Donald Trump
-
అమెరికా అమిత్ర వైఖరి
ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది. మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు. తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపైలాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం. -
"మెలోని నాతో ఫోటో కోసం ప్రాధేయపడింది"
రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం "ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది.. తాజాగా దీనిపై మెలోని స్పందించారు.ఫ్రాన్స్ వేదికగా ఇటీవల జీ7 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాని అనంతరం ట్రంప్ ఒక టీవీ ఛానెల్కు ఇంటర్వ్యుూ ఇచ్చారు. అందులో తాను మాట్లాడుతూ "ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారు మెలోనికి తనతో ఫోటో దిగాలని ఎంతో బలంగా ఉందని ఆమెపై జాలిపడి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది. నేనేమీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పక్కన నిలబడి ఫోటో దిగాలని ఆమె నన్ను బతిమిలాడారు. నేను ఫోటో దిగేవాడిని కాదు, కానీ ఆమెను చూసి జాలి వేసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై మెలోని మండిపడింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆయన మాటలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఎంత మృదువుగా ఉంటారో, మిత్రదేశాల పట్ల కూడా అలా ఉంటే బాగుంటుంది. అయితే ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని మెలోని స్పష్టం చేశారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మెలోనిని ఉద్దేశించి ట్రంప్ అన్న అనుచిత మాటలు మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించడమేనని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు. జూన్ 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది.ఇటలీ మంత్రుల ఆగ్రహంప్రధానమంత్రి కార్యాలయ అండర్ సెక్రటరీ గియోవన్ బాటిస్టా ఫజ్జోలారి స్పందిస్తూ.. "ట్రంప్ కావాలనే చేస్తున్నారో లేదా చేతగాక చేస్తున్నారో తెలియదు కానీ, అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను నాశనం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల ద్వారా యూరప్ ఖండంలో అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు" అని విమర్శించారు.ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెలోని ఎవరినైనా ఫోటో కోసం బతిమిలాడుతుందంటే తాను నమ్మనని, బెదిరించినా ఆమె అలా చేయదు" అని అన్నారుద్వైపాక్షిక సంబంధాలపై ఎఫెక్ట్ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చినప్పుడు మెలోని అమెరికా-ఇటలీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, ఇటీవల పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ఘర్షణలను ఖండిస్తూ పోప్ లియో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడటాన్ని మెలోని ఈ ఏడాది విమర్శించారు. దానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు మెలోనిని ఉద్దేశించి ఆమెకు ధైర్యం లేదు అని ఘాటుగా విమర్శించారు. కాగా ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. -
ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ పర్వత రిసార్ట్లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.అదే సమయంలో లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్ను ఉద్దేశించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
తుది ఒప్పందం కుదరకుంటే పశ్చిమాసియా మళ్లీ రక్తసిక్తమే!
ఎవియన్–లెస్–బెయిన్స్/దుబాయ్/వాషింగ్టన్: ప్రపంచ దేశాలను అష్టకష్టాలకు గురిచేస్తున్న పశ్చిమాసియా యుద్ధం ముగిసిపోయింది. యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి.దీనికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్’అని పేరుపెట్టారు. నిజానికి ఇదొక మధ్యంతర ఒప్పందమే. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాల నిలిపివేతపై తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబోయే 60 రోజులపాటు చర్చలు జరుగుతాయి. తుది ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులు మళ్లీ ప్రారంభించే వెసులుబాటును ట్రంప్ తన గుప్పిట పెట్టుకున్నారు. ఇక స్వేచ్ఛగా చమురు విక్రయాలు షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉండగా, స్థానిక కాలమానం ప్రకారం బుధవారమే ఫ్రాన్స్లో ట్రంప్ సంతకాలు చేశారు. రాజధాని పారిస్లోని వెర్సెయిల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ఇచ్చిన విందు సందర్భంగా అవగాహనా ఒప్పందం భౌతిక ప్రతిపై(ఫిజికల్ కాపీ) ట్రంప్ లాంఛనంగా సంతకం చేశారు. అదే సమయంలో ఇరాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒప్పందం ప్రతిపై సంతకం పెట్టారు. రెండు సంతకాలతో కూడిన పత్రాన్ని పెజెష్కియాన్ ప్రదర్శిస్తున్న చిత్రాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది.ఒప్పందం పూర్తి వివరాలను అమెరికా, ఇరాన్లు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇరుదేశాలు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి. ఆ దేశంపై ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. ఇరాన్ తన ముడి చమురును తక్షణమే స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునరి్నర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్లను అమెరికా అందిస్తుంది. ఈ అగ్రిమెంట్ను జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్కు ఎక్కువ, అమెరికాకు తక్కువ లబ్ధి చేకూరేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే సంతకం పూర్తయ్యింది: ట్రంప్ ట్రంప్ సంతకం చేసిన వీడియోను వైట్హౌస్ సిబ్బంది ఆన్లైన్లో షేర్ చేశారు. ఇందులో ట్రంప్, మేక్రాన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఫిజికల్ కాపీపై సంతకం పూర్తయిన తర్వాత ట్రంప్ ఆ డాక్యుమెంట్ను, సంతకం చేయడానికి ఉపయోగించిన పెన్నును అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అందజేశారు. ఆ గదిలో ఉన్నవారంతా చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. సంతకం కంటే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘ఇది అంత సులభం కాదు’అని వ్యాఖ్యానించారు. సంతకం చేసిన తర్వాత వెర్సెయిల్స్లో విందు ముగించుకొని బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు.‘ఇరాన్తో కుదిరిన అవగాహనా ఒప్పందంపై ఇప్పుడే సంతకం పూర్తయ్యింది’అని చెప్పారు. ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత ఆదివారం డిజిటల్ విధానంలో సంతకాలు చేశారని అమెరికా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఒప్పందంపై సంతకం చేశారు. ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలతో కూడిన ఒప్పంద పత్రాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, డిజిటల్ సంతకంతో కూడిన ఒప్పందం, భౌతిక సంతకంతో కూడిన ఒప్పందం మధ్య వ్యత్యాసం ఏమిటన్న దానిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అధికారిక హామీదారుగా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేసిన తర్వాత.. యుద్ధాన్ని ముగించే ఈ అవగాహనా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రెండు దేశాల మధ్య ఇన్నాళ్లూ ఆయన మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’గా ఆయన అభివరి్ణంచారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించినందుకు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీలను షరీఫ్ ప్రశంసించారు. హార్మూజ్ జలసంధి వెంటనే తిరిగి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవుపై దిగ్బంధనాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని ప్రకటించారు.ఒప్పందం విషయంలో తమకు సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్ వంటి పశ్చిమాసియా దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘దౌత్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న దృఢమైన నిబద్ధత, శాంతియుత పరిష్కారానికి ఆయన చూపిన చొరవ పశ్చిమాసియాలో వినాశకరమైన పరిణామాలకు అడ్డుకట్ట వేశాయి’’అని ఉద్ఘాటించారు.అమెరికా, ఇరాన్ల అత్యున్నత దౌత్య బృందం కృషి వల్లే ఒప్పందం సాకారమైందని కొనియాడారు. ఈ అవగాహన ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి, శ్రేయస్సుకు శాశ్వత పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’పై షెహబాజ్ షరీఫ్ కీలక మధ్యవర్తిగా గురువారం సంతకం చేశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అధికారికంగా హామీదారుగా షరీఫ్ సంతకం చేసినట్లు సమాచారం. స్విట్జర్లాండ్ సమావేశం యథాతథం! స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ నెల 19న ఒప్పందంపై సంతకాలు చేయడానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. అయితే, షెడ్యూల్ కంటే ముందే సంతకాల కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ స్విట్జర్లాండ్ సమావేశం శుక్రవారం యథాతథంగా జరుగుతుందని సమాచారం. అమెరికా, ఇరాన్లతోపాటు పశ్చిమాసియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అవగాహనా ఒప్పందం అమలుతోపాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఎవరికెంత లాభం? అవగాహనా ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో ఎవరికెంత లాభం అనే చర్చ మొదలైంది. హార్మూజ్ జలసంధి దాదాపు తెరుచుకున్నట్లే. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించబోతున్నాయి. తక్షణ లాభం మాత్రం ఇరాన్కే అని చెప్పొచ్చు. ఆ దేశం తమ చమురును ప్రపంచ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విక్రయించుకోనుంది. భారీగా ఆదాయం గడించనుంది. ఆంక్షలు లేవు కాబట్టి బహిరంగంగానే వ్యాపారం చేసుకోవచ్చు. కొత్త మార్కెట్లకు చమురును సరఫరా చేయొచ్చు. ధరలు కూడా పెంచే వీలుంది.మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఎంతోకొంత లబ్ధి పొందబోతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో ఎలాంటి సుంకాలు లేకుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి. దాంతో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఉండవు. అయితే, ఎనిమిది ఏళ్ల క్రితం తాను రద్దు చేసిన 2015 నాటి అణు ఒప్పందం కంటే మెరుగైన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ సాధించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఇరాన్ను కట్టడి చేయగలరా? అనే అనుమానాలున్నాయి. ఇరాన్పై యుద్ధంతో ట్రంప్ కొత్తగా సాధించింది ఏమిటో చెప్పాలని అమెరికన్లు ప్రశి్నస్తుండడం గమనార్హం. హార్మూజ్లో మళ్లీ నౌకల సందడిప్రారంభమైన రాకపోకలు న్యూయార్క్: అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ నౌకల సందడి మొదలైంది. ప్రధాన షిప్పింగ్ కంపెనీలు హార్మూజ్ గుండా తమ నౌకలను తరలించడం ప్రారంభించాయని సముద్రయాన డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జలసంధిలో చిక్కుకుపోయిన ప్రముఖ కంపెనీల నౌకలు.. 110 రోజుల తర్వాత మొదటిసారిగా అక్కడి నుంచి ప్రయాణం ఆరంభించాయని లాయిడ్స్ లిస్ట్ ప్రధాన సంపాదకుడు రిచర్డ్ మీడ్ చెప్పారు.పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. గురువారం ఆంక్షలు తొలగిపోయాయి. ప్రధాన షిప్పింగ్ కంపెనీలైన గ్రిమాల్డి గ్రూప్, కోస్కో, నట్సెన్, ఎన్వైకే నియంత్రణలో ఉన్న ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్ జెండా కలిగిన, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ యాజమాన్యంలోని రెండు ముడి చమురు ట్యాంకర్లు జలసంధిలోకి ప్రవేశించాయి. అయితే, హార్మూజ్పై ఇరాన్ అమర్చిన జల మందుపాతరలను ఇంకా వెలికితీయలేదు. దాదాపు 80 మందుపాతరలను వెలికి తీయాల్సి ఉందని చెబుతున్నారు. హార్మూజ్ గుండా మరింత చమురు: వాన్స్ ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తేశామని జేడీ వాన్స్ గురువారం చెప్పారు. పదుల సంఖ్యలో నౌకలు ఇరాన్ ఓడరేవులకు చేరుకోవడానికి తమ సైన్యం అనుమతించిందని అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా ఇప్పుడు మరింత చమురు ప్రవహిస్తోందని చెప్పారు.దక్షిణ లెబనాన్లోనే ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుజెరూసలేం: లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ఆలోచన లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో ఉన్న తమ సైన్యం ఇకపైనా అక్కడే ఉంటుందని గురువారం ప్రకటించారు. అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకం చేసిన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు.సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం తిష్టవేసింది. దక్షిణ లెబనాన్లో ఒక సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలని, ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అది అవసరమైనంత కాలం అక్కడి నుంచి సైన్యం వైదొలగకూడదని నెతన్యాహు అన్నారు. లెబనాన్లో సైతం దాడులు ఆపాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. అందుకు సిద్ధంగా లేమని నెతన్యాహు సంకేతాలిస్తున్నారు. -
ఎట్టకేలకు శాంతి దిశగా...
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్ సంతకం చేసి ఆన్లైన్లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్లో ఇజ్రాయెల్ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. ఇజ్రాయెల్తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్ మూతతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్ను ఇరాన్ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్ వెలుపలనున్న ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్ గౌరవిస్తారని ఆశించాలి. -
దిగ్బంధం ఎత్తివేత.. హర్మూజ్లో ఊపందుకున్న చమురు రవాణా
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. దీంతో హర్మూజ్లో చమురు రవాణా ఊపందుకుంది. 60 రోజుల చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎలక్ట్రానిక్ విధానంలో యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై తనకు మొదట భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఇరాన్ హక్కులు మరియు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రయోజనాలను కాపాడుతామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్లు ఖమేనీ పేర్కొన్నారు.ఓ పక్క అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు అమల్లోకి వస్తుండగా.. ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్పై సైనిక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో ముగ్గురు హెజ్బోల్లా సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిని పక్కన పెడితే హెజ్బోల్లా నేత నైమ్ ఖాస్సెమ్ అమెరికా–ఇరాన్ ఒప్పందాన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. -
శాంతి ఒప్పందం వెనుక ట్రంప్ మాస్టర్ ప్లాన్
-
బీబీకి దొరికిన ‘బెస్ట్ డీల్’ ఇదేనా!?
ఇజ్రాయెల్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ఇరాన్తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్లోని ఓ హోటల్లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్ జోలికొస్తే ఖబర్దార్.. ట్రంప్ బిగ్ వార్నింగ్
వాషింగ్టన్: ఫ్రాన్స్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా భారత్పై దాడి చేయడానికి సాహసిస్తే తాము వెంటనే రంగలోకి దిగి వారి అంతు చూస్తామని ట్రంప్ హెచ్చరించారు. భారత్కు అండగా ఉంటామని కీలక హామీ ప్రకటించారు. మోదీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. భారత్తో తమకు అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ నాకు గొప్ప మిత్రుడు. మా మధ్య ఇంతకంటే సన్నిహిత సంబంధం ఉండడం అసాధ్యం. మోదీ ఉన్నంతకాలం భారత్కు నా మద్దతు ఉంటుంది. మోదీ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే ఆప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంత కాలం భారత్ అద్భుతంగా రాణిస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా భావిస్తున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యల్లో మోదీ వ్యక్తిగత నాయకత్వంపై ప్రత్యేక ప్రశంసలు కనిపించడం విశేషంగా మారింది.ఇక, అంతకుముందు.. భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిషి, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’ అని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది’ అని అన్నారు. -
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది: ఇరాన్
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. డీల్కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. దీంతో యుద్ధం అధికారికంగా ముగిసినట్లైంది. అయితే ఈ ఎంవోయూపై ఇప్పుడు ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. జీ7 సదస్సు అనంతరం పారిస్లోని వెర్సైల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన ట్రంప్ ఒప్పంద పత్రంపై(MoU) సంతకం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇటు ఇరాన్ కూడా డీల్ను కన్ఫర్మ్ చేసింది. తమ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకం చేసినట్లు వెల్లడించింది. అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని టెహ్రాన్ అంటోంది.ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ Esmaeil Baqaei మాట్లాడుతూ.. "ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై ఇరు దేశాధినేతల సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం అమలును పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది."అమెరికా సంయుక్త రాష్ట్రాలు – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం" పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇందులో పేర్కొన్నారు.ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అదే సమయంలో యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు వైదొలగాలని కూడా ఇందులో పేర్కొన్నారు.మరోవైపు, వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.సంతకాలు పూర్తవడంతో ఇకపై 60 రోజులపాటు అమెరికా–ఇరాన్ ప్రతినిధులు తుది ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా–ఇరాన్ ఎంవోయూలో కీలక అంశాలులెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి కాల్పుల విరమణ60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలుపరస్పర అంగీకారంతో గడువు పొడిగింపునకు అవకాశం30 రోజుల్లో ఇరాన్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపుయుద్ధానికి ముందు స్థాయిలో నౌకల రాకపోకల పునరుద్ధరణతుది ఒప్పందం తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఉచిత, సురక్షిత రాకపోకలకు ఇరాన్ హామీహర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి రుసుములు లేకుండా ఏర్పాట్లుఅణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారంఐఏఈఏ పర్యవేక్షణలో యురేనియం(శుద్ధి చేసిన) నిర్వహణకు ఒప్పుకోలుఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి కనీసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుఆ నిధిలో అమెరికాతో పాటు ప్రాంతీయ భాగస్వామ్య దేశాల భాగస్వామ్యంఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అంగీకారంఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తుది ఒప్పందంలో ఖరారుఅయితే.. అధికారిక సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ.. ఫిజికల్ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరగబోయే ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొంటుండగా.. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టెహ్రాన్ చెప్పినట్లే, ఒప్పందం కుదరడం ఒక దశ అయితే, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే అసలు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ట్రంప్ సంతకం.. డీల్లో మ్యాటర్ ఏంటంటే.. -
ఇరాన్తో యుద్ధానికి ముగింపు.. ఒప్పంద పత్రంపై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన అవగాహన ఒప్పందం (MoU)పై బుధవారం సంతకం చేశారు. ఈ విషయాన్ని వైట్హౌస్కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఈ ఒప్పంద పత్రంలో 14 కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది.వీటిలో కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఒప్పందంలోని 14 అంశాలు (అంచనా):1. తక్షణ కాల్పుల విరమణఇరాన్, అమెరికా అనుబంధ బలగాలు పాల్గొంటున్న అన్ని యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలి. లెబనాన్లోని ఘర్షణలు కూడా ఇందులో భాగం.2. పరస్పర సార్వభౌమాధికారానికి గౌరవంఇరు దేశాలు ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి.3. 60 రోజుల్లో తుది ఒప్పందంగరిష్టంగా 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించవచ్చు.4. హర్మూజ్ జలసంధిపై ఆంక్షల ఎత్తివేతఅమెరికా 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ నిర్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తుంది. తుది ఒప్పందం తర్వాత ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కూడా ఉంటుంది.5. ఉచిత నౌకా రవాణాఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి రుసుము లేకుండా భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది.6. 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా సహకరిస్తుంది. అయితే నేరుగా అమెరికా నిధులు ఇవ్వబోదని అధికారులు స్పష్టం చేశారు.7. ఆంక్షల ఎత్తివేతతుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్పై ఉన్న అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.8. అణ్వాయుధాలకు నోఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని మరోసారి హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో తొలగించేందుకు అంగీకరించింది.9. ప్రస్తుత పరిస్థితుల కొనసాగింపుతుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా సైనిక మోహరింపుల విషయంలో కొత్త మార్పులు ఉండవు.10. ఇరాన్ చమురు ఎగుమతులకు అనుమతిఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మినహాయింపులు ఇస్తుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలపైనా సడలింపులు ఉంటాయి.11. స్తంభింపజేసిన నిధుల విడుదలఒప్పందం విజయవంతంగా అమలైతే ఇరాన్కు చెందిన కొన్ని విదేశీ ఆస్తులు, నిధులను విడుదల చేస్తారు.12. పర్యవేక్షణ వ్యవస్థఒప్పంద అమలు, భవిష్యత్ నిబంధనల పాటింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.13. తుది ఒప్పందంపై చర్చలుMoUపై సంతకం అనంతరం శాశ్వత ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.14. ఐరాస భద్రతా మండలి ముద్రతుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం తీసుకుని, బైండింగ్ తీర్మానం రూపంలో అమలు చేస్తారు.ఈ ఒప్పందం అమలైతే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం సాధారణ స్థితికి రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. -
కమాండ్ నుంచి ఇండో తొలగింపు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యూఎస్ ఇండో–పసిఫిక్ కమాండ్ పేరును యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. 1947లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ స్థాపించిన ఈ కమాండ్కు సంబంధించిన లోతైన చారిత్రక మూలాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా పసిఫిక్ కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ‘‘వాస్తవానికి 1947 జనవరి 1న అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ ఈ కమాండ్ను స్థాపించారు.70 ఏళ్లకు పైగా యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరుతో పనిచేసింది. యునైటెడ్ స్టేట్స్ ఏకీకృత పోరాట కమాండ్లలో పురాతనమైనదిగా, అతిపెద్దదిగా ఘనత సాధించింది’’అని రక్షణ శాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. పేరు మారినప్పటికీ ఈ కమాండ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది. కమాండ్ ప్రాథమిక లక్ష్యంలో, ప్రాంతీయ మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి స్వేచ్ఛాయుత పరిస్థితులను కొనసాగించాలన్న నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘యూఎస్ పసిఫిక్ కమాండ్ తిరిగి వచి్చంది’’అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 2018లో యూఎస్ ఇండో–ఫసిఫిక్ కమాండ్గా మార్చారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి, ఈ కమాండ్ పేరును ఇండో–పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు 2018లో అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ వెల్లడించారు.ఈ కమాండ్ పరిధి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, పెంగి్వన్ల నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల వరకు విస్తరించి ఉందని చమత్కరించారు. అమెరికా జాతీయ రక్షణ వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరును పునరుద్ధరించడం గమనార్హం. ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ సమావేశం అవుతున్న సమయంలోనే కమాండ్ నుంచి ఇండియా పేరును హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ట్రంప్? ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్పు వెనుక అమెరికా వ్యూహం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలన్న తమ ప్రణాళికలను అమెరికా విరమించుకుంటోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా విషయంలో అమెరికా వైఖరిలో ఇటీవల మార్పు వస్తోంది. బలమైన చైనా బారి నుంచి తైవాన్ను రక్షించలేమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపుగా ఆయన చేతులెత్తేశారు. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘క్వాడ్’కూటమిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ విషయానికొస్తే ఈ పరిణామం పేరు మార్పునకు సంబంధించిన విషయం కంటే కూడా మారుతున్న అమెరికా ప్రాధాన్యతల గురించి తెలియజేసే అంశంగా భావించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ రక్షణ వ్యూహాన్ని ఈ ఏడాది జనవరి 23న బహిర్గతం చేశారు. ‘‘ఉమ్మడి రక్షణ భారాన్ని మిత్రదేశాలు కూడా పంచుకోవాలి. భాగస్వామ్య దేశాల భద్రతకు దశాబ్దాలుగా మోస్తున్న ఆర్థిక భారాన్ని ఇకపై మోయలేం’’అని ఇందులో స్పష్టం చేశారు.ఈ పరిణామాలను గమనిస్తే అమెరికా దృష్టిలో ఇండియాలో స్థానంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో పాకిస్తాన్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ట్రంప్ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ట్రంప్ పరోక్షంగా ఆమోదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. ‘‘క్వాడ్ పతనానికి ఇది మరో అడుగు లాంటిదా?’’అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పాకిస్తాన్లో అంతర్భాగం పీఓకే పసిఫిక్ కమాండ్ మ్యాప్పై వివాదం యూఎస్ పసిఫిక్ కమాండ్ వెబ్సైట్లోని ‘బాధ్యతాయుత ప్రాంతం’మ్యాప్ భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తుండడం రాజకీయంగా వివాదాస్పదంగా మా రింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), అక్సాయ్ చిన్లు భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్లుగా ఈ మ్యాప్ను రూపొందించారు. పీఓకేను పాకిస్తాన్లో అంతర్భాగంగా చిత్రీకరించారు. తప్పులతడక మ్యాప్ ఉన్న వెబ్సైట్లో సంబంధిత వెబ్ పేజీని చివరిసారిగా మార్చి నెలలో అప్డేట్ చేశారన్న సమాచారం కనిపిస్తోంది. 1947లో జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనం కావడం అనేది సంపూర్ణమైన, చట్టబద్ధమైన, తిరుగులేని ప్రక్రియ అని భారత్ చెబుతోంది.జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు. భారత్కు, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అలవాటు నరేంద్ర మోదీ గారి మిత్రులకు ఉందని విమర్శించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి దేశాన్ని ఇలాంటి ప్రతికూల స్నేహబంధాల్లోకి నెట్టినప్పుడు, ఏ దేశానికైనా శత్రువుల అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. -
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ఆగిపోతుందని, చమురు, గ్యాస్ ధరలు దిగొస్తాయని ఆశపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇరాన్తో కేవలం అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) మాత్రమే కుదిరిందని, అది తుది ఒప్పందం కాదని తేలి్చచెప్పారు. ఇరాన్ ఇకనుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. తద్వారా ఇరాన్ తమ దారికి రాకపోతే యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని సంకేతాలిచ్చారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు శుక్రవారమే సంతకాలు చేయబోతున్నారు. స్విట్జర్లాండ్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇంతలోనే ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చూస్తే ఆ ఒప్పందం అనుకున్నంత దృఢంగా లేదని స్పష్టమవుతోంది. ‘‘ఇరాన్తో కుదుర్చుకున్నది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే.ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయినా, మేము వెంటనే వారి తలలపైనే బాంబులు కురిపిస్తాం. మళ్లీ కాల్పులు ప్రారంభిస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వారు(ఇరాన్) దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ ఆక్షేపించారు. అవగాహనా ఒప్పందంలో ఏవైనా మార్పులు చేసినా లేదా దానిని పాటించడంలో విఫలమైనా తక్షణమే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను హెచ్చరించారు. ఇదీ ఒప్పందం ముసాయిదావాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను అమెరికా ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతంచేశారు. ఆ అధికారులు చెప్పిన ఆ అంశాలు.. 1. లెబనాన్, ఇరాన్, హార్మూజ్ జలసంధి సముద్రజలాలు సహా పశి్చమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణం నిలిపేస్తుంది 2. అమెరికా, ఇరాన్ను పరస్పరం ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలను గౌరవించుకుంటాయి 3. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ఫలవంతంగా ముగిస్తాయి 4. అవగాహన ఒప్పందంపై సంతకాలుచేశాక 30 రోజుల్లోపు హార్మూజ్ దిగ్బంధనాన్నిఅమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది 5. సంతకాలు పూర్తయ్యాక 60 రోజులపాటు సుంకాల్లేకుండా హార్మూజ్ గుండా నౌకల రాకపో కలకు ఇరాన్ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుంది 6. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి మిత్రదేశాలతో కలిసి అమెరికా 300 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తుంది 7. ఇరాన్పై ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్నిరకాల ఆంక్షలను ఎత్తేసేందుకు అమెరికా కృషిచేస్తుంది 8. అణ్వ్రస్తాలను ఇరాన్ తయారుచేయకూడదు, కొనుగోలుచేయకూడదు. ఇప్పటికే అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిరీ్వర్యంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి 9. అణుకార్యక్రమం ఇప్పుడు ఏ దశలోఉందో అదే యథాతథస్థితి కొనసాగించేందుకు ఇరాన్కు హక్కు ఉంటుంది. ఇరాన్పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించబోదు, బలగాలను దింపబోదు 10. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం వస్తూత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సాయపడుతుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా పరంగానూ సాయపడనుంది 11. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాక్కు చెందిన ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణకు అవకాశం 12. అవగాహన ఒప్పందం సవ్యంగా, సమర్థవంతంగా అమలయ్యేలా ఒక ప్రత్యేక కార్యనిర్వాహణ వ్యవస్థను కొలువుతీర్చి దానిని పర్యవేక్షించడం 13. సంతకాలు చేయగానే 1, 4, 5, 10, 11 పేరాల్లోని అంశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. అందుకే మిగతా పేరాల్లోని అంశాల మీదనే చర్చలు జరుగుతాయి. 14. ఐరాస భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి -
భారత నావికుల భద్రతే ముఖ్యం
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నా. – మోదీనా దృష్టిలో మోదీ చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉండగా ఎవరైనా భారత్పై దాడి చేయడానికి సాహసిస్తే వెంటనే వారి అంతు చూస్తాం. – ట్రంప్ఎవియన్–లెస్–బెయిన్స్: హార్మూజ్ జలసంధి సహా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో భారత నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. బుధవారం ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో భారత నావికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.వారికి భద్రత కల్పించే అంశాన్ని ఇరాన్తో ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో చేర్చాలని కోరారు. ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అమెరికా దుశ్చర్యను ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందితే మోదీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత నావికుల భద్రత గురించి ట్రంప్తో భేటీలో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్, అమెరికా సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే శాంతి ఒప్పందంలో భారత నావికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని స్పష్టంచేశారు. అక్కడ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత నౌకాయానికి అనుకూల పరిస్థితులు ఉండాలని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత తమ అత్యంత కీలకమని వివరించారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం విషయంలో సాధించిన పురోగతిని తాము సమీక్షించామని వెల్లడించారు. మోదీ చాలా కఠినమైన వ్యక్తి, కిల్లర్ భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిíÙ, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. అచ్చం దేవదూతలా కనిపిస్తారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివరి్ణంచారు. ‘‘మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి విషయంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. నేను వైట్హౌస్లో ఉన్నంత కాలం అమెరికాలో భారత్కు ఒక మంచి మిత్రుడు(ట్రంప్) ఉంటారు. ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన విషయం నాకు తెలిసింది. వారికి నా సంతాపం తెలియజేస్తున్నా.అది చాలా కఠినమైన వృత్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్తో మేము కలిసి పనిచేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మేము చాలా సమీపంలోకి వచ్చేశాం. ఉద్యోగాలు, ఉపాధి విషయంలోనూ రెండు దేశాలు చక్కగా సహకరించుకుంటున్నాయి’’అని ట్రంప్ వివరించారు. 2020లో భారత్లోని అహ్మదాబాద్లో తనకు లభించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారని, అది తనకు ‘గొప్ప సమయం’అని చెప్పారు.వచ్చే నెల అమల్లోకి ట్రేడ్ డీల్ మోదీ, స్టార్మర్ ప్రకటన ఎవియన్–లెస్–బెయిన్స్: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బుధవారం ప్రకటించారు. వారు ఫ్రాన్స్లో జీ7 భేటీ సందర్భంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఒప్పందం అమలుపై చర్చించారు. ఈ ట్రేడ్ డీల్ భారత్–యూకే సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని మోదీ అభివరి్ణంచారు. ఇది వచ్చే నెల 15న అమల్లోకి రానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఫ్రెడరిక్ మెర్జ్తో భేటీ ప్రధాని మోదీ జర్మన్ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, జర్మనీలు కేవలం వాణిజ్య రంగంలోనే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని మోదీ వివరించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఎఫ్టీఏపై సంతకాలు యూరోపియన్ యూనియన్ అగ్రనేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నాటికి భారత్, యూరోపియన్ యూనియన్లు ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై సంతకం చేయనున్నాయని లేయెన్ తెలిపారు. ఎల్లప్పుడూ శాంతి పక్షాన భారత్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. మానవతా విలువలకు భారత్ ప్రా ధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. తాము శాంతి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను తాము సమీక్షించామని పేర్కొన్నారు. -
పుతిన్, జిన్పింగ్కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తటస్థ వైఖరి అవలంబించారని, అందుకు తాను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా చేపట్టిన చర్యలకు బీజింగ్, మాస్కో అడ్డంకులు సృష్టించలేదని పేర్కొన్నారు. అవసరమైతే వారు పరిస్థితిని మరింత క్లిష్టం చేయగలిగేవారు. కానీ అలా చేయలేదు. అందుకే వారికి ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి జిన్పింగ్ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తాడు.ఓ పక్క చైనా, రష్యా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్, తమ మిత్రదేశాలైన జపాన్, కొన్ని యూరోపియన్ దేశాలు హోర్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో తగిన సహకారం అందించలేదని విమర్శించారు.ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా చైనా, రష్యాలపై తరచూ విమర్శలు గుప్పించే ట్రంప్, ఈసారి వారిని బహిరంగంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. -
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ
పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు, వాణిజ్యం, ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఈ భేటీ జరుగుతోంది. జీ7 సదస్సు-2026 ఫ్రాన్స్లోని ఎవియన్ స్పా పట్టణంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మోదీ, ట్రంప్ సమావేశయ్యారు. నౌకా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రపంచ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగడం, నౌకా సిబ్బంది భద్రతకు భరోసా ఉండడం అత్యంత ముఖ్యమని ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది భారతీయ నౌకా సిబ్బంది సముద్ర వాణిజ్యంలో పనిచేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ నిరంతరంగా సాగేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య నౌకా సిబ్బంది సంక్షేమం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని మోదీ అన్నారు. ఇరాన్కు సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. నౌకా కార్మికుల భద్రతతో పాటు ప్రపంచ నౌకాయాన మార్గాల నిర్వహణకు తగిన రక్షణ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వం అద్భుతం“నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగినంత కాలం భారత్ ఎంతో బాగా పురోగమిస్తుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని “దేవదూత”గా ట్రంప్ అభివర్ణించారు. ‘‘ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. బేరసారాల్లో మోదీన నిక్కచ్చిగా ఉంటారు. భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికా భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. భారత్కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. తాను 8 యుద్ధాలకు ఆపానంటూ మరోసారి చెప్పారు. ఇరాన్ 48 ఏళ్లుగా ప్రపంచాన్ని ఉపయోగించుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, జీ7 సదస్సులో యూకే, అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల నాయకులు పాల్గొని ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణ, ఇతర కీలక అంశాలపై చర్చించారు. జీ7 దేశాలతో పాటు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ప్రతినిధులకు కూడా ఈ కీలక సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనను జీ7 దేశాలు స్వాగతించాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
లేట్ గా వచ్చిన లేటెస్ట్గా.. నేనే బాస్.. G7లో ట్రంప్
పారిస్ : ఫ్రాన్స్లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. ఆయన ప్రవేశిస్తుండగా సభికులు లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో నేనే ఇక్కడ బాస్ అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.అనంతరం ఆయన జీ7 ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు."మనం నిజంగా అంతర్జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఈ సంక్షోభాల భారాన్ని అత్యంత బలహీన దేశాలు ఒంటరిగా మోయకూడదు. నేడు అనేక సమాజాలు వృద్ధాప్యం వైపు పయనిస్తుండగా, భారతదేశం మరియు గ్లోబల్ సౌత్లోని ఇతర దేశాలు యువ ప్రతిభ, నైపుణ్యాలతో ఉప్పొంగుతున్నాయి.అని భారత్ను ప్రశంసిస్తూ మాట్లాడారు.అంతకుముందు సమావేశంలో మాట్లాడిన భారత ప్రధాని 'పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ సౌత్పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మోదీ అన్నారు. కాగా జీ 7 దేశాలలో భారత్ సభ్య దేశంగా లేదు. అయినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనడానికి మోదీ ఫ్రాన్స్ వెళ్లారు.కాగా ఈ రోజు సాయంత్రం ట్రంప్తో, మోదీ భేటి జరగనుంది. వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలపై ఈ ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. వీరు చివరిసారిగా 16 నెలల క్రితం, 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్లో సమావేశమయ్యారు. -
ఇరాన్పై బాంబులు వేస్తా : ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపుకు శ్రీకారం చుడుతూ.. ఈనెల 19న అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మరో రెండు రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని, ఆ ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులు వేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. వంద రోజులకు పైగా యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో అమెరికా-ఇరాన్ల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మధ్యవర్తులుగా పాకిస్థాన్, ఖతర్ వ్యవహరిస్తున్నాయి. రెండు రోజులలోనే ఒప్పందంపై సంతకాలు జరగనున్న తరుణంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఒప్పందం కుదిరిన వెంటనే హర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందానికి అణు ఆయుధాలే సాక్షాలు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు ప్రోగ్రామ్ నిలిపివేయాలని, యురేనియం నిల్వలను తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటూ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేయాలి. లేదంటే ఆ దేశంపై బాంబులు వేయిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. ‘ఎంఓయూ కేవలం ప్రారంభం మాత్రమే. అణు ప్రోగ్రామ్పై భవిష్యత్ చర్చలు కొనసాగుతాయి అని అన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే యుద్ధం నిలిచిపోతుందని, హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు ఇరాన్-ఒమాన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆయన తెలిపారు.ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా లెబనాన్తో సహా అన్ని ఫ్రంట్లలో యుద్ధం తక్షణమే నిలుస్తుందని, నావికాదళ ఆంక్షలు తొలగించబడతాయని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి కీలకమని, ఒప్పందం తర్వాత చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధంలో ధ్వంసమైన గ్యాస్, ఆయిల్ ఫీల్డ్స్ పునరుద్ధరణకు నెలలు పట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదని, భారతీయులు కూడా దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తరఫున ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జీ7 సదస్సు వేదికగా ప్రపంచ నేతల దృష్టికి తీసుకెళ్లారు.ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం స్వాగతార్హమని అన్నారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు.“భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.మోదీ వ్యాఖ్యల వెనుక కారణం ఇదేకొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురును తరలిస్తున్నారనే అనుమానంతో ఆ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.ఇది ఒక్కటే కాదు. మారివెక్స్, జల్వీర్ అనే మరో రెండు నౌకలపైనా అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండటం భారత్ ఆందోళనకు కారణమైంది.అమెరికా చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరంఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన (డిమార్ష్) అందజేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “సెట్టెబెల్లోపై దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేశాం. భారతీయ నావికుల ప్రాణ భద్రతపై మా ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశాం” అని వెల్లడించారు.ప్రపంచానికి భారత్ సందేశంజీ7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణనష్టంపై ఆవేదన మాత్రమే కాదు. హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.17 నెలల తర్వాత.. ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో టారిఫ్ వార్, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఫోన్తో పాటు సోషల్ మీడియాలో ట్వీట్లతో సంభాషించుకున్నారు. జీ7 సదస్సులో భాగంగా.. బుధవారం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. -
నావికులకు భద్రత కల్పించాలి!
ఎవియన్–లెస్–బెయిన్స్: సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికులకు తగిన భద్రత కచ్చితంగా కల్పించాలన్నారు. మంగళవారం ఫ్రాన్స్లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. నౌకల్లో విధులు నిర్వర్తించే నావికుల భద్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఒమన్ తీరంపై వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా దుశ్చర్యను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి కలిగిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంఘర్షణలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘర్షణలకు శాశ్వత పరిష్కార మార్గాలను చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే కనుగొనాలని చెప్పారు. ప్రపంచం ‘దాత–గ్రహీత’ అనే విధానం నుంచి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు పయనించాలని మోదీ చెప్పారు. పరస్పర అనుసంధానం వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ‘విశ్వాసం’అత్యంత కీలకమని స్పష్టంచేశారు. ‘ఒకరు దాత, మరొకరు గ్రహీత’ అనే విధానాన్ని వదులుకోవాలని, మనమంతా సమాన భాగస్వాములుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నడవడమే కాకుండా.. కలిసి నడవాలన్నారు. భాగస్వామ్యాలు గౌరవంతో ముడిపడి ఉండాలి తప్ప పరా«దీనతతో కాదని తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి: ట్రంప్ మూడున్నర నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇకపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ అంశం కంటే ఇరాన్ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇరాన్ వ్యవహారం ఇక వెనక్కి వెళ్లిపోయినట్లేనని ట్రంప్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడానికి తాను చేయల్సిందంతా చేస్తానని వెల్లడించారు. జీ7 సదస్సులో ట్రంప్తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొన్నారు. ఉదయం వర్కింగ్ సెషన్ 75 నిమిషాల్లోనే ముగిసింది. రష్యా చమురు, సహజ వాయువు రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల ద్వారా ఆ దేశంపై ఒత్తిడిని పెంచడానికి ట్రంప్తో సహా జీ7 దేశాల నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ సదస్సులో ఉక్రెయిన్ అంశంపై చాలా ఫలవంతమైన సంభాషణ జరిగిందని ఓ దౌత్యవేత్త చెప్పారు. అదనపు వైమానిక రక్షణ సామర్థ్యాలు, ఇతర రక్షణలు సమకూర్చడం ద్వారా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడంపైనా నాయకులు అంగీకారానికి వచ్చారని తెలిపారు. కెనడా ప్రధానితో మోదీ భేటీ ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఆవిష్కరణలు, విద్య, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఫ్రాన్స్లో జీ7 సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. హలో మై ఫ్రెండ్ జీ7 సదస్సు వేదిక వద్ద మోదీ, ట్రంప్ ఆత్మీయ సంభాషణ 16 నెలల తర్వాత ముఖాముఖి నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం ఎవియన్–లెస్–బెయిన్స్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నారు. ఫ్రాన్స్లోని ఎవియన్–లెస్–బెయిన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మంగళవారం వారిద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, ఆ తర్వాత కాసేపు సంభాషించారు. క్లుప్తంగా చర్చించుకున్నారు. వారు సంభాషణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇరువురు నేతల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరుగుతాయి. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ, భారత్–అమెరికా సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్లో పర్యటించారు. అప్పట్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఫోన్లో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖి కలుసుకొని చర్చించుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు టారిఫ్ల యుద్ధం సాగింది. చమురు కొనుగోలు విషయంలోనూ భారత్పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. భారత్, అమెరికా మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానం, హెచ్–1బీ వీసా రుసుమును పెంచడం వంటి నిర్ణయాలు భారత్–అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచాయి. -
ఆగిన యుద్ధం ఆగినట్టేనా?
ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.కుదిరినట్టేనా ‘అవగాహన’?ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్పై దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్ చేసిన ప్రకట నను ఇరాన్ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్ పునర్ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.ఇరాన్ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్పై కాదని వివరించబూనారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్లతో పాటు లెబనాన్ తదితర అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆగుతుందా?నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. ఏం సాధించినట్టు?ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్ సాధించిందేమిటి? ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్ వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జీ 7 సదస్సులో మోదీ, ట్రంప్ షేక్హ్యాండ్.. ఇద్దరి భేటీకి డేట్ ఫిక్స్
పారిస్: ఫ్రాన్స్లోని ఎవియన్లో జరుగుతున్న జీ 7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గత 16 నెలల తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలుసుకున్న తొలి సందర్భం ఇదే.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు మాక్రోన్ సమావేశ వేదిక వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా, బుధవారం (జూన్ 17)న మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు. జీ7 సదస్సుకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. అమెరికా కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందంపై నేతల మధ్య బహిరంగంగా, స్పష్టమైన చర్చలు జరిగినట్లు సోర్సెస్ తెలిపాయి. ట్రంప్, ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా సమావేశం కానున్నారు.ఇరాన్తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందే చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఆ ఒప్పందాన్ని పరిశీలన కోసం అమెరికా కాంగ్రెస్కు పంపుతానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and other G7 world leaders stand together for a group photo at the G7 Summit, in Evian, France.(Video: DD News) pic.twitter.com/MI5YiAys44— ANI (@ANI) June 16, 2026 -
ఇజ్రాయెల్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించిన ఘనత తనదేనంటూ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మనుగడ, భద్రత.. అమెరికా మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించడంలో తన సొంత విధానాలే నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. తాను చేసిన పనులను చేయడానికి మరే ఇతర అధ్యక్షుడూ సిద్ధంగా లేరన్నారు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బలంగా ఉన్నాయని వివరిస్తూనే.. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్.. లెబనాన్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రముఖ నిపుణులకు నిలయంగా ఉన్న లెబనాన్.. కాలక్రమేణా తీవ్రంగా క్షీణించిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.లెబనాన్, హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై తాను సంతృప్తిగా లేనన్నారు. ఈ ఘర్షణ చాలా కాలంగా సాగుతోందని.. ఇది ఇరాన్తో ఇటీవలే కుదిరిన ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇజ్రాయెల్కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి. శుక్రవారం లోపు హర్మూజ్ పూర్తి ఓపెన్ అవుతుంది. ఇకపై హర్మూజ్లో టోల్ ఫీజు ఉండదన్న ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్నారు.కాగా, దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి.ఈ నేపథ్యంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని.. అయితే, అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని.. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ లక్ష్యమంటూ మరోసారి తేల్చి చెప్పారు. -
ట్రంప్ బిగ్ గేమ్! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది. టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్రైజింగ్, అలాగే పాక్స్టన్పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసిందిరిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.ట్రంప్కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే.. 👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్గా మారింది. -
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్తో డీల్పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చినందుకు ఇరాన్పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)ను ప్రస్తావించారు.కాగా, ట్రంప్ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇటీవల హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.దీనిపై స్పందించిన ట్రంప్, ఫెడరల్ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు. -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. -
హర్మూజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్కు ససేమీరా చెబుతూ.. లెబనాన్పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్తో మాకు అనవసరం’
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఫిఫా ప్రపంచకప్కు కూడా పాకిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి, జట్టు అధికారుల్లో కొందరికీ ఎంట్రీ నిరాకరించడం, ఇరాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను అమెరికా రద్దు చేయడం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు తరలించుకోవడం చూసి అసలు ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ వాటన్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండడం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్కు ఆతిథ్యం ఇవ్వనుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరాన్ ఫుట్బాల్ కోచ్ అమీర్ ఘలేనోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము ఇక్కడికి మ్యాచ్లు ఆడేందుకు వచ్చాం. మా చుట్టూ జరుగుతున్న హడావిడి, ఇతర విషయాల గురించి పట్టించుకోము. ట్రంప్తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్రపంచకప్పైనే ఉంది. సహజంగానే ప్రతీ జట్టుకు వారి దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. అంతేకాదు అవి ఆటకు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ నెలకొని ఉండొచ్చు. కానీ అవి ఆటతో ముడిపెట్టలేం. మేము రాజకీయ వ్యక్తులం కాదు.. ఫుట్బాల్ ఆటగాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్ ఎన్నడూ నాకౌట్ రౌండ్కు చేరలేదు. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్కు న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అమెరికా తమపై దాడులు చేస్తున్న కారణంగా తొలుత ఫిఫా ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశానికి వస్తే ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని రెండు దేశాలు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛగా మ్యాచ్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పించనుంది.ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. చదవండి: ‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఇకపై దాడులొద్దు
జెరూసలేం: ఇకపై ఎలాంటి దాడులు చేసుకున్నా సహించేది లేదని ఇజ్రాయెల్, ఇరాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా దాడులపై ఆయన ఆదివారం స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో దాడులు, ప్రతిదాడులకు దిగితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని, శాంతి యత్నాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేశారు.అందుకే సంయమనం పాటించాలని ఇజ్రాయెల్, ఇరాన్లకు తేల్చిచెప్పారు. ఇలాంటి ఉద్రిక్తతల వల్ల శాంతి ఒప్పందంపై సంతకాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. బీరూట్పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో పలువురు మరణించారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా మూడు మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతీకార దాడులు తప్పవని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి సాధనే లక్ష్యంగా ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చామని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ ఎలాంటి దాడులు చేసుకోవద్దని స్పష్టంచేశారు. ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తి! శాంతి ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒప్పందంలోని అంశాలు ఆయనకు తీవ్ర నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా బీరూట్పై దాడికి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటెంట్లు దాడికి దిగారని, అందుకే ప్రతిస్పందనగానే తాము బీరూట్పై దాడులు చేసినట్లు నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.ఇజ్రాయెల్ దుశ్చర్యపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించాలన్న సంకల్పం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు లేదన్నారు. హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది. ఆయుధాలు, ఆర్థిక సాయం అందజేస్తోంది. అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలన్న అంశాన్ని కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. -
పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్..?
-
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
ట్రంప్నకు షాకిచ్చిన నెతన్యాహు
జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గిందంటూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు ఆర్థిక ఉపశమనం కల్పించే ఒప్పందం కుదిరితే, ఆ దేశం తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళన..ఇజ్రాయెల్ భద్రతా వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఆంక్షల సడలింపుతో ఇరాన్కు భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఆ నిధులను ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి, అలాగే ప్రాంతంలోని తన మిత్ర వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని అన్సర్ అల్లాహ్ వంటి ఇరాన్ అనుకూల శక్తులకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. ఇదే సమయంలో ఇరాన్కు అమెరికా లొంగిపోయిదంటూ ఇజ్రాయెల్ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.చర్చలే ముఖ్యం.. ఇక అమెరికా మాత్రం దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించవచ్చని నమ్ముతోంది. యుద్ధం లేదా ప్రత్యక్ష ఘర్షణల కంటే చర్చల ద్వారా అణు విస్తరణను అడ్డుకోవడం అంతర్జాతీయ భద్రతకు మేలు చేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధికి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయకుండా నిరోధించడం, అంతర్జాతీయ తనిఖీలను పునరుద్ధరించడం చర్చల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ హామీలతో సంతృప్తి చెందడం లేదు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదని, కేవలం ఆలస్యమైందే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అందువల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కఠినమైన ఒప్పందం తప్ప మరో మార్గం లేదని భావిస్తోంది.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా మరియు ఇరాక్లో ఇరాన్ అనుకూల బలగాల కార్యకలాపాలు, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల దాడులు వంటి పరిణామాలు ఇప్పటికే ప్రాంతీయ భద్రతా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం కుదిరితే అది మొత్తం మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా లెక్కలు వేరుఅమెరికా మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అనేక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్తో ప్రత్యక్ష సైనిక సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. అందుకే దౌత్య చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, పరిమితం చేయడం యుద్ధం కంటే మెరుగైన మార్గమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ తనిఖీల ద్వారా ఇరాన్ కార్యకలాపాలపై నిఘా కొనసాగించవచ్చని వారి అభిప్రాయం.ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావంఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ శక్తి సమతుల్యత మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని భావిస్తే అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్
-
17న ట్రంప్, మోదీ భేటీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్హౌస్ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.టారిఫ్ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదేపదే ప్రకటించగా, భారత్ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్పోర్ట్కు చేరకున్న మోదీని ఫ్రాన్స్ విద్యా మంత్రి ఎడోగార్డ్ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్తోపాటు ఎవియాన్, పారిస్లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ను ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. -
యూఎస్ అటార్నీగా జేమ్స్ మెక్డొనాల్డ్!: ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనలో, న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా జేమ్స్ ఎం. మెక్డొనాల్డ్ను నియమించాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పదవి అమెరికా న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనది, ముఖ్యంగా ఆర్థిక నేరాలు, అవినీతి కేసులు, ఫెడరల్ స్థాయి క్రిమినల్ కేసులను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.జేమ్స్ మెక్డొనాల్డ్ ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది. ఈయన గతంలో అదే న్యూయార్క్ దక్షిణ జిల్లాలో అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పనిచేశారు. అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా కూడా సేవలందించారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సల్లివన్ & క్రోమ్వెల్ న్యాయ సంస్థలో సీనియర్ పార్ట్నర్గా పనిచేస్తున్నారు.వర్జీనియా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా, హార్వర్డ్ కాలేజీలలో చదువుకున్న మెక్డొనాల్డ్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ జి. రాబర్ట్స్, జూనియర్ వద్ద లా క్లర్క్గా కూడా పనిచేశారు. కాబట్టి దేశానికి శక్తివంతమైన ఫలితాలు అందించగల సామర్థ్యం ఆయనకు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. -
ఇరాన్తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరికీ తెరుస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు.ఇరాన్ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్పెట్టారు. ‘‘బరాన్ హుస్సేన్ ఒబామా ఇరాన్తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.ఇరాన్ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్ విమానాలతో ఇరాన్ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్తో, యావత్ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.]24 గంటల్లోనే: షెహబాజ్ షరీఫ్యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలను ట్యాగ్ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్ విధానంలో అమెరికా, ఇరాన్లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్ తెలిపారు.వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!ఇస్లామాబాద్: ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్ ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
నరకానికి పంపించేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది."ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు.“నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
-
ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
యుద్ధం ముగిసింది
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతి ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అత్యంత చేరువలోకి వచ్చామని అన్నారు. ఒప్పందంపై ఈ వారాంతంలోనే సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్లో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్తో తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఇరాన్తో ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్ కూడా అనుకూలంగా భావిస్తోందని చెప్పారు. ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వివరించారు. ఇది చాలా బలమైన, సమగ్రమైన అవగాహన ఒప్పందమని, కచ్చితంగా కార్యరూపం దాల్చబోయే విషయమని వ్యాఖ్యానించారు. ‘‘చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలిగే తీవ్రమైన దెబ్బలను వారు(ఇరాన్) ఎదుర్కొన్నారు. అందుకే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నాకంటే వారే ఎక్కువగా కోరుకుంటున్నారు’’అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకారం అనంతరం.. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్కు మద్దతుగా నిర్వహించిన ఆన్లైన్ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ రోజు (గురువారం) ఇరాన్తో యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ డిమాండ్కు ఇరాన్ అంగీకరించిందని ఉద్ఘాటించారు. ఇరాన్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉండకూడదని, అదే తమ అసలు ఉద్దేశమని వివరించారు. ‘‘వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేయరు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయరు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు’’అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్పై దాడులు ఆపాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై జెనీవాలో సంతకాలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అలాంటిదేమీ లేదు: ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరినట్లేనని, ఈ వారాంతంలో సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. -
అది ఇరాన్ ఘాతుకమే
వాషింగ్టన్: ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ ఇరాన్ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్ భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. జాసన్ మీక్స్కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్ మీక్స్కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్ భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్ బఖాయీ అభివర్ణించారు. -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
తుది దశలో కీలక ఒప్పందం.. ఇరాన్ విదేశాంగ మంత్రి పోస్ట్!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content. In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డిఅఫైర్స్ జేసన్ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
-
డొనాల్డ్ ట్రంప్కు ఊరట
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న అమెరికా 10 శాతం గ్లోబల్ టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ సుంకాలను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే విధించిన స్టేను అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తాజాగా పొడిగించింది. దీంతో కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ టారిఫ్లు అమల్లోనే ఉండనున్నాయి.అమెరికాలోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ముగ్గురు దిగుమతిదారుల నుంచి 10 శాతం సుంకాలను వసూలు చేయడం కొనసాగించవచ్చు. ఈ ముగ్గురిలో రెండు చిన్న వ్యాపార సంస్థలతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కొనుగోళ్లపై సుంకాలు చెల్లించిన వాషింగ్టన్ రాష్ట్రం కూడా ఉంది.వాస్తవానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు (U.S. Court of International Trade) ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా సుంకాల వసూళ్లను నిలిపివేయకుండా, కేసు దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకే పరిమిత ఉపశమనం కల్పించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం వెంటనే అప్పీల్కు వెళ్లగా.. మే 12న అప్పీళ్ల కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి టారిఫ్ల వసూళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే స్టేను మరింత కాలం కొనసాగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.అమెరికా సుప్రీంకోర్టు 2025లో ట్రంప్ విధించిన పలు టారిఫ్లను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం ‘ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 122’ కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండానే పరిమిత కాలానికి దిగుమతులపై సుంకాలు విధించే అధికారం కలిగి ఉంటారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ జూలైలో ముగియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ గడువు పొడిగిస్తే మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, టారిఫ్ల చట్టబద్ధతపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కేసు పూర్తయిన తర్వాత కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. ట్రంప్ టారిఫ్ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయం. అయితే ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్లు భవిష్యత్తులో కొనసాగుతాయా? లేక కోర్టు వాటికి బ్రేక్ వేస్తుందా? అన్నది తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్సిగ్నల్
వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంలోని అంశాలపై మిత్ర దేశాలు సానుకూలత తెలిపాయన్నారు. మరికొద్ది గంటల్లో ఇరాన్పై భీకర దాడులుంటాయంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. ‘ఇప్పటిదాకా ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల ప్రతిపాదనలు చివరకు ఇరాన్ అత్యున్నత నేతల దాకా వెళ్లాయి. వాళ్లు వాటిని ఆమోదించారు. అందుకే కొన్ని గంటల క్రితం ఇరాన్పై రాత్రి వేళ భీకర బాంబు దాడులు చేయాలనుకున్న నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. చర్చల్లో ప్రస్తావించిన కీలక అంశాలపై మధ్యవర్తిత్వ, భాగస్వామ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ తదితర దేశాలు సమ్మతి తెలపడం శుభపరిణామం. ఈ శాంతి ఒప్పందం కుదిరి, అమల్లోకి వచ్చేదాకా హార్మూజ్ జలసంధి దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుంది. శాంతి ఒప్పందం ఏరోజు, ఎక్కడ కుదుర్చు కోబోతు న్నామో త్వరలోనే వెల్లడిస్తా’అని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. అంతకుముందు ఇరాన్ చమురు పరిశ్రమను మొత్తం గుప్పిటపట్టేలా భీకర స్థాయిలో దాడులతో దురాక్రమణ చేస్తామని, అందుకు గురువారం రాత్రే ముహూర్తం ఖరారుచేశామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘నావికాదళం, వైమానిక దళం, సైన్యం, రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలు, అన్ని రకాల వ్యవస్థలను కోల్పోయిన ఇరాన్పై ఇక బీభత్సంగా బాంబులేస్తాం. అందుకు ఈరోజు రాత్రే ముహూర్తం పెట్టా. ఇరాన్ కీలక ఖర్గ్ ద్వీపంలోని అతిపెద్ద ఆయిల్ టర్మినల్ను త్వరలోనే వశపర్చుకుంటాం. ముడి చమురు పరిశ్రమ మొత్తాన్నీ మా పరం చేసుకుంటాం. అన్నింటినీ ఆక్రమిస్తాం. చమురు, సహజవాయు రంగాలన్నింటిపై ఆధిపత్యం సాధిస్తాం. అచ్చం వెనెజువెలాలో మెరుపుదాడులు చేసినట్లుగా అనూహ్యరీతిలో దాడులతో తెగబడతాం. మా దాడుల తర్వాత వెనెజువెలాపై అమెరికా ఆధిపత్యం మొదలైంది. దీంతో వెనెజువెలా, అమెరికా రెండింటికీ లాభం చేకూరింది. ఇప్పుడు దానినే ఇరాన్లో పునరావృతం చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. బుధవారం దాడులకు కొనసాగింపుగా గురువారం తెల్లవారుజామున సైతం దాడులుచేశాక ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. ఖర్గ్ ద్వీపం అనేది ఇరాన్ చమురు పరిశ్రమకు గుండెకాయ. ఇక్కడి నుంచి 90 శాతం చమురు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఖర్గ్ దీవిని స్వా«దీనంచేసుకోవడం అమెరికాకు అంత తేలికైన విషయం కాదు. దీవి నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్ ప్రధానభూభాగం, సైన్యం ఉంది. అక్కడి నుంచి దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులను, ఆత్మాహుతి డ్రోన్లు, శతఘ్ని ఫిరంగులను అమెరికా పూర్తిస్థాయిలో నిలువరించడం కష్టమని నిపుణులు తేల్చేశారు. అయినాసరే ఖర్గ్ ద్వీపాన్ని స్వాదీనం చేసుకునేందుకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని గురువారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘‘ద్వీపంలోకి అమెరికా బలగాలను దించుతా. సైనికులను రంగంలోకి దింపాల్సిందే. నిజానికి ఆర్మీని తీసుకురావడం నాకు ఇష్టంలేదు. కానీ మొత్తం దీవిని స్వా«దీనం చేసుకోవాలంటే సైన్యం రాక తప్పదు. స్వా«దీనం చేసుకున్నాక ఎంతకాలంపాటు దానిపై పట్టు నిలుపుకోగలం అనేది నాకైతే తెలీదు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొనసాగిన అమెరికా దాడులు.. బుధవారం అర్ధరాత్రి దాటాక చాలా పొద్దుపోయాక అమెరికా ఇరాన్పై దాడులు చేసింది. ఇరాన్ సైనిక నిఘా సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బందర్ అబ్బాస్ తీర పట్టణం సహా హార్మూజ్ సమీప దక్షిణ ప్రాంతాలపై అమెరికా దాడులుచేసింది. టెహ్రాన్లోని తయారీ కర్మాగారం, సైనిక బ్యారెక్లు, స్థానిక పోలీసుల కేంద్రాలపైనా దాడులు జరిగాయని ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ సైతం వెల్లడించింది. దాడులు మొదలెట్టి అమెరికా చర్చలకు అర్థంలేకుండా చేసిందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలకు ఇరాన్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు విదేశాల్లో మేం జప్తుచేసుకున్న ఇరాన్ బ్యాంక్, ఆర్థిక ఖాతాల నుంచి రాబట్టుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. -
ట్రంప్ క్యాబినెట్లోకి కీలక వ్యక్తి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇచ్చిన తరువాత, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.'జే క్లేటన్'ను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) పదవికి ఎంపిక చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పదవి అమెరికా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన భద్రతా బాధ్యతలలో ఒకటి. దేశంలోని అన్ని గూఢచార సంస్థల పనిని సమన్వయం చేయడం ఈ పదవి ప్రధాన బాధ్యత.జే క్లేటన్ను అమెరికా అధ్యక్షుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఈయన గతంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్గా పని చేశారు. అంతే కాకుండా ఈయన సులివన్ & క్రామ్వెల్ మాజీ హెడ్, ప్రస్తుతం న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేస్తున్నారని కూడా వెల్లడించారు.నా మంత్రివర్గంలో పనిచేయడానికి క్లేటన్ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈయన నియామకాన్ని వీలైనంత త్వరగా ధృవీకరించాలని నేను యునైటెడ్ స్టేట్స్ సెనేట్ను కోరుతున్నాను ట్రంప్ పేర్కొన్నారు. -
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్లో ‘ఇండోపాకాం’, యూరప్లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
తూచ్.. మేము బాంబులెయ్యం!
ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఇప్పటికే ఇరాన్ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.ఓవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలు ఓవైపు ఇరాన్ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా-ఇరాన్ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, యూరోపియన్ దేశాల వర్గాల సమాచారం ప్రకారం, సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకిగా మారింది.ఇరాన్ ఆయిల్ అమ్మకాల ద్వారా సంపాదించిన బిలియన్ల డాలర్లు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం, డాలర్ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్ నిధులను ఫ్రీజ్ చేశాయి. అమెరికా మార్కెట్ యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఆ బ్యాంకులు ఆంక్షలను పాటించాయి.ఇరాన్ నిలిపివేసిన 6 బిలియన్ల నుంచి 12 బిలియన్ల వరకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ అమెరికా మాత్రం మానవతా సాయం కింద షరతులతో కొద్దికొద్దిగా మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఇరాన్తో అమెరికా మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోందని వర్గాలు వెల్లడించాయి. సైనిక దృష్ట్యా ఈ యుద్ధం అంతులేని మార్గమని, ఇరాన్పై దాడి చేసి అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, చివరికి అమెరికా-ఇరాన్ సంఘర్షణకు ముగింపు రావాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను తిరిగి ఇరాన్ పొందడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్తో గ్రీట్ డీల్కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
మేమే గెలిచాం.. యుద్ధం ముగింపుకు రాయబారాలు
-
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
అపాచీ ఎఫెక్ట్.. ఇరాన్పై అమెరికా రివెంజ్ ఎటాక్స్!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇదిలా ఉండగా, ఇరాన్తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
లక్ష డాలర్ల హెచ్1బీ ఫీజు రద్దు!
వాషింగ్టన్: అమెరికా కలల్ని పండించే హెచ్1–బీ వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు విధించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సోరోకిన్ తీర్పు వెలువరించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ‘‘అమెరికా కాంగ్రెస్ అనుమతిలేకుండా ప్రభుత్వం ఇలా భారీ స్థాయిలో పన్నులను మోపేందుకు అధికారంలేదు. ఇమ్మిగ్రేషన్ విధానాలు, పన్నులపై నిర్ణయాలు తీసుకునే అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంది. ఫీజు, పేమెంట్ అని చెబుతున్నప్పటికీ వీసా పిటిషన్దారులపై ట్రంప్ పన్ను భారం మోపారు’’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సంతతి సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో ఇది మెరుగైన నిర్ణయమని కొనియాడాయి. అమెరికన్ కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్1–బీ వీసా అవసరం. భారతీయ ఐటీ ఉద్యోగులతోపాటు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో పని చేసేవారు హెచ్1–బీ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులు చేయడమే కాకుండా ఒక్కో హెచ్1–బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 20 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా జడ్జి దీనిపై విచారణ జరిపి భారీ ఫీజు సరికాదని తేల్చి చెప్పారు. ఇకపై మరిన్ని ఇబ్బందులు! ‘‘హెచ్1–బీ వీసాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపశమనం ఇచ్చిన తీర్పిది. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా? అన్నది ప్రశ్నార్థకం’’ అని ఇండియాస్పోరా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషీపుర వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో అమెరికన్ ప్రభుత్వం హెచ్1–బీ వీసాదారులను ఇకపై కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ, ఆరోగ్య, తయారీ రంగాల పురోభివృద్ధికి అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ చీఫ్ ఆఫ్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఖండేరావ్ కాండ్ చెప్పారు. ఆర్థికపరమైన వాస్తవిక పరిస్థితులతోపాటు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కీలకమైన విధానపర అంశాల్లో మార్పులు చేయాలన్న ప్రాథమిక విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని వివరించారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తాంలక్ష డాలర్ల హెచ్1–బీ వీసా ఫీజును రద్దు చేస్తూ మసాచుసెట్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్స్ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్హౌస్ అధికార ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హెచ్1–బీ వీసా పథకాన్ని దశాబ్దాలుగా దురి్వనియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికే అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొంతమంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు కూడా లక్ష డాలర్ల వీసా ఫీజును న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తుండడం గమనార్హం. భారీ వీసా ఫీజు కారణంగా వైద్య సిబ్బందితోపాటు ఉపాధ్యాయులను అమెరికాకు రప్పించడం చాలా కష్టమైపోయిందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన టీచర్లు లేకుండా పోతున్నారని అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ లీజా ముర్కోస్కీ చెప్పారు. అమెరికా ఆరోగ్య రంగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉండగా.. లక్ష డాలర్ల వీసా ఫీజు అదనపు భారం మోపిందని, కోర్టు తీర్పుతో భారీ ఊరట లభించినట్లేనని నార్త్ వర్జీనియా డెమోక్రాట్ ప్రతినిధి డాన్ బేయర్ హర్షం వ్యక్తంచేశారు. రిపబ్లికన్ ప్రతినిధి మైక్ లాలర్, జార్జియా డెమోక్రాట్ ప్రతినిధి సాన్ఫర్డ్ డి.బిషప్, కాలిఫోర్నీయా, న్యూజెర్సీ అటార్నీ జనరళ్లు రాబ్ బోంటా, జెన్నిఫర్ డావెన్పోర్టు తదితరులు కోర్టు తీర్పును స్వాగతించారు. దేశానికి తీవ్ర హాని హెచ్–1బీ వీసా ఫీజు విషయంలో మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఉత్తర్వును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అలాంటి చర్యలు దేశానికి తీవ్ర హాని కలిగిస్తాయని మంగళవారం ఆక్షేపించారు. ‘‘ఈ న్యాయమూర్తులు నిజంగా మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇది చాలా విపరీతమైన పరిస్థితి. వారు మా దేశానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు’’అంటూ ట్రంప్ విమర్శించారు. -
ట్రంప్ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
నలభై ఏళ్ల స్నేహం.. ఒకరి విజయాలను మరొకరు బహిరంగంగా కొనియాడుకునే అనుబంధం.. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్ పదేపదే అప్రమత్తం(వార్నింగ్) చేస్తున్నారన్న వార్తలు వెలువడగా.. దీనిని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ మాత్రం ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్.. ఇజ్రాయెల్పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్పై మరిన్ని దాడులు చేస్తే వాషింగ్టన్ మద్దతును కోల్పోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆప్తమిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.అయితే, యెచియెల్ లీటర్ ఈ కథనాలను తోసిపుచ్చారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు పరస్పర సహకారంతో జరిగాయని.. మీడియా.. తప్పుదోవ పట్టించేలా కథనాలను అల్లుతుందంటూ ఆరోపించారు. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు (lovers' spat) జరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని ఫాక్స్ న్యూస్తో లీటర్ వ్యాఖ్యానించారు.ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్పై సైనిక చర్యల విషయంలో తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయించుకున్నప్పటికీ, తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ దౌత్యవేత్త పేర్కొన్నారు. చాలా వరకు మేము అమెరికా-ఇజ్రాయెల్ మధ్య చాలా సన్నిహిత, ఉమ్మడి సహకారంతో ముందుకు సాగుతున్నాము. మా మధ్య అద్భుతమైన అవగాహన ఉందన్నారు. మరోవైపు, నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇజ్రాయెల్-ఇరాన్ రెండు దేశాలూ దాడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డురాకపోతే శాంతి దిశగా తుది చర్చలు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. అవసరమైన విధంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ తాను ట్రంప్నకు స్పష్టం చేసినట్లు తెలిపారు. -
ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ తో వెనక్కి తగ్గిన..!
-
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
ఇరాన్తో శాంతి ఒప్పందం దిశగా సాగుతున్న అమెరికా ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పుతాయేమోనన్న ఆందోళన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ.. ఇరాన్పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం వాషింగ్టన్ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ నెతన్యాహుకు పదే పదే ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇరాన్తో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "బీబీ.. చాలా జాగ్రత్తగా ఉండు. లేదంటే తొందర్లోనే నువ్వు ఒంటరివాడివైపోతావు" అని నెతన్యాహూతో జరిగిన సంభాషణలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ (Axios) కథనం వెల్లడించింది.బీబీ అనేది నెతన్యాహు చిన్నప్పటి ముద్దు పేరు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలు, అభిమానులతో పాటు పలు దేశాధినేతలు కూడా ఆయన్ని అలాగే పిలుస్తుంటారు. అందుకే ట్రంప్ ఆ పదం వాడారని తెలుస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా అమెరికాను భావిస్తారు. ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ రైట్వింగ్ లీడర్లుగా గుర్తింపు పొందారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇరాన్ అంశంలో ఇద్దరి మధ్య వ్యూహాత్మక విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్తో దీర్ఘకాలిక ఘర్షణ కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించాలన్నది ట్రంప్ వైఖరి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన వైఖరిని అవలంబించాలని నెతన్యాహూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికా ఇరాన్తో శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు చర్చలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైట్హౌస్ భావిస్తోంది. అందుకే గత కొన్ని వారాలుగా లెబనాన్, ఇరాన్ అంశాల్లో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నెతన్యాహూను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.ఇక.. నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అసలు సారాంశం.. అమెరికా మద్దతు గురించి. ఇజ్రాయెల్కు ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి కీలక సహాయం అమెరికా నుంచే అందుతోంది. ఒకవేళ నెతన్యాహూ అమెరికా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. వాషింగ్టన్ నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగకపోవచ్చన్న సంకేతంగా విశ్లేషకులు ఈ హెచ్చరికను చూస్తున్నారు.ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా లేదు. ఇరాన్ మళ్లీ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని నెతన్యాహూ చెబుతుండగా, యుద్ధం కంటే దౌత్యమే పరిష్కారమని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన "జాగ్రత్త బీబీ" హెచ్చరిక కేవలం ఇద్దరు నేతల మధ్య సంభాషణ మాత్రమే కాకుండా.. పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ సంకేతంగా మారింది. -
ట్రంప్నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై 1,00,000 డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కేసు 20 మంది డెమోక్రటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. బోస్టన్లోని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ఫీజును 'కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన పన్ను'గా పేర్కొన్నారు.ప్రతి ఏటా ఇచ్చే వీసాలుసాధారణంగా H-1B ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సుమారు 65,000 వీసాలను ఇస్తుంది. అదనంగా మాస్టర్స్ లేదా ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ.. కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది.ఈ భారీ ఫీజు కారణంగా అనేక సంస్థలు.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకడుగు వేసినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే దాదాపు 38.5% తగ్గినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. ఇది విదేశీ నిపుణులపై ప్రభావం చూపింది.నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్ ప్రభుత్వంట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. ఎంతోమందికి ఉపశమనంఇక భారతదేశంపై కూడా ఈ విధానం ప్రభావం చూపింది. H-1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కఠిన నిబంధనల వల్ల దరఖాస్తులు తగ్గి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇది మార్పు దశలో ఉన్న విధానం అని, కొన్ని ఇబ్బందులు సహజమని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అటు కంపెనీలకు, ఇటు యూఎస్ వెళ్లాలనుకునే ఎంతోమందికి ఉపశమనం కలిగించింది. -
చాగోస్ దీవులపై ట్రంప్ కన్ను.. యూకేకు బిగ్ షాక్?
వాషింగ్టన్: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ దీవులను కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలంరేపుతున్నాయి. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తరహాలోనే, ఇప్పుడు బ్రిటన్ను పూర్తిగా పక్కనపెట్టి, చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం ఉన్న మారిషస్తో అమెరికా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘టెలిగ్రాఫ్’ వెల్లడించింది.ట్రంప్ వ్యూహం.. బ్రిటన్తో సంబంధంలేకుండా..అమెరికా రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్తో సంబంధం లేకుండా చాగోస్ దీవులను నేరుగా మారిషస్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనికంటే ముందు ఆ దీవులకు పూర్తి సార్వభౌమాధికారం లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు ఆప్షన్లలో ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికా అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు మిత్రదేశంగా ఉన్న మారిషస్కు ఈ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తే, అక్కడ గూఢచర్య ముప్పు పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డియెగో గార్సియా స్థావరం.. ఇరాన్ ముప్పుమధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చాగోస్ దీవులలోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరం అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రస్తుతం ఇరాన్తో నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ నుండి సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ నుండి అమెరికా లాంగ్-రేంజ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత మార్చిలో ఈ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించగా, అమెరికా యుద్ధనౌక దాన్ని తిప్పికొట్టింది. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు యూకే ఆలస్యంగా అనుమతి ఇవ్వడంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.యూకే హ్యాండ్ఓవర్ సస్పెన్స్.. శరణార్థుల ఆవేదనఈ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో, గత ఏప్రిల్లోనే దీనికి సంబంధించిన చట్టం నిలిచిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. డియెగో గార్సియాపై నియంత్రణకు ముప్పు పొంచి ఉన్నందున, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా బ్రిటన్ ఎలాంటి సార్వభౌమత్వ ఒప్పందానికి ముందుకు వెళ్లబోదని స్పష్టం చేశారు. మరోవైపు తమ జన్మభూమి భవిష్యత్తును బ్రిటన్ రాజకీయాలు హైజాక్ చేశాయని, స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని చాగోస్ శరణార్థుల బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైళ్ల వర్షం
us israel iran war live updatesమరోసారి భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ ఎటాక్ఇరాక్పైనా గురిపెట్టిన ఇరాన్.. బాగ్ధాద్లో భారీ పేలుళ్లు ఇరాన్పై ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లుట్రంప్ వద్దని చెబుతున్నా లెక్క చేయని ఇజ్రాయెల్దాడులు చేయబోమని చెబుతూనే ఇరాన్పై మిసైళ్ల వర్షంమరోసారి నెతన్యాహూకు ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గగన తలం మూసివేతపశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకున్న మేఘాలుప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావంతమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడిఆదివారం రాత్రి 11:00 గంటల నుండి తమ దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సిరియాఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతాయని ప్రకటన మూసివేత చర్యల్లో భాగంగానే డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేత -
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. -
అమెరికాకు ఆ భయం పట్టుకుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అమెరికా- ఇజ్రాయెల్ మధ్య అసలేం జరుగుతోంది?. ఇరాన్ యుద్ధం.. వాషింగ్టన్- టెల్ అవీవ్ మధ్య చిచ్చురాజేసిందా?.. అంతర్జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల బృందం.. అక్కడ గూఢచర్యం భయాలతో బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు కథనాలు వెలువడ్డాయి.ఇజ్రాయెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంపై ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు, ఉన్నతాధికారుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే ఆందోళనలతో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ అంతర్గత నివేదికను విడుదల చేసింది. డీఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏడు పేజీల నివేదికతో పాటు ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలను వివరించే ఒక చార్ట్ కూడా ఉంది.ఇజ్రాయెల్కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ , టెక్నికల్ సర్వైలెన్స్(సాంకేతిక నిఘా) సామర్థ్యాలు క్రిటికల్ స్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక తేల్చింది. అమెరికా రక్షణ శాఖలో ఆందోళనలు పెరగడానికి కారణమైన కొన్ని నిర్దిష్ట సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇరాన్, ప్రాంతీయ భద్రతాంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలో.. అమెరికా నిర్ణయాలను ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వాషింగ్టన్లో బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులపై తాము నిఘా పెడుతున్నామనే వార్తలను తోసిపుచ్చింది.ఇజ్రాయెల్ అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ.. అక్కడి సంస్థలపై గానీ ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. మా నిఘా వ్యవస్థలు కేవలం శత్రువులను లక్ష్యంగా చేసుకుంటాయి. మిత్రదేశాలను కాదు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి కొట్టిపారేశారు.మరోవైపు, పెంటగాన్ దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కథనం పూర్తిగా అవాస్తవం, సరైన అవగాహన లేని వ్యక్తుల సమాచారం ఆధారంగా ఈ కథనాలు సృష్టించారన్నారు. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.ట్రంప్ టెహ్రాన్తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఏ ఒప్పందాన్ని గౌరవించదని.. మరింత కఠినమైన సైనిక చర్యలే సరైనవని వాదిస్తోంది. ఈ విషయమై ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని.. ఆ తర్వాత ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధికారులు అధికారిక పర్యటనల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రస్తుత, మాజీ అధికారులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా బర్నర్ ఫోన్లు (తాత్కాలిక ఫోన్లు), తాత్కాలిక కంప్యూటర్లు, కఠినమైన కమ్యూనికేషన్ నిబంధనలను పాటిస్తారు. ఇజ్రాయెల్ పర్యటనల్లో అమెరికా ఇప్పటికే అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమాచారాన్ని దూకుడుగా సేకరించడంలో ఇజ్రాయెల్ దిట్ట అని అందరికీ తెలిసిందేనంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు.అమెరికా, ఇజ్రాయెల్లు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ రంగంలో సహకరించుకుంటూ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో తలెత్తిన విభేదాల సమయంలో ఇజ్రాయెల్ నిఘా పెడుతోందనే అనుమానాలు మిత్ర దేశాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హార్ముజ్ జలసంధిలో యుద్ధం.. పెట్రోల్, డీజిల్ దొరకటం కష్టమేనా?
-
ఈ ఒక్క కారణంతో భయంకర ఆపరేషన్, దాడులు ఆగిపోయి..
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. -
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అర్మేనియా దేశ రాజకీయాలు ఇప్పుడు భారత్ సహా అనేక పెద్ద దేశాలను టెన్షన్లోకి నెట్టాయి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా రాజకీయ వర్గాలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాకుండా, అర్మేనియా భవిష్యత్తులో రష్యా ప్రభావ వలయంలోనే కొనసాగుతుందా లేదా యూరప్–అమెరికా వైపు మరింత దగ్గరవుతుందా అనే కీలక నిర్ణయానికి సంకేతంగా మారాయి.పషిన్యాన్కు రాజకీయ అగ్నిపరీక్షప్రస్తుతం అర్మేనియాలో ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన నాయకత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ప్రజా ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పషిన్యాన్, గత కొన్నేళ్లుగా రష్యాపై ఆధారాన్ని తగ్గించి యూరోపియన్ యూనియన్, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. అయితే అభిప్రాయ సేకరణల ప్రకారం ఆయన పార్టీ అతిపెద్ద శక్తిగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణలకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించడం కష్టమని విశ్లేషకుల అభిప్రాయం.2023 సంఘటనతో మారిన రాజకీయ సమీకరణంఅర్మేనియా రాజకీయాల్లో పెద్ద మలుపు 2023లో చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై అజర్బైజాన్ పూర్తి నియంత్రణ సాధించడంతో లక్ష మందికి పైగా అర్మేనియన్లు అక్కడి నుంచి తరలిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో సంప్రదాయ మిత్రదేశమైన రష్యా తగిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదని అర్మేనియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో “రష్యాపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం” అనే భావన బలపడింది. ఇదే పషిన్యాన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది.ప్రధాన ప్రత్యర్థి ఎవరు?పషిన్యాన్కు ప్రధాన సవాలు సామ్వేల్ కరపేట్యాన్ నేతృత్వంలోని స్ట్రాంగ్ అర్మేనియా కూటమి నుంచి వస్తోంది. ఈ కూటమి రష్యాతో సంప్రదాయ సంబంధాలు కొనసాగించాలని, పశ్చిమ దేశాల వైపు వేగంగా వెళ్లడం ప్రమాదకరమని వాదిస్తోంది. గత అనుభవాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది.రష్యా ఆందోళన ఎందుకు పెరుగుతోంది?రష్యా దృష్టిలో అర్మేనియా అత్యంత కీలక వ్యూహాత్మక మిత్రదేశం. దేశంలో రష్యా సైనిక స్థావరం ఉంది. అలాగే ఇంధనం, వాణిజ్యం, భద్రత రంగాల్లో అర్మేనియా ఇప్పటికీ రష్యాపై అధికంగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో అర్మేనియా పశ్చిమ దేశాల వైపు వెళితే:దక్షిణ కాకసస్లో రష్యా ప్రభావం తగ్గుతుందిEurasian Economic Union బలహీనపడుతుందిపశ్చిమ ప్రభావం రష్యా సరిహద్దులకు మరింత చేరుతుందిఈ నేపథ్యంలో రష్యా ఎన్నికల ముందు అర్మేనియాపై ఆర్థిక ఒత్తిళ్లు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.అర్మేనియాపై రష్యా ఆర్థిక ఒత్తిళ్లు..అర్మేనియన్ పండ్లు, చేపలు, పూలు, మినరల్ వాటర్, మద్యం ఉత్పత్తులపై పరిమితులుగ్యాస్, చమురు సరఫరాలపై హెచ్చరికలుయూరోపియన్ యూనియన్ వైపు వెళితే ఆర్థిక కూటమి నుంచి తొలగించే సంకేతాలుఇవి మాస్కో వ్యూహాత్మక ఒత్తిడి చర్యలుగా విశ్లేషకులు చూస్తున్నారు.పశ్చిమ దేశాల మద్దతు..ఇక యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా కూడా అర్మేనియాకు బహిరంగ మద్దతు ఇస్తున్నాయి.EU ద్వారా సుమారు 50 మిలియన్ యూరోల ఆర్థిక సహాయం ప్రణాళికఅమెరికాతో అణుశక్తి మరియు మౌలిక సదుపాయాల భాగస్వామ్యంబ్రస్సెల్స్ నుంచి యూరోపియన్ సమీకరణకు రాజకీయ సంకేతాలుఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. పషిన్యాన్ గెలిస్తే:యూరోపియన్ యూనియన్ దిశగా వేగవంతమైన అడుగులుఅజర్బైజాన్తో శాంతి చర్చలు ముందుకురష్యాతో సంబంధాల్లో ఉద్రిక్తత పెరుగుతుందిప్రతిపక్షం బలపడితే:రష్యాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలుయూరోపియన్ సమీకరణ మందగింపువిదేశాంగ విధానంలో మాస్కో ప్రభావం పెరుగుతుందిప్రాంతీయ సమీకరణం..అర్మేనియా చుట్టూ ఉన్న దేశాల పాత్ర కూడా కీలకం:టర్కీ: అజర్బైజాన్కు బలమైన మిత్రుడుఅజర్బైజాన్: భూభాగ నియంత్రణ తర్వాత మరింత శక్తివంతంఇరాన్: ప్రాంతీయ సమతుల్యం కోరుకుంటుందిభారత్పై ప్రభావంగత కొన్నేళ్లలో అర్మేనియా రష్యాపై ఆధారాన్ని తగ్గిస్తూ భారత్ నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా భారత్.. దక్షిణ కాకసస్లో కొత్త రక్షణ భాగస్వామిగా ఎదుగుతోంది. పశ్చిమ వైపు అర్మేనియా మరింత మొగ్గు చూపితే భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు కేవలం అర్మేనియా రాజకీయ పోటీ మాత్రమే కాదు. ఇది వాస్తవానికి రష్యా ప్రభావంలో కొనసాగాలా లేదా పశ్చిమ ప్రపంచానికి దగ్గరవ్వాలా? అనే నిర్ణయాత్మక పోరుగా మారింది. అందుకే ప్రపంచ శక్తులు ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్కి భారీ ఝలక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అల్బేనియా అడ్రియాటిక్ తీరంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ నిర్మించతలపెట్టిన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్పై పెద్ద దుమారం చెలరేగింది. వీరు తలపెట్టిన సుమారు రూ. 15,232 కోట్ల భారీ ప్రాజెక్ట్ అక్కడి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందంటూ అల్బేనియా రాజధాని టిరానా నగర కేంద్రంలో యువత తీవ్ర నిరసనలకు దిగింది. జారెడ్ కుష్నర్ అఫినిటీ పార్ట్నర్స్ మద్దతుతో, ఇవాంకా ట్రంప్ ప్రమేయంతో రూపొందుతున్న ప్రతిపాదిత విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టే ఈ ఆగ్రహానికి కేంద్ర బిందువు. అసలేంటీ ప్రాజెక్ట్ తెలుసుకుందాం.పర్యావరణ నష్టం, చట్టపరమైన లోపాలపై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని టిరానా (Tirana) లో ప్రాజెక్ట్ను రద్దు చేయాలని, భూములను అసలు యజమానులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరుస నిరసనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సజాన్ ద్వీపంలో, తీరప్రాంత నగరమైన వ్లోరా సమీపంలోని జ్వెర్నెక్ వద్ద నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్ట్తో రక్షిత జాతి అయిన ఫ్లెమింగోలకు, సముద్ర తామేళ్లకు, అలాగే రక్షిత చిత్తడి నేలల ప్రాంతంలోని ఇతర జాతులకు ముప్పు కలిగిస్తాయని వారు అంటున్నారు. తీరప్రాంతంలో బుల్డోజర్లు రావడం, బీచ్లకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేయడంతో స్థానికులు, నిరసనకారులు సెక్యూరిటీ గార్డులతో ఘర్షణకు దిగారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు#BREAKING #usa Protests entered a fourth night in Tirana and across Albania against a luxury resort project backed by Jared Kushner’s Affinity Partners and involving Ivanka #Trump . Demonstrators oppose the development on the protected Vjosa-Narta wetland and Sazan Island, citing… pic.twitter.com/uGA0f2K9FW— Thepagetoday (@thepagetody) June 5, 2026విదేశీ డెవలపర్లకు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు గులాబీ రంగు ఫ్లెమింగో కటౌట్లు, అల్బేనియా నాట్ ఫర్ సేల్ అనే ప్లకార్డ్లతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అంతేకాదు అవినీతి ఆరోపణలుఎదుర్కొంటున్న పీడీ నాయకుడు సాలీ బెరిషాతో పాటు ప్రధానమంత్రి రామాను కూడా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడీ రామా కార్యాలయం ముందు ప్రతిరాత్రి జరుగుతున్న ర్యాలీలను పోలీసులు వాటర్ కెనాన్లతో అదుపు చేస్తున్నారు.మరోవైపు వ్యోసా-నార్తా రక్షిత పర్యావరణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ ధ్వంసం చేస్తుందని దాదాపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు (NGOs) ఆందోళన వ్యక్తం చేస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ప్రతిపాదిక ప్రాజెక్ట్ సుమారు 10,000 గదులతో కూడిన ఒక కొత్త నగరం అవుతుందని, ఇది వన్యప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అల్బేనియా పర్యావరణవేత్త జోని వోర్ప్సీ విమర్శించారు.2024లో అల్బేనియాలోని అడ్రియాటిక్ తీరంలో లగ్జరీ హోటళ్లు, విల్లాలు నిర్మించనున్నట్లు జారెడ్ కుష్నర్, ఆయన భార్య ఇవాంకా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ను రక్షిత ప్రాంతమైన వ్యోసా-నార్తా (Vjosa-Narta) డెల్టా మరియు ఒకప్పుడు రహస్య కమ్యూనిస్ట్ సైనిక స్థావరంగా ఉన్న సజాన్ (Sazan) ద్వీపంలో నిర్మించాలని ప్రణాళికలు వేశారు. సుమారు 1.6 బిలియన్ డాలర్లు (USD) ఉంటుందని అంచనా. అయితే, సజాన్ ప్రభుత్వ ఆస్తి అయినందున, ఇందులో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని అల్బేనియా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక్కడ దాదాపు 4 బిలియన్ యూరోల ప్రాజెక్ట్ ఉందని, దీని వెనుక ఖతార్కు చెందిన 'పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్' సహ-యజమానులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. అల్బేనియాలో, పర్యావరణ పరిరక్షణతో సహా ప్రతిదీ పారదర్శకంగానే ఉందని, చాలా బాధ్యతాయుతంగా ఆ ప్రాజెక్ట్ను చేపట్టామని, స్థానికులకు ఉద్యోగాలు, సంపద సృష్టించడంపై దృష్టి పెట్టామని కుష్నర్ వ్యాపార భాగస్వామి, ఆషర్ అబెహ్సెరా చెప్పారు.విచారణఅల్బేనియా ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రాజెక్ట్పై విచారణ ప్రారంభించింది. రక్షిత ప్రాంత హోదాను ఎలా మార్చారు? పబ్లిక్ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? మరియు నిధుల మూలాలు ఎక్కడివి? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.కాగా 1990లలో కమ్యూనిజం పతనం తర్వాత అల్బేనియాలో భూ వివాదాలు ఎక్కువయ్యాయి. కమ్యూనిస్ట్ పాలనలో 45 ఏళ్ల సంపూర్ణ జాతీయీకరణలో కోల్పోయిన తమ పూర్వీకుల భూములను తిరిగి పొందాలని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములపై కొందరు స్థానికులు హక్కులు కోరుతున్నారు. అలాగే, భూముల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు భారీ ఊరట లభించింది. గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు అమెరికా ఫెడరల్ కోర్టు చెక్ పెట్టింది. ఆ ఆదేశాలు చెల్లుబాటు కావని తీర్పు ఇచ్చింది. దీంతో స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడికి మరో పరాభవం ఎదురైనట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన పలు వలస విధానాలపై రోడ్ ఐలాండ్లోని ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం "జాతీయ భద్రత" పేరుతో 39 దేశాలకు చెందిన విదేశీయుల గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అంతేకాకుండా ఆశ్రయం (అసైలమ్) కోసం దరఖాస్తు చేసిన వారి కేసులను కూడా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయాలను పరిశీలించిన న్యాయమూర్తి జాన్ మెక్కానెల్.. ప్రభుత్వం తనకు లేని అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు."అమెరికాకు రావాలంటే చట్టాన్ని అనుసరించాలి అని తరచూ చెబుతుంటారు. ఈ కేసులో దరఖాస్తుదారులు అదే చేశారు. అయినప్పటికీ వారికి అన్యాయం జరిగింది. చట్టాన్ని పాటించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన దరఖాస్తుదారులను ఇలా నిరవధికంగా వేచి ఉండమని చెప్పలేరు" అంటూ కీలక తీర్పు ఇచ్చింది.ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పులు. ఈ ఘటనలో అరెస్టైన వ్యక్తి అఫ్గానిస్థాన్కు చెందినవాడు కావడంతో ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణంగా చూపుతూ పలు దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. అనంతరం "ట్రావెల్ బ్యాన్" జాబితాను విస్తరించి మొత్తం 39 దేశాలను చేర్చింది. ఈ జాబితాలోని దేశాల పౌరుల గ్రీన్కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిరవధికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఆశ్రయం కోరిన వారి దరఖాస్తులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.అయితే కోర్టు తాజాగా ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చింది. వలస ప్రయోజనాలపై నిలిపివేత, ఆశ్రయ దరఖాస్తుల నిలిపివేత, ఇప్పటికే ఆమోదించిన కేసుల పునఃసమీక్ష, ట్రావెల్ బ్యాన్ దేశాలకు చెందిన వారిపై ప్రత్యేక ప్రతికూల దృష్టితో వ్యవహరించే విధానాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వేలాది మంది వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్కార్డుల కోసం, ఉద్యోగ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారింది.అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా, చట్టబద్ధ వలస మార్గాలను పరిరక్షించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న రాజకీయ పోరులో ఈ తీర్పు మరో కీలక మలుపుగా మారింది. "జాతీయ భద్రత" పేరుతో విధించిన ఆంక్షలకు కోర్టు అడ్డుకట్ట వేయడంతో.. చట్టబద్ధంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?!
అయోమయాన్ని సృష్టించటానికీ, అవతలి పక్షంపై పైచేయి సాధించటానికీ ఎంతకైనా తెగించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికన్ కాంగ్రెస్కు పెద్ద అబద్ధం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్తో శత్రుత్వాన్ని ఆపి, అక్కడున్న సేనలనువెంటనే వెనక్కి పిలిపించాలని 215–208 ఓట్ల తేడాతో బుధవారం అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించగా, ‘అసలు యుద్ధం ఎక్కడుంది? అది ఏప్రిల్ మొదటి వారంలోనే ముగిసి పోయింది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అది కొనసాగుతోంది’అంటూ ట్రంప్ లేఖ రాశారు. ఇజ్రాయెల్తో కుమ్మక్కై, ఫిబ్రవరి 28న ఇరాన్పై మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పటికీ ఆగలేదు. హార్మూజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. తమ షరతులకు తలొగ్గితేనే ఒప్పందం సాధ్యమంటూ ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తీర్మానానికి కొన్ని గంటలముందు కూడా అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కానీ ఈ ఘర్షణల్ని యుద్ధంగా పరిగణించరాదని ట్రంప్ భాష్యం చెబుతున్నారు. నిజానికి యుద్ధం ఆపాలని ప్రతినిధుల సభ ఆదేశించినంత మాత్రాన ట్రంప్కొచ్చే నష్టమేం లేదు. ఆ తీర్మానం చట్టపరంగా కీలకమైన చర్యే కావొచ్చు, కానీ ఆచరణలో అదే మంత పనికొచ్చేది కాదు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమాక్రాట్లతో చేయి కలపటంతో తీర్మానం ఆమోదం పొందింది. 1973లో వచ్చిన యుద్ధ అధికారాల చట్టంకిందకాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధంలోకి దిగితే, రెండు నెలల్లో దాన్నిముగించాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తే మరో 30 రోజులు పొడిగించటానికి అధ్యక్షుడికి వెసులుబాటుంది. కానీ అటు తర్వాత మాత్రం అసాధ్యం. ట్రంప్ రాసిన లేఖ ప్రకారం నిండా నెలకుమించి యుద్ధం సాగలేదు! కాల్పుల విరమణ అమల్లో ఉందంటే యుద్ధం లేనట్టేననీ, ‘అవసరమైన’సందర్భాల్లో చేస్తున్న దాడుల్ని యుద్ధంగా పరిగణించరాదనీ యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. తలా తోకా లేకుండా మాట్లాడటంలో ట్రంప్ సిద్ధహస్తుడు. ఒకపక్క కాంగ్రెస్ చేసిన తీర్మానం దేశభక్తి రాహిత్యమంటూనే, అదే నోటితో అదెప్పుడో ముగిసిందని చెబు తున్నారు. ఆయన తర్కం ప్రకారం యుద్ధం చేయటమే దేశభక్తి అయితే, దాన్ని నిలి పేసిన తనకూ దేశభక్తి లోపించినట్టే. ఈ వాదప్రతివాదాల మాటెలావున్నా ఇలాంటి అధ్యక్షుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు మున్ముందు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ నెలాఖరుతో యుద్ధం వంద రోజులకు చేరుతుంది. యుద్ధం ఆగేందుకు ఇప్పటికి నాలుగుసార్లు ప్రతినిధుల సభలో డెమాక్రాట్లు తీర్మానాలు పెట్టారు. కానీ మొదటి మూడుసార్లూ అవి వీగిపోయాయి. మూడోసారి తీర్మానమైతే 212–212తో ఎటూతేలకుండా ముగిసింది. ఈసారి అది నెగ్గినా ట్రంప్ తన తర్కంతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంవల్ల ఇరాన్లో ఇంతవరకూ 3,400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2,900 కోట్ల డాలర్లు ఖర్చయిందని పెంటగాన్ చెబుతుండగా, ఇదంతా ముగిసేసరికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ మూర్ఖత్వం ఇలాగే కొనసాగితే అమెరికా నిండా మునగటం ఖాయం. దాంతో పాటు డాలర్తో ముడిపడివున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా స్థితికి చేరుకుంటాయి. ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటి ఇప్పటికే ట్రంప్ రేటింగ్ నేల చూపులు చూస్తోంది. ప్రతినిధుల సభ చేసిన తీర్మానంవంటిదే రిపబ్లికన్ల ఆధిక్యతగల సెనేట్లో కూడా చేస్తే అమెరికా అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే యుద్ధం ఆపాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు సైతం దాన్ని ట్రంప్ వీటో చేయొచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ తీర్మా నిస్తే తప్ప ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవి కాదు. ఇప్పటికే మొత్తం ఓటర్లలో 64 శాతంమంది ట్రంప్ యుద్ధోన్మాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తటస్థ ఓటర్లలో అయితే 73 శాతంమంది యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారు. ఎవరెంతగా కోరుకున్నా ట్రంప్ మాత్రం స్వీయ వినాశనంవైపే అమెరికాను తీసుకుపోతున్నారు. -
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. -
సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దాదాపు 70 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో బిల్లు రూపకల్పన చేశారు. అయితే, బిల్లుపై డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ డ్రామా నడిచింది. ట్రంప్ వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు వేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ బిల్లును నెగ్గించుకుంది. సరిహద్దుల్లో నిఘూ పటిష్టం, అక్రమ వలససలను అడ్డుకోవడమే బిల్లు ముఖ్యఉద్దేశమని ట్రంప్ తెలిపారు. -
మోదీ లొంగిపోయే రకం కాదు: పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి తెస్తే మోదీ లొంగిపోయే రకం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.రష్యా అధ్యక్షుడు పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించే దేశం. ఏ దేశం ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదు. భారత్ ఒక గొప్ప దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. అలాంటి దేశం తన ప్రయోజనాలను బాగా అర్థం చేసుకుంటుంది. రష్యాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం ఫలితం ఇవ్వదు’ అని స్పష్టం చేశారు.రష్యా భారత్ను ఇప్పటికీ అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. పాశ్చాత్య ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా భావిస్తోంది. అమెరికాతో భారత సంబంధాలు పెరిగినా, రష్యా-భారత్ సంబంధాలపై మాస్కోకు పెద్దగా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని చెప్పారు. అయితే, పరోక్షంగా అమెరికాను టార్గెట్ చేసే పుతిన్ ఇలా వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది.అమెరికా-భారత్ సంబంధాలపై వ్యాఖ్యపుతిన్ వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం అమెరికా-భారత్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నప్పటికీ, అది రష్యా-భారత్ సంబంధాలకు ఎలాంటి ఆటంకం కాదని ఆయన అన్నారు. అంటే, భారత్ ఒకేసారి అమెరికా మరియు రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించగలదని, ఇది భారత విదేశాంగ విధానంలోని ప్రత్యేకత అని పుతిన్ అభిప్రాయపడ్డారు.ఎందుకు ఈ వ్యాఖ్యలు?రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్దం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించగా, భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. దీనిపై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేసినప్పటికీ, భారత్ తన నిర్ణయం జాతీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది.భారత్-రష్యా మధ్య ప్రధాన రంగాలు:రక్షణ సహకారంఅణు విద్యుత్అంతరిక్ష పరిశోధనఇంధన భద్రతవాణిజ్యంసాంకేతికత -
టారిఫ్ల టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో భారత్పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ఆయన.. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకవైపు భారత్పై అదనపు సుంకాల (టారిఫ్లు) కత్తి వేలాడదీస్తూ.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తన "మంచి స్నేహితుడు"గా అభివర్ణిస్తున్నారు ట్రంప్. భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్తో వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. "మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బాగా కలిసిపోతాం. అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో భారత్పై విమర్శలు కూడా గుప్పించారు. చాలా ఏళ్ల పాటు భారత్ అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. ప్రస్తుతం తన విధానాల వల్ల పరిస్థితి తారుమారైందని, ఇప్పుడు అమెరికానే భారత్తో వాణిజ్యం ద్వారా లాభపడుతోందని చెప్పారు.ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ప్రతినిధి బృందం భారత్లో పర్యటించి కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.అయితే చర్చలు జరుగుతున్న వేళే అమెరికా మరోసారి టారిఫ్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలవంతపు శ్రమ (Forced Labour) ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలతో భారత్తో పాటు మరో 53 దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.ట్రంప్ మరోసారి హార్లే-డేవిడ్సన్ మోటార్సైకిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భారత్ హార్లే-డేవిడ్సన్పై 200 శాతం వరకు సుంకం విధించిందని, అందువల్ల ఆ సంస్థ భారత్లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు భారత ద్విచక్ర వాహనాలకు అమెరికాలో అలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు.గతంలో మోదీ-ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్పై విధించిన కొన్ని సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై కీలక తీర్పు ఇవ్వడంతో చర్చల దిశలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాయి.అదనపు టారిఫ్ల హెచ్చరికల మధ్య కూడా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా వ్యక్తం చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్–అమెరికా సంబంధాల్లో స్నేహపూర్వక సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. టారిఫ్ల వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కీలకాంశాలుభారత్తో డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలుభారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ట్రంప్ ధీమా.మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్య.గతంలో భారత్ భారీ సుంకాలు విధించిందని విమర్శ.భారత్తో పాటు 53 దేశాలపై 12.5% అదనపు టారిఫ్ల ప్రతిపాదన.టారిఫ్ల వివాదం మధ్యే కొనసాగుతున్న వాణిజ్య చర్చలుత్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం -
రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్
సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 యూఎస్ ఎన్నికల్లో(మధ్యంతర) తాను ఎలాంటి రాజకీయ విరాళాలు ఇచ్చే ప్రణాళికలు లేవని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆల్ట్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాధారణంగా రాజకీయాల నుంచి డబ్బు దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే చాలా మంచిది’ అని పేర్కొన్నారు.తాను స్వయంగా రాజకీయ విరాళాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏఐ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రచారాలకు డబ్బు పెట్టే ఇతర టెక్ దిగ్గజాల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మా పోటీదారులందరి కంటే మమ్మల్ని వేరే ప్రమాణాలతో కొలవడం సరికాదు. వారు మమ్మల్ని తొక్కేయడానికి డబ్బును ఆయుధంగా వాడుతుంటే మేము కూడా తిరిగి పోరాడగలగాలి. అయితే, బోర్డు అంతటా నిబంధనలు అందరికీ ఒకేలా ఉండడానికి నేను ఇష్టపడతాను’ అని ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు.సూపర్ పీఏసీల హోరాహోరీకృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం, అనుకూల చట్టాల కోసం సిలికాన్ వ్యాలీలో పొలిటికల్ యాక్షన్ కమిటీల (పీఏసీ) యుద్ధం నడుస్తోంది.లీడింగ్ ది ఫ్యూచర్: ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ సహ వ్యవస్థాపకుల మద్దతుతో నడుస్తున్న సూపర్ పీఏసీ ఇది. ఏఐ స్నేహపూర్వక అభ్యర్థులను గెలిపించడం, డేటా సెంటర్ల నిర్మాణంపై రాష్ట్రాల ఆంక్షలను ఎదుర్కోవడం దీని ముఖ్య ఉద్దేశం.పబ్లిక్ ఫస్ట్ యాక్షన్: ఓపెన్ఏఐ ప్రధాన పోటీదారు ‘ఆంత్రోపిక్ పీబీసీ’ ఈ సూపర్ పీఏసీకి ఏకంగా 20 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చింది. ఇది కఠినమైన ఏఐ భద్రతా నిబంధనల కోసం వాదిస్తుంది.ఓపెన్ఏఐ వివరణ: లీడింగ్ ది ఫ్యూచర్ పీఏసీకి గ్రెగ్ బ్రోక్మన్, ఆయన భార్య అన్నా నుంచి 25 మిలియన్ డాలర్ల విరాళాలు అందినప్పటికీ ఆ సంస్థతో తమకు ఎలాంటి అధికారిక అనుబంధం లేదని ఓపెన్ఏఐ బ్లాగ్ పోస్ట్లో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్!
బంగారు రంగు జుట్టు.. హుందాగా కనిపించే 700 కిలోల భారీ కాయం.. వీటన్నింటికీ మించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండే విలక్షణమైన రూపం! ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ వింత అల్బినో గేదె గురించే చర్చ నడుస్తోంది. వారం రోజులుగా ఢాకా శివార్లలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు వచ్చిన ఈ గేదెను చూసేందుకు జనం తరలివస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ ‘ట్రంప్’ గేదె కథనం ఇప్పుడు అంతర్జాతీయంగానూ హెడ్లైన్స్లో నిలుస్తోంది.మొదట ఈ అరుదైన అల్బినో గేదెను ముస్లింల పవిత్ర పండుగ ‘ఈద్-అల్-అధా’ (బక్రీద్) సందర్భంగా త్యాగం (బలి) చేయడం కోసం ఒక స్థానిక రైతు సిద్ధం చేశాడు. అయితే, ఈ గేదె లేత కొమ్ములు, దానికున్న వింతైన బంగారు రంగు జుట్టు సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉన్నాయంటూ సదరు రైతు గమనించి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ‘ఫేస్బుక్లో ఈద్కు ముందే ‘ట్రంప్’ను బలి ఇవ్వబోతున్నారనే పోస్టులు చూశాను. కానీ చివరి నిమిషంలో దానిని బలి ఇవ్వకుండా జూకు తరలించారని తెలిసి స్వయంగా చూడటానికి వచ్చాను’ అని జాషోర్ నగరం నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు తెలిపారు.భద్రతా కారణాలు, ప్రజా విజ్ఞప్తుల దృష్ట్యా బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్వయంగా స్పందించి ఆ జంతువును రక్షించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ గేదెను ఢాకాలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు తరలించింది.జూలో వీఐపీ ట్రీట్మెంట్!ప్రస్తుతం జూలో ఈ వింత గేదెకు సెలబ్రిటీ హోదా దక్కింది. జూ సిబ్బంది దీనిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. విపరీతమైన ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి సిబ్బంది నిరంతరం నీళ్లు చల్లుతున్నారు. ట్రంప్ మార్కు హెయిర్స్టైల్ చెడిపోకుండా జుట్టును ఒక వైపునకు దువ్వుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.జూ క్యూరేటర్పై వేటు!ఈ గేదెకు ‘డొనాల్డ్ ట్రంప్’ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రదర్శనశాలలోని ఎన్క్లోజర్ వద్ద మొదట డొనాల్డ్ ట్రంప్ అనే బోర్డును ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ తర్వాత అధికారులు ఆ బోర్డును తొలగించారు. ఈ వివాదం నేపథ్యంలోనే జూ క్యూరేటర్ను పదవి నుంచి తొలగించడం గమనార్హం. అయితే దీనికి గల అధికారిక కారణాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
వార్ పవర్స్ షాక్.. ట్రంప్ దూకుడుకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కీలక రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే 'వార్ పవర్స్' (War Powers) తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించింది. 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ట్రంప్ విదేశాంగ, సైనిక విధానాలపై కాంగ్రెస్ అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు.డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం.. అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదంటే కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపడం కొసమెరుపు. ఎందుకు ఎదురుదెబ్బ?.. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ ఘర్షణలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం వల్ల అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార రిపబ్లికన్ పార్టీలోని నలుగురు సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈసారి విజయంఇదే తరహా తీర్మానం గతంలో పలుమార్లు సభ ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. మే నెలలో జరిగిన ఓటింగ్లో 212-212తో సమం కావడంతో తీర్మానం విఫలమైంది. అయితే ఈసారి అదనపు మద్దతు లభించడంతో సభ ఆమోదం దక్కింది.ఏం జరగబోతోందంటే..హౌస్ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలుపుతున్నప్పటికీ తుది ఫలితం ఆసక్తికరంగా మారింది. సెనెట్ ఆమోదించినా ట్రంప్ దీనిపై వీటో (Veto) విధించే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదిస్తోంది.యుద్ధం వెంటనే ఆగిపోతుందా?ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన యుద్ధం తక్షణమే ఆగిపోదు. అయితే కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగించడంపై ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధ్యక్ష అధికారాలపై కాంగ్రెస్ తన నియంత్రణను పునరుద్ఘాటించినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రంప్ దూకుడును కొంత మేర నియంత్రించే పరిణామంగా భావిస్తున్నారు.కీలక అంశాలుఇరాన్పై సైనిక చర్యలను పరిమితం చేసే 'వార్ పవర్స్' తీర్మానం ఆమోదం215-208 ఓట్లతో హౌస్లో ఆమోదంనలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతుయుద్ధ నిర్ణయాలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే సందేశంసెనెట్ ఆమోదం, ట్రంప్ వీటోపై ఉత్కంఠట్రంప్ విదేశాంగ విధానాలకు పెద్ద రాజకీయ హెచ్చరికగా విశ్లేషణ -
‘నేను ఖమేనీని కలవాలనుకుంటున్నా..’
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలవాలని ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాను ఇరాన్ సుప్రీం లీడర్ను నేరుగా కలవాలనుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఖమేనీ భాగస్వామి అయ్యారని.. ఇరువురి మధ్య సంబంధాలు చాలా బాగున్నట్లు కనిపిస్తోందంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు, నాయకులకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను.. అలాగే ఏదో ఒక సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.'పాడ్ ఫోర్స్ వన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిణామాలు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి.. మేము ఏదో ఒక సమయంలో సమావేశమవుతామని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే విషయానికి అంగీకరించిందని.. అది చాలా పెద్ద విషయం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు."మేము వారిని అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వలేము. వారు అణు ఆయుధాన్ని కలిగి ఉండబోమని ఇప్పటికే అంగీకరించారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్తో తమ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమంటూ సానుకూల ధోరణితో మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
ట్రంప్ కి అమెరికా కోర్ట్ బిగ్ షాక్.. 180 కోట్ల డాలర్ల ఫండ్స్ రద్దు.!
-
భారత్కు మరోసారి అమెరికా సుంకాల షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మరోసారి భారత్కు షాకిచ్చారు. బలవంతపు కార్మిక విధానానికి (forced labour) నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు (tariffs) విధించాలని అమెరికా సిద్దమవుతున్నారు. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్లతో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5 శాతం వరకు అదనపు టారిఫ్లు (పన్నులు) విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో (వెట్టిచాకిరీ/forced labour) తయారైన వస్తువులపై నిషేధాన్నివిధించడంలో లేదా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫల మయ్యాయని USTR నిర్ధారించింది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు స్విట్జర్లాండ్ తదితర దేశాలున్నాయి. ఇందులో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే లపై 10 శాతం సుంకాలు, ఇతర దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకం విధించనుంది. దీని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని యూఎస్టిఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. అవి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటనుంది. అలాగే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. కానీ, ఒకవేళ ఇవి అమలులోకి వస్తే, సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ చర్య వీలు కల్పిస్తుంది.ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలమవడం ఆమోదయోగ్యం కాదని USTR జామీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విఫల విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ, మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. (అమెరికా చట్టాల తరహాలో భారతదేశంలో ప్రస్తుతం బలవంతపు శ్రమ వస్తువుల దిగుమతిపై ప్రత్యేక నిషేధ చట్టమేదీ లేదు.)అయితే, ప్రతిపాదిత సుంకాలతో పాటు గొడ్డు మాంసం, కాఫీ, కొన్ని రకాల పండ్లు మరియు గింజల వంటి వాటికి వివిధ మినహాయింపులు ఉన్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి లోబడి ఉండే కెనడా మరియు మెక్సికో వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని వస్త్రాలు, దుస్తులకు కూడా. జూలై 6 లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. ఇదీ చదవండి: కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం -
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనుకున్న సమయంలో పరిస్థితి మళ్లీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సాగుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. మరోవైపు.. కువైట్, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు గల్ఫ్ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో శాంతి ప్రయత్నాల భవిష్యత్తుపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న చర్చలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయా? ముగిశాయా? అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్.. "అవి ముగిసినా నాకు పెద్దగా పట్టదు. ముగిస్తే ముగిశాయి. లేకపోతే లేదు. కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్గా మారాయి" అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు ట్రంప్ దౌత్యపరమైన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు. కానీ ట్రంప్ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా, ట్రంప్ ఇప్పటికే విసుగు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందానికి దాదాపు 20 నెలల చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన చర్చలు రెండు నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.మళ్లీ పరస్పర దాడులుఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కువైట్ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేలుళ్ల శబ్దాలకు భయపడవద్దని సూచించింది. అదే సమయంలో బహ్రెయిన్ కూడా సైరన్లు మోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.ఇరాన్కు చెందిన క్వేష్మ్ ద్వీప ప్రాంతంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ, ఇరాన్ నుంచి ప్రాంతీయ దేశాలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. అంతేకాకుండా క్వేష్మ్ ద్వీపంలో "స్వీయ రక్షణ చర్యల" కింద దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.అమెరికా ప్రకారం, ఇరాన్ కువైట్పై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమయ్యాయి. బహ్రెయిన్పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ సంయుక్త వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరాన్తో చర్చలు మందగించడం, మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడుల ముప్పు పెరగడం నేపథ్యంలో ప్రాంతీయ శాంతి ప్రక్రియ మరోసారి అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మోజ్తాబా బతికే ఉన్నారా? అమెరికా ఏమంటోంది..?? -
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు. -
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.బీరూట్పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.యుద్ధం తాజా పరిస్థితిఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.ఇరాన్ చర్చలకు బ్రేక్?లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా?ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.మిడిల్ఈస్ట్ సంక్షోభం ఎటు?ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఆపారు. బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేయాలని, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరుపక్షాలతో మాట్లాడి తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగేలా ఒప్పందం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నేను చాలా ఫలప్రదమైన ఫోన్ సంభాషణ జరిపాను. బీరూట్కు ఎటువంటి సైనిక బలగాలు వెళ్లవు. హిజ్బుల్లాతో కాల్ మాట్లాడాను. అన్ని రకాల కాల్పులను నిలిపివేయడానికి వారు అంగీకరించారు — ఇజ్రాయెల్ వారిపై దాడి చేయదు, వారు ఇజ్రాయెల్పై దాడి చేయరు"" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్లో రాశారు.లెబనాన్ రాజధాని వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలను తన ఆదేశాలతో వెనుకకి తిరిగినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల ఆధారంగా.. హిజ్బుల్లా కూడా కాల్పులు జరపకుండా ఉండేందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే శాంతి చర్చల ఒప్పందంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకూ చర్చలు ప్రస్థావనే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. -
మేము కోరుకున్నది దక్కకపోతే..
వాషింగ్టన్: పశ్చిమాసియాలో హార్మూజ్ జలసంధి దిగ్బంధం సహా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో మంచి ఒప్పందానికి అమెరికా, ఇరాన్లు చాలా దగ్గరగా వచ్చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, తాము కోరుకున్నది లభించకపోతే ఆ ఒప్పందాన్ని వేరే విధంగా ముగిస్తామని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్లో తన కోడలు లారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఇరాన్తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ, తొందరపడితే మంచి ఒప్పందం కుదరదని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా తాము కోరుకున్నది సాధిస్తున్నామని తేల్చిచెప్పారు. కోరుకున్నది దక్కేదాకా వేచి చూస్తామని, ఒప్పందం విషయంలో తొందరేమీ లేదని సంకేతాలిచ్చారు. చర్చల విషయంలో ఇరానీయులు మంచి నిపుణులు అని అన్నారు. కానీ, ఇరాన్ సైనికపరంగా ఇప్పటికే ఓడిపోయినందున ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇరాన్తో ఒప్పందం చేసుకోగలిగితే మంచిదేనని.. లేకపోతే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ చెప్పిందని ట్రంప్ అన్నారు. ఒకవేళ వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటి అయుధాన్ని కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్పై అమెరికాకు గణనీయమైన పట్టు సాధించిందని తెలిపారు. అయితే, ఇరాన్ నాయకత్వంలో కొందరు మితవాదులు ఉండడంతో తాము ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేయలేదని అన్నారు. ఇరాన్లోని అత్యంత తీవ్రవాద శక్తులను, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 60 రోజల తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందులోని అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
ట్రంప్ హెల్త్ రిపోర్ట్: ఫుల్ ఫిట్.. కానీ..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ తెరదించింది. త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్.. తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని తాజాగా విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు.పూర్తిగా ఫిట్.. కానీ జాగ్రత్తలు అవసరంవాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్నకు వైద్య పరీక్షలు జరిగిన అనంతరం, వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ బార్బబెల్లా అధికారిక నివేదక విడుదల చేశారు. ట్రంప్ తన కమాండర్ ఇన్ చీఫ్ విధులను నిర్వహించడానికి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేవని నివేదిక తెలిపింది. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా, గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైంది. వైద్యపరంగా అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉన్నదని, క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.మేధో శక్తికి పక్కా స్కోరువయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలకు ఈ నివేదిక గట్టి సమాధానం ఇచ్చింది. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి, తన మానసిక పదునును నిరూపించుకున్నారు. గతంలో పలుమార్లు ఆయన సభల్లో కళ్లు మూసుకోవడంపై వచ్చిన విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. అలసట వల్ల కాకుండా, కేవలం విశ్రాంతి కోసమే అలా చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని కాపాడుకునేందుకు ఆయనకు వ్యక్తిగత ఆహార నియమాలు, వ్యాయామాలపై ప్రత్యేక సూచనలు చేశారు.నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యంనివేదికలో పేర్కొన్నట్లుగా, ట్రంప్ చేతులపై ఉన్న స్వల్ప రంగు మార్పులు తరచుగా షేక్హ్యాండ్స్ ఇవ్వడం, గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆస్ప్రిన్ మందుల ప్రభావమేనని వైద్యులు వివరించారు. ఈ చిన్నపాటి సమస్యలు మినహా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. గతంలో ఆరోగ్యంపై వచ్చిన వదంతులను పక్కనపెట్టి, ఇప్పుడు సూచించిన జీవనశైలి మార్పులను ట్రంప్ పాటించాలని డాక్టర్లు కోరారు. -
భారత్లో ట్రంప్ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆమె.. ఢిల్లీలోని చారిత్రాత్మక బాప్స్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్తో పాటు రాజస్థాన్లోని జైసల్మేర్ వెళ్లారు. టిఫానీ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, కట్టడాలను టిఫానీ దంపతులు మంత్రముగ్దులయ్యారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు ఫోటోలు దిగారు. ఆచిత్రాలను టిఫాని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు. -
డీల్పై సంతకానికి ట్రంప్ నో
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులపాటు పొడిగించేందుకు, హార్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం పట్ల ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దీన్ని పరిశీలించిన ట్రంప్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సిచ్యుయేషన్ రూమ్లో తన సలహాదారులతో చర్చించానని, ఇరాన్తో ఒప్పందంపై అతిత్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, డీల్పై సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఇరాన్తో చేసుకొనే ఏ ఒప్పందమైనా అమెరికాకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం డీల్ విషయంలో అమెరికాతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్తో మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
స్వదేశానికి వెళ్లక్కర్లేదు
వాషింగ్టన్: గ్రీన్కార్డు దరఖాస్తుల విషయంలో కొత్త నిబంధనల పట్ల తీవ్ర విమర్శలు రావడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు) కోసం చేసుకున్న దరఖాస్తు సమీక్ష దశలో ఉన్నప్పుడు.. దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదని యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగం వెల్లడించింది. గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా స్వదేశానికి తిరిగివెళ్లాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అసాధారణ పరిస్థితుల్లో మినహా.. అమెరికాలో శాశ్వత నివాసిత హోదా కోరుకునే విదేశీయులు దరఖాస్తు, ప్రాసెసింగ్ సమయంలో స్వదేశాల్లోనే ఉండాలని ఆదేశిస్తూ మే 21వ తేదీన ప్రకటన జారీ చేసింది. దీనిపై వలసదార్లు, అమెరికా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి. గ్రీన్కార్డు జారీ విధానంలో ఎలాంటి సమూల మార్పు జరగలేదని డీహెచ్ఎస్ ప్రకటించింది. ఒక దరఖాస్తుదారుడు అమెరికా వెలుపల నుండి గ్రీన్కార్డు ప్రక్రియను పూర్తి చేయాలా? లేక అమెరికాలోనే ఉండాలా? అనే విషయాన్ని కేసుల వారీగా పరిశీలించి నిర్ణయించే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎప్పటినుంచో ఉందని గుర్తుచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ ప్రకారం.. అర్హులైన వలసదారులు ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’అనే ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసిత హోదా కోసం అమెరికాలో ఉంటూనే దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు అమెరికాలోనే నివసించవచ్చు. స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా, గ్రీన్కార్డు కోరుకునే వ్యక్తులు దరఖాస్తు, ఆమోద ప్రక్రియ సమయంలో స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది ‘‘తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్కార్డు కోరుకునే విదేశీయులు దరఖాస్తు చేసుకోవడానికి ఇకపై స్వదేశానికి తిరిగి వెళ్లాలి’’అని ఆయన స్పష్టంచేశారు. వలసదార్లు వారి స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకున్నప్పుడు, అది తిరస్కరణకు గురైతే వారికి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ఒకవేళ అమెరికాలో ఉండి దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే వారు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లుగా గుర్తించాల్సి వస్తుందని తెలిపారు. వారిని వెతికిపట్టుకొని బయటకు పంపించే ప్రయాస కూడా తమకు తప్పుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనను వలసదార్లు తప్పుపట్టారు. విదేశీ కారి్మకులపై ఆధారపడిన అమెరికా కంపెనీలు కూడా మండిపడ్డాయి. దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
ట్రంప్వి బిల్డప్ బాబాయ్ మాటలే..!
‘అన్నీ సెట్ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు."హర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.అలాగే ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది. -
రికార్డు సృష్టించనున్న ట్రంప్.. నోట్లపై
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారు. అమెరికా $250 నోటుపై ట్రంప్ చిత్రం ముద్రించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరెన్సీ నోట్లపై జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని ముద్రించడాన్ని నిషేధించే నిబంధన ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనను మార్చే యత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని కలిగిన 250 డాలర్ల నోటును జారీ చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభం చేసింది. ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే కొత్త నోటును ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఇదే ఆమోదం పొందితే 50 ఏళ్లకు పైగా కాలంలో అమెరికా నోటుపై కనిపించిన తొలి సజీవ వ్యక్తి ట్రంప్ అవుతారు.2026లో యునైటెడ్ స్టేట్స్ తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సాధించిన విజయాలను సూచిస్తూ ఈ నోటును జారీ చేస్తామని తెలిపారు. కాగా ఈ నోటు ప్రాథమిక డిజైన్ను చూసిన డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చూసి, దానికి కొన్ని మార్పులు సూచించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.160 ఏళ్ల చట్టం మార్చాలి 1866లో కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం, కేవలం మరణించిన ప్రముఖుల ఫోటోలను మాత్రమే డాలర్లపై ముద్రిస్తారు. జీవించి ఉన్న ఏ వ్యక్తి ఫోటోను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఈ నిబంధనను ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. దీంతో ట్రంప్ ఫోటో వేయడానికి వీలుగా చట్టాన్ని సవరించాలంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కాగా అమెరికా కరెన్సీ చరిత్రలో మొదటిసారిగా ఒక అధ్యక్షుడి పదవికాలంలోనే తన సంతకం నోట్లపై రాబోతోంది. $100 నోట్లతో పాటు ఇతర డాలర్ నోట్లపై డోనాల్డ్ ట్రంప్ సంతకాన్ని ముద్రించడానికి ట్రెజరీ శాఖ అనుమతించింది. ఈ నోట్ల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. -
బ్లాకేడ్ ఎత్తేస్తున్నా.. మీ భార్యలకు హాయ్ చెప్పండి.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్హౌస్లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. -
కరెన్సీ నోటు మీద ట్రంప్.. డిజైన్ రెడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన చర్చ అమెరికా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ నోటుకు సంబంధించిన డిజైన్ను సిద్ధం చేశామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. అయితే దీనికి తుది ఆమోదం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మాట్లాడిన బెస్సెంట్, “మేము బిల్లు డిజైన్ను సిద్ధం చేశాం. అవసరమైతే వెంటనే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక స్మారక నోటుగా దీనిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్లో పెండింగ్లో బిల్లుఈ ప్రతిపాదనకు సంబంధించి రిపబ్లికన్ ప్రతినిధి జో విల్సన్ కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం సజీవ వ్యక్తుల చిత్రాలు అమెరికా కరెన్సీపై ముద్రించరాదు. అయితే ట్రంప్ కోసం ఆ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది. ట్రెజరీ విభాగం ప్రకారం, కాంగ్రెస్ ఆదేశిస్తే “అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రతిబింబించే స్మారక 250 డాలర్ల నోటు” విడుదలకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు.డిజైన్లో ట్రంప్ చిత్రం, సంతకంవాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ నోటు డిజైన్లో ట్రంప్ చిత్రపటంతో పాటు 250వ వార్షికోత్సవ లోగో, ఆయన సంతకం కూడా ఉండనున్నాయి. బ్రిటిష్ కళాకారుడు ఇయాన్ అలెగ్జాండర్ ఈ డిజైన్ను రూపొందించినట్లు సమాచారం. అమెరికా బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్లో ఈ ప్రతిపాదనపై అంతర్గత చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రంప్ నియమిత యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ బ్రాండ్ విస్తరణ2025లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన పేరు, చిత్రాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ చిత్రంతో 250వ వార్షికోత్సవ స్మారక నాణేలు రూపొందించగా, ఫెడరల్ భవనాలపై కూడా ఆయన చిత్రపటాలు ప్రదర్శిస్తున్నారు. అయితే 250 డాలర్ల నోటు విడుదల కావాలంటే కాంగ్రెస్ బిల్లు ఆమోదం పొందడంతో పాటు ట్రంప్ సంతకం కూడా అవసరం. “మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. ఇక నిర్ణయం క్యాపిటల్ హిల్ చేతుల్లోనే ఉంది” అని బెస్సెంట్ స్పష్టం చేశారు. -
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్సిగ్నల్ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్హౌస్పైనే నిలిచింది.అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయగా.. బందర్ అబ్బాస్ సమీపంలో ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు జరిపింది. అమెరికా దళాలు ఐదు డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించగా.. ఇరాన్ మాత్రం తమపై దాడులు పునరావృతమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఒమన్, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. “అది అంతర్జాతీయ జలమార్గం.. ఎవరూ దానిపై ఆధిపత్యం చెలాయించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటు టెహ్రాన్లో ఆగ్రహానికి దారితీశాయి.మరోవైపు ఇజ్రాయెల్–హెజ్బొల్లా ఘర్షణలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. లెబనాన్, బీరూట్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా.. ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు ఒక్క ట్రంప్ చేతుల్లోనే ఉండటం గమనార్హం. -
డెల్కు ట్రంప్ భారీ డీల్.. బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.అమెరికా మీడియా సంస్థ సీఎన్బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు. -
భారత్ ఐటీ ఉద్యోగులపై ట్రంప్ పిడుగు H-1B వీసాలు ఇక డౌటే
-
ట్రంప్ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్హౌస్లో UFC (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైట్ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. యూఎఫ్సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్హౌస్ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్ నైట్” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్ను ట్రంప్ పుట్టినరోజు(జూన్ 14) చుట్టూ ప్లాన్ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్ స్పోర్ట్స్ షోకేస్”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. వైట్హౌస్ దక్షిణ లాన్ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్ రింగ్, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్ అప్ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్ కోసం దాదాపు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా) వరకు ఖర్చవొచ్చని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే వైట్హౌస్ లాన్ దెబ్బతినడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మాత్రమే దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చవుతుందని స్వయంగా యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్ వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయిఅమెరికాలో పెరుగుతున్న ద్రవ్య లోటు, ప్రజా వ్యయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి “ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్” అవసరమా? అనే ప్రశ్న డెమొక్రాట్లు గట్టిగా లేవనెత్తుతున్నారు. “ట్రంప్ దుబారా ప్రాజెక్ట్”గా విమర్శిస్తున్నారు. వైట్హౌస్ అనేది పరిపాలనా కేంద్రం తప్ప వినోద వేదిక కాదని, అక్కడ పోరాట క్రీడల కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం అధ్యక్ష పదవికి తగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది పాలన కాదు.. పబ్లిసిటీ షో” అని కొందరు నేతలు ఘాటుగా విమర్శించారు. ఇక రిపబ్లికన్ వర్గాల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన ఉంది. కొందరు దీనిని అమెరికా 250 ఏళ్ల వేడుకలను ప్రపంచానికి చూపించే అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఇది అనవసర రాజకీయ వివాదాలకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో చూస్తే వైట్హౌస్ ప్రాంగణంలో ఇలాంటి పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగలేదు. సాధారణంగా అధికారిక వేడుకలు, చిన్న స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే అక్కడ నిర్వహించబడతాయి. అంతర్జాతీయ స్థాయి ఫైట్ ఈవెంట్ మాత్రం వైట్హౌస్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. ఇదే సమయంలో..ట్రంప్ ఆధ్వర్యంలో వైట్హౌజ్లో కొన్ని నిర్మాణ మార్పులు కూడా జరుగుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సమావేశ హాళ్ల ఆధునీకరణ, ఈవెంట్ స్పేస్ల విస్తరణ, భద్రతా మౌలిక సదుపాయాల మార్పులతో పాటు భారీ “బాల్రూమ్” నిర్మాణ ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉండడం తెలిసిందే. అయితే.. అంతర్జాతీయ స్థాయి విందులు, భారీ రాజకీయ–సామాజిక ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా ఈ మార్పులు చేపడుతున్నారన్న చర్చ సాగుతోంది. డెమొక్రాట్లు మాత్రం “వైట్హౌస్ను పరిపాలనా కేంద్రం నుంచి ఎంటర్టైన్మెంట్ వేదికగా మార్చేస్తున్నారు” అంటూ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఏది ఏమైనా ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. యూఎఫ్సీ ఈవెంట్ను “గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్”గా అభివర్ణిస్తూ భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైట్హౌస్లో యూఎఫ్సీ ఫైట్ ప్లాన్ను చాలామంది “రాజకీయ బ్రాండింగ్ ఈవెంట్”గా చూస్తున్నారు.ఏంటీ ఫైట్?యూఎఫ్సీ.. “అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్”. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) పోటీ సంస్థ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, జియూ-జిట్సు వంటి పలు యుద్ధ కళలను కలిపి జరిగే పోరాటాలను ఇందులో నిర్వహిస్తారు. అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా ఎదిగింది. ఆక్టగాన్ అనే ఎనిమిది కోణాల రింగ్లో ఫైటర్లు తలపడటం యూఎఫ్సీ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ పోటీలను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇది కేవలం క్రీడ మాత్రమే కాకుండా భారీ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీగా కూడా మారింది. -
ట్రంప్ పోలికలే రక్షించాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్మీడియాలో వైరల్గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కు బక్రీద్ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ.. చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.బంగ్లాదేశ్లోని ఢాకా సమీప నారాయణ్గంజ్లో ఓ ఫారంలో పెంచుతున్న ఈ అరుదైన ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ గేదె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పిల్లలు, యువత, కుటుంబాలు పెద్దఎత్తున ఫారంకు చేరుకుని సెల్ఫీలు దిగేవారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట.అయితే ఈద్ అల్ అదా సందర్భంగా బలి కోసం ఇప్పటికే ఈ గేదెను విక్రయించినట్లు యజమాని జియౌద్దీన్ మృధా వెల్లడించారు. “ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను.. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని ఆయన చెప్పడంతో.. వైరల్ స్టార్గా మారిన ఈ గేదె కథ విషాదంగా ముగియబోతోందన్న చర్చ మొదలైంది.కానీ సోషల్మీడియాలో పెరిగిన చర్చలు, భారీ ప్రజాదరణ చివరకు ప్రభుత్వాన్ని కదిలించాయి. పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ చివరి క్షణంలో జోక్యం చేసుకుని గేదెను రక్షించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ‘ట్రంప్ బఫెలో’ను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. ప్రత్యేక షెడ్, కేర్టేకర్ను ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆల్బినో జంతువులు బంగ్లాదేశ్లో చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం కారణంగానే వీటికి తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టు వస్తాయని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు పలుమార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని తెలిపారు.ఇప్పుడు సోషల్మీడియాలో ఒక్క ప్రశ్నే వైరల్గా మారింది.. “ట్రంప్లా కనిపించడం వల్లేనా ఈ గేదె ప్రాణాలు దక్కాయి?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. బలి పీఠం దాకా వెళ్లిన ‘ట్రంప్ బఫెలో’ కథ చివరకు జూ వరకూ చేరి హ్యాపీ ఎండింగ్ దిశగా మలుపు తిరిగింది. -
పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్ విషయంలో ఒమన్ గనుక ఇరాన్కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్పై విరుచుకపడ్డారుఅమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్ "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్ని అన్నారా? లేక ఇరాన్కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్హౌస్నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. -
నాటోకు అమెరికా భారీ ఝలక్..
ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ భయానక యుద్ధ పరిస్థితులు.. -
ట్రంప్ ప్లాన్తో పాక్ పాస్పోర్ట్ చెల్లదా?
“ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్కు చెల్లదు”.. అని పాకిస్థాన్ పాస్పోర్ట్పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్ తన పాస్పోర్ట్ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది.ట్రంప్ తాజాగా “అబ్రహామ్ అకార్డ్స్” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్, టర్కీతో పాటు పాకిస్థాన్ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు. మిడిల్ ఈస్ట్లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్ చెబుతోంది.అబ్రహం అకార్డ్స్అబ్రహం అకార్డ్స్.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇందులో చేరి ఇజ్రాయెల్తో నేరుగా దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. విమాన సర్వీసులు, టూరిజం, వ్యాపారం, సాంకేతిక సహకారం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. అయితే.. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకముందే అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో చేతులు కలపడం వల్ల ఇవి మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో చారిత్రక మలుపుగా భావించబడ్డాయి.నిబంధనల దాకా..ఇక్కడే పాకిస్థాన్కు పెద్ద చిక్కు ఎదురవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పాస్పోర్ట్పై స్పష్టంగా ఇజ్రాయెల్కు మినహాయింపు(Israel excepted) అనే నిబంధన ఉంది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుందిగానీ… ఇజ్రాయెల్కు మాత్రం కాదు. ఒకవేళ పాకిస్థాన్ ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలు ఏర్పరచుకుంటే… అదే సమయంలో తమ పౌరులు అక్కడికి వెళ్లకూడదని చెప్పే పాస్పోర్ట్ కొనసాగించడం చట్టపరంగా విరుద్ధంగా మారుతుంది. దౌత్య సంబంధాలు, వీసాలు, ట్రేడ్, ఎంబసీ వ్యవస్థ అన్నీ అమల్లోకి రావాలంటే ఈ నిబంధనను తొలగించాల్సిందే.ఇలాంటి పరిణామం ఇప్పటికే బంగ్లాదేశ్లో జరిగింది. ఆధునిక ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టే సమయంలో “except Israel” అనే వాక్యాన్ని అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా అదే ప్రశ్న ముందుకొస్తోంది. అందుకే… ట్రంప్ ప్రతిపాదన కేవలం విదేశాంగ రాజకీయాల మార్పు మాత్రమే కాదు… పాకిస్థాన్ జాతీయ గుర్తింపులో భాగమైన పాస్పోర్ట్ నిబంధనల వరకూ వెళ్లే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాక్తో పాటు సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా చేరాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి, ఆర్థిక భాగస్వామ్యం, ఇజ్రాయెల్తో సహకారం కోసం ఈ ఒప్పందాల్లో చేరడం అవసరమని ట్రంప్ భావిస్తున్నారు.ఏయే దేశాలంటే.. ప్రపంచ దేశాల పాస్పోర్ట్లలో సాధారణంగా.. “ఈ పాస్పోర్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది” అనే వాక్యం కనిపిస్తుంది. కానీ పాకిస్థాన్ పాస్పోర్ట్పై మాత్రం దశాబ్దాలుగా .. “ఇజ్రాయెల్కు మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్పోర్ట్ చెల్లుతుంది” అనే వాక్యం ముద్రించబడుతోంది. పాకిస్థాన్ ఈ నిబంధనను ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి. 1947లో భారత విభజన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది, అంటే 1948లో ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచే పాలస్తీనా భూభాగాలపై వివాదం మొదలైంది. పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్… ఇజ్రాయెల్ను అధికారిక దేశంగా గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగానే పాకిస్థాన్ పాస్పోర్ట్లపై “ఇజ్రాయెల్కు చెల్లదు” అనే నిబంధనను ముద్రించడం ప్రారంభించింది. 1950ల చివరి దశ నుంచి 1960ల నాటికి ఈ వాక్యం అధికారికంగా పాస్పోర్ట్లలో స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇది కేవలం పాకిస్థాన్కే పరిమితమైన విషయం కాదు. ఒకప్పుడు అనేక ముస్లిం దేశాలు ఇలాంటి విధానాలనే పాటించాయి. అరబ్–ఇజ్రాయెల్ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్ను వ్యతిరేకించిన దేశాలు తమ పౌరులు అక్కడికి వెళ్లకుండా పాస్పోర్ట్లపైనే నిషేధాలను ముద్రించేవి. బంగ్లాదేశ్, మలేషియా, బ్రూనై, ఇరాన్, సిరియా, లెబనాన్, కువైట్ వంటి దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. కాలక్రమేణా ప్రపంచ రాజకీయాలు మారాయి. అనేక దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకున్నాయి. దీంతో కొన్ని దేశాలు పాస్పోర్ట్లలోని ఆ నిబంధనలను తొలగించాయి. బంగ్లాదేశ్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అక్కడ కూడా చాలాకాలం పాటు “ఇజ్రాయెల్కు మినహా” అనే వాక్యం ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పాస్పోర్ట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఆ వాక్యాన్ని తొలగించారు. అయితే ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించలేదనే తమ వైఖరి మాత్రం మారలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా పాకిస్థాన్, ఇరాన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్ స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే… పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా లభించే వరకు ఇజ్రాయెల్ను గుర్తించే ప్రసక్తే లేదని. బంగ్లా బాటలో వెళ్తే.. మొదటిగా పాస్పోర్ట్లను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న “ఇజ్రాయెల్కు మినహా” అనే నిబంధనను తొలగించాలంటే కొత్త నమూనా పాస్పోర్ట్లు ముద్రించాలి. లక్షలాది పాస్పోర్ట్లను దశలవారీగా మార్చాల్సి రావచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో వీసా విధానాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, విమాన సర్వీసులు, రాయబార కార్యాలయాల ఏర్పాట్లు వంటి అనేక వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య అధికారిక ప్రయాణాలు ప్రారంభమైతే చట్టపరమైన మార్పులు కూడా తప్పవు.అయితే అసలు భారమంతా రాజకీయంగానే ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్థాన్లో పాలస్తీనా అంశం భావోద్వేగానికి సంబంధించినది. ఇజ్రాయెల్ను గుర్తించడం అంటే “దశాబ్దాల వైఖరికి విరుద్ధం” అని మతపరమైన, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా మతపరమైన పార్టీలు, కఠినవాద సంస్థలు దీన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చవచ్చు. మరోవైపు సైన్యం, విదేశాంగ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశాలతో సంబంధాలపై కూడా దాని ప్రభావం పడొచ్చు.ఇక మద్దతుదారులు మాత్రం వేరే వాదన చేస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పడితే సాంకేతికత, వ్యవసాయం, భద్రత, వాణిజ్య రంగాల్లో లాభాలు రావచ్చని అంటున్నారు. మధ్యప్రాచ్య దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే… ఇది కేవలం పాస్పోర్ట్పై ఒక లైన్ మార్చడం కాదు. పాకిస్థాన్ దశాబ్దాల రాజకీయ సిద్ధాంతాన్ని మార్చే నిర్ణయంగా మారే అవకాశం ఉంది. -
ట్రంప్ హెల్త్ చెకప్ .. అధ్యక్షుడు సేఫేనా?
వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారుతన ట్రూత్ సోషల్ పోస్ట్లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్య సమస్యలుట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.రాజకీయ ప్రాధాన్యతఅమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు. -
ఇరాన్పై అమెరికా నిప్పుల వర్షం
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సోమవారం దక్షిణ ఇరాన్పై భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టేన్ టిమ్ హాకిన్స్ సోమవారం ప్రకటించారు.ఇవి కేవలం తమ ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని వివరణ ఇచ్చారు. ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను కాపాడుకోవడానికి దాడులకు చేయక తప్పలేదన్నారు. అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. అమెరికా దాడుల్లో ఇరాన్కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు.పడవలపై అమెరికా దాడులు చేయడంతో నలుగురు ఇరాన్ జవాన్లు మరణించినట్లు ‘తబ్నాక్’అనే వార్తా సంస్థ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న, సైనిక ఓడరేవుతోపాటు విమానాశ్రయం కలిగిన బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. తాజా దాడులు కాల్పుల విరమణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి యత్నాలకు భంగం కలిగించొద్దు: ఇరాన్ అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికి సంకేతంగా అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం ఖతార్లో చర్చల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టంచేశారు. అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్ను కూల్చాం: ఐఆర్జీసీ అమెరికాకు బుద్ధి చెప్పామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్లను, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటపెట్టలేదు. ఆ యురేనియంను నాశనం చేయాల్సిందే: ట్రంప్ ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం(అణు ధూళి)ను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి, నాశనం చేయవచ్చని చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాల్లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ వద్దనున్న యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతు విధించిన విషయం విదితమే. కానీ, తాజాగా ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
తైవాన్పై ఉభయుల చదరంగం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.మార్పున్నట్టా? లేనట్టా?రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు. తైవాన్కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?యుద్ధానికి దూరంతో ఏం పని?అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.మూడవది పెండింగ్లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.వ్యూహం ఉండనే ఉంది!ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. -
తెరపైకి అబ్రహం ఒప్పందం... డీల్ పై తెగేసి చెప్పిన ట్రంప్..
-
ట్రంప్ పోస్ట్ బాంబ్.. పాక్ ప్రధానికి ఘోర అవమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అబ్రహం అకార్డ్స్ విస్తరణపై మాట్లాడిన ట్రంప్.. తన సోషల్ మీడియా సందేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించలేదు. బదులుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను పేర్కొనడం ఇస్లామాబాద్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అబ్రహం అకార్డ్స్ విస్తరణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించాయి. ఇజ్రాయెల్తో సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో పాకిస్తాన్ పేరు కూడా చర్చలోకి రావడం ఇస్లామాబాద్కు అత్యంత సున్నితమైన పరిణామంగా మారింది. ఇజ్రాయెల్ను గుర్తించే అంశం దేశంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతను తెచ్చాయి. ఆయన తన పోస్టులో సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నాయకులను ప్రస్తావించినప్పటికీ.. పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పక్కన పెట్టి అసిమ్ మునీర్ను మాత్రమే పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నిర్మాణంలో సైనిక వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యంపై అంతర్జాతీయ దృష్టిని మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది.మిగిలిన దేశాల నాయకులను వారి రాజ్యాంగ పదవుల ద్వారా గుర్తించగా, పాకిస్తాన్ను మాత్రం దాని సైనిక అధిపతి ద్వారా గుర్తించారు. అక్కడ షరీఫ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతర్జాతీయ సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ట్రంప్ చేసిన ఎంపిక పాకిస్తాన్లో అధికార కేంద్రం ఎక్కడ ఉందన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో విదేశాంగ విధానాలు, భద్రతా నిర్ణయాల్లో సైన్యం ప్రభావం పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రస్తావన ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉందన్న పాత చర్చను ఇది మళ్లీ వేడెక్కించింది.ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ అవగాహన లోపం కాదని.. దేశంలో సివిలియన్ ప్రభుత్వం కంటే సైనిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అబ్రహం అకార్డ్స్ అంశం పాకిస్తాన్కు మరో దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు దేశంలో ఉన్న తీవ్ర భావోద్వేగ రాజకీయ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఒత్తిడుల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. ఇరాన్తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారు. ఆ ఒప్పందాలపై ఇరాన్ కూడా సంతకం చేయడం గౌరవంగా ఉంటుందని వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన చిక్కుముడిని విడదీయడానికి అమెరికా కృషి చేస్తోందన్నారు. చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలని ఆకాంక్షించారు. ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చని తెలిపారు. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చల్లో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. అయితే, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు అబ్రహం ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు చేశాయి. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఖమేనీ నుంచి ప్రతిస్పందన ఆలస్యం ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన గుర్తు తెలియని ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఆయనను కలుసుకోవడం ఇరాన్లోని అత్యంత ముఖ్యులకు తప్ప ఇతరులకు సాధ్యపడదు. శాంతి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీకి చేరవేయడం, ఆయన నుంచి ప్రతిస్పందన రావడానికి చాలా సమయం పడుతోందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అందుకే శాంతి ఒప్పందం ఖరారు కావడం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఒప్పందం ముసాయిదాను ఖమేనీ దాదాపు అంగీకరించారని సీనియర్ పరిపాలనా అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చాలామంది ఇరాన్ నాయకులు పగటి వెలుగు చూడకుండా, వారాల తరబడి అత్యంత పటిష్టమైన బంకర్లలో గడుపుతూ, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అమెరికా మీడియా వెల్లడించింది. చర్చల్లో గణనీయమైన పురోగతి: రూబియో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం చెప్పారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తున్నారని, చెడ్డ ఒప్పందాన్ని ఆయన అంగీకరించబోరని తేల్చిచెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం అత్యవసరమేమీ కాదు: ఇరాన్ అమెరికాతో ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యవసరమేమీ కాదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పష్టంచేశారు. చర్చలో ఉన్న చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చామని చెప్పడం సరైనదే అవుతుందన్నారు. అయితే, దీని అర్థం ఒప్పందంపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయని చెప్పడం కాదని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్లు ఇప్పటికే ఈ అవగాహనా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 60 రోజులపాటు కాల్పుల విరమణ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళిక వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
ట్రంప్పై.. మార్కో రూబియో సెటైర్.. క్లిప్ డీలీట్
అమెరికా విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన ట్రంప్ చేసిన ఒక పోస్ట్ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ప్రశ్నించారు.దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ విమర్శకులు ప్రస్థావించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. -
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. President Donald Trump posts on Truth Social- "Negotiations with the Islamic Republic of Iran are proceeding nicely! It will only be a Great Deal for all or, no Deal at all to the Battlefront and shooting, but bigger and stronger than ever before, and nobody wants that! During my… pic.twitter.com/D1IhQaGjim— ANI (@ANI) May 25, 2026 -
మిడిల్ ఈస్ట్పై ట్రంప్ బిగ్ ప్లాన్.. పాక్, గల్ప్ దేశాల బ్రేక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.అబ్రహాం ఒప్పందం లక్ష్యందౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.ఒప్పందంలోని దేశాలు..యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.ఇజ్రాయెల్కు లాభాలుఅరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.ఇజ్రాయెల్కు నష్టాలుపాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.అమెరికాకు లాభాలుప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.పాలస్తీనా సమస్యలో మార్పులుఅరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇరాన్ అంశంఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.పాకిస్తాన్ ఇలా..పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. -
ఇరాన్ డీల్పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్ను బలహీన స్థితిలో చర్చల టేబుల్పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. -
ఒప్పందానికి చేరువలో..
వాషింగ్టన్/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలిఇరాన్తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలన్నారు. మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో ఇరాన్తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.ఒప్పందంలో ఏముంది? → ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. → అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. → ఇరాన్ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. → యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది. → హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. → ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు. -
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ్మినిస్ట్రేటివ్లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.ఇరాన్ అణ్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. -
ఇరాన్ సరెండర్.. యురేనియంపై ట్రంప్ విజయం!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరాన్ యురేనియం నిల్వల నిర్మూలన పద్దతిపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన దాదాపు 400 కిలోల యురేనియం ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, దాదాపు ఆయుధ స్థాయి యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.🇺🇸🇮🇷 NYT: U.S. officials said Iran has reportedly agreed to give up its stockpile of highly enriched uranium as part of the proposed agreement announced by U.S. President Donald Trump. Officials said details on how the uranium would be removed or downgraded would be discussed… pic.twitter.com/BoNOksRsG4— Global Surveillance (@Globalsurv) May 24, 2026అయితే, ఈ దశలో ఈ అవగాహన ఇంకా విస్తృతంగానే ఉందని, యురేనియంను ఇవ్వడంపై కచ్చితమైన విధానంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆ అధికారులు తెలిపారు. విస్తృత ఒప్పందం అధికారికంగా కుదిరిన తర్వాత, తదుపరి అణు చర్చల దశలో ఇరాన్ ఈ పదార్థాన్ని ఎలా బదిలీ చేస్తుంది, పలుచన చేస్తుంది లేదా ఇతరత్రా తటస్థీకరిస్తుంది అనే దానిపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యురేనియం నిల్వలను దేశం నుండి బయటకు పంపవద్దని ఆదేశించారని ఇరాన్ వర్గాలు ఇటీవల పేర్కొన్న తర్వాత ఈ పరిణామం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేయబడిన దాదాపు 400 కిలోగ్రాముల యురేనియంను కలిగి ఉంది, ఇది ఆయుధ-స్థాయికి దగ్గరగా ఉంది. ఈ నిల్వలను మరింత శుద్ధి చేసి బహుళ అణు బాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు పదేపదే వాదిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, మధ్యప్రాచ్యంలో చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు స్థిరపడే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యుద్దం కారణంగా ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యురేనియం నిల్వను వదులుకోవడానికి అంగీకరించిన ప్రతిఫలంగా, అమెరికా ఈ ఆస్తులను విడదీయడానికి సిద్ధమవుతోంది.ప్రభావం: ఆర్థికంగా ఇరాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది.ప్రాంతీయ స్థిరత్వం: ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇరాన్ చర్చల్లో మరింత సహకరించే అవకాశం ఉంది.JUST IN: 🇵🇰🇮🇷 Pakistan official says Iran has agreed to hand over enriched uranium under the Trump-announced deal. pic.twitter.com/OK78Aus5qj— Whale Insider (@WhaleInsider) May 24, 2026ఇదిలా ఉండగా.. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అమెరికా మరోసారి సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మళ్లీ దాడులు జరిగితే ప్రారంభ దశ కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. -
శాశ్వత శాంతి విరమణ ఒప్పందం.. హర్మూజ్ జలసంధి ఓపెన్..!
-
అమెరికా వైట్ హౌస్ దగ్గర కాల్పులు.. ట్రంప్ కి తప్పిన ప్రమాదం..!
-
ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఏకంగా ఇరాన్ను అమెరికా జెండా రంగులతో కప్పేశారు ట్రంప్. ఇరాన్ దేశ చిత్ర పటాన్ని అమెరికా జెండా రంగులతో ఎడిట్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా దానికి "మధ్యప్రాచ్యపు యునైటెడ్ స్టేట్స్?" అనే క్యాప్షన్ జతచేశారు. దీంతో, ట్రంప్ చర్య.. పెను దుమారానికి దారి తీసింది.అయితే.. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్పై సాధ్యమయ్యే సైనిక చర్యపై అమెరికా ప్రభుత్వంలో చర్చలు మళ్లీ మొదలైన తరుణంలో ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక, కొన్ని రోజుల క్రితం ఇరాన్ పడవలపై క్షిపణి దాడులు, అంతరిక్ష యుద్ధం, ఇరాన్పై ఎగురుతున్న అమెరికా జెండాను చిత్రీకరిస్తూ ఏఐ (AI) రూపొందించిన చిత్రాలను కూడా ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, యాక్సియోస్ నివేదికలో ఉటంకించిన అమెరికా అధికారుల ప్రకారం.. చివరి నిమిషంలో చేసే దౌత్య ప్రయత్నాలు పురోగతిని సాధించడంలో విఫలమైతే, ఇరాన్పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.While Rubio speaks of progress in negotiations with Iran and promises to reveal more details in the near future, Trump, meanwhile, continues his media game on social networks. He posts a map of Iran colored in the hues of the American flag, captioning it: “The United States of… pic.twitter.com/sM7GxiqXgv— Military Summary (@MilitarySummary) May 23, 2026ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేదానిపై ఆదివారం ఆయనొక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్లో కొత్తగా దాడులకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని వార్తాసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ నేతలతో మునీర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
వైట్హౌస్ వద్ద మళ్లీ కాల్పులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌస్ వద్ద మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం ఓ ఆగంతకుడు సీక్రెట్ సర్వీసు సెక్యూరిటీ చెక్పాయింట్కు వద్దకు దూసుకొచ్చి భద్రతా సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని యూఎస్ సీక్రెట్ సర్వీసు విభాగం వెల్లడించింది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నారు. ట్రంప్కు సమీపంలో కాల్పులు జరగడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ట్రంప్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. నేనే ఏసుక్రీస్తుని.. రాజధాని వాష్టింగన్లో వైట్హౌస్ కాంప్లెక్స్కు ఆనుకొని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగుడు తన బ్యాగ్ నుంచి హఠాత్తుగా ఆయుధాన్ని బయటకు తీసి కాల్పులు ప్రారంభించాడని సీక్రెట్ సర్వీసు అధికారులు తెలిపారు. తాము వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించామని అన్నారు. దుండగుడితోపాటు అతడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. దుండగుడిని నాసిర్ బెస్ట్(21)గా గుర్తించినట్లు చెప్పారు. నాసిర్ బెస్ట్కు నేరచరిత్ర ఉంది. డి్రస్టిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టు రికార్డుల ప్రకారం.. 2025 జూలైలో అరెస్టయ్యాడు. అప్పట్లో అనుమతి లేకుండా వైట్హౌస్ మరో చెక్పాయింట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆగాలంటూ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. తానే ఏసుక్రీస్తునని చెప్పుకున్నాడు. తాను అరెస్టు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అప్పట్లో అతడిపై ప్రాథమిక విచారణ జరిగింది. కానీ, తదుపరి విచారణకు హాజరు కాలేదు. నిందితుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలియజేశారు. టార్గెట్ ట్రంప్? అధ్యక్షుడు ట్రంప్ను ఎవరైనా టార్గెట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 25న వాషింగ్టన్లోని వైట్హౌస్ సమీపంలో ఓ హోటల్లో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు అదే హోటల్లో కాల్పులకు తెగబడ్డాడు. మే 4న వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో కాల్పులు జరిగాయి. ట్రంప్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. తాజాగా వైట్హౌస్లో ట్రంప్ ఉండగానే, బయట సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద యువకుడు కాల్పులు జరిపాడు. వైట్హౌస్లో ఉన్న ట్రంప్పై ఈ కాల్పుల ప్రభావం పడలేదని సీక్రెట్ సర్వీస్ స్పష్టంచేసింది. వాస్తవానికి ట్రంప్ వారాంతాన్ని తన న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్లో గడపాల్సి ఉండగా, దానికి బదులుగా వైట్హౌస్లోనే ఉండాలని తన ప్రణాళికను మార్చుకున్నారు. కాల్పుల ఘటనపై శనివారం సాయంత్రం వైట్హౌస్లో ఉన్న జర్నలిస్టులు స్పందించారు. బయట నుంచి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. జర్నలిస్టులు బయటకు రాకుండా సీక్రెట్ సర్వీసు సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, కాల్పులు జరగ్గానే సీక్రెట్ సర్వీసు సిబ్బంది వైట్హౌస్ ప్రాంగణం చుట్టూ లాక్డౌన్ విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పరిస్థితి సద్దుమణిగినట్లు గుర్తించి, 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. -
యుద్ధమా? ఒప్పందమా?
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరదించడానికి ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్పై బాంబు దాడులు పునఃప్రారంభించాలా? లేదా? అనే దానిపై తన ఆలోచనలు ఫిఫ్టీ.. పిఫ్లీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. ఇరాన్తో తాను చక్కటి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని లేదా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్లు సైనిక చర్యను నిలిపివేయాలి. ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడమే లక్ష్యంగా 30 రోజుల పాటు విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాలి. చివరి నిమిషంలో జరిగే చర్చలు శాంతి ఒప్పందానికి దారితీయకపోతే, ఇరాన్పై కొత్తగా దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఇరాన్ నేతలతో అసిమ్ మునిర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
9/11 హీరో వెల్లెస్ క్రౌథర్కు అమెరికా అత్యున్నత పురస్కారం!
సెప్టెంబర్ 11, 2001లో (9/11) అల్ఖైదా జరిపిన ఉగ్ర దాడిలో ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడిన వెల్లెస్ రెమీ క్రౌథర్కు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు మరణానంతరం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ (సౌత్ టవర్) పై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు క్రౌథర్ వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఈ దాడి జరిగే సమయంలో క్రౌథర్ సౌత్ టవర్లోని 104వ అంతస్తులో ఈక్విటీస్ ట్రేడర్గా పనిచేస్తున్నాడు. మొదటి విమానం నార్త్ టవర్ను ఢీకొన్న తర్వాత వెల్లెస్కు అక్కడ నుంచి తప్పించుకునే అవకాశముండేంది. కానీ ఆయన మాత్రం తన ప్రాణం కన్న అక్కడ ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రౌథర్ ముఖానికి ఎర్రటి రుమాలు కట్టుకుని మెట్ల మార్గాల గుండా ప్రజలను కిందకు దించుతూ వారిని కాపాడాడు. కానీ ఈ ప్రయత్నంలో వెల్లెస్ రెమీ క్రౌథర్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన ఎరుపు రంగు రుమాలు 9/11 మెమోరియల్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆయన 'మ్యాన్ ఇన్ ది రెడ్ బందాణా'గా గుర్తింపు పొందారు. -
తులసి గబ్బార్డ్ ఎగ్జిట్.. వైట్హౌస్లో ఏం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్హౌస్ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. భారతీయ మూలాలు లేకున్నా.. తులసి గబ్బార్డ్(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్. కానీ ఆమె తల్లి క్యారెల్ గబ్బార్డ్కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. ఏం జరిగి ఉండొచ్చు?అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ట్రంప్.. పొగిడారు కదా!ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్హౌస్ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్మీడియాలో తుల్సీ గబ్బార్డ్ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.తులసి గబ్బార్డ్ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. -
అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా
ఇరాన్పై యుధ్దం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్ (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్లైన్ పంచుకున్నారు.తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను దగ్గరుండి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువుకాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్ సర్కార్లో తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half. Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026 -
పుతిన్తో ట్రంప్ గేమ్.. ఎక్కడికి దారి తీస్తుందో..
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చర్యలు.. ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం చెబుతారో అనేది ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూరోప్లో తమ బలగాలను తగ్గిస్తామని ఇన్నాళ్లూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోలాండ్కు అదనంగా 5000 మంది బలగాలను పంపనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రకటన నాటో దేశాలను షాక్కు గురిచేసింది.అంతకుముందు ట్రంప్.. జర్మనీ నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్లు చెప్పారు. జర్మనీ నుంచి సుమారు 5 వేల మందిని ఉపసంహరించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ యుద్ధంలో అమెరికా పరాజయాన్ని చవిచూసినట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. ఈ క్రమంలో జర్మనీ నుంచి తమ బలగాలను ట్రంప్ ఉపసంహరించుకున్నట్టు సమాచారం.కానీ, పోలాండ్కు మాత్రం అదనంగా బలగాలను పంపనున్నట్లు ట్రంప్ చెప్పడం నాటో దేశాల్లో గందరగోళం నెలకొన్నది. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవరోకీ విజయవంతంగా ఎన్నికయ్యారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, అమెరికా ఆయనకు మద్దతుగా 5 వేల మంది బలగాలను పోలాండ్కు పంపుతోందని ట్రంప్ తన ట్రుత్ సోషల్లో తెలిపారు. అయితే, జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ఇది యూరప్లో అమెరికా సైనిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా భావించబడుతోంది. మరోవైపు.. పోలాండ్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఇది రష్యా ముప్పు నుంచి రక్షణను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయం సైనిక వ్యూహం కంటే రాజకీయ సంబంధాలపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.పోలాండ్-రష్యా ఘర్షణ.. ప్రస్తుతం పోలాండ్-రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ తన భద్రతను నాటో మరియు అమెరికా సైనిక ఉనికిపై ఆధారపడి బలోపేతం చేస్తోంది. అలాగే రష్యా చర్యలను ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. ప్రస్తుతం పోలాండ్-రష్యా మధ్య ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధం రూపంలో కాకుండా “హైబ్రిడ్ వార్” రూపంలో జరుగుతున్నాయి. రష్యా పోలాండ్పై సైబర్ దాడులు, గూఢచారి చర్యలు, సమాచార యుద్ధం, మరియు సరిహద్దు అస్థిరతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. పోలాండ్ మాత్రం NATO తూర్పు రక్షణలో ముందు వరుసలో నిలిచి రష్యా ముప్పును ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే పోలాండ్-రష్యా సంబంధాలు మరింత కఠినమవుతాయి. మరోవైపు.. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో.. రష్యా నుంచి వచ్చే ముప్పు నిజమైన ప్రమాదమని పేర్కొన్నారు. 2025 నవంబరులో రష్యా క్షిపణి దాడిలో పోలాండ్ పౌరులు మరణించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది.పోలాండ్.. నాటో తూర్పు రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పోలాండ్ తన సైనిక శక్తిని విస్తరించి, NATO తూర్పు ఫ్లాంక్లో ప్రధాన స్థావరంగా మారింది. అమెరికా బలగాల ఉనికి, పోలాండ్ సైనిక విస్తరణ, మరియు NATO Forward Land Forces బెటాలియన్ పోలాండ్ను తూర్పు యూరప్ రక్షణలో కేంద్రంగా నిలబెట్టాయి.ప్రధాన ఘర్షణ రూపాలు1. హైబ్రిడ్ దాడులు సైబర్ దాడులు: పోలాండ్ ప్రభుత్వ, మౌలిక వసతులపై రష్యా తరచుగా సైబర్ దాడులు చేస్తోంది. గూఢచారి చర్యలు: రష్యా గూఢచారులు పోలాండ్లోని కీలక సైనిక, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాచార యుద్ధం: సోషల్ మీడియా, మీడియా ప్రచారాల ద్వారా పోలాండ్ సమాజాన్ని విభజించే ప్రయత్నం.2. సరిహద్దు సమస్యలు బెలారస్ ద్వారా వలసదారుల ప్రవేశం: రష్యా-బెలారస్ కలిసి అక్రమ వలసదారులను పోలాండ్ సరిహద్దులోకి పంపి అస్థిరత సృష్టిస్తున్నారు. సైనిక ఒత్తిడి: పోలాండ్ NATOతో కలిసి తూర్పు సరిహద్దులో బలగాలను పెంచుతోంది.3. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పోలాండ్ ఉక్రెయిన్కు ప్రధాన లాజిస్టికల్ హబ్గా మారింది. రష్యా దీన్ని ప్రత్యక్ష ముప్పుగా భావించి పోలాండ్పై దాడులను పెంచింది.పోలాండ్ పాత్రలో ప్రధాన అంశాలు1. Forward Land Forces (FLF) NATO తూర్పు ఫ్లాంక్లోని ఎనిమిది మల్టీనేషనల్ బెటాలియన్లలో ఒకటి పోలాండ్లో ఉంది. ఈ బెటాలియన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి మరియు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.2. Mass-Army Strategy పోలాండ్ 2039 నాటికి 500,000 సైనికులు (300,000 యాక్టివ్, 200,000 రిజర్వ్) కలిగిన భారీ సైన్యాన్ని నిర్మిస్తోంది. ఇది దీర్ఘకాలిక, అధిక తీవ్రత గల యుద్ధంను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. AI, డ్రోన్లు, లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమీకరిస్తోంది.3. Air & Missile Defence పోలాండ్ NATO Integrated Air and Missile Defence (IAMD)లో కీలక భాగస్వామి. పర్మనెంట్ NATO Air Policing ద్వారా పోలాండ్ ఆకాశాన్ని 24/7 పర్యవేక్షిస్తున్నారు.4. సైబర్ మరియు స్పేస్ రక్షణ పోలాండ్ NATO Eastern Sentry ప్రోగ్రామ్లో భాగమై, సైబర్ దాడులు, ఉపగ్రహ ముప్పులు.రష్యా ప్లాన్..నాటోలో విభేదాలు: రష్యా హైబ్రిడ్ దాడులు NATO ఏకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి.యూరప్లో అస్థిరత: సైబర్ దాడులు, ఇంధన సమస్యలు, వలసదారుల ఒత్తిడి యూరప్ భద్రతను దెబ్బతీస్తున్నాయి.ఉక్రెయిన్ మద్దతు తగ్గించడం: రష్యా లక్ష్యం యూరప్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతు తగ్గించేలా ఒత్తిడి చేయడం.నాటో ప్రస్తుతం రష్యా, చైనా వంటి దేశాల హైబ్రిడ్ వార్ వ్యూహాలకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2026లో NATO “Counter-Hybrid Support Teams”, Article 5 invocation readiness, మరియు EUతో సమన్వయం వంటి చర్యల ద్వారా సభ్యదేశాలను రక్షిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ పోలాండ్కు అదనపు బలగాలను పంపుతానని ప్రకటించడం నాటోకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తోంది. మొత్తం మీద రష్యా హైబ్రిడ్ వార్లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.1. సమన్వయం లోపం ట్రంప్ నిర్ణయం NATO మిత్రదేశాలతో ముందుగా చర్చించకుండా తీసుకున్నారు. NATOలో ఏకత్వం, నమ్మకం దెబ్బతింటుంది.2. జర్మనీ నుండి బలగాల తగ్గింపు పోలాండ్కు బలగాలను పంపడం కోసం అమెరికా జర్మనీలోని సైనికులను తగ్గిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలు దీన్ని తమ భద్రతా ప్రాధాన్యత తగ్గింపుగా భావిస్తున్నాయి. నాటోలోని ఇతర దేశాలు దీన్ని సంయుక్త వ్యూహం కాకుండా వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నాయి.4. తూర్పు-పశ్చిమ విభేదాలు తూర్పు యూరప్ దేశాలు (పోలాండ్, బాల్టిక్ దేశాలు) అమెరికా బలగాలను స్వాగతిస్తున్నాయి. పశ్చిమ యూరప్ దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) దీన్ని NATOలో విభేదాలు పెంచే చర్యగా భావిస్తున్నాయి. -
గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పుతాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్ ఎకోసిస్టమ్లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.స్టార్టప్లకు ముప్పుఅక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్ ఫౌండర్, నిక్ డేవిడోవ్ గుర్తుచేశారు.చట్టసభ సభ్యుల ఆగ్రహంఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం?


