పెద్దపల్లిరూరల్: మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన సొంతింటికి వచ్చారు. పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన మల్లోజుల వెంకటయ్య–మధురమ్మల కుమారులు కోటేశ్వర్రావు, వేణుగోపాల్రావు మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కోటేశ్వర్రావు ఎన్కౌంటర్లో మరణించగా, వేణుగోపాల్రావు కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారుల బృందం పర్యవేక్షణలో వేణుగోపాల్రావు పెద్దపల్లికి చేరుకున్నారు.
27 ఏళ్ల వయసులో ఉన్నపుడు అజ్ఞాతవాసం వెళ్లానని.. ఇప్పుడు తన వయస్సు 72 అని చెప్పిన మల్లోజుల ‘ఫిగర్ అటు..ఇటు అయిందంతే’..అంటూ చమత్కరించారు. భార్య తారతో వచి్చన వేణుగోపాల్రావును కుటుంబీకులు సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. వేణు తన పెద్దన్న ఆంజనేయులుతో మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు.
కుటుంబసభ్యులతో కొద్దిసేపు గడిపి ఇంటి ముందుకు వచ్చి కాలనీవాసులతో ముచ్చటించారు. ‘అంతా మారిపోయింది. అప్పటి ఆనవాళ్లేమీ కనిపించడం లేదు’అన్నారు. 45 ఏళ్ల తర్వాత ఇల్లు చేరిన వేణుగోపాల్ను కలిసేందుకు ఇరుగుపొరుగు వారితోపాటు పలువురు వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించారు. మళ్లీ ఏప్రిల్లో వస్తా..అంటూ వెళ్లిపోయారు.


