ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సునీల్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్, సోనియా సింగ్, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జీ5(Zee5)లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అప్కమింగ్ చిత్రాల జాబితాలో ఆ సంస్థ చేర్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానుందని పేర్కొంది. సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో మంచి రెస్పాన్స్ రావచ్చని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
కథేంటంటే..
రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్ని స్పెయిన్లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


