వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించారు.
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే ఇరాన్ సుప్రీంలీడర్గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ దేశానికి చెందిన 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబాను ఎన్నుకుంది. ఈ ఎన్నికపై ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకుంటే వారే తమ లక్ష్యమని హెచ్చరించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.
కాగా పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కొరత ఏర్పడింది. హార్మూజ్ను ఎట్టిపరిస్థితుల్లో తెరిసేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వారి అనుమతి లేకుండా ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడి చేస్తుంది.


