breaking news
Hyderabad
-
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
పోలీస్ వెబ్సైట్.. అప్డేట్ మిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.వాటిలో కొన్ని ఇవి... జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్చార్జ్గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది. నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది. గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెప్తోంది. హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్గా మారిన ఈ జోన్కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. పాతబస్తీలోని సౌత్ జోన్ చారి్మనార్ జోన్గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్సైట్లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది. -
రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివిమీరిపోయారు. విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులే కాదు ఉన్నత విద్యావంతులను కూడా అలవోకగా మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ జడ్జీనే మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేటుగాళ్లు ఆయన నుంచి రూ.1.66 కోట్లను దోచుకున్నారు. ఈమేరకు మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్మెట్కు చెందిన రిటైర్డ్ జడ్జి (73)కి ఫిబ్రవరి 23న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను సీనియర్ సీబీఐ అధికారి దీపక్ కుమార్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. మీరు ఆధార్తో అనుసంధానమైన రెండు మొబైల్ నంబర్లను మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారని రిటైర్డ్ జడ్జికి చెప్పాడు.ఈమేరకు బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ్ సారథిగా పరిచయం చేసుకున్న మరో మోసగాడు కాన్ఫరెన్స్ కాల్లో చేరి.. మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్నావని చెప్పాడు. ఈమేరకు సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్నాడు. కుటుంబం లేదా స్నేహితులతో సహా ఎవరితోనూ ఈ విషయాన్ని చర్చించవద్దని మోసగాళ్లు హెచ్చరించారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం కేసులున్నాయంటూ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.విచారణ తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అరెస్ట్, ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని భయపడిన రిటైర్డ్ జడ్జి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య నాలుగు లావాదేవీల్లో తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.66 కోట్లను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. నిందితులు హామీ ఇచ్చిన విధంగా తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
30 నెలల్లో ‘పాలమూరు’ పూర్తి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 30 నెలల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్తో సహా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, వనరులను కల్పించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, బీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కలిపి మొత్తం రూ.1546 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగిరం చేయడంలో భాగంగా భూసేకరణ కోసం రూ.5వేల కోట్లను కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల అంచనాలతో పరిపాలనపర అనుమతులు జారీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. అంత ఖర్చుచేసినా ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు.తాజాగా అంచనాలు రూ.55 వేల కోట్లకు పెరిగాయని, డిస్ట్రిబ్యూటరీల వ్యయం కలిపితే రూ.80వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.7,161 కోట్లను ఖర్చు చేసిందన్నారు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా, పూడికతో 9 టీఎంసీలకు తగ్గిపోయిందని ఉత్తమ్ తెలిపారు. నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు తక్షణమే పూడిక తొలగింపు పనులను చేపడతామని ప్రకటించారు. జూరాల నుంచి తొలగించే ఇసుకను గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల్లో చుక్క నీళ్లను వదులుకోమన్నారు. సమీక్షలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. తెలంగాణ రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేళాను నిర్వహించారు. వ్యవసాయ వర్సిటీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళా రైతులకు డ్రోన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంట మార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆహార ధాన్యాల్లో స్వావలంబన: మంత్రి శ్రీధర్బాబు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను ఉపయోగించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట కోసి ఇంటికి చేరేవరకు మహిళలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఐకార్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ మాట్లాడుతూ కొత్త సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పంటల వైవిధ్యీకరణ, మార్కెట్లతో రైతాంగాన్ని అనుసంధానం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 30 మంది మహిళా రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. మెగా మహిళా రైతు మేళాలో సుమారు 6 వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
ఎస్హెచ్జీ మహిళకు డిజిటల్ హెల్త్ కార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ కార్డుల జారీకి ముందు వారికి 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వీటి ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించి పంపిణీ చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమాలకు ఆయన మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని రాజనర్సింహ, సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో శిశువులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమన్నారు. మహిళల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎస్హెచ్జీ సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు అవకాశం ఇస్తే పంట పొలాల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం ఇప్పుడిప్పుడే సాకారమవుతోందన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్’ పుస్తకాన్ని సీతక్క విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, దివ్య దేవరాజన్, శ్రుతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను సన్మానించి, వారికి రూ.25వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్లెట్స్ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్లు పోలీసులకు పెను సవాల్గా మారాయన్నారు. ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: కూకట్పల్లి షాపింగ్ మాల్లో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి వైజంక్షన్లోని లేక్ షేర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్లు, యాడ్ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.హోర్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
‘ కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం’
హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ఆ నీటిని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యదిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో అత్యధిక సాగు పంటలు పండాయి. ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేశాం. ప్రాజెక్టులకు భూ సేకరణను జూన్ 2 లోపు 5 వేల కోట్ల తో కంప్లిట్ చేస్తాం. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని చర్చించాం. పాలమూరు ను 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్ల..?, వారి హయాంలో నే పాలమూరు అంచనాలు రూ. 84 వేల కోట్లకు పెంచారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది. 2028 డిసెంబర్ లోపు అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం’ అని తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహనకు ‘పర్పుల్ రైడ్’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అపోలో ఆసుపత్రులు, పర్పుల్ రైడ్ సంయుక్తంగా ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించాయి. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అపోలో ఆసుపత్రి వరకు కొనసాగింది. సుమారు వెయ్యికి పైగా మహిళలు పాల్గొని ఉత్సాహంగా ర్యాలీని విజయవంతం చేశారు. న్యాయం, గౌరవానికి ప్రతీకగా భావించే పర్పుల్ రంగు సందేశాలతో తెలుపు టీషర్టులు ధరించి మహిళలు పాల్గొన్నారు.ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనే జింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగితా రెడ్డి మాట్లాడుతూ, మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ముందుగా చూసుకుంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. గుండె జబ్బులు, స్తన మరియు గర్భాశయ గర్భద్వార క్యాన్సర్లు, మధుమేహం, రక్తహీనత వంటి వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.ఆరోగ్య రంగంలో సాంకేతికత ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె, ఏఐ ఆధారిత ఆరోగ్య అంచనాలు ద్వారా వ్యాధి ప్రమాదాలను ముందుగానే గుర్తించి సమయానికి వైద్య సలహాలు పొందవచ్చన్నారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు.ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, మహిళలు బైక్ నడపలేరనే భావన ఇప్పుడు పాతబడి పోయిందన్నారు. ఈ ర్యాలీ ద్వారా మహిళల సాధికారతతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యమని చెప్పారు.క్యాంపెయిన్కు అనుబంధంగా ఉన్న డాక్టర్ రోషన్ మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ముందస్తు స్క్రీనింగ్పై దృష్టి పెట్టడం ద్వారా జీవనశైలి వ్యాధులను నివారించవచ్చన్నారు. మహిళల ధైర్యం, సామర్థ్యాన్ని ఈ ర్యాలీ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అపోలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్న వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధులు, ముందస్తు నిర్ధారణ ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య సలహాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. -
థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ ల్లో మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పార్కింగ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 2021, జూలై 20న జారీ చేసిన జీవో 121పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉచితం. దీనికి విరుద్ధంగా జీవో 121 జారీ చేశారంటూ న్యాయ విద్యార్థి ప్రేమ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్లో తన నుంచి వసూలు చేసిన పార్కింగ్ ఫీజు రశీదును జత చేశారు. పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
గ్రేప్ ‘పండు’గ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని గ్రేప్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు నేరుగా తోటల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించి కట్ చేసుకొని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హారి్టకల్చర్ వర్సిటీ ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ వెసులుబాటు ఉంది.52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లు కోసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావచ్చని నిర్వాహకులు వెల్లడించారు. రకాన్ని బట్టి రూ.250 నుంచి 700 ధర నిర్ణయించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రమ్య మృతి కేసు నిందితుడికి రెడ్కార్నర్ నోటీసు
హైదరాబాద్: ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరు మృతికి కారణమైన నిందితుడికి బంజారాహిల్స్ పోలీసులు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... 2016 జూలై ఒకటిన రమ్య(9) అనే విద్యారి్థనిని పాఠశాల నుంచి తీసుకొని ఆమె బాబాయి పి.రాజేష్, తాత మధుసూదనాచారిలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3 నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సినీమ్యాక్స్ భవనంలోని టీజీఐ ఫ్రైడ్ పబ్లో అతిగా మద్యం తాగిన ఆర్.శ్రావిల్, కచ్చా విష్ణువినీత్ల కారు బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ పంజగుట్ట వైపు అతివేగంగా దూసుకువచ్చింది. శ్రావిల్ నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి పంజగుట్ట శ్మశానవాటిక సమీపంలోని డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రమ్య ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో రమ్య, మధుసూదనాచారి, రాజేష్లు మృతి చెందారు. ఈ మేరకు ఏ1 శ్రావిల్, ఏ2 విష్ణువినీత్లపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు నడుస్తుండగానే విష్ణువినీత్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 17న నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ కేసు వాయిదా ఉండటంతో పోలీసులు సాక్షుల విచారణ చేపట్టారు. నిందితులను కూడా హాజరుపర్చేందుకుగాను అమెరికా నుంచి విష్ణువినీత్ను రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. -
పండ్ల రవాణాపై గల్ఫ్ గుబులు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్ ఫర్నిచర్లపై ప్రభావం ఉంది. రెండింతలైన ధరలు.. రంజాన్ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్లో యాపిల్స్ ధర (బాక్స్) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్ నగర మార్కెట్లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్ ధర అక్కడి మార్కెట్లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది. నిర్మాణ సామగ్రిపైనా.. ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాల నుంచి పెట్కోక్ (సిమెంట్లో ఉపయోగించేవి), పాలిమర్లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
వంటకు యుద్ధం మంట
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ (ఎలీ్పజీ), కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114.50 పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. రాష్ట్రంలో ఇదే సిలిండర్ ధర రూ. 905 నుంచి 965కు చేరుకుందని ఆయిల్ కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా ఖర్చులను బట్టి మారనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు గృహ బడ్జెట్పై మరింత ఒత్తిడి పెంచనుంది. కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం ఏకంగా రూ.114.50 పెంచింది. దీంతో ఢిల్లీలో ధర రూ.1,883కు చేరగా, హైదరాబాద్లో సుమారు రూ.2వేల వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్చి 1న కమర్షియల్ సిలిండర్పై రూ.28 పెంచారు. తాజా పెంపుతో ఈ ఏడాది ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర మొత్తం రూ.300కు పైగా పెరిగినట్లయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. ఫలితంగా టీ నుంచి భోజనం వరకు, ఇతర అన్ని తినుబండారాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్ల వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.‘మహాలక్ష్మి’కి ఊరట? తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 సబ్సిడీ కింద ఏటా ఆరు సిలిండర్లను ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. అయితే పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 740 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. పెరిగిన ధర కూడా ప్రభుత్వం భరించే పక్షంలో ఖజానాపై ఈ భారం మరింత పెరుగుతుంది. కాగా, ప్రస్తుతం పెట్రో ల్, డీజిల్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రంచెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా కొనసాగితే వాటి ధరల పెంపు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
మహిళల భద్రత అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్ విత్ హర్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డీజీపీ బి.శివధర్రెడ్డి, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు. డిజిటల్ క్రైం పెరిగింది.. ‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్ విత్ హర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. -
ముందుగానే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం నడివేసవిని తలపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగతలు నమోదు కావాల్సి ఉండగా... చాలాచోట్ల సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాలు లేకపోవడం, గాలిలో తేమశాతం తగ్గడంతో వేడిమి అధికంగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. కానీ 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుండటం మున్ముందు పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఏప్రిల్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటం కలవరపెడుతోంది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్నగర్లో 40.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహబూబ్నగర్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.9 డిగ్రీలు అధికంగా నమోదు కాగా... ఆదిలాబాద్లో 2.8, భద్రాచలంలో 2.7, హనుమకొండలో 2.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. శనివారం ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వచ్చేవారం చివర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
స్థానికంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో పేదలు తమ ఉపాధిని, సామాజిక జీవనాన్ని కోల్పోకుండా ఇకపై లబ్దిదారులకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గృహ సముదాయాల్లోనే ఇళ్లను కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లను కేటాయించి, లబ్ధిదారులను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. గతంలో ఉన్నట్లు కాకుండా లబి్ధదారులను దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితిని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఆయా గృహ సముదాయాలకు సమీపంలో నివాసం ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. జీవో నంబర్ 33 మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన, నిర్మాణాలు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తాం. డబుల్ బెడ్రూమ్ గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి మౌలిక సదుపాయాలతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నాటికి కనీసం 10 వేల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘ఇందిరమ్మ’కింద ఆర్థిక చేయూత మహానగర పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్ల‘పథకం కింద స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు సొంత గృహ నిర్మాణాలకు త్వరలో అనుమతులు, ఆర్థిక చేయూత మంజూరు చేస్తాం. ఇప్పటికే సుమారు 18,000 మంది లబ్దిదారులను గుర్తించాం. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెల 31 నాటికి ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నాం. మహానగర్ పరిధిలో మురికివాడల స్థానంలో సుమారు 25,000 గృహాలను గరిష్టంగా జీ+5, జీ+10 వరకు భవన సముదాయాలను నిర్మించి మెరుగైన నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే అత్యాధునిక భవనాలను నిర్మిస్తాం. అలాగే దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న ఈడబ్ల్యూఎస్, వాంబే గృహాల స్థానంలో కూడా కొత్త భవనాలను నిర్మించి, అక్కడి నివాసితులకు మెరుగైన గృహాలను అందిస్తాం. -
పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!
(సాక్షి, హైదరాబాద్) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్ మింటన్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. సంరక్షణలో అనేక సవాళ్లుభవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్గా నిలిచింది. లైమ్ మోరా్టర్ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. ప్రధాన సభా మందిరంలోనూ.. భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్ ఆర్చ్ నిర్మాణం బయటపడింది. హాల్లోని గోడలపై పూసిన ఎనామెల్ పెయింట్ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. కోరింథియన్ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్ టైల్స్తో మరమ్మతులు చేశారు. బాహ్య భాగంలో అలంకార శిల్పాలు భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. ఆధునిక వసతులతో ఏర్పాట్లుతెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ -
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
చందానగర్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం చందానగర్లో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందన్నారు. రాజకీయాలు కూడా దానికి అతీతం కాదన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు కూడా కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచనలు చేశారు.ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో› 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం సబితారెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ మహిళలకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మహిళలకు భద్రత, రక్షణ కావాలంటే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన సుమారు 40 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు. -
సీఎస్గా జయేశ్? లేదా వికాస్?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది, ఈనెల 31న సీఎస్గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు. ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్రెడ్డి సీఎస్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అన్నీతానై... జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు. ఆ తరువాత ‘టాస్్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు. మిగిలిన వారు ఎలా..? ఇక వికాస్రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్లో స్పెషల్ సీఎస్గా ఉన్న శశాంక్గోయల్ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్మిత్తల్, దాన కిషోర్లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్రెడ్డి పట్టం కడతారని సమాచారం. -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ మేరకు పలు సూచనలు చేశారు. ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్లో ఇల్లు కొనలేమా?
నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. -
సీఎం రేవంత్ సమక్షంలో వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 126 మంది మావోయిస్టులు.. ఆయుధాలు విడిచి సరెండర్ అయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. లొంగిపోయిన వారిలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి సైతం ఉన్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయ్యింది. లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టు నేత సంతోష్ ఉన్నారు. 31 ఏకే-47లతో పాటు భారీగా ఆయుధాలను అప్పగించారు సంతోష్. ఇక లొంగిపోయిన వారిలో ఏవోబీ కీలకనేత చలసాని నవత సైతం ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ మావోయిస్టుల ఆయుధాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత వారితో ముచ్చటించారు. కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా వందకు పైగా మావోయిస్టులు లొంగిపోవడం ఆ ఉద్యమం చివరి దశకు చేరిందనేదానికి నిదర్శనం. -
ఇల్లు కొంటే.. గేటెడ్ కమ్యూనిటీలోనే కొనాలి!
పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతం.. ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే.. ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్ కమ్యూనిటీలు.. – సాక్షి, సిటీబ్యూరోభార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్ అపార్ట్మెంట్ల నుంచి గేటెడ్ కమ్యూనిటీలకు షిఫ్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్ల లో అపార్ట్మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.తొలి ప్రాధాన్యత భద్రతకే.. ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఫిట్నెస్ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, స్పోర్ట్స్ కోర్ట్ క్లబ్హౌస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్ దుకాణం, ఫార్మసీ, వెల్నెస్ సెంటర్ కూడా ఉంటాయి.సామాజిక బంధాలు.. సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.మౌలిక సదుపాయాలు.. గేటెడ్ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ. వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.అవసరాలు తీరేలా.. గేటెడ్ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తారు. అందుకే గేటెడ్లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్ స్పేస్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, సౌర విద్యుత్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.నగరం నలువైపులా.. కూకట్పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్పేటతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లతో పోలిస్తే గేటెడ్ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి. -
త్వరలో చర్లపల్లి-నాగర్కోయల్ అమృత్ భారత్.. ప్రత్యేకత ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్కోయల్ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్భారత్ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్కోయల్ అమృత్భారత్ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా రెండు అమృత్భారత్ రైళ్లు, వరంగల్ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్భారత్, హైదరాబాద్కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చర్లపల్లి–ముజఫర్పూర్ జంక్షన్(బిహార్) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.కాగా, హైదరాబాద్–నాగర్కోయిల్ అమృత్ భారత్ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిటైల్ ఫేమ్.. రియల్ ఎస్టేట్ బూమ్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్ సైన్సెస్తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్లో బిజినెస్ హాట్స్పాట్లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్–ఏ ఆఫీస్ స్టాక్లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్ నివేదిక పేర్కొంది. స్టార్టప్స్లోనూ టాప్.. హైదరాబాద్ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్ పరిశోధన సంస్థ స్టార్టప్ జీనోమ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ 19వ స్థానంలో నిలవడం గమనార్హం. లీజింగ్.. కింగ్.. రిటైల్, ఫ్యాషన్ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారుతోంది. కుష్మాన్– వేక్ఫీల్డ్ తాజా రిటైల్ మార్కెట్ బీట్ రిపోర్ట్ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్ చదరపు అడుగుల స్థలం రిటైల్ లీజింగ్ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్ లీజింగ్లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్కు సంబంధించినవి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి. -
సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సుమిత్రానగర్లోని ఓ అపార్టుమెంట్లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్లను రిమాండ్కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు. -
చేనేత.. అమల పలకరింత
హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్ (ఐహెచ్ఎంసీ), గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హస్తకళల ప్రత్యేక ప్రదర్శనను సినీనటి, జంతు హక్కుల కార్యకర్త అమల అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా చరఖాపై నూలు వడుకుతున్న ఓ మహిళతో ఆమె సరదాగా మాట్లాడారు. అర్పిత.. స్ఫూర్తి మంత్రచిన్న వయసులో జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ దుర్ఘటనలో రెండు కాళ్లనూ కోల్పోయినా భయపడలేదు.. ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తల్లిదండ్రులు కాలం చేశారు.. కానీ, బెదరలేదు.. విధిని ఎదిరించి స్ఫూర్తిగా నిలుస్తోంది కోల్కతాకు చెందిన అర్పితా రాయ్.. ఉద్యోగిగా.. యోగా శిక్షకురాలిగా రాణిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్టీసీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అర్పితా రాయ్..కమలం.. వికసిత కాంత మహిళా శక్తి తోడ్పాటు లేనిదే వికసిత భారత్ సంకల్పం అసాధ్యం. వనితల తోడిదే అవని అని వక్తలు కొనియాడారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించారు. -
యువతితో పెళ్లైన హోంగార్డు ప్రేమాయణం!
హైదరాబాద్: ఇటీవల జరిగిన మేడారం జాతరకు విధులపై వెళ్లిన ముగ్గురు పిల్లలున్న ట్రాఫిక్ హోం గార్డు అక్కడ ఓ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడమే కాకుండా రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ... శ్రీకాకుళంకు చెందిన పొంగూరు వాసుదేవరావు(38) అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు ఇదివరకే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను తీసుకొని భార్య ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. ఏడేళ్ల కొడుకుతో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో అద్దెకుంటూ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మేడారం జాతరకు విధులపై వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని తన తల్లి కనిపించడం లేదంటూ వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్ను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా గంట వ్యవధిలోనే ఆమె తల్లిని కనుగొని అప్పగించాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తరచూ ఇద్దరూ కలుసుకునే వారు. గత నెల 25వ తేదీన వాసుదేవరావు ప్రేమించిన యువతి(25)ను అమీర్పేట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. తరచూ తన కూతురు బయటికి వెళ్తుండటాన్ని గమనించిన యువతి తండ్రి ఆరా తీయగా వాసుదేవరావును ఆమె పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది. ఈ విషయంలోనే తమకు రక్షణ కావాలంటూ తాను వివాహం చేసుకున్న యువతిని తీసుకొని వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటన వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టి ఆ యువతి మేజర్ కావడంతో హోంగార్డుతో పంపించారు. ఈ విషయంపై మొదటి భార్య నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా మేలుకో.. ‘షీబాక్స్’కు చెప్పుకో!
సాక్షి, హైదరాబాద్: మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న మరో అస్త్రం షీ–బాక్స్. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులను అరికట్టే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన ఆన్లైన్ పోర్టలే ఈ షీ–బాక్స్ (సెక్స్వల్ హెరాసె్మంట్ ఎల్రక్టానిక్ బాక్స్). దేశంలో ఎక్కడ పనిచేసే మహిళలైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు.కాగా, 2024, ఆగస్టు 29న ఈ పోర్టల్ను మరింతగా ఆధునీకరించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే, నిందితులను శిక్షించేలా ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే మహిళలెవరైనా లైంగిక వేధింపులపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులు భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. 2013లో అమల్లోకి వచి్చన పోష్ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాసె్మంట్)ను సక్రమంగా అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.బాధితులు బయటికి రావాల్సిన పనిలేకుండా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయడంతోపాటు వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఆ వివరాలను షీ–బాక్స్ పోర్టల్లో నమోదు చేయడం తప్పనిసరి. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పోర్టల్లో ఫిబ్రవరి వరకు 1,008 ఫిర్యాదులు నమోదవగా, అందులో 105 ఫిర్యాదులు పరిష్కరించారు. షీ–బాక్స్ అంటే ఏమిటి? షీ–బాక్స్ అనేది మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలి? ⇒ షీ–బాక్స్ పోర్టల్ https:// shebox.wcd. gov. in/ లోకి వెళ్లాలి. ⇒ కుడిచేతి వైపు ఉన్న రిజిస్టర్ యువర్ కంప్లైంట్పై క్లిక్ చేయాలి. ⇒ అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి. ⇒ అవసరమైతే ఆధారాలు అప్లోడ్ చేయాలి. ⇒ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత అది సంబంధిత సంస్థలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీ సీ) లేదా సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏమవుతుంది? ⇒ ఫిర్యాదు సంబంధిత శాఖకు, ప్రైవేటు కార్యాల యం అయితే సంబంధిత కార్యాలయంలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లేదా జిల్లా స్థాయి లోని లోకల్ కమిటీ (ఎల్సీ)కి పంపిస్తారు. ⇒ అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ⇒ విచారణ ప్రారంభమైన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ బాధితురాలికి ఫిర్యాదు స్థితి గురించి సమాచారం అందుతుంది. పోర్టల్లోకి వెళ్లి తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. -
టికెట్ స్కాన్ చేస్తేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ను క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తేనే ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించగలుగుతారు. మెట్రో రైల్ స్టేషన్లలో ఉన్న తరహా విధానం త్వరలో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే కాదు, విమాన ప్రయాణికుల లగేజీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు కాబోతోంది.రాత్రి కాగానే కొందరు నిరాశ్రయులు, ఆగంతకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్లి అక్కడ ప్రయాణికులు కూర్చునే బెంచీలపై నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారిని అడ్డుకునేవారుండరు. ఇక అలాంటి వారు స్టేషన్లోకి ప్రవేశించలేరు. చివరకు సెక్యూరిటీ చెకింగ్ లేకుండా స్వయంగా ప్రయాణికులు కూడా స్టేషన్లోకి వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి దుర్భేద్య వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. వచ్చే నెలలో అందుబాటులోకి పదో నంబరు ప్లాట్ఫామ్ ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా యి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అతి కీలక ఎయిర్ కాంకోర్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అది సిద్ధం కానుంది. ఈలోపు, పదో నంబరు ప్లాట్ఫామ్ వైపు పనులు దాదాపు ముగిసినందున, వచ్చే నెల నుంచి అక్కడి వసతులను ప్రయాణి కుల వినియోగంలోకి తేనున్నారు. భద్రత వ్యవస్థ మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాకే ప్రారంభం కానుంది. పదేళ్ల క్రితం దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో, సికింద్రాబాద్ స్టేషన్లో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ప్రారంభించారు.కానీ, నిత్యం లక్షన్నర మంది ప్రయాణికులు వచ్చే చోట ఒకటి చొప్పున రెండు వైపులా రెండు చెకింగ్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల సామర్థ్యాన్ని అది తట్టుకోలేకపోయింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే వాటిని మూసేశారు. ఇప్పుడు స్టేషన్లోకి ఎలాంటి చెకింగ్ లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ.740 కోట్ల వ్యయంతో పూర్తిగా ఆధునీకరిస్తున్నందున, విమానాశ్రయ తరహా హంగులద్దుతున్నారు. ప్రయాణికులు, వారి సంబం«దీకులు కలిపి నిత్యం లక్షల మంది స్టేషన్కు వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకటో నంబరు ప్లాట్ఫామ్, అటు పదో నంబర్ ప్లాట్ఫామ్ ఉండే రెండు ప్రవేశ మార్గాల్లో దాదాపు ఆరు వరకు భద్రత తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.ఎలా ఉండబోతోంది?⇒ ప్రయాణికులు ముందుగా లగేజీ స్కానింగ్ చేయించుకోవాలి. వెంట తెచ్చే ప్రతి బ్యాగును ఎక్స్రే స్కానింగ్ చేస్తారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ వేస్తారా? లేదా? అన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. చెక్ చేసిన తర్వాతనే లగేజీని లోనికి అనుమతిస్తారు. గంట వ్యవధిలో 30 వేల మంది వచ్చినా సరిపోయే సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ⇒ ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరి. లోనికి ప్రవేశించేముందే భద్రత సిబ్బంది స్కానర్ల సాయంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతారు. ⇒ లోనికి ప్రవేశించేముందు క్యూఆర్ కోడ్ సాయంతో ఆన్లైన్ టికెట్, ప్రత్యక్ష టికెట్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టికెట్ లేని వారిని నిరోధించేందుకు వీలవుతుంది. ప్రయాణికుల వెంట వచ్చే సంబం«దీకులు ఇక కచ్చితంగా ప్లాట్ఫామ్ టికెట్ కొనాల్సిందే. ⇒ పునరాభివృద్ధి తర్వాత భారీ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నందున, సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచనున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందిని అదనంగా రిక్రూట్ చేసుకోనున్నారు. -
50 లక్షల ఓటర్లు తగ్గుతారు సర్!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో భారీగా ఓటర్లు తగ్గిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘సర్’లో ఏకంగా 50 లక్షల వరకు ఓటర్లు తగ్గిపోతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఈ సంఖ్య 2.75 కోట్ల నుంచి 2.80 కోట్ల మధ్య ఓటర్లు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2002 ఓటర్ల జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, శివార్లలో దాదాపు 87 లక్షల ఓటర్లు ఉంటే.. అందులో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు, గ్రామీణ జిల్లాల్లో దాదాపు 30 లక్షల వరకు ఓటర్లు తగ్గుతారని ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’సాఫ్ట్వేర్ ఆధారంగా బోగస్ లేదా డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే రెండో ఓటు ఉంటే..ఈ సాఫ్ట్వేర్తో తొలగించే వీలుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి స్థిరపడినవారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చి.. ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తమ స్వస్థలాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారు. అలా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారందరి ఓట్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగిస్తారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఎస్ఐఆర్ సందర్భంగా బీఎల్ఓ ఇంటింటికి సర్వేకు వచ్చిన సమయంలో ఓటర్లు తప్పనిసరిగా భౌతికంగా ఉండాలని, ఒకవేళ లేని పక్షంలో కుటుంబ యజమాని సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని ఆధారాలను (ప్రూఫ్స్) చూపించి సంతకం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి ఓట్లు కనుమరుగయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి, రోహింగ్యాలకు ఇక్కడ ఓటు హక్కు కల్పించరు. అవసరమైతే ఎన్యుమరేటర్లు రెండుమూడుసార్లు వచ్చి మరీ తనిఖీలు చేసిన తర్వాతనే తుది జాబితాను రూపొందిస్తారు.ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రతీ ఓటరు వివరాలు సేకరించి.. ఎన్యుమరేటర్ ఫామ్లో నింపిన తర్వాత ఒక ఓటరు రిసిప్ట్ కాపీ ఇస్తారని, అదే కాపీని సంబంధిత సిబ్బంది డిజిటల్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకే ఓటరు రెండుచోట్ల ఓట్లు వేసే పద్ధతిని ఈ ఎస్ఐఆర్ ద్వారా అరికట్టడానికి వీలవుతుందని, వాస్తవంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న విషయంలో పూర్తి స్పష్టత వస్తుందని, డూప్లికేషన్కు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడో దశలో తెలంగాణ...దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మూడో దశలో తెలంగాణలో చేపట్టనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారం. 2002 ఎన్నికల జాబితాతో అనుసంధానం చేసిన మ్యాపింగ్ ప్రక్రియ చేస్తోంది. ఈ సమయంలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం 4 భాగాలుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా జాబితా ముద్రణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణతో ఈ ప్రకియ పూర్తవుతుంది. ప్రతి ఇంటికీ నాలుగైదుసార్లు వెళ్లి వివరాలు సేకరించడం ద్వారా బీఎల్ఓలు ఎన్యుమరేషన్లో కీలక భూమిక పోషించనున్నారు.పాస్పోర్టు, రేషన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలించి నిజమైన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారు. తద్వారా డూప్లికేట్, చనిపోయిన, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిన వారు, బోగస్ ఓటర్లు జాబితా నుంచి తొలగించి, వాస్తవ ఓటర్లకు మాత్రమే ఓటుహక్కు ఉండేలా ఈ ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల సంఘం ఉద్దేశం. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది రానున్న కాలంలో తెలియాల్సిందే. -
10న బీఆర్ఎస్ వర్క్షాప్ !
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్నకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం తదితరులను వక్తలుగా ఆహ్వానించినట్టు తెలిసింది.ఈ వర్క్షాప్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులు, సభా నియమావళితోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటిని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తీరు తదితరాలపై నిపుణులు సూచనలు, సలహాలతోపాటు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లో కింది స్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ‘అంబేడ్కర్ విగ్రహం’పై ఉద్యమం మూసీ సుందరీకరణ పేరిట భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసిన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై ఉద్యమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10న ప్రారంభించే ‘అంబేడ్కర్ విగ్రహం’ఉద్యమ కార్యక్రమాన్ని వచ్చే నెల 14న జరిగే అంబేడ్కర్ జయంతి నాటికి తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణాన్ని మూసివేసి సందర్శకులకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని దశలవారీగా అవసరమైతే ఢిల్లీ స్థాయికి ఉద్యమం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారం తరహాలో ఏప్రిల్ 14న హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఆంక్షల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్తో హుస్సేన్సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించే యోచనలో ఉంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతోపాటు వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ నేతలు భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంక్షలు విధించడంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ‘గ్రేటర్’లో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్లకు మరో రెండు నెలల్లోపే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోన్న బీఆర్ఎస్ ఆ లోపే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని భావిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో ఇఫ్తార్ విందులు, ఇతర పారీ్టల నుంచి నేతల చేరికలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్స్పేస్గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్ దూసుకెళ్లి..
అడ్డాకుల/హసన్పర్తి/చొప్పదండి: వాహనాల అతివేగం, నిర్లక్ష్యం ఏడు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అవతలి వైపు మార్గంలో వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఓ లారీ అతివేగంగా దూసుకెళ్తూ ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరిని బలిగొంది. అలాగే ఓ టిప్పర్ సైతం మితిమీరిన వేగంతో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు.తిరుపతి వెళ్తుండగా..ఎస్స్సై ఎం.వేణు, బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి 28 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన మహబూబ్నగర్ డిపో ఆర్టీసీ బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారు, పొన్నకల్ స్టేజీ సమీపంలో డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట నుంచి సిమెంట్ పైపులను మహబూబ్నగర్ తీసుకెళ్తున్న లారీని ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో లారీ, బస్సు క్యాబిన్లు నుజ్జునుజ్జు కావడంతో కొత్తకోట మండలం వడ్డెవాటకు చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి (35), కొత్తకోటకు చెందిన లారీ సహాయకుడు నాగన్న (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా బస్సు డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ మరణించారు. మరో డ్రైవర్ రామన్గౌడ్తోపాటు 10 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో వెంకట్రామమ్మ, శాంతి, సురేశ్బాబు, శిరీష ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇంజనీరింగ్ పరీక్ష రాసి వస్తుండగా..హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్పర్తి పెద్ద చెరువు సమీపంలో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇంజనీరింగ్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మలుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన షేక్ జునైద్ అక్రమ్ (21), వరంగల్ ఎల్లంబజార్కు చెందిన ఆకుతోట సుప్రతిక (21) మృతిచెందారు. వారిద్దరూ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.జునైద్ ఓ ప్రైవే ట్ హాస్టల్లో ఉంటూ బైక్పై కళాశాలకు రాకపోకలు సాగిస్తుండగా సుప్రతిక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. కళాశాలలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో శుక్రవారం పరీక్ష రాశాక జునైద్ లిఫ్ట్ ఇవ్వడంతో సుప్రతిక బైక్పై ఎక్కింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు నుజ్జునుజ్జు కావడంతో స్నేహి తులు కంట తడిపెట్టారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. మృతులిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. జునైద్ తండ్రి షేక్ జమీల్ అక్రమ్ పాన్షాపు నిర్వహిçస్తుండగా, సుప్రతిక తండ్రి ఉమామహేశ్వర్ పండ్ల వ్యాపారి.పెళ్లి వేడుకకు వెళ్తుండగా.. తమ స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఎస్సై నరేశ్రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన చిలుక ప్రదీప్కుమార్ (24), తాటికొండ సాయి కిరణ్ (24) శుక్రవారం పక్కనే ఉన్న చాకుంటలో స్నేహితుడి వివాహానికి బైక్పై వెళ్తున్నారు. మరో పది సెకన్లలో మెయిన్ రోడ్డు నుంచి చాకుంట క్రాస్ రోడ్డు దాటుతామని అనుకుంటుండగా కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్నటిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ వారి తల మీద నుంచి టిప్పర్ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ప్రదీప్కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, సాయికుమార్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. -
నేను అందరివాడిని
సాక్షి, హైదరాబాద్: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణపై వడివడిగా కదిలాం.. ‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.అలాగే వన్ మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్క్యాప్ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మిత్రధర్మం... పేదల పక్షం... ‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్ప్లాన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
మన టాప్ ర్యాంక్ 23
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]గతేడాదికన్నా సంఖ్య తగ్గింది సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీఅనూజ్ అగ్నిహోత్రి టాపర్ రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్ సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.ఐపీఎస్ టు ఐఏఎస్.. 23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే.. ‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి 103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.నాలుగో యత్నంలో 573వ ర్యాంకు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు. ⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.ఎంపీడీఓకు 472వ ర్యాంకుసిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు. డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.రెండో ప్రయత్నంలో...హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.అమ్మానాన్న ప్రోత్సాహంతోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు. -
గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్మెంట్ గ్యాస్ బెలూన్ పేలింది. ఓ కన్వెన్షన్ లో హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. దీన్ని బ్రహ్మకుమారీస్ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
TG: సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగా వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.యుపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మెయిన్స్ రాసే విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే గతేడాది సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నగదుని అందజేసింది. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
Hyderabad: కొండలు కరిగించేస్తున్నారు
ఇది కొత్వాల్ గూడ పరిధిలోని రెడీమిక్స్ ప్లాంటు. పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిర్మాణాలకే కాదు పరిశ్రమలకు, ప్లాంట్లకు అనుమతుల్లేవు. కానీ పలు సంస్థలు ఇక్కడ సుమారు ఇరవై వరకు ఆర్ఎంసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కళ్లముందే పెద్దఎత్తున క్వారీ తవ్వకాలు చేపడుతున్నా..క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువమయ్యాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాదు వాగులు, వంకలు, ఎత్తైన కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. తక్కువ ధరకు వాటిని కొను గోలు చేసి లేక్వ్యూల పేరుతో ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి గ్రానైట్, కంకర, రోబోసాండ్ పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వీటి కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని కొండలు, గుట్టలపై కన్నేశాయి. ఇందుకు అధికారంలో ఉన్న కొంత మంది పెద్దల సహకారం కూడా లభిస్తుండటంతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాయి. పైసా ఖర్చులేకుండానే విలువైన మట్టిని తమ సైట్లోకి తరలిస్తున్నాయి. జిలెటిన్స్టిక్స్తో కొండలను పిండి చేస్తున్నాయి. అక్కడే క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకునంతా సమకూర్చుకుంటున్నాయి. అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. ఒక్క శంషాబాద్ మండల పరిధిలోనే 20 అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ లీజు సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీ నుంచి నిరభ్యంతర పత్రం, తెలంగాణ విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి, రెవెన్యూ శాఖల నుంచి కనీస అనుమతులు లేవంటే ఆశ్చర్య పోనవసరం లేదు. కోకాపేట్లో.. కొంత మంది తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు. కనీసం లీజు అనుమతులు కూడా తీసుకోకుండా రూ.కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూమిలో పరిమితికి మించి తవ్వకాలు చేపట్టారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు పరి్మషన్ తీసుకుని ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేపట్టి, ప్రభుత్వానికి కనీస ఫీజును కూడా చెల్లించడం లేదు. ఈవిషయంపై శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదు ప్లాంట్లను సీజ్చేశామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో సీజ్ చేస్తామని వివరించారు.అక్రమ క్రషర్ మాఫియా కనిపించడం లేదా? శంషాబాద్: జీవో 111 పరిధిలో చిన్న ఇల్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. కొత్వాల్గూడ అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని నిజనిర్ధాణ కమిటీ గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. మంత్రి పొంగులేటికి కుమారుడు నగరంలో నిర్మాణం చేస్తున్న ఆకాశహరŠామ్యలకు ఇక్కడ ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్లో సంబం«ధమున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో గరీబోళ్ల ఇళ్లు కూల్చేసి ఆ ప్రాంతాన్ని గాజాలా మార్చారన్నారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రశి్నంచని అడ్డుకోలేని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పెయిడ్ బ్యాచ్ కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టును పొంగులేటి వదలడంలేదన్నారు. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏఐసీసీకి ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ అప్పులు మీరే కట్టండి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా తీసుకున్న భారీ రుణాలు. మరోవైపు బల్దియాకు అధిక ఆదాయ వనరులైన ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ ఫీజులు భారీగా తగ్గే పరిస్థితులు. ఇంకోవైపు తీసుకున్న అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉండటంతో అప్పులు కట్టాల్సిన బాధ్యతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు ఏళ్లకేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో కొండలా పేరుకు పోయిన బకాయిలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరించి మూడు కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్లు బకాయిలు కట్టే పరిస్థితిలో లేవు. జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉన్నా ఆదాయం వచ్చే అవకాశం అంతంతమాత్రమే. దీంతో మూడు కార్పొరేషన్లు మనుగడ సాగించాలంటే, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చెందాలంటే వివిధ ప్రాజెక్టుల (ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ,సీఆర్ఎంపీ) కోసం తీసుకున్న అప్పుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను కానీ, స్టాంపుడ్యూటీ ద్వారా కానీ, వృత్తిపన్ను ద్వారా కానీ, ఇతరత్రా రూపాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలేవి చెల్లించకుండా, వాటి బదులు తమ అప్పులు తీర్చాల్సిందిగా కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తోంది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఏ కార్పొరేషన్పైనా భారం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రుణ భారం గత ప్రభుత్వ హయాంలో నగరంలో భారీయెత్తున మౌలిక సదుపాయాలు కలి్పంచారు. అభివృద్ధి పనులు చేశారు. అందుకుగాను మున్సిపల్ బాండ్ల జారీ, వాణిజ్య రుణాలు, ఇతరత్రా వెరసి రూ.6,530 కోట్ల అప్పులు చేశారు. వడ్డీ సహా చెల్లింపులు పోను గత అక్టోబర్ వరకు మిగిలిన అప్పుల భారం రూ.4,877 కోట్లు. రాని బకాయిలు వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రావడం లేదు. వాటిలో స్టాంపు డ్యూటీవే దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలున్నాయి. మ్యుటేషన్ ఫీజులు రూ. 100 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను తదితరాలు వెరసి వేల కోట్లు రావాలి. ఇవేవీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ నెలనెలా సిబ్బంది జీతాలకు దాదాపు రూ.120 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ విజ్ఞప్తి చేసింది. మూడు కార్పొరేషన్లలో జనాభా, మౌలిక వసతులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేశారు. కానీ, అప్పుల భారం ఉంటే ప్రగతి ముందుకు సాగదని, అభివృద్ధి ఆగిపోగలదని భావించి ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉన్నాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగలదని ఆశిస్తున్నారు.‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ నేటినుంచేనగర కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలులో నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తద్వారా రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం బాట వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి వారం నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ నగరం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు అగ్రసేన్ మహరాజ్ జంక్షన్, చాచానెహ్రూ పార్కు, పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ కార్యాలయం, కొత్వాల్గూడ, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మూడు కార్పొరేషన్ల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువగా చెత్త తరలింపు వంటి పనులకు ప్రాధాన్యమిచ్చారు. నగరానికి ప్రాధాన్యం ఎందుకు ? రాజధాని హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా మారడంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలి్పంచవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలనలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండు కార్పొరేషన్లను గెలుచుకోవాలనేది అధికార పార్టీ ఆలోచన కాగా, ఒక కార్పొరేషన్ను మిత్రధర్మంగా ఎంఐఎంకు వదిలేశారనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. మూడుకార్పొరేషన్ల ఎన్నికలూ ఒకేసారి జరుగుతాయా, లేక వేర్వేరుగానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఇక ఈ–ఆఫీస్ పాలనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరిపాలన అంతా నూరు శాతం ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎఫ్ఎంఎస్) ద్వారానే కొనసాగనుంది. ఈ నెల 15 నుంచి ఓఎఫ్ఎంఎస్ విధానంలోనే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మాన్యువల్ పద్ధతిలో వచ్చే ఫైళ్లను ఎట్టిపరిస్థితిలోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాయి రవి అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆర్థిక శాఖ కూడా యుద్ధప్రాతిపదికన అమలుకు నిర్ణయించింది. తాజా ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్లుగా అవతరించనున్నాయి. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక లాగిన్...: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కాగితాలతో కూడిన ఫైళ్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయాల్లో కొన్నింటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచి్చనప్పటికీ అర్జీలతో కూడిన వాటిని కాగితాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై కాగితాలతో కూడిన ఫైళ్లకు తప్పనిసరిగా స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ప్రతి అంశం ఆర్థికశాఖతో ముడిపడి ఉండటంతో ఫైళ్ల నిర్వహణ ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ విధానంలోకి మార్పు చేయాల్సిందే. ప్రజల నుంచి లేదా ఉద్యోగుల నుంచి వచ్చే వినతులు కాగితాల్లో వస్తే వాటిని వెంటనే స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చాకే ఫైలును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎంఎస్ విధానంలో భాగంగా శాఖలవారీగా ప్రతి ఉద్యోగికి త్వరలో ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించనున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా ఫైళ్ల నిర్వహణ సమయం తగ్గడంతోపాటు పారదర్శకత పెరగనుంది. ఒకవేళ ఫైలు నిర్వహణలో జాప్యం జరిగినా ఉన్నతాధికారులకు తెలియడంతోపాటు కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకొనే వీలుంటుందని.. ఫలితంగా జవాబుదారీతనం మరింత మెరుగవుతుందని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఎస్ఐఆర్కు వేగంగా కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. మూడో దశ కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన ప్రీ ఎస్ఐఆర్ ర్యాండమ్ పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.36 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి పోలింగ్ కేంద్ర అధికారులు(బీఎల్ఓ)లు పరిశీలన జరుపనున్నారు. ప్రీ ఎస్ఐఆర్ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఫీల్డ్ సర్వే వివరాలు వచ్చేనెల మూడవ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి... ఎస్ఐఆర్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్ల తయారీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కసరత్తు చేస్తున్నారు. నిర్వాచన్ సదన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్ఓలకు తుది దశ శిక్షణను ఇవ్వనున్నారు.బీఎల్వోలు పూర్తి చేసే ఎన్యుమరేటర్ ఫారాల్లో ఒకటి ఓటర్కు ఇవ్వడం, ఒకదాన్ని ఎన్నికల సంఘం తన వద్ద రికార్డు చేయనుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్లైన్స్ మీద ఈసీ, సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తై, తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 350 ఓటర్లు.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్లోడ్ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా. ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్ బీఎల్ఓలు, సూపర్వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
డిండి.. ‘ఏదుల’ గండి
సాక్షి, హైదరాబాద్: ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం కనీసం 440 మీటర్లు ఉన్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ గతేడాది జనవరి 22న నీటిపారుదల శాఖ జీఓ 10 జారీ చేసింది. ఏదుల రిజర్వాయర్లో 336 మీటర్లు నీటిమట్టం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి పనులు చేపట్టాలని అప్పట్లో కోరింది. గత నెల 6న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలోని కమిటీ డిండి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిల్వలు 440 మీటర్లు ఉంటేనే... ఏదుల రిజర్వాయర్లో కనీసం 437.375 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నుంచి వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని తరలించాలని గతంలో అనుమతులిచ్చారు. ఏదుల జలాశయ గరిష్ట నీటినిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) 445 మీటర్లు కాగా, గరిష్ట నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. జలాశయంలో 440 మీటర్ల మట్టంతో 4.16 టీఎంసీలు, 437 మీటర్ల మట్టంతో 3.04 టీఎంసీల నిల్వలు, 436 మీటర్ల మట్టంతో 2.72 టీఎంసీల నిల్వలు ఉంటాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ అడుగు (బెడ్ లెవల్) 21.643 కి.మీ.ల వద్ద 421.45 మీటర్ల మట్టాన్ని కలిగి ఉండగా, ప్రతిపాదనల ప్రకారం ఏదులలో 436.41 మీటర్ల మట్టం నుంచి నీటిని తరలించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన నీటిమట్టం, డిండి ప్రాజెక్టు కాల్వ లోతు మధ్య 4.9 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన కనీస నిల్వ మట్టాన్ని 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ(జనరల్) నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఏదుల రిజర్వాయర్ను 440 మీటర్లకు నింపడానికి కేవలం 2 రోజులే పడుతుందని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఏదులలో 440 మీటర్ల స్థాయిలో నిల్వలున్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్టుల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుండగా, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున మొత్తం 30 టీఎంసీలను తరలించుకోవడానికి డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 మీటర్లకు చేరినప్పుడే డిండి ఎత్తిపోతలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు మునుగోడు కాంగ్రెస్ నేత ఐలయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
తొలిసారి నాన్నా అంటున్నా..
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: ‘తండ్రి ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’అని ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా..’అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను..’అంటూ గణపతి కుమారుడు శ్రీనివాసరావు పేరిట ఓ ఆడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావడం చర్చకు దారి తీసింది. ఎంతో భావోద్వేగంతో 4.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఒకప్పటి పరిస్థితులతో పోలి్చతే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉందని, నేటి తరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ తన అభిలాషను బయటపెట్టారు. కాగా ఈ ఆడియో గణపతి కుమారుడిదేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. ఆ ఆడియోలో ఏముందంటే.. అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో.. ప్రతి కుటుంబం చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా నీకు వందనం. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాన జీవితం ప్రారంభించాక అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో తెలియదు. ఏ బట్ట కట్టిందో.. ఏ తిండి తిన్నదో కూడా ఎవరికీ తెలియదు. సమాజానికి ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో, చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అంటే అది ఆత్మార్పణమే.. ఇది నా అభిలాష ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనేంతగా ఎదిగి సమాంతర ప్రభుత్వం నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సమాజంలో అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష. -
విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్ దాకా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన దశాబ్దాలపాటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్పూర్లో జని్మంచిన ఆయన.. దీన్దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత 1991, 1993, 1996లలోనూ వరుస విజయాలు సాధించారు. యూపీ ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.2017లో ప్రధాని మోదీ కేబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం, వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ 29వ గవర్నర్గా నియమించింది. అక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన్ను తాజాగా తెలంగాణ గవర్నర్గా బదిలీ చేసింది. -
మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది. ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే, సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.కార్యాచరణ ఇలా...1వ వారం – గ్రామీణాభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4) 2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుంచి 11) 3వ వారం – అరైవ్–అలైవ్ (ఏప్రిల్13 నుంచి 18) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి 25) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2) 6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 10వ వారం – పర్యావరణం (జూన్ 1 నుంచి 6) -
ఘనంగా భట్టి తనయుని వివాహం
సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్ జీఎంఆర్ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు. -
కీలక పోస్టింగ్లన్నీ ఇన్చార్జ్లతోనే
సాక్షి, హైదరాబాద్: పోలీస్శాఖలోని కీలక పోస్టులను ఇన్చార్జ్లతో నెట్టుకొస్తున్నారు. కొందరు అధికారులు రెండు అంతకంటే ఎక్కువ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్చార్జ్ బాధ్యతల్లో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 14 మంది ఐపీఎస్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపు కోటాను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్లు ఉన్నారని, ఆ సంఖ్యను 105కు పెంచాలన్నారు. పెరుగుతున్న పనిభారం నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే కీలక శాఖలకు ఉండే అధికారులకు ఇతర విభా గాల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పెరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు ఐపీఎస్ అధికారుల వద్దే అత్యంత కీలక శాఖలతోపాటు ఇతర విభాగాలు ఉండడంతో పనిభారంతోపాటు పర్యవేక్షణ కొరవడుతుందన్న వాదనా వినిపిస్తోంది. తెలంగాణ పోలీస్శాఖ అధికారిక వె బ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం..ప లు విభాగాలకు ఇన్చార్జ్లుగా కొనసాగుతు న్న ఐపీఎస్ అధికారులు వివరాలు చూస్తే.. ⇒ బి.శివధర్రెడ్డి డీజీపీ కోఆర్డినేషన్, హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ డా.సౌమ్యా మిశ్రా జైళ్ల శాఖ డీజీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్న శిఖాగోయల్కు టీజీ సైబర్ సె క్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీఎఫ్ఎస్ఎల్ ఇ న్చార్జ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ⇒ మరికొన్ని కీలక విభాగాలు చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఐడీ అడిషనల్ డీజీతోపాటు మహిళా భద్రత విభాగం, భరోసా అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లోనూ చారుసిన్హా కొనసాగుతున్నారు. ⇒ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వీవీ శ్రీనివాసరావుకు అడిషనల్ డైరెక్టర్ టెక్నికల్ సరీ్వసెస్, టీజీఎల్పీఆర్బీ చైర్మన్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఇన్చార్జ్ అడిషనల్ డీజీ ట్రైనింగ్గా బాధ్యతలు అప్పగించారు. ⇒ అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్, అడిషనల్ డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో స్వాతిలక్రా ఉండగా, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్కు అడిషనల్ డీజీ లీగల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీ పిక్స్ ఇన్చార్జ్ ఎండీగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ అడిషనల్ డీజీ పర్సనల్, మల్టీజోన్–2 అడిషనల్ డీజీగా దేవేంద్రసింగ్ చౌహాన్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ సంజయ్కుమార్ జైన్ అడిషనల్ డీజీ తెలంగాణ బెటాలియన్స్, పీటీఓ హైదరాబాద్ ఇన్చార్జ్గా, షానవాజ్ ఖాసిం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ ఎం శ్రీనివాసులు అడిషనల్ కమిషనర్ క్రైం హైదరాబాద్ సిటీ, డిటెక్షన్ డిపార్ట్ మెంట్ (డీడీ) ఇన్చార్జ్ డీసీపీగా, తఫ్సీర్ ఇక్బాల్ హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ శాంతిభద్రతలు, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్గా ఇన్చార్జ్గా, ఎల్ఎస్ చౌహాన్ డీఐజీ జోగుళాంబ జోన్, డీఐజీ చారి్మనార్ జోన్గా, భాస్కరన్ ఎస్పీ సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఇన్చార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈగల్ (గతంలో టీజీ యాంటీ నార్కో టిక్స్ బ్యూరో)కు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య డైరెక్టర్గా ఉండగా, మరో రిటైర్డ్ ఐపీఎస్ వీబీ కమలాసన్రెడ్డి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ, టీజీఐసీసీసీ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో, ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా వి.శివకుమార్ పనిచేస్తున్నారు. -
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా (73) నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ప్ర దేశ్ గవర్నర్గా ఉన్న ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్ వర్మను పొరుగున ఉన్న మహారాష్ట్రకు బదిలీ చేసింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల (ఎల్జీ)ను మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాలనాపరమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో గవర్నర్లను, లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అనుభవం ఉన్న పలువురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా అవకాశం కలి్పంచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు సైతం స్థానచలనం కలిగింది. లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్గా పంపడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్.ఎన్. రవిని బెంగాల్ గవర్నర్గా బదిలీ చేశారు.కొత్త నియామకాలు, బదిలీలు..⇒ తెలంగాణ: శివ ప్రతాప్ శుక్లా (హిమాచల్ప్రదేశ్ నుంచి బదిలీ) ⇒ మహారాష్ట్ర: జిష్ణుదేవ్ వర్మ (తెలంగాణ నుంచి బదిలీ) ⇒ పశ్చిమ బెంగాల్: ఆర్.ఎన్. రవి (తమిళనాడు నుంచి బదిలీ) ⇒ బిహార్: లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ ⇒ నాగాలాండ్: నంద్ కిశోర్ యాదవ్ ⇒ హిమాచల్ ప్రదేశ్: కవీందర్ గుప్తా (లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్) ⇒ తమిళనాడు: రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (ప్రస్తుత కేరళ గవర్నర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు) ⇒ లద్దాఖ్ ఎల్జీ: వినయ్ కుమార్ సక్సేనా (ఢిల్లీ నుంచి బదిలీ) ⇒ ఢిల్లీ ఎల్జీ: తరణ్జీత్ సింగ్ సంధూ -
సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్నేహితుడు వేం నరేందర్రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి అందజేశారు.సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాలా, జుల్పికర్ అలీ ఒక సెట్ నామిషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం వేం నరేందర్రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వచ్చిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్రెడ్డి, మహేశ్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
తల్లిదండ్రులకు ఆరచేతిలో వైకుంఠం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల వేడి మొదలవ్వక ముందే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. విద్యార్థులు ఇంకా ఎస్సెస్సీ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండగానే ‘ఇంటర్’ సీటు రిజర్వు చేసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ముందస్తు రిజర్వేషన్.. భారీ ఫీజు డిస్కౌంట్’ అనే నినాదంతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. వీకెండ్ వస్తే చాలు ప్రధాన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, నేరుగా ఇళ్లను సందర్శించడం సర్వసాధారణమైంది. తమ క్యాంపస్లలో ఉన్న వసతులను చూపిస్తూ ఏసీ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్ల పేరుతో భ్రమలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే ఇప్పుడే చేరాలని, లేదంటే సీట్లు దొరకవని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పదవ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ అడ్మిషన్ల కోసం అడ్డదారులకు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.ప్రత్యేక బ్యాచ్ల ఆకర్షణ సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైంది. ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారు. పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసిన్ ర్యాంకుల హామీలు, క్యాంపస్లో చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ప్రీ–రిజిస్ట్రేషన్ మాయాజాలం పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే సీటు గ్యారెంటీ అంటూ తల్లిదండ్రుల నుండి ప్రీ–రిజిస్ట్రేషన్ అడ్మిషన్న్టోకెన్ పేరిట కొంత వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వస్తే ‘సీటు దొరకదు‘ అని చెప్పి తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఒకసారి ఈ సొమ్ము చెల్లిస్తే, ఒకవేళ విద్యార్థికి వేరే కాలేజీలో సీటు వచ్చినా, ఆలోచన మార్చుకున్నా ఈ డబ్బు తిరిగి రాదు. ఇది కార్పొరేట్ విద్యా సంస్ధల మార్కెటింగ్ గిమ్మిక్కుల్లో ప్రధానమైనది.చదవండి: 'మమ్మల్ని పంపించండి మహాప్రభో'ఫీజుల మోత మహా నగరంలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కార్పొరేట్ విద్యా సంస్థలు క్యాంపస్లు బట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, శివారులోని డిమాండ్ ఉన్న ఏరియాల్లో కోర్సు ఆధారంగా ఫీజులు మారుతుంటాయి. కార్పొరేట్ సంస్థలు అందించే సౌకర్యాలను బట్టి ఫీజులను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: -
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మళ్ళీ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం మళ్లీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అనర్హత కేసు విచారణలో భాగంగా దానం నాగేందర్పై విచారణ పూర్తి కాలేదు. దానం నాగేందర్పై విచారణను శనివారానికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరొకవైపు కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు స్పీకర్. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు సూచించారు స్పీకర్. దానంపై దాఖలైన రెండు పిటిషన్లను శనివారం విచారించనున్నారు. గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను తేల్చేపనిలో పడ్డారు. -
మహిళల కోసం ప్రత్యేక యూరాలజీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘సెంటర్ ఫర్ ఫంక్షనల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పూర్తిగా మహిళా వైద్య సిబ్బందితో నిర్వహించే ‘ఆల్-వుమెన్ ఆపరేషన్ థియేటర్ (ఓటీ)’*ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ పాల్గొన్నారు.మహిళల్లో మూత్ర అసంయమనం, పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, పునరావృత మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, సామాజిక సంకోచం, అవగాహన లోపం కారణంగా చాలామంది చికిత్సకు ముందుకు రావడం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమస్యలకు సమగ్ర నిర్ధారణ, ఆధునిక చికిత్సలు ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.గత ఐదేళ్లలో ఏఐఎన్యూ మహిళా యూరాలజీ బృందం 307 ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. మూత్ర లీకేజ్, యూరినరీ ఫిస్టులాలు, సిస్టోసీల్స్, ఫీమేల్ యూరేథ్రోప్లాస్టీ వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స అందించిన అనుభవంతోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సారికా పాండ్య మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని తెలిపారు. కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేకా మాట్లాడుతూ, మహిళలు సంకోచం లేకుండా వైద్య సేవలు పొందేలా పూర్తి మహిళా సిబ్బందితో ఈ ఓటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతుల నుంచి వృద్ధుల వరకు మహిళల యూరాలజీ సమస్యలకు రోగి-కేంద్రీకృత, సమగ్ర వైద్య సేవలు అందించడం ఈ కేంద్ర లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. -
ఇఫ్తార్ విందులో.. ఖర్జూర నోరార
రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న ఫుడ్ లవర్స్ రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇఫ్తార్ టేబుల్స్ కొత్త ట్రెండ్స్తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్ ఇఫ్తార్కు మోడ్రన్ టచ్ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ఒకహెల్తీ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్లా కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోరంజాన్ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్ పవర్హౌస్ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్ సిల్వెస్ట్రీస్ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్గా లేదా సన్–డ్రైడ్గా వీటిని వినియోగిస్తారు. సిటీలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్ ఖర్జూరం (Medjool dates ) పెద్ద పరిమాణంలో, అంబర్ బ్రౌన్ కలర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్తో నిండిన ఈ రకం గిఫ్టింగ్కు హాట్ ఫేవరెట్. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్ స్టోర్లలో దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. హనీ టచ్తో సాఫ్ట్ డిలైట్గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్. ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్ యెల్లో, పండినప్పుడు అంబర్ బ్రౌన్గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్ నూర్ రకాన్ని ‘క్వీన్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్నెస్తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్ డెజర్ట్స్లో ఇది ఫేవరెట్. ఇరాన్ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్తో మోలాసిస్ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. -
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది..టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్ పేట్ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్ని సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు. -
రెండో సారి.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడా అతని పంథా మారలేదు..వసూళ్ల పర్వం కొనసాగించాడు. గమనించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్ను నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. వెంకటేశ్ జూన్లో స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ వెంకటేశ్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేయకుండా జాప్యం చేయడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బాధితులు, నేరస్తుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ అనంతరం నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. 2019లో మహబూబ్నగర్ తెల్కపల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులో కొన్ని సంవత్సరాలపాటు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అతని తీరు మారకపోవడం విచారకరం. -
మార్చిలోనే మాడ్చేసేలా..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా మే నెలలో రికార్డు కావాల్సిన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా ఈ నెల 3న (మంగళవారం) నమోదైంది. 2025 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, ఈ సారి ఏకంగా 4,421 మెగావాట్లు దాటింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే నెలాఖరు నాటికి గ్రేటర్ రోజు సగటు విద్యుత్ డిమాండ్ 5వేల మెగావాట్లు దాటే అవకాశం లేకపోలేదు. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్తో సబ్స్టేషన్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. ఏప్రిల్/మే మాసాల్లో ఎండ త్రీవత ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతుంటారు. సహజంగానే ఈ సమయంలో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుంది. కానీ.. ఇందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలో ఎండలు మండుతున్నాయి. -
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు. ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. -
యుద్ధ ప్రభావం: నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పెరిగిన రద్దీ..!
సాక్షి,హైదరాబాద్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇంధన వినియోగదారుల్లో గుబులు రేపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. నగరంలో పెట్రో సెగ రాజుకునే పరిస్థితి నెలకొంటోంది. చమురు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో బంకులకు వాహనదారుల తాకిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతాయని, సరఫరా నిలిచిపోతుందనే వదంతులు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నగరంలో జరిగే విక్రయాల కంటే నాలుగు రోజులుగా 10 నుంచి 20 శాతం అధికంగా అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల కోసం లీటర్ల కొద్దీ ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా డీలర్లు ఆయిల్ కంపెనీలకు పంపే రోజువారీ ఇండెంట్ను కూడా భారీగా పెంచుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇంధన వినియోగంలో హైదరాబాద్ మహా నగరానిదే సింహభాగం. గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధి)లో పెట్రోల్, డిజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడయ్యే పెట్రోల్లో దాదాపు 60 శాతం, డీజిల్లో సుమారు 35 నుంచి 40 శాతం వాటా ఒక్క మహా నగరానికే దక్కుతోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్లో ప్రతిరోజూ సుమారు 30 లక్షల నుంచి 45 లక్షల లీటర్ల పెట్రోల్, అంతకంటే కొంత తక్కువ మొత్తంలో డీజిల్ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వినియోగం అదనంగా మరో 10 లక్షల లీటర్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 80 డాలర్ల మార్కును చేరుకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడలేదు. దేశంలో సుమారు 25 రోజుల వినియోగానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నట్లు తెలుసోంది. అదనంగా వ్యూహాత్మక చమురు నిల్వలు మరో 74 రోజుల వరకు రక్షణ కల్పించే అవకాశాలున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉనట్లు కేంద్రం భరోసా కల్పిస్తోంది. ఆందోళన వద్దు ఇప్పట్లో ఇంధన కొరత, ధర పెంపు ఉండబోదు. ధరల పెరుగుదలపై వదంతులను నమ్మవద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరం. అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. పౌరసరఫరాల శాఖ వినియోగదారులకు అవగాహన కల్పించాలి. – అమరేందర్ రెడ్డి, పెట్రోల్ డీలర్ల సంఘం -
గణపతి లొంగుబాటు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోవడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న తదితరులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమైన సందర్భంలోనే.. గణపతి గురించిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్ సదస్సుతో పాటు మావోయిస్టు నేతల లొంగుబాట్లపై చర్చించడానికి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణపతి లొంగుబాటు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో గణపతి లొంగుబాటు అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల నేపథ్యంలో గణపతి తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన త్వరలోనే లొంగిపోవడానికి మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి దేశం విడిచి నేపాల్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చారని.. ఉన్నతాధికారులు ఆయనకు సేఫ్ ప్యాసేజ్ కల్పించి నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చేలా చూశారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. అనారోగ్యంతోనే బాధ్యతల నుంచి పక్కకు.. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గణపతి అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. అయినా జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉద్యమంలో కొనసాగారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు పీపుల్స్వార్ను ఆ తర్వాత మావోయిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సాయుధ పంథావైపు నడిపించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసులకు పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఏది ఏమైనా గణపతి లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగింపునకు వచ్చినట్టేనని అంటున్నారు. సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా.. గణపతి 1949లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్లో జని్మంచారు. ఆయన్ను ఉద్యమంలో టీచర్ అని పిలుస్తారు. 1970లో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సల్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు లభించింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతిది కీలక పాత్రగా చెబుతారు. గణపతితో పాటు ఆయన సహచరిణి సుజాత కూడా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. -
కండక్టర్ డ్యూటీ.. కాదంటే కోరుకున్న జిల్లాకు బదిలీ
సాక్షి, హైదరాబాద్: పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగరానికి 2 వేలకుపైగా ఎలక్ట్రిక్ బస్సులు రానుండడంతో నగరంలో పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సర్దుబాటు చేసే విషయంలో సంస్థ ఓ ప్రణాళికను ఖరారు చేసుకుంది. ఆరునెలల తర్వాత నుంచి దశలవారీగా ఈ బస్సులు రానున్నాయి. ఈ రాక ప్రారంభమైన తర్వాత నగరం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే తిరగనున్నాయి. దీంతో ఇక్కడ పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. అలాంటి వారు దాదాపు 8 వేల మంది వరకు ఉండనున్నారు. దీంతో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న విషయంలో తాజాగా ఉన్నతస్థాయిలో సమీక్షించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రాజేంద్రనగర్ డిపోను సందర్శించారు. ఆరాంఘర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని ఆర్టీసీకే అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లే క్రమంలో రాజేంద్రనగర్ డిపోకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న కార్మికులతో కాసేపు ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏర్పడే పరిస్థితులు, అదనంగా మారే సిబ్బంది సర్దుబాటు గురించి వారికి క్లుప్తంగా వివరించారు. » ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ప్రస్తుతం 2 వేల కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల 1,700 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. అప్పుడు మిగులుబాటులో ఉన్న డ్రైవర్లకు కండక్టర్ విధులు అప్పగిస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. » కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసిన తర్వాత కూడా మిగిలిపోయే డ్రైవర్లను, ఇతర జిల్లాలకు పంపుతారు. » నగరంలో దాదాపు 4 వేల మంది వరకు గ్యారేజీ సిబ్బంది మిగిలిపోతారు. వీరిలో బస్సు నడిపే లైసెన్సులు ఉన్నవారిని గుర్తించి డ్రైవర్ డ్యూటీలు అప్పగించి వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేస్తారు. » నగరంలోనే ఉండాలనుకునేవారికి కండక్టర్ డ్యూటీలు అప్పగిస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయ్యాక మిగిలిపోయే వారిని వారు కోరుకునే జిల్లాల్లో కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తారు. అప్పటికీ మిగిలిపోయే వారి ని ఇతర జిల్లాలకు బదిలీచేసి సర్దుబాటుచేస్తారు. » నగరం నుంచి వెళ్లేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉండదు. దీంతో వారి సీనియారిటీ నగరంలోనే కొనసాగేలా, ఇక్కడి వేతనమే పొందేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ పరిస్థితికి ఇదీ కారణం... ఆర్టీసీలో ఉండే ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు సంస్థలు అద్దె ప్రాతిపదికన(గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) నడుస్తున్నవే. వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు వారే ఉంటారు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నందున, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డ్రైవ ర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. వారినే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూటకోమారు బదిలీ చేయడంతో పాలన దెబ్బతింటోందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతకాని పాలనకు ఉన్నతాధికారుల బదిలీలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణభవన్లో బుధవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఐదుసార్లు జరిగిన బదిలీలతో విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా తమకు అప్పగించిన స్థానాల్లో పనిచేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ బదిలీలతో విద్యుత్ శాఖ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తోపాటు సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో నలుగురు చొప్పున ఉన్నతాధికారులు మారిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఐదు విడతల్లో 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కాగా, 20 జిల్లాల కలెక్టర్లు మారారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారని చెప్పారు. తరచూ బదిలీలపై రాష్ట్రానికి నష్టం విభాగాధిపతులుగా ఉండే సీనియర్ ఐఏఎస్లతోపాటు జిల్లా కలెక్టర్లను తరచూ మార్చడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని అధికారులను బదిలీలు చేస్తూ, తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు పోస్టింగులు ఇస్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదు శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టడంలో జరుగుతున్న అక్రమాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల ఎక్కువ అవినీతి జరుగుతోందని హరీశ్రావు ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సీఎం అక్రమాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారని, సీఎం తప్పుల్లో భాగస్వాములు అయ్యేందుకు అనేక మంది అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. లగచర్ల ఆందోళనల సందర్భంగా అనేక హామీల ఎగవేతకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను బదిలీ చేశారని తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించి ఓటేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంలో చూపిన దూకుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లోపించిందన్నారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ శివారులోని నియోపోలిస్లో సీఎం రేవంత్రెడ్డి మేనల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడని, కోట్లాది రూపాయల లీజు, రాయల్టీ ఎగవేతకు పాల్పడ్డారని హరీశ్రావు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లను పరిశీలిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ప్రస్తుతానికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హరీశ్రావు వెల్లడించారు. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
భూసేకరణకు రూ. 5 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ అవసరాలకు రూ. 5 వేల కోట్ల విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు దామోదర, పొంగులేటి, సీతక్క, వివేక్తో కలిసి బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖపై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు భద్రతను పటిష్టం చేసేందుకు చేపట్టిన మరమ్మతులను జూలై నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి ప్రాణధారగా నిలిచిన సింగూరు ప్రాజెక్టు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించి సమగ్ర రీతిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నివేదికలు అందిన నేపథ్యంలో క్రమంగా నీటి నిల్వలను తగ్గించి తక్షణ మరమ్మతులు చేపట్టామన్నారు. మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును పటిష్టపరిచే వరకు పూర్తిస్థాయి మట్టం మేరకు నీటిని నిల్వ చేయరాదని నిర్ణయించామని చెప్పారు. ప్రాజెక్టులో సమస్యలను గుర్తించేందుకు అండర్ వాటర్ సర్వేలు, సోనార్ పరీక్షలు నిర్వహించి రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేకుండా ఒకే పంట సీజన్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సింగూరు కాల్వల లైనింగ్ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 13 కి.మీ.ల కాల్వకు గాను 9 కి.మీ.ల లైనింగ్ పూర్తయిందని, మిగిలిన 4 కి.మీ.ల మేర కాల్వకు లైనింగ్ను జూన్ 26లోగా పూర్తి చేయాలన్నారు.ఉగాది నాటికి పెద్దారెడ్డి ఎత్తిపోతలకు శంకుస్థాపన అందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను సత్వరంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు ఉగాదిలోగా శంకుస్థాపన చేస్తామన్నారు. అందోల్ నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలన్నారు. ములుగు జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణను వేగిరం చేయాలని తెలిపారు. పాలెంవాగు గేట్లు, రెగ్యులేటర్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. పాలెంవాగుపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలన్నారు. -
వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల నియామకాల అధికారి, సికింద్రాబాద్–12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశాలు పొందడానికి ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అద్భుతమైన అవకాశం అని ఆయన వివరించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అవివాహిత యువతీ యువకులు ఉద్యోగాలకు అర్హులన్నారు. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజి్రస్టేషన్ చేసుకోనవసరం లేదని, నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత పత్రాలు, స్థానికత ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ సరి్టఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు 13న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలన్నారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https:// agnipathvayu. cdac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
నెల రోజుల్లో కొత్త విద్యా విధానం
సాక్షి, హైదరాబాద్: వారంలో ఉపాధ్యాయ సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తామని, మరో నెల రోజు ల్లో కొత్త విద్యా విధానం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పా రు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక విద్యా విధానం కాదని, సిఫారసులు మాత్రమేనని కేకే స్పష్ట చేశారు. ముర ళి నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. విద్యా కమిషన్ నివేదికతో పాటు మరో మరో 14 నివేదికలపై చర్చించి, అందరి అభిప్రాయా ల మేరకు మరో నెల రోజుల్లో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులతో చర్చించిన తర్వాతే హైపవర్ కమిటీ నూతన విద్యా పాలసీని రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తుందని తెలిపారు. ఈ పాలసీలోని అంశాల అమలు, వాటి సాధ్యాసాధ్యాలపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేకే చెప్పారు. మురళి కమిషన్ బాగా పని చేసింది విద్యకు సంబంధించి పలు సిఫారసులు చేయడంలో మురళి కమిషన్ బాగా పని చేసిందని అన్నారు. విద్యా కమిషన్లో పీహెచ్డీ చేసిన వారు లేరనడం సరైంది కాదని, విశ్వవిద్యాలయ విభాగం హెడ్గా పనిచేసిన ప్రొఫెసర్ పీఎస్ విశ్వేశ్వర్రావు లాంటి వారు ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించాయని, వీటన్నింటిపైనా చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రొఫెసర్లు, మేధావుల స్థాయిలో మొత్తంగా 11 కమిటీలను ఏర్పాటు చేశామని కేకే వివరించారు. విద్యా రంగంలో గురువుల సేవలు వెలకట్టలేమని, తాను కూడా టీచర్గా పని చేశానని గుర్తు చేశారు. -
ప్రభుత్వ కాలేజీల్లో నిర్లక్ష్యం... ప్రైవేటులో ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ తన నివేదికలోనూ ఇదే పేర్కొంది. ప్రభుత్వ కాలేజీల్లో బోధనాపరమైన నిర్లక్ష్యం, ప్రైవేటు కాలేజీల్లో ఒత్తిడితో కూడుకున్న విద్య ఉంటోంది. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేటులో బట్టీ చదువుల విధానంలో ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవుతున్నా.. సాంకేతిక విద్యలో ఇలాంటి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఒత్తిడి కారణంగా వెనుకబడుతున్నారు. సబ్జెక్టుపై పట్టులేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడైంది. గురుకుల విద్య మెరుగే.. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 10,96,666 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో 1,84,743 మంది ఉంటే, ప్రైవేటులో 7,20,674 మంది ఉన్నారు. గురుకులాల్లో 1,00,644 మంది చదివారు. ప్రభుత్వ కాలేజీల్లో 37 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రైవేటులో 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే, గురుకులాల్లో ప్రైవేటు కన్నా ఎక్కువగా 78 శాతం మంది పాసయ్యారు. జేఈఈ, నీట్లో కూడా గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. జాతీయ కాలేజీల్లో సీట్లు పొందినప్పటికీ ఒత్తిడికి గురికావడం లేదని ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో తేలింది. దీన్నిబట్టి ఒత్తిడిలేని గురుకుల తరహా విద్యా విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణే మందు.. ప్రభుత్వ కాలేజీల్లో నవంబర్ నాటికి మొత్తం సిలబస్ పూర్తవ్వడం లేదు. అధ్యాపకులకు ఎన్నికల విధులు ఉండటం, చాలాచోట్ల సబ్జెక్టు ఫ్యాకల్టీ కొరత, కాలేజీలు సరిగా జరగకపోవడం కారణాలైతే... విద్యార్థుల హాజరు శాతం కూడా తక్కువగా ఉంటోంది. ఈ ఏడాది నుంచి ముఖ గుర్తింపు విధానం తేవడంతో కొంత మార్పు కన్పిస్తోంది. అయితే, క్లాసులకు హాజరవ్వని విద్యార్థులను ప్రిన్సిపల్స్ ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండటం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు పనులకు వెళ్తున్నట్టు పలువురు ప్రిన్సిపల్స్ చెప్పారు. ప్రధానంగా ఇలాంటి పరిస్థితులను పర్యవేక్షణలో సరిచేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. మార్పులు తెస్తున్నాంప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ పెట్టాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి కాలేజీలను నిత్యం గమనిస్తున్నాం. దీనివల్ల హాజరు శాతం పెరుగుతోంది. ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. ఇంటర్మీడియెట్ విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. – కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం.గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్. -
వార్.. ఆపేద్దాం టూర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం అన్నింటి కన్నా పర్యాటక రంగాన్ని దెబ్బతీయనుంది. సమ్మర్ టూర్లపై ప్రభావం పడుతుందని ట్రావెల్ ఆపరేటర్లు అంటున్నారు. వేసవిలో మన దేశంలో పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ఇస్తారు కాబట్టి కుటుంబ సమేత విహారాల లీజర్ ట్రావెల్కు ఇది సరైన సమయంగా పర్యా టక ప్రేమికులు భావిస్తారు. కొత్త జంటల హనీమూన్స్కు కూడా ఇది సీజన్ లాంటిదే. ఇప్పటికే చాలా మంది తమ ట్రావెల్ ప్లాన్స్ను అమలులోకి పెట్టారు. విదేశాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు నెలల ముందుగానే ప్రయాణ టికెట్లతో పాటు ఇతరత్రా బుకింగ్స్ కూడా చేసుకున్నారు. రద్దులు, వాయిదాలు మొదలు.. విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సేవలు నిలిపివేశాయి లేదా దారి మళ్లించాయి, ఇది గల్ఫ్ వెళ్లేవారికి మాత్రమే కాక దుబాయ్ వంటి ప్రధాన కేంద్రాల ద్వారా అమెరికా వెళ్లేవారిని ప్రభావితం చేసింది. ప్రస్తుతం ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారని మేక్ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా..‘సాధారణ పరిస్థితుల్లో.. పాఠశాల సెలవులు కుటుంబ ప్రయాణాల వల్ల వార్షిక లీజర్ అవుట్»ౌండ్ ట్రాఫిక్ లో 30–35 శాతం పెరుగుదల ఉంటుంది’‘ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటివో) అధ్యక్షుడు రవి గోసైన్ అంటున్నారు. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించగా వేసవి లీజర్ ట్రావెల్ అంతర్జాతీయ పర్యటనలలో 43.5 శాతం వాటాతో అతిపెద్ద చోదకంగా నిలిచింది.విహారాలకు విఘాతమే... ‘భారత్ నుంచి యూరప్, అమెరికాకు విమానాలను అనుసంధానించడానికి దుబాయ్ నాడీ కేంద్రం. ఆ ప్రయాణాలను ప్లాన్ చేసే ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రభావితమవుతారు’ అని ట్రావెల్ ప్లాట్ఫామ్ పిక్యూర్ట్రైల్ సహ వ్యవస్థాపకుడు హరి గణపతి అంటున్నారు. భారతీయులకు మధ్యప్రాచ్యం కీలకమైన ప్రయాణ కారిడార్. పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2025లో భారతీయులు సందర్శించిన టాప్ 20 దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్ ఉన్నాయి. అదే సమయంలో, కొంతమంది ప్రయాణికులు అంతగా అనిశ్చితి లేని గమ్యస్థానాల వైపు తమ ప్రణాళికలను మారుస్తున్నారు. పశి్చమాసియాలో అనిశ్చితి మధ్య భారతీయ ప్రయాణికులు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిలిప్పీ¯న్స్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ వంటి ప్రత్యామ్నాయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. -
భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్బీనగర్ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టగర్ పి.జగదీశ్వర్ ఆదారాలను ఎల్బీనగర్లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు. గృహ హింస కేసులో ఏడాది.. సిటీ కోర్టులు: గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్లోని 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్పేట్కు చెందిన తౌఫిక్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్ ఉమెన్ పోలీస్స్టేషన్లో ఇర్ఫాన్ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్తో పాటు మనోరంజన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ తీర్పు వెల్లడించారు. -
కొమ్మల్లో దాగింది కొంటె చిలకమ్మ!
హైదరాబాద్: అది ఖరీదైన, అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలక. శ్రీనగర్ కాలనీలోని ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లోంచి తుర్రుమంది. దీంతో ఆ కుటుంబమంతా విలవిలలాడింది. బ్యాటరీ లైటుతో రాత్రంతా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ చెట్టు కొమ్మ సందుల్లో కనిపించింది. కిందికి తీసుకొచ్చేందుకు యతి్నంచినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు ఫైర్ ఇంజిన్కు, హైడ్రాకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ అక్కడకు చేరుకుని నిచ్చెన పైకి లేపేందుకు యత్నిస్తుండగా శబ్దానికి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగిరిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగానికి సమాచారమిచ్చారు. వారు బకెట్ క్రేన్లో కుటుంబ యజమానిని కూర్చోబెట్టి అలికిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్ల కొమ్మల్లోని చిలకను 3 గంటల పాటు పోలీసులు, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది ప్రయతి్నంచి విజయం సాధించారు. ఆఫ్రికన్ గ్రే చిలకను పట్టుకోవడానికి నాలుగు ప్రభుత్వ శాఖల సిబ్బంది శ్రమించడం కొసమెరుపు. -
వార్ అక్కడ.. వర్రీ ఇక్కడ!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్, హోటల్, గోల్డ్ ట్రేడింగ్, మైనింగ్ రంగాల్లో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన మనోళ్లు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాజా పరిణామాలు దుబాయ్ ’సేఫ్–హెవెన్’ అనే ఇమేజ్ను దెబ్బతీశాయి. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలంగాణకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో ‘సీక్రెట్’పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లెక్కకు మించి పెట్టుబడులు రాజకీయ, సినీ ప్రముఖుల్లో కొందరు బినామీల ద్వారా దుబాయ్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు రియల్ ఎస్టేట్ (లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు), హోటల్స్, గోల్డ్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టారని తెలిసింది. అలాగే దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లాలోని కీలక నేతల్లో ఇద్దరికి దుబాయ్లో హోటల్, రియల్ ఎస్టేట్, ఐటీ, మైనింగ్ వ్యాపారాలు ఉన్నట్లు గట్టి ప్రచారం ఉంది. రియల్ ఎస్టేట్లో తెలుగువాళ్ల పెట్టుబడులు 2025లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రికార్డుస్థాయిలో సుమారు 249 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారతీయ పెట్టుబడులే 30 శాతం వరకు ఉన్నట్లు దుబాయ్ ట్రేడ్ వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక వెలువడింది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీ, రియల్ రంగంలో ఉన్న వారు పెద్దఎత్తున దుబాయ్లో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. లగ్జరీ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఆఫ్–ప్లాన్ ప్రాజెక్టులు దుబాయ్లో బూమ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు ’వెయిట్ అండ్ వాచ్’ మోడ్లోకి వెళ్లారు. ‘పానిక్ లేదు, కానీ డెసిషన్ మేకింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఒక క్లయింట్ డీల్ బ్యాక్ అవుట్ చేశాడు. చాలామంది ఒప్పందాలు జాప్యం చేయమంటున్నారు. సైట్ విజిట్స్ తగ్గాయి. లావాదేవీలు 30–40% పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్డ్ సేల్స్ భయంతో ఉన్నారు’అని దుబాయ్లో తెలుగు పెట్టుబడుదారులకు సంబంధించి బ్రోకర్గా పనిచేసే వ్యక్తి ఒకరు ఫోన్లో చెప్పారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్ తగ్గాయి. పామ్ జుమైరా, దుబాయ్ మెరీనా హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్ బిజినెస్లో డైరెక్ట్ డ్యామేజ్ తక్కువే అయినా, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు రీ–నెగోíÙయేట్ అవుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్లో పెట్టుబడిపెట్టిన తెలుగు ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
సేవాగ్రామ్కు వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 8 మంది డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ నుంచి ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందలేదు. వికారాబాద్లో 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో రెండు, మూడు రోజులు పాల్గొనలేదన్న కారణంతో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ముగ్గురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఈ సర్టిఫికెట్లను ఏఐసీసీ జారీ చేయలేదని సమాచారం. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, బీర్ల అయిలయ్య, మేడిపల్లి సత్యం, చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యేలు)తోపాటు వజ్రేశ్ యాదవ్ (మేడ్చల్) ఉన్నారు. పది రోజుల శిక్షణలో భాగంగా వీరు రెండు, మూడు రోజులు గైర్హాజరైన కారణంగానే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఎన్ని రోజులు గైర్హాజయ్యారో అన్ని రోజులపాటు మహారాష్ట్రలోని సేవాగ్రామ్కు వెళ్లి అక్కడ శిక్షణతోపాటు సర్టిఫికెట్లు తీసుకోవాలని ఏఐసీసీ నుంచి శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించిన ఇన్చార్జ్లు స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే శిక్షణకు వెళ్లలేదని, ఎమ్మెల్యేలుగా తమకుండే అనివార్య ప్రాధాన్యతలే ఇందుకు కారణమని, త్వరలోనే సేవాగ్రామ్కు వెళ్లి శిక్షణ తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. పలువురు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ సర్టిఫికెట్లు ఇవ్వని విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా ధ్రువీకరించారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని పనుల వల్ల శిక్షణకు రెండు రోజుల పాటు హాజరు కాని వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పారు. కనీస సహకారం లేదు : రాహుల్తో డీసీసీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా తమను నియమించారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ సహకారం అందించడం లేదని రాహుల్గాందీకి ఫిర్యాదు అందింది. సోమవారం వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ ఫిర్యాదును నేరుగా రాహుల్కు చెప్పడం గమనార్హం. ‘మంత్రులే జిల్లాల్లో పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించడం లేదు. ప్రభుత్వ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ వ్యవహారాల్లోనూ వారి ఇష్టారాజ్యమే నడుస్తోంది. కనీసం డీసీసీ అధ్యక్షులుగా ఎక్కడ ప్రెస్మీట్ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఆర్థికంగా సహకరించే వారు కూడా లేరు.’అని ఓ నేత అందరి సమక్షంలోనే రాహుల్కు చెప్పినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన రాహుల్ డీసీసీ అధ్యక్షులే చొచ్చుకుపోవాలని సూచించారు. ఎవరికీ భయపడొద్దని చెబుతూ పార్టీ బలోపేతానికి డీసీసీ అధ్యక్షులు ఏం చేయాలనుకున్నా చేయొచ్చని, ఈ క్రమంలో ఏ సమస్య వచి్చనా తన వద్దకే వస్తుందని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
రాజ్యసభ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని, మొత్తం 16 మంది ఆశిస్తున్నారని, సామాజిక వర్గాల వారీగా వారి జాబితాను హైకమాండ్ ఇచి్చనట్టు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. రాజ్యసభ అభ్యరి్థత్వాల గురించి రాహుల్గాంధీ వచ్చిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చినా, ఖరారు కాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు ఒకవేళ ఢిల్లీ వెళ్లాల్సి వస్తే బుధవారం వెళతామని, లేదంటే అధిష్టానం పెద్దలతో ఫోన్లో మాట్లాడతామని వెల్లడించారు.మంగళవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి నలుగురు సమర్థవంతమైన బీసీ నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఉన్నారన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల గురించి ఏఐసీసీ అన్ని అంశాలను బేరీజు వేస్తోందని, ముఖ్యంగా సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటోందని, సామాజిక కూర్పుతోనే అభ్యరి్థత్వాలు ఖరారయ్యే అవకాశముందని చెప్పారు. జస్టిస్. బి.సుదర్శన్రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. రెండింటి విధానాలూ ఒకటే మావోయిస్టు ఎజెండా, కాంగ్రెస్ విధానం ఒకటేనని, పేదల సంక్షేమం, దేశ అభివృద్ధే ధ్యేయమని మహేశ్గౌడ్ చెప్పారు. అయితే, వారు ఆయుధాలు పట్టుకున్నారని, తాము ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేస్తామని, ఇదే తేడా అని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని, మాజీ మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, తాము ఎవరినీ పారీ్టలోకి రావాలని అడగలేదని, మాజీ మావోయిస్టులు కూడా తమను సంప్రదించలేదన్నారు.జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకుంటామని మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాశామని, మార్కెట్ విలువ ఎంత ఉందో అంత చెల్లించి ఎకరం స్థలం తీసుకుంటామని, ఇందుకోసం ఏడు జిల్లాల్లో స్థలాల ఎంపిక కూడా జరిగిందన్నారు. బీఆర్ఎస్ తరహాలో పుక్కటికిమాత్రం ప్రభుత్వ స్థలాలు తీసుకోబోమని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి చెప్పారని, అలాంటి చోట్ల అందరు నేతలను పిలిపించి మాట్లాడుతామన్నారు. -
5న వాదనలు ముగించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో గురువారం (5న) వాదనలు ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు.. తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజుల తరబడి వాదనలు వినడం సరికాదని, క్లుప్తంగా వాదనలు ముగించాలని సూచించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు.కమిషన్ను తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ,, కేంద్ర జల కమిషన్ వంటి సంస్థల నుంచి అందిన పత్రాల ఆధారంగా మాత్రమే సమగ్ర నివేదికను సమర్పించింది. ఎవరినీ నిర్బంధించడానికి ఎవరిపైనా ఎటువంటి ఆధారాలు తీసుకోలేదు. ప్రజా ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సర్కార్కు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇతర ఏ ప్రాజెక్టుపైనైనా విచారణ కమిషన్ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ ఏర్పాటును తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది. చట్టప్రకారం ఇచ్చిన అధికారం మేరకే కమిషన్ విధులు నిర్వహించి నివేదిక అందజేసింది. కేబినెట్ సబ్కమిటీ ఆమోదం లేకుండా నాటి సీఎం, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి సంతకాలతో రూ.వేల కోట్లు విడుదల చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని ఏజీ చెప్పారు. ‘రూ.1.47 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం గిట్టుబాటు కాదని కాగ్ ఆక్షేపించింది. ఎకరాకు రూ.6.42 లక్షల పెట్టుబడి పెట్టింది. ఎత్తిపోతలకు విద్యుత్ వినియోగంతో రాష్ట్రంపై అదనపు భారం పడుతోంది. అంత మొత్తం పెట్టుబడికి తగిన ఆదాయం వ్యవసాయం నుంచి రావడం లేదు’ అంటూ పీవీ జగన్నాథ్రావు వర్సెస్ ఒడిశా, ఏలేరు కమిషన్లో సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. -
నీటి లెక్కలపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటున్న నీటిని లెక్కించడానికి ఆయా ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను సాకుగా చూపి కృష్ణా జలాల లెక్కలను పర్యవేక్షించే బాధ్యతల నుంచి తప్పించుకుంది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని 12, 13వ క్లాజుల్లోని నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని గుర్తు చేసింది. కృష్ణా బోర్డు నుంచి మెజర్మెంట్ బుక్స్ను తీసుకొని వాటిలో నీటి లెక్కలను రికార్డు చేసేలా సంబంధిత ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణాబోర్డు తాజాగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాసింది. తొలిదశ కింద ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ కేంద్రాలతోపాటు రెండో విడత కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, వాటికి రక్షణ కల్పించే బాధ్యత సంబంధిత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 85(8)ఏ ప్రకారం.. ట్రిబ్యునళ్ల తీర్పులతోపాటు ఉమ్మడి ఏపీ–ఇతర రాష్ట్రాలు/కేంద్రం మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపడానికే తమ బాధ్యత పరిమితం అని గుర్తు చేసింది. ట్రిబ్యునళ్ల తీర్పులు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే నియమాలకు లోబడి మాత్రమే ప్రాజెక్టులు (బరాజ్లు, డ్యామ్లు, రిజర్వాయర్లు, రెగ్యులేటర్లు), కాల్వల నెట్వర్క్, నీటిని తరలించే ఇతర ప్రవాహ మార్గాలపై కృష్ణాబోర్డు తన అధికార పరిధి కలిగి ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 87(1) పేర్కొంటోందని ప్రస్తావించింది. కృష్ణా ట్రిబ్యునల్–1 సమర్పించిన తదుపరి నివేదిక ఆధారంగా 1976 మే 31న కేంద్ర వ్యవసాయ, నీటిపారుదలశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజ్–12కి జత చేసిన అనుబంధం బీ(1)లో ఉన్న నిబంధనలతోపాటు కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని క్లాజ్–13లో ఉన్న నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని నిబంధనల ప్రకారం రాష్ట్రాలు నీటి లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగా.. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని నిబంధనల మేరకు నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడమే తమ బాధ్యత అని తేల్చి చెప్పింది. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని ఆదేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో దాని అమలు సాధ్యం కాలేదని తెలిపింది. సంబంధిత రాష్ట్రాలు తమ పరిధిలోని మొత్తం 31 గేజ్ స్టేషన్ల నుంచి సేకరించిన వివరాలను పంపిస్తే, వాటి ఆధారంగా తాము నీటి లెక్కలను సిద్ధం చేసి త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపిణీ జరుపుతున్నామని తెలియజేసింది. -
సరికొత్తగా డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల మార్పుపై ఉన్నత విద్యామండలి కసరత్తు ముమ్మరం చేసింది. ఏడాదిగా కొత్త సిలబస్పై మేధోమథనం చేసిన మండలి.. మార్పుల అవసరం, సరికొత్త విధానాలతో ప్రయోజనాలు, జాబ్ మార్కెట్లోకి డిగ్రీ కోర్సులను తీసుకెళ్లడంపై సమగ్ర నివేదిక రూపొందించగా దీనికి సీఎం నుంచి ఆమోదం లభించింది. దీంతో 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ మార్పులను అమల్లోకి తేవాలని విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. ఇటీవల విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో ఆయన సమావేశమయ్యారు. వేగవంతమైన కార్యాచరణ అమలు చేయాలని వీసీలను ఆదేశించారు. డిగ్రీ కాలేజీలు, కోర్సుల అకడమిక్ ఆడిట్ను చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు ఇష్టపడని కోర్సులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా కొత్త సిలబస్లో భాగం చేయనున్నారు. ఆంగ్ల భాషలోనూ సమూల మార్పులకు వ్యూహరచన సిద్ధమైందని మండలి వర్గాలు తెలిపాయి. ప్రతి కోర్సుకూ పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యం పెంపొందించేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాపకులకు అవగాహన క్లాసులు నిర్వహించే యోచనలో విద్యామండలి ఉంది. డిగ్రీలో ఆధునిక సిలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీల వైపు విద్యార్థులు మొగ్గుచూపడం లేదు. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులే కోరుకుంటున్నారు. తక్షణ ఉపాధికి ఇదే మార్గమని భావిస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల్లో నైపుణ్యం కొరత కనిపిస్తోంది. కృత్రిమ మేధ ప్రభావం, బిగ్ డేటాకు కనెక్ట్ అయ్యే కంప్యూటర్ భాష, కోడింగ్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారిని నియమించుకొని ఆపై వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో కొనసాగించేవి. ప్రస్తుతం నైపుణ్యం ఉన్నవారినే ఆహ్వానిస్తున్నాయి. అందులో డిగ్రీ కోర్సుల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని నౌకరీ డాట్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లో ఏఐ ప్రాధాన్యతను పెంచేలా సిలబస్లో మార్పులు తేవాలని బాలకిష్టారెడ్డి సూచించారు. 20 శాతం సాంకేతిక పరిజ్ఞానంపై సిలబస్ ఉండేలా మార్పులు చేయనున్నారు. టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఆఫ్లైన్లో చేసేందుకు అవకాశం కల్పించడం మార్పుల్లో ముఖ్యమైనదిగా అధికారులు చెబుతున్నారు. వాటికి కొన్ని క్రెడిట్స్ కూడా ఇవ్వనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా ఇటీవల ఈ తరహా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏఐ సంబంధిత అప్లికేషన్స్తో కూడిన కోర్సులను స్వదేశీ, విదేశీ యూనివర్సిటీల ద్వారా చేసే అవకాశం కల్పించనున్నారు. ఆన్లైన్లో చేసే ఈ కోర్సులకూ క్రెడిట్స్ ఇవ్వనున్నారు. అయితే కోర్సుల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మారిన కోర్సులకే మెజారిటీ కోవిడ్ తర్వాత కామర్స్ కోర్సుల్లో గుణాత్మక మార్పులు చో టుచేసుకున్నాయి. ఈ–వాణిజ్యం పెరగడం, ఆన్లైన్ విధానంలో ఆడిటింగ్ చేపట్టడంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు డి మాండ్ పెరిగింది. ఇందులోనూ టెక్నాలజీతో కూడిన నైపు ణ్య మెళకువలు ఉన్నవారికే ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కాలేజీలు కామర్స్ కోర్సుల్లో టెక్నాలజీని తప్పనిసరి చేశాయి. ఈ కారణంగా రాష్ట్రంలో అత్యధికంగా 37 శా తం విద్యార్థులు కామర్స్లో చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ లైఫ్సైన్స్ కోర్సులున్నాయి. వాటి కీ జాబ్ మార్కెట్ ఉండటం, ఏఐ టెక్నాలజీ సంబంధిత చా ప్టర్లు జోడించడమే ఈ మార్పులకు కారణంగా కనిపిస్తోంది. డిగ్రీ స్వరూపం మారుస్తాం సిలబస్ మార్పునకు తుది మెరుగులూ పూర్తయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యమే కేంద్రంగా డిగ్రీ కోర్సులు తేవాలన్నది మండలి ఆలోచన. ఈ క్రమంలో అన్ని రంగాల నిపుణుల సలహాలు తీసుకున్నాం. సిలబస్ మార్పుపై సబ్జెక్టు నిపుణుల ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చాం. అంతిమంగా డిగ్రీ స్వరూపం మారబోతోంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
ముఖ గుర్తింపు మస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను వినియోగంలోకి తీసుకుని రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదని తేల్చి చెప్పారు. ఆసరా పెన్షన్ల పథకం అమలులో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను అమల్లోకి తెచ్చి 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని వెల్లడించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించతలపెట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి ‘ప్రభుత్వం సేకరించిన రూ.3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉంది. వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిసినా వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తాం. అవకతవకలకు తావు లేకుండా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పనితీరు ఆధారంగా అవార్డులు రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులుంటాయి. జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.. ’ అని సీఎం చెప్పారు. ఈ మూడు నెలలే కొలమానం ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలి. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానం. మీ సర్వీస్ కెరీర్కు ఇవే పునాదిగా నిలుస్తాయి. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. సమర్ధవంతంగా పని చేస్తేనే కొనసాగింపు కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎస్ నివేదిక ఇవ్వాలి. (నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు) క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలి. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను ప్రజలకు తెలియజేయాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి. ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి..’ రేవంత్ సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి.. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. జాబ్ మేళాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు. డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. జూన్ 12నే పుస్తకాలు, యూనిఫామ్లు ‘వచ్చే విద్యా సంవత్సరంలో 100 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూలు బస్సు సౌకర్యం, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ను ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్ 12నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి..’ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం సహించం.. ‘ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోంది. అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది. 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తాం. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆస్పత్రుల్లో పరిపాలన, వైద్య సేవలను విభజిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 25 వేల బోగస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ‘బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించాం. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తాం. వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు సీఎం జారీ చేసిన ఇతర ఆదేశాలు ⇒ పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ⇒ రహదారులపై గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్ నంబర్ ద్వారా సేకరించి మరమ్మతులు చేపట్టాలి. ⇒ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓఆర్ఆర్ ఏజెన్సీ బాధ్యత తీసుకోవాలి. ⇒ నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ ఉండాలి. యాజమాన్యాలు జవాబుదారీతనంతో ఉండాలి. ⇒ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ–సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి. ⇒ భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ్చ -
మోదీజీ.. మీ కోసం వెయిటింగ్ ఇక్కడ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి త్వరలో కొత్తగా ఒక వందేభారత్, రెండు అమృత్భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వాటిని పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు, ప్రధానమంత్రి మోదీతో ప్రారంభోత్సవం చేయించేందుకు ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్లో స్పష్టత రాకపోవటంతో తాత్కాలికంగా వాటి ప్రారంభోత్సవాన్ని పెండింగులో ఉంచారు. ఈనెల 6న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఓ దఫా రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందినా, అది వాయిదా వేస్తున్నట్టు మరో సమాచారం అందింది. దీంతో కార్యక్రమం ఎప్పుడుంటుందో స్పష్టత లేనప్పటికీ, ప్రధానికి సమయం కేటాయించే వీలు లేని పక్షంలో వర్చువల్గానైనా త్వరలో ప్రారంభిస్తారని సమాచారం.సికింద్రాబాద్/చర్లపల్లి–నాందేడ్ వందేభారత్హైదరాబాద్–నాందేడ్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది. రెండు నగరాల మధ్య 280 కి.మీ. దూరం ఉండగా... ప్రస్తుతం నడుస్తున్న సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 7 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ దూరాన్ని మూడు గంటల్లో చేరుకునేలా వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది. నాందేడ్ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, అక్కడి వ్యాపారులు సరుకుల కోసం హైదరాబాద్కే వస్తుంటారు. సాధారణ ప్రజలు కూడా శుభకార్యాల షాపింగ్కు హైదరాబాద్కే వస్తుంటారు. దీంతో రెండు నగరాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు వందేభారత్ రైలు ఉపయోకకరంగా ఉండనుంది. ఈ డిమాండ్ ఆధారంగానే రైల్వే బోర్డు వందేభారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది. ఇది సికింద్రాబాద్ లేదా చర్లపల్లి నుంచి నడుస్తుంది.అమృత్భారత్ రైళ్లు...ఇటీవలే హైదరాబాద్కు రెండు అమృత్భారత్ రైళ్లను కేటాయించిన రైల్వే బోర్డు తాజాగా మరో రెండింటిని మంజూరు చేసింది. ఇవి చర్లపల్లి నుంచి కోల్కతాలోని షాలిమార్కు, యూపీలోని గోరక్పూర్కు నడుస్తాయి. హైదరాబాద్–కోల్కతా మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, సరిపడా రైళ్లు లేవు. ఇక యూపీలోని గోరక్పూర్కు నడిచే అమృత్భారత్.. కాన్పూర్, నాగ్పూర్, లక్నో, భోపాల్ను అనుసంధానిస్తుంది. గోరక్పూర్కు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లు లేవు. వారానికి ఒక రోజు చొప్పున నడిచే నాలుగు సర్వీసులున్నాయి. ఈ రూట్లోనూ ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉంది. -
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు..
హైదరాబాద్లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతినగర్లోని ఓ ఫర్నీచర్ షాపులో ఈ ఘోర అగ్నప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాకుండా దీంతో పుట్పాత్పై ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నించారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే షార్డ్ సర్ప్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్కడే ఉన్న కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక ఓ దుకాణంలోమంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #Telangana | #HyderabadMassive fire in Bachupally gutted a furniture store near Vignan VNR College under Nizampet Circle limits.Firefighters rushed with multiple engines. No casualties reported. Further details awaited. pic.twitter.com/VSrkerhxfn— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) March 3, 2026 -
పలు జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్. సీఎస్ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్. వారందరినీ భాగస్వామ్యులను చేయాలి.. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలివ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి.ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి...గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి.వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి..రవాణా శాఖ డాటా ఆన్లైన్ పూర్తి చేయాలిపాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి.ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి..రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి.ఆ నంబర్కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి . -
సీఎం రేవంత్కు కేందమంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.సాస్కి (SASCI) పథకం కింద తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందని కిషన్రెడ్డి వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో ఆయన స్పష్టీకరించారు.‘‘2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు...రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది...2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది...అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40,000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లకు పైగా నిధులు, విద్య & క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి...అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల ఋణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించింది.వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత ఋణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ గారి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(SASCI)” పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలు 2020-21 నుండి నేటి వరకూ మూలధన పెట్టుబడితో కూడిన అనేక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఈ ఋణాల ద్వారా సమకూర్చుకున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత ఋణాలను అందించడం జరిగింది. ఈ ఋణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి...మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆసుపత్రులు, మెడికల్ & నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు. ..ముఖ్యంగా MMTS ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది. ..2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది...ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
వాడో కామాందుడు.. క్లాస్ రూమ్లోనే నన్ను..
మెదక్ జిల్లా: ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన విద్యార్థి లైంగిక దాడి చేశాడు. అంతేకాక పూర్వవిద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. సోమవారం ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన మేరకు.. బాచుపల్లి వీఎన్ఆర్ కాలేజీలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్కు చెందిన విద్యార్థిని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే ఈ కాలేజీలోనే చదువుతున్న ఆశిష్ బాధితురాలికి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. 2024 నుంచి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాక గత సంవత్సరం కాలేజీలోనే మత్తు చాక్లెట్ ఇచ్చి లైంగిక దాడిచేశాడు. ఇలా పలుపర్యాయాలు దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఇదే కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్ను ఆశిష్ పరిచయం చేశాడు. అతను కూడా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం లైంగిక దాడి విషయం తెలుసుకుని అప్పట్లోనే ఆశిష్ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్ రాయించుకున్నట్లు తెలిసింది. -
Balkampet: ఎల్లమ్మా... మాయమ్మ
సనత్నగర్: ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించి వెలుగుచూడని మరెన్నో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ అధికారి వచ్చిన దగ్గరనుంచి అంతా అస్తవ్యస్తంగా మారిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు టెండర్లలో ఎలాంటి భాగస్వామ్యం ఉండకూడదు. కానీ, ఆ అధికారి కుమారుడు టెంట్హౌస్ టెండర్లలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్య నిర్వహణాధికారి (ఈవో)గా ఎవరొచి్చనా పెత్తనం మాత్రం ఆ అధికారిదే అనే విమర్శలున్నాయి. భక్తులు సమరి్పంచే చీరల్లో రూ.10 వేలు దాటిన పట్టుచీరలు ఆ అధికారి చేతుల్లోకి వెళ్తాయన్న ఆరోపణలున్నాయి. టెండర్ దక్కించుకున్న వారు అధికారికి కమీషన్ ముట్టచెబితేనే బిల్లులు విడుదలవుతాయి. బంగారం, వెండి ఆభరణాలు చేయించి ఇచ్చే సమయంలో ధర్మకాంటా వేసి ఆ రిసిప్టును జత చేసి ఈవోకు సమరి్పస్తారు. ఎవరైతే దీనిని తీసుకున్నారో ఆ గుమాస్తా సంతకంతో పాటు ఈఓ సంతకం కూడా చేస్తారు. కాగా కానుకలు ఇచి్చన భక్తులకు రిసిప్టులు ఇవ్వలేదని తెలుస్తోంది. మంత్రి ఆకస్మిక పర్యటన అనంతరం.. రిసిప్టులు తీసుకోనివారు క్యూ కడుతున్నారు. ఒకవేళ విచారణకు వస్తే తమకే రిసిప్టు తీసుకోవడానికి కుదర్లేదని చెప్పాలంటూ సదరు అధికారి నుంచి ఫోన్లు కూడా వెళ్తున్నట్లు వినికిడి. అమ్మవారికి మూగజీవం బలి ఇచ్చేందుకు రూ.550 నిర్దేశించారు. ఇక్కడ రూ.1000–1200 వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.ఈవోపై వేటు అమీర్పేట: బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఇన్చార్జి ఈవో (కార్యనిర్వాహణ అధికారి) తమ్మినేని శేఖర్ను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల మంత్రి సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయం రికార్డులను స్వా«దీనం చేసుకుని, పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శాఖ కమిషనర్ సోమవారం సాయంత్రం ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
విమానం టికెట్లకు రెక్కలు
సాక్షి,హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధంతో విమానయానం సంక్షోభంలో పడింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు దుబాయ్, ఖతర్, సౌదీ తదితర చోట్ల పెద్దసంఖ్యలో చిక్కుకుపోయారు. కీలక దుబాయ్ ఎయిర్పోర్టు మూసివేత, గల్ఫ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో చార్జీలు మోతెక్కుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి వన్వేలో న్యూయార్క్కు రూ.75 వేల వరకు చార్జి ఉంటే ఇప్పుడు రూ.1,03,855కు పెరిగింది. పారిస్ టికెట్ రూ.86,269 నుంచి రూ.93,868 అయ్యింది. యూకేకు రూ.63,534 వరకు చార్జీలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి అమెరికా, యురోప్ దేశాలకు వెళ్లే విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో చార్జీలు రెట్టింపయ్యాయని ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఇథియోపియాకు నేరుగా విమానాలు ఉన్నాయి. తప్పనిసరిగా బయల్దేరాల్సిన వాళ్లు ఆఫ్రికా మీదుగా వెళ్లాల్సి వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటలీ రాజధాని రోమ్ మీదుగా విమానాలను మళ్లించేందుకు అవకాశం కలి్పంచడంతో చార్జీలకు రెక్కలొచి్చనట్లు సికింద్రాబాద్లోని వాల్మీకీ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా, దుబాయ్, సౌదీ, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, బ్రిటన్కు 15 వేల మందిపైగా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం సరీ్వసులు స్తంభించడంతో సంఖ్య భారీగా తగ్గినట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణాలు 3–6 నెలలు ముందుగానే బుక్ అవుతాయి. 25 శాతం మాత్రమే అత్యవసర బుకింగ్లు ఉంటాయి. తాజా సంక్షోభంతో చాలామంది ప్రణాళికలను మార్చుకున్నారు. తప్పనిసరిగా గమ్యం చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రమే ఈ భారాన్ని మోయాల్సి వస్తోందని ట్రిప్స్ ట్రావెల్స్ ప్రతినిధి సీహెచ్ భార్గవవర్మ తెలిపారు.యూఏఈ కార్యాలయం వద్ద భద్రత బంజారాహిల్స్: నగరంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద బంజారాహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. సౌదీకి వెళ్లేందుకు వీసాల కోసం నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. దుబాయ్, కువైట్, ఒమన్, అబుదాబి తదితరచోట్ల విమానాశ్రయాలు మూతపడడంతో హైదరాబాద్ నుంచి వెళ్లేవారు పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీకి వెళ్లే విమానాలు రద్దు కావడంతో పాటు అటునుంచి రావాల్సినవీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ కాన్సులేట్ కార్యాలయం కూడా వెలవెలబోతోంది. అమెరికా కాన్సులేట్ జనరల్ నివాసం వద్ద బందోబస్తు జూబ్లీహిల్స్ రోడ్డు నం–1లోని హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే ఈ పరిసరాల్లో పోలీసు పహారా పెంచారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ నివాసం గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటుంది. -
నేడు కలెక్టర్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జనగణన–2027 తొలి విడత కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 మధ్య చేపట్టే రాష్ట్రంలో గృహాల గణన నిర్వహణపై రాష్ట్ర జనగణన అధికారి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన 34 ప్రశ్నలతో గృహాల గణన నిర్వహణకు 89వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భోజన విరామం అనంతరం 1.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2 నుంచి 2.30 గంటల వరకు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం నిర్వహణపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2.30 నుంచి 4 గంటల మధ్య 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కలెక్టర్లకు సూచనలు జారీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లకు నిర్దేశించనున్నారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, రవాణా, అటవీ, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమలు, టీజీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు కలెక్టర్లకు అవగాహన కలి్పంచనున్నారు. చివరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రేవంత్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శుల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించనున్నట్టు తెలిసింది. -
మీ ఆధార్ డేటా భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: ఆధార్ నంబర్.. యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య భారతీయ పౌరులకు గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతా మొదలు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మొబైల్ సిమ్ కార్డు దాకా అనేక సేవల్లో ఆధార్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధార్ డేటా భద్రత అత్యంత కీలకంగా మారింది. ఆధార్ వివరాలను నిర్లక్ష్యంగా అపరిచితులతో పంచుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డును ఎవరికీ ఈ–మెయిల్ చేయవద్దని సూచిస్తున్నారు.ఆధార్ నంబర్ను ఉపయోగించి మోసగాళ్లు కొత్త సిమ్లు తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బాధితులకు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దొంగిలించిన ఆధార్ వివరాలతో కేటుగాళ్లు బాధితుల పేరిట రుణాలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనేక సేవలకు ఆధార్ అనుసంధానమై ఉండటం వల్ల అది లీక్ అయితే వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పుగా మారుతుందని.. ఫోన్, ఎస్ఎంఎస్, ఫేక్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసగాళ్లు ఆధార్ వివరాలు దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎలా రక్షించుకోవాలి?⇒ ఆధార్ నంబర్, ఓటీపీ ఎవరితోనూ పంచుకోవద్దు⇒ అపరిచిత లింక్లలో ఆధార్ వివరాలు నమోదు చేయవద్దు⇒ అవసరమైతే పూర్తి ఆధార్ బదులుగా మాస్క్డ్ ఆధార్ వినియోగించాలి ⇒ యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో ఆధార్ లాక్/అన్లాక్ సదుపాయాన్ని ఉపయోగించాలి⇒ అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి -
‘రింగు’కు బఫర్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డుకు 50 అడుగుల బఫర్ జోన్ను నిర్ధారించారు. అంటే రెండు వైపులా కలిపి వంద అడుగుల (30 మీటర్లు) మేర స్థలం బఫర్గా ఉండనుంది. రీజినల్ రింగురోడ్డుకు 100 మీటర్ల స్థలం ఉండనుండగా, దానిని ఆనుకుని మరో 30 మీటర్ల స్థలం బఫర్గా ఉంటుంది. వెరసి 130 మీటర్ల స్థలం రీజినల్ రింగురోడ్డు నిబంధనల్లో ఉంటుంది. ఆ 30 మీటర్లపై పట్టాదారులకే హక్కులుండనున్నా, ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుండదు. శాశ్వత నిర్మాణాలే కాదు, తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించాలి. ఈమేరకు ఇటీవల ఎన్హెచ్ఐఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, రెండు వైపులా 15 మీటర్లు చొప్పున బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ రాష్ట్రం సమ్మతి లేఖ రాసింది. భవిష్యత్తు అవసరాల కోసం.. రీజినల్ రింగురోడ్డు కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ప్రధాన క్యారేజ్వే పోను రెండు వైపులా సర్వీసు రోడ్డు కోసం స్థలం కేటాయిస్తారు. ప్రస్తుత పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికిప్పుడు సర్వీసు రోడ్డును నిర్మించకూడదని నిర్ణయించారు. ఖాళీగా వదిలే ఆ స్థలాన్ని భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సర్వీసు రోడ్డుకు వినియోగిస్తారు. కానీ, దాన్ని ఆనుకుని పట్టాదారులు ఎడాపెడా నిర్మాణాలు సాగిస్తూ పోతే క్రమంగా ఆ సర్వీసు రోడ్డు స్థలం కూడా కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆక్రమణలు జరగకున్నా, ఆ స్థలాన్ని ఆనుకుని నిర్మాణాలు వెలిస్తే, సర్వీసు రోడ్డుకు ఇబ్బందులు తలెత్తుతాయి. రిబ్బన్ డెవలప్మెంట్ రాకుండా... పెద్ద రోడ్డు నిర్మిస్తే దానిని ఆనుకుని రోడ్డు పొడవునా వాణిజ్యపరమైన నిర్మాణాలు వెలియటం సహజం. అలా వచ్చే నిర్మాణాలను రిబ్బన్ డెవలప్మెంట్గా పేర్కొంటారు. అది మితిమీరితే ఆ రోడ్డుకే ఇబ్బందిగా మారుతుంది. భవిష్యత్తులో రోడ్డును విస్తరించటం కూడా సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రీజినల్ రింగురోడ్డును ఆనుకుని ఆ తరహా రిబ్బన్ డెవలప్మెంట్ రాకుండా నిరోధించేందుకు ఈ బఫర్ జోన్ సహకరిస్తుంది. రోడ్డు భద్రత: అధిక వేగంతో వెళ్లే వాహనాలు రోడ్డు నుంచి దిగువకు దూసుకెళ్లినప్పుడు కింద ఉండేవారికి ప్రమాదం పొంచి ఉంటుంది. రోడ్డును ఆనుకుని నిర్మాణాలు వెలిస్తే ఈ తరహా ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. దీన్ని నిరోధించటానికి కూడా బఫర్ జోన్ అనుకూలంగా ఉంటుంది. పర్యావరణ రక్షణ: రింగురోడ్డును ఆనుకుని పచ్చదనాన్ని పెంచాలన్నది మరో ఆలోచన. అందుకు ప్రత్యేకంగా రోడ్డుపై ఎక్కువగా స్థలం ఉండదు. దిగువ ఆనుకుని ఉండే ప్రైవేటు భూముల్లో చెట్లు పెంచాల్సి ఉంటుంది. అందుకు పట్టాదారులు అంగీకరించరు. ఇలా బఫర్ జోన్ ఏర్పాటుతో ఆ భూముల్లో సాగు తప్ప వేరే పనులకు వీలుండదు. ఏదో ఒక రూపంలో పచ్చదనం పెంపునకు ఇది ఉపకరిస్తుంది. భవిష్యత్తు అవసరాలకు: భవిష్యత్తులో రీజినల్ రింగురోడ్డుకు అదనంగా స్థలం సేకరించాల్సి వస్తే ఈ బఫర్ పరిధిలో ఉండే భూమి అనుకూలంగా ఉంటుంది. అందులో నిర్మాణాలు ఉండకుండా ఖాళీగా ఉండనున్నందున భూ సేకరణకు వీలుంటుంది. -
గులాంగిరీ చేయొద్దు: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా అయ్యే అవకాశం కూడా వస్తుందని అన్నారు. డీసీసీల అధ్యక్షులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికీ గులాంగిరీ చేయొద్దని, పార్టీకి కళ్లు, చెవులు మీరేనని స్పష్టం చేశారు. సాధారణంగా (సింపుల్గా) ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లో పార్టీని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేహీ అంటే పదవులు రావని, డీసీసీ అధ్యక్షుల కార్యాచరణ పదవులే పరమావధిగా ఉండకూడదని, ప్రజల కోణంలో ఉండాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించేలా పని చేయాలని, పార్టీకి ప్రజల్లో మంచి పేరు తేవాలని కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరితా రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ 4 గంటల పాటు వారితో సమావేశమై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. బీజేపీ ప్రజల గురించి ఆలోచించదు.. ‘పార్టీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే సుప్రీం. మీరంతా నా టీమ్. భవిష్యత్తు అంతా మనదే. పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకునే బాధ్యత మీది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు సర్వాధికారాలు ఇచ్చాం. మీరు పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజలతో మమేకం కండి. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది మనమే. మన వల్లనే ప్రజలకు ఎక్కువ లబ్ది కలిగింది. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. కానీ మనం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాం. అప్పుడే రాజకీయాలు చేస్తున్నాం. ప్రత్యర్థి పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎలా నష్టం కలిగించాలన్నదే బీజేపీ, మోదీ ఉద్దేశం. ఎలాగైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. వాళ్లు ఓట్ల కోసం స్వార్థంతో ఆలోచిస్తారే తప్ప ప్రజల గురించి ఆలోచించరు. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా మనం పనిచేయాలి. మీరు నిలబడండి. పార్టీని నిలబెట్టండి..’ అని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఉన్నోడి వైపు బీజేపీ..లేనోడి వైపు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయం మన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. జనాభా దామాషా ప్రకారం వనరుల పంపిణీ గురించి చర్చ చేసింది, దేశంలో కులగణన చర్చను ప్రారంభించింది మనమే. ఆ వర్గాల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంది. అందుకే తెలంగాణలో బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, మైనార్టీల పక్షం వహిస్తున్నాం. దేశంలో రెండే వర్గాలున్నాయి. ఉన్నోడు.. లేనోడు. ఉన్నోడి వైపు బీజేపీ ఉంటే లేనోడి వైపు కాంగ్రెస్ ఉంది. బీజేపీది విభజన సిద్ధాంతం అయితే, మనది ఐక్యతా దృక్పథం. మనది అహింసా వాదం, వారిది మతం కోసం రాజకీయ వాదం. మనది గాంధేయవాదం, వారిది హింసా వాదం. మనం అన్ని మతాలు, కులాల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ బీజేపీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయదు. శివుడిలా మనం సామాన్యంగా ఉండాలి హిందువులు ఆరాధించే శివుడు సామాన్యుడిలా కనిపిస్తాడు. ఆయన లాగానే మనమూ సామాన్యంగానే ఉండాలి. ఆయన అందరికీ తానున్నానని అభయహస్తం ఇస్తాడు. మన పార్టీ గుర్తు కూడా హస్తమే. మనం అందరినీ కలుపుకొని వెళ్లి ప్రజలకు తామున్నామనే అభయం ఇవ్వాలి. ప్రజలను మెప్పించి, వారి సమ్మతితోనే అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచన. అదే మన సిద్ధాంతం. పార్టీలో మహిళలను గౌరవించాలి. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్ళాలి. బీజేపీ ద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఆగడాలను అడ్డుకుని దేశాన్ని రక్షించాలి..’ అని రాహుల్ చెప్పారు. ట్రేడ్ డీల్ పెద్ద కుట్ర ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. మోదీ అమెరికాకు లొంగిపోయేందుకు ప్రధాన కారణం ట్రేడ్ డీల్. ఇదో పెద్ద కుట్ర. ఈ కుట్రలో మోదీ అనేక తప్పులు చేశారు. అందుకే దేశాన్ని దారాధత్తం చేసి అమెరికా ముందు మోకరిల్లే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసమే పనిచేయడం వెనుక కూడా కుట్ర ఉంది. మోదీ విధానాలతో రూ. 9 లక్షల కోట్ల విలువైన నష్టం దేశ రైతులకు జరుగుతోంది. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరించండి. రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ముందుకు తీసుకెళుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ముఖ్యం. పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అందరూ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించండి..’ అంటూ రాహుల్ దిశానిర్దేశం చేశారు. శుభాకాంక్షలు..ఫొటోసెషన్ డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి ముందు వికారాబాద్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. అందరూ బాగున్నారా అంటూ నేతలను పలకరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీ ఈ సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి వెళ్లిన రాహుల్గాంధీ అక్కడ వారి కుటుంబసభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆత్రం సుగుణ (ఆసిఫాబాద్), ఇ.వెంకట్రామిరెడ్డి (హనుమకొండ), సంజీవ్ ముదిరాజ్ (మహబూబ్నగర్).. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీ అధ్యక్షుల సమస్యలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు బి. మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షరి్మల, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సంగతన్ సృజన్ అభియాన్ ఇన్చార్జి చల్లా వంశీచందర్రెడ్డి, టీపీసీసీ శిక్షణ విభాగం చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
యుద్ధం ఎఫెక్ట్: న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం మరియు సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు.24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్-91 9871999044సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-91 9958322143 -
హోలీలో ఇలా చేస్తే చర్యలే.. ప్రజలకు సజ్జనార్ హెచ్చరిక
సాక్షి హైదరాబాద్: నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోలీ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ కార్యాలయం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు.ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడాలన్నారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం రంజాన్ మాసం నడస్తున్న నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హోలీ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు.హోలీ పండుగ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చెస్తామని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. -
అమెరికా కాన్సులేట్కు భద్రత పెంపు
హైదరాబాద్: పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు చేపడుతుండడంతో అమెరికా కాన్సులేట్కు భద్రత పెంచారు. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఈ కార్యాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులు గచి్చ»ౌలి పోలీసులను ఆదేశించారు. దీంతో ఆదివారం 70 మంది పోలీసులను అమెరికన్ కాన్సులేట్ వద్ద మోహరించారు. అటువైపు వెళ్లే రోడ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. కాగా, ఐటీ కారిడార్లోని స్టార్ హోటళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. వాటిలో బస చేసిన అమెరికన్లు , ఇతర దేశాలకు చెందిన పౌరుల వివరాలను సేకరిస్తున్నారు. అమెరికన్లు నివాసం ఉండేచోట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. -
Hyderabad: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్ వాసులపై పడుతోంది. అనేకమంది ప్రయాణికులు, యాత్రికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. గగనతలాలను (ఎయిర్స్పేస్) మూసివేయడంతో పాటు ఎయిర్పోర్టులను ఖాళీ చేయిస్తుండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఆయా దేశాల్లో ఇక్కట్లు పడుతున్నారు. ట్రాన్సిట్ వీసాలు తీసుకోవడానికీ అవకాశం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అక్కడి ఎంబసీ కార్యాలయాలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదని నగరంలో ఉన్న వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయా దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అమెరికా, యూకేతో పాటు యూరోప్ దేశాలకు ప్రయాణించే వారు విమాన టిక్కెట్లు నేరుగా తమ గమ్యస్థానానికే తీసుకున్నా... అలా ప్రయాణించడం సాధ్యం కాదు. సింగపూర్తో పాటు దుబాయ్, దోహా, అబుదాబి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటలు ఆగి ముందుకుసాగాల్సిందే. వీటినే ట్రాన్సిట్ పాయింట్స్ అంటారు. శనివారం నగరం నుంచి వెళ్లినవారు ట్రాన్సిట్ పాయింట్స్లో చిక్కుకుపోయారు. హఠాత్తుగా కమ్మేసిన యుద్ధ మేఘాలు, ఎయిర్ స్పేస్లు మూసేయడం, వందల అంతర్జాతీయ సరీ్వసుల రద్దు, ప్రయాణికుల లగేజీ దించేయడంతో దుబాయ్, అబుదాబి, దోహా తదితర విమానాశ్రయాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి లగేజీ కుప్పలు కనిపిస్తున్నాయి.హోటల్స్లోనూ బసకు అవకాశం లేక... ప్రయాణం మధ్యలో, ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో ఆయా దేశాల్లో కొన్ని రోజులు ఉండాలంటే కచి్చతంగా ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టుల్లో ఉండే ఈ వీసా కౌంటర్లు సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉంటాయి. ఇక యుద్ధ వాతావరణంలో శనివారం వీటి వద్ద భారీగా క్యూలు పెరిగిపోయాయి. దీంతో అందరికీ ఈ వీసాలు లభించట్లేదు. మరోపక్క విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రికే ప్రయాణికులను విమానాశ్రయం బయటకు పంపేశారు. సాధారణంగా విమానయాన సంస్థలకు హోటల్స్కు మ«ధ్య ఒప్పందాలు ఉంటాయి. అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులను ఎయిర్లైన్స్లు ఒప్పందం ఉన్న హోటల్స్కు పంపి బస కల్పిస్తాయి. శనివారం రాత్రి ఓచర్లు ఇచ్చి ఇలానే చేశాయి. అప్పటికే హోటళ్లు ఖాళీ లేకపోవడం, ఆహారం, నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు గదులు ఇవ్వడం లేదు.విహారయాత్రికులది మరో పరిస్థితి... ఆయా ట్రాన్సిట్ కంట్రీస్కు టూరిస్టులు సైతం ఎక్కువ సంఖ్యలోనే వెళ్తుంటారు. సాధారణంగా 4నుంచి 15 రోజుల ప్యాకేజీలతో వెళ్లి వస్తుంటారు. ఇందులోనే రాను–పోను చార్జీలు, బస, స్థానికంగా రవాణా తదితరాలు ఉంటాయి. నగరం నుంచి గత వారం రోజుల్లో దుబాయ్ సహా ఇతర ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లినవాళ్లు హోటళ్లలో ఇరుక్కుపోయారు. ఇలాంటివారిలో పీవీ సింధు, మంచు విష్ణు వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వీరికి ఇబ్బంది లేకపోయినా సాధారణ టూరిస్టులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్యాకేజీ సమయం మీరిన తర్వాత, కొన్ని హోటళ్లలో సమయం ఉన్నప్పటికీ బస చేయడానికి యాజమాన్యాలు అంగీకరించట్లేదు. తాము వసతులు కలి్పంచలేమని, ఆహారం అందించలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని హోటల్స్లో బస కలి్పంచడానికి భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలిసిన వారు ఎవరూ లేకుంటే ఇబ్బందే గత నెల 22న విహార యాత్ర నిమిత్తం దుబాయ్ వచ్చా. తాజా ఉద్రిక్తతలతో శనివారం నుంచి హోటల్ రూమ్కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక్కడ వాట్సాప్ కూడా పని చేయకపోవడంతో కుటుంబీకులతో సంప్రదింపులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ క్షిపణులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియట్లేదు. స్థానికంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఇబ్బంది లేదు. టూరిస్టు, ప్యాసింజర్గా వచి్చనవాళ్లు మాత్రం ఇబ్బంది పడాల్సిందే. భయానక పరిస్థితుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతున్నాం. అబుదాబి, దోహాల్లోనూ ఇలానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి విమానాశ్రయాలు మూసివేశారు. –వినయ్ కుమార్, మియాపూర్ -
తప్పతాగి.. కానిస్టేబుల్ను ఢీకొట్టి
రంగారెడ్డి జిల్లా: మద్యం మత్తులో కారులో అతి వేగంగా వచ్చిన ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. తన కారుతో మరో కారును ఢీకొట్టి పారిపోయే ప్రయత్నంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ను కూడా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కారు బానెట్పై పడ్డా ఆపకుండా దాదాపు 800 మీటర్లు దూసుకెళ్లాడు. వాహనదారులు అతడిని అడ్డుకోవడంతో పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నార్సింగిలోని జయభేరి సమ్మిట్లో నివాసం ఉండే గుర్రంపాటి తరుణ్రెడ్డి బెంజ్ కారులో వెళుతూ శనివారం ఉదయం నానక్రాంగూడ వద్ద మరో కారును ఢీ కొట్టాడు. అయితే అతను ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సెట్లో సమాచారం అందించడంతో ట్రిపుల్ ఐటీ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇ.నర్సింహులు అటుగా వచ్చిన బెంజ్ కారును ఆపేందుకు ప్రయతి్నంచారు. అయితే తరుణ్ రెడ్డి దీనిని పట్టించుకోకుండా కానిస్టేబుల్ను ఢీకొనడంతో అతను కారు బానెట్పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా అలాగే వెళుతుండటాన్ని గుర్తించిన వాహనదారులు కారును అడ్డుకుని కానిస్టేబుల్ను కాపాడారు. ఈ ఘటనలో నర్సింహులు స్వల్పగాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 160 ఎంజీగా నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లన..
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల ఆదరణను పెంచుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రతిరోజు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్లు మాత్రం 60 – 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ బస్సుల్లో కేవలం నగదు చెల్లించి టికెట్ కొనుక్కొనే సదుపాయం ఉండటంతో మహిళలు వినియోగించుకోవడం లేదు. మరోవైపు అధిక చార్జీల కారణంగా పురుషులు సైతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు.హైటెక్సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠీ, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలకు ఏసీ బస్సులు నడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణ లభించడం లేదు.దీంతో ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు టికెట్పై రాయితీలను అందజేస్తున్నారు. కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.10 వరకు ఈ రాయితీ లభిస్తుందని అధికారులు తెలిపారు. ఏసీ బస్సుల్లో 5 స్టేజీలు లేదా 10 కి.మీ.దూరానికి ప్రస్తుతం రూ.50 చార్జీ ఉండగా, తాజా రాయితీపైన రూ.40కే ప్రయాణం చేయవచ్చు. అలాగే 10 స్టేజీలు లేదా 20 కి.మీ.దూరానికి ప్రస్తుతం నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.55 చార్జీ ఉండగా, రాయితీతో రూ.45 కే ప్రయాణం చేయవచ్చు. నగదు కష్టాలు.. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కానీ ప్రతిరోజు నగదు చెల్లించి ప్రయాణం చేసే పురుషుల సంఖ్య మాత్రం పడిపోయింది.దీంతో మహిళల ఉచిత టికెట్లపైన ప్రభుత్వం నుంచి లభించే నిధులు మినహా రోజువారీ బస్సుల నిర్వహణ, ఇతరత్రా ఖర్చుల కోసం డిపోల్లో నగదు కష్టాలు పెరిగాయి.ఈ క్రమంలోనే పురుషుల సంఖ్యను పెంచాలని డ్రైవర్లు, కండక్టర్లపైన అధికారులు ఒత్తిడిని పెంచారు. అదనపు ఆదాయంపైన దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు తాజాగా వేసవి రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రాయితీలు ప్రకటించారు. -
మహిళలకు కేన్సర్ గండం
సాక్షి, హైదరాబాద్: మహిళల్లో పెరుగుతున్న కేన్సర్ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత ఐదేళ్లలో బ్రెస్ట్, సరై్వకల్, ఓవేరియన్ కేన్సర్ కేసులు పెరుగుతున్న తీరు ఇందుకు కారణం. 2021 నుంచి 2025 వరకు నమోదైన అంచనా గణాంకాలను జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ కార్యక్రమం (ఎన్సీడీఐఆర్) విడుదల చేసింది. ఇందులో ఏటా కేన్సర్ కేసులు పెరుగుతున్న తీరును స్పష్టం చేసింది. 2021లో దేశంలో బ్రెస్ట్ కేన్సర్ కేసులు 2,13,263 ఉండగా 2025 నాటికి ఇవి 2,40,381కు పెరిగాయి. సరై్వకల్ కేన్సర్ కేసులు 76,898 నుంచి 79,239కు పెరిగాయి. ఓవేరియన్ కేన్సర్ కేసులు 45,217 నుంచి 49,449కు చేరాయి. మరణాల విషయానికొస్తే 2021లో బ్రెస్ట్ కేన్సర్ మరణాలు 91,704 ఉండగా 2025లో 1,03,363కు పెరిగాయి. సరై్వకల్ కేన్సర్ మరణాలు 41,523 నుంచి 42,789కు పెరగగా, ఓవేరియన్ కేన్సర్ మరణాలు 27,584 నుంచి 30,167కు చేరాయి. రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో కూడా మహిళల్లో కేన్సర్ కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2021లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు 6,258 ఉండగా 2025 నాటికి అవి 7,084కి పెరిగాయి. ఇక సరై్వకల్ కేన్సర్ కేసులు 2021లో 3,169 నమోదు కాగా 2025లో 3,233కు పెరిగాయి. ఓవేరియన్ కేన్స ర్ కేసులు 1,231 నుంచి 1,365కు పెరిగాయి. మరణాల పరంగా బ్రెస్ట్ కేన్సర్ మరణాలు 2,691 నుంచి 3,046కి, సరై్వకల్ కేన్సర్ మరణా లు 1,711 నుంచి 1,746కి, ఓవేరియన్ కేన్సర్ మరణాలు 751 నుంచి 833కి పెరిగాయి. ఉత్తరాదిలో అధికం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మూడు రకాల కేన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముందస్తు స్క్రీనింగ్ అవసరం మహిళలు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత బ్రెస్ట్ పరీక్షలు, గర్భాశయ ద్వారం స్క్రీనింగ్ (పాప్ స్మియర్), అ్రల్టాసౌండ్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే కేన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. తాజాగా రా ష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 14 ఏళ్లు నిండిన బాలికలకు వ్యాక్సిన్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
పాతబస్తీలో షియాల భారీ నిరసన
చార్మీనార్/డబీర్ పురా: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఖమేనీ హత్యను నిరసిస్తూ ఆదివారం పాతబస్తీ పురానీ హవేలీ చౌరస్తా వద్ద షియా ముస్లింలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమేనీ చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకొని నివాళులర్పించారు. పురానీ హవేలీ చౌరస్తా నుంచి దారుషిఫా వరకు నిరసన ర్యాలీ సాగింది. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు సహా భారీఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. దారి పొడవునా డెత్ టు అమెరికా.. డెత్ టు ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేస్తూ ఆదివారం రాత్రి ఆయా దేశాల జెండాలను రోడ్డుపై వేసి తొక్కుతూ నిరసన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయెల్కు తగిన శిక్ష తప్పదని షియా పెద్దలు ర్కొన్నారు. ఖమేనీ హత్యను పిరికి పందల చర్య అని తీవ్రంగా మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్లో ఉండిపోయిన భారతీయులందరినీ యుద్ధ ప్రాతిపదికన వెంటనే రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. పురానీ హవేలీ నుంచి కొనసాగిన ర్యాలీ చివరలో చార్మీనార్ ఎమ్మెల్యే మీర్ జుల్పికర్ అలీ, ఎమ్మెల్సీ మీర్జా హసన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదండీ మీ ర్యాంకు... వచ్చేయండి!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎప్సెట్) మే నెలలో జరుగుతుంది. కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడే విద్యార్థులకు ర్యాంకులు ఇస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రైవేటు, ప్రభుత్వ ఇంటర్ కాలేజీలతో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సమన్వయం చేసుకుంటున్నాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆన్లైన్ ఎప్సెట్ మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగానే ర్యాంకులు తెలియజేస్తున్నాయి. వీటిని చూపించి, తమ కాలేజీలో ముందే సీటు రిజర్వు చేసుకోవాలని కోరుతున్నాయి.ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎప్సెట్ రాసిన వెంటనే కంప్యూటర్ తెరపై చివరలో మార్కులను వెల్లడించే విధానాన్ని సెట్ విభాగం తీసుకొచి్చంది. కాబట్టి విద్యార్థికి ఎంత ర్యాంకు వస్తుందనే అంచనాకు రావడం తేలిక. ఫలితంగా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకు యత్నించాలో విద్యార్థి ఓ నిర్ణయానికి వచ్చే వీలుంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీలు తమకు అనుకూలంగా ర్యాంకులు తెస్తున్నాయనే ఆరోపణలు కూడా విని్పస్తున్నాయి. ముందుగా సీటు రిజర్వు చేసుకుంటే గ్యారంటీ ఉంటుందని నమ్మబలుకుతున్నాయి. లక్ష మందికి గాలం ఏటా 3 లక్షల మంది ఎప్సెట్ రాస్తుంటారు. 160 మార్కులకు ఉండే ఈ ప్రశ్నపత్రంలో సగం మార్కులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. 50 లోపు మార్కులతో 50 వేల ర్యాంకు పొందుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. 43 మార్కులు సాధించి లక్ష లోపు ర్యాంకు వస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వందకు పైగా మార్కులు సాధిస్తే వారికి వంద ర్యాంకు వస్తుంది.ఇలాంటి వాళ్లంతా ఎన్ఐటీ, ఐఐటీలు ఇతర సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. వెయ్యి లోపు ర్యాంకు వచ్చే విద్యార్థులకు కన్వీనర్ కోటాలోనే టాప్ కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. 5 వేలలోపు ర్యాంకు వచ్చే దాదాపు 10 వేల మందికి కూడా ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ టాప్ టెన్లో ఉన్న కాలేజీల్లో సీట్లు దొరుకుతున్నాయి. ఈ లెక్కన మంచి కాలేజీలో సీట్లు రావనుకున్న లక్ష మందిని ప్రైవేటు కాలేజీలు గుర్తించి, సీట్లు అమ్ముకునే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. కాలేజీల కొత్త మంత్రం ఇంజనీరింగ్ పూర్తవ్వగానే సాఫ్ట్వేర్ కొలువు గ్యారంటీ అన్న నినాదాన్ని విద్యార్థుల వద్దకు తీసుకెళ్తున్నాయి. డీమ్డ్, అటానమస్ కాలేజీలు ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. కేవలం నైపుణ్యం నేర్పడం ద్వారా ఉద్యోగాలు సాధించడం తేలికని భావిస్తున్నాయి. ఫీల్డ్వర్క్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దీన్ని తమకు అనుకూలంగా కాలేజీలు మలుచుకుంటున్నాయి.కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలతో తమకు భాగస్వామ్యం ఉందని, వాటిల్లో ఇంటర్న్ షిప్ ఇప్పిస్తామని, అదే కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రైవేటు కాలేజీలు ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఇతర ఎమర్జింగ్ కోర్సుల సీట్ల భర్తీకే ప్రయతి్నస్తున్నాయి. దీనికోసం ఇప్పట్నుంచే కృత్రిమ డిమాండ్ సృష్టించే ప్రయత్నంలో ఉన్నాయి. ర్యాంకు ఏదైనా దారి అటే... రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వీటిల్లో 68 శాతం కంప్యూటర్, దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లోనే సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో దాదాపు 40 వేల సీట్లున్నాయి. ఇందులో 25 వేల వరకూ కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే భర్తీ అవుతున్నాయి. 20 వేల మంది విద్యార్థులు 50 వేలకుపైగా ర్యాంకు ఉన్నవాళ్లే ఈ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత లేని విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఇటీవల ఏఐసీటీఈ పేర్కొంది. ఆన్లైన్ విధానం తేవడం వల్ల నాణ్యమైన విద్యార్థులు వచ్చే వీలుందని ఏఐసీటీఈ భావిస్తోంది. ఎమర్జింగ్ కోర్సుల్లో డబ్బులు కట్టి చేరడం వల్ల ఏఐతో వచ్చే ఉద్యోగాల్లో కోడింగ్ చేయలేకపోతున్నారని నౌకరీ డాట్ కామ్ నివేదిక స్పష్టం చేస్తోంది. -
26 అరైవల్, 27 డిపార్చర్ విమానాల రద్దు
శంషాబాద్: పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దోహా, బహ్రెయిన్, అబుదాబితో పాటు పలు దేశాల గగనతలం మూసివేత కారణంగా హైదరాబాద్కు రాకపోకలు సాగించే విమానాలు పెద్ద ఎత్తున రద్దవుతున్నాయి. ఆదివారం మొత్తం శంషాబాద్కు రావాల్సిన 26 అరైవల్, ఇక్కడి నుంచి బయల్దేరాల్సిన 27 డిపార్చర్ విమానాలను సంబంధిత ఎయిర్లైన్స్లు ముందస్తుగానే రద్దు చేశాయి. ఇందులో కువైట్, దుబాయ్, అబుదాబి, రస్అల్ ఖైమా, ధమామ్, జెడ్డా, షార్జా తదితర గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలున్నాయి.దుబాయ్ నుంచి యూఎస్ అనుసంధాన విమానాల్లో బయల్దేరే వారికి కూడా విమానాల రద్దు ప్రభావం పడింది. కార్గో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. హాంగ్కాంగ్ నుంచి దుబాయ్కు బయల్దేరిన ఓ విమానాన్ని దారి మళ్లించడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసి బే–203 పార్క్ చేశారు. అలాగే థాయ్లాండ్లోని క్రాబి నుంచి దుబాయ్కు బయల్దేరిన విమానాన్ని కూడా దారి మళ్లించి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. సోమవారం నాటి షెడ్యూల్లో కూడా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఏడు విమానాలు రద్దు చేసినట్లు ముందస్తుగా ప్రకటించారు. టికెట్ బుకి ంగ్ సమయంలో కాంటాక్ట్ ఫోన్ నంబరు ఉన్న వారికి ముందస్తు సమాచారం అందుతోంది. -
ఎన్డీడీబీ చేతికి మదర్ డెయిరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: మూసివేత తప్పని దశకు చేరుకున్న మదర్ డెయిరీ (నార్ముల్)ని ఆదుకునేందుకు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) రంగంలోకి దిగనుంది. ఈ డెయిరీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా, కొంత కాలం నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు కూడా బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఎన్డీడీబీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేశ్ షా, బోర్డు ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ జి. మధుసూదన్రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మదర్ డెయిరీ సంస్థ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. అలాగే డెయిరీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. నిర్వహణ బాధ్యతలు ఎన్డీడీబీ తీసుకోవాలని మదర్ డెయిరీ పాలకవర్గం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రతినిధి బృందం బోర్డుకు అందజేసింది. రూ.75 కోట్ల నిధులు అనివార్యం..: ప్రస్తుత పరిస్థితుల్లో డెయిరీని గట్టెక్కించాలంటే రూ.75 కోట్ల వరకు అనివార్యంగా నిధులు కావాలని, అలాగే సంస్థ నిర్వహణకు మరికొంత అవసరం అవుతాయని, ఈ పరిస్థితుల్లో ఎన్డీడీబీ సహకారం కావాలని, లేదంటే డెయిరీ మూసివేత ఒక్కటే మార్గమవుతుందని తెలంగాణ ప్రతినిధులు వివరించారు. డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి వేతనాలు, పాల సేకరణ, బ్యాంకుల్లో తక్షణమే చెల్లించాల్సిన రుణాలు, కార్యకలాపాల పునరుద్ధరణ, పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం కొన్ని షరతుల మీద మదర్ డెయిరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ఎన్డీడీబీ అంగీకరించినట్టు తెలిసింది. ఈ షరతులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే జాతీయ స్థాయిలోని మరో డెయిరీతో కలిసి సంయుక్తంగా కొంతకాలంపాటు డెయిరీని నిర్వహిస్తామని ఎన్డీడీబీ స్పష్టం చేసింది. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ప్రతినిధులు చర్చల పురోగతికి కూడా తమ సమ్మతిని తెలియజేశారు. దీంతో 10–15 రోజుల్లో మదర్ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వం, ఎన్డీడీబీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం మేరకు ఎన్డీడీబీ రంగంలోకి దిగి ఆర్థిక కష్టాలు, అస్తవ్యస్త నిర్వహణతో కుదేలవుతున్న మదర్ డెయిరీకి మళ్లీ జీవం పోసే ప్రయత్నాలను ప్రారంభించనుంది. -
అక్రమ వసూళ్లు..అధికార దుర్వినియోగం!
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 15 రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోతే సీపీ చేస్తున్న అన్ని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వీడియోలతో సహా త్వరలో అసెంబ్లీ, మీడియా సాక్షిగా బయటపెడతానని హెచ్చరించారు. ‘కరీంనగర్ సీపీ బచ్చాగాడు, ఆయన వయస్సు 40 యేండ్ల కంటే చిన్ననే..’అని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌశిక్రెడ్డి మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ వాహనాలా? ‘పీడీఎస్ బియ్యం అక్రమార్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 337 మంది హోంగార్డుల బదిలీ కోసం రూ.కోటి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారు. టీఎస్ 09 పీఏ 4195 ఇన్నోవా వాహనాన్ని సీపీ గౌస్ ఆలం తన మిత్రుడు, ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం వినియోగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రైవర్లుగా ఉన్నారు. టీఎస్ 09 పీఏ 5601 ఇన్నోవా కారు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సోదరుడిని కాలేజీలో డ్రాప్ చేసేందుకు రోజు చలిమెడ వెళ్తుంది. ప్రైవేటు పౌరుల కోసం ప్రభుత్వ వాహనాల వాడకంపై డీజీపీ శివధర్రెడ్డి సమాధానం చెప్పాలి. సీపీ సతీమణికి కరీంనగర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచి్చందో తెలుసు. ఆమె కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు. ఇక ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు..’అని కౌశిక్రెడ్డి ఆరోపించారు. వసూళ్ల కోసం ఏసీపీ, సీఐని పెట్టుకున్నారు.. ‘బియ్యం అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేయించేందుకు ఏసీపీ విజయ్కుమార్, సీఐ సృజన్రెడ్డిని సీపీ పెట్టుకున్నారు. జనవరి 8న ఎన్ఎన్ ప్రైడ్ మాల్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఆ మాల్ యజమాని దగ్గర నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. చర్యలు తీసుకోకపోతే వీడియోలు బయట పెడతా. ఆ తర్వాత ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ బాధపడకూడదు. ఎందుకంటే నేను ఆ వీడియోలు బయట పెడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. 15 రోజుల తర్వాత హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐ ఏమేం పనులు చేస్తున్నారో అన్నీ బయట పెడతా..’అని కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. -
డీసీసీల అధ్యక్షులకు నేడు రాహుల్ క్లాస్
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులను కలవనున్న రాహుల్ వారితో ఫొటో సెషన్లో పాల్గొననున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులను కూడా ఈ శిబిరానికి ఆహ్వానించారు. వారితో కూడా మాట్లాడనున్న రాహుల్ ఫొటోలు సైతం దిగనున్నారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు పీఏసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, సంగతన్ సృజన్ అభియాన్ జాతీయ ఇన్చార్జి చల్లా వంశీచందర్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్కుమార్, విశ్వనాథన్, సచిన్ సావంత్, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మొత్తంగా 77 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. రాహుల్ షెడ్యూల్ ఇదీ.. పీసీసీ వర్గాలు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 7:10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాహుల్గాంధీ 9:20 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న రాహుల్గాంధీ 10 గంటలరే వికారాబాద్కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్కు చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ శిబిరంలో ఉంటారు. తిరిగి హెలికాప్టర్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని 5:30 గంటలకు ఢిల్లీ వెళ్తారు. -
సింఘ్వీ రెన్యువల్.. రెండో బెర్తు నేడు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఖరారయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇద్దరికి అవకాశముండగా, అందులో ఒక స్థానం సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ కానుందని సమాచారం. రెండో బెర్తు కోసం తీవ్రమైన పోటీ ఉండగా, సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక సమీకరణల నేపథ్యంలో వేం లేదా వంశీలలో ఒకరికి ఈ సీటు దక్కుతుందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నలుగురిలో ఎవరో? రెండు రాజ్యసభ సీట్లల్లో ఒకటి సింఘ్వీకి ఖరాయిందనే చర్చ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే జరుగుతోంది. ఆయన నామినేషన్కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా రెండో స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎంతో పాటు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేశాయి. రెడ్డి సామాజిక వర్గానికి లేదంటే బీసీలకు ఇచ్చే కోణంలో పేర్లను పరిశీలించారు. మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే పీసీసీ నేతలతో చర్చ సందర్భంగా ఈసారి రాజ్యసభకు కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్. పి.వినయ్కుమార్ పేరును అధిష్టానం ప్రతిపాదించినట్టు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హన్మంతరావు కోరిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడింది. మరోవైపు ఈసారి ఓసీలకు అవకాశం ఇవ్వాలని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపాలనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే వంశీచందర్రెడ్డి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. అయితే వంశీ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని సీనియర్లను ఈసారి రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం మరికొంత కాలం ఆయన సేవలు అవసరమనే కోణంలో కూడా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చే పక్షంలో వేం నరేందర్రెడ్డిని ఎంపిక చేయాలని రేవంత్రెడ్డి కోరుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి పేరును సీఎం ప్రతిపాదించారు. కానీ సుదర్శన్రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్రెడ్డిని ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేస్తారా? అనూహ్యంగా ఇంకెవరికైనా అవకాశమిస్తారా? అనేది సోమవారం తేలుతుందని అంటున్నారు. డిప్యూటీ సీఎం వద్ద బ్రేక్ఫాస్ట్ భేటీ రాజ్యసభ రెండో బెర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం ప్రజాభవన్లో జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ భేటీకి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్, కొండా సురేఖ, అజహరుద్దీన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా హాజరయ్యారు. అలాగైతే రెండు సీట్లూ రాష్ట్ర నేతలకే..! రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అభిషేక్ మను సింఘ్వీని తమిళనాడు నుంచి ఎంపిక చేసే అంశం కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రెండు స్థానాలూ రాష్ట్రానికి చెందిన నాయకులకే దక్కే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. తమిళనాడులో డీఎంకే మద్దతుతో ఒక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన పేరుపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సుముఖంగా లేరని, సింఘ్వీ విషయంలో సానుకూలంగా స్పందించారని అంటున్నారు. సింఘ్వీ తమిళనాడుకు వెళితే సమీకరణలు ఆసక్తికరంగా మారతాయని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. -
వ్యూస్ కోసం కక్కుర్తి పడొద్దు.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి హైదరాబాద్: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరా బాద్ సీపీ VC సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ఖాతాలో సజ్జనార్ పోస్ట్ చేశారు.చలాన్ల రాయితీ తప్పంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీస్ శాఖ ఇదివరకూ అధికారికంగా ఎటువంటి రాయితీలను ప్రకటించలేదని తెలిపారు.కనుక ప్రజలు దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి అని సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ తెలిపారు.ఫేక్ న్యూస్ అలర్ట్! సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం.… pic.twitter.com/wrZ9znN6qe— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 1, 2026 -
‘ఇరాన్పై దాడుల్ని భారత్ ఖండించాలి’
సాక్షి,హైదరాబాద్: మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని భారత్ ఖండించాలని ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ అన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఓవైసీ స్పందించారు. ‘ఇరాన్పై దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్పై దాడుల్ని తక్షణమే ముగియాలని,ఈ విషయంలో భారత ప్రభుత్వం తన పాత్ర పోషించాలని కోరారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. దాడుల్ని కేంద్రం ఖండించాలి. అంతర్జాతీయ స్థాయిలో దేశం శాంతి ప్రయత్నాలకు ముందడుగు వేయాలి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి (10 మిలియన్) మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధం కొనసాగితే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కల్లోలం తప్పదు. భారతీయులు అక్కడ చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
Hyderabad: అక్కడ యుద్ధం.. ఇక్కడ కలవరం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా పరిణామాలతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్కడ జరుగుతున్న యుద్ధం.. ఇక్కడివారిలో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారో అంటూ హైదరాబాదీలు బెంగ పెట్టుకున్నారు. వారి యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఆరా తీస్తున్నారు. కాగా, పవిత్ర రంజాన్ నెలలో గల్ఫ్ నుంచి హైదరాబాదీలు పెద్దఎత్తున స్వదేశానికి వస్తుంటారు. యుద్ధం కారణంగా వీరి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. వీరేకాక వేలాదిమంది సాధారణ నగర ప్రజలు నగరం నుంచి గల్ఫ్, ఇరాన్ లకు వెళ్తూ వస్తుంటారు. విమానాల రద్దుతో వీరి ప్రయాణం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి నడిచే అంతర్జాతీయ విమాన సరీ్వసుల్లో ఎమిరేట్స్ తదితర గల్ఫ్ దేశాల సంస్థలకు చెందినవే అధికం కావడం గమనార్హం. భాష, సంస్కృతిలో పటిష్ఠ సంబంధాలు.. ఇరాన్కు హైదరాబాద్తో శతాబ్దాలుగా అనుబంధం ఉంది. ముఖ్యంగా కుతుబ్షాహీ కాలం నుంచి ఇరానియన్లు నగరానికి వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. వ్యాపారంతో పాటు నిర్మాణ రంగంలో ఉన్నారు. పర్షియన్ (ఇరాన్) ప్రభావం హైదరాబాద్ సంస్కృతి, నిర్మాణ శైలి, వంటకాలు, భాషపై స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాదీ ఉర్దూలో పర్షియన్ పదాలు కలిసిపోయాయి. చార్మినార్, గోల్కొండ తదితర చారిత్రక కట్టడాలలో పర్షియన్ నిర్మాణ శైలి స్పష్టంగా చూడవచ్చు. కాగా, ఉర్దూ, పర్షియన్ భాష కలగలిసి నగర సాంస్కృతిక జీవనంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. ఇరాన్ కవులు, మేధావులు ఇక్కడ స్థిరపడ్డారు. వందలాది ఇరానియన్ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇరానీ చాయ్, ఇరానీ హలీమ్, వంటకాలు హైదరాబాదీల ఫేవరెట్. వంటకాలలో ఇరానీ ఘాటు సుగంధద్రవ్యాలను ప్రజలు ఇష్టపడుతుంటారు. కుతుబ్షాహీల కాలంలో వలస వచి్చన ఇరానియన్లు తయారు చేసిన చాయ్.. ఇరానీ చాయ్గా సుప్రసిద్ధమైంది. నగరంలో ఎన్నో ఇరానీ రెస్టారెంట్లు ఉన్నాయి. పెద్ద హోటళ్లతో పాటు ఫుడ్ ఫెస్టివల్స్లో ఇరానీ వంటకాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఇరాన్–హైదరాబాద్ మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి.ఇరాన్ సుప్రీంనేత పేరిట.. బంజారాహిల్స్లో ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఉంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.7 లోని రోడ్డుకు ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీ పేరు పెట్టారు. ఇక ఢిల్లీలోని ఎంబసీ కాకుండా భారత్లో ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు రెండు మాత్రమే. ఒకటి ముంబైలో ఉండగా మరొకటి హైదరాబాద్లో ఉంది.విద్యాబంధం నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఇరాన్ యువత వందలాది మంది చదువుతున్నారు. ముఖ్యంగా ఓయూ, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రధాన కేంద్రాలు. వీరంతా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు చదువుతున్నారు. ఇప్పుడు స్వదేశంలో తమవారి గురించి బెంగ పెట్టుకున్నారు.తండ్రి కడచూపు నోచుకోలేక.. నగరంలోని బీఎన్రెడ్డి నగర్ కు చెందిన వ్యక్తి మృతిచెందారు. ఈయన పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి మరణవార్త తెలుసుకుని తిరిగొస్తున్న వీరు దుబాయ్లో చిక్కుకున్నారు. చిక్కుకుపోయిన పీవీ సింధు.. బర్మింగ్హామ్ నుంచి వస్తున్న హైదరాబాదీ, ప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విమాన సరీ్వసులు నిలిచిపోవడంతో దుబాయ్లో ఆగిపోయారు. -
భగభగలు.. వడగాలులు
సాక్షి, హైదరాబాద్: వేసవి భగభగలు తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం సాధారణ స్థితిలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతుండగా రానురాను తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్గా పరిగణిస్తాం. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి రెండో వారం నుంచే ప్రారంభమయ్యాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనున్న చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనం కావడం, ఎక్కువ రోజులు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దీనికితోడు చలి తీవ్రత కూడా అధికంగా ఉండగా ఈ ఏడాది వేసవిలో ఇదే తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వేడితో కూడుకున్న రోజులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్చిలో తేలికపాటి వానలు... రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నాయి. రానున్న మూడు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ఈనెల రెండు, మూడో వారంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈనెలాఖరు నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ఈ సీజన్లో గరిష్టంగా 44 నుంచి 46డిగ్రీ సెల్సియస్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అదేవిధంగా భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో వడగాలులు కూడా ఎక్కువ రోజులు వీస్తాయని, వాతావరణంలో నెలకొన్న మార్పులుతో అత్యంత చలి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా వేసవి సీజన్పై ప్రాథమిక అంచనాలను ఐఎండీ నేడో, రేపో విడుదల చేయనుంది. -
14 అరైవల్, 19 డిపార్చర్ విమానాలు రద్దు
శంషాబాద్: పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాల రద్దు సంఖ్య పెరుగుతోంది. రాత్రి 9 గంటల వరకు గల్ఫ్తో పాటు ఆసియా దేశాల నుంచి రావాల్సిన మొత్తం 14 విమానాలు రద్దు కాగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గల్ఫ్తో పాటు వివిధ దేశాలకు వెళ్లాల్సిన 19 విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. యుద్ధం కారణంగా దోహా, బహ్రెయిన్ల గగనతలం మూసివేయడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి దోహా, షార్జా, కువైట్, ధమామ్, అబుదాబి, రస్ అల్ఖైమాకు వెళ్లే విమానాలతో పాటు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్కు చెందిన విమానాలు కూడా ఉన్నాయి. -
మూసీ మురిసేలా మహాత్ముడు
సాక్షి, హైదరాబాద్/లంగర్హౌస్: మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి. నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే.ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు).మూసీ చుట్టూ 25 వేల ఎకరాల భూమి..: తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు వైపులా మొత్తం 21 కిలో మీటర్ల మేర మూసీని సుందరీకరించనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో సుమారు 5,600 కోట్ల వ్యయంతో నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. రోడ్లు, వంతెనలు, స్కైవాక్లతో పాటు నదీ తీరాలను అభివృద్ధి చేసేందుకు వెచ్చించనున్నారు. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీపీ) రూ.4,100 కోట్లు రుణం రూపంలో అందించనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్లు, పీపీపీ విధానం, ఇతరత్రా రూపంలో సమీకరించనుంది. ఆ తర్వాత దశల వారీగా హెచ్ఎండీఏ పరిధిలో మూసీ ప్రవహించే 55 కి.మీ. వరకూ నదికి పునరుజ్జీవం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మూసీకి ఇరువైపులా సుమారు 25 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 120 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని నివాస, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా స్థిరాస్తి కార్యకలాపాలకు వినియోగించాలని భావిస్తున్నారు.సరోవర్లో ఏముంటాయంటే..సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 238 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్లో 52 ఎకరాలు కేంద్ర రక్షణ శాఖకు చెందినవి ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 38.9 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. నది పరీవాహక ప్రాంతాన్ని హ్యాపెనింగ్ ప్లేస్గా, నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ సరోవర్లో గాంధీతత్వశాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం వంటివి ఉంటాయి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నది పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 99 రోజుల కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించి, వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని సీఎస్ను ఆదేశించారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. ఈ 99 రోజుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్తోపాటు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని.. ప్రతి పథకం, ప్రతి పాలసీ విజయం, వైఫల్యం వారిపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. మార్చి 4న నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపై మాట్లాడతానని వెల్లడించారు. ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా.. పరిపాలనలో అధునాతన సాంకేతికను సమర్థంగా వినియోగించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారానే అన్ని పథకాలు, సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. కరెంట్ మీటర్, ఇళ్ల నిర్మాణానికి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని చెప్పారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ అధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశించారు. మూడు వారాల్లో నివేదికను అందజేయాలని కోరారు. ప్రతీ విభాగంలో డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కేంద్రం సమ్మిట్పై విమర్శలొచ్చాయి.. కేంద్రం నిర్వహించిన ఏఐ సమ్మిట్పై కొన్ని విమర్శలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించామని గుర్తు చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల డేటా సిద్ధంగా ఉండాలి.. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం అన్ని శాఖల కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండాలని, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారు.. పారదర్శకత, జవాబుదారీతనం, మార్పును తీసుకొస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం రెండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని అధికారులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించారు. -
చేయూత కోసం చాన్నాళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ‘చేయూత’పింఛన్ల మంజూరు కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త పింఛన్ల దరఖాస్తునకు సంబంధించి 2022 ఆగస్టు నుంచే ఆసరా పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా వివిధ కేటగిరీల కింద కొత్త పింఛన్ల కోసం దాదాపు 19 లక్షల దాకా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. దాదాపు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం వివిధ కేటగిరీల వారు నిరీక్షిస్తున్నారు. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, నాలుగు లక్షల దాకా వితంతు, మూడులక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే 70 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న దరఖాస్తులన్నీ కలిపితే 19 లక్షలు ఉన్నట్టుగా సమాచారం. చేయూత ఇలా... చేయూత పథకం... వృద్ధులతోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కారి్మకులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు భరోసానిస్తోంది. ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్య పదేళ్ల కాలంలో పింఛన్ల కోసం రూ.5,558 కోట్లు ఖర్చుచేయగా... తెలంగాణ ఏర్పడ్డాక... 2014–23 ఏళ్ల మధ్య ఆసరా పథకం కింద రూ.61,526 కోట్లు వ్యయం చేశారు. ప్రస్తుతం వృద్ధాప్య ఇతర కేటగిరీల పింఛనుదారులకు నెలకు రూ.2,016 చెల్లిస్తుండగా, దివ్యాంగులకు రూ.4,016 అందజేస్తున్నారు. 2014 వరకు పింఛన్లు పొందే లబ్ధిదారులు 29,21,828 మంది ఉన్నారు. 2023 డిసెంబర్ నాటికి వివిధ కేటగిరీల ఆసరా పింఛ¯న్దారుల సంఖ్య 43,20,551కు పెరిగింది. వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాల వల్ల 3.05 లక్షల పింఛన్లను తొలగించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారు 41,02,818 ఉన్నట్టుగా తెలుస్తోంది. -
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
సెక్రటేరియట్ : మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన సీఎం.. ప్రమాదం లో గాయపడిన ఒకరి కి 3 లక్షల పరిహారం.. నవంబర్ 17, 2025 న సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన 44 మంది హైదరాబాద్ వాసులు..కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్,హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా,తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్.సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యల పైన కేంద్రం తో మాట్లాడాను..మంత్రి అజారుద్దీన్ ను మదీనా పంపించాను..బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం..దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు..కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం..నాంపల్లి అగ్ని ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం..ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం..అందుకే కుటుంబాలను సెక్రటేరియట్ కి పిలిచి పరిహారం అందించాం…ఇది మీ ప్రభుత్వం..ఆందోళన వద్దుమీ కష్టం,ఆనందం లో మీతో ఉంటుంది..ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది..అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం..కొడంగల్ లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్ కు పంపిస్తున్న.. -
శారదాపీఠం భూములపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలోని శారదాఫీఠం భూముల అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో జలమండలికి భూ కేటాయింపులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిర్మాణాల తాజా స్థితిని తెలియజేయనందుకు అధికారులపై రేవంత్ ఫైర్ అయినట్లు సమాచారం. కాగా, 2019లో తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని, ఇది ఆ పీఠం విజ్ఞప్తి మేరకే జరిగినట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ ధ్వజంశారదా పీఠం భూములు అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇక దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారంటూ హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్లం లేదా అంటూ ప్రశ్నించారు. -
Telangana: వాహనదారులకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది జీవితకాల పన్ను పెంపుతో పాటు పౌరసేవల రుసుములు పెంచిన రవాణాశాఖ.. ప్రస్తుతం రోడ్డు భద్రతా సెస్సు విధింపునకు సన్నద్ధమైంది. ఆదివారం (మార్చి 1) నుంచి కొనుగోలు చేసే వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను వడ్డించనుంది. వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపుతో పాటు రోడ్డు భద్రతా పన్ను కూడా చెల్లించాలి. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో ఏటా సుమారు 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత, రవాణా, ఇతర కేటగిరీలకు చెందిన వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను రూపంలో ఇకనుంచి ప్రతి ఏటా సుమారు రూ.130 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉన్నట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రప్రభు త్వం అమల్లోకి తెచ్చిన రోడ్డు భద్రతా చట్టంలో భాగంగా సెస్ విధింపు తప్పనిసరిగా మారినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత కేటగిరీలో ద్విచక్ర వాహనాలపై రూ.2 వేలు, కార్లపై రూ.5000 చొప్పున భారం పడనుంది. 4 సీట్లు, 7 సీట్ల సామర్థ్యమున్న వాహనాలు, అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న వాటిపై రూ.10 వేల చొప్పున రోడ్డు భద్రతా సెస్ విధించనున్నారు. వాహనాల కొనుగోలు సమయంలోనే వసూలు చేయనున్న ఈ సెస్ను రోడ్డు భద్రతా నిధిగా వివిధ రకాల కార్యకలాపాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 89 లక్షల వాహనాలు ఉండగా.. వీటిలో 65 లక్షల వరకు బైక్లే. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల్లోనూ బైక్లే ఎక్కువగా ఉండనున్నాయి. నిఘా వ్యవస్థ పటిష్టం.. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జాతీయస్థాయిలో ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన విధానాలతో 2019లోనే కేంద్రం రోడ్డు భద్రతా చట్టాన్ని రూపొందించింది. డ్రైవింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు వాహనాల సామరŠాధ్యన్ని, పెంచాలని సూచించింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో చర్యలు చేపట్టారు. రోడ్డు భద్రతా చట్టం నిబంధనల్లో భాగంగానే ప్రస్తుతం సెస్ విధింపు అమల్లోకి రానుంది. మరోవైపు సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సైతం ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక నిధి అవసరమని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందుకనుగుణంగానే మార్చి 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు భద్రతా నిబంంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. -
ఫ్లైఓవర్ల నిర్మాణం.. నియంత్రణ సాధ్యమేనా..?
రోడ్డు విస్తరణ చేపట్టలేదు.. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు తొలగించలేదు.. పాదచారులు నడవడానికి వీలుగా ఫుట్పాత్లను అందుబాటులోకి తేలేదు.. రోడ్లపై గుంతలు పూడ్చలేదు.. వాహనదారుల సమస్యలు తెలుసుకోకుండా ట్రాఫిక్ రద్దీని అధ్యయనం చేయకుండా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి శుక్రవారం తెరలేచింది. మొదటి రోజునే పార్క్ హయత్ హోటల్ ముందు పిల్లర్ నిర్మాణానికి పునాదులు తీస్తుండగా ట్రాఫిక్ ఎన్టీఆర్ భవన్ వైపు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మొదటి పిల్లర్ నిర్మాణం కాకముందే వాహనదారులకు చుక్కలు కనిపించాయి. రెండేళ్ల పాటు ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం జరుగుతుందని సంబంధిత ఏజెన్సీ, ట్రాఫిక్ పోలీసులు వెల్లడించడంతో వాహనదారులు, పాదచారుల్లో ఆందోళన వ్యక్తమైంది. రెండేళ్ల పాటు ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇప్పటి నుంచే భయాందోళనకు గురవుతున్నారు. ఇంకో మార్గమే లేదు.. కేబీఆర్ పార్కు చౌరస్తాలో ప్రతిరోజూ గంటకు 12 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో గంటకు 13 వేలు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లో గంటలకు 10 వేల చొప్పున వాహనాలు సిగ్నల్ దాటుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం జరుగుతోంది. ఈ వాహనదారులు వెళ్లాలంటే ఇంకో మార్గమే లేదు. మెయిన్రోడ్డు నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. కనీసం జీహెచ్ఎంసీ రోడ్లపై గుంతలు పూడ్చలేదు. రోడ్డు విస్తరణ చేపట్టలేదు. అడ్డుగా ఉన్న చెట్లను తొలగించలేదు. ఫుట్పాత్లు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకోగా ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రించడం ట్రాఫిక్ పోలీసులకు మోయలేని బరువుగా తయారుకానుంది. ఈ రోడ్డులో వాహనాలు నియంత్రించడం అంతా ఆషామాషీ కాదు. జీహెచ్ఎంసీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా నిర్మాణ పనులు అప్పగించి చేతులు దులుపుకుంది. ఏం చేయాలంటే.. కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్లపై గుంతలు పూడ్చి అనువైన చోట్ల రోడ్లను విస్తరించాలి. అలాగే ఫుట్పాత్లను అందుబాటులోకి తేవాలి. అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, కేబుళ్లను తొలగించాలి. ట్రాఫిక్ మార్షల్స్ను నియమిస్తాం కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు తోడు 20 మంది ట్రాఫిక్ మార్షల్స్ను కూడా నియమించి వాహనాలు సజావుగా ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేందుకు ఓ వెహికల్ను కూడా అందుబాటులో ఉంచుతాం. నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ ఉంటుంది. ఫుట్పాత్లను అందుబాటులోకి తీసుకురావాలని మెఘా సంస్థ ప్రతినిధులకు సూచించాం. రోడ్డు పక్కన అక్రమ పార్కింగ్ చేయకుండా నిరంతర పహారా జరుగుతుంది. ప్రజలు, వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. అదనపు పోలీసులను కూడా ఇక్కడ వినియోగిస్తాం. – జోయల్ డేవిస్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, హైదరాబాద్ -
తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్ అర్వింద్కుమార్ సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం.ఇక, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బీఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. -
సుబ్బిరామిరెడ్డి కూతురు పీఏనని నమ్మించి..!
హైదరాబాద్: తాను టి.సుబ్బిరామిరెడ్డి కూతురు, సోషలైట్ పింకిరెడ్డి పీఏనని ఓ మహిళా ఆభరణాల వ్యాపారిని నమ్మించి కిలో మేలిమి బంగారు ఆభరణాలు తీసుకుని వాటికి బదులుగా కిలో నకిలీ బంగారం ముద్దను ఇచ్చిన నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్లో చార్టెడ్ అకౌంటెంట్ ఆన్లైన్ పాఠాలు చెప్పే లెక్చరర్గా, యూట్యూబర్గా పేరొందిన శ్రీనాథ్ రాఠి అలియాస్ అంకిత్ (29) కాచిగూడలోని శ్రీకృష్ణా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ నెల 13న మాదాపూర్లోని మైహోమ్ బుజాలో నివసించే పాలకుర్తి లక్ష్మీకావ్య (40)ని పరిచయం చేసుకున్నాడు. ఆమె బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని పార్క్ హయత్ హోటల్ ఎదురుగా స్వర్ణ కావ్యం జ్వువెలరీ ఆభరణాల షాపు యజమానురాలు. తాను పని చేస్తున్న మేడం వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటిని మార్పిడి చేసుకుని ఆభరణాలు తీసుకుంటామంటూ లక్ష్మీకావ్యను నమ్మించాడు. ఇలా మూడుసార్లు లక్ష్మీకావ్య వద్ద నుంచి ఆమె నగల దుకాణంలో బంగారు ఆభరణాలు తీసుకుని అంతే విలువైన బంగారు బిస్కెట్లను ఇచ్చాడు. దీంతో ఆమె శ్రీనాథ్ రాఠిని నమ్మడం ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీన శ్రీనాథ్ రాఠి తన అనుచరుడు కృష్ణను ఈ ఆభరణాల షాపునకు పంపించాడు. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లోనూ, సోమాజీగూడలోని పార్క్ హోటల్లోనూ, బంజారాహిల్స్లోని ది లీలా హోటల్లోనూ మూడుసార్లు ఆమె వద్ద మేలిమి బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఈ నెల 25న చివరగా రూ.2 కోట్లు విలువ చేసే కిలో బంగారు ఆభరణాలు తీసుకుని వాటి బదులుగా రాగిముద్దపై బంగారు పూత పూసి బంగారు బిస్కెట్గా నమ్మించి ఇచ్చాడు. ఆ తెల్లవారు ఆమె పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో నిందితుడిని కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఆధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించగా నిందితుడు శ్రీనాథ్ రాఠిని సీసీఎస్ పోలీసులు గతంలో రూ.2.48 కోట్లు చార్టెడ్ అకౌంటెంట్లను చీటింగ్ చేసి వసూలు చేసి అరెస్టయ్యినట్లు తేలింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శ్రీనాథ్ రాఠితో పాటు కృష్ణ, మనోజ్, పురుషోత్తం రాఠిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రసన్న కుమార్ అలియాస్ అంజలి!
సాక్షి,హైదారాబాద్: విశాఖపట్నానికి చెందిన పెదపూడి ప్రసన్న కుమార్ కాంబోడియాలో కూర్చుని అంజలి కందులగా మారాడు. ఈ పేరుతో మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగరానికి చెందిన యువకుడి పరిచయమయ్యాడు. చాటింగ్ చేస్తూ చీటింగ్ మొదలుపెట్టి క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్టిమెంట్ అన్నాడు. ఇలా రూ.11 లక్షలకు పైగా కాజేసి తన వాటా తీసుకున్నాడు. కాంబోడియా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో సూత్రధారిగా ఉన్న ప్రసన్న కుమార్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ వి.అరవింద్ బాబు శుక్రవారం ప్రకటించారు. ఇతడిపై జారీ చేసిన ఎల్ఓసీ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. ప్రసన్న కుమార్ 2024 ఏప్రిల్లో విదేశీ ఉద్యోగం కోసం విశాఖలోని జాబ్ కన్సల్టెంట్ను సంప్రదించాడు. డేటా ఆధారిత ఉద్యోగం కలి్పస్తామని చెప్పి కంబోడియా పంపారు. అక్కడకు చేరుకున్న ప్రసన్నకు భారతీయులను సోషల్మీడియా వేదికల ద్వారా మోసం చేసే వ్యవస్థీకృత ముఠా సూత్రధారులతో పరిచయం ఏర్పడింది. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు వారితో చేతులు కలిపి వివిధ రకాలైన ఫ్రాడ్స్ చేయడంపై శిక్షణ పొందాడు. ఆపై నేరుగా రంగంలోకి దిగిన ప్రసన్న విశాఖకే చెందిన రవి కిరణ్, గంగ రాజుల నుంచి దాదాపు 500 సిమ్కార్డులను అక్రమంగా పొందాడు. ఆ నెంబర్ల ఆధారంగా వివిధ సోషల్మీడియా, మాట్రియోనియల్ సైట్లలో ఆక్షణీయమైన యువతులు, మహిళల ఫొటోలు, పేర్లతో నమోదయ్యాడు. అలా ఇక్కడి వారితో పరిచయం పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచి్చ, చాటింగ్ ద్వారా బోగస్ క్రిప్టో, ఫారెక్స్ ట్రేడింగ్ వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టి స్వాహా చేయడం మొదలుపెట్టాడు. నగరానికి చెందిన యువకుడికి (28) ఇతగాడు అంజలి కందులగా మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను లండన్లో ఇంజనీర్గా పనిచేస్తున్నానని నమ్మించాడు. ప్రేమ, పెళ్లి అంటూ మాటలు చెప్పి ఆపై అసలు కథ మొదలుపెట్టాడు. తన మామ క్రిప్టో ట్రేడింగ్ నిపుణుడని ఆయన చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఎర వేశాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్లో పెట్టుబడి పెట్టించాడు. ఈ బోగస్ ప్లాట్ఫామ్స్ డ్యాష్బోర్డుల్లో భారీ మొత్తం బ్యాలెన్స్ ఉన్నట్లు చూపిస్తూ రూ.11,17,834 ఇన్వెస్ట్ చేయించారు. బాధితుడు ఈ మొత్తాన్ని గత ఏడాది నవంబర్ 13న విత్డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచగా సాధ్యం కాలేదు. తనతో తియ్యగా మాట్లాడిన అంజలి పేరుతో ఉన్న సోషల్మీడియా, మాట్రిమోనియల్ ఖాతాలు సైతం మాయం అయ్యాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు తొలుత విశాఖపటా్ననికి చెందిన రవి కిరణ్, గంగ రాజులను అరెస్టు చేశారు. వీరి విచారణలో ప్రసన్న కుమార్ పేరు వెలుగులోకి వచి్చంది. అతడు కాంబోడియాలో ఉన్నాడని తెలియడంతో లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. మంగళవారం కాం»ొడియా నుంచి వచి్చన ప్రసన్న చెన్నై విమానాశయంలో దిగాడు. ఎల్ఓసీ ఆధారంగా పట్టుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ప్రసన్నను అరెస్టు చేసి తీసుకువచ్చింది. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఫరిధిలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. షిరిడి హిల్స్లో ఉండే దివ్యా రెడ్డి (33) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. కాగా అదేప్రాంతానికి చెందిన నర్సింహా అనేవ్యక్తి గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవలే వీరి మధ్య గొడవలు సాగుతున్నాయి. శుక్రవారం కూడా గొడవ ఎక్కువ అవ్వడంతో దివ్యా రెడ్డి ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆపస్మారక స్థితికి చేరుకుంది.. గమనించిన స్థానికులు ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!
మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం పింఛన్ సొమ్మును మరో రూ.వెయ్యి పెంచనున్నట్లు తెలుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. చేయూత పథకంలో భాగంగా దివ్యాంగులకు పింఛన్ రూ.3016 అందిస్తుండగా మరో వెయ్యి పెరిగే అవకాశం ఉంది. దీంతో రూ.4,016 పింఛన్ పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. వృద్ధాప్య, వితంతు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ వర్కర్లు, బీడీ టేకేదారులు, డయాలసిస్, హెచ్ఐవీ రోగులు, ఒంటరి మహిళలు పొందుతున్న పింఛన్ రూ.2016 నుంచి రూ.3016కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని 36,754 మంది వృద్ధులు, 11,454మంది దివ్యాంగులు, 38,798 వితంతువులు, 278 మంది నేత కార్మికులు, 869 మంది గీత కార్మికులు, 2,467 మంది ఒంటరి మహిళలు, 2,335 మంది బీడీవర్కర్లు, 268 ఫైలేరియా, 172 డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, 15 మంది బీడీ టేకేదారులు మొత్తంగా 93,410 మందికి ప్రయోజనం కలుగనుంది. జిల్లాలో ప్రతీ నెల రూ.22.68 కోట్లు పింఛన్దారులకు అందుతోంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వాటినే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. చాలామంది 57ఏళ్లు నిండిన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తుందా అని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. -
HYD: కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్–సిటీ) ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ముగ్ధ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్పాస్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పగటిపూట ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పనులను రాత్రివేళల్లోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పునాది పనులు పూర్తయ్యే వరకే రహదారిపై కొద్దిపాటి అసౌకర్యం ఉంటుంందన్నారు. ఈ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సజ్జనర్ సూచించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజయ్కుమార్, జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ డీసీపీ కాజల్, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తదితరులు సీపీ వెంట ఉన్నారు. -
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు
హైదరాబాద్: నగర మార్కెట్లలో కిలో కరివేపాకు రూ.100–120 వరకు పలుకుతోంది. చిన్న కట్ట కావాలన్నా రూ.10 పెట్టాల్సిందే. రెండు నెలల క్రితం కిలో కరివేపాకు ధర రూ.50–60 ఉండగా.. ప్రస్తుతం రెండింతలైంది. చలి కారణంగా ఆకులు రాలిపోవడంతో నగరానికి కరివేపాకు దిగుమతి భారీగా తగ్గిపోయింది.అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, మాదన్నపేట్, బోయిన్పల్లి, మీరాలంమండి, శంషాబాద్ తదితర హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది. నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
త్వరలో గణపతి సైతం..
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి లొంగుబాటుపై చర్చ తీవ్రమవుతోంది. ఓవైపు కేంద్ర హోంశాఖ విధించిన గడువు దగ్గర పడుతుండటం..మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాట పట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి గణపతి పైకి మళ్లుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో మిగిలిన ముగ్గురిలో గణపతి ఒకరు కావడంతో.. మావోయిజం అంతం లక్ష్యంలో ఇది కీలకంగా మారింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మావోయిస్టు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.మావోయిస్టు పార్టీ సుప్రీంగా, ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన గణపతి గౌరవప్రదంగా లొంగిపోయేలా అవకాశం ఇవ్వాలని, ఆయన వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల లొంగిపోయిన తాజా, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇతర రాజకీయ అంశాలతో పాటు సీఎంతో భేటీలో ఈ అంశాన్ని సైతం దేవ్జీ, చంద్రన్న, మల్ల రాజిరెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తెచి్చనట్టు సమాచారం. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన, తెలంగాణ స్థానికుడైన గణపతి తెలంగాణలో లొంగిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సైతం మంచి పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిర్బంధం పెరగడంతో లొంగు‘బాట’ మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించినప్పటి నుంచి మావోయిస్టు కీలక నేతలు ఉండేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. నిర్బంధం పెరగడంతో పలువురు నేతలు సహా మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు (సరెండర్) పాలసీ పక్కాగా అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లొంగిపోయేందుకు మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. తాజాగా ఉద్యమ ప్రస్థానానికి తెలంగాణలోనే ముగింపు పలకాలని గణపతి సైతం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ ఉన్నారనే చర్చవృద్ధాప్యం, అనారోగ్యంతో 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావుకు అప్పగించిన గణపతి, అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితం అయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్లతో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టులపై పూర్తి స్థాయిలో పట్టుసాధిస్తుండడంతో ముందుగానే అప్రమత్తమైన మావోయిస్టు అగ్రనాయత్వం గణపతిని సేఫ్ జోన్లోకి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్పటివరకు మావోయిస్టు పారీ్టకి మార్గనిర్దేశనం చేస్తూ వచి్చన గణపతి బయటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రనాయత్వంతో సైతం టచ్లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేపాల్లో తలదాచుకున్నారని...లేదు ఫిలిప్పీన్స్కు వెళ్లి ఉంచొచ్చని ఇలా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కానీ గణపతి ఎక్కడ అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నమ్మకాన్ని పెంచుతున్న తెలంగాణ పాలసీ ఇటీవల లొంగిపోయిన కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ , మల్ల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పోతుల కల్పన అలియాస్ సుజాత, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తదితరుల లొంగుబాటు విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇచి్చన మాటను నిలుపుకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్ల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుండటం మావోయిస్టు నేతల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ కారణంగానే తెలంగాణ స్థానికుడు జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన గణపతి సైతం ఇక్కడే లొంగిపోతే మంచిదనే అభిప్రాయం మాజీ మావోయిస్టుల్లోనూ వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.దేవ్జీ సహా ఇతరుల లొంగుబాటు సందర్భంగా గణపతి జాడపై మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ శివధర్రెడ్డి బదులిస్తూ.. గణపతి అడవుల్లో లేరని, మైదాన ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉందని చెప్పిన నేపథ్యంలో గణపతి ఆచూకీపై పోలీసులకు కొంత స్పష్టత ఉందనే విషయం అర్థమవుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశంలోనూ గణపతి ప్రస్తావన వచి్చనట్టు తెలుస్తుండటంతో ఆయన కూడా త్వరలో తెలంగాణలోనే లొంగిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో లొంగిపోయిన మావోయిస్టులు చంద్రన్న, సుజాతక్కలు సైతం శుక్రవారం నాటి సమావేశంలో పాల్గొనడం గమనార్హం. -
చరిత్రను భావితరాలకు అందజేయడం మన బాధ్యత
అఫ్జల్గంజ్ : చరిత్రను భావితరాలకు అందజేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భౌగోళిక గుర్తింపు పొందిన తెలంగాణ సాంస్కృతిక కళావైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. అందుకోసం ఆర్టీసీ బస్సులను సాంస్కృతిక కళాసారథులుగా అలంకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ బస్స్టేషన్లో ఏర్పాటు చేసిన జీఐ ట్యాగింగ్ బస్సులను రాష్ట్ర రవాణాæ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతోకలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని, సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ మాట్లాడుతూ జీఐ ఉత్పత్తులకు ప్రాచుర్యం కలి్పంచేందుకు, మార్కెటింగ్ విస్తరణకు, ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ఆర్టీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ(వెండితీగ పని), నారాయణపేట్ చీరలు, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం గవర్నర్ ఆలోచనల ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, సీహెచ్.వెంకన్న,విజయపుష్ప,రాజశేఖర్,ఖుస్రో షా ఖాన్, రీజినల్ మేనేజర్లు శ్రీలత, సుధ పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
నేను చెప్పినట్టే తీర్పు వచ్చింది
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని గతంలో తాను చెప్పినట్లుగానే కోర్టు తీర్పు వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. మద్యం పాలసీ కేసులో నిందితులుగా పేర్కొన్న వారందరికీ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. లిక్కర్ కేసులో శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసు మూలంగా ఐదున్నర నెలల పాటు పిల్లలు, కుటుంబానికి దూరంగా ఉంటూ బాధ, అవ మానాలు, వ్యక్తిత్వ హననం ఎదుర్కొన్నా. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను పొందిన అవమానానికి, కోల్పోయిన సమయానికి వెలకట్టలేరు. కుటుంబం ఇచ్చిన ధైర్యంతోనే కన్నీళ్లు దిగమింగుకుని ముందుకు సాగా. ప్రజా సేవ చేసేందుకు ఈ కేసులు నాకు ఎంతమాత్రం అడ్డంకి కాబోవు..’ అని కవిత పేర్కొన్నారు.కేసులు నేను ఒంటరిగా ఎదుర్కొన్నా..‘కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి ఓ వైపు అభినందనలు తెలు పుతూనే మరోవైపు ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేనే కారణం అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్పై కక్ష సాధింపులో భాగంగా నాపై కేసు పెట్టారు. నేను జైలుకు వెళ్లిన తర్వాత కేసీఆర్, కేటీఆర్తో సహా పార్టీ పెద్ద నాయకులు ఎవరూ ప్రెస్మీట్లు పెట్టలేదు. కేసులు నేను ఒంటరిగా ఎదుర్కొన్నా. కనీ సం పార్టీ సోషల్ మీడియా కూడా మద్దతు ఇవ్వలేదు. తప్పుడు ప్రచారా లను ఎదుర్కొని ఉంటే బీఆర్ఎస్కు ఈ తరహా గతి పట్టేది కాదు.ఉద్యో గాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకపోవడం, దోపిడీదార్లకు టికెట్లు ఇవ్వ డం, పార్టీ నేతల అహంకారం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందనే విమర్శ ఉంది. కానీ కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచు కుని బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి తప్పులను సమీక్షించుకోవాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఓటమి పాలయ్యే స్థితిలో బీఆర్ఎస్ ఉందా. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో నా పేరు ఎక్కడా చర్చల్లో లేదు. మద్యం పాలసీ కేసు విష యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకే రీతిలో మాట్లాడుతున్నాయి. నేను పార్టీ పెట్టాలని అనుకుంటున్న సమయంలో కోర్టు తీర్పు నాకు ప్రకృతి సహకరించి ఇచ్చిన ఆశీర్వాదంలా భావిస్తున్నా..’ అని కవిత వ్యాఖ్యానించారు. -
లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయింది
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘అయితే మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కేసు మూలంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సైతం రాజకీయంగా నష్టపోయింది..’ అని కేటీ ఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొ న్నారు.‘మద్యం పాలసీ కేసు తరహాలోనే మా నాయ కులపై నమోదైన ప్రతి కేసు అబద్ధం, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలో తేలిపోతుంది. అసత్యాలతో కూడిన, కుట్రపూ రిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజ లను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధా న్య తనిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ’నవ భారతం’లో బాగా పెరిగిపోయింది. కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఇక కోర్ అర్బన్ చట్టం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టాన్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమ తులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరి యాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలి యక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలికోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి, ఆ లోపు దానిని తొలగించినా అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు.ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని, నగరంలోని సర్కిల్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ ఎంఏయూడీ(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్)పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. భవనాల పనులు వేగవంతం చేయాలిభారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని , అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతోపాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్పై భారీ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేయడంతో..ఆ కేసు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశమయ్యింది. కేసు పూర్వాపరాలను, కవితపై ఆరోపణలు, అరెస్టు తదితర పరిణామాల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు కూడా చర్చనీ యాంశమవుతున్నాయి.ముఖ్యంగా ఈ కేసు కారణంగా బీఆర్ ఎస్ భారీ కుదుపులకు లోనైందని, రాజకీయంగా నష్టపోయిందంటూ ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఎన్నికల్లో దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తెచ్చిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అనేక కీలక పరిణామాలు..లిక్కర్ కేసులో కవితను ఈడీ, సీబీఐ విచారించడంతో మొద లైన వివాదం పార్టీలో ఇంటా బయటా అనేక పరిణామాలు, రాజకీయ మలుపులకు దారి తీసింది. మద్యం పాలసీ కేసులో ముడుపులు ఆరోప ణలతో కవితను 2024 మార్చిలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇది బీఆర్ఎస్పై తీవ్ర ప్రభావం చూపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే ఏడాది ఏప్రిల్, మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవక పోవడానికి కవితపై వచ్చిన ముడుపుల ఆరోపణలు, ఆమె అరెస్టే కారణమంటూ పార్టీ లోపలా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే..రాష్ట్ర్టంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ మద్యం పాలసీ అంశం తెరమీదకు వచ్చింది. 2021లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం 2021–22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. రిటైల్ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ఈ విధానం ప్రవేశ పెట్టారు. అయితే లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా, ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చారనే కోణంలో..‘సౌత్ గ్రూప్’ పేరిట దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేత లు ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చి లైసెన్సులు పొందారనే కోణంలో విచారణ జరిగింది. ఇందులో నాటి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, అప్పటి ఎమ్మెల్సీ కవిత కూడా ముడుపులు ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హైదరా బాద్, ఢిల్లీలో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కవితను పలుమార్లు విచారించాయి. తనపై రాజ కీయ ప్రేరేపిత కేసు నమోదైందని కవిత వాదించారు. 2024 మార్చిలో కవిత అరెస్టు అయ్యారు. 2024 చివరలో ఈడీ, సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేశాయి. సుమారు ఐదు నెలల పాటు జైలు జీవితం తర్వాత కవిత బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. -
నివేదికపై నిప్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా కమిషన్ నివేదిక అన్ని వర్గా ల్లోనూ కలకలం రేపుతోంది. టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. నిరుద్యోగులుమండిపడుతుండగా, విద్యార్థులు ఆగ్ర హంతో ఉన్నారు. విద్యావిధాన రూపకల్పనకు విద్యా కమి షన్ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను గురువారం సీఎంకు సమర్పించింది. ఇందులోని వివరాలను కమిషన్ చైర్మన్ మురళి అదే రోజు మీడియాకు వెల్లడించారు. ఇందులో టీచర్లకు వేత నాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఎత్తివే యాలని, ఇంటర్ బోర్డు స్థాయిలోనూ పరీక్షలు ఉండాలని, టీచర్ల నియామక విధానం మార్చాలని పేర్కొన్నా రు. ఈ అంశాలన్నీ ఆయా వర్గాల్లో వ్యతిరేకతకు దారి తీశాయి. ఆ సిఫార్సులు ఎవరి కోసం?విద్యా కమిషన్ సభ్యులు కొన్ని నెలలుగా వివిధ వర్గాలతో చర్చించారు. పలు జిల్లాలు తిరిగారు. విదేశాలకూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నివేదిక రూపొందించినట్టు చెబుతున్నారు. ⇒ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర స్థాయిలో జేఈఈ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎప్ సెట్ చేపడుతున్నారు. విద్యా కమి షన్ రాష్ట్ర ఎప్సెట్ను ఎత్తివేయాలని సూచించింది. ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ సీటు ఇవ్వాలని ప్రతిపాదించింది. గతంలో ఎంసెట్కు ఇంటర్ మార్కుల్లో 40 శాతం వెయిటేజీ తీసుకునే వారు. క్రమంగా దీనిని ఎత్తివేశారు. ఇంటర్ మార్కులే ప్రామాణికం కావడంతో కార్పొరేట్ కాలేజీ విద్యార్థులకు ఎక్కవ సీట్లు వస్తున్నాయి. అట్టడుగు మారుమూల విద్యార్థులు నష్టపోతున్నారు.అనేక అధ్యయనాల తర్వాత ఈ విధానాన్ని మార్చారు. ఇప్పుడు ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలనే విధానంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ సిఫార్సులు కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలికేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇంటర్లో రెండో ఏడాదే పరీక్షలు నిర్వహించాలనే సిఫార్సు కూడా కలకలం రేపింది. ఇది నాణ్యతను దెబ్బతీసే చర్యగా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కమిషన్ ఎదుట ఆందోళనకు విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. ⇒ టీచర్స్ నియామక ప్రక్రియపై సిఫార్సులూ గందరగోళానికి దారి తీస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను డీఎడ్ అర్హతతో నియమిస్తారు. ఈ పోస్టులకూ బీఎడ్ అర్హత పెట్టాలన్న సిఫార్సులపై వ్యతిరేకత వస్తోంది.టీచర్స్ సంఘాల వ్యతిరేకత⇒ మార్కెట్ ప్రమాణాలతో టీచర్ల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని విద్యా కమిషన్ వ్యాఖ్యానించడం దారుణమని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ అన్నారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. ⇒ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో గ్రామాల్లో స్కూళ్ల ను మూసివేసే దిశగా కమిషన్ సిఫార్సులున్నా యని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పటోళ్ల చంద్రశేఖర్ తెలిపారు. ⇒ అసంబద్ధ నిర్ణయాలతో కూడిన సిఫార్సుల వెనుక ఏ శక్తులున్నాయో అన్న అనుమా నం కలుగుతోందని, ఉపాధ్యాయులను చులకన చేసేలా సిఫార్సులున్నాయని ఆర్యూపీపీ టీఎస్ అధ్యక్షుడు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్ అన్నారు. ⇒ విద్యా కమిషన్ హద్దు మీరి వ్యవహరించిందని, టీచర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసే కనీస అర్హత కమిషన్ కోల్పోయిందన్నారు. -
ఉద్యోగుల కోటా రూ. 745 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన బకాయిల చెల్లింపుల హామీలో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగు లు, పెన్షనర్లకు సంబంధించి వివిధ రకాల బిల్లు ల బకాయిలను నెలవారీగా చెల్లిస్తామని, కనీసం రూ.700 కోట్ల చొప్పున ఇ స్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లకు తగ్గకుండా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. తాజాగా ఫిబ్రవరికి సంబంధించి రూ.745 కోట్లు విడుదల చేయాలని, ఈ నిధులకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆ దేశించారు. విడుదలైన బిల్లులో గ్రాట్యు టీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ బకాయిలకు సంబంధించి కూడా భట్టి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రూ.389 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో సంబంధిత బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. -
కేపీహెచ్బీలో గజం భూమి రూ. 2.65 లక్షలు
హైదరాబాద్,: హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కెపిహెచ్ బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్ల ను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1 మరియు 2 లోని ధర్మారెడ్డి కాలనీ లోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 40 మంది కొనుగోలు దారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్దారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడు పోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు (Flats) రూ .90 లక్షలను అప్ సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్ కు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ శ్రీ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా (Open Plots) రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ల (Flats) ద్వారా రూ.8.45 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.


