సింఘ్వీ రెన్యువల్‌.. రెండో బెర్తు నేడు ఫైనల్‌ | Congress candidates for Rajya Sabha likely to be finalised today | Sakshi
Sakshi News home page

సింఘ్వీ రెన్యువల్‌.. రెండో బెర్తు నేడు ఫైనల్‌

Mar 2 2026 12:43 AM | Updated on Mar 2 2026 12:43 AM

Congress candidates for Rajya Sabha likely to be finalised today

రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు నేడు ఖరారయ్యే అవకాశం

రెండో సీటు రెడ్డి సామాజిక వర్గానికి లేదా బీసీలకు ఇవ్వడంపై పార్టీ కసరత్తు 

వేం నరేందర్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, వీహెచ్, వినయ్‌కుమార్‌లలో ఒకరికి చాన్స్‌ 

సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ.. అప్పుడు రాష్ట్రం నుంచే ఇద్దరు!

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఖరారయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇద్దరికి అవకాశముండగా, అందులో ఒక స్థానం సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీకి రెన్యువల్‌ కానుందని సమాచారం. రెండో బెర్తు కోసం తీవ్రమైన పోటీ ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక సమీకరణల నేపథ్యంలో వేం లేదా వంశీలలో ఒకరికి ఈ సీటు దక్కుతుందనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

నలుగురిలో ఎవరో? 
రెండు రాజ్యసభ సీట్లల్లో ఒకటి సింఘ్వీకి ఖరాయిందనే చర్చ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచే జరుగుతోంది. ఆయన నామినేషన్‌కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా రెండో స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎంతో పాటు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేశాయి. రెడ్డి సామాజిక వర్గానికి లేదంటే బీసీలకు ఇచ్చే కోణంలో పేర్లను పరిశీలించారు. మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 

అయితే పీసీసీ నేతలతో చర్చ సందర్భంగా ఈసారి రాజ్యసభకు కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్‌ కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌. పి.వినయ్‌కుమార్‌ పేరును అధిష్టానం ప్రతిపాదించినట్టు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడింది. 

మరోవైపు ఈసారి ఓసీలకు అవకాశం ఇవ్వాలని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపాలనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే వంశీచందర్‌రెడ్డి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. అయితే వంశీ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని సీనియర్లను ఈసారి రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం మరికొంత కాలం ఆయన సేవలు అవసరమనే కోణంలో కూడా చర్చ జరిగినట్టు సమాచారం. 

మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చే పక్షంలో వేం నరేందర్‌రెడ్డిని ఎంపిక చేయాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరును సీఎం ప్రతిపాదించారు. కానీ సుదర్శన్‌రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్‌రెడ్డిని ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేస్తారా? అనూహ్యంగా ఇంకెవరికైనా అవకాశమిస్తారా? అనేది సోమవారం తేలుతుందని అంటున్నారు. 

డిప్యూటీ సీఎం వద్ద బ్రేక్‌ఫాస్ట్‌ భేటీ 
రాజ్యసభ రెండో బెర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో బ్రేక్‌ ఫాస్ట్‌ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం ప్రజాభవన్‌లో జరిగిన ఈ బ్రేక్‌ఫాస్ట్‌ భేటీకి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్, కొండా సురేఖ, అజహరుద్దీన్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కూడా హాజరయ్యారు. 

అలాగైతే రెండు సీట్లూ రాష్ట్ర నేతలకే..! 
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుందనే చర్చ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. అభిషేక్‌ మను సింఘ్వీని తమిళనాడు నుంచి ఎంపిక చేసే అంశం కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రెండు స్థానాలూ రాష్ట్రానికి చెందిన నాయకులకే దక్కే అవకాశం ఉందని గాం«దీభవన్‌ వర్గాలంటున్నాయి. 

తమిళనాడులో డీఎంకే మద్దతుతో ఒక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతిపాదించిన పేరుపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ సుముఖంగా లేరని, సింఘ్వీ విషయంలో సానుకూలంగా స్పందించారని అంటున్నారు. సింఘ్వీ తమిళనాడుకు వెళితే సమీకరణలు ఆసక్తికరంగా మారతాయని గాం«దీభవన్‌ వర్గాలంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement