చాలామంది అప్పటి వరకు సామాన్యులుగా కనిపించినవాళ్లు..జీవితం పెట్టిన పరీక్షలతో ఒక్కసారిగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలుస్తారు. ప్రపంచమే జైజైలు పలికేలా ఆకామంత ఎత్తున నిలుస్తారు. అంతేగాదు కష్టం వస్తే కాళ్లు మునగదీసి ఏడుస్తూ కూర్చొవడం కాదు..కన్నెర్రజేసేలా హీరోలా బతికి చూపించాలి..మార్గదర్శకంగా ఉండాలని చేతలతో చూపిస్తారు. అలాంటి మాటలకు నిలువెత్తు అర్థం ఈ మహిళ. భయంకరమైన అనారోగ్య సమస్య ఆమెను భయపెట్టలేదు కదా..మరింత బలోపేతమై గొప్ప విజయాన్ని అందుకునేందుకు పురిగొల్పింది.
ఆ మహిళే జయశ్రీ విజయ్ మోహన్. చెన్నైకి చెందిన జయశ్రీ కొన్ని నెలల క్రితం టాంజానియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారామె. ఇది అత్యంత కఠినమైన పర్వత శిఖరాగ్రం. ఎందుకంటే శిఖరాగ్రం సమీపం చేరుకునే రోజున అస్సలు విశ్రాంతి తీసుకోకుండా సుమారు వెయ్యి మీటర్లు దాక 15 గంటల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టంలో సాధారణంగా లభించే ఆక్సిజన్ స్థాయిలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైన పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అదికూడా 6.5 గంటల్లో అవలీలగా అధిరోహించింది.
అలాగే వెనక్కి(అవరోహణ) 10.26 గంటల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చేశారామె. ఈ అరుదైన ఘనతతో జయశ్రీ ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్ రికార్డుల నెలకొల్పింది. ఇలా అతి తక్కువ సమయంలో మహిళల విభాగంలో కిలిమంజారోని అధిరోహించి.. వెనక్కి వచ్చేసిన తొలి మహిళగా నిలిచారామె. ఇంతటి ఘనతను సృష్టించిన జయశ్రీ నిజానికి ఆరోగ్యవంతమైన మహిళ కాదు. ఆమె ఒక స్ట్రోక్ బాధితురాలు. తన రికార్డు ఇతర మహిళలను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపారామె.
ఆమె ఒక తల్లిగా, విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా హాయిగా సాగిపోతున్న జీవితాన్ని స్ట్రోక్ ఒక్క కుదుపుతో దబాలున కిందపడేసినట్లయ్యింది. జయశ్రీ ఎడమవైపు మొత్తం పక్షవాతానికి గురై ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నా..తనకేమైందన్నది అర్థం గాక, తన శరీరం తనమాట వినక పడిన బాధ అంత ఇంత కాదు. పిల్లల కళ్లలో ఆందోళన ఒక్కటే తనకేదో అయ్యిందని అనిపిస్తోంది కానీ తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.
వివిధ ఆస్ప్రతులు తిప్పుతూ తన వాళ్లు పడుతున్న బాధ అర్థమవుతున్నా..ఏం చేయలేని ఆ నిస్సహాయత ఎప్పటికీ మర్చిపోలేనంటోంది జయశ్రీ. ఆ తర్వాత వైద్యులు తన వద్దకు వచ్చి..ఆమె గతంలోలా మాములు మనిషి అవ్వలేదని, నాడీ సంబంధిత పూర్తి నష్టాన్ని తిప్పికొట్టలేమని తేల్చి చెప్పేశారు. అప్పుడే తేలిసిందామెకు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలనేది.. అయితే తన స్థితిని మార్చలేకపోవచ్చు గానీ, ధైర్యాన్ని పోగొట్టుకోనక్కర్లేదని అంటోంది జయశ్రీ.
అంతేగాదు ఆ సమయంలోనే అసలైనవి "బలం", "సంయమనం" అని తెలసుకున్నానని చెబుతోంది. అప్పుడు అర్థం చేసుకున్నా.. శరీరం మాట వినడం, దాని పరిమితులు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఎలా అని పూర్తిగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.
కోలుకోవడం మొదలయ్యాక..ఏదో అనారోగ్య బాధితురాలిలా ఉండిపోవడం నచ్చక ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాగే తనలాంటి మహిళల్లో స్థైర్యం నింపాలన్న ఆకాంక్ష ఈ సాహసానికి పురిగొల్పిందని చెప్పుకొచ్చింది జయశ్రీ. నిజానికి ఈ పర్వత ట్రెక్కింగ్ కోసం ముందుగా ఆమె శారీరకంగా మానసికంగా ప్రిపేరయ్యేందుకు ఎంతగానో శిక్షణ, ట్రీట్మెంట్ల తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని భేఖాతరు చేయకపోగా..రికార్డులు మీద రికార్డులు నెలకొల్పడం అంటే మాటలు కాదుగదా..!.
(చదవండి: ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్ సోమన్)


