అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. సినీ అభిమానులకు అత్యాధునిక సదుపాయాలతో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఐమ్యాక్స్ స్థాయి విజువల్స్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికతతో అల్లు అరవింద్ దీనిని నిర్మించారు. అయితే, ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే, ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవం మాత్రం మార్చి 12న జరగనుందని తెలుస్తోంది. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం చేతులమీదుగా అల్లు సినిమాస్ ప్రారంభం కానుందని ఇప్పటికే సోషల్మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో మొదటి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ప్రదర్శించబడుతాయి. ఈ మల్టీఫ్లెక్స్లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. ప్రతి స్క్రీన్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.

పుష్ప-2 విడుదల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వారిద్దిరూ గద్దర్ అవార్డ్స్ వేదికపై కలుసుకోవడంతో వాటికి బ్రేక్ పడింది. అల్లు శిరీశ్ పెళ్లి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మరోసారి కలిసిని విషయం తెలిసిందే.. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకున్నారు. కొంత సమయం పాటు ఒకే సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలా అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడటంతో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సీఎం తప్పకుండా వెళ్తారని బన్నీ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


