ఎమ్మెల్యేల టూర్ వెనుక సీఎం సిద్దు
● సీఎంఓ ద్వారా త్వరగా
వీసాల కోసం లేఖ
● విహారయాత్రపై హైకమాండ్ ఆరా
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విదేశీ పర్యటన ప్రతిపాదన తీవ్ర చర్చకు కారణమైంది. దీనిపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. 30 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 15 లేదా 16న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విహారయాత్రకు బయల్దేరతారని ప్రచారం కావడం తెలిసిందే. సీఎం సీటు కోసం జరుగుతున్న యుద్ధంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. ఎమ్మెల్యేలకు ఓ వర్గం విదేశీ యాత్రను ఏర్పాటు చేసినట్లు, అది సీఎం సిద్దరామయ్యేనని గురువారం తేటతెల్లమైంది. టూర్పై డీకే అసంతృప్తితో ఉన్నారు.
నివేదిక ఇవ్వండి
ఈ నేపథ్యంలో ఏమిటీ యాత్ర అని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆరా తీశారని తెలిసింది. పశు సంవర్ధక శాఖ అధ్యయన పర్యటన పేరుతో కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్కు సిద్ధమయ్యారు. ఆ తరువాత ప్రైవేట్ పర్యటనగా మారిందని సమాచారం. ఈ టూర్ గురించి నివేదిక సమర్పించాలని కేపీసీసీ నేతలకు హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది. అధ్యయన పర్యటన అయితే ప్రభుత్వ అనుమతి ఉందా? అని అడిగినట్లు తెలిసింది.
సీఎంఓ హడావుడి
టూర్కి సాక్షాత్తు సీఎం ఆఫీసే ఎన్ఓసీ ఇచ్చేసిందని, అంతేకాకుండా ఆ రెండు దేశాల వీసాలను త్వరగా మంజూరు చేయాలని లేఖ కూడా పంపినట్లు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్యేల విహారయాత్ర కొత్త చర్చకు దారిచ్చింది. యాత్ర జరిగేనా, లేదా బ్రేక్ పడేనా అనేది ఉత్కంఠగా మారింది.
నాకు సంబంధం లేదన్న మంత్రి
బనశంకరి: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ పర్యటనతో తనకు సంబంధం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి కే.వెంకటేశ్ అన్నారు. తమ శాఖ నుంచి ఎలాంటి విహారయాత్ర ఏర్పాటు చేయలేదని అన్నారు. నగరంలో మాట్లాడుతూ ఈ మేరకు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ప్రాయోజకత్వంతో కొందరు ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యాత్రకు వెళ్తున్నారని వార్తలు రావడంతో మంత్రి వివరణ ఇచ్చారు.


