రాయచూరు రూరల్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లాలోని సింధనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం చికిత్స కోసం గంగమ్మ(80) అనే వృద్ధురాలు ఆస్పత్రిలో చేరారు. అయితే సాయంత్రానికి ఆమె మరణించింది. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు వృద్ధురాలికి సక్రమంగా చికిత్స అందించనందునే మరణించిందని ఆరోపిస్తూ, వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అర గంట సేపు రాయచూరు– సింధనూరు ప్రధాన రహదారిలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆకస్మికంగా ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే ఆస్పత్రి వద్దకు చేరుకున్న మాజీ జెడ్పీ అధ్యక్షుడు పంపనగౌడ బాదర్లి, పోలీసులు జోక్యం చేసుకుని రాజీ సంధానంతో సమస్యను పరిష్కరించారు. ఈ విషయంలో తాలూకా ఆరోగ్య అధికారి సురేష్గౌడ మాట్లాడుతూ వయో సహజ వృద్ధాప్య కారణంగా గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించినట్లుగా అనుమానం
మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన


