వాషింగ్టన్: ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్తో పాటు మరికొన్ని దేశాలకు 30 రోజుల పాటు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను స్థిరీకరించడంతో పాటు పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సముద్ర రవాణాలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు పలు దేశాలకు వెసులుబాటు కల్పిస్తూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇరాన్ ఉగ్రవాద పాలన వల్ల తలెత్తిన అస్థిరతను ఎదుర్కొంటూనే, చమురు ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ మినహాయింపు కేవలం మార్చి 5 లోపు నౌకల్లో లోడ్ అయిన చమురుకు మాత్రమే వర్తిస్తుందని, ఇది ఏప్రిల్ 4 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
.@POTUS is taking decisive steps to promote stability in global energy markets and working to keep prices low as we address the threat and instability posed by the terrorist Iranian regime.
To increase the global reach of existing supply, @USTreasury is providing a temporary…— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 12, 2026
ఈ నిర్ణయం వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభం చేకూరదని అమెరికా అధికారులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో మెజారిటీ భాగం చమురు వెలికితీత సమయంలో విధించే పన్నుల ద్వారానే లభిస్తుందని, ప్రస్తుతం కేవలం రవాణాలో ఉన్న నిల్వలను విక్రయించుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చామని స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆసియా జలాల్లో సుమారు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు నిలిచిపోయి ఉంది. తాజా ఉత్తర్వులతో ఈ నిల్వలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్


