సాక్షి,బళ్లారి: సమాజ సేవలో పోలీసు వృత్తి ఎంతో కీలకంగా పని చేస్తుందని, ఎన్నో కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని పోలీసులు ప్రజల కోసం పని చేస్తారని రిటైర్డ్ పోలీసు అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన గురువారం పోలీసు ధ్వజారోహణ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని డీఏఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు సేవలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు, కఠిన కేసులు వచ్చినప్పుడు ఉన్నతాధికారుల మార్గదర్శకత, తోటి పోలీసులు ఇచ్చిన సహకారం వల్ల తన పోలీసు వృత్తి ఎంతో సంతృప్తిగా కొనసాగిందన్నారు. పదవీ విరమణ తర్వాత పోలీసులకు, పోలీసు అధికారులకు లభిస్తున్న సౌకర్యాలను మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు పోలీసు అధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ తమ సిబ్బంది, రిటైర్డ్ అధికారుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. విధుల్లో మరణించిన పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయన్నారు. డీఏఆర్ డీఎస్పీ తిప్పేస్వామి మాట్లాడుతూ 1965 ఏప్రిల్ 2న కర్ణాటక చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి ఈ రోజును పోలీసు ధ్వజ దినంగా జరుపుకుంటున్నామన్నారు. ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 27 మంది పోలీసులు, అధికారులు పదవీ విరమణ చేశారన్నారు. ఉత్తమ సేవలు అందించిన 160 మంది పోలీసులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. కార్యక్రమంలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పోలీస్ ధ్వజ దినోత్సవం
హొసపేటె: పోలీసు బలగాల ధైర్యం, త్యాగం, నమ్మకానికి ప్రతీక అని రిటైర్డ్ ఏఎస్పీ సలీమ్ పాషా తెలిపారు. గురువారం నగరంలోని జిల్లా పోలీస్ గ్రౌండ్లో జరిగిన పోలీస్ పతాక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. పని సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా, దానిని ఇంటికి తీసుకువెళ్లకూడదు. వారు తమ కుటుంబాల పై ఒత్తిడి పెట్టకుండా, సామాజికంగా ఆరోగ్యకరమైన రీతిలో తమ విధులను నిర్వర్తించాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లో అద్భుతమైన సేవలు అందించిన శ్రీహరిబాబు, సంతోష్ చౌహాన్, కోదండ పాణి అనే ముగ్గురు అధికారులకు ముఖ్యమంత్రి పతకాలు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందికి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో శాఖకు చెందిన ఆరు దళాలు ఆకర్షణీయమైన కవాతును నిర్వహించాయి. ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
విధి నిర్వహణలో సేవాభావం అవసరం
రాయచూరు రూరల్: పోలీసులు విధి నిర్వహణలో సేవా మనోభావాన్ని పెంపొందించుకోవాలని రిటైర్డ్ ఎస్ఐ బసవరాజ్ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ క్రీడా మైదానంలో పోలీస్ ధ్వజ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం సన్నగిల్లుతోందని విచారం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ కళ్యాణ నిధి నుంచి 2025–26లో 227 మందికి ఆరోగ్య భాగ్య పథకం కింద రూ.9 లక్షలు వ్యయం చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కుమారస్వామి, హరీష్, డీఎస్పీలు దత్తాత్రేయ కర్నాడ్, శాంతవీర, చంద్ర శేఖర్, సీఐలు ఉమేష్ కాంబ్లే, నాగరాజ్, సాబయ్య, నింగప్ప, ఎస్సైలు వైశాలి, లక్ష్మి బసవరాజ్, నారాయణ, లక్ష్మి, నరసమ్మలున్నారు.
సేవలో ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంతో సంతృత్తి
పోలీసు సేవలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి
పోలీసు ధ్వజదినోత్సవంలో రిటైర్డ్ అధికారి శ్రీనివాసులు


