శంషాబాద్: పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దోహా, బహ్రెయిన్, అబుదాబితో పాటు పలు దేశాల గగనతలం మూసివేత కారణంగా హైదరాబాద్కు రాకపోకలు సాగించే విమానాలు పెద్ద ఎత్తున రద్దవుతున్నాయి. ఆదివారం మొత్తం శంషాబాద్కు రావాల్సిన 26 అరైవల్, ఇక్కడి నుంచి బయల్దేరాల్సిన 27 డిపార్చర్ విమానాలను సంబంధిత ఎయిర్లైన్స్లు ముందస్తుగానే రద్దు చేశాయి. ఇందులో కువైట్, దుబాయ్, అబుదాబి, రస్అల్ ఖైమా, ధమామ్, జెడ్డా, షార్జా తదితర గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలున్నాయి.
దుబాయ్ నుంచి యూఎస్ అనుసంధాన విమానాల్లో బయల్దేరే వారికి కూడా విమానాల రద్దు ప్రభావం పడింది. కార్గో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. హాంగ్కాంగ్ నుంచి దుబాయ్కు బయల్దేరిన ఓ విమానాన్ని దారి మళ్లించడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసి బే–203 పార్క్ చేశారు. అలాగే థాయ్లాండ్లోని క్రాబి నుంచి దుబాయ్కు బయల్దేరిన విమానాన్ని కూడా దారి మళ్లించి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. సోమవారం నాటి షెడ్యూల్లో కూడా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఏడు విమానాలు రద్దు చేసినట్లు ముందస్తుగా ప్రకటించారు. టికెట్ బుకి ంగ్ సమయంలో కాంటాక్ట్ ఫోన్ నంబరు ఉన్న వారికి ముందస్తు సమాచారం అందుతోంది.


