్షణ యోజనలో రెవెన్యూ పత్రాలను ప్రజలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి జి.ఎం.తెలిపారు. శనివారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటుచేసిన పత్రికాసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.1.13 కోటి రెవెన్యూ పత్రాలు స్కానింగ్ చేశామన్నారు. ప్రజలకు డిజిటల్ రూపంలోనే పత్రాలు అందుతాయని తెలిపారు. పాత పాణి, ముటేషన్, ల్యాండ్గ్రాంట్ రిజిస్ట్రేషన్ తదితర భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దావణగెరె తాలూకా కార్యాలయంలో 52,80765, హరహర తాలూ కాలో 1106372, జగుళూరు1323129, హొన్నాళి,11,51723 పత్రాలను స్కానింగ్ చేసినట్లు తెలిపారు. తాలూకా కార్యాలయాల్లో ప్రజలు తమ భూమి పత్రాలను తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అపర జిల్లాధికారి శీలవంత శివకుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రాజానాయక్ తాసిల్దార్ ఎం.బి.అశ్వథ పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ సాక్షి,బళ్లారి: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ పేర్కొన్నారు. నగరంలోని వాల్మీకి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసేవారే కాకుండా ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసేవారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 1.06 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వారికి ఐడీకార్డులు పంపిణీ చేశామని, ప్రమాదంలో మృతి చెందితే బీమా కింద రూ. లక్ష అందజేస్తారన్నారు. డీజిల్, పెట్రోల్ సెస్ ద్వారా ఒకశాతం కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని సీఎంను కోరామన్నారు. రూ.150 కోట్లు లభించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కార్మికులు లేకపోతే అభివృద్ధి జరగదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంపీ తుకారం మాట్లాడుతూ కార్మికుల హిత రక్షణ కోసం మంత్రి సంతోష్లాడ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేలు నారా భరత్రెడ్డి, గణేష్ ,అధికారులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
మధుమేహం, ధూమపానం, బీపీ..
బనశంకరి/ యశవంతపుర: రాష్ట్రంలో రోజురోజుకు గుండెపోటు మరణాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు టెక్నికల్ కమిటీ నివేదిక అందజేయగా, అందులోని అంశాలపై చర్చ ఆరంభమైంది. బెంగళూరు జయదేవ హృద్రోగ ఆసుపత్రి డైరెక్టర్ రవీంద్రనాథ్, ఇతర నిపుణులు నివేదికను అందజేశారు. పలు జిల్లాల్లో గుండెపోటుతో ఆస్పత్రుల్లో చేరిన 251 మంది ఆరోగ్య పరీక్షల వివరాలను పొందుపరిచారు. ఇందులో 87 మంది రోగులకు షుగర్ ఉన్నట్లు తెలిసింది. 102 మందిలో బీపీ, 35 మందిలో అధిక కొలె స్ట్రాల్ ఉంది. 40 మందిలో గుండె సంబంధ రోగాలు ఉన్నట్లు కనిపెట్టారు. 251 మందిలో 111 మంది ధూమపానం చేస్తుండగా, 19 మందిలో కోవిడ్ హిస్టరీ ఉంది. 77 మందిలో ఎలాంటి రోగాలు లేవు. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న 12 మంది హృద్రోగుల గురించి అధ్యయనం చేశారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 66 మంది హృద్రోగులను పరిశీలించారు. 41 నుంచి 45 ఏళ్ల వయసున్న 172 మంది హృద్రోగులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. చిక్కమగళూరులో లారీ డ్రైవర్.. గుండెపోటు ఘటనలు హాసన్ పొరుగున ఉన్న చిక్కమగళూరును చుట్టుముట్టాయి. గుండెపోటుతో రెండురోజుల క్రితం 29 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అలాగే శుక్రవారం రాత్రి అజ్జంపుర పట్టణంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ సగీర్ అహ్మద్ (45) భోజనం చేస్తుండగా ఎదలో నొప్పి అని చెప్పాడు. క్షణాల్లోనే కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో పోలీసు... బెళగావి జిల్లా గోకాక్లో ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు. ఎఎస్ఐ మీరానాయక్ (55), హుబ్లీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గోకాక్ గ్రామదేవత జాతర బందోబస్తులో ఉన్నారు. గోకాక్ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పోలీసులకు వసతి కల్పించారు. శనివారం తెల్లవారుజామున మీరానాయక్కు గుండెపోటు వచ్చింది, వెంటనే పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. మృతదేహానికి గోకాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. డ్యూటీకి వెళ్లి కానరాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటు కారణాలపై కమిటీ నివేదిక -
ఆయుర్వేద శిబిరాల నిర్వహణ అభినందనీయం
రాయచూరు రూరల్: నగరంలోని పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల భవనంలో శనివారం రస కౌశల్య శిబిరాలను ఏర్పాటు చేశారు. శిబిరాలను రాజీవ్గాంధీ ఆరోగ్య వర్సిటీ ప్రిన్సిపాల్ బీఏస్ సవడి ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ ఆవరణలో 250 ఔషధ మొక్కలు నాటి పంచకర్మ తదితర ఆయుర్వేద విధానాలతో రోగులకు వైద్యం అందిస్తుండటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అయుర్వేదం ద్వారానే అన్ని రోగాలకు మందులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కేశవ రెడ్డి, శివకుమార్, ఆయూష్ అధికారి శంకర గౌడ, మహేశ్వర స్వామి, పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్ పాల్గొన్నారు. -
ఇప్పుడు సాకారమైంది
పలువురు స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ 1960 ల నుంచి వంతెన నిర్మాణం కోసం కోరుతున్నామని, ఇప్పుడు సాకారమైందని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సిగందూరులోని చౌడేశ్వరి దేవస్థానానికి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నది వల్ల చుట్టూ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు వంతెన నిర్మాణం వల్ల దూరం గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. అలాగే చుట్టుపక్కల శరావతి నది బ్యాక్వాటర్లో ఉండే దీవుల గ్రామాల ప్రజలకు కూడా సాగర్ పట్టణానికి వెళ్లడానికి రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ప్రస్తుతం నదిలోని తీర గ్రామాలు, ద్వీప గ్రామాలకు వెళ్లడానికి పెద్ద పెద్ద ఫెర్రీలను వాడుతున్నారు. కార్లు, బైక్లు, ఇతర వాహనాలను కూడా అందులోనే తరలిస్తుంటారు. ఫెర్రీ ప్రయాణం ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు ప్రమాదాలతో కూడుకున్నది కావడం గమనార్హం. -
కంప్లి వంతెన అంచులకు వరద నీరు
హొసపేటె: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా కంప్లి–గంగావతి మధ్య కంప్లి పట్టణ సమీపంలో ఉన్న వంతెన అంచులను తుంగభద్ర జలాలు తాకాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయంలో 80 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో పైనుంచి వచ్చిన నీటిని యథాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం 70వేల క్యూసెక్కులు నదికి విడుదల చేయడంతో వరద పోటెత్తింది. ఫలితంగా వంతెన నీట మునిగింది. వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. వరద నీటి ఉధృతిని మున్సిపల్ అధ్యక్షుడు భట్టా ప్రసాద్, ముఖ్య అధికారి బి.మల్లికార్జున, పీఐకేబీ వాసుకుమార్ పరిశీలించారు. నదిలోకి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవహిస్తే, కంప్లి–గంగావతి లింక్ వంతెన మునిగిపోవడంతోపాటు ఆలయం, కోట ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. -
మృతదేహంతో నిందితుడి ఇంటిఎదుట ధర్నా
హుబ్లీ: హాసన్ జిల్లా హరసికెరి రైల్వే పట్టాలపై రక్త గాయాలతో మృతి చెందిన నవ వివాహితది హత్య అని ఆరోపిస్తూ మృతురాలికుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. వివరాలు....దావణగెరి జిల్లా చెన్నగిరి తాలూకా అనజి గ్రామ నివాసి విద్య (24)కు ఆరు నెలల క్రితం ఇదే తాలూకా సోమలాపుర గ్రామ నివాసి, కానిస్టేబుల్ శివుతో వివాహమైంది. దంపతులు బెంగళూరులో నివసించే వారు. అకస్మికంగా విద్య కనిపించకుండా పోవడంతో భర్త శివు గత నెల 30 బెంగళూరు శంకరపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు హాసన్ జిల్లా అరసికెరె రైల్వే పట్టాలపై విద్య రక్తగాయాలతో కనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమెది సహజ మరణం కాదని, కట్నం కోసం వేధించి హత్య చేశారని ఆరోపిస్తూ భర్త శివు, ఆయన తల్లి గాయత్రమ్మ, తండ్రి గుడప్ప, చెల్లెలు శిల్పపై హరసికెర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆమెకు అంత్యక్రియలు చేయాలంటే తొలుత నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు శివు ఇంటి ఎదుట ధర్నా చేశారు. నిందితుడు శివును అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు. -
అధ్వానంగా కార్యాలయ ఆవరణ
సాక్షి,బళ్లారి: కన్నడ భాష పరిరక్షణకు నగరంలోని అనంతపురం రోడ్డు(రాజ్కుమార్రోడ్డు)లో ఏర్పాటు చేసిన కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణ అధ్వానంగా తయారైంది. జిల్లాధికారి బంగ్లా పక్కానే ఉన్న ఈ కార్యాలయంలో పరిసరాల్లో చెత్తా చెదారం చేరిది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండటంతో వందలాది మంది విద్యార్థులు, నగర వాసులు వచ్చి జ్ఞానార్జన పొందుతుంటారు. ఇదే ఆవరణలో నగరవాసులు ఏదయం, సాయంత్రం వాకింగ్కు వస్తుంటారు. స్వచ్ఛత కరువు కావడంతో వ్యాహాళికి వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇదే కార్యాలయ ఆవరణలో అధునాతన భవనాలు నిర్మించారు. వాటిని వినియోగించకుండా వృథాగా వదిలేశారు అక్కడి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంచినీటి సంపు క్లీన్ చేయకపోవడంతో అందులో చెత్తాచెదారం పడిపోయింది. మరుగుదొడ్లు కూడా దుస్థితికి చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయని వ్యాహాళికి వచ్చినవారు వాపోతున్నారు. కన్నడ సంస్కృతి శాఖ కార్యాలయ ఆవరణంలో సమస్యలపై సామాజిక కార్యకర్త వెంటకరెడ్డి మాట్లాడుతూ కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణంలో నెలకొన్న దుస్థితికి అధికారికి చెబితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని సూచించారు. వృథాగా భవనాలు ఆవరణలో పారిశుధ్య లోపం వ్యాహాళికి వస్తే కంపు, దుర్వాసన స్వాగతం పట్టించుకోని అధికారులు -
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కేజీఎఫ్: కార్మిక సంఘాలు అన్నీ ఐకమత్యంగా వస్తే బిజిఎంఎల్, బిఈఎంఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీ ఎం.మల్లేష్బాబు తెలిపారు. శనివారం నగరంలోని ఉరిగాం అతిథి గృహంలో కెజీఎఫ్ ఉళిసోణ ఎకతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు గత 25 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని, ఇందుకు కార్మిక సంఘాలు కూడా సహకారం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి కూడా తీసుకు వెళ్లామని, అయితే కార్మికులు పలు సమస్యలపై పట్టు విడవకపోవడం వల్ల పరిష్కారం కావడం లేదన్నారు. బిజిఎంఎల్ కార్మికులకు ఇళ్లు సొంతం కావాలంటే అదనంగా ఉన్న ఇళ్లను వాపసు చేయాల్సి ఉంటుందన్నారు. జేడీఎస్ నాయకులు సిఎంఆర్ శ్రీనాథ్, బణకనహళ్లి నటరాజ్, సేవ్ కేజీఎఫ్ కార్యదర్శి దయానంద తదితరులు పాల్గొన్నారు. -
శరావతి నదిపై మెగా వంతెన
శివమొగ్గ: దేశంలో ఆతి పెద్దదైన కేబుల్ వంతెనల్లో రెండవదిగా పేరుపొందిన బ్రిడ్జి శివమొగ్గ జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైంది. శరావతి నది మీద ఉంది, ఇక్కడి ప్రజలకు అనేక సంవత్సరాల స్వప్నమైన వంతెన ఇది. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరు వంతెనను జూలై 14వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని జిల్లా ఎంపీ బీ.వై.రాఘవేంద్ర తెలిపారు. శనివారం శివమొగ్గ నగరంలోని తమ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ. 473 కోట్ల ఖర్చుతో నిర్మాణమైందని, 14న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని తెలిపారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. సిగందూరు చౌడేశ్వరి దేవి వంతెన కళస వద్ద సాగర తాలూకాలో అంబరగొండ్లు– కళసవల్లి అనే ఊర్ల మధ్య ఈ వంతెన నిర్మాణమైంది. ఇక్కడ శరావతి నది వల్ల ఏడాదిలో చాలా నెలలు రోడ్లు మునిగిపోతాయి. తెప్పలు, పడవలే శరణ్యం. ఎన్నో ఏళ్లుగా తమకు వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 17 పిల్లర్లతో దీని పొడవు 2.44 కిలోమీటర్లు. రెండు లేన్లతో పాటు ఫుట్పాత్లు ఉన్నాయి. సిగందూరులోని ప్రఖ్యాత చౌడేశ్వరి దేవి దేవస్థానాన్ని గౌరవిస్తూ వంతెనకు ఆమె పేరునే పెట్టారు. దీనికి 2018లో నితిన్ గడ్కరీనే శంకుస్థాపన చేయడం గమనార్హం. ఈ తరహా బ్రిడ్జి కర్ణాటకలో ఇదే మొదటిదని నిపుణులు తెలిపారు. వంతెన నిర్మాణం ఘనత తమదంటే తమదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారు. 2.44 కి.మీ. పొడవుతో నిర్మాణం శివమొగ్గ జిల్లాలో వినూత్న కేబుల్ బ్రిడ్జి 14న ప్రారంభోత్సవం -
స్వామీ వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
రాయచూరు రూరల్: నగరంలోని సర్వోదయ పాఠశాలలో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామీ వివేకానంద పుణ్యరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వామి రావ్ మాట్లాడారు. విద్యార్థులు వివేకానందను ఆదర్శంగా తీసుకోవాన్నారు. ఆయన జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర, ప్రవీణ్, డాక్టర్ అనంద్ పడ్నిస్, హన్మంతరావ్, రామరావ్, వినోద్, జానకి, దానమ్మ, అశ్విని, సంతో్స్ కుమార్, నివేదిత, శ్రీపాద, గురురాజ, వినోద సాగర్, ఉమా, నరసింహమూర్తి పాల్గొన్నారు. -
కళ్యాణ కర్ణాటకను కరుణించని వరుణుడు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీప్ సీజన్ ఆరంభమై నెల రోజలు గడిచినా చుక్కవాన లేదు. దీంతో రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. ఎటు చూసినా ఖాళీ భూములు దర్శనం ఇస్తున్నాయి. కళ్యాణ కర్ణాటకలో కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలు ఉన్నాయి. వర్షాభావంతో విత్తనమే పడలేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా మేఘాల జాడ కూడా కనిపించకపోవడంతో అన్నదాతలు నిర్వేదంతో ఉన్నారు. రాయచూరు జిల్లాలో 5.4 లక్షల హెక్టార్లలో విత్తనం పడాల్సి ఉండగా ఇప్పటివరకు 25వేల హెక్టార్లో మాత్రమే విత్తనం చేశారు. పత్తి, కంది, సూర్యకాంతి, సజ్జ పంటలు అక్కడక్కడ సాగయ్యాయి. వర్షం లేక అవికూడా మొక్కలు వాడుముఖం పట్టాయి. విత్తనం వేయని రైతులు వరుణుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్లో వర్షాలు శూన్యం అన్నదాతల్లో నిర్వేదం బీళ్లతను తలపిస్తున్న పొలాలు -
ఎల్లో లైన్లో మెట్రో రైళ్లను నడపాలి
యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రో ఎల్లో లైన్లో రైలు మార్గం నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర రూట్లో సర్వీసులను ప్రారంభించాలని నగర బీజేపీ నాయకులు శనివారం లాల్బాగ్ పార్కు ముందు ఆందోళన చేశారు. ఎంపీలు తేజస్వీ సూర్య, పీసీ మోహన్, ఎమ్మెల్యే రామమూర్తి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఎంఆర్సీఎల్ సంస్థ బెంగళూరు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభిస్తే 10 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సిల్క్ బోర్డ్ వద్ద ప్రజలు బస్సుల కోసం గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోందని చెప్పారు. నెల రోజుల్లో పూర్తి చేస్తాం ఆగస్ట్ 15లోపు బెంగళూరు సొరంగ మార్గంలో రైలు సంచారాన్ని ప్రారంభించనున్నట్లు బీఎంఆర్సీఎల్ ఎండి మహశ్వర్రావ్ తెలిపారు. బీజేపీ నిరసనపై ఆయన స్పందిస్తూ ఎల్లో మార్గంలో మెట్రో సంచారానికి మూడు కోచ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. భద్రతా తనిఖీలు, మిగిలిన పనులను నెల రోజులలో పూర్తి చేసి త్వరలోనే మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. జయనగరలో వంతెనను నిర్మించాలని డిమాండ్లు వచ్చాయన్నారు. బీజేపీ ఎంపీల ధర్నా -
రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించండి
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వే స్టేషన్లో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షణ మధ్య రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యులు డిమాండ్ చేిశారు. ఈమేరకు సభ్యులు చంద్ర శేఖర్, మారెప్ప, సిద్దలింగయ్య స్వామిలు శనివారం స్టేషన్ మేనేజర్తో సమావేశమై చర్చించారు. ఫ్లాట్ఫారంలో టైల్స్ తొలగిపోయాయని, వాటిని మార్చాలన్నారు. ప్లాట్ఫారంపై అపరిశుభ్రత నెలకొందని, లగేజి గది, మహిళల విశ్రాంతిగది, స్టేషన్లో కుక్కులు సంచరిస్తున్నాయన్నారు. దివ్యాంగులకు సదుపాయాలు లేవన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కొల్హాపూర్ రైలును పునః ప్రారం భించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు హేమరాజ గౌడ, అమరనాథ్ పాల్గొన్నారు. -
బస్సు పల్టీ.. 25 మందికి గాయాలు
మండ్య: వేగంగా వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట పొలంలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో సమారు 25 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మండ్య తాలూకాలోని శివళ్ళి, హాడ్యా గ్రామాల మధ్య జరిగింది. మండ్య నుంచి శివళ్ళి మీదుగా పాండవపురకు వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. స్థానికులు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నకిలీ హెల్మెట్లపై కొరడా దొడ్డబళ్లాపురం: ఊరూ పేరూ లేని నకిలీ హెల్మెట్లు, నాసిరకం హెల్మెట్లను అమ్ముతున్న షాపులపై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులో శనివారంనాడు 19 చోట్ల తనిఖీలు చేసి, 6 దుకాణదారులకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించారు. సిద్ధయ్య రోడ్డు, కలాసిపాళ్య, లాల్ బాగ్ రోడ్డు, మాగడి రోడ్డు, సుమనహళ్లి, విజయనగర, దాసరహళ్లి, నాగరభావి, ఔటర్ రింగ్ రోడ్డుల్లో దాడులు చేపట్టారు. నోటీసులు ఇచ్చి కోర్టులో జరిమానా కట్టాలని సూచించారు. పెద్దసంఖ్యలో నకిలీ హెల్మెట్ల స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ హెల్మెట్లు ధరించిన 38 బైకిస్టులకు కూడా జరిమానాలు వేశారు. సగం హెల్మెట్లు, ఐఎస్ఐ మార్కులేని హెల్మెట్లు ఉపయోగిస్తున్నవారికి కూడా ఫైన్ వేశారు. తుపాకీతో ఎమ్మెల్యే పుత్రుని హల్చల్ దొడ్డబళ్లాపురం: జాతరలో పోలీసుల ముందే ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా లక్ష్మిదేవి జాతరలో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి కుమారుడు సంతోష్ జార్కిహొళి కాల్పులు జరిపాడు. జాతరలో సంతోష్ కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకుని పిస్టల్ తీసి గాల్లోకి కాల్చాడు. కాల్పుల శబ్ధాలకు జనం భయపడిపోయారు. ఈ దృశ్యాలు వైరల్ కాగా, అతని అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ముందు కాల్పులు జరిపినా వారు పట్టించుకోలేదని, శాంతిభద్రతలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నించారు. -
8న సిలికాన్ సిటీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సమర్థనం ట్రస్టు కార్యాలయంలో కేక్ కట్ చేసి పేదలు, వృద్ధులు, పిల్లలకు అన్నదానం నిర్వహిస్తారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ వింగ్టీమ్ విజ్ఞప్తి చేసింది. హాజరయ్యేవారు పండ్లు, బిస్కెట్లు తీసుకువచ్చి వృద్ధులకు, పిల్లలకు అందజేయవచ్చని పేర్కొంది. వివరాలకు 9035193106, 9945207998, 9703518965 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. -
పేదలకు నోటీసులు తగదు
రాయచూరు రూరల్: నగరంలో మావినకెరె చెరువు గట్టుపై నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు అందజేయడం తగదని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాదికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జైభీమ్ మాట్లాడారు. మావినకెరె చెరువు గట్టును కబ్జా చేసిన పేదలకు వారం రోజుల్లో స్థలాలను ఖాళీ చేయాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. 1999లో 14 మంది నగరసభలో ఆస్తి పన్ను కట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గురువారం సాయంత్రం స్థలాలను ఖాళీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
తుంగభద్ర వరద యథాతథం
సాక్షి,బళ్లారి/హొసపేటె: గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటివారంలోనే తుంగభద్రమ్మ కళకళలాడుతోంది. డ్యాంలోకి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో డ్యాం వద్ద 20 క్రస్ట్గేట్లను రెండు అడుగులు మేర పైకెత్తి నదికి సుమారు 60 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి ప్రధాన జలాశయమైన తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ఆ మూడు రాష్ట్రాలకు చెందిన ఆయకట్టు రైతులు సకాలంలో పంటలను సాగు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. డ్యాం నుంచి నదికి నీరు వదిలిన తరుణంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ సమీపంలోని పురంధర దాస మంటపం నీట మునిగింది. తుంగభద్ర డ్యాంకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో అనుకున్న సమయం కన్నా ముందుగానే డ్యాం నిండిపోయింది. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్గేటు కొట్టుకుపోగా, అనంతరం తాత్కాలికంగా మరమ్మతులు చేసి స్టాప్లాగ్ గేటును అమర్చిన సంగతి విదితమే. లోతట్టుకు పొంచి ఉన్న ముప్పు అయితే గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో అన్ని క్రస్ట్గేట్లను పూర్తిగా మార్చాలని నిపుణులు సూచించినందున తుంగభద్ర డ్యాంలో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి వరద నీటిని నదికి వదులుతున్నారు. దీంతో నదిలోకి భారీ స్థాయిలో నీరు చేరుతోంది. డ్యాంలో ప్రస్తుతం 75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలారు. ఏ క్షణంలోనైనా వరద నీరు మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే నదికి భారీగా నీరు వదలడంతో పురంధర దాస మంటపం మునిగిపోయిన నేపథ్యంలో మరింత నీటి ప్రవాహం పెరిగితే కంప్లి, గంగావతి తాలూకాల్లో నదీ తీర ప్రాంతాల్లో పంటలు నీటమునిగే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో పంటలు నీటమునిగేవి. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో డ్యాంలోకి భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 75.837 టీఎంసీలు, నీటిమట్టం 1624.80 అడుగులు, ఇన్ఫ్లో 35,052 క్యూసెక్కులు ఉందని బోర్డు అధికారులు తెలిపారు. టీబీ డ్యాం వద్ద 20 క్రస్ట్గేట్ల ఎత్తివేత 60 వేల క్యూసెక్కులు నదికి విడుదల హంపీలో పురంధర మంటపం మునక వరద నీటితో తుంగభద్ర డ్యాంకు జలకళ -
కారు లారీని ఢీకొని దంపతుల మృతి
● ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ శివార్లలో జాతీయ రహదారి–50లోని జెస్కాం కార్యాలయం ముందు కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. బాగల్కోటె జిల్లాలోని శెట్టిహాళు గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ ముత్తప్ప పూజార్(35), అతని భార్య రేణుక(30), పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తల్లీకుమారుల అదృశ్యంహొసపేటె: నగరంలోని 22వ వార్డు ఆశ్రయ కాలనీలో తల్లీకుమారులు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ తెలిపారు. ముంతాజ్బేగం(42), ఆమె కుమారుడు వసీం అక్రం(13) గత నెల 13న తప్పిపోగా, మహిళ తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, గుండ్రని ముఖం, 5.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి కన్నడ, ఉర్దూలో మాట్లాడుతుంది. గోధుమ, తెల్ల రంగు పూల డిజైన్ చీర ధరించింది. ఆమె వీపుపై కుడి వైపున ఒక నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన బాలుడు తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, నీలి రంగు ముఖం, 4.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి, కన్నడ, ఉర్దూలో మాట్లాడతాడు. అతను తెల్లటి టీ షర్టు, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన తల్లీ కుమారుల ఆచూకీ ఏమైనా తెలిస్తే హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ లేదా 9480807700 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. నాణ్యతగా నిర్మాణ పనులతోనే జాప్యంబళ్లారి అర్బన్: నగరంలో ప్రగతి పథంలో సాగుతున్న వివిధ నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం జరగడం లేదని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే సమయం పడుతోందని, ఈ విషయంలో విపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. గాంధీనగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఏ పనులు కూడా కావాలని ఆలస్యం చేయడం లేదన్నారు. అన్నీ అనుకున్న గడువులోనే పూర్తి చేస్తామన్నారు. సుధా క్రాస్ రైల్వే వంతెన పనులు నిలిచి పోయాయన్నారు. ఆ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించడంతోనే తాత్కాలికంగా పనులను నిలిపి వేశారన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలు రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల గురించి స్పందించిన ఆయన సీఎం, కేపీసీసీ అధ్యక్షుల గురించి మాట్లాడేంత స్థాయికి తాను ఇంకా ఎదగలేదన్నారు. అలాగే ఏ మంత్రి పదవిని తాను కోరుకోలేదన్నారు. ఒకటి, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశించడం సరికాదన్నారు. ఇంట్లో చోరీకి దొంగల యత్నం హొసపేటె: దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటెలోని సంక్లాపురలో జరిగింది. దొంగల కదలికలు అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పద్మావతి అనే మహిళకు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి యత్నించినా ఎలాంటి విలువైన వస్తువులు లేదా డబ్బు కనిపించక పోవడంతో వట్టి చేతులతో వెనుతిరిగారు. హొసపేటె రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటిని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించరూరాయచూరు రూరల్: నగరంలో మరుగుదొడ్లు నిర్మించాలని దళిత మౌళిక సౌకర్యాల హక్కుల పోరాట సమితి సేవకుడు శరణ బసవ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. దేవినగర్, బుద్ధనగర్ మురికి వాడల్లో 1200 మంది పేద కార్మికులు నివసిస్తున్నారని, కనీసం 5 చోట్ల మరుగుదొడ్లు నిర్మించి నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ నగరసభ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
కొనసాగిన ఆటోల తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలో నాలుగో రోజు 200 ఆటోలను తనిఖీ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. శుక్రవారం పోలీస్ స్టేన్లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేని వాటిని చెక్ చేసి సీజ్ చేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.70 వేలు వసూలు చేశామన్నారు. ఆగస్టు ఒకటో తేదీలోగా ఆటోడ్రైవర్లు, యజమానులు తమ రికార్డులను సరి చేసుకోవాలన్నారు. ఎస్పీని బదిలీ చేయొద్దురాయచూరు రూరల్: యాదగిరి జిల్లా ఎస్పీ ప్రథ్వీశంకర్ను బదిలీ చేయవద్దని మాజీ మంత్రి రాజుగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణ, మట్కా, జూదం, ఇతరత్ర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారని, అలాంటి నిజాయితీ అధికారిని బదిలీ చేయకుండా యాదగిరి జిల్లాలోనే కొనసాగించాలని, ప్రామాణికతతో విధులు నిర్వహించే అధికారులను బదిలీ చేయవద్దని కోరినట్లు తెలిపారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనరాయచూరు రూరల్: నగరంలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. శుక్రవారం హాజీ కాలనీలో మైనార్టీ సోదరులు నమాజ్ అనంతరం మూకుమ్మడిగా ప్రార్థనలు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి తీసుకున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రెండు గంటల పాటు నిరసన ప్రదర్శనను జరిపారు. అసంఘటిత కార్మికులకు స్మార్ట్కార్డ్లు హొసపేటె: రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన 35 లక్షల మంది కార్మికులను గుర్తించి, ఉచితంగా నమోదు చేయించి వారికి స్మార్ట్ కార్డ్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని కార్మిక శాఖ మంత్రి, సంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి అధ్యక్షుడు సంతోష్లాడ్ అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని మల్లిగె హోటల్లో ఏర్పాటు చేసిన అసంఘటిత కార్మికులకు స్మార్ట్ కార్డ్ల పంపిణీ, వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచ గ్యారంటీల అమలుపై విపక్షాలు చేసిన అన్ని ఆరోపణలకు కేవలం రెండు నెలలకే గ్యారెంటీ పథకాలను అమలు చేసి తగిన జవాబు చెప్పామన్నారు. రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి నేరుగా రూ.60 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.3 లక్షల కోట్లను ఇచ్చే దేశంలోని ఏకై క సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, లతా మల్లికార్జున, జిల్లాధికారి దివాకర్, హుడా అధ్యక్షుడు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్గా డాక్టర్ ఈశ్వర్ హొసమని హుబ్లీ: కర్ణాటక మెడికల్ కళాశాల(కేఎంసీ) పరిశోధన సంస్థ ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎఫ్ కమ్మరా శుక్రవారం డాక్టర్ ఈశ్వర్కు బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆకస్మికంగా ఆదేశాలను వెల్లడించింది. శస్త్ర చికిత్స విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని సదరు ఆస్పత్రి ఇన్చార్జి ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరిస్తారు. ఈ కళాశాలలోనే ఎంబీబీఎస్, ఎంఎస్ చదివిన ఆయన 2006 నుంచి ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. -
కళలు, కళాకారులను కాపాడుకోవాలి
బళ్లారి అర్బన్: కళలు, కళాకారులను పరిరక్షించుకొని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హచ్చొళ్లి వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ హెచ్కే.సిద్దయ్య స్వామి పేర్కొన్నారు. సిరుగుప్ప తాలూకా కుడుదరహాళ గ్రామం దేవి పుణ్య ఆశ్రమం, ఎళెవాళ సిద్దయ్య స్వామి బయలురంగ మందిరంలో హంద్యాళ మహాదేవ తాత కళా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన నాటక హబ్బ–2025 సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేడు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత యువతలో కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో మహాదేవతాత కళా సంఘం కృషి ప్రశంసనీయం అన్నారు. ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ కళాకారుడు పురుషోత్తం హంద్యాళ్ మాట్లాడుతూ మానవ సంబంధాలు జీవితంలో అవిభాజ్య అంగం అన్నారు. మానసిక భావనాత్మక యోగ క్షేమాలు, పరస్పర సహకారంతో జీవితం నిర్వహణకు సంబంధాలు చాలా ముఖ్యం అన్నారు. ఆశ్రమ పీఠాధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ తాతతో సంబంధాలు స్వచ్ఛంద అవగాహన, వ్యక్తిత్వ ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. కార్యక్రమంలో కుమార్ ప్రసాద్ సంగీతం అందించగా, సిరిగేరి ధాత్రి రంగ సంస్థ కళాకారుల బృందం సంబంధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖులు బీ.వెంకటేష్, కాసింసాబ్, జ్ఞానరెడ్డి, పాలాక్షి గౌడ, బుశప్ప తదితరులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
పంచ గ్యారెంటీలకే సమయం లేదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచ గ్యారెంటీల అమలుకే సమయం లేదు, ఇక అభివృద్ధి ఎక్కడ ఉందని, ముఖ్యమంత్రి పదవికి ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర జనతాదళ్(ఎస్) యువ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం బీదర్ జిల్లాలో ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పదవికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య పగటి కలలు కంటున్నారన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు మిన్నంటాయన్నారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలు బట్టబయలు అవుతున్నాయన్నారు. మధ్యవర్తుల ఆధారంగా కమీషన్ల దందాలతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవం జరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదన్నారు. రైతులు పండించిన వరి, జొన్న పంటలకు రక్షణ కల్పించలేదన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తరుణంలో కుమారస్వామి మామిడి, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండెప్ప కాశంపూర్, వెంకట్రావ్ నాడగౌడ, హన్మంతప్ప ఆల్కోడ, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, చంద్రశేఖర్, రశ్మి రామేగౌడలున్నారు. ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవికి దోబూచులాట యువ జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి -
తుంగ..భద్ర గలగలా పరవళ్లు
యశవంతపుర/ శివమొగ్గ: కరావళి– మలెనాడు ప్రాంతాలలో భారీగా వానలు పడుతున్నాయి. తుంగానదీ నీటి మట్టం విపరీతంగా పెరిగింది. చిక్కమగళూరు జిల్లా శృంగేరి కెరెకట్ట ప్రాంతంలో పడుతున్న వానలతో శృంగేరి శారద మఠం గాంధీ మైదానం నీటితో నిండిపోయింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా బ్యారికేడ్ను వేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఎడతెరిపిలేని వానలతో తుంగా నదీ అపాయకర స్థాయిలో ప్రవహిస్తోంది. కళస తాలూకా చన్నహడ్లు గ్రామం వద్ద మట్టి చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. హిరైబెలు మల్లేశనగుడ్డతో పాటు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో కొప్ప, శృంగేరి, ఎన్ఆర్పుర, మూడిగెరె తాలూకాలలో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అహితకర ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు చర్యలను చేపట్టారు. 8 జిల్లాల వ్యాప్తిలో శనివారం రాత్రి వరకు భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, హాసన్, కొడగు, శివమొగ్గ, బెళగావి జిల్లాల పరిధిలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. శివమొగ్గ జిల్లాలో బడులకు సెలవులిచ్చారు. తుంగ, భద్ర నదులు కలిసి మరింత ఉధృతరూపం దాల్చాయి. పోటెత్తిన తుంగా నది పరివాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తున్న కారణంగా శివమొగ్గ తాలూకాలోని గాజనూరులోని తుంగా జలాశయం ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆనకట్ట ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకొన్నందున నీటిని భారీగా వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 77 వేల క్యూసెక్కుల వదిలినట్లు ఆనకట్ట ఇంజనీర్ తిప్పనాయక్ తెలిపారు. దీంతో దిగువన తుంగా నది పోటెత్తుతోంది. నీటి విడుదల వల్ల శివమొగ్గ నగరం గుండా వెళ్లే తుంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కోర్పలయ్య గుడిసె దగ్గర ప్రమాద స్థాయిని ప్రదర్శించే కట్ట మీదుగా నీరు వెళ్తోంది. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చొరబడే ప్రమాదం ఉంది, నీరు చేరికతో తుంగభద్ర నది జోరు మీదుంది. శివమొగ్గ వద్ద తుంగ డ్యాం నుంచి భారీగా నీటి విడుదలతుంగా డ్యాం నుంచి 77 వేల క్యూసెక్కుల విడుదల -
రాత్రంతా కావేరి నదిలో చిక్కి..
మండ్య: భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంత ఆపద వచ్చినా ప్రాణాలు పోవంటారు. అలాంటిదే ఈ సంఘటన. ఆత్మహత్య చేసుకోవడానికి కావేరి నదిలోకి దూకిన యువతి ఒకరు ప్రవాహంలో ఉన్న చెట్టుకు చిక్కుకొని రాత్రి మొత్తం కొట్టుమిట్టాడింది. చివరకు ప్రజలు, పోలీసులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ ఆశ్చర్యకర సంఘటన మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని మహాదేవపుర గ్రామంలో జరిగింది. ఇంట్లో గొడవపడి వివరాలు.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో నివసించే పవిత్ర (19), ఓ కాలేజీలో ఎల్ఎల్బీ చదువుతోంది. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఏదో గొడవ జరిగింది. ఇంటి నుంచి బయటికి వచ్చి మైసూరులో ఉన్న బంధువుల ఇంటికని బయల్దేరింది. అయితే శ్రీరంగపట్టణానికి వచ్చి మహాదేవపుర గ్రామానికి వెళ్లింది. అక్కడ వంతెన పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి నదిలోకి దూకింది. ప్రవాహంలో చాలా దూరం కొట్టుకొని వెళ్ళి ఓ చోట చెట్టుకు చిక్కుకుంది. రాత్రంతా అలాగే ఉండిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను చూసిన ప్రజలు వెంటనే అరికెరె పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపారు. నది మధ్యలో చెట్టుకు చిక్కిన పవిత్రను కాపాడి ఆస్పత్రిలో చేర్పించి ఆమె కుటుంబానికి సమాచారమిచ్చారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి అనూహ్యంగా బయటపడిన వైనం -
బావిలోకి పడ్డ నక్క
గౌరిబిదనూరు: తాలూకా కడబూరు సమీపంలో రామకృష్ణారెడ్డి పొలంలోని బావిలోకి గురువారం రాత్రి ఓ నక్క పడిపోయింది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు నక్కను చూసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీ సిబ్బంది వచ్చి నక్కను తీసుకెళ్లి సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టారు. భార్య దెబ్బలకు భర్త హతం ● బెంగళూరులో ఘటన దొడ్డబళ్లాపురం: భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. సీఎం మార్పు వారి వ్యవహారం: కుమార మండ్య: ముఖ్యమంత్రిని మారుస్తారా... వేరేవారు ముఖ్యమంత్రి అవుతారా అనే విషయం నాకు అనవసరం. అదంతా కాంగ్రెస్ వ్యవహారం, నేను తల బద్ధలు కొట్టుకోవాల్సిన పని లేదు అని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. శుక్రవారం మండ్య నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సీఎం మార్పు జరుగుతుందని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ త్వరలో రాష్ట్రమంతటా పర్యటిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది హైకమాండ్లు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. గంగమ్మకు బిస్కెట్ల శోభ చింతామణి: పట్టణం వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి ఆషాడ మాస రెండవ శుక్రవారం సందర్భంగా బిస్కెట్లతో వినూత్నంగా అలంకరించారు. అర్చకులు సురేష్ ఉదయమే అమ్మవారికి అభిషేకం, అలంకారం జరిపి, విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించి తరించారు. -
వీడియో కాల్ చేసి.. ఆత్మహత్య
● సహజీవనంలో విషాదం యశవంతపుర: నేటి రోజుల్లో సహ జీవనం వెంట పరుగులు తీస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా విరాజపేటలో జరిగింది. వివరాలు.. స్థానిక గాంధీనగరలో ఉండే సాగర్ (30) కరెంటు స్తంభాలను నాటే పని చేస్తున్నాడు. ఆటో కూడా నడిపేవాడు. ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు. అతడు తరచూ మద్యం తాగి రావడంతో ఆమె గొడవ పడేది. రెండు రోజుల క్రితం ఇలాగే పోట్లాట జరిగింది. ఊరికి వెళ్లివచ్చిన సాగర్ మహిళ లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించలేదు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ప్రియురాలు దూరమైపోతుందనే భయంతో వీడియో కాల్ చేసి ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించినా పట్టించుకోలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కొడుకు ఇంటికి రాగా సాగర్ శవమై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆగని హృదయాఘాతం
యశవంతపుర/ దొడ్డబళ్లాపురం: రాష్ట్రవ్యాప్తంగా గుండెపోటు విషాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. హాసన్, మండ్య, బెంగళూరు ప్రాంతాల్లో శుక్రవారం ఐదుమంది కన్నుమూశారు. గత 45 రోజుల నుంచి హాసన జిల్లాలోనే గుండెపోటు మరణాల సంఖ్య 34కు పెరిగింది. హాసన్లో యువకుడు... ● హాసన్కు సమీపంలోని చిక్కకొండ చిట్నిహళ్లి గ్రామంలో మదన్ (21) అనే యువకుడు గుండె పట్టుకుని చనిపోయాడు. తల్లితో కలిసి చన్నపట్టణలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల చిక్కకొండలోని బావ ఇంకికి వచ్చారు. గురువారం రాత్రి ఎదలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. ● హాసన్ జిల్లా ఆలూరు తాలూకా కల్లహళ్లి గ్రామానికి చెందిన రాజమ్మ జూన్ 14న ఇంటిలో వంట పని చేస్తుండగా కిందపడి చనిపోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ● హాసన్ నగరానికి చెందిన బీఎం విమల (55) అనే మహిళ కొప్పలో ఇంటిలో పని చేస్తుండగా గురువారం రాత్రి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ తక్షణం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ● మండ్య జిల్లా మళవళ్లి తాలూకా బాళెహొన్నగ గ్రామంలో శిల్పా (45) ఇంట్లో పాత్రలను శుభ్రం చేస్తుండగా గుండెపోటుతో మరణించింది. ధర్నాకు వస్తూ రైతు నేత... దేవనహళ్లి తాలూకాలో భూస్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారంనాడు బెంగళూరులో జరుగుతున్న రైతుల పోరాటంలో పాల్గొనడానికి వస్తున్న రైతు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన బెంగళూరులో క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ సర్కిల్లో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబరహుండి గ్రామం నివాసి అయిన రైతు నేత ఈశ్వర్ (40), ధర్నాలో పాల్గొనడానికి ఫ్రీడంపార్క్ కు వస్తున్నాడు. రైలులో వచ్చిన ఈశ్వర్ ఫ్రీడం పార్క్కు వస్తూ సర్కిల్లో కుప్పకూలిపోయాడు. రైతులు అతన్ని శేషాద్రిపురం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక చనిపోయాడు. రైతులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. రైతు నాయకుడు ఈశ్వర్ (ఫైల్) రాష్ట్రంలో మరో ఐదుమంది తుదిశ్వాస నిరసనకు వస్తూ రైతునేత హఠాన్మరణంకోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు: కమిటీ రాష్ట్రంలో జరుగుతున్న గుండెపోటు మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సాంకేతిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. 10 మంది నిపుణులు కలిగిన కమిటీ ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కోవిడ్కు గురైన వారిలో స్వల్ప హృదయ సమస్యలు తలెత్తాయని, అయితే గుండెపోటుకు ఆ వ్యాక్సిన్ కారణం కాదని పేర్కొన్నారు. కోవిడ్ సోకిన వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించినట్టు తెలిపారు. 15 ఏళ్ల వయసు నుంచి పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. పాఠ్య పుస్తకాల్లో కూడా గుండెపోటుకు గురించి పాఠ్యాంశం చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని తప్పనిసరిగా నిషేధించాలని, గుండె సమస్యల రిజిస్టర్ ను ప్రారంభించాలని తెలిపారు. గుండెపోటుతో చనిపోయినవారికి పోస్టుమార్టం నిర్వహించి గుర్తించిన అంశాలను నమోదు చేయాలని, జిల్లా ఆస్పత్రులలో రక్తాన్ని పలుచన చేసే ట్యాబ్లెట్లు నిల్వ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. -
జై మాతా చాముండేశ్వరి
మైసూరు: ఆషాఢ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధ చాముండికొండ పైన వెలసిన నాడిన శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. సిరులు కురిపించే లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. గత శుక్రవారం సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడిన భక్తులు ఈ వారం సజావుగానే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. పూలతో అమ్మవారి ముఖం, త్రిశూలం, ఓం స్వస్తిక్ చిత్రటాలను రూపొందించారు. తెల్లవారుజామునే దేవాలయం ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో చాముండేశ్వరి దేవికి పంచామృతాలతో అభిషేకం చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలోను వివిధ పూలతో అలంకరించారు. పలు రాష్ట్రాల నుంచి రాక రాష్ట్రం నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తారు. భక్తులకు సాధారణ దర్శనంతో పాటు రూ 2 వేల టికెట్, రూ.300 టికెట్ల ద్వారా దర్శనాలు కల్పించారు. మైసూరు నగరంలోని లలిత మహాల్ మైదానం నుంచి భక్తులకు ఉచిత బస్సులను నడిపారు. ప్రముఖుల పూజలు డిప్యూటీ సీఎం డీ శివకుమార్, వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి, మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, కొందరు ఎమ్మెల్యేలు, అలాగే ప్రముఖ నటుడు దర్శన్ తదితరులు విశేష పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆషాఢ శుక్రవారం పోటెత్తిన భక్తులు -
బెంగళూరుపై సైబర్ పడగ
బనశంకరి: సైబర్ వంచనలపైపోలీసు శాఖ ప్రజలను జాగృతి చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. ప్రజల అత్యాసే వారికి అస్త్రంగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో సైబర్ వంచనలు పెరిగిపోతున్నాయి. సైబర్ వంచకులు ఎక్కడో మారుమూల కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకొని ప్రజల బ్యాంకు ఖాతాలకు కన్నం వేస్తున్నారు. 2024లో ఒకే ఏడాదిలో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2.914.97 కోట్లు సైబర్ వంచకుల అకౌంట్లకు బదిలీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 6,11,688 కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. నగదు పోగొట్టుకున్న బాధితుల నుంచి వెనక్కివచ్చింది కేవలం 20 శాతం కంటే తక్కువగా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. అనేక రూపాల్లో మోసాలు పెట్టుబడి, ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, పేమెంట్, భూమి, ముందస్తు నగదు చెల్లింపు, సోషల్ మీడియా, ఓఎల్ఎక్స్, బిజినెస్ అవకాశం, ప్రకటనలు, గిప్టు, ఏపీకే, మ్యాట్రిమోనియల్తో పాటు వివిధ పేర్లతో వంచకులు కస్టమర్లను వంచనకు తెగబడుతున్నారు. ప్రభుత్వానికి సీఐడీ నివేదిక.... సైబర్ నేరాలపై అధ్యయనం చేసిన సైబర్ నేరాల విబాగం శిక్షణ, పరిశోధన కేంద్రం(సీఐడీ) ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సైబర్ కేసుల్లో అక్రమ నగదు బదిలీకి నకిలీ అకౌంట్లు వినియోగిస్తున్నారు. వంచనకు సంబంధించి నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్బీ)లో నమోదైన ఫిర్యాదులతో పాటు బ్యాంకింగ్ రంగంలో నియంత్రణకు రాని వంచనల గురించి నివేదిక అందించింది. బెంగళూరు నగరంలోనే అధికం... బెంగళూరు నగరంలో అత్యధికంగా సైబర్ వంచన కేసులు నమోదయ్యాయి. వివిధ సైబర్ పోలీస్ స్టేషన్లతో పాటు మొత్తం 19 స్టేషన్లలో 4,092 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా మొత్తం రూ.664 కోట్లు దోచేశారు. సైబర్ నేరాల్లో 42.9 శాతం బెంగళూరు నగరంలో నమోదు కాగా ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచిన నకిలీ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.1,859.9 కోట్లు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఫేక్ అకౌంట్ల నుంచి రూ.948 కోట్లు వంచనకు గురైంది. రాష్ట్రంలో ఒకే ఏడాది రూ.2,914 కోట్లు దోచారు ఉద్యాన నగరిలో రూ.664 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు బెంగళూరు మహానగరంలో 4092 ఎఫ్ఐఆర్లు నమోదు -
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి, హొసనగర, సాగర తాలూకాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కొడగుకు భారీ వర్ష సూచన కొడగు జిల్లాలో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వంకలు, వాగులు ఏరులై ప్రవహిస్తున్నాయి. నదుల్లో నీటిమట్టం పెరిగింది. జనజీవనం స్తంభించింది. అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. చిక్కమగళూరు జిల్లాలోని 5 తాలూకాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్ఆర్పుర, కొప్ప, శృంగేరి, కళస, మూడిగెరె తాలూకాల్లో అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లాధికారి మీనా నాగరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో కారవార తాలూకా కద్ర సమీపంలో కొడసహళ్లి ఆనకట్టకు వెళ్లే రోడ్డులో గురువారం భారీ వర్షాలతో కొండచరియ విరిగిపడింది. ఘటనాస్థలానికి అధికారులు వెళ్లి పరిశీలించి జేసీబీలతో మట్టిని తొలగిస్తున్నారు. ముంగారు వర్షాల నేపథ్యంలో కళ్యాణ కర్ణాటక జీవనాడి తుంగభద్రా జలాశయం నిండుతోంది. జలాశయంలోకి భారీ స్థాయిలో నీరు చేరింది. 80 టీఎంసీల నీరు నిల్వ చేరింది. 34 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో పెరిగింది. 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దక్షిణ కన్నడలోనూ వర్షాలు దక్షిణకన్నడ జిల్లా సుబ్రమణ్య, కడబ, సుళ్య తాలూకా కుక్కే సుబ్రమణ్యలో వర్షాలు కొనసాగుతున్నాయి. కుక్కే సుబ్రమణ్యలో కుమారధార స్నానఘట్టం నీట మునిగిపోయింది. వర్షాల నేపధ్యంలో కడబ, సుళ్య తాలూకాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటించారు. కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన, బెళగావి, ధారవాడ, హావేరి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 6 రోజుల వరకు మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా, సాధారణ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రదేశాల్లో వర్షం కంటే గాలి వేగం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. విరిగి పడుతున్న కొండచరియలు నీట మునిగిన కుమారధార స్నానఘట్టం జనజీవనం అస్తవ్యస్తం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు -
బాలున్ని కిడ్నాప్ చేసి హత్య
కెలమంగలం: పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల బాలున్ని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం తమిళనాడులోని క్రిష్ణగిరి తాలూకా కేంద్రం అంచెట్టి సమీపంలో జరిగింది. అంచెట్టి సమీపంలోని మావనట్టి గ్రామంలో శివరాజ్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రోహిత్(13)అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు అదే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం బాలుడు పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని సీసీటీవీ కెమెరా పుటేజ్లను పరిశీలించారు. కొందరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసినట్లు కనిపించగా అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వరకు బాలుడి జాడలేదు. పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ష్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. కాగా అంచెట్టికి ఐదు కిలోమీటర్ల దూరంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా రోహిత్ విగతజీవిగా కనిపించాడు. బాలుడు హత్యకు గురైనట్లు నిర్ధారించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా కారు కనిపించగా సోదా చేశారు. బాలుడి కిడ్నాప్నకు ఈ కారు ఉపయోగించినట్లు తేలింది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజు పరిశీలించారు. బాలుడి హత్యకు కారణాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలో ఘోరం -
టాస్క్ఫోర్స్ యాక్షన్ పోలీసులకు శిక్షణ
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లాతో పాటు మూడు జిల్లాల పరిధిలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసుశాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల కొత్తగా స్పెషల్ టాస్కఫోర్స్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, అధికారులకు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. మతఘర్షణలు, ఉద్రిక్తత పరిస్థితులు నేలకొన్న ఘటనలో ఈ భద్రతదళాన్ని ఉపయోగించుకుంటారు. ఇందులో భాగంగా అపరేషన్ వింగ్లో 95 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఈ దళంలో ఇంటెలిజెన్స్తో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘాను నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. రైలు ఇంజిన్లో మంటలు● ప్రయాణికులు సురక్షితం దొడ్డబళ్లాపురం: చలనంలో ఉండగా రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ వద్ద గురువారం చోటుచేసుకుంది. మైసూరు నుంచి రాజస్థాన్లోని ఉదయపురకు వెళ్తున్న రైలు చెన్నపట్టణ తాలూకా వందారగుప్పె వద్ద రాగానే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ ముందు భాగంలో దట్టమైన పొగ కమ్ముకుంది. లోకోపైలట్ చాకచక్యంతో వెంటనే రైలు నిలిపివేశాడు. ప్రయాణికులను కిందకు దింపారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇంజిన్లో మంటలు చెలరేగిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మారెమ్మదేవికి వెన్నతో అలంకరణ బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామ దేవత మారెమ్మదేవికి ఆషాఢ మాసం సందర్భంగా గురువారం విశేష అలంకరణ చేశారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం వెన్నతో ప్రత్యేక అంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధ మహిళా రైతు ఆత్మహత్య మండ్య : రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించినా పంటలు చేతికందక అప్పుల ఊభిలో కూరుకుపోయిన వృద్ధ మహిళా రైతు బలవన్మరణం చెందింది. ఈఘటన మండ్య జిల్లా మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జవనమ్మ(75)కు భర్త చనిపోయాడు. దీంతో తనకున్న మూడు ఎకరాల పొలంలో సొంతంగా పంటలు సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం మహిళా స్వయం సేవా సంఘం, సహకార సంఘం, ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపు రూ.9 లక్షల మేర అప్పులు చేసింది. అయితే ప్రకృతి విపత్తులతో పంట చేతికందలేదు. అప్పులు తీరే మార్గం కనిపించక పురుగులమందు తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నవ వరుడి విషాదాంతం
● వివాహమైన 24 గంటల్లోనే ఆత్మహత్య ● మృతుడు జిల్లా ఆస్పత్రి ఉద్యోగి కోలారు : వివాహమై 24 గంటల్లోనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన బుధవారం రాత్రి కోలారులో జరిగింది. బంగారుపేటె తాలూకా నాయకరహళ్లి గ్రామానికి చెందిన హరీష్బాబు(33) కోలారు జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు.. జిల్లాస్పత్రిలోనే పని చేస్తున్న గాంధీనగర నివాసి అయిన శివరంజని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈమేరకు బుధవారం రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని బుధవారం రాత్రి ఆస్పత్రి ఈఎన్టీ గదిలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
రైతుల భూములు లాక్కోవడం అన్యాయం
బనశంకరి: దేవనహళ్లి చుట్టుపక్కల 13 గ్రామాల రైతుల 1,777 ఎకరాల భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రైతులు చేపట్టిన పోరాటానికి సాహితీవేత్తలు, కన్నడ సినీ రంగం కళాకారులు, రైతు ఉద్యమనాయకుడు రాకేష్ టికాయత్, దర్శన్పాల్, సామాజిక కార్యకర్త హీరేమఠ్ తదితర ప్రముఖులు మద్దతు పలికారు. ధర్నానుద్దేశించి సాహితీవేత్త రహమత్ తరీకెరె మాట్లాడుతూ ఇది రైతుల పోరాటం మాత్రమే కాకుండా కన్నడిగుల పోరాటమన్నారు. రైతులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వీటిపై చర్చించకుండా భూమి ఎలా లాక్కోవాలని ఆలోచిస్తుందని ప్రశ్నించారు. ఈనెల 4న రైతుల తరఫున తీర్మానం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటుడు కిశోర్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందన్నారు. అన్నదాతపై దాడి చేసి చిన్న రైతుల చేతిలో ఉన్న భూమిని లాక్కుంటున్నారన్నారు. రైతుల భూములను పరిశ్రమలకు ఇవ్వడం కుదరదన్నారు. రచయిత కవిరాజ్ మాట్లాడుతూ రైతుల భూమిని లాక్కోవడం సరికాదన్నారు. ఇది కార్పొరేట్ లాబీ అని తెలుస్తోందని, దీనిపై తీవ్రపోరాటం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పోరాటదారులు శివసుందర్, సాహితీవేత్తలు కేపీ.సురేశ్, వీరసంగయ్య, బీటీ.లలితానాయక్, నూర్శ్రీధర్, వీ.నాగరాజ్, గురుప్రసాద్ కెరగోడు, బడగలపుర నాగేంద్ర, కేవీ.భట్, డైరెక్టర్ రాజేంద్రసింగ్బాబు, టీఎన్.సీతారాం, నాగతిహళ్లి చంద్రశేఖర్, విజయలక్ష్మీ సింగ్, గిరీశ్ కాసరవళ్లి, నటుడు ప్రకాష్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు మద్దతు పలికిన సాహితీవేత్తలు, సినీ కళాకారులు -
విదేశీ పండ్లకు భలే గిరాకీ
సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో రోజురోజుకు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా మన ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి, అరటి, జామ, సపోట, ఖర్బూజ, యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, మోసంబి తదితర పండ్ల తోటలను రైతులు అష్టకష్టాలతో పండిస్తుంటారు. ఆ పండ్ల తోటలను పండిన రైతులకు కూడా గిట్టుబాటు ధర లేక చాలా మంది పండ్ల తోటల పెంపకంపై నిరాసక్తత చూపుతున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఏటేటా విదేశాల్లో పండుతున్న పండ్లను మన ప్రాంతాల్లో కూడా పండిస్తూ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ భూమి అనువైనది కాదని రైతులు అనుకొనేవారు. అయితే కర్ణాటకలోని ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నారు. విదేశీ పండ్లతో ఆరోగ్యానికి మేలు విదేశీ పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 200లకు పైగా వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతున్నారు. మెక్సికో దేశం నుంచి డ్రాగన్ ప్రూట్స్, మలేషియా నుంచి రంభుటాన్, దురియన్ పండ్ల తోటలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో విజయనగర, బళ్లారి ప్రాంతాల్లో డ్రాగన్ ప్రూట్ ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. డ్రాగన్ప్రూట్కు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో రంభుటాన్ పండ్ల తోటలను అధికంగా పండిస్తున్నారు. కాఫీ తోటలకు పేరు గాంచిన హాసన, శివమొగ్గ జిల్లాల్లో కూడా బటర్ప్రూట్స్ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా విదేశీ పండ్ల తోటలను విస్తృతంగా సాగు చేస్తుండటంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేస్తూ రైతులకు తోడ్పాటును అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో సాగు వివరాలు హగరిబొమ్మనహళ్లి తాలూకాలో డ్రాగన్ ప్రూట్స్ను, దక్షిణ కన్నడ జిల్లాలో వక్క, టెంకాయ తోటల మధ్యన రంభుటాన్, మ్యాంగోస్టిన్ పండ్ల తోటలను అధికంగా సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో విదేశీ పండ్ల తోటలను సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొన్నారు. డ్రాగన్, అవకాడొ ఎక్కువగా సాగు చేయగా స్ట్రాబెర్రీ, నకడెమియా తదితర విదేశీ పండ్లు కూడా వందలాది ఎకరాల్లో కనిపిస్తున్నాయి. డ్రాగన్ ప్రూట్స్ బళ్లారి, విజయనగర, చామరాజ నగర్, బీదర్ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. డ్రాగన్ ప్రూట్స్తో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు కొత్త కొత్త పంటలను సాగు చేయడంపై అనుభవం పెంచుకొంటున్నారు. ఎంతో రుచి, ఆరోగ్యం, చూసేందుకు కనువిందుగా కనిపించే విదేశీ పండ్లు మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తున్నాయంటే ఇక్కడి రైతులు కూడా సాగు చేయడంతో ఎప్పటికప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయని పండ్ల అమ్మకందారులు పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం దక్షిణ కన్నడ, ఉడిపిలో విస్తృతంగా పండించే రంభుటాన్ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ జిల్లాల్లో 155 ఎకరాల్లో సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను రైతులు అర్జిస్తున్నారు. అవకాడొ పండ్లను రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని గదగ్, హావేరి జిల్లాలతో పాటు మైసూరు జిల్లాలో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. ఈ పండ్ల తోటల పెంపకం రైతులను ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు దోహదం చేస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో విదేశాల్లో పండించే పండ్లను సైతం ఇక్కడ పండిస్తున్నప్పటికీ సరైన మార్గదర్శనం, పరిశోధనలు లేకపోవడంతో రైతులు నష్టాలను కూడా చవిచూస్తున్నారు. అయితే రంభుటాన్, లిచ్చి తదితర పండ్లకు రోజు రోజుకు మంచి గిరాకీ లభిస్తోందని రైతులు అంటున్నారు. మన దేశంలో పండించే పండ్లతో పాటు విదేశాల్లో పండించే పండ్లకు మంచి గిరాకీ వస్తుండటంతో రైతులు వాటిని సాగు చేసేందుకు ఏటా ఆసక్తిని పెంచుకొంటున్నారు. కొడగు జిల్లాలో జర్ముప్లాసంను కూడా సాగు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల సాగు ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు. పండ్ల తోటల పెంపకంపై రైతుల ఆసక్తి వివిధ దేశాల పండ్లు కర్ణాటకలో లభ్యం -
మూడో రోజున 75 ఆటోలు సీజ్
రాయచూరు రూరల్: నగరంలో మూడవ రోజున కూడా తనిఖీ చేసి 75 ఆటోలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి అనుమతులు లేని వాటిని తనిఖీ చేశామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు బీమా ఇతర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.50 వేలు వసూలు చేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో దాఖలాలు పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. -
తుంగభద్ర పరవళ్లు
● 20 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల ● లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక జారీ హొసపేటె: తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం నుంచి అదనపు నీటిని క్రస్ట్గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం డ్యాం వద్ద 20 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి డ్యాం నుంచి సుమారు 59 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. అధికారికంగా తెరిచిన 20 క్రస్ట్గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్న అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. తుంగభద్ర నది ఒడ్డున, పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరించారు. నదిలోకి ఎవరూ చేపల వేటకు దిగవద్దని మత్స్యకారులకు సూచించారు. పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తున్నందున డ్యాంలోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రస్తుతం నదిలోకి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి డ్యాంకు మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున నదిలోకి మరింత నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా గురువారం డ్యాంలో నీటిమట్టం 1625.55 అడుగులకు, నీటి నిల్వ 78.31 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 34,625 క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లో 59,611 క్యూసెక్కులు ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి నిల్వ కేవలం 8.782 టీఎంసీలు మాత్రమే ఉందేదని మండలి వర్గాలు తెలిపాయి. స్లో పాయిజన్ ఇచ్చి భర్త హత్య● వీడియో సాక్ష్యం ఉన్నా భార్యని అరెస్ట్ చేయని పోలీసులు హుబ్లీ: భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి భార్యను హత్య చేసిన ఘటన యాదగిరి జిల్లా గురుమట్కల్లోని గడ్డి మొహల్లో జరిగింది. మృతుడిని మహమ్మద్ అలీగా గుర్తించారు. భార్యే స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడాదిన్నర క్రితం భర్తకు దగ్గు ఉందంటూ స్లో పాయిజన్ ఇచ్చి భార్యే భర్తను హత్య చేసింది. అయితే భర్త చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన తమ్ముడు మహమ్మద్ ఇక్బాల్కు ఈ వీడియో దృశ్యాలను పంపించారు. తనను సక్రమంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. భోజనం పెట్టేది కాదు, విషం పెట్టినట్లుగా అనుమానం ఉందని మృతుడు చెప్పినట్లుగా వీడియో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై మహమ్మద్ అలీ తల్లి గురుమట్కల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి పరిశీలించారు. అంతేగాక వీడియో సాక్ష్యం ఉన్నా పోలీసులు మాత్రం బాధ్యురాలైన భార్యను అరెస్ట్ చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని మృతుడి తల్లి జిల్లాధికారికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జిల్లా ఇంచార్జి కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వ పరిపాలనాధికారి మమత శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొప్పళ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మోహన్ రాజ్, విజయ నగర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా సమీర్ శుక్లా, బీదర్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రందీప్, బళ్లారి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా త్రిలోక చంద్ర, యాదగిరి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మనోజ్ జైన్, కలబుర్గి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా పంకజ్ కుమార్ పాండే, బాగల్కోటె జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మహ్మద్ మోసిన్, విజయపుర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా ఉజ్జవల్ కుమార్ ఘోష్, గదగ్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రమణ దీప్ చౌదరిలు నియమితులయ్యారు. వచనానంద స్వామి పూర్వాశ్రమ సోదరుడు మృతిహుబ్లీ: హరిహర పంచమసాలి పీఠం జగద్గురువు వచనానంద స్వామి పూర్వాశ్రమం సోదరుడు అయిన అశోక్ దుండప్ప (45) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెళగావి జిల్లా అథణి తాలూకా తాంవశి గ్రామానికి చెందిన అశోక్ దుండప్ప బుధవారం రాత్రి అథణి నుంచి తాంవశికి వెళుతుండగా ఆయన ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో ఈ ప్రమాదం వా టిల్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందారు. అథణి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ గేమ్తో రూ.18 లక్షలు హుష్కాకి● యువకుడి ఆత్మహత్య సాక్షి, బళ్లారి: నేటి యువత చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఫోన్ ఫీవర్ పట్టుకోవడంతో ఆన్లైన్ గేమ్లు కూడా కుప్పతెప్పలుగా వస్తున్నాయి. దీంతో ఆ గేమ్లు ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దావణగెరె జిల్లాలో ఆన్లైన్ గేమ్లు ఆడి ఏకంగా ఓ యువకుడు రూ.18 లక్షలు కోల్పోయాడు. దావణగెరె నగరంలోని సరస్వతి కాలనీకి చెందిన శశికుమార్(25) అనే యువకుడు ఆన్లైన్ గేమ్ ద్వారా రూ.18 లక్షలు పోగొట్టుకోవడంతో యువకుడు చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆన్లైన్ గేమ్లు బంద్ చేయాలని పాలకులు మాటలకే పరిమితం అవుతున్నారు. ఫోన్లో యథేచ్చగా ఆన్లైన్ గేమ్లు సాగుతుండటంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
దూద్సాగర్.. సందర్శకులపై నజర్
హుబ్లీ: కర్ణాటక సరిహద్దు సమీపంలోని గోవాలోని దూద్సాగర్ జలపాతం ప్రస్తుతం నిండుకుండలా ప్రవహిస్తోంది. పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. అయితే పర్యటనకు వెళ్లిన వారు అక్కడి కొన్ని సూక్ష్మ ప్రాంతాల్లో నియమాలను ఉల్లంఘించి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సందర్శకులు తప్పకుండా తగిన నియమాలను పాటించాలని, ముఖ్యంగా సొరంగాలు, లోయలు, అడవి జంతువుల వల్ల అపాయం ఉందని సూచించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నిఘాలో సందర్శకులు నియమాలను పాటించాలి. క్యాసల్రాక్ రైల్వే స్టేషన్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించరాదు. అలా అక్రమంగా ప్రవేశించిన 21 మందిని అరెస్ట్ చేసి వీరిపై కేసులు దాఖలు చేశారు. అరెస్ట్ అయిన వారిని బెయిల్పై విడుదల చేసి జరిమానా విధిస్తూ హుబ్లీ ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ రైల్వే కోర్టు ఈ మేరకు ఆంక్షలు విధించింది. సందర్శకులు యశ్వంత్పుర–వాస్కో ఎక్స్ప్రెస్ ద్వారా ఘటన స్థలానికి వచ్చి రైలు పట్టాల పొడవునా నడుచుకుంటూ జలపాతం వద్దకు వెళ్లే వారు. భద్రత కారణాలతో దీన్ని కట్టుదిట్టంగా నిషేధించారు. సందర్శకులు రైలు పట్టాలపై నడవరాదని హుబ్లీ నైరుతి రైల్వే పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. -
బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడ్స్ వాహనం బావిలోకి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బీదర్ తాలూకా గోడంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడ్స్ వాహనం ఉన్నఫళంగా బావిలోకి బోల్తా పడింది. గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తున్న గోడంపల్లికి చెందిన లక్ష్మీకాంత్ అలియాస్ కాంత మహారాజు(45), రవి(18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో అర్జున్, ప్రజ్వల్, పవన్, సంగమేష్ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో పడిపోయిన వాహనం కింద పడి మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వివరాలు సేకరించి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. మరణంలోనూ వీడని తల్లీకుమారుడి బంధం బీదర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావిలోకి గూడ్స్ వాహనం బోల్తా పడిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్న రవి(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అదే గోడంపల్లి గ్రామానికి చెందిన శారదాబాయి(70) అనే మహిళ తన కుమారుడు మృత్యువాత పడ్డాడని తెలిసి, బాధ భరించలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు తల్లీ, కుమారుడు కూడా మృతి చెందడంతో మరణంలో కూడా వారి బంధం వీడలేదని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. బావిలో బోల్తా పడిన గూడ్స్ వాహనం ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు -
రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 5న అయుర్వేద రస కౌశల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్ణిమా ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం కళాశాల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వనమూలికల ద్వారా రస కౌశల్య శిబిరాన్ని రాజీవ్గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ బీఎస్ సవది ప్రారంభిస్తారన్నారు. కళాశాల ఆవరణలో 250 ఔషధ మొక్కలను నాటుతారన్నారు. పంచకర్మ పద్ధతిలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి అన్ని విధాలుగా సౌకర్యాలను సమకూర్చామన్నారు. కేశవరెడ్డి, శివకుమార్, ఆయుష్ అధికారి శంకరగౌడ, మహేశ్వరస్వామిలతో పాటు రాష్ట్ర నలు మూలల నుంచి 300కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్లున్నారు. జెడ్పీ సీఈఓకు సర్కార్ అభినందన పత్రంరాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండేకు రాష్ట్ర ప్రభుత్వం అభినందన పత్రం జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాధికారి సర్వే పథకాలను ప్రజలకు సక్రమంగా అందచేయడంలో తీసుకున్న చొరవకు అభినందనలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ లేఖ రాశారు. భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో చూపిన చొరవకు అభినందనపత్రం అందించారు. హళకట్టి ఆశయాలు అనుసరణీయం రాయచూరు రూరల్: వచన సాహితీవేత్త హళకట్టి ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ీతహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో వచన సాహితీవేత్త హళకట్టి జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు. వైద్యుడి బదిలీ రద్దుకు వినతి హొసపేటె: నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సోమశేఖర్ కబ్బేరను ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరాదని డిమాండ్ చేస్తూ భగత్సింగ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో గురువారం విజయనగర జిల్లాధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్లకు వినతిపత్రాన్ని అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం.సంతోష్ కుమార్తో పాటు నాయకులు, రక్తదాతలు ఎస్.విజయ్కుమార్, సీ.ప్రకాష్, హనుమంతప్ప, చెన్నబసవనగౌడ, బీఎస్.రుద్రప్ప, ఎం.సుభాష్, కే.పునీత్కుమార్, వెంకటేష్ కులకర్ణి, ఫయాజ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి సమావేశం దోహదం హొసపేటె: ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను వినడానికి, పరిష్కారాలను సూచించడానికి నగరంలో ఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ ఫిర్యాదు సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నెలకొకసారి, జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషనర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల కోసం జిల్లా అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, సమావేశం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా పరిష్కారం దొరకడం లేదని దళిత నాయకులు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మంజునాథ్, కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, దళిత, వాల్మీకి సమాజ నేతలు పాల్గొన్నారు. -
జలవనరుల గణన సక్రమంగా నిర్వహించండి
హొసపేటె: జిల్లాలో జల వనరుల గణనను అధికారులు సరైన పద్ధతిలో నిర్వహించి గణాంకాలను అందించాలని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప సూచించారు. జిల్లాధికారి కార్యాలయ హాలులో గురువారం జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జల వనరుల శాఖ కేంద్ర సురక్షిత మైనర్ ఇరిగేషన్ డేటా సమన్వయ పథకం కింద ప్రతి ఐదేళ్లకు ఒకసారి మైనర్ ఇరిగేషన్ గణన నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్, జలవనరుల గణనను సక్రమంగా నిర్వహించాలి. జిల్లా స్థాయిలో జనాభా గణన పనులను నిర్వహించే సూపర్వైజర్లు, తాలూకా స్థాయిలో రెవెన్యూ శాఖలోని గ్రామ అకౌంటెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు జనాభా గణన పని విధానంపై సరైన శిక్షణ ఇవ్వాలి. రెవెన్యూ, ఆర్థిక, గణాంక విభాగం, చిన్న నీటిపారుదల, భూగర్భ జల అభివృద్ధి విభాగం, పెద్ద, మధ్య తరహా నీటిపారుదల విభాగం, వ్యవసాయం, ఉద్యానవన శాఖ, స్థానిక సంస్థలతో సహా వివిధ విభాగాల సమన్వయంతో జనాభా గణన క్షేత్రస్థాయి పనిని నిర్వహించాలని ఆయన అన్నారు. జెడ్పీ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అన్నదాన స్వామి, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ తిమ్మప్ప, మైనర్ ఇరిగేషన్, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.వెంకటేష్, ఉద్యానవన శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ కేఎం.రమేష్ సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అతిథి అధ్యాపకులపై జీఓని రద్దు చేయాలి
బళ్లారిఅర్బన్: అతిధి లెక్చరర్లకు విధుల పెంపుతో పాటు మిగిలిన అదనపు పని భారాన్ని కొత్త వారికి కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసి అప్పగించాలి. ముఖ్యంగా గత జూన్ 25న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల అతిథి లెక్చరర్ల సంఘం జిల్లాధ్యక్షుడు డాక్టర్ దుర్గప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ లెక్చరర్లను ఎటువంటి పక్షపాతం చూపకుండా యథా విధిగా కొనసాగించాలి. ఇప్పటికే కొందరు లెక్చరర్లు వయోవిరమణ అంచులో ఉన్నారని, అలాంటి వారికి రూ.25 లక్షల మొత్తాన్ని, సేవా భద్రతను కల్పించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, పీఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఎట్టి పరిస్థితిలోను తమను వీధుల పాలు చేయరాదని ఆయన మొర పెట్టుకున్నారు. ఈ విషయంలో లెక్చలర్లందరికీ న్యాయం చేయాలని దుర్గప్ప కోరారు. సంఘం కార్యదర్శి డీ.సిద్దేశ్, సహకార్యదర్శి రుద్రప్పమని, టీ.జయరాం, శివకుమార్ అంగడి, సంధ్యాబాయి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం నచ్చజెప్పడంతో విధులకు హాజరు
హుబ్లీ: వీఆర్ఎస్ కోరుతూ సమర్పించిన ధార్వాడ ఏఎస్పీ నారాయణవీ భరమనికి సీఎం ఫోన్ చేసి నచ్చజెప్పడంతో గురువారం ధార్వాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని తన కార్యాలయంలో యథావిధిగా విధులకు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడతో చర్చించిన తర్వాత తన కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన భావనలను తన సీనియర్ అధికారులకు తెలియజేశాను. సీనియర్ అధికారులు కూడా తనతో మాట్లాడారు. తాను క్రమశిక్షణ కలిగిన శాఖలో ఉన్నాను. సీఎం, హోం మంత్రి తనతో మాట్లాడారు. తాను ఎప్పుడూ కూడా మీడియాతో మాట్లాడలేదు. విధులకు హాజరవుతున్నానన్నారు. కాగా ఆయనకు ఫోన్ చేసిన సీఎం వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని వాపస్ తీసుకోండి. తాను ఆ రోజు ఉద్దేశ పూర్వకంగా ఆ విధంగా నడుచుకోలేదు. మిమ్మల్ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం తనకు లేదని ఏఎస్పీకి నచ్చజెప్పారు. కాగా ఈ ఘటనపై విధాన సౌధలో ఎమ్మెల్యే అశోక్ పఠాన్ మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య ఆయన్ను కొట్టడానికి ప్రయత్నించలేదు. మనిషి అన్న తర్వాత సహజంగానే కోపం వస్తుంది అంతే.. అంటూ ఘటనను సమర్థించుకున్నారు. వీఆర్ఎస్ నిర్ణయం మార్చుకున్న ఏఎస్పీనారాయణ భరమని -
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది. -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
జేడీఎస్ నిరసన
యశవంతపుర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి, పాలనా వైఫల్యం అధికమైందని ఆరోపిస్తూ బెంగళూరు నగర జేడీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఫ్రీడం పార్క్లో జరిగిన నిరసనలో నేతలు, కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యారంటీ పథకాల ద్వారా గద్దెనెక్కిన సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అరోపించారు. గ్యారంటీలను కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.పేలుళ్లకు కుక్కలు బలి చింతామణి: గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందులను వేటడానికి గాను అమర్చిన పేలుడు పదార్థాలను రెండు కుక్కలు కొరకడంతో పేలి తలలు నుజ్జయి చనిపోయాయి. ఈ సంఘటన తాలూకాలో బట్లపల్లి పోలీసు స్టేషన్ పరిదిలోని వై.గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామ శివార్లోని నారప్ప తోట దగ్గర కుక్కల కళేబరాలను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్థల పరిశీలన జరిపిన పోలీసులు అడవి జంతువుల కోసం ఎవరో ఈ పేలుడు పదార్థాలను ఉంచారని, వాటిని కుక్కలు తినే వస్తువులని కొరకడంతో పేలిపోయినట్లు తెలిపారు. ప్రజలకు ఏమీ జరగలేదని తెలిపారు. పేలుడు పదార్థాలను పెట్టిన వారి కోసం గాలిస్తున్నారు. గుండెపోట్లతో ధార్వాడలో ఇద్దరు.. హుబ్లీ: రాష్ట్రంలో హాసన్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గుండెపోటు మరణాలు మిస్టరీగా మారడం తెలిసిందే. తాజాగా ధార్వాడలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. నవలగుంద పట్టణ నివాసి ముత్తప్ప శంక్రప్ప పూజార (44), అదే తాలూకాలోని యమనూరు నివాసి కేబుల్ ఆపరేటర్ ఫక్కీరప్ప బణగార (45)గా గుర్తించారు. సోమవారం రాత్రి నిద్రలోనే కన్నుమూశారు. ఒకప్పుడు ఉమ్మడి ధార్వాడ జిల్లాలో భాగమైన హావేరిలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. అది మోదీ వైఫల్యం: సుర్జేవాలా బనశంకరి: ఉగ్రవాదులను కాపాడే పాకిస్తాన్ కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అధ్యక్ష పదవి లభించడం తీవ్ర విషయమని ఏఐసీసీ నేత, రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. బుధవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్కు అవకాశం తప్పించకుండా ప్రధాని మోదీ తప్పు చేశారన్నారు. మోదీ దేశ విదేశాల్లో పర్యటనలకు రూ.8 వేల కోట్లు ఖర్చుచేశారని, కానీ ఏ దేశం మద్దతును సంపాదించారని అన్నారు. పహల్గాం దాడి సమయంలో పాకిస్తాన్ కు వేర్వేరు దేశాలు మద్దతు ఇచ్చాయని, కానీ భారత్కు చుట్టుపక్కల ఉండే దేశాలు సైతం అండగా నిలవలేదని, ఇది మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ వైఫల్యమని దుయ్యబట్టారు. -
ఆషాఢమాస పూజలు
కోలారు: తాలూకాలోని బిదరహళ్లి క్రాస్ వద్ద ఉన్న అశ్వర్థకట్ట వద్ద నిర్మించిన మహాగణపతి, లక్ష్మీనరసింహ, పంచముఖి ఆంజనేయస్వామి, ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో బుధవారం ఆషాఢమాసం పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీదేవి అమ్మవారికి విశేష అర్చనలు చేశారు. వివిధ దేవతలకు ఫల పంచామృత అభిషేకం, అలంకారం, సహస్ర కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు దొడ్డబళ్లాపురం: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూడా సీఎంని చేయాలని రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ మరోసారి డిమాండ్ చేశారు. రామనగరలో బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఇంతకుముందు ఇదే ప్రకటన చేసినందుకు పార్టీ నుంచి నోటీసులు వచ్చాయని, వివరణ ఇచ్చానని తెలిపారు. ఒకవేళ తమ నాయకుడు డీకే శివకుమార్ చర్యలు తీసుకుంటే శిరసావహిస్తానన్నారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని వివరణ ఇచ్చానన్నారు. అయితే తన మాదిరిగా మాట్లాడిన అందరికీ నోటీసులు ఇవ్వలేదని వాపోయారు. సీఎం సిద్దరామయ్య బాగా పరిపాలిస్తున్నారని చెప్పారు. కారు పల్టీ, మహిళ మృతి శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మాలూరు పోలీస్స్టేషన్ పరిధిలో మందగడ్డె 17వ మైలురాయి వద్ద బుధవారం వర్షం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారు తీర్థహళ్లి నుండి శివమొగ్గ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ పక్కన ఉన్న నీటి గుంతలోకి పడిపోయింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మహిళ (59)ను వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయింది. మృతురాలు కుందాపూర్ తాలూకావాసిగా గుర్తించారు. డ్రైవర్తో సహా కారులో ఉన్న మిగతా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. రైలు పట్టాలపై పోలీసు భార్య శవం ● 6 నెలల కిందటే పెళ్లి యశవంతపుర: పెళ్లియిన ఆరు నెలలకే నవ వివాహితకు నూరేళ్లు నిండాయి. ఆమె అనుమానాస్పదంగా మరణించిన ఘటన హాసన జిల్లా అరసికెరె తాలూకాలో జరిగింది. వివరాలు.. దావణగెరె జిల్లా చన్నగిరికి చెందిన విద్య (23)కు అరసికెరె సోమలాపురవాసి శివుతో పెళ్లయింది. శివు పోలీసు కానిస్టేబుల్గా పని చేస్తూ బెంగళూరు శంకరపురలో నివాసం ఉంటున్నారు. జూన్ 30న విద్యా అదృశ్యమైంది. భర్త శంకరపుర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం విద్యా శవం అరసికెరె రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. ఆమె అరసికెరెకు ఎందుకు వెళ్లిందో, ఎలా మరణించిందో అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ ఆమె ఇల్లు విడిచి వెళ్తే పుట్టింటికి వెళ్లాలి కదా అనే అనుమానాలున్నాయి. పెళ్లయినప్పటి నుంచి విద్యను భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ కూతురుని అత్తింటివారు హత్య చేశారని విద్య తల్లిదండ్రులు విలపించారు. అరసికెరె రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పొంగిన భక్తిరసం చింతామణి: ఆషాడమాస పూజల సందర్భంగా పట్టణంలో డబుల్ రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో వైష్ణవి భజన మండలి మహిళలు శ్రావ్యంగా దాసర కృతులను ఆలాపన చేశారు. ఆరు గంటలపాటు ఏకధాటిగా గురురాఘవేంద్రులను కీర్తిస్తూ పాటలను ఆలపించారు. భక్తులు తన్మయులయ్యారు. -
అద్దె భూతం.. నగరజీవి సతమతం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో ఇంటి అద్దెలు భగ్గుమంటాయన్నది తెలిసిందే. ఈ వార్తలు ట్రెండింగ్ టాపిక్గా మారాయి. బెంగళూరుకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించేవారికి వారి జీతాల కంటే అద్దెలు ఎక్కువగా ఉన్నాయా అనిపించేలా ఇంటి బాడుగలు షాక్కు గురి చేస్తున్నాయి. ఆస్తుల యజమానులకు కాసుల పంట పండుతోంది. 6 నెలల్లో 15 శాతం పెరుగుదల ఈ ఏడాదిలో తొలి ఆరు నెలలు ముగిశాయి. అదే సమయంలో ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ఎక్కువగా బాడుగలు ఉన్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదని ఇక్కడి అద్దెదారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే బెంగళూరు ఇంటి అద్దెల్లో 15.7 శాతం మేర పెంపుదల నమోదైంది. నెలకు రూ. లక్ష పైనే ఆధునిక సౌకర్యాలతో లేఔట్లు, అపార్టుమెంట్లు, విల్లాలు ఐటీ కంపెనీలకు సమీపంగా ఉండడం పేరుతో ఇంటి అద్దెలను పెంచడం పరిపాటైంది. అద్దెదారుల నుంచి 20–25 శాతం మేర పెంచి రెంట్లను వసూలు చేస్తున్నారు. ఐటీ కారిడార్కు సమీపంలోని మంచి ఇంటి అద్దె ఎంత తక్కువ అనుకున్నా రూ. 1 లక్ష నుంచి 2.5 లక్షల వరకూ ఉంటోంది. ఐటీ ఉద్యోగుల జీతాలు సగం వరకు ఈ ఇంటి రెంట్లకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరి నియంత్రణలో ఉండడం లేదు. డిపాజిట్కు అయితే పరిమితి అనేది లేకుండా పోయింది. అత్యధిక వేతనాలు పొందుతున్న ఐటీ, బీటీ నిపుణులు సైతం అమ్మో అనాల్సిందే. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగులు నెలకు కనీసం రూ. 1.2–1.5 లక్షల మేర అద్దెలు కట్టాల్సి వస్తుంది. అద్దెల భూతంపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. కెనడవాసి విస్మయం నగర అద్దెల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కఠిన వాస్తవాలు జోక్ల రూపంలో వస్తుంటాయి. క్యాలెబ్ ఫ్రైసెన్ అనే కెనడాకు చెందిన వ్యక్తి బెంగళూరు దొమ్మలూరు డైమండ్ డిస్ట్రిక్ట్లో 3 బీహెచ్కే ఫ్లాట్లో బాడుగకు దిగాడు. అద్దె వివరాలను ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసినవారు కళ్లు తేలేయాల్సిందే. నెల బాడుగ ఎంతంటే రూ. 1.75 లక్షలు, సెక్యురిటీ డిపాజిట్ రూ. 19.25 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. ఆ డిపాజిట్తో లగ్జరీ కారునే కొనొచ్చని, మామూలు ఊళ్లలో ఇల్లే కొనుగోలు చేయవచ్చని నెటిజన్లు అనేక రకాలుగా పేర్కొన్నారు. బెంగళూరులో భగ్గుమంటున్న బాడుగలు భారీ వేతనజీవులకూ తప్పని కష్టం బెంబెలెత్తిపోతున్న ఐటీ ఉద్యోగులు -
రాజధానిలో భారీ వర్షం
బనశంకరి: కొన్నిరోజుల విరామం తరువాత రాజధాని బెంగళూరులో బుధవారం జోరు వర్షం కురిసింది. మహదేవపుర, ఆర్ఆర్.నగర, బొమ్మనహళ్లి, యలహంక వలయ పరిదిలో వర్షం పడటంతో చల్లని వాతావరణం నెలకొంది. జక్కూరు, హొరమావు, ఉళ్లాల, దొడ్డ బిదరకల్లు, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, మడివాళ, లాల్బాగ్, జక్కసంద్ర తో పాటు 37 వార్డుల్లో వర్షం కురిసింది. కొన్ని లోతట్టు ప్రదేశాల్లో వర్షం నీరుచేరింది. పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే చిక్కమగళూరు నగరంలో వర్షం పడింది. కరావళి, మలెనాడు, ఒళనాడు జిల్లాల్లో పెద్ద వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
బాగేపల్లి.. భాగ్యనగర
చిక్కబళ్లాపురం: బెంగళూరు రూరల్ జిల్లాను ఇక మీదట బెంగళూరు ఉత్తర జిల్లా అని పిలవాలి, అలాగే చిక్కబళ్లాపురం జిల్లాలో కర్ణాటక ముఖద్వారంగా పేరుపొందిన బాగేపల్లి పట్టణాన్ని భాగ్యనగరగా పేర్కొనాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బుధవారం ఇక్కడి ప్రముఖ పర్యాటక స్థలమైన నంది కొండపై మంత్రిమండలి సమావేశం జరిగింది. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొండపై సభా భవనంలో కేబినెట్ భేటీ సాగింది. తరువాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం, మంత్రులు వివరించారు. బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ విశ్వవిద్యాలయంగా మార్చినట్లు తెలిపారు. ఎత్తినహొళె నీటి ప్రాజెక్టును వేగవంతం చేసి మరో రెండు సంవత్సరాలలో కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు ఉత్తర జిల్లాకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. 8 టీఎంసీలు ఏ మూలకు సరిపోతాయని విలేకరులు ప్రశ్నించగా, అన్ని వనరుల నుంచి సేకరించి అందిస్తామని సీఎం చెప్పారు. కేసీ వ్యాలీ నీటిని తాగరాదు కేసీ వ్యాలీ, హెచ్ఎన్ వ్యాలీ పథకం ద్వారా కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాలలో చెరువులు, భూగర్భ జలాల వృద్ధి కోసం శుద్ధీకరించిన మురుగునీటిని వదులుతున్నారు, ఈ నీటిని ఎలా తాగాలి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని విలేకరులు ప్రస్తావించారు. జిల్లా మంత్రి ఎంసి సుధాకర్ స్పందిస్తూ, ఈ నీరు తాగడానికి కాదు, అంతర్జలాల పెంపునకు మాత్రమే అని, ఆ నీటిని వదిలే చెరువుల నీటిని తాగరాదని తెలిపారు. చిక్కబళ్లాపురంలో ఎపిఎంసి హైటెక్ పూల మార్కెట్ను రూ.141 కోట్ల ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు రూరల్.. ఉత్తర జిల్లా కేబినెట్ భేటీలో పేర్ల మార్పు నంది హిల్స్ మీద సమావేశం బెంగళూరు వర్సిటీకి మన్మోహన్సింగ్ పేరుభోగనందీశ్వరుని దర్శనం నంది హిల్స్ దిగువన ఉన్న నంది గ్రామంలో చరిత్ర ప్రసిద్ధ భోగనందీశ్వర ఆలయంలో సీఎం, మంత్రులు విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకున్నారు. పార్వతీదేవి ఆలయం ముందు గ్రూప్ ఫోటో తీసుకొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, మీకు అనుమానం వద్దని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని అన్నారు. నందికొండలో మంత్రి మండలి సమావేశం అన్నది ఈ ప్రాంతానికి లాభం దృష్టితో చూడరాదన్నారు. రాబోయే రోజులలో బిజాపూర్ లో కేబినెట్ నిర్వహించే యోచన ఉందని చెప్పారు. సీఎం టూర్ సందర్భంగా నంది హిల్స్ కు పర్యాటకులను నిషేధించారు. -
వీటి వల్లే హాసన్లో గుండెపోట్లు
బనశంకరి: హాసన్ జిల్లాలో 42 రోజుల్లో 26 మంది గుండెపోటుతో మృత్యవాతపడ్డారు. ఇందులో యువతీ యువకులు, బాలలు కూడా ఉండడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో 12 మంది బెంగళూరు జయదేవ ఆసుపత్రి నిపుణులతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ఎక్కువగా మాంసం తినడం, ఫాస్ట్ ఫుడ్ అలవాటు వల్ల మరణాలు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మేక, పొట్టేలు వంటి రెడ్ మీట్ సేవనంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని నిపుణులు నిర్ణయించారు. ఇప్పుడు కేవలం వారంరోజుల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను సర్కారును అందజేయనున్నారు. మహిళలు, పిల్లల మరణాలకు? అయితే మహిళలు, బాలలకు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉండవు, మాంసాహారం కూడా పరిమితంగా ఆరగిస్తారు. వారికెందుకు గుండెపోట్లు వచ్చాయో ప్రస్తావించలేదు. నిపుణులు సాధారణ కారణాలనే చూపడం గమనార్హం. కోవిడ్ జబ్బుకు గురికావడం, అలాగే కోవిడ్ వ్యాక్సీన్లు ఆకస్మిక మరణాలకు కారణాలని జిల్లాలో వదంతులున్నాయి. టీవీలు, సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. కానీ వ్యాక్సిన్లతో సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. గుండె మరణాలకు కారణాలు ఇంకా నిగూఢంగానే ఉన్నాయి. మద్యం, మాంసం, ధూమపానం కారణాలు కావచ్చు నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక -
అంగన్వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత
హుబ్లీ: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే పౌష్టిక ఆహారాన్ని అక్రమంగా ఓ గోడౌన్లో నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి రూ.1,83,072 విలువ చేసే ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలఘటిగి తాలూకా యలవదాళ నివాసి, అంగన్వాడీలకు ఆహార సామగ్రి సరఫరా చేసే చంద్రకాంత్ వడ్డరకర అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. బెల్లం 147 కేజీలు, బియ్యం 882 కేజీలు, పిల్లల ఆహార కుస్తీ కిట్ 1058 కేజీలు, మిల్లెట్ లడ్డు మిశ్రమం 679 కేజీలు, గోధుమ నూక 566 కేజీలు, మిల్లెట్ లాడ్ 1411 కేజీలు, రవ్వ 1608 కేజీలను పట్టుకున్నారు. ఇవి ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేసి అంగన్వాడీ చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందిస్తారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారన్న ఆరోపణలపై కలఘటిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ శ్రీశైల కౌజలిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఈ అక్రమ నిల్వపై దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తాలూకా పీడీపీఓ విద్యా బడిగేర్ ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంతో అవమానం.. వీఆర్ఎస్కు ఏఎస్పీ వినతి హుబ్లీ: కార్యక్రమం వేదికపై సీఎం సిద్దరామయ్య చేతిలో అవమానానికి గురైన ఏఎస్పీ నారాయణ భరమని స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెళగావిలో జరిగిన కార్యక్రమ వేదికపై సీఎం సిద్దరామయ్య ఏఎస్పీ నారాయణ భరమనిని కొట్టేంత పని చేశారు. ఈ ఘటనతో మనోవేదనకు గురై ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఆయన చేసిన ఈ విజ్ఞప్తిపై సీఎం సమక్షంలోనే నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో నారాయణ కొంచెం శాంతించినట్లుగా చెబుతున్నారు. కాగా ఈ అధికారి వీఆర్ఎస్ నిర్ణయంతో ప్రభుత్వంపై కాసింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండనుందని భావిస్తున్నారు. రాయల విగ్రహం పేరుతో రూ.లక్ష దోపిడీరాయచూరు రూరల్: మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వాముల విగ్రహం ఏర్పాటు విషయంలో చందాలు ఇవ్వాలంటూ ఏకంగా భక్తులకు రూ.1.15 లక్షల నిధులు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ మాట్లాడుతూ మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల 253 అడుగుల విగ్రహాన్ని సురేష్ అనే వ్యక్తి రామనగర వద్ద బెంగళూరు–మైసూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. 96119 09961కు భక్తులు రూ.1.15 లక్షలు ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకొని అనంతరం ఫోన్ ఎత్తకుండా పోవడంతో సైబర్ నేర పరిశోధన కేంద్రానికి కేసు బదిలీ చేశామన్నారు. భక్తులు ఎవరి మాటలకు, దుష్ప్రచారాలకు తలొగ్గకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండో రోజూ కొనసాగిన తనిఖీలురాయచూరు రూరల్: నగరంలో రెండో రోజు 300 ఆటోలను చెక్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. బుధవారం మహిళా కళాశాల వద్ద ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేవని తేలిందన్నారు. వాటన్నింటిని తనిఖీ చేసి సీల్ వేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో వీటిని పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో దాదాపు 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవని అన్నారు. ఆశా కార్యకర్తల ధర్నా రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. కేంద్ర సర్కార్ ఇచ్చే ప్రోత్సాహ ధనాన్ని కలిపి వేతనాలు చెల్లించాలని వివరించారు. భవిష్యత్తులో 40 వేల మంది అశా కార్యకర్తలకు నెలకు రూ.15 వేలు చొప్పున గౌరవ వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం స్పందించాలన్నారు. తొలగించిన ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. నెల నెలా తప్పకుండా వేతనాలు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
ఆస్పత్రి ఉన్నా వైద్యులు లేరన్నా.!
రాయచూరు రూరల్: రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వారికి వైద్యం, ఆరోగ్యం లభించడం మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా మారింది. రాయచూరు నుంచి 15 కి. మీ.దూరంలో ఉన్న ఉడుంగల్ ఖానాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. అయితే విధులు మాత్రం ఇద్దరే నిర్వహిస్తున్నారు. 24 గ్రామాల ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు కల్పించాల్సిన వైద్యులు, సిబ్బంది విధులకు రాకుండా చక్కర్లు కొడుతున్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, అతిసార వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న తరుణంలో వైద్యులు తమకేమీ పట్టనట్లు సొంత పనుల్లో మునిగారు. ఉడుంగల్ ఖానాపుర ఆస్పత్రిలో 19 మంది ఉండగా, ఆరుగురు ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 10 మంది సొంత పనుల్లో జిల్లా కేంద్రంలో ఉంటారు. వైద్యులు 15వ తేదీ నుంచి విధులకు గైర్హాజరయ్యారు. ప్రతినిత్యం 40 మందికి పైగా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. అయినా రోగులకు ఇంతవరకు ఆస్పత్రిలో డాక్టర్ ఎవరో తెలియదని గ్రామస్తులు వాపోయారు. 24 గ్రామాల ప్రజలకు అందని వైద్యం విధులకు వైద్యులు, సిబ్బంది డుమ్మా -
గడువుకు ముందే తుంగభద్ర తుళ్లింత
సాక్షి, బళ్లారి/హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యాం క్రస్ట్గేట్లలో ఆరు క్రస్ట్గేట్లు పైకెత్తి నదికి సుమారు 14,136 క్యూసెక్కుల నీరు వదిలారు. బుధవారం తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణనాయక్, ఎస్డీఓ జ్ఞానేశ్వర్ తదితరులు క్రస్ట్గేట్లకు పూజలు చేసి నదికి నీరు వదిలారు. డ్యాం ప్రస్తుత గరిష్టనీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారం వచ్చేలోపు 80 టీంఎంసీలు నీరు చేరడంతో పాటు డ్యాం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ఫ్లో కూడా 30 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో ముందుస్తు చర్యలతో డ్యాం క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యాంలో 77.144 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నది ద్వారా కిందకు వదిలే విధంగా గేట్లను ఎత్తారు. మరమ్మతుల్లో లోపం.. రైతులకు శాపం గత ఏడాది 19వ క్రస్ట్గేటు కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా స్టాప్లాగ్ గేటును అమర్చి ఖరీఫ్తో పాటు రబీకి కూడా నీరందించారు. అయితే డ్యాంకు ఉన్న 33 గేట్లను మరమ్మతులు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. అయినా పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు శాపంగా మారింది. రబీలో కాలువలకు నీరు నిలుపుదల చేసిన తర్వాత క్రస్ట్గేట్లను మరమ్మతు చేసే విషయంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఈ ఏడాది డ్యాంలో 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించే పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. డ్యాం క్రస్ట్గేట్లను మరమ్మతు చేసే విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసి ఉంటే 80 టీఎంసీలకు చేరుకున్న తర్వాత వదిలే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నీరు ఎలాంటి ఢోకా లేకపోయినా రబీ పంటపై స్పష్టత కనిపించక పోవడంతో ఆయకట్టు రైతుల్లో ఈసారి ఒకే పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.20 అడుగులు, ఇన్ఫ్లో 32,767 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 13,670 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపారు. జలాశయం వద్ద ఆరు క్రస్ట్గేట్లు ఎత్తి నీరు విడుదల డ్యాంలో గరిష్ట నీటి నిల్వను 80 టీఎంసీలకు కుదించిన వైనం క్రస్ట్గేట్లు బలంగా లేనందున ముందుగానే గేట్ల ఎత్తివేత డ్యాం చరిత్రలో జూలై 2 నాటికి గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి -
పాఠశాలల్లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలి
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సమితి డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవన వనంలో ఆయుర్వేద ఉద్యమం చేపట్టిన అధ్యక్షుడు హఫీజుల్లా మాట్లాడారు. సర్కార్ సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని కోరారు. విద్యా రంగం పురోభివృద్ధికి సర్కార్ కమిటీలను ఏర్పాటు చేసి దానిని కార్య రూపంలోకి తేవాలన్నారు. సర్కారీ బడుల్లో బెంచీలు, విద్యుత్, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, తాగునీరు, క్రీడా సౌకర్యాలు విద్యార్థులకు ప్యాడ్లు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాదికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
హైకోర్టు సూచనతో నాగేంద్రకు బిగ్షాక్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బళ్లారి జిల్లా నుంచి ఏకై క మంత్రిగా కేబినెట్లో చోటు దక్కించుకోవడంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుని, జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఎదిగారు. అయితే వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరగడం, ఆ శాఖకు ఆయన మంత్రిగా ఉండటంతో పాటు ఆయన ప్రమేయంతోనే అవినీతి జరిగిందనే ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. కంచే చేను మేసిన చందంగా తన వర్గానికి చెందిన వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టడంతో రాష్ట్రంలో కలకలం రేపింది. పట్టుమని ఏడాది పాటు కూడా మంత్రిగా పని చేయని నాగేంద్ర అవినీతి ఊబిలో కూరుకుపోయారు. గోరు చుట్టుపై రోకటి పోటులా.. జైలుకు కూడా వెళ్లి వచ్చిన తర్వాత ఇందులో తన తప్పేమీ లేదని, తిరిగి మంత్రి పదవిని చేపడతానని ఆయన తన వర్గీయులతో పదే పదే చెబుతున్న తరుణంలో గోరు చుట్టుపై రోకటి పోటులా హైకోర్టు సూచనతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరిగిన తర్వాత ఆ నిధులను 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బళ్లారి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు ఖర్చు పెట్టారనే ఆరోపణలు కూడా ఉండటంతో పాటు ఎస్ఐటీ అధికారులు ఆ మేరకు విచారణ కూడా చేస్తున్నారు. బీజేపీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. నాగేంద్ర ప్రమేయంతో అవినీతి జరిగిందని, దానిపై ఆయన జైలుకు వెళ్లిన తరుణంలో పార్టీ ఆయనకు అండగా ఉంది. మళ్లీ మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కూడా సానుకూలంగా ఉండటంతో ఖచ్చితంగా నాగేంద్రకు మంత్రి పదవి దక్కుతుందని జిల్లాలో ముఖ్యంగా ఆయన అనుచరవర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ ఎంట్రీతో అక్కమార్కుల్లో దడ అయితే బ్యాంకు విచారణకే పరిమితమైన సీబీఐతో సమగ్ర తనిఖీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్ యత్నాళ్, రమేష్ జార్కిహోళి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఐటీ, ఈడీ విచారణ చేస్తున్న తరుణంలో హైకోర్టు సూచనతో సీబీఐ కూడా ఎంట్రీ ఇస్తుండటంతో అవినీతిలో కూరుకుపోయిన వారి గుండెల్లో దడ మొదలైంది. ఎస్ఐటీ నుంచి క్లీన్చిట్ పొందిన నాగేంద్ర మళ్లీ మంత్రి అవుతానని కలలు కంటున్నారు. అయితే సీబీఐ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనని చర్చనీయాంశంగా మారింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇప్పటికే మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల గోల్మాల్లో ఎవరెవరి పాత్ర ఉందో నిధులు స్వాహా చేసిన నేతలకు తెలుసు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ తనిఖీ చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మళ్లీ మంత్రి అయ్యే యోగం ఇప్పట్లో లేనట్లేనా? సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఎస్ఐటీకి ఆదేశం వాల్మీకి మండలి అవినీతి కుంభకోణం కేసులో మలుపు -
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని జాయింట్ కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్టుగా వేతనాలు, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి చెప్పి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మాని పెంచిన ధరలను తగ్గించాలన్నారు. -
సర్కారు బడులు అభివృద్ధి కావాలి
బళ్లారి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు కొనసాగి, అభివృద్ధి చెందాలి, అలాగే ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా సమాన పాఠశాలలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర పాఠశాలల అభివృద్ధి, పర్యవేక్షణ సమితుల సమన్వయ వేదిక నేతలు వీపీ నిరంజనారాధ్య, జేవీ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలల అభివృద్ధికి వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం–2009ను పూర్తిగా పరిణామాత్మకంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. నర్సరీ నుంచే ఇంగ్లిష్ మీడియం అమలుకు స్వస్తి చెప్పి విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలన్నారు. త్రిభాష సూత్రానికి బదులు ద్విభాష సూత్రాన్ని అమలు చేయాలి. ఆంగ్ల భాషను ఓ భాషగా ప్రభుత్వ స్థాయిలో బోధించడానికి నిపుణులైన ఆంగ్ల భాష ఉపాధ్యాయులను నియమించాలి. భాషను పరిణామాత్మకంగా బోధించడానికి అవసరమైన వనరులు అలాగే శిక్షణ ఇవ్వాలన్నారు. కన్నడను పాలన భాషగా మరింత పరిణామాత్మకంగా అమలు చేయడానికి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివిన విద్యార్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించినట్లు వారు తెలిపారు. -
మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా జేగరకల్లో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని, ప్రహరీ నిర్మించాలని సమాజ సేవకురాలు విద్యా పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనం వద్ద ఖాళీ చెంబులతో చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. 2024–25వ సాలులో గ్రామంలో రూ.20 వేలతో నిర్మించిన మహిళల మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. వెంటనే నీరు, ప్రహరీ వ్యవస్థను కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆల్మట్టి డ్యాం నుంచి 8న కాలువలకు నీరురాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా ఆల్మట్టి డ్యాం నుంచి ఈనెల 8న ఆయకట్టు కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ ప్రకటించారు. మంగళవారం బెంగళూరు వికాససౌధలో యాదగిరి, బాగల్కోటె, విజయపుర, రాయచూరు జిల్లాల ఎమ్మెల్యేలు, కేబీజీఎన్ఎల్ అధికారులతో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో మంత్రి పైవిధంగా ప్రకటించారు. కృష్ణా ఆయకట్టు ప్రాంత పరిధిలోని కాలువలకు 120 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారన్నారు. వార బందీ పద్ధతి ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, ఎమ్మెల్సీ అజయ్ సింగ్, శాసన సభ్యులు కరెమ్మ, వజ్జల మానప్ప, జేటీ పాటిల్, ఽశరణేగౌడ బయ్యాపూర్, మోహన్రాజ్లున్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంత కుమార్ శ్రీకారం చుట్టారు. బుధవారం 4వ వార్డులో ఎంఎల్ఏడీపీ ద్వారా రూ.లక్ష, రూ.25 లక్షల కేకేఆర్డీబీ నిధులతో హైటెక్ వంట గది, అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ జరిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రజాక్ ఉస్తాద్, ఈశప్ప, మురళీ యాదవ్, రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, హసన్లున్నారు. గురుకుల పాఠశాలను కొనసాగించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐడీఎస్ఓ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అయ్యాళప్ప మాట్లాడారు. సర్కార్ ప్రస్తుతం ఉన్న వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలకు పదోన్నతిని కల్పిస్తూ దానిని రద్దు చేయడాన్ని ఖండించారు. 2025–26లో 40 మంది బాలికలు 8వ తరగతిలో చేరారని, వారి భవిష్యత్తు కోసం మళ్లీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా విద్యా శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగికి రూ.9.25 లక్షల బురిడీ హోసూరు: పెద్ద మొత్తంలో జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని పట్టభద్రున్ని నమ్మించి రూ. 9.25 లక్షల నగదును స్వాహా చేశారు ఫేస్బుక్ మోసగాళ్లు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన యువకుడు (24) బి.కాం చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫేస్బుక్లో వెలువడిన ఓ ఉద్యోగ ప్రకటనను చూసి వారిని సంప్రదించాడు. ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని, ఇందుకుగాను వివిధ రుసుముల కింద రూ. 9.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మి చెప్పిన బ్యాంకు ఖాతాకు నగదును జమ చేశాడు. కాలం గడిచిపోతున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో వారి నంబర్కు సంప్రదించగా స్విచ్ఆఫ్ రావడంతో లబోదిబోమంటూ క్రిష్ణగిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కామపిశాచులకు అడ్డాగా..
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నిందితుడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు.. 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్లో వేధింపులుమెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు. 2024 జనవరి 27 – క్యాబ్లో వేధింపులుకమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024 కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్లో ఫొటోలు, వీడియోలు లభ్యం. 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది. -
‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి?’.. డీకేఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన. అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన. 👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే.. 👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
సెలూన్లో మహిళలకు మస్కా
యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. -
ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన
గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. జన్యుపరమైన లోపాలుజీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలుఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది #HealthForAll Extensive studies by @ICMRDELHI and AIIMS on sudden deaths among adults post COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deathsLifestyle and Pre-Existing Conditions identified as key factorshttps://t.co/QEN1X1PKfv— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2025టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం.. 2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. -
శంషాబాద్ రావాల్సిన విమానాలు మళ్లింపు.. బెంగళూరులో ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్కు రావాల్సిన పలు విమాన సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. ల్యాండింగ్కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్కు రావాల్సిన విమానాలను బెంగళూరుకు తరలించారు. దీంతో, విమాన ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావలసిన పలు విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను బెంగుళూరు ఎయిర్ పోర్టుకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ముంబై-హైదరాబాద్, వైజాగ్-హైదరాబాద్, జైపూర్-హైదరాబాద్, లక్నో నుంచి రావలసిన విమానాలు బెంగళూరులో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను విజయవాడకు దారి మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. -
పోలీసులంటే దేవుళ్లు కాదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి వికాశ్ కుమార్తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్ కుమార్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై క్యాట్ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది. తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు’’అని క్యాట్ తేలి్చచెప్పింది. వికాశ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. -
కర్ణాటక సీఎం మార్పు.. డీకే కీలక వ్యాఖ్యలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. -
చివరి భూములకు ఈసారైనా నీరందేనా?
రాయచూరు రూరల్: మూడు దశాబ్దాల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్నారు. ఉన్న నీటి వనరులు వినియోగించుకోలేని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల కింద రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారుతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన స్థితిలో కాలువలు ఉన్నాయి. జిల్లాకు వర్షపాతం ఒక శాపమైతే, పాలకుల శీతకన్నుతో ఎడమ కాలువ ఆధునికీకరణ పేరుతో రూ.కోట్లాది నిధుల విడుదల జరిగినా పనులు మాత్రం సక్రమంగా జరగకుండా పోయాయి. కాలువలకు నీరు వదిలితే ఏ క్షణంలోనైనా గండ్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాలువలకు ఇరువైపుల కట్టలకు ఉన్న సిమెంట్ కాంక్రీట్ జారిపోయింది. అక్కడక్కడ నాపరాళ్లు పగిలిపోయాయి. ఎర్రమట్టి కుదించుకు పోయింది. 99, 102వ డిస్ట్రిబ్యూటరీల కింద మమదాపుర, మర్చటహాళ్, నెలెహాళ్, మటమారి, ఆశాపుర, దిన్ని, యరగేర, మంజర్ల తదితర ప్రాంతాల్లో ఉపకాలువలకు నీరందడం కష్టమైంది. కాలువ గట్లు బలహీన పడిన వైనం పట్టించుకోని అధికారులు, పాలకులు -
ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా
రాయచూరు రూరల్: నగరంలో ఎలాంటి అనుమతులు లేని 300 ఆటోలకు చెక్ పెట్టినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిలో ఆటోల తనిఖీ చేపట్టి డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు లేని వాటన్నింటిని పట్టుకుని సీల్ వేసినట్లు తెలిపారు. నగరంలో దాదాపు 75 శాతం ఆటోలకు ఎలాంటి బీమా ఇతరత్ర పత్రాలు లేవని ఆయన అన్నారు. చెరువులో మొసలి పట్టివేత రాయచూరు రూరల్: తాలూకాలోని మర్చేడ్ చెరువులో మొసలి ప్రత్యక్షం కాగా అటవీ శాఖ అధికారులకు అప్పగించిన ఘటన తాలూకాలో చోటు చేసుకుంది. చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. గ్రామంలోని యువకులు ఏకమై చేపలు పట్టే వలతో మొసలిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో గ్రామ ప్రజలు ఊరట చెందారు. పాము కాటుకు తల్లీకొడుకు మృతి రాయచూరు రూరల్: పాము కాటుకు గురై తల్లీకొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. దేవదుర్గ తాలూకా ఏరుండి గ్రామంలో సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిసున్న సమయంలో వీరిని పాము కరిచింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తల్లి సుబ్బమ్మ(35), బసవరాజ్(10) మరణించారు. రిమ్స్లో బాలుడి అపహరణ రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన బాలుడు కిడ్నాప్కు గురైన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాయచూరు తాలూకా జులుంగేర తాండాకు చెందిన విష్ణు నాయక్(10)కు చేతులు కాలడంతో గత నెల 17న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆ బాలుడిని గత నెల 22న కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు. కార్మికుల సమస్యలు తీర్చండి రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బషీర్ పేర్కొన్నారు. మంగళవారం హట్టి పైభవనంలో జరిగిన సభలో కార్మికుల నుద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కార్మికుల జీవితం కష్టకరంగా మారిందన్నారు. కేంద్రం కార్మికుల హక్కులను హరిస్తోందన్నారు. సమావేశంలో రమేష్, ఫకృద్దీన్, వెంకటేష్, పెంచలయ్య, సాహీరా బేగంలున్నారు. ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఏర్పాటు తగదు రాయచూరు రూరల్: దేఽశంలో కేంద్ర సర్కారు ఆధీనంలో మంజూరు అవుతున్న విద్యా సంస్థలకు కమిటీ అధ్యయనం చేస్తుందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనడాన్ని బసవేశ్వర క్రాంతికారి సంఘం అధ్యక్షుడు రాజేష్ తప్పు బట్టారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్, జమ్మూకశీ్మ్ర్లో విజయనగర్ల్లో ఎయిమ్స్, కశ్మీర్ అవంతికల్లో ఫోరోనిక్స్ విశ్వవిద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలన చేశాయా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు కర్ణాటకలోని రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు రూపొందిస్తామనడం అపహాస్యంగా ఉందన్నారు. -
నేడు తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి కర్ణాటక కోటా కింద కొప్పళ, రాయచూరు జిల్లాలకు నీరందించే తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ(ఎల్బీఎంసీ)కు నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఈనెల 10న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యాంకు మంగళవారం ఇన్ఫ్లో 33,916 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా డ్యాంలోకి భారీగా ఇన్ఫ్లో పెరగడంతో డ్యాంలో నీటిమట్టం కూడా క్రమంగా పెరిగింది. జలాశయానికి ఎగువన శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, ఆగుంబె, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.38 అడుగులు, నీటినిల్వ 74.486 టీఎంసీలు ఉండగా ఔట్ఫ్లో 2,388 క్యూసెక్కులుగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నదికి టీబీ డ్యాం నుంచి నీరు తుంగభద్ర జలాశయంలోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో రూపంలో 33,916 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ద్వారా నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం జలాశయంలో 71.790 టీఎంసీల నీరు నిల్వ చేరింది. నిపుణుల సలహా ఆధారంగా జలాశయం క్రస్ట్గేట్లు మార్చక పోవడంతో ఈ సంవత్సరం జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించారు. తుంగా, భద్ర నుంచి పెద్ద మొత్తంలో నీరు విడుదలైతే జలాశయం నుంచి నదిలోకి మరింత ఎక్కువగా నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల అధికారులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ హెచ్చరిక సందేశాన్ని పంపారు. 10న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీలకు టీబీ డ్యాం నుంచి నీటి విడుదల -
బళ్లారిలో కసాప సమ్మేళనంతో కొత్త చరిత్ర
బళ్లారిటౌన్: బళ్లారిలో త్వరలో జరిగే 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం చరిత్ర సృష్టించనుందని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులోని కసాప కార్యాలయంలో జరిగిన ముందస్తు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడిగులు గర్వించదగ్గ ఉత్సవం అని, అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా సన్నద్ధం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన అన్ని సదుపాయాలకు ఆర్థిక సహాయం అందజేయనుందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు, నాడోజ మహేష్ జోషి మాట్లాడుతూ బళ్లారి జిల్లాలో ఇంత వరకు 5 సమ్మేళనాలు జరిగాయని, ఇది 6వ సమ్మేళనం అన్నారు. స్వాతంత్య్ర అనంతరం రెండో సమ్మేళనం అని గుర్తు చేశారు. ఇప్పటికే బళ్లారిలో కసాప కార్యవర్గ సమితి సమావేశంలో అఖిల భారత కసాప సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్ను ఎంపిక చేశారని, ఈమె మొదటి మైనార్టీ మహిళ అని గుర్తు చేశారు. జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, కేంద్ర కసాప కార్యదర్శి బీఎం పాటిల్, మాధ్యమ కన్వీనర్ హెచ్.శ్రీధర్మూర్తి, జిల్లా ఎస్పీ శోభారాణి, మహమ్మద్ హ్యారీష్ తదితరులు పాల్గొన్నారు. -
9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన
హుబ్లీ: డీ క్రియేషన్స్ వారి దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ధార్వాడ పద్మ థియేటర్లో ఏర్పాటు చేశామని ఆ చిత్ర దర్శకుడు మన్సూరే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇది ప్రేమ కథ అని, హీరోగా విజయ్ కృష్ణ, హీరోయిన్గా ప్రియాంక కుమార్ నటించారని తెలిపారు. శృతి హరిహరన్, శరత్ లోహితాశ్వ, సుధా బెళవాడి, అరుణ్సాగర్, శోభరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కార్తీక్, భక్కేష్ సంగీత దర్శకత్వం నిర్వహించారు. బెంగళూరు, ఉడిపి, కుందాపుర, గోవాల్లో షూటింగ్ చేశామన్నారు. ప్రత్యేక ప్రదర్శన బెంగళూరు, మైసూరుకు మాత్రమే పరిమితం అయిందన్నారు. అయితే కన్నడ సినీ రంగానికి ఉత్తర కర్ణాటక ఇచ్చిన సేవలు అనన్యం అని, అందుకే ధార్వాడలో ఈ ప్రత్యేక ప్రదర్శన చేశామన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్, పంపిణీదారులు రవిచంద్ర రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వృక్ష సంపద భద్రతకు చర్యలు చేపట్టండి బళ్లారి అర్బన్: మొహర్రం పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా ఆయా తాలూకాల పరిధిలో అగ్నిగుండం తయారీ కోసం వృక్షాలను నాశనం చేయరాదు. ఎండుకట్టెలతో పండుగను జరుపుకొనేలా అవగాహన కల్పించాలని, ఎట్టిపరిస్థితిలోను పచ్చని చెట్లను నాశనం చేయకుండా చర్యలు చేపట్టాలని జిల్లాధికారికి కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి జిల్లా శాఖ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. మొహర్రం పండుగ మతాల మధ్య సామరస్యానికి ప్రతీక అన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సందర్భంగా పచ్చని చెట్లు చేమలకు హాని వాటిల్లకుండా పోలీసులు సంబంధిత అధికారులు పండుగ నిర్వాహకులకు అవగాహన కల్పించి వారిని చైతన్య పరచాలని సంస్థ అధ్యక్షుడు పంపనగౌడ కోరారు. లింగేశ్వర్, అంజినమ్మ, ఆంజినేయ, శేఖర్, హులిగప్ప తదితరులు పాల్గొన్నారు. కవి మృతికి సంతాపం రాయచూరు రూరల్: నగరంలో సీనియర్ కవి బీ.వీ.వాల్మీకి నాగేంద్ర అకాల మృతికి రంగస్థల కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం కన్నడ భవనంలో జరిగిన సమావేశంలో సీనియర రంగస్థల కళాకారుడు హక్కి మాట్లాడుతూ రంగాయణ, కళా రంగం, కవిత్వంలో రాటు దేలిన నాగేంద్ర వాల్మీకిగా పేరొందారని అభివర్ణించారు. కార్యక్రమంలో అయ్యనగౌడ, వెంకటేష్, బషీర్ అహ్మద్, నరేంద్ర రంగస్వామిలున్నారు. ఆ ప్రకటన ఖండనీయం హొసపేటె: సోషలిజం, లౌకికవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్కు చెందిన దత్తాత్రేయ హొసబాళె చేసిన ప్రకటనను అఖిల భారత బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసోసియేషన్ నాయకుడు ఎం.కరుణానిధి తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘ్ పరివార్ తన రహస్య ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అంబేడ్కర్ పేరును ముందుకు తేవడం ద్వారా దేశ ప్రజల్లో కుల విద్వేషాన్ని నాటడానికి కూడా ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు 1946 డిసెంబర్ 13న ఒక సంకలిత తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, అది 1947లో ఆమోదం పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగంలో చేర్చారన్నారు. అనంతరం అసోసియేషన్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా కుల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నియామక పరీక్షల శిక్షణకు విజ్ఞప్తి
బళ్లారిఅర్బన్: ఎన్ఎండీసీలో నియామకాల కోసం పరీక్షలకు సిద్ధతా శిక్షణ గురించి వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో తహసీల్దార్కు అందజేశారు. ఎన్ఎండీసీ పరీక్ష అభ్యర్థులు తమ సమస్యను వినతిపత్రంలో వివరించారు. గత మార్చిలో నియామకమైన ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల సిద్ధతా శిక్షణ శిబిరాన్ని దోణిమలైలోని ప్రభుత్వ హైస్కూల్లో గత నెల 30 నుంచి ఈనెల 8 వరకు జరుపుతామని ప్రకటన ఇచ్చారన్నారు. అయితే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరైన కారణంగా శిక్షణ శిబిరాన్ని వాయిదా వేశారన్నారు. దీంతో బళ్లారి వాసులకు బళ్లారిలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేలా విజ్ఞప్తి చేస్తున్నామని విద్యార్థులు సురేష్, విజయ్కుమార్, పల్లవి, ఈశ్వరి అరిణి, రాజేశ్వరి, సాగర్, రాయాపుర లక్ష్మణ్, పంపాపతి, మహంతేష్, రాజేష్, రుద్రముని, గాదిలింగప్ప తదితరులు తెలిపారు. -
కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి
సాక్షి,బళ్లారి: ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి, బళ్లారి, కొప్పళ, రాయచూరు, బాగల్కోటె, బీదర్ తదితర జిల్లాల్లో జొన్నలు, సజ్జ రొట్టిలను ప్రధానంగా భోజనం చేస్తుంటారు. అందులోను కలబుర్గి రొట్టిలకు, జొన్నలకు మరింత గుర్తింపు ఉంటుంది. వర్షాధారిత భూముల్లో విస్తృతంగా పండించే జొన్నలను ఈ ప్రాంత వాసులు ఎక్కువగా ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు పొందిన జొన్నరొట్టిలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో కలబుర్గి జొన్న రొట్టిలను ప్రస్తావించడంతో ఈ ప్రాంతంలో తయారు చేస్తున్న జొన్న, సజ్జ రొట్టిలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మన్ కీ బాత్లో ఽప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలబుర్గి జొన్నరొట్టిలను ఽశ్లాఘించడంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని కలబుర్గిలో కాకుండా కర్ణాటక జొన్న రొట్టిలకు పేరు వచ్చింది. కలబుర్గి జొన్నరొట్టిలను మోదీ ప్రస్తావించారంటే ఈ ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పూర్వీకుల నుంచి బలవర్థక ఆహారం మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నా మన పూర్వీకులు ముందు నుంచి ఆహారంలో ప్రతినిత్యం ఉపయోగిస్తున్న జొన్నరొట్టిలను తమ పిల్లలకు కూడా భోజనంలో ప్రతి నిత్యం తినేందుకు కృషి చేస్తుండడంతో ఆరోగ్యకరమైన జొన్న, సజ్జ రొట్టిల వాడకం ద్వారా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం వేలాది జొన్న రొట్టిలు తయారు చేసి అమ్మకాలు సాగిస్తుండటంతో, ప్రతి ఇంటా జొన్నరొట్టిల సవ్వడి ఉంటుందని కలబుర్గి వాసులు పేర్కొంటున్నారు. ఇక్కడ పండించే జొన్నలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. వర్షాధారిత భూముల్లో ఎలాంటి రసాయనిక, క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కలబుర్గి జొన్నలంటే ప్రతి ఒక్కరూ లొట్టలు వేసుకుని తినాల్సిందే. అందుకే ప్రధాని మోదీని కూడా కలబుర్గి జొన్నరొట్టిలు ఆకర్షించాయని చెప్పవచ్చు. ఇక్కడ ఎండురొట్టిలతో అప్పటికప్పుడు తయారు చేసే జొన్నరొట్టిలకు మరింత గుర్తింపు ఉంటుంది. జొన్న రొట్టిలు తింటే వ్యాధులు దూరం ఉత్తమ ఆరోగ్యకరమైన జొన్నరొట్టిలను తినడం ద్వారా ముఖ్యంగా చక్కెర వ్యాధి పూర్తి నియంత్రణంలో ఉంచవచ్చని, బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలబుర్గి రొట్టిలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్నారు. కలబుర్గి జొన్నరొట్టిలను బ్రాండ్గా తీసుకుని రావడంతో రొట్టిలను తయారు చేస్తున్న మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ తయారు చేసే జొన్న రొట్టిలను కర్ణాటక వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు చేస్తుండటంతో కలబుర్గి రొట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరుగాంచింది. ఈ రొట్టిలు అమెజాన్, జొమ్యాటోల్లో కూడా అందుబాటులోకి వచ్చాయంటే జొన్న రొట్టిలను తినేవారి సంఖ్యరోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కలబుర్గి జొన్నరొట్టిలతో పాటు ఉత్తర కర్ణాటకలో పండించే జొన్నలతో తయారు చేసే జొన్న రొట్టిలకు ఎంతో గుర్తింపు ఉందని చెప్పవచ్చు. మన్ కీ బాత్లో జొన్నరొట్టిలకు ప్రధాని కితాబు ఆరోగ్యకరమైన ఆహారంగా ఈ రొట్టిలకు గుర్తింపు రొట్టిల తయారీతో మహిళలకు సైతం జీవనోపాధి -
బీదర్లో శాంతియుతంగా సద్భావన నడక
హుబ్లీ: బీదర్లో శాంతియుతంగా సద్భావన నడక చేపట్టారు. మహబూద్ గవాన్ మదరసా నుంచి ప్రారంభమైన ఈ నడక పలు వీధుల గుండా సాగి జిల్లాధికారి కార్యాలయానికి చేరుకొని ముగిసింది. ప్రదర్శన పొడవునా ఒక దేశం, ఒకే ధ్వని, ఒకే ఐక్యత, అన్ని మతాల సారం మానవత్వమే, ద్వేషం కాదు. ప్రేమను పంచుదాం. ప్రతి ధర్మం ఓ పువ్వులా శాంతి తోటలో కలిసి మెలసి బతుకుదాం. శాంతితో కలిసి నడుద్దాం. సౌభ్రాతృత్వమే మన శక్తి. మానవత్వం ఉన్న ఇంట్లో ద్వేషానికి స్థలం లేదు. అల్లర్లు వద్దు, హక్కులను గౌరవిద్దాం. ఐక్యత మన శక్తి, విభజన మన వినాశనం, అందరికీ సామరస్యం కావాలి తదితర నినాదాల ఫలకాలను చేతిలో పట్టుకొని ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఏడీసీ డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి, జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటిలకు వినతిపత్రాలను అందజేశారు. అంతకు వముందు జగద్గురు చెన్నబసవానంద స్వామి తదితర మఠాధీశులు మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతె సత్యాదేవి, ఫాదర్ డిసౌజ, సంజయ్, షాహిన్ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్తో పాటు అన్ని మతాలకు చెందిన ప్రముఖులు, సాధకులు, మత పెద్దలు పాల్గొన్నారు. -
ఏఐఐఈఏ ప్లాటినం మహోత్సవం
బళ్లారి రూరల్ : ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) 75 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా మంగళవారం ఎల్ఐసీ బ్రాంచ్–2లో ప్లాటినం మహోత్సవాన్ని ఆచరించారు. ఏఐఐఈఏ జెండాను ఆవిష్కరించి జ్యోతిప్రజ్వలనం చేశారు. ఈసందర్భంగా కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపత్ కుమార్, ఏబీఎం ఐ.కె.గోపాల్, ఏఐఐఈఏ అధ్యక్షుడు ఆర్.దత్తాత్రేయ, కార్యదర్శి కామ్రేడ్ సూర్యనారాయణ, డీఓ శశిధర్, ఏజెంట్ కొట్రేశ్, బీఎఫ్ఐ, ఏయూయూటీయూసీ, కర్ణాటక గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
మిమ్స్ను అప్గ్రేడ్ చేయాలి
మండ్య: మండ్య మెడికల్ కాలేజీ ఆస్పత్రి (మిమ్స్)కి చెందిన 18 ఎకరాల స్థలాన్ని కాపాడాలని రక్షణ వేదిక, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం సహా పలు సంఘాల నేతలు, కార్యకర్తలు మండ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి ర్యాలీని ఆరంభించారు. మిమ్స్ అనేది జిల్లాలో 30 లక్షల మందికి ఉపయోగపడే ప్రధాన ఆస్పత్రి అన్నారు. నిత్యం వందలాది మంది వైద్యసేవలకు వస్తుంటారని, 400 పడకల ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే మిమ్స్కు చెందిన 18 ఎకరాలు కబ్జా కోరల్లో ఉందని, దానిని రక్షించాలని నినాదాలు చేశారు. శివరామేగౌడ సునందా జయరాం, నాగణ్ణగౌడ, జయరాం తదితరులు పాల్గొన్నారు. డీకేశిని సీఎం చేయాలి● వంద మందికి పైగా ఎమ్మెల్యేల మాట ఇది ● ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ శివాజీనగర: కాంగ్రెస్లో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుతున్నారు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తప్పకుండా సీఎం అవుతారని ఆయన మద్దతుదారు, రామనగర హస్తం ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. రామనగరలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాను చెప్పేది వాస్తవమన్నారు. శివకుమార్ పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుచేత ఆయనకు సీఎం స్థానం లభించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. ఇదే మాటను సుర్జేవాలాకు చెబుతానన్నారు. సుర్జేవాలా చర్చలు రాష్ట్ర కాంగ్రెస్లోని ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చి, సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీసేందుకు వచ్చిన ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా 2వ రోజున మంగళవారం భేటీలు కొనసాగించారు. మంత్రులు పట్టించుకోవడం లేదు, వారికి బుద్ధి చెప్పండని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్.ఏ.హ్యారిస్, రిజ్వాన్, ఎం.కృష్ణప్ప, ప్రియాకృష్ణ, శివణ్ణ, ఏ.సీ.శ్రీనివాస్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ తదితరులు సుర్జేవాలను కలిసి మాట్లాడారు. సీబీఐకి వాల్మీకి మండలి స్కాం కేసు: హైకోర్టు బనశంకరి: రాజకీయ కలకలం రేకెత్తించిన మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశించింది. యూనియన్ బ్యాంక్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న సిట్ విచారణను రద్దు చేసింది. ఇప్పటివరకు సిట్ సేకరించిన ఆధారాలను సీబీఐ కి అందించాలని ఆదేశించింది. కేసు సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో పలువురు సీనియర్ నేతలకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తోంది. ఈ కేసులో బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మంత్రి పదవిని కోల్పోవడం తెలిసిందే. ఆయనను ఈడీ అరెస్టు కూడా చేయగా ప్రస్తుతం బెయిలు పొందారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది. సెలూన్లో మహిళలకు మస్కా యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. -
గుండెపోటుకు నవ వరుడు బలి
దొడ్డబళ్లాపురం: రెండున్నర నెలల క్రితం వివాహమైన కొత్త పెళ్లికొడుకును గుండెపోటు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన గుండెపోటు మరణాలతో సతమతమవుతున్న హాసన్ జిల్లాలోనే జరిగింది. హొళేనరసీపుర తాలూకా సోమనహళ్లివాసి సంజయ్ (27)కు ఇటీవలే పెళ్లయింది. సోమవారంనాడు స్నేహితులతో పార్టీ చేసుకున్న సంజయ్ తరువాత గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి తీసికెళ్లారు. అక్కడ బీపీ చెక్ చేయగా 220 ఉన్నట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందాడు. అయితే మృతుని కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శివమొగ్గలో విద్యార్థి.. శివమొగ్గ: గుండెపోటుతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన నగర శివార్లలోని బసవనగంగూరు గ్రామంలో జరిగింది. మృతుడు శ్రీనిధి (20) అనే విద్యార్థి. ఇతను నగరంలోని డీవీఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనిధికి అస్వస్థత కలిగింది, వెంటనే అతనిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది. గుండెపోటు, న్యుమోనియా కారణమని వైద్యులు చెప్పినట్లు గ్రామ నివాసి ప్రసన్న తెలిపారు. యువకుని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం అలముకొంది. హాసన్ జిల్లాలో విషాదం -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సుందర ప్రకృతిసీఎం జైలుకెళ్లడం ఖాయం: స్నేహమయి మైసూరు: గతంలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో జరిగిన కోట్లాది రూపాయల ఇళ్ల స్థలాల కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్య జైలుకెళ్లడం ఖాయమని సామాజిక కార్యకర్త, ఫిర్యాదిదారు స్నేహమయి కృష్ణ అన్నారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య అధికారం అండతో చట్టం కళ్లుగప్పే పని చేస్తున్నారన్నారు. ఈరోజు కాకపోతే రేపు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కేసులో తగిన సాక్ష్యాధారాలను సమకూర్చామన్నారు. సాక్ష్యాధారాలను నాశనం చేసే పనిని పోలీసులతో చేయిస్తున్నారన్నారు. సీఎం నిందితుడని 14 ఇళ్ల స్థలాలను వాపసు ఇచ్చినప్పుడే ప్రజలకు తెలిసిందన్నారు. ఈ కేసు విచారణలో మైసూరు లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేష్ పనితీరు బాగా లేదని ఆరోపించారు. సాక్ష్యాధారాలను ఆయనే నాశనం చేస్తున్నారని, సిద్దరామయ్యకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. ● బెళగావి జిల్లాలో ఘోరం సాక్షి,బళ్లారి: వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
మృత్యు శకటమైన కారు
దొడ్డబళ్లాపురం: దేవస్థానానికి వెళ్తుండగా ప్రయాణిస్తున్న కారే మృత్యుశకటమైంది. బోల్తాకొట్టిన ప్రమాదంలో ఆరుమంది బంధువులు మరణించిన దుర్ఘటన దొడ్డబళ్లాపురం– హిందూపురం రహదారి మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద చోటుచేసుకుంది. దొడ్డ పట్టణ పరిధిలోని కరేనహళ్లికి చెందిన ఈశ్వరప్ప (75), పురుషోత్తమ్ (75), కాళప్ప (68), నారాయణప్ప (70), గోపినాథ్(45), కారుడ్రైవర్ నరసింహమూర్తి (50) మృతులు. ఓవర్టేక్ చేయబోయి.. వివరాలు.. మంగళవారం ఉదయం దొడ్డబళ్లాపురం నుంచి మంచేనహళ్లి వద్ద ఉన్న భీమేశ్వర కొండ ఆలయానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. గౌరిబిదనూరు మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుమీద పల్టీలు కొట్టి బోల్తాపడింది. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా, బెంగళూరుకు తరలించారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయానికి వెళ్తుండగా బోల్తా ఆరుగురు దుర్మరణం దొడ్డబళ్లాపుర వద్ద విషాదం -
ఐదేళ్లలో 82 పులులు చనిపోయాయా?
శివాజీనగర: రాష్ట్రంలో గత ఐదున్నర సంవత్సరాల్లో 82 పులులు మృతి చెందాయని సాక్షి దినపత్రిక సహా పలు మీడియాల్లో వార్తా కథనాలు రావడంపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టి సారించారు. అన్ని పులుల మరణాల గురించి నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులకు సూచించారు. ఎన్ని పులులు సహజంగా మరణించాయి? ఎన్ని అసహజంగా మృతి చెందాయి? అసహజ మరణాలకు కారణాలేమిటి, నివేదికలు ఏమైనా వచ్చాయా అని అటవీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ పులుల కళేబరాల గోళ్లు, దంతాలు సేకరించారా, నిర్లక్ష్యం చూపిన సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారా? ఎన్ని పులుల హత్య కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారో వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు పులుల హత్య కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎన్ని కేసులు తనిఖీ దశలో ఉన్నాయి తదితర సమాచారన్ని 10 రోజుల్లోగా తమకు సమ ర్పించాలని తెలిపారు. అటవీ ఉన్నతాధికారులపై చర్యలు మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వరబెట్ట అడవిలో తల్లి, నాలుగు పిల్ల పులులను కొందరు విషాహారం పెట్టి చంపిన కేసులో జిల్లా డీసీఎఫ్ చక్రపాణి, ఎసీఎఫ్ గజానన హెగడె, విభాగ అధికారి మాదేష్లకు ప్రభుత్వం బలవంతంగా సెలవు ఇచ్చింది. రోడ్డుకు సుమారు 100 మీటర్ల దూరంలోనే పులులు చనిపోతే పట్టించుకోలేదని సర్కారు ఆగ్రహించింది. అక్కడికి 800 మీటర్ల దూరంలో చెక్పోస్టు ఉన్నా స్పందన లేదని, పైగా అటవీ వాచర్లు ధర్నా చేస్తుంటే పరిష్కరించలేదని అసంతృప్తిని వ్యక్తంచేసింది. అటవీ అధికారులు, గస్తీ సిబ్బంది లోపం వల్లే పులులు చనిపోయినట్లు నిర్ధారించి సెలవు ఆదేశాలిచ్చింది. విచారణకు అటవీ మంత్రి ఆదేశం -
భారీగా బంగారు నగలు సీజ్
యశవంతపుర: తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.58.60 లక్షలు విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు విల్లుపురానికి చెంది, ఆర్ఆర్ నగరలో నివాసం ఉంటున్న నాగమణి (47), రవికుమార్ (45) ఇటీవల ఓ ఫ్లాటు కిటికీలను బద్ధలు కొట్టి 55 గ్రాముల బంగారం, 3 కేజీల వెండిని దోచుకెళ్లారు. పోలీసులు గాలించిన అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి 537 గ్రాముల బంగారం, 7.84 కేజీల వెండి, బైక్ని సీజ్ చేశారు. బైకు దొంగ అరెస్ట్ బైకులను మాయం చేస్తున్న దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లిలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లి మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. సిటీలో ఇద్దరు దొంగలకు సంకెళ్లు -
బైక్ ట్యాక్సీలు షెడ్డుకేనా?
సాక్షి బెంగళూరు: బెంగళూరులో గత నెల 16వ తేదీ నుంచి బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా బైక్ ట్యాక్సీలు బంద్ అయినట్లు అంచనా. బైక్ ట్యాక్సీ కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదని, మా మంచి భవిష్యత్తుకు ఒక భరోసా అని వేలాది మంది బైక్ట్యాక్సీదారులు సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ నిషేధాన్ని సడలించాలని కోరారు. కొన్నిచోట్ల నిరసనలు కూడా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్నడనాట నిషేధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్దాస్ పై కూడా ఎక్స్లో వారికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టేలా ట్వీట్ చేయడం వల్ల బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన చేశారని ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను మీరి సుమారు 200కు పైగా బైక్ ట్యాక్సీదారులు విధుల్లోకి రాగా, పోలీసులు ఆ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. చార్జీల బాదుడు ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఆటో, క్యాబ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. వాటికి గిరాకీ గణనీయంగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని యాప్ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోవాలాలు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బైక్ ట్యాక్సీల నిషేధం తర్వాత ఏకాఎకి మూడు రెట్లు చార్జీలను పెంచినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. రవాణా శాఖ ఆటో రిక్షాలకు తొలి రెండు కిలోమీటర్లకు రూ. 30 ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్కు రూ. 15 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ యాప్ ఆటోలు తుంగలో తొక్కి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు పెరగడంతో రవాణా అధికారులు తనిఖీలు ప్రారంభించారు. నిషేధంతో వేలాదిమంది గగ్గోలు ఆటోల్లో పెరిగిన చార్జీల భారం ప్రజలు ఏమంటున్నారు? బెంగళూరులో తక్కువ ఖర్చుతో గమ్యం చేరడానికి బైక్ ట్యాక్సీలు అనువుగా ఉండేవని పలువురు నగరవాసులు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి రోజూ ప్రయాణ ఖర్చు పెరుగుతోందని చెప్పారు. ట్రాఫిక్లో సులభంగా వెళ్లే అవకాశం ఉండేదని అన్నారు. ఆటోలు, క్యాబుల్లో అధిక ధరలు వసూలు చేస్తుండడంతో తమకు ఆర్థిక భారంగా మారిందని సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు తెలిపారు. ఆటోడ్రైవర్ల సంఘాలు మాత్రం వాటిని నిషేధించాలని, లేకుంటే తమకు ఉపాధి ఉండదని పట్టుబట్టాయి. కాగా బైక్ ట్యాక్సీల మీద పలు ఆరోపణలున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అనేక కేసులున్నాయి. బైక్ ట్యాక్సీల భవిష్యత్తు ఏమిటనేది సందిగ్ధంలో ఉంది. -
దేవుడా.. ఎంతపని చేశావయ్యా
బాగేపల్లి(కర్ణాటక): తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్.ఎస్.చరణ్ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు. అంతా భీతావహం వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చిన భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్.ఎన్. రూప, కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్ హెచ్.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్ మంజునాథ్లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు. కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు.దేవుడా..ఎంతపని చేశావయ్యాకురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఢీకొన్న లారీ ఎక్కడ? టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కేసు నమోదు చేశారు. టాప్తో సహా లేచిపోయింది టెంపో ట్రావెలర్కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఇద్దరూ క్షేమం టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్ మంజునా«థ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు. దర్శనం తరువాత బయల్దేరాం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు -
సిద్దూ సర్కారులో అవినీతి తాండవం
బళ్లారిఅర్బన్: రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ప్రజలకు ఉత్తమ పాలన అదించడంలో పూర్తిగా విఫలం అయిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. ఆయన డీసీ కార్యాలయ ఆవరణలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగి పోయిందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపణలే దీనికి నిదర్శనం అన్నారు. గృహ వసతి శాఖలో లంచం ముట్టనిదే పనులు కావడం లేదని ఎంఆర్ పాటిల్ చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తిగా ఉంటూ బహిరంగంగా మండిపడుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు కనీస వసతులైన రోడ్లు, వంతెనలు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. పేదలు, రైతుల వ్యతిరేక సర్కారు ఇది అని మండిపడ్డారు. షెడ్యూల్ కులాలకు కేటాయించిన నిధుల విడుదలలో కూడా పక్షపాతం చూపుతున్నారన్నారు. ఫలితంగా ఆ వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికే తాపత్రయ పడుతుందని విమర్శించారు. మిగిలిన వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం పక్షపాత ధోరణికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ను ఆ స్థానం నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రముఖులు కిరణ్కుమార్, రాజునాయక్, లక్ష్మికాంతరెడ్డి, పుష్ప, జమిల, హొన్నూరుస్వామి, అశోక్ సంగనకల్లు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది
రాయచూరు రూరల్: సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో గాన సుధ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన సంగీతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటిి జీవిత విధానంలో మానసిక ఒత్తిడి అధికమైందని అన్నారు. డివైడర్కు లారీ ఢీ.. డ్రైవర్కు తీవ్ర గాయాలు హొసపేటె: నగర బైపాస్ రోడ్డులో కరివేపాకు లోడ్తో వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ పడిన ఘటన సోమవారం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో లారీ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హొసపేటె నగరం మీదుగా ద్వారా ముంబైకి కరివేపాకు లోడ్తో వెళుతున్న లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నగరంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో చేర్పించారు. హొసపేటె ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి తనిఖీ చేశారు. పీడీఓపై చర్యకు డిమాండ్రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా మలదకల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ)పై చర్యలు చేపట్టాలని సమాజ సేవకుడు భీమరాయ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–25లో రూ.720 లక్షల మేర నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. స్వార్థం కోసం నిధులు వినియోగించుకున్నారని, రెండు రోజుల్లో చర్యలు చేపట్టకపోతే జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామన్నారు. -
నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయి. పేదలకు అందిస్తున్న బియ్యం చౌక ధర దుకాణాల్లో ఉచితంగా బీపీఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తుండగా, వాటిని నల్ల బజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వారి కార్డులను రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోయింది. అంత్యోదయ కార్డులకు 14 కేజీలు జొన్నలు, 21 కేజీలు బియ్యం, బీపీఎల్ కార్డుదారులకు 2 కేజీలు జొన్నలు, 3 కేజీలు బియ్యం పంపిణీ చేయకుండా నల్ల బజార్కు తరలిస్తున్నారు. సిరుగుప్ప నుంచి రాయచూరుకు 550 ప్లాస్టిక్ బస్తాల్లో తరలిస్తున్న రూ.6.50 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్ రాయచూరు రూరల్: రాయచూరు రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్ జాగటగల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2025–27 సంవత్సర కాలానికి ఉపాధ్యక్షుడిగా జయరాం, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సభ్యులుగా ఈరణ్ణ, వెంకట సింగ్, శ్రీకాంత్, చంద్రకాంత్ ఎంపికయ్యారు. -
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
హొసపేటె: కళాకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలి. కళాకారుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. అప్పుడే కళాకారుల జీవితాలు మెరుగుపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాతా మంజమ్మ జోగతి తెలిపారు. ఆదివారం దుర్గాదాస్ కళామందిర్లో జరిగిన రంగబింబ 3వ వార్షికోత్సవం, సంగ్యా బాళ్యా నాటక ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. కన్నడ, సంస్కృతి శాఖ కళాకారుల జీవితాలను మెరుగు పరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలన్నారు. పేద కళాకారులు, కళా సంస్థలకు సహాయం చేయడం ద్వారా రంగస్థల కళాకారులను ప్రోత్సహించాలన్నారు. అప్పుడే కళాకారులు, కళ మనుగడ సాగించగలరని ఆమె అన్నారు. ప్రస్తుతం రంగబింబ కళా ట్రస్ట్ గత మూడు సంవత్సరాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కళా మనుగడ కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఆర్యవైశ్య సమాజ్ అధ్యక్షుడు చిద్రి సతీష్, గుబ్బి వీరణ్ణ అవార్డు గ్రహీత, సీనియర్ నాటక కళాకారిణి డాక్టర్ నాగరత్నమ్మ, నాటక అకాడమి సభ్యుడు శివనాయక, పంచ గ్యారంటీ యోజన అమలు కమిటీ అధ్యక్షుడు కే.శివమూర్తి, పీపీ అధ్యక్షుడు ఆదిమని హుస్సేన్ బాషా, లలిత కళారంగ ఉపాధ్యక్షుడు జీఎం.కొట్రేష్, సభ్యుడు కే.మంజునాథ్, జీపీ మాజీ సభ్యుడు గోవింద పరశురామ, గరగ ప్రకాష్, ఎం.కీర్తిరాజ్ జైన్, రోగాని మంజునాథ్ పాల్గొన్నారు. -
మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం
కోలారు: కోలారు సమీపంలోని ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విరగ కాసిన కాయలతో అలరారుతున్న పనస చెట్లు స్వాగతం పలుకుతాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 46 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా పనస చెట్లు దర్శనమిస్తాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో 5 కి.మి.ల దూరంలో ఉన్న హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన వారికి తాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే మొదటి పనస సంరక్షణా క్షేత్రం అని కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు 1600లకు పైగా పనస చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకు ఒక్కో సంఖ్య ఇచ్చారు. కొన్ని పనస చెట్ల కింద ఆ పనస ఏ రకానికి చెందినదనే వివరాలు రాసి ఉంచారు. ఒక్కొక్క చెట్టులోను పనస ఆకృతి, సైజు, వాటి రుచి, లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. పనస కొమ్మలకు విరివిగా కాసిన పనస కాయలు చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి. కొన్ని చెట్ల మొదలులోనే పనస కాయలు కాచి ఉండడాన్ని గమనించవచ్చు. మరో చెట్టులో మొదలు నుంచి కొన వరకు పనస కాయలు విరగకాశాయి. సీజన్లో మాత్రమే కాకుండా యేడాది పొడవునా పనసకాయలు కాచే రకాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా తోట నిండా పనస రకాల లోకమే మనకు దర్శనమిస్తుంది. 50 వసంతాల పనస తోట కర్ణాటక హార్టికల్చర్ పితామహుడు దివంగత ఎం.హెచ్.మరిగౌడ దూరదృష్టి ఫలితంగా 1969వ సంవత్సరంలో మహాత్మాగాంధీ జన్మశతమానోత్సవం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హార్టికల్చర్ శాఖ నుంచి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 100 పనస తోటలను పెంచాలని మరిగౌడ సంకల్పం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నగర సమీపంలోని టమక వద్ద పనస తోట తలెత్తింది. భూస్వాధీనం తదితర ప్రక్రియల కారణంగా 1973లో ఈ పనస తోటలో పనస మొక్కలను నాటడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న పనస చెట్లు 1973–75 సంవత్సరాల మధ్య నాటినవి. అంటే ఈ పనస తోట 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ పనస తోటలో ఆరంభం నుంచే విత్తనాల ద్వారా మొక్కలను పెంచి నాటారు. హార్టికల్చర్ శాఖ అధికారులు ఎక్కడ నాణ్యమైన పనస పళ్లు కనిపించినా వాటి విత్తనాలను తెచ్చి మొక్కలుగా పెంచి పోషించేవారు. సుమారు మూడున్నర దశాబ్దాల కాలం పాటు ఈ చెట్లను ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించారు. ప్రస్తుతం ఈ చెట్లు ఉత్తమ ఫలాలను అందిస్తున్నాయి. 2009లో ఈ పనస క్షేత్రంలో బాగలకోటె విశ్వవిద్యాలయానికి చెందిన హార్టికల్చర్ కళాశాల ప్రారంభమైంది. అనంతరం పనస తోటను హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతకు ముందు ఈ క్షేత్రం పనస రకాల సేకరణ కేంద్రంగా ఉండింది. విశ్వవిద్యాలయానికి అప్పగించిన అనంతరం శాసీ్త్రయంగా పనస రకాల అభివృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో విశ్వవిద్యాలయ, కళాశాల శాస్త్రవేత్తలు చెట్లను రక్షణ చేయడంతో పాటు వివిధ రకాల పనస వంగడాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నారు. అభివృద్ధి చేసిన పనస రకాలను రైతులకు కూడా అందిస్తున్నారు. ఈ పనస క్షేత్రంలో ప్రతియేటా పనస కాయలను వేలం వేస్తారు. వ్యాపారులు వేలంలో పనస కాయలను కొంటారని వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ప్రముఖుడు శివానంద హొంగల్ తెలిపారు. ఇప్పటికీ ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి రైతులు, విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలో పనసకాయల తోట చూపరులకు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి -
హుబ్లీ ధార్వాడ పాలికెకు కొత్త రథసారథులు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె సంస్థ కొత్త మేయర్గా బీజేపీ తరపున జ్యోతిపాటిల్, డిప్యూటీ మేయర్గా సంతోష్ చవాన్ ఎన్నికయ్యారు. పాలికె కార్యాలయంలో 24వ అవధికి సంబంధించి 19వ వార్డు కార్పొరేటర్ జ్యోతి పాటిల్ అత్యధిక 47 ఓట్లతో మేయర్గా ఎన్నికయ్యారు. పాలికె 49వ వార్డు కార్పొరేటర్ సంతోష్ చవాన్ కూడా 47 ఓట్లను పొంది డిప్యూటీ మేయర్గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బెళగావి డివిజన్ కమిషనర్ ఎస్బీ శెట్టన్నవర్ ప్రకటించారు. కాగా విపక్ష కాంగ్రెస్ తరపున 59వ వార్డు కార్పొరేటర్ ప్రవాసాంధ్ర మహిళా నాయకురాలు సువర్ణ కల్వకుంట్ల, 76వ వార్డు కార్పొరేటర్ వహీదాఖానం అల్లాభక్షి కిత్తూరు వరుసగా డిప్యూటీ మేయర్ స్థానాల కోసం నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ మేయర్ పదవికి 14వ వార్డు కార్పొరేటర్ శంభుగౌడ రుద్రగౌడ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ ఎన్నికలను సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో పాలికె కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 90 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముగ్గురు గైర్హాజరు తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం 87 మంది పాల్గొనగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. అదనపు డివిజినల్ కమిషనర్ ఎస్ఎస్ బిరాదార్, పాలికె కమిషనర్ రుద్రేష్ గాళి ఎన్నికలను పర్యవేక్షించారు. కొత్త మేయర్ జ్యోతి పాటిల్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తానన్నారు. రక్షిత మంచి నీరు, చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా ఉందన్నారు. ఈ రెండింటిని తొలి ప్రాధాన్యతగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జంట నగరాల సౌదర్యానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తానన్నారు. ఇక ఆరోగ్యం దృష్యా పాలికె ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తానన్నారు. వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసానికి జంట నగరాలకు వస్తారు. వారికి కనీస సౌకర్యాలు దక్కేలా చూస్తానన్నారు. సీనియర్ల సలహా సూచనలను తీసుకుని వారిని విశ్వాసంలోకి పరిగణించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శ్రమిస్తానన్నారు. మేయర్గా జ్యోతి పాటిల్ ఉప మేయర్గా సంతోష్ చవాన్ -
హాసన్లో హృదయ వేదన
బనశంకరి: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు ఆగకపోగా, ప్రజల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకే రోజు నలుగురు మరణించారు. దీంతో గత 40 రోజుల్లో గుండెపోటుకు బలైనవారి సంఖ్య 22 కు పెరిగి భీతావహం నెలకొంది. బేలూరులో జేపీ లేపాక్షి (50) అనే మహిళ, హొళెనరసీపుర ప్రభుత్వ పీయూ కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ ముత్తయ్య (58), నుగ్గేహళ్లి నాడకచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ (53), చెన్నరాయపట్టణ తాలూకా కెంబాళు గ్రామంలో లోహిత్ (38) అనే జవాన్ గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. అయ్యో.. సైనికుడు ● లోహిత్ గత 18 ఏళ్లుగా ఆర్మీ జవాన్గా పనిచేస్తుండగా సెలవుల్లో ఊరికి వచ్చారు. జూలై 3 నాటికి సెలవు పూర్తయి డ్యూటీకి వెళ్లాలి. కానీ సోమవారం ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలాడు. ● చెన్నరాయపట్టణ తాలూకా నుగ్గేహళ్లి గ్రామ నాడ కచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండె నొప్పి అనిపించింది. వెంటనే కుటుంబీకులు చెన్నరాయపట్టణ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. బెంగళూరులో మెడికో మరోవైపు బెంగళూరులో మెడికల్ విద్యార్థి వైభవ్ కులకర్ణి (26) గుండెపోటుతో మృతిచెందారు. బాగల్కోటేలో వీవీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. స్నేహితులతో కలిసి తమిళనాడు టూర్కి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బెంగళూరుకు రాగానే గుండెపోటు పట్టేయడంతో అతడిని ఓ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పరిశోధిస్తాం: సీఎం హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల గురించి మైసూరులో ఉన్న సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని, కారణాలు ఏమిటి అనేది నిపుణుల ద్వారా తెలుసుకుంటామన్నారు. ఆరోగ్యశాఖ జయదేవ హృద్యోగ సంస్థకు చెందిన 10 మంది వైద్యనిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయనుంది. హాసన్లో మరణాలు, కారణాలపై విచారణ జరుపుతారు. మరో నలుగురు ఆకస్మిక మృతి మృతుల్లో లెక్చరర్, ఉద్యోగి, జవాన్ -
తీర్థయాత్రలో ఎంత ఘోరం?
బాగేపల్లి: తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్.ఎస్.చరణ్ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు. అంతా భీతావహం వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చిన భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్.ఎన్. రూప, కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్ హెచ్.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్ మంజునాథ్లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు. కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు. దేవుడా..ఎంతపని చేశావయ్యాకురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఢీకొన్న లారీ ఎక్కడ? టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కేసు నమోదు చేశారు. టాప్తో సహా లేచిపోయింది టెంపో ట్రావెలర్కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఇద్దరూ క్షేమం టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్ మంజునాఽథ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు. దర్శనం తరువాత బయల్దేరాం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు బాగేపల్లి భక్తుల టెంపోను లారీ ఢీ ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన -
ఆలయం ఆరంభం
మాలూరు: తాలూకాలోని అంచెముస్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ దేవి దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామంలో భక్తులు, ప్రజల సహకారంతో శ్రీ గంగమ్మ దేవి దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. వేదమంత్ర పారాయణం, కళశ స్థాపన, మహా కుంభాభిషేకం తదితరాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. ఘరానా రైలు దొంగ అరెస్టు మైసూరు: రైలులో దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర దొంగను మైసూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్కు చెందిన జితేంద్రకుమార్ చమ్లా (37) అరెస్టయిన నిందితుడు. ఇతని నుంచి రూ. 22.75 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకొన్నారు. రైళ్లలో 17 చోరీల కేసులు పరిష్కారమయ్యాయి. మంగళూరు, అరసికరే రైల్వేపోలీస్ స్టేషన్లలో 4 కేసులు ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక లో రైళ్లలో ప్రయాణిస్తూ డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లాడని కేసులున్నాయి. పలుసార్లు అరెస్టయి విడుదలైనా మళ్లీ దొంగతనాలే చేసేవాడు. రైల్వే ఎస్పీ శ్యామలత ఆధ్వర్యంలో గాలింపు జరిపి పట్టుకున్నారు. యథేచ్ఛగా జింకల వేట బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఆనేకల్ తాలుకాలో ఉన్న బన్నేరుఘట్ట అభయారణ్యంలో జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని, కొమ్ములను అమ్ముతున్న ముఠాని అటవీ అధికారులు గుర్తించారు. 74 కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. నైస్ రోడ్డు జంక్షన్ వద్ద ఓ కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. కారు డ్రైవర్ ప్రతాప్ (31)ని అరెస్టు చేసి ప్రశ్నించి సీకే పాళ్యలో ఉన్న ఒక షెడ్లో గాలించగా మరింత మాంసం, చర్మాలు లభించాయి. ఒక సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకీలు, పదితూటాలు, రెండు కార్లు, ఒక బైక్, తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలరాజు, షెడ్ యజమాని భీమప్ప, రమేష్, ఫిలిప్లపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నారు. అభయారణ్యంలో చుక్కల జింకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని వేటాడి మాంసాన్ని అమ్మేవారని తెలిపారు. సహజీవనంలో హత్య ● అసోంవాసి అరెస్టు బనశంకరి: బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు స్కేటింగ్ గ్రౌండ్ వద్ద బీబీఎంపీ చెత్త లారీలో లభించిన మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమైంది. సహజీవనంలో ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. అసోంకు చెందిన షంషుద్దీన్ (33) అనే వలస కూలీని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఇద్దరు పిల్లల తల్లి అయిన పుష్ప అలియాస్ ఆశ (40) హత్యకు గురైన మహిళ. భార్య పిల్లలను అసోంలోనే వదలిపెట్టిన నిందితుడు హుళిమావు వద్ద ఓ హౌస్ కీపింగ్ సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే స్థానికురాలు వితంతువు పుష్పా పనిచేస్తూ ఇద్దరి మధ్య పరిచయమై ఏడాదిన్నర నుంచి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. పుష్ప ఫోన్లో ఎక్కువగా మాట్లాడడంతో అనుమానంతో షంషుద్దీన్ వేధిస్తున్నాడు. జూన్ 28వ తేదీ రాత్రి గొడవ జరిగి, నిందితుడు కత్తితో దాడి చేసి, ఆపై గొంతు పిసికి పుష్పని హత్య చేశాడు. మృతదేహాన్ని మూటగట్టి బైకులో పెట్టుకుని హుళిమావు నుంచి వచ్చి చెత్త లారీలో పడేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం చెత్త లారీలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి హంతుకుని కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అరెస్ట్చేసి విచారణ చేపట్టారు. -
నందికొండపై కేబినెట్కు ఏర్పాట్లు
చిక్కబళ్లాపురం: ఇక్కడి ప్రఖ్యాత నంది హిల్స్ మీద 2వ తేదీన సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. కొండ మీదకు మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ నవీన్భట్ సోమవారం నందిగిరిని పరిశీలించారు. ఏర్పాట్లను వీక్షించారు ఆయన మాట్లాడుతూ సమావేశానికి ముందు నంది ఆలయాన్ని సందర్శిస్తారు. కొండపైకి వెళ్లే మార్గంలో సూచనా ఫలకాలను అమరుస్తాం, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తరువాత కుప్పహళ్లి గ్రామ పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రిమండలి భేటీతో చిక్కతో పాటు నందిహిల్స్ పరిసరాలలో కోలాహలం నెలకొంది. పర్యాటకుల రాకను నిషేధించారు.ఘరానా ఓఎల్ఎక్స్ మోసగానికి సంకెళ్లు యశవంతపుర: ఓఎల్ఎక్స్లో కారు అమ్ముతున్నట్లు ప్రకటన ఇచ్చి డబ్బులు తీసుకుని ఉడాయించే మోసగాన్ని దక్షిణకన్నడ జిల్లా మంగళూరు సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రవిచంద్ర మంజునాథ్ రేవణకర (29)ని అరెస్ట్ చేశారు. రూ.2.5 లక్షలకు కారు అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్ యాప్లో ఇతడు ప్రకటన ఇచ్చాడు. ఓ వ్యక్తికి ఈ డీల్ నచ్చి సంప్రదించాడు, డబ్బులు పంపగానే కారును డెలివరీ చేస్తానని మోసగాడు చెప్పాడు. సరేనని బాధితుడు డబ్బులు బదిలీ చేశాక వంచకుడు స్పందించలేదు. బాధితుడు మంగళూరు సైబర్ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలించి నిందితుడు హొసపేటలో ఉండగా వెళ్లి అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. నిందితునికి 21 బ్యాంక్ ఖాతాలున్నాయి. 8 సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నాడు. ఇతని మీద 80 కి పైగా సైబర్ వంచన కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్ల నుంచి కార్ల ఫోటోలను ఓఎల్ఎక్స్లో పెట్టి మోసాలకు పాల్పడడమే వృత్తిగా చేసుకున్నాడని బయట పడింది. తోటలోకి ఆవు వచ్చిందని.. శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని హోసనగర తాలూకాలోని విజాపుర గ్రామంలో ఆవు పొదుగును కత్తిరించిన కేసులో రామచంద్ర అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్శెట్టి అనే వ్యక్తి ఆవును జూన్ 28వ తేదీన మేతకు వదిలాడు. అప్పుడు ఒక పొదుగును ఎవరో కత్తిరించారు. హోసనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగింది. నిందితుడు రామచంద్ర చాకుతో పొదుగును కోయడంతో పాటు కట్టెతో ఆవును చావబాదినట్లు ఒప్పుకున్నాడు. తన తోటలోకి వచ్చి మేసిందనే కోపంతో దాడి చేశానన్నాడు. పేలిన బస్సు టైరు, 10 మందికి గాయాలు మైసూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు టైరు పేలి పది మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన సోమవారం నంజనగూడు తాలూకాలోని హెడియాల దగ్గర జరిగింది. బేగూరు నుంచి హెడియాల మీదుగా సరగూరుకు వెళ్తున్న బస్సు టైరు పేలిపోయింది. ఆ తాకిడికి బస్సులోని వారికి గాయాలయ్యాయి. హెడియాల మాజీ జీపీ సభ్యుడు నేమతుల్లాఖాన్, అతని స్నేహితులు గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్లారు. హెడియాల సరిహద్దుల్లో తరచూ ఆర్టీసీ బస్సులు చెడిపోతున్నాయి. ఉచిత బస్సు కావడంతో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. రద్దీకి తగినట్లు బస్సులు నడపడం లేదు. పైగా పాత డొక్కు బస్సులు తిప్పుతున్నారని ప్రజలు ఆరోపించారు. కొత్త బస్సులను వేయాలని కోరారు. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
దైవ దర్శనానికి వచ్చి పరలోకానికి
● పుష్కరిణిలో పడి బాలుడు మృతి శ్రీనివాసపురం: దైవ దర్శనానికి వచ్చిన కుటుంబంలో విషాదం పొంగిపొర్లింది. పుష్కరిణిలో మునిగి బాలుడు మరణించిన ఘటన ముళబాగిలు కురుడుమలై గ్రామంలో చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా కాలఘట్ట గ్రామానికి చెందిన కుశాల్ (9) మృతుడు. తండ్రి మంజునాథ్, కుమారుడు కుశాల్, కుటుంబంతో కలిసి ఆదివారం కురుడుమలై గ్రామంలోని పురాణ ప్రసిద్ధ వినాయక దేవాలయానికి దర్శనం కోసం వచ్చారు. అక్కడ ఆటలాడుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లిన బాలుడు జారి నీటిలోకి పడిపోయాడు. కొంతసేపు ఎవరూ గమనించలేదు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చివరికి పుష్కరిణిలో బాలుని శవం కనిపించింది. కుమారుడి మరణంతో దంపతులు ఇద్దరు కన్నీరు పర్యంతమయ్యారు. ముళబాగిలు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. వరదలు ఉధృతం
రాయచూరు రూరల్: మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు కర్ణాటకలోకి పోటెత్తుతోంది. వేదగంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్య కేశి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, భాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాద గిరి, రాయచూరు జిల్లాలు వరద ప్రభావానికి గురవుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. బెళగావి జిల్లాబెణ్ణే తుప్రి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 14 వంతెనలు నీటమునిగాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలమట్టి జలాశయానికి లక్షా35వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ నారాయణ పుర డ్యాంకు విడుదల చేస్తున్నారు.నారాయణపుర డ్యాం 30 గేట్లను ఎత్తి లక్షా10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు నది తీరాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు వరద నీటి ప్రవాహంతో పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లింగసూగురు తాలూకాలోని మాదరదొడ్డి, కడదరగడ్డ, ఓంకార గడ్డి, యరగూడి, హంచినాళ, మల్లమ్మ గడ్డ, జలదుర్గ, రాయచూరు తాలూకా అత్కూరు, కురువకుర్ద, కురవకుల, దొంగ రాంపూర. కాడ్లూరు, గురాజపూర్, గంజల్లి, దేవదుర్గ తాలూకా వీరగోట, ముదగోట, లింగదహల్లి, చిచోడి, బాగురు, అంచేసూగురు, గోపాల పుర, కర్క హల్లి, హేరుండి, అప్రాళ, బసవంతపుర, చిక్కరాయకుంపి, హిరే రాయకుంపి, గూగల్ తదితర ప్రాంతాలు జలావృతం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. వరద నీటిలో చిక్కుకుపోయిన కాపరులు కరకల గుడ్డకు చెందిన గొర్రెల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు ఉన్న ప్రాంతాన్ని వరదనీరు చుట్టుముట్టింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బాధితులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలివెళ్లాయి. -
సాహిత్య సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్
బళ్లారిఅర్బన్: డిసెంబర్లో బళ్లారిలో జరగనున్న 88వ అఖిల భాతర సాహిత్య సమ్మేళనం అధ్యక్షురాలిగా బుకర్ ప్రైజ్ గెలుచుకున్న హార్ట్ ల్యాంప్ రచయిత, హాసన్కు చెందిన బాను ముస్తాక్ ఎంపికయ్యారు. కసాప రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ జోషి ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా కన్నడ రచయిత్రి బుకర్ ప్రైజ్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా కన్నడ కస్తూరి పరిమాళలను ప్రసరింపజేశారన్నారు. దీంతో ఆమెను సమేళ్మన అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం సమంజసమని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో సమ్మేళనాన్ని వైభవోతంగా జరపడానికి కసాప ఇప్పటినుంచే ప్రక్రియ మొదలు బెట్టిందన్నారు. సమావేశంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్ట రుద్రప్ప, గౌరవ కార్యదర్శి డాక్టర్.హెచ్ఎల్ మల్లేశ్ గౌడ, తదితరులు పాల్గొన్నారు. -
అపురూపం మరడిహళ్లి రంగప్పన పర్వతం
సాక్షి,బళ్లారి: కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లావారసం గుట్టలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వీటిని చూడాలంటే చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా మరడిహళ్లి గ్రామానికి వెళ్లాల్సిందే. భూ గర్భం నుంచి ఎగసిన లావారసం ఉప్పునీటితో కలవడంతో ర్యాపిడ్ బెల్ట్ గణీకృతమై పిల్లోలావాగా ఏర్పడుతుంది. ఆలివన్, పైరాక్సిన్, హంపిబోల్, బయోటైల్, ఐరన్,క్యాల్షియం, శిలికాన్ ఖజజాల మిశ్రమ సమ్మేళనమే పిల్లోలావా. మరడిహళ్లిలో ఉన్న ఇలాంటి గుట్టను భారతీయ పురాతత్వ శాఖ 1976లో గుర్తించి జాతీయ భూవిజ్ఞాన స్మారకాలుగా ప్రకటించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే వీటిని పర్యవేక్షిస్తున్నారు. మరడి అంటే మట్టి దిబ్బా అని, దిబ్బ అంచున వెలసిన ఊరే మరడిహళ్లి. దిండు ఆకారంలో ఉన్న ఈ గుట్టను రంగప్పన పర్వతంగా స్థానికులు పిలుస్తారు. భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు కాగా మరిడిహళ్లి పిల్లోలావాకు 260 కోట్ల సంవత్సరాల వయస్సు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పిల్లోలావాను తొలిసారిగా గనులు భూవిజ్ఞానశాఖ డైరెక్టర్ పీఎస్ పిచ్చముత్తు గుర్తించినట్లు ఆ సంస్థ చిత్రదుర్గం సీనియర్ భూశాస్త్ర తెలిపారు. ముట్టుకుంటే పత్తిని తాకినట్లు అనుభూతి మరిడిహళ్లి గుట్టలు, రాళ్లు అడవిగా కనిపిస్తోంది. బంతి ఆకారంలో సైజు రాళ్లను, బండరాళ్లను చూడవచ్చు. ప్రతిరాయి కూడా లావా నుంచి ఏర్పడిందే. ముట్టుకుని చూస్తే పత్తిని స్పర్శించినట్లుగా భావన కలుగుతుంది. గ్రామీణ ప్రజలు ఒకటిపై ఒకటి పెట్టి గుడిని కట్టారు. పై కప్పుపై శంఖము, చక్రము, గదా చిత్రాలు లిఖించి రంగనాథ స్వామిగా నామకరణం చేశారు. శ్రీరంగ పట్టణం కరిగట్టలోను లావా చిహ్నలు ఉన్నాయి. మైసూరులోని జ్వాలాముఖి త్రిపురసుందరి దేవిని జ్వాలాముఖి అమ్మగా పూజిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. మరడిహళ్లిలోని లావా గుట్టలు ఏర్పడి కోట్లాది సంవత్సరాలు గడిచినా వాటి రూపంలో ఇసుమంతైనా మార్పులేదు. వానలు, గాలులు, ఉష్ణోగ్రత్తలు తాకిడి ప్రభావంతో ఎటుమంటి మార్పు చెందలేదు. 50కి పైగా జాతీయ భూవిజ్ఞాన స్మారకాలు ఉన్న మరిడిహళ్లి పిల్లోలావాను అత్యంత ప్రాచీనమైనదిగా చెబుతున్నారు. కోట్ల సంవత్సరాలు గడిచినా రూపంలో మార్పు లేదు లావారసం ప్రవాహాలను నాలుగు విధాలుగా విభజించారు. మొదటి మూడు లావా రసభూమి పై అంచులో కనిపించగా, పిల్లోలావా సముద్రపు అడుగు భాగంలో సంభవించే జ్వాలాముఖి రూపాన్ని సంతరించుకుంటాయి. నిప్పు, నీటీ మధ్య ఘర్షణలో ఏర్పడిన ఘనరూప వస్తువే పిల్లోలావాగా పరివర్తన చెందిందిగా శాష్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లటి నీటితో తీవ్రమైన ఉష్ణాంశాలతో లావారరసం కలిసినప్పుడు ఒత్తిళ్లుకు గరై సుడులు, సుడులుగా రూపాన్ని ఏర్పరుడుంది. ఒకదానిపై ఒకటి తలదిండులు పేర్చినట్లుగా గట్టిపడుతుంది. ఈ కారణంగా దీన్ని దిండు ఆకృతి లావా అని అంటారు. కోట్లాది సంవత్సరాల క్రితం ఏర్పడిన పిల్లోలావా(దిండు) పర్వతాలు ప్రపంచస్థాయిలో ఘనత వహించిన మరడిహళ్లి పిల్లోలావా -
జల సవ్వడి.. జన సందడి
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు జీవనాడి అయినా తుంగభద్ర జలాశయం ఆదివారం పర్యాటకుల సందడితో కళకళలాడింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం నిండు కుండల తొణికిస లాడుతోంది. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి డ్యాం అందాలను వీక్షించారు. డ్యాంలో ఎగసి పడుతున్న అలలను, ఆస్వాదించారు. బళ్లారి, కొప్పళ రాయచూరు, చిత్రదుర్గ గదగ్తో పాటు తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. -
పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం
రాయచూరు రూరల్ : పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల భారత పాత్రికేయుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాత్రికేయుల తరహాలో సమాజానికి సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా కథనాలు రాయాలన్నారు. అనంతరం ఉత్తమ పాత్రికేయులకు అవార్డులు అందించారు. రామచంద్ర ప్రభు, చంద్రు, విజయ జాటగల్, వెంకట సింగ్, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు. ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఎందుకు? రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ మంజూరు కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర అహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొనడాన్ని బీఎస్పీ అధ్యక్షుడు జైబీమ్ తప్పు బట్టారు. అదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క రాయచూరు విషయంలోనే ఈ నిబంధన పెడుతున్నారన్నారు. ఏపీలోని మంగళగిరి, తెలంగాణ, బీబీనగర్, జమ్మూలో ఎయిమ్స్ ఏర్పాటుకు కమిటీలు ఏర్పాటు చేశారా? అని జైబీమ్ ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు రాయచూరులో ఎయిమ్స్ మంజూరు విషయంలో ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తోందని ప్రశ్నించారు. గూడ్సుషెడ్ తరలింపునకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలోని రైల్వే గూడ్స్ షెడ్ను యరమరాస్కు తరలించేందుకు కేంద్ర దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శ్రీకారం చుట్టారని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు బాబారావ్ తెలిపారు. నగరంలో 60 ఏళ్లుగా ఉన్న రైల్వే గూడ్స్షెడ్తో ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో నగరానికి 8 కి.మీ.దూరంలోని యరమరాస్కు తరలించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. బ్లడ్బ్యాంక్ను ప్రారంభించిన ఎంపీ హొసపేటె: నగరంలో ఏర్పాటు చేసిన వై.ఉమామహేశ్వర రావు రోటరీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ను ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే గవియప్ప ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా రోటరీ క్లబ్ హోస్పేట్లో ఆరోగ్యం, విద్య, ఇతర సామాజిక సేవలు అందిస్తోందన్నారు. రోటరీ సంస్థ నేతలు తదితరులు పాల్గొన్నారు. చెస్ పోటీలు మెదడుకు పదును బళ్లారిఅర్బన్: ప్రతిభ పాఠవాల వెలికి తీతకు చెస్ పోటీలు దోహద పడుతాయని ట్రెడ్డి పేపర్ యజమాని సునిల్ గుండే విద్యార్థులకు సూచించారు. నగరంలోని గాంధీననగర్ వాటర్బూస్టర్ వద్ద ట్రెండి పేపర్ కాంప్లెక్స్లోబళ్లారి చెస్ అకాడమి ఆధ్వర్యంలో అండర్–15 బాలుర విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన చెస్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా బళ్లారి, హోస్పేట్, బెంగళూరు, బీదర్, ఉడుపి, కుందాపుర, హైదారాబాద్, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అకాడమి కోచ్ ఎస్ఎండీ రఫిక్, బసవేశ్వర డాక్టర్ భరత్, బళ్లారి చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీహెచ్ఎం విరుపాక్షయ్య, నాగరాజు, రాఘవేంద్ర, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్ ●
● పదిమంది నిందితుల అరెస్ట్ రాయచూరురూరల్: ఏటీయంలోకి నకిలీ నోట్లును డిపాజిట్ చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచూరు జిల్లా మాన్విలోని ఏటీఎంలోకి ఆదివారం పదిమంది వ్యక్తులు వెళ్లారు. రూ.18 వేల నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు యత్నించారు. రూ.500 విలువైన 36 నోట్లు యంత్రంలో ఇరుక్కుపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించగా నకిలీ నోట్లుగా తేలింది. దీంతో రాయచూరుకు చెందిన విరుపాక్షి, శేఖర్, ఖాజా హుసేన్, కొప్పళ బీమేష్తో పాటు మరో అరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెలలో శేఖర్ నుంచి విరుపాక్షి ఖాతాకు రూ.20, 500 నకీలి నోట్లను డిపాజిట్ చేశారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలి రాయచూరు రూరల్: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణపై చర్యలు చేపట్టాలని కర్ణాటక నాయక్ ఓక్కూట వేదిక అధ్యక్షుడు రవి కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. అదివారం పా త్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో కన్నడ భాషతో పాటు అంగ్లం, హిందీ, ఉర్దు భాషలను తప్పకుండా నేర్చుకోవాలని ఒత్తిడి తేవడాన్ని తప్పు బట్టారు. కళాశాల, విశ్వ విద్యాలయాల నియమాలను ప్రిన్సిపాల్ ఉల్లఘింసున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశ్లీల ఫొటోలు పంపి వేధింపులు హుబ్లీ: పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు మహిళా అధ్యాపకురాలు ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శశి అనే యువకుడికి అధ్యాపకురాలితో గతంలో పరిచయం ఉంది. ఆ సమయంలో అధ్యాపకురాలి ఫొటో సేకరించాడు. అనంతరం ఆమెకు అశ్లీల వీడియోలను వాట్సాప్నకు పంపించి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. లేని పక్షంలో వీడియోలు, ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిలేడీల చేతివాటం హుబ్లీ: బుర్కా ధరించి వచ్చిన కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు. కొప్పళ జిల్లా కారటగి పట్టణంలోని వీఏ బజార్కు ఈ నెల 18న ఇద్దరు మహిళలు బుర్కాలు ధరించి వచ్చి చోరీలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొహర్రంను శాంతియుతంగా ఆచరించండి రాయచూరురూరల్: మోహర్రంను శాంతియుతంగా నిర్వహించుకోవాలని అడిషనల్ ఎస్పీ హరీష్ సూచించారు. ఆదివారం సదర్బజార్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మోహర్రం వేడుకులు జూలై 6 వరకు జ రుగుతాయన్నారు. హిందూ ముస్లింలు సోదరభావంతో మెలుగుతూ పండుగను ఆచరించాలన్నారు. సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, యస్ఐలు మంజునాథ్, మహ్మద్ ఇసాఖ్, బసవరాజ్ నాయక్, లక్ష్మి సన్న వీరే్ష్ నాయక్ పాల్గొన్నారు. -
దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు
హుబ్లీ: ఎమర్జెన్సీకిమించి దేశంలో దారుణ పరిస్థితులతో కూడిన వాతావరణం ఉందని, ఈ విషయం గురించి బీజేపీ నేతలు చర్చిస్తే మంచిదని జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ సూచించారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం, పూల్వామ దాడుల విషయాలను ప్రజలు మరచిపోయేలా 50 ఏళ్లనాటి ఎమర్జెన్సీ విషయాన్ని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ సారి మైసూర్ దసరా వేడుకలను కొత్త సీఎం ప్రారంభిస్తారన్న ఆర్ అశోక్ వ్యాఖ్యలపై సంతోష్లాడ్ మాట్లాడుతూ ఎవరు సీఎం అవుతారనేది ఆయన్నే అడగాలని పాత్రికేయులకు సూచించారు. -
బస్టాండ్ను స్వచ్ఛంగా ఉంచండి: కలెక్టర్
హొసపేటె: జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్ నగరంలోని కేంద్ర బస్టాండ్ను ఆదివారం తనిఖీ చేశారు. బస్టాండ్లో ఉన్న అపరిశుభ్రతను చూసి అధికారులపై మండిపడ్డారు. బస్టాండ్ను స్వచ్ఛంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత ప్లాట్ఫారంపై ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి తినుబండారాలు, వాటర్ బాటళ్ల గడువు తేదీని తనిఖీ చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్ను పరిశీలించారు.ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆదేశించారు. బాత్రూమ్కు వెళ్లాలంటే రూ.10 వసూలు చేస్తున్నట్లు మహిళా ప్రయాణికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. కేవలం రూ. 3 మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు అన్ని విధాలా మౌలిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, అధికారులు రాజశేఖర్ వాజంత్రి, వార్త సమాచార అధికారి ధనుంజయ పాల్గొన్నారు. -
భార్యతో స్నేహితుడి అక్రమ సంబంధం
● నరికి చంపిన భర్త సాక్షి బళ్లారి/ హొసపేటె: స్నేహం ముసుగులో భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని కొడవలితో నరికి చంపిన భర్త ఉదంతం గంగావతిలో జరిగింది. గంగావతి తాలూకా విఠలాపురానికి చెందిన నాగరాజ్(28), హనుమంతప్ప చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏడేళ్ల క్రితం హనుమంతప్పకు వివాహమైంది. నాగరాజు అప్పుడప్పుడు వస్తూపోతూ హనుమంతప్ప భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన హనుమంతప్ప స్నేహితుడితో గొడవ పడి, పంచాయతీ చేసి పోలీసు స్టేషన్ కూడా వెళ్లాడు. స్నేహితుడిలో మార్పు రాక పోవడంతో శనివారం సాయంత్రం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని రైస్ మిల్లు వద్దకు నాగరాజును పిలిపించాడు. అనంతరం అతన్ని కొడవలితో నరికి, తలపై బండరాయి వేసి హత్య చేశాడు. అనంతరం కనకగిరి పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన విఠలాపురంలో కలకలం రేపింది. -
లారీ ఢీకొని ఎస్ఐ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: గంజాయి కేసులో నిందితులను అరెస్టు చేసి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు తలఘట్టపుర పోలీస్స్టేషన్ ఎస్సై మెహబూబ్ కన్నుమూశారు. శనివారం రాత్రి గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అత్తిబెలెలో అరెస్టు చేసి కారులో తీసుకువస్తుండగా సూర్యసిటీ వద్ద కారు టైర్ పంచర్ అయ్యింది. రోడ్డుపక్కన కారు ఆపి డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఎస్సై మెహబూబ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ మెహబూబ్పై దూసుకెళ్లింది. ఈ గందరగోళంలో గంజాయి నిందితులు పరారయ్యారు. గాయపడ్డ ఎస్సైని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మెహబూబ్ చికిత్స ఫలించక ఆదివారంనాడు మరణించారు. అస్పృశ్యత వివాదం దొడ్డబళ్లాపురం: కొన్ని గ్రామాలలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతోంది. దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించిన క్షురకునిపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా కిణిసుల్తాన గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ఒకే ఒక క్షౌ రశాల ఉంది. దళితులకు కటింగ్ చేయనని క్షురకుడు తెగేసి చెప్పిన వీడియో ప్రచారమైంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు నిందితున్ని పిలిపించి చట్టంపై అవగాహన కల్పించారు. ఇక నుంచి దళితులకు కటింగ్ చేస్తానని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. మోదీ నోట, రొట్టెల మాటశివాజీనగర: కలబుర్గి గట్టి జొన్న రొట్టెల గురించి తెలియనివారుండరు. జొన్న రొట్టెలు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా పేరుపొందాయన్నది తెలిసిందే. ఇక్కడ తయారయ్యే రొట్టెలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఎంతోమంది మహిళలు రొట్టెలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి కృషిని ప్రధాని మోదీ మెచ్చుకొన్నారు. ఆదివారం సాగిన మన్కీ బాత్లో మహిళా స్వావలంబన భారతదేశ అభివృద్ధికి కొత్త మంత్రమైంది. కలబుర్గి మహిళలు జొన్న రొట్టెల తయారీ ద్వారా ఆత్మనిర్భరతకు బ్రాండ్గా నిలిచారు అని ప్రశంసించారు. స్వసహాయ సంఘాల ద్వారా ప్రతిరోజు 3 వేల రొట్టెలు తయారు చేస్తున్నారు. ఈ రొట్టెలు గ్రామాలకే కాకుండా నగరాల్లో, ఆన్లైన్లో విక్రయిస్తున్నారు అని కొనియాడారు. జలపాతం నుంచి పడి టూరిస్టు మృతి దొడ్డబళ్లాపురం: బెళగావి– మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంబోలి జలపాతం వద్ద విషాదం జరిగింది. 300 అడుగుల ఎత్తు నుండి కిందపడి పర్యాటకుడు మరణించాడు. కొల్హాపుర నివాసి బాలసో సాగర్ (45) మృతుడు. ఆదివాంనాడు అంబోలి ఫాల్స్ చూడడానికి స్నేహితులతో వచ్చాడు. ఫాల్స్ను దగ్గరగా చూస్తుండగా జారి 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడే మరణించాడు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు. రన్యకు జైల్లో వేధింపులు బనశంకరి: బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటి రన్య రావు ఇబ్బందుల్లో ఉంది. జైలు భోజనం ఆమెకు సరిపడలేదు. ఆ వాతావరణం, అక్కడ సిబ్బంది ప్రవర్తనతో సమస్యలు ఎదుర్కొంటోంది. మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నట్లు, బంగారు దొంగ అని సతాయిస్తున్నట్లు బంధువులకు తెలిపింది. ఇది తట్టుకోలేని ఆమె మరో బ్యారక్లోకి మార్చాలని జైలు అధికారులను కోరింది. అందుకు వారు అంగీకరించారని, త్వరలోనే మార్చవచ్చని సమాచారం. వెల్డింగ్ కార్మికుడు దుర్మరణం మైసూరు: నగరంలోని బివిఎల్ లేఔట్లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు చనిపోయాడు. మైసూరు అజీజ్ నగర నివాసి సుహేల్ (25)గా గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి సుహేల్ మరణించాడు భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని మృతుని భార్య ఫిర్యాదు చేసింది. భవన యజమాని ప్రదీప్, ఇంజనీర్ అనిల్పై ఆలనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాస్మొటిక్స్లో హాని కారకాలు?
బనశంకరి: నేటి రోజుల్లో కాస్మొటిక్స్ అనబడే సౌందర్య ఉత్పత్తులు జీవితంలో ఓ భాగమయ్యాయి. పేద, ధనిక, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ స్థాయికొద్దీ వాటిని వాడుతున్నారు. అందంగా కనిపించాలనే ఆరాటమే కారణం. కానీ కాస్మొటిక్స్ ఆరోగ్యానికి హానికరమే అభిప్రాయాలున్నాయి. స్టెరాయిడ్స్ను కలిపిన క్రీమ్స్, ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిపై రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నిఘాపెట్టింది. మగువలు నిత్యం వాడే క్రీమ్స్, లిప్స్టిక్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌందర్య ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్లలో పరీక్షించాలని నిర్ణయించారు. ముఖం అందంకోసం వాడే ఫోలిక్ యాసిడ్, స్టెరాయిడ్ బేస్క్రీమ్, విటమిన్ డీ, సి కలిగిన క్రీమ్లు, సీరమ్లలో నాణ్యత లోపించిందని ఆ సంస్థ తనిఖీలలో రుజువైంది. అనేకమంది ప్రజలు ముఖం కాంతిని పెంచుకోవడానికి ఈ మూలకాలు కలిపిన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలు నాసిరకం మూలకాలను కలిపి తయారు చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను చేపట్టింది. ఈ సంస్థ గతంలో అనేక బొంబై మిఠాయి, పానీ పూరి, పన్నీర్, స్వీట్లు వంటి ఆహార ఉత్పత్తులను తనిఖీ చేసి క్యాన్సర్ రోగ కారకాలు వాడుతున్నారని హెచ్చరించడం తెలిసిందే. ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు -
చెత్త లారీలో మహిళ శవం
శివాజీనగర: బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురైంది. మహిళను హత్యచేసిన దుండగులు శవాన్ని మూటకట్టి చెత్త లారీలో ఉంచి పరారయ్యారు. చెన్నమ్మకెర అచ్చుకట్ట ప్రాంతంలో ఓ స్కేటింగ్ మైదానం వద్ద లారీలో శవాన్ని పడేశారు. శనివారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన దుండగులు నిలిపిన చెత్త లారీలో శవం మూట ఉంచి పరారయ్యారు. ఆదివారం ఉదయం లారీ సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించారు. మృతురాలి వయసు 30–35 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాల కోసం, అలాగే హంతకుల కోసం విచారణ సాగుతోంది. భారీగా నకిలీ జీన్స్ సీజ్ దొడ్డబళ్లాపురం: మార్కెట్లో అనేక కంపెనీల బ్రాండెడ్ జీన్స్ ఫ్యాంట్లు, వస్త్రాలు లభిస్తుంటాయి. కానీ అవి అసలైనవా, కాదా? అనేది తెలుసుకోకుంటే నకిలీవి అంటగడతారు. నకిలీ బ్రాండెడ్ జీన్స్ తయారీ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు రూ.30 లక్షలకు పైగా విలువైన జీన్స్ దుస్తులను సీజ్ చేశారు. బెంగళూరు మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి బైలకోనేనహళ్లిలోని సదరు ఫ్యాక్టరీలో సోదాలు చేయగా, నాసినకం బట్టతో తయారు చేసిన జీన్స్ దుస్తులకు ప్రముఖ కంపెనీల లేబుళ్లు తగిలించి షాపులకు తరలిస్తున్నట్లు తేలింది. వాటిని అధిక ధరలకు విక్రయించేవారు. అలాగే అనుమతులు కూడా లేకుండా గోడౌన్లో గార్మెంట్స్ని నడుపుతున్నారు. కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐదేళ్లూ సిద్దునే సీఎం: మంత్రి మైసూరు: సీఎం సిద్దరామయ్య పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రంగా ఉంది, ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది, ఎలాంటి సమస్యలు లేవని మంత్రి హెచ్.సి.మహాదేవప్ప అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు సంక్రాంతి పండుగ గురించి తెలుసు కానీ, సెప్టెంబర్ నెలలో వచ్చే క్రాంతి, మహాక్రాంతి గురించి వినలేదని బీజేపీ నేతల విమర్శలపై మండిపడ్డారు. రాజ్యాంగం రక్షణ కోసం క్రాంతి జరుగుతుందని అన్నారు. ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారని చెప్పారు. సీఎం కావాలని అందరికీ ఆశ ఉంటుందని, అవకాశం ఒక్కరికే వస్తుందని అన్నారు. కావేరి హారతిపై నోటీసు: డీసీఎం శివాజీనగర: కృష్ణరాజ సాగర జలాశయం వద్ద కావేరి హారతిని నిర్వహించడాన్ని కొందరు ప్రశ్నిస్తూ వేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీచేసినట్లు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ చెప్పారు. త్వరలో సర్కారు నుంచి సమాధానం ఇస్తామన్నారు. ఆయన ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడారు. హారతికి కొందరు అభ్యంతరం చెబుతున్నారు, ఎవరి అనుమతి అవసరం లేదు అని అన్నారు. ఆగస్టులో రాష్ట్రంలో మార్పు సంభవిస్తుందని బీజేపీ నేత అశోక్ చెప్పడాన్ని హేళన చేశారు. అశోక్ జ్యోతిష్యం చెప్పటం ఆరంభించారా? నాకు సమయం ఇప్పించండి, నేను వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొంటానని చమత్కరించారు. త్వరలో పార్టీ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా వస్తారని, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడతారని చెప్పారు. చోరీ చేసి, షాపులకు నిప్పు మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు పట్టణంలో దుండగులు ఓ షాపుల పై కప్పును తొలగించి లోపలికి చొరబడి దోచుకుని, నిప్పుపెట్టి పారిపోయారు. బెత్తలిమారమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డులోని రిషి స్టోర్స్, నంది స్టోర్స్ లోకి శనివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. విలువైన దుస్తులు, బూట్లు, రూ. 20 వేల డబ్బును దొంగిలించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు షాపుల నుంచి పొగలు మంటలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు యజమానులకు తెలిపారు. వారు చేరుకుని వెంటనే స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అతనే నా బిడ్డకు తండ్రి యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుని కొడుకు కృష్ణ జె రావ్ తన కొడుక్కి తండ్రి అని ఓ బాలింత చెబుతోంది. అతని వల్లే తనకు మగ బిడ్డ పుట్టాడని పేర్కొంది. తన బిడ్డకు తండ్రి కృష్ణ జె రావ్ కారణమంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కృష్ణ తనను ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడని ఆమె తెలిపింది. ఫలితంగా గర్భం దాల్చి మగ బిడ్డ పుట్టాడని, ఇప్పుడు ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, మోసపోయానని విలపించింది. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడంతో అదుపుతప్పి ఇంటిని ఢీకొట్టింది. బస్సులోని 35 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాలు.. శివమొగ్గ నుంచి బెంగళూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు కేఎ.57 ఎఫ్ 2826.. తిపటూరు తాలూకాలోని కోనెహళ్ళి సిద్దాపుర గ్రామం వద్ద బస్సు టైరు పేలిపోయి రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభం, కొబ్బరి చెట్టును ముక్కలు చేసుకుంటూ వెళ్లి పుట్టణ్ణ ఇంటిని ఢీకొట్టింది. భారీ శబ్ధం, కుదుపులు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. సీట్లకు గుద్దుకోవడంతో ఎక్కువమందికి ముఖానికి, తలకు గాయాలయ్యాయి. ఇంటిలో ఉన్న వారికి గాయాలు తగిలాయి. ఎక్కువ గాయాలైనవారిని తిపటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 35 మందికి గాయాలు తుమకూరు జిల్లాలో ప్రమాదం -
హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన డాక్టర్ ఆడియో ఒకటి వైరల్గా మారిన ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జవగొండనహళ్లిలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ రెన్యూవల్ కోసం అక్కడి వైద్యుడు డాక్టర్ క్రిష్ణను కోరగా రూ.5వేలు లంచం అడిగాడు.డబ్బు ఇవ్వకపోతే రేటు రూ.10వేలు అవుతుందని, ఇంకా లేట్ చేస్తే రూ.15వేలు అవుతుందని, ఎవరికి చెపుకున్నా తాను సంతకం పెట్టబోనని నర్స్ను హెచ్చరించాడు. ఈమేరకు ఆడియో లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
చావే శరణ్యం
యశవంతపుర(కర్ణాటక): తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు. -
అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు
బనశంకరి(కర్ణాటక): క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది.ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. -
రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తమను కిడ్నాప్ చేసేందుకు యత్నంచారని నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేకల్ తాలూకా చందాపుర వద్ద చోటుచేసుకుంది. సంజయ్, దివ్య ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు వ్యతిరేకించడంతో 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈక్రమంలో దివ్య తల్లి కాల్ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని, జయదేవ ఆస్పత్రిలో అడ్మిట్ చేశామని, చూసివెళ్లమని కోరింది. దీంతో సంజయ్, దివ్యలు బైక్పై ఆస్పత్రికి వెళ్తుండగా బొమ్మసంద్ర నివాసి శోభ, ఆమె గ్యాంగ్ సభ్యులు రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అయితే నవదంపతులు వారిబారి నుండి తప్పించుకొని సూర్యా నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
హుబ్లీ: నైరుతి రైల్వే జోన్ పరిధిలో రైల్వే పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు స్థానిక సిద్దారూఢ రైల్వేస్టేషన్లో కార్యాచరణ చేపట్టి రూ.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫాం–3లో అమరావతి ఎక్స్ప్రెస్ రైల్లో దొరికిన ఓ ఎర్ర సంచిని పరిశీలించగా అందులో 5.123 కేజీల గంజాయి ఉన్నట్లు తేలింది. సదరు గంజాయిని ఎకై ్సజ్ శాఖకు అప్పగించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. బంగారు ఆభరణాలు చోరీ కాగా మరో ఘటనలో తబీబా ల్యాండ్ ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు దోచుకొని పరారయ్యారు. ముబారక్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్లో పెట్టిన రూ.21,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదు చోరీ అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళం పగలకొట్టి ఈ చోరీ చేసినట్లు బాధితుడు హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్గా సంగీతరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేసింది. వీరిలో దేవదుర్గలో గ్రేడ్–2 తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సంగీతను లింగసూగూరుకు బదిలీ చేశారు. లింగసూగూరు తహసీల్దార్గ విధులు నిర్వహిస్తున్న సయ్యద్ శాలంను రాయచూరు కార్పొరేషన్కు రెవిన్యూ శాఖ అధికారిగా నియమించారు. శుక్రవారం సంగీత లింగసూగూరు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. పోస్టాఫీసులో డెలివరి కేంద్రం ప్రారంభం బళ్లారి టౌన్: నగరంలోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం తొలి అంతస్తులో డెలివరి కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈసందర్భంగా పోస్టాఫీసు కేంద్రం సూపరింటెండెంట్ పీ.చిదానంద మాట్లాడుతూ ఈ కేంద్రం వల్ల పోస్టు కార్డులను, ఇతర వస్తువులను త్వరితంగా ప్రజలకు అందజేయవచ్చన్నారు. ఈ సేవలు సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు త్వరితంగా పార్సిళ్లు అందచేసేందుకు ఎంతో ఉపయోగపడనుంది. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్సీ వాలికర్, భీమసేన, రాజశేఖర్, తిందప్ప, నాగభూషణం, రాంప్రసాద్, చెన్నబసప్ప, రాఘవరెడ్డి, హనుమంతరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాధికారి అరెస్టుకెలమంగలం: వారసుదారు సర్టిఫికెట్ను అందజేసేందుకు రూ. 6 వేలు డిమాండ్ చేసిన గ్రామాధికారిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు.. తాలూకా కేంద్రం అంచెట్టి మారెమ్మ ఆలయ వీధికి చెందిన మారియప్ప కొడుకు జయరామన్ (40). ఇతని తండ్రి గత 1999లో చనిపోయాడు. వారసుదారు సర్టిఫికెట్ కోసం గత 24వ తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్నాడు. 27వ తేదీ శాలివారం గ్రామాధికారి ఆఫీసుకు వచ్చి సర్టిఫికెట్ గురించి అడిగాడు, గ్రామాధికారి లక్ష్మీకాంత్ రూ. 6 వేలు లంచం ఇవ్వాలని కోరడంతో రూ. 1500 అందజేసి ఇంటికెళ్లాడు. మరోవైపు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.4500 శనివారం తీసుకుంటూ ఉండగా లక్ష్మీకాంత్ను అరెస్ట్ చేశారు. విద్యా సామగ్రి అందజేత శ్రీనివాసపురం : దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు ఎం భైరేగౌడ అన్నారు. తాలూకాలోని జోడి కృష్ణాపుర గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన పాల్గొని విద్యార్థులకు ఉచిత బ్యాగులు, విద్యా సామగ్రి అందించి మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేస్తానన్నారు. రఘునాథరెడ్డి, కాళాచారి, సభ్యుడు శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు కోలారు : దాతలు ఇచ్చిన సహకారంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్ విద్యార్థులకు సూచించారు. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కోలారు యువ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు సయ్యద్ అఫ్రిది నేతృత్వంలో నగరంలోని టి చెన్నయ్య రంగమందిరంలో శనివారం ఉచితంగా ల్యాప్టాప్, 500 మంది విద్యార్థులకు ప్రశస్తి పత్రాలు అందించి మాట్లాడారు. దేశానికి ఐఏఎస్, ఐపీఎస్లను అధిక సంఖ్యలో పరిచయం చేసిన ఘనత కోలారు జిల్లాకు ఉందన్నారు. కార్యక్రమంలో కోలారు జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అఫ్రిది, కెఎండీసీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూం పాల్గొన్నారు. -
విద్యార్థులు కౌశల్యాలు పెంచుకోవాలి
కోలారు : విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందివ్వడం బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయ చరిత్రలోనే ఇదే తొలిసారి అని విశ్వ విద్యాలయ కులపతి ప్రొఫెసర్ నిరంజన వానళ్లి అన్నారు. నగర సమీపంలోని మంగసంద్ర స్నాతకోత్తర కేంద్రంలో శనివారం ఆయన 341 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించి మాట్లాడారు. ఉచిత ల్యాప్టాప్లను వినియోగించుకొని కౌశల్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వ విద్యాలయ వ్యాప్తిలో చదువుతున్న 271 మంది విద్యార్థులకు ఉచిత కౌశల్య శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలనావిభాగం కులపతి సి.ఎన్.శ్రీధర్, సిండికేట్ సభ్యుడు వెంకటేశప్ప, డైరెక్టర్ డాక్టర్ కుముద పాల్గొన్నారు. -
కృష్ణా తీరం.. వరద విలయం
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణా, దాని ఉప నదుల్లో వరద పోటెత్తుతోంది. వేద్ గంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్యకేశి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యాంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. ఈనేపథ్యంలో ఆల్మట్టి డ్యాంతో పాటు నారాయణపూర్ డ్యాం నుంచి 26 గేట్లను తెరిచి కృష్ణా నదికి లక్ష క్యూసెక్కుల నీరు వదిలారు. ఈనేపథ్యంలో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని 14 వంతెనలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద విలయం సృష్టించడంతో నీట మునిగాయి. భీమా నదిలో ఇద్దరు గల్లంతు మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో పొంగి ప్రవహిస్తున్న భీమానదిలో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా మాచనూరు వద్ద చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను పశువుల కాపరులు సిద్దప్ప(21), రమేష్(17)లుగా పోలీసులు గుర్తించారు. గురుసుణిగి బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. నీటి ఉధృతికి మృతదేహాలు కొట్టుకుపోయి ఉంటాయని లేదా మొసళ్లు అధికంగా ఉన్నందున పీక్కు తిని ఉంటాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మర పడవతో గాలింపు చేపట్టినట్లు వడగేర ఎస్ఐ మహబూబ్ అలీ, రెవెన్యూ అధికారి బసవరాజ్ తెలిపారు. యువకుల గల్లంతుతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ అన్ని డ్యాంల నుంచి పరవళ్లు -
ఏ క్షణంలోనైనా తుంగభద్ర తుళ్లింత
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంకు వరద పోటెత్తి క్రమంగా నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంకు 60 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో రూపంలో వస్తుండటంతో డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 65 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్గేట్లు బలహీనంగా ఉండటంతో డ్యాంలో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని ఇటీవల తీర్మానించారు. ఈనేపథ్యంలో డ్యాం నిండితే ఏక్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా గత ఏడాది డ్యాంలో 19వ క్రస్ట్గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. డ్యాంలో 100 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని మిగిలిన నీరు డ్యాం నుంచి నది ద్వారా దిగువకు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత పదేళ్లలో జూలై మొదటి వారంలోనే కాలువలకు నీరు విడుదల చేయడంతో పాటు నదికి కూడా నీరు వదులుతుండటం విశేషం. లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరిక జారీ -
నోరూరిస్తున్న నేరేడు పండ్లు
బళ్లారి టౌన్: ఒకప్పుడు సామాన్య ప్రజలు కొనేందుకు వెళితే అధిక ధరలతో వెక్కిరించే నేరేడు పండ్లు ఈ ఏడాది సామాన్యులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. గత ఏడాది కిలో రూ.200లు పలికిన ఈ పండ్లు ఈఏడాది కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో అధిక దిగుబడి వచ్చినందున ధరలు తగ్గాయని రైతులు తెలిపారు. పండ్లను పండించేందుకు పేరుగాంచిన డీ.నాగేనహళ్లిలో మామిడి, సపోటా, నేరేడు పండ్లను ఎక్కువగా పండిస్తారు. నగరానికి కూడా ఈ ప్రాంత వాసులే ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతుంటారు. ప్రధానంగా తాలూకా ఆఫీసు, అనంతపురం రోడ్డు, కూల్ కార్నర్ సెంటర్, సుధా క్రాస్ వంటి అధిక జన రద్దీ గల ప్రాంతాల్లో రైతులు తీసుకువచ్చి ఉదయం తాజాగా ఉన్నప్పుడు కిలో రూ.100 ధరకు, సాయంత్రం రూ.80 నుంచి రూ.60 ధరకు అమ్ముతున్నారు. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో షుగర్ పేషెంట్లు ఎక్కువగా వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా ఈసారి నేరేడు పండ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ అధికంగా కనిపిస్తూండటంతో సామాన్యులు కొనేందుకు ఆశక్తి చూపుతున్నారు. ముందస్తు వర్షాలతో ఈసారి అధిక దిగుబడి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న వైనం -
కరుణించని మేఘాలు.. కరువు కోరల్లో కర్షకులు
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా వరుణ దేవుడి కరుణ లేక రైతులు బిక్కముఖం వేసుకొని ఆకాశంలో మేఘాల వైపు చూస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సాగు, తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఖరీఫ్లో తొలకరి వానలు కురువక లక్షలాది హెక్టార్లలోని భూముల్లో రైతులు విత్తనాలు వేయక బీళ్లుగా మారాయి. నల్లరేగడి భూములు బీటలు బారి నోళ్లు తెరుచుకున్నాయి. రైతులు వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో ఎర్ర భూముల్లో ఎద్దులతో చదును చేస్తున్నారు. మేఘాలు కరుణించక రైతులు వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరుణించని వరుణుడితో కర్షకుల కళ్లలో కన్నీరు మాత్రం తప్పడంలేదు. వర్షం కురిపించని మేఘం లక్షల హెక్టార్లలో పడని విత్తనం -
పదవిని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ
కోలారు : దివంగత ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశంపై అత్యవసర పరిస్థితిని రుద్దారని, ఫలితంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు అరవింద లింబావళి తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని కన్నడ భవనంలో సిటిజన్ ఫోరం సోషల్ జస్టిస్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో పత్రికలపై సెన్సార్షిప్ విధించారని, వేలాది మంది ప్రతిపక్ష నేతలను జైళ్లలో వేశారన్నారు. నాటి కాంగ్రెస్లోని కీచలాటలు కూడా అత్యవసర పరిస్థితిని విధించడానికి ఒక కారణమైందన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో సిద్దరామయ్య కూడా జైలులో ఉన్న విషయాన్ని ఆయన మరచి పోయినట్లున్నారన్నారు. ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు కేవీ శంకరప్ప, జేడీఎస్ నాయకుడు సిఎంఆర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అత్యవసర పరిస్థితిలో పోరాటాలు సాగించిన వారిని సన్మానించారు. -
అంగన్వాడీల్లో పోషణ్ ట్రాక్ను రద్దు చేయరూ
రాయచూరు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు తలనొిప్పిగా మారిన పోషణ్ ట్రాక్ పద్ధతిని రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. పోషణ్ ట్రాక్ పద్ధతి ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడానికి మొబైల్ ఫోన్లో వారి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి, కేవైసీ నంబర్తో పాటు ఆధార్ కార్డును లింక్ చేసి ఓటీపీ ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరీశీలించాలని, నెట్ వర్క్ వున్న సమయంలో లబ్ధిదారులు రారని, వారు వచ్చినప్పుడు నెట్వర్క్ ఉండదని, ఆ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. పచ్చదనం వృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: నగరంలో పచ్చని చెట్లు పెంచి పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యత ఇచ్చి పర్యావరణాన్ని సంరక్షించాలని అటవీ శాఖ అధికారి రాజేష్ నాయక్ పేర్కొన్నారు. శనివారం రాయచూరు తాలూకా హీరాపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క దాని నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు గంగాధర్, మౌనేష్, సీహెచ్ లావణ్య, హఫీజుల్లా, శంకర్గౌడ, నరసింహ, ఆంజనేయ, ఈరేష్ తదితరులు పాల్గొన్నారు. వారసులకు మొబైళ్ల అందజేత రాయచూరు రూరల్: నగరంలో గత రెండు నెలల నుంచి మొబైళ్లను పోగొట్టుకున్న వ్యక్తుల విచారణ జరిపి చోరీ సోత్తును తిరిగి సొంతదారులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శాంతవీర బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించి విలేఖర్లతో మాట్లాడారు. సుమారు 25 మంది మొబైళ్లను పోగోట్టుకున్నారు. ఈ విషయంపై సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్, రవికుమార్, బసవరాజ్, శివానందలున్నారు. సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన వద్దురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల భాషా బోధనను ప్రారంభించడానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కన్నడ క్రియా సమితి అధ్యక్షుడు రఫీక్ పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో మాతృభాష కన్నడకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టి కన్నడ భాషకు తిలోదకాలివ్వటానికి సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే కన్నడ భాష ఉనికి మిగిలిందని, దానికి కూడా చరమగీతం పాడటానికి సర్కార్ కసరత్తు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యత కల్పిస్తే కన్నడ భాష ఉనికికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పున పరిశీలించి ఆంగ్ల భాషకు బదులుగా కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మాలూరు: తాలూకాలోని చిక్కకంతూరు గ్రామ సంతె మైదానం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటుందని నిర్ధారించారు. కేసరి రంగు టీషర్టు, కాఫీ కలర్ ఫ్యాంట్ ధరించాడని, కుడిచేతికి కేసరి రంగు దారం ఉందని, ఇతని వివరాలు వారు మాలూరు పోలీస్ స్టేసన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. -
అట్టహాసంగా తంబిట్టు
కోలారు: తాలూకాలోని టి గొల్లహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నల్లూరులో శనివారం ఊరి పండుగ సందర్భంగా గ్రామ దేవతకు తంబిట్టు దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఊరి పండుగను జరపలేదు. దీంతో ఈసారి గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. గ్రామాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇతర ప్రాంతాలలో స్థిరపడినవారు కుటుంబాలతో తరలివచ్చారు. గ్రామ దేవతలు గంగమ్మ, వీరభద్ర, కుంటి గంగమ్మ, సుగ్గులమ్మ తదితర దేవతలకు మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకు వెళ్లి సమర్పించారు. యువతికి లిఫ్ట్ ఇచ్చాడని దాడి దొడ్డబళ్లాపురం: తమ వర్గం యువతికి బైక్పై లిఫ్ట్ ఇచ్చాడనే కారణంతో యువకునిపై దాడి చేసిన ఆరుమందిని కలబుర్గి పట్టణ పరిధిలోని ఎంబీ నగర పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 26న తన సహోద్యోగి అయిన ముస్లిం యువతి ఇంటికి వెళ్లడానికి ఆటో దొరకలేదు. దీంతో బైలప్ప ఆమెకు బైక్పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ముస్లిం యువకులు అడ్డగించి బైలప్పపై దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుమందిని అరెస్టు చేశారు. కారు ఢీకొని ఇద్దరు రైతుల మృతి మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని సత్తెగల్ గ్రామాన్ని కలిసే బైపాస్ రోడ్డులో కారు బైక్ని ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో కారు బోల్తాపడినప్పటికీ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. సత్తెగల్ గ్రామానికి చెందిన నటరాజు (65), మహేష్ మాయప్ప(50), పొలం పని ముగించుకొని ఒకే బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు న్యూఢిల్లీకి చెందినవారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు సత్తెగల్ మీదుగా ఊటీ విహారానికి వెళ్తున్నారు. కారు ఢీకొనడంతో నటరాజు, మాయప్ప తీవ్ర గాయాలై అక్కడే చనిపోయారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోల అధిక చార్జీలపై మంత్రి ఆగ్రహం శివాజీనగర: నగరంలో యాప్ ఆధారిత ఆటోలు సంచరిస్తున్నాయి. ఈ యాప్ ఆధారిత ఆటో డ్రైవర్లు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి వచ్చింది. అధిక చార్జీలను వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణ సురక్షిత శాఖ కమిషనర్కు మంత్రి లేఖ రాశారు. బెంగళూరులో ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న యాప్ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోల డ్రైవర్లను వెంటనే కట్టడి చేయాలని ఆదేశించారు. ఆటోల పర్మిట్ను రద్దు చేయటంతో పాటుగా కేసు నమోదు చేయాలని తెలిపారు. అధిక చార్జీల మీద ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
క్షుద్ర పూజలకు శునకాలు బలి
బనశంకరి: క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది. ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అపార్టుమెంటులో బెంగాలీ మహిళ అకృత్యం -
ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్కు కేంద్రం ఓకే
బనశంకరి: రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్ర అప్రతిష్టపాలు చేసిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ జట్టు విజయోత్సవంలోతొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగిన సంఘటనలో అప్పటి పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, మరో ఇద్దరు ఐపీఎస్లను సర్కారు సస్పెండ్ చేయడం తెలిసిందే. వారి సస్పెన్షన్ను కేంద్రహోం శాఖ ఆమోదించింది. బీ.దయానంద్, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్కుమార్, బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్లను సస్పెండ్చేసి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఐఏఎస్, ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే నిబంధనల ప్రకారం కేంద్ర సిబ్బంది నిర్వహణ మంత్రిత్వశాఖకు, హోంశాఖకు సమాచారమివ్వాలి. సస్పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విచారణకు హాజరు శివాజీనగర: తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హాతో విచారణ జరిపిస్తోంది. ఆయన ముందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. శనివారం కుమారకృప గెస్ట్ హౌస్లో విచారణ సాగింది. దయానంద, హెచ్.టీ.శేఖర్, వికాస్కుమార్ వికాస్ హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఆ రోజు బందోబస్తుతో పాటు పలు అంశాల మీద జడ్జి మైకేల్ సమాచారం సేకరించారు. -
భద్ర, లింగనమక్కి కళకళ
శివమొగ్గ: గత కొన్నిరోజుల నుంచి పరివాహక వ్యాప్తిలో కురిసిన భారీ వర్షాలతో ప్రధాన జలాశయాలైన భద్రా, లింగనమక్కిల్లో నీటి నిల్వ భారీగా వృద్ధి చెందింది. జూన్ 28వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు అందిన సమాచారం మేరకు మధ్య కర్ణాటకలోని ప్రధాన జలాశయం భద్రా డ్యాం గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా 161.4 అడుగులకు చేరింది. 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 1290 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత ఏడాది ఇదే రోజుకు భద్రా డ్యాం నీటిమట్టం 122.3 అడుగులు మాత్రమే ఉండేది. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం లింగనమక్కి డ్యాం గరిష్ట నీటిమట్టం 1819 అడుగుల కాగా, ఇప్పుడు 1784 అడుగులకు చేరింది. డ్యాంలోకి 24,752 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోండగా 7198 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున నీటిమట్టం 1748 అడుగులు మాత్రమే ఉండేది. ఇక తుంగా డ్యాంకు 40,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 41,151 క్యూసెక్కుల నీటిని వదలడంతో హొసపేటె టీబీ డ్యాంకు చేరుతోంది. నిండుగా త్రివేణి సంగమం మరోవైపు వర్షాలు తగ్గినా, మైసూరులో ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. జిల్లాలో హుణసూరు వద్దనున్న లక్ష్మణతీర్థ నది ఉధృతంగా ఉంది. టి.నరసిపుర వద్ద కావేరి, కపిలా, స్ఫటిక సరోవర నదుల త్రివేణి సంగమం నిండుగా ప్రవహిస్తోంది. నిండడానికి సిద్ధంగా డ్యామ్లు -
హాసన్లో ఆగని గుండెపోటు మరణాలు
యశవంతపుర: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం గుండెపోటుతో మరో వ్యక్తి చనిపోయాడు. హాసన్ నగరంలోని సిద్ధేశ్వరనగరకు చెందిన గోవింద (37) ఆటో డ్రైవర్. ఆటో నడుపుతుండగా ఒక్కసారిగా ఎదలో నొప్పి వచ్చింది, ఆటోలోనే జిల్లా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందికి తన బాధ చెబుతూ ఉన్నాడు, అంతలోనే కుప్పకూలిపోయాడు. పరిశీలించిన వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. ఈ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గుండెపోటు వచ్చి 17 మంది మరణించడం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు ఇలా ఆకస్మికంగా మరణిస్తున్నారో, గుండెపోటుకు కారణాలేమిటో అని చర్చ సాగుతోంది. బస్ కండక్టర్ గిరీశ్.. యశవంతపుర: హాసన్ జిల్లాకు చెందిన బెంగళూరు బీఎంటీసీ కండక్టర్ గిరీశ్ (41) గుండెపోటుతో మరణించారు. శనివారం సెలవు కావటంతో సొంతూరు హాసన్ తాలూకా కట్టాయి హొబళి హ్యరానె గ్రామానికి వెళ్లారు. పొలానికి వెళ్లి మొక్కజొన్న పంటకు ఎరువులు వేసి ఇంటికి వచ్చారు. ఎదలో నొప్పిగా ఉందని అక్కడే పడిపోయారు. కుటుంబసభ్యులు చూసేసరికి విగతజీవి అయ్యాడు. గిరీశ్కు ప్రతి వారం సెలవు రోజున ఊరికెళ్లి పొలం చూసుకోవడం అలవాటు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
నెలలోగా బెంగళూరు పాలికెల ఖరారు
● రూ. లక్ష కోట్లతో నగరాభివృద్ధి: డీసీఎం బనశంకరి: కెంపేగౌడ వేసిన పునాదిపై మేము బ్రాండ్ బెంగళూరును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నామని, మనందరం కలిసి బలిష్టమైన, శాంతియుత, గ్రీన్, బెంగళూరును నిర్మిద్దామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో నాడప్రభు కెంపేగౌడ 516 జయంతి ఉత్సవం, పలు రంగాలలో సేవచేసిన 53 మందికి కెంపేగౌడ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డీకే పాల్గొని మాట్లాడారు. మనిషి గా జననం, మరణం అనివార్యమని, ఈ రెండింటి మధ్య మనం ఏమి సాధించామనేది చాలా ముఖ్యమన్నారు. బెంగళూరు అన్నివర్గాల ప్రజల శాంతి తోట అని, దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. గ్రేటర్ బెంగళూరుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నామని, సిటీని ఎన్ని పాలికెలుగా చేయాలనేది నెలలోగా తీర్మానిస్తామని తెలిపారు. సొరంగ మార్గం రోడ్డుకు రూ.37 వేల కోట్లు, ఫ్లై ఓవర్లకు రూ.17వేల కోట్లు, స్వచ్ఛతకు రూ.15 వేల కోట్లతో పాటు బెంగళూరు సమగ్రాభివృద్ధికి రూ.లక్ష కోట్లతో పథంకం రూపొందించామని తెలిపారు. మీడియా విమర్శలను సంతోషంగా స్వీకరించి పనిచేస్తామని చెప్పారు. చావే శరణ్యం ● రాష్ట్రపతికి వృద్ధ దంపతుల లేఖ యశవంతపుర: తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు. దావణగెరె బంద్ దొడ్డబళ్లాపురం: భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీరు తరలించేందుకు చేపడుతున్న పనులను వ్యతిరేకిస్తూ శనివారంనాడు దావణగెరె బంద్ జరిగింది. ఇందుకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేపట్టాలనుకోవడం దారుణమని బీజేపీ ఆరోపించింది. భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీటిని తరలిస్తే ఈ జిల్లా రైతులకు, ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని రైతు నేతలు చెప్పారు. ఇందుకు అనుమతించబోమని బంద్ నిర్వహించగా ఓ మోస్తరుగా స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు తగ్గాయి. కొన్నిచోట్ల ఆఫీసులు మూతపడ్డాయి. -
గోవధ.. పులికి మరణ శాసనం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర పరిధిలోని అరణ్యంలో హూగ్యం వలయంలో ఓ తల్లి పులి, దాని నాలుగు పిల్లలను దుండగులు విషాహారం పెట్టి చంపడం సంచలనం కలిగిస్తోంది. అరుదైన వన్యజీవులను పొట్టనపెట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు స్థానికులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. హనూరు తాలూకాలోని కొప్ప గ్రామానికి చెందిన మాద అలియాస్ మాదరాజు, నాగరాజ్, కోనప్పను పోలీసులు, అటవీ సిబ్బంది అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తన ఆవును పులి చంపి తిన్నందుకు తానే విషం పెట్టి చంపినట్లు మాదరాజు తండ్రి శివణ్ణ మొదట తెలిపాడు. తానే పులి కుటుంబాన్ని చంపినట్లు చెప్పాడు. అయితే తీవ్రంగా అనుమానపడిన పోలీసులు విచారణ జరపగా శివణ్ణ కుమారుడు మాదరాజు హస్తం బయటపడింది. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆవును పులి చంపి కొంత తినేసింది. ఈ కోపంతో ఆవు కళేబరంపై పురుగుల మందును చల్లాను, తరువాత వచ్చి ఆ మాంసాన్ని తిన్న పులి, పిల్లలు మృత్యువాత పడ్డాయని వివరించాడు. ల్యాబ్కు శరీర భాగాలు మరింత దర్యాప్తు కోసం పులి, ఆవుల శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అటవీ అధికారులు తెలిపారు. దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి సమితిని ఏర్పరిచామని, వారు కూడా పరిశీలించారని చెప్పారు. ఘటనాస్థలిలో పరిసరాల మొబైల్ఫోన్ లొకేషన్పై దృష్టి పెట్టారు. పులులకు విషం పెట్టినట్లు రుజువైతే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని రిటైర్డ్ డీసీఎఫ్ పూవయ్య తెలిపారు. మరో పులి మృత్యువాత మైసూరు: సరిహద్దుల్లో గుండ్లుపేట తాలూకాలోని బండిపుర పులి అభయారణ్యంలో మరో పులి మృత్యువాత పడింది. గుండ్రే ప్రాంతంలో ఐదేళ్ల ఆడపులి కళేబరం లభ్యమైంది. అటవీశాఖ గస్తీ సిబ్బంది దానిని కనుగొన్నారు. ఆ పులిది సహజ మరణమేనని తెలుస్తోంది. అటవీ అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆవు కళేబరంపై పురుగుల మందు పిచికారీ దానిని భక్షించి తల్లీ, పిల్ల వ్యాఘ్రాల మృతి ముగ్గురు అరెస్టు -
వైభవోపేతంగా మైసూరు దసరా
శివాజీనగర: రాష్ట్ర పండుగ మైసూరు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఆచరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి దసరా 10 రోజులు కాకుండా 11 రోజులు జరుపుతారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 రాత్రి వరకు సాగుతుంది. మైసూరు దసరా సంబరాల గురించి శనివారం బెంగళూరులో విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సిద్దరామయ్య, మైసూరు దసరా వేడుకలలో ప్రజల భద్రత, సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఉండాలి. ఆడంబరం మాటున దసరా చరిత్రాత్మక ప్రాధాన్యత కనుమరుగు కారాదన్నారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వైభవం కాదు. దసరా చరిత్ర యశస్సును కాపాడుతూ ప్రజల అనుకూలాలను దృష్టిలో పెట్టుకొని వేడుకలను ఆచరించాలని సూచించారు. దసరా సమయంలో పోలీసులు పర్యాటకులతో ప్రేమాభిమానంతో ప్రవర్తించాలని తెలిపారు. ఆర్భాటంగా జరుపుతాం రాష్ట్రంలో ఈసారి కూడా మంచి వర్షాలు పడ్డాయి. నదులు, చెరువులు నిండిపోయాయి. అందుచేత ఈసారి దసరాను వైభవంగా ఆచరిస్తామని సీఎం తెలిపారు. దసరా సమయంలో ప్రభుత్వ సాధనలను ప్రతిబింబించే వస్తు ప్రదర్శన, స్తబ్ధ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 2న విజయదశమి వచ్చింది, శకటాల్లో గాంధీ ఆశయాలను కూడా అద్దంపట్టేలా ఉండాలన్నారు. వేడుకలలో 10 లక్షల మందికి పైగా ప్రజలు చేరుతారు, విదేశీయులు ఎక్కువగా రావచ్చు, అందుచేత ప్రమాదాలు సంభవించకుండా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు వహించాలి, ప్యాలెస్ ముందు రద్దీ నియంత్రణ చేపట్టాలన్నారు. వసతులకు లోటు రాకూడదు మైసూరులోని అన్ని రోడ్లకు ఇప్పటినుంచే మరమ్మతు పనులు ప్రారంభించాలని, గతేడాది మాదిరిగా ఈదఫా కూడా నగరాన్ని సుందరంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని సీఎం తెలిపారు. గతంలో దసరా ఆచరణకు రూ.40 కోట్లు కేటాయించాం, ఈసారి కూడా నిధులు ఇస్తామన్నారు. మైసూరు నగర సౌందర్యాన్ని పెంచాలి, దసరా నెపంతో ప్రజల పనులు, అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూడాలని తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట సీఎం సిద్దరామయ్య సూచన ఈసారి 11 రోజుల పాటు సంబరాలు దసరాకల్లా సీఎం మార్పు బీజేపీ పక్ష నేత అశోక్ మైసూరు: కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చడం కచ్చితమని, అందువల్ల త్వరలో జరిగే మైసూరు దసరా ఉత్సవాలను కొత్త ముఖ్యమంత్రి ప్రారంబిస్తారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. శనివారం మైసూరులో ఓ కళ్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం మార్పు తథ్యమని, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. సిద్దరామయ్య ఏమీ కాలేదనే రీతిలో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్లో అధికారం కోసం కుమ్ములాట తారాస్థాయికి చేరిందని, పైగా అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. సిద్దరామయ్య మాత్రం అబద్ధాలు చెబుతూ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారని, అసలైన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో ఉండేదని అన్నారు. సెప్టెంబరు 22 నుంచి దశమి వేడుకలు అక్టోబరు 2న జంబూసవారీ ఉత్సవం మైసూరు: ఈసారి నాడహబ్బ విజయదశమి ఉత్సవాలకు ఆగస్టు 4వ తేదీన గజ పయనం మొదలవుతుంది. నాగరహోళె అరణ్యంలో వీరనహోసహళ్ళి గ్రామం వద్ద ఏనుగులకు స్వాగతం పలుకుతారు. అక్కడ సంబరాల తరువాత మైసూరుకు చేరుకుంటాయి. దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10:10 గంటలనుంచి 10:40 గంటల శుభ వృశ్చిక లగ్నంలో చాముండికొండ పైన నాడదేవత చాముండేశ్వరి మాతకు విశేష పూజలతో ఆరంభిస్తారు. అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 1:18 గంటల ధనుర్ లగ్నంలో రాజప్రముఖులు దసరా పూజను గావిస్తారు. ఆ రోజు సాయంత్రం సుమారు 4:42 గంటల నుంచి 5:06 గంటల శుభ కుంభ లగ్నంలో జంబూసవారీ ఊరేగింపు జరుగుతుంది. -
అత్తతో కలిసి అల్లుడి పరార్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్య సవతితల్లితో అల్లుడు పరారైన సంఘటన దావణగెరె జిల్లా ముద్దేనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చెన్నగిరి తాలూకా మరవంజి గ్రామం నివాసి గణేశ్(25) గతనెల 12న తన భార్య హేమను వదిలి ఆమె సవతి తల్లి శాంత(55)తో పరారయ్యాడు. వివాహం జరిగినప్పటి నుంచి గణేశ్ శాంతతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ విషయం భార్య హేమకు తెలియడంతో ఇద్దరూ ఊరు వదిలి పరారయ్యారు.