వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో, అమెరికాలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.
వివరాల మేరకు.. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. తక్షణమే పదవీవిరమణ చేయాలని హెగ్సెత్ ర్యాండీకి తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే, అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గతేడాది యద్ధశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటినుంచి.. డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్ను, అడ్మిరల్స్ను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న జార్జ్ను తాజాగా తొలగించారు. ఇక, పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు.
జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ ఛైర్మన్గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా.. తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ను కోరారు.


