Karnataka News
-
కార్మిక చట్టాల్ని విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. ప్రభుత్వ, రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్, కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. నరేగను తొలగించి వికసిత్ భారత్ మిషన్ రోజ్గార్ పేరును నమోదు చేయడం తగదని పేర్కొన్నారు. నరేగ పథకం తొలగింపుతో నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్ అంధకారమైందన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కూలీ కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ఆందోళనలో వీరనగౌడ, వరలక్ష్మి, సంతోష్, శరణ, వీరేష్, దివాకర్, నిర్మల, నిసార్, జిలాని పాషా, చంద్రకళ, కస్తూరి, సురేష్, పద్మావతి, రహమత్లున్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతిసాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, శ్రీరాముని పరమభక్తుడు హనుమ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంగళవారం హనుమ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బాలాంజనేయ స్వామి ఆలయం, మోకా రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం తదితర ఆంజనేయ స్వామి ఆలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన అంజనేయ స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వీధి కుక్కలకు విషాహారం● రెండు శునకాల మృత్యువాత ● విజయపుర జిల్లాలో కలకలం సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆక్రోశం వ్యక్తం చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలకు విషాహారం ఇచ్చారు. వీధి కుక్కల బెడద నివారణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. మహానగర పాలికె నిర్లక్ష్యంగా పని చేస్తోందని, వీధి కుక్కలను నియంత్రించడాన్ని పట్టించుకోవడం లేదని, ప్రతి రోజు నగరంలో ఏదో ఒక చోట కుక్కలు ప్రజలను గాయపరుస్తున్నాయని ఆరోపించారు. దీంతో వీధి కుక్కలను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. అయితే ఇదే సందర్భంలో విజయపుర నగరంలోని పలు కాలనీల్లో విచ్చలవిడిగా ఉన్న వీధి కుక్కలకు విషాహారం ఇవ్వడంతో రెండు కుక్కలు మృతి చెందాయి. ఈ ఘటనతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జంతువులను కాపాడాల్సిందిపోయి విషాహారం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగుల ధర్నా రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంక్ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిందని ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. మంగళవారం ఎస్బీఐ వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్యోగుల సంఘం కార్యాధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం అధికంగా పని భారం పెంచిందన్నారు. సిబ్బంది కొరతను నివారించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, 2019 నుంచి ఉద్యోగంలో చేరిన వారికి ఐసిటీ మార్పులు చేయాలన్నారు. వేతనాల్లో తారతమ్యాలను నివారించాలని తదితర డిమాండ్లు తీర్చాలని ఒత్తిడి చేశారు. -
అవాంఛిత పిల్లలను అనాథల్ని చేయొద్దు
హొసపేటె: పిల్లలు ఈ దేశపు ఆస్తి. అనాథ లేదా అవాంఛిత పిల్లలను ఎక్కడపడితే అక్కడ వదిలి వేయకుండా వారిని ఒక ప్రత్యేక ప్రభుత్వ దత్తత సంస్థకు అప్పగించి, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో సహాయపడాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగరంలోని ప్రత్యేక దత్తత సంస్థను సందర్శించి, తనిఖీ చేసి, ఇద్దరు పిల్లల దత్తత ఉత్తర్వు జారీ చేసిన అనంతరం మాట్లాడారు. 2024 అక్టోబర్లో జిల్లాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 7 మంది పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారి జీవితాలను ప్రకాశవంతం చేసిందన్నారు. జైలు మార్గదర్శకాల ప్రకారం మండ్య, హొన్నావరలకు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలను దత్తతకు అప్పగించి, ఆ సంస్థలోనే పిల్లల సంరక్షణ, పెంపకాన్ని సక్రమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. వదిలి వేసిన లేదా అనాథ పిల్లలు కనపడితే మహిళా శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని వెంటనే సంప్రదించి తెలియజేయాలన్నారు. ఆ పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారికి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వండి అని ఆమె సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సుదీప్ కుమార్ ఉంకి, జిల్లా బాలల సంరక్షణ విభాగం, దత్తత కేంద్రం సిబ్బంది, తల్లిదండ్రులు హాజరయ్యారు. వారిని ఏదైనా దత్తత సంస్థకు అప్పగించండి విజయనగర జిల్లా మేజిస్ట్రేట్ కవిత ఎస్ మన్నికేరి విజ్ఞప్తి -
కన్ను పడితే.. బైక్ గల్లంతే
హొసపేటె: కొప్పళ, దావణగెరె తదితర జిల్లాల్లో పదికి పైగా బైక్లను దొంగలించిన దొంగ ఎట్టకేలకు పోలీసు వలలో చిక్కాడు. తాను దొంగలించిన బైక్పై ప్రయాణిస్తుండగా అతడు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం ద్వారా ఆ దొంగ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సంఘటన కొప్పళ జిల్లా గంగావతి నగరంలో వెలుగులోకి వచ్చింది. పూర్వాపరాలు.. నగరంలోని ఆనెగుంది రోడ్డులోని శ్రీరాములు కళాశాల సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి గురైన ఆ బైక్ను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత బసాపట్టణ గ్రామానికి చెందిన మల్లప్ప బసప్ప అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ బైక్ తనదేనని, అది చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్కు సంబంధించిన పత్రాలన్నింటిని అతడు పోలీసులకు సమర్పించాడు. బైక్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగావతిలోని సాయినగర్కు చెందిన, వృత్తి రీత్యా డ్రైవర్ అయిన ప్రకాష్ తళవారను పోలీసులు క్షుణ్ణంగా విచారించగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గంగావతి, దావణగెరె, హొసపేటెలతో సహా వివిధ ప్రాంతాల నుంచి తాను మొత్తం పది బైక్లను దొంగిలించినట్లు ప్రకాష్ విచారణలో అంగీకరించాడు. గత ఏడాదిన్నర కాలంలో పది బైక్ల చోరీ దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగ చివరకు రోడ్డు ప్రమాదంతో పోలీసులకు పట్టుబడిన వైనం -
వైభవం.. హులిగమ్మ దేవి రథోత్సవం
హొసపేటె/రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో చారిత్రాత్మక ప్రసిద్ధ శక్తి పీఠంగా నిలిచిన హులిగిలో వెలిసిన హులిగమ్మ దేవి రథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. కొప్పళ తాలూకాలోని సుక్షేత్ర హులిగి గ్రామంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవంలో కొప్పళతో పాటు విజయనగర, బళ్లారి, గదగ్, రాయచూరు వంటి సరిహద్దు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అక్కడికి చేరుకున్న లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించి ఆనంద నినాదాలు చేశారు. హులిగమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన రథాన్ని లాగారు. రథం తిరిగి యథాస్థానానికి చేరుతుండగా, భక్తుల నుంచి చప్పట్లు మారుమోగాయి. ఉదో ఉదో.. హులిగమ్మ అని భక్తులు పదే పదే నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్, ఎమ్మెల్సీ హేమలత నాయక్, మాజీ ఎంపీ సంగణ్ణ కరడి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్. అరసిద్ది మార్గదర్శకత్వంలో తగిన పోలీసు భద్రత కల్పించారు. హులిగమ్మ అభివృద్ధి ప్రాధికార సంస్థ సభ్యులు, కార్యదర్శి ప్రకాష్ రావు, ప్రపంచ పశు వైద్య సంక్షేమ బోర్డు అధ్యక్షుడు దయానంద స్వామీజీ, హులిగి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులతో సహా చుట్టు పక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు హాజరయ్యారు. -
ప్రతిభా పాటవాలతో జ్ఞాన సముపార్జన
రాయచూరు రూరల్: విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు ప్రతిభా పాటవాలు అవసరమని సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి అభిప్రాయ పడ్డారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో అంజుమన్ ఈ సంస్థలో ప్రతిభాన్విత విద్యార్థులను సత్కరించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ తత్వ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని జ్ఞానంతో విద్యాభ్యాసం సాధించాలని పోతే జీవితాలకు అపాయం కలుగుతుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఉందన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, సంస్థ సంచాలకులు హ్యారిస్ సిద్దికి, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ ఖరీం, అస్లాం పాషా, లతీఫ్, తారీఖ్ హుసేన్, అమినుల్ హసన్, మహిబూబ్, బందే నవాజ్, జుబేర తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి గోడ కూలి బాలిక మృతి
● మరో ఇద్దరికి గాయాలు ●యాదగిరి జిల్లాలో విషాదం సాక్షి బళ్లారి: భారీ వర్షాల కారణంగా పాతమిద్దె గోడ కూలి బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరి జిల్లా వడగేరి తాలూకా తుమకూరు గ్రామంలో జరిగింది. భారీ వర్షం కురవడంతో పాతమిద్దె గోడ కూలడంతో అక్షిత(8) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆడుకుంటున్న సమయంలో ఉన్నఫళంగా గోడ కూలడంతో అక్షిత మృత చెందగా, సంగీత, భూమిక అనే ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వర్షాలు భారీగా కురవడంతో ఇంటి పైకప్పుపై నీరు నిలబడంతో గోడ కూలినట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారుల పరామర్శ ఈ విషయం తెలుసుకొన్న వెంటనే జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ తదితరులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు పూర్తిగా బలహీన పడటంతో పాతమిద్దె కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. వారు బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య రాయచూరు రూరల్: అప్పుల బాధ భరించలేక బంగారు అభరణాలు విక్రయించే దుకాణపు యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళ సింధనూరులో ప్రాణేష్ వర్ణికర్(45) తమ అద్దె ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. రూ.2.5 కోట్ల మేర అప్పులుండడం, మరో వైపు కుటుంబ కలహాలతో భార్య దూరంగా ఉండడం అతడిని కలిచి వేయడంతో ఆ బాధలను దిగమింగ లేక ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. చాలా ఏళ్ల నుంచి నగరంలో జువెలరీ దుకాణం నడుపుతూ పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండే వాడని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమాజ సేవ ఎన్ఎస్ఎస్ లక్ష్యంరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో సేవ చేయడం ఎన్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని మటమారి పంచాయతీ అభివృద్ధి అధికారి శేఖరప్ప అభిప్రాయపడ్డారు. సోమవారం రాయచూరు తాలూకా మటమారిలో సర్కారీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు గ్రామీణ ప్రాంత సమస్యల గురించి వివరించాలన్నారు. పాఠ్యాంశాలపై చర్చ జరగాలన్నారు. ఎన్ఎస్ఎస్ సంస్థ నలుగురికి సహాయం చేయడం నిస్వార్థంతో కూడినది అని వివరించారు. గ్రామాల్లో సేవలు, స్వచ్ఛత, రక్తదానం, ఆరోగ్యం, పరిసరాల సంరక్షణపై దృిష్టి పెట్టాలన్నారు. బసనగౌడ, ప్రిన్సిపాల్ సుగుణ, సంతోష్, వీరాంజనేయ, ఈరణ్ణ, శరణేగౌడ, రేఖ, మహేశ్వరి, తేజేశ్వరిలున్నారు. సర్వే పనుల్లో జాప్యం తగదురాయచూరు రూరల్: భూ మాపన శాఖలో సర్వేయర్లు గత 72 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రైతుల భూములను సర్వే చేయడంలో జాప్యం తగదని రైతు సంఘం సంచాలకుడు గురురాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల భూములను కొలత వేసుకోవడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6.50 లక్షలు, రాయచూరు జిల్లాలో 19,496 సర్వే రికార్డులు పెండింగ్లో ఉన్నాయన్నారు. త్వరితగతిన రైతుల సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు. గొలుసుల దొంగకు జైలు శిక్షహుబ్లీ: బంగారు గొలుసు దొంగతనం ఆరోపణలు రుజువు కావడంతో ఓ దొంగకు మొత్తం 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ మూడో ఏసీజేఎం కోర్టు తీర్పునిచ్చింది. విశ్వనాథ్ సోమప్ప కోళివాడ శిక్షకు గురైన వ్యక్తి. ఇక్కడి విద్యాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మహిళల మంగళ సూత్రాల చోరీలు చేశాడు. ఆరోపణలు రుజువైన క్రమంలో న్యాయమూర్తి అళ్లప్ప ఎం.బడిగేర ఆ 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ప్రభుత్వం తరపున కేసు వాదించిన సీనియర్ సహాయక న్యాయవాది అనిల్కుమార్ తెలిపారు. కులదూషణ కేసు నమోదు అదే విధంగా మరో ఘటనలో కులం పేరుతో దూషణపై కేసు నమోదైంది. గత నెల 13న రాత్రి అమరగోళ ఏపీఎంసీ బసవ కాలనీలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టే విషయంలో అసభ్యంగా తిట్టడమే కాకుండా కుల దూషణకు పాల్పడి ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించిన ఆరోపణలపై బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిపై నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అమ్మా.. లే అమ్మా.. తల్లి లేక గున్న విలవిల
దొడ్డబళ్లాపురం: కనకపుర తాలూకా సంగమం వద్ద ఆడ ఏనుగు కన్నుమూసింది. తల్లి ఏనుగు కళేబరం వద్ద గున్న విలపిస్తున్న దృశ్యం అందరికీ బాధను పంచింది. సుమారు 38 సంవత్సరాల వయసు గల ఆడ ఏనుగు తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని అటవీ సిబ్బంది తెలిపారు. సిబ్బంది సోమవారం రాత్రి గస్తీ తిరుగుతుండగా ఏనుగు కళేబరం కనిపించింది. దాని పిల్లతో పాటు మరికొన్ని ఏనుగులు అక్కడే చాలాసేపు ఉండి వెళ్లిపోయాయి. ఆ తరువాత పశు వైద్యాధికారి డా.గిరీష్ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. గున్న ఏనుగును గజ సంరక్షణాలయానికి తరలిస్తారని తెలిసింది. -
సకాలంలో ఎరువులను అందించండి
హొసపేటె: పంటల సాగు అవసరాలకు అనుగుణంగా రైతులు మార్కెట్లో యూరియా, ఎరువులను పొందేలా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కొనుగోలు చేసే ఎరువులతో పాటు అదనంగా లింక్ ఉత్పత్తులుగా ఇతర వస్తువులను కూడా కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నేతలు జగన్రాజ్ బసవరాజ్ మాట్లాడుతూ ఎఫ్ఐడీ ద్వారా ఎకరాకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలనే నిబంధనను రద్దు చేయాలన్నారు. రైతులకు అవసరం లేని ఇతర ఎరువులను, వారికి కావాల్సిన ఎరువులతో పాటు తప్పనిసరిగా కొనాలనే నిబంధనను తొలగించాలన్నారు. రైతులపై లింక్ ఎరువుల పేరుతో అదనపు ఎరువులను కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు కొనుగోలు చేసే రైతులపై నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు హనుమంతప్ప, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కొందామా.. వద్దా?
హుబ్లీ: దేశ ప్రజలను బంగారం కొనుగోలు చేయవద్దని, బంగారం మీద పెట్టుబడులు పెట్టవద్దని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జంట నగరాలతో పాటు ధార్వాడ జిల్లా వ్యాప్తంగా సంబంధిత వ్యాపారులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరేమో వివిధ రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా ఫర్వాలేదని హుబ్లీ నగర బంగారు వ్యాపారులు తెలిపారు. సంబంధిత హుబ్లీ సరాఫ్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పరశురామ బిలాల్ మాట్లాడుతూ భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువని అన్నారు. అయితే దేశంలో బంగారం ఉత్పత్తి కావడం లేదన్నారు. దీంతో విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. వ్యాపారులకు ఎలాంటి సమస్యా కాదు డాలర్ ముందు రూపాయి విలువ పడిపోయింది. దీంతో ప్రధాని మోదీ బంగారు కొనుగోలు చేయరాదని సూచించడం సమంజసమేనన్నారు. దీని వల్ల బంగారు వ్యాపారులకు ఎటువంటి సమస్య కాదన్నారు. తులం బంగారు ధర రూ.లక్షకు పెరిగినప్పటి నుంచి కొనుగోలుదారుల సంఖ్య తగ్గిపోయింది. దీపావళి, ఉగాది, అక్షయ తృతీయ రోజుల్లో కూడా ప్రజలు అంతగా బంగారు కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రధాని చెప్పారన్న కారణంతో ప్రజలు కొనుగోలు చేయడం మానరు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా చాలని, వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే ఈ పరిణామం సంబంధిత వృత్తిపర కార్మికులపై పడుతుందన్నారు. అయితే ఆ కార్మికులందరూ బెంగాల్కు చెందిన వారని, హుబ్లీలో వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ధర తక్కువ ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువ హుబ్లీలో 450 బంగారు అంగళ్లు ఉన్నాయి. షరాఫ్ బజార్లో 190 మంది సభ్యులు ఉన్నారు. రూ.లక్ష కన్నా తక్కువగా ధర ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది. అధిక విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం చాలా తగ్గిపోయిందన్నారు. మొత్తానికి దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకొని అమలు చేయాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఓ వినియోగదారుడు మాట్లాడుతూ మోదీ ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశారో తెలియదు. అయితే మా ఇళ్లల్లో పిల్లల పెళ్లిళ్లు నిశ్చయం అయ్యాయి. పెళ్లిలో బంగారం పెట్టకపోతే కుదరదు. మా డబ్బులు ఇచ్చి బంగారు కొంటాం. ఇతరులు ఎవరూ మాకు డబ్బులు ఇవ్వరు. మేము వరకట్నం విషయంలో మాట ఇచ్చినట్లుగా బంగారం కట్టపెట్టాల్సి ఉంటుందన్నారు. బంగారం కొనుగోళ్లపై జనంలో జోరందుకున్న చర్చలు ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర సందిగ్ధత నెలకొన్న వైనం -
బర్త్డే రోజే విద్యార్థిని ఆత్మహత్య
● పెళ్లి చేస్తున్నారని ఆవేదన రాయచూరు రూరల్: తాను చదువుకుంటానంటే, తల్లిదండ్రులు పెళ్లి ఖాయం చేశారు, తనకిక చదువుకునే యోగమే లేదా అనే ఆవేదనతో పుట్టినరోజే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెళగావి నగరం అజాంనగరలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగింది. జిల్లాలో హుక్కేరి తాలూకా కటాబళికి చెందిన కావేరి నాయక్ (21) బీఎస్సీ చివరి ఏడాది చదువుతూ ఈ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు మూడు నెలల క్రితం పోలీస్ కానిస్టేబుల్తో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనులకు సిద్ధమవుతున్నాయి. కానీ చదువుకోవాలనే ఆకాంక్షకు పెళ్లి అడ్డుగా ఉందని కావేరి మథన పడుతూ ఉండేది. ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. సోమవారం ఆమె బర్త్ డే కాగా అదేరోజు ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కేపీఎస్సీ భ్రష్టు: కుమార యశవంతపుర: కర్ణాటకలో ఎన్నిసార్లు పరీక్షలను వాయిదా వేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు అనేక సార్లు ఇబ్బంది కలిగింది అని కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. నీట్ పరీక్షల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న అరోపణలపై మండళవారం నగరంలో స్పందించారు. రాష్ట్రంలో కేపీఎస్సీ సంస్థను సరి చేయలేదు, ఆ సంస్థను నాశనం చేశారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. పోస్ట్కు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు, ప్రజలు వీధుల్లో చర్చించుకొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు నీట్పై అరోపణలు చేయడం సబబు కాదన్నారు. పేలిన ఈవీ స్కూటర్, వ్యక్తి మృతి దొడ్డబళ్లాపురం: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిన దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్స్టేషన్ పరిధిలోని మర్ఫి టౌన్లో జరిగింది. వివరాలు.. లూర్థనాథన్ (62) ఇంట్లో తన స్కూటర్కు చార్జింగ్ పెట్టి అక్కడే పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటర్ బ్యాటరీ పేలింది. పేలుడు ధాటికి లూర్థనాథన్ తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఇంట్లో మంటలు అంటుకుని వస్తువులు కాలిబూడిదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హస్తం ఎమ్మెల్సీల ఢిల్లీ యాత్ర బనశంకరి: మంత్రి పదవులు కావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఢిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, మధు మాదేగౌడ, బసణ్ణగౌడ బాదర్లి, చంద్రశేఖర్పాటిల్, డీటీ శ్రీనివాస్ తదితరులు మంగళవారం రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్సింగ్ సూర్జేవాలాను కలిశారు. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కనీసం ఐదుమంది ఎమ్మెల్సీలకు క్యాబినెట్లో చోటివ్వాలని కోరారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళాన్ని త్వరగా పరిష్కరించాలని మనవిచేశారు. వివిద కార్పోరేషన్లు, బోర్డు పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నిర్లక్ష్య ఫలితమే బౌరింగ్ విషాదం శివాజీనగర: ఇటీవల నగరంలో వర్షాలకు బౌరింగ్ ఆస్పత్రి గోడ కూలి ఏడుమంది ప్రజలు బలైన కేసులో జిల్లాధికారి జగదీశ్ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను అందజేశారు. ఈ దుర్ఘటనలకు ఆరోగ్య శాఖ ఇంజనీర్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం. ఆస్పత్రి పాలక మండలి నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోతుగా తనిఖీ చేపట్టి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాం, అన్నింటినీ చెప్పలేము, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం రావాణాశాఖ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులు, అధికారుల వేతనాలను పరిష్కరిస్తూ అదేశాలను జారీ చేసింది. పూర్వ కింకో ఉద్యోగులు/కేఎస్ఆర్టీసీ/బీఎంటీసీ/వాయువ్య కర్ణాటక/కల్యాణ కర్ణాటక రవాణా శాఖ ఉద్యోగులకు వేతన పరిష్కరణ చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31, 2025న అందుకున్న మూల వేతనంపైకి 12.50 శాతం పెంచింది. ఈ పెంపు 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ జూలై 1 నుంచి పెంచిన వేతనం అందిస్తారు. -
పసిడి నగలా.. పూత పూసినవా!
అంజనాద్రి శ్రీఆంజనేయస్వామికి దాత సమర్పించిన బంగారు ఆభరణాలు సాక్షి బళ్లారి: హంపీ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున అంజనాద్రిపై ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి సమర్పించిన బంగారు నగల వ్యవహారం చర్చనీయాంశమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ గ్రూప్స్ అధినేత మహేశ్వరెడ్డి ఈనెల 8న రూ.కోట్ల విలువైన ప్రభావళి, గద, చక్రం, తదితర ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ఇవన్నీ 1,400 గ్రాముల బంగారంతో చేసినవని, రూ.2.50 కోట్ల విలువని దాత తెలిపారు. దేవాదాయ అధికారులు ఆ నగల నాణ్యతను పరిశీలించగా 250 గ్రాములు మాత్రమే బంగారం ఉందని నిర్ధారించడం చర్చనీయాంశమైంది. అన్నింటినీ రాగితో తయారు చేసి బంగారు పూత పూశారని ఆలయ పెద్దలు చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంత వ్యత్యాసం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలకు సమయం పడుతుంది: కలెక్టర్ ఈ నేపథ్యంలో కొప్పళ జిల్లా కలెక్టరు సురేశ్ హిట్నాల్ ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం తమ కార్యాలయంలో మాట్లాడారు. ‘మహేశ్వరరెడ్డి 1,400 గ్రాముల బంగారం సమర్పించినట్లు రికార్డుల్లో ఉంది. అది పూర్తిగా నిర్ధారణ జరిగే వరకు నకిలీనా, అసలా అనేది తేల్చలేం. లేజర్ టెక్నాలజీతో పరిశీలన చేయిస్తాం. ఆయన అన్ని రకాల రికార్డులు సమర్పించారు, 50 ఏళ్ల వారంటీ కూడా ఇచ్చారన్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే బంగారు ఆభరణాలు తయారు చేసిన వారే బాధ్యులని వారి దృష్టికి తీసుకెళతామన్నారు. బెంగళూరు లేదా హరియాణా నుంచి నిపుణులైన బంగారు పనివాళ్లను పిలిపించి తనిఖీలు చేయిస్తాం. హొసపేటెకు చెందిన నాగరాజు ఆచారి అనే నిపుణుడు పరిశీలించి ఒక కేజీ బంగారం ఉండవచ్చన్నారు. హట్టి గోల్డ్మైన్స్ అధికారులను కూడా సంప్రదించాం. కానీ నిర్ధారణకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బీఎస్ఐ హాల్మార్క్ సంస్థను సంప్రదించగా, బంగారాన్ని ఇప్పటికే రాగితో కలిపి ఆభరణాలు తయారు చేసినందున అందులో కచితమైన బంగారం ఎంతుందో చెప్పడం కష్టమన్నారు. పూర్తిగా తేల్చేందుకు మరింత సమయం పడుతుంది’ అని తెలిపారు. అంజనాద్రి హనుమంతునికి.. విరాళమిచ్చిన ఆభరణాలపై వివాదం పరిశీలన చేస్తున్నాం: కలెక్టరు -
మంచినీరివ్వండి సార్
తుమకూరు: రాష్ట్రంలో పలుచోట్ల తాగునీరు కావాలని ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇదే మాదిరిగా జిల్లాలోని శిరా తాలూకా గౌడగెరె ఫిర్కా తావరకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని మారనగెరె గ్రామంలో రక్షిత మంచినీటి యూనిట్కు మరమ్మతులు చేసి నీటిని అందించాలని గ్రామస్తులు మంగళవారం ధర్నా చేశారు. గ్రామస్తుడు నటరాజ్గౌడ మాట్లాడుతూ రూ.లక్షలాది వెచ్చించి రక్షిత మంచినీటి యూనిట్లను నెలకొల్పినా సరైన పర్యవేక్షణ లేక చెడిపోతున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ పనిచేయక 8 నెలలైందన్నారు. రిపేరీ చేయించాలని పీడీఓకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అధికారులు వెంటనే బాగు చేయించి నీటి వసతి కల్పించాలని ప్రజలు ఖాళీ బిందెలు పట్టుకుని కోరారు. -
1243వ రోజుకు రైతుల పోరాటం
బళ్లారిటౌన్: కుడితిని వద్ద పరిశ్రమల స్థాపనకు భూమి కోల్పోయిన రైతులు చేపట్టిన పోరాటం 1243వ రోజుకు చేరుకుంది. అయితే ఇటీవల పోరాటాలు తీవ్రం చేస్తున్నందున జిల్లా ఏసీ కోర్టు 144 సెక్షన్, 163 సెక్షన్లను అమలు చేసి ఎలాంటి పోరాటాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతు పోరాట నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తొలి రోజున నిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపట్టారు. రైతు సంఘం నేత యూ.బసవరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు 13 వేల ఎకరాల భూములను పరిశ్రమల కోసం కోల్పోయారన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భూమి ధరను కేటాయించలేదన్నారు. కేటాయించిన ధరనైనా ఇవ్వాలి లేదా భూములను వాపసు ఇవ్వాలనే డిమాండ్తో ననిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కమిటీ నేతలు జంగ్లి సాబ్, తిమ్మప్ప, నాగలింగ, శివకుమార్, నరసింహ మూర్తి, రాజప్ప, సిద్దప్ప, శ్రీధర్, మహిళా నాయకురాళ్లు మహంతమ్మ, మల్లమ్మ, పద్మావతి, సరోజ, కాళమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మైసూరు మహిళకు రూ.12 లక్షల టోపీ
మైసూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ముక్కు మొహం తెలియని వ్యక్తిని నమ్మి మైసూరులోని ఓ గృహిణి రూ.12.65 లక్షలను కోల్పోయింది. సోషల్ మీడియాలో కనిపించే మోసగాళ్ల మాయలో పడిపోయి పచ్చని కాపురాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. వివరాలు.. మైసూరులోని శక్తినగర నివాసి, ప్రభుత్వ ఉద్యోగి భార్య వేద (40) బాధితురాలు. 2025లో ఫేస్బుక్ ద్వారా డాక్టర్ జోసెఫ్ అలీ అనే వ్యక్తి తాను లండన్ నివాసినని వేదాకు పరిచయమయ్యాడు. తన తొమ్మిదేళ్ల కుమారుడిని కూడా పరిచయం చేశాడు. క్రమంగా అలీ, వేద ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకునేవారు. తాను ఇండోనేషియాకు వెళుతున్నానని, తన ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, టికెట్ కొనుగోలు కోసం డబ్బు సాయం చేయాలని అడిగాడు. దీంతో వేద పలుమార్లు రూ.1.85 లక్షలను బదిలీ చేసింది. తర్వాత కొన్ని రోజులకు తాను ఇండియాకు వచ్చానని, రూ.25 లక్షలను మీ ఖాతాకు బదిలీ చేస్తానని వేదాను నమ్మించాడు. ఇండియన్ కరెన్సీలోకి మార్చేందుకు చార్జీలు కట్టాలని రూ.10.80 లక్షలను బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ రూ.1.55 లక్షలను పంపాలని మోసగాడు ఒత్తిడి చేయగా వేదాకు అనుమానం వచ్చింది. ఆమె ప్రశ్నించడంతో ఫోన్ను స్విచాఫ్ చేసుకున్నాడు. మొత్తం రూ.12.65 లక్షలను కోల్పోయిన వేద సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
అమ్మ జ్ఞాపకాలను మరువలేక..
తుమకూరు, పావగడ: ఆయనకు తల్లి అంటే ఎంతో ప్రేమ. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక క్షోభకు గురై అతడు కూడా ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన తుమకూరులో జరిగింది. వివరాలు.. పావగడ పీడబ్ల్యూడీ కార్యాలయంలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న మంజు ప్రసాద్ (32) తల్లి ఏడాది క్రితం చనిపోయింది. అప్పట్నుంచి తల్లి మరణాన్ని తట్టుకోలేక లోలోపలే కుంగిపోయేవాడు. దీంతో మానసిక రుగ్మతకు గురై ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళిన మంజుప్రసాద్ కొరటగెరెలోని తన బంధువులకు మొబైల్ ఫోన్, ఇంటి తాళాలు అప్పగించాడు. నేరుగా తుమకూరు లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం దేవరాయన దుర్గ కొండ పైకి వెళ్ళాడు. కొండపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రాత్రికి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సుమారు 200 అడుగుల కిందన ఆయన మృతదేహం లభ్యమైంది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మంజు ప్రసాద్ ఆత్మహత్య పట్ల సహ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కొండపై నుంచి దూకి ప్రభుత్వ ఇంజనీరు ఆత్మహత్య తుమకూరు జిల్లాలో విషాద సంఘటన -
మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన
హొసపేటె: మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మహిళా సాధికారత విభాగం, అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె బృందాల సంయుక్త ఆధ్వర్యంలో హంపీలోని ముఖ్య ప్రదేశాల్లో సోమవారం మహిళల భద్రత, రక్షణపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలోని విరుపాక్ష ఆలయం, రథ వీధి, బస్టాండ్ పరిసరాల్లోని భద్రతా చర్యల గురించి ప్రజలకు, మహిళా పర్యాటకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ విద్యా, జెండర్ స్పెషలిస్ట్ అన్నపూర్ణ మాట్లాడుతూ మిషన్ శక్తి బేటీ బచావో.. బేటీ పడావో, సఖి వన్ స్టాప్ సెంటర్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల సౌకర్యాలను మహిళలు ఎలా పొందవచ్చో వివరించారు. కష్టాల్లో ఉన్న మహిళలకు కేంద్రం అందిస్తున్న సహాయం గురించి సఖి కేంద్ర నిర్వాహకురాలు బషీరా బీ సమాచారం అందించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితిలో మహిళల హెల్ప్లైన్–181, పోలీస్ అత్యవసర సేవ–112, పిల్లల హెల్ప్లైన్–1098, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్–1930లకు సమాచారం అందించాలన్నారు. బృందం సభ్యులు పిల్లలపై లైంగిక నేరాల నివారణ చట్టం గురించి వివరించారు. అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె సిబ్బంది అక్కడికి వచ్చిన మహిళా పర్యాటకులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అక్కపడె సిబ్బంది, విజయ మహిళా సురక్షా పడె సభ్యులు పాల్గొన్నారు. -
నైతిక విలువలు అలవర్చుకోండి
కోలారు: విద్యార్థులు విద్యతో పాటు తమ జీవితంలో నైతిక విలువలు అలవర్చుకోవాలని డీఐజీ డి.దేవరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం బంగారుపేట పట్టణంలోని ఎస్డీసీ విద్యా సంస్థలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ద్వితీయ ఇంటర్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన 465 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పట్టాతో ఉన్నత ఉద్యోగం సాధించవచ్చన్నారు. అయితే దానితో పాటు విద్యార్థులు ఉత్తమ విలువలు అలవర్చుకోవాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ విద్యా సంస్థల వ్యాప్తిలో మాదక ద్రవ్యాల విక్రయించడాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయడానికి అందరు చేతులు జోడించాలన్నారుు. బంగారు పేట కన్నడ సంఘం అధ్యక్షుడు పల్లవి మణి, ఎస్డీసీ సమూహ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రమణీయంగా కరగ
కోలారు: నగర సమీపంలోని టమకలో రేణుకా యల్లమ్మ దేవి పూల కరగ ఉత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పూజారి కరగనెత్తుకుని రేణుకా యల్లమ్మ దేవాలయం ముందు మంగళ వాయిద్యాలకు నృత్యమాడారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా కరగ సాగింది. కేంద్ర మంత్రులకూ మోదీ ఆ మాట చెప్పాలి ● డీసీఎం శివకుమార్ విసుర్లు దొడ్డబళ్లాపురం: పెట్రోల్, డీజిల్ను తక్కువ వాడాలని, బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చెప్పే ముందు కేంద్రమంత్రులకు, అధికారులకు అదే మాట చెప్పాలని డీసీఎం డీకే శివకుమార్ విమర్శించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రులు, ప్రభుత్వఽ అధికారులు కూడా కార్లలో కాకుండా బస్సుల్లో, మెట్రో రైళ్లలో తిరగాలని ఆదేశాలివ్వాలన్నారు. మోదీ బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రజలకు చెప్పడం లేదని, కేవలం పెట్రోల్,డీజిల్ తక్కువ వాడాలని చెబుతున్నారని అన్నారు. ప్రధాని సలహాలు ఇచ్చే ముందు కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో ఈ పని చేయించి నాంది పలకాలన్నారు. దేశంలో శుభ కార్యాలకు బంగారం కొనడం అనాదిగా వస్తున్న ఆచారమని, ప్రజలను కొనవద్దని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు. 13న బెంగళూరువాసులకు బహుమతి బెంగళూరు వాసులకు మే 13న పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్టు డీసీఎం తెలిపారు. దానిపై సుర్జేవాలాతో రాజకీయ అంశాలపై చర్చించామని, ఇప్పుడు అధికారులను పిలిచి సూచనలు ఇచ్చానన్నారు. పెద్ద బహుమతిని గ్యారంటీగా ఇస్తానని, అదేమిటనేది ఆ రోజే చెబుతానన్నారు.యువకున్ని బలిగొన్న గంజాయి కేసు మైసూరు: మైసూరులోని రామకృష్ణ నగరలో ఓ యువకుడు తనపై గంజాయి సేవనం కేసు పెట్టారని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ మెయిన్ నివాసి అయిన ఎం. మధు (22), వృత్తి రీత్యా వడ్రంగి, 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఓ చెట్టు వద్ద గంజాయి సిగరెట్ను సేవిస్తూ ఉండగా కువెంపునగర పోలీసులు పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు భయంతో సతమతమైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు, కుటుంబ సభ్యులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ప్రకటించారు. పోలీసులు స్పందిస్తూ, గంజాయి వాడినందుకు అతనిపై కేసు నమోదు చేశాం, అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసహజ మరణంగా కేసు నమోదు చేశామని తెలిపారు. చిరుత బాధిత కుటుంబానికి పరిహారం మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని నాగమలేలో చిరుతపులి దాడిలో మరణించిన బాలుడు హర్షిత్ (10) కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది. ఆదివారం మలే మహదేశ్వర కొండ నుంచి నాగమలేకు భక్తులు వెళ్తుండగా చిరుత దాడి చేసి బాలున్ని లాక్కెళ్లి చంపివేసింది. అటవీ శాఖ బాలుని కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించి, ఇప్పటికే రూ. 5 లక్షల చెక్కును అందజేసింది. మిగిలిన సొమ్మును కుటుంబ బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. -
భారీ మొత్తం అమ్మొద్దు, సీసాల్లో వద్దు
శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ ఇంధనాలు బొటాబొటిగా సరఫరా అవుతున్నాయి. పలు రకాల ప్రచారాలు జరిగినప్పుడల్లా బెంగళూరుతో సహా అనేక జిల్లాల్లో బంకుల వద్ద జనం పోటెత్తి రద్దీ ఏర్పడుతోంది. కొన్ని వారాలుగా ఇలాంటి తంతు నిత్యకృత్యమైంది. కొందరు భయంతో భారీ మొత్తంలో పెట్రోలు, డీజిలు కొని నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందనే ఆరోపణలున్నాయి. కట్టుదిట్టంగా అమలు చేయాలి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్రతరం కాకుండా ముందు జాగ్రత్తలు వహించేందుకు ఆహార పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. పెట్రోల్, డీజిల్ పంపిణీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు, బంకుల యజమానులకు సూచనలు చేసింది. అలాగే మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించింది. ఉల్లంఘించే పెట్రోల్ బంక్ల మీద కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపింది. పెట్రోలు, డీజిల్ విక్రయాలపై కొత్త నియామాలు ఉల్లంఘించే బంకులపై చర్యలు ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలు ఇవే నియమాల ప్రకారం.. వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ పోయాలి. గరిష్టంగా 200 లీటర్ల వరకూ అనుమతి ఉంది. ఎవరైనా గానీ బాటిల్లు, క్యాన్లు వంటి వాటిలో ఇంధనాన్ని తీసుకెళ్లరాదు, అలా వచ్చిన వారికి బంకుల సిబ్బంది ఇంధనం ఇవ్వరాదు. సాధారణ పెట్రోలు బంకులు భారీస్థాయిలో ఒకరికే ఇంధనం సరఫరా చేయడానికి వీలు లేదు. అతిక్రమించి బల్క్ అమ్మకం చేసినచో లైసెన్స్ రద్దు లాంటి తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలకు, ఆక్వా రంగానికి డీజిల్ సరఫరాలో ఎలాంటి తారతమ్యం జరగకుండా అధికారులు దృష్టిసారించాలి. ఇలా పలు నిబంధనలను రూపొందించారు. -
అంజన్నకు విరాళంలో వివాదం
సాక్షి బళ్లారి: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్వర్రెడ్డి సమర్పించిన రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వివాదానికి దారి తీశాయి. రెండు రోజుల క్రితం మహేశ్వర్రెడ్డి స్వామివారికి గద, కిరీటం తదితర ఆభరణాలను సమర్పించిన సంగతి విదితమే. అయితే వాటిని జిల్లా యంత్రాంగం పరిశీలించిన తర్వాత వాటిలో కేవలం 28 గ్రాముల బంగారం మాత్రమే ఉందని, తామ్రం, రాగితో తయారు చేసి బంగారు పూతతో ఆభరణాలను సమర్పించారని తేలింది. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తామ్రంపై బంగారు పూత పూసి ఆభరణాలను తయారు చేసినట్లు తేలడంతో సదరు వ్యక్తికి నోటీసు జారీ చేశారు. ఆభరణాలకు సంబంధించి కచ్చితమైన బిల్లులను ఇవ్వాలని సూచించారు. అయితే ఈ బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడంతో చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ ఆభరణాలు తయారు చేసిన వారు ఇలా తామ్రంతో చేసి పైన బంగారు పూత పూశారా? అన్నది సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. అది నకిలీ బంగారమని తేల్చిన జిల్లా యంత్రాంగం చర్చనీయాంశంగా గోల్డ్ ప్లేటెడ్ ఆభరణాల సమర్పణ -
హంపీలో అక్రమ హోం స్టేలకు తాళం
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీ చుట్టు పక్కల ఉన్న కమలాపుర ప్రాంతంలో అక్రమంగా వెలిసిన హోంస్టేలు, రెస్టారెంట్లపై పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సోమవారం ఉక్కుపాదం మోపాయి. అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా హంపీ ప్రాంతంలో వందలాది హోంస్టేలు, రెస్టారెంట్లు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హంపీ, కమలాపుర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోంస్టేలు పర్యాటకులకు సేవలు అందించడానికి అవసరమైన అధికారిక అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు తెలిసింది. సంయుక్త ఆపరేషన్లో జిల్లా ఎస్పీ జాహ్నవి, తహసీల్దార్ శృతి, పర్యాటక శాఖ సీనియర్ అధికారుల బృందం పాల్గొన్నారు. -
పర్మినెంట్ చేయాలని ఆశాల ధర్నా
రాయచూరు రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలన్నారు. గత నాలుగు నెలల నుంచి గౌరవ వేతనాల్లో ఇచ్చే పారితోషికంలో కోత విధించడాన్ని తప్పుబట్టారు. న్యాయసమ్మతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఈఓకు వినతిపత్రం సమర్పించారు. -
విద్యా శాఖలో మార్పులు తెస్తా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో విద్యా శాఖలో మార్పులు తెస్తామని డీడీపీఐ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. బడిగేర్ను గదగ్కు బదిలీ చేయడంతో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా పని చేస్తున్న తనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ఈ ఏడాది 15వ స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తామన్నారు. ఉపాధ్యాయులు, సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామన్నారు. చెరువు స్నానం.. తీసింది ప్రాణం●స్నానానికి వెళ్లి యువకుడు మృత్యువాత హొసపేటె: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని వనగేరి వద్ద చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన జరిగింది. ఆ తాలూకాలోని బోదూరు గ్రామానికి చెందిన హనుమంత(17) అనే యువకుడు తోటి యువకులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అయితే నీటిలోకి దూకిన హనుమంత తిరిగి పైకి రాలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థిని మృతిపై విచారణకు వినతిరాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో ఇటీవల ప్రైవేట్ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో జీపును వెనుకకు మళ్లిస్తుండగా అదుపు తప్పి ఢీకొనడంతో భూమిక(17) అనే విద్యార్థిని దుర్మరణం చెందడంపై విచారణ జరపాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు పూజార్ మాట్లాడారు. విద్యార్థిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రియుడితో పెళ్లికి నిరాకరణ.. యువతి ఆత్మహత్యహుబ్లీ: ప్రియుడితో పెళ్లికి నిరాకరించిన కుటుంబ సభ్యుల తీరుతో మనోవేదనకు గురై ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామంలో జరిగింది. శ్వేత(18) ఆత్మహత్య చేసుకున్న యువతి. మృతురాలు శ్వేత కొన్నేళ నుంచి హుబ్లీ తాలూకా కిరేసూర గ్రామానికి చెందిన నాగరాజ్ను ప్రేమిస్తుండేది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి నాగరాజ్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో జీవితం విరక్తి చెందిన ఆమె విషం తాగింది. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికలకు టీకా అభియాన్ బళ్లారిటౌన్: జిల్లాలో 14 ఏళ్ల వయస్సులోపు బాలికలకు క్యాన్సర్ నియంత్రణ కోసం టీకా అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీహెచ్ఓ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ అభియాన్ను ప్రవేశ పెట్టామని, దీన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో 16,495 మంది బాలికలకు ఈ టీకాలను వేసే లక్ష్యం ఉందన్నారు. ఇంత వరకు 5,658 మంది బాలికలకు టీకాలను వేసినట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మరాదని కోరారు. -
కుటుంబాన్ని చిదిమిన కారు
దొడ్డబళ్లాపురం: కారు, బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమారుడు చనిపోగా, తల్లి, చిన్న కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన హాసన్ తాలూకా శివారులోని బిట్టగౌడనహళ్లి వద్ద దేవేగౌడ సర్కిల్లో జరిగింది. గోరూరుకు చెందిన జయణ్ణ (38), మిథున్ (8) మృతులు, రజిని (29), మిలన్ (4) క్షతగాత్రులు. అందరూ ఒకే బైక్లో హాసన్లో 10 ఏళ్లకోసారి జరిగే దేవీరమ్మ జాతరకు వచ్చారు. జాతర చూసుకుని బైక్లో తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురినీ ఆస్పత్రికి తరలిస్తుండగా జయణ్ణ, మిథున్ దారిలో మృతిచెందారు. తల్లీ, కొడుకు చికిత్స పొందుతున్నారు. కారు అతివేగంతో దూసుకువచ్చి ఇంత ఘోరానికి కారణమైందని స్థానికులు ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ను ఢీ, తండ్రీ కొడుకు మృతి -
యువకుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
మాలూరు: తాలూకాలోని కేజీ హళ్లి గ్రామంలో యవకుడి హత్య కేసులో నిందితులను మాస్తి పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. టీకల్ గ్రామానికి చందిన దర్శన్, సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీ హళ్లి సంత మైదానంలో శనివారం రాత్రి జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్పీ ఆదేశాలతో కార్యాచరణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో సఫలం అయ్యారు. కోర్టులో ఓ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో తెలిసింది. -
గజరాజు వచ్చె.. ఘాట్ రోడ్డు బంద్
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఓ చోట ఏనుగులు వీరంగం సృష్టిస్తున్నాయి. రైతులు, కూలీలపై ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడీఘాట్ రోడ్డులో ఆదివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో వాహనదారులు అందోళనకు గురయ్యారు. ఈ ఘాట్లో దక్షిణ కన్నడ, చిక్కమగళూరుల మధ్య వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వీకెండ్ కావడంతో వాహన రద్దీ ఎక్కువగా ఉంది. ఘాట్ మార్గం 10 మలుపు వద్ద భారీ అడవి ఏనుగు నిలబడింది. దీంతో గంటలకొద్దీ కారు, బస్సు, బైకిస్టులు ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలెనాడు భాగంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు కనిపించటం సహజం, అయితే ఇప్పుడు ఘాట్రోడ్డులోకి కూడా రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. కొందరు ఏనుగును మొబైల్ ఫోన్లో వీడియోలు తీయసాగారు. రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ కొద్దీ నిలిచి పోయ్యాయి. ఏనుగుకు దగ్గరగా వెళ్లరాదని అటవీ సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. రెండు గంటల తరువాత ఏనుగు నెమ్మదిగా అడవిలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చార్మాడి రూట్లో గందరగోళం -
అగ్నిప్రమాదంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ బుగ్గి
హుబ్లీ: బెళగావి తాలూకా వనగ గ్రామంలోని పారిశ్రామికవాడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర అగ్నిప్రమాదం వాటిల్లింది. ఇక్కడి డాంగే ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు చెలరేగగా ఘటనలో రూ.లక్షలాది విలువ చేసే ప్లాస్టిక్ వస్తువులు, యంత్ర పరికరాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి ఉన్నఫళంగా మంటలు చెలరేగగా, ప్లాస్టిక్ వస్తువులు భారీగా ఉండటంతో కొద్ది సేపటిలోనే ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అర్పారు. సమయ స్పూర్తితో నడుచుకున్నందు వల్ల అగ్నిజ్వాలలు పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు తగలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫ్యాక్టరీలోని విలువైన ప్లాస్టిక్ ముడివస్తువులు, అలాగే తయారు చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టం కొద్ది ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరగడంతో ఘటన స్థలాన్ని సంబంధిత పోలీసులు పరిశీలించి నివేదిక సిద్ధ చేస్తున్నట్లు తెలిసింది. -
ఇద్దర్ని బలిగొన్న చెరువు
● మండ్య జిల్లాలో విషాదం మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని హెరగనహళ్లి గ్రామంలో కోడి చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మునిగిపోయారు. సత్యప్రకాష్ (17), యశస్ (17), స్నేహితులు కాగా, ఇటీవలే టెన్త్ పాసై, ఇంటర్లో చేరబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడి స్నేహితులు, బంధువుల ఇళ్లలో విచారించగా రాలేదని తెలిపారు. ఈతకు చెరువుకు వెళ్లినట్లు తెలిసి అక్కడకు చేరగా, బైక్, బట్టలు, చెప్పులు కనిపించాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఫైర్సిబ్బంది, గ్రామస్తులు గాలించగా, బాలలు విగతజీవులుగా బయటపడ్డారు. మంత్రి ఎన్. చలువరాయస్వామి ఆసుపత్రిలో బాలల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధాని రక్షణపై సర్కారు నిర్లక్ష్యం: శోభ బనశంకరి: కర్ణాటక ప్రభుత్వానికి ప్రధాని రక్షణ పట్ల ప్రేమ ఉందా? అని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ప్రశ్నించారు. సోమవారం బెంగళూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ఆదివారం వస్తున్నారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి పైగా ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులను ఎందుకు బదిలీ చేసింది, దీని వల్ల పోలీసుల్లో గందరగోళం ఏర్పడి ఉంటుందన్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో బదిలీలు ఎందుకో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని, ప్రధాని ప్రయాణించే దారిలో భద్రతను ఎందుకు పెంచలేదని అన్నారు. షెడ్డులో మంటలు.. చిన్నారుల సజీవ దహనం బనశంకరి: బెంగళూరులో కొత్తనూరు సమీపంలోని నారాయపురలో షెడ్లో నిప్పు అంటుకుని ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వివరాలు.. రాయచూరుకు చెందిన వలస కూలీ కుటుంబం షెడ్డులో జీవిస్తోంది. వారి పిల్లలు అర్జున్ (5), ఆశా (3). సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంటి వద్ద అవ్వతో కలిసి బాలలు ఉన్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో అవ్వ షెడ్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో మంటలు లేచాయి. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా షెడ్లోనే దాక్కున్నారు. చివరకు మంటల్లో చిక్కి మృత్యువాత పడ్డారు. కొత్తనూరు పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. పిల్లలు లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. శృంగేరి రీకౌంటింగ్పై సుప్రీం స్టే ● రాజేగౌడ కొనసాగింపు యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి అసెంబ్లీ క్షేత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గెలిచిన బీజేపీ అభ్యర్థి జీవరాజ్ వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ ఓటింగ్లో ఓడిపోయిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజేగౌడ సుప్రీంకోర్టులో అర్జీ వేయగా, విచారించిన ధర్మాసనం అక్కడ యథాస్థితిని కాపాడాలంటూ ఆదేశించింది. ఫలితాలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు అదేశాలను రాజేగౌడ సుప్రీంలో సవాల్ చేశారు. గత ఎన్నికల ఓట్లు, తాజాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమాచారం, జిల్లాధికారి గౌరవ్శెట్టి నిర్ణయాలు తదితరాలను ధర్మాసనం ముందు సమర్పించారు. పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తులు.. రీకౌంటింగ్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు సమాచారాన్ని సీల్డ్ కవర్లో అందించాలని ఎన్నికల కమిషన్కు నోటీసులిచ్చారు. రీకౌంటింగ్ ఫలితాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడంతో రాజేగౌడకు ఊరట దక్కినట్లయింది. ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మోదీ బాగా చెప్పారు: దేవేగౌడ బనశంకరి: బంగారం కొనొద్దు, ఇంధనాలను పొదుపుగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను మనందరం స్వాగతించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ తెలిపారు. సోమవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ సంఘర్షణతో దుష్పరిణామాలు ఏర్పడ్డాయి, ఈ సందర్భంలో నరేంద్ర మోదీ చెప్పిన మంచి సలహాలను స్వాగతించాలన్నారు. -
ఇళ్లలో చోరీలు.. ఇద్దరి అరెస్టు
హొసపేటె: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం విజయనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కేంద్రం సభాంగణంలో ఎస్పీ జాహ్నవి విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలలుగా హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు కుమారనహళ్లి, జహంగీర్ బాషాలను అరెస్ట్ చేశామన్నారు. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారన్నారు. దొంగలించిన సొత్తును అమ్ముకుని వచ్చిన డబ్బులను పంచుకుని జల్సాలు చేసేవారన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దొంగలను పట్టుకున్నారన్నారు. నిందితులు హగరిబొమ్మనహళ్లి, తంబ్రళ్లి, మరియమ్మనహళ్లి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.12.56 లక్షల విలువైన 96.54 గ్రాముల బంగారు, రూ.1.50 లక్షల విలువైన 750 గ్రాముల వెండి ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి ఎస్ఐ వికాస్ పి.లమాణి, మరియమ్మనహళ్లి ఎస్ఐ తారాబాయి, తంబ్రళ్లి ఎస్ఐ నాగరాజ్, సిబ్బందిని ఎస్పీ జాహ్నవి అభినందించి రివార్డులు అందజేశారు. రూ.14 లక్షల ఆభరణాలు స్వాధీనం -
సర్కారు బడికి హైటెక్ హంగులు
మరఖల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రవేశద్వారంలో విద్యార్థులు తరగతి గదిలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అత్యాధునిక బెంచీలు ప్రాజెక్టర్తో తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు రాయచూరు రూరల్: ప్రైవేట్ స్కూల్ కంటే తామేం తక్కువ కాదంటూ బీదర్ జిల్లాలో ఓ సర్కారు పాఠశాల మౌలిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తోంది. కళ్యాణ కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా మరఖల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్లలో లేని సౌకర్యాలను కూడా విద్యార్థులకు కల్పించారు. చిన్న కుగ్రామంలో ఉన్న ఈ పాఠశాల పెద్ద కాన్వెంట్లకు దీటుగా నిలిచింది. 2026–27వ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు, ఎస్డీఎంసీ, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు. తొమ్మిది గదులు, గ్రంథాలయం, వంట గది, భోజన గదులు, రక్షిత మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 8వ తరగతి వరకు బోధన ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి మొదలుకొని యూకేజీ తర్వాత 8వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. 185 మంది విద్యార్థులుండగా, 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు పర్మినెంట్ అతిథి ఉపాధ్యాయులు, ముగ్గురు వంట మనుషులున్నారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అన్ని విధాలైన పుస్తకాలు, 5 కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, రెండు ప్రాజెక్టులు, రైట్ సంస్థ రూ.6.50 లక్షల నిధులను విరాళంగా అందించడంతో పాటు 25 హైటెక్ బెంచీలను సమకూర్చింది. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల బెడదను తప్పించవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామనగౌడ అన్నారు. ప్రైవేట్కు దీటుగా మరఖల్ ప్రభుత్వ పాఠశాల మౌలిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలిచిన వైనం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాలో ప్రత్యేకం -
మంత్రి సుధాకర్కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ప్రణాళిక, గణాంక మంత్రి డి.సుధాకర్కు కుటుంబీకులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున మరణించడం తెలిసిందే. భౌతికకాయాన్ని చిత్రదుర్గం జిల్లా హిరియూరుకు తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత చెళ్లకెరెకు తీసుకువచ్చి స్టేడియంలో కొంత సేపు ఉంచి, నివాసానికి తరలించారు. తమ నేతను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పావగడ రోడ్డులోని ఆర్యవైశ్య ముక్తిధామలో జైన సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కుమారుడు సుహాస్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, స్పీకర్ ఖాదర్, పలువురు కాంగ్రెస్ ప్రముఖులు, మంత్రులు పాల్గొని తుది నివాళులు అర్పించారు. పార్థివ దేహంపై కప్పిన జాతీయ జెండాను సీఎం, డీసీఎంలు ఆయన సతీమణి హర్షిణి కి అందజేశారు. సుధాకర్ను డీకే శివకుమార్ గుర్తు చేసుకొని ఆవేదనకు గురయ్యారు. ఆయనను బతికించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్పారు.మంత్రి డి.సుధాకర్ (ఫైల్) చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన సీఎం, డీసీఎం, మంత్రులు -
గంగమ్మ ఆలయ వార్షికోత్సవం
మాలూరు: తాలూకాలోని పుర గ్రామంలో గంగమ్మ దేవి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇటీవల దేవాలయాన్ని జీర్ణోద్దారణ చేయగా.. జీర్ణోద్దారణ అనంతరం మొదటి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గోపూజ, స్వస్తివచనం, అంకురార్పణ, మహాగణపతి పూజ, అగ్నిప్రతిష్ట, గణహోమం, పంచామృతాభిషేకం చేశారు. అంచెముస్కూరు, లక్కూరు. చిక్కతిరుపతి, జయమంగల, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. వైభవంగా చౌడేశ్వరి దేవి దీపారాధన కోలారు: బంగారుపేట తాలూకా బేతమంగల ఫిర్కా కంగాండ్లహళ్లి గ్రామంలో చౌడేశ్వరి దేవి జాతరలో భాగంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం దేవాలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం, దీపారాధన, తదితర పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. -
పనసమాకనహళ్లిలో నీటి ఎద్దడి
శ్రీనివాసపురం: తాలూకాలోని పనస మాకనహళ్లి గ్రామంలో నీటి ఎద్దడి అధికమైంది. గ్రామంలో చాలా వరకు బోర్వెల్లు ఎండి పోయాయి. ప్రజలు తాగునీరు లేక నానా ఇబ్బంది పడాల్సి వస్తోంది. వంకలు, వాగులు ఎండిపోవడంతో పశువులకు కూడా నీరు లభించడం లేదు. సుదూరంలో ఉన్న కొళాయిల నుంచి సైకిళ్లపై నీరు తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది గ్రామానికి తరచుగా వచ్చే నీటి ట్యాంకర్పై ఆధారపడుతున్నారు. కొత్తగా బోర్వెల్ వేసి నీటి సమస్యను పరిష్కరించాలని పీడీఓకు విన్నవించినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరించకుంటే తీవ్ర ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
కారు, టాటా ఏస్ ఢీ: నలుగురికి గాయాలు
హొసపేటె: అతివేగంగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తాలూకాలోని ధర్మసాగర్ గ్రామం సమీపంలో జరిగింది. ఉదయం బళ్లారి నుంచి హొసపేటె వైపునకు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ గూడ్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం ప్రమాదానికి కారణమని తెలిసింది. గాదిగనూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి–63పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆటోను ఢీకొన్న కారు.. హుబ్లీ: కారు డ్రైవర్ మద్యం మత్తులో ఆటో రిక్షాను ఢీకొట్టాడు. ఈ ఘటన ధార్వాడ జిల్లా ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకోగా... అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు నడిచి వెళ్లే జిల్లా ఆస్పత్రి ఎమర్జెనీ యూనిట్ దగ్గర తాగిన మత్తులో కారు నడుపుకుంటూ వచ్చి ఆటో రిక్షాను ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు స్టిరింగ్పై ఆ మందు బాబు నిద్రలోకి జారుకున్నాడు. ఘటన స్థలానికి వచ్చిన ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటన నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో వచ్చి తగిన చర్యలు తీసుకున్నారు. -
ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలు
రాయచూరు రూరల్: సర్కారు కార్యాలయాలను ప్రజలకు సేవలు చేసే దేవాలయాలుగా భావిస్తాం. అయితే కొంతమంది అధికారులు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. రాయచూరు జిల్లా లింగసూగురులో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయం మందు పార్టీలకు వేదికగా మారింది. రాత్రి వేళ్లలో అధికారులు పార్టీలు చేసుకుంటూ క్లబ్గా మార్చేస్తున్నారు. శనివారం రాత్రి కార్యాలయంలో అధికారులు రెచ్చిపోయారు. విచ్చల విడిగా మందు తాగుతూ జల్సాలు చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఏఈఈ హనుమప్ప అదవాని ఇతర అధికారులతో కలసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జల్సాలు చేస్తున్న అధికారులపై వేటు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి. -
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
కేజీఎఫ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పిలుపునిచ్చారు. తాలూకా వ్యాప్తిలో పదవ తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన 206 మంది విద్యార్థులకు ఆదివారం నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాలో తాలూకా చివరి స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలను తీసుకు రావడానికి ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. కార్యక్రమంలో బీఈఓ నారాయణస్వామి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహమూర్తి, నగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు. యువకుడు దారుణ హత్య మాలూరు: యువకుడిని కొడవలితో నరికి ఆపై తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన టీకల్ ఫిర్కా కెజి హళ్లి సంత మైదానంలో చోటు చేసుకుంది. తాలూకాలోని జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) హత్యకు గురైన యువకుడు. పాత గొడవలే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లేదా ఎవరైనా కిరాయి హంతకులు హత్య చేయించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వేసవి శిబిరాలతో ప్రతిభ వెలికితీత బొమ్మనహళ్లి: ఆనేకల్ పట్టణం పాత ప్రభుత్వ సెకండరీ పాఠశాల ఆవరణలో సంక్రమణ బలగం, వివిధ సంస్థల సహకారంతో చిన్నారుల కోసం వేసవి శిబిరం ఏర్పాటు చేశారు. వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, సినిమా, నాటక ప్రదర్శన, కథ, పాట, సాంఘిక చైతన్యం, గ్రామ క్రీడలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతిభను ప్రదర్శించారు. జాతీయ యువ పురస్కార గ్రహీత డాక్టర్ చిన్నప్ప చిక్కహగడే, న్యాయవాది పురుషోత్తం, శ్యామ్ రాజ్ ఉర్సు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హేమరెడ్డి మల్లమ్మ జయంతి
రాయచూరు రూరల్: నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్న రంగ మందిరంలో ఆదివారం జిల్లా దళిత, జెడ్పీ, నగర సభ, కన్నడ సంస్కృతి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ మాట్లాడుతూ.. హేమారెడ్డి మల్లమ్మ శరణుల చింతనలను అలవర్చుకున్న విషయాలను ప్రప్తావించారు. అలనాటి మహా మానవతా వాది బసవన్న సమకాలికురాలు అయిన హేమరెడ్డి మల్లమ్మ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. హేమరెడ్డి మల్లమ్మ జీవత చరిత్రను భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి సుధాకర్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్య, వీర సంగన బసవ స్వామీజీ, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, శరణప్ప, ఉమేష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బసన గౌడ, రామన గౌడ కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లమ్మ జీవితం ఆదర్శంసాక్షి, బళ్లారి: మహాసాథ్వి మల్లమ్మ జీవితం మానవాళికి ఆదర్శం అని కర్ణాటక రాష్ట్ర రెడ్డి జన సంఘం డైరెక్టర్ గణపాల ఐనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని వేమనపీఠం ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లమ్మ విగ్రహానికి పూజలు చేసి, నివాళులర్పించారు. గణపాల ఐనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లమ్మ రెడ్డి సమాజంలో జన్మించడంతో మన అందరికి గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సమాజ ప్రముఖులు బసవరాజ్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాగరాజ్రెడ్డి, మోహన్రెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని బసవ భవనంలో వీరశైవ లింగాయ్ రెడ్డి సమాజంలో హేమరెడ్డి మల్లమ్మకు ఘనంగా నివాళులర్పించారు. హేమరెడ్డి మల్లమ్మ విగ్రహానికి పూజలు చేస్తున్న రెడ్డి సమాజ ప్రముఖులు బసవ భవనంలో వీరశైవ లింగాయత్ రెడ్డి సమాజం ఆధ్వర్యంలో మల్లమ్మ జయంతి -
హొసపేటెలో కాంగ్రెస్ సంబరాలు
హొసపేటె: తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆదివారం హొసపేటెలోని డాక్టర్ పునీత్ రాజ్కుమార్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు, పార్టీ అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం, సంకీర్ణ రాజకీయాల విజయానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయనగర జిల్లా షెడ్యూల్డ్ కులాల విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ బంతమనే మాట్లాడుతూ.. మనువాద భావజాలం కలిగిన బీజేపీ పార్టీ ఏ కారణం చేతనైనా సరే దక్షిణ భారతదేశంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదని తెలిపారు. తమిళనాడులో అమలువుతున్న పాలన, సంకీర్ణ ప్రభుత్వ విజయం యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం ప్రముఖ కార్యనిర్వాహకులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తలూరు వీరభద్ర, సజ్జద్ఖాన్, రఘు, నాగరాజు, గిరీష్, ప్రకాష్, బి.మౌలాలి, శశికుమార్, కిషోర్ కుమార్, కార్తీక్, గణేష్, యోహాన్, అమీద్ హుస్సేన్, బాబా ఫకృద్దీన్, ఆశాబేగం తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ హుబ్లీ: మత్తు పదార్థాల సేకరణ, విక్రయం కేసులో దాండేలి సుభాష్ నగర్ నివాసి అయాన్ సాన్వాజ్ను అరెస్ట్ చేసి బళ్లారి జైలుకు పంపారు. మత్తు పదార్థాల సేకరణ నిల్వ, రవాణా విక్రయాల్లో వృత్తి పరమైన డ్రగ్స్ పెడ్లర్ అయిన నిందితుడిపై దాండేలి పోలీసులు 5 కేసులు, హుబ్లీ గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. పలుసార్లు జైలుకు పంపిన కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించాడు. పదే పదే ఇవే నేరాలకు పాల్పడటంతో ఐజీపీ, ఎస్పీ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ చట్టం ద్వారా డ్రగ్స్ పెడ్లర్ అయాన్ సాన్వాజ్ను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన ఈత సరదారాయచూరు రూరల్: ఈత సరదా ప్రాణం తీసింది. మిత్రులతో కలసి ఈత కోసం వెళ్లి యువకుడు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా కమల నగర తాలూకా బళత వద్ద ఉన్న మంజ్రా నదిలోకి అనిల్ చిద్రి (28) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ లోతైనా ప్రదేశానికి వెళ్లిన అనిల్ చిద్రి నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ ద్వారా మంజ్రా నదిలో గాలించారు. చాలా సేపు అనంతరం యువకుడి మృతదేహం లభ్యం కావడంతో వెలికితీశారు. కుశనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేఎంసీ ఆస్పత్రిలో మహిళకు ప్రాణదానంహుబ్లీ: రక్తహీనత, తలసీమియా, హెమోగ్లోబిన్ కొరత తదితర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న మహిళకు కేఎంసీ ఆస్పత్రి వైద్యులు పునర్ జన్మ ప్రసాదించారు. నెల రోజుల క్రితం విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. వివరాలు.. విజయనగర జిల్లా కంప్లి సమీపంలో ఓ గ్రామానికి చెందిన రేణుక (47) తొలి కాన్పులో మగ్గ బిడ్డకు జన్మినిచ్చింది. ఆ తర్వాత మూడు అబార్షన్లు జరిగాయి. 5వ సారి మళ్లీ రేణుక గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురికావడం, నిసత్తువతో ఎప్పుడు నిద్రించేది. గంగావతి, కూష్టగి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి కొప్పళ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తల్లీబిడ్డ బతకడం కష్టమని సదరు ఆస్పత్రుల్లోని వైద్యులందరూ తేల్చి చెప్పారు. అంతేగాక ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. కొప్పళ వైద్యుల సూచన మేరకు కేఎంసీ ఆస్పత్రికి వచ్చిన రేణుక.. ఏప్రిల్ నెలలో అడ్మిట్ అయ్యింది. కిమ్స్ వైద్యులు ఆమెకు తొలుత వివిధ వైద్య పరీక్షలు చేశారు. రక్తహీనతతో పాటు కొన్ని సమస్యలు ఉండటంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్లుగా గుర్తించారు. తక్షణమే మాతృ శిశు ఆస్పత్రి విభాగంలో డాక్టర్ రామలింగప్ప అంతర్సాని నేతృత్వంలోని వైద్య బృందం సహజ ప్రసవం చేశారు. ప్రస్తుతం రేణుక ఆరోగ్యం కుదుటపడింది. -
తల్లికి సేవ చేయాలి
రాయచూరు రూరల్: ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. కుమారులు తల్లిని పూజించి, సేవ చేయాలని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. ఆదివారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి కుటుంబ కోసం నిత్యం శ్రమిస్తుందన్నారు. తల్లి చూపే త్యాగం, ప్రేమ, కరుణను గుర్తు చేసుకోవాలన్నారు. పిల్లలకు మానవతా విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు బోధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రవీంద్ర జాలదార్, శారద తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉద్బవ లింగ ఉత్సవాలు రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గాణదాళలో ఆదిశేష ఉద్బవ లింగ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం సాయంత్రం కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్యులు, హోసళ్లి ముత్యా మహంత శివయోగి మహాస్వామి, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కలసి రథాన్ని లాగారు. వీడియోతో మహిళకు బ్లాక్మెయిల్ హుబ్లీ: యువతిపై లైంగిక దాడి చేసిన వీడియోలను ఇతరులకు మొబైల్స్కు పంపిన యువకుడిపై ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 21 ఏళ్ల యువతి నవనగర అబ్దుల్ మాలిక్పై ఫిర్యాదు చేసింది. గతంలో ఈమె ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటర్యూకు వెళ్లిన సమయంలో అబ్దుల్ మాలిక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసుకుని ఇతరుల మొబైల్స్కు పంపించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వాల్మీకి విగ్రహావిష్కరణ రాయచూరు రూరల్: నాయక్ సమాజం విద్యలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మాన్వి తాలూకాలోని బల్లటిగిలో మహర్శి వాల్మీకి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహర్శి వాల్మీకి జీవత చరిత్రను అందరూ తెలుసుకోవాలని సూచించారు. మానవతా ధర్మం ఆధారంగా మహర్శి చేసిన సేవలు అనన్యమన్నారు. నాయక్ సమాజం చేస్తున్న సేవలు ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తు తరాల వారికి గుర్తుండేలా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లోకసభ సభ్యుడు కుమార నాయక్, మాన్వి శాసన సభ సభ్యుడు హంపయ్య నాయక్, ప్రసన్నానంద స్వామి, వరదానేంద్ర, గంగాధర నాయక్, రవి, అమరేష్, రుద్రప్ప అంగడి, కేశవ మూర్తి, సూగుప్ప, గంగారెడ్డి, గపూర్ పాల్గొన్నారు. ఫ్లాట్లపై ఫిర్యాదు సాక్షి, బళ్లారి: నగరంలో ఓ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఓ అపార్టుమెంటులో తాను కొనుగోలు చేసిన ఫ్లాట్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు కేటాయించిన 10 ఫ్లాట్లలో నాణ్యత ఏమాత్రం లేదని వాపోయింది. నిర్మాణదారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెండు రోజుల క్రితం బాడుగులకు ఇచ్చిన షాపులో పై పెచ్చులు ఉడిపోయాయని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కోలారు: ఉత్తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలను తరచుగా చేయించుకుంటూ ఉండాలని తాలూకా ఆరోగ్య అధికారి డా నారాయణస్వామి తెలిపారు. ఆదివారం నగరంలోని సబ్ జైలులో ఖైదీలకు ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. 100 రోజుల క్షయ ముక్త అభియాన్ గురించి ఖైదీలకు వివరించారు. అతి వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఎక్కువగా నీరు తాగాలని తెలిపారు. జైలు అధికారి జి రాములు, జైలర్ యాస్మిన్, ఎస్.బాబు పాల్గొన్నారు. -
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
హొసపేటె: పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న కేంద్రం ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను ప్రవేశ పెట్టిందని తెలిపారు. పెట్టుబడిదారులు మాత్రమే పాలించాలన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 20 మంది కార్మికులను ఒక యూనిట్గా పరిగణించేవారు. ఇప్పుడు ఈ సంఖ్యను 50 మందికి పెంచడంతో 49 మంది కార్మికులు ఉన్నా సరే వారికి ఎటువంటి లైసెన్స్ పొందే అర్హత లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో 8 గంటల పని వేళలను ఇప్పుడు 12 గంటలకు పెంచారని తెలిపారు. అదనంగా మహిళలు కూడా రాత్రి షిఫ్టులలో పని చేయాలనే నిబంధన తీసుకొచ్చారన్నారు. యజమానులు తమకు నచ్చినంత సమయం కార్మికులతో పని చేయించుకోవచ్చనే చట్టాన్ని అమలులోకి తెచ్చారు. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తులను ఆమోదించడానికి బదులుగా, ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల సంఘాల విజ్ఞప్తులకు మాత్రమే ఆమోదం తెలుపుతోందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రధాని వెళ్లే మార్గంలో విస్ఫోటకాలు
● పోలీసు అధికారుల తనిఖీ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సంచరించే మార్గంలో బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్ళి గేట్ వద్ద విస్ఫోటక పదార్థాలైన జిలెటిన్ కడ్డీలు లభించడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వారంరోజుల నుంచి ప్రధాని టూర్కు ఎస్పీజీ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తీరా మోదీ వచ్చిన సమయంలో పేలుడు పదార్థాలు బయటపడడం చర్చనీయాంశమైంది. వడేరహళ్ళి గేట్ సమీపంలోని రోడ్డు పక్కన రెండు జిలెటిన్ కడ్డీలు లభ్యమయ్యాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో లభించాయి. పేలుడు వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? దీని వెనుక ఏమైనా కుట్ర వంటిది ఉందా అనేది కనుగొనేందుకు ఇన్స్పెక్టర్తో పాటుగా 50 మంది పోలీసులతో తనిఖీ బృందాన్ని రామనగర ఎస్పీ నియమించారు. పోలీస్ ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో శోధించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత గవర్నర్, సీఎం, డీసీఎంల నివాళులు నేడు చెళ్లకెరెలో అంత్యక్రియలు -
జస్టినాదే సింగిల్స్ ట్రోఫీ
● తుమకూరు టెన్నిస్ టోర్నీ... తుమకూరు: తుమకూరు వర్సిటీలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన సింగిల్స్ ఫైనల్లో, రెండవ సీడ్ జుజానా పావ్లికోవ్స్కా గాయం కారణంగా వైదొలిగింది. దీంతో, జస్టినా మికుల్స్కిటే సులభంగా సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. భుజం గాయం కారణంగా శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్ నుంచి పోలెండ్ ఆటగత్తె జుజానా తప్పుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య పోటీ మిస్ కావడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. దీంతో జస్టినా సులభంగా టైటిల్ పొందింది. ఇరువురికీ హోంమంత్రి పరమేశ్వర్ ట్రోఫీలు, బహుమతి నగదును అందజేశారు. కన్నికా పరమేశ్వర్, కలెక్టరు శుభ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అలరించే హస్తకళా మేళాబనశంకరి: బెంగళూరు బనశంకరి రెండోస్టేజ్లోని శ్రీహరి కళ్యాణ మండపంలో జరుగుతున్న చేనేత హస్తకళా మేళా వినూత్న ఉత్పత్తులకు వేదికై ంది. దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన కాటన్, పట్టు, నూలు చేనేత వస్త్రాలు, చీరలు, మహిళలను అలరిస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తాలు, ఆభరణాలు, గృహాలంకరణ సామగ్రి ఇక్కడ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పేరుపొందిన వస్త్రాలు, చీరలు, కళాకృతుల స్టాల్స్ ఇందులో వెలిశాయి. ఈ ప్రదర్శన ఈ నెల 17వ తేదీ వరకు జరుగుతుంది. -
ప్రాచీన కట్టడాలకు జీవం పోయండి
మైసూరు: ప్యాలెస్ సిటీలో రెండు చారిత్రక కట్టడాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైసూరు వారసత్వ కట్టడాలైన దేవరాజ మార్కెట్, లాన్స్డౌన్ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్.. సీఎం సిద్దరామయ్యకు విజ్ఞప్తి చేశారు. మైసూరు వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే మా ప్రధాన లక్ష్యమని, ఈ మేరకు సీఎం లేఖ రాసినట్లు తెలిపారు. ఈ భవనాల పరిరక్షణకు ఈ ఏడాది మే 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనదని ఎంపీ చెప్పారు. ఈ కట్టడాలను కూల్చివేసి, కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. 19వ శతాబ్దానికి చెందిన భవనాలను పరిరక్షించి, పునరుద్ధరించడానికే ఈ తీర్పు వచ్చిందని అన్నారు. మరమ్మతులు చాలు రూర్కీ ఐఐటీ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 70 శాతం మరమ్మతులతో భవనాలు సుస్థిరంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పునాదులను పరిరక్షించి, పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. పునరుద్ధరణ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా మైసూరు నగరపాలక సంస్థ (ఎంసీసీ), మైసూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎండీఏ)లకు ఆదేశించాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. 2024–25 బడ్జెట్లో దేవరాజ మార్కెట్ పునరుద్ధరణకు రూ.95 కోట్లు, లాన్స్డౌన్ భవనానికి రూ.35 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని చెప్పారు. అవి కట్టడాలు మాత్రమే కాదని, అవి మైసూరు సజీవ సాంస్కృతిక, వాణిజ్య వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. మైసూరు దేవరాజ మార్కెట్, లాన్స్డౌన్ భవనాల పునరుద్ధరణకు ఎంపీ డిమాండ్ -
మృత్యువుతో పోరాడి.. ఓడిన మంత్రి సుధాకర్
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదం సంభవించింది. ప్రణాళికా, గణాంక మంత్రి, చిత్రదుర్గ ఇన్చార్జి.. డి.సుధాకర్ (62) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. సుమారు నెల రోజుల నుంచి ఆయన శ్వాసకోశ జబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం తెలిసిందే. మొదట మోకాలి శస్త్ర చికిత్స కోసం యశవంతపురలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, శ్వాసకోస సమస్య మొదలైంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉంచి దేశ విదేశాల వైద్యనిపుణులు వైద్యం అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి ఆయన ప్రాణాలు విడిచారు. కుటుంబంతో పాటు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు విచారంలో మునిగిపోయారు. సుధాకర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెళ్లకెరె నుంచి ఎమ్మెల్యేగా చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెకు చెందిన సుధాకర్ పారిశ్రామికవేత్తగా ఉండేవారు. ఈయన చిన్నాన్న ఎస్.జయణ్ణ చెళ్లెకెర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయణ్ణ తరువాత సుధాకర్ రాజకీయ ప్రవేశం చేసి చెళ్లకెరె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజన తరువాత ఆయన హిరియూరు నుంచి 2008లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సత్తా చాటుకున్నారు. బీజేపీ యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతునిచ్చి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో హిరియూరు నుంచి కాంగ్రెస్ టికెట్తో గెలిచారు. తరువాత ఓటమి పాలైనా, 2023 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ మంత్రి పదవిని చేపట్టారు. జైన సముదాయానికి చెందిన సుధాకర్, అన్నివర్గాల ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. సోమవారం మధ్యాహ్నం తరువాత చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారమే హిరియూరుకు, ఆపై చెళ్లకెరెలోని స్వగృహానికి తీసుకెళ్లారు. ప్రముఖుల నివాళులు గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేపీ నేతలు యడియూరప్ప, ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి తదితరులు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. 3 రోజులు సంతాప దినాలు మంత్రి సుధాకర్ గౌరవార్థం ప్రభుత్వం ఆదివారం నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎలాంటి ప్రభుత్వ వేడుకలు జరగవు. చిత్రదుర్గ జిల్లాలో సోమవారం ప్రభుత్వ సెలవును ప్రకటించారు. పార్థివ దేహానికి సీఎం సిద్దరామయ్య నివాళులు ప్రమాణ స్వీకార వేడుకలో కుటుంబంతో మంత్రి సుధాకర్ (ఫైల్) నాకు సన్నిహితుడు డిప్యూటీ సీఎం తీవ్ర విచారం మంత్రి డి.సుధాకర్ అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కోసం పోరాడారు, ఆయన జ్ఞాపకార్థం ఆ పథకానికి సుధాకర్ పేరు పెట్టడం గురించి ఆలోచిస్తామని డీసీఎం శివకుమార్ తెలిపారు. ఇది చాలా దుఃఖకరమైన రోజు. నా సన్నిహిత మిత్రుడు, మంత్రి సుధాకర్ దూరమయ్యారు. గత ఒక నెల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స తరువాత శ్వాసకోశ వ్యాఽధికి గురయ్యారు. కోమాలోకి వెళ్లారు. ఈ మధ్య మళ్లీ కోలుకొన్నారు. ఆయన కోలుకుని వస్తారని విశ్వాసముండేది. విదేశాల నుంచి కూడా వైద్యులను పిలిపించి చికిత్స చేయించాం, కానీ ఆదివారం తెల్లవారజామున 3:15 గంటలకు తుదిశ్వాస విడిచారు అని డీసీఎం తెలిపారు. భారత జోడో యాత్రలో ఐదు రోజులు ఆయనే పర్యవేక్షించారు, మరణవార్తను రాహుల్గాంధీకి తెలిపాను అని చెప్పారు. -
రథోత్సవాల నేత్రపర్వం
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం సింగంద్రలోని చన్నకేశవ నగరలో చెన్నకేశవ జాతర వేడుకలు నిర్వహించారు. ఆదివారం మండుటెండలో అన్నమ్మ దేవి రథం, కబ్బాలమ్మ దేవి రథం, రేణుకా యల్లమ్మ దేవి రథం, వీరభద్రస్వామి రథాలను భక్తజనం లాగారు. మంగళవాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల మధ్య తేర్లు ముందుకు కదలగానే భక్తులు అరటిపండ్లు విసిరారు. కనువిందుగా కరగ కోలారు: తాలూకాలోని చిట్నహళ్లి గ్రామంలో శనివారం రాత్రి ధర్మరాయస్వామి కరగ ఉత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి కాకినత్త బాలరాజ్ దేవాలయం ముందు వేదికపై మేళతాళాలకు అనుగుణంగా కరగను మోస్తూ చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కరగ సంబరం సాగింది. అగ్నిగుండ ప్రవేశంతో ఉత్సవం ముగిసింది. వేలాది భక్తులు వీక్షించారు. దేవీరమ్మ తేరు సంబరంబొమ్మనహళ్లి: హాసన్ దగ్గర భువనహళ్లిలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే చారిత్రక దేవీరమ్మ జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శంభునాథ్ స్వామీజీ, కలెక్టర్ కె. లతాకుమారి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేవీరమ్మకు పూజలు రథోత్సవానికి నాంది పలికారు. భక్తులు దారి పొడవునా హారతి ఇస్తూ అమ్మవారిని స్వాగతించారు. పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో జాతర కిటకిటలాడింది. బ్యాంకు ఖాతాలో రూ.18 లక్షలు మాయంయశవంతపుర: చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 29 కేసులు నమోదయ్యాయి. మహిళల బ్యాంక్ ఖాతా నుంచి రూ.18.24 లక్షలు మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్ల మోసాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిక్కమగళూరు నగరానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలలో ఈ డబ్బులు పోయాయి. ఏపీకే, ఓటీపీ, లింక్లు ఏవీ ఆమె మొబైల్కు రాలేదు. అయినా బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం కావడం చూస్తే ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 21 వరకు వివిధ దినాలలో డబ్బులు డ్రా అయ్యాయి. బ్యాంక్ సిబ్బంది మీద అనుమానం వ్యక్తమవుతోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.లక్కుండిలో ప్రాచీన శిల లభ్యందొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లా చారిత్రక లక్కుండి గ్రామంలో శనివారంనాడు కుంబార బావిని శుభ్రం చేస్తుండగా 9 లేదా 10వ శతాబ్దం నాటి రాతి శిల లభించింది. అందులో మొదట యుద్ధం జరగడం, తరువాత యుద్ధంలో మరణించిన వీరున్ని అప్సరసలు స్వర్గానికి తీసికెళ్లే దృశ్యాలు, వీరుడు స్వర్గంలో సేదతీరుతున్న వైనం చెక్కి ఉన్నాయి. శిలపై సూర్య చంద్రులు, శివలింగం, శివలింగాన్ని యువతి పూజిస్తున్న బొమ్మలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్నినెలల కిందట లక్కుండిలో ఓ ఇంటిలో బంగారు నిధి లభించడం, తవ్వకాలలో ప్రాచీన విగ్రహాలు దొరకడం తెలిసిందే. -
వివాహ వార్షికోత్సవం వేళ.. విషాద హేల
తుమకూరు: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆనందంగా పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న దంపతులతో పాటు బంధువులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలో హైవే – 33లో హొన్నెనహళ్లి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మండ్య జిల్లాలోని స్వర్ణనగరకు చెందిన శుభ (60), కె.ఆర్. గాయత్రి (60), ఈమె భర్త కుమార్ నరసింహమూర్తి (65), కారు డ్రైవర్ రఘు కుమార్ (56) మృతులు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. గాయత్రీ, కుమార్ల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తుమకూరులోని దేవరాయనదుర్గలో ఉన్న యోగనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసుకుని కారులో సొంతూరికి వెళ్తున్నారు. ఘటనాస్థలంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీ వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఎగిరిపడిన కారు ఆ ధాటికి కారు దూరంగా ఎగిరిపడగా, నలుగురూ దుర్మరణం చెందారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు, కుణిగల్ పోలీసులు కారులోనుంచి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. ప్రమాద స్థలంలో హైవే, స్థానిక అధికారులు ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం దంపతులు, బంధువుల మృతి తుమకూరు జిల్లాలో ఘటన -
పిడుగు పాటుకు మూగజీవాలు బలి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఉప్పారగట్టి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటు కారణంగా 35 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల యజమాని ఉప్పార బీ.అజ్జప్పకు చెందిన 30 గొర్రెలు, గొల్లర పీ.సురేష్కు చెందిన ఐదు గొర్రెలు సాయంత్రం చెరువు సమీపంలో మేత మేస్తూండగా వర్షం ప్రారంభమై పిడుగు పడింది. చినుకుల నుంచి తప్పించుకునేందుకు చెట్టు కింద నిలబడి ఉన్న గొర్రెలపై పిడుగు పడింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఆర్.కవిత, విపత్తు నిర్వహణ శాఖ అధికారి డాక్టర్ సూరప్ప, పశుసంవర్ధక శాఖ అధికారులు శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రకృతి విలయం కారణంగా నష్టపోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భర్త ఇంటికే భార్య కన్నం
రాయచూరు రూరల్: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త ఇంటికే కన్నం వేసి నగలు చోరీ చేసుకుని ప్రియుడితో పారిపోడానికి సిద్ధమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హొసకోటెలో జరిగింది. భర్త దిల్షాన్ నదాఫ్, భార్య హసీనా నదాఫ్లకు రెండు నెలల క్రితం వివాహమైంది. హసీనా హనుమంతు అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లైనా కూడా ప్రేమికుడిని వదలడానికి ఇష్టం లేకపోవడంతో భర్త ఇంటిలో చోరీకి పాల్పడిన హసీనా 154.6 గ్రాముల బంగారు, 45 గ్రాముల వెండి ఆభరణాలను దొంగలించుకొని పరారైంది. ఈ విషయాన్ని భర్త దిల్షాన్ నదాఫ్ రామదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లో వారిద్దరిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఆభరణాల విలువ దాదాపు రూ.21 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హసీనా నదాఫ్ హనుమంతు బంగారు, వెండి ఆభరణాల చోరీ ప్రియుడితో కలిసి పరారీకి కుట్ర -
బీజేపీ బలగం మీరేనప్పా!
సాక్షి, బళ్లారి: దక్షిణ భారత దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన మహా నాయకుడు బీ.ఎస్ యడియూరప్ప, క్లర్క్ స్థాయి నుంచి పురసభ సభ్యునిగా రాజకీయ అరంగ్రేటం చేసి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తూ, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. శనివారం చిత్రదుర్గలో మాజీ సీఎం యడియూరప్ప 50 ఏళ్ల ప్రజాజీవితాన్ని పురస్కరించుకుని అభిమానోత్సవాన్ని నిర్వహించారు. అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు ఈ సభకు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరై ప్రసంగిస్తూ యడియూరప్పను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సైకిల్ ద్వారా గ్రామ గ్రామాన్ని చుట్టి ఎంతో శ్రమించారన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని, ఆయన రాజకీయాలు చేయలేదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల కోసం పని చేసిన వ్యక్తి అన్నారు. 2008లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడంతో దక్షిణ భారత దేశంలో బీజేపీ ప్రవేశానికి కారకుడయ్యారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రి పదవిని కూడా యడియూరప్ప తిరస్కరించారని అమిత్ షా తెలిపారు. కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్నారని, ఎంతో మంది స్వామీజీలు, జగద్గురువులు , లక్షలాది మంది జనం పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యంగా భావించిన నాయకుడని అన్నారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. రాజకీయాల్లో తాము ఒక్కరే ఎదగాలని అందరూ భావిస్తారని, అయితే యడియూరప్ప తన చుట్టు ఉన్న వారు, కార్యకర్తలను రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. యువ నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అసామాన్యుడు ● ప్రధాని మోదీ సందేశం ప్రజాజీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న యడియూరప్ప సామాన్య వ్యక్తిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, అసామాన్యుడుగా ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆయన జీవితం ప్రతి యువతకు ఆదర్శనీయమని అన్నారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ సమావేశానికి తాను పలు కారణాలతో హాజరు కాలేకపోయానని, అయితే తన మనస్సు అంతా ఇక్కడే ఉందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చదివి వినిపించారు. ఎన్నో ఏళ్లు యడియూరప్పతో కలిసి పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి పని చేశానని మోదీ చెప్పారు. పార్టీని పల్లె పల్లెకూ తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యడియూరప్పను నేతలు ఘనంగా సన్మానించారు. యడియూరప్పపై ప్రధాని మోదీ, అమిత్షా ప్రశంసల జల్లు చిత్రదుర్గంలో అట్టహాసంగా అభిమానోత్సవ వేడుక హాజరైన బీజేపీ ప్రముఖులు మీ రుణం తీర్చుకోలేనిది: యడ్డి సుదీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అటుపోట్లు, కష్టాలు, బాధలు అనుభవించానని, ప్రతి విజయంలోను తన వెంట అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నడవడం మరిచిపోలేనని, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని యడియూరప్ప పేర్కొన్నారు. ఆయన ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా ఇద్దరూ దేశాభివృద్ధికి బాటలు వేశారన్నారు. మోదీ అవతార పురుషుడని కొనియాడారు. మరో 10 ఏళ్ల పాటు మోదీనే దేశ ప్రధానిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు యడియూరప్ప సేవలను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు. -
ఆమెకు ఉరిశిక్షే సరి
శివమొగ్గ: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష్బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ప్రియునికి సైతం అదే శిక్ష భర్త హత్య కేసులో భద్రావతి కోర్టు తీర్పు -
నమో తిరుమలేశా
● చిక్క తిరుపతిలో విశేష పూజలు మాలూరు: ప్రసిద్ద యాత్రాస్థలం అయిన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకట రమణస్వామి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. వేసవి సెలవులు కావడంతో బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తజనం వచ్చారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్, కార్తీక్ల నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామి వారిని అలంకరించారు. గిగ్ కార్మికులకు సర్కారు వెబ్సైట్ బనశంకరి: డెలివరీ బాయ్స్ తదితర గిగ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో కార్మికుల తమ ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, సదరు కంపెనీలకు ప్రభుత్వం బదిలీచేసి పరిష్కారం కనుగొంటారు. ఈ పోర్టల్ కార్మికులు– కంపెనీల మధ్య వారధిగా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అనేక కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ కూడా అంతర్గత వివాదాల పరిష్కార కమిటీలను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు 12 లక్షల గిగ్ కార్మికుల వివరాలను పోర్టల్లో నమోదు చేశారని తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడం ద్వారా నకిలీల నమోదును తొలగిస్తున్నామని తెలిపారు. గుడికి వెళ్లివచ్చేలోగా ఇల్లు లూటీ మైసూరు: ఇంటి యజమాని లేని సమయంలో చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు రూ.2.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరు తాలూకా ఇలవాల సమీపంలో జరిగింది. ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేసే ప్రవీణ్కుమార్ వినాయక ఎన్క్లేవ్లో నివసిస్తుంటారు. ఇంటికి తాళం వేసుకుని ఒంటికొప్పలు సమీపంలోని గుడికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తెరిచి ఉండటం కనిపించింది. కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. ఇలవాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నదిలో అక్కా చెల్లి జలసమాధియశవంతపుర: ఈతకెళ్లిన బాలిక, యువతి నీటిపాలైన ఘటన దక్షిణకన్నడ జిల్లా కడబ తాలూకాలో జరిగింది. గుండ్యకు చెందిన నలుగురు అమ్మాయిలు స్థానిక నదిలో ఈత కొట్టాలని వెళ్లారు. లోతైన చోటుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయారు. వారిలో సునీత (21). అర్పిత (15)లు మునిగిపోగా, మిగతా ఇద్దరూ కేకలు వేశారు. దగ్గరలో ఉన్నవారు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఇద్దరి మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. వీరిద్దరూ అక్కా చెల్లెలని తెలిసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడబ పోలీసులు కేసు నమోదు చేశారు. పసికందును చంపిన వీధి కుక్క దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో వీధి కుక్కల దురాగతాలు అధికయ్యాయి. నిత్యం ఎక్కడో ఓ చోట జనంపై దాడులు చేస్తున్నాయి. బీదర్ జిల్లాలో ఘోరం జరిగింది. 5 నెలల పసికందుని వీధికుక్క బలితీసుకుంది. హుమ్నాబాద్ తాలూకా దుబలగుండి గ్రామంలో సిద్ధప్ప, సుధ దంపతుల కుమార్తె శివాని (5 నెలలు). శిశువు వారికి 4వ సంతానం. ఇంటి ఆవరణలో కుమార్తెను పడుకోబెట్టి తల్లి పని చేసుకుంటుండగా ఓ వీధి కుక్క చొరబడి చిన్నారిని తీవ్రంగా గాయపరిచింది. తల్లి కేకలు వేసి కుక్కను తరిమేసింది. చిన్నారిని బ్రిమ్స్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, కొంతసేపటికి పసికందు మరణించడంతో తల్లి బోరున విలపించింది. అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆ కుటుంబానికి సంతాపం తెలిపారు. -
అతివేగం.. తీవ్ర అపాయం
మండ్య: రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. మండ్య తాలూకాలోని పనకనహళ్లి సమీపంలో బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్ వేలో శుక్రవారం సాయంత్రం కారు బోల్తా పడటంతో తండ్రీకొడుకులు చనిపోయారు. తాలూకాలోని కచ్చిగెరె గ్రామానికి చెందిన కిరణ్ (40), కుమారుడు కిషోర్ (13) మృతులు. కుమార్తె కీర్తన (10) గాయపడగా, ఆమె మండ్య జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆల్టో కారులో పాండవపురలో ఓ పెళ్లికి వెళ్లిన ఈ ముగ్గురూ కచ్చిగెరె గ్రామానికి తిరిగి వస్తున్నారు. కిరణ్ కారు నడుపుతుండగా అతి వేగం వల్ల పనకనహళ్లి సమీపంలో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కారు ముక్కలు కావడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన తండ్రీ కొడుకులు ఇద్దరూ అక్కడే మరణించారు. మృతదేహాలను మండ్య మిమ్స్ ఆస్పత్రికి తరలించగా కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఎస్పీ వి.జె. శోభారాణి, ఏఎస్పీ తిమ్మయ్య పరిశీలించారు. ఎక్స్ప్రెస్ వేలో కారు పల్టీలు తండ్రీ కుమారుడు మృతి -
లోకాయుక్త పంజా
సీఐ వీరణ్ణ దొడ్డమని గ్రామ లెక్కాధికారి శివ కుమార్రాయచూరు రూరల్/హుబ్లీ: లోకాయుక్త అధికారులు శుక్రవారం పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి యాదగిరి, బీదర్ జిల్లాల్లో దాడులు చేశారు. యాదగిరి జిల్లా గురుమఠకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ వీరణ్ణ దొడ్డమని రూ.లక్ష లంచం తీసుకుంటుండగా లోకాయుక్త డీఎస్పీ జాకీర్ ఇనాందార్ పట్టుకున్నారు. గోపాలపురలో ఆనంద్ అనే వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఆ కేసులో నుంచి అతని పేరును తొలగించడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో బీదర్ జిల్లాలో ఓ డాబాలో లంచం తీసుకుంటున్న గ్రామ లెక్కాధికారిపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. మరకందిన్ని గ్రామ లెక్కాధికారి శివకుమార్ ఇంటి పత్రాలను మ్యుటేషన్ చేసి ఇచ్చేందుకోసం రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, మహదేవ్ శాంతప్ప నుంచి ముందస్తుగా రూ.2.50 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో లోకాయుక్త డీఎస్పీ హనుమంతరాయ, అధికారులు దాడి చేసి శివకుమార్తో పాటు అతనికి సహకరించిన శరణయ్యను అరెస్ట్ చేశారు. యాదగిరి, బీదర్ జిల్లాల్లో అధికారుల దాడులు వలలో చిక్కిన గురుమఠకల్ సీఐపై కేసు నమోదు -
నిర్వహణ లోపం.. లక్ష్యానికి శాపం
బళ్లారిఅర్బన్: నగరంలోని ఏడు ఇందిరా క్యాంటీన్లలో శుక్రవారం అల్పాహార పంపిణీ నిలిచి పోయింది. క్యాంటీన్ సిబ్బందికి పలు మాసాలుగా వేతనాలు చెల్లించక పోవడమే ఇందుకు కారణమని తెలిసింది. నగరంలోని మోతీ సర్కిల్, ఓపీడీ, ట్రామా కేర్ సెంటర్, బాపూజీ నగర్, జిల్లా ఆస్పత్రి, బెళగల్లు క్రాస్ ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేద ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక్కడ ఉదయం రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి రూ.10 కే భోజనం అందిస్తున్నారు. దీనికి అవసరమైన సబ్సిడీ మొత్తాన్ని స్థానిక సంస్థలు భరిస్తున్నాయి. నగరంలోని ఏడు క్యాంటీన్లలో ప్రతిరోజూ సుమారు 3 వేల మందికి పైగా ప్రజలకు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నగర పాలక సంస్థ విడుదల చేస్తోంది. 9 నెలలుగా అందని నిధులు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థకు గత తొమ్మిది నెలలుగా పాలక సంస్థ నుంచి నిధులు అందక పోవడంతో అక్కడ పని చేస్తున్న 50 మందికి పైగా సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని సమాచారం. దీంతో సిబ్బంది శుక్రవారం నుంచి అల్పాహారం, భోజనాల తయారీ, పంపిణీని నిలిపి వేయాలని నిర్ణయించారు. దీంతో ఉదయం నగరంలోని అన్ని ఇందిరా క్యాంటీన్లలో అల్పాహారం సరఫరా కాలేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో క్యాంటీన్ల నిర్వాహకులతో వెంటనే స్పందించి సిబ్బందికి బాకీ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నానికి వంటలు సిద్ధం చేసి భోజన సరఫరాను పునఃప్రారంభించారు. ఇంకా ఐదు నెలల బాకీ నిధులు విడుదల కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ హెగ్డే మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పడకూడదు. నగర పాలికె సకాలంలో నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. వేతనాల కోసం క్యాంటీన్ సిబ్బంది ధర్నా ఉదయం అల్పాహార పంపిణీ నిలిపివేత -
కాలువలు ఇలా.. నీరు పారేదెలా?
కవితాళ వద్ద కాలువ గట్టుపై పెరిగిన ముళ్ల కంపలు మమదాపుర వద్ద కాలువలో మొలిచిన పిచ్చిమొక్కలు గంగానగర క్యాంప్ వద్ద ధ్వంసమైన కాలువ గట్టు రాయచూరు రూరల్: గత కొన్నేళ్ల నుంచి వర్షాభావంతో జిల్లా ప్రజలు, రైతులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటుండగా, ఉన్న నీటి వనరులనైనా వినియోగించి రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ కింద ఆయకట్టు చివరి భూముల రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారైంది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాలువల నిండా పిచ్చిమొక్కలు పిచ్చి మొక్కలు, పూడికలతో కాలువలు పూడి పోయాయి. జిల్లాకు వర్షాభావం శాపమైతే, పాలకుల ఽశీత కన్ను ఎడమ కాలువ పాలిట శాపమైంది. జిల్లాకు వర ప్రసాదమైన ఎడమ కాలువకు ఆధునికీకరణ పేరుతో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతున్నా పనులు మాత్రం ఎక్కడా సక్రమంగా జరగడం లేదు. కాలువ మొదట్లో నీరు వదిలితే రెండు మూడు రోజులకే గండ్లు పడుతుండేవి. చివరి భూములకు నీరు అందడం గగనంగా మారేది. సెంటీమీటర్ ఎత్తున కూడా కాలువల్లో నీరు పారిన పాపాన పోలేదు. మరమ్మతు పనుల్లో నాణ్యత డొల్ల ఎడమ కాలువ మరమ్మతు పనులు నామ మాత్రానికే నాణ్యతకు అద్దం పడుతున్నాయి. కాలువల్లో పూడిక తీయించినట్లు, జంగిల్ కటింగ్ చేసినట్లు కాంట్రాక్టర్లు రికార్డులు చూపించి సొమ్ము స్వాహా చేస్తున్నారు. వీటంతటికీ ఉన్నతాధికారులు, నాయకుల అండదండలు ఉండడంతో తుంగభద్ర ఎడమ కాలువ కాంట్రాక్టర్లకు కామధేనుగా మారింది. 99వ డిస్ట్రిబ్యూటరీ నుంచి 102వ డిస్ట్రిబ్యూటరీ వరకు కాంట్రాక్టర్లు పీస్ వర్కుల పేరుతో పనుల కేటాయించుకుని పీస్ పనులకు రూ.90 వేలుగా నిర్ణయించారు. అధ్వానంగా ఉప కాలువలు గత మూడేళ్ల నుంచి తుంగభద్ర ఎడమ కాలువలో పూడిక పేరుకుంది. పిచ్చి మొక్కలు, ముళ్ల కంప చెట్లు మొలిచాయి. కాంగ్రెస్ సర్కార్ నిధులను పంచ గ్యారంటీలకు వినియోగించడంతో కాలువల పనులకు నిధులు లేకపోవడంతో ఉప కాలువలు అధ్వానంగా మారాయి. రాయచూరు జిల్లాలో సింధనూరు, మాన్వి, కవితాళ, సిరవార, రాయచూరు ప్రాంతాలకు సాగునీరు ప్రవహిస్తాయి. కొన్నేళ్లుగా వర్షాభావం, తీవ్ర దుర్భిక్ష పరిస్థితి రైతుల రక్షణపై సర్కార్కు కొరవడిన చిత్తశుద్ధి -
ఈడీ అదుపులో హ్యాకర్ శ్రీకృష్ణ
బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బిట్కాయిన్ కుంభకోణంలో బెంగళూరులో ఈడీ అధికారులు సూత్రధారి శ్రీకృష్ణతో పాటు ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ను హ్యాక్చేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని వీరిపై కేసు నడుస్తోంది. గతంలో సిట్ దర్యాప్తులో హ్యాకర్ శ్రీకృష్ణ చే అనేక డిజిటల్ వ్యాలెట్లు చోరీ అయినట్లు వెల్లడైంది. ఈ కేసుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్ను రెండుసార్లు సిట్ విచారించింది. ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరికొందరి పాత్రపై కూపీలాగుతున్నారు. భారీగా నగదు మార్పిడి ఏప్రిల్లో ఎమ్మెల్యే హ్యారిస్, నలపాడ్ నివాసాలలో ఈడీ అధికారులు రోజంతా సోదాలు చేపట్టడం తెలిసిందే. శ్రీకృష్ణ హ్యాక్ చేసిన బిట్కాయిన్లను క్రిప్టో ద్వారా నగదుగా మార్చుకుని పలువురికి బదిలీ చేసినట్లు అనుమానాలున్నాయి. శ్రీకృష్ణ ముంబైకి చెందిన వ్యక్తి ద్వారా నలపాడ్ అకౌంట్ కు రూ.10 లక్షలు జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.4.5 కోట్ల అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలో సిట్, ఇటీవల సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేశారు. దీంతో కొందరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. శ్రీకృష్ణ అరెస్ట్ బెంగళూరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బిట్కాయిన్ల దోపిడీ కేసుల్లో అరెస్టు మరికొందరి పాత్రపై కూపీ బెంగళూరులో కలకలం -
విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ
హొసపేటె: జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ.50 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మిస్తామని, రైతుల ఆకాంక్ష అయిన చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప పేర్కొన్నారు. హొసపేటె నగర శివార్లలోని నాగేనహళ్లిలో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో తరచుగా ఏర్పడుతున్న విద్యుత్ సరఫరా అంతరాయాలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రెండు పెద్ద సబ్స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాధికారి కార్యాలయ ప్రాంగణంలో పట్టణ ప్రాంత అవసరాలను తీర్చడానికి రూ.23.26 కోట్ల వ్యయంతో, నాగేనహళ్లిలో రూ.27 కోట్ల వ్యయంతో మరో సబ్స్టేషన్తో పాటు కొత్త పవర్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తారన్నారు. రాయరకెరె స్టేషన్ అప్గ్రేడ్ రాయరకెరెలోని పాత సబ్స్టేషన్ను 220 ఎంవీఏ సామర్థ్యానికి అప్గ్రేడ్ చేస్తున్నారన్నారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్ను అందిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు సెప్టెంబర్ 2027 నాటికి పూర్తయి ప్రజా సేవకు అందుబాటులోకి వస్తాయన్నారు. పనులు పూర్తయిన తర్వాత తోరణగల్లు, మునిరాబాద్ లైన్లపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. స్థానిక విద్యుత్ నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. దశాబ్దాలుగా మూతపడిన చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలన్న రైతుల ఆకాంక్షకు ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. తమిళనాడు నమూనాను అనుసరించి, ప్రైవేట్ భాగస్వామ్యంతో కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారన్నారు. దీని వల్ల రైతులకు చెరకుకు సరైన ధర లభించడమే కాకుండా, సకాలంలో పంట కోత ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని ఆయన అన్నారు. త్వరలో జిల్లా ఆస్పత్రి ప్రారంభం జిల్లా ఆస్పత్రి త్వరలో ప్రారంభం కానుందన్నారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన, అన్ని సౌకర్యాలతో కూడిన జిల్లా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కౌంట్డౌన్ ప్రారంభమైందన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాల సేకరణ, సిబ్బంది నియామక ప్రక్రియలు తుది దశలో ఉన్నాయన్నారు. ఈ అద్భుతమైన ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీకి సంబంధించిన సమాచారాన్ని రాబోయే 15– 20 రోజుల్లో తెలియజేస్తామని ఆయన అన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు సమితి అధ్యక్షుడు శివమూర్తి, జిల్లా ఎస్పీ జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్, జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, కేపీటీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్ఎం నటరాజ్, తహసీల్దార్ శృతి టీపీ ఈఓ ఆలం బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాం ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప హామీ -
సీహెచ్ పౌడర్ విక్రేత అరెస్ట్
రాయచూరు రూరల్: సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బసవరాజ్ వెల్లడించారు. నగరంలోని బోళమానుదొడ్డి శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో మారెప్ప(52) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 84 లీటర్ల సీహెచ్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు మహిళలకు బ్యాంక్ రుణాలురాయచూరు రూరల్: మహిళలకు, రైతులకు బ్యాంక్ నుంచి రుణాలిస్తామని ఢిల్లీకి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం దీప్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ప్రైవేట్ భవనంలో వ్యవసాయ మేళాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో స్వసహాయ మహిళా గుంపులకు ఈ ఏడాది రూ.6 కోట్ల మేర రుణాలిచ్చామన్నారు. రాష్ట్రంలో 240 ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రైతులు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశ్యంతో రుణాలిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుబ్లీ ఆర్ఎంఓ సూర్యమని సాహూ, అశోక్, షేక్ అస్రార్, రవీంద్ర నాథ్ సింగ్, విశాల్, శంకర్, ఆనంద్, బాలకృష్ణ, పద్మలున్నారు. కసాయిల బారి నుంచి రక్షించండి రాయచూరు రూరల్ : నగరంలోని పశువుల సంతలో విక్రయానికి తెచ్చిన పశువులను ఇతర చోటికి తరలించడానికి కసాయిలు ఇబ్బందులు కలిగిస్తున్నారని, వారి నుంచి రైతులను రక్షించాలని హిందూ మంచ్ ఏక్తా మైనార్టీ సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫైజల్ ఖాన్ మాట్లాడారు. జిల్లాలో ఖురేషి సమాజం వారు జంతువులను కొనుగోలు చేయడం, ఇతర సంతల్లో వాటిని విక్రయించడం పరిపాటి అని, దానిని ఆసరాగా చేసుకొని కసాయిలు వారిపై దాడి చేసి, పశువులను లాక్కొని తక్కువ ధరకు ఇవ్వాలని వేధించడం వంటి సంఘటనలు పునరావృతం కావడం వల్ల అలాంటి వారి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం సమర్పించారు. అభిమానోత్సవానికి బస్సుల మళ్లింపు● బస్టాండ్లో ప్రయాణికుల లబోదిబో హొసపేటె: నగరంలో శనివారం సరిగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తమ ఊర్లకు వెళ్లేందుకు బస్సులు లేక బస్టాండ్లో గంటల తరబడి వేచి ఉండి నానా ఇబ్బంది పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప 50 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో పొరుగు జిల్లా చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన అభిమానోత్సవానికి ఒప్పంద ప్రాతిపదికన బస్సులన్నీ మళ్లించగా, బస్సులు లేక గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నరకయాతన పడ్డారు. బస్టాండ్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ బస్టాండ్కు బస్సులు రాకపోవడం వల్ల సండూరు, కొప్పళ, కంప్లి, బళ్లారి, గంగావతి, కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి, హగడలి వంటి పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడ్డారు. నియామకంరాయచూరు రూరల్: రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారిగా మల్లికార్జునను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బడిగేరను గదగ్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారిగా పని చేస్తున్న మల్లికార్జునను నియమించారు. -
ఈజీపుర ఫ్లై ఓవర్ పనులకు మోక్షం
బనశంకరి: బెంగళూరు దక్షిణ పాలికె పరిధిలో కొన్నేళ్లుగా సాగుతున్న ఈజీపుర కేంద్రీయ సదన ఫ్లై ఓవర్ పనులు వేగవంతమయ్యాయి. ఈ వంతెన పొడవు 2.38 కిలోమీటర్లు కాగా, ఎన్నో ఏళ్లుగా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సెయింట్జాన్స్ ఆస్పత్రి వద్ద సంక్లిష్టమైన పోర్టల్ ఫ్రేమ్ పనులు నిలబడి పోగా, ఫిబ్రవరిలో వాటిని పరిష్కరించారు. ఇక్కడ భూస్వాధీనం పెండింగ్లో ఉండింది. ర్యాంప్స్ చివరి పనులను పూర్తిచేసి ఈ ఏడాదిలోగా ప్రజల సంచారానికి పచ్చజెండా ఊపే చాన్సుంది. కాంట్రాక్టర్లు మారుతూ.. 2017 మే 4వ తేదీన రూ.203 కోట్ల వ్యయంతో ఈజీపుర పై వంతెన పనులకు నాంది పలికారు. కానీ కాంట్రాక్టు సంస్థ అలసత్వం, వివిధ సమస్యల వల్ల పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా జరగడంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2022 మార్చిలో మరో సంస్థకు నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబరులోగా పూర్తిచేసి సంచారానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఈజీపుర పథకం చీఫ్ ఇంజనీర్ రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్టోబరులో ప్రారంభానికి సన్నాహాలు -
గౌరవ వేతనం విడుదల చేయరూ
హొసపేటె: గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఆశా కార్యకర్తల ప్రోత్సాహకం, నిర్ణీత గౌరవ వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలని ఏఐయూటీయూసీ అనుబంధ కర్ణాటక రాష్ట్ర యునైటెడ్ ఆశా వర్కర్స్ అసోసియేషన్ విజయనగర జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ విషయమై అసోసియేషన్ జిల్లా కమిటీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారికి వినతిపత్రాన్ని సమర్పించింది. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో నేటి రోజుల్లో జీవించడం కష్టంగా ఉందని అన్నారు. దానికి తోడు పాఠశాలలు, కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు మూడు నెలల పాటు జీతాలు లేకపోవడంతో ఆశా కార్యకర్తల జీవితం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని ఆయన అన్నారు. సమాజ ఆరోగ్యం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న యువ ఆశా కార్యకర్తలను ఇలా చూడటం తీవ్రంగా ఖండించదగిందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా జీతాల చెల్లింపును వాయిదా వేయడం సరైన చర్య కాదు. సమస్య ఏదైనా పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను, కొన్ని గౌరవాలను అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలాది మంది ఆశా కార్యకర్తలు ధర్నాలో దిగే పరిస్థితికి వస్తుందని తెలిపారు. సంఘం ముఖదర్దార్ నాగమ్మ మహేశ్వరి, నేత్రావతి, గౌరి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
లెనిన్ విగ్రహం ధ్వంసం తగదు
రాయచూరు రూరల్: పశ్చిమ బెంగాల్లో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తగదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు భీమయ్య మాట్లాడుతూ ముర్షిదాబాద్ జిల్లా జియగంజ జిల్లాలో కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తగదన్నారు. బీజేపీ గోముఖవ్యాఘ్రంగా మారడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస అధికమైందని, శాంతి స్థాపనకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. నకిలీ రూ.500 నోట్ల చెలామణి బెడద రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నకిలీ రూ.500 నోట్ల చెలామణి బెడద అధికమైంది. లింగసూగూరులో గత వారం రోజుల నుంచి వివిధ దుకాణాలు, అంగళ్లు, హోటళ్లలో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. లింగసూగూరులో చోటు చేసుకున్న నకిలీ రూ.500 నోట్ల చెలామణి అంశఽం మరింత చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం సిరవారలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా కొనసాగింది. యూనియన్ బ్యాంక్ బండిల్లో నకిలీ రూ.500 నోట్లు రావడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్లపై నంబర్, స్టిక్కర్, మహాత్మా గాంధీ చిత్రం, న్యూఢిల్లీ కోట చిత్రం మాదిరిగానే ఉంటుందనే భావనలో ప్రజలున్నారు. లింగసూగూరు, ిసిరవారల్లో నకిలీ నోట్ల చెలామణితో ప్రజలు సతమతమవుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం హొసపేటె: హంపీ చక్రతీర్థ సమీపంలోని కోటిలింగ వద్ద తుంగభద్ర నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభించింది. మత్స్యకారులు, పడవ నడిపేవారు పోలీసులకు సమాచారం అందించారు. అతని వద్ద లభించిన ఆధార్ కార్డులో పూజారి పంపపోతప్ప అని ఉంది. ఘటనపై హంపీ పర్యాటక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
సహజీవనంలో దారుణం
బనశంకరి: సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్లో పనిచేస్తూ ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. మహిళ వేధింపులకు యువకుడు బలి -
త్వరలోనే సీఎం కుర్చీ సమస్యకు తెర: మంత్రి ్చ
దొడ్డబళ్లాపురం: ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సీఎం కుర్చీ మార్పు, మంత్రివర్గ విస్తరణ రెండు సమస్యలు త్వరలో కొలిక్కి వస్తాయని మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. శనివారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్ అన్ని సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, లేదా అనేది త్వరలో తెలుస్తుందన్నారు. ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ గురించి ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ జరిగిందని, సర్పై దేశవ్యాప్తంగా గందరగోళం ఉందన్నారు. సర్ దుర్వినియోగాన్ని అరికట్టడం గురించి చర్చలు జరిగాయన్నారు. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. బెంగాల్లో మమత బెనర్జీ ఈ విషయం చర్చకు వచ్చిందన్నారు. తమిళనాడులో టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి తరువాత బలపరీక్షకు సమయం ఇవ్వాలన్నారు. -
ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు అరికట్టాలి
హొసపేటె: ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విరాళాలను నియంత్రించడానికి తక్షణమే జిల్లా విద్యా నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విరాళాలు సేకరించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో విద్యా సంస్థల అధిపతులు, విద్యాశాఖ అధిపతులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించే కేంద్ర చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన ప్రవేశ రుసుముల వివరాలను నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నిబంధనలకు మించి విరాళాలు స్వీకరించిన ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యా హక్కు చట్టం ప్రకారం జరిమానా విధించాలని పేర్కొన్నారు. అనధికారిక ట్యూషన్ సెంటర్లను మూసి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శారద, పవన్ కుమార్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జేఎంఎం పనుల్లో కొరవడిన నాణ్యత
కోలారు: జలజీవన్ మిషన్ (జేఎంఎం) పనులను నాణ్యత లేకుండా చేశారని తాలూకాలోని విట్టప్పనహళ్లి గ్రామస్తులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపిస్తూ గ్రామస్తులు రెండు రోజుల క్రితం పనులను పూర్తిగా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పనులను పరిశీలన చేయడానికి శుక్రవారం గ్రామానికి ఏఈఈ జబీవుల్లా, ఇంజినీర్ అరవింద్, కాంట్రాక్టర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా పనులలో జరిగిన లోపాలను గ్రామస్తులు అధికారులకు చూపించారు. పరిశీలన చేయకుండానే అంతా సక్రమంగా ఉందని క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణంలోను నాణ్యత కనపరచ లేదని ఆరోపించారు. ఏఈఈ పరిశీలన తమకు సంతృప్తిని కలిగించలేదని, ఉన్నతాధికారులు వచ్చి పరిశీలన చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండిపడిన గ్రామస్తులు -
లక్ష్య సాధనకు శ్రమించండి
రాయచూరు రూరల్: విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందని తహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. విద్యా రంగంలో రాయచూరు జిల్లా వెనుకబడిందనే ముద్రను చెరిపేందుకు కృషి చేశారని కొనియాడారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో విద్యాశాఖ, భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి ఉత్తీర్ణత, భవిష్యత్తు ప్రణాళిక అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనకు శ్రమించాలని తెలిపారు. విద్యార్థులు పది తరువాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీపీఈఓ చంద్రశేఖర్, బీఈఓ ఈరణ్ణ కోస్గి, హపీజుల్లా మోయిన్ హుల్ హక్, రమేష్, అమరే గౌడ, ప్రశాంత్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో జిల్లాభివృద్ధి రాయచూరు రూరల్: అందరి సహకారంతో జిల్లాభివృద్ధి సాధ్యం అని నూతన జిల్లా అధికారి పూవిత తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా అధికారి నితీష్కు వీడ్కోలు పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధికారి పూవిత మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకోవడం అధికారుల బాధ్యత అన్నారు. సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధమని వెల్లడించారు. జిల్లా అధికారి నితీష్ ప్రసంగిస్తూ.. రాయచూరు జిల్లాలో విధులు నిర్వహిస్తే దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చని తెలిపారు. ఎయిర్పోర్టు, జాతీయ రహదారి, ఇతర పనులకు ఇచ్చిన సహకారం భవిష్యత్తులో నూతన అధికారికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఈశ్వర్ కుమార్ చందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, అదనపు జిల్లా అధికారి శివానంద, ఏసీ హంపణ్ణ, డీహెచ్ఓ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. లోకాయుక్త దాడులు హుబ్లీ: ఈ–స్వత్తు, ల్యాండ్ రికార్డుల బదిలీ తదితర రికార్డులను తయారు చేసి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో లోకాయుక్త అధికారులు శుక్రవారం ఉదయం హుబ్లీ–ధార్వాడ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయాలపై దాడి చేశారు. లోకాయుక్త జిల్లా ఎస్పీ సిద్దలింగప్ప ఎస్టీ నేతృత్వంలో పాలికె పరిధిలో 12 డివిజన్ కార్యాలయాలు ఉండగా.. ఏకకాలంలో దాడి చేసి రికార్డులు పరిశీలించారు. ఈ–స్వత్తు ఆరోపణలపై విచారిస్తున్నారు. లంచం ఇస్తే కాని అధికారులు పనులు చేయడం లేదని.. అనవసరంగా సాకులు చూపి జాప్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా అధికారులు రికార్డులను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మైనర్పై గ్రూప్–డి ఉద్యోగి లైంగిక దాడిహొసపేటె: స్థానిక సబ్ డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్–డి ఉద్యోగి.. మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై నగరంలోని ఎక్సటెన్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు.. హొసపేటె సబ్ డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అజయ్ అనే వ్యక్తి గ్రూప్–డి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఓ 16 ఏళ్ల బాలిక తన తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు అజయ్ ఆ బాలికతో మాటలు కలిపాడు. మాయమాటలు చెప్పి ఆస్పత్రి ప్రాంగణంలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికకు ఇచ్చిన జ్యూస్లో మత్తు మందు కలిపి లైంగికంగా వేధించాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన బరంగామ్ పోలీసులు.. నిందితుడు అజయ్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.కార్మికుడు ఆత్మహత్య హోసూరు: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన బిహార్ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన మిదిలేష్ మండల్ (43) కుటుంబంతో కలిసి బాగలూరు సమీపంలోని చొక్కనాథపురం గ్రామంలో నివాసముంటూ కూలి పనులు చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. నెల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
కేజీఎఫ్: ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు బృందం శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి దాదాపు 130 కిలోల ప్లాస్టిక్ను సీజ్ చేశారు. నగరసభ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్లాస్టిక్తో వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలన్నారు ప్లాస్టిక్ కనిపిస్తే దుకాణం లెసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. కౌశల్యాలను పెంపొందించుకోవాలి కోలారు: ఇంజినీర్లు సామాజిక సమస్యలకు స్పందించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. నగర సమీపంలోని సి భైరేగౌడ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంల ఆయన పాల్గొని విద్యార్థులకు పదవీ ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే కౌశల్యాలను విద్యార్థులు అలవర్చుకోవాలలన్నారు. కళాశాల కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఈశ్వర్, డాక్టర్ అప్రమేయన్ పాల్గొన్నారు. -
స్ట్రీట్ఫుడ్ హబ్ ఏర్పాటుకు చర్యలు
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హంపీలో పర్యాటకులు, స్థానికులకు ఒకే చోట వివిధ రకాల నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు పీఎం స్వనిధి పథకం కింద అత్యాధునిక స్ట్రీట్ఫుడ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. హంపీకి వచ్చే వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులకు ఒకే చోట పరిశుభ్రమైన, వైవిధ్యమైన ఆహారాన్ని అందించడమే ఈ ఫుడ్ హబ్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇది స్థానిక వీధి వ్యాపారులకు ఆర్థిక సాధికారత కల్పించి, హంపీ పర్యాటక రంగానికి కొత్త రూపు తీసుకొస్తుందన్నారు. చాముండి హిల్స్, బేలూరు–హలేబిడు, గంగాపూర్, పట్టడకల్లు, హంపీతో సహా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో స్ట్రీట్ఫుడ్ హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో మన హంపీ కూడా చేర్చబడటం గర్వకారణమని తెలిపారు. ఈ స్ట్రీట్ ఫుడ్హబ్ ఏర్పాటు చేయడానికి రూ.4 కోట్ల వ్యయంతో ఒక తాత్కాలిక దుకాణాన్ని ఏర్పాటు చేసి వ్యాపారం నడపడానికి ఒక క్లస్టర్కు అనుమతి ఇవ్వబడుతుందన్నారు. పెద్ద మర్రిచెట్టుకు ఎదురుగా, హంపీ పార్కింగ్ స్థలానికి సమీపంలో ఉన్న గుత్తిలాండ్తో సహా రెండు ప్రదేశాలను ఇప్పటికే గుర్తించి, భూ కేటాయింపు కోసం ప్రతిపాదన సమర్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, హంపీ అభివృద్ధి అథారిటీ కమిషనర్ రమేష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ జిల్లా ప్రచార నిర్వాహకుడు దేవరాజ్ పాల్గొన్నారు. -
ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో ఇంటెలిజెన్స్లో ఎస్ఐగా పని చేస్తున్న వీరేశ్పై సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్ఐ వీరేశ్ తనపై కొప్పళలో అత్యాచారం చేసి వేధించాడని మహిళా కానిస్టేబుల్ విజయశ్రీ ఫిర్యాదు చేసింది. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు తెలియజేసింది. అయితే ప్రేమ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఎస్ఐ వీరేశ్ ఆరోపిస్తున్నారు. తాను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఇప్పటికే రాయచూరు ఎస్పీ అరుణాంగ్శు గిరికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఎస్ఐ వీరేశ్.. తనపై అత్యాచారం చేశారంటూ మహిళా కానిస్టేబుల్ విజయశ్రీ ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. జిల్లా పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ బళ్లారి అర్బన్: ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు గీతా సేవి సంస్కార, వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత శుద్ధ జల చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవళె, జడెప్ప మాట్లాడుతూ.. సేవయే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మే 25వ తేదీ వరకు రోజూ నిరంతరాయంగా శుద్ధ జల, మజ్జిగ పంపిణీ కొనసాగుతుందన్నారు. తొలి రోజు సుమారు 250 మందికి పైగా ప్రజలు చల్లని మజ్జిగను సేవించి దాహాన్ని తీర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఎండ తీవ్రతను బట్టి మరిన్ని ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేపట్టాలని ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు. చిన్నారి ఆచూకీ లభ్యం యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కెళగూరు గ్రామంలో కాఫీతోటలలో అదృశ్యమైన ఏడాదన్నర చిన్నారి అచూకీ లభించింది. రాత్రి కురుస్తున్న వానలో కాఫీచెట్ల కింద చిన్నారి చలిలో వణుకుతుండగా పోలీసులు రక్షించి తల్లీదండ్రులకు అప్పగించారు. మధ్యప్రదేశ్ నుంచి గోను, సోను దంపతులు పొట్టకూటి కోసం వలసవచ్చారు. ఐదు మంది పిల్లలను చూసుకోవటానికి ఒక మహిళను నియమించి పనులకు వెళ్లారు. ఓ చిన్నారి ఏడవటంతో కాపలా ఉన్న మహిళ మరికొందరు చిన్నారులను తోడుగా ఇచ్చి కాఫీతోటలోకి పంపింది. ఆ చిన్నారులు అక్కడే నిద్రపోయారు. శివం అనే చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా 12 గంటల పాటు గాలించారు. కాఫీతోట చివరి భాగంలో చిన్నారి నిద్రిస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల పాటు వానలు యశవంతపుర: మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావారణశాఖ మంచి వార్తనిచ్చింది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల పరిధిలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒళనాడు జిల్లాల్ల భారీగా రుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర ఒళనాడు ధారవాడ, హవేరి, గదగ్, దక్షణ ఒళనాడు చిక్కమగళూరు, మైసూరు, కొడగు, మలెనాడు శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరావళి కర్ణాటక దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. -
అడుగంటిన తుంగభద్ర
హొసపేటె: కళ్యాణ కర్ణాటకలోని కొన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. మొత్తం 105 టీఎంసీల గరిష్ట నీటిమట్టానికి గాను ప్రస్తుత నీటిమట్టం కేవలం 10 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. దీంతో బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందనే భయాందోళనలు ప్రజల్లో పెరిగాయి. తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో రాబోయే వర్షాకాలం వరకు అందుబాటులో ఉన్న కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా కేటాయించడం తుంగభద్ర బోర్డుకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లోని ప్రధాన చెరువులను కాలువల ద్వారా నీటిని మళ్లించి నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మే నెలలో వేసవి కాలంలో అధిక ఎండల కారణంగా జూన్లో వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడం అధికారులకు కష్టంగా మారుతోంది. కొత్త క్రస్ట్గేట్ల అమరిక పనులు పూర్తి మరోవైపు జలాశయం భద్రత కోసం చేపట్టిన ఒక ముఖ్యమైన సాంకేతిక కార్యాచరణ విజయవంతంగా పూర్తయింది. జలాశయానికి చెందిన 33 కొత్త క్రస్ట్గేట్ల అమరిక పనులు సుమారు రూ.54 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. ఇక రాబోయే 50 ఏళ్ల పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా క్రస్ట్గేట్లు పని చేస్తాయని నిపుణులు హామీ ఇచ్చారు. కొత్తగా అమర్చిన ఈ గేట్లను ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఈనెల 15న డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేయడం ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. డ్యాంలో గణనీయంగా తగ్గిన నీటిమట్టం ప్రస్తుత నీటి నిల్వ కేవలం 10 టీఎంసీలే ప్రజల్లో తాగునీటి ఎద్దడి భయాందోళన -
నేడు యడ్డి అభిమానోత్సవం.. చిత్రదుర్గ కాషాయమయం
చిత్రదుర్గకు శుక్రవారం వచ్చిన మాజీ సీఎం యడియూరప్పకు ఘనస్వాగతం దృశ్యంచిత్రదుర్గలో పార్టీ జెండాలు, బంటింగ్లతో జాతీయ రహదారి కాషాయమయమైన దృశ్యం బనశంకరి: మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అభిమానోత్సవం సందర్భంగా కోటెనాడు చిత్రదుర్గ పూర్తిగా కాషాయమయంగా మారింది. చిత్రదుర్గలోని రోడ్లు బంటింగ్స్, కటౌట్లతో నిండిపోయాయి. శనివారం నిర్వహించే ఉత్సవానికి స్వాగతం కోరుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. చారిత్రక నగరంలోని ప్రముఖ స్మారకాలు, వీధులు, సర్కిళ్లలో ప్రత్యేక అలంకరణ చేశారు. జాతీయ రహదారి–48లో 6 కి.మీ. వరకు కాషాయం బంటింగ్స్, అభిమానోత్సవ జెండాలు అమర్చారు. రాష్ట్ర నలు మూలల నుంచి విచ్చేసే లక్షలాది మందికి 10 చోట్లకు పైగా పార్కింగ్ వ్యవస్థ కల్పించారు. మాదార చెన్నయ్య గురుపీఠం పక్కన గల విశాలమైన మైదానంలో అభిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గత మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 10 లక్షల మందికి భోజనం కోటెనాడు చిత్రదుర్గలో శనివారం నిర్వహించే మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే లక్షలాది మంది అభిమానులకు సుమారు 500 మంది వంటవారితో వివిధ రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. 10 లక్షల మందికి టిఫిన్, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. భోజనం, నీటి కొరత లేకుండా చూసే బాధ్యత బెంగళూరు ఎమ్మెల్యేలకు అప్పగించారు. 120 మంది స్వయం సేవకులు, ఇద్దరు ఎమ్మెల్యేలు భోజనం కౌంటర్ల వద్ద ఉంటారు. -
దోపిడీ దొంగల అరెస్టు
కోలారు: ముళబాగిలు తాలూకాలో గత నెల 7న జరిగిన దోపిడీకి సంబంధించి ముళబాగిలు నగరానికి చెందిన టిప్పు సుల్తాన్ (28), సాదిక్ బాషా (30), తౌహీద్ ఖాన్ (26) అనే దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థల గ్రామీణాభివృధ్ది సంస్థ ప్రతినిధి శశికళ బ్యాంకులో వారపు కంతులు కట్టడానికి కార్యాలయం నుంచి వెళ్తుండగా కాపు కాచిన నిందితులు ఆమె కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి రూ. 5.90 లక్షలు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి నిప్పంటించి నగదు, నగలు చోరీ కోలారు: దుండగులు ఓ ఇంటికి నిప్పు అంటించి లక్షల రూపాయల విలువచేసే ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఈఘటన తాలూకాలోని మల్లసంద్ర గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శారదమ్మ వద్ద టీ అంగడి నిర్వహిస్తోంది. గురువారం రాత్రి ఆమె ఇంటిలో లేని సమయంలో దొంగలు చొరబడి లాకర్ పగుల గొట్టి నగలు, నగదు దోచుకున్నారు. ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఇంటికి నిప్పంటించి వెళ్లారు. దీంతో వస్తు సామగ్రి కాలి బూడిదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వేమగల్ పోలీసులు వచ్చి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. -
పైన కోళ్ల దాణా.. లోపల గంజాయి
● రూ. 1.25 కోట్ల విలువైన సరుకు స్వాధీనం ● ఇద్దరు బిహార్వాసుల అరెస్ట్ బొమ్మనహళ్లి: సంచుల్లో కోళ్లదాణ నింపి దాని మధ్యలో గంజాయి ఉంచి లారీలో సరఫరా చేస్తుండగా బెంగళూరు జిగణి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి గుట్టు రట్టు చేశారు. కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై పక్కా సమాచారంతో ఆనేకల్ తాలూకా బేగూర్ మెయిన్ రోడ్డులోని కొప్ప సమీపంలో పోలీసులు కాపుగాశారు. ఆ సమయంలో వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా కోళ్ల దాణ సంచుల్లో 250 కిలోల గంజాయి బయట పడింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని బిహార్కు చెందిన రామాయణ్ యాదవ్ (56) సబీర్ ఖాన్ (51)ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా గంజాయి రవాణా ఘటనలో వినోద్ సింగ్, బాబు అనే స్మగ్లర్లు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. జిగణి పోలీసుల పనితీరును బెంగళూరు రూరల్ ఎస్పీ పి. చంద్రకాంత్ అభినందించారు. వైద్యుడు బలవన్మరణం● మనస్తాపంతో నర్స్ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ఒకే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్స్ రెండు రోజుల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలోని మహదేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చేతన్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న సరస్వతి(45) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఈ ఆస్పత్రిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. డాక్టర్ మృతిని తట్టుకోలేక సరస్వతి మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వడదెబ్బకు చిరు వ్యాపారి మృతిదొడ్డబళ్లాపురం: వడదెబ్బకు చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఉగారఖుర్ద పట్టణంలో శుక్రవారం జరిగింది. వర్ధమాన్ అనే వ్యాపారి వారపు సంతలో వ్యాపారం చేస్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా వడదెబ్బకు మృతిచెందినట్టు వైద్యులు తేల్చారు. కాగవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.బన్నేర్ఘట్ట జూ పార్కులో జిరాఫీ మృతి బొమ్మనహళ్లి: బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్లో ’శివాని’ అనే ఆడ జిరాఫీ మృతి చెందింది. మూడు సంవత్సరాల పది నెలల వయసున్న ఈ జిరాఫీ కొన్ని రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వారం రోజులుగా పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స ఫలించక గురువారం సాయంత్రం మరణించినట్లు అధికారులు తెలిపారు. ‘సీకల్ టార్షన్‘ అనే సమస్యతో ఇది బాధపడుతున్నట్లు తెలిపారు. పేగులు మెలిపడటం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో ఇది మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్మార్టం పరీక్ష అనంతరం అంతర్గత అవయవాల నమూనాలను తదుపరి పరీక్షల కోసం హెబ్బాల్లోని ప్రయోగశాలకు పంపినట్లు తెలిసింది. శివానిని 2024 ఫిబ్రవరిలో మైసూరులోని చామరాజేంద్ర జూ నుంచి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్కుకు తీసుకువచ్చారు. జిరాఫీ మృతితో జంతు ప్రేమికులలో విషాదం నెలకొంది. -
జూన్ 1 నుంచి హెల్మెట్ వాడాల్సిందే
సాక్షి, బళ్లారి: నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం హెల్మెట్ వాడకపోవడమే అని జిల్లా ఎస్పీ సుమన్ డి.పెన్నేకర్ తెలిపారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలకు గురై దాదాపు 450 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ పెట్టుకుని వాహనాలను నడపాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తారన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. వైద్యులు కూడా హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తారన్నారు. ప్రాణం అమూల్యమైనదని.. పోయిన ప్రాణం తిరిగి రాదని తెలిపారు. కుటుంబ సభ్యుల కోసం మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల్లోపు వారు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 18 ఏళ్లలోపు వారు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానా జిల్లా ఎస్పీ సుమన్ డి.పెన్నేకర్ -
జీబీఏ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
బనశంకరి: సుప్రీంకోర్టు సూచన మేరకు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికెలకు జూన్ 14 నుంచి 24లోగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి కాగా ఈ అవధిలో పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జీఏ.సంగ్రేశి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఐదు నగర పాలికెల కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల తేదీ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని, తేదీ కూడా ఒక వారంలోగా నిర్ణయిస్తామన్నారు. జీబీఏ ఆధ్వర్యంలో ఎన్నికలు కొద్దిగా వాయిదా వేయాలని మనవి అందినప్పటికీ జూన్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు. జూన్ 24లోగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించామన్నారు. ఏ తేదీన పోలింగ్ నిర్వహించాలి అనే విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. జీబీఏ ఏ సమస్య తెలిపినప్పటికీ నిర్ణీత అవధిలోగా ఎన్నికలు నిర్వహించడం అనివార్యమన్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అనంతరం జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్ మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే వార్డుల విభజన, రిజర్వేషన్, ఓటర్ల తుదిజాబితా సిద్ధమైందన్నారు. జూన్ 14 నుంచి 24 లోగా ఎన్నికలు వారంలో పోలింగ్ తేదీని ప్రకటిస్తాం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేశి -
చెరువు ఆక్రమణలపై నివేదిక తర్వాత చర్యలు
బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికె పరిధిలోని సారక్కి చెరువు స్థలంలో భారీ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ శాఖ ఇటీవల నిర్వహించిన సమీక్ష నివేదికలో వెల్లడైంది. సారక్కి చెరువు పరిధిలో మొత్తం 58 ఆక్రమణలు వెలుగుచూడగా బఫర్ జోన్లో అనధికారిక కట్టడాలు నిర్మించారు. దక్షిణ నగర పాలికె, భూరికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన సర్వేలో ఇళ్లు, వాణిజ్య కట్టడాలు, ఒక దేవస్థానంతో పాటు అనేక ఆక్రమణలు గుర్తించారు. ఆక్రమణ ఆస్తులపై మార్కింగ్ వేసి చెరువు సరిహద్దులను గుర్తించారు. బలమురి ప్రసన్న మహాగణపతి దేవస్థానంలో ఒక భాగం ఆక్రమణకు గురైందని అధికారులు తెలిపారు. ఈ నివేదికను హైకోర్టుకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆక్రమణలు తొలగించే అవకాశం ఉంది. జీబీఏ చెరువు అభివృద్ధి శాఖ అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ అంతిమ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు: ఇద్దరు మృతి
● దావణగెరె జిల్లాలో ఘోరం సాక్షి బళ్లారి: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం దావణగెరి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాకు చెందిన గౌతమ్ (29), మనోజ్ (29) మృతులు. వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. రెండు కార్లు వేగంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రక్షకుడే భక్షకుడై..
సాక్షి బళ్లారి: జిల్లాలో సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగా, ఎస్పీ వద్ద పని చేసే గన్మెన్ దేవరాజు కంచే చేను మేసిన చందంగా అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్కు బాధితుడు తెలిపిన నేపథ్యంలో సీరియస్గా తీసుకొన్న ఆమె దర్యాప్తు చేయించి నిజం అని తేలడంతో తన గన్మెన్ దేవరాజును సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయించారు. ఈ విషయంపై శుక్రవారం జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన గన్మెన్ దేవరాజు, అతని స్నేహితుడు గతనెల 27న అక్రమ బియ్యం రవాణా చేసే శరభయ్య అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సమగ్రంగా తనిఖీ చేశామన్నారు. రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసి.. రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు తరలిస్తుండగా అడ్డుకొని ఎస్పీ స్క్వాడ్ అని బెదిరించి వారి దగ్గర నుంచి ముందుగా రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. చివరకు రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకుని సొమ్ము వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. దేవరాజుకు సహకారం అందించిన లాయర్ గాదిలింగ పరారీలో ఉన్నాడని, మరో వ్యక్తి సాయిరాంను అరెస్టు చేశామన్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్, కారును కూడా సీజ్ చేశామన్నారు. ఎస్పీ స్క్వాడ్, ఐజీ స్క్వాడ్ అనే ప్రత్యేక బృందాలు లేవని స్పష్టం చేశారు. స్క్వాడ్ పేరు చెప్పి పోలీసులు ఎవరైనా ఇలాంటి కృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సు పల్టీ–విద్యార్థి మృతి ● 50 మందికిపైగా ప్రయాణికులకు గాయాలుదొడ్డబళ్లాపురం: యాక్సిల్ కట్ కావడంతో కేఎస్ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి విద్యార్థి మృతి చెందగా 50మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మరబనహళ్లి వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 9–30 గంటల సమయంలో దావణగెరె నుంచి బసవాపట్టణకు బయలుదేరిన బస్సు చెన్నగిరి తాలూకా మరబనహళ్లి వద్దకు రాగానే యాక్సెల్ కట్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదంలో దర్శన్ అనే కళాశాల విద్యార్థి మృతిచెందగా 50మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బసవాపట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దావణగెరె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. సుప్రీంకోర్టులో రాజేగౌడ సవాల్ ● శృంగేరి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదం ● హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పైకోర్టును ఆశ్రయించిన వైనం దొడ్డబళ్లాపురం: శృంగేరి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పరాజిత అభ్యర్థి టీడీ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రీకౌంటింగ్కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ రాజేగౌడ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అప్పట్లో ఓడిన అభ్యర్థి డీఎన్ జీవరాజ్ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు తిరస్కరించిన 279 ఓట్లను మళ్లీ లెక్కించాలని, వాటిలో లోపాలు లేకుంటే వాటిని ఓట్లుగా పరిగణించాలని ఆదేశాలిచ్చింది. దీంతో తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా డీఎన్ జీవరాజ్ ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి గండం రావడంతో రాజేగౌడ ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్వరలో తమిళనాడు రాజకీయ సమస్య పరిష్కారం యశవంతపుర: తమిళనాడులో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు రెండు రోజుల్లో సమిసిపోయే అవకాశం ఉన్నట్లు కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం హాసన జిల్లా మావినకెరె రంగనాథస్వామి కొండలో దేవుడిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని కాదని ఏఐఏడిఎంకే, డీఎంకేలు కలిసి పొత్తు ఏర్పరచుకుని అధికారంలో వస్తారని తాను అనుకోవటం లేదని అభిప్రాయ పడ్డారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ సలహాలు తీసుకుని ప్రభుత్వ రచనకు చర్యలు తీసుకుంటారన్నారు. బియ్యం అక్రమ రవాణాపై ఎస్పీ గన్మెన్ దౌర్జన్యం రూ.3 లక్షలు లంచం తీసుకొన్నట్లు వెలుగులోకి గన్మెన్ దేవరాజును సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ ఈ కేసులో గన్మెన్తో పాటు మరొకరు అరెస్టు -
తాగునీటి సమస్య తలెత్తకూడదు
హొసపేటె: జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నిరంతరాయంగా నీరు సరఫరా చేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా తెలిపారు. శుక్రవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 153 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు. హరపనహళ్లి తాలూకాలో 24, హగరిబొమ్మనహళ్లిలో 5, హడగలి తాలూకాలో 3 గ్రామాలతో సహా మొత్తం 32 గ్రామాల్లో ఇప్పటికే నీటి సమస్య ఉందని వెల్లడించారు. గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి 41 ప్రైవేట్ బోర్వెల్స్ను అద్దెకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖకు చెందిన 4 నీటి ట్యాంకర్లను కూడా ఉపయోగించవచ్చని సూచించారు. జిల్లాలోని 666 శుభ్రమైన తాగునీటి యూనిట్లను నిరంతరం పరిశీలించాలన్నారు. ఏదైనా సాంకేతిక లోపం కనబడితే వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. నీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి, తక్షణ పరిష్కారం కోసం జిల్లా తాలూకా స్థాయిల్లో 24 గీ7 కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ను ప్రారంభించారు. తాగునీటి సమస్యపై 9480837823 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా -
గని బాధితుల కోసం భారీ ప్రాజెక్టు
హొసపేటె: గనుల ప్రభావిత ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అక్కడి నివాసితుల పునరావాసం కోసం కర్ణాటక గనులు, పర్యావరణ పునరావాస సంస్థ అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ.1,146 కోట్ల వ్యయంతో అన్ని ప్రాథమిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక గృహ వసతి సౌకర్యాన్ని కల్పిస్తోందని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. కర్ణాటక మైన్స్ ఎన్విరాన్మెంటల్ రిహాబిలిటేషన్ కార్పొరేషన్ పథకం కింద గనుల ప్రభావిత ప్రాంతాల పునరావాస ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనదన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యాన్ని, సమన్వయ లోపాన్ని సహించబోమని ఆమె అధికారులకు సూచించారు. నివాస సముదాయాల నిర్మాణ సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం పాటించాలన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలి పనులను నాణ్యతగా చేపట్టాలని, ప్రతి దశలోనూ తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీరు, మురుగునీరు, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. 1183 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లొసుగులు ఉండకూడదు. అర్హులైన గని బాధిత కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలన్నారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని కూడా ఈ పథకం నుంచి మినహాయించకూడదని ఆమె కట్టుదిట్టమైన ఆదేశాలిచ్చారు. నిర్ణీత కాలమితిలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, సబ్ డిజిజనల్ అధికారి వివేక్, తహసీల్దార్ శృతి, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. 1183 కుటుంబాలకు అత్యాధునిక గృహ వసతి విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి -
ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టరూ
రాయచూరు రూరల్: ఖాళీగా ఉన్న 52,432 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు చెన్నబసవ మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ధార్వాడ, కలబుర్గి, బాగల్కోటెల్లో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నియామకాలకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ముందుకు రావాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. కొప్పళలో లవ్ జిహాద్● యువకుడిపై దాడి ● 8 మంది నిందితుల అరెస్ట్ సాక్షి, బళ్లారి: కొప్పళలో లవ్ జిహాద్ ఘటనలు ఆగడం లేదు. ఈనేపథ్యంలో కొప్పళలో ముస్లిం యువకుడు సమీర్పై 8 మంది హిందూ యువకులు దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ముస్లిం యువకుడి మొబైల్లో పలువురు హిందూ యువతులతో ఉన్న ఫోటోలు, వీడియోలు లభించాయని విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కొప్పళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని యువకుడిపై దాడి చేయడం సరికాదని సూచించారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికబళ్లారిటౌన్: ట్రెడిషనల్ షూటోఖాన్ కరాటే అకాడమి, కర్ణాటక జిందాల్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికై నట్లు కరాటే అకాడమి శిక్షకుడు కట్టెస్వామి తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో అసోంలోని గౌహతిలో జరగనున్న 24వ అఖిల భారత కరాటే పోటీల్లో పాల్గొనేందుకు 10 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు నలుగురు శిక్షకులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కరాటే శిక్షకులు సుభాష్ చంద్ర, జడేష్ హులుగన్న, బీ.నాగరాజు, హనుమంత ప్రసాద్, నబీసాబ్, ఆనంద్, జిందాల్ అధికారులు అభినందించారు. ప్రాచీన కళలపై ప్రోత్సాహం అవసరం బళ్లారి రూరల్: తోలుబొమ్మలాట, జానపద నాటకాలు తదితర ప్రాచీన కళలపై పిల్లలను ప్రోత్సహించాలని శ్రీధరగడ్డ జగద్గురు కొట్టూరు మఠం సంస్థానాధిపతి మరి కొట్టూరు తెలిపారు. బుధవారం శ్రీధరగడ్డ బసవేశ్వర ఆలయ ఆవరణలో ఎర్రిస్వామి తోలుబొమ్మల కళా ట్రస్టు, బళ్లారి కన్నడ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కన్నడ సాహిత్య పరిషత్తు ఉత్తమ కార్యక్రమాలను చేపడుతూ గ్రామీణులకు ప్రాచీన కళలను గుర్తు చేస్తోందన్నారు. పాశ్చాత్య నాగరికతకు అటువాటు పడిన నేటి ప్రజలకు మన కళలపై ఆసక్తిని పెంపొందించాలన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ సహ సంచాలకుడు నాగరాజు మాట్లాడుతూ ప్రాచీన కళలు, వాటి విశిష్టతను గురించి వివరించారు. కార్యక్రమంలో శ్రీధరగడ్డ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. టిప్పు సర్కిల్ అభివృద్ధికి వినతి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం టిప్పుసుల్తాన్ సర్కిల్ను అభివృద్ధి పరచాలని ఎస్డీపీఐ డిమాండ్ చేసింది. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు ఖాజా మోయినుద్దీన్ మాట్లాడారు. టిప్పుసుల్తాన్ సర్కిల్లో ఉద్యానవనం, విద్యుత్ దీీపాల అలంకరణ, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి నగరసభ కమిషనర్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. సేవాదళ్ పాత్ర అనన్యంకోలారు: భారత సేవాదళ్ శిక్షణను ప్రతి పాఠశాలలోను తప్పనిసరి చేయాలని భారత సేవాదళ్ గౌరవ అధ్యక్షుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. గురువారం నగరంలోని ఖాద్రిపురలోని శ్రీ నల్లూరమ్మ దేవి పిల్లల ఆశ్రమంలో హర్డీకర్ జయంతిని నిర్వహించారు. యువత దేశ ప్రేమ, దేశభక్తి, జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఇందుకు భారత సేవాదళ్ శిక్షణ అవసరమన్నారు. కేఎస్ గణేష్, సభ్యులు పాల్గొన్నారు. -
రేపు ద్రావిడ భాషా సాహిత్య సమ్మేళనం
బళ్లారిటౌన్: నగరంలోని జ్ఞానామృత కళాశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో అంతర్రాష్ట్ర స్థాయిలో సాహిత్య గోష్టి, ద్రావిడ భాషా సాహిత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుల సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు యోగానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.శివలింగప్ప పేర్కొన్నారు. గురువారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమేళ్మనంలో 17 దేశాల, భారతదేశంలోని 25 రాష్ట్రాల కవులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమేళ్మనం అనంతరం ప్రతి ఏటా మాదిరిగా సంగమ సాహిత్య పురస్కార అనే అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమావేశానికి 50కి పైగా కన్నడ, తెలుగు సాహితీవేత్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. తొలి రోజు ప్రారంభం కానున్న సమావేశానికి సాహితీవేత్త ఓఎల్ నాగభూషణ్, నేషనల్ బుక్ ట్రస్ట్ పత్తిపాత మోహన్ పాల్గొంటారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అమరేశ్ నుగడోణి అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇక రెండో రోజు మారుతీ పౌరోహిత్యం, పూర్ణిమ మాలుగమణి, శరణ బసవ బుడదుణ్ణి, మేఘనాథ్రెడ్డిలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రముఖులు బసవరాజు, వీరేష్, గడ్డిగిరి సాబ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల గుండంలో నడక
బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా చిక్కహోసహాసహళ్లిలో శ్రీమహదేశ్వర జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం ఉదయం నుంచే వందలాది భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. జాతర సందర్భంగా వీధుల్లో ఊరేగింపు, నిప్పుల గుండంలో నడక నిర్వహించారు. అర్చకులు, భక్తులు భగభగమంటున్న నిప్పుల గుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు, వందలాది మంది ఈ వేడుకను వీక్షించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాశీ విశ్వనాథ్తో సహా పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు. సీఎం కుర్చీ తగాదాను పరిష్కరించాలి: రాజణ్ణ మైసూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఉన్న గందరగోళాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే పరిష్కరించాలని, అప్పుడే ప్రభుత్వానికి, పార్టీకి మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ అన్నారు. ఆయన గురువారం నగరంలోని టీకే లేఔట్లోని సీఎం సిద్దరామయ్య నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య ఇప్పటికే తాను హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు, అందువల్ల హైకమాండ్ రాష్ట్రంలోని నాయకత్వ మార్పు గందరగోళాన్ని సత్వరం పరిష్కరించాలన్నారు. లేకుంటే ప్రభుత్వం, పార్టీపై దుష్పరిణామాలు చూపుతుందన్నారు. గందరగోళాన్నే కొనసాగిస్తే అది అన్ని రకాల సమస్యలకు మూలం అవుతుందన్నారు. డీసీఎం డీకే శివకుమార్ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అందువల్ల సీఎం కుర్చీపై ఆశ ఎక్కువగానే ఉంటుందన్నారు. అది తప్పు కూడా కాదన్నారు. కాంగ్రెస్లో డజను మందికి సీఎం పదవికి అర్హత ఉందని అన్నారు. హైకోర్టులో జీవరాజ్కు ఊరట శివాజీనగర: శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను మార్చేశారంటూ దాఖలైన పిటిషన్ల విచారణ మీద హైకోర్టు జూన్ 3 వరకు స్టే జారీ చేసింది. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలవడం తెలిసిందే. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు సుధీర్కుమార్ మురుళ్లి కేసు వేశారు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీశానంద విచారణ జరిపారు. అవతలి పక్షం అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసులపై స్టేని విధిస్తూ జూన్ 3కు వాయిదా వేశారు. దీంతో జీవరాజ్కు ఉపశమనం దక్కినట్లయింది. కమనీయంగా కరగ బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని ఇండ్లవాడి జీపీ చిక్కహోసహళ్లిలో మహాదేశ్వర స్వామి జాతర సందర్భంగా కరగ మహోత్సవం కనులపండువగా జరిగింది. మారెమ్మ ఆలయం నుంచి కరగను ఎత్తుకుని ఊరేగింపు బయటకు రాగానే, భక్తులు మల్లెపూలు కురిపించి స్వాగతం పలికారు. డప్పులు, మంగళ వాయిద్యాల లయకు అనుగుణంగా కరగధారి నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. జాతరలో భాగంగా గ్రామదేవతల పల్లకీ ఉత్సవం నిర్వహించారు. గ్రామంలోని మహదేశ్వర స్వామి, ముత్తరాయ స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, మునేశ్వర స్వామి, గంగమ్మ దేవి, సత్తెమ్మ దేవి, సపలమ్మ దేవి, కడిగేరమ్మ దేవీల పల్లకీ ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. రాత్రి జరిగిన మారెమ్మ దేవి పూజ నాట్య ప్రదర్శన భక్తులను ముగ్ధులను చేసింది. ప్రేమ గొడవ.. బాలుడు ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడిన 15 ఏళ్ల బాలుడు పెద్దలు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నపట్టణలోని రాజా కెంపేగౌడ కాలనీలో జరిగింది. పసి వయసులో దారి తప్పి జీవితాన్ని అంతం చేసుకున్నాడు. బిడదికి చెందిన బాలుడు స్థానిక యువతితో పరిచయం పెరిగి ప్రేమలో పడ్డాడు. ఇది పెద్దలకు తెలిసి ఇలా చేయరాదని అతన్ని మందలించారు. యువతి చెన్నపట్టణకు వెళ్లిపోయింది. 2వ తేదీన అక్కడకు వెళ్లిన బాలుడు ఆమెతో గొడవపడి పురుగుల మందును తాగాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతిచెందాడు. తమ కుమారుని మృతికి యువతి కారణమని తల్లిదండ్రులు చెన్నపట్టణ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ధర్మమే మనకు శ్రీరామరక్ష
మైసూరు: మానవుని సర్వతోముఖాభివద్ధికి ధర్మమే (మతమే) పునాది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం మైసూరులోని చాముండి కొండల పాదాల వద్ద ఉన్న సుత్తూరు మఠంలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ‘జాతీయ అభివృద్ధికి ప్రేరణగా సామాజిక సామరస్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ’దయ ఉంటే, ధర్మం ఉంటుంది. ఆశ్రయం కోరి వచ్చిన పక్షిని కాపాడటానికి ఆత్మార్పణ చేసుకున్న శిబి చక్రవర్తి త్యాగం, దయ మనకు ఉండాలి. ఈ త్యాగం, కరుణ, దయలోనే సామరస్యం ఇమిడి ఉంది’ అని అన్నారు. మోక్షం, అర్థం, కామ వాంఛలలో కూడా ధర్మం ఇమిడి ఉంటుంది. సామరస్యం మధురమైన సంగీతంలా ఉండాలి. మనం సంయమనం కోల్పోతే, ఐక్యత ఏర్పడదు అని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా మతం ఒక రక్షణ కవచంగా నిలిచింది. మనం ధర్మాన్ని కాపాడుకుంటే, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం లేకుండా మానవ జీవితానికి అర్థం లేదు. ధర్మం శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. ధర్మం ఉంటే సుఖం, శ్రేయస్సు ఉంటాయి. అది దుఃఖాన్ని కలిగించదు అని వివరించారు. సమానత్వ భావన రావాలి ఆధిక్య, నిమ్న అనే భావనను వదిలించుకుని, భారతీయులందరిలో ఏకతా భావం పెంపొందించాలి అని భాగవత్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలను మనం మళ్ళీ చదవాలి. సామాజిక స్వేచ్ఛ లేకుండా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛను సాధించలేమని అంబేడ్కర్ అన్నారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నవి కావు. ఈ భావన భారతదేశానికి ప్రత్యేకమైనది. దీనిని తథాగత బుద్ధుడు అందించారు,’ అని తెలిపారు. ఈ సందర్భంగా చిక్కబళ్లాపురం సత్యసాయి ఆశ్రమ అధ్యక్షుడు మధుసూదన్ సాయి రచంచిన ‘ఆత్మనో మోక్షం జగత్ హితాయచ’ అనే పుస్తకాన్ని భాగవత్, సుత్తూరు మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ విడుదల చేశారు. వేల ఏళ్లుగా కాపాడుతోంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ -
లంచగొండిలపై లోకాయుక్త కొరడా
హొసపేటె: భూ ఖాతా మార్పిడికి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు కొప్పళ జిల్లా కోళూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిని, బిల్ కలెక్టర్ను, రోజు వారీ కూలీని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని కోళూరు జీపీ కార్యదర్శి మరియప్ప, బిల్ కలెక్టర్ నాగరాజ్, రోజువారీ కూలీ మారుతీగా గుర్తించారు. ఫిర్యాదుదారుడు ఎం.జ్ఞానేశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దదేగల్ గ్రామ ఆర్ నెంబర్– 74/29 వద్ద ఉన్న 8 గుంటల భూమికి సంబంధించి భూ మార్పిడి, డిజైన్ ఆమోదం, అనంతరం పంచాయతీ ఖాతాను నమోదు చేయడానికి, ఫారం నెంబర్ 9–11 జారీ చేయడానికి నిందితులు రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని ఫిర్యాదుదారుడు ఈనెల 5వ తేదీన లోకాయుక్త పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రకారం బుధవారం పక్కా ప్రణాళికతో వల పన్ని నిందితులను అరెస్టు చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. లోకాయుక్త ఎస్పీ సీ.సిద్ధరాజు మార్గదర్శకత్వంలో, డీఎస్పీ లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కార్యాచరణలో దర్యాప్తు అధికారి, పోలీసు ఇన్స్పెక్టర్ చంద్రప్ప, ఇన్స్పెక్టర్లు సునీల్, శైలా పాటిల్ పాల్గొన్నారు. జీపీ కార్యదర్శి సహా ముగ్గురు అరెస్టు -
సమస్యల పరిష్కారానికి పెద్దపీట
రాయచూరు రూరల్: జిల్లాలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పిస్తూ గత జిల్లాధికారి నితీష్ చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామని జిల్లాధికారిణి పూవిత వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లాధికారి కార్యాలయంలో నితీష్ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అధికారుల విధి అని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గత జిల్లాధికారి నితీష్, అదనపు జిల్లాధికారి శివానంద పాల్గొన్నారు. జిల్లాధికారిణిగా పూవిత బాధ్యతల స్వీకారం మహిళా శిశు సంక్షేమ శాఖపై ప్రత్యేక నిఘా -
కంచే చేను మేస్తే...
సాక్షి, బెంగళూరు: సమాజంలో పోలీసుల సేవలు గణనీయమైనవి. అయితే నేరాలను అరికట్టే, శాంతి భద్రతలను పర్యవేక్షించే నాలుగో సింహమే నేరాలకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారు? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొందరు పోలీసుల పరిస్థితి ఎలా ఉందంటే కంచె చేను మేసినట్లు తయారైంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 713 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. విధి నిర్వహణలో లోపాలు, అవినీతి, నేర చర్యల్లో పాల్గొనడం వంటి అభియోగాల్లో కొందరు ఖాకీలు చిక్కుకున్నారు. దోపిడీ, దొంగతనం, హత్య వంటి పెద్ద నేరాల్లో కూడా పోలీసుల హస్తం ఉందని కొన్ని కేసులు చెబుతున్నాయి. ఉధృతంగా నేరాలు.. చర్యలు 2024, జనవరి నుంచి 2026 జనవరి వరకు 95 మంది పోలీసులు క్రిమినల్ కేసుల్లో, 62 మంది అవినీతి కేసుల్లో, 556 మంది ఇతర నేరాల్లో పాల్గొని సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో 400 మందికి శిక్షలు కూడా ఖరారు అయ్యాయి. ధార్వాడలో బీజేపీ నేత యోగేశ్గౌడ హత్య కేసులో ఓ ఇన్స్పెక్టర్కు ఏడేళ్ల జైలు శిక్ష పడడం తెలిసిందే. ఇతరత్రా కేసుల్లో ఇంకా ఎంతెంత మందికి కఠిన శిక్షలు పడతాయోనని చర్చ మొదలైంది. రకరకాల కేసుల్లో ప్రమేయం కొందరు పోలీసులకు పరోక్షంగా హత్య కేసులతో ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారంట్ పనులు, సీజ్ చేసిన వాహనాలను వదిలిపెట్టేందుకు, చార్జ్షీట్ నుంచి నిందితుల పేర్ల తొలగింపులు, జూదం, క్రికెట్ బెట్టింగ్ల నుంచి పేరు తీసివేసేందుకు, ట్రాఫిక్ తనిఖీలు, బాల్య వివాహాల సమయాల్లో డబ్బులు డిమాండ్ చేయడం, దాడులు దౌర్జన్యాలకు పాల్పడడం వంటి నేరాలకు పాల్పడిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. అంతేకాకుండా బాలికలపై లైంగిక వేధింపులు, అక్రమ అరెస్టులు, ఫిర్యాదులు స్వీకరించడంలో జాప్యం వంటి విధి నిర్వహణలో లోపాల కారణంగా కూడా ఇంటిముఖం పట్టారు. మరోవైపు ముఖ్యమైన కేసుల లీకేజీ, నకిలీ పాసుపోర్టులకు సహకారం, రౌడీలతో ములాఖత్ వంటి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. బెదిరింపులు, దోపిడీల కేసుల్లోనూ అభియోగాలు నాలుగో సింహంపై మరకలు తరచూ నేరారోపణలు, సస్పెన్షన్ పర్వాలు రెండేళ్లలో 713 మందిపై కేసులు దావణగెరెలో బంగారం దోపిడీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఐజీ స్క్వాడ్ పేరు చెప్పి 80 గ్రాముల బంగారాన్ని లాక్కున్నారు బెంగళూరులో ఏటీఎంలకు నగదు నింపే వాహనం దోపిడీ కేసులో ఓ కానిస్టేబుల్ అరెస్టు బీపీవో మేనేజర్ కిడ్నాప్ కేసులో ఒక హెడ్కానిస్టేబుల్కు కటకటాలు .. ఇలా అనేకమంది పోలీసు సిబ్బందిపై తరచూ ఆరోపణలు, చర్యలు. -
లేఔట్లపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు
రాయచూరు రూరల్: నగరంలో 27 లేఔట్లపై అభ్యంతరాల వెల్లడికి 15 రోజుల గడువు విధించినట్లు రాయచూరు నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామి పేర్కొన్నారు. గురువారం నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని నోటీసులు జారీ చేశామన్నారు. నగరంలో రూ.75 లక్షలతో నూతన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నగరసభ మొత్తం బడ్జెట్ రూ.75.89 లక్షలు కాగా రూ.70.14 కోట్లు వ్యయం కాగా రూ.5.75 లక్షలు మిగులు బడ్జెట్గా పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్, సభ్యులు రామస్వామి, ప్రతిభా రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. మఠం అభివృద్ధికి ప్రాధాన్యత రాయచూరు రూరల్: నగరంలో సోమవారపేట హిరేమఠం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమవారపేట హిరేమఠంలో 25 శిలా మంటపాలకు భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. మఠం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సోమవారపేట హిరేమఠం పీఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, దోతరబండి మల్లికార్జున, అంతరగంగి వీరభద్రప్ప, షణ్ముకప్ప, నాగనగౌడ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు రాయచూరు రూరల్: వేసవిలో రెండు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని జిల్లాధికారిణి పూవిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తుంగభద్ర, కృష్ణా నదీ ప్రాంతంలోని గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం నెలకొనకుండా చూడాలని సూచించారు. విద్యుత్ కోత, మోటార్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఏసీ హంపన్న, టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, శరణ బసవ, సురేష్ వర్మ తదితరులున్నారు. గృహలక్ష్మిపై అలసత్వం తగదు రాయచూరు రూరల్: పంచ గ్యారంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం డబ్బుల పంపిణీలో అధికారులు అలసత్వం వహించడం తగదని పంచ గ్యారంటీల అమలు సమితి అధ్యక్షుడు పామయ్య మురారి అధికారులపై మండిపడ్డారు. గురువారం జలనిర్మల కార్యాలయ సభాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించడం అధికారుల విధి అని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వారం రోజుల్లోపు గృహలక్ష్మి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడేలా చూడాలన్నారు. ఈ విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, లీడ్ బ్యాంక్ మేనేజర్లు సమస్యలను పెద్దవి చేయకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలకు శాఖల ప్రధాన అధికారులు హాజరు కావాలే తప్ప మిగిలిన సిబ్బంది కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా యోజనాధికారి రోణ, సభ్యులు హన్మంతు, పవన్ పాటిల్, నాగేంద్రప్పలున్నారు. నీటికుంటలో పడి మహిళ మృతి కోలారు: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మహిళ మృతి చెందిన ఘటన ముళబాగిలు పట్టణంలోని శివకేశవ నగరలో ఉన్న కొలిమికుంటలో చోటు చేసుకుంది. ముళబాగిలు పట్టణానికి చెందిన సౌభాగ్యమ్మ (65) మరణించిన మహిళ. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఉదయం కొలిమి కుంటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా కాలుజారి కుంటలో పడి మరణించింది. ముళబాగిలు నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీబీ డ్యాంలో పూడిక తొలగించండి
బళ్లారిటౌన్: అఖండ బళ్లారి జిల్లాలోని రైతుల జీవనాడి తుంగభద్ర డ్యాంలో పేరుకున్న పూడికను ప్రభుత్వం తొలగించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ డిమాండ్ చేశారు. గురువారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూడిక వల్ల దాదాపు 30 టీఎంసీల నీటిని ప్రతి ఏటా కోల్పోతున్నామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మైనింగ్ నిధులు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించే బదులు పూడికతీత పనులకు వినియోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. గత 26 ఏళ్లుగా ఈ విషయాన్ని రైతు సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా ప్రభుత్వాలు సక్రమంగా స్పందించడం లేదన్నారు. 2017లో రైతు సంఘాల ఆధ్వర్యంలో డ్యాంలో పూడికతీతకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినట్లయితే 10 ఏళ్లలో పూడికతీతను పూర్తి చేయవచ్చన్నారు. డ్యాంలో రైతులకు ఉపయోపడే ఒండ్రుమట్టి, ఇసుక, గ్రావెల్ ఉందని, దీన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. రైతులు డ్యాంలోని మట్టిని పొలాలకు తీసుకెళుతుంటే పోలీసులు, మైన్స్ అండ్ జువాలజీ శాఖ అధికారులు వేధిస్తున్నారన్నారు. రైతులకు ఉపయోగపడే మట్టిపై కూడా అధికారులు అనవసరంగా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఈ నెలాఖరులో రైతు సంఘం ఆధ్వర్యంలో డ్యాంలో పూడికతీతకు తామే శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనర్ ఉద్దెహాళు, ప్రముఖులు దొడ్డదానప్ప, రాజు గౌడ, వీరభద్రగౌడ, శ్రీధర్, దరూరు బసవరాజు, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. -
పెచ్చరిల్లిన ప్రతీకారం
మైసూరు: ఆస్తి కోసం సోదరులను మచ్చుకత్తితో సవతి సోదరుడు నరికి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని కేఆర్నగర తాలూకా అర్జునహళ్లి గ్రామంలో జరిగింది. డిస్కవరి రఘు (35), హర్షవర్ధన్ (30) హతులు. వీరు మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో నివాసం ఉన్నారు. అర్జునహళ్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు.. ఆస్తి గొడవలు రైతు రమేష్ రాజుకు ఇద్దరు భార్యలు కాగా చిన్న భార్య కుమారుడు డిస్కవరి రఘు, ఆస్తి కోసం తండ్రి రమేష్ రాజును మూడేళ్ల క్రితం చంపేసి జైలుకెళ్లి వచ్చాడు. చిన్న భార్య కామాక్షి శ్రీరంగపట్టణ లో టీచర్గా పని చేస్తుండేవారు. మూడేళ్ల క్రితం కామాక్షి రిటైరైన తర్వాత పిల్లలు డిస్కవరీ రఘు, హర్షవర్ధన్లతో కలిసి శ్రీరంగపట్టణలో నివాసం ఉన్నారు. రమేష్రాజు మొదటి భార్య సుధ కొడుకు రోహిత్ (28), కాగా, సవతి సోదరులతో గొడవలున్నాయి. ఆస్తి పంచాయతీ చేసుకుందామని రోహిత్.. రఘు, హర్షవర్ధన్లను అర్జునహళ్లి గ్రామానికి పిలిపించాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రోహిత్ మచ్చుకత్తిని తీసుకుని సోదరుల తల, ముఖంపై నరికాడు, హర్షవర్ధన్ అక్కడే మరణించగా, తప్పించుకుని పారిపోతున్న డిస్కవరీ రఘును వెంబడించి కళ్యాణపుర వద్ద రోడ్డు పక్కన హతమార్చాడు. నిందితుడు అరెస్టు కేఆర్నగర ఇన్స్పెక్టర్ శివప్రకాష్, పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు రోహిత్ను పొలం వద్ద ఉండగా అరెస్టు చేశారు. స్వల్ప గాయాలైన అతనికి కేఆర్నగర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండను చూసిన గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. ఇద్దరు దాయాదుల నరికివేత ఆస్తి గొడవలతో సవతి సోదరుని కిరాతకం.. మైసూరు జిల్లాలో కలకలం -
ఉపాధి కరువు.. వలస దరువు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర నగరాలకు వలసలు వెళుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో రబీలో కూడా కరువు నెలకొంది. వ్యవసాయ కూలీలకు పనులు లభించక బతుకు తెరువు కోసం బెంగళూరు, ముంబై, సోలాపూర్, గోవా, చైన్నె, హైదరాబాద్లకు వలస వెళుతున్నారు. వానలు లేక పంటలు పండక పోవడంతో జీవనోపాధి కరువై వలసల కోసం రైతులు మూటా ముల్లే సర్దుకుంటున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజు వందలాది మంది బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్నారు. వారిని కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామాల్లో వయస్సు పైబడిన వారిని వదిలి పిల్లా పాపలతో కట్టుబట్టలతో వలస వెళుతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు వలసల నివారణకు ఎలాంటి పథకాలను ప్రారంభించాలనే తపన ఏ ఒక్కరిలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం పాకులాడే నేతలు రైతన్నలు పడుతున్న బాధలను పరిష్కరించడంలో మౌనం వహిస్తున్నారు. రాయచూరులో రైలు ఎక్కుతున్న నిరుద్యోగులు లగేజీ సర్దుకుని వలస బాట పట్టిన కూలీలు మూటాముల్లెతో తరలి వెళుతున్న వ్యవసాయ కూలి కార్మికులు జీవనోపాధి కోసం సుదూర నగరాలకు వలసబాట పట్టిన వైనం -
కన్నేస్తే.. బైక్ మాయం
బొమ్మనహళ్లి: ఏపీకి చెందిన చిత్తప్పగారి ఆనంద్ (34), షేక్ షఫీర్ బాషా (37) కన్నుపడితే ఎలాంటి బైక్ అయినా మాయమవుతుంది. నకిలీ తాళాలతో ఎత్తుకెళ్తారు. తరువాత దానికి ఏజెంట్ల సహాయంతో ఆర్సీ కార్డును సృష్టించి అమ్మేయడం, ఆ డబ్బుతో జల్సాగా జీవించడం వారి నైజం. గత కొన్నేళ్లుగా బైక్ చోరీల్లో ఆరితేరారు. నాలుగురోజుల కిందట బెంగళూరు హెబ్బగోడి పోలీసులు ఈ ఘరానా దొంగలను అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా వారి చిత్రాలు, బైక్ల ఫోటోలను విడుదల చేశారు. ఓ షోరూంకు సరిపడే బైక్లను ఈ దుండగులు కొల్లగొట్టారు, ఫలితంగా ఎంతోమంది జీవనాధారమైన బైక్ పోయిందని బాధపడడంతో పాటు డబ్బును నష్టపోయారు. దొంగల నుంచి రూ 41.67 లక్షల విలువైన 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షఫీర్ బాషా నకిలీ ఆర్సీలను తయారు చేయడంలో దిట్ట అని తెలిసింది. కంప్యూటర్, ప్రింటర్, మొబైల్ఫోన్లు, 501 ఆర్సి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ కమిషనర్ నారాయణ్, ఏసీపీ సతీష్ కేసును పర్యవేక్షించారు. నగరంలో ఎవరిదైనా బైక్ పోయి ఉంటే హెబ్బగోడి ఠాణాలో సంప్రదించవచ్చు. ఇద్దరు ఘరానా దొంగల నుంచి 51 బైక్లు సీజ్ -
మిద్దెలపై తోటలు పెంచాలి
బళ్లారి రూరల్ : నగరంలో సొంతిల్లు ఉన్నవారు మిద్దెలపై తోటల (టెర్రస్ గార్డెన్) పెంపకంపై ఆసక్తిని చూపాలని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి సూచించారు. గురువారం దావణగెరె నగరంలోని శివకుమారస్వామి కాలనీలో సిటీ కార్పొరేషన్ కమిషనర్ ఉదయ్కుమార్ నివాసంపై ఏర్పాటు చేసిన మిద్దెతోటను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కొత్తగా గృహనిర్మాణం చేపట్టేవారు, ఇప్పటికే సొంతిళ్లు ఉన్నవారు మిద్దైపె వర్షపునీటితో తోటలను పెంచుకోవాలన్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ నీరు అవసరం లేదని తెలిపారు. సిటీకార్పొరేషన్ కమిషనర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ చేసి మిద్దెతోటలు పెంచొచ్చని అన్నారు. ఇందువల్ల భూగర్భ అంతర్జల నీటిమట్టం పెరుగుతుందన్నారు. జపాన్, కొరియా దేశాల తరహాలో మనం కూడా పూల మొక్కలను, పండ్లతోటలను, కూరగాయలను పండించుకోవచ్చన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలోను మిద్దెలపైన ఖాళీ ప్రదేశంలో తోటలను పెంచాలన్నారు. -
బోడేనహళ్లిలో విషాదం
కోలారు: వ్యవసాయ నీటిగుంతలో పడి అక్క, తమ్ముడు మృతి చెందారు. ఈ ఘటన బంగారుపేట తాలూకా బోడేనహళ్లి గ్రామంలొ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రూప, బాబు దంపతుల కుమార్తె తనుశ్రీ (15), అదే గ్రామానికి చెందిన వరదరాజు, శ్యామల దంపతుల కుమారుడు కార్తీక్ (8) మృతులు. బంగారుపేట తాలూకాలోని నల్లగుట్టపల్లి గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో కార్తీక్ 3వ తరగతి చదువుతున్నాడు. కార్తీక్ ఆటలాడుతూ కాలుజారి వ్యవసాయ గుంతలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు గుంతలోకి దిగిన తనుశ్రీ కూడా నీటిలో మునిగి చనిపోయింది. తనశ్రీ యళేసంద్ర కిత్తూరు రాణి చెన్నమ్మ వసతి పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. విషయం తెలుసుకున్న బంగారుపేట తహసీల్దార్ కే.ఎన్.సుజాత, బీఈఓ శశికళ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఘటనపై కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ నీటి గుంతలో పడి అక్కా తమ్ముడు మృతి -
చిక్కణ్ణకు ఉత్తమ రైతు అవార్డు
చెళ్లకెరె రూరల్: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా బొబ్రహళ్లి గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆదర్శ రైతుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. హైదరాబాద్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ డాక్టర్.ఎంఎల్ జాట్ రైతును సన్మానించారు. రైతు చిక్కణ్ణ కుసుమగిరి ఎఫ్టీఓ ద్వారా లభించే హెర్ఆర్–13 రాగి విత్తనాలను సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా సాగు చేసి ఉత్తమ ఫలితాలను సాధించాడు. ఐసీఏఆర్ విజ్ఞాని మార్గదర్శనంలో నాటి పద్ధతిలో సమతుల్య పోషకాంశాలు, నైసర్గిక వ్యవసాయ విధానాలను అనుసరించారు. ఈ పంటను రైతు ఉత్పాదన సంస్థ ద్వారా క్వింటాలుకు రూ.4,886 ల చొప్పున కొనుగోలు చేశారు. 6 ఎకరాల్లో సాగు చేసిన పంటతో రూ.6.59 లక్షల రాబడి లభించిందని అన్నారు. దీంతో పాటు తనకు ఉన్న 60 పశువులకు పశుగ్రాసం లభించినట్లయిందన్నారు. ఉత్తమ పంట దిగుబడికి సలహా సూచనలు అందించిన విజ్ఞానులు డాక్టర్ సీ.తారా సత్యవతి, డాక్టర్ కే.శ్రీనివాస బాబు, డాక్టర్ రఫీలకు రైతు కృతజ్ఞతలు తెలిపారు. కుసుమగిరి రైతు ఉత్పాదక సంస్థ సీఈఓ డాక్టర్ నరసింహమూర్తి అందించిన సహకారాన్ని కూడా రైతు ఈసందర్భంగా కొనియాడారు. -
రమణీయం.. పుష్ప పల్లకీ ఉత్సవం
బనశంకరి: బెంగళూరు యలహంకలో పుష్ప పల్లకీ వైభవం మిన్నంటింది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పల్లకీ వాహనాల ఊరేగింపు నేత్రపర్వం గావించింది. గ్రామదేవత మహేశ్వరమ్మ పూల కరగ మహోత్సం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యలహంక బజార్రోడ్డులో వెలసిన శ్రీమహేశ్వరమ్మ కరగ వేడుక బుధవారం అర్ధరాత్రి ఆరంబమైంది. భక్తజనవాహిని మధ్య కరగ, పుష్ప పల్లకీలు ఊరేగింపు సాగింది. ఎమ్మెల్యే ఎస్ఆర్.విశ్వనాథ్ కరగ ను దర్శించుకుని పూజలు చేశారు. 24 గ్రామ దేవతల పూల పల్లకీలు ట్రాక్టర్లు, వాహనాలలో ఊరేగింపు రమణీయంగా సాగింది. వేలాదిగా ప్రజలు దర్శించుకున్నారు. యలహంకలో మహేశ్వరమ్మ జాతర -
వినతి మేరకు సస్పెన్షన్ రద్దు
ఐపీఎస్ రామచంద్రరావు సస్పెన్షన్ రద్దుపై స్పందిస్తూ, సీఎం అనుమతి తీసుకొని రద్దు చేశారు, ఈ నెలాఖరులో ఆయన రిటైరవుతారు, పెన్షన్ సెటిల్మెంటు తదితరాలు ఉన్నాయని, సస్పెన్షన్ ఎత్తేయాలని రామచంద్రరావు సీఎంకు విన్నవించారు, కావాలంటే తరువాత విచారణను కొనసాగించవచ్చని అభ్యర్థించారు అని తెలిపారు.వరుసగా వాహనాల ఢీ, 10 మందికి గాయాలుదొడ్డబళ్లాపురం: బెంగళూరు– తుమకూరు హైవేలో వరుసగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. గురువారం దాబస్పేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు, రెండు కార్లు, ఒక బైక్, ఒక లారీ, బొలెరో జీప్ వరుసగా ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు అదుపు చేయలేక ఢీకొట్టుకున్నాయి. దీంతో ఆ వాహనాలు ధ్వంసం కాగా, 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ సంఘటనతో కిలోమీటర్ల మేర గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద ట్రాఫిక్ను సరిచేశారు. -
ఏకపక్ష విడాకులు చెల్లవు
శివాజీనగర: హెచ్ఐవీ రోగినంటూ భార్య, అత్తమామలు దూషించారని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి ఏకపక్షంగా విడాకులు తెచ్చుకున్న భర్తకు హైకోర్టులో షాక్ తగిలింది. భార్య వేసిన కేసు మేరకు హైకోర్టు ఆ విడాకులను రద్దు చేసింది. వివరాలు.. ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్గా పనిచేసే ఆమెకు, ప్రభుత్వ ఉద్యోగి అయిన అతనికి 2002లో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లు బాగానే ఉన్నారు. ఆ తరువాత పిల్లలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఎన్నిసార్లు కోరినా ఆమె రాలేదు. పైగా తాను ఎయిడ్స్ రోగినంటూ దూషించారని భర్త ఓ ఫ్యామిలీ కోర్టులో కేసు వేసి విడాకులు కోరగా మంజూరయ్యాయి. ఇది అన్యాయమని, తనకు విడాకులు వద్దని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. జడ్జిలు జస్టిస్ సూరజ్ గోవిందరాజ్, చిల్లకూరు సుమలతలతో కూడిన కల్బుర్గి డివిజనల్ బెంచ్ విచారించింది. ఎయిడ్స్ రోగి అని భార్య నిందించడం తప్పేనని, కానీ అలా నిందించినట్లు భర్త ఆధారాలు చూపలేదని జడ్జిలు పేర్కొన్నారు. భార్య క్రూరత్వం అనేదానికి సైతం రుజువులు చూపలేదని తెలిపారు. చివరకు విడాకులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి భార్య, పిల్లలకు జీవనభృతి తొలి భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లికి జీవనభృతి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడానికి అంగీకరించబోమని, భృతి ఇవ్వడం తప్పనిసరి అని హైకోర్టు ఆదేశించింది. తొలి భార్య, వారి పిల్లలకు రూ.30 వేల భృతి ఇవ్వాలని కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ఓ భర్త హైకోర్టులో అర్జీ వేశాడు. న్యాయమూర్తి జస్టిస్ కే.బీ.గీత విచారించారు. రెండో భార్య, పిల్లలను పోషిస్తానని భర్త గతంలో మాట ఇచ్చాడని, ఫోటోస్టూడియో యజమాని, అర్చకునిగా పని చేస్తున్నందున ఆదాయం వస్తూ ఉంటుందని జడ్జి అన్నారు. అతని 74 సంవత్సరాల తల్లి ఓ మెస్లో పనిచేస్తూ జీవిస్తోందని తెలిసి జడ్జి.. వారందరి పోషణ నీపైనే ఉందని ఆదేశించారు. నియమాల ప్రకారం మొదటి భార్య కుటుంబానికి జీవనభృతిని అందించాలని తెలిపారు. ఓ భర్తకు హైకోర్టు షాక్ ఎయిడ్స్ రోగి అని భార్య దూషించేదన్న భర్త -
సైలెంట్ కిల్లర్..హైపర్నాట్రేమియా
సాక్షి,బళ్లారి: ఈ ఏడాది భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుతున్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులతో పాటు పెద్దలు, బాగా ఆరోగ్యంగా ఉన్న వారు కూడా బయట తిరిగేందుకు భయపడుతున్నారు. బిసిల బళ్లారిగా పేరొందిన బళ్లారిలో ఎండల ప్రభావం సహజంగానే మరింత ఎక్కువగా ఉంటుంది. ఎండల ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడ ఎండలో నిలిపిన వాహనాల్లో మంటలు కూడా వ్యాపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో చిన్నారులు ముఖ్యంగా నవజాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు చిన్నారులు, నవజాత శిశువులతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఎండల ప్రభావం ఒక్కో రోజు ఒక్కో విధంగా పెరుగుతోంది. విపరీతమైన ఎండలకు తోడు ఉక్కపోత ఉండటంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు డీహైడ్రేషన్కు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. పెద్దల పరిస్థితి ఇలా ఉంటే చిన్నారులు, నవజాత శిశువుల విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని వెద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద బారులు చిన్నారులు, నవజాత శిశువుల్లో హైపర్నాట్రేమియా అనే ప్రమాదకర పరిస్థితి పెరుగుతుండటంతో ఆస్పత్రుల వద్దకు చిన్నారులు, నవజాత శిశువులను ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. విపరీతంగా ఎండలు పెరిగిపోవడం వల్ల నీటి లోపం ఏర్పడి రక్తంలో సోడియం స్థాయి అధికమవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల్లో చెమట ద్వారా శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుందని, సరిపడా ద్రవ రూపంలో నీరు శరీరానికి అందకపోతే చిన్నారులు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారని, దీంతో రక్తంలో సోడియం స్థాయి పెరిగి హైపర్నాట్రేమియా ఏర్పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సమస్య అధిగమించడానికి జిల్లా ఐఏంఐ అధ్యక్షుడు, చిన్నారుల ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రాజేష్ చిన్నారులను ఎండల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉందని, చిన్నారులు, నవజాత శిశువుల్లో హైపర్నాట్రేమియా అనే ప్రమాదకర పరిస్థితి పెరుగుతోందన్నారు. ఎక్కువగా నీటిని తాగాలి నవజాత శిశువుల్లో ఎక్కువగా కనిపిస్తోందని, దీనికి ప్రధాన నివారణ తల్లులు ఎక్కువ నీరు తాగాలని, తల్లి మంచినీరు ఎక్కువగా తాగడం, పండ్ల రసాలు, పాలు తదితర నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సహజంగానే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నవజాత శిశువులకు పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపర్నాట్రేమియా రాదని సూచించారు. తల్లులు పాలు ఇవ్వకపోతే అప్పుడే పుట్టిన బిడ్డకు, నెలలు నిండిన పసికందులకు ఈ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. నవజాత శిశువులు తమ పరిస్థితి చెప్పలేరని, ఈ నేపథ్యంలో తల్లులు అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలన్నారు. ఇక చిన్నారుల విషయానికి వస్తే దాహం వచ్చినప్పుడు వెంటనే నీరు తాగాలన్నారు. నోరు ఎండిపోకుండా చూసుకోవాలన్నారు. అలసట, ఏడుపు ఎక్కువగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, జ్వరం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. శిశువులకు తరుచుగా తల్లిపాలు ఇవ్వాలన్నారు. పిల్లలకు నీరు, ద్రవ పదార్థాలను ఎక్కువగా ఇవ్వాలన్నారు. ఎండల్లో జాగ్రత్తలు పాటించాలి మరీ ముఖ్యంగా ఎండల్లో బయటకు వెళ్లకూడదన్నారు. తేలికపాటి దుస్తులు వేసుకోవాలన్నారు. హైపర్నాట్రేమియా ప్రమాదకరమైందని, అయితే గుర్తిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. మండే ఎండల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైపర్నాట్రేమియా అనేది రక్తంలో సోడియం స్థాయి 145 ఎంఈక్యూ–ఎల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించే ఒక రకమైన ప్రమాదకర పరిస్థితి అని, ఇది అప్పుడే పుట్టిన బిడ్డలకు, నెలలు నిండిన నవజాత శిశువుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వేసవిలో పుట్టే పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చాలా మంది తల్లులు నీరు తక్కువగా తాగుతారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తల్లులు ఎక్కువగా నీరు తాగితేనే నవజాత శిశువులకు పాలు పుష్కలంగా అందుతాయని అన్నారు. ఆలస్యంగా గుర్తించినా ప్రమాదమే హైపర్నాట్రేమియాను గుర్తించకపోతే, అలస్యంగా చికిత్స చేసినా మెదడు రక్తస్రావం వంటి సమస్యలు, రక్తం గడ్డకట్టడం, కిడ్నీ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు, మెటబాలిక్ అసిడోసిస్ వంటి ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులు వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. ఎండా కాలంలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ప్రసవించిన తల్లులు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని, సరిగా పాలు ఇవ్వాలని, పాలిచ్చే విధానం కూడా తెలుసుకోవాలన్నారు. శిశువులను బయటకు తీసుకుని వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక 1 నుంచి 10 ఏళ్ల లోపు చిన్నారులు కూడా వేసవి సెలవుల నేపథ్యంలో బయటకు ఆడేందుకు వెళుతుంటారని, వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండలోకి వెళ్లకుండా, ఎక్కువగా నీరు తాగేవిధంగా చూడాలన్నారు. హైపర్నాట్రేమియా పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్న వైనం ఆస్పత్రుల వద్ద శిశువులతో తల్లిదండ్రులు -
మంచి దొంగలు!
● కొట్టేసిన గొలుసు ముక్కను ఇచ్చేశారు చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని చామరాజపేటలో మే 3వ తేదీ ఉదయం ప్రియా అనే మహిళ నీటి సంపును చూస్తుండగా పల్సర్ బైక్లో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె గొంతును పట్టుకొని మాంగల్యం చైనును లాగారు. ఆమె చైన్ను గట్టిగా పట్టుకోగా, కొంత గొలుసును దుండగులు తెంచుకెళ్లారు. తరువాత చిక్కబళ్లాపురం నగర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలి నుంచి దేవనహళ్లి వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 5వ తేదీన ప్రియ భర్త ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్తుండగా మెట్లపైన గొలుసు ముక్క ఉండగా చూసి తీసుకున్నాడు. అది దుండగులు తెంచుకెళ్లిన గొలుసేనని గుర్తించారు. పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించి వెళ్లారు. దొంగలు భయపడి గొలుసును వదిలిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అడవిలో చెట్టుకు బస్సు ఢీ మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు పట్టణం నుంచి హోగ్యంకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అటవీ ప్రాంతంలో చెట్టును ఢీ కొట్టింది. బస్సులోని 39 మంది ప్రయాణికులు ఉండగా, ముందు భాగంలో కూర్చొన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ లాక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రోడ్డు అడ్డుగోడను ఢీ కొట్టుకుంటూ చివరికి చెట్టును ఢీ కొని బస్సు ఆగిపోయింది. ఒకవేళ నేరుగా లోయలోకి పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు తెలిపారు. రామాపుర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పెళ్లి నగలు మరిచిపోయి.. ● హోటల్ సిబ్బంది నిజాయితీ యశవంతపుర: కూతురి పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలను హోటల్లో మరిచి వెళ్లిపోగా, హోటల్ సిబ్బంది నిజాయితీతో తిరిగి వారికి అప్పగించిన ఘటన బాగలకోటలో జరిగింది. బాగలకోటకు సమీపంలోని బెళ్లిఖిండి గ్రామానికి చెందిన లక్ష్మవ్వ ముదనూరు అనే మహిళ కుమార్తె పెళ్లి కోసం లక్షల రూపాయల బంగారం కొనుగోలు చేసి, భోజనం కోసం సదరు హోటల్కు వెళ్లారు. తరువాత బ్యాంగ్ను అక్కడే వదిలిసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక చూసుకుని, లక్ష్మవ్వ, బంధువులు ఉరుకులు పరుగుల మీద హోటల్కు తిరిగి వెళ్లారు. అక్కడ సిబ్బంది నగల బ్యాగ్ను భద్రంగా దాచి పెట్టారు. సీసీ కెమెరాల చిత్రాల ప్రకారం లక్ష్మవ్వవేనని గుర్తించి ఆమెకు అప్పగించడంతో సంతోషించారు. 15 కి.మీ.లకు రూ.1200 ● బెంగళూరులో ఆటో చార్జీలపై ఆక్రోశం యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్ అనే నెటిజన్ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్ కంటే హార్న్ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్ను బుక్ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి. -
పోలీసు గృహాల నిర్మాణానికి భూమిపూజ
హొసపేటె: నగరంలోని డీఏఆర్ మైదానంలో రూ.6.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోలీసు నివాస సముదాయానికి ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప మంగళవారం భూమిపూజ చేశారు. 12 మంది కానిస్టేబుళ్లు, 6 మంది సబ్ ఇన్స్పెక్టర్ల నివాస గృహాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 36 నివాస గృహాలను నిర్మించారన్నారు. ప్రస్తుతం మరో 18 నివాస గృహల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 142 నివాస గృహాల అవసరం ఉండగా, మరో 32 నివాస గృహాల మంజూరు కోసం హోం మంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తామన్నారు. మహిళా పోలీసు స్టేషన్ నిర్మాణానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్ తల్వార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కసాప వ్యవస్థాపక దినోత్సవం
హొసపేటె: స్థానిక ఎస్బీఎన్ బీఈడీ కళాశాలలో బుధవారం కన్నడ సాహిత్య పరిషత్ 112వ వ్యవస్థాపక దినోత్సవం, వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు సన్మానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కన్నడ సంస్కృతి శాఖ సహ సంచాలకులు సిద్ధలింగేష్ కే.రంగన్నవర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన ఉపాధ్యాయులను తయారు చేయడంలో మన సంస్కృతి, సంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కర్ణాటక జానపద అకాడమీ సభ్యులు డాక్టర్ జీవన్ సాబ్, తాలూకా విద్యాధికారి శేఖరప్ప హొరపేటె, కసాప తాలూకా అధ్యక్షుడు డాక్టర్ గుండి మారుతి, కార్యదర్శులు ప్రకాష్, ఉమామహేశ్వర్, డాక్టర్ సురేంద్ర, హంపీ కవి దృశ్య కళా విభాగాధిపతి డాక్టర్ మోహన్, ప్రభుత్వ ప్రమోషన్ హెడ్ మాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.బసవరాజ్, కార్యవర్గ సభ్యులు, కళాశాల పాలన మండలి సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. -
రైల్వే గేట్ వద్ద గ్రీన్మ్యాట్ ఏర్పాటు
బళ్లారిఅర్బన్: తీవ్రమైన వేసవి ఎండల కారణంగా ప్రతి రోజూ వందలాది మంది వాహనదారులు నగరంలోని కంటోన్మెంట్ రైల్వే గేటు వద్ద మండుటెండలో రైలు వెళ్లేంత వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన మాజీ మేయర్, కార్పొరేటర్ ఎం.రాజేశ్వరి సుబ్బరాయుడు తక్షణం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆమె అభ్యర్థనపై స్పందించిన అధికారులు వెంటనే గ్రీన్ మ్యాట్ను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులకు నీడ రూపంలో ఎండల నుంచి ఉపశమనం లభించింది. కాగా బుధవారం రాజేశ్వరి గ్రీన్మ్యాట్ను పరిశీలించారు. యువ నాయకుడు యోగానంద రెడ్డి, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. -
భాష ఎదుగుదలకు సహకరించండి
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా స్థాయి కసాప సంస్థాపన దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. నగరంలోని కిల్లే బృహన్మఠంలో తాలూకా అధ్యక్షుడు విజయ్ రాజేంద్ర ఆధ్వర్యంలో కసాప 98వ సంస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకోని జరిగిన కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య మాట్లాడుతూ కన్నడ భాష ఎదుగుదలకు ప్రోత్సాహం అందించాలన్నారు. కన్నడ భాషలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వీర హనుమాన్, ఈరణ్ణ కోస్గి, రావుత్ రావ్, ప్రతిభ, వైశాలి, దండెప్ప బిరాదార్ తదితరులు పాల్గొన్నారు. -
హైకమాండ్ ఆదేశిస్తే ఐదేళ్లూ నేనే సీఎం
మైసూరు: తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది తమ కాంగ్రెస్ హైకమాండ్ తీర్మానిస్తుందని, హైకమాండ్ చెప్పినట్లు వింటానని సీఎం సిద్దరామయ్య అన్నారు. సిద్దరామయ్య బుధవారం మైసూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేస్తుందన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఐదేళ్లుగా సీఎంగా ఉంటానని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపిస్తామని సీఎం అన్నారు. శృంగేరిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బీజేపీ అభ్యర్థి, ఎన్నికల సిబ్బంది కలిసి మార్చేశారని సీఎం ఆరోపించారు. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. పిలిస్తేనే ఢిల్లీకి: డీసీఎం శివాజీనగర: హైకమాండ్ ఆహ్వానించినపుడు వెళతాం, పిలవకుండా వెళ్లడం సరికాదు.. అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో నివాసం వద్ద మాట్లాడుతూ దావణగెరెలో కొందరు నేతలను తొలగించడం పార్టీ నిర్ణయమన్నారు. సీఎం రాజకీయ కార్యదర్శిని తీసేయడంపై ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. లౌకికవాద శక్తులు ఒక్కటిగా ఉండాలని, అందుకే తమిళనాడులో విజయ్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందన్నారు. సిద్దరామయ్య నోట అదే మాట -
మద్యం బాటిల్ కోసం ఇనుప రాడ్డుతో దాడి
హుబ్లీ: మద్యం బాటిల్ ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు మానసిక అస్వస్తుడిపై ఇనుపరాడ్డు, ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక హుండి ప్లాంట్ బాలవ్వన చౌక్ దొడ్డమని కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనలో మానసిక అస్వస్తుడైన అనోక్ జమఖండి గాయపడ్డారు. రఘు, నిరంజన్ దాడి చేశారని అనోక్ అన్న అఖిత్ ఫిర్యాదు చేశాడు. అమన్ ఇచ్చిన మద్యం బాటిల్ను అనోక్ పట్టుకొని నిలబడ్డాడు. దాన్ని ఇవ్వమని రఘు, నిరంజన్ అడగగా ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురై బాటిళ్లు లాక్కొనే క్రమంలో రాడ్డు, ఇటుకలతో తల వీపు మీద కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించారని అఖిత్ బెండిగేరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యరగేరలో ఎక్స్ప్రెస్ బస్సులను ఆపండిరాయచూరు రూరల్: రాయచూరు నుంచి మంత్రాలయానికి యరగేర మీదుగా వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులను యరగేరలో నిలపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం నాడ కార్యాలయం వద్ద అధ్యక్షుడు నిజాముద్దీన్ మాట్లాడుతూ రాయచూరు నుంచి 15 కి.మీ.ల దూరంలో ఉన్న యరగేరలో ఆర్టీసీ బస్సులను నిలపకుండా నేరుగా వెళుతున్నారన్నారు. రాయచూరు నుంచి ఆదోని, కర్నూలు, మంత్రాలయం, బెంగళూరు వరకు వెళుతున్న బస్సులను నిలపాలని కోరుతూ ఆర్టీసీ డిపో మేనేజర్, నాడ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. అంబులెన్స్లో కవలల జననం హొసపేటె: తాలూకాలో అంబులెన్స్లో ఒక మహిళ కవలలకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని హంపనకట్టెకు చెందిన షకీలా అనే మహిళకు ఇంట్లో పురిటి నొప్పులు రావడంతో ఆమెను హంపనకట్టె గ్రామం నుంచి తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో నగరంలోని 60 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో ఆమె అంబులెన్స్లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు అత్యవసర ఆరోగ్య నిపుణుడు జే.అనిల్కుమార్ తెలిపారు. అంబేడ్కర్ జాతీయ ప్రైడ్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానంబళ్లారిఅర్బన్: ప్రజా నాయకత్వం, సామాజిక న్యాయం, సమాజ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తింపుగా నగర కేపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కందుకూరు రాముడుకు బెంగళూరులోని ది ఇండియన్ ఫోరం ఫర్ సోషల్ లీడర్స్ అండ్ అఛీవర్స్ సంస్థ– 2026వ సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రైడ్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసింది. సంస్థ గౌరవ అధ్యక్షులు, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ కే.వెంకటేషన్ రాముడుకు ఈ అవార్డును అందజేశారు. అవార్డును స్వీకరించిన సందర్భంగా రాముడును జిల్లాధికారి కే.నాగేంద్ర ప్రసాద్ అభినందించారు. ఘనంగా పుట్టినరోజు వేడుకబళ్లారిఅర్బన్: కర్ణాటక రక్షణ వేదిక (ప్రవీణ్శెట్టి వర్గం) జిల్లా అధ్యక్షుడు వీహెచ్.హులుగప్ప 41వ పుట్టినరోజు వేడుకలు బళ్లారిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. కరవే రాష్ట్ర సంచాలకుడు అద్దిగేరి రామన్న మాట్లాడుతూ హులుగప్ప సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సమర్థ నాయకుడని కొనియాడారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెస్కాం ఎండీగా జహీరా నసీం రాయచూరు రూరల్: గుల్బర్గా విద్యుత్ సరఫరా మండలి(జెస్కాం) మేనేజింగ్ డైరెక్టర్గా జహీరా నసీం మంగళవారం జెస్కాం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలబుర్గి విభాగంలో విద్యుత్ చౌర్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య రంగంలో సేవలు నిరంతరంరాయచూరు రూరల్: విద్యా, వైద్య రంగంలో నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి సేవలు, సాధన నిరంతరమని అభిమానుల సంఘం సంచాలకుడు మారెప్ప అన్నారు. బుధవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో రాజేంద్రరెడ్డి పుట్టినరోజు వేడుకలను జరిపి మాట్లాడారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న వైద్య సేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవ చేస్తున్నారన్నారు. -
విరిగిన చెట్లు.. తొలగింపునకు పాట్లు
బుధవారం ఓ వీధిలో చెట్ల తొలగింపు మత్తికెరెలో కరెంటు వైర్ల మరమ్మతులు బనశంకరి: గత నెల 29న సాయంత్రం కురిసిన భారీ గాలీవానలకు బెంగళూరులో వందలాది చెట్లు కూలిపోయాయి, కొమ్మలు విరిగిపడి కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఆ చెట్ల తొలగింపు ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో కూలిన చెట్లు, కొమ్మలు ఇంకా అలాగే ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల ఆలస్యం అవుతున్నట్లు గ్రేటర్ బెంగళూరు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రాత్రి సమయంలో చెట్లు తొలగిస్తున్నారు. పాలికె సిబ్బందితో పాటు ప్రైవేటు కూలీలను కూడా నియమించినట్లు చెప్పారు. కేంద్ర, తూర్పు, దక్షిణ నగర పాలికెల పరిధిలో ఎక్కువ చెట్లు కూలాయి. ఇదే రీతిలో తొలగింపు సాగితే పూర్తిగా శుభ్రం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అనే సందేహాలున్నాయి. బెంగళూరులో ప్రజలకు ఇబ్బందులు -
పొగాకు వాడకం ప్రాణాంతక వ్యసనం
హొసపేటె: పొగాకు వాడకం ఒక ప్రాణాంతక వ్యసనమని జిల్లా ఆరోగ్యాధికారి ఎం.ధర్మనగౌడ అన్నారు. హగరిబొమ్మనహళ్లిలోని తిమ్మయ్య శెట్టి ఐటీఐ కళాశాలలో బుధవారం పొగాకు వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పొగాకు వాడకం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యవసం నుంచి యువతను రక్షించడంలోనూ, సమాజంలో అవగాహన కల్పించడంలోనూ విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. పొగాకు రహిత సమాజ నిర్మాణంలో వారు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. పాఠశాల, కళాశాల ప్రాంగణాలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిషేధించినట్లు ఆయన తెలిపారు. తాలూకా ఆరోగ్య విద్యా అధికారి యమునవ్వ, కళాశాల ప్రధానోపాధ్యాయ విభాగం తరపున పాల్ రేణుక ప్రసాద్, ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు, జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సామాజిక కార్యకర్త బోజరాజు పాల్గొన్నారు. -
అద్దమైనా.. అడ్డుకుంటుందని..
మైసూరు: సాంస్కృతిక నగరం మైసూరులో ఇకపై బహిరంగంగా ఎక్కడబడితే అక్క మూత్రవిసర్జన చేయడానికి వీలు లేకుండా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సెంట్రల్ బస్టాండ్ ఎదుట సుమారు 80 మీటర్ల పొడవైన కాంపౌండ్కు స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్షన్ అద్దాలను ఏర్పాటు చేశారు. దానిముందు నిలుచునే వారు అందరికీ కనిపిస్తారు. దీనివల్ల మూత్ర విసర్జన చేయబోరని అధికారులు చెబుతున్నారు. అద్దాల చుట్టూ ఎల్ఈడీ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి వేకువ వరకూ ఆ లైట్లు వెలుగుతాయి. జన సంచార స్థలాల్లో మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారింది. దీన్ని నివారించేందుకు సుమారు రూ. 9.5 లక్షల ఖర్చుతో అద్దాల వ్యవస్థను అమలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఇక్కడే తొలిసారని, విజయవంతం అయితే ఇతర నగరాలకూ విస్తరించే అవకాశం ఉంది. కాగా, స్టీలు షీట్లను దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం లేకపోలేదు. బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకట్టకు.. మైసూరులో సరికొత్త ప్రయోగం -
ఘనంగా గంగమ్మ జాతర
కోలారు: ముళబాగిలు తాలూకాలోని తాయలూరు గ్రామంలో 69వ సంవత్సర గంగ శిరస్సు జాతర వేడుక వైభవంగా జరిగింది. సుమంగళులు తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. దేవాలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లతో అలంకరించారు. భక్తులు ఉపవాసం చేసి ఆలయంలో పూజలు నిర్వహించారు. గంగశిరస్సు పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.లండన్లో ఉద్యోగమని రూ.37 లక్షల టోపీమైసూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి అతని నుంచి రూ.37.35 లక్షల మేర స్వాహా చేసిన ఘటన మైసూరులో జరిగింది. లష్కర్ మొహల్లాకు చెందిన మహ్మద్ యాహియా అనే వ్యక్తి లండన్లో హోటల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనను చూశాడు. ప్రకటనలో ఇచ్చిన మొబైల్ నంబరును సంప్రదించాడు. ఆ సమయంలో కాల్లో మాట్లాడిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు. ఈక్రమంలో ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి అతని నుంచి రూ.37.35 లక్షలను వసూలు చేశారు. మళ్లీ డబ్బు కోసం డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో వైద్యుడు.. సస్పెన్షన్ వేటు యశంతపుర: వైద్యో నారాయణ హరి అంటారు, కానీ మద్యం తాగి విధులు నిర్వహించిన వైద్యుని ఉదంతమిది. విజయపుర జిల్లా వందాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ సజ్జన్ మద్యం మత్తులో విధులకు వస్తుంటారు. ఈ విషయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్కు తెలిసింది. విచారణ జరిపి అభియోగాలు నిజమని తేలడంతో ఆ వైద్యున్ని సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలిపారు. తాళాలు మింగిన నిందితుడుదొడ్డబళ్లాపురం: విచారణ సమయంలో నిందితుడు లాకర్ కీని మింగేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి ఠాణాలో జరిగింది. వివరాలు.. బళ్లారికి చెందిన కార్తీక్ రాముపై గత నెలాఖరులో పోక్సో కేసు నమోదయింది. అతనిని అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసులు ప్రశ్నిస్తుండగా జేబులోఉన్న తాళాలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్సలో అతనికి 10 కేజీల అరటిపండ్లు తినిపించారు. చివరకు టాయ్లెట్లో బయటకు వచ్చింది. గుంతకల్లు– మార్కాపురం రైలు సర్వీసులు గుంతకల్లు: గుంతకల్లు–మార్కాపురం రోడ్డు–గుంతకల్లు మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. గుంతకల్లు–మార్కాపురం రోడ్డు (నంబరు 57407) రైలు మే 13 నుంచి పట్టాలెక్కుతుంది. ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11:30 గంటలకు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్కి చేరుకుటుంది. ఇక మార్కాపురం రోడ్డు–గుంతకల్లు (57408) ప్యాసింజర్ రైలు మే 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు ప్రతి రోజు తెల్లవారుజూమున 4:30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 10:30 గంటలకు గుంతకల్లు జంక్షన్కు చేరుకుంటుంది. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమదేవపల్లి, కృష్ణపురం, కంభం, తర్లపాడు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. -
బాలుడిపై వీధి కుక్కల దాడి
సాక్షిబళ్లారి: వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం విజయపుర జిల్లాలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి కరిచి నోటితో 10 అడుగుల మేర ఈడ్చుకెళ్లిన ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. స్థానికుల సహాయంతో బాలుడిని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. విజయపురలోని రాజ్కుమార్ లేఅవుట్లో సంతోష్ బిరాదార్(3) అనే బాలుడిని వీధి కుక్క కరవడంతో పాటు ఈడ్చుకెళ్లింది. ఇంట్లోని వారు బాలుడిని ఆడుకునేందుకు బయటకు వదిలారు. దీంతో బాలుడు ఆడుతున్న సమయంలో వీధి కుక్క విచక్షణ రహితంగా కరిచి గాయపరిచి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులతో పాటు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా స్థానిక సంస్థలు, పాలకుల నిర్లక్ష్యంతో కుక్కలు యథేచ్ఛగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. జిల్లాధికారిణిగా పూవిత ●నితీష్ బదిలీ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాధికారి నితీష్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహంతేష్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ఆర్థిక, మౌలిక సౌకర్యాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న 2016వ సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూవితను నియమించారు. ఇప్పటి వరకు రాయచూరు జిల్లాధికారిగా పని చేసిన నితీష్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బెంగళూరు కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు. మూడు రోజుల క్రితం కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నంను కూడా బెంగళూరుకు బదిలీ చేఽశారు. చలివేంద్రం ప్రారంభంరాయచూరు రూరల్: నగరంలోని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ వై.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మేనేజర్లు సుఖేష్, వంశీనాథ్, శివశంకర్ రావు, సంఘం అధ్యక్షులు శరణే గౌడ, కార్యదర్శి రవి, శ్రీధర్, రాఘవేంద్ర, వీరేష్, లత, జమున, శ్రీశైల, మహంతగౌడలున్నారు. బాలంకు ఆస్పత్రి యజమాని మృతి రాయచూరు రూరల్: బాలంకు ఆస్పత్రి యజమాని బాలిరెడ్డి(90) మృతి చెందారు. మంగళవారం తెల్లవారు జామున సింధనూరు తాలూకా రైతు నగర(తిమ్మారెడ్డి క్యాంప్)లో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు శ్రీధర్రెడ్డి నగరంలో బాలంకు ఆస్పత్రిని నడుపుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. ఆయన అంత్యక్రియలను స్వస్థలంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య నెరవేర్చారు. రైతుల సొమ్ము అందజేత రాయచూరు రూరల్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా పారిపోయిన దళారుల నుంచి బకాయి సొమ్ము వసూలు చేసిన ఉదంతం యాదగిరి జిల్లాలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలోని బైచబాళ, కూడలిగిల్లో రైతులు వరి ధాన్యాన్ని విక్రయించారు. అయితే మధ్యవర్తులు డబ్బులివ్వకుండా పరారయ్యారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి రాజుగౌడకు వివరించారు. ఆయన వారి ఆచూకీని కనుగొని రైతులకు రావాల్సిన రూ.71 లక్షలు వసూలు చేసి రైతులకు అప్పగించారు. మహిళా బిల్లును వ్యతిరేకించలేదు కోలారు: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదని, బిల్లు వెనుక ఉన్న కుట్రను మాత్రమే వ్యతిరేకించామని కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. బుధవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో మాట్లాడారు. బీజేపీ దూరదృష్టి లేకుండా మహిళా బిల్లును ప్రవేశ పెట్టడం సరికాదని అన్నారు. డీలిమిటేషన్తో కలపడం బీజేపీ కుట్రలో భాగమని అన్నారు. బీజేపీ మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందనే దానికి మణిపూర్ ఘటనలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకురాలు వసంత కవితా రెడ్డి, హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచస్థాయికి బెంగళూరు
● మాస్టర్ప్లాన్ తయారీకి ఒప్పందం: డీసీఎం బనశంకరి: బెంగళూరును ప్రపంచస్థాయి ప్రగతి హబ్ గా తీర్చిదిద్దడానికి గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నామని డీసీఎం డీకే.శివకుమార్ తెలిపారు. బెంగళూరు పురోగతికి ఆర్థిక మాస్టర్ప్లాన్ రూపొందించడం ఐఎస్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మంగళవారం విధానసౌధలో నగరాభివృద్ధిశాఖ కార్యదర్శి తుషార్ గిరినాథ్, ఐఎస్ఈజీ డైరెక్టర్ డాక్టర్ శిరీష్ సంఖ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బెంగళూరు చుట్టుపక్కల రికార్డు స్థాయిలో ఆర్థిక శక్తిని అందించామని చెప్పారు. 8 వేల చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదైన బెంగళూరు అభివృద్ధి, ఎగుమతుల్లో దూసుకెళ్తోందన్నారు. బెంగళూరుకు 500 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2032 నుంచి 2037 వరకు చేపట్టాల్సిన ఆర్థిక మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టూరిజం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం తదితరాలు ఇందులో ఉంటాయన్నారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువచేసే పథకాన్ని దశలవారీగా కార్యరూపంలోకి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఐటీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు ప్రజల నుంచి సలహాలను సేకరిస్తామన్నారు. బెంగళూరును ప్రపంచ నగరాలతో పోటీపడేలా చేస్తామని తెలిపారు.ఎయిర్పోర్టులో కొత్త భద్రతా చర్యలు శివాజీనగర: దేశ, విదేశాల్లో ఇటీవల విమాన ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) భద్రత దృష్ట్యా కొత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విమానాలు సంచరించే స్థలంలో భద్రత పెంచేందుకు ‘స్మార్ట్ ఏర్సైడ్ సేఫ్టీ సిస్టం’ అనే కొత్త సాంకేతికను అమల్లోకి తీసుకొచ్చారు. స్మార్ట్ కెమెరాలు, ఏఐ పరిజ్ఞానంతో విమానాశ్రయ వాహనాల సంచారంపై నిఘా వేస్తారు. అలాగే పొగమంచులో, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు విమానాలకు ప్రమాదం జరగకుండా చూస్తారు. కుర్చీ గందరగోళాన్ని సరిదిద్దాలి: మంత్రి సతీశ్ బనశంకరి: సీఎం పదవి మార్పు గురించి సీఎం, డిప్యూటీ సీఎంను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి గందరగోళాన్ని నివారించాలని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం మార్పు గురించి మల్లికార్జున్ఖర్గే రెండురోజులక్రితం చెప్పారని, ఎన్ని రోజులు ఇలాచెబుతారని, హై కమాండ్ నేతలు అందరి అభిప్రాయాలు తీసుకుని తీర్మానం చేసి గందరగోళానికి చెక్ పెట్టాలన్నారు. అహింద ఓట్లతోనే గెలుపు సాధ్యమైందని, 2028లో అహిందను ఏకతాటిపైకి తీసుకురావడం సవాల్గా మారిందని అన్నారు. దావణగెరె ఉప ఎన్నికలో మైనారిటీల ఓట్లు మైనస్ కావడం చేతులారా జరిగిందని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అంతలోగా దీనిని సరిదిద్దాలన్నారు. పోలీసు ఆత్మహత్య మైసూరు: మానసిక వేదనతో విసిగిపోయి పోలీసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరులో జరిగింది. మృతున్ని మైసూరులోని దేవరాజ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంప్రసాద్ (45)గా గుర్తించారు. నగరంలోని పోలీస్ లేఔట్లోని సొంత ఇల్లు కలిగిన శ్యాంప్రసాద్ దేవరాజ పోలీసు స్టేషన్లో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. డ్యూటీకి రాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో ఉరికి వేలాడుతూ ఉన్నాడు. నజరబాద్ పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లే కారణమని అనుమానాలున్నాయి. -
మంత్రి జమీర్ ఇంట్లో నగల చోరీ
యశవంతపుర: ఏకంగా మంత్రి ఇంటికే కన్నం వేశారు కేటుగాళ్లు. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ నివాసంలో బంగారు నగలను చోరీ చేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు శివాజీనగర పోలీసులు అరెస్ట్ చేసి రూ.1.13 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు. మత్తికెరెకి చెందిన సయ్యద్ అమీన్ అహ్మద్ (48), గోవిందపురవాసి అమీర్ అహ్మద్ (48) పట్టుబడిన దొంగలు, వారి నుంచి 759 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సీమాంత్కుమార్ సింగ్ మంగళవారం తెలిపారు. శివాజీనగర స్టేషన్ రోడ్డులో మంత్రి ఇల్లు ఉంది, మంత్రి తల్లి అందులో ఉంటారు, ఏప్రిల్ 15న బీరువాలో ఉంచిన 1.2 కేజీల బంగారు నగలు పోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వచ్చిన పై దొంగలు ఇంట్లోకి చొరబడి నగలను ఎత్తుకెళ్లారని తేలింది. బడా బైక్ దొంగల అరెస్టు స్కూటర్లు, బైకులను చోరీ చేసి వాటికి నకిలీ ఆర్సి కార్డులను సృష్టించి అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి రూ.41.67 లక్షలు విలువగల 51 వాహనాలను సీజ్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్ (39), నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా (31)ను అరెస్ట్ చేశారు. 501 నకిలీ ఆర్సి కార్డులు కూడా లభించాయి. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్లు చోరీ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితున్ని పట్టుకుని విచారించగా, గుట్టు రట్టయింది. హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంటర్నెట్ సెంటర్లో డూప్లికేట్ ఆర్సి కార్డులను రూపొందించినట్లు చెప్పారు. ఫేస్బుక్లో ప్రకటనలిచ్చి చోరీ వాహనాలను అసలుగా నమ్మించి అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. వీరు బెంగళూరులో 9 పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. 692 మొబైళ్ల రికవరీ బెంగళూరు ఈశాన్య పరిధిలో చోరీలకు గురైన 692 మొబైల్ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.1.75 కోట్లు అని చెప్పారు. ఈశాన్య విభాగంలోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు గురైన మొబైల్లను సీఈఐఆర్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగల అరెస్టు ఆభరణాల స్వాధీనం -
బెంగళూరుతో పాటు జిల్లాలకు వర్షసూచన
బనశంకరి: భరించలేని వేసవి ఎండల మధ్య వాన హెచ్చరికలు వచ్చాయి. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సుమారు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారముంది. దీంతో బెంగళూరు, రూరల్తో పాటు 13 జిల్లాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. చిక్కబళ్లాపుర, రామనగర, మండ్య, మైసూరు, చామరాజనగర, కొడగు, కోలారు, బెళగావి, ధార్వాడకు అలర్ట్ వచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులో పలుచోట్ల జల్లు వర్షం కురిసింది. బెళగావి నగరంలో జోరువాన పడడంతో రోడ్లు జలమయం అయ్యాయి. నగరంలో జల్లులు, బెళగావిలో వర్షం -
అడ్డపల్లకీ వైభవం
గౌరిబిదనూరు: నగరంలో వీరశైవ లింగాయత పంచ పీఠాల భక్తులు ఏర్పాటు చేసిన జగద్గురు రంభాపురి వీర సింహాసనాధీశ్వర 1008 జగద్గురు ప్రసన్న రేణుకా వీరసోమేశ్వర రాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామి అడ్డపల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. సోమ, మంగళవారాలు పల్లకీ వేడుకలు పుర వీధులలో అట్టహాసంగా సాగాయి. జానపద బృందాల ప్రదర్శనలు అలరించాయి. స్వామీజీలు మాట్లాడుతూ సమాజంలో ధర్మ జాగృతి, శాంతి తదితర ప్రాముఖ్యతను వివరించారు. అంబాదేవి హారతి వేడుక తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకా హులికుంటె ఫిర్కా హొసహళ్లి గ్రామంలోని శ్రీ అంబాదేవి దేవస్థానం 20వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. హొసహళ్లి, నేరలహళ్లితో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల భక్తులు, మహిళలు జ్యోతులు మోసుకొచ్చి అంబాదేవికి హారతి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు హెచ్ఎం శశిధర్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. రాష్ట్ర సర్కారుతో ప్రజలకు విసుగు: కుమార తుమకూరు: రాష్ట్రంలోని ఇప్పటి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే రోజుల్లో బీజేపీ, జేడీఎస్ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. తుమకూరు తాలూకా ముళకుంటె గ్రామంలో మంగళవారం జరిగిన విజయ చౌడేశ్వరి దేవి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిందన్నారు. ఈ గెలుపు దేశ తదుపరి ఎన్నికలకు దిక్సూచి అన్నారు. ఈ సభలో జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.నింగప్ప, సీబీ సురే ష్బాబు, ఎమ్మెల్యేలు బీ.సురేష్గౌడ, ఎంటీ కృష్ణప్ప, మాజీ ఎమ్మెల్సీ చౌడరెడ్డి పాల్గొన్నారు. 8 నుంచి కబ్బన్పార్క్లో మామిడి, పనస మేళాశివాజీనగర: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మే 8 నుంచి 17 వరకు బెంగళూరు కబ్బన్ పార్కులో రాష్ట్రస్థాయి మామిడి, పనస ప్రదర్శన, అమ్మక మేళా జరగనుంది. సహజంగా మాగబెట్టిన పండ్లు, రైతులు నేరుగా విక్రయించడం వల్ల మంచి ధరలకే లభిస్తాయని చెప్పారు. మామిడి రైతులకు మార్కెటింగ్ నేరుగా లాభాల గురించి సమాచారం అందస్తారు. ఉత్తమ రకాలైన పనస, మామిడి పండ్లు లభిస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.45 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పూత ఆలస్యమైంది. మామిడి పండ్ల సరఫరా లేటుగా జరుగుతోంది. దీని వల్ల పండ్లు ఎక్కువ కాలం లభిస్తాయని చెప్పారు. ఇస్రో క్యాంపస్పై అనుమానిత డ్రోన్ శివాజీనగర: బెంగళూరులో ఇస్రో క్యాంపస్పై గుర్తుతెలియని డ్రోన్ విహారం కలకలం రేపింది. మే 2న ఉదయం 8:16 గంటల సమయంలో కార్తీక్ నగరలోని ఇస్రో ఉపగ్రహ యూనిట్, పరీక్షా కేంద్రంపై సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తులో కొన్ని క్షణాల పాటు గుర్తు తెలియని డ్రోన్ విహరించిందని సీఐఎస్ఎఫ్ సిబ్బంది హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేశ భద్రత దృష్ట్యా ఇస్రో క్యాంపస్ సున్నిత ప్రదేశంకాగా, నో డ్రోన్ జోన్గా గుర్తించబడింది. డ్రోన్ను ఎగురవేసినవారిని గుర్తించి, దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. పసిబిడ్డ విక్రయం ఉత్తిదే.. బనశంకరి: భార్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి, రెండున్నరేళ్లు వయసుగల చిన్నారిని రూ.5 లక్షలకు అమ్మేసిందని భర్త తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. అలాంటిది ఏదీ జరగలేదని బెంగళూరు వివేకనగర పోలీసులు కనిపెట్టారు. దంపతుల మధ్య గొడవలతో ఇలా ఫిర్యాదు చేశాడని చెప్పారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. -
శృంగేరి.. తపాలా ఓట్ల కిరికిరి
శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రం, శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పునర్ లెక్కింపులో బీజేపీ నాయకులు క్రిమినల్ పన్నాగం పన్ని ఓట్ల దొంగిలించారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. శృంగేరిలో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ విజయం సాధించడం తెలిసిందే. దీంతో మూడేళ్లుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ మాజీ కావడంతో కాంగ్రెస్ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకు చెల్లలేదు? మంగళవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ గత అసెంబ్లీ ఎన్నికల్లో 201 ఓట్లతో గెలుపు సాధించారు. రాజేగౌడకు ఈవీఎంలలో 59,171 ఓట్లు, 569 పోస్టల్ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జీవరాజ్కు ఈవీఎంలలో 58,970 ఓట్లు, పోస్టల్ ఓట్లు 692 వచ్చాయి. 200 ఓట్లతో రాజేగౌడ గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో అక్రమం జరిగిందని కేసు వేశారు అని సీఎం తెలిపారు. రీకౌంటింగ్లో 314 ఓట్లు మాత్రమే చెల్లినవి. 255 ఓట్లు చెల్లలేదు, అవి ఎందుకు చెల్లలేదో చెప్పాలన్నారు. జీవరాజ్కు రీకౌంటింగ్లో గతం కంటే 2 ఓట్లు తగ్గి 690 ఓట్లు వచ్చాయి, దీనిని చూస్తే బీజేపీ నాయకులు ఓట్ చోరీ చేశారనేది తెలుస్తుందన్నారు. రీకౌంటింగ్కు కేంద్ర పరిశీలకులు వచ్చారు, కుట్ర జరిగిందని వారే కేంద్రానికి లేఖ రాసినట్లు తనకు తెలిసిందన్నారు. ఏమవుతుందో చూడాలని అన్నారు. దావణగెరె, బాగల్కోట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, 2028 ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. అభ్యర్థిపై కేసు.. హైకోర్టు ఆగ్రహం శివాజీనగర: గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని శృంగేరి నూతన బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి విచారించారు. 2023 మే 13న జరిగిన ఘటన మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తే ఎలా? ట్యాంపరింగ్ గురించి హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా? ఓటమిపాలైనవారు ఎవరు కుట్ర చేస్తారు, ఎవరు వారు? పిలవండి, మీకు కళ్లు కనిపించవా, సస్పెండ్ చేయాల్సి ఉంటుంది.. అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రస్తుత ఎన్నికలాధికారి గౌరవ్ శెట్టిపై ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, రాజకీయ ప్రభావానికి లోనై కేసులు పెట్టరాదు అని సూచించారు. జీవరాజ్పై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్టే జారీ చేసి విచారణను వాయిదా వేశారు. దీంతో జీవరాజ్కు ఊరట దక్కింది. అక్కడ బీజేపీ నేతలచే ఓట్ చోరీ జరిగింది సీఎం సిద్దరామయ్య ఆరోపణలు కోర్టులో బీజేపీ అభ్యర్థికి మరోసారి ఊరట -
బెంగళూరులో ఆకలి తీర్చుకుందామని హోటల్కు వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ధరల మంట అలా ఉంది. ఏది ముట్టుకున్నా వాత తప్పదు
● రాజధానిలో మోతెక్కిపోతున్న రేట్లు ● మసాలా దోసె రూ.100 ● ప్లేటు పూరీ.. అంతే ధర ● యుద్ధం, గ్యాస్ ధరలతో మంట సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో మామూలుగానే హోటళ్లలో ధరలు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, గ్యాస్ ధరల పెంపు వల్ల మరింతగా హోటల్ సందర్శకులపై భారం పడుతోంది. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అనేలా హోటళ్లలో రేట్లు భగ్గుమంటున్నాయి. గత వారంలోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 993 మేర కేంద్రం పెంచింది. గత రెండు నెలల కాలంలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,490 మేర పెరిగింది. దీనిని కారణంగా చూపుతూ నగరంలోని ఎక్కువ శాతం హోటళ్లు ఆహార పదార్థాలు, టీ, కాఫీ ధరలను పెద్దమొత్తంలో పెంచేశాయి. దీంతో ఆరగిద్దామని వెళ్లేవారికి జేబులకు చిల్లులు పడుతున్నాయి. నెలరోజుల్లో రెండోసారి బాదుడు ● బెంగళూరు నగరంలో సుమారు 40 వేళ్లకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ● ఒక నెల రోజుల క్రితమే గ్యాస్ కొరత నెపంతో హోటళ్లు టిఫిన్, భోజన ధరలను పెంచాయి. ● భోజనం ధర రూ. 10 నుంచి రూ. 20 మేర, టిఫిన్ ధరలు రూ 5–10 మేర పెరిగాయి. ఇడ్లీ రూ. 5, దోసె రూ. 10 వరకూ రేటు అధికమైంది. ● మల్లేశ్వరంలోని ప్రముఖ హోటళ్లలో రెండు పూరీలు, కూర ధర రూ. 100కు చేరింది. రెండు నెలల క్రితం ఈ ధర రూ. 80 వద్ద ఉండేది. ప్లేటు పులిహోరె రూ. 70 నుంచి రూ. 80కు పెరిగింది. ● జయనగర మూడో బ్లాక్లో దోసె క్యాంప్ హోటల్లో గతంలో మసాల దోసె రూ. 90 ఉండగా ఇప్పుడు రూ.100కు పెంచేశారు. భోజనం మరింత ప్రియం బెంగళూరులో కామత్ హోటళ్ల గురించి తెలిసిందే. వీటిలో గతంలో భోజన ధర రూ. 120 ఉండగా, నేడు అది రూ.140కి చేరింది. గతంలో దోసె రూ. 90 అయితే ఇప్పుడు వంద అయ్యింది. రూ.20 ఉన్న టీ ధర రూ.25కు పెరిగింది. సింగిల్ పూరీ రూ. 50 నుంచి రూ. 55కు చేరింది. కొన్ని దర్శిని హోటళ్లలో రూ.90 ఉన్న భోజనం రేటు రూ. 100కు పెంచారు. ఇలా ఏది ముట్టుకున్నా అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. సామాన్యులపై భారం రేట్ల పెంపు వల్ల కొన్ని నెలల్లో హోటళ్లకు 15–20 శాతం సందర్శకుల సంఖ్య క్షీణించినట్లు సమాచారం. బ్యాచిలర్లు, అల్పాదాయ ప్రజలు ధరల్ని తలచుకుని అమ్మో అంటున్నారు. చిన్నపాటి హోటళ్లలో 200 గ్రాముల కబాబ్కు రూ.100 ఉండగా ఇప్పుడు రూ. 120కి పెరిగింది. చికెన్ బిర్యానీ ధర కూడా చిన్నహోటళ్లలో రూ. 130 నుంచి రూ. 140కి పెంచారు. వంట గ్యాస్ కొరత తీరుతోందని అనుకునేలోపల ధరలతో ఇబ్బంది వచ్చింది. -
టెన్నిస్ టోర్నీ షురూ
తుమకూరు: కల్పతరునాడు తుమకూరు నగరంలో ఐటీఎఫ్డబ్ల్యూ–35 ర్యాంకింగ్ తుమకూరు మహిళా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి మంగళవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. తుమకూరు విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించిన టెన్నిస్ కోర్టు ఈ టోర్నీకి వేదికైంది. హోంమంత్రి జీ.పరమేశ్వర్, టోర్నీ ప్రముఖులు, జిల్లాధికారి, ఎమ్మెల్యేలు బెలూన్లను ఎగరేయడం ద్వారా నాంది పలికారు. కన్నికా పరమేశ్వర్, ఎమ్మెల్యేలు సురేష్గౌడ, జ్యోతిగణేష్, సురేష్బాబు, గోవిందరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్లలో పలువురు క్రీడాకారిణులు తలపడగా, పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. -
రైతుల జీవనాడి.. సేవకు మళ్లీ రెడీ
హొసపేటె: రైతుల జీవనాడిగా నిలిచిన, 70 ఏళ్ల చరిత్ర కలిగిన తుంగభద్ర డ్యాంలో మొత్తం 33 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో డ్యాం భద్రతపై రైతులు, అధికారుల్లో నెలకొన్న ఆందోళన తొలిగిపోయింది. ఈ డ్యాం రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు సురక్షితంగా ఉంటుందని తుంగభద్ర బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఆగస్టు 10వ తేదీ రాత్రికి రాత్రే తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్గేటు గొలుసు తెగిపోయి కొట్టుకు పోయిన ఘటనతో డ్యాం భద్రతపై సర్వత్రా ఆందోళన రేకెత్తింది. డ్యాంలోని మొత్తం 33 పాత క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చేందుకు ప్రభుత్వం, నీటి పారుదల నిపుణులు, తుంగభద్ర బోర్డు అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4–5 నెలల్లోనే పనులు పూర్తి తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన సమయంలో డ్యాంలో నీటి నిల్వ, వరద భారీగా ఉన్నాయి. దీంతో నీరంతా వృథాగా నదిలోకి పారుతోందని రైతులు ఆందోళన చెందారు. అయితే ఆ క్రస్ట్గేటును అమర్చేందుకు 2025 జూన్లో గుజరాత్కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదిరినప్పటికీ జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అయితే డిసెంబర్ 5వ తేదీ నాటికి జలాశయంలో నీటిమట్టం 10 అడుగుల మేర తగ్గడంతో మొదట 18వ క్రస్ట్గేటు అమరిక పనులను ప్రారంభించారు. ఆ పనులు విజయవంతంగా పూర్తయిన తర్వాత 19వ క్రస్ గేటును మార్చాలని నిర్ణయించారు. ఈ రెండు గేట్లను అమర్చడానికి 2 నెలల సమయం పట్టింది. అనంతరం మిగిలిన క్రస్ట్ గేట్లను అమర్చే పనులు ముమ్మరంగా సాగాయి. డిసెంబర్ 25వ తేదీ నుంచి కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే మొత్తం 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడం అందరి ప్రశంసలకు పాత్రమైంది. రైతాంగంలో హర్షాతిరేకాలు తుంగభద్ర డ్యాం నుంచి విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని లక్షలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందుతోంది. అంతేకాకుండా పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న ఈ డ్యాంకు చెందిన క్రస్ట్గేట్ల ఏర్పాటుకు 2–3 ఏళ్లు పట్టవచ్చనే భయంతో పాటు ప్రజల్లో అనేక రకాల ఆందోళనలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు కేవలం 4–5 నెలల స్వల్ప వ్యవధిలోనే అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలోని బృందంతో సహా పలువురు కార్మికులు ప్రాణాలకు తెగించి తొలుత తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు. రూ.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా 33 క్రస్ట్గేట్ల ఏర్పాటుకు అవసరమైన ఇనుప పలకలను జోడించడం వంటి వివిధ సన్నాహక పనుల కోసం హొసపేటె, గదగ్ వద్ద రోజుకు 60 మంది కార్మికులు పని చేయగా, డ్యాం వద్ద మరో 60 మంది కార్మికులు నిత్యం శ్రమించారు. ఈ జలాశయానికి చెందిన ఒక్కో క్రస్ట్గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగి, 5 టన్నుల బరువు ఉంది. నీటిని నిల్వ చేసే ఒక భారీ ఆనకట్టపై క్రస్ట్గేట్లను అమర్చే సాహసోపేతమైన ఈ పనిని హైడ్రాలిక్ క్రేన్లు, ట్రక్కుల వంటి ఆధునిక యంత్రాలను వినియోగించి ఎటువంటి ప్రమాదాలు లేకుండా పూర్తి చేసినందుకు తుంగభద్ర బోర్డు అధికారులు, ఇంజనీర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెల్డింగ్, పెయింటింగ్ పనులు పెండింగ్ తుంగభద్ర డ్యాంకు చెందిన 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ కొన్ని గేట్ల వెల్డింగ్, పెయింటింగ్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఈ పనులన్ని ఈనెల 15 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జలాశయానికి చెందిన పాత క్రస్ట్గేట్లు 70 ఏళ్లకు పైగా మన్నిక వచ్చాయి. ఇప్పుడు కొత్త గేట్లను అమర్చిన నేపథ్యంలో వాటి నిర్వహణను సక్రమంగా చేపడితే రాబోయే మరో 50–60 ఏళ్ల పాటు ఎటువంటి సమస్యలు తలెత్తవని టీబీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ క్రస్ట్గేటు కొట్టుకుపోవడంతో అప్పట్లో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభం కాకముందే మొత్తం 33 క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు, ఆయా గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హొసపేటె సమీపంలోని తుంగభద్ర జలాశయం(ఫైల్) డ్యాంకు ఇటీవల అమర్చిన కొత్త గేటు 70 ఏళ్ల నాటి పాత క్రస్ట్గేట్లన్ని ఇప్పుడు కొత్తవే మరో 60 ఏళ్ల వరకు డ్యాం భద్రతకు ఢోకా లేదు టీబీ డ్యాం 33 కొత్త క్రస్ట్గేట్ల ఏర్పాటు పనులు పూర్తి -
చెరువులో స్నానానికెళ్లి యువకుడు మృతి
హొసపేటె: సరదాగా చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన ఓ యువకుడు మునిగి మృతి చెందిన ఘటన సోమవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరిగింది. సిద్దాపుర వడ్డరహట్టికి చెందిన యువకుడు అరుణ్ (19) ఈ ఏడాది ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. వేసవి సెలవుల్లో కూలి పని కోసం మండ్యకు వెళ్లిన అరుణ్ తమ బంధువు వివాహం కోసం తమ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటి నుంచి కానాహొసహళ్లికి జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చిన అరుణ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం సరదాగా చెరువులో స్నానానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు చీకటి పడేంత వరకు చెరువులో గాలించినప్పటికీ మృతదేహం లభించలేదు. చివరకు కానాహొసహళ్లి పోలీసులు దావణగెరె జిల్లాలోని హరిహర నుంచి నలుగురు గత ఈతగాళ్లను రప్పించగా, యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. పేదవారైన మృతుని తల్లిదండ్రులు, తమ ఏకై క కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం క్రీడా మైదానం ప్రారంభంహుబ్లీ: ఎస్బీఎం ఆస్పత్రిలో డాక్టర్ నిరంజన్కుమార్ 75వ జన్మదినం సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. పిల్లల క్యాన్సర్ విభాగం ఇటీవల ప్రారంభం కాగా కిమోథెరపీ పొందుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. దీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండే పిల్లల్లో ఉత్తేజం నింపడానికి ఈ కొత్త కార్యక్రమం చేపట్టారు. ఉత్తర కర్ణాటకలో తొలిసారిగా నిర్మించిన ఈ ఆట మైదానం చిన్న పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ 100కు పైగా పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. మృదువైన సామాన్లు, బోర్డు గేమ్స్, క్యారంస్ ఆట, వైస్ ఛాన్సలర్ 2 ఏళ్ల పిల్లాడితో క్రికెట్ ఆడటం ద్వారా ఆట మైదానాన్ని అధికారికంగా ప్రారంభించారు. డాక్టర్ తన్వీర్ షేక్ మాట్లాడుతూ క్యాన్సర్ కిమోథెరపీ పిల్లల దేహాన్ని బలహీన పరుస్తుంది. అయితే వారి మనోనిబ్బరం, ఆత్మసైర్యాన్ని తగ్గించలేదన్నారు. ఈ ఆట మైదానం సమగ్ర చికిత్సకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో చికిత్స పూర్తి చేసుకున్న పిల్లలతో పాటు 4వ స్టేజ్ క్యాన్సర్ చికిత్స పొందిన ఓ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్తో 4వ స్టేజ్లో ఉన్న చిన్నారి వ్యాధిని జయించాడు. ముఖ్యంగా ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 67 శాతం మార్కులు సాధించిన బాధిత బాలిక అందరిలో విశ్వాసాన్ని నింపారు. బహిరంగ స్థలంలో పొగాకు వాడితే రూ.1000 జరిమానాహుబ్లీ: బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. ఎవరైన వ్యక్తి బహిరంగ స్థలంలో పొగాకు ఉత్పత్తులను వాడరాదు. ఒక వేళ వాడిన పక్షంలో రూ.200 నుంచి రూ.2000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. 21 ఏళ్ల లోపు వ్యక్తులపై నిర్ధిష్ట ప్రాంతంలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల వాడకంపై కూడా నిషేధం విధించారు. 21 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో విడిగా లేదా కట్టల చొప్పున సిగరెట్లు, ఇతర ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. అమ్మేందుకు కూడా దుకాణం పెట్టరాదని ఆయన సూచించారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కనీసం రూ.1000 వరకు జరిమానా విధిస్తామని ఆ ప్రకటనలో ఆయన వివరించారు. నరేగ పనుల పరిశీలన రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నరేగ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పరిశీలించారు. సోమవారం రాయచూరు తాలూకా బిజినగేరలో చేపట్టిన నరేగ పథకం పనులను ఆయన పరిశీలించి కూలీ కార్మికులతో చర్చించారు. వేసవిలో ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం 6 గంటలకే పనులకు రావాలని, 11 గంటల్లోపు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలైన తాగునీరు, నీడ కల్పించడం వంటివి చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నిరంతర అధ్యయనం అవసరంరాయచూరు రూరల్: విద్యార్థులు వైద్య రంగంలో నిరంతర అధ్యయనంతో ఉత్తమ పరిణితిని సాధించాలని నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి పిలుపు ఇచ్చారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో జరిగిన విద్యార్థి సమావేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉత్తమ విద్యాభ్యాసానికి కళాశాల అందిస్తున్న బోధనలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవ చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రిజిస్ట్రార్ శ్రీనివాస్, మోహన్ గుప్త, చంద్రమౌళి, సురేష్ బాబు, లక్ష్మి, అపర్ణ, రశ్మీ, స్వప్నిల్లున్నారు. -
పాత టైర్లతో మొక్కల పెంపకం
రాయచూరు రూరల్: వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు కొప్పళ నగరసభ ఒక అడుగు ముందుకేసింది. నగరంలో చెత్తను పారవేసే చోట మినీ ఉద్యానవనాల ఏర్పాటుకు సిద్ధమైంది. చెత్తను పారవేసిన వారిపై జరిమానాలు విధించినా ప్రజలు తీరు మారకపోవడంతో దీని నియంత్రణకు కొప్పళ నగరసభ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాతబడిన టైర్లకు రంగులు వేసి వాటిని రక్షణగా పెట్టి మొక్కలు నాటారు. నగర సౌందర్యం పెంపొందించడానికి కొత్త మార్గాలు వెతికారు. బీజేపీ మాజీ నగరసభ సభ్యురాలు దివ్యా అగ్ని స్వచ్ఛత, పరిసరాల సంరక్షణకు ముందుకు రాగా, ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. కొప్పళలో వినూత్న ప్రయోగం -
భీమా నదిలో వ్యర్థాల తొలగింపు
రాయచూరు రూరల్: భీమా నదిలో స్వచ్ఛతకు యువ బ్రిగేడ్ శ్రీకారం చుట్టింది. ఆదివారం కలబుర్గి జిల్లా అప్జల్పుర వద్ద భీమా నదిలో చెత్త చెదారం, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు, దుస్తులు, ఇతరత్ర స్వచ్ఛత కార్యకమానికి శ్రీకారం చుట్టారు. వానకాలం ప్రారంభానికి ముందే వర్షపు నీరు వచ్చి నదిలో చేరక ముందే అపరిశుభ్రతను తొలగించారు. అప్జల్పుర యువ బ్రిగేడ్ సంచాలకుడు రాజేంద్ర ఆధ్వర్యంలో 15 మందితో కూడిన బృందం నదీ తీర ప్రాంతాలను శుభ్రం చేశారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘంరాయచూరు రూరల్: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘమని రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో శాంతియుతంగా మానవుడు ఉన్నారంటే సైనికుల వల్లేనని గుర్తెరగాలన్నారు. వారిని గౌరవించడం మనందరి కర్తవ్యమన్నారు. మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లాధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. కుటుంబం గురించి ఆలోచించని సైనికులు దేశ రక్షణ, శాంతి సౌభ్రాతృత్వం కోసం పాకులాడుతారన్నారు. కార్యక్రమంలో శివరామానంద భారతి స్వామీజీ, వెంకన గౌడ, ధర్మణ్ణ, కృష్టమూర్తి, వీరభద్రయ్య, పంపణ్ణ, చక్రవర్తి, విశ్వనాథ్, రంగనగౌడ, శరణ బసవ, హంపనగౌడ, బసవరాజ్లున్నారు. మసరకల్ ఆస్పత్రికి జాతీయ స్థాయి అవార్డు రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా మసరకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కమిటీ వచ్చి పరిశీలించిన బృందంలో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీశైల పాటిల్, తమిళనాడు కావేరి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో 91.27 శాతం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం నుంచి ఆస్పత్రిలో శుభ్రత, మందుల లభ్యత, రోగులకు చికిత్సలు, స్నేహ సంబంధాలు, అత్యవసర చికిత్సల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, వైద్యులు, నర్సులు, సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం వంటి అంశాలను గుర్తించిన బృందం ఎన్క్యూఏఎస్ అవార్డుకు ఎంపికై ంది. మసరకల్ ఆస్పత్రి వైద్యులు బనదేశ్, శంశుద్దీన్, సిబ్బంది హరీష్, మల్లయ్య, పర్వేజ్ల సేవలను గుర్తించారని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత పేర్కొన్నారు. కొప్పళ జిల్లాలో నవజాత శిశువు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో నవజాత శిశువు లభ్యమైన ఘటన వీడియో వైరల్ అయింది. సోమవారం కుకనూరు తాలూకా ద్యాంపురలో అప్పుడే పుట్టిన బిడ్డను వీధి పక్కన పారేసి పరారయ్యారు. గ్రామస్తులు చేరి శిశువును ఎత్తుకుని సకల పరిచర్యలు చేశారు. అనంతరం బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. ఎవరో పురిటి బిడ్డను కర్కశంగా రోడ్డు పక్కన పడేసి పోవడం చూపరులందరి మనస్సులను కలిచి వేసింది. రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతరాయచూరు రూరల్: రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. సోమవారం రాయచూరు తాలూకా శక్తినగర్ నుంచి కాడ్లూరు వరకు రోడ్డు, గిల్లేసూగూరు–తురకనడోణ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. -
ట్రాక్టర్, లారీ ఢీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు
సాక్షిబళ్లారి: ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో తిమ్మలాపుర వద్ద టోల్ గేట్ వద్ద మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ముందు జాతీయ రహదారిపై జరిగింది. లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో లారీ డ్రైవర్ ఫయాజ్, ట్రాక్టర్ డ్రైవర్ మల్లేష్, శివప్ప తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకా కాళింగేరి నుంచి ట్రాక్టర్లో మిర్చి బస్తాలు తీసుకొని మరియమ్మనహళ్లికి వెళుతుండగా, తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ముంబైకి 12 టన్నుల మామిడి కాయలను లారీలో తీసుకొని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై రెండు వాహనాలు బోల్తా పడటంతో రోడ్డుపై మామిడి కాయలు చెల్లాచెదురుగా పడి పోయాయి. రోడ్డుపై పడిన మామిడి కాయలను తీసుకోడానికి జనం పోటీ పడ్డారు. మిర్చి సంచులు కూడా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుకు అటు వైపు మామిడి కాయలు, ఇటు వైపు మిర్చి బస్తాలు పడి పోయి వాహనాలు కూడా రోడ్డు మీదే బోల్తా పడిన నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. గాయపడిన వారిని హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరియమ్మనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అభిమానోత్సవానికి భారీగా తరలి రండి
సాక్షిబళ్లారి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్.యడియూరప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడమేగాకుండా రైతు సంక్షేమానికి ఎంతో శ్రమించారని విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా పేర్కొన్నారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. చిత్రదుర్గలో ఈ నెల 9న యడియూరప్ప అభిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. బళ్లారి జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారన్నారు. బీజేపీ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. రాష్ట్రంలో రైతు పర, నీటి పారుదల, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి కూడా అందించిన సహకారం మరువలేనిదన్నారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షగౌడ, మురారీ గౌడ పాల్గొన్నారు. -
మున్సిపల్ అధ్యక్షురాలిగా రేష్మా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పురపాలక సంఘం నూతన అధ్యక్షురాలిగా రేష్మా సికందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో రాబోయే రోజుల్లో అందరినీ విశ్వాసంలోకి తీసుకొని, పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు నీటిపారుదల వ్యవస్థతో పాటు పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. సంఘం ఉపాధ్యక్షురాలు నేత్రావతి హుచ్చప్ప సెరెగార, మాజీ అధ్యక్షులు ఎం.మరిరామప్ప, మాజీ ఉపాధ్యక్షురాలు అంబికా దేవేంద్రప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరి గోణిబసప్ప, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సాహేరా బాను, తాలూకా అధ్యక్షురాలు యశోదా మంజునాథ్, నాయకులు సికందర్, గుండ్రు హనుమంత, సెరెగార హుచ్చప్ప, కవితా ఆల్దాళ్, ఉప్పర బాలప్ప, త్యావణిగి కొట్రేష్, బారికర్ బాపూజీ, మడివాళర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి వృథా.. తీరని వ్యథ
పగిలిన పైపు నుంచి వృథా అవుతున్న నీరు నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కిన ప్రజలు రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెపుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అయినా అధికారులు మౌనం వహిస్తున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. హరిజనవాడ, దేవినగర్ల మధ్యలో తాగునీటి పైపులైన్లు పగిలి పోయాయి. తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో నగరసభ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నీటి కోసం నానాపాట్లు ప్రజలు మాత్రం నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కి నీటిని తోడుకుంటున్నారు. వారం రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అస్కిహాళ, దేవినగర్, హరిజన వాడ, అయ్యబోడి, మడ్డిపేటలకు వారం రోజుల కిందట నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనులు చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా నగరసభ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పగిలిన తాగునీటి సరఫరా పైపు వారం రోజులుగా అందని నీరు నీటి కోసం నగరవాసుల తహతహ -
పంచ రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై విజయోత్సవం
రాయచూరు రూరల్: పంచ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన విజయోత్సవంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు వీరనగౌడ మిఠాయిలు పంపిణీ చేశారు. బీదర్ దక్షిణ శాసన సభ్యుడు శైలేంద్ర బెల్దాళ్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు. ఇది పార్టీ కార్యకర్తల విజయంగా భావించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్షా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాషాయ పతాకం రెపరెపలాడుతుందన్నారు. కర్ణాటకలోని బాగల్కోటె, దావణగెరెల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఆ పార్టీ విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్, రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ హర్షం వ్యక్తం చేశారు. -
భార్య వైద్యానికి డబ్బు సమకూర్చలేక భర్త ఆత్మహత్య
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర గ్రామ పంచాయతీ పరిధిలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం అవసరమైన లక్షల రూపాయలను సమకూర్చలేక, తీవ్ర నిరాశకు గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మల్లాపుర గ్రామానికి చెందిన శివప్ప (26)గా గుర్తించారు. మెదడు సంబంధిత పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) బారిన పడిన తన భార్యకు సకాలంలో చికిత్స అందించడానికి అవసరమైన డబ్బును సమకూర్చలేక పోవడంతో ఆ యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రారంభంలో తన చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేసి అతను భార్యకు చికిత్స చేయించాడు. ఆ తర్వాత అప్పులు కూడా చేశాడు. అయినప్పటికీ అతని భార్య ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. దీంతో తన భార్య చికిత్స కోసం డబ్బును సమకూర్చలేక అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంగాపుర జీపీ పరిధిలోని విప్రమగనిలో దేవఘాట్లి వైపునకు వెళ్లే రహదారికి ఎడమ వైపున ఉన్న ఒక రైతు గిడ్డంగి పక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం శివప్ప మృతదేహం లభ్యమైంది. -
బాగల్కోటె బీజేపీదే అనుకున్నాం
బనశంకరి: బాగల్కోటెలో తమ ఓటమిని ఊహించలేదని, ఇకపై పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర తెలిపారు. సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటెలో తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, బాగల్కోటెలో ఇలా అవుతుందని అనుకోలేదన్నారు. బాగల్కోటేలో సీఎం సిద్దరామయ్య 15 రోజులు మకాం పెట్టారని, మంత్రులు కూడా ఇక్కడే తిష్ట వేశారని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వానికి శక్తి నింపిందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధికార మదంతో హిందువులకు అన్యాయం చేశారని, అందుకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ మాట్లాడుతూ.. దావణగెరె దక్షిణలో గెలుస్తామనుకున్నారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు సందర్భంగా నేతలు మిక్చర్ పంచి సంబరాలు నిర్వహించారు. బీజేపీ సారథి విజయేంద్ర -
కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు
కోలారు: రాష్ట్రంలో జరిగిన దావణగెరె, బాగలకోటె ఉప ఎన్నికలు, కేరళ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు టపాసులుకాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పంచ గ్యారెంటీలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కారణమన్నారు. ఉప ఎన్నికల్లో విజయం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై మరింతగా విశ్వాసం ఉంచారనేందుకు నిదర్శనమన్నారు. కేరళలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతానికి నిదర్శనమన్నారు. నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ఆర్ మురళీగౌడ, లాల్ బహద్దూర్ శాస్త్రి, నాగరాజ్, శ్రీనివాస్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా జ్యోతుల ఉత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు పరిధిలో ఆనేకల్ తాలూకా హెన్నాగరంలో వెలసిన గ్రామ దేవత శ్రీయల్లమ్మ దేవి ఆలయంలో జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. 10కి పైగా గ్రామాల నుంచి భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. హెన్నాగరం, యరండహళ్లి, హెచ్.హోసహళ్లి, కాచనాయకనహళ్లి, చందాపుర, బనహళ్లి, శ్రీరాంపుర, బెల్లందూరు, అగర, హారగద్దె తదితర ఊళ్లనుంచి భక్తులు పాల్గొన్నారు. యల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో సహా పలు పూజలు నిర్వహించారు. ముళ్లపంది వేటగాడు అరెస్టు మైసూరు: అడవిలో ముళ్లపందిని చంపి, అమ్మడానికి ప్రయత్నించిన వేటగాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. హెచ్డి కోట తాలూకాలోని అగసనహుండి బస్టాండు వద్ద హరీష్ అనే వ్యక్తిని నిర్బంధించి, వేట పనిముట్లు, ముళ్లపంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపంది మాంసం, ముళ్లు, ఎముకలకు ఔషధ గుణాలు ఉన్నాయనే మూఢ నమ్మకం కారణంగా అక్రమ వేట కొనసాగుతోంది, వన్యప్రాణుల వేట పర్యావరణ సమతుల్యతకు ముప్పు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలను చూస్తే, వెంటనే అటవీ శాఖ హెల్ప్లైన్ 1926కు తెలియజేయాలి అని జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. జాతరలో ప్రమాదం, 20 మందికి గాయాలు దొడ్డబళ్లాపురం: గదగ్లోని తొంటాదార్య మఠంలో జరిగిన జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో ఎగ్జిబిషన్లో డ్యాన్సింగ్ ఫ్లోర్ వీల్ విరిగిపడి 20 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వీల్ వేగంగా తిరుగుతుండగా అందరూ ఉత్సుకతతో కేకలు వేస్తున్నారు. ఈ సమయంలో అది విరిగి కుప్పకూలింది. క్షణాల్లోనే జనం హాహాకారాలతో దద్దరిల్లింది. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గదగ్ పట్టణ పోలీసులు జాతర కమిటీ, ఫ్లోర్ వీల్ యజమానిపై కేసు నమోదు చేశారు. కూతుర్ని వేధిస్తున్నాడని డెలివరీ బాయ్ హత్య దొడ్డబళ్లాపురం: నీ కుమార్తెను ప్రేమిస్తున్నా, నాకు ఇచ్చి వివాహం చేయాలని వెంటబడి వేధిస్తున్న యువకున్ని యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి హతమార్చాడు, ఈ సంఘటన యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తండ్రి ఈరయ్య (44), బంధువులు చిన్నయ్య (29), చేతన్ (26), వినాయక (19)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెళగావికి చెందిన రమేశ్ (22) బెంగళూరుకు వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రమేశ్ ఈరయ్య కుమార్తెను వేధించడంతోపాటు ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో రమేశ్ని హతమార్చాలని పథకం వేశారు. మిగతా నిందితులతో కలిసి రమేశ్ను బార్కు తీసుకెళ్లి మద్యం తాగారు. తరువాత కారులో వెళ్తూ తాడుతో గొంతు బిగించి చంపి మృతదేహాన్ని అళ్లాలసంద్ర వద్ద రాజకాలువలో విసిరేసి పరారయ్యారు. పోలీసులు విచారించి అరెస్టు చేశారు. కాగా, రమేశ్పై బాగలకోటలో అత్యాచారయత్నం కేసు, మరో బెదిరింపుల కేసు ఉన్నాయి. ద్రాక్ష, మామిడి తోటలకు వాన దెబ్బచిక్కబళ్లాపురం: జిల్లాలోని కె.ముత్తుగదహళ్లి, కన్నమంగళ, చింతడిపి చుట్టుపక్కల గ్రామాలలో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, జడివానకు మామిడి, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ద్రాక్ష చెట్లు చెల్లాచెదురయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పరిహారం అందచేయాలని రైతులు కోరారు. -
శృంగేరి క్షేత్రానికి కొత్త ఎమ్మెల్యే
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి ఎమ్మెల్యే మారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ కాదు.. బీజేపీ నేత జీవరాజ్ కొత్త శాసనసభ్యుడు. శనివారం నుంచి జరిగిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈ పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి డీ.ఎన్.జీవరాజ్ 52 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సుదీర్ఘంగా లెక్కింపు శనివారం ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కాగా, సాయంత్రం తానే గెలిచానని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీటీ రాజేగౌడ ప్రకటించి విజయోత్సవం చేసుకోవడం తెలిసిందే. కానీ వాద వివాదాల మధ్య ఓట్ల బండిళ్ల లెక్కింపు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు కొనసాగించారు. ఫలితాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్శెట్టి సమర్పించారు. తరువాత ఫలితాలను ప్రకటిస్తూ జీవరాజ్దే విజయమని తెలిపారు. సోమవారం నూతన ఎమ్మెల్యే జీవరాజ్కు ధృవీకరణ పత్రాన్ని కూడా పంపిణీ చేశారు. న్యాయం జరిగింది: జీవరాజ్ జీవరాజ్ శృంగేరి శారదమాత దేవస్థానంలో పూజలు చేసి మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్ల బండిళ్లను రాజేగౌడ ఖాతాలోకి కలిపారని ఆ రోజునే ఫిర్యాదు చేశానని తెలిపారు. రెండు రోజుల తరువాత ఎన్నికల అధికారులు పోస్ట్ ద్వారా నాకు సమాధానాన్ని పంపించారు. నేను ఆ రోజే గెలిచాను, కానీ మోసం ద్వారా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికి న్యాయం లభించింది. చాలా సంతోషమన్నారు. ఆదివారం రాత్రి అధికారులు తనకు మెయిల్లో గెలుపు సమాచారం పంపారన్నారు. సోమవారం ఉదయం తనపై నగర పోలీస్ స్టేషన్లో కొందరు కేసు పెట్టారని, డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఈ విజయాన్ని స్వాగతించారు. కలెక్టర్ ఏమన్నారు..? 1,822 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించామని కలెక్టర్ గౌరవ్శెట్టి తెలిపారు. 2023లో లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్కు 692 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడకు 569 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రీకౌంటింగ్లో జీవరాజ్కు 690 ఓట్లు పడ్డాయి. రాజేగౌడకు 314 ఓట్లే వచ్చాయి. దీనిని బట్టి రాజేగౌడకు 251 ఓట్లు తగ్గాయని వివరించారు. రాజేగౌడకు మొత్తం 318 చెల్లని ఓట్లు పడ్డాయని తెలిపారు. ఇది క్రిమినల్స్ కుట్ర: డిప్యూటీ సీఎం శృంగేరి ఫలితాలు దేశానికే ప్రమాదకరం. అక్కడ కుట్ర జరిగింది, ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఇంతటి క్రిమినల్లు ఉన్నారని తెలియలేదు. సుప్రీంకోర్టుకై నా వెళతాం. అక్కడ బ్యాలెట్ బాక్సులను ముందే తెరిచారు, బ్యాలెట్ పేపర్ అవకతవకలు జరిగాయి. అప్పట్లో అంతా సక్రమమేనని అధికారులు సంతకాలు చేశారు. జయనగరలో కూడా సౌమ్యారెడ్డి 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఇప్పటికీ ఓట్ల లెక్కింపు జరగలేదు. శృంగేరిలో ఎలా లెక్కించారు’ అని డీకే ధ్వజమెత్తారు.తుంగా నది ఒడ్డున కొలువైన శృంగేరి పట్టణంలో రాజకీయ దుమారం కలెక్టర్ అందజేసిన ధృవీకరణ పత్రంతో నూతన ఎమ్మెల్యే జీవరాజ్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపు కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజేగౌడకు చుక్కెదురు రాష్ట్రంలో రెండు చోట్ల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగేరిలో షాక్ తగిలింది. అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడేళ్ల తరువాత ఓడిపోయారు. బ్యాలెట్ల ఓట్ల పునర్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలవడం రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. -
యుద్ధప్రాతిపదికన డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ నాటికి క్రస్ గేట్లు అమర్చే పనులను పూర్తి చేశామన్నారు. డ్యాం గేట్లు, ఇతర పనులకు రూ.315 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రూ.54 కోట్లను క్రస్ట్ గేట్లకు కేటాయించడం జరగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొని అనుకున్న సమయానికి పనులు పూర్తయినట్లు వెల్లడించారు. 22వ గేట్ వద్ద కొత్త చైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నవలి వద్ద సమానంతర జలశయం నిర్మాణం కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాలెన్సింగ్ రిజర్యాయర్ నిర్మాణానికి విముఖత వ్యక్తం చేస్తున్నారనారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. 33 టీయంసీల మేర పూడికతీత విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తుంగభద్ర డ్యాం పరిశీలన హొసపేటె: తుంగభద్ర డ్యాం గేట్ ఏర్పాటు పనులను ఆదివారం ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల నివేదిక ప్రకారం పాత గొలుసులు బలంగానే ఉన్నప్పటికి.. ముందు జాగ్రత్త చర్యలు కొత్త గొలుసులు అమర్చాలని నిర్ణయించామన్నారు. పూడికతీత సమయంలో రైతుల భూములు, పర్యావరణానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ పరిసరాల్లోని పరిశ్రమల నుంచి రసాయనాలతో కూడిన నీరు డ్యామ్లోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వచ్చాయన్నారు. అధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి ముఖ్యమే అయినా, ప్రజల ఆరోగ్యం, పంటల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జలాశయం మొత్తం 33 గేట్ల సంస్థాపన పనులు పూర్తయ్యాయని, సాంకేతిక బృందం సలహా మేరకు ఆధునీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలియజేశారు. పనులు పూర్తయిన తర్వాత, రాయచూర్, బళ్లారితో సహా నాలుగు జిల్లాల రైతులను ఆహ్వానించి డ్యామ్కు ప్రతేక్య పూజ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.315 కోట్ల వ్యయం డీసీఎం డి.కె.కుమార్ -
ఇంటి గోడ కూలి వ్యక్తి మృతి
హొసపేటె/సాక్షి, బళ్లారి: కానహోసహళ్లి పట్టణంలోని ఉజ్జిని రోడ్డులో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుండగా.. పాత రాతి గోడ ఒకటి కూలిపోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇంటి యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్త ఇంటి పునాది (బేస్మెంట్), పాత గోడ మధ్య పైప్లైన్ వేయడానికి పునాదిని చదును చేసే పనిలో నిమగ్నమైన ఇంటి యజమాని బసవరాజప్ప ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఆ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అతడి తల పైభాగం తప్ప, మిగిలిన శరీరమంతా మట్టిలో కూరుకుపోయింది. ఫలితంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్కు చెందిన పీసీఐ సిద్రమప్ప బిదరాని బృందం వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 45 నిమిషాలకు పైగా శ్రమించి మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కూడ్లిగి తాలూకా, కనహోసహళ్లిలో ఘటన -
కుల వివక్షకు తావులేని రథోత్సవం
మైసూరు: జిల్లాలోని హుణసూరులో బ్రాహ్మణ వీధిలో ఉన్న పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవం కుల భావాలు లేకుండా సాగింది. బ్రాహ్మణులు, దళిత నేతలను అతిథులుగా ఆహ్వానించి వేడుక సాగించారు. డీఎస్ఎస్ రాష్ట్ర నేత నింగరాజు మల్లాడి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి దళిత నాయకులను ఊరేగింపుగా తీసుకువెళ్లి, రథాన్ని లాగడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని అన్నారు. దళిత నాయకులు చిక్కహున్సూర్ రాజు, బల్లేనహళ్లి కెంపరాజు, కిరిజాజీ గజేంద్ర, బెల్తూరు వెంకటేష్, నాగనహళ్లి మాదేవ, బన్నిబీడి శ్రీధర్, రేణుకమ్మ తదితరులు, బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రకృతిని రక్షించుకోవాలి
కెజీఎఫ్: భావి తరాల హితవును దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని 3వ అపర సెషన్స్ న్యాయమూర్తి బి.శివకుమార్ తెలిపారు. గుడ్ డీడ్స్ డే సంధర్భంగా బెళకు ట్రస్టు, తంబార్లహళ్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పనులు చేయాలనే సందేశాన్ని ఇవ్వడం ఈ దినం ప్రాముఖ్యత అన్నారు. ప్రకృతి సకల జీవరాశులను తన ఒడిలో ఉంచుకుని కాపాడుతుందని తెలిపారు. అయితే మనిషి తన స్వార్థానికి ప్రకృతిని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. అభివృద్ధి, నగరీకరణ పేరుతో ప్రకృతి, పరిసరాలను నాశనం చేయడం సరికాదని పేర్కొన్నారు. అందరూ విధిగా చెట్లను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అపర సివిల్ సీనియర్ న్యాయమూర్తి ముజఫర్ మాంజరి, న్యాయమూర్తి జయలక్ష్మి, సివిల్ న్యాయమూర్తి శమిద, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.ఎన్.రాజగోపాలగౌడ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో విజయ భేరి
కోలారు: జిల్లా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సురేష్ బాబు, నారాయణ స్వామి, అనిల్ కుమార్ వర్గానికి చెందిన అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్ వర్గం ఓటమి పాలైంది. ఎన్నిక జరిగిన 20 స్థానాలను అనిల్ కుమర్ వర్గానికి చెందిన వారు కై వసం చేసుకున్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధించడంపై నారాయణ స్వామి, అనిల్ కుమార్, సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తామన్నారు. -
ఊటీ యాత్రలో కడతేరిన ప్రాణాలు
మైసూరు: ఊటీ విహారయాత్ర మధ్యలోనే రక్తసిక్తమైంది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని కేరళ రోడ్డుపై మద్దయనహుండి సమీపంలో ఆదివారం మట్టిని తీసుకువెళ్తున్న లారీ కారును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. కారులోని ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళకు చెందిన కారు డ్రైవర్ మునీర్ (30), మునీరా (55), మోహిజ్ (3) మృతులు. వివరాలు... మునీరా కుటుంబం కేరళలోని కన్నూరులో జీవిస్తోంది. ఆమె రెండో అల్లుడు మునీర్ దుబాయ్లో పనిచేస్తుంటాడు. సెలవు పెట్టి అత్తగారింటికి వచ్చాడు, అతని భార్య గర్భవతిగా ఉంది. ఊటీ విహారయాత్రకు వెళ్లాలని కారులో బయల్దేరారు. కోజికోడ్ – కొళ్లేగాళ హైవే 766లో ప్రయాణిస్తూ అప్పుడే కేరళను దాటి కర్ణాటకలోకి ప్రవేశించారు. బండీపుర అడవి రేంజిలో ప్రయాణిస్తుండగా ఎర్ర మట్టి లోడుతో కేరళకు వెళ్తున్న కర్ణాటక లారీ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు దూరంగా ఎగిరిపడి గుర్తుపట్టలేనంతగా తుక్కుగా మారిపోయింది. మునీర్, మునీరా, ఆమె పెద్ద కూతురి కొడుకు మోహిజ్ అక్కడే రక్తపు మడుగులో చనిపోయారు. సానియా మీర్జా (22), సహల్ పర్వీన్ (28), బిలాల్ అనేవారు తీవ్రంగా గాయపడగా, వారికి చామరాజనగరలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేరళ నుంచి వారి బంధువులు ఆస్పత్రికి చేరుకోగా రోదనలతో మార్మోగింది. స్థానికుల ఆందోళన మట్టి, రాళ్లను రవాణా చేసే లారీల కారణంగా కేరళకు వెళ్లే రోడ్డుపై నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వెంటనే రైతు సంఘాల కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితమే టిప్పర్ లారీ, కారును ఢీకొనగా కేరళకు చెందిన నలుగురు చనిపోయారని తెలిపారు. టిప్పర్లు, లారీలు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజలను బలిగొంటున్నారని ఆరోపించారు. సారవంతమైన మట్టి కేరళకు దొంగరవాణా జరుగుతోందని, దీనిని అరికట్టాలని కోరారు. కానీ అధికారులు డబ్బులు తీసుకుంటూ దొంగ రవాణాకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. కేరళీయుల కారును మట్టి లారీ ఢీ అత్త, అల్లుడు, మనవడు మృతి చామరాజనగర వద్ద విషాదం -
పసందైన మామిడి..
ప్రజల చెంతకే హుబ్లీ: వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు. దిగుబడిని బట్టి ధరలతో సంబంధం లేకుండా రుచిని ఆస్వాదిస్తాం. అయితే ఆరుగాలం కష్టపడి తోటలు సాగు చేసిన రైతులను దళారీలు మోసం చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పండ్లను కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. దీంతో రైతులకు లాభాలు దొరకడం లేదు. ధార్వాడా మామిడి సాగు రైతులు నేరుగా వినియోగదారులకు పండ్లను విక్రయించేందుకు శ్రీకారం చుట్టారు. ధార్వాడా గాంధీ భవన్లో జరుగుతున్న ఈ అభియానాలో వినియోగదారులకు వివిధ రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. దళారీలకు చరమగీతం పాడటంతో లాభాలు నేరుగా రైతులకు దక్కుతున్నాయి. బెళగావి, హవేరి, గదగ, ధార్వడా, బాగలకోట తదితర జిల్లాల నుంచి బంగినపల్లి, అల్పాన్ సో, బెంగళూరు బేనీసా తదితర మామిడి రకాలను తీసుకొచ్చి ఒకే చోట విక్రయిస్తున్నారు. కిలో రూ.100 నుంచి 200 దాకా ధరలు పలుకుతున్నాయి. రైతులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయనాలు వాడకుండా సహజంగా పండ్లను మాగబెడుతున్నారు. వినియోగదారులకు మార్కెట్లో తిరిగే శ్రమ తొలగి ఒకే చోట్ల నాణ్యత గల పండ్లు లభిస్తున్నాయి. అల్పాన్ సో రకం మామిడి పండ్లకు జాతీయ, అంతర్జాతీయంగా చాలా డిమాండ్గా ఉంది. ఇక్కడి మట్టి వాతావరణం వల్ల ఈ పండుకు ప్రత్యేక రుచి తెచ్చి పెడుతుంది. జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్ల కన్నా ఎక్కువ ప్రాంతంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో అల్పాన్ సో రకం అగ్రస్థానంలో ఉంది. ఈ మేలిమి రకం మామిడి పండ్లు సరసమైన ధరలకే దొరుకుతుండటంతో మామిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధార్వాడా గాంధీ మార్కెట్లో ఏర్పాటు చేసిన బ్యానర్ఆకట్టుకున్న మామిడి రకాలు ధార్వాడా గాంధీ భవన్లో సహజసిద్ధంగా మాగబెట్టిన మామిడి పండ్ల విక్రయ కేంద్రం ఏర్పాటు దళారీ వ్యవస్థకు చెక్ రైతులకు దక్కనున్న లాభాలు -
లేట్గా వచ్చారని.. నీట్కు నిరాకరణ
శివాజీనగర: నీట్–యూజీ పరీక్షలకు ఆలస్యంగా రావడంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని యలహంక ప్రథమ శ్రేణి కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చాళుక్య సెంటర్లోని ఆర్సీ కాలేజీకి అత్తిబెలెకు చెందిన ఓ విద్యార్థిని 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది, ఆమెను కూడా లోపలికి పంపలేదు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ఆరంభంకాగా, మధ్యాహ్నం 1.30 గంటల వరకు గేట్లు తెరిచారు. ట్రాఫిక్ జాం వల్ల ఆలస్యమైనట్లు విద్యార్థినులు తెలిపారు. ఏడాది పాటు శిక్షణ పొందామని, ఆలస్యమంటూ అనుమతించలేదని విలపించారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. పలువురు విద్యార్థినుల కన్నీరు -
హోరాహోరీగా టెన్నిస్ టోర్నీ
తుమకూరు: తుమకూరులో జరుగుతున్న ఐటీఎఫ్డబ్ల్యూ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయర్స్ పోటీల్లో భారత క్రీడాకారిణి శ్రీనిధి చౌదరి అద్భుతమైన ఆటతో తదుపరి రౌండ్కు దూసుకెళ్లింది. 14వ సీడ్ నేమ్హా సారా కిస్పోట్టాను హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఓడించింది. మరో పోటీలో స్నిగ్ధ కాంత, 13వ సీడ్ అరుణ ముండేను కఠినమైన మూడు సెట్ల పోరాటంలో మట్టి కరిపించింది. పలు మ్యాచ్లు రసవత్తరంగా సాగాయి. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. 8 స్థానాల కోసం క్రీడాకారిణులు పోటీపడతారు. కారు దగ్ధం కేసు.. వ్యక్తి ఆత్మహత్య!దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని నిర్జన ప్రదేశంలో శనివారం ఓ కారు కాలిపోగా అందులో ఓ మహిళ సజీవ దహనమైన ఘటన మరింత క్లిష్టంగా మారింది. కారు నుంచి దూకి పరారైన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మారసంద్ర గ్రామానికి చెందిన రామాంజినప్ప (43) మృతుడు. వివరాలు.. రామాంజినప్పకు పెళ్లయి, తరువాత విడిపోయాడు. ఈ క్రమంలో శనివారంనాడు కారులో ఒక మహిళతో ఏకాంతంగా గడపడానికి వచ్చాడు. ఈ సమయంలో కారు దగ్ధమై ఆమె సజీవ దహనమైంది, పోలీసులు కారును పరిశీలించి విచారణ చేపట్టారు. ఇంతలో ఆదివారం దగ్గరలో రైలు పట్టాలపై అతడు శవమై తేలాడు. చిక్కబళ్లాపురానికి చెందిన ఆ మహిళతో రామాంజినప్పకు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది. భర్త రెండో పెళ్లికి మొదటి భార్య బ్రేక్● దొడ్డలో వింత ఘటన దొడ్డబళ్లాపురం: గర్భిణి అయిన మొదటి భార్య ఎంట్రీతో కళ్యాణ మండపంలో ఆమె భర్త రెండో పెళ్లి.. పందిరిలోనే నిలిచిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు ఏమైందోనని చెవులు కొరుక్కున్నారు. సినిమా, సీరియల్స్లో జరిగే ఇలాంటి సంఘటన నిజంగానే చోటుచేసుకుంది. వివరాలు... దొడ్డ పట్టణంలో బసవ భవన్లో.. లెక్చరర్ కుమార్కు, వధువుకు ఆదివారం ఉదయం పెళ్లి జరుగుతోంది. మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష మధ్య ఓ గర్భిణి అక్కడకు వచ్చింది. తాను కుమార్ భార్యనని చెప్పడంతో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి కుమార్ను, బాధిత మహిళను స్టేషన్ కి తీసికెళ్లారు. అంతకుముందు రోజు రాత్రి కుమార్ తన భార్యకు కాల్ చేసి పెద్దవాళ్లు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, తాను ఏం చేయలేకపోతున్నానని చెప్పాడు. దీంతో ఆమె ధైర్యం చేసి కేరళ నుంచి అక్కడకు వచ్చింది. తమ పెళ్లి ఫోటోలు, ఇతరత్రా ఆధారాలను చూపడంతో వధువు కుటుంబీకులు కంగుతిన్నారు. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లి రద్దు కాగా, బంధుమిత్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. సీఎం సిద్దు మార్పు ఈజీ కాదు ● ఎమ్మెల్యే రాయరెడ్డి శివాజీనగర: ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మార్పు లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని సీఎం ఆర్థిక సలహాదారుడు, ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా గొంతెత్తారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి, అందుకు ప్రజోపయోగ పరిపాలన చేయాలి అని ఖర్గేకు చెప్పానన్నారు. మంత్రివర్గ పునర్విభజన, ముఖ్యమంత్రి మార్పు గురించి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గందరగోళమైన ప్రకటనలు చేస్తున్నారు, దీనిపై స్పష్టత ఇవ్వాలని విన్నవించానని చెప్పారు. సీఎం మార్పు లేదు, ఒకవేళ చేయాలనుకుంటే హైకమాండ్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటుందని ఖర్గే తనకు చెప్పారన్నారు. అప్పట్లో సీఎల్పీ భేటీలో సిద్దరామయ్యను ఎన్నుకొన్నారు, ఇప్పుడు సీఎంను మార్పు చేయాలంటే మళ్లీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోరాలన్నారు. మార్పు అంత సులభం కాదన్నారు. ఒకవేళ సీఎంను మార్చితే, మీరే ముఖ్యమంత్రి కావాలని ఖర్గేకు ఆహ్వానం పలికినట్లు రాయరెడ్డి తెలిపారు. సిద్దరామయ్య వర్గీయులు మౌనం దాల్చిన సమయంలో రాయరెడ్డి మద్దతుగా నిలబడడం విశేషం. -
ఆరోగ్య శిబిరాలు సద్వినియెగం చేసుకోండి
రాయచూరు రూరల్: పేద ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియెగం చేసుకోవాలని నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆర్.హెచ్.ఆరోగ్య కేంద్రంలో ఇషా, అసిఫ్, జామియా ఫౌండేషన్ ఆధర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలను ఉద్దేశించి ప్రసంగించారు. 300 మందికి పైగా రోగులు ఆరోగ్య శిబిరాల్లో వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డా.కార్తీక్ బాసిత్, లతీఫ్, హపీజ్, జావిద్, మనియార్, హజరత్ బాషా, హసన్ మూల్లా, హసీఫ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత పేద ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి యం.బి.పాటిల్ తెలిపారు. ఆదివారం విజయపుర జిల్లా దేవర హిప్పరిగిలో 30 పడకల అరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పేదలు సర్కారు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. సర్కారు ఆస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు రాజు గౌడ పాటిల్, తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ వ్యవస్థతో ఇబ్బందులుహుబ్లీ: కాగితం లేని ఆస్తుల నమోదు వంచనకు దారి తీస్తుందని సంబంధిత డాక్యుమెంట్ రైటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ధార్వాడ జిల్లా రిజిస్ట్రేషన్ ముద్రణ శాఖ ద్వారా అనుమతి పొందిన డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతరాజ్ పోలా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కావేరి సాంకేతిక ఆధారంగా పేపర్ లెస్ డిజిటల్ నమోదు అములుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ పద్దతి వల్ల ప్రజల ఆస్తువుల రికార్డులకు ఎటువంటి భద్రత ఉండదన్నారు. డీజీ లాకర్లో సేవ్ కావడం వల్ల ఆస్తి కొనుగోలుకు నికర దాఖలు లభించవని తెలిపారు. ఈ పద్ధతి వల్ల ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. తక్షణమే ప్రభుత్వం పేపర్ లెస్తో పాటు గత వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బుద్ధుడి బోధనలు ఆదర్శం కోలారు: బుద్ధుడి తత్వ సిద్ధాతాలను అనుసరించడం ద్వారా ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో బుద్ధుడి సందేశాలు లోకానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కె.వి.ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నగర సమీపంలోని మంగసంద్ర వద్ద ఉన్న బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయంలో బుద్ధ పూర్ణిమ సంధర్భంగా కావ్య బెళదింగళు కవిగోష్టి కార్యక్రమం నిర్వహించారు. కవులు, రచయితలు రచించే ప్రతి వాక్యం లోకానికి ప్రేమను పంచాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆప్త కార్యదర్శి నెలకంటె వెంకటేశయ్య మాట్లాడుతూ.. బుద్ధుడి వ్యక్తిత్వం అత్యంత అధ్భుతమైన శక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో శరీఫ్, అవధి పత్రిక సంపాదకుడు జి.ఎన్.మోహన్, సాహితి లక్ష్మీపతి కోలార, తదితరులు పాల్గొన్నారు. 2 వంతెనలకు ఆమోదం కోలారు: అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తిలో రూ.10 కోట్ల ఖర్చుతో రెండు చోట్ల బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాలూకాలో క్యాలనూరు సమీపంలో రూ.6 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి , ఛత్రకోడిహళ్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో మరో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం లభించిందని అన్నారు. అధికారులే చురుగ్గా పని చేయాలని ఆయన కోరారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
మాలూరు: తాలూకాలోని మాస్తి ఫిర్కా రాజేనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని గొల్లహళ్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో రెండు గుంపుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న తాలూకా యంత్రాంగం అధికారులు, మాస్తి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గొల్లహళ్లి గ్రామ సర్వే నంబర్ 4–1లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. భూమి హక్కు, చట్టపరమైన సంబంధాల విషయమై రెండు గుంపుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాలూకా అధికారులు, పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. తహసీల్దార్ ఎం.వి.రూప మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటం ముఖ్యమన్నారు. రెండు గుంపుల ప్రముఖులు అన్ని దాఖలాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. గ్రామంలో శాంతి సభ నిర్వహించి, అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులకు సూచించారు. -
బళ్లారి అభివృద్ధికి యడియూరప్ప కృషి
సాక్షి, బళ్లారి: నగరాభివృద్ధి, బళ్లారి జిల్లా అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప విశేష కృషి చేశారు. ఆయన హయాంలో బళ్లారి జిల్లాకు భారీగా నిధులు విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యడియూరప్ప అభిమానోత్సవానికి సంబంధించి ముందస్తు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9వ తేదీన చిత్రదుర్గంలో జరిగే యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమానికి బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో యడియూరప్ప ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని, అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని గుర్తు చేశారు. తమ లాంటి ఎందరికో రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందించారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యడియూరప్ప తనదైన ముద్రవేసుకున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం పరితపించిన నాయకుడు అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ఫోన్ ద్వారా సమావేశంలో తన సందేశాన్ని వినిపించారు. యడియూరప్ప అభిమానోత్సవ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్షా హాజరవుతారన్నారు. అనివార్య కారణాలతో తాను బళ్లారి సమావేశానికి రాలేకపోయాయని తెలిపారు. చిత్రదుర్గంలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. గంగావతి ఎమ్మెల్యే కూడా సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడారు. యడియూరప్ప ఆశీస్సులతోనే రాజకీయాల్లో రాణించేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీరశైవ సమాజ ప్రముఖులు విరుపాక్షి గౌడ, జానేకుంట బసవరాజు, మహేశ్వరయ్య స్వామి, గురులింగన గౌడ, పంచాక్షరప్ప, కోలారు చంద్రశేఖర గౌడ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి -
ఘనంగా పడుబిద్రి రథోత్సవం
బొమ్మనహళ్లి: ఉడుపి జిల్లా పడుబిద్రిలో పునర్నిర్మించిన మహాలింగేశ్వర మహాగణపతి ఆలయంలో స్వామివారి బ్రహ్మకుంభాభిషేకం, రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ పూజలు, యాగాలు సాగాయి. ఆదివారం ఉదయం శుభ ముహూర్తంలో బ్రహ్మ కుంభాభిషేకం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వేలాది మంది భక్తుల మధ్య తేరు సంబరం జరిగింది.ఘరానా జ్యోతిష్యుల గుట్టురట్టు● మహిళలకు వేధింపులు దొడ్డబళ్లాపురం: మహిళలను వేధిస్తున్న ఇద్దరు జ్యోతిష్యుల గుట్టు రట్టయింది. పూజల పేరుతో ఒక జ్యోతిష్యుడు తనపై అత్యాచారం చేస్తున్నట్లు ఓ బ్యూటీషియన్ బెంగళూరులోని సీకే అచ్చుకట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు రాజాజీనగరలో బ్యూటీషియన్ శిక్షణనిస్తోంది. మోహన్కుమార్ అనే జ్యోతిష్యుడు ఆమెకు పరిచయమయ్యాడు. సంపాదన పెరగడానికి తాను ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తానని నమ్మించి రామనగరలోని పిరమిడ్ వ్యాలీ సహా పలుచోట్లకు తీసుకువెళ్లి అత్యాచారాలు చేశాడు. ఎవరికై నా చెబితే ఇంట్లో అందరినీ చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. నిందితుడు మోహన్ కుమార్ పరారీలో ఉన్నాడు. నగ్నంలో పూజల్లో పాల్గొనాలని.. నగ్నంగా పూజల్లో పాల్గొంటే రూ.30 లక్షలు ఇస్తానని ఒక జ్యోతిష్యుడు తనను వేధిస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రామనగర తాలూకా దొడ్డమణ్ణుగుడ్డె గ్రామంలో వెలుగు చూసింది. కిరణ్ అనే జ్యోతిష్యుడు గత కొన్ని రోజులుగా రాత్రి పూట మెసేజ్లు పంపిస్తున్నాడు, డబ్బులు రెట్టింపు చేసే పూజలో నువ్వు నగ్నంగా కూర్చున్నా, లేదా నీ నగ్న ఫోటోలు పంపించినా పూజలు ఫలిస్తాయని, ఇందుకు సహకరిస్తే రూ.30 లక్షలు ఇస్తానని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమనీయం.. కరగోత్సవంబొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర ధర్మరాయస్వామి, ద్రౌపతమ్మ కరగ మహోత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. అర్ధరాత్రి దేవీ దేవతలకు పుష్పాలతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణం నుంచి ధర్మరాయస్వామి, ఆదిశక్తి ద్రౌపతమ్మ దేవి పుష్పోత్సవం ప్రారంభమైంది. కరగ పూజారి మల్లెలతో అలంకరించిన కరగను ఎత్తుకుని నాట్యమాడుతూ ఊరంతా సంచరించారు. శృంగేరిలో కుట్రల్ని తిప్పికొట్టాం: డీసీఎం శివాజీనగర: శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లపై కుట్రను తిప్పికొట్టినట్లు డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నేను రాత్రంతా ఓట్ల లెక్కింపు పరిణామాలను గమనించాను. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జీవరాజ్, అధికారులను ఏ విధంగా దుర్వినియోగం చేసుకొన్నారనేది దేశానికి పెద్ద సాక్షి అయిందన్నారు ఆ నివేదిక వచ్చిందని, దానిని అధ్యయనం చేస్తున్నానన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఉన్న బాక్స్లను ఓపెన్ చేయడం నుంచి అన్నీ తనకు తెలుసని జీవరాజ్పై మండిపడ్డారు. గతంలో వారి ఏజెంట్ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది, సంతకాలు కూడా తీసుకున్నారు, ఇప్పుడు జీవరాజ్ రచ్చ చేశారని ధ్వజమెత్తారు. జీవరాజ్పై న్యాయ పోరాటం చేపట్టామని తెలిపారు. -
బాగల్కోటెలో మేటి వర్సెస్ వీరణ్ణ
సాక్షి, బెంగళూరు: దావణగెరె దక్షిణం, బాగలకోటె విధానసభ నియోజకవర్గాలకు జరిగిన హైఓల్టేజ్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు సోమవారం ఈవీఎంల నుంచి విడుదల కాబోతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఇక్కడ ఉప సమరం జరగడం తెలిసిందే. హస్తానికి అనేక రకాల సమీకరణాలు, అడ్డంకుల మధ్య అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ అగ్నిపరీక్షలా సాగింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండుచోట్లా ముమ్మరంగా ప్రచారం సాగించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. రాబోయే ఫలితాలను మూడేళ్ల కాంగ్రెస్ పరిపాలన మీద రిఫరెండంగా కొందరు పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు రెండో ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎదుర్కొన్న రెండో ఉప ఎన్నిక ఇది.. 2024, నవంబర్లో 3 నియోజకవర్గాలు శిగ్గాంవి, చెన్నపట్టణ, సండూరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు చోట్లా గెలిచి సత్తా చాటుకుంది. ఇప్పటి ఫలితాలు ప్రజలు పాస్ మార్కులు వేశారా లేదా అనేది తేటతెల్లం చేయబోతున్నాయి. ఎవరు గెలిస్తే ఏమవుతుంది? సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం పవర్ ఫైట్ జరుగుతోంది. నేటి ఫలితాల తరువాత ఇది క్లైమాక్స్కు చేరనుందనే ప్రచారం సాగుతోంది. దావణగెరె, బాగల్కోటెలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక లెక్క, ఓడితే మరో లెక్క అన్న చందంగా మారింది. గెలుపు ఓటములను సిద్దరామయ్య, డీకే శివ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోగలరు. రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతే సిద్ధరామయ్య మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని డీకే వర్గం గళమెత్తే అవకాశముంది. కాంగ్రెస్ సర్కారు పనితీరు, పంచ గ్యారంటీ పథకాలు తదితరాలపై ప్రజాభిప్రాయంగా ఓటర్ల తీర్పును పరిగణించే అవకాశముంది. విజేతలు ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది నేడే దావణగెరె, బాగల్కోటె ఉప ఎన్నికల ఫలితాలు రెండింటిపై కాంగ్రెస్ కన్ను బీజేపీ సైతం గంపెడాశలు ఆశల పల్లకీలో బీజేపీశివాజీనగర: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు జరిగాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. రెండు నియోజకవర్గాలలో భారీ భద్రత ఏర్పాటైంది. హెచ్.ఎం.మేటీ మరణంతో బాగల్కోటె సీటు ఖాళీ అయ్యింది. మేటి కుమారుడు ఉమేశ్ మేటి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి పాత అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ పోటీ పడ్డారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,78,273 మంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరణ్ణ చరంతిమఠ సోదరుడు మల్లికార్జున చరంతిమఠ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 10 వేల ఓట్లను పొందారు, దీంతో అప్పటి బీజేపీ అభ్యర్థి వీరణ్న ఓటమి పాలయ్యారు. ఈసారి ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. దావణగెరెలో సమర్థ్ వర్సెస్ శ్రీనివాస దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున కుమారుడు శ్యామనూరు సమర్థ్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాస కరియప్ప పోటీలో ఉండగా, ఎవరిని విజయం వరిస్తుందనేది తేలబోతోంది. ఎన్నికల ఫలితాలపై అంతటా జోరుగా బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం.బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ఎన్నికలలో శ్రమించారు. బీజేపీకి పట్టం కడితే విజయేంద్రకు ఊపు రానుంది. రెండింటిలోనూ జేడీఎస్ పోటీ చేయకుండా బీజేపీకి అండగా నిలిచింది. రెండుపార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరిగిందనేందుకు ఫలితాలు అద్దం పట్టబోతున్నాయి. ఒక్క సీటు గెలిచినా బీజేపీలో ఉత్సాహం ఇనుమడించడంతో పాటు జేడీఎస్తో దోస్తీ బలపడుతుంది. ఇలా ఫలితాలు ఒక దిక్సూచిగా, రాజకీయ లెక్కాచారాలకు ఒక మార్గం కానున్నాయి. -
జ్ఞాన బోధ చేయడం స్వామీజీల కర్తవ్యం
రాయచూరు రూరల్: సమాజంలో ప్రజలకు ధర్మ, జ్ఞాన బోధ చేయడం స్వామీజీల కర్తవ్యమని మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ సూచించారు. ఆదివారం రాయచూరు తాలూకా మిట్టి మల్కాపూర్లో అరూడ జ్యోతి సిద్దరూడ మఠం పీఠాధిపతి నిజానంద శివాచార్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో సన్మానాలు ముఖ్యం కాదన్నారు. నిరుపేదలకు అన్నదానం చేయాలని సూచించారు. సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి ధర్మ ప్రచారంలో అందరు ముందుండాలని నిజానంద శివాచార్యులు సూచించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ బ్యాగవాట్, తిమ్మప్ప, మహంతేష్ పాటిల్, ఈరేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలిరాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో యువత సమాజానికి సేవలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సింధనూర్ తాలుకా క్రీడా మైదానంలో విధాన పరిషత్ సభ్యుడు బసన గౌడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5001 మంది మహిళలకు ఒడి నింపడం, 151 మందికి ఉచితంగా సాముహిక వివాహాలు చేశారు. కార్యక్రమంలో స్పీకర్ యూటి ఖాదర్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడిగి, మధు బంగారప్ప, భోసురా, శివానంద పాటిల్, శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, బసన గౌడ, పుట్టణయ్య, నాగరాజ్, హంపయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలబురిగి జిల్లా అధికారిగా మహ్మద్ షరీఫ్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అధికారి పౌజియాను తరూన్నమ్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేంతేష్ ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు గ్రామీణ నీటి సరఫరా శాఖకు మార్చడం జరిగింది. ఆమె స్థానంలో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ ఇఖ్రముల్లా షరీఫ్ను నూతన జిల్లా అధికారిగా నియమించారు. తుంగభద్రలో పూడికతీత చేపట్టాలిసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడంతో 33 టీఎంసీల నీటి సామర్థ్యం కోల్పోయామని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుంగభద్ర డ్యాం గేట్లను పరిశీలించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ను కలిసి సమస్యలను తెలియజేశారు. తుంగభద్ర డ్యాంలో పూడికతీతకు సంబంధించి సాధ్య, సాధ్యాలను వివరించారు. డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు డ్యాంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని తెలిపారు. ఏటా పూడిక చేరడంతో డ్యాంలో ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంటోందని పేర్కొన్నారు. నవలి వద్ద జలాశయం అనుమతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అనుమతులు అవసరం అన్నారు. పలు గ్రామాలు నీట ముగిగే అవకాశం ఉండటంతో ఆలోచించాలని సూచించారు. మైనింగ్ ఫండ్ ద్వారా పూడికతీత చేపట్టాలని సూచించారు. సుదీప్ హెలికాప్టర్ ల్యాండింగ్ మార్పురాయచూరు రూరల్: సింధనూరులో ఆదివారం జరిగిన మహిళలకు ఒడి నింపే కార్యక్రమానికి సినీ నటుడు కిచ్చా సుదీప్ విచ్చేశారు. అందులో భాగంగా ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ హెలికాప్టర్ వస్తున్న నేపథ్యంలో దానిని వేరే చోటుకు మళ్లించాలని పోలీసులు సూచించారు. మరో వైపు సామూహిక వివాహాల సందర్భంగా బహిరంగ సభలో నూతన వధువరులను ఆశీర్వదించి వేదికపై వెళ్తున్న తరుణంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరిగింది. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, వేదికపై కూర్చున్న మంత్రులు హుటాహుటిన కిందకి వచ్చేశారు. అధికారులు మంటలను అదుపు చేశారు. -
పనిచేయకపోతే వేటు తప్పదు
శివాజీనగర: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల మీద నిర్దాక్షిణ్యంగా క్రమశిక్షణా చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటుగా హెచ్చరించారు. శనివారం విధానసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, శాఖల అధిపతులు, ఐఏఎస్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి గోడ కూలి 7 మంది చనిపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వాడీవేడిగా సభ సాగింది. అలసత్వం, అవినీతి వద్దు సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలు, పథకాలలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తే సహించను. పనుల్లో లోపాలు కనిపిస్తే అధికారులను బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాలను వేగిరం చేయాలన్నారు. ఈ పథకాలపై కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేయడం లేదన్న సిద్దరామయ్య.. ఇలాంటి ధోరణిని సహించనని మండిపడ్డారు. పథకాల అమలుకు నిధుల కొరత ఉందని నెపం చెప్పి కాలక్షేపం చేయవద్దన్నారు. బడ్జెట్ పథకాలకు ఆర్థిక వనరులను అందజేస్తాం, కాలపరిమితిలో అమలు పరచాలని ఆదేశించారు. ఎక్కడా అవినీతికి తావుండరాదన్నారు. అధికారులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలి. ఎక్కడో కూర్చొని ఫైళ్లు పరిష్కరిస్తామంటూ నేను సహించను అని తెలిపారు. ప్రజల సమస్యల మీద స్పందించాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమాచార పథకాల పరిశీలన గురించి నూతన కర్ణాటక ప్రగతి పోర్టల్, డెయిరీని సీఎం ఆవిష్కరించారు. సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఐఏఎస్లపై సీఎం సిద్దు ఉగ్రరూపం బడ్జెట్ పథకాలను అమలు చేయాలని ఆదేశం ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో భేటీ -
పసికందు ముందే తల్లి ఆత్మహత్య
యశవంతపుర: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. 5 నుంచి పీణ్య పై వంతెనపై ఆంక్షలుయశవంతపుర: బెంగళూరులో ఎంతో ముఖ్యమైన పీణ్య ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పాక్షికంగా మూతపడనుంది. వంతెన కేబుల్ మరమ్మతుల కోసం కొన్నిరోజులు బంద్ అవుతుంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ రోజూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పీణ్య వంతెనను మూసేస్తారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు తెలిపారు. బెంగళూరుకు వచ్చేవారు కెన్న మెటల్ ఫ్యాక్టరి సమీపంలో పై వంతెన కింది భాగంలో ఎన్హెచ్–4 సర్వీసు రోడ్డు ద్వారా నగరంలోకి ప్రవేశించాలని తెలిపారు. ఘనంగా చన్నకేశవ రథోత్సవంకేజీఎఫ్: కేజీఎఫ్ తాలూకాలోని రామసాగర గ్రామంలో వెలసిన శ్రీ భూనీల సమేత చన్నకేశవ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్టుకు వివిధ హోమాలు సహా మహా మంగళారతి తరువాత ఉత్సవమూర్తులు తేరులో ప్రతిష్టించి రథోత్సవాన్ని ప్రారంభించారు. తేరుపైకి భక్తజనం దవనం, అరటి పండ్లు విసిరారు. సపలాంబదేవి ఊరేగింపు మాలూరు: తాలూకాలోని బంటహళ్లి గ్రామంలో నూతనంగా భక్తుల సహాయంతో నిర్మించిన శ్రీ సపలాంబ దేవి ప్రతిష్టాపనా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శనివారం దేవాలయంలో సపలాంబ దేవి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు తంబిట్లు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కె ఎస్ మంజునాథ్ గౌడ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు.


