సాక్షి, బళ్లారి: పెంచి పెద్ద చేసిన చేతులతోనే ఇద్దరు కూతుళ్లను చెరువులోకి తోసి, ఆపై తానూ దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. గురువారం కొప్పళ జిల్లా యలబుర్గి తాలూకా మరనాళ గ్రామంలో ఈ విషాదం సంభవించింది. బాళవ్వ (35), కుమార్తెలు హులిగమ్మ (9), విజయ (2)ను తీసుకుని ఊరిబయట ఉన్న చెరువులోకి దూకింది. గ్రామస్తులకు తెలిసి గాలించి మృతదేహాలను బయటకు తీశారు. ఆమె భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదని తెలిసింది. దీంతో మనసు రాయి చేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాళవ్వ పెద్ద కూతురు వసతి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. యలబుర్గి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిప్పంటించుకుని గర్భిణి..
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలను తట్టుకోలేక 5 నెలల గర్భిణి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా వడ్డరదొడ్డి గ్రామంలో జరిగింది. వివరాలు.. నయన (19)కు సునీల్తో 9 నెలల క్రితమే వివాహం జరిగింది. గర్భవతి అయిన ఆమె గురువారం డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపులే కారణమని నయన కన్నవారు రామనగర రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య


