ముప్పిడి సాంబయ్య లొంగుబాటు | The Maoist party has almost disappeared in Odisha | Sakshi
Sakshi News home page

ముప్పిడి సాంబయ్య లొంగుబాటు

Mar 2 2026 12:53 AM | Updated on Mar 2 2026 12:53 AM

The Maoist party has almost disappeared in Odisha

వనం వీడి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ జిల్లాకు.. 

సాంబయ్యతోపాటు మరో 14 మంది సరెండర్‌ 

ఒడిశాలో దాదాపుగా కనుమరుగైన మావోయిస్టు పార్టీ 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీకి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్‌ వికాస్‌ శనివారం రాత్రి లొంగిపోయారు. ఆయనతోపాటు మరో 14 మంది మావోయిస్టులు కూడా సాయుధ పోరుబాట వీడారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బొలాంగిర్‌–బార్‌ఘడ్‌–మహాసముంద్‌ జిల్లాలతో కూడిన డివిజన్‌ కమిటీ లొంగిపోతామంటూ ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మకు లేఖ రాసింది. 

తమ భద్రతకు హామీ ఇస్తే మార్చి 2 లేదా 3వ తేదీలోగా లొంగిపోతామని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ నుంచి లొంగుబాటుకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఫిబ్రవరి 28నే వికాస్‌ తన దళంతో కలిసి లొంగిపోయారు. ఇందులో సాంబయ్య ఒక్కరే తెలంగాణకు చెందినవారు కాగా మిగిలిన 14 మంది ఛత్తీస్‌గఢ్‌ వారు.  

సంకోచించకుండా లొంగిపోండి.. 
లొంగుబాటు ప్రక్రియను సజావుగా జరిపించేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మీడియా ప్రతినిధులు రంగంలోకి దిగా రు. వీరి ద్వారా శనివారం సాయంత్రం మహాసముంద్‌ జిల్లాలో అటవీ గ్రామమైన హర్‌తొండాకు 4 కి.మీ. దూరంలో ఒక వాగు ఒడ్డున ఉన్న పొలానికి మావోయిస్టులు చేరుకున్నారు. అక్కడి నుంచి మీడియా ప్రతినిధి ఫోన్‌ ద్వారా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్‌శర్మతో వికాస్‌ మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఎలాంటి సంకోచం లేకుండా లొంగిపోవచ్చని విజయ్‌శర్మ తెలిపారు. ఆదివారం మహసముంద్‌ జిల్లాలో తన పర్యటన ఉందని, ఆ సమయానికి అక్కడకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. మీ బృందంలో ఎంత మంది ఉన్నారు. ఎన్ని ఏకే 47లు తెచ్చారని విజయ్‌శర్మ ప్రశ్నించగా మొత్తం 15 మంది వచ్చామని, మూడు ఏకే 47లు తెచ్చామని సాంబయ్య బదులిచ్చారు.  

ఖాళీ దిశగా ఒడిశా 
మావోయిస్టు పార్టీకి దండకారణ్యం తర్వాత అతిపెద్ద బేస్‌గా ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే గతేడాది జనవరిలో ఒడిశా సరిహద్దులో గరియాబంద్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న గాజర్ల గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌తో పాటు చైతే మృతి చెందారు. నవంబర్‌ 18న జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనూ ఈ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. 

తర్వాత డిసెంబర్‌ 25న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒడిశా బాధ్యతలు చూస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు మరణించాడు. ఇలా వరుసగా ఒడిశాలో ఆ పార్టీ నష్టపోతుండగా తాజాగా బీబీఎం కమిటీ సైతం కనుమరుగైంది. చివరగా ఒడిశా కమిటీలో కలహంది–కందమాల్‌–బౌద్‌–నయాగడ్‌ డివిజన్‌ కమిటీనే యాక్టివ్‌గా ఉంది. 

12 మంది సభ్యులున్న ఈ కమిటీ కూడా జనవరి చివరి వారంలో లొంగిపోయే ప్రయత్నం చేసింది. ఈ కమిటీలో లొంగుబాటు ప్రయత్నాలు చేసిన అన్వేశ్‌ అనే మావోయిస్టును తోటి నక్సలైట్‌ సుక్రు చంపేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ కమిటీలోనూ తొమ్మిది మంది మావోలే మిగిలి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement