గల్ఫ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో నగరవాసులు
రంజాన్ నెలలో స్వదేశానికి పెద్ద ఎత్తున రాక
ఇరాన్తో హైదరాబాద్కు శతాబ్దాలుగా అనుబంధం
ఇరానీ చాయ్ నగర ప్రజలకు ఇష్టమైన పానీయం
ఫుడ్ ఫెస్టివల్స్లో తరచూ ఆ దేశ బిర్యానీ రుచులు
నగర వర్సిటీల్లో ఇరాన్ విద్యార్థులు
బంజారాహిల్స్లో ఇరాన్ కాన్సులేట్ జనరల్.. వీధికి సుప్రీం నేత పేరు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా పరిణామాలతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్కడ జరుగుతున్న యుద్ధం.. ఇక్కడివారిలో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారో అంటూ హైదరాబాదీలు బెంగ పెట్టుకున్నారు. వారి యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఆరా తీస్తున్నారు. కాగా, పవిత్ర రంజాన్ నెలలో గల్ఫ్ నుంచి హైదరాబాదీలు పెద్దఎత్తున స్వదేశానికి వస్తుంటారు. యుద్ధం కారణంగా వీరి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. వీరేకాక వేలాదిమంది సాధారణ నగర ప్రజలు నగరం నుంచి గల్ఫ్, ఇరాన్ లకు వెళ్తూ వస్తుంటారు. విమానాల రద్దుతో వీరి ప్రయాణం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి నడిచే అంతర్జాతీయ విమాన సరీ్వసుల్లో ఎమిరేట్స్ తదితర గల్ఫ్ దేశాల సంస్థలకు చెందినవే అధికం కావడం గమనార్హం.
భాష, సంస్కృతిలో పటిష్ఠ సంబంధాలు..
ఇరాన్కు హైదరాబాద్తో శతాబ్దాలుగా అనుబంధం ఉంది. ముఖ్యంగా కుతుబ్షాహీ కాలం నుంచి ఇరానియన్లు నగరానికి వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. వ్యాపారంతో పాటు నిర్మాణ రంగంలో ఉన్నారు. పర్షియన్ (ఇరాన్) ప్రభావం హైదరాబాద్ సంస్కృతి, నిర్మాణ శైలి, వంటకాలు, భాషపై స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాదీ ఉర్దూలో పర్షియన్ పదాలు కలిసిపోయాయి. చార్మినార్, గోల్కొండ తదితర చారిత్రక కట్టడాలలో పర్షియన్ నిర్మాణ శైలి స్పష్టంగా చూడవచ్చు. కాగా, ఉర్దూ, పర్షియన్ భాష కలగలిసి నగర సాంస్కృతిక జీవనంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. ఇరాన్ కవులు, మేధావులు ఇక్కడ స్థిరపడ్డారు. వందలాది ఇరానియన్ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి.
ఇరానీ చాయ్, ఇరానీ హలీమ్, వంటకాలు హైదరాబాదీల ఫేవరెట్. వంటకాలలో ఇరానీ ఘాటు సుగంధద్రవ్యాలను ప్రజలు ఇష్టపడుతుంటారు. కుతుబ్షాహీల కాలంలో వలస వచి్చన ఇరానియన్లు తయారు చేసిన చాయ్.. ఇరానీ చాయ్గా సుప్రసిద్ధమైంది. నగరంలో ఎన్నో ఇరానీ రెస్టారెంట్లు ఉన్నాయి. పెద్ద హోటళ్లతో పాటు ఫుడ్ ఫెస్టివల్స్లో ఇరానీ వంటకాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఇరాన్–హైదరాబాద్ మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి.
ఇరాన్ సుప్రీంనేత పేరిట..
బంజారాహిల్స్లో ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఉంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.7 లోని రోడ్డుకు ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీ పేరు పెట్టారు. ఇక ఢిల్లీలోని ఎంబసీ కాకుండా భారత్లో ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు రెండు మాత్రమే. ఒకటి ముంబైలో ఉండగా మరొకటి హైదరాబాద్లో ఉంది.
విద్యాబంధం
నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఇరాన్ యువత వందలాది మంది చదువుతున్నారు. ముఖ్యంగా ఓయూ, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రధాన కేంద్రాలు. వీరంతా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు చదువుతున్నారు. ఇప్పుడు స్వదేశంలో తమవారి గురించి బెంగ పెట్టుకున్నారు.
తండ్రి కడచూపు నోచుకోలేక..
నగరంలోని బీఎన్రెడ్డి నగర్ కు చెందిన వ్యక్తి మృతిచెందారు. ఈయన పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి మరణవార్త తెలుసుకుని తిరిగొస్తున్న వీరు దుబాయ్లో చిక్కుకున్నారు.
చిక్కుకుపోయిన పీవీ సింధు..
బర్మింగ్హామ్ నుంచి వస్తున్న హైదరాబాదీ, ప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విమాన సరీ్వసులు నిలిచిపోవడంతో దుబాయ్లో ఆగిపోయారు.


