జిల్లాకు చెందిన మావోయిస్టులు
ఎవరెవరరు ఉన్నారని ఆరా తీస్తున్న పోలీసులు
పన్నాల యాదయ్య, మండుగుల భాస్కర్ అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తింపు
భాస్కర్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్దండకారణ్యం డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం
వారు లొంగిపోయేలా పోలీసుల ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఇంకా ఎంత మంది మావోయిస్టులు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ రికార్డుల ప్రకారం ఇద్దరు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ లోతుగా విచాకరిçస్తున్నారు. గత డిసెంబర్ 25వ తేదీన ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేశ్ అలియస్ రాజేశ్ తివారి, అలియాస్ చమ్రు, అతియాస్ గణేశన్న మరణించిన తరువాత పోలీసులు మావోయిస్టులకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందులో చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల భాస్కర్, గుర్రంపోడు మండలం చామలోనిబాయి గ్రామానికి చెందిన పన్నాల యాదయ్య ఉన్నట్లుగా గుర్తించారు.
మావోయిస్టుల ఆచూకీ కోసం ఆరా..
జిల్లా నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించిన ఆ ఇద్దరు లొంగిపోయేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా మంది ఎన్కౌంటర్లలో చనిపోతుండగా మరికొంత మంది లొంగిపోతున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి మందుగుల భాస్కర్, పన్నాల యాదయ్య మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వారు కూడా లొంగిపోయేలా అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
దండకారణ్యం డివిజనల్ కమిటీ సెక్రటరీగా భాస్కర్
చిట్యాల మండంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల భాస్కర్ ప్రస్తుతం చత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) డివిజనల్ కమిటీ సెక్రటరీగా (డీసీఎస్) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2012లో ఆయనపై ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. పదో తరగతి వరకు ఉరుమడ్లలోనే చదువుకున్న భాస్కర్ ఇంటరీ్మయట్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన మెడిసిన్ చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆ తరువాత 1991–92లో హైదరాబాద్లోని నిజాం కాలేజీలో బీఎస్సీలో చేరాడు. మొదటి సంవత్సరమే దానిని వదిలేసి మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిసింది. చదువు మానేసిన సంవత్సరం సంక్రాంతి పండక్కి గ్రామానికి వచ్చిన భాస్కర్ ఆ తరువాత మళ్లీ ఇంటికి రాలేదు. మావోయిస్టు పార్టీలో చేరిన అతను అంచలంచెలుగా దండకారణ్యం డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగాడు. ఆయన తండ్రి దుర్గయ్య 2003లో మరణించారు. ఆ సమయంలోనూ గ్రామానికి రాలేదు. ప్రస్తుతం తల్లి లక్ష్మమ్మ, సోదరుడు నాగభూషణరావు, సోదరి అరుణ ఉన్నారు.
23 ఏళ్లుగా అజ్ఞాతంలో పన్నాల యాదయ్య
గుర్రంపోడు మండలం చామలోనిబావి గ్రామానికి చెందిన పన్నాల యాదయ్య అలియాస్ గన్మ్యాన్ 23 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. భార్య అంజమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ప్రస్తుతం ఇతనికి 23 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లీ కుమారుడు గత కొంతకాలంగా నల్లగొండలోనే ఉంటూ బతుకుదెరువు కోసం ఏదో ఒకపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2012 పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో అతను దళ సభ్యుడిగా ఉన్నాడని, అతనిపై రూ.లక్ష రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో పలుమార్లు పోలీసు అధికారులు అతని కుటుంబæ సభ్యులకు నిత్యావసర సరుకులు అందించేశారు. యాదయ్య అందుబాటులోకి వస్తే లొంగిపొయేలా నచ్చజెప్పమని సూచించారు. నలుగురు అన్నదమ్ముల్లో ఇతనే చివరివాడు. బలహీనంగా, వంకర కాళ్లతో గన్ను మోసేంత బలం కూడా లేని యాదయ్య మావోయిస్టుల్లో ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మూడేళ్ల క్రితం అరెస్టయిన గణేష్
జిల్లాకు చెందిన వారు ఇంకా ఎవరైనా మావోయిస్టు పార్టీలో ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 2023 ఏప్రిల్లో మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ అరెస్టు అయ్యాడు. హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుకునేందుకు వెళ్లిన గణేశ్ అక్కడ క్యాటరింగ్ బాయ్గా పని చేశాడు. అదే సమయంలో కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తూ, మావోయిస్టుల రిక్రూట్మెంట్కు సహకరిస్తున్న ఆనందరావుతో గణేశ్కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్ సాహిత్యం చదివి గణేష్ మావోయిస్టుల వైపు ఆకర్షితుడయ్యాడు. వారం పాటు దళంతోనే ఉన్నాడు. ఆ తరువాత జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఆగర్గూడ వద్ద ఏప్రిల్ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు.


