సీజే రాయ్కు కన్నీటి వీడ్కోలు
బనశంకరి: బెంగళూరులో కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త సీజే.రాయ్ భౌతిక కాయానికి ఆదివారం బన్నేరుఘట్టలోని కాసాగ్రాండ్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారంనాడు ఆయన ఐటీ అధికారులు విచారిస్తుండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. బౌరింగ్ ఆసుపత్రిలో సీజే.రాయ్ పార్థివదేహాన్ని భార్య, పిల్లలకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్లో ఊరేగింపుగా అంత్యక్రియలకు బయలుదేరారు. రాయ్ కాన్ఫిడెంట్ కార్యాలయం ముందు కొద్దిసేపు నిలిపారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఎన్ఏ.హ్యారీస్ నివాళులు అర్పించారు. సెయింట్ జోసెఫ్ చర్చిలో ప్రార్థనలు జరిపారు. సీజే.రాయ్ కార్ల ప్రేమికుడు కావడంతో ఆయన సొంతమైన రోల్స్రాయిస్, బెంజ్, రేంజ్రోవర్, బుగాటి, ఆడి తదితర లగ్జరీ కార్లు ర్యాలీగా వచ్చాయి. దారి పొడవునా కుటుంబసభ్యులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. బన్నేరుఘట్టలోని కాసాగ్రాండ్ కు తీసుకువచ్చి క్రైస్తవ సంప్రదాయంతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మంత్రి రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
ఐటీపై మోహన్దాస్ ఆక్రోశం
యశవంతపుర: ఐటీ దాడులు, సీజే రాయ్ ఆత్మహత్యపై ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్యాక్స్ వేధింపుల వల్ల కాఫీ డే సిద్ధార్థను పోగొట్టుకున్నాం, ఐటీ అధికారుల సతాయింపులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని దాస్ ఆవేదన చెందారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ అధికారులకు పూర్తి అధికారాలిస్తే ఇక సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు.
లగ్జరీ కార్లతో అంతిమయాత్ర


