Karnataka Latest News
-
థగ్ లైఫ్కు రూ.35 కోట్ల నష్టం?
● కన్నడనాట సినిమా ఆడని వైనం ● కమల్– కన్నడ వివాద ఫలితం సాక్షి, బెంగళూరు: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే ఒకే ఒక్క మాటతో ప్రముఖ నటుడు కమల్హాసన్ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తన మాటలపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించడంతో మరింతగా కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. దీని ఫలితం కమల్ హాసన్ నటించి, నిర్మించిన థగ్ లైఫ్ సినిమా మీద పడింది. ఆ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల సుమారు రూ. 35–40 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు తెలిసింది. 7 శాతం రాబడి పోయినట్లే సినీ నిర్మాత, పంపిణీదారుడు జి.ధనంజయన్ లెక్కల ప్రకారం కర్ణాటకలో థగ్లైఫ్ సినిమా విడుదలకు అవకాశం లేకపోవడంతో సుమారు రూ. 35–40 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఇందులో నిర్మాత షేర్ రూ. 12–15 కోట్ల పైమాటేనని ఆయన తెలిపారు. ఇతర పరభాషా చిత్రాలు కన్నడనాట భారీ వసూళ్లను రాబట్టాయి. కమల్ హాసన్ థగ్లైఫ్ సినిమాకు కర్ణాటకలో మంచి డిమాండ్ ఏర్పడింది. మణిరత్నం–కమల్ హాసన్ కాంబినేషన్ కాబట్టి ఆసక్తి నెలకొంది. అలా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని ఆయన తెలిపారు. మొత్తం సినిమా ఆదాయంలో 7 శాతాన్ని కన్నడ వివాదం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. అంతా సిద్ధమైన సమయంలో.. వాస్తవానికి కర్ణాటకలో థగ్లైఫ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సినిమాను కర్ణాటకలో పంపిణీదారుడు వెంకటేశ్ సుమారు రూ. 8.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 200 థియేటర్లలో సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలకు నాలుగైదు రోజుల ముందు కమల్హాసన్ చేసిన ప్రకటన పరిణామాలను మార్చేసింది. సినిమా తొలిరోజు సుమారు రూ. 4 నుంచి రూ 5 కోట్ల మేర, రెండోరోజు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల మేర ఆదాయం దూరమైనట్లు అంచనాలున్నాయి -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ
సాక్షి, బెంగళూరు: త్యాగ బలిదానాలకు సంకేతమైన బక్రీద్ పండుగను రాష్ట్రమంతటా ఘనంగా ఆచరించారు. బెంగళూరు, బళ్లారి, మైసూరు, కలబుర్గి, మంగళూరు సహా పల్లె పట్టణం అనే తేడా లేకుండా అంతటా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. శనివారం ఉదయం నుంచి మసీదుల్లో, ఈద్గా మైదానాలలో అశేష సంఖ్యలో సామూహికంగా ప్రార్థనలు చేశారు. ధర్మగురువులు బక్రీద్ పండుగ ఆచరణ, దయ, దానధర్మాల గురించి సందేశమించ్చారు. సమాజంలో ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులంతా పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రార్థనల్లో చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. మైదానాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఉద్రిక్తతలు నెలకొన్న మంగళూరు, ఉడుపి జిల్లాలో కూడా ప్రశాంతంగా పండుగను ఆచరించారు. వేడుకలకు సీఎం దూరం చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట ఘటనతో సీఎం సిద్ధరామయ్య ఈసారి బక్రీద్ వేడుకలకు హాజరుకాలేదు. సాధారణంగా ఏటా ఆయన బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనడం పరిపాటిగా వస్తోంది. మంత్రి జమీర్ అహ్మద్ ఆహ్వానం పలికినప్పటికీ , సీఎం సమ్మతించలేదని తెలిసింది. తుమకూరులో తుమకూరు: ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటి, అమరవీరుల త్యాగాలను స్మరించుకొనే బక్రీద్ ను నగరంతో పాటు జిల్లా అంతటా భక్తితో ఆచరించారు. ముస్లిం సోదరులు ఉదయమే నూతన వస్త్రాలను ధరించి తాలూకా కేంద్రాల్లోని ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు నిర్వహించారు. తుమకూరులో కురిగల్లు రోడ్డులోని ఈద్గా గ్రౌండ్లో ప్రార్థనలు చేసి శుభాకంక్షలు తెలుపుకొన్నారు. పలు పార్టీల ప్రముఖులు చేరి శుభాకాంక్షలు తెలిపారు. అంతటా సామూహిక ప్రార్థనలు -
క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు
బనశంకరి: రాజధానిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట పై సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. శనివారం స్టేడియంలో దుర్ఘటన జరిగిన స్థలాలను పరిశీలించారు. ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీల ప్రతినిధులను విచారణ చేపట్టారు. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడడం, దేశమంతటా విమర్శలు చెలరేగడం తెలిసిందే. సీఐడీ ఎస్పీ శుభన్వితా నేతృత్వంలో డీఎస్పీలు పురుషోత్తమ్, గౌతమ్, అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. విచారించాల్సిన వ్యక్తుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అరైస్టెన ఆర్సీబీ ప్రాంచైజీ మార్కెటింగ్ విభాగం చీఫ్ నిఖిల్ సొసాలే, ఆ వేడుక నిర్వహణ బాధ్యత తీసుకున్న డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్లను రిమాండ్ కు తరలించారు. బక్రీద్ సందర్భంగా శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. ఆర్సీబీపై మరో ఎఫ్ఐఆర్ చిన్నస్వామి స్టేడియం దుర్ఘటనలో కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీ పై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. గాయపడిన బీకాం విద్యార్థి సీ.వేణు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రీ టికెట్ ప్రకటనను చూసి స్టేడియానికి వెళ్లానని, గేట్ నంబరు 6 వద్ద తొక్కిసలాట ఏర్పడింది. నా కుడికాలిపై బ్యారికేడ్ పడటంతో గాయపడి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని ఫిర్యాదులో తెలిపాడు. రోలన్ గోమస్ అనే ఓ బాధితుడు శుక్రవారం సాయంత్రం కబ్బన్పార్కు ఠాణాలో ఫిర్యాదు చేయగా, పై మూడు సంస్థలపై కేసు దాఖలైంది. సోషల్ మీడియాలో ఆర్సీబీ పోస్ట్ను చూసి స్నేహితులతో సంబరాలు వీక్షించడానికి స్టేడియానికి వెళ్లాను, 7వ గేటు వద్ద తొక్కిసలాట ఏర్పడి గాయపడ్డానని రోలన్గోమస్ పేర్కొన్నాడు. పరిహారం రూ.25 లక్షలకు పెంపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం గతంలో రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. శనివారం ఆ మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది. విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. క్షతగాత్రులకు నోటీసులు సీఐడీ టీం ముమ్మర విచారణ ఆర్సీబీ మీద మరొకరు ఫిర్యాదు మరోవైపు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ దర్యాప్తు ముమ్మరం చేశారు. గాయపడి బౌరింగ్, ఫోర్టీస్, మణిపాల్, వైదేహి ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, చికిత్స తీసుకుని ఇంటికెళ్లారు, దుర్ఘటనకు కారణాలు ఏమిటి అనేదానిపై సమాచారం సేకరించారు. 25 మందికి పైగా క్షతగాత్రులకు వాంగ్మూలం ఇవ్వలని నోటీస్ ఇచ్చారు. జూన్ 11వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఇప్పటివరకు 65 మంది గాయపడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 5 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి కారణం ఏమిటి, సమస్య ఎలా తలెత్తింది అనే దానిపై వివరాలను సేకరిస్తారు. మెజస్టీరియల్ విచారణను 15 రోజుల్లోగా పూర్తిచేసి నివేదిక అందించాలి. బనశంకరి: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) కార్యదర్శి ఏ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ పదవులకు రాజీనామా చేశారు. ఘటనలో తమ పాత్ర పరిమితమైనప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్భట్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఆర్సీబీ జట్టు పాలకమండలిలోని నలుగురు అధికారులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. కేఎస్సీఏ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. విధానసౌధ ముందు ఆర్సీబీ జట్టుకు సన్మానోత్సవం జరిగింది. తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేఎస్సీఏ సన్మానోత్సవం చేపట్టాయి. కానీ లక్షలాది మంది స్టేడియంలోకి చొరబడటంతో తొక్కిసలాటలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. కున్హా కమిటీకి ఆదేశం తొక్కిసలాట ఘటనలో హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి మైకేల్ కున్హా కమిటీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు ప్రాధాన్యత ఇచ్చి నెలలోగా పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది. చామరాజనగర ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో జరిగిన మరణాల మీద కున్హా కమిటీ విచారణ సాగిస్తోంది. దీనిని పూర్తిచేసి నివేదిక ఇవ్వడానికి ఆగస్టు చివరివరకు గడువును పొడిగించింది. దీంతో కున్హాపై రెండు బాధ్యతలు పడ్డాయి. -
ఠాణా వద్దే భార్య నరికివేత
మైసూరు: చామరాజనగర పట్టణ పోలీసు స్టేషన్ వద్ద భార్యను కొడవలితో నరికి చంపిన కిరాతక భర్త గి రీష్ను పట్టణ స్టేషన్ పోలీసులు శుక్రవారం బంధించారు. సోమవారపేటె స్టేషన్ మఠం వద్ద ఉండగా పట్టుకుని జిల్లాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తరువాత హత్యాస్థలానికి తీసుకెళ్లి స్థల మహజరు జరిపారు. కేసు గురించి అతని నుంచి సమాచారం సేకరించి జిల్లా జైలుకు తరలించారు. ఆమెకు భద్రత కల్పించి ఉంటే పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో గిరీష్ తన భార్య విద్య ను బుధవారం మధ్యాహ్నం ఇష్టానుసారంగా వేటకొడవలితో నరికి చంపి పరారు కావడం తెలిసిందే. ఠాణా దగ్గరే మహిళ హత్యకు గురికావడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులను తట్టుకోలేక ఆమె కోయంబత్తూరులో తలదాచుకుంది. గిరీష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలించి తీసుకొచ్చారు. మళ్లీ సతాయించడంతో బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకోగా ఆమెను ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. అక్కడకు కూడా వెళ్లి సైకో భర్త గొడవపడేవాడు, ఆమె ఫోన్ని కూడా లాక్కున్నాడు. దీంతో ఆ రోజు ఠాణాలో ఫిర్యాదు చేసి ఆశ్రయ కేంద్రానికి ఒంటరిగా వెళ్తుండగా కిరాతకుడు నరికి పరారయ్యారు. ఆమెను ఆశ్రయ కేంద్రానికి సురక్షితంగా పంపించాల్సిన బాధ్యత పోలీసులదే. ఓ పోలీసును తోడుగా పంపాలి. కానీ పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె హత్యకు గురైందని ప్రజలు ఆరోపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా అనాథలయ్యారు. కిరాతక భర్త అరెస్టు -
పన్ను కట్టని క్రికెట్ సంఘం?
బనశంకరి: తొక్కిసలాట తరువాత అధికారుల దృష్టి చిన్నస్వామి మైదానం మీద పడింది. గత కొన్నేళ్లుగా ప్రకటనల ట్యాక్స్ చెల్లించని కేఎస్సీఏ కు బీబీఎంపీ నోటీస్ జారీ చేసింది. స్టేడియం లోపల బయట ప్రకటనల్ని ప్రదర్శిస్తే చట్టప్రకారం బీబీఎంపీకి పన్ను చెల్లించాలి. అనేక ఏళ్లుగా స్టేడియంలో ప్రకటన బోర్డులను నిర్వహిస్తున్నారు. సుంకం చెల్లించాలని పాలికె అడిగితే స్పందన రావడం లేదు. క్రికెట్ సంఘం ధోరణితో బీబీఎంపీకి కోట్లాది రూపాయల నష్టం ఏర్పడింది. తాజా పరిణామాల మధ్య పాలికె అధికారులు పెండింగ్ పన్నులను చెల్లించాలని నోటీస్ పంపారు. నకిలీ బాంబు కాల్.. పీజీ మెడికో అరెస్టు దొడ్డబళ్లాపురం: మంగళూరులోని కణచూరు ఆస్పత్రికి జూన్ 4న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కణచూరు మెడికల్ కాలేజీ పీజీ ఆస్పత్రి విద్యార్థిని డా.చలసాని మోనిక చౌదరి ని అరెస్టు చేశారు. జూన్ 4న ఉదయం 8:45 సమయంలో కణచూరు ఆస్పత్రిలో బాంబు ఉందని, 11 గంటలకు పేలుతుందని, ఆస్పత్రి మొత్తం ఖాళీ చేయాలని తనకు ఎవరో 5 సార్లు కాల్ చేశారని సదరు విద్యార్థిని మోనిక అధ్యాపకులకు చెప్పింది. దీంతో సుమారు 30 మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్తో ఆస్పత్రి మొత్తం తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేదు. మోనికనే ఈ నాటకం ఆడినట్టు పోలీసులు కనుగొన్నారు. శనివారం అరెస్టు చేసి ఆమెను విచారించగా ఆ రోజు జరిగే సెమినార్కు హాజరు కాకూడదనుకుంది, దీనిని రద్దు చేయించాలని ఈ నాటకం ఆడినట్టు ఒప్పుకుంది. -
మామ చేతిలో అల్లుడు హతం
● శివమొగ్గ జిల్లాలో ఘటన శివమొగ్గ: మద్యం మత్తులో మామ, అల్లుడు గొడవపడి అల్లుని హత్యకు దారితీసింది. శివమొగ్గ జిల్లాలోని సొరభ తాలూకాలోని ఆనవట్టి దగ్గర జరిగింది. వివరాలు.. అల్లుడు రవీంద్ర (26), మామ ఉమేష్ (45) 5వ తేదీన మద్యం తాగి, హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని మామ హోటల్లో ఉన్న కత్తెరను తీసుకొని అల్లుని ఎదలో పొడిచాడు. అల్లుడు విలవిలలాడుతుండగా మామ పరారయ్యాడు. స్థానికులు రవీంద్రను సొరభ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసినట్లు సమాచారం. సీఎం, డీసీఎం, హోం మంత్రిదే బాధ్యత ● పోలీసులపై సస్పెన్షన్ సరికాదు ● రిటైర్డు ఐపీఎస్ భాస్కరరావు మైసూరు: ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట కారణంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం యావత్ పోలీసు శాఖను నిర్వీర్యం చేసినట్లయిందని రిటైర్డ్ ఐపీఎస్, బీజేపీ నేత భాస్కరరావు ఆరోపించారు. శనివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ దురంతానికి సీఎం, డీసీఎం, హోం మంత్రి నేరుగా బాధ్యులని, అందువల్ల ఆ ముగ్గురు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఈ ముగ్గురి చేతులకు 11 మంది రక్తపు మరకలు అంటాయన్నారు. ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ జట్టు గెలవడం ఒక పెద్ద శాపమని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఆర్సీబీ జట్టులో ఉన్నది ఇద్దరు కన్నడిగ ఆటగాళ్లు మాత్రమే, అయినా కన్నడిగుల భావోద్వేగాలు ఆ జట్టుపై అధికంగా ఉన్నాయని చెప్పారు. విజయోత్సవంలో కనీసం వంద అంబులెన్స్లు, స్ట్రెచర్లు, తాళ్లు, రద్దీ నియంత్రణ వస్తుసామగ్రి సిద్ధంగా పెట్టుకోవాల్సిందన్నారు. సస్పెన్షన్ ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని సీఎం సిద్దరామయ్య కుంగదీశారన్నారు. ఐపీఎల్ వంటి ప్రైవేటు కార్యక్రమానికి డీసీఎం శివకుమార్ వెళ్లడమేంటి, కప్కు ముద్దు పెట్టడమేంటి అని హేళన చేశారు. కృతికకు దక్కని ఊరటదొడ్డబళ్లాపురం: బెంగళూరులో రిటైర్డ్ డీజీపీ ఓంప్రకాశ్ హత్య కేసులో ముందస్తు బెయిలు కోరిన కుమార్తె పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హత్య కేసులో కుమార్తె కృతిక మీద కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలువ్వాలని ఆమె బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారించి కొట్టివేసింది. దీంతో కృతిక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఏప్రిల్ 20న ఓంప్రకాశ్ను ఆయన భార్య పల్లవి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఆమె రిమాండులో ఉంది. -
మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కేటాయించి పర్యావరణాన్ని సంరక్షించాలని వైస్ చాన్సలర్ హన్మంతప్ప పేర్కొన్నారు. ఆయన శనివారం వర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల్లో, ఇళ్ల ముందు మొక్కలు పెంచేలా విద్యార్థులు చైతన్యం తేవాలన్నారు. సీఎం, డీసీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో 11 మంది మృతికి కారకులైన రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. సస్పెన్షన్ సరికాదు హొసపేటె: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ సస్పెన్షన్ సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని హొసపేటె వాల్మీకి నాయక సామాజికులు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో నిరసన తెలిపారు. సస్పెన్షన్ను వాపసు తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ వివేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాయప్ప, శ్రీనివాస్, జంబయ్య నాయక్ పాల్గొన్నారు. రాయచూరులో భారీ వర్షం రాయచూరు రూరల్: నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదగుంటలుగా మారాయి. గంట పాటు కురిసిన వానకు రంగమందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయంగా మారడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి. పండిట్ తారానాథ్ జయంతిరాయచూరు రూరల్: నగరంలో పండిట్ తారానాథ్ 134వ జయంతిని ఆచరించారు. శుక్రవారం హందర్ద్ హైస్కూలులో తారానాథ్ చిత్రపటానికి పాఠశాల పాలక మండలి అధ్యక్షుడు శరత్ కళస పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తారానాథ్ విద్యా రంగాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంబాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులున్నారు. 11న తుంగభద్ర నీటి విడుదలపై సమీక్షహొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల వరప్రదాయిని తుంగభద్ర డ్యాం కింద ప్రధాన ఎగువ కాలువ( టీబీ హెచ్ఎల్సీ) అంచనా నీటి కేటాయింపులపై కీలక టీబీ బోర్డు తొలి నీటి సమీక్ష సమావేశం ఈ నెల 11న జరగనుంది. ఈ విషయానికి సంబంధించి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సంబంధిత ఎస్ఈలకు ఇప్పటికే తగిన సమాచారం పంపించారు. ఇందులో భాగంగా అనంతపురం హెచ్ఎల్సీ ఎస్ఈకు కబురు పంపారు. 11వ తేదీన వెబ్ ద్వారా నీటి సమీక్ష జరగనుంది. ప్రస్తుత 2025–26 వ సంవత్సరానికి సంబంధించి తుంగభద్ర జలాశయానికి ఎన్ని టీఎంసీల నీరు లభ్యం అవుతాయన్న దానిపై అంచనా వేస్తారు. అంచనాల ప్రకారం మండలి అధికారులు నీటి కేటాయింపులు చేస్తారు. బోర్డు కార్యదర్శి, వెబ్ ద్వారా జలాశయం పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ఎస్ఈలతో కలిసి చర్చిస్తారు. ఈ దఫా కురిసే వానలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను తయారు చేస్తారు. అదే విధంగా ప్రధాన కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారన్న దానిపై కూడా కీలక నిర్ణయాన్ని తీసుకొంటారు. -
అతిథిలా నటించి దోచుకెళ్లాడు..!
● కళ్యాణ మంటపంలో దొంగ చేతివాటం హుబ్లీ: కళ్యాణ మంటపంలోకి అతిథిలా వచ్చి అక్కడ ఉన్న విలువైన వస్తువులను చోరీ చేసి పరారైన వ్యక్తిపై గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ దొంగలా వచ్చిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అయితే అతడు గోకుల్ రోడ్డు కళ్యాణ మంటపానికి అతిథిగా వచ్చి మంటపంలోని విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యాడు. ఈ దొంగ చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు కళ్యాణ మంటపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులకు పెళ్లి నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దాఖలు చేసుకున్న గోకుల్ రోడ్డు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇక్కడి మంటూరు రోడ్డు అరళికట్టి కాలనీలో జరిగిన మట్టి దిబ్బ కూలిన కేసులో కాంట్రాక్టరు, సహ కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా, బాధ్యత లేకుండా సదరు పనులు చేపట్టడంతో మృతి చెందిన కార్మికుడు చేతన్ యాదవ్ సోదరుడు హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ అంజాద్ గిరణితో పాటు మరో సహ కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు నిర్మాణం ●జాతీయ స్థాయిలో నగర పాలికెకు ప్రశంసలు హుబ్లీ: తారు రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తులను వినియోగిస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ చేపట్టిన వినూత్న ప్రక్రియకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. పర్యావరణ దినం సందర్భంగా ఢిల్లీలోని భారత్ మంటపంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలికె చేపట్టిన ఈ వినూత్న ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. గట్టిదనంతో కూడి సుస్థిరమైన రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై వీడియోను టీపీటీ ద్వారా ప్రదర్శించారు. దీంతో సదరు కార్యక్రమ ఆవరణలో పాలికెకు ఓ అంగడి సముదాయాన్ని కేటాయించారు. అక్కడ ప్రజలకు ప్రయోగాత్మకంగా రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకం విధానాన్ని వివరించారు. దీంతో అక్కడ వీక్షించిన ప్రముఖులు పాలికె ఈ కొత్త ప్రయోగానికి అభినందనలు తెలియజేఃశారు. ప్లాస్టిక్ లేని జంట నగరాలు అనే లక్ష్యంగా పాలికె చేస్తున్న కృషిని దేశ రాజధానిలో గుర్తించారు. ఈ సందర్భంగా పాలికె మేయర్ రామప్ప బడిగేర్, కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి, అడిషనల్ కమిషనర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలికె ఈ విప్లవాత్మక కృషిపై స్థానిక మీడియాలో బాగా ప్రచారం లభించడంతో ఢిల్లీలో ఈ ఘనత సాధించినట్లు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. నా తమ్ముడికి న్యాయం చేయండి హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని హెబ్బళ్లి జెడ్పీ సభ్యుడు యోగీష్ గౌడ హత్య కేసులో సాక్షులు నిజం చెప్పడం ద్వారా తన తమ్ముడికి న్యాయం దొరికేలా చేయాలని హతుడి సోదరుడు గురునాథగౌడ విజ్ఞప్తి చేశారు. స్థానిక మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన రిట్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ మేరకు బెయిల్ రద్దు అయింది. సాక్షులపై ఒత్తిళ్లు పెంచారు. పోలీస్ అధికారులు కూడా ఒత్తిళ్లకు గురయ్యారు. సీబీఐ నివేదిక తర్వాత ఈ కేసు విషయంలో సాక్షుల నాశనానికి ప్రయత్నించారని సమర్పించిన రిట్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తాజాగా ఆదేశాలను వెల్లడించిందన్నారు. ఈ హత్యోదంతంపై నిరంతరం పోరాడుతున్న బసవరాజ్ కొరవర మాట్లాడుతూ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తమ పలుకుబడిని ఉపయోగించి సాక్షులపై ఒత్తిళ్లు తేవడం కోర్టు గమనించి సీబీఐ సమర్పించిన రిట్ను స్వీకరించిందన్నారు. సాక్షులపై ఒత్తిళ్లు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు అయిందని, ఆ మేరకు ఆయన లొంగుబాటుకు సుప్రీంకోర్టు 7 రోజుల గడువును ఇచ్చిందన్నారు. సత్యానికి గెలుపు, విజయం లభించింది. యోగీష్ గౌడ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సాక్షులపై ప్రభావం చూపించడం సరికాదు. సాక్షులు స్వేచ్ఛగా నిజాలు వెల్లడించాలన్నదే సుప్రీంకోర్టు ఆశయం అన్నారు. పర్యావరణంపై ప్రజలను జాగృతి చేయాలి కోలారు : పరిసరాల నాశనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను జాగృతం చేయాలని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ అన్నారు. నగరంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్, వంశోధయ ఆస్పత్రి, కోలారు రోటరీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విశ్వ పరిసర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్లు తదితర అభివృద్ధి పనుల పేరుతో వృక్షాలను తొలగిస్తున్నారని, దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా పెంచి పోషించాలన్నారు. అనంతరం పరిసర దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ కేవీ శంకరప్ప, రోటరీ నందిని అధ్యక్షుడు వీ బాబు, సురేష్బాబు, ఉమాదేవి, దంత వైద్యురాలు పంకజ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
కొళాయిల్లో ఒండునీరు.. జనం బేజారు
రాయచూరు రూరల్: నగరంలోని పలు కాలనీలకు నగరసభ అధికారులు, జలమండలి సిబ్బంది కొళాయిల ద్వారా ఒండునీటిని సరఫరా చేశారు. శనివారం మంగళవారపేటె, జహీరాబాద్, జీడితోట, నవాబ్గడ్డ, వాసవినగర్ ప్రాంతాల్లో కృష్ణా నది నుంచి సేకరించిన నీటిని శుద్ధీకరించకుండా సరఫరా చేశారు. కొళాయిల్లో ఒండునీరు, వాన నీరు కలిసి రాగా నురుగతో కూడిన నీరు సరఫరా అయ్యాయి. బేజారు పడిన ప్రజలు గత్యంతరం లేక ఆ నీటినే పట్టుకున్నారు. రాంపూర్ జలాశయం నుంచి నీరు వదలడంతో కొళాయిల్లో ఒండు నీరు రావడం కనిపించింది. ప్రజలు నగరసభ, జలమండలి అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై రగిలిపోయారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
సాక్షి,బళ్లారి: త్యాగ, బలిదానాలకు ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరి ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ తర్వాత గొప్పగా జరుపుకునే పండుగల్లో ఒక్కటైన బక్రీద్ పండుగకు ముస్లిం సోదరులకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో పండుగ రోజున ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసుకొని పొట్టేళ్లు బలి ఇచ్చి అందరికీ మంచి జరగాలని భక్తిశ్రద్ధలతో పండుగను ఆచరించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆయా మసీదులు, ఈద్గాల్లో ప్రార్థనలు చేసి భక్తిని చాటుకున్నారు. కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా బక్రీద్ను ఆచరించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ భోజనాలను ఆరగించారు. ఎంపీ, ఎమ్మెల్యే శుభాకాంక్షలు రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తదితరులు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం ధర్మ గురువు సమక్షంలో ఈద్గాల్లో భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో జనం చేరి సామూహిక ప్రార్థనలు చేయడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొని సంతోషంగా పండుగను ఆచరించారు. ప్రశాంతంగా బక్రీద్ పండుగ రాయచూరు రూరల్: నగరంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గా మైదానం, ఏక్ మినార్ మసీదులో ముస్లిం సోదరులు మసీదు నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్నారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఉత్సాహంగా బక్రీద్ ఆచరణ హొసపేటె: త్యాగ బలిదానాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని ఈద్గా మైదానంలో ఉదయం సామూహిక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు, పిల్లలు ఒకరినొకరు కౌగలించుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత ప్రతి ఇంట్లో దేవుడి పేరు మీద గొర్రెలను బలి ఇచ్చారు. బక్రీద్ పండుగ ఆచారం ప్రకారం మాంసంలో కొంత భాగాన్ని బంధువులకు, మరి కొంత భాగాన్ని పేదలకు దానం చేశారు. మరికొందరు మాంసాన్ని వండి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబూబక్కర్, ఫిరోజ్ఖాన్, అన్వర్ బాషా, ఇమామ్ నియాజీ, వందలాది మంది సోదరులు పాల్గొన్నారు. ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు వాడవాడలా భక్తిశ్రద్ధలతో పండుగ -
పోలీసు అధికారులపై చర్య మంచిదే
హుబ్లీ: ఆర్సీబీ విజయోత్సవ వేళ జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకుల మృతి దురుదృష్టకరం అని, విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమే అని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విషాద ఘటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్తో పాటు పలువురికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవంలో ఇలాంటి దురంతం చూడలేదన్నారు. అలాగే పోలీస్ కమిషనర్ వంటి ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారిగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం అన్నారు. అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించడం వల్లే ఈ దురంతం జరిగిందన్నారు. తగినంత గడువు తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందన్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన దేశానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాల్సిందన్నారు. అంతేగాక సంబంధించిన వారితో మాట్లాడి అవకాశం ఇవ్వాల్సింది. ప్రభుత్వంలో క్రికెట్ మండలి తప్పు కూడా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో క్రికెట్ మండలికి వ్యతిరేకంగా పలు కేసులు పెట్టాలి. మొత్తం దేశంలో క్రికెట్పై అతి పిచ్చి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
కాలువలకు సత్వరం నీరు అందించండి
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 25 టీఎంసీల నీరు నిల్వ ఉన్న వెంటనే ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేస్తే, రైతులకు మేలు జరగడంతో పాటు జలాశయం భద్రతకు కూడా మేలు అని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ అన్నారు. ఇప్పటికే జలాశయంలో 22 టీఎంసీల నీరు నిల్వ అవుతున్నాయి. ఎగువన మంచి వర్షాలు కురుస్తున్నందున జలాశయానికి నీరు పుష్కలంగా అందుతోంది. ఈనేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై వచ్చే ఏడాది మార్చి వరకు రైతులకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, తరువాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్ సమర్పించారు. వారు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే 3 రాష్ట్రాల రైతుల తరఫున నిరసన చేపడతామని హెచ్చరించారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు జలాశయపు 19వ గేటు కొట్టుకుపోయినప్పడు వచ్చే ఏడాది జలాశయం 33 గేట్లను కొత్తగా తయారు చేసి బిగించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని తుంగభద్ర రైతు సంఘం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు సంఘం ఒక అభ్యర్థనను సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. టెండర్ మంజూరు చేసినా వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త గేట్లు తయారు చేసి బిగించడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.తుంగభద్ర జలాశయం గేట్లు మంచి నాణ్యతతో లేనందున, ఈ సంవత్సరం జలాశయంలో 80 శాతం మేర నీరు మాత్రమే నిల్వ చేసేందుకు వీలు ఉంటుందని సమాచారం. కొంచెగేరి దొడ్డమల్లప్ప, దరూరు ఎం.వీరభద్ర నాయక్, ఎం.రామాంజిని నాయక్, కురుబర గాదిలింగమూర్తి, అంగడి రాజాగౌడ, బసవనగౌడ, రైతు సంఘం బాధ్యులు హాజరై వినతిపత్రం సమర్పించారు. -
ఖరీఫ్ సాగు పనులు షురూ
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో తమ తమ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఖరీఫ్లో ముందుగానే వానలు కురిసాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లు నీటిపారుదల భూములు కాగా మిగిలిన భూముల్లో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, కేఎస్ఎంఎఫ్లో 7,393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ దేవిక వెల్లడించారు. జిల్లాలోని 35 రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు దీనిని సద్వినియోగపరుచుకోవాలని కేంద్రం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేదు వ్యవసాయ శాఖ జేడీ దేవిక వెల్లడి -
ఆలయాల్లో గాలి సతీమణి పూజలు
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తూ టెంపుల్ రన్ చేస్తున్నారు. జనార్ధన్రెడ్డిని మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించి చంచలగూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను మరో కేసులో విచారణ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జనార్ధన్రెడ్డి తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో తన భర్తకు మంచి జరగాలని ఆమె రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పూజలు, హోమాలు చేయిస్తున్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం అయిన అంజనాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టాభిరామ ఆలయంలో పూజలు చేసి అనంతరం ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకొని అక్కడి స్వామిజీ ఆశీస్సులు పొందారు. అనంతరం కొల్లూరు మూకాంబిక ఆలయంలో పూజలు, హోమాలతో పాటు శత్రు నివారణ సంకష్ట పూజలను కూడా నిర్వహించారు. అక్కడి నుంచి బ్రహ్మలింగేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అసోం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం అయిన కామాక్షి దేవిని దర్శించుకున్నారు. ఈమె గత వారం రోజులుగా పలు ఆలయాల్లో పూజలు చేస్తుండటం విశేషం. -
కొత్వాలుగా సీమంత్కుమార్ సింగ్
బనశంకరి: బెంగళూరు నగర నూతన పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్కుమార్ నియమితులయ్యారు. చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సీమంత్కుమార్సింగ్ను నియమించింది. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీమంత్కుమార్ సింగ్ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంతకు ముందు తన కార్యాలయంలో అధికారులతో నూతన కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నగరంలో ఇటీవల రౌడీకార్యకలాపాలు పెచ్చుమీరడం, ప్రజలను మారణాయుధాలతో బెదిరించడం, అమాయకులు, దుకాణాలపై దాడులు తదితర ఘటనలకు అడ్డుకట్టవేసి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. బక్రీద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విషయంలో సీనియర్ అధికారులతో సమాలోచనచేసి నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ సీమంత్కుమార్సింగ్ సూచనచేశారు. చిన్నస్వామిస్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ కేసుపై విచారణ ప్రారంభించిందన్నారు. బాధ్యులపై చట్టరీత్యాచర్యలు తీసు తీసుకుంటామన్నారు. నమోదైన కేసులను సీఐడీకి అప్పగించే ముందు తమ విధులు తాము నిర్వహిస్తామని తెలిపారు. -
ఆ తొక్కిసలాట సర్కారు వైఫల్యమే
సాక్షి,బళ్లారి: ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంతో అక్కడ జరిగిన తొక్కిసలాట తదితర పరిణామాలతో 11 మంది మృతి చెందడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తూ నిరసన తెలిపారు. రాయల్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచారం కోసం పాకులాడిందన్నారు. లక్షలాది మంది అభిమానులు చేరుతారని తెలిసి కూడా అక్కడ తగిన భద్రత ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. తొక్కిసలాట ఘటనను తాము రాజకీయం చేస్తున్నామని కాంగ్రెస్ ఆరోపించడం శోచనీయం అన్నారు. 11 మంది అమాయకులు మృతి చెందితే వారి తరఫున పోరాటం చేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భద్రతా లోపం వల్ల తొక్కిసలాట జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో సరిపోదని, పాలకులు బాధ్యత వహించాలన్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు రామలింగప్ప, కార్పొరేటర్లు కోనంకి తిలక్, శ్రీనివాస్ మోత్కూరు, హనుమంతప్ప, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. సీఎం, డీసీఎం దిష్టిబొమ్మలు దహనం చేసిన బీజేపీ నగరంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన వైనం -
మారణకాండకు వారే బాధ్యులు
సాక్షి,బళ్లారి: ఇటీవల బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్లే కారణమని, వారు నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ముగ్గురిపై కేసులు పెట్టి తక్షణం వారిని అరెస్ట్ చేయాలని, వారు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత వెంటనే విజయోత్సవ ర్యాలీని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఆలస్యంగా జరుపుకుని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారులను బాధ్యులను చేసి, వారిని సస్పెండ్ చేసినంత మాత్రాన పాపం పోదని, తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తూతూమంత్రంగా నామమాత్రపు పరిహారం ప్రకటించడం సరికాదన్నారు. గవర్నర్నూ అవమానించారు ఆర్సీబీ విజయోత్సవంలో గవర్నర్కు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాధారణంగా ఏదైనా సమావేశంలో ప్రారంభానికి ముందు గవర్నర్ వస్తారని, అయితే గవర్నర్ను అందరి కంటే ముందే పిలిచి ఆయన్నే వేచి ఉండే విధంగా చేసి ప్రోటోకాల్ను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై ఎ1గా సీఎం, ఎ2గా డీసీఎం, ఎ3గా హోంమంత్రి పేర్లను నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. ఆర్సీబీ ఘటనలో జరిగిన లోపాలపై చర్చించేందు కోసం అసెంబ్లీ సమావేశాలు జరపాలన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు అల్లు అర్జున్ సినిమా విడుదల రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందితే ఆ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని, అక్కడ కాంగ్రెస్ సర్కారే పాలనలో ఉందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మరి తొక్కిసలాటలో 11 మంది మృతి చెందితే సీఎం, డీసీఎం, హోంమంత్రిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి, పదవుల నుంచి ఎందుకు తప్పించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్, పాలికె ప్రతిపక్ష నేత ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు కే.ఎస్.అశోక్, మోత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ 11 మంది చావుకు వారే బాధ్యత వహించాలి సీఎం, డీసీఎం, హోంమంత్రి రాజీనామా చేయాలి ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీరాములు నిప్పులు -
శివమొగ్గలో కాల్పుల మోత
● అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగపై పోలీసు కాల్పులు శివమొగ్గ: అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన శుక్రవారం వేకువజామున శివమొగ్గ నగరంలో జరిగింది. బెంగళూరులోని కల్కెరెకు చెందిన మంజునాథ్ అలియాస్ మంజు(42)పై రౌడీషీట్ నమోదైంది. ఇతనిపై 72కుపైగా కేసులు ఉన్నాయి. అనేక దోపిడీ ఘటనల్లో ఇతను భాగస్వామి. చాలా రోజులుగా పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్నాడు. శివమొగ్గ నగరానికి వచ్చినట్లు పక్కా సమాచారంతో శివమొగ్గ నగరంలోని జయనగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఐ సిద్దెగౌడ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వేకువజామున వేట మొదలు పెట్టారు. నిందితుడు ఉన్న చోటకు చేరుకున్నారు. లొంగిపోవాలని మంజుకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ద్యామప్ప అనే కానిస్టేబుల్పై మంజు మారణాయుధంతో దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ సిద్దేగౌడ సర్వీస్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా మంజు ఎదురుదాడికి యత్నించడంతో మళ్లీ కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మంజు కాలిలోకి దూసుకెళ్లడంతో కుప్పకూలాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. నేడు బ్లాక్ డే దొడ్డబళ్లాపురం: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి కన్నడ భాషా ఉద్యమనేత వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం బ్లాక్ డే గా ఆచరించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12–30 గంటలకు బెంగళూరు మైసూరు బ్యాంక్ సర్కిల్లో బ్లాక్ డే ఆచరించనున్నట్టు ఆయన ప్రకటించారు. 11మంది మృతికి కారణం ఎవరని వాటాళ్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు, రాజకీయ అవసరాలకు అతీతంగా ఆలోచించాలని ఆయన అన్నారు. ఆర్సీబీ విజయోత్సవాన్ని ఆచరించాలని ఎవరు నిర్ణయించారన్నారు. తొక్కిసలాట మృతునికి అశ్రునయనాలతో అంత్యక్రియలు మండ్య : చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద జరగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని రాయసముద్ర గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్ర కుమారుడు పూర్ణచంద్ర అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం రాయసముద్రలో బంధువుల కన్నీటి మధ్య జరిగాయి. రాయసముద్రతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పూర్ణచంద్రకు కడసారి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే హెచ్.టి.మంజు, ఆర్టీఓ మల్లికార్జున, తహసీల్దార్ ఎస్యూ ఆశోక్, విద్యాశాఖాధికారి తిమ్మేగౌడ వచ్చి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూర్ణచంద్ర మృతి బాధాకరమన్నారు. -
వాడకాన్ని ఆపుదాం.. ప్లాస్టిక్ను అంతం చేద్దాం
హొసపేటె: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత జీవనశైలి అలవర్చుకుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకుంటామని అదనపు జిల్లాధికారి బాలకృష్ణప్ప అన్నారు. నగరంలోని విజయనగర కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పర్యావరణ దినోత్సవ వేడుకల కోసం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి అనే నినాదాన్ని విడుదల చేసిందన్నారు. కాలుష్య నియంత్రణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అవగాహన కల్పించడానికి ప్రజలు, సంఘసంస్థలు ప్రభుత్వంతో చేతులు కలపాలన్నారు. కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని కొనడానికి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపి వేద్దాం. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు వేసి చెత్త వాహనాలకు ఇద్దాం. మీ చిన్న చర్యలు పర్యావరణానికి మేలు చేస్తాయి. ప్లాస్టిక్ వాడకాన్ని విడిచిపెట్టి కాలుష్యాన్ని అంతం చేయడానికి మనమందరం ఒక తీర్మానం చేద్దాం అని ఆయన అన్నారు. ముందుగా తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు నివాళులర్పిస్తూ మౌన జాగరణ పాటించారు. నగరంలోని విజయనగర కళాశాల నుంచి డాక్టర్ పునీత్రాజ్కుమార్ సర్కిల్ వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పర్యావరణ అవగాహన గురించి నినాదాలు చేస్తూ ఊరేగించారు. పర్యావరణ, వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అబ్దుల్ సమద్ కొట్టూర్, పర్యావరణ అధికారి హెచ్ఎం మీనాక్షి, సీనియర్ పర్యావరణ అధికారి బీఎస్ మురళీధర్, విజయనగర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభుగవాడ, పర్యావరణ వేత్త రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ సిబ్బంది మంజునాథ్, శేఖరప్ప పాల్గొన్నారు. -
తప్పు మీది.. శిక్ష పోలీసులకా?
సాక్షి బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం గేటు వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొక్కిసలాటకు పోలీసుల అధికారుల వైఫల్యమే కారణంగా చూపుతూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి.దయానందతో పాటు ఐదు మంది పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షపై సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సామాజిక మాధ్యమాల్లో ‘ఐ స్టాండ్ విత్ దయానంద’ పేరుతో హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. జూన్ 3న అర్ధరాత్రి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుపొందితే జూన్ 4న విజయయాత్ర, విజయోత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనర్కు సమాచారం ఇస్తే భద్రతా ఏర్పాట్లు ఎలా సాధ్యం అవుతాయి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తక్కువ సమయంలో కార్యక్రమ నిర్వహణ, అందుకు సంబంధించిన భద్రత వ్యవస్థ ఎలా సాధ్యపడుతుందని మండిపడుతున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కల ఆర్సీబీ నెరవేర్చడంతో ముందురోజు అభిమానుల అత్యుత్సాహం అందరూ చూశారు. అర్ధరాత్రి దాటినా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలారు. అలాంటి అభిమానులున్న ఆర్సీబీ జట్టు బెంగళూరుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఊహించడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలం అయింది. మరోవైపు విజయోత్సవ వేడుక నిర్వహించి తీరాల్సిందేనని ప్రభుత్వంపై ఆర్సీబీ తీవ్ర ఒత్తిడి చేసిందని సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తెలిపారు. ఎలాంటి ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు లేకుండా హడావుడిగా ఆర్సీబీ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పని ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గందరగోళ వ్యాఖ్యలతో పరిస్థితి విషమం సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు అత్యంత సూక్ష్మంగా పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నం చేసినా పాలన యంత్రాంగం సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వరలు పదేపదే గందరగోళం కలిగించేలా వ్యాఖ్యలు చేసి మరింత ఆందోళనకరంగా పరిస్థితిని మార్చారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్పై ప్రజల్లో ఆగ్రహం తొక్కిసలాటకు బాధ్యత పోలీసు విభాగంపైకి నెట్టే యత్నం విజయోత్సవానికి అనుమతిచ్చింది ప్రభుత్వం కాదా? అని ప్రశ్న పోలీసు కమిషనర్ దయానందకు నెటిజన్ల నుంచి మద్దతుకమిషనర్ ఆదేశాలతో నిద్రాహారాలు లేకుండా విధులు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కమిషనర్ దయానంద ఆదేశాలు జారీ చేయడంతో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ నిద్ర మానుకుని విధులకు హాజరయ్యారు. ఉదయం వరకు నిద్రాహారాలు లేకుండా పోలీసులు ఉద్యోగం చేశారు. మళ్లీ మరుసటి రోజు విశ్రాంతి లేకుండా విజయోత్సవాల బందోబస్తు కూడా చేపట్టాల్సి వచ్చింది. దీంతో ఉన్న కొద్దిపాటి సిబ్బందితో విజయోత్సవ కార్యక్రమానికి పోలీసు బందోబస్తును చేపట్టారు. అలాగే మొత్తం నాలుగైదు లక్షల మంది బెంగళూరు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇంత మందిని పర్యవేక్షించేందుకు, బందోబస్తుకు, భద్రతకు కేవలం 1,600 మంది పోలీసులను వినియోగించారు. అన్ని లక్షల మందికి 1600 మంది పోలీసులు ఎలా సరిపోతారని ప్రశ్నలు వస్తున్నాయి. అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించి తప్పును పోలీసు విభాగంపై నెట్టడం ఎంత వరకు సబబు అని ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పోలీసు అధికారుల సస్పెన్షన్ ద్వారా పరిపాలనలో తాము దిట్ట అని, నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థులమని, అయితే వాటిని అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందని నిరూపించాలనుకుంటున్నారా? అని మండిపడుతున్నారు. -
తొక్కిసలాట మృతులకు నివాళులు
మైసూరు: ఆర్సీబీ జట్టు విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో అసువులుబాసిన వారికి శుక్రవారం నగరవాసులు నివాళులర్పించారు. చాముండిపురం సర్కిల్ వద్ద జనమన వేదిక , పాతి ఫౌండేషన్ , ఆరివు సంస్థ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. లోకాయుక్తకు చిక్కిన అధికారులు దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు లోకాయుక్తకు చిక్కారు. ఉడుపి బ్రహ్మవరకు చెందిన దినేష్ పూజారి అనే వ్యక్తి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అయితే కనెక్షన్ మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని ఉడుపి జిల్లా బ్రహ్మావర మెస్కాం అసిస్టెంట్ ఇంజినీర్ అశోక్ పూజారి డిమాండ్ చేశాడు. దదీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. శుక్రవారం పథకం ప్రకారం కార్యాలంయలో రూ.20 వేల నగదు ఇస్తుండగా లోకాయుక్త పోలీసులు దాడిచేసి అశోక్ పూజారిని అరెస్ట్ చేశారు. కేఐఏడీబీ సర్వే సూపర్వైజర్.... లంచం తీసుకుంటూ కేఐఏడీబీ సర్వే సూపర్వైజర్ లోకాయుక్తకు చిక్కాడు. బెంగళూరుకు చెందిన రవి అనే వ్యక్తి తన భూమికి సంబంధించిన స్కెచ్ను ఆమోదించాలని కేఐఏడీబీ సర్వే సూపర్ వైజర్ నరేంద్రకుమార్ను కోరాడు. అందుకు రూ.1.50 లక్షలు లంచం డిమాండు చేశాడు. దీంతో రవి లోకాయుక్తను ఆశ్రయించాడు. పథకం ప్రకారం నగదు అందజేస్తుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి నరేంద్ర కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ దయానంద్ సస్పెన్షన్ అన్యాయం బనశంకరి: తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మృతిచెందిన ఘటనకు సంబంధించి బెంగళూరు నగరపోలీస్కమిషనర్ బి.దయానంద్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈమేరకు మడివాళ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నరసింహరాజు శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి ధర్నాచేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఖండిస్తూ చేతిలో డాక్టర్ అంబేడ్కర్ ఫొటో పట్టుకుని, నల్లదుస్తులు ధరించి రాజభవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. విధానసౌధ పోలీసులు చేరుకుని హెడ్కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. సీఎం, డీసీఎం, హోం మంత్రిపై బీజేపీ ఫిర్యాదు బనశంకరి: చిన్నస్వామిస్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మృతిచెందిన ఘటనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీసీఎం డీకే.శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం బెంగళూరు కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.రాజీవ్ నేతృత్వంలోని కమిటీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్, అధికారప్రతినిధి అశ్వత్నారాయణ పాల్గొన్నారు. ఇద్దరి అరెస్ట్ బనశంకరి: బెంగళూరు చిన్నస్వామిస్టేడియంలో సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబందించి ఇద్దరు స్టేడియం సిబ్బందిని శుక్రవారం కబ్బన్పార్కు పోలీసులు అరెస్ట్చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టికెట్ కౌంటర్లో విధులు నిర్వహించే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
అలరించిన ముగ్గుల పోటీలు
రాయచూరు రూరల్: జిల్లా సాహిత్య లోకానికి మున్నూరు కాపు సమాజం మద్దతు ఇవ్వడం అభినందనీయమని సీనియర్ కవి భగత్రాజ్ నిజాంకారి పేర్కొన్నారు. గురువారం నగరంలోని వీరాంజనేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అఖిల భారత ముంగారు మున్నూరు కాపు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన కవిగోష్టిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నాడు శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల పాటు ముంగారు ఉత్సవాలను చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. వృషభం, మాతా లక్ష్మీదేవి, రైతులు, వెంకటేశ్వరుడు, పల్లె వాతావరణం ఉట్టి పడేలా ముగ్గులు వేశారు. మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, వెంకటేష్, కృష్ణమూర్తిలున్నారు. -
తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి
రాయచూరు రూరల్: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ తొక్కిసలాటలో యాదగిరికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని యాదగిరి తాలూకా హొనగెరెకు చెందిన శివలింగ(17)గా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు తిమ్మమ్మ, చంద్రప్పలతో కలిసి బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన శివలింగ యలహంక వద్ద సిమెంట్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. శివలింగ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఆర్సీబీ సంబరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డాడు. బెంగళూరు బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం హొనగెరెలో అతని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మొక్కలను కన్న బిడ్డల్లా పెంచాలి రాయచూరు రూరల్: మొక్కలను కన్నబిడ్డల్లా పెంచాలని శ్రీరామనగర క్యాంప్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహంతేష్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. విద్యార్థులు తమ ఇంటి చుట్టు పక్కల మొక్కలు పెంచాలన్నారు. కన్నబిడ్డలను ఎలా పెంచుతారో అలా చెట్లను పెంచాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి హుబ్లీ: నిరంతరం తాగునీటి సరఫరాలో భాగంగా పైపులైన్లు అమరుస్తుండగా మట్టిపెళ్లలు విరిగి పడి మృతి చెందిన కార్మికుడు చేతన్ యాదవ్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని అసంఘటిత దళిత కార్మికుల సంఘం తహసీల్దార్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సంఘం నేతలు మాట్లాడుతూ మంటూరు మెయిన్ రోడ్డులో ఎల్అండ్టీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. అందులో భాగంగా పనులు చేస్తున్న కార్మికులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మట్టిపెళ్లలు విరిగిపడి కార్మికుడు స్థలంలోనే మృతి చెందాడు. ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల పేద కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్షణమే మృత కార్మికుని కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల పరిహారధనం చెల్లించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అలాగే మరో కార్మికుడు మౌలాసాబ్ ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, ఆ కార్మికుడు కోలుకొనేంత వరకు ఆస్పత్రి ఖర్చుతో పాటు ఇంటి ఖర్చులను కంపెనీనే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు విజయ్ కర్రా, సతీష్, విశ్వనాథ్, విజయ్కుమార్, సలీం తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికునితో కానిస్టేబుల్ గొడవ●బస్సు అద్దాన్ని పగలగొట్టిన పోలీస్ రాయచూరు రూరల్: ప్రయాణికునితో గొడవ పెట్టుకున్న కానిస్టేబుల్ ఆర్టీసీ బస్సు అద్దాన్ని పగలగొట్టిన ఘటన జిల్లాలోని దేవదుర్గలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకొని దేవదుర్గ నుంచి రాయచూరుకు వస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ బస్సులో కూర్చున్నాడు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీట్లో కూర్చొన్న వృద్ధుడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ గొడవకు దిగాడు. కోపంలో బస్సు నుంచి దిగి ముందు భాగంలోని అద్దంపైకి రాసి విసిరి అద్దాన్ని పగలగొట్టి ధ్వంసం చేశాడు. వృద్ధుడిని భయ పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్తో సహా బస్సును డ్రైవర్ సురేష్బాబు నేరుగా పోలీస్ స్టేషన్కు పోనిచ్చాడు. అక్కడ పోలీసు అధికారులు చర్చించి ఇద్దరి మధ్య రాజీ చేసి శాంతింపచేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టండి హొసపేటె: వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్లపై గుంతలను మూసివేసి రాకపోకలు సజావుగా సాగేలా వ్యవస్థ కల్పించాలని కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రజా పనుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఇంజినీర్లతో నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కేటాయించి మంచి రోడ్లు నిర్మించారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి. రోడ్డు పక్కన పెరుగుతున్న చెట్లను నరికి వేయాలి. దీనికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి సమయంలో నాణ్యతను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రజా పనుల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవదాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.నాగనగౌడ, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నకిలీ జర్నలిస్టుల బెడద అరికట్టాలి హొసపేటె: కొట్టూరు తాలూకాలో నకిలీ జర్నలిస్టుల బెడద అరికట్టాలని, నిజమైన జర్నలిస్టులకు రక్షణ, న్యాయం అందించాలని, నకిలీ లేఖ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాలూకా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ శనివారం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించింది.అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ దేవరమనె మాట్లాడుతూ నిజమైన, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు నకిలీల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల పేరుతో అధికారులు, ఇతరులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అసోసియేషన్ నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరింది. డబ్బు వసూలుకు సంబంధించి చాలా ప్రజా ఫిర్యాదులు వస్తున్నాయి. తాలూకా యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించి నిజమైన జర్నలిస్టులకు సహకరించాలని అభ్యర్థించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉజ్జిని రుద్రప్ప, జిల్లా కార్యదర్శి రవికుమార్, తాలూకా కార్యదర్శి మంజునాథ్, సభ్యులు గురుప్రసాద్, ప్రకాష్, హళ్లి కొట్రేష్, చిగటేరి కొట్రేష్, ఎన్.నాగరాజ్ పాల్గొన్నారు. -
బైక్ ప్రయాణికులకు హెల్మెట్ రక్ష
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి శ్రీరామ రక్షగా హెల్మెట్ పని చేస్తుందని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో హెల్మెట్ వాడకంపై ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. హెల్మెట్ ధరించక పోవడంతో ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందన్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారందరూ హెల్మెట్ ధరించాలన్నారు. శుక్రవారం నుంచి హెల్మెట్ ధరించకపోతే రూ.500లు జరిమానా వేస్తామన్నారు. అయితే పోలీసులకు దొరికితే రూ.500లు కట్టి వెళ్లవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. హెల్మెట్ వాడకం మీ ప్రాణ రక్షణ కోసమేనన్నారు. పాఠశాల, కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులు ద్విచక్ర వాహనాల్లో వెళితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఆయా పాఠశాల, కళాశాలల యజమాన్యాలు ఈ విషయంపై విద్యార్థులు, సిబ్బందికి జాగృతి కల్పించాలన్నారు. యాజమాన్యాలూ బాధ్యులే ఒకవేళ విద్యార్థులు కూడా హెల్మెట్ ధరించకపోతే జరిమానాతో పాటు ఆయా కళాశాల, పాఠశాలల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కూడా కచితంగా కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితితుల్లోను వాహనాలు నడపకూడదన్నారు. హెల్మెట్పై గతంలో కూడా ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. ప్రస్తుతం తూతూమంత్రంగా నియమాలు జారీ చేస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదన్నారు. కచ్చితంగా ఇప్పటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు రక్షిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా హెల్మెట్పై వెనక్కు తగ్గేది లేదన్నారు. అనంతరం ఆమె పలువురు పోలీసు అధికారులతో కలిసి శ్రీకనక దుర్గమ్మ ఆలయం పక్కనే రోడ్డులో ప్రజలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగిస్తూ ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ నందారెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల కోసం కాదు, మీ ప్రాణ రక్షణకే తప్పకుండా ధరించాలి: ఎస్పీ శోభారాణి -
టైర్ పేలి కారు పల్టీ.. ఒకరు దుర్మరణం
రాయచూరు రూరల్: కారులో ప్రయాణిస్తుండగా టైర్ పేలడంతో కారు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడిని అమరేశ్వర క్రాస్ నుంచి దేవర భూపురకు కారులో వెళుతున్న తిమ్మనగౌడ(32)గా పోలీసులు గుర్తించారు. నిశ్చితార్థం ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలిసింది. లింగసూగూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: గొర్రెలను మేపడానికి వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపరులు కాలు జారి బావిలో పడి దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకాలో జరిగిన ఈ ఘటనలో మృతులను కుశాల్ చెన్నప్ప(8), రాజు చెన్నప్ప(14)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తాపుర పోలీసులు తెలిపారు. రాజ కాలువల్లో పూడికతీత రాయచూరు రూరల్: నగరంలోని రాజ కాలువలు, మురుగు కాలువల్లో పేరుకున్న చెత్త, పూడికతీతను జిల్లా స్థాయి అధికారులు గురువారం సాయంత్రం పరిశీలించారు. బస్టాండ్ వద్ద గల పెద్ద కాలువలో పూడికతీతను జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, కమిషనర్ జుబిన్ మహాపాత్రో పరిశీలించి మాట్లాడారు. కాలువల్లో పూడికను తొలగిస్తే వర్షాకాలంలో నీరు సజావుగా ముందుకు వెళతాయన్నారు. పూడికను తొలగించకుంటే వర్షపు నీరు నిల్వ చేరి లోతట్టులోని ఇళ్లలోకి జొరబడతాయన్నారు. ప్రజలు ఇబ్బంది పడరాదని గమనించి వారి శ్రేయస్సు దృష్ట్యా పూడికను తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 9 నుంచి పక్షవాత పరీక్ష శిబిరం హుబ్లీ: హెల్త్ గార్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 14 వరకు సంతోష్నగర్ నీలకంఠేశ్వర కాంప్లెక్స్లోని డాక్టర్ విజయ్ కాట్వే క్లినిక్లో పక్షవాతంపై ఉచిత వైద్య పరీక్ష చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక చికిత్సా పద్ధతుల ద్వారా నిపుణులైన వైద్యులతో రోగులను పరీక్షిస్తారు. అలాగే మెదడు, వెన్నెముక, పక్షవాతం, మూర్ఛరోగం తదితరాల పరీక్షలను కూడా జరుపుతారన్నారు. పేర్ల నమోదుకు సెల్ నంబర్–9731280586లో సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. నకిలీ బ్రాండ్తో చీపుర్ల తయారీ.. కేసు నమోదు హుబ్లీ: విభవ కంపెనీ మంకీ 555 బ్రాండ్ పేరుతో చీపుర్లను నకిలీ పద్ధతిలో తయారు చేసి విక్రయిస్తున్న ఆరోపణలపై జైన్ మార్కెటింగ్ అంగడిపై కేసు నమోదైంది. మంగళవారపేటెలోని జైన్ మార్కెటింగ్ అంగడితో పాటు పలువురికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. సదరు కంపెనీ జీఎం వినోద్ కుమార్ జవళి ఈ ఫిర్యాదు చేశారు. నుల్వి గ్రామంలో విభవ కంపెనీ పేరుతో మంకీ 555 బ్రాండ్ చీపుర్లను తయారు చేసిన కార్మికుడు గౌడప్పగౌడ నుంచి 60 చీపుర్లను కొనుగోలు చేసి పరిశీలించగా ఈ నకిలీ తయారీ గుట్టురట్టయింది. ఈ ఘటనపై గంటిగేరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా విశ్రాంత ఉద్యోగి ఎస్ఎండబ్ల్యూయూ అబ్రాయ్ అనే కంపెనీలో రూ.3.20 లక్షల పెట్టుబడి పెట్టి మోసపోయారు. స్థానికుడు కన్ననగౌడ ఈయననే గాక తనూష, కార్తీక, హబీద్సింగ్లను కూడా మోసగించినట్లు బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తిప్రపత్తులతో ధ్వజారోహణ బళ్లారిఅర్బన్: శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీపార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ ఆలయంలో 101వ ధ్వజారోహణను ఆచార్య విమల్ సాగర్ సారథ్యంతో భక్తిప్రపత్తులతో వేద ఘోషల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, జిల్లా ఎస్పీ శోభారాణి, శ్రీపార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ సంఘం అధ్యక్షుడు ఉత్సవ్లాల్ బాగ్రేచా, ఉపాధ్యక్షుడు సూరల్మల్ దంతెవాడి, ప్రధాన కార్యదర్శి రోషన్ జైన్, సహ కార్యదర్శి అనిల్ బాగ్రేచా, సంయుక్త కార్యదర్శి భరత్, ట్రెజరర్ గౌతమ్ బుజ్వాన్, వినోద్ బాగ్రేచా, మహావీర్, హర్ష జైన్, అజయ్ సోని, దేవస్థాన పదాధికారులు, జైన్ ప్రముఖులు, సమాజ బాంధవులు పాల్గొన్నారు. -
నోరూరిస్తున్న ఫలరాజు
సాక్షి,బళ్లారి: అన్ని పండ్లలోకి మామిడి పండును ఫలరాజు అని అంటారు. ఏడాదిలో మే నుంచి జూలై లేదా ఆగస్టు వరకు నాలుగు నెలల కాలాన్ని మామిడి పండ్ల సీజన్గా పిలుస్తారు. ఈ మామిడి పండ్లు పండించాలంటే ఒక ఏడాది లేదా రెండేళ్లు అయితే సరిపోదు. మామిడి మొక్కలు నాటిన తర్వాత కనీసం నాలుగు లేదా ఐదేళ్ల తర్వాత మామిడి చెట్ల నుంచి కాయలు కోయడానికి వీలుంటుంది. చెట్లు బాగా ఏపుగా పెరిగిన తర్వాత అంటే ఏడెనిమిది సంవత్సరాల తర్వాతే మామిడి చెట్ల నుంచి ఓ మోస్తరుగా మామిడికాయలు విరివిగా కాస్తాయి. అంటే మామిడి చెట్లు నాటిన తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు కంటికి రెప్పలా, చంటిపిల్లవాడిని పెంచినట్లుగా మామిడి చెట్లను పెంచిన రైతుకు మామిడి పండ్ల సీజన్ వచ్చిన తర్వాత ఏడాదికి ఒకసారి మాత్రమే చేతికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు కాసిన తర్వాత రైతులు ఈసారి తమ కష్టాలు తీరతాయని ఆశతో ప్రతి మామిడికాయ వద్దకు వెళ్లి లెక్కించుకుని బాగా కాశాయని సంబరపడి పోతాడే కాని తీరా మార్కెట్కు వచ్చిన తర్వాత ధరలు చూసి మామిడి రైతు కుదేలవుతున్నారు. ఈసారి మామిడి కాయలు ఎక్కడ చూసినా పెద్దగా కాయలేదని రైతులు పేర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు కాసిన కాయలను మాగబెట్టి పండ్లు చేసి అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే ధరలు ఉన్నఫళంగా తగ్గిపోవడంతో మామిడి రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈసారి మామిడి పండ్ల సీజన్ ప్రారంభంలో ధరలు కొంతమేరకు ఉండేవని, అయితే గత రెండు వారాలుగా అమాంతంగా పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాదామి, తోతాపురి, సింధూర రకం మామిడి పండ్ల ధరలు భారీగా తగ్గిపోతున్నాయని అంటున్నారు. మామిడి రైతుల వద్ద కిలోకు రూ.10 నుంచి రూ.15లోపు ధరకు కొనుగోలు చేస్తున్నారు. బళ్లారి నగరంలోని ఏపీఎంసీకి ప్రతి రోజు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు, పొరుగున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మామిడి పండ్లను తీసుకు వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ధర చూసి రైతులు కనీసం రవాణా ఖర్చులు, కాయలు కోయడానికి అయిన ధరలు కూడా పలకడం లేదంటున్నారు. ఒక్క బళ్లారి ఏపీఎంసీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మార్కెట్లోను మామిడి ధరలు పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు రాకుంటే ఏం చేయలేం కొనుగోలు చేసే వ్యాపారులు రాకపోతే తాము ఏమీ చేయలేమని ఏపీఎంసీల్లో పని చేసే దళారులు అంటున్నారు. పొలాల్లో మామిడి కాయలను కూడా తాము కోయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నాలుగు ఎకరాల మామిడి తోట ఉందని, ప్రారంభంలో తోట మొత్తం రూ.50 వేలకు ఇచ్చానని, అయితే మార్కెట్లో ధరలు పడిపోవడంతో సదరు వ్యాపారి కాయలు కోయడం లేదన్నారు. తాము కాయలు కోసి మార్కెట్కు తీసుకుని వస్తే అమ్ముడు పోవడం లేదని మామిడి తోట సాగు చేసిన రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈసారి మామిడిపంట బాగా తగ్గినప్పటికీ ధరలు మాత్రం పెరగలేదన్నారు. ఇందుకు కారణాలు తెలియడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఏకకాలంలో మామిడిపంట చేతికందిందని, దీంతో పాటు వర్షాలు కూడా బాగా కురుస్తుండటం వల్ల కాయలు నేలరాలిపోతున్నాయని, దీంతో రైతులు అందరూ ఒకేసారి కాయలు కోస్తున్నారని, ధరలు పడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అక్కడక్కడ జోరుగా వర్షాలు కురుస్తుండటం కూడా మామిడి రైతులకు ఽశాపంగా మారింది. అల్ఫాన్సా, మల్లికా రకాలకు డిమాండ్ మామిడి పండ్లలో అల్ఫాన్సా, మలగూబ, రసపురి, సక్కరగుత్తి, తోతాపురి, మల్లికా, సింధూర, కేసరి తదితర రకాలు ఉన్నాయని, వీటిలో అల్ఫాన్సా, మల్లికా రకాలు అంతో ఇంతో ధర పలుకుతున్నాయని, ఈ పండ్ల తోటలు ఉన్న రైతులకు కొంతమేరకు పెట్టుబడులు, కూలీలు, రవాణా ఖర్చులు వస్తున్నాయని, మిగిలిన పండ్ల ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఆయా మామిడి పండ్లు సాగు చేసిన రైతులు ఈసారి నష్టాలు చవిచూస్తున్నారు. రైతుల నుంచి ఽతక్కువ ధరకు కొనుగోలు చేసిన చిన్న చిన్న వ్యాపారులు వినియోగదారులకు కిలో రూ.30 నుంచి రూ.50లకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతులకేమో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. దళారులు తమకు వచ్చే కమీషన్ తీసుకుని చేతులు దులుపుకుంటున్నారంటున్నారు. వ్యాపారులు మార్కెట్లో తీసుకున్న ధర కంటే నాలుగింతల ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నష్టపోయేది తామేనని, తమను పట్టించుకునే నాథుడు లేరని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామిడి రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించకపోతే తమకు ఏటేటా నష్టాలు తప్పవని మామిడి తోటల రైతులు మండిపడుతున్నారు. మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం హోల్సేల్గా భారీగా తగ్గిన మామిడి ధర రిటైల్గా అయితే వ్యాపారులకు లాభాలు పండ్ల తోటల్లో కాయలు కూడా కోయని వైనం అమాంతంగా ధర పతనంతో రైతులకు నష్టాలు -
తొక్కిసలాటపై రాజకీయం చేయబోం
శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట ఘటనను తాము రాజకీయం చేసేందుకు ఇష్టపడబోమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవరాజ అరసు 43వ వర్ధంతి సందర్భంగా విధానసౌధ ముందు భాగంలో ఉన్న అరసు ప్రతిమకు పుష్పాంజలి ఘటించిన తరువాత ఆయన మాట్లాడారు. తొక్కిసలాట ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. తాను ఈ విషయంలో రాజకీయం చేయనబోన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులను బలిపశువులు చేశారని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ నైతిక బాధ్యత వహించాలనే ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఎవరు బాధ్యతలు తీసుకొన్నా, బాధ్యతతో విధులు నిర్వహించాల్సింది. వారు నిర్లక్ష్యంతో విధులు నిర్వహించినందుకు చర్యలు తీసుకున్నామని పోలీస్ అధికారుల సస్పెన్షన్ను సమర్థించుకున్నారు. ఈ ఘటనపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తగిన సమాధానం ఇవ్వటానికి ఇష్టపడలేదు. దేవరాజు అరసు పేదల పక్షపాతిఅంతకు ముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవరాజ అరసు కార్యశైలి, రాజకీయ విధానాలను శ్లాఘించారు. అరసు రాష్ట్రానికి చెందిన రాజకీయ చాణుక్యుల్లో ఒకరన్నారు. దేవరాజ అరసుకు పేదలు, అన్యాయానికి గురైన వారిపై అపారమైన ఆసక్తి ఉండేదన్నారు. అరసు పేదరిక నిర్మూలనకు కార్యక్రమాలను సక్రమంగా అమలుపరిచారన్నారు. ఆయన కాలంలో ఎలాంటి వర్గానికి రాజకీయ అవకాశాలు లభించలేదో అలాంటి వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాతినిథ్యం కల్పించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం హావనూరు కమిషన్ను నియమించి వెనుకబడిన వర్గానికి విద్య, ఉద్యోగంలో రిజర్వేషన్ కల్పించారన్నారు. అరసు పథకాలు తమకందరికి సదా స్ఫూర్తి అని సీఎం తెలిపారు. సీఎం సిద్దరామయ్య -
నీటిలో శవాలై తేలిన తల్లీబిడ్డలు
చిక్కబళ్లాపురం: అదృశ్యమైన తల్లీ, ఆమె ఇద్దరు బిడ్డలు నీటిలో శవాలై తేలారు. ఈఘటన చిక్కబళ్లాపురం తాలూకా బాదగానహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో జయణ్ణ, లావణ్య(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నిహారిక(12), నేహా(9) అనే బిడ్డలు ఉన్నారు. ఏ కారణం చేతనో గురువారం సాయంత్రం నుంచి వీరు అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా వారి జాడ లేదు. శుక్రవారం గ్రామ శివార్లలోని బావిలో ముగ్గురూ శవాలై తేలారు. స్థానికులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిది ఆత్మహత్య? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఇకపై హెల్మెట్ ధారణ తప్పనిసరి
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనల్లో వెళ్లేవారు హెల్మెట్ ధరించక పోవడంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు గురి అవుతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో పాటు మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు మేలు చేస్తుందనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ శోభారాణి దిశానిర్దేశంతో గురువారం నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో డీఎస్పీ నందారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయ్యనగౌడ పాటిల్, రవిచంద్ర, సుభాష్ తదితరులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్రాణాలు ఎంతో విలువైనవి ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యనగౌడ పాటిల్ మాట్లాడుతూ ప్రాణాలు ఎంతో విలువైనవని, వెలకట్టలేనివన్నారు. క్షణాల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడేందుకు హెల్మెట్ రక్షణ కవచంగా ఉంటుందని సూచించారు. పోలీసులకు భయపడి హెల్మెట్ ధరించకూడదని, మీ ప్రాణాలను కాపాడుకునేందుకు మీరే హెల్మెట్ ధరించాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపితే మీకే ప్రమాదమని సూచించారు. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే జరిమానా తప్పనిసరిగా విధిస్తారన్నారు. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రాణరక్షణా కవచం హెల్మెట్ హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో కింద పడినప్పుడు తప్పకుండా రక్షిస్తుందని గుర్తు చేశారు. ఈసారి తూతూ మంత్రంగా చేపడుతున్న జాగృతి సమావేశం కాదన్నారు. నిబంధనలను కట్టుదిట్టం చేశారన్నారు. నగరంలో అన్ని రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా ఎవరు హెల్మెట్ ధరించారు, ఎవరు హెల్మెట్ ధరించలేదు అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పోలీసులు కూడా ఆయా కూడళ్లలో హెల్మెట్పై అవగాహన కల్పిస్తున్నారన్నారు. తక్షణం ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు. -
ఎయిడ్స్ బాధిత చిన్నారులకు రేషన్ సరుకుల పంపిణీ
హుబ్లీ: హుబ్లీలో ఎయిడ్స్ బాధిత చిన్నారుల ఆశ్రమానికి హరియత్ స్ట్రీల్ సంస్థ నెల రోజులకు అయ్యే రేషన్ సరుకులను విక్రమ్ బాయి ఫౌండేషన్కు అందజేసినట్లు ఆ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ విక్రమ్ బూరట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల మేలు కోసం రేషన్ సరుకులను అందించిన హరియత్ స్టీల్స్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లీ కొడుకుకు తీవ్రగాయాలు బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు క్రాస్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో తల్లీ కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల మేరకు.. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన దేవరాజు, దేవమ్మ, కుమారుడు నాగేంద్ర ద్విచక్ర వాహనంలో బళ్లారి వైపు వెళ్తుండగా కేఏ–16 బి–4796 నంబరు గల ప్రైవేట్ బస్సు బళ్లారి వైపు నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తూ నేమకల్లు క్రాస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దేవమ్మకు చెయ్యి విరుగగా, 7 ఏళ్లు వయస్సు ఉన్న నాగేంద్రకు కాలు విరిగింది. బాలుని తండ్రి, స్ధానికులు వెంటనే బళ్లారి విమ్స్కు తరలించారు. బస్సు డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. బళ్లారి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపాడని స్ధానికులు తెలిపారు. పండిట్ తారానాథ్ జయంతి రాయచూరు రూరల్: నగరంలోని పండిట్ తారానాథ్ 134వ జయంతిని ఆచరించారు. గురువారం ఎల్వీడీ కళాశాలలో తారానాథుని ప్రతిమకు ఏఐడీఎస్ఓ కార్యదర్శి బసవరాజ్ పూలమాలలు వేశారు. తారానాథుడు విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సభ్యులు వినోద్ కుమార్, అధ్యక్షుడు అయ్యాళప్పలున్నారు. మారథాన్ పరుగుకు శ్రీకారం రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు మున్నూరు కాపు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి మారథాన్ పరుగుకు శ్రీకారం చుట్టారు. గురువారం నగరంలోని వీరాంజనేయ ఆలయం వద్ద పరుగును ఆయన ప్రారంభించారు. బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కృష్ణమూర్తిలున్నారు. పచ్చదనం పెంపొందిద్దాం రాయచూరు రూరల్: పచ్చని చెట్ల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చి పచ్చదనం పెంపొందించాలని వ్యాయామ ఉపాధ్యాయిని ఈరమ్మ అన్నారు. బుధవారం బిజినగేర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచాలన్నారు. -
మహా వరదలకు ఆల్మట్టి కారణం కాదు
● తేల్చిన నీటిపారుదల శాస్త్రవేత్త కమిటీ బృందం రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంభిస్తోందన్న ఆరోపణలతో గురువారం ఓ కమిటీ పర్యటించింది. మహారాష్ట్ర నీటిపారుదల శాస్త్రవేత్త నందకుమార్ కమిటీతో కూడిన సభ్యులు ఆల్మట్టి డ్యాంను సందర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు.బ బచావత్ తీర్పు మేరకు ఎత్తు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా భాగ్య జల నిగమ మండలి అధికారులు, మహారాష్ట్ర నీటిపారుదల శాస్త్రవేత్త కమిటీ సభ్యులు జలాశయంలోకి వస్తున్న నీటి నిల్వ, ఎంత మేర వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మహారాష్ట్రకు వరదలు రావడానికి కర్ణాటక జలాశయాలు కారణం కాదని తేల్చారు. నదీ తీర ప్రాంతంలో అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో వరదల సమయంలో పల్లెలు, వాగులు, వంతెనలు కొట్టుకు పోతాయన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కార్కు 2020లో నివేదికను అందించినట్లు తెలిపారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు సభ్యుడు బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఆనకట్ట ఎత్తు పెంచితే సాంగ్లీ, కోల్హాపూర్, మీరజ్ జిల్లాలు వరదలకు గురి కావడం తథ్యమనే విషయాన్ని తోసిపుచ్చారు. ఆల్మట్టి డ్యాం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి నందకుమార్ ఆధ్వర్యంలోని సంజయ్ ఘనేకర్, ఆర్ఆర్ పవార్, ప్రదీప్ పురందర్, అతుల్ కపూలే, ఆర్డీ మోహితె, ఎస్ఎల్ దయాపూర్, ఎస్.ఎస్.ఖరే, ధైర్యశీల పవార్లున్నారు. -
జీవితంలో విజయవంతానికి ఏకాగ్రత ముఖ్యం
రాయచూరు రూరల్: జీవితంలో విజయం సాధించడానికి ఏకాగ్రత ముఖ్యమని చిక్కబళ్లాపుర శాసన సభ్యుడు ప్రదీప్ ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఎన్ఎస్ బోసురాజు ఫౌండేషన్, జ్ఞానదర్శిని విద్యా సంస్థ, కనసు కేఎస్ అకాడమి బ్రైట్ కంప్యూటర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీతత్వ శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు భయం లేకుండా నిరంతరం 8 గంటల పాటు విద్యనభ్యసిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అర్థమవుతుందన్నారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందన్నారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన ఘటనలపై రాజకీయం చేయడం తగదన్నారు. సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, రవి, స్మిత, వెంకటకృష్ణ, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. -
తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఏదీ?
హొసపేటె: ఖరీఫ్, రబీ సీజన్లకు ఆయకట్టు కాలువలకు నీటి విడుదల గురించి తుంగభద్ర బోర్డు నుంచి స్పష్టత లేకపోవడంతో కర్ణాటకలోని కొన్ని తుంగభద్ర పరివాహక ప్రాంతాలు, ఆంఽధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో డ్యాంలోని 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది, నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలోని బృందం చేసిన ప్రయత్నాల ఫలితంగా తాత్కాలికంగా స్టాప్లాగ్ గేట్ను అమర్చి నదిలోకి భారీ మొత్తంలో విడుదల అవుతున్న నీటికి అడ్డుకట్ట వేశారు. అయితే వివిధ స్థాయిల్లోని నిపుణుల కమిటీలు అన్ని క్రస్ట్గేట్ల జీవితకాలం ముగిసినందున వాటిని మార్చాలని తుంగభద్ర బోర్డుకు సూచించాయి. ఈ ప్యానెళ్లు గమనించిన ప్రకారం ఇవి రెండు దశాబ్దాలకు పైగా ఉపయోగిస్తున్నారు. కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల కమిటీ అధికారులు దాదాపు 75 శాతం నీటిని నిల్వ చేసి, మిగిలిన నీటిని పొలాలకు విడుదల చేయాలని సూచించింది. హైలెవల్ మెయిన్ కెనాల్, లోలెవల్ కెనాల్, టీబీ డ్యాంకు దగ్గరగా ఉన్న ఇతర కాలువల కింద ఆధారపడిన ప్రాంతాలకు అంతరాయం కలగకుండా దశల వారీగా నీరందించి ఏడాదిన్నర లోపు అన్ని గేట్లను మార్చి కొత్తవాటిని అమర్చాలని అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. సందిగ్ధంలో రైతులు ఈ సందర్భంలో కాలువలకు నీటి కేటాయింపులు లేదా విడుదల గురించి బోర్డు ఎటువంటి స్పష్టత జారీ చేయక పోవడంతో టీబీ డ్యాం నీటి వనరులపై ఆధారపడిన రైతులు గందరగోళ స్థితిలో ఉన్నారు. రెండో పంటకు తక్కువ నీరు అందుబాటులో ఉంటుందని అధికారులు అంచనా వేసినందున రైతులు వరిని నాటుకోవద్దని సూచించడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. తుంగభద్ర ఆనకట్ట కింద దాదాపు ఒక సీజన్కు పంట సెలవు వచ్చింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నీటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల, నిపుణుల సూచనలను పాటిస్తూ కేటాయించిన నీటిని విడుదల చేయవచ్చని అధికారులు తెలిపారు. క్రస్ట్గేట్ల వినియోగ కాలం ముగిసినందున వాటిని మార్చాలనే నిపుణుల ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకుని గమనిస్తే గేట్ల జీవితకాలం ముగిసినా వాటిని అదనంగా 25 ఏళ్ల పాటు ఉపయోగించారు. అసలు హామీ ఇచ్చిన 45 సంవత్సరాల వ్యవధి కంటే ఎక్కువగా ఉపయోగించిన దృష్ట్యా 15 నెలల్లో దశల వారీగా అన్ని గేట్లను మార్చడానికి రూ.80 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచినట్లు అధికారులు తెలిపారు. 16.38 లక్షల ఎకరాల్లో సాగు కర్ణాటకలో దాదాపు 9.26 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 6.25 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాలు కలిపి మొత్తం సుమారుగా 16.38 లక్షల ఎకరాలు తుంగభద్ర ఆయకట్టు కాలువల కింద సాగులో ఉన్నాయి. అన్ని పట్టణ ప్రాంతాలకు తాగునీటి వనరులను కూడా అందిస్తున్నాయి. ఇంతలో కృష్ణా నదీ పరివాహకంలో ఆకస్మిక వర్షాల కారణంగా భారీ ఇన్ఫ్లో వచ్చింది. తుంగభద్ర ఆనకట్టలో బుధవారం నీటినిల్వ 20.447 టీఎంసీలు నమోదైంది. గత సంవత్సరం ఈ సమయానికి కేవలం 3.462 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉండేది. గత సంవత్సరం ఇదే రోజు ఇన్ఫ్లో 659 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, ఇప్పుడు 8,222 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రూపంలో వస్తోంది. హైలెవల్ మెయిన్, లోలెవల్ కాలువల రైతు సంఘాలు టీబీ బోర్డు నుంచి నీటి విడుదలపై స్పష్టత కోరాయి. సూచించిన నిల్వ పరిమితి నిండే వరకు వేచి ఉండటానికి బదులుగా, ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టకు లభించే నీటి వివరాలను బోర్డు విడుదల చేయాలని పేర్కొన్నాయి. టీబీ బోర్డు నిరంతరం నీటిని విడుదల చేస్తే నీటి వనరులను అంచనా వేయడం వల్ల రెండు సీజన్లలో వరి పంటలు పండించడానికి తమకు సహాయపడుతుందని ఆయకట్టు రైతులు తెలిపారు. ఆందోళనలో డ్యాం ఆయకట్టు రైతులు స్పందించని ప్రభుత్వాలు, అధికారులు -
సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు
రాయచూరు రూరల్ : నగరంలో సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కంచు గడ్డ మారెమ్మ ఆలయంలో పుష్పాలంకరణ చేశారు. భక్తులు దేవి ఆలయంలో విశేష పూజలు నెరవేర్చారు. భక్తులు తెల్లవారు జామున అమ్మవారికి ఊయల సేవను చేపట్టారు. లోకాయుక్త వలలో సర్వేయర్ రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా సురపురలో ఓ సర్వేయర్ లోకాయుక్త వలలో చిక్కారు. ఫారం నంబర్– 10 ఇవ్వడానికి సర్వేయర్ మల్లికార్జున లంచం డిమాండ్ చేయడంతో న్యాయవాది సోమనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు దాడి చేశారు. సురపుర తాలూకా సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున భూమిని కొలత చేయడానికి రూ.20 వేలను లంచం అడిగారు. రూ.19 వేలను ఫోన్ పే ద్వారా లంచంగా తీసుకున్నారు. దీని ఆధారంగా పోలీస్ కస్టడీలో ఉంచామని డీఎస్పీ ఇనాందార్ వెల్లడించారు. కృష్ణరాజ ఒడెయర్కు పుష్పాంజలి రాయచూరు రూరల్: నగరంలో మైసూరు రాజవంశస్థుడు కృష్ణరాజ ఒడెయర్ 141వ జయంతిని ఆచరించారు. కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు వెంకటేష్, రావుత్ రావ్లు పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. కన్నడ భాషకు కృష్ణరాజ ఒడెయర్ చేసిన సేవలను కొనియాడారు. సమావేశంలో విద్యాసాగర్, శ్రీనివాస్ రాయచూరకర్, దండెప్ప, బాబు భండారిగళ్, వీర హనుమాన్, పాటిల్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి నివారించండి రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, పర్యావరణ సంరక్షణకు అధికారులు నడుం బిగించాలని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పీడీఓ, గ్రామ అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన నరేగ పనులపై పంచాయతీ అభివృద్ధి అధికారులతో చర్చించారు. గ్రామాల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్నును వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు శరణబసవ, చంద్రశేఖర్లున్నారు. కాంగ్రెస్ ఆఫీసులుగా పోలీస్ స్టేషన్లు రాయచూరు రూరల్: రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలబుర్గిలో విధాన పరిషత్ సభ్యులు హరీష్ పూంజా, నారాయణ స్వామి, రవి కుమార్లపై అక్రమంగా కేసులు నమోదు చేయించారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించి పోయాయన్నారు. రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలుబొమ్మగా చేశారన్నారు. పాకిస్తాన్ జిందాబాద్, నాసిర్ సాబ్ జిందాబాద్ అన్న వారిని సమర్థించడాన్ని తప్పుబట్టారు. కలబుర్గిలో ప్రియాంక్ ఖర్గే, దక్షిణ కన్నడలో యూటీ ఖాదర్, హుబ్లీ ధార్వాడలో సంతోష్లాడ్, బెళగావిలో లక్ష్మీ హెబ్బాళ్కర్, శివమొగ్గలో మధు బంగారప్ప రిపబ్లిక్ ఆఫ్ జిల్లాగా నడుపుతున్నారని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో శంకర్రెడ్డి, మల్లికార్జున, రాము, రవీంద్ర జాలదార్ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతో పర్యావరణ రక్షణ
హొసపేటె: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మనోహర్ లాల్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటి నీరు పోసిన అనంతరం ఆయన మాట్లాడారు. జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్నారు. అందుకే స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా సీనియర్ ఉపాధ్యాయులు ప్రకాష్, ఉపాధ్యాయురాలు సునీత, రమీజా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
వృక్ష సంపదను పరిరక్షించాలి
బళ్లారిఅర్బన్: నగరంలో పచ్చదనం పెంపొందించే దిశగా వృక్ష సంపదను పరిరక్షించాలని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీవీ సంఘం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పర్యావరణ సంరక్షణతో పాటు పరిసరాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు కృషి చేయాలన్నారు. నగరంలో ప్రతి ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెట్లను పరిరక్షించుకొనే అలవాటు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. విద్యార్థులు పాఠాలతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉంటే అలాంటి వారి వ్యక్తిత్వం చక్కగా రూపుదిద్దుకుంటుందన్నారు. కళాశాల పాత విద్యార్థులు సంఘం సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షనీయం అన్నారు. పాత విద్యార్థులు నారా శరత్రెడ్డి, రత్నరెడ్డి, ఇర్ఫాన్, టిల్లు తదితరుల కృషిని ఆయన అభినందించారు. విద్యార్థులకు పాఠాల బోధనతో పాటు వారి ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రేరణ ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు. పాలికె ఈఈ మల్లనగౌడ మాట్లాడుతూ సామాజిక స్పృహతో నగరంలో నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాత విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మియాఓకి ఫారెస్ట్ తరహాలో ఓ ఎకరా స్థలంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ అధికారి శరణ్కుమార్, కార్పొరేటర్ నూర్ మహమ్మద్, కణేకల్ మహంతేష్, కళాశాల పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె బసవరాజ్, చానాళ్ శేఖర్, యాళ్పి పంపనగౌడ, చోరనూరు కొట్రప్ప, బీఆర్ఎల్ శీన, పల్లెద ప్రభులింగ, కోరి విరుపాక్షప్ప తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా జైన్ ఆలయ శతాబ్ది ఉత్సవాలు
బళ్లారి అర్బన్: నగరంలో పార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ మందిర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ ఉత్సవ కమిటీ పార్శ్వనాథ్ పరమాత్మ శోభయాత్రను నిర్వహించారు. ఈ ఊరేగింపులో డోలు, తాషారండోల్ వంటి వివిధ కళా బృందాలతో తేరు వీధిలోని శ్వేతాంబర్ జైన్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు తేరు వీధి, మోతీ సర్కిల్, కాళమ్మ వీధి సర్కిల్, బెంగళూరు రోడ్డు, బ్రూస్పేట్ సర్కిల్ మీదుగా మళ్లీ ఆలయానికి చేరుకుంది. విమలాసాగర్ సూరేశ్వర్ జీ మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం ఆలయంలో ప్రవచనం, భక్తులకు ఆశీస్సులు అందించారు. భక్తులకు మహామంగళ హారతి, ప్రసాదం పంపిణీ నిర్వహించారు. సాయంత్రం పాలక సేవా మతపరమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపులో పార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ సంఘం అధ్యక్షులు ఉత్సవ్లాల్ బాగ్రేచా, ఉపాధ్యక్షులు సూరజ్మల్ దంతెవాడి, ప్రధాన కార్యదర్శి రోషన్ జైన్, సహ కార్యదర్శి అనిల్ బాగ్రేచా, జాయింట్ కార్యదర్శి భరత్, ట్రెజరీ గౌతమ్ బుజ్వాన్, వినోద్ బాగ్రేచా, మహావీర్, హర్ష జైన్, అజయ్ సోని, దేవస్థాన పదాధికారులు, జైన్ ప్రముఖులు, సమాజ బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఆకట్టుకున్న శోభాయాత్ర ఊరేగింపు -
ఘటనాస్థలిలో సౌకర్యాలు కరువు
బనశంకరి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో బెంగళూరు చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన ఘోర విషాదంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసింది. పదుల సంఖ్యలో ప్రజలు, బాధితుల బంధువులు హైకోర్టుకు ఈమెయిల్స్ రూపంలో ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వాడీవేడిగా విచారణ సాగింది. హైకోర్టు జడ్జిలు వీ.కామేశ్వరరావ్, సీఎం.జోషి విచారణ సాగించారు. అడ్వొకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి హాజరై సర్కారు అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం సుమారు 1600 మంది పోలీసులను భద్రతకు నియమించింది. స్టేడియం వద్ద అంబులెన్సులు, తాగునీటి వాహనం వంటి సదుపాయాలను కల్పించిందన్నారు. జడ్జిలు స్పందిస్తూ అంబులెన్స్ ఘటనా స్థలంలో ఉందా అని ప్రశ్నించగా, అంబులెన్స్లు ఉన్నాయని, కానీ అవి సరిపోలేదని ఏజీ తెలిపారు. పిటిషన్దారుల న్యాయవాది అరుణ్శామ్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఘటన సంభవించింది. నిజాలను దాచిపెడుతున్నారని చెప్పారు. ఆర్సీబీ ఆటగాళ్లకు విధానసౌధ ముందు సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది ఎవరు అనేది స్పష్టం చేయాలి. వారు దేశం, రాష్ట్రం కోసం క్రికెట్ ఆడలేదని, కానీ వారిని సన్మానించే ఉద్దేశం ఏమిటి, ఏ కారణంతో రెండు కార్యక్రమాలు ఒకేసారి ఏర్పాటుచేశారు. ప్రజలను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు. రక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటనేది తెలపాలని కోర్టుకు మనవి చేశారు. అంబులెన్స్లను ఏ ప్రదేశంలో ఉంచారు అనేది కోర్టుకు వివరించాలని కోరారు. ఏ విషయం దాచలేదని, అందరికీ నోటీస్ జారీ చేశారని, ఎవరినీ వదిలిపెట్టేదిలేదని ఏజీ తెలిపారు. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. నిజాలను దాచిపెడుతున్నారు హైకోర్టులో వాదనలు కోర్టుకు పలువురు ఫిర్యాదులు -
పెళ్లి చేసి పంపాలనుకున్నాం..
కోలారు: బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మరణించిన కోలారు యువ ఇంజినీరు సహన (23)కు గురువారం కోలారులో కన్నీటి వీడ్కోలు పలికారు. కోలారు నగరంలోని ఉపాధ్యాయ దంపతుల కుమార్తె అయిన సహన ఇంజినీరింగ్ పూర్తి చేసి బెంగుళూరులోని బాష్ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. కోలారులోని ఎస్జి కాలనీలో కుటుంబం నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా సహన పెద్ద కూతురు. కంపెనీ సహోద్యోగులతో కలిసి విక్టరీ పరేడ్ను చూడాలని స్టేడియం వద్దకు వెళ్లింది. తొక్కిసలాటలో కిందపడిన సహనపై వందల సంఖ్యలో జనం తొక్కుకుంటూ వెళ్లడంతో మృత్యువు పాలైంది. వెంటనే సహన తల్లిదండ్రులు హుటాహటిన బెంగుళూరుకు వెళ్లారు. పోస్టుమార్టం ముగిశాక కూతురు మృతదేహాన్ని కోలారుకు తీసుకువచ్చారు.త్వరలో పెళ్లి చేయాలనుకున్నాం – తండ్రిపెళ్లీడుకు వచ్చిన కుమార్తెను కోల్పోయిన కన్నవారు విచార సాగరంలో మునిగిపోయారు. కుమార్తె పార్థివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. కుమార్తెకు ఈ ఏడాదే పెళ్లి సంబంధాలు చూసి వివాహం చేయాలని అనుకున్నామని తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిందని తండ్రి సురేష్బాబు విలపించారు. మెట్టినింటికి సాగనంపడానికి బదులు పాడె కట్టి పంపాల్సి వచ్చిందని బంధువులు రోదించారు. -
హైకోర్టు విచారణ జరపాలి
శివాజీనగర: ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.50 లక్షలు చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె డిమాండ్ చేశారు. గురువారం ఆమె స్పందిస్తూ ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా సుమోటోగా కేసు నమోదు చేసి రాష్ట్ర హైకోర్టుచే విచారణ చేయించాలని మనవిచేశారు. గాయపడినవారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. బౌరింగ్, విక్టోరియా ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులకు నిపుణులచే శస్త్రచికిత్సలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించారు. -
పెళ్లి వ్యాన్ కాలువలోకి పల్టీ
హుబ్లీ: ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా దేవికొప్ప సమీపంలోని గణిగినగట్టి క్రాస్ వద్ద పెళ్లి జనంతో వెళ్తున్న వ్యాన్ రోడ్డుపక్కన కాలువలోకి దూసుకు పోయింది, ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. కుందగోళ తాలూకా ఎళివాళ గ్రామవాసి దేవక్క (67), సాత్విక్ (6), కస్తూరవ్వ (55) హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో మరణించారు. లక్ష్మవ్వ, శకుంతల, తీవ్రంగా గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. దేవికొప్ప గ్రామంలో బీరప్ప, రోహిణి అనే జంట పెళ్లికి వెళ్లిన వీరు తిరిగి వస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోగా, 12 మంది గాయపడినట్లు కలఘటిగి సీఐ శ్రీశైల కౌజలిగి తెలిపారు.లగ్జరీ బస్సులో గొలుసు చోరీమైసూరు: కేఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హ్యాండ్బ్యాగ్లోని సుమారు రూ.2 లక్షల విలువైన 25 గ్రాముల బంగారు గొలుసును దొంగలు చోరీ చేశారు. జిల్లాలోని టీ.నరసిపుర నివాసి తనూజ, దావణగెరెలో బంధువుల ఇంట్లో వేడుక కోసం కుటుంబంతో సహా వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని దావణగెరె కేఎస్ఆర్టీసీ ఐరావత బస్సులో మైసూరుకు బయల్దేరింది. బంగారు గొలుసును బాక్సులో పెట్టి వ్యానిటీ బ్యాగ్లో భద్రపరిచింది. మైసూరులో దిగాక చూసుకుంటే గొలుసు కనిపించలేదు. నజరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బస్సులోనే దొంగలు కొట్టేసి ఉంటారని వాపోయింది. -
ఒక్క అంబులెన్స్ లేదు, వైద్యం లేదు
యశవంతపుర: రాజకీయ సమావేశాలకు కల్పించే ప్రాధాన్యం, బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవానికి ఎందుకు కల్పించలేదని తొక్కిసలాటలో చనిపోయిన బాలిక దివ్యాంశి తండ్రి శివకుమార్ ప్రశ్నించారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ఇంత గొప్ప సంభ్రమానికి ఎందుకు సరైన సౌకర్యాలను కల్పించలేదని కన్నీటితో ప్రశ్నించారు. అమ్మ, పిన్నమ్మ జతలో చిన్నస్వామి స్టేడియం గేటు నంబర్ 15లో చేరుకున్న దివ్యాంశి (14) తొక్కిసలాటలో చిక్కుకుంది. జనం బాలికను బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు చికిత్సలు చేయడానికి ముందుకు రాలేదని తండ్రి విలపించారు. నా భార్యకు సీపీఆర్ చేశారు, ఒక్క అంబులెన్స్ లేదు. పోలీసులు సాయం చేయలేదు. నాలుగు గంటల పాటు స్టేషన్లో కూర్చున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంత పరిస్థితిలో ఎవరు కాచుకుని కూర్చుంటారు? సరైన వ్యవస్థలు లేని కారణంగా ఈ ఘోరం జరిగిందని శివకుమార్ ఆరోపించారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
అస్తవ్యస్తం.. విషాదాంతం
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వం, అధికారుల్లో కొరవడిన సమన్వయం, ప్రచార యావ, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కారణమే బుధవారం చిన్న స్వామి క్రీడా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గెలుపొందింది. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతటితో ఆగితే సరిపోయేది. అర్ధరాత్రి రాయల్ చాలెంజర్స్ ప్రకటన చిత్రాన్ని మార్చేసింది. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ఉంటుందనడంతో యువతలో ఉత్సాహం మిన్నంటింది. ఈ విజయ యాత్రను ప్రభుత్వం నిరాకరించకుండా, అలా అని మద్దతు ప్రకటించకుండా మధ్యాహ్నం వరకు మీనమేషాలు లెక్కించింది. చివరికి తాము కూడా పాల్గొనాలని ప్రభుత్వ పెద్దలు తీర్మానించడం మలుపు తిప్పింది. గందరగోళం షురూ బుధవారం ఉదయం 11 గంటలకు విధానసౌధ ఎదుటకు అభిమానులు గుమిగూడడం ప్రారంభం అయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు విధానసౌధ ఎదుట రోడ్లపైనే అనధికారికంగా బైక్లు పార్కింగ్చేసి మరింత ట్రాఫిక్ అస్తవ్యస్తం చేశారు. విధానసౌధ ఎదుట సరైన పోలీసు బందోబస్తు చేసేందుకు కూడా ఇబ్బందులు పడింది. ఆర్సీబీ ఆటగాళ్లతో కనిపిస్తూ ప్రచారంలో ముందుండాలని ప్రభుత్వ నేతలు, అధికారులు పోటీ పడ్డారు. విధానసౌధ ముందుకు కూడా రెండు లక్షలకు పైగా అభిమానులు గుమిగూడారు. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్టేడియం వద్ద ఘోరం చిన్న స్వామి స్టేడియం వద్ద పరిస్థితి మరీ దారుణంగా మారింది. స్టేడియం చుట్టూ లక్షలాది మంది చేరుకున్నారు. భారీ ఎత్తున చేరుకున్న అభిమానులను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం అయింది. ఇలాటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని రద్దు చేయడమో లేదా అభిమానులకు దిశానిర్ధేశం చేసి అక్కడి నుంచి తరలించడమో చేయాలి.. ఆ పనిలో కూడా ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం స్పష్టమైంది. చివరికి అభిమానులను నియంత్రించేందుకు లాఠీచార్జీలు జరిగాయి. స్టేడియం బయట లక్షలాది తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట వెనుక వైఫల్యాలెన్నో ఆకస్మికంగా ఆర్సీబీ విక్టరీ పరేడ్ భద్రతా ఏర్పాట్లలో అలసత్వం అంచనాలకు మించి లక్షలాది మంది రాక బెంగళూరులో న్యూ ఇయర్ సంబరాలను మించిన ఈవెంట్ జరుగుతోంది, మరి ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఆ స్థాయిలో లేకపోవడమే ఘోర విషాదానికి దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఆక్రందన అందరినీ కంట తడి పెట్టిస్తోంది. సిద్దరామయ్య సర్కారుపై ఆరోపణల జడివాన ముసురుకుంది. కప్ వచ్చిందన్న ఆనందం ఏ కోశాన లేదు. ఏర్పాట్లకు సమయం ఎక్కడుంది? ఉన్నపళంగా భద్రత కల్పించేందుకు సర్కారు, పోలీసుశాఖకు సమయం లేకపోయింది. మంగళవారం అర్ధరాత్రి మ్యాచ్ ముగిసితే మరుసటి రోజే విజయోత్సవం ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు కూడా. బుధవారం మధ్యాహ్నం నాటికి సీఎం సిద్ధరామయ్యతో హోం మంత్రి పరమేశ్వర్, డీకే శివకుమార్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకునే పాటికి ఉన్న కొద్ది పాటి సమయం పూర్తయింది. ఈ సమావేశం తరువాత ప్రభుత్వ ఆధ్వర్యంలో విధానసౌధ మెట్లపై అభినందన కార్యక్రమం కూడా చేపట్టాలని తీర్మానించారు. దీంతో హడావుడిగా మెట్లపై వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు చేసేందుకు సమయం సరిపోలేదు. అలాగే అభిమానులకు కార్యక్రమం ఎక్కడ, ఎలా రావాలి? ఎన్ని గంటలకు అనే సమాచారం అందించేవారు లేరు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు రాలేదు. అభిమానులు భారీ ఎత్తున విధానసౌధ వద్దకు చేరుకున్నారు. అంత రద్దీని చూసిన తర్వాత వెంటనే ప్రమాదాన్ని గుర్తించి విజయయాత్ర ర్యాలీని రద్దు చేశారు. ఐపీఎల్ పూర్తిగా ఒక ప్రైవేటు కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున హడావుడిగా చేయాల్సిన అవసరం ఉందని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి. -
ఊపిరాడక.. శ్వాస ఆగింది
శివాజీనగర: తొక్కిసలాట దుర్ఘటనలో అనేకమంది శ్వాస అందక మృతిచెందినట్లు పోస్టుమార్టంలో ప్రాథమికంగా తెలిసింది. మృతదేహాలకు ఆస్పత్రుల్లో మరణోత్తర పరీక్షలు జరిపి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడమైనది. బయటకు వెళ్లినవారు శవాలుగా చేతికి అందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరుమని రోదించారు. తమవారిని ప్రాణాలతో తెచ్చివాలని శోకించారు. జనం ఒకరిమీద ఒకరు పడడంతో చాలామందికి ఊపిరి ఆడలేదు, దీనివల్లే చనిపోయారు అని వైద్యనిపుణులు నివేదికల్లో పేర్కొన్నారు. మృతుల్లో కొందరికి ఎముకలు విరిగిపోయాయి, అంతకుమించి ప్రత్యేక కారణాలు కనిపించలేదు. బౌరింగ్ ఆసుపత్రిలో 6 శవాలు, విక్టోరియా ఆసుపత్రిలో 5 మృతదేహాలకు పోస్టుమార్టం జరిపారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తూ మృతదేహాలను ఇళ్లకు తీసుకొని వెళ్లిన దృశ్యాలు అందరి మనస్సును కలసివేశాయి. తొక్కిసలాటలో గాయపడినవారు 56 మంది నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఎంతో జీవితం.. కడతేరిందిచిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాటలో మృతుల వివరాలు వెలువడ్డాయి. 11 మంది మరణించడం తెలిసిందే. వీరిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలవాసులు ఉన్నారు. అయితే బెంగళూరులోనే ఉంటూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేసేవారు. చిన్న వయసులోనే మృత్యువు పాలయ్యారు.కబ్బన్పార్క్ ఠాణాలో కేసుమృతుల తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 194 క్రింద కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేశారు. -
విజయోత్సవం.. హృదయ విదారకం
బెంగళూరు చిన్నస్వామి మైదానం వద్ద తొక్కిసలాట బనశంకరి: ఐపీఎల్ కప్ సొంతం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సిలికాన్ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా, కళ్లారా చూడాలని వేలాది మంది జనసాగరంలా తరలివచ్చారు. గేట్ –12 వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జీ చేయడం, జనం నలుదిక్కులా పరుగులు తీశారు, బ్యారికేడ్లను తోసివేసి గేట్లు విరగ్గొట్టి స్టేడియంలోకి చొరబడ్డారు. ఈ గందరగోళంలో తొక్కిసలాట సంభవించింది. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్లడంతో పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అరుపులు, కేకలు, ఏడుపులు మిన్నంటాయి. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. అనేకమంది స్పహ తప్పి పడిపోయారు. దీంతో జనమే బాధితులను చేతుల మీద, భుజాల మీద ఎత్తుకుని అంబులెన్సుల కోసం పరుగులు తీశారు. ఏదో యుద్ధ ప్రాంతంలోని ఘోర కలిలా మారిపోయింది. అచేతనంగా పడిపోయిన కొందరికి సీపీఆర్ కూడా చేయసాగారు. బాధితులను సమీప బౌరింగ్, వైదేహి, మాల్య ఆస్పత్రులకు తీసుకెళ్లారు. బాలిక, యువతీ యువకులు కలిసి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామందికి కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్న చిన్న గాయాలైన కొందరు చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారు. తమవారికి ఏమైందో తెలియక అనేకమంది బంధుమిత్రులు రోదిస్తూ పరుగులు తీశారు. శివమొగ్గలో బైకిస్టు మృతి శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మంగళవారం రాత్రి యువకులు ఆర్సీబీ విజయోత్సవం జరుపుకొన్నారు. గోపి సర్కిల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎడాపెడా బాదడంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. కొంత మంది యువకులకు గాయాలయ్యాయి. అలాగే ఉషా నర్సింగ్ హోం సర్కిల్ సమీపంలో రెండు బైక్లు ఢీకొని ఓ బైకిస్టు దుర్మరణం చెందాడు, మరో ఇద్దరు యువకులు గాయపడి ఆస్పత్రిలో చేరారు. 14 ఏళ్లకే నూరేళ్లు 14 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక కూడా మరణించింది. 9వ తరగతి చదివే బాలిక తల్లిదండ్రులు శివకుమార్, అశ్వినితో కలిసి ఆర్సీబీ టీంని చూడాలని స్టేడియానికి వచ్చింది. తొక్కిసలాటలో చిక్కి చనిపోయింది. సీఎం పరామర్శ బౌరింగ్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హోంమంత్రి పరమేశ్వర్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వమే వైద్యఖర్చులను భరిస్తుందని తెలిపారు. కొందరు యువకులు మాట్లాడుతూ స్టేడియం వద్ద కనీస ఏర్పాట్లు లేవని, స్టేడియం లోపలికి వెళ్తామంటే గేట్లు తీయలేదని, పైగా పోలీసులు లాఠీలతో కొట్టడంతో జనం పరిగెత్తారని ఆరోపించారు. చిందులు వేస్తూ అభిమాని కన్నుమూత దొడ్డబళ్లాపురం: ఆనందం పట్టలేక డ్యాన్సు చేస్తుండగా గుండెపోటుతో ఆర్సీబీ జట్టు అభిమాని మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా మూడలగి తాలూకా అవరాది గ్రామంలో చోటుచేసుకుంది. మంజునాథ్ ఈశ్వర్ కంబార్ (28) ముందునుంచి ఆర్సీబీ అంటే అభిమానించేవాడు, ఈసారైనా విజేత కావాలని తపించేవాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీ గెలుపు తరువాత సంబరాలలో మంజునాథ్ చిందులు వేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కంబార్కు భార్య, ఆరునెలల కూతురు ఉన్నారు. 2 స్టేషన్లలో మెట్రో సర్వీసులకు బ్రేక్ బనశంకరి: ఆర్సీబీ విజయోత్సవానికి వేలాది మంది తరలిరావడం, తొక్కిసలాట విషాదం నేపథ్యంలో విధానసౌధ, కబ్బన్పార్కు మెట్రో స్టేషన్లలో రైలు సర్వీసులను బీఎంఆర్సీఎల్ నిలిపివేసింది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి ఈ రెండు స్టేషన్లలో మెట్రో రైళ్లను ఆపలేదు. టోకెన్, క్యూఆర్ టికెట్ పంపిణీ బంద్ అయ్యింది. దీంతో ప్రజలు సర్ఎం.విశ్వేశ్వరయ్య మెట్రోస్టేషన్, ఎంజీ.రోడ్డు స్టేషన్లలో దిగి వెళ్లారు. ఈ రెండు స్టేషన్లలో నిలబడలేనంత రద్దీ ఏర్పడింది. ఆర్సీబీ ఆటగాళ్లను చూడాలని జనం ఉబలాటం 11 మంది దుర్మరణం 33 మందికి పైగా గాయాలు -
నింగినంటేలా గెలుపు సంబరం
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీం బుధవారం బెంగళూరులో విజయయాత్ర నిర్వహించింది. విరాట్ కోహ్లీ సహా జట్టు సభ్యులు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాజ్ హోటల్కు వచ్చి విడిది చేశారు. జనసంద్రం మధ్య వేడుక ● విధానసౌధ మెట్లపై బృహత్ సన్మానోత్సవం జరిగింది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఆర్సీబీ జట్టు కోహ్లీ, రజత్ పాటిదార్ సహా ఆటగాళ్లను మైసూరు పేటా పెట్టి, శాలువ, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ● టీం సభ్యులు గర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ప్రదర్శించారు. వేలాదిమంది అభిమానులు కేరింతలతో హర్షధ్వానాలు చేశారు. ● సౌధ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అభిమానులే కనిపించారు. వాహనాలు, గోడలు, భవనాలు, ఎత్తైన చెట్లను ఎక్కి వీక్షించారు. ● ఎక్కువగా టీనేజర్లు, యువత వెల్లువలా వచ్చారు. ఆర్సీబీ.. ఆర్సీబీ...కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో మారుమోగింది. ● అయితే అంతలోనే వర్షం రావడంతో హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగించి ఆటగాళ్లను బస్సులోకి పంపించారు. ● మరోవైపు రాష్ట్రమంతటా అభిమానులు సంబరాలలో మునిగి తేలారు. టపాసులు మోతమోగాయి. బెంగళూరు న్యూ ఇయర్ సంబరాలను తలపించింది. కోహ్లీ సేనకు విధానసౌధ ముందు ఘన సన్మానం వెల్లువలా వచ్చిన అభిమానులు, నగరవాసులు -
విపరీతంగా జనం రావడం వల్లనే..
సాక్షి, బెంగళూరు: ఊహించని విధంగా అశేషంగా జనం రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని తొక్కిసలాటపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కావేరి నివాసంలో మీడియాతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆర్సీబీ విజయోత్సవ ంలో పాల్గొనేందుకు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు వచ్చారన్నారు. 35 వేల సీట్ల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియానికి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది అభిమానులు, ప్రజలు చేరుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. అభిమాన గణం ఒక్కసారిగా లోపలకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు, 33 మంది గాయపడినట్లు వెల్లడించారు. మరో 14 మందికి అతి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇంత మంది ఈ కార్యక్రమనికి వస్తారని అస్సలు ఊహించలేదని చెప్పారు. మృతులందరూ యువతేనని, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విచారణ జరిపిస్తాం: సీఎం ఇలాంటి దుర్ఘటన జరగాల్సినది కాదని, దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని, ఒకవేళ భద్రతా లోపం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. బెంగళూరు కలెక్టర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ తనిఖీ జరుగుతుందన్నారు. విచారణకు 15 రోజులు గడువు ఇస్తానని, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాల ధ్వజం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్లు ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. దుర్ఘటనపై సీఎం సిద్దు స్పందన -
చెరువులో కారు పల్టీ
శివమొగ్గ: కారు అదుపుతప్పి చెరువులోకి పల్టీ కొట్టగా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి తీర్థహళ్లి తాలూకాలోని మాలూరు పోలీస్స్టేషన్ పరిధిలో బాలేగార సమీపంలో జరిగింది. శివమొగ్గలోని ఆర్ఎంఎల్ నగర్కు చెందిన డ్రైవర్ తీర్థహళ్లి నుంచి కారును తీసుకొని వస్తుండగా శివమొగ్గలోని బాలేగార సమీపంలో బాలగురు చెరువు మలుపు వద్ద కేఎస్ఆర్టీసి బస్సును తప్పించే క్రమంలో అదుపు తప్పి వాహనం చెరువులో పడిపోయింది. బస్సు ప్రయాణికులు గమనించి డ్రైవర్ను రక్షించి బయటకు తీసుకొచ్చారు. -
ప్రతి మదిలో విజయానందం
బనశంకరి: ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( ఆర్సీబీ) సొంతమైంది. ఆ జట్టు ఐపీఎల్–20 విజేతగా నిలవడంతో కర్ణాటకలో విజయోత్సవాలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన ఫైనల్ పోటీల సందర్భంగా మ్యాచ్ ముగిసే వరకు అభిమానులు ఎంతో ఉత్కంఠతో గడిపారు. ఆర్సీబీ విజయం సాధించాలని అభిమానులు పలుచోట్ల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన పోటీలను కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పోటీలను వీక్షించే ఏర్పాట్లు చేయగా నగరవాసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబుకింది. నగరవాసులు ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. బాణా సంచా పేల్చి స్వీట్లు పంచారు. కేకలు వేసి కేరింతలు కొట్టారు. యువత బైక్ల్లో సంచరిస్తూ హోరెత్తించారు. విరాట్కోహ్లి అభిమానులు కోహ్లి ఫొటోలతో కూడిన టీషర్ట్స్ ధరించి సందడిచేశారు. బార్ అండ్ రెస్టారెంట్లో యువత, క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు. యువత మొత్తం రోడ్లపైకి రావడంతో బెంగళూరు నగరంలో చాలారోడ్లులో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆనేకల్, మారతహళ్లితో పాటు అనేక ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. యువకులు రోడ్లుపై సందడి చేస్తుండగా వీరిని నియంత్రించడానికి పోలీసులు నానాతంటాలు పడ్డారు. విజయోత్సవ యాత్ర ఉరేగింపులేదు.... భద్రతాదృష్ట్యా ఆర్సీబీ ఆటగాళ్లు విజయోత్సవ యాత్ర ఉరేగింపు లేదని విధానసౌధ ముందుబాగంలో ప్రభుత్వ ఆద్వర్యంలో సన్మానం, చిన్నస్వామిస్టేడియంలో సంబరాలు ఉంటాయని హోంశాఖమంత్రి డాక్టర్జీ పరమేశ్వర్ తెలిపారు. విధానసౌధ తూర్పుద్వారం గ్రాండ్స్టెప్స్పై జరిగే సన్మాన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం పరమేశ్వర్ మాట్లాడారు. భద్రతా దృష్టితో ఆర్సీబీ జట్టు ఉరేగింపు ఉండదని క్రికెటర్లు అందరూ బస్సులో విధానసౌధకు వస్తారని, అక్కడ ప్రభుత్వ సన్మానం స్వీకరించిన తరువాత బస్సులో చిన్నస్వామి స్టేడియం చేరుకుంటారని తెలిపారు. చిన్నస్వామిస్టేడియంలో పోలీసులు పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు.ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఐపీఎల్ పోటీల్లో ఆర్సీబీ జట్టు విజయంపై హోరెత్తిన సంబరాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టిన అభిమానులు జనసంద్రంగా మారిన విధానసౌధ పరిసరాలు -
లారీ ఢీకొని బస్సు బోల్తా.. ఒకరి మృతి
దొడ్డబళ్లాపురం: బస్సును లారీ ఢీకొని వృద్ధురాలు మృతిచెందగా 15మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెణచినమరడి గ్రామం వద్ద చోటుచేసుకుంది. బైలహొంగల–గోకాక్ మధ్య సంచరించే కేఎస్ఆర్టీసీ బస్సు బెణచిమరడి వద్దకు రాగానే లారీ వేగంగా ఢీకొంది. దీంతో బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. కొళవి గ్రామం నివాసి యల్లవ్వ(70) బస్సు కింద చిక్కి మృతి చెందింది. ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకొని ప్రాణాలతో బయట పడ్డారు. వీరిలో గాయపడిన 15 మందికిపైగా ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. గోకాక్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
బక్రీద్ను శాంతియుతంగా ఆచరించాలి
చింతామణి: ఈనెల 7న బక్రీద్ పండుగను ముస్లింలు అన్ని వర్గాల సహకారంతో శాంతియుతంగా ఆచరించాలని ఏఎస్పీ జగన్నాఽథ్రై సూచించారు. పట్టణంలోని పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పండుగకు మాంసం వినియోగిస్తారని, దుకాణాల వారు చెత్తను ఇష్టానుసారంగా పడేయకుండా నగరసభ వాహనంలో వేయాలన్నారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు నగరసభ అనుమతి తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం తుమకూరు: నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. బధవారం నగరంలోని పలు దుకాణాను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల్లో 450 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకొని దుకాణ యాజమానులకు రూ.31వేల జరిమానా విధించారు. దాడుల్లో మెట్రో పాలిటన్ కార్పొరేషన్ అధికారి శివప్రసాద్, శోభ, సూపర్వైజర్ శంకర్, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. పథకాలపై అవగాహన తుమకూరు: ప్రభుత్వం పథకాల ద్వారా అందే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తుమకూరు ప్రజలకు జిల్లా కలెక్టర్ శుభకళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రెండేళ్లల సాధించిన విజయాలపై జిల్లా యంత్రాంగం, జిల్లా సమాచార, ప్రజా సంబంధ శాఖ సహకారంతో నగరంలోని బస్టాండులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, సమావేశాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 10వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ప్రజలు హాజరై ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని పొందాలని పిలుపునిచ్చారు. -
పామకాటుతో బాలుడి మృతి
దొడ్డబళ్లాపురం: పాము కాటుకు బాలుడు మృతిచెందిన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా కమరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమిత్ గురులింగ(10) గతనెల 31న ఇంటి వద్ద ఉండగా పాము కాటు వేసింది. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా కాటు వేసిన పామును రెండు రోజుల తరువాత గుర్తించి బంధించి అడవిలోకి వదిలేశారు. గుండెపోటుతో ఉద్యోగి మృతి మైసూరు: కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా రెవెన్యూ శాఖ ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మరణించిన ఘటన చామరాజనగర జిల్లా యళందూరులో జరిగింది. యళందూరు పట్టణంలోని రెవెన్యూ శాఖ డీ గ్రూప్ ఉద్యోగి శ్రీనివాస నాయక(51) ఇతను కార్యాలయంలో పని చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని అంత్యక్రియలు యళందూరు పట్టణంలో జరిగాయి. 60 అడుగుల బావిలో పడిన ఆవు ● రక్షించిన అగ్నిమాపక సిబ్బంది మైసూరు: బావిలో పడిన ఓ ఆవును అగ్నిమాపక సిబ్బంది రక్షించిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా ఆర్ఎస్దొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ముద్దప్ప బడావణెలో నంజుండస్వామి అనే వ్యక్తికి చెందిన ఆవు మేతకు వెళ్లి 60 అడుగుల లోతైన బావిలో పడింది. గమనించిన యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది లోపలకు దిగి తాళ్ల సహాయంతో ఆవును వెలికితీసి కాపాడారు. అగ్నిమాపక దళ అధికారి మహేష్, సిబ్బంది ఆనంద్ కుమార్, అశోక్, బసవరాజు, మనోహర్, హర్ష, లోకేష్ పాల్గొన్నారు. సుహాస్శెట్టి హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్ యశవంతపుర: హిందూ సంఘాల కార్యకర్త సుహాస్శెట్టి హత్యోదంతంలో మరో నిందితుడు పట్టుబడ్డాడు. బజ్జె శాంతిగుడ్డెకి చెందిన అబ్దుల్ రజాక్(59) అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ రజాక్ కుమారుడు ముహమ్మద్ ముజాంమ్మిల్, కుతూరి భర్త (అల్లుడు) నౌషద్ వామంజూరుతో పాటు ఇతర నిందితులు తప్పించుకోవటానికి సహకరించిన అరోపణలతో అబ్దుల్ రజాక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో మరి కొంతమంది నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు మంగళూరు నగర పోలీసు కమీషనర్ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. ఒకే రాత్రి 1.48 లక్షల బాక్స్ల బీరు తాగేశారు యశవంతపుర: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలిచిన సంతోషంలో అభిమానులు బీరును ఏరులై పారించారు. మ్యాచ్ జరిగిన మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా రూ.30.66 కోట్ల విలువైన 1.48 లక్షల బాక్స్లు బీరు తాగారు. బుధవారం సాయంత్రం అభినందన కార్యక్రమం ఉండటంతో మంగళవారం రాత్రికంటే బుధవారం అధికంగా బీయర్ను ఖర్చే చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. బీర్ కోసం వైన్షాపుల ముందు పడిగాపులు కాశారు. ఆర్సీబీ విజయం.. ఉచితంగా ఓళిగ భోజనం మైసూరు: ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు విజేతగా నిలిచిన వేళ మైసూరులోని ఇందిరా క్యాంటీన్లలో బుధవారం ఉచితంగా ఓళిగ భోజనాన్ని వితరణ చేశారు. 18 ఏళ్ల చిరకాల వాంఛ సాకారం కావడంతో మైసూరులోని కేఆర్ బ్యాంక్ అధ్యక్షుడు బసవరాజ్ ఈ ఉచిత ఓళిగ భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారు. మైసూరు నగరంలోని అన్ని ఇందిరా క్యాంటీన్లలో మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత ఓళిగ భోజనం పంపిణీ చేశారు.బండరాతితో బాది హత్య చిక్కబళ్లాపురం: దుండగులు ఓ వ్యక్తిని బండరాతితో బాది హత్య చేశారు. ఈఘటన చిక్కబళ్లాపురం నగరంలోని బీబీ రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంకు సమీపంలో జరిగింది. నగరంలోని చామరాజపేట కాలనీవాసి శ్రీకాంత్ (29) వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. బుధవారం ఉదయం బ్యాంకు సమీపంలో శ్రీకాంత్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ కుశాల్చౌక్సి, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే బండరాయి ఉండటం, దానికి రక్తం అంటడంతో హత్యకు గురైనట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ముళ్ల పందుల మాంసం స్వాధీనం
దొడ్డబళ్లాపురం: బన్నేరుఘట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు వేటగాళ్లు ముళ్లపందులను వేటాడి మాంసం తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేశారు. 27 కేజీల ముళ్లపందుల మాంసాన్ని, వాటి రక్తం నింపిన కవర్లు, రెండు బైక్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు పరారయ్యారు. వీరిని నాగరాజు(25),నంజ(28)గా గుర్తించారు.వీరు బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో పని చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ విక్రేతల అరెస్టు దొడ్డబళ్లాపురం: బెంగళూరులో హెరాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న నలుగురు డ్రగ్ పెడ్లర్లను జిగణి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ తాలూకా బుక్కసాగర చెరువు వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేశారు. బిగ్ బాస్కెట్లో పని చేస్తూ మాస్తేనహళ్లిలో నివసిస్తున్న ఒడిశావాసి అక్షయ్(24), ఫ్లిప్ కార్ట్లో పనిచేస్తూ వీరసంద్రలో నివసిస్తున్న అసోంలోని దెమాజి జిల్లాకు చెందినబిస్వజిత్ దావో(24), అసోం రాష్ట్రం కరిమాగంజ్ జిల్లాకు చెందిన జాకీర్ హుసేన్(24), డ్రైవర్గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్న మంగళూరు జిల్లా తిరుపాళ్య నివాసి సర్వుద్దీన్(28)ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 88గ్రాముల ఏడీఎంఏ, కిలో గంజాయి, 4.06గ్రాముల హెరాయిన్, 4 సిరంజిలు, 4మొబైళ్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. మద్యం మత్తులో బైక్ను ఢీ ● భార్య కళ్లముందే భర్త మృతి కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల సరిహద్దున గల పరశురాంపురం– చెళ్లకెర ప్రదాన రహదారి పుర్లేపల్లివద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుందుర్పి మండలం ఎనుములదొడ్డి నివాసి కురుబ ఉమేష్ (42) చనిపోయాడు. మృతుడు ఉమేష్ భార్య లక్ష్మిదేవితో ఉదయం కలసి చెళ్లకెరలో జరిగిన పెళ్లికి వెళ్లి బైక్లో తిరిగి వస్తున్నారు. వడ్డెపాళ్యం గ్రామానికి చెందిన కురాకుల కాంత, శివన్న, కాంతరాజులు ఒకే బైక్లో మద్యం మత్తులో వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఉమేష్ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. నిందితులు ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఇష్టానుసారం నడుపుతూ వచ్చి ఢీకొనడంతో ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతునికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. పరశురాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీ ఉద్యోగి హత్య దొడ్డబళ్లాపురం: ప్రైవేటు కంపెనీ ఉద్యోగి హత్యకు గురైన సంఘటన చిత్రదుర్గలో జరిగింది. బాగల్కోటె జిల్లా ఇళకల్ తాలూకాకు చెందిన బసవరాజు బెంగళూరులోని జియో కంపెనీలో పని చేస్తున్నాడు. కుమార్తెను స్కూల్లో చేర్చడానికి అడ్మిషన్ కోసం మంగళవారం స్వంత ఊరు ఇళకల్కు బస్సులో వెళ్తుండగా మార్గం మధ్యలో చిత్రదుర్గ బస్టాండులో దిగాడు. సమీపంలో ఉన్న బార్లో మద్యం తాగాడు. అతని వద్ద డబ్బు ఉన్నట్లు అదే బార్లో మద్యం తాగుతున్న విజయ్, రహీం అనే ఇద్దరు వ్యక్తులు గమనించారు. బసవరాజును మభ్య పెట్టి రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్జనప్రదేశానికి తీసుకువచ్చి హత్య చేసి నగదుతో ఉడాయించారు. చిత్రదుర్గ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. కోనేరులో చేపల మృత్యువాత దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పట్టణంలోని రోజిపురలో ఉన్న పురాతన కోనేరులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కోర్టు ముందు ఉన్న పురాతన కోనేరును పరిసర సంరక్షకులు కలిసి శుభ్రం చేసి ఫెన్సింగ్ వేసి సంరక్షించారు. స్థానికులు కొన్ని రోజుల క్రితం అందులో చేపలు వదిలారు. ఇటీవల చేపలు వందలాదిగా హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. విషయం తెలుసుకున్న నగరసభ కమిషనర్ కోనేరును పరిశీలించారు. కోనేటిలో ఉన్న కలుషిత నీటిని శుభ్రం చేసి కొత్తగా నీరు వదిలి చేపలు వదులుతామని కమిషనర్ తెలిపారు. హఠాత్తుగా చేపలు ఎందుకు మృతిచెందాయో తెలుసుకునేందుకు నీటిని ల్యాబ్కు పంపించారు. -
రోడ్డుపై వెంటాడి భార్య నరికివేత
మైసూరు: పర పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగరలోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (26) అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటెకు చెందిన గిరీష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఫిర్యాదు చేసి వెళ్తుండగా దాడి దీంతో విద్యా తన భర్త గిరీష్ తనను వేధిస్తున్నాడంటూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్ పదునైన కొడవలితో దాడికి యత్నించాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది. భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై గిరీష్ తిరగబడ్డాడు. కొడవలిని అక్కడే పారేసి రైల్వేస్టేషన్కు వెళ్లే రోడ్డు వైపు పరుగెత్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్లో నగర శివార్లలోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు. ఎస్పీ డాక్టర్ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చామరాజనగర జిల్లాలో ఘోరం -
తండ్రీకుమార్తెకు గాయాలు
● బైక్ను ఢీకొన్న టిప్పర్ లారీ శివమొగ్గ: టిప్పర్ లారీ ఢీకొని తండ్రీ కుమార్తె గాయపడ్డారు. ఈ ఘటన శివమొగ్గ శివార్లలోని శివరామపుర సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. కుమార్తెను స్కూల్లో దింపడానికి బైక్లో తీసుకు వెళ్తుండగా అరనూరు నుంచి శివమొగ్గ వైపు వస్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొంది. తండ్రీ కుమార్తె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. వారు స్పృహలో లేనందున ఏ గ్రామానికి చెందిన వారనేది తెలియరాలేదు. తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
టెక్కీకి రూ.2.39 కోట్ల మస్కా
● షేర్ల పేరుతో బడా మోసం బనశంకరి: ఎంతో చదువుకున్నవారు ఇట్టే సైబర్ మోసగాళ్ల వలలో పడిపోతున్నారు. తరువాత పోలీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చిన షేర్మార్కెట్ ప్రకటనను చూసి ఐటీ ఇంజనీర్ రూ.2.39 కోట్లు పెట్టుబడి పెట్టి మునిగిపోయాడు. బెంగళూరు వైట్ఫీల్డ్ కు చెందిన 41 ఏళ్ల టెక్కీ బాధితుడు. వివరాలు.. జనవరి 21 తేదీన టెక్కీ ఫేస్బుక్ చూస్తుండగా అలిస్బ్ల్యూ అనే షేర్ల ట్రేడింగ్ ప్రకటన కనబడింది. దీనిపై క్లిక్చేయగానే సదరు వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ఇందులో పూజా శైన్ అనే యువతి, టెక్కీ కి ఫోన్చేసి షేర్మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభం లభిస్తుందని, మీకు లింక్ పంపించానని తెలిపింది. ఇందులో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేసింది. యువతి మాటలు నమ్మిన టెక్కీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ముందుగా రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా లాభం కూడా పొందాడు. ఈసారి ఎక్కువ పెట్టుబడి పెడితే ఇంకా లాభం లభిస్తుందని ఆశపెట్టారు. అలా వివిధ బ్యాంకు అకౌంట్లకు దశలవారీగా నగదు జమ చేశాడు. యాప్లో లాభం పొందినట్లు చూపించింది. విత్ డ్రాకు యత్నించగా కొన్నిరోజుల క్రితం లాభం విత్డ్రా చేయడానికి టెక్కీ ప్రయత్నించగా సాధ్యం కాలేదు. విత్ డ్రా చేయడానికి రుసుముల కింద నగదు చెల్లించాలని మోసగాళ్లు తెలిపారు. సరేనని ముందు వెనుకా ఆలోచించకుండా టెక్కీ లక్షలాది రూపాయలను వారి అకౌంట్లకు జమచేసి లాభం విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా ఫలితం లేదు. నిర్వాహకులకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. మొత్తం రూ.2.39 కోట్లు అలా మోసపోయాడు. వైట్ఫీల్డ్ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కమల్ మీద తగ్గని కన్నెర్ర
శివాజీనగర/ దొడ్డబళ్లాపురం: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమైనది. నేను ఎవరికీ బాధ కలిగించే ఉద్దేశంతో మాట్లాడలేదు. కన్నడ భాషకు ఘనమైన చరిత్ర ఉందనేది నిస్సందేహం అని కన్నడిగుల కన్నెర్రకు గురైన ప్రముఖ నటుడు కమల్హాసన్ పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కి లేఖ రాశారు. తన కొత్త సినిమా థగ్ లైఫ్ని కర్ణాటకలో ఆడనివ్వబోమని మండలి, కన్నడ సంఘాలు ఖరాఖండిగా చెప్పడంతో కమల్ లేఖ ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మనమంతా ఒకే కుటుంబం, కన్నడ భాష గౌరవాన్ని తగ్గించే ఉద్దేశం లేదు, కన్నడ సంస్కృతిని గౌరవిస్తాను అని లేఖలో తెలిపారు. ఏ భాషను కించపరచినా నేను పోరాటం చేశాను అని చెప్పారు. అయితే లేఖలో ఎక్కడా కమల్ క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. కోర్టులో గుణపాఠం దక్కింది కమల్హాసన్కు ఇకపై కర్ణాటకలోకి ప్రవేశం ఉండదని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ అన్నారు. హైకోర్టు కమల్కు తగిన రీతిలో గుణపాఠం చెప్పిందన్నారు. హైకోర్టు జడ్జి కన్నడిగుల మనసుని బాగా అర్థం చేసుకున్నారన్నారు. థగ్ లైఫ్ ఒక్కటే కాదు, ఇకపై కమల్ సినిమాలు ఏవీ కర్ణాటకలో రిలీజ్ కావన్నారు. మరోవైపు బెళగావిలో కన్నడ సంఘాలు బృహత్ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కమల్ ఫోటోని చించి నిప్పు పెట్టారు. ● కమల్ది మొండితనం: డీకే నటుడు కమల్హాసన్పై తమకు ఎలాంటి మెతక ధోరణి లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమల్హాసన్ క్షమాపణ చెబుతారని అనుకున్నాం. కమల్హాసన్ వ్యాఖ్యలపై సోమవారం సాహితీవేత్త హంప నాగరాజయ్య తదితరులతో చర్చించాను. ద్రావిడ భాషలన్నీ కూడా ఒక్కటే. తమిళు, కన్నడ, తెలుగు, మలియాళం పరస్పరం మిళితమయ్యాయి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అనేదానికి చోటు లేదు అని అన్నారు. కమల్ మొండిగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అందరూ పాటించాలి అని చెప్పారు. యడ్డి మండిపాటు చరిత్ర, భాషాశాస్త్రం పరిజ్ఞానం లేని నటుడు కమల్హాసన్, కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడటం ఖండనీయమని బీజేపీ నేత, మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప అన్నారు. కన్నడ ఏ భాష నుంచి పుట్టలేదని అనేక మంది సీనియర్ భాషా పండితులు రుజువులు చూపించారన్నారు. కొనసాగిన ఆందోళనలు కమల్హాసన్ బుజ్జగింపు లేఖ -
నాల్వడి ఒడెయర్కు భారతరత్న ఇవ్వాలి
మైసూరు: ఆధునిక మైసూరు నిర్మాణం, అభివృద్ధిలో మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజు నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ సేవలు అపారమని చామరాజ నియోజకవర్గ ఎమ్మెల్యే కే.హరీష్గౌడ అన్నారు. మంగళవారం ఒడెయర్ 141వ జయంతి సందర్భంగా విఖ్యాత అంబావిలాస ప్యాలెస్ ముందు నివాళులు అర్పించారు. మైసూరు రాష్ట్రాన్ని దేశమే తిరిగి చూసేలా అభివృద్ధి పనులు చేశారన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేసి 1916లో మైసూరు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు చోట్ల ఆస్పత్రులను తెరిచారన్నారు. ఒడెయర్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మదినం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలన్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల సీజ్ యశవంతపుర: బెంగళూరు సీసీబీ పోలీసులు గౌడాన్పై దాడి చేసి రూ.61.82 లక్షలు విలువగల నిషేధిత పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను సీజ్ చేశారు. తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని కనకపుర మొయిన్ రోడ్డులోని గోదాములో సోదాలు చేశారు. పెద్దమొత్తంలో పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.82 లక్షలుగా అంచనా వేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.70 వేల విలువగల ఈ సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్లు, విదేశీ సిగరేట్ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఆర్బీఆర్ లేఔట్ సెకండ్స్టేజీలోని అంగడిలో అమ్ముతున్నట్లు తెలిసి దాడి చేశారు. 201 ఈ–సిగరెట్లు, 297 హుక్కా ఫ్లేవర్ల బాటిళ్లు లభించాయి. అంగడి యజమాని పరారయ్యాడు. ట్రాఫిక్ ఉల్లంఘనులపై చలానాల జోరు యశవంతపుర: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనులపై బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు కార్యాచరణ చేసి 1408 కేసుల్లో రూ.7.38 లక్షల జరిమానాలను వసూలు చేశారు. సోమవారం 45 త్రిబుల్ రైడ్ కేసుల్లో రూ.22,500, 114 రాంగ్ రూట్ కేసుల్లో 58,500, 240 అక్రమ పార్కింగ్ కేసుల్లో రూ.1.36 లక్షలు, 210 నో ఎంట్రీ కేసుల్లో రూ.1.5 లక్షలు, ఇతరత్రా 795 అతిక్రమణల్లో రూ.4.16 లక్షలు జరిమానా విధించారు. పొగరాయుళ్ల మీద ప్రపంచ పోగాకు రహిత దినోత్సవాల సందర్భంగా బెంగళూరు నగర పోలీసులు మూడు రోజుల పాటు తనిఖీలు చేసి 11,507 కేసులను నమోదు చేసి రూ.21.19 లక్షలు జరిమానాలను వసూలు చేశారు. బహిరంగంగా ధూమపానం చేస్తున్నవారికి జరిమానాలు వేశారు. కాగా, నగరంలో పొగాకు వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. విద్యార్థుల డ్రగ్స్ దందా ●● ఇద్దరు కేరళవాసుల అరెస్టు బనశంకరి: గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు కేరళ విద్యార్థులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.13 లక్షల విలువచేసే గంజాయి, హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ మంగళవారం తెలిపారు. నిందితులు బీబీఏ చదువుతూ సంపిగేహళ్లిలోని అపార్టుమెంటులో నివసించేవారు. దాడి చేసి పట్టుకుని 1200 గ్రాముల గంజాయి, 220 గ్రాముల హైడ్రో గంజాయి, 2 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ను అమ్ముతున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ స్వాధీనం బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య లేఔట్లో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్చేశారు. మండ్య జిల్లా బెళ్లూరు క్రాస్లో ఓ వ్యక్తి నుంచి గంజాయి, ఎండీఎంఏ క్రిస్టల్ను తక్కువ ధరతో కొని, బెంగళూరులో అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు. వీరి వద్ద నుంచి 1.9 కేజీల గంజాయి, 13.5 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. -
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు
శ్రీనివాసపురం : తాలూకాలోని హోదలి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, సీసీ రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు తదితర సదుపాయాలు కల్పిస్తామని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ తెలిపారు. పంచాయతీ సభాంగణంలో మంగళవారం నిర్వహించిన సామాన్య సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు త్వరితగతిన రెవెన్యూ శాఖకు సంబంధించిన పింఛన్ తదితరాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీడీఓ సంపత్కుమార్, కార్యదర్శి శివశంకర్, సభ్యుడు గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆల్మట్టి ఎత్తు పెంపునకు మహారాష్ట్ర పేచీ
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంబిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకోడానికి అవకాశం ఉంది.బ బచావత్ తీర్పు మేరకు ఎత్తు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ డ్యాం ఎత్తు పెంపుదలకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గత నెల 9న లేఖ రాసి ఆనకట్ట ఎత్తు పెంచితే సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాలు వరద ముంపునకు గురి కావడం తథ్యమని, దీనిని పున పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు సభ్యుడు బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు తెలపని సర్కార్ నేడు మొండి వాదన చేస్తోంది. కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పీ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) కేసు వేసిందని మహారాష్ట్ర సర్కార్ వాదిస్తోంది. రాష్డ్రంలోని లోక్సభ సభ్యులు ఏకమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎత్తు పెంపుదలతో విజయపుర, బెళగావి, బాగల్కోటె, యాదగిరి, రాయచూరు, గదగ, కొప్పళ జిల్లాల జీవనాడి కృష్ణా నదికి నీటి విడుదలతో 5.30 లక్షల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. మరో వైపు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే 75,563 ఎకరాలు ముంపునకు గురవుతుంది. 20 చోట్ల పునర్ వసతి కేంద్రాల స్థాపనకు 64,670 ఎకరాలు, కాలువల నిర్మాణానికి 51,847 ఎకరాలు కలిపి మొత్తం 1,33,867 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తు పెంచితే 130 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం లభిస్తుంది. 2010 నుంచి పెండింగ్లో ప్రతిపాదన 524.25 మీటర్లకు డ్యాం ఎత్తు పెంచుకునేందుకు అవకాశం -
అనుచిత వ్యాఖ్యలపై ధర్నా
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేను అవహేళనకరంగా మాట్లాడిన విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామిపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవి కుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిణిని అవమానించడం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేను విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు అవమానించడం తగదన్నారు. వారిపై చర్యలు చేపట్టి పదవుల నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాసన సభ్యులు శరణేగౌడ బయ్యాపూర్, హంపయ్య నాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామి, జిల్లాధ్యక్షురాలు నిర్మల, బసవరాజ్ పాటిల్, రుద్రప్ప, అమరేగౌడ, శాంతప్ప, అస్లాం పాషా, ఈశప్ప, పామయ్య, రామన్న, జయన్నతదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులపై చర్యలకు డిమాండ్ కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు -
రోడ్డెక్కిన మామిడి రైతులు
శ్రీనివాసపురం : సీజన్ ప్రారంభంలోనే ధరలు తగ్గడంతో మామిడి రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఇందిరా సర్కిల్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ శాశ్విత నీటిపారుదల సౌలభ్యాలు లేని తాలూకాలో రైతులు బోర్ల కింద మామిడి పంట సాగు చేశారన్నారు. సీజన్లోనే ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. టన్ను మామిడి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మాత్రమే ధర పలుకుతోందని. ఈ ధరలు కూలి కార్మికులకు, ట్రాక్టర్ బాడుగలకు కూడా సరిపోవన్నారు. మామిడి పంటతో లాభాలు పొందవచ్చని భావించిన రైతుల కలలు కల్లలు అవుతున్నాయన్నారు. మామిడి రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మామిడికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు భైరెడ్డి పాల్గొన్నారు. టమాట, మామిడి రైతులను ఆదుకోండి కోలారు : టమాట, మామిడికి మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఉప విభాగాధికారి డాక్టర్ మైత్రికి వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అనుసరిస్తున్నారు. లక్షలు ఖర్చుచేసి పండించిన టమాట, మామిడికి ధరలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, మరగల్ శ్రీనివాస్, మంగసంద్ర తిమ్మణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: యాదగిరి నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపూరె పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గాంధీనగర్ తాండాలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రమైన యాదగిరిలో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా నాణ్యతగా రోడ్లను నిర్మించాలన్నారు. వర్షాలు మొదలయ్యేలోగా రోడ్ల నిర్మాణపు పనులను పూర్తి చేయాలని ఆమె సూచించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా రట్టిగేరి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సదరు అడ్డాపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,200 నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు గుడిగేరి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పరిహారం పంపిణీ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా సిరవార తాలూకా గుడదిన్నిలో ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మంగళవారం మంత్రి బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ రూ.5 లక్షల పరిహారధనం చెక్ను మృతుడు సాయణ్ణ తల్లికి అందించి సానుభూతిని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ రవి, నేతలు కరిలింగప్ప, సిద్దనగౌడ, శ్రీనాథ్లున్నారు. నకిలీ నోట్ల చెలామణి నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన సోమవారం జిల్లాలోని మాన్వి తాలూకాలో జరిగినట్లు సీఐ సోమశేఖర్ ఎస్ కెంచరెడ్డి తెలిపారు. గత నెల 13న ఇండియన్ బ్యాంక్లోని ఏటీఎం కేంద్రంలో సీకల్కు చెందిన విరుపాక్షి తమ ఖాతాలోకి 35 నకిలీ రూ.500 నోట్లను చేర్చి రూ.18 వేలను జమ చేశాడన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి సీకల్ విరుపాక్షి, శేఖర్, హుసేన్ బాషా, మాచనూరు ఖాజాహుసేన్, సిరవార సిద్దనగౌడ, అమరేష్, మాన్వి అజ్మీర్, సింధనూరు ఆలం బాషా, రాయచూరు నరసయ్య శెట్టి, కారటిగి భీమేష్లను అరెస్ట్ చేశామన్నారు. నకిలీ రికార్డుల దహనం● ముగ్గురు అధికారుల సస్పెండ్ రాయచూరు రూరల్: నకిలీ రికార్డులను తయారు చేసి వాటిని తగులబెట్టిన అధికారులను సస్పెండ్ చేసిన ఘటన యాదగిరి నగరసభలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన యాదగరి నగరసభ రెవిన్యూ అధికారి మానప్ప బడిగేర, ఇంచార్జి రెవిన్యూ అధికారి మైనుద్దీన్ మహ్మద్ హజరత్, శహాపుర నగరసభ నీటి సరఫరా సూపర్వైజర్ హన్మంతప్పలను అరెస్ట్ చేశారు. యాదగిరిలో సర్వే నంబర్–151లో 42వ ఇంటి నంబర్ మల్లమ్మ రామణ్ణ పేరు మీద ఉన్న దానిని ఈ ముగ్గురు అధికారులు జూన్ 1న నగరసభ కార్యాలయంలోకి ప్రవేశించి రికార్డులను తారుమారు చేసినట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు యాదగిరి నగరసభ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ఘనంగా కరుణానిధి జయంతి కేజీఎఫ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 101వ జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ సర్కల్ వద్ద డీఎంకే కార్యకర్తలు కరుణానిధి ఫ్లెక్సీకి పూలదండలు వేసి నివాళులర్పించారు. గౌరవాధ్యక్షుడు మునిరత్నం మాట్లాడుతూ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. చక్రపాణి, ఏసు, కణ్ణన్, రవీంద్ర, మురుగన్, శివ తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు గె లుపొందాలి
● సీఎం సిద్దరామయ్య అభిలాష హుబ్లీ: అత్యంత ఉత్కంఠ రేపిన ఐపీఎల్– 2025 క్రికెట్ పోటీల ఫైనల్లో పంజాబ్ జట్టుతో తలపడుతున్న ఆర్సీబీ జట్టు గెలవాలని సీఎం సిద్దరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. గదగ్ జిల్లా లక్కుండిలో ప్రాచీన వస్తువుల తవ్వకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈసారి ఫైనల్కు వచ్చిన ఆర్సీబీ జట్టు మంచి ఊపు మీద ఉందన్నారు. పంజాబ్ జట్టు ఆర్సీబీ కన్నా ముందు క్వాలిఫైడ్ మ్యాచ్లో 101కే ఆలౌట్ అయిందన్నారు. ఆ తర్వాత ముంబైపైన గెలిచిందన్నారు. ముంబై కూడా స్ట్రాంగ్ టీం. అందులో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి ఆర్సీబీ కప్ గెలవాలన్నదే అందరి ఆకాంక్ష అని, తాను కూడా ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్నానన్నారు. ఒక వేళ జట్టు గెలవక పోయినా గెలిచిన జట్టుకు అభినందనలు తెలుపుతానన్నారు. హెచ్ఎంపై కమీషన్ ఆరోపణలుహుబ్లీ: ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాను పని చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే షూ, సాక్స్ తదితరాల్లో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని నవలగుంద తాలూకా అణ్ణిగేరి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు బుర్హానుద్దీన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ డీడీ ఆ తాలూకా బీఈఓ, లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త మాబుసాబ్ మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, బీఈఓకు కూడా తెలియజేశానన్నారు. 2024 డిసెంబర్ 20న సదరు వస్తువుల పంపిణీకి రూ.1500 కమీషన్ను లంచంగా తీసుకున్నట్లు ఫిర్యాదు చేశానని మాబుసాబ్ ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలుహుబ్లీ: హుబ్లీ బీఆర్టీఎస్ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి రూ.42 వేలు జరిమానా వసూలు చేశారు. టికెట్ లేకుండా, అనుమతి పొందిన పాస్కు విరుద్ధంగా విద్యార్థులు తదితరులకు విధించిన జరిమానా గత నెలలో సుమారు రూ.42 వేలు వసూలు చేసినట్లు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా నగర విభాగం డీసీ ఓ ప్రకటనలో తెలిపారు. హుబ్లీ నగర పరిధిలో సిబ్బంది, అధికారుల బృందం 34 బీఆర్టీఎస్ బస్సుల్లోని పాయింట్లలో ఈ తనిఖీ కార్యాచరణ చేపట్టారు. ప్రయాణికులు టికెట్ తీసుకొని బీఆర్టీఎస్ బస్సుల్లో ప్రయాణించాలని, లేకుంటే జరిమానా విధిస్తామని సంబంధిత డివిజనల్ కంట్రోలర్ ఓ ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టండి రాయచూరు రూరల్: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందడుగు వేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ విషయంపై చర్చించారు. యువతులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. న్యూట్రిన్ పునర్ వసతి కేంద్రాల ద్వారా పిల్లల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని సీడీపీఓలను ఆదేశించారు. సమావేశంలో సీడీపీఓ వెంకటేష్ దేశాయి, మహేష్ నాయక్, శరణమ్మలున్నారు. గ్రంథాలయ భవనం ప్రారంభమెప్పుడో? హొసపేటె: కంప్లి పట్టణంలోని సోమప్పన కెరె క్యాంపస్లో దాదాపు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) గ్రంథాలయం చాలా నెలలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఇది స్థానిక విద్యార్థులు, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. విద్యార్థులు, విద్యావంతులు ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ విద్యార్థుల విద్యా హక్కులను హరించకూడదని, గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకొని గ్రంథాలయాన్ని ప్రజల ఉపయోగం కోసం తెరవాలని విద్యార్థులు, ప్రజలు ఒత్తిడి చేశారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి మాలూరు : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని హెచ్ హొసకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రాజేశ్వరి సుబ్రమణి పిలుపునిచ్చారు. బరగూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఆమె విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించి మాట్లాడారు. సర్కార్ బడుల్లో పిల్లలందరికీ ఉచితంగా యూనిఫాం, బ్యాగు, భోజనం అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రారంభిస్తుండడం విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్ వెంకటేష్, ఎస్డీఎంసీ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
జొన్నల కొనుగోలు కోసం రైతుల ఆందోళన
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు వారం రోజుల నుంచి ఆందోళనకు దిగారు. సోమవారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో ఆందోళన, బంద్ చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద డీహెచ్ పూజార్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాగా సింధనూరు బంద్కు రైతులు, న్యాయవాదులు, వ్యాపారులు మద్దతు పలకడంతో విజయవంతమైంది. సింధనూరు బంద్ విజయవంతం న్యాయవాదులు, వ్యాపారుల మద్దతు -
ఆర్టీఓ ఇన్స్పెక్టర్పై వేటుకు ఆదేశం
సాక్షి బళ్లారి: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్టీఓ) కార్యాలయంలో తనిఖీకి వెళ్లిన జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణిలతో సరైన విధంగా నడుచుకోకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలో జిల్లాధికారి, ఎస్పీ ఇద్దరూ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. స్పీడ్ కంట్రోల్కు సంబంధించి అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే టికాణా వేసుకొన్న ఆర్టీఓ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ నడుచుకొన్న తీరు, మాట్లాడిన పద్ధతి సరిగా లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాకు గుండీ కూడా పెట్టుకోక పోవడంతో ఎస్పీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు బటన్ వేసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. సినిమాలో విలన్ తరహాలో నడుచుకుంటున్న తీరును నిలదీశారు. దీంతో జిల్లాధికారి మాట్లాడుతూ తక్షణం ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్టీఓ కార్యాలయాన్ని జిల్లాధికారి, ఎస్పీ సందర్శించడానికి రావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆర్టీఓ ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులతో నడుచుకొన్న తీరు స్థానికులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తక్షణం ఆ అధికారిని సస్పెండ్ చేయాలని సూచించిన నేపథ్యంలో సదరు రవాణా శాఖాధికారులు ఆర్టీఓ సీఐని సస్పెండ్ చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. అధికారులతో ఆర్టీఓ ఇన్స్పెక్టర్ దురుసు ప్రవర్తన ఫలితం -
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
రాయచూరు రూరల్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిర్మల బెణ్ణె అధికార బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు బీజేపీ పట్ల విసుగు చెందారన్నారు. అక్రమాల పుట్ట, కమీషన్ పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. రారష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ జారీ చేసిన పంచ గ్యారెంటీలు త్వరలో జరుగనున్న నగరసభ, జెడ్పీ, టీపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సహాయకారి అవుతాయన్నారు. సమావేశంలో శాంతప్ప, నరసమ్మ, శాలం, అమరేగౌడ, శ్రీనివాసరెడ్డి, తాయన్న, శివమూర్తి, అరుణ్, రాజశేఖర్, నాగేంద్రలున్నారు. ట్రాక్టర్ టిల్లర్ కింద పడి వ్యక్తి మృతిహుబ్లీ: ధార్వాడ తాలూకా ఎత్తినగుడ్డ వద్ద పొలంలో ట్రాక్టర్ టిల్లర్(నాగలి) కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన నారాయణ ఈళిగేర మృతుడు. పరిచయం ఉన్న వ్యక్తి రుద్రగౌడ పాటిల్తో కలిసి ఈయన ట్రాక్టర్తో నాగలి దున్నించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆకస్మికంగా నాగలి కింద పడి మృతి చెందాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. అయితే పొలంలో వ్యక్తి మృతదేహం లభించగా తొలుత హత్యగా అనుమానం వ్యక్తమైంది. పోలీసులు విచారించగా నాగలి దున్నేటప్పుడు పొరపాటున నారాయణ పడి మృతి చెందినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి డ్రైవర్ రుద్రగౌడ పాటిల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు. పాల ప్రాముఖ్యతపై అవగాహన అవసరంరాయచూరు రూరల్: పాల వాడకం ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. నగరంలోని బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ క్షీర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పాలను తాగాలని, పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినాలన్నారు. తద్వారా పాల వాడకం కూడా పెరిగి ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. చెరువులోకి ట్రాక్టర్ బోల్తా.. బాలుడు దుర్మరణం రాయచూరు రూరల్: చెరువులోకి ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో అమరేష్(15) అనే బాలుడు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. ఆదివారం కరడకల్ చెరువు గట్టుపై ట్రాక్టర్ నడుపుతుండగా డ్రైవర నిర్లక్ష్యంతో ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి పడింది. డ్రైవర్ నీటిలో మునిగి ఈత కొడుతూ బయట పడ్డాడు. కానీ బాలుడు చెరువులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. పిల్లలకు కిట్ల పంపిణీరాయచూరు రూరల్: సమాజంలో ప్రామాణికతో పేద పిల్లలకు సహాయం చేయడం మానవ ధర్మమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు శరణ బసవ పేర్కొన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందింరలో కలా సంకుల సంస్థ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ కిట్లను అందించి మాట్లాడారు. విద్యారంగంలో జిల్లా వెనుక బడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో కలా సంకుల సంస్థ అధ్యక్షురాలు రేఖ, ఇన్కంటాక్స్ అధికారి శోభా యాదవ్, సురేఖ, ప్రసన్న, ఫాతిమా, దండెప్ప, శ్రీనివాస్, మంజుల, సంతోషి, మారుతిలున్నారు. -
జిందాల్లో అగ్ని ప్రమాదం
●త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సాక్షి బళ్లారి: దేశంలో పేరు గాంచిన స్టీల్ ఇండస్ట్రీ జిందాల్ పవర్ హౌస్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని తోరణగల్లు సమీపంలో వేలాది ఎకరాల్లో వెలసిన జిందాల్ స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఉన్నఫళంగా పవర్ హౌస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఎలక్ట్రానిక్ వస్తులు పూర్తిగా కాలిపోయాయి. తక్షణం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పడంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఈ ఘటనపై తోరణగల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. క్లీనర్ దుర్మరణం పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో పెద్దవడుగూరు మండల పరిధిలోని కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఐషర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో ఐషర్ వాహనం క్లీనర్ మహమ్మద్ (31) అనే వ్యక్తి మృతి చెందాడు. రాయచూరు నుంచి అనంతపురానికి సరుకులు తీసుకొని వచ్చి అన్లోడ్ చేసి తిరిగి రాయచూరుకు వెళ్తుండగా కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే నిద్రమత్తులో ఐషర్ డ్రైవర్ ఖలీల్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఐషర్ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి అని తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని మాజీ ఇంజినీర్ వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం బిల్లవ మందిరంలో యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాతో వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, సత్యవతి, బూదెప్ప, సహదేవ్, భావన, నేత్ర, విజయలక్ష్మి, ప్రభాకర్లున్నారు. డెంగీ కట్టడికి ఏకతాటిపై కదలండి రాయచూరు రూరల్: డెంగీ వ్యాధిని కట్టడి చేసేందుకు అందరూ కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు పిలుపు ఇచ్చారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డెంగీ దినోత్సవంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిం చాలన్నారు. అందరిని ఏకతాటి పైకి తెచ్చి నలుగురితో సమానంగా కలిసి జీవించాలన్నారు. ఇంటి ముందు నీరు నిలవకుండా ముందుకు ప్రవహించేలా చూడాలన్నారు. ఇంటి మందు దోమలు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. హెడ్ మాస్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారులు చంద్రశేఖరయ్య, యఽశోద, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, అరుణ, రాధిక, అనిత, అన్నపూర్ణలున్నారు. యథేచ్ఛగా సంబరాలు.. 8 మంది అరెస్ట్రాయచూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో తమ జట్టు గెలుపుపై మితిమీరిన సంబరాలు చేసుకుంటున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని మస్కి తాలూకాలో చోటు చేసుకుంది. మస్కి తాలూకా హసమకల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించిన రోజు రాత్రి 8 మంది ఆర్సీబీ అభిమానులు యథేచ్ఛగా సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చడంతో పాటు పెట్రోలు పోసిన యువకులు నడి రోడ్డుపై నిప్పంటించి అల్లరి చేసి న్యూసెన్స్ సృష్టించినందున పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు తాలూకా బళగానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో నిరవధిక ధర్నా ప్రారంభించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. -
శ్మశాన వాటికకు దారేదీ?
హొసపేటె: శ్మశాన వాటికకు వెళ్లే దారిలో తీగ కంచె ఏర్పాటుతో అంత్యక్రియలకు ఆటంకం కలిగిన ఘటన మరియమ్మనహళ్లిలో జరిగింది. శ్మశాన వాటికకు వెళ్లే దారి మూసుకొని పోవడంతో ఖననం చేయడానికి దారి లేకుండా పోయింది. దీంతో దాణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపుర హంపినకట్టె గ్రామంలో ముస్లింలు ఆందోళనలో ఉన్నారు. గ్రామంలోని ముస్లింలు ఎవరైనా మరణిస్తే అదే శ్మశాన వాటికలో ఖననం చేస్తారు. ఆ గ్రామానికి చెందిన హొన్నూరు సాబ్ అనే వ్యక్తి శనివారం మరణించగా, అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించారు. దాదాపు ఏడాది కాలంగా ఉన్న ఆ రోడ్డుపై ఒక ప్రైవేటు వ్యక్తి ఇనుప కంచె వేసి దారి లేకుండా చేశాడు. మృతదేహాన్ని మోసుకెళ్తున్న మృతుడి బంధువులు తమకు దారి తెలియక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. శ్మశాన వాటిక దగ్గర భూమిని కొన్న ఒక వ్యక్తి వందలాది ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటికకు దారిని వదలడానికి బదులుగా తీగతో కంచెను ఏర్పాటు చేశాడు. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు పక్కన ఒక ప్రైవేటు వ్యక్తి అకస్మాత్తుగా ముళ్ల కంచెను నిర్మించాడు. దీంతో మృతదేహాన్ని పొరుగున ఉన్న పొలం గుండా తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేయాల్సి వచ్చింది. ఇనుప కంచె వేయడంతో రాకపోకలకు ఆటంకం -
కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ప్రారంభిస్తాం
రాయచూరు రూరల్: కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆదివారం కలబుర్గిలో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే ఆధునికీకరణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్య ప్రజలకు అనుకూలమయ్యే విధంగా భారతీయ రైల్వే 10 వేలకు పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వందే భారత్ రైలు సంచారం ఉందన్నారు. బెంగళూరు–బెళగావి మధ్య త్వరలో వందే భారత్ రైలు సంచారానికి చర్యలు తీసుకుంటామన్నారు. డీజిల్ ఇంజిన్లను తొలగించి విద్యుత్ రైళ్లను నడపడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్లు ఆదా అవుతోందన్నారు. కమల్ హాసన్ కన్నడ భాషపై అవహేళనకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కేంద్రం పేదలకు తక్కువ ఖర్చుతో మందులు లభించేలా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశానన్నారు. హేమావతి నీటి విడుదల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య దారి మళ్లారన్నారు. హేమావతి నీటిని రామనగరకు తీసుకెళ్లే పథకంలో రైతులపై కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొండివాడిగా మారాడన్నారు. రైతులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసి హేమావతి నీటి విషయంలో రాజకీయాలు వీడి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. నూతన పైపులైన్లు అమర్చుకోవాలన్నారు. హేమావతి నీటి పథకాన్ని వదిలి పెట్టాలని కోరామన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
హుబ్లీ: కొప్పళలో సోమవారం ఓ దారుణ హత్య జరిగింది. బేకరీలో తన పని మీద ఉన్న వ్యక్తిని బయటకు లాగి వేటాడి మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లాలోని కుష్టిగి తాలూకా తావరగెరా పట్టణం నడిబొడ్డున ఉన్న ఓ బేకరీ దుకాణంలో కొనడానికి వచ్చిన ఓ వ్యక్తిని దుండగుల గుంపు మారణాయుధాలతో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ప్రమోద్, నాగరాజు, ప్రదీప్, రవి, గౌతమ్, మంజునాథ్గా గుర్తించగా, మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. మొత్తం మీద ఏడుగురు అరెస్టు అయ్యారు. మృతుడిని చెన్నప్ప నారినాళ్గా గుర్తించారు. ఆస్తుల గొడవకు సంబంధించి బేకరీలో ఉన్న చెన్నప్పను లోపలికి వెళ్లి మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగానే అతడు బేకరిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో దుండగులు ఇద్దరు అతనిని వెంటపడి మారణాయుధాలతో దాడిఆ చేసి దారుణంగా హత్య చేశారు. మరో వ్యక్తి చేతికి దొరికినా కలపదిమ్మెతో తలపై కొట్టాడు. కాగా ఈ హత్య దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద హత్య చేయడానికి వచ్చిన దుండగులు తమ పని ముగించుకొని దర్జాగా వెళ్లిపోయినట్లుగా తెలిసింది. కాగా తావరగెరె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ దారుణ హత్యతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, మంగళవారపేటె మఠాధిపతి వీరసంగమేశ్వర శివాచార్య పేర్కొన్నారు. వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2024–25లో ఉత్తమ శ్రేణిలో పాసైన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటు పడాలన్నారు. గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్,ి ససిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గొరేబాళ్, విజయ్ కుమార్లున్నారు. -
నిర్మాణంలో ఉండగానే కూలింది
● కూలీ మృతి, నలుగురికి గాయాలు మండ్య: నిర్మాణ దశలో ఉన్న మహాద్వారం కుప్పకూలిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవరహళ్ళి గ్రామంలో జరిగింది. వివరాలు.. తపసీరాయ స్వామి దేవాలయం ముందు భాగంలో మహాద్వారాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు, 35 అడుగుల పొడవునా నిర్మాణమవుతోంది. పై భాగంలో కాంక్రీట్ వేయడం కోసం కడ్డీలతో చట్రం బిగించారు. సోమవారం మధ్యాహ్నం కాంక్రీటు వేస్తుండగా బరువు తట్టుకోలేక చట్రం కుప్పకూలి కార్మికుల మీద పడింది. ఐదుమంది కార్మికులు చిక్కుకున్నారు. జేసీబీని తీసుకొని వచ్చి శిథిలాలను తొలగించి కూలీలను బయటకు తీవారు. ఆస్పత్రికి తరలిస్తున్నప్పుడు కల్బుర్గి జిల్లాకు చెందిన శరన్ (27) అనే కూలి చనిపోయాడు. మిగతావారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. నాగమంగళ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నాసిరకంగా సెంట్రింగ్ను వేయడమే కూలడానికి కారణమని అనుమానాలున్నాయి.పెళ్లిలో రూ.25 లక్షల నగల చోరీ దొడ్డబళ్లాపురం: కళ్యాణ మండపంలో వధువుకు చెందిన రూ.25 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురైన సంఘటన బెంగళూరు రాజాజినగర పరిధిలో చోటుచేసుకుంది. గవిపురం నివాసి ఎల్.శివశంకర్ ఈమేరకు మాగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్ కుమార్తె దివ్య వివాహం రాజాజినగర సప్తపది కళ్యాణ మండపంలో జరిగింది. మే 29న జరిగిన రిసెప్షన్కు అనేకమంది అతిథులు హాజరయ్యారు. పెళ్లికూతురికి చెందిన ఖరీదైన కానుకలు, రూ.25 లక్షల విలువైన నగలను సూట్కేస్, బ్యాగుల్లో భద్రపరిచి నిద్రపోయారు. మే 30న ఉదయం అందరూ లేచి గదికి తాళంవేసి ముహూర్తానికి వెళ్లారు. ఇంతలో ఎవరో దొంగలు నకిలీ తాళంచెవితో గది తాళం తీసి నగల బ్యాగులను అపహరించారు. చోరీ వల్ల పెళ్లిలో ఉత్సాహం బదులు విచారం తాండవించింది. కొట్లాడుతూ ఉంటే హిందీని రుద్దుతారు దొడ్డబళ్లాపురం: కన్నడ, తమిళం అంటూ మనం కొట్లాడుతూ సమయం వృథా చేస్తే కేంద్రం వచ్చి మనపై హిందీ భాషను రుద్దుతుందని మంత్రి కృష్ణభైరేగౌడ అన్నారు. తాజా కన్నడ, తమిళ వివాదాన్ని ప్రస్తావించారు. సోమవారంనాడు కెంపేగౌడ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని భాషలూ సమానమే అన్నారు. అయితే బలవంతంగా మనపై హిందీ రుద్దాలని చూస్తున్నారని ఇదే అసలు సమస్య అన్నారు. స్వయంప్రేరితంగా హిందీ నేర్చుకొంటే తప్పులేదని, నేర్చుకో అని ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు. ఫొటోషూట్కు రూ.25 వేల జరిమానా ● జంటకు అటవీశాఖ వడ్డన మైసూరు: ఇది ఫోటోషూట్ల కాలమైంది. పెళ్లికి ముందు, ఆ తరువాత, తల్లీ తండ్రి కాబోతుంటే మరోసారి ఇలా అనేక సందర్భాలలో ఫోటోషూట్లు ఉండాల్సిందే. కొన్నిసార్లు ఇవి వెర్రిగా మారుతుంటాయి కూడా. ఇదే మాదిరిగా మైసూరులోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర వన్యప్రాణుల అభయారణ్యంలోకి చొరబడి ఫోటోలు తీసుకున్న జంటకు అటవీశాఖ రూ. 25 వేల జరిమానా వడ్డించింది. బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో అడవిలోకి వెళ్లి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్కుమార్కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు. -
చిన్నారుల్లో నేర ప్రవృత్తి విశృంఖలం
హుబ్లీ: ఇటీవల పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. దీనిపై తల్లిదండ్రుల పాత్ర గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మద్యం తాగిన మత్తులో గాని, మత్తు పదార్థానికి బానిసలైనప్పుడు గొడవ జరగడం పర్యవసానంగా హత్యకు దారి తీయడం అక్కడక్కడ జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వాణిజ్య నగరి హుబ్లీలో చిన్న కారణంగా 13 ఏళ్ల బాలుడు తనకన్నా మూడేళ్లు పెద్దవాడైన మరో బాలుడిని చాకుతో దాడి చేసి హత్య చేసిన ఘటన సర్వత్ర ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు తెలిసో తెలియకో హత్య వరకు ఎలా వెళుతున్నారు. పిల్లల మనోగతంలో ఇంత క్రౌర్యం కలగడానికి కారణం ఏమిటి? ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? అన్న దానిపై సమాధానంగా పిల్లల పరివర్తన ఎలా ఉంటుందన్న దాని గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. ఇటీవల హుబ్లీ ధార్వాడ నేర, ట్రాఫిక్ విభాగం డీసీపీ సీఆర్ రవీష్ మాట్లాడుతూ తన 30 ఏళ్లకు పైగా వృత్తి జీవితంలో ఇలాంటి ఘటన తొలిసారిగా చూశానన్నారు. 13 ఏళ్ల బాలుడు హత్య చేయడం అత్యంత ఆవేదన కలిగించే ఘటన అన్నారు. పిల్లలను బాగా పెంచడం ప్రతి తల్లిదండ్రి ప్రథమ కర్తవ్యం అన్నారు. వేప విత్తనానికి తేనె పోస్తే విషం పోతుందా? వేప విత్తనానికి బెల్లం, పాలు, తేనె పోసినంత మాత్రాన వేపలోని విషం పోతుందా? అంటూ వేప ఎప్పటికై నా తియ్యదనం ఇస్తుందా? అని బసవణ్ణ వచనాన్ని ఉదాహరణగా వివరించారు. పిల్లల ఎదుగుదల తదితర బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో నడుచుకొనే తీరు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనికి తోడు మొబైల్, టీవీలు, సినిమాల్లో నేరాలు, ఘోరాలను వైభవీకరించడం వల్ల సుతిమెత్తని చిన్నారుల మనసుపై పరిణామం చోటు చేసుకుంటుందన్నారు. పిల్లల మనసు మొగ్గలాంటిది. తల్లిదండ్రులు వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు రోజు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అన్నదాంతో పాటు అసహజ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ వాటికి పరిష్కారం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో తల్లిదండ్రులు దుర్గుణాలను తగ్గేలా చూడాలన్నారు. నైతిక, నీతి పాఠాలను వివరించి చెప్పాలన్నారు. పబ్జీ, బ్లూగేమ్స్ వంటి ఆన్లైన్ ఆటలు చిన్నారి పువ్వులాంటి మనసుపై ముల్లులాంటి క్రౌర్యాన్ని కలిగిస్తుందన్నారు. అందుకే పిల్లలకు మొబైల్, ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారో సదా గమనించి మంచి చెడ్డలను వివరించాలన్నారు. పిల్లలపై ఇంటి వాతావరణ ప్రభావం మనోవైద్యుడు డాక్టర్ శివానంద హిరేమఠ మాట్లాడుతూ 13 ఏళ్ల బాలుడు హత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇటీవల పిల్లల్లో అమాయకత్వం తగ్గిపోతోందన్నారు. సోషల్ మీడియా, సినిమాలోని హింసను భారీగా చూపడం వంటి దృశ్యాలు చిన్నారుల మనసులను కనిష్టం చేస్తున్నాయన్నారు. తమ చుట్టు పక్కల తమ కన్నా పెద్దలు అలాంటి ప్రవృత్తిలో ఉంటే వారినే పిల్లలను అనుసరిస్తారు. ఇంట్లోని వాతావరణంలో తల్లిదండ్రుల మధ్య జగడాలు వంటి కారణాలు పిల్లలపై తీరని ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయాలపై తల్లిదండ్రులు సదా జాగృతంగా ఉండి తమ పిల్లలకు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్, థెరపీ ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఆన్లైన్ ఆటలలో హింసాత్మక ప్రవృత్తి నానాటికి పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం, తల్లిదండ్రులు వాటి నుంచి దూరంగా ఉంచే పని చేయాలి. తండ్రే ఆ కుటుంబ ఆదర్శ వ్యక్తిగా ఉత్తమ నడత కలిగి ఉండాలి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదితో కూడిన వాతావరణ కౌటుంబిక సౌహార్ధ ఉండాలి. తండ్రి తమ పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించి పిల్లలతో చక్కటి అనుబంధాన్ని పాదుగోల్పేలా తమ తీరును తల్లిదండ్రులు మార్చుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలను మంచిగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత మనో వైద్యులు, పోలీస్ అధికారుల సలహా సూచనలు -
బాను ముష్తాక్ గర్వకారణం: సీఎం
శివాజీనగర: సాహిత్యానికి సమాజాన్ని వృద్ధిచేసే శక్తి ఉందని, సాహిత్యం ద్వారా సమాజాన్ని ఐకమత్యం చేయాలే గాని విభజించరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. సోమవారం విధానసౌధలో బుకర్ పురస్కార గ్రహీత, కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ అభినందన సభ జరిపారు. ఆమెను సీఎం సన్మానించి మాట్లాడారు. బాను ముష్తాక్ కన్నడ కీర్తిని పెంచారు. ఇది కన్నడ ప్రపంచానికే గర్వకారణమని ప్రశంసించారు. బాను ముష్తాక్ను, ఆమె రచనలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తికి రూ.10 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించారు. పాత్రికేయురాలిగా, రచయితగా, న్యాయవాదిగా, ఉద్యమకారిణిగా సమాజంలో రాణించారని బాను ముష్తాక్ను కొనియాడారు. ముస్లిం సముదాయపు మహిళ మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ రాసే ప్రగతిపరమైన శ్రద్ధ ఆమెలో ఉందని అన్నారు. -
థగ్ లైఫ్ ఆడకూడదు
శివాజీనగర/ మైసూరు: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేయరాదని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. కన్నడ సంఘాల హెచ్చరిక -
బెళగావి నీళ్లు ధార్వాడకా?
● కన్నడ సంఘాల ధర్నా దొడ్డబళ్లాపురం: జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి హుబ్లీ–ధార్వాడలోని పరిశ్రమలకు నీటి విడుదలను ఆపకపోతే బెళగావి బంద్ తప్పదని కర్ణాటక రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. సోమవారంనాడు బెళగావిలోని రాణి చెన్నమ్మ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి, కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. వారంలోపు నీటి విడుదల ఆపకపోతే తామే ముందుండి నీటి విడుదల అడ్డుకుంటామని, బెళగావి జిల్లా బంద్ చేస్తామని చెప్పారు. జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి ప్రజలకు, రైతులకు నీటిని ఇవ్వాలని కోరారు. పరిశ్రమలకు ఇస్తే రైతుల పంటలు ఎండిపోతాయన్నారు. కలెక్టర్ కార్యాలయానికి తాళం వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి తరలించారు. మెడికో ఆత్మహత్య శివమొగ్గ: శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిమ్స్లో బాలిక మృతిపై విచారణ మండ్య: బాలిక సాన్వి మరణానికి మిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు రావడంతో విచారణ కోసం బృందాన్ని ఏర్పాటు చేశాం, 15 రోజుల్లోగా నివేదిక ఇస్తారని ఎమ్మెల్యే పి.రవికుమార్ చెప్పారు. సోమవారం మండ్య నగరంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇంట్లో టైల్స్ పడడం వల్ల బాలిక కాలు విరిగింది, నాలుగు రోజుల్లో ఎలా చనిపోతుందని అన్నారు. గాయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారన్నారు. మిమ్స్లోని పలు విభాగాల సర్జన్లతో కమిటీని రచించినట్లు తెలిపారు. జిల్లాధికారి కార్యాలయంలో మిమ్స్ వైద్య నిపుణులతో కలెక్టర్ చర్చించారు. బాలికను వైద్యం కోసం చేర్పించగా మరణించడం, మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేయడం తెలిసిందే. సకాలంలో వైద్యం చేయకపోవడం వల్లే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు ఆరోపించారు. అరెస్టు చేయాలని ధర్నా బనశంకరి: బెళగావి తాలూకా సంతిబస్తవాడ మసీదులో ఖురాన్, హదీస్లను కాల్చివేసిన ఘటనలో దుండగులను అరెస్టు చేయాలని ముస్లింలు సోమవారం ఆ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఘటన జరిగి 20 రోజులు గడిచినప్పటికీ దుండగులను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు కారణమౌతోందని, గ్రామంలో అశాంతి సృష్టించడానికి దుండగులు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల సంతిబస్తవాడలో మరో వర్గంవారు తమతో వ్యాపారాలను బహిష్కరించారని, మత సామరస్యం దెబ్బతీస్తున్నారని చెప్పారు. చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డంకులా?
బనశంకరి: కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రం వాటా నీటిని ఉపయోగించుకోవడానికి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచాలని ట్రైబ్యునల్లో కోరినప్పుడు మౌనంగా ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హఠాత్తుగా అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రాష్ట్ర రైతులు హితరక్షణ కాపాడటానికి రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని చేతులెత్తి మొక్కుతానని అన్నారు. గత నెల 9వ తేదీన దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారని తెలిపారు. ఆలమట్టి ఎత్తు పెంచితే మహారాష్ట్రలో సాంగ్లి, కొల్హాపుర జిల్లాలు వరద ముంపు సమస్యను ఎదుర్కొంటాయని లేఖలో రాశారన్నారు. ఫడ్నవీస్ వైఖరి తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 2010 ట్రైబ్యునల్ తీర్పు పట్ల మహారాష్ట్ర ఎప్పుడూ ప్రశ్నించలేదని, ఈ పథకాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర కూడా చెప్పిందని, కానీ ఇప్పుడు మళ్లీ డ్యాం ఎత్తు పెంచరాదని లేఖ రాసిందని డీకేశి ఆరోపించారు. ఎత్తు పెంపు అనేది ట్రైబ్యునల్లో తమకు దక్కిన హక్కు అని, దీనిపై సీఎం సిద్దరామయ్య ఒకటి రెండు రోజుల్లో తిరుగు లేఖ రాస్తారని తెలిపారు. వరద వారి సమస్య మహారాష్ట్రలో వరదలు తలెత్తితే, అది వారి సమస్య. వారే సరిదిద్దుకోవాలని కేంద్రమంత్రులను, ప్రధానిని కలిసి చెబుతామని డీకే అన్నారు. ఇందులో రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సమైక్యంగా ఉండాలన్నారు. 2013 నుంచి ఈ పథకానికి గెజిట్ నోటిఫికేషన్ కావాలని వేచి చూస్తున్నామని, ఇంకా ఎన్నిరోజులు నిరీక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సోమణ్ణ ఆల్మట్టి గురించి స్పందిస్తూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర హితమని, మాకు వేరే రాష్ట్రాలతో గొడవ ఇష్టంలేదని, మన వాటా నీరు కావాలని అన్నారు. ఆలస్యం కావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. భూస్వాధీనానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని అన్నారు. మహారాష్ట్ర సీఎం లేఖపై డిప్యూటీ సీఎం ధ్వజం -
భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హరపనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాల్లోని అనేక గ్రామాలకు చెందిన రైతుల పొలంలో వర్షంతో టమాటా పంట దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో తాలూకాలోని అనేక రైతుల పొలంలో టమాటా పంట దెబ్బతినడంతో కోయకుండా వదిలేశారు. టమాటా ధర పడిపోవడంతో కోత మరింత ఆర్థిక భారం అవుతుందని రైతులు నాగరాజు, హనుమంతప్ప పంటను పొలంలోనే వదిలేశారు. దీంతో ఏపుగా పెరిగిన టమాటా పొలంలో కుళ్లిపోతోంది. ఎకరానికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. అయితే పంట దిగుబడి వచ్చినా మార్కెట్లో ధర మాత్రం లేదు. కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.4 ల ధరకు అడుగుతున్నారు. దీని వల్ల కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను పొలంలోనే వదిలేశామని రైతు హనుమంతు విచారం వ్యక్తం చేశారు. వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందించడంపై జిల్లా యంత్రాంగం, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు దృష్టి సారించాలని కోరారు. -
వరుణ జోరుకు విరామం
బనశంకరి: రాష్ట్రంలో నైరుతి ముందస్తు వర్షాలు తగ్గుముఖం పట్టగా కరావళి, మలెనాడు ప్రదేశాల్లోనూ వానలు అదుపులోకి వచ్చాయి. గత 10 రోజులుగా కరావళి, మలెనాడు ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మంగళూరు శుక్రవారంనాడు అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరుచేరింది. అనూహ్యంగా శనివారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. ఉత్తర, దక్షిణ ఒళనాడులో వరుణుడు విరామం ఇచ్చాడు. ఇప్పటివరకు ఉత్తర కన్నడ జిల్లాలో క్యాజల్రాక్, బంట్వాళలో తలా 4 సెంటీమీటర్లు, కోటాలో 3, సె.మీ, కద్రి, మంగళూరులో తలా 2 సెంటీమీటర్లు, కుమటా, సిద్దాపుర, ఉడుపి, కారవార, కార్కళ, మూడుబిదిరె, పణంబూరు, కుందాపుర, ముల్కి, ఉప్పినంగడి, పుత్తూరు, హొన్నావరలో తలా ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. భారీ వర్షాలతో ప్రముఖ నదులు, జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. మేలో గణనీయంగా వానలు మే నెలలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. కర్ణాటక వాతావరణశాఖ సమాచారం ప్రకారం గత ఒకవారంలో 298 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మే లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.6 మిల్లీమీటర్లు కాగా, 218.7 మిల్లీమీటర్లు వర్షం కురిసింది, అలా మామూలు కంటే 197 శాతం అధిక వర్షం పడింది. రాష్ట్రమంతటా తగ్గిన వర్షాలు -
కన్నడ వైపునే నిలబడతా: శివు
యశవంతపుర: కన్నడ భాష గురించి ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ నటుడు శివరాజ్కుమార్ స్పందిస్తూ తాను కన్నడ బాషకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. కమల్ మాట్లాడిన వేదికపై నేనున్నాను, ఎలా మాట్లాడాలో కమల్ తెలుసుకొని మాట్లాడి ఉండాలి. కన్నడ భాషకు ఎలాంటి సమస్య వచ్చినా నేను కన్నడకు మద్దతుగా నిలబడతానన్నారు. కన్నడ కోసం తాను ఏమి చేశానో ప్రజలందరికీ తెలుసన్నారు. కమల్ ఇష్ట ప్రకారమే మాట్లాడి ఉండవచ్చు. క్షమాపణ చెప్పడం అనేది ఆయనకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బ్యాంకు లాకర్లో నగలు మాయం యశవంతపుర: ఇంట్లో ఉంటే దొంగలు పడి దోచుకుంటారనే భయంతో కొందరు నగలను బ్యాంక్ లాకర్లో భద్రపరుస్తారు. కానీ అక్కడ కూడా మాయమైతే ఏం చేయాలి? బంగారు ఆభరణాలు అదృశ్యమైన ఘటనలో బెంగళూరు చిక్కమారనహళ్లి డాలర్స్ కాలనీ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ భారతీశ్, డిప్యూటీ మేనేజర్ ఫిల్జిత్ జాన్, సిబ్బందిపై కేసు నమోదైంది. చిక్కమారనహళ్లికి చెందిన మహిళా ఖాతాదారు ఫిర్యాదు చేసింది. వివరాలు.. 2022లో ఆమె ఆ బ్రాంచిలో ఖాతాను తెరిచారు. లాకర్ను తీసుకొని 145 గ్రాముల బంగారం ఉంచారు. గత మార్చి 29న బ్యాంక్కు వెళ్లి పరిశీలించగా ఖాళీ లాకర్ కనిపించింది. పై నిందితులకు చెప్పగా, మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పైగా బంగారం బిల్లు ఉంటే ఆన్లైన్ ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఈ అన్యాయంపై బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రంతో పాటు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానిక డీసీపీ కి ఫిర్యాదు చేయగా, ఆ మేరకు సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికపై మూకుమ్మడి అత్యాచారం దొడ్డబళ్లాపురం: మైనర్ బాలికపై దారుణం జరిగింది. ఆరుమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెళగావి శివారులోని చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై నిందితులు రెండుసార్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 6 నెలల క్రితం బాలిక స్నేహితుడు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం చేసి వీడియో తీశాడు. తరువాత ఆ వీడియోను చూసి ఆమెను బెదిరించి ఆరుమంది యువకులు మరోసారి ఘోరానికి ఒడిగట్టారు. మళ్లీ వీడియో తీసి బెదిరిస్తుండడంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఏపీఎంసీ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. -
రియల్టర్ ఇంట్లో బడా దోపిడీ
బనశంకరి: సెక్యూరిటీకి పెట్టుకున్న నేపాలీ దంపతులు ఆ ఇంటిని ఊడ్చిపెట్టేశారు. భారీగా నగదు, రెండు కేజీల బంగారు ఆభరణాలు, పిస్టల్ను దోచుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెచ్ఏఎల్ శాస్త్రి నగరలో రియల్టర్, రాజకీయనేత రమేశ్ నివాసం ఉంటున్నారు. మూడునెలల క్రితం నేపాల్ కు చెందిన రాజ్, దీపా దంపతులు ఆయన ఇంట్లో కాపలాదారు పనిలో చేరారు. బాగా పనిచేస్తూ ఇంటి యజమానికి నమ్మకంగా ఉండేవారు. తిరుమలకు వెళ్లగానే గత నెల 27వ తేదీన రమేశ్ కుటుంబం తిరుమల తిమ్మప్ప దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశం కోసం వేచిచూస్తున్న నేపాలీ దంపతులు మరో ముగ్గురు నేపాలీలను పిలిపించుకున్నారు. సీసీ కెమెరాల సిస్టమ్ని ఆఫ్ చేశారు. రమేశ్ బెడ్రూమ్ తలుపులు బద్ధలుకొట్టి అందులో ఉన్న రూ.10 లక్షల నగదు, 2 కిలోలు బంగారు ఆభరణాలు, లైసెన్సుడ్ పిస్టల్ను మూటగట్టారు. అద్దె కారు బుక్ చేసుకున్న దుండగులు దర్జాగా ఉడాయించారు. కారు డ్రైవరుకు చోరీ విషయం తెలియదు. యజమానికి అనుమానం 28వ తేదీ వేకువజామున రమేశ్ మొబైల్ఫోన్ సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించగా కనెక్ట్ కాలేదు. కరెంట్ లేనందున సీసీ కెమెరా ఆఫ్ అయి ఉంటుందని అనుకున్నాడు. పక్కింటి వారికి ఫోన్ చేసి విచారించగా ఇంట్లో ఎవరూ లేరని తెలిపారు. అనుమానం వచ్చి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటి వద్దకు వెళ్లాలని సూచించాడు. స్నేహితులు వెళ్లి చూడగా దోపిడీ వెలుగులోకి వచ్చింది. హెచ్ఏఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నేపాలీ ముఠా తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలోనూ నేపాలీ పనివారు ఓ నగల వ్యాపారి ఇంట్లో నుంచి రూ.14 కోట్ల డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. సిటీలో నేపాలీ ముఠా ఘాతుకం రూ.10 లక్షలు, 2 కేజీల బంగారం, పిస్టల్తో ఉడాయింపు -
నేత్రపర్వం.. మహా రథోత్సవం
బళ్లారిఅర్బన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చేళ్లగుర్కిలో వెలసిన శ్రీఎర్రితాత మహా రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీ మాదిరిగా మహా రథోత్సవం ఈ ఏడాది కూడా సప్త భజనలతో ప్రారంభమై ఎర్రితాతకు వెండి ఆభరణాలు, పూలతో అలంకరణ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం మహా రథోత్సవం సందర్భంగా ఆలయంలో అగ్ని దీపాలతో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. మహా రథోత్సవంలో వివిధ సాంస్కృతిక కళా బృందాలు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పైళ్లెన కొత్త జంటలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చేళ్లగుర్కి ఎర్రితాతకు ఆభరణాల అలంకరణ వేలాదిగా పాల్గొన్న చుట్టుపక్కల భక్తులు -
జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో కలిసి చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని విన్నవించినా అధికారులు బేఖాతరు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడం, ఆ కేంద్రాలను మూసివేయడాన్ని ఖండించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ కల్పించాలి రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ వ్యవస్థ(ఓపీఎస్)ను కల్పించాలని అఖిల కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల వేదిక అధ్యక్షుడు జై కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందన్నారు. పాత పింఛన్ పద్ధతికి బదులుగా నూతన పింఛన్ పద్ధతి అమలుతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాలని కోరారు. అనుచిత వ్యాఖ్యలపై నిరసన బళ్లారిఅర్బన్: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయరాదని కన్నడ రక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం రాయల్ సర్కిల్లో వేదిక శివరామగౌడ బణ జిల్లాధ్యక్షుడు కురిహట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర స్వామి, కరవే పదాధికారులు పాల్గొని నిరసన తెలిపారు. కన్నడ భాషను అవమానించిన కమల హాసన్ తక్షణమే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలన్నారు. కరవే పదాధికారులు కట్టిగె సూరి, సుంకన్న పాల్గొన్నారు. రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని సినీ నటుడు కమల హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరవే ఆందోళన చేపట్టింది. ఆదివారం రంగమందిరం వద్ద చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. నటుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నటుడి చిత్రపటంపైకి కరవే కార్యకర్తలు గుట్కాను ఉమ్మి తమ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలి రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. కన్నడ భాషను ప్రోత్సహించాలిరాయచూరు రూరల్ : నగర, పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ భాష కార్యకర్తల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భాషలో నేటికీ తెలుగు, కన్నడలు కలిపి వ్యాఖ్యానించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తహసీల్దార్ సురేష్ వర్మ, జైలర్ అనిత, వీర హనుమాన్, మ్యాదర్, బషీరుద్దీన్ హొసమని, కృష్ణ, నిజాముద్దీన్, రామలింగప్పలున్నారు. -
4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి
బళ్లారిటౌన్: నగరంలోని బసవభవన్లో ఈ నెల 4న శ్రీగురు చిరంతప్ప స్వాముల 21వ స్మరణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమ్మరచేడు మఠం కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపేందుకు వివిధ సమితులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రేణుకాచార్య, బసవణ్ణ, స్వాముల చిత్రపటాలను శ్రీకనకదుర్గమ్మ దేవస్థానం నుంచి బసవభవన్ వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 వివిధ మఠాల స్వాములు పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం, పుస్తక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా నగరంలో వివిధ రంగాల్లో సమాజ సేవ చేసిన 11 మంది సాధకులను అవార్డులు ఇచ్చి సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 30 మందికి పైగా వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో శంభులింగ స్వామి, జంగమ హొసళ్లి స్వామి, నేతలు పంచాక్షరప్ప, జయప్రకాశ, మెట్రి మృత్యుంజయ, బీఎం స్వామి, గంగావతి వీరేష్, రాజన్న, నందీష్, దుర్గేష్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. హెచ్జీఎంలో ఎయిర్ బ్లాస్ట్తో కార్మికుడి దుర్మరణం రాయచూరు రూరల్: జిల్లాలోని హట్టి బంగారు గనుల(హెచ్జీఎం) కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ఎయిర్ బ్లాస్ట్ కావడంతో దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఽశరణ బసవ(35) అనే కార్మికుడిపైకి 28 అడుగుల్లో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో రాళ్లు ఎగిరి ఆయనపై పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలతో శరణ బసవ మరణించగా, మరొక కార్మికుడు గాయాల పాలు కావడంతో లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఉచిత కంప్యూటర్ శిక్షణకు అర్జీల ఆహ్వానం హొసపేటె: 2025–26వ సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, డిప్లొమాతో సహా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన లేదా అనుత్తీర్ణులైన పురుష, మహిళా విద్యార్థులకు మరియమ్మనహళ్లిలోని ప్రభుత్వ పరికరాల శిక్షణా కేంద్రం(జీటీటీసీ)లో రెండు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ టూల్స్ ట్రైనింగ్ సెంటర్, హొసపేటె అనే చిరునామాలో లేదా 9845416198, 8722999929 నంబరులో సంప్రదించాలని జీటీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైక్లింగ్ జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో సైకిలింగ్ జాతాకు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శ్రీకారం చుట్టారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కి పచ్చజెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నాడు పూర్వీకులు నడిచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. నేటి ఆధునిక యుగంలో నడకను విస్మరించి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతాలో బసవరాజ్, రవి, చెన్నబసవనగౌడ, విశ్వనాథ్, జయప్రకాష్, శరణే గౌడ, నాగరాజ్, సందీప్, పవన్, సకలేష్, విజయ, రాఘవేంద్ర, గురురాజ్, వెంకటేష్లున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హొసపేటె: ఎస్సీఎస్పీ, టీఎస్పీ పథకాల కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల నుంచి పర్యాటక, ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానించిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ ఎస్.తళకేరి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 2వ తేదీ నుంచి విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని కమలాపుర లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫాంను పొంది, భర్తీ చేసి ఈనెల 9వ తేదీలోగా అదే కార్యాలయంలో సమర్పించాలి. శిక్షణ పొందుతున్న అభ్యర్థి వయస్సు కనీసం 20– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ స్టీవార్డ్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మల్టీ క్యుసిన్ కుక్ శిక్షణ కాలం 5 నెలలు ఉంటుంది. అభ్యర్థి 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. రూమ్ అటెండెంట్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపురలోని లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో లేదా 08394–295640 నెంబర్లో సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపారు. -
యువతి పైకి బస్సును ఎక్కించేయత్నం
బనశంకరి: సిలికాన్సిటీలో కొందరు బీఎంటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్ల దుష్ప్రవర్తన వల్ల ఆ సంస్థకే చెడ్డపేరు వస్తోంది. బస్ను అడ్డగించిన యువతిపై బస్ ఎక్కించడానికి ప్రయత్నించిన బీఎంటీసీ బస్డ్రైవరు ఉదంతమిది. గతనెల 23 తేదీ సాయంత్రం 5.30 సమయంలో నగరంలోని ఓ కూడలిలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్ పక్కన కారులో వెళ్తున్న యువతి దిగి, బీఎంటీసీ డ్రైవరు ప్రశాంత్ని ఏదో విషయమై ప్రశ్నించింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా బస్ ముందుకు కదిలింది, సిగ్నల్లో బస్ను యువతి అడ్డుకుంది. కానీ డ్రైవరు ఆమైపె బస్ను ఎక్కించడానికి ప్రయత్నించగా యువతి తప్పించుకుంది. డ్రైవరు చర్యతో ప్రజలు హడలిపోయారు. డిపో నెంబరు 17, చంద్రాలేఔట్ డిపో కు చెందిన బీఎంటీసీ బస్ అని తెలిసింది. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలతో డ్రైవరును సస్పెండ్ చేశారు. -
పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త
హొసపేటె: గత ఐదు రోజులుగా పౌర కార్మికులు తమ వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో నగరంలో అనేక రహదార్లు చెత్తకుప్పల్లా దర్శనం ఇస్తున్నాయి. దీంతో హొసపేటె నగరం మురికివాడగా మారుతోంది. హొసపేటె నగరం నుంచి హంపీకి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు వచ్చిపోతుంటారు. అయితే పౌర కార్మికులు నిరసన కారణంగా చెత్త సేకరించడం నిలిపి వేశారు. నగర ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. దీంతో చెత్త దుర్వాసన వెదజల్లుతోంది. ప్రజలు వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. పైగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త కుప్పలను పశువులు, కుక్కలు, పందులు చెల్లాచెదురు చేస్తున్నాయి. చెత్త కుళ్లిపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నగరసభ యంత్రాంగం వెంటనే రహదార్లలో ఉన్న చెత్తను తొలగించే దిశగా దృష్టి పెట్టాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
10 నుంచి ముంగారు ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా ఈనెల 10న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను జిల్లా ఇన్చార్జి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభిస్తారన్నారు. 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల బరువుగల రాతిదూలం లాగే పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాశీ జగద్గురువులు, 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 11న లక్ష్మీదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 8 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 5న సద్భావన యాత్ర, కవిగోష్టులు, 6న రంగుల పోటీలు, 7న సేవకులకు సన్మానం, 8న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 11న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 12న హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి 25వ ఏడాది పోటీలకు ముఖ్యమంత్రుల రాక -
హావేరి జిల్లాలో అధికం
వ్యవసాయం చేయాలని అందరికీ మక్కువ. కొందరికి హాబీ అయితే చాలామంది అదే జీవనాధారమైన అన్నదాతలు. కానీ రైతుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కలిసిరాని రుతుపవనాలు, అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. విత్తనాలు, ఎరువులు, కూలీలకు విపరీతమైన ఖర్చులు. పంట పండినా దక్కని లాభం ఇలాంటివి కర్షకులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. కుటుంబం మొత్తం కష్టించినా ప్రతిఫలానికి గ్యారెంటీ లేదు.. కొప్పళ వద్ద పొలం పనులు సాక్షి, బెంగళూరు: గత ఏడాది మంచి వర్షాలు పడినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు. ప్రభుత్వ ఐదు గ్యారెంటీలు అమలవుతున్నా రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ రెండేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది 2024–2025 ఆర్థిక ఏడాదిలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు మరో మార్గం లేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 983 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లాధికారులతో సీఎం సిద్దరామయ్య గత రెండురోజులు నిర్వహించిన ప్రగతి పరిశీలన సమావేశంలో తేల్చారు. పరిహారంలోనూ కోత నిబంధనల ప్రకారం రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కానీ అధికారులు ఏదో సాకుతో తగ్గించేందుకే చూస్తారు. ఈ 983 మంది రైతుల ఆత్మహత్యల్లో 139 కేసులను ప్రభుత్వం రైతు మరణాలు కాదని తిరస్కరించింది. 828 రైతుల ఆత్మహత్యలు పరిహారానికి అర్హమైనవిగా తేల్చారు. జిల్లా స్థాయిలో మరో 16 కేసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పుల బాధనే అని తేలింది. పంట నష్టం , సాగు కోసం ఇతర కారణాల వల్ల అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కనిపించక మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు మరింత దారుణంగా మారుతున్నాయి. ఏటా సుమారు వెయ్యి మంది కన్నడనాట గడిచిన మూడేళ్లలో వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022– 23లో సుమారు 922 మంది రైతులు తనువు చాలించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో సుమారు 1,061 మంది, 2024–25లో సుమారు 983 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏటికేడాది ఈ విష వలయం విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు. ప్రతి ఏటా వెయ్యికి అటుఇటుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున ఇద్దరి నుంచి ముగ్గురు రైతులు పురుగుల మందునో, ఉరినో ఆశ్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు పథకాలు, కార్యక్రమాలు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యను నియంత్రించడం సాధ్యపడడం లేదని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర తగ్గిపోవడం, అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు ధ్వంసం కావడం వల్ల, అప్పులు పెరిగిపోవడం వల్ల రైతులు జీవితం మీద విరక్తి చెందుతున్నారు. ఆత్మహత్యల గ్రాఫ్ ఏటా ౖపైపెకి గత ఆర్థిక ఏడాదిలో 983 మంది ఆత్మహత్య ఏటేటా ఇదే విషాదం పకృతి విపత్తులు, సర్కార్ల నిర్లక్ష్యం రైతుల ఆత్మహత్యల్లో హావేరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. హావేరి జిల్లాలో సుమారు 128 మంది రైతులు బతుకు చాలించారు. ఆ తర్వాత స్థానంలో కలబురిగి – 82, సీఎం సొంత జిల్లా మైసూరు – 73 ఉన్నాయి. ధారవాడ జిల్లాలో 72 మంది, బెళగావిలో 71, హాసన్ జిల్లాలో 47, బీదర్లో 45, శివమొగ్గ జిల్లాలో 45, గదగ జిల్లాలో 44, యాదగిరి జిల్లాలో 43 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక దక్షిణ కన్నడ జిల్లాలో 5 మంది, కొడగు జిల్లాలో 5 మంది, బళ్లారిలో నలుగురు, చామరాజనగరలో నలుగురు, రామనగరలో ముగ్గురు, చిక్కబళ్లాపురలో ముగ్గురు చొప్పున అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. అలాగే కొన్ని జిల్లాల్లో ఒక్క రైతు ఆత్మహత్య కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఉడుపి, కోలారు, బెంగళూరు, బెంగళూరు గ్రామీణం జిల్లాల్లో ఒక్క రైతు బవవన్మరణం కూడా నమోదు కాలేదు. -
మొబైల్ జామర్తో ప్రజలకు పాట్లు
బళ్లారి అర్బన్: నగరంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న సెంట్రల్ జైల్లో ఇటీవల కొత్తగా మొబైల్ జామర్ను ఏర్పాటు చేయడంతో జైల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జామర్ సామర్థ్యాన్ని వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జైల్ సూపరింటెండెంట్కు ఆయన వినతిపత్రాన్ని అందించారు. జామర్ ఏర్పాటుతో సమీపంలోని వ్యాపార దుకాణాలు, ఫోన్ పే, ఆర్టీజీఎస్తో సహా డబ్బు బదిలీలు నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యాపారాలు కూడా తగ్గిపోయాయన్నారు. ప్రజలు తమ మొబైల్ సంభాషణలను చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జామర్ సామర్థ్యాన్ని తగ్గించి స్థానికుల సమస్యలకు పరిష్కారం కల్పించాలన్నారు. జైల్లో ఉన్న ఖైదీల భద్రత కోసం జామర్ ఏర్పాటు చేయడం మంచిదే అయినా జైలు నగర శివార్లలో ఉండి ఉంటే ఇలా జామర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం అన్నారు. నగర నడిబొడ్డున జైలు ఉన్నప్పటికీ జామర్ సామర్థ్యాన్ని ప్రజలకు అనుకూలం అయ్యేలా తగ్గించాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్నాయుడు, కార్పొరేటర్ గుడిగంటి హనుమంతు, కార్పొరేటర్ కే.హనుమంతు, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యం తగ్గించాలని జైలు సూపరింటెండెంట్కు వినతి -
విత్తనాలు, ఎరువుల కోసం రైతుల క్యూ
హొసపేటె: రుతుపవననాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు బాగా కురిశాయి. ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంది. అదనంగా రుతుపవనాలు ముందుగానే వస్తాయనే సూచన ఉంది. అందువల్ల వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విత్తనాలు విత్తడం ప్రారంభమైంది. జూన్ 10వ తేదీ తర్వాత చాలా చోట్ల విత్తన ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ పంటల విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతులు నగరంలోని ప్రైవేట్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఐదు తాలూకాలకు అవసరమైన వివిధ పంటల మొత్తం 11,766 క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశారు. వర్షాకాలం కోసం మొత్తం 1,08,102 మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉంది. ఇందులో మే నెలాఖరు వరకు 3,031 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, వ్యవసాయ శాఖ 40,228 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసింది. స్టాక్ అందుబాటులో ఉంది. ఈసారి వరి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, జొన్న విత్తనాలను సేకరించారు. వీటిని రైతు కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ విత్తనాల కోసం రైతులు ప్రైవేట్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. -
ఇకపై చెత్త నిర్వహణ బాధ్యత ప్రైవేట్కు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాలు పెరుగుతున్న చందంగానే సిటీ కార్పొరేషన్లో చెత్త సేకరణ, నిర్వహణ పెను సవాల్గా మారింది. జంట నగరాల్లో నిత్యం వందలాది టన్నుల చెత్త సేకరిస్తారు. దీని నిర్వహణకు పాలికె కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు చెత్తను ఆరోజే నిర్వహణ చేసేలా బాధ్యతలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ పాలికె నిర్ణయం తీసుకుంది. ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. జంట నగరాల్లో చెత్త నిర్వహణ సమర్థవంతంగా లేదు. దీంతో ఎక్కడ చూసినా పర్వతాల్లా చెత్త కుప్పలే కనిపిస్తుంటాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చెత్త గుట్టలను కరిగించడానికి సాధ్యం కాక వాటిని బయో మైనింగ్ చేస్తున్నా అటు ధార్వాడ, హొసయల్లాపుర, అలాగే హుబ్లీ కార్వార రోడ్డులో చెత్త రాశులు పేరుకు పోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశులు తరగడం లేదు. ప్రస్తుతం దీన్ని బయో మైనింగ్ ద్వారా కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొద్ది మేర సత్ఫలితాన్ని సాధించారు. రోజూ 500 టన్నుల చెత్త సేకరణ ఈ నేపథ్యంలో ప్రతి రోజు హుబ్లీలో 300 టన్నులు, ధార్వాడలో 150 టన్నులు మొత్తం కలిపి 450 నుంచి 500 టన్నుల చెత్త సేకరణ అవుతోంది. దీని నిర్వహణ పాలికెకు క్లిష్టంగా మారింది. బయో మైనింగ్ ద్వారా ఇంతకు ముందు సేకరించిన చెత్తను కరిగించినా కూడా ప్రతి రోజు 450 టన్నుల చెత్త సేకరణ అవుతూనే ఉంది. దీంతో చెత్త కరిగిన చందంగానే పెరుగుతోంది కూడా. రోజు సేకరించే చెత్తను శాసీ్త్రయంగా నిర్వహణ చేయాలని పాలికె సంకల్పించింది. ఇదే విషయాన్ని తమ సలహా, సూచనగా గ్రీనరీ ట్రిబ్యునల్ మండలి కూడా పేర్కొంది. కాగా రోజు పేరుకు పోయే 450 టన్నుల చెత్తను డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. దీన్ని ఆ రోజే యార్డ్లో చెత్త పడగానే ఉన్న చెత్త సంస్కరణ పూర్తి కావాలన్న షరతుతో ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. తడి, పొడి చెత్తను ప్రత్యేకించి డంపింగ్ యార్డ్లో వేస్తారు. ఇందులో పొడిచెత్తను సేంద్రీయ ఎరువుగా సంస్కరిస్తారు. అలాగే పొడి చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడానికి అనువుగా సంస్కరించి సేకరించి పెడతారు. ఏడాదిపాటు ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఈ మేరకు ఓ ఏడాది పాటు ఈ చెత్త నిర్వహణ యూనిట్ను ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత యూనిట్ పాలికె ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మీడియాకు తెలిపారు. హుబ్లీలో 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్, ధార్వాడలో 150 టన్నుల సామర్థ్యం గల యూనిట్లు ఉన్నాయి. ఆ రోజు చెత్త ఆ రోజే సంస్కరణ చేస్తే ఎటువంటి చెత్త సమస్య తలెత్తదు. దీంతో రోజు ఉత్పత్తి అయ్యే రెండు ప్లాంట్లలో నిర్వహణకు నిర్ణయించారు. ఆ మేరకు హుబ్లీలోని 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్ నిర్వహణను రూ.9 కోట్లకు, అలాగే ధార్వాడ చెత్తను రూ.6 కోట్ల టెండర్కు ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ విషయమై పాలికె సాధారణ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపుతాం. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. మొత్తం మీద 30–40 ఏళ్లుగా వేధిస్తున్న ఈ చెత్త నిర్వహణ పెను సమస్యకు ఇప్పటికై నా పరిష్కారం లభిస్తే అదే పది వేలు అని జంట నగరాల వాసులు అభిప్రాయపడ్డారు. ఏ రోజు చెత్త ఆరోజే సేకరణ, నిర్వహణ హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె నిర్ణయం -
శిథిలావస్థలో బీఈఓ కార్యాలయం
రాయచూరు రూరల్ : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాలలకు తోడు తాలూకా విద్యాశాఖాధికారి (బీఈఓ) కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. బీఈఓ కార్యాలయానికి 50 ఏళ్లు దాటినా భవనానికి మరమ్మతులు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. తాలూకా కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతున్నాయి. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఏ రోజునా కూడా కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా విద్యాశాఖాధికారి కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన సందర్భాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై నీరు నిలబడి కారడంతో పెచ్చులూడి కిందకు పడగా సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిక్కుబిక్కుమంటూ విధులు.. అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోవడం నగరసభ కార్యాలయం పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. అందులోకి బీఈఓ కార్యాలయాన్ని తరలించడానికి అవకాశం కల్పిం చాలని బీఈఓ ఈరణ్ణ కోస్గి జిల్లాధికారి నితీష్కు లేఖ రాసి 45 రోజులు గడుస్తున్నా నేటికీ జిల్లాధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు, సిబ్బంది వాపోయారు. త్రుటిలో సిబ్బందికి తప్పిన ప్రమాదం 50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం -
ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులకు ఉత్తేజం
బళ్లారిటౌన్: విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం వల్ల వారిని ఉత్తేజ పరిచినట్లు అవుతుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్ఎన్ రుద్రేష్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన ఎస్ఎస్ఎల్సీ, ద్వితీయ పీయూసీల్లో ప్రతిభ కనబరిచిన విలేకరుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్కు పేష్వా చేసిన సహాయంతో దేశ రాజ్యాంగాన్ని రచించేలా ఎదిగారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు కొంత ప్రోత్సాహ ధనం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేకే ట్రస్ట్ నేత జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ డబ్బును దొంగలు దోచుకుపోవచ్చు కానీ విద్యను ఎవరూ దోచుకోలేరని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, అడహక్ కమిటీ సభ్యులు కే.మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దివ్యశ్రీ, కాంచన, నాగాంబిక, అశ్విత చౌదరి, కార్తీక్, సంజన, హేమంత్కుమార్, యశ్వంత్కుమార్లకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. -
జ్వరం, దగ్గు, జలుబు.. స్కూలుకు పంపొద్దు
శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రమంతటా పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ దిగులు నెలకొంది. ఆరోగ్య శాఖ పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ సాంకేతిక కమిటీ ఆదేశాలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.ఇవీ మార్గదర్శకాలు● పాఠశాల పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తే బడికి పంపరాదు,● వెద్యులతో చికిత్స చేయించాలి. సుస్తీ నయమైన తరువాతనే పిల్లలను పాఠశాలలకు పంపించాలి.● జ్వరం, దగ్గు, జలుబు, ఇతర రోగ లక్షణాలు ఉన్న పిల్లలు పాఠశాలకు వస్తే, వారి తల్లిదండ్రులకు తక్షణమే సమాచారమిచ్చి ఆ పిల్లలను ఇంటికి పంపించాలి.● పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే వైద్యసేవలను పొందాలి.● అన్ని పాఠశాలల్లో కోవిడ్ ముందు జాగ్రత్తా చర్యలను తప్పకుండా పాటించాలి.రాజధానిలో 150కి పైగా కేసులుబెంగళూరులో కోవిడ్ కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. క్రియాశీల కేసులు 150 ని మించిపోయాయి. మహాదేవపుర, తూర్పు జోన్తో పాటుగా బెంగళూరులోని పలు ఏరియాల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. రోగ బాధితులు, వారి పక్కన ఉండేవారు కోవిడ్ నియమావళిని పాటించాలని వైద్య నిపుణులు తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికై నా సిద్ధంగా ఉండాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది తీవ్రతరమైన వైరస్ కాదు. వృద్ధులు, వివిధ జబ్బు పీడితులు తప్పకుండా మాస్క్ ధరించాలి. అందరూ మాస్క్ ధరించాలన్న నియమం లేదు అని చెప్పారు. -
క్రస్ట్గేట్ నిర్మాణ పనులపై నిరాసక్తి
హొసపేటె: తుంగభద్ర డ్యాం 32 క్రస్ట్గేట్ల భర్తీ పనులకు మళ్లీ టెండర్ పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల కంపెనీలు మళ్లీ ఈ–టెండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీటీ సర్వీస్ కంపెనీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత నిపుణులు కూడా మార్పు అవసరమని చెప్పారు. అందువల్ల తుంగభద్ర బోర్డు 32 గేట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పుడు కూడా నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. సాంకేతిక కారణాల వల్ల, మళ్లీ టెండర్ పిలిచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తులను సమర్పించాయి. గుజరాత్కు చెందిన అనార్ కంపెనీ, హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీలు తుంగభద్ర డ్యాం 32 గేట్ల పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ నుంచి రెండు కంపెనీలు.. మరో వైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వప్రా, బెకామ్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పుడు సాంకేతిక బిడ్ తెరిచి ఉంది. రాబోయే రోజుల్లో టెండర్ ఎవరు దక్కించుకున్నారో తెలుస్తుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల నిర్మాణంలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ను కోరారు. అయితే తుంగభద్ర బోర్డు మళ్లీ టెండర్లు పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. జలాశయం క్రస్ట్గేట్ల నిర్మాణంలో అనుభవం, అర్హతలు కలిగిన ఏవైనా కంపెనీలు కర్ణాటకలో ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్గేట్ 2024 ఆగస్టు 10న కొట్టుకుపోయింది. ఈ గేటుకు స్టాప్లాగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రస్ట్గేట్ నిర్మాణం కోసం గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీకి టెండర్ అప్పగించారు. ఈ కంపెనీ మెటీరియల్ను కొనుగోలు చేసి, గేట్ తయారీ పనిలో బిజీగా ఉంది. జూన్ నెలాఖరు నాటికి ఈ కంపెనీ గేట్ను ఏర్పాటు చేయాలని టెండర్లో పేర్కొన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కర్ణాటక, ఆంధ్రల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోని వైనం -
ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం
బళ్లారిటౌన్: జిల్లాలోని కురుగోడు తాలూకా కోళూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని కంప్లి ఎమ్మెల్యే జేఎన్.గణేష్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన కాలం నుంచి వచ్చిన మన ఆయుర్వేద వైద్యం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవన్నారు. ఈ మందుల వాడటం వల్ల రోగాలు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని స్థానికులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యులు కూడా రోగులతో సౌజన్యంగా నడుచుకొని సేవలు అందించాలన్నారు. కోళూరు జీపీ అధ్యక్షురాలు దొడ్డబసమ్మ, ఉపాధ్యక్షుడు చెన్నప్ప, జిల్లా ఆయుష్ అధికారి ఎన్.విరుపాక్షప్ప, వైద్యాధికారి కేపీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆక్యుప్రెషర్లో బంగారు పతకం రాయచూరు రూరల్: బెంగళూరులో జరిగిన బసవ ఆక్యు ప్రత్యామ్నాయ మందుల అకాడమీ ఆధ్వర్యంలో రాయచూరుకు చెందిన రాజా శంకర్ ఆక్యుప్రెషర్లో బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్, హెచ్.భోజరాజు, తమిళనాడు హిలర్ అధ్యక్షుడు డా.మణికణ్ణన్లున్నారు. ఎమ్మెల్సీపై చర్యలకు డిమాండ్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్పై చర్యలు తీసుకోవాలని అంజుమన్–ఏ–రాయచూరు డిమాండ్ చేసింది. శనివారం అదనపు జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సయ్యద్ అమీనుల్లా హసన్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని జనసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు జావిద్ఖాన్ పేర్కొన్నారు. శనివారం మాన్విలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉన్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యా శాఖాధికారులను డిమాండ్ చేశారు. జనౌషధి కేంద్రాల మూసివేత సరికాదురాయచూరు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బీజేపీ నాయకులు ఆరోపించారు. శనివారం బాగల్కోటె జిల్లా ఇలకల్ ప్రభుత్వాస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో ఇలకల్ నగర అధ్యక్షుడు అరవింద్ మాట్లాడారు. పేదలు దుబారా వ్యయంతో కూడిన మందులు కొనుగోలు చేయడం కష్టమని భావించి ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను ప్రారంభించి వారికి సౌకర్యం కల్పించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వాటిని మూసివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు. ఆందోళనలో తృప్తి సాలిమఠ, మల్లికార్జున, శ్యాం సుందర్, బసప్ప, చంద్రశేఖర్, నాడగౌడ, ప్రకాష్, విజయ్ గిరెడ్డి, నాగేష్, శ్రీనివాస్, శివరాజ్, వీరేష్, పరశురామ్, సూగూరేష్, రాజేంద్రలున్నారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
హొసపేటె: దురలవాట్లకు బానిసయ్యే ముందు మీ జీవితం, జీవనోపాధి విలువలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండగలరని సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర అన్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన అవగాహన మార్చ్ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత పొగాకు, నికోటిన్ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. దేశంలో 267 మిలియన్లకు పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం 13.5 లక్షలకు పైగా ప్రజలు పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నారు. హాస్యాస్పదంగా పొగాకు వినియోగదారుల్లో 47.6 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కర్ణాటకలో 22.8 శాతం మంది వ్యక్తులు ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పొగాకు ఉత్పత్తుల చీకటి ఉద్దేశ్యాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను పొగాకు రహితంగా మార్చడంలో ప్రజల సహకారం చాలా ముఖ్యం అన్నారు. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వస్తున్నాయి. నోరు, రక్తనాళాల నష్టం, తల, మెడ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్వరపేటిక, మెదడు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్కు కారణమవుతుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దురలవాట్లకు బానిస కావద్దు బళ్లారిటౌన్: దురలవాట్లు, పొగాకు ఉత్పత్తుల సేవనానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీహెచ్ఓ వై.రమేష్బాబు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొగాకులో దాదాపు 2000 రసాయనిక అంశాలు దాగి ఉన్నాయన్నారు. అది మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా కిడ్నీలు, నరాల సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పత్తి అవుతాయన్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనే పథకాలను రూపొందించిందన్నారు. విద్యా సంస్థల వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మకం నిషేధం అని, అధికారులు కూడా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఈశ్వర్ దానప్ప, ఇంద్రాణి, జబిన్తాజ్, శ్రావణి, రాఘవేంద్ర, గోవిందప్ప, విరుపాక్షి, అంబదాసు, శివకుమార్, ఉమా మహేశ్వరి, సవిత తదితరులు పాల్గొన్నారు. పొగాకు సేవనానికి దూరంగా ఉండండి సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర పిలుపు -
పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తాం
రాయచూరు రూరల్: మురికి వాడల్లో నివసించే పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తామని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ వెల్లడించారు. శనివారం పండిట్ సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మురికి వాడల క్రియా వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్లం హబ్బను ప్రారంభించి మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల ప్రాంతంలో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగరాభివృద్ధి ప్రాధికార అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం కనుగొంటామన్నారు. నగరంలో నివసించే పేదల్లో 2024లో 1.64 లక్షల మందికి హక్కు పట్టాల పత్రాలను అందించారన్నారు. ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఆర్డీఏ అధికారులతో ప్రతిపాదించి చర్యలు చేపడతామన్నారు. సర్కార్ మురికి వాడల ప్రజలకు ఇంటి హక్కు పట్టాలివ్వడానికి సిద్ధమన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, పవన్ కుమార్, రజాక్ ఉస్తాద్, రవీంద్ర జాలదార్, అంబన్న, అనిల్, మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్లున్నారు. -
పరిశ్రమలకు ఈ–ఖాతా వర్తించదు
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి ఈ–ఖాతాలను చేయించుకోవాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సిటీ కార్పొరేషన్ అధికారులు ఉపసంహరించుకోవాలని కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, హౌసింగ్, ఏపీఎంసీ, కేఏఐడీబీ, కేఎస్ఎస్ఐడీసీ వంటి వాటికి ప్రభుత్వమే కావేరి–2.0లో తీసుకుంటుందని, లేకపోతే సబ్ రిజిస్త్ట్రార్ కార్యాలయంలో అధికారులు నమోదు చేసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. సర్కారు ఈ నిర్ణయంపై సరైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నగరసభ అధికారులు ఈ విషయంలో పునరాలోచించాలన్నారు. -
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఉరవకొండ, ఉరవకొండ రూరల్: ఉరవకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలోని అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిలో కేసీఆర్టీసీ బస్సు, కారును వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి, చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె సైనీ దీప్తి అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపీ క్షేత్రాన్ని సందర్శించి శనివారంనాడు ధర్మవరానికి తిరిగి వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు బూదగవి సమీపంలో ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో కారులో అదుపుతప్పి దూసుకెళ్లింది, కారు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి (80) అక్కడికక్కడే చనిపోయాడు, సైనీదీప్తి, రోహన్రెడ్డి, చెన్నమ్మతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి పంపించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కారు ఢీకొని కూలీలకు గాయాలుపావగడ: పట్టణంలోని తేజస్ హోటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రజవంతి గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు గాయాలపాలై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాలూకాలోని నీలమ్మనహళ్లికి వేరుశనగ పంట కలుపును తీయడానికి ఆటోలో వెళ్లి తిరిగి స్వగ్రామం రజవంతికి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. స్థానిక పీయూ కళాశాల లెక్చరర్ విశ్వనాథ్, రాజవంతికి చెందిన మంజునాథ్ తదితరులు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.బూదగవి సమీపంలో ఘటనకారులోని ఒకరు మృతి, నలుగురికి గాయాలు -
రేప్ కేసులో ఎమ్మెల్యేకు ఊరట
దొడ్డబళ్లాపురం: అత్యాచారం కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మునిరత్న, అతని అనుచరులు అత్యాచారం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు వారిపై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణని జూన్ 2కి విచారణ వాయిదా వేసింది. మైక్రో వేధింపులు.. మాజీ జవాన్ ఆత్మహత్య యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ మైక్రోపైనాన్స్ సంస్థల వేధింపులు తగ్గడం లేదు. డెత్నోటు రాసి విశ్రాంత జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. మాజీ జవాన్ దేవజన జగదీశ్ (56) మడికెరిలో నివాసం ఉండేవాడు. డబ్బు అవసరాల కోసం కొన్ని మైక్రో ఫైనాన్స్ల నుంచి అప్పులు తీసుకున్నాడు. వాటిని వెంటనే తీర్చాలని సిబ్బంది సతాయించసాగారు. దీంతో జగదీశ్ డెత్నోటులో ఆర్థిక సమస్యలతో పాటు మైక్రో పైనాన్స్ సిబ్బంది వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఓ గోదాములో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. రాష్ట్ర పోలీసుకు కేంద్ర పోలీసు వంచన యశవంతపుర: పెళ్లి చేసుకొంటానని నమ్మించి రాష్ట్ర మహిళా పోలీసు కానిస్టేబుల్ను లైంగికంగా వాడుకుని మోసం చేసిన కేంద్ర రిజర్వు కానిస్టేబుల్ బాగోతమిది. మోసగానిపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన సంజీవ చవాన్ నిందితుడు, ఓ మహిళ కానిస్టేబుల్తో సంజీవ్ ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ యాదగిరి జిల్లాకు చెందినవారు కావడంతో పరిచయం మొదలై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సంజీవ్ షికార్లకు వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. పెళ్లి చేసుకుందామని మహిళా పోలీసు కోరగా, అతడు తప్పించుకు తిరగసాగాడు. ఆమె నిలదీయటంతో నీ ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, రాజాజినగర పోలీసులు నిందితునికి విచారణకు రావాలని నోటీసులు పంపారు. శ్రీకంఠేశ్వరునికి కానుకల వెల్లువ మైసూరు: మైసూరు జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే నంజనగూడులోని శ్రీకంఠేశ్వరస్వామి ఆలయానికి ఈ త్రైమాసికంలో భక్తుల నుంచి నగదు కానుకలు విరివిగా లభించాయి. రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ దాసోహ భవన్లో హుండీల లెక్కింపు జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన వంద మందికి పైగా మహిళలు నగదు లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఏఈ జగదీష్, ఆలయ ఈవో సతీష్, తలకాడు వెంకటేష్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. నగదు, బంగారం సొత్తు రూపంలో రూ.కోటిన్నర ఆర్జన లభ్యమైంది. సర్కారీ బడికి జడ్జి పుత్రుడు తుమకూరు: ప్రభుత్వ పాఠశాల అంటే పేదల పిల్లలు మాత్రమే చదివించుకుంటారని అనుకుంటారు. అధికారులు, ధనవంతులైతే ఇటు వైపు కన్నెత్తి చూడరు. లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పు చేసైనా ప్రైవేటు స్కూళ్లకే పంపుతారు. ఇలాంటి భావన ప్రబలిపోయిన నేటి సమాజంలో.. ఓ మహిళా జడ్జి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శిర పట్టణ సీనియర్ సివిల్ జడ్జి జరీఫాబాను తమ కుమారుడు ఆజాద్ను ప్రభుత్వ కన్నడ మీడియం పాఠశాలలోని 5వ తరగతిలో చేర్పించారు. ఈ పాఠశాలలో 350 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. ఇంగ్లిష్, కన్నడ మీడియం రెండూ ఉన్నాయి. న్యాయమూర్తి చొరవకు తాలూకా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కమల్ క్షమాపణ చెప్పాలి: మంత్రి దొడ్డబళ్లాపురం: కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు కర్ణాటకలో నిషేధిస్తామని కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తండగడి అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కమల్ క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే ఫిలిం చాంబర్తో, నటుడు శివ రాజ్కుమార్తో చర్చించామని, ఆయన కూడా అర్థం చేసుకోవాలన్నారు. కన్నడ భాష విషయంలో రాజీ అయ్యే ప్రశ్నే లేదన్నారు. అహంకారమే శివమొగ్గ: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని చెబుతూ కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసిన నటుడు కమల్హాసన్పై కఠిన చర్యలు తీసుకోవాలని శివమొగ్గలోని డీసీ కార్యాలయం ఎదుట కరునాడు రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఆయన కన్నడ భాషకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి, కానీ ఇలా మాట్లాడడం అహంకారానికి పరాకాష్ట అని ఆరోపించారు. తొందరపాటు ప్రకటనలు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య గందరగోళం సృష్టించకూడదని అన్నారు. -
టెన్త్ ఉత్తీర్ణత అంతేనా?
శివాజీనగర: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత పొందిన జిల్లాల డీడీపీఐలకు నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ను ఆదేశించారు. శనివారం విధానసౌధలో జరిగిన రాష్ట్ర ప్రగతి పరిశీలన సభలో అన్ని జిల్లాధికారులు, జడ్పీ సీఈఓలతో సీఎం మాట్లాడారు. ఎక్కువ జిల్లాల్లో ఫలితాలు ఎందుకు తగ్గాయో డీడీపీఐలు ఇచ్చే సమాధానం సబబుగా లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్ఎస్ఎల్సీలో ఉత్తీర్ణత తగ్గడంపై ఆగ్రహించారు. జిల్లా కేంద్రాల్లో కూర్చోవద్దు ఉపాధ్యాయుల కొరత, సిబ్బంది కొరత అని నెపం చెప్పరాదని ఘాటుగా సీఎం హెచ్చరించారు. డీడీపీఐలు, జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు సరిగా పనిచేస్తున్నారో, లేదో పరిశీలించాలి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. డీడీపీఐలు జిల్లాల్లో కూర్చోకుండా అంతటా పర్యటిస్తూ ఉండాలని తెలిపారు. పాఠశాలల నూతన గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంపై జిల్లాధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్లు తగ్గరాదు, డ్రాపవుట్లు పెరగరాదని ఆదేశించారు. దీనికి తగిన చర్యలను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పిల్లలకు గుడ్డు, పాలు, రాగిమాల్ట్, హాస్టల్ సదుపాయం అన్నిటిని ఇచ్చినా కూడా ఎందుకు బడుల్లో చేరడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. బాల్య వివాహాలపై ఎస్సీ ఎస్టీలు, బీసీలు, పేదల జనాభా ఎక్కువగా ఉన్నచోట్ల బాల్య వివాహాలు, బాల గర్భిణీ కేసులు ఉంటాయి. దీనిని తప్పకుండా అరికట్టాలని సీఎం చెప్పారు. నిఘా వహించి, రిపోర్ట్ ఇవ్వని పీడీఓలు, రెవెన్యూ సిబ్బంది విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. డీడీపీఐలు, ఉపాధ్యాయులకు శ్రద్ధ లేదా! కలెక్టర్ల భేటీలో సీఎం సిద్దు మండిపాటు -
వృథా ప్రకటనలు మానుకోవాలి
రాయచూరు రూరల్: నాయకులు వృథా ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చాలని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డంకి అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు దేవమిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక్ ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ తాను మాదిగ అని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదన్నారు. -
ఉద్యోగ విరమణ సహజం
రాయచూరు రూరల్: ఉద్యోగంలో పదవీ విరమణ సహజమని టాగూర్ స్మారక విద్యా మండలి అధ్యక్షుడు అమరేష్ అభిప్రాయపడ్డారు. శనివారం టాగూర్ స్మారక విద్యా సంస్థ కళాశాలలో పదవీ విరమణ చేిసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస రాయచూరుకర్ను సన్మానించి వీడ్కోలు పలికి మాట్లాడారు. విద్యార్థులకు ఉత్తమ బోధనలతో పాటు గ్రామాల్లో ఎలా సమాజ సేవ చేయాలో నేర్పిన వ్యక్తిగా కొనియాడారు. మండలి పదాధికారులు శివబసప్ప మాలి పాటిల్, విరుపాక్షప్ప, శాంతప్ప, పంపనగౌడ, నిర్మల, హేమరెడ్డి, నాగభూషణ్, రాజేశ్వరి, విజయ్ కుమార్, అళ్లప్ప, వెంకటేష్, దేవిరెడ్డి, చెన్నమల్లికార్జున, వీరప్ప, కల్లయ్యలున్నారు. -
దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం
బళ్లారి రూరల్ : శతాబ్దాల క్రితం శైవులు (శివభక్తులు) వైష్ణవుల (విష్టుభక్తులు) మధ్య అంతరాలు పెరిగి మేము గొప్ప అంటే మేముగొప్ప అని వాదులాడుకొనేవారు. అలాంటి వారికి మేమిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చేలా దావణగెరె జిల్లా హరిహరలోని హరిహరేశ్వర ఆలయం తార్కాణంగా నిలిచింది. దక్షిణకాశీగా పేరొందిన హరహరేశ్వరాలయం తుంగభద్ర నదికి కుడివైపున వెలసింది. సువిశాల ప్రాంగణంలో హొయ్సళ శిల్పకళా నిర్మాణ శైలి ఉట్టిపడుతోంది. క్రీ.శ.1224 హొయ్సళ రాజు రెండో నరసింహ సేనాధిపతి పోళాల్వ నిర్మించాడు. ఉత్సంగి పాండ్యులు, విజయనగర పాలకులు ఽఈ ఆల యాన్ని అభివృద్ధి పరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం పొడవుగా కాకుండా వెడల్పుగా నునుపైన 56 స్తంభాలతో చతురస్రాకారంతో నవరంగ మహామండపంలా ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిలలో పరమశివుడు, విష్ణుమూర్తి దర్శమిస్తారు. మూల విరాట్ హరిహరేశ్వరుడు కుడివైపున జపమాల, త్రిశూలంతో, ఎడమవైపు కిరీటం, పీతాంబరాలతో శంఖు, చక్రంతో స్వయంభువుగా వెలశాడు. ఆలయ ప్రాంగణంలోనే మహాలక్ష్మిద ఆలయం ఉంటుంది. గర్భగుడికి ఆనుకొని ఎడమ వైపున శివలింగం, ఎదురుగా బసవేశ్వర శిలలు ఉంటాయి. ఈ ఆలయంలో శైవ, వైష్ణవ ఆచారాలను పాటిస్తారు. ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. గుహాసురుని సంహారానికి హరిహరుల అవతారం స్కంధపురాణం ప్రకారం ఈ ప్రాంతంలో గుహాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశివుడు, విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొందాడు. అనంతరం దేవతలను, రుషులను, మానవులను బాధించేవాడు. హోమాలు, యగ్న యాగాలకు విఘ్నాలు కలిగించేవాడు. దీంతో దేవతలు, రుషులు విష్ణువును వేడుకొనగా శివుడు, నారాయణుడు కలసి హరిహరేశ్వరుడుగా అవతారమెత్తి గుహాసురున్ని సంహరించి ఇక్కడే కొలువు తీరారని స్థలపురాణం చెబుతోంది. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో చతురస్రాకారంలో గుడి ఒకే మూలవిరాట్టుగా భక్తులకు హరిహరుల దర్శనం 56 నునుపైన సుందర స్తంభాలతో విరాజిల్లుతున్న వైనం -
కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు
హుబ్లీ: వర్గాల మధ్య ధ్వేష వాతావరణం సృష్టించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీష్ శెట్టర్ ఆరోపించారు. హావేరిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి మత కలహాలు పెరిగాయన్నారు. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టిందని మంగళూరు ఘటనను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక మెసేజ్కు ఓ వర్గం వేలాది మంది యువకులు గుమిగూడతారన్నారు. అప్పటి కమిషనర్ ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో పెను ముప్పు జరిగిందన్నారు. మంగళూరులో ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. హావేరి గ్యాంగ్ రేప్ నిందితులు ఊరిలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నిందితులకు చట్టంపై భయం లేని వాతావరణం కాంగ్రెస్ సర్కారు వల్ల నెలకొందన్నారు. పీఎఫ్ఐ కార్యకర్తల కేసు రద్దు చేసినందుకు గతంలో కేజీ హళ్లి, డీజీ హళ్లి అల్లర్లు జరిగాయి. మైనార్టీలను ఆకర్షించేందుకు మంత్రి వర్గంలో ఇష్టమొచ్చినట్లుగా కేసుల రద్దు నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ఇక మీదటైనా ఇలా జరగరాదు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు. ధార్వాడలో కోవిడ్ కేసు నమోదుహుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఓ కోవిడ్ కేసు నమోదైంది. కోవిడ్ లక్షణాలతో 71 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయండి హుబ్లీ: విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి నామినేట్ చేయడానికి సిఫార్సు చేసే గురుతర బాధ్యత మీదేనని సీఎం సిద్దరామయ్యకు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయాలన్నది తన అభిలాష అని తెలిపారు. రాష్ట్రంలో మంచి పనులను చేసి సీఎం ప్రజల మనసులో ఆదరణ చూరగొన్నారు. సాహిత్యం, సంగీతం, కళలు, సాంస్కృతిక, విద్య, పత్రికా రంగం, సమాజ సేవ తదితర రంగాల్లో సాధకులను ఈసారి నామినేట్ చేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు. పర్మినెంట్ చేయాలని ఒత్తిడిరాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా సంచాలకులు శ్రీశైల నాయక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధికారికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టి పాఠశాలకు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల ధర్నా విరమణ హొసపేటె: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపివేసి గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నాను శనివారం మున్సిపల్ ఉద్యోగులు విరమించుకున్నారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నెల రోజుల్లోగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నడిరోడ్డులో గుంత.. ప్రయాణికులకు చింత హొసపేటె: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే ఉన్న బసవణ్ణ కాలువ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చారు. దీనిని మెరుగు పరచనందున గుంతలు పడి ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులను తీసుకెళ్లే వాహనదారులు, ఆటోలు, కార్లు ప్రయాణికులు ఇప్పుడు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే నియంత్రణ కోల్పోయి బసవణ్ణ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం రోడ్డు పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వసూలు చేస్తోంది. కానీ వాటి నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను సంబంధిత అధికారులు వెంటనే మూసివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
పొగాకు వ్యసనం మానండి
బనశంకరి: ఇటీవల రోజుల్లో పాఠశాల విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు చాలా సులభంగా లబించడం చాలా ప్రమాదకరమని ఫిడిలిటస్ ఎండీ అచ్యుత్గౌడ అన్నారు. ప్రపంచ పోగాకు రహితదినోత్సవం సందర్బంగా శనివారం శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో బనశంకరి రెండోస్టేజ్ ట్రాఫిక్సిగ్నల్ వద్ద జనజాగృతి నిర్వహించారు. సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు నేటి యువత, బాలలు బానిసలు కావడం బాధాకరమని చెప్పారు. పొగాకు సేవనాన్ని త్యజించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి లభిస్తుందని తెలిపారు. పొగ తాగడానికి బదులు పుస్తక పఠనం మంచి అభ్యాసమని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు పూలు, పండ్లు అందించి పొగాకు వ్యసనాన్ని మానాలని కోరారు. -
సాహితీవేత్త హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేశ్ మూర్తి (80) శుక్రవారం కన్నుమూశారు. వయస్సు పైబడిన వ్యాఽధితో బాధపతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక సినిమాలకు పాటలు, కథ, సంభాషణ రాసిన ఆయన 85వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడయ్యారు. వెంకటేశమూర్తి మృతికి అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు. 1944 జూన్ 23న దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హూదిగెరె గ్రామంలో జన్మించిన వెంకటేశ్మూర్తి.. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి కన్నడలో ఎం.ఏ పట్టాపొందారు. కన్నడలో పీహెచ్డీ చేశారు. 1973లో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ వాణిజ్య కాలేజీలో కన్నడ అధ్యాపక వృత్తి ఆరంభించిన ఆయన 2000లో రిటైర్డ్ అయ్యారు. వెంకటేశమూర్తి పార్థీవదేహం అంతిమ దర్శనానికి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్ర వెను భాగం బయలు రంగమందిరంలో ఏర్పాటు చేశారు. సీఎం సిద్దరామయ్య సంతాపం: హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్ను మూయటం బాధకు గురి చేసిందని సీఎం సిద్దరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. కవితలు, నాటకం, పిల్లల సాహిత్యం, అనువాదం ఇలా సాహిత్యంలో వివిధ రీతుల్లో నిమగ్నమై అపారమైన చదవరులను కలిగిఉన్న విశిష్ట రచయిత వెంకటేశమూర్తి మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అదేవిధంగా హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి మృతికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వేంకటేశమూర్తి సాహిత్య రంగానికి తనదైన సేవలు అందించారన్నారు. -
కమల్హాసన్ దిష్టిబొమ్మ దగ్ధం
మండ్య: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల్ హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయకూడదని, ఆయన కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని జేసీ సర్కిల్లో శుక్రవారం గుమిగూడిన కార్యకర్తలు కమల్హాసన్ చిత్రపటానికి నిప్పంటించి దహనం చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.నిధుల దుర్వినియోగం ● మున్సిపల్ మేనేజర్ సస్పెన్షన్ దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై దావణగెరె జిల్లా మలెబెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయ మేనేజర్ భజక్కనవర్ను సస్పెండ్ చేశారు. ఈ–ఖాతా ప్రక్రియలో అక్రమాలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని స్వంతానికి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో భజక్కనవర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గంగాధరస్వామి ఆదేశాలు జారీ చేశారు.కప్ గెలిస్తే సెలవు ఇవ్వాల్సిందే ● సీఎం సిద్దరామయ్యకు క్రికెట్ అభిమాని లేఖ సాక్షి బెంగళూరు: ఏటా ఐపీఎల్ సందర్భంగా ‘ఈ సల కప్ నమ్దే’ అంటూ హోరెత్తిపోయి ఆ తర్వాత ఆర్సీబీ ప్రదర్శనతో నిరాశ చెందే కన్నడిగుల్లో ఈ పర్యాయం కొత్త జోష్ చోటు చేసుకుంటోంది. 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఆర్సీబీకి అభిమానుల మద్దతు భారీగా పెరిగింది. ఆర్సీబీ ఫైనల్లో గెలిచి సంబరాల్లో మునగాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిస్తే సెలవు కావాలంటూ బెళగావి జిల్లా గోకాక్కు చెందిన శివానంద మల్లన్నవర్ అనే యువకుడు సీఎం సిద్ధరామయ్యకు ఈ మేరకు లేఖ రాశాడు. ఆర్సీబీ ఫైనల్లో గెలుపొందితే ఏటా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ పండుగ’ పేరిట ఉత్సవాలు జరపాలని, విజ్ఞప్తి చేశాడు. కరెంటుకు విద్యార్థి బలి దొడ్డబళ్లాపురం: విద్యుత్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిక్కబళ్లాపుర తాలూకా దొడ్డకిరుకుంబి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదేశ్(16) గురువారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. తన ఇంటి వద్ద ఇనుప కడ్డీతో డ్రైనేజీ పైప్ క్లీన్ చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తంతి తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. నందిగిరిధామ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మంత్రిపై హనీట్రాప్ కేసులో డీజీపీకి సిట్ నివేదిక బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజణ్ణపై హనీట్రాప్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు పూర్తి చేసి శుక్రవారం డీజీపీ ఎంఏ సలీంకు నివేదిక అందజేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఫిర్యాదుచేసిన మంత్రి రాజణ్ణ ఒకటి రెండు సార్లు తన కార్యాలయానికి యువతి వచ్చిందని, తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెంపపై కొట్టి పంపానని తెలిపారు. ఆమె జతలో గడ్డంతో ఉన్న యువకుడు కూడా వచ్చాడని తెలపగా, దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అంతేగాక మంత్రి ఆప్తులు, గన్మ్యాన్, సెక్యూరిటీ, పీఏను విచారణ చేసినా ఎలాంటి సాక్ష్యాలు దొరకనందున దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అధికారులు డీజీపీకి నివేదిక అందజేశారు. -
సమస్యలపై స్పందించకుంటే చర్యలు
శివాజీనగర: మేము, మీరంతా ప్రజల పన్నుల సొమ్ముతో పరిపాలన చేస్తున్నాం. అన్ని సదుపాయాలను అనుభవిస్తున్నది ప్రజల పన్నుల సొమ్ము ద్వారానే అనేది మరువరాదు. అందువల్ల ప్రజల సమస్యలపై స్పందించకపోతే అటువంటి అధికారుల విరుద్ధంగా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం సిద్దరామయ్య అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీల సీఇఓలకు కట్టుదిట్టమైన హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల జిల్లాధికారులు, సీఇఓలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. చట్టాన్ని నాశనం చేస్తే చర్యలు తీసుకోండి: రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక దుష్ట శక్తులు ఎంతటి ప్రభావం కలిగినా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని సీఎం జిల్లా అధికారులను హెచ్చరించారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారితే అభివృద్ధి సాధ్యపడదన్నారు. డీసీ, సీఇఓల పర్యటన కార్యక్రమం ప్రకటించాలి: జిల్లాధికారులు, సీఇఓలు తమ పర్యటన కార్యక్రమం వివరాలు ముందుగానే ప్రజలకు తెలిసేలా ప్రకటించాలి. తనిఖీల నివేదిక ఆధారాలను సక్రమంగా ఉంచుకోవాలి. పాఠశాలలు, హాస్టళ్లను ముందుగా సూచన లేకుండా తనిఖీ చేయాలని గతంలో ఆదేశించినా చాలా మంది పాటించలేదనే నివేదిక తనకు వచ్చిందని సీఎం అన్నారు. జిల్లాలో సామాన్య ప్రజలకు ఆరోగ్య, రవాణా సంచారం లాంటి మౌలిక సదుపాయాలు లభించకపోతే దానిని పరిపాలన వైఫల్యమనే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అడవుల్లో పాఠశాల, రోడ్డు, ఆసుపత్రిలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎందుకు సాధ్యపడలేదని ప్రశ్నించారు. సీఇఓలు ఇటువంటి అడవులకు నిరంతరం భేటీ చేయాలని సూచించారు. జిల్లాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి కొందరు జిల్లాధికారులు, సీఇఓలు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజలు సాధారణంగా జిల్లాధికారుల కార్యాలయానికి వస్తారు. అటువంటి వారి కష్టాలను మీరే ఆలకించకపోతే దానిని పరిష్కరించేవారు ఎవరు?, ఎవరి వద్ద వారు తమ కష్టాలను చెప్పుకోవాలి? అని సీఎం ప్రశ్నించారు. తాలూకా, జిల్లా కేంద్రాల్లో అధికారులు కేంద్ర స్థానంలో ఉండాలన్నారు. జిల్లా ఇన్చార్జి కార్యదర్శులు నెలలో కనీసం రెండు సార్లు ఆయా జిల్లాలకు భేటీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు. జిల్లాధికారులు తప్పు చేసినా నిర్ధాక్షిణ్యంగా చర్యలు: జిల్లాధికారి, జిల్లా భద్రతాధికారులు, సీఈఓలు తమ అహంభావం పక్కకుపెట్టి సమన్వయంతో పని చేస్తేనే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులను హెచ్చరించిన సీఎం సిద్దూబాల్య వివాహాలను అడ్డుకోలేరా?బాల్య వివాహాల గురించి సీఎం మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. మీ కింది స్థాయివారు మీకు రిపోర్ట్ ఇవ్వటం లేదా? మీకు వారిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం 700 బాల్య వివాహాలు జరిగాయని, బాల్యంలోనే తల్లులైన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయన్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడిచినా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే ఎలా?, బాల్య వివాహాలు అరికట్టేందుకు ఉన్న చట్టాలు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. -
జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి
బళ్లారి రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరనలో జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనౌషధి కేంద్రాలను పునః ప్రారంభించాలన్నారు. కేవలం ప్రధాని మోదీ బొమ్మ ఉన్నందునే అధికార రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపించారు. అధిక మొత్తం చెల్లించి మందులు కొనలేని పేదలకు జనౌషధి కేంద్రాలు ఎంతో సహాయకారిగా ఉండేవన్నారు. జనౌషధి కేంద్రాలను మూసివేస్తే, మందులు కొనలేని పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్రగ్ మాషియాలో భాగంగానే తక్కువ ధరకు మందులను అందించే జనౌషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. బీఎంసీఆర్సీ ఆసుపత్రిలో కుక్కకాటుకు వినియోగించే రేబిస్ మందుల కొరత ఉందన్నారు. అందువల్ల వైద్యులు బయట మందులషాపులకు చీటీలు రాసిస్తున్నారన్నారు. అందోళనలో భాగంగా బీజేపీ నాయకులు నినాదాలతో కూడిన ప్లకార్డులతో ఆసుపత్రి ముందు బైటాయించారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణుల ఆందోళన బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బైటాయించి ధర్నా -
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో రిబ్బన్ కట్ చేసి ఇందిరా క్యాంటీన్ను ఎంపీ ఈ.తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, పట్టణ పంచాయతీ అధ్యక్షురాలు బీ.రేఖా రమేష్, ఉపాధ్యక్షుడు సిద్ధయ్య ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రవాసి మందిరంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుతో ఆస్పత్రికి వచ్చే రోగులకు, కార్మికులకు, పేదలకు ఎంతో అనుకూలం అవుతుందన్నారు. అయితే కొట్టూరులో ఉన్న ప్రస్తుత సమస్యల గురించి విలేకరులు అడగగా ఇక్కడ నెలకొన్న సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు దొడ్డ రామణ్ణ, ఎంఎంజీ సత్యప్రకాష్, బీడీసీసీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకేష్, పట్టణ పంచాయతీ చీఫ్ నసరుల్లా, అడికె మంజునాథ్, ఇంజినీర్ అశోక్, డీఎస్ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బీ.మరిస్వామి, పట్టణ పంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దుకాణాల్లో డ్రగ్స్ విక్రయిస్తే ఖబడ్దార్
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. గురువారం తన కార్యాలయంలో మందుల దుకాణాల వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కారాదన్నారు. యువతకు మత్తు పదార్థాలు విక్రయించే ముందు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్యలున్నారు.వ్యక్తి అదృశ్యంహొసపేటె: తాలూకాలోని 32వ వార్డు బాణదకేరిలోని గరడిమనె నివాసి కే.వెంకటేష్(57) అనే వ్యక్తి ఈనెల 10వ తేదీ నుంచి అదృశ్యం కావడంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తలకు గాయమై మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. చాలా చోట్ల చికిత్స చేయించినా పూర్తిగా నయం కాలేదు. 5.4 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, ముదురు రంగు శరీరఛాయ గల ఇతను కనిపించకుండా పోయినప్పుడు లేత నీలం రంగు పుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడు. కన్నడ భాషలో మాట్లాడగలడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్ను లేదా సెల్– 9480805745, 08394–224033, 224204 నంబర్లలో సంప్రదించాలని కోరారు.గంజాయి విక్రయం.. నిందితుల అరెస్ట్రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో హైడ్రో గంజాయిని విక్రయిస్తున్న కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అభిరామ్ ఎల్ వరసిద్ధి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగావతిలో అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.18.06 లక్షల విలువైన 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. థాయిలాండ్ నుంచి భారత్కు అక్రమంగా గంజాయిని తెప్పించుకొన్న కేరళకు చెందిన భాగస్వాములు సౌజేష్(28), సలీం(27), దుర్గా ప్రసాద్(27), బాద్షా(32), మదన్ (26), సూర్యప్రతాప్రెడ్డి(19), మహ్మద్ హమీద్(22), మణికంఠ(23)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.మిఠాయిలతో విద్యార్థులకు స్వాగతంరాయచూరు రూరల్: జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు మిఠాయిలతో స్వాగతం పలికారు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ తాలూకాలోని బిజినగేర, విజయ నగర క్యాంప్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అందాల్సిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.బాలిక ఆత్మహత్యదొడ్డబళ్లాపురం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దొడ్డబళ్లాపురం పట్టణ పరిధిలోని దర్గాపురలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన ధర్మేంద్రకుమార్ దర్గాపురలోని పిళ్లేగౌడ అనే వ్యక్తికి చెందిన తోటలో నివాసం ఉంటోంది. ధర్మేంద్ర సమీపంలోని రైల్వేస్టేషన్లో సిమెంటు మూటలు అన్లోడ్ చేసే పని చేస్తుండగా భార్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తోంది. వీరికి నలుగురు సంతానం. రెండవ కుమార్తె చాందిని కుమారి(12) మానసిక రోగంతో బాధపడుతుండేది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగానే ఇంట్లో తమ్ముడిని బయటకు పంపించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి బాలుడి ఘనత
హుబ్లీ: పాత హుబ్లీ ఇంద్రప్రస్థ నగర్ నివాసి సుస్విన్ అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును దాఖలు చేసి ఘనత సాధించాడు. 4.8 ఏళ్ల సుస్విన్ 39.24 నిమిషాల్లో 11.18 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ద్వారా అందరినీ ఆశ్చర్య పరిచాడు. కాగా ఇంతకు ముందు 5.3 ఏళ్ల తమిళనాడు చిన్నారి అదవ్ అశోక్కుమార్ అనే బాలుడు 10.3 కిలోమీటర్ల దూరాన్ని 39.44 నిమిషాల్లో అధిగమించాడు. దీన్ని సవాల్గా తీసుకున్న సుస్విన్ 2025 ఏప్రిల్ 5న సత్తూరు ఆశ్రయ కాలనీ నుంచి ఉదయం 6.40 గంటలకు సైక్లింగ్ ప్రారంభించి 7.19 గంటలకు ఉణకల్ క్రాస్ వరకు తొక్కి ఘనత చాటాడు. ప్రతి రోజు హుబ్లీ ఆనంద్నగర్ చుట్టు పక్కల ప్రాంతంలో తండ్రి వినాయక్ బాలుడికి సైక్లింగ్లో శిక్షణ ఇచ్చే వారు. రోజు అభ్యాసం చేస్తూ అలాగే అభ్యాసాన్ని రెట్టింపు చేసుకుంటూ చివరుకు 11 కిలోమీటర్ల దూరాన్ని 39.05 నిమిషాల్లో చేరుకున్నాడు. రింగ్ రోడ్డులో సాధన షురూ తొలుత హుబ్లీ రింగ్ రోడ్డులో సైకిల్ తొక్కడం ప్రారంభించి ఆ తర్వాత జంట నగరాల్లోని రోడ్లల్లో తొక్కడం ప్రారంభించారు. అనంతరం అభ్యాసంతో సైకిల్ రైడింగ్ అలవాటు చేసుకున్నాడని బాలుడి తల్లి సుష్మ తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో కీలకం అన్నారు. సుస్విన్ సైక్లింగ్లో సాధన ప్రారంభించిన వేళ మేమందరం చిన్నారికి మద్దతుగా నిలిచామన్నారు. ప్రస్తుతం చిరంజీవి రికార్డు సాధించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తండ్రి వినాయక హళపేటె మాట్లాడుతూ తమిళనాడు బాలుడు రికార్డును బద్దలుగొట్టాలన్న లక్ష్యంతోనే కుమారుడు సుస్విన్కు నిరంతరం శిక్షణ ఇచ్చానున్నారు. ఆ విధంగా బాలుడు ప్రతి రోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేయించేవాడినని, ప్రస్తుతం కుమారుడి రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దాఖలు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. 11 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి చరిత్ర సృష్టించిన బాలుడు -
తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
సాక్షి,బళ్లారి: తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది రైతులు నీరు పొందే విషయంపై ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి భారీగా వచ్చిన వరదలతో 19వ క్రస్ట్గేట్ కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. అష్టకష్టాలతో క్రస్ట్గేటు యథావిఽఽధిగా అమర్చడం వల్ల ఖరీఫ్, రబీ పంటలకు నీరు అందాయన్నారు. అయితే క్రస్ట్గేట్లు అన్నింటికీ మరమ్మతులు చేయాలని, అవి సక్రమంగా లేవని నిపుణులు, ప్రభుత్వ పెద్దలు కూడా సూచించారని గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు పక్కా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిపుణులు సూచించినా క్రస్ట్గేట్లు మరమ్మతులు చేయక పోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. 33 క్రస్ట్ గేట్లను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు ఇచ్చిన సూచనలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు శివరాజ్ తంగడిగి రబీలో నీటి విడుదలను నిలుపుదల చేసి క్రస్ట్ గేట్లను మరమ్మతు చేస్తామని చెప్పినా ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ఫ్లో వస్తోందని, ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయిందన్నారు. త్వరలో కాలువలకు కూడా నీరు వదలాల్సిన పరిస్థితులు ఉన్నందున రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు భీమన్నగౌడ, మల్లప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. క్రస్ట్గేట్లకు ఎందుకు మరమ్మతులు చేయలేదు? అధికారులపై రైతు సంఘం అధ్యక్షుడు మండిపాటు -
5లోగా ఫీజు వివరాలు వెల్లడించండి
హొసపేటె: విజయనగర జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు వివరాలను జూన్ 5వ తేదీలోపు ప్రకటించాలని, విస్మరిస్తే ఆ పాఠశాలల సమాచారాన్ని జిల్లా వెబ్సైట్లో ప్రకటిస్తామని విజయనగర జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాలక మండళ్ల సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ పాఠశాల అయినా అదనపు ఫీజులు వసూలు చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు వివరాలను అన్ని పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు. సమగ్ర సర్వే 86 శాతం పూర్తి షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేలో పని కోసం వారి వారి నగరాలు, తాలూకాలు, గ్రామాల నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాల సమగ్ర సర్వే 86 శాతం పూర్తయిందని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయ హాల్లో షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేకు సంబంధించి కమ్యూనిటీ నాయకులు, వివిధ సంఘ సంస్థల ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేపై జస్టిస్ నాగ మోహన్దాస్ సింగిల్ మెంబర్ విచారణ కమిషన్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పనులను పూర్తి చేసిందన్నారు. ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలను మినహాయించిందన్నారు. సర్వేలో 14 శాతం మాత్రమే ఇంకా పెండింగ్లో ఉందన్నారు. -
రైతులకు వ్యవసాయ సలహాలివ్వాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు సలహాలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప సూచించారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఖరీఫ్ సీజన్ విత్తనాల అభియాన్ను వికసిత వ్యవసాయ సంకల్ప అభియాన్ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాల గురించి రైతులకు వివరించాలన్నారు. 15 రోజుల పాటు జరిగే జాతా సందర్భంగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. జాతాలో అధికారులు దురుగేష్, స భ్యులు మధుసూదన్, మల్లేష్, మధుసూదనరెడ్డిలున్నారు. -
పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: జిల్లాలో భూమి లేని పేదలకు భూములు పంచాలని భూ వసతి పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. కేంద్రీయ పాఠశాలలో విద్యార్థులకు శిబిరం హొసపేటె: టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. 3 నుంచి 10వ తరగతి ఆంగ్ల మీడియం విద్యార్థులకు తెలుగు భాష గురించి అక్షరాలను ఉపాధ్యాయురాలు జీ.సునీత తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం ఈ సారి రీజినల్ లాంగ్వేజ్లో ఒకటైన తెలుగు అక్షరాలను చదవడం, రాయడంపై ఒక వారం పాటు విద్యార్థులకు ఈ శిబిరాన్ని చేపట్టామని ప్రిన్సిపల్ మనోహర్లాల్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. నిలిచిన లారీకి కారు ఢీ.. ముగ్గురి దుర్మరణం హుబ్లీ: నిలబడిన లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా భద్రపుర వద్ద హైవేలో గురువారం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మదన్, సురేష్, ఎల్ఎన్.వేణుగోపాల్ మృతి చెందారు. తోట చూసుకొని ముండరగి నుంచి బెంగళూరు వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను మైసూరు, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అణ్ణిగేరి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి రాయచూరు రూరల్ : జిల్లాలో సంచార నియమాలను తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారు పాటించాలని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం వద్ద ప్రచారాందోళనకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. యువత, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధిక శాతం మంది గ్రామీణ ప్రజలు సైబర్ నేరాలకు బలవుతూ లక్షల్లో డబ్బులు కోల్పోయారన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్య పాల్గొన్నారు. ఆకాశవాణి అధికారికి ఘనంగా వీడ్కోలు రాయచూరు రూరల్: రాయచూరు ఆకాశవాణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారి బావలత్తిని ఎద్దుల బండిలో ఊరేగించి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పదవీ విరమణ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలపడానికి భారీగా తరలివచ్చి నూతన ఒరవడితో వీడ్కోలు పలికారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప పాల్గొని మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన అధికారి బావలత్తి అందరి మనస్సులను దోచుకున్నారన్నారు. వెంకటేష్ బేవినబెంచి, సరోజ, విజయ రాజేంద్ర, బండేష్, ఈరణ్ణలున్నారు. -
గురువుల ఉపదేశం బంగారం
చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార శ్రీ యోగినారేయణ స్వామి ఆలయంలో కాలజ్ఞాని శ్రీ యోగి నారేయణ తాతయ్య 190వ జీవ సమాధి ప్రవేశ పర్వ ఆరాధన ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. తాతయ్య విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసిన ధర్మాధికారి జయరాం మాట్లాడుతూ గురువుల ఉపదేశాలను మనం పాటిస్తే జీవనం బంగారంగా సాగుతుందన్నారు. మానవుడు అనేక ఆశలకు లోనవుతుంటాడు. అయితే యోగి ఆశలను వదిలి సాధనకర్తగా తయారువుతాడన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి కాషాయ వస్త్రాలను బహూకరించారు. తాతయ్య రచించిన తాటాకుల పుస్తకాలను విశేషంగా పూజించారు. నలమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. రాత్రి అఖండ భజన సాగింది. -
కోవిడ్కు వృద్ధుడు బలి
బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ కలవరం రేపుతోంది. బెంగళూరులో 100 కేసులకు పైగా చేరుకున్నాయి. బెళగావి తాలూకా బెనకనహళ్లి గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు వయోభారంతో అనారోగ్యం బారినపడి బిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వెంటనే కోవిడ్ వార్డులోకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. కాగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు 3కు చేరాయి. కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిసింది. మాస్కుల వాడకం పెరిగింది. బీజేపీ ఎమ్మెల్సీలపై గవర్నర్కు ఫిర్యాదు శివాజీనగర: కల్బుర్గి జిల్లాధికారి ఫౌజియా తరున్నుం ని పాకిస్తానీ అని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ దూషించారు. మరో చలవాది నారాయణస్వామి మంత్రి అయిన ప్రియాంక ఖర్గేను కుక్కతో పోల్చారు, వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గురువారం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, సలీం అహమ్మద్ తదితరులు ఇందులో ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సమాజాన్ని విడగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. స్మారకాల సంరక్షణకు రారండి ● సంఘసంస్థలకు పర్యాటక మంత్రి పిలుపు బనశంకరి: రాష్ట్రంలో చారిత్రక స్థలాలు నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని, రాష్ట్రంలో 25 వేలకు పైగా చారిత్రక స్థలాలను దత్తత ఇవ్వాలని నిర్ణయించామని పర్యాటక మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. బెంగళూరు చిత్రకళా పరిషత్లో నమ్మ ఆర్ట్స్ బెంగళూరు పేరుతో 5 రోజుల పాటు నిర్వహించే జాతీయ కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, మఠాలు, ట్రస్టులు, సంఘసంస్థలు స్మారక దత్తు పథకం కింద స్మారకాలను దత్తత తీసుకోవచ్చునని తెలిపారు. దీంతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్మారకాల రక్షణకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వీలవుతుందన్నారు. చిత్రసంతెను చూస్తే చిత్రకళలో అభిరుచి లేనివారు కూడా ఆశ్చర్యానికి లోను అవుతారని తెలిపారు. కోల్కతా తరువాత కళల పట్ల ఆసక్తి కలిగిన రాజధాని బెంగళూరు కావడం గర్వకారణమన్నారు. ప్రముఖ కళాకారుడు విలాస్నాయక్ గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రకళాపరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.25 లక్షలు నిధులు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిత్రకళావేడుక ఆదివారం వరకు జరుగుతుంది. -
‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం
● ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి బళ్లారిఅర్బన్: నగరంలో సమస్యల పరిష్కారానికి సలాం బళ్లారి కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. సలాం బళ్లారి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1200 కోట్లతో నగరంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి త్వరలో శ్రీకారం చుడుతామన్నారు. గడిగి చెన్నప్ప సర్కిల్ త్వరలో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. సీఎం, డీసీఎంలు హాజరవుతారన్నారు. ఇంతకు ముందు తాను పర్యటించిన వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
డీసీసీబీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు
కోలారు: తీవ్ర కూతూహలం రేకెత్తించిన డిసిసి బ్యాంకు డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. బ్యాంకు పాలక మండలిలో 18 మండి డైరెక్టర్లు ఉండి ఇందులో 6 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలి 12 డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికలో 8 స్థానాల ఫలితాలు వెలువడి, ఇంకా 4 స్థానాల ఫలితాలు కోర్టు ఆదేశాల మేరకు రిజర్వులో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పాలక కాంగ్రెస్ పార్టీకి నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎన్నికలలో డిసిసి బ్యాంకు మాజీ అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడతో పాటు మాజీ డైరెక్టర్లు, కొత్త అభ్యర్థులు బరిలోకి దిగారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, కేజీఎప్ ఎమ్మెల్యే రూపా శశిధర్, బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర కసరత్తులు చేసినా ఫలించలేదు. బ్యాలహళ్లి గోవిందగౌడను ఓడించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిక అనంతరం విలేకరులతో మాట్లాడిన బ్యాలహళ్లి గోవిందగౌడ తనకు ప్రాణహాని జరిగితే అందుకు మాజీ మంత్రి కె ఆర్ రమేష్కుమార్ కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. గోవిందగౌడ ఎన్నిక -
నగరంలో పచ్చదనం పెంచుదాం
రాయచూరు రూరల్: నగరాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పోషించాలని కమిషనర్ జుబీన్ మోహపాత్రో పిలుపునిచ్చారు. రాయచూరు కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన బుధవరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. జూన్ 5న నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారిలో కుడి ఏడమ వైపుల మొక్కలు నాటుతామని, నగరవాసులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉప కమిషనర్ గురు సిద్దయ్య పాల్గొన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాంరాయచూరు రూరల్: నగరంలో పౌర కార్మికుల సమస్యలపై స్పందిస్తామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హమీచ్చారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద అందోళన చేపట్టిన కార్మికులను ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పౌర కార్మి కుల సర్వీసులు రెగ్యులర్ చేసిందన్నారు. జ్యోతి సంజీవినీ, కేజీఐడీ ఇతర సౌలభ్యాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.గోవుల రక్షణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయండిరాయచూరు రూరల్: జిల్లాలో గోవుల రక్షణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని గోసేవా సంఘం కార్యదర్శి వినయ్ ిసింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దానిని నిలువరించేందుకు నగరంలోని నవోదయ, యరగేర, శక్తినగర. కల్లూర్ క్రాస్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. స్వప్న సింగ్, బాలప్ప, రాయరెడ్డి పాల్గొన్నారు.చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతిహుబ్లీ: నగరంలోని నూల్వీక్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజాటౌన్ నివాసి ఆటో డ్రైవర్ నజీర్ అహమ్మద్ గురువారం మృతి చెందాడు. ఇతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాజకాలువలను శుభ్రం చేయాలితుమకూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వరదనీరు సక్రమంగా వెళ్లేలా నగరంలో రాజకాలువలను శుభ్రం చేయాలని నగర ఎమ్మెల్యే జ్యోతిగణేష్ జిల్లాధికారి శుభ కళ్యాణ్ను మనవి చేశారు. గురువారం జిల్లాధికారిని కలిసి నగరంలో ఉన్న అమాని చెరువు, చుట్టుపక్కలున్న గార్డెన్ రోడ్డు, దిబ్బూరు, ఎస్.మాల్ వెనుక భాగం, శిరా గేట్, ఈ ప్రాంతంలో వర్షాలు పడితే నీళ్లు ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. వర్షాలు పడటానికిముందే కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తీసేయాలి, మరమ్మత్తులు చేయించాలని కోరారు. నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు వస్తోందని, పరిష్కారం చేయాలని తెలిపారు.బ్రేక్ ఫెయిలై ప్రమాదంతాడిమర్రి: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల పరిధిలోని కేయన్ పాళ్యం వద్ద గురువారం ఓ కారు బ్రేక్ ఫెయిలై రాళ్ల కుప్పను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. బెంగుళూరుకు చెందిన షరీఫ్, ఐదు మంది తమ బంధువులతో గూగూడు కుళ్లాయస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు వస్తూ తాడిమర్రికి రావడానికి బదులు దారి తప్పి చిల్లకొండయ్యపల్లికి గ్రామానికి వెళుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేయన్ పాళ్యం వద్దకు రాగానే కారు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన రాళ్ల కుప్పను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్పల్ప గాయాలయ్యాయి. -
కసాప సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సాక్షి,బళ్లారి: బళ్లారి జిల్లాలో 68 సంవత్సరాల తర్వాత జరగనున్న అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళననాన్ని ఘనంగా నిర్వహిద్దామని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కసాప బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి కామర్స్ కాలేజీలో తల్లిదండ్రుల పేరుమీదుగా గురువారం ఏర్పాటు చేసిన స్మారక దత్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ నేల, నీరు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కసాప చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. మాతృభాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మరవకూడదని సూచించారు. కన్నడ కస్తూరి పరిమళాన్ని నలుదిశలా ప్రసరింపజేయడానికి అఖిలభారత భారత కన్నడ సమ్మేళాన్ని కన్నుల పండువగా నిర్వహించాలన్నారు. ఆ సమ్మేళనం బళ్లారిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టూరుస్వామి బీఎడ్ కళాశాల సహప్రాధ్యాపకులు ఎన్ జీ జయణ్ణ మాట్లాడుతూ ప్రాచీన కన్నడ సాహిత్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, మహానగర పాలికె విపక్ష నాయకుడు, కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
1న ప్రతిభా పురస్కారాలు ప్రదానం
సాక్షి,బళ్లారి: కర్ణాటక వీరశైవ లింగాయత్ ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూన్ 1న సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు చెన్నబసవస్వామి గురువారం వివరాలు వెల్లడించారు. 10వ తరగతి, పీయూసీలో 85శాతం పైగా మార్కులను తెచ్చుకున్న వారిని సన్మానించి, పురస్కారం అందజేస్తామన్నారు. ఇప్పటికే 10వతరగతి విద్యార్థులు 130 మంది, పీయూసీ విద్యార్థులు 135 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. సమావేశంలో బసవరాజు బిసలహళ్లి,ఎస్పీ జగదీష్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: గాణిగ సమాజం ఆధ్వర్యంలో జూన్ 1న ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేయనుననట్లు ఆ సముదాయం అధ్యక్షుడు చెన్నప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెన్త్, పీయూసీలో ఉత్తమ మార్కులు సాధించిన సముదాయానికి చెందిన విద్యార్థులకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. బసప్పహళి, శంకరప్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
కామ స్వామి మఠం ధ్వంసం
దొడ్డబళ్లాపురం: బాలికపై అత్యాచారం చేసిన దొంగ స్వామికి చెందిన మఠాన్ని అధికారులు జేసీబీలతో ధ్వంసం చేయించారు. బెళగావిలోని రామ మందిరమఠం లోకేశ్వర స్వామీజీ ఒక బాలికకు మాయమాటలు చెప్పి రాయచూరు, బాగలకోటకు తీసుకెళ్లి కొన్ని రోజులపాటు లాడ్జీలలో ఉంచి అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి ఫిర్యాదుచేయగా అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలిసిందే. గురువారంనాడు రాయభాగ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీసులు మేఖళి గ్రామంలో ఉన్న సదరు మఠాన్ని జేసీబీలతో పడగొట్టించారు. 8 ఏళ్ల క్రితం స్వామిజీ 8 ఎకరాలను ఆక్రమించుకుని మఠం నిర్మించాడు. అనుమతులు లేనందున ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.16 మంది రైల్వే ఉద్యోగులపై కేసుదొడ్డబళ్లాపురం: తోటి ఉద్యోగిపై హత్యకు కుట్ర చేయడంతోపాటు కుల దూషణ చేశారని ఓ ఉద్యోగి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు 16మంది రైల్వే ఉద్యోగులపై కేసు నమోదైన వ్యవహారం యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని రైల్వే వీల్ ఫ్యాక్టరీలో సీనియర్ మెకానిక్గా పని చేస్తున్న బసవలింగప్ప ఫిర్యాదుదారుడు. వేతనం, ప్రమోషన్ రాకుండా తోటి ఉద్యోగులు 16మంది తనపై హత్యకు కుట్ర చేసి, కుల దూషణతో వేధించారని ఆయన కేసువేశారు. కోర్టు ఆదేశాల మేరకు యలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.స్కూలు బస్సు పల్టీదొడ్డబళ్లాపురం: స్కూళ్లు తెరిచిన గురువారంనాడే స్కూల్ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన గదగ్ పట్టణ పరిధిలోని ఆర్కే నగరలో జరిగింది. స్థానిక శ్రీపార్శ్వనాథ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన స్కూల్ ఉదయాన్నే విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రిడ్జి కింద నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయపడ్డాడు. పోలీసులు క్రేన్ తెప్పించి బస్సును రోడ్డుపై నుండి తొలగించారు. ఖాళీ బస్సు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: డెత్నోటు రాసి ఇంజినీరింగ్ విద్యా ర్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా హళ్లిగట్టులో జరిగింది. తేజస్విని (19) సీఐటీ కాలేజీలో ఫస్టియర్ బీటెక్ చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటోంది. గురువారం తెల్లవారుజామున గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. డెత్నోటులో 6 విషయాలు తెలిపింది. సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది.తుపాకుల విక్రేతల అరెస్టుదొడ్డబళ్లాపురం: నాటు తుపాకులు, రివాల్వర్లు తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్న ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నాటు తుపాకి, ఒక రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు కేజీ హళ్లి రౌడీషీటర్ కాగా మరొకరు ఆయుధాల విక్రేత. అరెస్టయిన రౌడీషీటర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పంజాబ్లోని తేజ్ బహద్దూర్ నగర్లో నివసిస్తున్న ఆయుధాల విక్రేతను అరెస్టు చేసి తీసుకువచ్చారు. తుపాకులను ఎవరెవరికి విక్రయించారు అనేది విచారిస్తున్నారు.సీఎం, డీసీఎం బదిలీల వార్బనశంకరి: సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బదిలీల గురించి విభేదాలు వచ్చాయి. ప్రజాపనుల శాఖ నుంచి జలవనరుల శాఖకు సీనియర్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై డీకే శివకుమార్ అసహనం వెలిబుచ్చారు. తమ శాఖలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. దీనిపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. డీకే మీడియాతో మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో ఎక్కువ మంది ఇంజనీర్లు లేరు, మాకు అర్జెంటుగా ఇంజనీర్లు కావాలని అడిగాను. కానీ మా శాఖలోకి వచ్చి పదోన్నతి తీసుకుని ప్రజాపనులశాఖ, జిల్లా పంచాయతీ తో పాటు ఇతర శాఖలకు బదిలీ అవుతున్నారని వాపోయారు. మీ అనుమతి లేకుండా ఎవరు బదిలీచేశారని విలేకరులు ప్రశ్నించగా, ఉన్నతస్థాయిలో జరుగుతోందని పరోక్షంగా సీఎంను ప్రస్తావించారు. నాకు చెప్పకుండా ఎవరినీ బదిలీ చేయరాదని తెలిపానన్నారు. -
దోపిడీదొంగల అరెస్టు
యశవంతపుర: జాతీయ రహదారిలో దోపిడీకి ప్లాన్ వేసిన గురుడ గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి కారంపొడి, కత్తిని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు చొక్కబెట్టుకు చెందిన జలీల్ హుసైన్, భట్కళ హెబళె గాంధీనగరకు చెందిన డ్రైవర్ నాసీర్ హకీమ్ను అరెస్ట్ చేశారు. జలీల్పై ఇప్పుటీకే 11 కేసులు, నాసీర్పై 2 కేసులున్నట్లు భట్కళ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మైనర్ బాలుడు కాగా, అతనిపై కూడా ఒక కేసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హైవే మీద తెల్లవారుజామున ఐదు మంది పొంచి ఉండి, ఎవరైనా కనిపిస్తే దోచుకోవాలని సిద్ధమయ్యారు. అదే మార్గంలో వెళ్లతున్న భట్కళ పోలీసుల కంట పడ్డారు. ముగ్గురిని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఇటీవలి కాలంలో నేరగాళ్లు గరుడ పేరుతో ముఠాలను ఏర్పాటు చేసుకుని హల్చల్ చేయడం పెరిగింది. డ్యాన్స్మాస్టర్ వంకరబుద్ధి కృష్ణరాజపురం: డ్యాన్స్ మాస్టర్ వంకర బుద్ధి ప్రదర్శించాడు. డ్యాన్స్ పేరుతో బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.ఈ ఘటన బెంగళూరు నగరం మహదేవపుర నియోజకవర్గంలోని కాడుగొడిలో జరిగింది. భారతీ కన్నన్(32) అనే వ్యక్తి చిన్నారులకు డ్యాన్స్లో శిక్షణ ఇస్తుంటాడు. ఈ నెల 24న ఓ బాలికను డ్యాన్స్ శిక్షణ పేరుతో కారులో ఎక్కించుకొని నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పాడు. ఈక్రమంలో లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఆలమట్టికి పోటెత్తిన వరద
రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఫలితంగా ఆలమట్టి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఉపనది మలప్రభ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదోళ్ తాలూకా ధవళేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజీని వరద జలాలు తాకుతూ ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాజాపూర్, హిప్పరిగి జలాశయాల నుంచి వరద నీరు అలమట్టికి చేరుతున్నాయి. దీంతో 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గుర్జాపూర వంతెన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. యాదగిరి జిల్లాలో భారీ వర్షాలు యాదగిరి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శహపుర తాలూకా యడళ్లిలో ఇళ్లలోకి నీరు చేరి వస్తు సామగ్రి, ధాన్యం తడిసి ప్రజలు నిరాశ్రయులయ్యారు. యాదగిరిలోని విద్యాభారతి పాఠశాల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది. వరదతో కృష్ణా నది పోటెత్తుతుండటందతో ప్రజలు నీటి వనరుల వద్దకు వెళ్లరాదని అధికారి నితీష్ ఆదేశాలు జారీ చేశారు. -
గుండెపోటుతో యువతి మృతి
యశవంతపుర: కరోనా వైరస్ ఉత్పన్నమయ్యాక యువతీ యువకులు కూడా గుండెపోటుతో బలవుతున్నారు. ఇదే మాదిరిగా హాసన్ జిల్లా కెలవత్తి గ్రామంలో కవన కె.వి (21) గుండెపోటుతో చనిపోయింది. ఆమె హాసన్ పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. వార్షిక పరీక్షలు జరుగుతుండగా మూడు పరీక్షలను రాసింది. మరో మూడు రాయవలసి ఉంది. బుధవారం సాయంత్రం పరీక్ష రాసి ఇంటికి వెళ్లింది. దాహంగా ఉంది, నీళ్లివ్వాలని తల్లిని అడిగింది. ఆమె ఫిల్టర్ వద్దకెళ్లి నీటిని తీసుకువచ్చేలోపు కవన కుప్పకూలి పడిపోయింది. తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిల్లాలోనే వారం రోజుల కింద సంధ్య అనే విద్యార్థిని కూడా గుండెపోటుతో మరణించింది. -
నకిలీ ఐఎస్ఐ ఫ్లైవుడ్ స్వాధీనం
హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా కార్వారలోని ఒక దుకాణంలో నకిలీ ఐఎస్ఐ మార్కుతో మేరిన్ ఫ్లైవుడ్ విక్రయిస్తుండగా అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఫ్లైవుడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులు ధ్రువీకరించుకోవాలని, ఆల్మార్కింగ్ ఉన్నవాటినే వినియోగదారులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు అరికట్టండి రాయచూరు రూరల్: యువతలో నేర ప్రవృత్తికి కారణమైన గంజాయి విక్రయాలను అరికట్టాలని, జిల్లాలో జరుగుతున్న హత్యలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక రాష్ట్ర ది లేజండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రశీద్ డిమాండ్ చేశారు. గురువారం ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ఆయన ధర్నా చేశారు. నగరంలో గంజాయి, హఫీం వంటి విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని సేవించి యువత నేరాలకు పాల్పడుతోందన్నారు. దీనికితోడు జిల్లాలో హత్యల సంస్కృతి పెరుగుతోందన్నారు. రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటల్స్ బంద్ చేయాలన్నారు. అనంతరం ఆబ్కారీశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఫుట్పాత్ల్లో ఆక్రమణలు తొలగించుకోండి రాయచూరురూరల్: నగరంలో ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లపై దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు డీఎస్పీ శాంతవీర్ సూచించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం నుంచి జైల్ రోడ్, ఏక్మీనార్, సూపర్ మార్కెట్, తీన్కందిల్, షరాఫ్ బజార్, మహవీర్ సర్కిల్ వరకు పర్యటించారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించారు. పాదచారులకు ఇబ్బందిగా ఉందని, వెంటనే దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు సూచించారు. లేని పక్షంలో తామే ఆక్రమణలు తొలగించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ట్రాఫిక్ ఎస్ఐ సణ్ణ వీరణ్ణ పాల్గొన్నారు. రైల్వే ట్రాక్పై తనిఖీలు హుబ్లీ: భారీ వర్షాలు నేపథ్యంలో నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్మాతూర్ గురువారం అటవీ ప్రాంతాలలోని రైల్వే ట్రాక్ను పరిశీలించి అవసరమైన సూచలను అందజేశారు. హుబ్లీ–కోలం విభాగంలో విండో ట్రయల్ ద్వారా ఈపరిశీల చేశారు. క్యాతల్రాక్, కోలం తదితర అటవీ ప్రాంతంలో పట్టాలు, వంతెనల స్థితిగతులపై ఆరా తీశారు. ట్రాక్ రిలేయింగ్ టైన్ యంత్రం వినియోగించి అమర్చిన ఇటీవల ఆధునీకరించిన ట్రాక్ స్లీపర్లను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఎస్ఓ ట్రాక్ డైరెక్టర్ బీపీ సింగ్,హుబ్లీ డీఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు హుబ్లీ: జిల్లాలో ఉన్న కబేళాలకు మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకొని 40 ఆవులను రక్షించారు. ఈఘటన కలఘటగి పట్టణంలో జరిగింది. ఏపీఎంసీ ఆవరణంలో పాడుబడిన రెండు గోదాములలో ఈ పశువులను నిర్బంధించారు. వీటిని బుధవారం రాత్రి వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా స్థానిక యువకులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీశైల కౌజలగి తన సిబ్బందితో చేరుకుని దాదాపు రూ.6 లక్షల విలువైన గోవులను రక్షించారు. -
తగ్గని కమల్ సెగలు
శివాజీనగర: కన్నడ భాష పుట్టుక గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి నేతలు సమావేశమయ్యారు. నిర్మాత సా.రా గోవిందు మాట్లాడుతూ, కమల్ హాసన్పై మాకెవరికీ కనికరం లేదు. శుక్రవారంలోగా కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే.. కన్నడనాట ఆయన సినిమాలను విడుదల చేయనివ్వం అని హెచ్చరించారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ కన్నడ సంఘలు కమల్ సినిమాను బ్యాన్ చేయాలని పట్టుబట్టారు. కాబట్టి కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్హాసన్ చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆగని నిరసనలు రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సినిమా పంపిణీదారులు కమలాకర్ నేతృత్వంలో మరో భేటీ జరిగింది. ఈ సమయంలోనే కొన్ని కన్నడ సంఘాల కార్యకర్తలు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పాలని కన్నడ సంఘాల పట్టు -
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేశారు. సీఎం మాట్లాడుతూ భారతీయ సైనికుల శక్తిని కొనియాడారు. దుష్టుల సహారానికి ప్రతి ఒక భారతీయుల కట్టుబడి ఉన్నారని అన్నారు. సైనికులు, రైతులు, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిరస్మరణీయులని తెలిపారు. రిటైర్డ్ సైనికుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని తెలిపారు. -
కమల్.. గోల్మాల్
శివాజీనగర: ప్రముఖ బహుభాషా సినీనటుడు కమల్హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడం తమిళం నుంచి పుట్టింది అని ఆయన చెప్పడం మీద కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందా? కమల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ కొద్దివారాల్లో విడుదల కానుంది, మంగళవారం చైన్నెలో జరిగిన సినిమా ప్రి– రిలీజ్ వేడుకలో కమల్ మాట్లాడుతూ, కన్నడం.. తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కూడా ఉన్నారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్ ప్రసంగాన్ని ఉయిరే, ఉరవే తమిళే.. అంటే నా జీవితం, నా బంధం అన్నీ తమిళమే అనే మాటలతో ప్రారంభించారు. వేదికపై ఉన్న కన్నడ నటుడు శివ రాజ్కుమార్ను చూస్తూ, ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివ రాజ్కుమార్) ఇక్కడికి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టారు. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అని అన్నారు. సంస్కృతి తెలియని వ్యక్తి: సీఎం సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కన్నడ భాష సంస్కృతికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, పాపం కమల్కు ఆ విషయం తెలియదేమో అని హేళన చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కమల్ను సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కమల్హాసన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన భాషా చరిత్రలో నిపుణుడు కూడా కాదని విమర్శించారు. నిరసనలు కన్నడ భాషా అభిమాన సంఘాలు కమల్పై మండిపడ్డాయి. బెంగళూరులో కమల్హాసన్ పోస్టర్లను చించి, దిష్టిబొమ్మను తగులబెట్టారు. కన్నడను చిన్నచూపు చూడటం తగదని హెచ్చరించాయి. కన్నడ భాషను తక్కువ చేసేలా మాటలు సీఎం, నేతలు సహా ప్రజల మండిపాటు -
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పోలీసులు భారీ ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని స్వాధీనపరచుకుని ఆఫ్రికన్ని అరెస్టు చేశారు. వివరాలు.. నైజీరియాకు చెందిన పేపె మోరె పేయి(43) అనే డ్రగ్స్ నేరగాన్ని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 3 కేజీల డ్రగ్స్, గంజాయిని జప్తు చేశారు. అమృతహళ్లి లో ఎండీఎంఏ క్రిస్టల్, గంజాయిని నిందితుడు విక్రయించేవాడు. రెండేళ్ల కిందట వ్యాపార వీసాతో ఇండియాకు వచ్చిన పేపె.. హెబ్బాళలోని టాటానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ వ్యాపారిగా మారాడు. కమ్మనహళ్లి లో మరో విదేశీ వ్యక్తి నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి వస్త్ర వ్యాపారం పేరుతో నగరంలో సంచరిస్తూ విక్రయించేవాడు. డ్రగ్స్, ఓ స్కూటర్, మొబైళ్లు, కొంత నగదును సీజ్ చేశారు. కావేరి నదిలో మెడికో గల్లంతు ● ముగ్గురు క్షేమం మైసూరు: కావేరి నదిలో స్నానానికి దిగి ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు యువకులు ప్రాణాలతో బయట పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని శివనసముద్ర దర్గా వెనుక భాగంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని దయానంద సాగర్ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు శివనసముద్ర వద్ద ప్రవహించే కావేరీ నది సందర్శనకు వచ్చారు. అక్కడ నది అందాలను చూసి పులకించిపోయారు. వీరిలో నందకుమార్, ప్రఫుల్, తుషార్, ప్రమోద్ అనే నలుగురు స్నానం చేయాలని నదిలోకి దిగారు. అయితే ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండగా నందకుమార్ నీటిలో కొట్టుకునిపోయాడు. మిగతా ముగ్గురిని స్థానికులు, కొళ్లెగాల అగ్నిమాపక కేంద్రం అధికారి అరుణ్కుమార్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. జై కనక దుర్గా మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు సమీపంలో వెలసిన దుర్గాదేవి దేవాలయంలో బుదవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని విశేషంగా పూలతో అలంకరించారు. అభిషేకంతో పాటు వేదమంత్ర పారాయణం నిర్వహించారు. హంసల మధ్యన కూర్చున్న భంగిమలో అమ్మవారిని పుష్పాలతో అలంకరించడం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజల కోసం పనిచేయండి ● ఉప లోకాయుక్త వీరప్ప మండ్య: సామాన్య ప్రజల కోసం మంచి పనులు చేసేవారికి అవసరమైతే కాళ్లు కూడా మొక్కుతానని, కానీ అవినీతికి పాల్పడేవారికి ఉరి శిక్ష పడేలా చేస్తానని ఉపలోకాయుక్త బీ.వీరప్ప హెచ్చరించారు. బుధవారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన ప్రసంగిస్తూ కష్టపడి సంపాదించింది కొంత సొమ్మే అయినా సంతోషాన్ని ఇస్తుందని, అవినీతికి పాల్పడి ఎంత డబ్బు ఆర్జించినా మనశ్శాంతిని ఇవ్వదని అన్నారు. అధికారులు కానీ, ఎవరైనా కానీ ప్రజలకు మంచిచేస్తే పాదాభివందనాలు చేస్తానని, తప్పుడు పనులు చేస్తే మాత్రం ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పారు. అవినీతి అనేది సామాన్యమైన రోగం కాదని, ఇది క్యాన్సర్ కంటే చాలా పెద్ద వ్యాధి అని అన్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నయం కాదని అన్నారు. -
ఇద్దరిని బలిగొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. జిల్లాలోని తిపటూరు తాలూకా మత్తిహళ్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఢీకొని అయ్యనబావి నివాసులు ఉమేష్ (32), రజనీకాంత్ (33) మరణించారు. మత్తిహళ్లి గ్రామంలో కూలిపనులు చేసుకుని స్వగ్రామానికి వాపసు వస్తున్నారు. ఆ సమయంలో తిపటూరు వైపు నుంచి కుందాపుర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వారిని నేరుగా ఢీకొనింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడే కన్నుమూశారు. బస్సు డ్రైవర్పై హొన్నవళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనాస్థలిలో కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వరద ప్రాంతాల్లో సమీక్ష ● మంత్రులకు సీఎం ఆదేశం శివాజీనగర: రాష్ట్రంలో వర్షంతో హానికి గురైన ప్రాంతాలకు తక్షణమే వెళ్లి సమీక్ష చేయాలని సీఎం సిద్దరామయ్య, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, కార్యదర్శులకు ఆదేశించారు. ఈ నెల 30, 31న అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీ సీఈఓ తదితరులతో వర్ష హాని గురించి సమావేశం అవుతానని తెలిపారు. వరద నష్టాల గురించి బుధవారం సీఎం సమీక్ష చేశారు. వరద బాధిత జిల్లాల్లో ప్రమాదాలు జరగకుండా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. 170 తాలూకాలకు హాని రాష్ట్రంలో 170 తాలూకాలు వరద బీభత్సానికి గురైనట్లు సర్కారు తెలిపింది. బెంగళూరు పాలికె పరిధిలో 201 స్థలాలు వరదలకు గురయ్యాయి. మే 26 వరకు వర్షంతో రాష్ట్రంలో 45 ఇళ్లు కూలిపోగా, 1385 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం వాయిదా! శివాజీనగర: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బెంగళూరు మెట్రోలో ఎల్లో లైన్లో సంచారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. సిగ్నలింగ్లో సమస్య వచ్చినట్లు బీఎంఆర్సీఎల్ తెలిపింది. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు సంచరించే ఎల్లో మార్గంలో మెట్రో రైలు సర్వీసులు జూన్ నుంచి మొదలవుతాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ సిగ్నలింగ్లో సమస్య రాగా దీనిని సరిచేసేందుకు నెల రోజులు కావాల్సి ఉంది. అందుచేత జూన్లో ఆరంభం అనుమానమేనని తెలిసింది. ఈ మార్గంలో రైలు పరీక్షలు పూర్తయ్యాయి, రైల్వే మండలి ఆమోదం తెలిపింది. ఫైనల్ దశ పరిశీలన కోసం త్వరలోనే మెట్రో రైలు సురక్షతా కమిషనర్ రావాల్సి ఉంది. ఇంతలో సిగ్నలింగ్లో సాంకేతిక లోపం బయటపడింది. సిగ్నలింగ్ కాంట్రాక్ట్ను చేపట్టిన సీమెన్స్ నిపుణులు ఇటీవల సిగ్నలింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ డేటా సెట్లలో లోపం కనిపించింది. పొగాకు ఉత్పత్తులపై వేటు యశవంతపుర: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ–సిగరెట్, వేపింగ్ సాధనాలను, హుక్కాను నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపారు. మాల్లు, కాఫీ బార్లు తదితరాలలో నిత్యం తనీఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. పొగాకు ఉత్పత్తుల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలన్నారు. ప్రజలలో కూడా జాగృతి తీసుకురావాలన్నారు. 2024–25లో బెంగళూరు నగరంలో సిగరెట్లతో పాటు పొగాకు కేంద్రాలపై 57,130 కేసులను నమోదు చేసి రూ.80.8 లక్షలు జరిమానాలు విధించినట్లు తెలిపారు. విశ్వ ధూమపాన దినం సందర్భంగా ఈ నెల 27వ నుంచి జూన్ 2 వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఏకధాటి వాన.. చామంతికి వేదన
చిక్కబళ్లాపురం: గత 10 రోజుల నుంచి కురుస్తున్న జడి వానలకు చామంతి పూల తోటలు పాడవుతున్నాయి. చెట్లు కుళ్లిపోవడంతో రైతులకు భారీ నష్టం వస్తోంది. తాలూకాలోని బన్నికుప్పె, నంది దిబ్బూరు, కత్తిరగుప్ప, గుండ్లగుర్కి, రాంపుర ఇతర గ్రామాలలో చామంతి పూల తోటలు ఎక్కువగా ఉన్నాయి. పూలను బెంగళూరుకు తరలించి అమ్ముతారు. గతేడాది ఇదే నెలలో 1 కేజీ పూలు రూ.300 పలికేవి. అన్ని రకాలుగా నష్టమే ఇప్పుడు అధిక వర్షాల వల్ల గిరాకీ తగ్గింది, పైగా తోటలు తడిసిపోయి చెట్లు కుళ్లిపోతున్నాయని శ్రీనాథ్ అనే రైతు తెలిపాడు. రెండు ఎకరాల పంటకు రూ.4 లక్షలు ఖర్చుచేశానని, అప్పులు చేసి పంట పెట్టానని తెలిపారు. వర్షపు నీరు పీల్చుకొని పూలు చెడిపోతాయి, మార్కెట్లో విలువ ఉండదని విచారం వ్యక్తంచేశాడు. చేతికి వచ్చిన చామంతి పూల చెట్లను పీకేస్తున్నారు. మామూలుగా నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన తుపానులు మేలో వచ్చి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు. కుళ్లిపోతున్న చెట్లు, పువ్వులు రైతులకు తీవ్ర నష్టం -
హెచ్ఏఎల్ను తరలిస్తే సహించేది లేదు
శివాజీనగర: బెంగళూరులోని హెచ్ఏఎల్ని తరలిస్తారా.. అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరులోని హెచ్ఏఎల్ను ఏపీలో విస్తరించాలని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్రానికి చంద్రబాబు వినతి నేపథ్యంలో హెచ్ఏఎల్ ఉత్పత్తి యూనిట్లు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. హెచ్ఏఎల్కు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని అందించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. కర్ణాటకలో బెంగళూరు, తుమకూరులో హెచ్ఏఎల్కు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాలు ఇందులో తయారవుతున్నాయి. నెహ్రూ స్థాపించిన సంస్థ: డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ హెచ్ఏఎల్ను బీజేపీ (మోదీ ప్రభుత్వం) ఏర్పాటు చేయలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బెంగళూరులో స్థాపించారు. కర్ణాటక హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకోవడానికి మేము దేనికై నా సిద్ధం అని అన్నారు. ఈ విషయంలో కర్ణాటక బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ మాట్లాడుతూ, హెచ్ఏఎల్ బెంగళూరులోని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చేసుకోనీ అన్నారు. ఐదోతరం అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానం (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ సహకారంతో నడుస్తోంది. ఈ తరుణంలో వివాదం రేకెత్తడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తేల్చిచెప్పిన సీఎం, డిప్యూటీ సీఎంలు సీఎం చంద్రబాబు ధోరణిపై ఆగ్రహంఅది సాధ్యం కాని పని: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఈ విషయమై మాట్లాడుతూ హెచ్ఏఎల్ తరలింపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కర్ణాటకలో హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాకు తెలిసినంతవరకూ ఇది సాధ్యపడదు, హెచ్ఏఎల్ తరలింపు జరగదు అని సిద్దరామయ్య పేర్కొన్నారు. -
కిల్లర్ చిరుత కోసం గాలింపు
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగపుర హాడి సొళ్లెపుర అటవీ ప్రాంతంలో సోమవారం మేకలు మేపుతున్న హరీష్ అనే యువకున్ని ఓ చిరుత హతమార్చింది. దానిని పట్టుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు. పెంపుడు ఏనుగులతో గాలింపు సాగిస్తున్నారు. నాగరహొళె విభాగంలోని 30 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. హుణసూరు వలయంలోని హనగోడు కురుబర హొసహళ్లి గ్రామానికి చెందిన హరీష్ (24) తండ్రి కృష్ణతో కలిసి అటవీ శాఖ స్థలంలో మేకలు మేపుతుండగా, చిరుత వచ్చింది. దానిని తరిమేందుకు ప్రయత్నించగా అది హరీష్ మీద పడి తీవ్రంగా కొరికింది. తీవ్రంగా గాయపడిన హరీష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. హరీష్కు మూడు నెలల క్రితమే పెళ్లయింది. రూ.20 లక్షల పరిహారం మృతుడు హరీష్ కుటుంబానికి అటవీ శాఖ రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. హరీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడికక్కడే రూ.5 లక్షల చెక్ను అందజేశారు. మిగతా రూ.15 లక్షల పరిహారధనం చెక్ను త్వరలో అందజేస్తామని డీసీఎఫ్ సీమా తెలిపారు. డ్రోన్, ఏనుగులతో.. చిరుత ఆచూకీ కోసం ఒక పెద్ద బోను, నాలుగు చిన్న బోనులు, 15 కెమెరా ట్రాప్లు అమర్చారు. ఒక డ్రోన్ ద్వారా ఆకాశం నుంచి తనిఖీ చేస్తున్నారు. 2 కుంకీ ఏనుగులు కూడా పాల్గొంటున్నాయి. చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. నవ వివాహితున్ని బలిగొన్న మృగం -
సెంట్రల్ జైలులో నిందితుల రాద్ధాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని జైళ్లలో పేరుగాంచిన, బ్రిటిష్ హయాంలో నిర్మించిన అప్పటి సెంట్రల్ జైలులో నిందితుల గొడవలు, రాద్ధాంతాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో పాటు, అందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో నిందితులు లేనిపోని సాకులు చూపుతూ జైలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. శివమొగ్గలో ఇటీవల జరిగిన భజరంగదళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులను బళ్లారి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే వీరి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ జైలు సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జైలులోని నిందితుల ఆగడాలు, కిరికిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలు ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోక తికమక పడుతున్నారు. రోజూ ఏదో సాకుతో గొడవ ఈ కేసులో నిందితులు జిలాన్, సయ్యద్ నిహాల్ అనే ఇద్దరు జైలులో రోజుకు ఒకటి చొప్పున సమస్యను సాకుగా చూపుతూ జైలు సిబ్బందిని వేధిస్తున్నారు. ఇటీవల ఈ వివాదం పతాక స్థాయికి చేరడంతో సిబ్బంది, నిందితుల మధ్య వాగ్వాదం జరిగిన కీలక వీడియో దృశ్యాలు వైరల్ కావడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హర్ష హత్య కేసులో నిందితుడైన జిలాన్ను ఇంతకు ముందు కలబుర్గి జైలులో ఉంచారు. అయితే కలబుర్గి జైలులో వసతులు సరిగా లేవని, అతడు ధార్వాడ జైలుకు మార్చుకున్నారు. అక్కడ కూడా వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేసి, మరొక చోటకు తరలించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే జిలాన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. జిలాన్కు బళ్లారి జైలు వసతులు మింగుడు పడటం లేదు. ఈ కేసులో మరో నిందితుడు సయ్యద్ నిహాల్ను జిలాన్ కన్నా ముందే బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అధికారులు, సిబ్బందికి దినదిన గండం మొత్తం మీద ఈ ఇద్దరు నిందితులు ఒకచోట చేరడంతో మొత్తం సీన్ మారింది. జైలు అధికారులు, సిబ్బంది రోజుకు గండంలా తయారైంది. తమను ప్రత్యేకంగా ఉంచరాదని, అందరితో పాటు ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య ఖైదీలుగా ఉండేందుకు తమను వదలాలని, లేదా వేరే జైలుకు మార్చాలని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు, అది కూడా న్యాయవాది ద్వారాా చెప్పించేవారు. జైలు పాలనా నియమాలు వీటిని అంగీకరించకపోవడంతో ఉన్నఫళంగా వారికి వారే గొడవ పెట్టుకుని రాద్ధాంతం సృష్టించారని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఇద్దరు ఏదో విషయమై రాద్ధాంతం సృష్టించినట్లు తెలియడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. గొడవల నేపథ్యంలో ఇద్దరిపీ వేర్వేరు సెల్లో ఉంచామని జైలు అధికారులు తెలిపారు. కాగా శివమొగ్గ హర్ష, దక్షిణ కన్నడ ప్రవీణ్ నెట్టార్ హత్య కేసుల్లోని నిందితులు కూడా బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నారు. వీరందరినీ సాధారణ ఖైదీలుగా ఉంచామని జైలు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అధికారులకు తలనొప్పిగా మారిన వైనం -
ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే కారణమని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ జాబితాలో కొరమ, కొరచ, బోవిలను తొలగించాలన్నారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలు వదులుతున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ ఆది కర్ణాటక అని, మాదిగ అని ఎక్కడా ప్రస్తావన చేయలేదన్నారు. నాడు అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బేడ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదని కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఖర్గే, ఆంజనేయ అంబేడ్కర్ వ్యతిరేక వాదులు ఎస్సీ జాబితా నుంచి కొరమ, కొరచ, బోవి కులాలను తొలగించాలి అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణం అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర -
ఔషధ దుకాణాల్లో మత్తు పదార్థాలు అమ్మొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయించరాదని, మత్తు పదార్థాల నియంత్రణకు సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో మందుల దుకాణాల వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదన్నారు. రోగులకు ఔషధాలు ఇచ్చే ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. -
బడి.. అసౌకర్యాల ఒడి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించి అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు పలు రకాల పథకాలను రూపొందించి అమలు జరుపుతోంది. ప్రత్యేకంగా ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించి పాఠశాల స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ కమిటీలతో విద్యా రంగంలో మార్పులు వస్తాయని ఆశించారు. కేవలం పదవులకు మాత్రమే కమిటీలని, ఆశించిన మేర ప్రోత్సాహం కనుమరుగు కావడంతో పేరుకు మాత్రమే కమిటీలున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని పాతబడిన రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం మరమ్మతులకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు మాత్రం అలాగే మిగిలాయి. పాఠశాలల్లో కనీస వసతులు కరువు కళ్యాణ కర్ణాటకలోని ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్ స్థాయిలో పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. ప్రతి పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్వహణలో అధికారులు పట్టించుకోవడం లేదు. భవనాలకు తక్కువ మోతాదులో నిధుల విడుదలతో పనులు జరగకుండా పోతున్నాయి. పాఠశాలలో తాగునీటి ఎద్దడి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, రక్షణ గోడలు, కిటికీలు, తలుపులు లేకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజలు చెత్తాచెదారం వేసి పరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. పాఠశాల పక్కనే మురుగు గుంటలున్నాయి. దుర్వాసన వెదజల్లుతుంటే విద్యార్థులు విద్యనభ్యశించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటిస్తే పందులు, పశువులు స్వైర విహారంతో పాటు మరుగుదొడ్డిగా, రాత్రి వేళ బిచ్చగాళ్లకు నిలయంగా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అంద్రూన్ కిల్లా పాఠశాల భవనం మాత్ర ం శిథిలావస్థకు చేరింది. కల్యాణ కర్ణాటకలో పాఠశాలలు అధ్వానం అరకొర సౌకర్యాలతో చదువులు సాగేదెలా? పట్టించుకోని పాలకులు, విద్యా శాఖ అధికారులు నేటి నుంచి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడుల ప్రారంభం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా అభివృద్ధి ప్రభుత్వం డీపీఈపీ, ఓబీబీ, సాక్షరత, బాల కార్మిక, ఇతర పథకాల పేరుతో రూ.కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా విద్యా శాఖ నిర్వీర్యమైంది. విద్యార్థులకు చెట్ల కింద, దేవాలయాల్లో పాఠాలు బోధించే స్థితి నెలకొంది. ఈ నెల 29 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో 250, కొప్పళ జిల్లాలో 222, యాదగిరి జిల్లాలో 158, బీదర్ జిల్లాలో 211, విజయ నగర జిల్లాలో 96, కలబుర్గి జిల్లాలో 258 పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో శాసన సభ్యులు, మంత్రులు, లోక్సభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు మౌనం వహించారు. 4518 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించాలని చూస్తోంది. -
రోడ్డెక్కిన ఉపాఽధి కూలీలు
సాక్షి,బళ్లారి: రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలతో పనులు చేయించుకుని నెలల తరబడినా చేసిన పనికి సంబంధించిన కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీలు రోడ్డెక్కారు. బుధవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రతి రోజు ఉదయం సద్ది మూట కట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేసి వస్తున్నామన్నారు. కూలీ ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. ఐదు, పది రోజుల్లో డబ్బు జమయ్యేవి అనంతరం జరిగిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లాధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి గుర్రళ్లి రాజ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఐదు లేదా 10 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవన్నారు. అయితే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. కూలీలకు పనులు చేసిన తర్వాత డబ్బులు రాకపోతే వారు ఎలా జీవనం సాఽగించాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారికి జీతాలు రాకపోతే వెంటనే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని, అదే కూలీలకు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. కూలీల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. తక్షణం కూలి సొమ్ములు విడుదల చేయాలని కోరారు. ఆందోళనలో ఏఐకేకేఎంసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలల తరబడి అందని సొమ్ము జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా -
31న క్యాన్సర్ పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 31న ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు బెట్టదూరు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జయ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో కలబుర్గి హెచ్సీజీ క్యాన్సర్ కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. స్తన, గర్భకోశ, శ్వాసకోఽశ, థైరాయిడ్, రక్త, లుకేమియా వంటి వ్యాధులకు చికిత్స అందిస్తారన్నారు. అక్రమ రేషన్ బియ్యం పట్టివేతహొసపేటె: నగర శివార్లలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతో పాటు నిందితులను పట్టుకున్నారు. తాలూకా శివార్లలోని జంబునాథ ఆలయం మీదుగా జాతీయ రహదారి–67లో బళ్లారి నుంచి హుబ్లీ మార్గంలో వస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేసి, బియ్యాన్ని పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రూ.11.33 లక్షల విలువ చేసే బియ్యం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని జప్తు చేశారు. ఈ రెండింటి విలువ మొత్తం రూ.38.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా లారీ యజమాని ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు హొసపేటె రూరల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడపాలి సాక్షి,బళ్లారి: సింధనూరు నుంచి బెంగళూరుకు వయా కారటగి, గంగావతి, హుబ్లీ మీదుగా రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే సింధనూరు–హుబ్లీ–బెంగళూరు రైలు మార్గం మధ్య దూరం 681 కిలోమీటర్లు అవుతుందని రైల్వే క్రియాశీల సమితి నేత కేఎం మహేశ్వరయ్యస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గం మీదుగా ప్రయాణం వల్ల చాలా సమయం తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు టికెట్ ధర భారం అవుతుందని తెలిపారు. ఈ రైలు సర్వీసును బళ్లారి, గుంతకల్లు మీదుగా బెంగళూరుకు నడిపితే మధ్య దూరం 502 కిలోమీటర్లు అవుతుందన్నారు. దీని వల్ల ప్రయాణికులకు డబ్బులతో పాటు సమయం కలిసి వస్తుందన్నారు.హైదరాబాద్, చైన్నె, తిరుపతి,వెళ్లే ప్రయాణికులకు గుంతకల్లులో పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందువల్ల సింధనూరు, బెంగళూరు రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడిపేందుకు సంబంధిత రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యలను నియంత్రించండి రాయచూరు రూరల్: నగరంలో హత్యల నియంత్రణకు పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కర్ణాటక రాష్ట్ర ది లెజెండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రషీద్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలో గత ఏడాది నుంచి నగరంలో గంజాయి, హఫీం వంటివి అధికంగా విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. రహదారుల్లో ప్రతి నిత్యం యువకులు మద్యం తాగి కేరింతలు కొడుతూ ట్రాపిక్ జామ్ చేస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారన్నారు. నగరంలో రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటళ్లను బంద్ చేయడానికి పోలీసులు ముందుకు రావాలన్నారు. నగరంలో ఆరు మంది హత్యకు గురయ్యారన్నారు. భాషాభివృద్ధికి పాటు పడదాం సాక్షి,బళ్లారి: రక్షణ వేదిక కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్క కన్నడిగులు నేల, నీరు, సంస్కృతి సంపద్రాయాల విషయంలో అన్యాయం జరిగినప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని కరవే ప్రవీణ్శెట్టి వర్గం నేత హర్దగేరి రామణ్ణ సూచించారు. ఆయన బుధవారం కరవే ఆధ్వర్యంలో కనక దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా, వివిధ తాలూకాల పదాధికారులు నియామక ఆదేశ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ సంఖ్యలో వచ్చి వేదికలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అయితే పోరాటాలు చేస్తూ తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వచ్చినప్పుడు సంఘటితం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, తాము పోరాటాలకు ఎప్పుడూ సహకారం అందిస్తామన్నారు. కరవే ప్రముఖులు తిమ్మారెడ్డి, వీరారెడ్డి, ఉమేష్గౌడ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన విధాన పరిషత్ సభ్యుడు రవికుమార్పై చర్యలు తీసుకోవాలని తెహ్రిక్–ఏ–నిసా మైనార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రబియా ఖానం మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. బాధ్యుడైన ప్రజాప్రతినిధిపై చర్యలు చేపట్టాలని కోరుతూ పోలీస్ కమిషనర్ శరణప్ప ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల మూసివేత సరికాదు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం తాలూకాలోని విజయనగర క్యాంప్లో తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేతకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. కమల్ వ్యాఖ్యలపై కరవే ఆందోళన రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలను కరవే తీవ్రంగా ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతని చిత్రపటానికి పాదరక్షలతో దండించారు. అనంతరం చిత్రపటాన్ని తగలబెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్ హుబ్లీ: గబ్బూరు సమీపంలోని కుందగోళ క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బెండిగేరి పోలీసులు, సీసీబీ విభాగం సిబ్బంది సంయుక్తంగా కార్యాచరణ చేపట్టి అరెస్ట్ చేశారు. హావేరికి చెందిన మహమ్మద్ షాహిద్, రెహమాన్ బేగ్, నిసార్ అహమ్మద్ అరెస్ట్ అయిన నిందితులు. వీరి నుంచి రూ.12.64 లక్షలు విలువ చేసే 10.5 కేజీల గంజాయి, మూడు మొబైళ్లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పునర్వసతి కల్పించాలని డిమాండ్రాయచూరు రూరల్: హస్మియా కాలనీ వాసులకు పునర్వసతి కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం హస్మియా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ఉన్నఫళంగా వాహనాలతో వచ్చి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వకుండా తొలగించారని ఆరోపించారు. హస్మియా స్థలం వక్ఫ్ బోర్డుది కాదని, ప్రభుత్వ స్థలమని అన్నారు. తమకు ప్రత్యామ్నాయ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి హుబ్లీ: తాలూకాలోని సిరగుప్పి గ్రామం వద్ద హుబ్లీ–గదగ్ హైవే సమీపంలోని డాబా వద్ద టాటా ఏస్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఫలితంగా ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం ఉమచిగి గ్రామానికి చెందిన చంద్రయ్య హుబ్లీమఠ(70) రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతూ మృతి చెందారు. టాటాఏస్ వాహనం డ్రైవర్ సమీర్ ఉదగట్టి తన ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను కేఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సుల్లో దొంగతనాలు.. అత్తా కోడలు అరెస్టు
కెలమంగలం: బస్సులో ప్రయాణికుల వద్ద డబ్బులు దొంగలించుకెళ్లిన అత్తా, కోడలిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని జారకాలట్టి గ్రామానికి చెందిన మహిళ గత నెల 30వ తేదీన క్రిష్ణగిరిలో బంగారం కొనాలని రూ. లక్ష నగదుతో బస్సులో బయల్దేరింది. బస్సు దిగాక చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, బస్టాండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అలమేలు (45), కోడలు భువన (22)ను అరెస్టు చేశారు. విచారణ చేయగా తామే దొంగతనం చేశామని చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తూ డబ్బు, బంగారం కొట్టేస్తుంటామని తెలిపారు. వీరిపై కడలూరు, కల్లకురిచ్చి, పెరంబలూరు, సేలం, తంజావూరు, తిరుచ్చి, విళ్లుపురం పోలీస్ స్టేషన్లలో 11 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
జూన్ 6న మాదేవ చిత్రం విడుదల
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6న మాదేవ చిత్రం విడుదల కానుందని కన్నడ చలన చిత్ర నటుడు వినోద్ ప్రభాకర్ వెల్లడించారు. ఆయన మంగళవారం రాత్రి మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను దర్శనం చేసుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తనను కలసిన విలేఖర్లతో ఆయన మాట్లాడారు. తండ్రి బాటను అనుసరించి నటన చేయడం లేదన్నారు. మాదేవ చిత్రం విజయ వంతం కావాలని ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మైసూరు శాండల్ సోప్లకు రాయబారిగా తమన్నా భాటియాను నియమించడంపై మాట మార్చారు. నందిని పాల ఉత్పత్తులకు డాక్టర్ పునీత్ రాజ్కుమార్ను రాయబారిగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు అవకాశం లభిస్తే తాను కూడా రాయబారిగా పని చేస్తానన్నారు. -
మత్తు పదార్థాలను అరికడదాం
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచారాందోళనలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువకులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాల సేవనంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా కుంగిపోతారన్నారు. యువత గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్కరోజులోనే 9 కేసులను నమోదు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణాధికారి ఉదయ్ కిశోర్, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్లున్నారు. -
పేదలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వండి
రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల్లో నివసించే పేద ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలని మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల్లో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగర ప్రాధికార అధికారులు మౌనం వహించారన్నారు. నగర ప్రాంతంలో నివసించే వారి కోసం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. 2024లో 3.36 లక్షల మందిలో కేవలం 1.64 లక్షల మందికి హక్కు పత్రాలను అందించారన్నారు. కానీ వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడంలో ఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రభుత్వం మురికి వాడల ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలన్నారు.